బీఆర్ఎస్లో చేరిక
అనంతగిరి: వికారాబాద్ పట్టణం అనంతగిరిపల్లికి చెందిన అశోక్ శనివారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేక శేఖర్రెడ్డి, గోపాల్ తదితరులు ఉన్నారు.
ఏకగ్రీవం కాకుండా బీజేపీ చెక్
శంకర్పల్లి: మున్సిపాలిటీలో నామినేషన్ల సమయానికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. 12వ వార్డు స్థానానికి బీఆర్ఎస్ నుంచి దండు సంతోష్, కాంగ్రెస్ నుంచి యంసాని ప్రకాశ్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ తండ్రి రాజేశ్వర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని నామినేషన్ వేశారు. అప్పటికే హస్తం పార్టీ నుంచి బరిలో ఉన్న ప్రకాశ్గుప్తా సైతం రాజేశ్వర్తో కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు వార్డు స్థానాన్ని ఏకగ్రీవం కాకుండా సిరిగన్నగారి శ్రీకాంత్రెడ్డిని బరిలో నిలిపి, ఆయన్ని నగరంలోని క్యాంపునకు తరలించారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు అక్కడే ఉంచనున్నట్లు సమాచారం.
మహిళ అదృశ్యం
మొయినాబాద్ రూరల్: ఇంటి నుంచి పని కోసం వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుండే ప్రవళిక స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రికి పని కోసం వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


