యాప్ ద్వారా యూరియా పంపిణీ
అనంతగిరి: వికారాబాద్ మండలంలో యాప్ ద్వారా మాత్రమే యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ప్రసన్న లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరూ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎంతమేర యూరియా కావాలో బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఏ మండలం నుంచైనా యూరియా పొందవచ్చని తెలిపారు.
ముగిసిన అంత్యక్రియలు
తాండూరు రూరల్: అప్పులు చెల్లించమని వేధించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు ప్రవీణ్పటేల్ అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. గత గురువారం ఆయన పురుగు మందు తాగడంతో నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఆయన స్వగ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద అంతిమ సంస్కారాలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్పటేల్ భార్య రజిని మాట్లాడుతూ.. తన భర్త మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.
అదృశ్యమైన వ్యక్తి మృతి
ధారూరు: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు. ఎస్ఐ రాఘవేందర్, స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మైలారం పంచాయతీ అనుబంధ గ్రామమైన కొత్తతండాకు చెందిన పాత్లావత్ సుభాష్(31) మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మాన్పించాలని కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం అతనితో శివమాల ధారణ చేయించారు. మద్యం తాగకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన సుభాష్ ఆదివారం కనిపించకుండాపోయాడు. అతని భార్య హారిక ఫిర్యాదు మేరకు ధారూరు పీఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం కాగ్నానది ఒడ్డున పడిఉన్న సుభాష్ మృతదేహంతో పాటు అతని బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుభాష్ ధారూరు నుంచి బైక్పై దోర్నాల్ వైపు వెళుతూ కాగ్నా వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయి ఉంటాడని ఎస్ఐ చెప్పారు. ఈ మరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


