పటిష్టంగా కోడ్ అమలు
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. శనివారం వికారాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆన్లైన్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని తప్పకుండా అమలు చేయాలన్నారు. సున్నిత, అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే బైండోవర్ చేయాలని ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, నగదు పంపిణీ, ఉచితాల పంపిణీని అరికట్టాలని తెలిపారు. లైసెన్స్డ్ ఆయుధాలను తక్షణమే డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బీ రాములు నాయక్, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.
ఫిర్యాదుదారులతో ముఖాముఖి
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి నెలలో 52 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి మంగళ, గురువారాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా క్లిష్టమైన ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎస్పీ సూచించారు. పోలీస్స్టేషన్లకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. మహిళలు, వృద్ధులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా సేవలు అందించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.
ఎస్పీ స్నేహ మెహ్ర


