పతంగులు ఎగరేస్తూ బావిలో పడిన చిన్నారులు
● తమ్ముడి దుర్మరణం
● ప్రాణాలతో బయటపడిన అన్న
● కొంషెట్పల్లిలో విషాదం
మర్పల్లి: సరదాగా గాలిపటాలు ఎగరేసేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొంషెట్పల్లిలో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మహ్మద్ సైజొద్దీన్, ఉమ్రాబేగంకు ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు శనివారం ఓ పని నిమిత్తం మరో గ్రామానికి వెళ్లారు. అయితే, స్థానిక ఊర్దూ మీడియం పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు సైఫాన్ (9), ఒకటో తరగతి చదువుతున్న సోహైల్(6) ఉదయం స్కూల్కు వెళ్లలేదు. తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద లేకపోవడంతో అన్నదమ్ములిద్దరూ గాలి పటాలు ఎగరేసేందుకు పొలాల బాట పట్టారు. పతంగి కోసం పరుగెత్తుతున్న క్రమంలో బావిని గమనించని సోహైల్ అందులో పడిపోయాడు. తమ్ముడిని కాపాడే క్రమంలో సైఫాన్ కూడా బావిలోకి జారాడు. సాగుడుగా ఉన్న పాత బావిలోని ఓ చెట్టు కొమ్మ వద్ద చిక్కుకున్న సైఫాన్ కాపాడమంటూ కేకలు వేశాడు. ఇది గమనించిన ఓ మహిళ, అక్కడే ఉన్న ఉపాధి కూలీలకు సమాచారం ఇవ్వడంతో పరుగున వచ్చి, సైఫాన్ను బయటకు లాగారు. సోహైల్ ఆచూకీ లభించకపోవడంతో నాలుగు మోటార్ల ద్వారా బావిలోని నీళ్లను బయటకు తోడేస్తున్నారు. ఫైరింజన్ను వచ్చి గాలింపు చర్యలు చేపట్టినా బావిలో నీటి మట్టం తగ్గకపోవడంతో చిన్నారి ఆచూకీ లభించలేదు. పాడుబడిన బావి అడుగులో భారీగా ఉన్న చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కున్నాడు. అతికష్టం మీద రాత్రి 10గంటల తర్వాత చిన్నారి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టానికి తరలించారు.
పతంగులు ఎగరేస్తూ బావిలో పడిన చిన్నారులు
పతంగులు ఎగరేస్తూ బావిలో పడిన చిన్నారులు
పతంగులు ఎగరేస్తూ బావిలో పడిన చిన్నారులు


