మహిళ దారుణ హత్య
తాండూరు రూరల్: మహిళ గొంతుకోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్దేముల్ ఎస్ఐ శంకర్ వివరాల ప్రకారం.. రేగొండి గ్రామ శివారు అటవీ ప్రాంతాంలోని ఓ కాల్వ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైనట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డులోని వివరాల ద్వారా ఆమె, యాలాల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంకల పద్మమ్మ(45)గా గుర్తించారు. వికారాబాద్ నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిత్యం తాండూరుకు వచ్చి అడ్డా కూలీగా పని చేసుకుంటుందని, గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పనికోసం తీసుకెళ్లి, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ శంకర్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పద్మమ్మ నాలుగు రోజుల క్రితం పనికోసం బయటకు వెళ్లి, ఇంటికి వెళ్లలేదని తెలిసింది. వరినాట్లు వేసేందుకు వెళ్లి, ఒక్కోసారి వారం రోజుల వరకూ పని ప్రాంతంలోనే ఉంటారని, అలాగే వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. మృతురాలి భర్త చనిపోగా, ఓ కూతురు ఉంది.
పెద్దేముల్ మండలం రేగొండిలో ఘటన
డాగ్స్క్వాడ్, క్లూస్టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు
మృతురాలిది యాలాల మండలం పగిడిపల్లి


