సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్? | Cigarette smuggling trends a warning for India | Sakshi
Sakshi News home page

సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?

Jan 18 2026 10:40 AM | Updated on Jan 18 2026 11:03 AM

Cigarette smuggling trends a warning for India

న్యూఢిల్లీ: దేశంలో వచ్చే ఫిబ్రవరి ఒకటి నుండి సిగరెట్లపై పన్నులు పెరగనున్న తరుణంలో, అక్రమ పొగాకు విక్రయాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద అక్రమ సిగరెట్ మార్కెట్లలో ఒకటిగా ఉందని, ఈ నేపథ్యంలో పన్నుల పెరుగుదల అక్రమ ముఠాలకు మరింత ఊతమిచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. దక్షిణాఫ్రికా, అజర్‌బైజాన్ తదితర దేశాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు భారత్‌కు హెచ్చరికగా మారుతున్నాయని వారు తమ వాదన వినిపిస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో ఏం జరిగింది?
దక్షిణాఫ్రికాలో అక్రమ సిగరెట్ల వ్యాపారం మరింతగా మితిమీరిపోవడంతో, ఆ దేశానికి చెందిన  సిగరెట్ల తయారీ సంస్థ ‘బ్రిటిష్ అమెరికన్ టొబాకో’ (బీఏటీ)తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పన్నులు చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తక్కువ ధరకు విక్రయించే నకిలీ సిగరెట్ల  కారణంగా ఈ సంస్థ తన చట్టబద్ధమైన వ్యాపారాన్ని నిలదొక్కుకోలేకపోయింది. ఫలితంగా దక్షిణాఫ్రికాలో సిగరెట్ల తయారీ రంగంపై  ప్రతికూల ప్రభావం పడింది.

అజర్‌బైజాన్‌లోనూ..
అజర్‌బైజాన్‌లో పొగాకు స్మగ్లింగ్‌లో ఒక మాజీ కస్టమ్స్ అధికారి హస్తం ఉండటం, ఆపై అతను అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. దేశంలో పొగాకు అక్రమ నెట్‌వర్క్‌లు ఎంత శక్తివంతంగా మారాయంటే, అవి  ప్రభుత్వ వ్యవస్థల్లోకి కూడా చొచ్చుకుపోయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒకసారి ఈ అక్రమ ముఠాలు వేళ్లూనుకుంటే, వాటిని అదుపు చేయడం చాలా కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అక్రమ సిగరెట్ల మార్కెట్ వాటా
భారతదేశంలో గతంలో పన్నులు భారీగా పెంచినప్పుడు, చట్టబద్ధమైన, అక్రమ సిగరెట్ల ధరల మధ్య వ్యత్యాసం భారీగా కనిపించింది. ఇది స్మగ్లర్లను ప్రోత్సహించేదిగా పరిణమించింది. ప్రస్తుతం దేశంలో అక్రమ సిగరెట్ల మార్కెట్ వాటా 26.1% వరకు ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ. 23 వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. ఈ నిధులు ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగానికి అందకుండా పోతున్నాయి.

సరైన పన్ను విధానంతో..
ప్రజారోగ్యం దృష్ట్యా పొగాకుపై పన్నులు అవసరమైనప్పటికీ, అవి హేతుబద్ధంగా లేకపోతే అక్రమ మార్కెట్ వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. పన్నుల భారం మితిమీరినప్పుడు లీగల్ మార్కెట్ కుంచించుకుపోయి, స్మగ్లింగ్ మాఫియా బలపడుతుందనే వాదన వినిపిస్తోంది. అందుకే, పటిష్టమైన నిఘా, సరైన పన్ను విధానం ద్వారానే అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: మౌని అమావాస్య : ధార్మికమే కాదు.. ఆరోగ్యానికి ‘సూపర్ ఫుడ్’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement