హస్తంలో ముసలం
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు రాజుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకులను విస్మరిస్తూ.. కొత్త వారికి టికెట్లు ఇవ్వడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ప్రాతిపదికగా బీఫాంల పంపిణీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి భీంభరత్ వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో కిందిస్థాయి కార్యకర్తలు బలవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపించినా కొన్ని వార్డుల్లో టికెట్లు ఎవరికి ఇస్తున్నారో ఇప్పటికే తేల్చకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్చార్జి మంత్రి, మాజీ ఎంపీ ముఖ్యనేతలతో చర్చలు జరిపినా బీఫాంల అంశం ఇంకా కొలిక్క రాలేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు ఎన్నికల అధికారులకు బీఫాంలు అందజేయాల్సి ఉండటంతో ఎవరికి దక్కుతాయోననే ఆందోళన కొనసాగుతుంది.
బీఫాంలు అమ్ముకుంటున్నారని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల బీఫాంలను అమ్ముకుంటున్నారని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. అజీజ్నగర్కు చెందింన అల్లం శ్రీనివాస్రెడ్డి 5వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తుందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బీఫాంలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు సురంగల్కు చెందిన గడ్డం లక్ష్మివెంకట్రెడ్డి 13వ వార్డులో నామినేషన్ వేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నారనే సంకేతాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో మరికొంత మందికి టికెట్లు దక్కకపోవడంతో రెబల్స్గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
● కాంగ్రెస్లో అసమ్మతి జ్వాలలు
● తమ వర్గానికే టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే, పార్టీ ఇన్చార్జి పట్టు


