Telangana
-
BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..
-
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మంత్రి పొన్నం, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పపువ్వు సారా మంచిదే గానీ.. ఇందిరమ్మ పేరు పెట్టకండంటూ రాకేష్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. రాకేష్రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. రాకేష్రెడ్డివ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. రూల్స్ ప్రకారమే సభ నడవాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు.కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై మాజీ మంత్రి హరీష్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్,బీజేపీ ఎమ్మెల్యేలు సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. చర్చను పక్కదారి పట్టించడం సరైన పద్దతి కాదన్నారు. ఒక్క విషయాన్ని పట్టుకుని గంట సమయం వృథా చేయడం సరికాదన్నారు. రాకేష్రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న స్పీకర్.. కొత్త సభ్యులు పొరపాటు చేస్తే ఫ్లోర్ లీడర్ సరిచేయాలని సూచించారు.తానేం తప్పు మాట్లాడలేదన్న రాకేష్రెడ్డి.. ప్రతి స్కీమ్కు ఇందిరమ్మ పేరు పెడుతున్నారు.. ఈ స్కీమ్కు ఆమె పేరు పెట్టొద్దని చెప్పానంటూ రాకేష్రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలంటే హౌస్ కమిటీ వేయండి.. ఇందిరమ్మపై తప్పుగా ప్రచారం చేస్తుంటే తానూ మాత్రమే ఖండించానని రాకేష్రెడ్డి అన్నారు. ఇప్పపువ్వు సారా ఫ్యాక్టరీకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని చెప్పడం తప్పేమీ కాదంటూ మహేశ్వర్రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని.. ఇందిరమ్మ పేరు ఎందుకు తెచ్చారో రాకేష్రెడ్డి సమాధానం చెప్పాల్సిందేని మంత్రి సీతక్క అన్నారు. -
ఇలా పెట్రోల్ నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు: ఉత్తమ్
హైదరాబాద్: పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి కనపడుతుండడంతో దీనిపై తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పందించారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదని అన్నారు.‘మీరు ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీకే ప్రమాదకరం. అవసరం మేరకు సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకేసారి డ్రమ్లు, కంటైనర్లు నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు. ప్రజలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా మానిటరింగ్ చేస్తుంది. రూమర్స్, ఫేక్ న్యూస్ను నమ్మొద్దు’ అని సూచించారు.కాగా, తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... ‘డిమాండ్ 25 శాతం పెరిగింది. 1,200 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాయి. పెట్రోల్ బంక్ లు క్లోజ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. అహ్మదాబాద్, సూరత్, నాగపూర్, చెన్నైలో ఇలాంటి పరిస్థితి ఉంది. బంక్ లకు క్రెడిట్ సమస్య లేదు. గ్యాస్ అక్రమ రవాణా పై 175 కేసులు నమోదు చేస్తాం. 2,954 వాణిజ్య సిలిండర్ లు సీజ్ చేశాం.గృహ అవసరాలకు గ్యాస్ ఇబ్బంది లేదు. ఎల్పీజీ బుకింగ్ 15 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది’ అని అన్నారు. కాగా, పెట్రోల్ , డీజల్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఇతర అధికారులు కూడా సూచిస్తు న్నారు. పెట్రోల్ బంక్లలో కావాల్సినంత సప్లై జరుగుతుందని అంటున్నారు. -
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు: సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో ఇవాళ (బుధవారం) టీజీసీసీసీలో కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు.ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి.. కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని.. దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని పేర్కొన్నారు.ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని.. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్కు గుడ్బై.. రేవంత్పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు -
సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిన్నటి నుంచి వాహనదారులు బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళన, చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించాయన్న వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలపై తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది.ఓఎంసీలు - డీలర్లు.. క్రెడిట్ విధానం అంటే ఏమిటి?ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణం చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ (అప్పు) సౌకర్యంపై జరుగుతున్న చర్చ. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినప్పుడు దానికి సంబంధించిన సొమ్ము చెల్లించడానికి కొంత సమయం (క్రెడిట్ పీరియడ్) ఇస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత వల్ల ఓఎంసీలు తమ రిస్క్ను తగ్గించుకోవడానికి డీలర్ల క్రెడిట్ పరిమితులను తగ్గించడం లేదా ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లించి స్టాక్ తీసుకోవడం) విధానాన్ని అమలు చేస్తున్నాయి. చేతిలో నగదు లభ్యత తక్కువగా ఉన్న చిన్న డీలర్లు క్రెడిట్ దొరకకపోవడంతో స్టాక్ను తక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప కంపెనీల వద్ద స్టాక్ లేక కాదని నిపుణులు చెబుతున్నారు.యుద్ధ ప్రభావం ఎంతవరకు?పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే, భారత ప్రభుత్వం వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండటం వల్ల తక్షణమే ఇంధన సరఫరా నిలిచిపోయే అవకాశం లేదు. డీలర్లకు, కంపెనీలకు మధ్య ఉన్న అంతర్గత చెల్లింపుల వ్యవహారాలను వాహనదారులు కొరతగా భావించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి సమయాన్ని వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరఫరా సజావుగానే సాగుతోందని అధికారులు నిర్ధారించారు.కొరత లేదు.. ఆందోళన వద్దుతెలంగాణలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్) డిపోల వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా ఆగిపోతుందనేది కేవలం ఊహాగానమేనని, ప్రస్తుతానికి దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, ఆందోళనతో కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కంపెనీల స్పందన..వదంతులను నమ్మొద్దు: బీపీసీఎల్భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. భారత్లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. మా రిఫైనరీలు, సరఫరా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి’ అని సంస్థ పేర్కొంది.చమురు కంపెనీల ఉమ్మడి ప్రకటనబీపీసీఎల్, హెచ్పీసీఎల్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ (ఎల్పీజీ) సరఫరా కూడా సుస్థిరంగా ఉందని వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత డిమాండ్ను తట్టుకోవడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. లాజిస్టిక్స్, రవాణా నెట్వర్క్ ఎక్కడా ఆగకుండా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇరాన్ నుంచి రిలయన్స్ చమురు కొనుగోలుమరోవైపు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
Rapido: వామ్మో.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా!
హైదరాబాద్: ర్యాపిడో డ్రైవర్కు, ప్రయాణికురాలికి మధ్య జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరించి వారి ఫోన్లు దోచుకెళ్లిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్కర్నూల్ జిల్లా టూడుకుర్తి గ్రామానికి చెందిన రేణుక(32) నగరంలో కొండాపూర్లో నివసిస్తోంది. ఈ నెల 22న షేక్పేటలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె రాత్రి 8 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ సమయంలో తనను మహ్మద్ ఖాలిద్గా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి తాను ర్యాపిడో డ్రైవర్నని చెప్పి ఆమెను బైక్పై తీసుకువెళ్లేందుకు ముందుకువచ్చాడు. నమ్మకంతో రేణుక అతని బైక్పై ఎక్కింది. జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఆలయం వద్దకు చేరుకున్న తర్వాత చార్జీల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అటుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రేణుక, ఖాలిద్ల ఫోన్లు తీసుకుని పికప్, డ్రాప్ వివరాలు చెక్ చేస్తున్నట్లు నటించారు. ఈ క్రమంలో వారిద్దరి దృష్టి మరల్చి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత తమ ఫోన్లు దొంగిలించినట్లు గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గ్రేటర్ పరిధిలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల నాటికి రాజధాని నగరం హైదరాబాద్, నగరాన్ని ఆనుకొని ఉన్న ఇరుగుపొరుగు జిల్లాల్లో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునరి్వభజన చేసేందుకు నిర్ణయించడంతోపాటు 50 శాతం స్థానాలను పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పడంతో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి. శాసనసభా నియోజకవర్గాలు, లోక్సభ స్థానాలు 50 శాతం పెరగనుండటంతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 183కి పెరగనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2011 జనగణన మేరకు రాష్ట్రంలోని జనాభా దాదాపు 3.52 కోట్లు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ జనాభా సగటున దాదాపుగా 1.93 లక్షలు. దీనికి పది శాతం అటూఇటూ ఉండేలా పునర్విభజన జరగవచ్చు. హైదరాబాద్తో పాటు సరిహద్దు జిల్లాల్లోనూ అసెంబ్లీ సెగ్మెంట్లు పెరగనున్నాయి. జిల్లాల వారీగా పెరిగేదిలా.. 2011 లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 39,43,323. ఒక్కో అసెంబ్లీకి సగటుజనాభా 1.93 లక్షలను పరిగణనలోకి తీసుకుంటే ఈ జిల్లాలో 20 అసెంబ్లీ సీట్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 15 శాసనసభా స్థానాలకు తోడు కొత్తగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయన్న మాట. అలాగే మేడ్చల్ జిల్లా జనాభా 24,60,095. ఈ లెక్కన ఈ జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడు అదనంగా మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. రంగారెడ్డి జిల్లా జనాభా 24,46,265. ఈ లెక్కన ఈ జిల్లాలో కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ (కల్వకుర్తి పాక్షికం) నియోజకవర్గాలకు అదనంగా మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. ఇదే లెక్కన వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లాలో మరో 3 నియోజకవర్గాలు ఆవిర్భవిస్తాయి.ఐదు జిల్లాల పరిధిలో కొత్తగా 22 అసెంబ్లీ నియోజకవర్గాలతో పునరి్వభజన జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు కానున్న 63 శాసనసభ నియోజకవర్గాల్లో 22 ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. అంటే మూడో వంతుకు పైగా ఇక్కడే ఏర్పడనున్నాయి. ఒక నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండటంతో పాటు జీహెచ్ఎంసీకి ఒక సర్కిల్ లేదా జోన్ సైతం ఒకే జిల్లాలో జీహెచ్ఎంసీ పునరి్వభజన సందర్భంగానూ అధికారులు జాగ్రత్త వహించారు. కొత్త నియోజకవర్గాల్లో కొన్ని? ప్రస్తుతం ఆయా ప్రాంతాలకున్న ప్రాధాన్యం, వాడుక దృష్ట్యా కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ సీట్లు బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్, హిమాయత్నగర్, శంషాబాద్, చందానగర్, నార్సింగి, బాచుపల్లి, కాప్రా, బోడుప్పల్, కీసర, బాలానగర్ (ఐడీపీఎల్) పేరిట ఏర్పాటు కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అవి ఏ నియోజకవర్గంలో ఉన్నాయో, ఇతరత్రా అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, పక్కపక్కనే ఉండే రెండు ముఖ్య ప్రాంతాల పేర్లు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉండవని చెబుతున్న వారూ ఉన్నారు. -
ఈ జిల్లాలకు తాకిన పెట్రోల్ సెగ
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కష్టాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల ముందు వాహనాలు భారీ సంఖ్యలో బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరడంతో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తున్నారు. కొన్నిచోట్ల పెట్రోల్ బంకులు తెరుచుకోకపోవడంతో తెరిచివున్న బంకులకు వాహనదారులు పోటెత్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని పెట్రోల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. -
తెలంగాణలో పెట్రోల్ నిల్వలు.. డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో నిన్న అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. వదంతుల వ్యాప్తిచెందిన కారణంగా వాహనాల్లో డీజిల్, పెట్రోల్ నింపుకునేందుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. అవసరానికి మించి ఎవరు కొనుగోలు చేయవద్దు అని హెచ్చరించింది.మరోవైపు.. రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చించనున్నట్టు సమాచారం. -
దిమ్మతిరిగేలా పెరిగిన నిమ్మకాయల ధరలు
సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడంతో వంటి కారణాలతో వీటి ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు టోకు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, నార్కట్పల్లి, చిట్యాల తదితర ప్రాంతాల నుంచి నగరానికి నిమ్మకాయలు వస్తుంటాయని, మార్చి మధ్య నుంచి సరఫరా దాదాపు సగానికి తగ్గిపోయిందని మరో వ్యాపారి నరేష్ కుమార్ పేర్కొన్నారు. 25 కిలోల బరువున్న 1,200 నుంచి 1,500 బస్తాల నిమ్మకాయలు గతంలో రాగా, ఇప్పుడు కేవలం 800–1,000 బస్తాలు మాత్రమే వస్తున్నాయని ఆయన తెలిపారు. మధ్యవర్తులు ప్రధాన డీలర్ల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేసి, ఆ తర్వాత కూరగాయల వ్యాపారులకు సరఫరా చేయడంతో రిటైల్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. నిమ్మకాయల కొరత కారణంగా హోటల్ యజమానులు బిర్యానీ, చైనీస్ ఫాస్ట్ ఫుడ్తో పాటు సలాడ్లలో వడ్డించడం తగ్గించేశారు. -
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా.. ఒక్కటే.. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. అధి ష్టానం హామీ ఇచ్చింది. ఇస్తుందో లేదో తెలియదు. వారికి ఉండే సమీకరణాలు ఏమిటో?’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదవి లేకున్నా తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రి పదవి ఇవ్వడం వల్ల తనకు వచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదని, అది పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు తాము ఇద్దరం సోదరులమని తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్య మకారుల సేవలు అవసరమన్నారు. సీఎం రేవంత్రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బంది లేద ని, తాను సోమవారం సీఎంతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయని, ఆయన ఎదురుపడితే పలకరించుకున్నామే తప్ప ఎలాంటి భేటీ జరగలేదన్నారు. పదేళ్లపాటు తానే సీఎం అని రేవంత్రెడ్డి అంటేనే తాను అభ్యంతరం చెప్పానని, అలా అనడం శాసనసభ్యులను అవమానించడమే అవుతుందని మాత్రమే తాను గతంలో వ్యాఖ్యానించానని చెప్పారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే వారి పతనం ప్రారంభమైందని తాను కేటీఆర్తో అన్నట్లు చెప్పారు. కాగా భోజన సమయంలో రెండుగంటలపాటు కేటీఆర్తో భేటీలో సాధారణ విషయాలే మాట్లాడుకున్నామని, ఎలాంటి రాజకీయ ప్రాధా న్యత లేదని, ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నా రని రాజగోపాల్రెడ్డి తెలిపారు. -
‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్? నీ మొగుడు చూసుకుంటాడులే’’
సాక్షి,హైదరాబాద్: మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగంలోని ఓ మహిళా ఇన్స్పెక్టర్ సహచర సిబ్బందితో అమానవీయంగా, అసభ్యకర రీతిలో ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతోనే కాదు ఇన్స్పెక్టర్ ర్యాంక్ వారితోనూ ఆమె తీరు ఇలాగే ఉంటుందని పలువురు సిబ్బంది ‘సాక్షి’తో వాపోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమెను చూసుకునేందుకు సెలవు అడగ్గా... కుదరదని చెప్పడంతో పాటు ‘‘ఆస్పత్రిలో ఏం చేస్తావ్? నీ మొగుడు చూసుకుంటాడులే’’ అని మాట్లాడిందని ఓ మహిళా పోలీసు ‘సాక్షి’ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఏమాత్రం సానుభూతి లేకుండా ప్రతి విషయంలోనూ మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పోలీస్ యూనిఫాంలో ఠాణాకు రాకపోవడం వంటి విమర్శలకు తోడు, ఇటీవల పోక్సో కేసులో స్టేట్మెంట్ రికార్డ్కు వచ్చిన స్థానిక పోలీసు సిబ్బందితో విపరీతంగా ప్రవర్తించడంతో.. వారు తీవ్రంగా కుంగిపోయారు. విషయాన్ని ఉన్నతాధికారులు, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఆరోపణలు వాస్తవమేనని కమిషనర్కు నివేదిక అందజేశారు. దీంతో మహిళా ఇన్స్పెక్టర్ను మల్టీ జోన్–2కు సరెండర్ చేశారు. సైబర్ క్రైమ్ ఠాణాలో హోదాతో సంబంధం లేకుండా అందరూ విధిగా యూనిఫామ్లో డ్యూటీ నిర్వహించాలని ఆదేశించారు. -
నేడు కాంగ్రెస్కు రాజీనామా.. జీవన్ పయనమెటు?
సాక్షి,జగిత్యాల: నేడు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రాజీనామా అనంతరం ఏఐసీసీ, పీసీసీకి లేఖ పంపనున్నారు.కాంగ్రెస్తో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెగదెంపులు పెట్టనున్న జీవన్ రెడ్డి, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామా విషయంలో చివరి క్షణం వరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ దూత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి కలిసినా జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు.దీంతో జీవన్ రెడ్డి రాజీనామా, ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్న నేతగా జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం ఉంది. ఆయన స్వతంత్రంగా కొనసాగడం, బీఆర్ఎస్లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్లడం వంటి అవకాశాలు చర్చనీయాంశమవుతున్నాయి.జీవన్ రెడ్డి నిర్ణయం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, ఆయన తుది నిర్ణయం పూర్తిగా అనుచరుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉండటం గమనార్హం. -
పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన జనం
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆగిపోతుందని, కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో నగరంలో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందారు. మంగళవారం ఉప్పల్, మల్లాపూర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్పేట వంటి అనేక ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు పోటెత్తారు. రాత్రివేళకు సగానికి పైగా పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు రావడంతో బంకుల్లో నిల్వలు త్వరగా అయిపోయాయి. చమురు కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉండడం వరుస సెలవుల వల్ల కొన్ని బంకులకు సకాలంలో స్టాక్ చేరకపోవడం కూడా కొంత ప్రభావం చూపింది. ఆటో.. ఎటో.. మహా నగరంలో రవాణాకు వెన్నెముకగా నిలిచే ఆటోలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. కొద్ది రోజులుగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తే.. మధ్యాహా్ననికి కూడా ట్యాంకులు నిండని పరిస్థితి నెలకొంది. పశి్చమాసియా యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కమ్మేయడంతో... దాని ప్రభావం హైదరాబాద్ ఆటో డ్రైవర్లపై పడింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో డిమాండ్ను సాకుగా చూపి కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లు స్టాక్ ఉన్నా లేదని బోర్డులు పెడుతున్నాయి. నగరంలో ఎల్పీజీ ఆటోల సంఖ్య లక్ష పైనే. రోజువారీ గ్యాస్ డిమాండ్ 1.70 లక్షల కిలోలు ఉండగా, సరఫరాలో సగటున 30–40 శాతం లోటు కనిపిస్తోంది. భారత్ గ్యాస్ లిమిటెడ్ , ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్ వంటి సంస్థలతో పాటు బీజీఎల్, ప్రైవేటు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. నగర వ్యాప్తంగా సీఎన్జీ, ఎల్పీజీ స్టేషన్లు ఉన్నప్పటికీ, సగంపైగా బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి.ప్రైవేటు గ్యాస్ సైతం... ప్రభుత్వ రంగంలోని ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్తో పాటు ప్రైవేటులో సూపర్ గ్యాస్, గో గ్యాస్, ఏజిస్ లాజిస్టిక్స్, తెలంగాణ గ్యాస్, టోటల్ ఎనర్జీస్కు నగర వ్యాప్తంగా స్టేషన్లు ఉన్నాయి. ప్రైవేటు సంఖ్య తక్కువే అయినా అత్యవసర సమయాల్లో ఇవే దిక్కు. దీంతో కొంత ఎక్కువ వసూలు చేస్తాయి. కాగా, యుద్ధానికి ముందు కిలో సీఎన్జీ ధర రూ.70–75 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.90–రూ.100 దాటింది. కొన్ని ప్రైవేట్ స్టేషన్లలో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ప్రధాన కంపెనీల బంకుల్లో గ్యాస్ అయిపోవడంతో డ్రైవర్లు ప్రైవేట్లును ఆశ్రయిస్తున్నారు. అక్కడ లీటరుకు రూ.15–20 ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. -
నాడు మైక్ ఇవ్వలేదు.. నేడు వాకౌట్ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా ఎన్నోసార్లు నన్ను అవమానించారు. కనీసం సభ్యులుగా గౌరవించేవారు కాదు. నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా మాట్లాడుతుంటే వినాల్సిందిపోయి బడ్జెట్ కాగితాలను చించి చెవిలో పువ్వుల్లాగా పెట్టుకుని వెళ్లిపోవడం సంస్కారమా? సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి, ఇక్కడ భట్టి విక్రమార్క, అక్కడ శ్రీధర్ బాబు కూర్చోవడం ఏమిటి? అనే చులకన భావంతో చూడొద్దు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజాతీర్పును గౌరవించాలి’ అని బీఆర్ఎస్ సభ్యులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.బడ్జెట్పై శాసనసభలో మంగళవారం రెండోరోజు నిర్వహించిన చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. సభను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, బడ్జెట్ పద్దుల పుస్తకాలను సకాలంలో ఇవ్వడం లేదని ఆరోపిస్తూ భట్టి విక్రమార్క సమాధానాన్ని బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్రావు ప్రకటించి తమ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. ప్రశ్నించడానికి బీఆర్ఎస్ సభ్యులకు వీలైనంత సమయమిచి్చనా వాకౌట్ చేయడం సరికాదని భట్టి తప్పుబట్టారు. నాడు ఎన్ని అవమానాలకు గురిచేసినా తాము వాకౌట్ చేయలేదన్నారు. వాస్తవికతకు దగ్గరగా... ఆదాయం లేకున్నా ఏటా 20 శాతం బడ్జెట్ను గత బీఆర్ఎస్ సర్కారు పెంచిన తరహాలో పెంచుకుంటూ పోవడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. అలా చేస్తే ఈ పాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరేదన్నారు. ఏటా 6 శాతం వృద్ధితో బడ్జెట్ అంచనాలను పెంచుకుంటూ పోతున్నామని, మరో రెండుమూడేళ్లలో వాస్తవిక గణాంకాలకు దగ్గరగా ప్రతిపాదనలను తీసుకొస్తామని చెప్పారు. ఎన్నికల కోసం రైతు భరోసా చెల్లించారని బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను భట్టి తోసిపుచ్చారు. గత బీఆర్ఎస్ సర్కారు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ చేయడంతో వడ్డీలపై వడ్డీలు పెరిగి రైతులు నష్టపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను గాలికి వదిలేసిందన్నారు. తాము వచ్చాక రాష్ట్ర వాటా రూ.3 వేల కోట్లను చెల్లించి రూ.10వేల కోట్ల కేంద్ర నిధులను సాధించామని చెప్పారు. అప్పులకే ఏటా రూ.93,194 కోట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, పరిపాలన వ్యవస్థను విధ్వంసం చేసి ందని భట్టి ఆరోపించారు. రాష్ట్ర అప్పులు, తిరిగి చెల్లింపులు 2014–15లో రూ.9,580 కోట్లు మాత్రమే ఉండగా, గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులతో 2023–24 నాటికి రూ.25,350 కోట్లు, 2024–25 నాటికి రూ.66,545 కోట్లు, 2025–26 నాటికి రూ.93,194 కోట్లు కట్టాల్సి వచి్చందన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం రూ.1,59,165 కోట్ల అప్పులు చేసి రూ.1,85,090 కోట్ల అప్పులను తిరిగి చెల్లించిందన్నారు. మోదీ అప్పులు రూ.140 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం 1950–51 నుంచి 2013–14 మధ్యకాలంలో 13 మంది ప్రధానుల ఆధ్వర్యంలో రూ.56.66 లక్షల కోట్లు అప్పులు చేస్తే ప్రస్తుత ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో ఏకంగా రూ.140 లక్షల కోట్లు కొత్త అప్పులు చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర అప్పులపై బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆయన దీటుగా బదులిచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయికి 30 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయన్నారు. తెలంగాణ ఏం పాపం చేసింది. దేశంలో అంతర్భాగం కాదా? కేంద్రం ఇలా ఇవ్వడమే చీటింగ్ అని ఏలేటిని నిలదీశారు.రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.10 పెంచినట్టు ఏలేటి చేసిన ఆరోపణ లు అవాస్తమని తప్పుబట్టారు. నాడు మహాత్మాగాం«దీని భౌతికంగా లేకుండా చేశారని, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారని బీజేపీపై మండిపడ్డారు. భట్టి శాసనమండలిలో సైతం బడ్జెట్పై చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అర్ధరాత్రి వరకు సమాధానమిచ్చారు.పార్టీ ఆఫీస్ నడిపినట్టు సభ నడిపారు: మంత్రి శ్రీధర్బాబు బీఆర్ఎస్ హయాంలో సభను ఆ పార్టీ ఆఫీస్ను నడిపినట్టు నడిపారని మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులకు తగిన సమయమిచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సీఎం రేవంత్రెడ్డి సమాధానమిచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ను తీవ్రంగా తప్పుబడుతూ సభలో మాట్లాడారు. -
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు విడుదల చేయడంతోపాటు ఏటా రెండు లక్షల ఉద్యోగ నియామకాల భర్తీ హామీ నెరవేర్చాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో విద్యార్థులు, యువతకు మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో పెద్దఎత్తున బీఆర్ఎస్వీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకుని లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్లో విద్యకు 18 శాతం నిధులు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసినా కేటాయింపులు 8 శాతానికే పరిమితం చేశారు. గత ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన ఫీజు రీయింబర్స్మెంటులో 80 శాతం నిధులను విడుదల చేయలేదు. రూ.8 వేల కోట్ల బకాయిలకుగాను రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం మోసగిస్తోంది. బడ్జెట్లో విద్యానిధి పథకం, రూ.5 లక్షల విద్యా రుణం హామీ ఊసేలేదు. రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ కేలండర్ అమలు చేస్తామని ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీని అమలు చేయని రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’అని అన్నారు. విద్యార్థి నేతల అరెస్టు అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అరెస్టు చేసి పంజగుట్ట, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్వీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే పోలీసులు పలువురు బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం నేతల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. పోలీసులు అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్ తదితరులు తమ ఇళ్ల వద్దకు పోలీసులు వచ్చిన వీడియోలను ట్వీట్ చేశారు. విద్యార్థుల అరెస్ట్ దుర్మార్గ చర్య: కేటీఆర్ పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగ నియామకాల హామీ అమలు కోసం నిలదీసిన బీఆర్ఎస్వీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు. నిధులు విడుదల చేయకుండా ప్రశ్నించిన గొంతులపై విరుచుకుపడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఇచి్చన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి వచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. జాబ్ కేలండర్కు పాతరేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను నిర్లజ్జగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కుప్పకూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన పాపం విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిదే. 127 మంది విద్యార్థులు గురుకులాల్లో మరణించినా సీఎం రేవంత్రెడ్డిలో కనీసం చలనం లేదు. ఇప్పటికైనా బకాయిపడ్డ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలి’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేడో, రేపో సీన్ రీ కన్స్ట్రక్షన్!
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను సిట్ విచారించింది. రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతని సోదరుడు రితీష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్శర్మను మంగళవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని బందోబస్తు మధ్య శంషాబాద్ ఠాణాకు తరలించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. మొదట రోహిత్రెడ్డితో ప్రారంభించి, ముగ్గురిని వేర్వేరుగా విచారించారు.సిట్ బృందం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు మధ్యాహ్నం శంషాబాద్ ఠాణాకు వచ్చి నిందితులను స్వయంగా విచారించారు. వేర్వేరుగా ముగ్గురిని విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. ఫామ్హౌస్లో కుటుంబ సభ్యులతో పార్టీలు మాత్రమే జరుగుతుంటాయని రోహిత్రెడ్డి అడ్వొకేట్ శ్రీకాంత్రెడ్డి మీడియాతో తెలిపారు. పాత సంఘటలను కాకుండా ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాత్రమే విచారించాలని కోర్టు సూచించినట్టు చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు, కాల్పుల వ్యవహారంపై ఆరా కాల్పుల వ్యవహారం, డ్రగ్స్ కొనుగోలు అంశాలపై సిట్ అధికా రులు నిందితులను ప్రశ్నించినట్టు తెలిసింది. డ్రగ్స్ ఎక్కడ కొను గోలు చేశారు.. ఎవరు సరఫరా చేశారు.. డ్రగ్స్ పార్టీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి వంటి ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం. కాల్పుల వ్యవహారంపై నమిత్శర్మను ప్రశ్నించి పలు విషయాలు తెలుసు కున్నారు. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసింది రోహిత్రెడ్డే కావడంతో ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విచారణలో నాలుగు కొత్త పేర్లు బయటకొచ్చినట్టు సమాచారం. మిగిలిన రెండు రోజుల విచారణలో డ్రగ్స్ మూలాలకు సంబంధించిన వివరా లను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఫామ్హౌస్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
సర్వత్రా డీలిమిటేషన్ చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నియోజకవర్గాల పునర్విభ జన హాట్ టాపిక్గా మారింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ జరుగుతుందనే సమాచారంతో.. పల్లె, పట్నం, చిన్నా, పెద్దా రాజకీయ నేతలనే తేడా లేకుండా పునర్విభజన గురించిన చర్చే జరుగుతోంది. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, అధికారులు కూడా ఈ అంశంపైనే ఎక్కువగా మాట్లాడుకోవడం కన్పించింది. ముఖ్యంగా సెంట్రల్, నార్త్, సౌత్ తెలంగాణల్లో ఎక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే సెంట్రల్ తెలంగాణగా పరిగణించే హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయి అత్యధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ హైదరాబాద్ ఓటర్లను ఆకర్షించగలిగే పార్టీలు సులువుగా అధికారం దక్కించుకునే విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల జనాభాలో మార్పురాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొత్తం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే పునర్విభజన ఆయా జిల్లాల పరిధిలోనే ఉండనుంది. కొత్త జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఈ మేరకు నియోజకవర్గాల జనాభాలో మార్పు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక అనుమతి తీసుకుంటారనేది నిపుణుల భావన. జిల్లా, రాష్ట్రం యూనిట్గానియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల కేటాయింపునకు చాలా కాలంగా ఓ పద్ధతి పాటిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల కోసం జిల్లా యూనిట్గా, ఎస్టీ నియోజకవర్గాల కోసం రాష్ట్రం యూనిట్గా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఒకటి లేదా రెండు స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఎస్టీ రిజర్వుడు స్థానాల విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం వారి జనాభా ఆధారంగా మొత్తం స్థానాలను నిర్ధారించి, ఆ మేరకు ఎస్టీల జనాభా ఎక్కువ ఉండే నియోజకవర్గాలను రిజర్వు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో మహిళా కోటాఈసారి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా అమలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో 60 అసెంబ్లీ స్థానాలు రొటేషన్ పద్ధతిలో రిజర్వు అవుతాయని, పదిహేనేళ్లలో ఈ రొటేషన్ పూర్తయి రాష్ట్రంలోని అన్ని స్థానాలకూ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిసారి ప్రతి జిల్లాలో ఒకటి నుంచి మూడు స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా లోక్సభ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతమున్న 17కు తోడు అదనంగా పెరిగే 9 స్థానాలు మహిళలకే రిజర్వు కానున్నాయి. పదవుల సంఖ్యలోనూ మార్పులుప్రస్తుతం జరుగుతున్న చర్చకు అనుగుణంగా శాసన, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే, ఆ మేరకు పలు పదవుల సంఖ్య కూడా మారనుంది. ముఖ్యంగా శాసనమండలిలోనూ సగం స్థానాలు పెరుగుతాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులుండగా, పునర్విభజన అనంతరం అది 60కి చేరనుంది. దీంతో పాటు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులు కూడా పెరగనున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 11కు చేరనుంది. ఇక రాష్ట్ర మంత్రివర్గం సైజు కూడా పునర్విభజన అనంతరం పెరగనుంది. మొత్తం ఎమ్మెల్యేల్లో 15 శాతం మంది మంత్రులుగా పనిచేసే అవకాశం ఉండడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల గరిష్ట సంఖ్య 18గా ఉంది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 17 మంది మంత్రులుగా పనిచేయవచ్చు. అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మంత్రివర్గం సంఖ్య 27కు చేరనుంది. అయితే పునర్విభజన బిల్లుకు, ఇతర అంశాలకు సంబంధం లేని మండలి నుంచి మంత్రివర్గం వరకు ప్రత్యేక బిల్లుల ద్వారా సవరణలు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయంగా ఎవరికి లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయాలకతీతంగా, డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా, జనాభా లెక్కలు, భౌగోళిక సరిహద్దుల ఆధారంగా జరిగే ఈ ప్రక్రియ ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది ఇప్పటికిప్పుడే చెప్పే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పునర్విభజన సమయంలో నియోజకవర్గాల కూర్పు, ఆయా నియోజకవర్గాలకు కేటాయించే రిజర్వేషన్లు, నగర ప్రాంతాల్లో పెరిగే స్థానాలు, గ్రామీణ ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపంలో జరిగే మార్పులను బట్టి ఈ లబ్ధిని అంచనా వేయగలుగుతామని చెబుతున్నారు. అయితే సెంట్రల్ తెలంగాణలో సీట్లు భారీగా పెరిగిన పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్లకు కొంత మేలు జరగవచ్చని, గ్రామీణ తెలంగాణలో సీట్లు ఎక్కువగా పెరిగితే కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కూతురును కడతేర్చి... తానూ ఆత్మహత్యాయత్నం
సంస్థాన్ నారాయణపురం: భార్యాభర్తల మధ్య కలహాలతో కుమార్తెకు ఎలుకల మందు పెట్టి కడతేర్చాడు ఓ తండ్రి. అనంతరం తానూ నీళ్లలో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రవికి నాలుగేళ్ల క్రితం మాడుగులపల్లికి చెందిన స్వాతితో వివాహం జరిగింది. వీరికి మేఘన(2)తో పాటు 9 నెలల వయసున్న మయూరి అనే కుమార్తె ఉన్నారు. గత ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మూడు నెలల క్రితం స్వాతి తన చిన్న కుమార్తె మయూరిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. మేఘన తండ్రి దగ్గరే ఉంటుంది. అయితే పెద్ద కుమార్తె మేఘనను కూడా తన దగ్గరికి పంపించాలని స్వాతి మాడుగులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై భార్యాభర్తలు పెద్దమనుషుల సమక్షంలో సోమవారం మాట్లాడుకోవాల్సి ఉంది. కాగా.. తన చిన్న కుమార్తెను తీసుకుని భార్య తల్లిగారింటికి వెళ్లిందనే కోపంతో రవి తన పెద్ద కుమార్తె మేఘనకు మంగళవారం సపోట పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. మేఘన ఆ సపోట పండు తిని వాంతులు చేసుకుంది. అనంతరం రవి కూడా ఎలుకల మందు నీళ్లలో కలుపుకొని తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి మేఘనను హైదరాబాద్కు, రవిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మేఘన మృతిచెందింది. రవి పరిస్థితి విషమంగా ఉంది. రవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
50 శాతం సీట్ల పెంపు ముమ్మాటికీ కుట్రే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతి పెద్ద కుట్రగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే సీట్లను పెంచాలనే అభిప్రాయం స్వార్థ రాజకీయ ఎత్తుగడలో భాగమే అని విమర్శించారు. ‘ఎంపీ స్థానాల్లో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఎంతుందో అదేస్థాయిలో సీట్ల పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోంది. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ విషయమై అన్ని పక్షాలతో చర్చ జరిపి సీట్ల పెంపుపై ముందుకెళ్లాలి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... దక్షిణాది నుంచి చోటు ఉండదు... తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి 40, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలున్నాయి. 40–80లో 40 తేడా ఉంది. ఉత్తర్ప్రదేశ్లో 80 స్థానాలు 120కి పెరుగుతాయి. ప్రతి చోటా 50 శాతం ఇస్తున్నారని అనుకుంటున్నారు. కానీ.. ఏ లెక్కతో ఇస్తున్నారు. మన దగ్గర వ్యత్యాసం పెంచుతున్నారు. యూపీ, తమిళనాడు మధ్య తేడా 40 ఉంది. ముందు ముందు ఇది 60కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ ఇలా నాలుగైదు రాష్ట్రాల సీట్లు పెరిగిన తర్వాత అక్కడి నుంచే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ, ఏపీ కలుపుకొని దక్షిణాది రాష్ట్రాల సీట్లు మొత్తం 130 అవుతాయి. 50 శాతం సీట్లు పెరిగితే అవి 195 అవుతాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50 శాతం పెరిగితే దక్షిణాది సీటు ఒక్కటి కూడా అవసరం లేదు. మొత్తం స్థానాలను 815కు పెంచితే అందులో నుంచి 195 తీసివేస్తే.. మమ్మల్ని అడిగేవారే ఉండరు. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీట్లు అవసరం. భవిష్యత్తులో ఆ అవసరమే ఉండదు. మోదీ త్రీడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రధాని మోదీ త్రీడీ పాలసీకి వ్యతిరేకంగా దక్షిణ భారతాన్ని ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్, డివల్యూషన్, డి్రస్కిమినేషన్ ఈ త్రీడీ విధానంలో ప్రభుత్వాన్ని మోదీ నడపాలనుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడాలనుకుంటున్నాం. గతంలో దక్షిణాదికి రాజకీయాల్లో ప్రాముఖ్యత ఉండేది. దక్షిణాదికి చెందిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటకల నుంచి ఒక్క నిర్మలా సీతారామన్ మినహా మంత్రివర్గంలో చోటు లేదు. ప్రధాని, రక్షణ, హోంశాఖ, పరిశ్రమలు, కామర్స్ వంటి టాప్ టెన్ పోర్ట్ఫోలియోల్లో మనకు ఏమీ దక్కలేదు. రాజకీయ ప్రాధాన్యంలో దక్షిణాదికి చాలా నష్టం జరుగుతోంది. వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి అయ్యేందుకు అవకాశం ఉన్నవేళ ఆయనను ఇల్లు ఖాళీ చేయించి హైదరాబాద్కు పంపించేశారు. దక్షిణాదికి ఢిల్లీలో గుర్తింపేలేదు. మోదీ వచ్చిన తర్వాత రాజకీయ వివక్ష ఎక్కువైంది. కేసీఆర్ది కుటుంబ సమస్య కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వ్యక్తిగత వైరం లేదు, ఆయన ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు. కేసీఆర్ సమస్య ఆయన కొడుకు, కూతురు, అల్లుడే. గృహ నిర్బంధం చేసి ఏదో రకంగా సీఎం కావాలని చూస్తున్నది అల్లుడు, మీరిద్దరు కాదు నేను సీఎం అవుతా అని కవిత చూస్తున్నది. వారసత్వ రాజకీయాలు నమ్ముకున్న కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకు కాలేదు అల్లుడు అయ్యాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అవుతా అని హరీశ్రావు అనుకుంటున్నారు. ఇన్ని సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నాయి. కేసీఆర్ను ఫామ్హౌస్లో వాళ్లే నిర్బంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోవడం ఖాయం. వాళ్లది ఫెవికాల్ బంధం. వాళ్లిద్దరినీ వేర్వేరుగా చూడాలనుకోవడంలేదు. రెండింటినీ మడతేసి కొట్టాలన్నదే నా లెక్క. నాకు ఇప్పటికైతే జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. ఇంకా 8 ఏళ్లు 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. -
వన్ ఇండియా సర్వీస్
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ పౌరసేవల్లో మధ్యవర్తిత్వానికి ఇక తావు లేదు. వివిధ రకాల సర్వీసుల కోసం ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు మొదలు బదిలీ వరకు ఎక్కడా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోయే ‘వాహన్ పోర్టల్’రెండు రోజుల క్రితం అమల్లోకి వచ్చింది. వాహనాల కొనుగోలు సమయంలో ఆటోమొబైల్ డీలర్లు చేసే మాయాజాలానికి, ఫైనాన్స్ సంస్థల దోపిడీకి ‘వాహన్’అడ్డుకట్ట వేయనుంది. నకిలీబీమా సంస్థల అక్రమాలకు సైతం కళ్లెం పడనుంది. 2014లోనే కేంద్రం దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ను ప్రవేశపెట్టింది. 2016 నాటికి ఒక్క తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో వాహన్ పోర్టల్తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ సేవలపైన ‘సారథి పోర్టల్’అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సారథి పోర్టల్ సేవలు కొనసాగుతుండగా, రెండు రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ‘వాహన్ పోర్టల్’ ను ప్రారంభించారు.ఈ రెండు రోజుల్లో ‘వాహన్’కు 1702 దరఖాస్తులు అందాయి. 318 టీఆర్లను (తాత్కాలిక రిజిస్ట్రేషన్) జారీ చేసి నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొత్తగా నమోదయ్యే వ్యక్తిగత వాహనాలకే ఈ పోర్టల్ సేవలు లభిస్తున్నాయి. త్వరలో రవాణా వాహనాలకు సైతం పోర్టల్ను విస్తరించనున్నారు. ఈజీగా అంతర్రాష్ట్ర బదిలీలు సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనం బదిలీ కావాలంటే సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) అందజేయాలి. ఆ పత్రాన్ని బదిలీ కానున్న రాష్ట్రంలోని అధికారి ధృవీకరించుకొనేందుకు చాలా రోజుల సమయం పట్టేది. దీంతో బదిలీల్లో తీవ్రమైన జాప్యం చోటుచేసుకునేది. పైగా అధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు ఏజెంట్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనం వివరాలు వాహన్లో ఉంటాయి. మిగతా రాష్ట్రాల వాహనాల వివరాలు ఇప్పటికే ఈ పోర్టల్లో ఉన్నాయి. కాబట్టి రవాణా అధికారులు ఈ పోర్టల్లో లభించే డేటా ఆధారంగా క్షణాల్లో ఎన్ఓసీ అందజేసే సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని తీసుకోవచ్చు. డీలర్లు మాయ చేయలేరు రవాణాశాఖకు చెల్లించే జీవితకాల పన్నును తగ్గించేందుకు, వాహన ధరలను పెంచేందుకు, లేదా తగ్గించేందుకు ఆటోమొబైల్ డీలర్లు ఇక ఏ మాత్రం మాయ చేయలేరు. వాహనం తయారీ సంస్థ నిర్ణయించిన ధర మేరకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ డీలర్ల సర్వర్ పోర్టల్ ‘హోమో లోగేషన్’ను వాహన్తో అనుసంధానం చేశారు. దీనివల్ల తయారీ సంస్థ నిర్ణయించిన ధర, వాహన ఇంజిన్ నంబర్, ఛాసీస్ నంబర్ తదితర వివరాల నమోదులో డీలర్లు ఎలాంటి తప్పులు చేసేందుకు అవకాశం ఉండదు. అదనపు చార్జీలను కూడా వాహనదారుడి నుంచి వసూలు చేసేందుకు వీల్లేదు. ఇన్వాయిస్లో ఉన్న ధర మాత్రమే వాహనదారుడు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు ప్రస్తుతం షోరూమ్లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండటం వల్ల వాహనదారుడు ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు. ఫైనాన్స్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా వాహన్తో అనుసంధానమై ఉంటాయి. వాహనాలకు రుణాలు ఇవ్వాలనుకునే ప్రతి సంస్థ రవాణాశాఖ ఆమోదంతో అనుసంధానం కావాల్సిందే. ఇందుకోసం సదరు సంస్థల జీఎస్టీ గుర్తింపు, పాన్, ప్రభుత్వ గుర్తింపు, ఆర్బీఐ నుంచి పొందిన ఆమోద పత్రాలను తప్పనిసరిగా వాహన్లో అప్లోడ్ చేయాలి. దీంతో వాహనదారులకు అందజేసే రుణాలు, ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీ, ఆదాయపన్ను, తదితర అన్ని రకాల చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. ఎలాంటి మోసాలకు అవకాశం ఉండదు. నకిలీ బీమాకు తెర వాహన్ వల్ల నకిలీ బీమా సంస్థల మోసాలకు కూడా తెరపడుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బోర్డ్ (ఐఆర్బీ) అనుమతి పొందిన అన్ని బీమా సంస్థలు వాహన్తో అనుసంధానమై ఉంటాయి. దీంతో నకిలీ సంస్థల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. వంద శాతం పారదర్శకం దేశవ్యాప్తంగా అన్ని రకాల పౌర సేవలను ఏకీకృతం చేసే లక్ష్యంతో కేంద్రం మిషన్ మేడ్ ప్రాజెక్ట్ (ఎంఎంపీ)లో భాగంగా ‘ఒకే భారత్, ఒకే లైసెన్స్, ఒకే వాహనం నంబర్’విధానాన్ని కొనసాగిస్తోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా దేశవ్యాప్తంగా 1,423 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ‘వాహన్ సారథి’పోర్టల్ సేవలను అందజేస్తున్నాం. వంద శాతం పారదర్శకత, జవాబుదారీతనం ఈ మిషన్ లక్ష్యం. – ఎస్.కాశిరెడ్డి, ఎన్ఐసీ, తెలంగాణ కోఆర్డినేటర్ -
తగ్గేదేలే.. తెగదెంపులే!
జగిత్యాల: తన సమస్యకు కాంగ్రెస్లో పరిష్కారం లేదని, అందుకే ఆ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని మాజీమంత్రి జీవన్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా జీవన్రెడ్డి నివాసానికి కాంగ్రెస్ నేతల తాకిడి మొదలైంది. ఎవరు వచ్చినా జీవన్రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ వచ్చి చర్చలు జరిపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తాజాగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్రెడ్డి వచ్చి దాదాపు గంటకుపైగా జీవన్రెడ్డితో చర్చించారు. వారు జీవన్రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం గౌరవం లేని చోట ఉండలేనని బహిరంగంగానే చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడటం బాధగానే ఉన్నా.. విలువ లేని చోట ఉండలేనని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం జీవన్రెడ్డి వంటి నాయకుడిని వదులుకోలేమని చెబుతున్నా, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్రెడ్డి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేకం పోరాటాలు చేశారు. మండలి నేతగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్రెడ్డి ఓడిపోవడం.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్కుమార్ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్తో చేతులు కలపడంతో జీవన్రెడ్డి కినుక వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేకే పెద్దపీట వేయడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే జీవన్రెడ్డి తన రూటు మార్చుకున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్నట్టు బహిరంగంగానే లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ మారొద్దని కోరిన కాంగ్రెస్ పెద్దలు.. మెట్టు దిగని జీవన్రెడ్డి జీవన్రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పెద్దలు తరలివస్తున్నా, ఆయన మెట్టు దిగడం లేదు. పార్టీ మారొద్దని వారు పేర్కొన్నా.. పార్టీలో జరిగిన అన్యాయం చాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ జీవన్రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించినా, కప్పుకోనంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. చివరి ప్రయత్నంగా టీపీసీసీ అధ్యక్షుడితోపాటు, ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. వంశీచంద్రెడ్డి పార్టీ మారొద్దని చెప్పినా, పెద్దగా స్పందించనట్టు తెలిసింది. పార్టీ వీడొద్దని మహేశ్కుమార్గౌడ్ కోరారని, 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని జీవన్రెడ్డి ఆయన చెప్పారు. దీంతో మహేశ్గౌడ్ అసంతృప్తితోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. నేడు సమావేశం: జీవన్రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని, వచ్చిన నేతలకు చెప్పానని, బండారి గార్డెన్లో బుధవారం అందరితో సమావేశమై తన భవిష్యత్ పయనం ఎలా ఉండబోతుందో చెబుతానని జీవన్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతోనే పోరాటం చేయడం తనకు సాధ్యం కాదన్నారు. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జీవన్రెడ్డి 1981లో మల్యాల సమితి ప్రెసిడెంట్గా రాజకీయ ఆరగేట్రం చేశారు. టీడీపీ నుంచి 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చీలిక రావడంతో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే జీవన్, జీవన్ అంటే కాంగ్రెస్లా తనదైన ముద్ర వేసుకున్నారు. జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారమైతే జరుగుతుండగా బీజేపీ నేతలు కూడా జీవన్రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
తప్పుడు చార్జిషీటుతో అక్రమ కేసు
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేటు మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చార్జిషీటు పేరిట మళ్లీ తెరపైకి ఫార్ములా–ఈ తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసిన తొలి సంతకానికి సంబంధించిన ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. గతంలో తాను చెప్పినట్టు ఫార్ములా–ఈ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసు అని చెప్పారు. శాసనసభ లాబీల్లోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో మంగళవారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఫార్ములా–ఈ అంశాన్ని గోరంతను కొండంతగా చూపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడి నుంచి పంపిన నిధులు రూ.45 కోట్లు అయితే రూ.600 కోట్లకు పైగా ఉన్నాయని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ నుంచి పంపిన రూ.45 కోట్లు ఫార్ములా–ఈ బ్యాంకు ఖాతాలో భద్రంగా ఉన్నాయి. ఆ నిధులను ప్రభుత్వం ఎందుకు వెనక్కి రప్పించడం లేదు. ఈ కేసులో అనుచిత లబ్ధి జరిగిందని చెబుతున్న వారి పేరు చార్జిషీటులో లేదు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘అందాల పోటీల వల్ల తెలంగాణకు పైసా ప్రయోజనం లేకపోగా తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం అంతర్జాతీయంగా అప్రతిష్టపాలైంది. ఇంత దారుణం జరిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసు నమోదు కాలేదు. సీఎం సరదా కోసం రూ.100 కోట్లతో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించి సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేసినా కేసు నమోదు కాలేదు. ఫార్ములా–ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడదు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేసినా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ను వదిలిపెట్టేది లేదు’అని కేటీఆర్ చెప్పారు. మూసీపై ప్రణాళిక లేకుండానే.. ‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూపాయి లేకున్నా ఏడీబీ అప్పు ఇస్తుందనే ఉద్దేశంతో డీపీఆర్ లేకుండానే మూసీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతోంది. మూసీ ప్రాజెక్టుపై ఫైవ్ స్టార్ హోటళ్లలో కాకుండా మూసీ బాధితులతో చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మేధా పాట్కర్ వంటి మేధావులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు’అని కేటీఆర్ అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం డీలిమిటేషన్ ‘2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే స్వాగతిస్తాం. జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతమున్న నిష్పత్తిలో పునర్విభజన జరగాలి. పార్లమెంటులో దక్షిణ భారతదేశానికి 24శాతం ప్రాతినిథ్యం ఉంది. అదే నిష్పత్తిలో దక్షిణాదికి నష్టం జరగకుండా కేంద్రం చూడాలి. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. టీడీఆర్ స్కామ్ ‘‘ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరిట రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలు కచ్చితంగా టీడీఆర్లు కొనుగోలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది. మా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్ కుంభకోణంపై విచారణ జరిపిస్తాం. నిర్వాసితుల నుంచి అతి తక్కువ ధరకు టీడీఆర్ కొనుగోలు చేసి వాటిని అడ్డగోలు ధరలకు తిరిగి అమ్ముకుంటున్న రేవంత్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పాత్రను బయటపెడతాం. రేవంత్ పాలనలో టీడీఆర్ అంటే ‘తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్’గా మారిపోయాయి. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ కుటుంబం టీడీఆర్లను ఏటీఎంగా మార్చుకున్న తీరును బయటపెడతాం’అని కేటీఆర్ చెప్పారు. -
ఎల్బీనగర్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ రెండంతస్తుల వంతెన నిర్మాణం కానుంది. దిగువన సాధారణ రోడ్డు... ఆపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. అందులో తొలి అంతస్తులో ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితం కానుండగా రెండో అంతస్తులో మెట్రో కారిడార్ నిర్మాణం కానుంది. ఎల్బీనగర్లోని పనామా గోడౌన్ నుంచి హయత్నగర్ వరకు దాదాపు 5.5 కి.మీ. నిడివితో ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ రూపొందనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వచ్చే నెలలో ఆ శాఖ వార్షిక ప్రణాళిక ఖరారు కోసం జరగనున్న సమావేశంలో దీనికి తుది అనుమతి విషయంలో స్పష్టత రానుంది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సొంత నియోజకవర్గమైన నాగ్పూర్లో ఇప్పటికే ఇదే డిజైన్లో 5.62 కి.మీ. మేర ఫ్లైఓవర్ రూపొందింది. ఆ వంతెనను చూసే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రతిపాదించింది. ఇటీవల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ వంతెనకు కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపే అవకాశం ఉందని ఆయన మంగళవారం శాసనసభలో వెల్లడించారు. విజయవాడ జాతీయ రహదారి విస్తరణ అంశంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సందర్భంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టత ఇచ్చారు. పెరిగిన కాలనీలు, ట్రాఫిక్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో.. ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్డును ఆరు వరుసలకు విస్తరిస్తున్నారు. అందులో భాగంగా ఎల్బీనగర్ నుంచి నగర శివారు వరకు 8 వరుసలకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అయితే హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా భారీగా కాలనీలు వెలిశాయి. అలాగే హయత్నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఇటీవలి కాలంలో కాలనీలు వేగంగా పెరిగాయి. దాదాపు 15 లక్షల మంది ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ స్థానిక వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. కాలనీల్లోకి వెళ్లాలంటే రెండున్నర కి.మీ. ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని రావాల్సి వస్తోంది. ఇందుకోసం ఈ పరిధిలో 8 అండర్పాస్లను నిర్మించేందుకు డిజైన్ చేశారు. ఇందులో నాలుగు పూర్తవగా ఒకటి నిర్మాణంలో ఉంది. ఈ అండర్పాస్ డిజైన్ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న సూచన వచ్చింది. ఇదే సమయంలో ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ తర్వాతి వరకు 7.1 కి.మీ. మేర మెట్రో రైలు కారిడార్ ఖరారైంది. ఆరు స్టేషన్లతో ఈ కారిడార్ను నిర్మించనున్నారు. అది కూడా ఇదే మార్గంలో రూపొందుతుంది. దీంతో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు నిర్మిస్తే మెట్రో ప్రాజెక్టుకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో రెండూ ఒకే నిర్మాణంలో ఉండేలా తాజాగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కు రూపకల్పన చేశారు. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు రూ. 200 కోట్లు ఈ ప్రాజెక్టుకు రూ. 940.75 కోట్లు ఖర్చవుతుందని ఎల్ఎన్ మాల్వియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక అంచనాతో నివేదికను సమర్పించింది. దీంతో ఈ వ్యయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి రూ. 200 కోట్లను చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మిగతా మొత్తాన్ని కేంద్రం భరించాలని కోరుతూ ఇటీవల రోడ్లు భవనాల శాఖ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఆ శాఖ వార్షిక ప్రణాళికలో దీన్ని చేరి్పంచేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. అనుమతి రాగానే మరో ఆరు నెలల్లో దీనికి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెండోది... ఎల్బీనగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో ఆ డిజైన్తో నిర్మితమయ్యే రెండో కట్టడం కానుంది. ఇప్పటికే పుణే–హెదరాబాద్ జాతీయ రహదారిపై మదీనాగూడ నుంచి బీహెచ్ఈఎల్ వరకు 1.20 కి.మీ. పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీనికి రాష్ట్ర పభుత్వం రూ. 53.55 కోట్ల వాటా చెల్లించేందుకు కూడా అంగీకారం తెలిపింది. -
ఆశల పల్లకీలో!
(శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి– సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు తొలి అడుగు పడింది. పునర్విభజన జరిగితే లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు రాజకీయంగా కూడా అవకాశాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో 2011 లెక్కలతోనే ప్రక్రియ మొదలుకానుంది. ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కు పెరగనుండగా, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరగనున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు 50 శాతం అంటే.. 60 స్థానాలు పెరిగితే 179 కావాలి.. కానీ ప్రతి లోక్సభ స్థానానికి 7 శాసనసభ స్థానాలు ఉండాలన్న నియమంతో 26 లోక్సభ స్థానాల పరిధిలో 182 శాసనసభ స్థానాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల నుంచే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనలతో వారికి శాసనసభలో 60, లోక్సభలో 9 స్థానాలు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నుంచే పెంపు అమల్లోకి వస్తుంది. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న జిల్లాల పరిధిలోనే కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలో ఉండాలన్న ప్రాథమిక నిబంధన మేరకు జిల్లా యూనిట్గా తీసుకుంటారు. ప్రస్తుతం పలు శాసనసభ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ కొత్తగా చేపట్టే పునర్విభజనలో కొత్త నియోజకవర్గాల హద్దులు ఒకే జిల్లాకు పరిమితమవుతాయి. ఈ మేరకు పలు ప్రస్తుత నియోజకవర్గాల పరిధుల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధుల్లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటయ్యే 63 శాసనసభ స్థానాల్లో అత్యధికం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోనే ఏర్పాటు కానున్నాయి. పునర్విభజన ఇలా..! రాష్ట్రంలోని మొత్తం జనాభాను అన్ని నియోజకవర్గాలకు దాదాపు సమానంగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గానికి సగటుగా నిర్ణయించే జనాభా సంఖ్యలో 10 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండే వెసులుబాటు ఉంటుంది. 2011 లెక్కల మేరకు రాష్ట్ర జనాభా 3,51,90,260 మంది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గ సగటు 1,93,353గా ఉంటుంది. ఈ మొత్తానికి పది శాతం తక్కువ లేదా ఎక్కువ జనాభా సగటుతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పునర్విభజన కోసం ఏర్పాటు చేసే కమిషన్కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. మహిళలకు ఎలా..? మహిళలకు కేటాయించే స్థానాలు లాటరీ ద్వారా కేటాయిస్తారా..లేక అత్యధిక జనాభా ఉన్న మొదటి 60 నియోజకవర్గాలను ఎంచుకుంటారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుంటే పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అత్యధిక స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా కొత్తవి ఎన్ని.. ఆదిలాబాద్లో 5 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో ఐదు స్థానాలు పెరగనున్నాయి. కొత్తగా ఆదిలాబాద్ అర్బన్, ఉట్నూరు, మంచిర్యాల రూరల్ లేదా లక్సెట్టిపేట, నర్సాపూర్ (నిర్మల్) నియోజకవర్గాలతో పాటు మరొకటి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్న నార్నూరు, గాదిగూడ మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడే కొత్త నియోజకవర్గంలోకి వెళతాయి. నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాంతాలతోనే ఖానాపూర్ నియోజకవర్గం హద్దులు మార్చుకుంటుంది. నిజామాబాద్లో 3 నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలకు కొత్తగా మరో మూడు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి. కొత్తగా నిజామాబాద్ సౌత్ లేదా నార్త్, బోధన్ నియోజకవర్గం నుండి కొన్ని ప్రాంతాలను విడదీసి ఎడపల్లి లేదా బోధన్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కొత్తగా కామారెడ్డి రూరల్ æస్థానం ఏర్పాటుకు అవకాశం ఉంది. కరీంనగర్లో 5 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా, కొత్తగా ఐదు స్థానాలు ఏర్పడతాయి. కరీంనగర్ రూరల్, జగిత్యాల రూరల్, మెట్పల్లి, సుల్తాన్బాద్, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల జిల్లా) నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ నుండి సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లోకి సుమారు 10 మండలాలు వెళ్లటంతో తక్కువ నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయి. మెదక్లో 7 ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం 11 స్థానాలుండగా, కొత్తగా 7 స్థానాలు ఏర్పాటవుతాయి. అందులో సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రామచంద్రాపురం, అమీన్పూర్, సదాశివపేట, మెదక్ జిల్లాలో రామాయంపేట నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్లతో పాటు కొత్తగా సిద్దిపేట రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రెండు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్లోని తూప్రాన్, మనోహరాబాద్, దుబ్బాకలోని చేగుంట రామాయంపేటలో చేరతాయి. నల్లగొండలో 6 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 స్థానాలుండగా కొత్తగా 6 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. కొత్తగా మిర్యాలగూడ రూరల్, నల్లగొండ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి భువనగిరిలో రామన్నపేట లేదా చౌటుప్పల్ లేదా మోత్కూరు నియోజకవర్గం, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు 4 స్థానాలుండగా కొత్తగా సూర్యాపేట రూరల్, మునగాల నియోజకవర్గాలతో ఇంకో నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఖమ్మంలో 2 ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా, పునర్విభజన అనంతరం కొత్తగా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలంలోని పలు ప్రాంతాలతో ఖమ్మం రూరల్ నియోజకవర్గం ఏర్పాటు కానుంది. మిగిలిన స్థానాలు యథాతథంగా ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాలుండగా కొత్తగా ఒక స్థానం పెరుగుతుంది. వరంగల్లో 9 ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా కొత్తగా 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లాలో కాజీపేట, హసన్పర్తి, శాయంపేట, మడికొండ, వరంగల్ జిల్లాలో వరంగల్ సెంట్రల్, గీసుకొండ, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ రూరల్, తొర్రూరు,, భూపాలపల్లిలో కాటారం, జనగామలో ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు కొనసాగే అవకాశం ఉంది. మహబూబ్నగర్లో 6 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా 6.. మహబూబ్నగర్ రూరల్, గండీడ్, కోస్గి, అమరచింత, పెబ్బేరు, ఐజ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా విడిపోనుంది. అందులో కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గంలో కోస్గి, మద్దూర్ ఇతర మండలాలు చేరితే,, వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్, బొమ్మరాశిపేట, దుద్యాల, దౌల్తాబాద్ మరో రెండు మండలాలతో కొడంగల్ రూపురేఖలు మారనున్నాయి. హైదరాబాద్ చుట్టూ మొత్తం 51 హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య మొత్తం 51కి పెరగనుంది. హైదరాబాద్లో 5 స్థానాలు పెరిగి మొత్తం 20 నియోజకవర్గాలు ఏర్పాటు కానునున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 31 స్థానాలు అవుతాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్లోని మండలాలతోనే ఏర్పాటవుతుంది. ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు రెండేసిగా ఏర్పడి మొత్తం 13 నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 స్థానాలకు తోడు కొత్తగా కాప్రా, అల్వాల్, బోడుప్పల్, కొంపల్లి, మూసాపేట తదితర స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల్లో ప్రోత్సాహకం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చిందని దీని ద్వారా రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా 100 శాతం మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి లక్షా 15 వేల 551 ఎలక్ట్రిక్ వాహనాలకు 925.94 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్లో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా తో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీ వాహనాలను పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవి పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో బాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ వచ్చేలా ఈవి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనే వాహనాలు కూడా ఈవి వాహనాలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచించారని అందుకు హైర్ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్ ల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే,చైనా లతో పోటీపడుతుందని తెలిపారు.ఈవి వాహనాలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.క్యూర్ ఏరియా లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.. క్యూర్ ఏరియా లో డీజిల్ ఆటో లు కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్క్రాపేజీ పాలసీ లో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్ కి పంపిస్తున్నామన్నారు. తెలంగాణ లో వాహన్ , సారథి పోర్టల్ లోకి చేరిందని వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.సీఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిద్దాలనే లక్ష్యం తో EV వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తుందని 2 వేల కిలోమీటర్ల మేరకు CURE చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందనీ సీఎస్ పేర్కొన్నారు. నగరం లో ఈవిబిబస్సు లను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ లో అమలు చేస్తున్న ఈవి పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తుందన్నారు.EVS -
ఆలాంటి తప్పు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అనుకోను: కేటీఆర్
హైదరాబాద్: నియోజకవర్గాల డిలిమిటేనేషన్ను స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డిలిమిటేషన్ అనేది ఎప్పుడో జరగాలని, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఏపీ విభజన చట్టంలోనే నియోజకవర్గ పునర్విభజన హామీ ఉందన్నారు కేటీఆర్. ఈ మేరకు మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ పార్లమెంట్లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దానిని యథావిధిగా కొనసాగించాలి. కేంద్రం దక్షిణానికి అన్యాయం చేస్తుందని నేను అనుకోను. దక్షిణాది కుటుంబ నియంత్రణను బాగా పాటించింది. కుటుంబ నియంత్రణ పాటించని వారికి నజరానా.. పాటించిన వారికి జురుమానా అంటే కుదురదు. ఆలాంటి తప్పు ప్రభుత్వం చేస్తుందని అనుకోను. డీలిమిటేషన్ జరిగితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుంది. అశ్వారావుపేటలో ఒక లక్షా 30వేల ఓట్లు ఉంటే.. శేరిలింగంపల్లిలో 9లక్షల ఓట్లు ఉన్నాయి. డిలిమిటేషన్తో ఈ వ్యత్యాసం పోతుంది’ అని అన్నారు కేటీఆర్ఇక ఫార్ములా రేస్ కేసు గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల డైవర్షన్ కోసమే ఈ ఫార్ములా కేసు. చార్జ్షీట్. ప్రజల దృష్టిని మరల్చడానికి చార్జ్షీట్ వ్యవహారం. ఫార్ములా ఈ-రేసింగ్ కేసు లొట్టపీస్ కేసు. నేను మొదటి నుంచి చెప్తొన్న.. ఇది లొట్ట పీస్ కేసు. న్యాయస్థానాల్లో ఫార్ములా ఈ -రేసు కేసు నిలబడదు. ఈకేసులో ఎవరికైతే లబ్ధి జరిగిందని చెప్తున్నారో.. వారితో రేవంత్ దావోస్ లో మంతనాలు జరిపారు. కక్ష ఉంటే నామీద తీర్చుకోండి. అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు?, డబ్బులు చెల్లింపుపై నేనే మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడా డబ్బులు దారి మళ్ళలేదు. తప్పు జరగలేదు. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సక్షన్ జరిగింది. అరెస్ట్ల గుంరించి రేవంత్ రెండేళ్ళుగా చెప్తూనే ఉన్నారు. రిమాండ్కు పంపేది కోర్టులు.. రేవంత్ రెడ్డి కాదు’ అని పేర్కొన్నారు. -
‘దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు’
హైదరాబాద్: డిలిమిటేషన్లో మహిళా రిజర్వేషన్ అనేది 33 శాతంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. జనగణన అనంతరం డిలిమిటేషన్ జరుగుతుందన్నారు. జనాభా , ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదని, ఒకవేళ అలా జరిగితే నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల సీట్లు పెరగవన్నారు రాంచందర్రావు. ‘ఇక్కడ 8 వేలు ,10 వేలు జనాభా ఉన్న సీట్లు ఉన్నాయి. జనాభా ఆధారంగా సీట్ల పెంపుదల ఉంటుందని కాంగ్రెస్ చేసే ఆరోపణలో నిజం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా లోక్ సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు. ఉత్తరాదికి పెరిగిన ప్రపోషన్ ఆధారంగా దక్షిణాదిన సీట్లు పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ లు మతం మార్పిడి చేస్తే రిజర్వేషన్ వర్తించదనే కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రలోభాలకు గురి చేసి మతం మార్చుకుంటున్నారు. మత మార్పిడిల వల్ల ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ తో ఎస్సీ ఎస్టీ లకు అందాల్సిన సరైన ఫలాలు అందుతాయి’ అన్నారు. -
మాంసం ప్రియులకు షాక్! ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు
-
ఉద్యోగుల జీతంలో కోత.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు తల్లిదండ్రులకు అందజేసే బిల్లును కేబినెట్ ఆమోదించింది.తెలంగాణ కేబినెట్ నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికే స్ఫూర్తిదాయకమని, వృద్ధ తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని ఎక్స్ వేదికగా కొనియాడారు.‘చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం.‘దురదృష్టవశాత్తు ఆప్యాయతను పంచాల్సిన చేతులే ఈరోజు కన్నవారిని రోడ్డు పాలు చేస్తున్న సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ సామాజిక వేదనను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తల్లిదండ్రుల మద్దతు బిల్లును కేబినెట్లో ఆమోదించడం ఒక విప్లవాత్మక మార్పు.వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు చెందేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. ఇది బాధ్యతను విస్మరిస్తున్న బిడ్డలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే ఒక హెచ్చరిక. అమ్మనాన్నల ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక భరోసా.ఈ బిల్లు మన దేశానికి స్పూర్తిదాయకం. యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచి. కన్నవారే ప్రత్యక్ష దైవాలనే సత్యాన్ని విస్మరిస్తున్న నేటి తరానికి ఈ నిర్ణయం ఒక గొప్ప పాఠం. వృద్ధాప్యంలో వారు కోరుకునేది విలాసాలు కాదు, కేవలం తమ బిడ్డల ప్రేమని, తోడుని మాత్రమే. ఆ తోడుని చట్టబద్ధం చేస్తూ, వారి కళ్లలో ఆనందాన్ని నింపేలా ఈ సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులను గౌరవిద్దాం.. వారి ఆశీస్సులే శ్రీరామరక్ష!’ అని పేర్కొన్నారు. చిన్నారులుగా ఉన్నప్పుడు అడుగు తడబడితే చేయి అందించి, తమ కడుపు కట్టుకుని ఆకలి తీర్చి, పిల్లల ఎదుగుదలే శ్వాసగా బతికే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. మానవీయ విలువలు మృగ్యమవుతున్న నేటి కాలంలో కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం… pic.twitter.com/jV2LQNRSnx— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 24, 2026 -
నిజామాబాద్: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారిపై ఘటన జరిగింది. బస్సు, లారీ డ్రైవర్లతో పాటు పలువురికి గాయాలయ్యాయి. సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.వారిలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని బోధన్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ సీరియస్గా ఉండడంతో నిజామాబాద్ జీజీహెచ్కు తరలించారు. ఘటన స్థలంలో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
భర్తను చంపి చెరువులో పడేసిన భార్య..!
గుంటూరు: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్ పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వా«దీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మహేష్ కుమార్తో జీవన్ రెడ్డి కీలక భేటీ.. సంచలన ప్రకటన
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జీవన్ రెడ్డి ఎపిసోడ్పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాలు జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. జీవన్ రెడ్డి అనుచరులు ఆయన ఇంటిపై ఉన్న “ఇందిరా భవన్” ఫ్లెక్సీని తొలగించడం గమనార్హం.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చీఫ్ సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ వచ్చారు. ఈ క్రమంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అనంతరం, మహేష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్..‘పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. జీవన్ రెడ్డికి, ఆయన అనుచరులకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది.ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కొన్ని పనులు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులయ్యారు. అదే జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు ఉంది. జీవన్ రెడ్డితో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ మారవద్దని చెప్పి వచ్చాం. మొన్ననే నేను శ్రీధర్ బాబుతో కలిసి రావాల్సింది. మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడించాం. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నాం. ఆయనకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్లో ఆయన అనుభవానికి తగిన న్యాయం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. తన నివాసం నుంచి మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిపోయిన వెంటనే జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఇదే నా చివరి రోజు అని సంచలన ప్రకటన చేశారు. రేపు సమావేశం యథావిధిగా ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి పైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు తొలగించారు. అయితే, ఇందిరా గాంధీ మీద అభిమానంతో తన ఇంటికి ఇందిరా భవన్ అని పేరు పెట్టుకుని ఇంతకాలం పార్టీ కార్యకలాపాలు కొనసాగించిన జీవన్ రెడ్డి. ఇవాళ ఆ పేరుతో ఉన్న ఫ్లెక్సీ కూడా తొలగించారు. దీంతో పార్టీకి పూర్తిస్థాయిలో గుడ్బై చెబుతున్నట్టు అనుచరులు సంకేతాలు ఇచ్చారు. -
పూడ్చిన శవం కేసులో భారీ ట్విస్ట్.. హత్యగా తేలిన ఘటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఈనెల 11న మృతిచెందిన తాపీమేస్త్రీ ఎస్కే జాఫర్ కేసు మిస్టరీ వీడింది. భార్య ఖతిజా, ఆమె ప్రియుడు షేక్ మీరాసాహెబ్ కలిసి హతమార్చిన ట్లు పోలీసులు నిర్ధారించా రు. ఈ మేరకు సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ శివరామ కృష్ణ వివరాలు వెల్లడించారు. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతీజాకు తిప్పనపల్లికి చెందిన జాఫర్తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల పాటు కాపురం సజా వుగా సాగింది. ఆ తర్వాత జీవనోపాధి నిమిత్తం చింతలపూడి వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరాసాహెబ్తో ఖతిజాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అనుమానం వచ్చిన జాఫర్ భార్యాపిల్లలతో తిరిగి తిప్పనపల్లికి వచ్చినా.. వారి మధ్య ఫోన్ సంభాషణ, వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఖతిజా మీరాసాహెబ్తో కలిసి భర్తను హతమార్చగా, సహజ మరణంగా భావించిన కుటుంబసభ్యులు ఈనెల 12న మృతదేహాన్ని ఖననంచేశారు. ఆరోజు రాత్రి మృతుడి కూతరు కుటుంబీకులకు అసలు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు శవ పరీక్ష చేశారు. కేసు విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. -
గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ నేతలు.. గన్పార్క్ దగ్గర భారీ నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతోందని.. క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని మండిపడ్డారు.‘‘కేంద్రం అధీనంలో పెట్రోలియం శాఖ ఉందని.. తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఫ్యూచర్లో గ్యాస్ సిలిండర్ సైజ్ తగ్గిస్తారన్న అనుమానాలున్నాయి. 14 కిలోల గ్యాస్ సిలిండర్ను 10 కిలోలకు తగ్గిస్తారంట. సామాన్య ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఆంబోతు కొట్లాటలో లేగలు బలైనట్లు సామాన్యుల పరిస్థితి. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత చర్చనీయాంశంగా మారింది. కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం ప్రజలను మభ్యపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. గ్యాస్ కొరత పై ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రకటన చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
చరిత్రలో తొలిసారి చికెన్ ధర రికార్డు స్థాయికి..!
కరీంనగర్ అర్బన్: చికెన్ ధర ఎన్నడూ లేనివిధంగా ఎగబాకింది. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా రికార్డుస్థాయికి చేరగా వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ధర ఎక్కువగా ఉండటం సహజం. అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా కోళ్లను కాపాడుకోవడమే సవాల్. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేక ధర పెరుగుతోంది. కాగా, సాధారణ పరిస్థితుల్లో అసాధారణ ధర ఉండడం ఆందోళనకర పరిణామం. మరో పక్షం రోజులు గడిస్తే రూ.450 చేరడం లాంఛనమే. ప్రస్తుతం కిలో కోడి ధర రూ.185 కాగా, కిలో స్కిన్లెస్ చికెన్ రూ.350 ఉండగా రిటైల్ వద్ద మరింత ఎక్కువే. తినేవారికి తప్ప అందరికీ లాభాలేబాయిలర్ కోళ్ల పరిశ్రమ నాలుగునెలలుగా లాభాల బాట పడుతోంది. పౌల్ట్రీ రంగంలోకి కార్పొరేట్ శక్తులు రావడమే కాకుండా హెచ్చు కోళ్ల ఫారాలు వాళ్ల చేతికే చేరాయి. ఫారం యజమానులు ధరల హెచ్చుతగ్గుదలతో కంపెనీకే అప్పగిస్తున్నారు. యజమానులు నిర్వహిస్తున్నవి చాలా తక్కువే. కాగా ధరల నిర్ణయం సదరు కంపెనీలే నిర్ణయిస్తుండగా ప్రభుత్వ నియంత్రణ ఏ మాత్రం ఉండదు. కోళ్ల ఫారం నిర్వహణలో యువత అమితాసక్తి చూపుతుండగా లాభాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోడి పిల్లలు ఉత్పత్తి చేసేవారు, దాణా విక్రేతలు, ఫారాల నుంచి కోళ్లు వేసే ట్రేడర్లు, చికెన్ సెంటర్లకు లాభాలే తప్ప నష్టం చాలా తక్కువ. ఫారం యజమానులకే లక్కీ లాటరీల ఉండేది. కానీ.. మూడునెలలుగా అందరికీ లాభాలే. 6 నెలల క్రితం వరకు 2 వేల కోళ్లను యజమాని పెంచితే రూ.20–30వేల లాభం రాగా తాజాగా రూ.లక్షల నుంచి రూ.1.50 లక్షల లాభం వస్తోందని తెలుస్తోంది. కార్పొరేట్ శక్తుల రాకతో..పౌల్ట్రీ పరిశ్రమలో కార్పొరేట్ శక్తుల రాకతో పౌల్ట్రీ రైతులు వెట్టిచాకిరికే పరిమితమవుతున్నారు. లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టలేని స్థితిలో రైతులు కార్పొరేట్ శక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కార్పొరేట్ శక్తులు కోడి పిల్లల నుంచి దాణా వరకు అంతా వారే సరఫరా చేస్తారు. అయితే రైతులు షెడ్తో పాటు విద్యుత్, కోళ్లను చూసుకోవాలి. 45 రోజుల పాటు కష్టపడాల్సి వస్తోందని, అయితే మార్కెట్లో ధర వచ్చాక కూడా తక్కువ ధరే ఇస్తున్నారని, గిట్టుబాటుకావడం లేదని రైతులు వాపోతున్నారు. పౌల్ట్రీ రైతులకు ఏదీ చేయూతపౌల్ట్రీ రైతులకు ప్రభుత్వ ప్రొత్సాహం కరువైంది. పౌల్ట్రీని ఏర్పాటు చేసుకునే రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇస్తామని చెబుతున్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. పావలా వడ్డే కదా..ని చాలా మంది యువ రైతులు కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, తదితర ప్రాంతాల్లో పోటీపడి బాయిలర్ కోళ్ల షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకు రుణం ఇచ్చే సమయంలో పావలా వడ్డీ అని చెప్పి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి తమకు ఏమి రాలేదని, రూ.1.10 చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 20లక్షల బాయిలర్, 5లక్షల లేయర్ కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు అంచనా.ధరలపై నియంత్రణ ఉంటేనే ప్రయోజనంఇష్టారీతిగా చికెన్ ధరలు పెరుగుతుండగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికే గ్యాస్ కొరత, పప్పులు, నూనె ధర పెరగడంతో అదనపు భారం పడుతోంది. తాజాగా చికెన్ ధరలు పెరగడం మరింత భారమే. ప్రభుత్వ నియంత్రణలో వినియోగదారులు, కోళ్ల ఫారం నిర్వాహకులకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తేనే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
హైడ్రా కమిషనర్ చర్యలు ధిక్కరణే..
సాక్షి, హైదరాబాద్: బాగ్ అంబర్పేట్లోని బతుకమ్మ కుంట వివాదాస్పద భూమిలో స్టేటస్కో ఆదేశాల తర్వాత చేపట్టిన నిర్మాణాలు, బోర్డులను తొలగించాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. సివిల్ అప్పీలులో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించి..హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు పేర్కొంది. తొలగింపునకు నేటి నుంచి నాలుగు వారాల వ్యవధి ఇస్తున్నామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ఆలోగా నిర్మాణాలను తొలగించినట్లు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. బాగ్ అంబర్పేటలో సర్వే నంబర్ 563/1 పరిధిలోని 7 గుంటల భూ వివాదంలో ఏ.సుధాకర్ రెడ్డి హక్కులకు భంగం కలిగించమనే హామీకి లోబడి, వరదలను నివారణకు పరిమిత పనులను చేపట్టేందుకు న్యాయస్థానం 2025, జూన్ 12న అనుమతి ఇచి్చంది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్రెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్రావు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. -
కాంగ్రెస్కు జీవన్రెడ్డి రాజీనామా వేళ బిగ్ ట్విస్ట్!
సాక్షి,జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, అవమానాలు భరించలేక మార్చి 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో ఆయనను పార్టీ వీడకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరోసారి రంగంలోకి దిగింది. మరికాసేపట్లో జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఆయనను కాంగ్రెస్లో కొనసాగాలని కోరనున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జీవన్ రెడ్డి రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.జీవన్ రెడ్డి పార్టీ వీడకుండా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి చేసిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా, రాజీనామా ప్రకటించే కొన్ని గంటల ముందు పీసీసీ చీఫ్ రాకతో జీవన్ రెడ్డి నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు..గత ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అవమానం భరించలేక కాంగ్రెస్ను వీడనున్నట్లు జీవన్రెడ్డి తెలిపారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. జీవన్రెడ్డి ప్రకటన అనంతరం, ఆయన ఇంటి వద్ద ఓ పోస్టర్ వెలసింది. అందులో ఒకవైపు జీవన్రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్స్టార్ జీవన్రెడ్డి’ అని ఉండటం హాట్టాపిక్గా మారింది. జీవన్రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? విఫలమవుతాయా? అనేది తెలియాల్సి ఉంది. -
‘మంగ్లీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు’
హైదరాబాద్: గాయని మంగ్లీపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని న్యాయవాది నాగేశ్వరరావు పూజారి తెలిపారు. సోమవారం ప్రెస్క్లబ్ హైదరాబాద్లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని చానల్స్లో స్కూల్స్, ఆస్పత్రులు, పబ్లు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని, అత్యధిక వడ్డీ ఇస్తామని కొంతమంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని అందులో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు, సోదరులు ప్రధానంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు, డబ్బులు కట్టలు, కట్టలుగా చూపిస్తూ ఇది మంగ్లీ ఇంట్లోనే అని చెపుతున్నారని సుమారు రూ. 150 కోట్లు వసూలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. మంగ్లీకి పాటలు పాడడం, ఈవెంట్స్కు వెళ్లడం తప్ప వేరే ఎలాంటి వ్యాపారం లేదన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఔటర్పై రోడ్డు ప్రమాదం.. మాగంటి కుమార్తెలకు గాయాలు
హైదరాబాద్: ఔటర్రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగిన డీసీఎంను వెనకనుంచి ఢీ కొట్టిన కారు ప్రమాదంలో జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలు అక్షర, దిశిరలకు గాయాలయ్యాయి. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన మేరకు.. తమ మిత్రుడిని ఎయిర్పోర్ట్లో వదిలి రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్ నుంచి గచి్చ»ౌలి వైపు వస్తున్న ఫార్చునర్ కారు పోలీస్ అకాడమి వద్దకు రాగానే ముందు వెళుతున్న డీసీఎం ఒక్కసారిగా వేగం తగ్గింది. దాంతో వేగంగా వస్తున్న పార్చునర్ కారు దాన్ని వెనకనుంచి ఢీ కొట్టింది. మిత్రుడు అరికెపూడి దుర్గ సాయి కారును నడుపుతుండగా, మాగంటి అక్షర నాగ ముందు కూర్చోగా వెనక సీట్లో మాగంటి దిశిర, మేడిపల్లి అభిరాంరెడ్డిలు కూర్చున్నారు. వీరంతా స్నేహితులే. ముందు కూర్చున్న అక్షరకు తీవ్ర గాయాలు కావటంతో ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్షరకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని, మిగతా ఇద్దరు మిత్రులు రాత్రే ఇంటికి వెళ్లిపోగా సోమవారం దిశిరను డిశ్చార్జి చేశారు. -
గ్యాస్..ఉన్నా ఇవ్వరేంటి బాస్?
హైదరాబాద్: మహా నగరంలో గ్యాస్ కటకట రోజురోజుకు తీవ్రమవుతోంది. ఒక వైపు వంటగ్యాస్ లేక గృహ వినియోగదారులు ఆందోళనకు గురవుతుండగా...కమర్షియల్ ఎల్పీజీ, సీఎన్జీ సైతం అందుబాటులో లేక అటు ఆటోడ్రైవర్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దినసరి ఆదాయంపై ఆధారపడే ఆటోడ్రైవర్లు గ్యాస్ కోసం బంకుల చుట్టూ తిరుగుతూ..పూటల కొద్దీ వేచి చూస్తూ నానా యాతన పడుతున్నారు. లక్డీకాపూల్లోని ఓ బంక్ వద్ద సోమవారం దాదాపు వంద ఆటోలు బారులు తీరగా..చివరకు స్టాక్ లేదంటూ చెప్పడంతో డ్రైవర్లంతా ఆందోళనకు దిగారు. బంకులో గ్యాస్ ఉన్నా ఇవ్వడం లేదని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. -
ప్రాజెక్టులు అప్పగించకుండా ఎలా అదుపు చేయాలి?
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా.. నీటి వినియోగాన్ని అదుపు చేయాలని పరస్పరం తమకు ఫిర్యాదు చేస్తే ఎలా అదుపు చేయగలమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను కృష్ణా బోర్డు ప్రశ్నించింది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 తుది తీర్పు వెలువడే వరకూ ఇరు రాష్ట్రాలు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు ఈ నెల 20న లేఖ రాసింది.ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ.. వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ వాడుకున్నందున, అదనంగా నీటిని వాడుకోకుండా నియంత్రించాలంటూ తెలంగాణ ఈఎన్సీ ఇటీవల కృష్ణా బోర్డుకు లేఖలు రాశారు. తెలంగాణ కూడా కోటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందని.. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి అదనపు నీటిని వాడుకోకుండా నియంత్రించాలని ఏపీ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.దీనిపై కృష్ణా బోర్డు స్పందిస్తూ కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీలను కేటాయించారని ఇరు రాష్ట్రాలకు గుర్తు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇప్పటికీ పంపిణీ చేయలేదని తెలిపింది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్రం కేడబ్ల్యూడీటీ–2కు అప్పగించిందని గుర్తు చేసింది. నీటి పంపిణీపై కృష్ణా బోర్డు విచారణ చేస్తోందని పేర్కొంది. తాత్కాలికంగా శ్రీశైలంను ఏపీ, సాగర్ను తెలంగాణ నిర్వహించాలి కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకూ కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలు వాడుకోవడానికి 2015 జూన్ 18, 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని కృష్ణా బోర్డు వివరించింది. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం 2021 జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, దానిపై తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో అది అమల్లోకి రాలేదని పేర్కొంది.గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్రం పేర్కొందని వెల్లడించింది. ప్రాజెక్టులు తమకు అప్పగించని నేపథ్యంలో.. నీటి వినియోగాన్ని అదుపు చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు అమల్లోకి వచి్చ.. నీటి వాటాలు తేలే వరకూ రెండు రాష్ట్రాలు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు సూచించింది. -
మీరు కాంప్రమైజ్ అయితే.. పార్టీ కాంప్రమైజ్ కాదు
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ సర్కార్పై గట్టిగా పోరాడండి.. ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలు, గ్యారంటీలపై అధికార పార్టీని, నేతలను నిలదీయండి’అని బీజేపీ ముఖ్య నేతలు, నాయకులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. తెలంగాణ బీజేపీలో కొందరు ముఖ్యనేతలు అధికార కాంగ్రెస్ పార్టీతో ‘కాంప్రమైజ్ పాలిటిక్స్’నెరుపుతున్నారనే ఆరో పణల మధ్య.. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్ ద్వారా నాయకులకు గట్టి వార్నింగ్ పంపించినట్టుగా పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కేడర్ కష్టపడు తుంటే.. కొందరు ముఖ్యనేతలు, నాయకులు మాత్రం ఇతర పార్టీలతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి రావాలన్న లక్ష్యసాధనకు పార్టీలో అన్ని స్థాయిల నాయకులపై అధిష్టానం కన్ను ఉందని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని హైకమాండ్ సంకేతాలిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై కొందరు నేతలు మెతక ధోరణిని అవలంబిస్తూ అంత తీవ్రస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శల మధ్య తాజాగా అభయ్పాటిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇటీ వల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో పలు నియో జకవర్గాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలతో చేతు లు కలిపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామా లపై సీరియస్గా ఉన్న బీజేపీ హైకమాండ్ పార్టీ లైన్ దాటి ఎవరైనా ప్రైవేట్ డీల్స్ కుదుర్చుకుంటే సహించేది లేదని పాటిల్ హెచ్చరికలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని 9 జిల్లాల (పార్టీ యూని ట్లు) జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకు ల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘మీరు కాంప్రమైజ్ అయితే.. పార్టీ కాంప్రమైజ్ కాదు’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలదళంలో కలకలం రేపుతున్నాయి.తమతమ నియోజకవర్గాల్లో పట్టు కోసం లేదా కాంట్రాక్టులు, ఇతర వ్యక్తిగత ప్రయోజ నాల కోసం కొందరు నేతలు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరిస్తున్నారని అభయ్పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించాక...త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సత్తాచాటడం అనేది కొందరు నేతల తీరు వల్ల బీజేపీకి అగ్నిపరీక్షగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఏర్పడిన లోపాలు, కొందరు నేతల కుమ్మక్కు రాజకీయాలు, ఇతర సమస్యలను సరిదిద్దడమే లక్ష్యంగా అభయ్పాటిల్ రంగంలోకి దిగినట్టుగా పార్టీవర్గాలు చెబుతున్నారు. హైకమాండ్ వార్నింగ్తోనైనా కొందరు నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాల్సి ఉందని పార్టీ అంతర్గత చర్చల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఫార్ములా ఈ–రేస్ కేసులో చార్జిషీట్?
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు చార్జిషిట్ దాఖలు చేసినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అభియోగాలు మోపుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ చార్జిషిట్ దాఖలు చేసినట్లు సమాచారం. అలాగే ఏ2గా సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి. లక్ష్మీనర్సింహారెడ్డి (బీఎల్ఎన్ రెడ్డి), ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థలను చేర్చింది.హెచ్ఎండీఏ బోర్డుకు చెందిన రూ. 55 కోట్లను విదేశీ సంస్థలకు నిందితులు మళ్లించినట్లు ఏసీబీ పేర్కొంది. దాదాపు వెయ్యికిపైగా పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషిట్ను కోర్టు పరిశీలిస్తోంది. పత్రాల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. ఆ తరువాత కేటీఆర్ సహా నిందితులంతా కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించారని.. ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు గత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఏఎస్ అర్వీద్కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించడం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండీఏకు చెందిన రూ. 54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హెచ్ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా, అప్పటి పురపాలన, పట్టణాభివృద్ధి ప్రత్యేక సీఎస్గా ఉన్న అర్వీద్ కుమార్ను రెండో నిందితుడిగా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది. ఈ ముగ్గురితోపాటు ఫార్ములా–ఈ కార్ రేసింగ్ ఆర్గనైజర్, గ్రీన్కో ఏస్ నెక్సŠట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్కుమార్, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. -
విద్వేషంపై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు, 2026)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా చేసే పోస్టులు, అల్లర్లు.. ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు సైతం ఇదే తరహా బిల్లును శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. దీంతో గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. హేట్ స్పీచ్ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు.. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.వర్సిటీల్లో కుల వివక్ష నియంత్రణకు..విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. గిగ్ వర్కర్స్కు భద్రత గిగ్, ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్ – 2026’ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్తో పాటు సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు బోర్డు ఏర్పాటు ద్వారా వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.మెట్రో స్వాధీనం చర్యలు వేగవంతంహైదరాబాద్ నగరంలో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టంతెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.కులగణనపై కమిటీ నివేదికకు ఆమోదంరాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. కాగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.తల్లిదండ్రులకు భరోసా..వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతి నిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఏది తక్కువైతే ఆ మొత్తం వేత నాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రులకు మద్దతు బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. -
బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’పార్టీ నాయకులు–పోలీసుల మధ్య తోపులాటతో ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కళ్లు కప్పి ఆటోలో అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, ఇతర నేతలు నిరసన తెలిపారు. నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు నకు కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘6 గ్యారంటీలు ఎక్కడ’అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ సమీపానికి చేరుకొని బారికేడ్లు దాటేందుకు యతి్నంచిన కార్యకర్తలను పోలీసులు అడ్డు కున్నారు. వివిధ జిల్లాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకొని ముట్టడించే ప్రయత్నం చేశారు. అనంతరం రాంచందర్రావు తదితరులను అరెస్ట్ చేసి పంజగుట్ట స్టేషన్కు తరలించారు. ఆయన్ను సాయంత్రం విడుదల చేశారు.ఆ తర్వాత కూడా ఐదు, పది మంది చొప్పున కొన్ని బ్యాచ్ల వారీగా ఆటోలు, క్యాబ్లు, ఇతర రూపాల్లో శాసనసభ సమీ పానికి చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.800 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, 50 మంది మహిళలు, యువమోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ ప్రాంతా ల్లోని 9 పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. పలువురు నేతలను వారి ఇళ్ల వద్ద, అసెంబ్లీకి మార్గమధ్యలో హౌస్ అరెస్ట్లు చేసి పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, దాదాపు రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చింది.శాసనసభ ముట్టడికి సంబంధించి పోలీసులకు ముందస్తు సమాచారంతో చుట్టుపక్కల పెద్దసంఖ్యలో మోహరించారు. సోమ వారం ఉదయం 11 గంటల నుంచి పలు దఫాలుగా బ్యాచ్లుబ్యాచ్లుగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డా.ఎన్.గౌతమ్రావు, టి. వీరేందర్గౌడ్, బండ కార్తీకరెడ్డి, శిల్పారెడ్డి, ఎన్వీ సుభాశ్, దీపక్రెడ్డి, గణేశ్, మహేందర్ ఉన్నారు. రాంచందర్రావును పోలీస్స్టేషన్ లో ఎమ్మెల్యేలు పాయల్శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, డా.సి.అంజిరెడ్డి, మల్క కొమరయ్య పరామర్శించారు.మోసపూరిత హామీల సర్కార్ను మరింత నిలదీస్తాం: రాంచందర్రావు ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత నిలదీస్తామన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం: ఏలేటి కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందే తప్ప మడమ తిప్పదని బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించిన రాంచందర్రావు అరెస్టు.. ప్రభుత్వ నిర్బంధ పాలనకు నిదర్శనమని ఒకప్రకటనలో విమర్శించారు. -
స్వచ్ఛత శూన్యం.. స్పష్టత కరువు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ మాత్రం స్వచ్ఛత లేదని, స్పష్టత, విశ్వసనీయత అసలు కన్పించడం లేదని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకాశమంత హామీలిచ్చి బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించిందని అన్నారు. గత బడ్జెట్లు ’గాలి మాటలు’అయితే.. ఈ బడ్జెట్ అవాస్తవాల కోట లాగా కనిపిస్తోందని అన్నారు. ‘రైతన్నను ప్రభుత్వం దగా చేసింది. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు అయ్యింది. కాంగ్రెస్ ’అభయహస్తం’రైతుల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారింది. రైతు రుణమాఫీ ఎక్కడా పూర్తిగా అమలు కాలేదు. రుణమాఫీ అమలు విషయంలో కొడంగల్ కానీ, మధిర కానీ ఎక్కడికి వెళ్ళి పరిశీలించడానికైనా నేను సిద్ధం..’అని సవాల్ చేశారు. బడ్జెట్పై సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కరోనాలోనూ రైతుబంధు ఇచ్చాం.. ‘కరోనా కష్టకాలంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసింది. ఎకరాకు రూ.15 వేలు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఇస్తామన్న మీ హామీ ఏమైంది? రైతులకు బోనస్ ఓ ప్రహసనంగా మారింది. గత యాసంగి బోనస్ రూ. 1,161కోట్లు ఎగ్గొట్టారు. బడ్జెట్లో పంటల బీమా ఊసే ఎత్తలేదు. బోనస్ బోగస్ అయ్యింది. బీమా బూటకమయ్యింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.12 వేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగులకూ దగా.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న సర్కార్ బడ్జెట్లో దాని గురించి కూడా ప్రస్తావించలేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? ఓట్ల కోసం అశోక్నగర్ లైబ్రరీ చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్ పెద్దలే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలంటే, నిరుద్యోగుల వీపులు విమానం మోత మోగిస్తున్నారు. తలలు పగుల గొడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు దక్కింది డిప్రెషన్, సప్రెషన్ మాత్రమే (ఈ సందర్భంగా అధికార పార్టీని విమర్శిస్తూ హరీశ్ కవిత చదివారు)..’అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకూ మొండి చెయ్యే ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినా, ఏ యువకుల ఖాతాల్లోనూ డబ్బులు పడలేదు. పథకాలకు రాజీవ్గాందీ, ఇందిరమ్మ పేర్లు ఎందుకు పెడుతున్నారు? వారి పేర్లు ఎందుకు బద్నాం చేస్తున్నారు? రేవంత్రెడ్డికి వారి మీద ఎలాగూ నమ్మకం లేదు. భట్టి అయినా దీన్ని ఆలోచించాలి. ఈ పథకానికి ‘రేవంత్ ఆత్మీయ మోసం’అనో, ‘భట్టి గారి యువ భ్రమలు’అనో పేరు పెట్టుకుంటే బాగుంటుంది. కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. బడ్జెట్లో ఆ మాటే మాయం చేశారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఇచ్చిన జీవోను బయటపెట్టాలి. లేదంటే మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాగునీటిపై నిర్లక్ష్యం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆ హామీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 18 ప్రాజెక్టుల పూర్తి బడ్జెట్లో కన్పించడం లేదు. హామీ ఇచ్చిన 11,60,895 ఎకరాల ఆయకట్టు సాగు ఓ భ్రమగా మారింది. విలువలు అడుగంటాయి.. ఆశలు ఆవిరయ్యాయి..ప్రభుత్వం ఆడి తప్పింది.. పాలన పూర్తిగా గాడి తప్పింది. ఆరు గ్యారెంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు..’అని హరీశ్రావు విమర్శించారు. -
ప్రజలకు నష్టం చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవ్వరికీ నష్టం చేయం. నిరాశ్రయులను చేయం. పునరావాసం కల్పిస్తాం. మెరుగైన వసతులు ఏర్పాటు చేసి తరలిస్తాం. ప్రాజెక్టును నిర్మిస్తూనే అక్కడ నష్టపోయే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పిస్తాం. బఫర్ జోన్లో ఉండే వారికి ఏ రకంగా సహాయం అందించాలో అందిస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పే వాళ్ల ఉచ్చులో పడొద్దు. రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో అపోహలు సృష్టించకూడదు. అందరం కలిసి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు మహేశ్కుమార్గౌడ్, అద్దంకి దయాకర్ సోమవారం శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. కావాలంటే కేబినెట్ కమిటీ వేస్తాం.. ‘మూసీ ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రండి. ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వండి. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పారు. మూసీ నది వెంట 50 మీటర్ల బఫర్ జోన్ కూడా మీరు నిర్ణయించిందే. మీరు ప్రారంభించి అర్థాంతరంగా వదిలేసిన పనినే మేం ముందుకు తీసుకెళుతున్నాం. ఈ విషయంలో మీరు ఏ సూచన చేసినా పరిగణనలోకి తీసుకుంటాం. ప్రజలకు ఉపయోగపడేవి అయితే 100% అమలు చేస్తాం. నాకు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో కేబినెట్ సబ్ కమిటీ వేస్తాం. ఆ కమిటీకి మీ సూచనలు చెప్పొచ్చు. ప్రాణాంతకంగా మూసీ నీళ్లు నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలను చూస్తే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోరు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరంలో కాలుష్యం, జంతువుల కళేబరాలు, మనుషుల శవాలతో ఆ నీళ్లు వారికి ప్రాణాంతకంగా మారాయి. ఆ ప్రాంతంలో పండిన పంటలు, బోర్లలో నీళ్లు కూడా పిల్లలపైన విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఆ సమస్యల నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. మూసీలో శుభ్రమైన నీరు ప్రవహించేలా గోదావరి జలాలు తెస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు ‘గాందీసరోవర్ నిర్మించేందుకు 98 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రం ఇస్తుంది. టూరిజం శాఖ దగ్గర ఇంకో 100 ఎకరాలు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ల (మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ల అంశాన్ని ఉద్దేశించి) భూమి తీసుకోకపోయినా పరవాలేదు. కానీ ఆ అపార్ట్మెంట్లలో ఉండే మిత్రులు 2005–06లో 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి అనుమతులు తీసుకున్నారు. అయితే 2016లో మూసీ బఫర్ జోన్ 50 మీటర్లు అయ్యింది. ఆ ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్లు బఫర్ జోన్లో ఉంటాయి. భవిష్యత్తులో వాటిని అమ్ముకోవడానికి వీలుకాదు. అందువల్ల నష్టం జరుగుతుందని మాత్రమే చెబుతున్నాం. మీకు ఇష్టమైతే, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఆ భూమిని ఇప్పుడు ఇస్తే నష్టపరిహారం ఇస్తాం. ప్రత్యామ్నాయం చూపడానికి కూడా అభ్యంతరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి రోడ్మ్యాప్ ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్లో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయి. నగరంలో వాహనాల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టుగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశాం. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అని మూడు జోన్లుగా విభజించాం. క్యూర్ పరిధిని సేవా రంగంగా, ప్యూర్ను తయారీ కేంద్రంగా, రేర్ను వ్యవసాయ ప్రాధాన్యతగా అభివృద్ధి చేయబోతున్నాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం (క్యూర్)లోని కాలుష్య కారక పరిశ్రమలను బయటకు తరలిస్తేం నగరం నివాస యోగ్యంగా మారుతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసే క్రమంలో ఒకే విధమైన పరిపాలన విధానం కోసం మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, నాలుగు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేశాం. భవిష్యత్ అభివృద్ధి కోసం ఒక రోడ్మ్యాప్ను తయారు చేశాం..’అని సీఎం తెలిపారు. మెట్రో విస్తరణ..ఎలివేటెడ్ కారిడార్లు ‘ప్రజల సౌకర్యం కోసం ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్రెడ్డి ఉన్న సమయంలోనే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు సదుపాయం వచ్చింది. ఆనాడు దేశంలో రెండో స్థానంలో ఉన్న మన మెట్రో గత పదేళ్లలో నిర్లక్ష్యంతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణకు ఎల్అండ్టీ అనుకూలంగా లేకపోవడంతో మెట్రోను రూ.15 వేల కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటోంది. ఏప్రిల్ వరకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత లాస్ట్మైల్ కనెక్టివిటీ వచ్చేలా మెట్రో రైలును నాగోల్ నుంచి ఎయిర్పోర్టుకు, గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట, రాయిదుర్గం నుంచి నియోపోలీస్ వరకు మొత్తం 76 కిలోమీటర్లు మార్గాన్ని రూ.24 వేల కోట్లతో నిర్మించేందుకు అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. మెట్రో విస్తరణకు కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. హిమాయత్సాగర్ నుంచి గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్కు రేడియల్ రోడ్లు వేస్తున్నాం. హిమాయత్సాగర్ నుంచి రామోజీ ఫిల్మ్సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ వేస్తున్నాం. గండిపేట నుంచి గౌరెల్లికి 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చేరుకుంటారు. నగరంలో ఉండే వాళ్లు నగరం బయటకు వెళ్లేందుకు వీలుగా నగరం మధ్యలోంచి మూసీ వెంట ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తాం. దీనికి గౌలిగూడ బ్రిడ్జి దగ్గర, చాదర్ఘాట్ దగ్గర, నాగోల్ దగ్గర, అంబర్పేట జంక్షన్ దగ్గర ట్రంపెట్లు వస్తాయి. ఇలా హైదరాబాద్ను అద్భుత రీతిలో అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం..’అని రేవంత్ వివరించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద రోడ్డు ‘హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు.. రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్ అని మూడు రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. బేగంపేట్ ఎయిర్పోర్టు మధ్యలో రన్వే కింది నుంచి అండర్పాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తెచ్చాం. పనులు జరుగుతున్నాయి. దేశంలో ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదు. నల్లగొండ, విజయవాడ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్లను జూలై వరకు పూర్తిచేస్తాం. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నాం. ఫుట్పాత్ వ్యాపారులకు ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి ప్రోత్సహిస్తాం. మల్టీలెవల్ పార్కింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాం..’ అని సీఎం తెలిపారు. -
ప్రశాంతంగా శ్రీరామ నవమి శోభాయాత్ర : అధికారులు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ గరంలో శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. సీతారాం బాగ్ లోని ద్రౌపది గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, పాల్గొన్నారు. శోభాయాత్ర ఏర్పాట్లు, తీసు కోవాల్సిన చర్యలపై చర్చించారు.2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో జరుపు కోవాలని కోరారు. ఇందుకోసం సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తుతోపాటు, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. గతేడాది వాహనాల బ్రేక్డౌన్ వల్ల యాత్ర నెమ్మదించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.శోభాయాత్రను మధ్యాహ్నం 1 గంట కల్లా ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో పెద్ద వాహనాల వల్ల ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ప్రజలు, ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు సహకరించి శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటును ఇప్పటికే పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాల ఎత్తు విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులు భగవంతరావు, గోవింద్ రాఠి,ఆనంద్ సింగ్, కృష్ణ, శ్రీమతి శశికల (మాజీ కార్పొరేటర్), లాల్ సింగ్ (మాజీ కార్పొరేటర్) అందరూ శోభాయాత్ర సందర్భంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించగా, అన్నింటిని పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. అనంతరం శోభాయాత్ర వెళ్లే రూట్ను పరిశీలించారు.ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఐపీఎస్,ఎన్. శ్వేత, ఐపీఎస్, జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
హనుమాన్ టెంపుల్ హుండీలో నకిలీ నోట్ల కలకలం!
సాక్షి, హైదరాబాద్:- కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య నకిలీ నోట్లు బయటపడటం కలకలం రేపింది.“Childrens Bank” పేరుతో ఉన్న రూ. 100, 200, 500 నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి హుండీలో వేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. -
అది భస్మాసుర హస్తంగా మారింది: హరీష్రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాయమాటలతో రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు.ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను రూ.15 వేలకు ఎప్పుడు పెంచుతారో చెప్పాలని నిలదీశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో హరీష్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్లో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్ ఆపలేదు. మేము ఒక్క సీజన్ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు.నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను కోతల సమయంలో ఇస్తున్నారు. మీరు ఎగ్గొట్టిన రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రతులను కాపీ పేస్ట్ చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం అంటూ గత బడ్జెట్ లో రూ.6వేల కోట్లు పెట్టారు.. ఒక్కరికీ ఇవ్వలేదు. గతసారి యువ వికాసం నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?‘ అని హరీష్ రావు అన్నారు. -
రేవంత్ను సీఎం చేసింది నేనే: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది తానేనని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభ లాబీలో సోమవారం మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ తప్ప పవర్ఫుల్ నాయకుడు ఎవరూ లేరని రెడ్డి సంఘం మీటింగ్లో నేనే చెప్పాను. ఎవరు అవునన్నా కాదన్నా నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేన''ని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ క్యారెక్టర్ తనదేనని మల్లారెడ్డి వెల్లడించారు. దర్శకుడు హరీష్ శంకర్ విలన్ పాత్ర చేయమని తనను అడిగితే నో చెప్పానని అన్నారు. సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారు.విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువమల్లారెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సరదాగా స్పందించారు. ''మల్లారెడ్డి నువ్వు విలన్ పాత్రకే సెట్ అవుతావు. నువ్వు సినిమాల్లో చేస్తే విలన్ పాత్రే చెయ్. విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువ'' అంటూ తలసాని హాస్యమాడారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. కాగా, ఇటీవల 50వ పెళ్లిరోజు మల్లారెడ్డి ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. చదవండి: దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు -
మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులకు పునరావాసం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలు.. రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రసంగించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రద్దీని నివారించే ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో సిటీలోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు వరకు సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం వివరించారు. మరోవైపు మూసీ అభివృద్ధి ప్రణాళికల అమలుకు తాము ప్రయత్నిస్తుంటే అడ్డు పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన ప్రణాళికలు తాము అమలు చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అలాగే అప్పటి ప్రభుత్వం మూసీకి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయించిందని పేర్కొన్నారు. నల్లగొండ ప్రజల కష్టాలను చూసైనా మూసీ అభివృద్ధి కి సహాకరించాలని కోరారు.మూసీ ప్రక్షాళన ఆపండి అని కాకుండా, ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వాలన్నారు. ఒక వేళ సూచనలు తనతో పంచుకోవడానికి ఇబ్బందైయితే... శ్రీధర్ బాబు, పొన్నం నేతృత్వంలో కమిటీ వేస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.అలాగే మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేస్తున్నారని.. కానీ దీన్ని నాలా నిబంధనల ప్రకారం నిర్మించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అది బఫర్ జోన్ అయిన నేపథ్యంలో అది ఆ అపార్ట్మెంట్ మధ్యలో నుంచి వెళుతుందని వివరించారు. అయితే మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులకు నష్టం జరగకుండా చూస్తామని, నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎవ్వరినీ నిరాశ్రయులను చెయ్యం, పునరావాసం కల్పిస్తామంటూ అక్కడి వారికి భరోసా ఇచ్చారు. అలాగే మధుపార్క్ అపార్ట్మెంట్కు తమ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వచ్చినపుడు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు. -
ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలకు సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం,స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. -
తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపుల కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లా కోర్టులకు బాంబు బెదరింపుల రావడం రేపింది. తెలంగాణాలోని ములుగు జిల్లాకోర్టుకు, ఆంధ్రప్రదేశ్లోని కృష్టాజిల్లా, మచిలీపట్నంలోని జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులుములుగు జిల్లా కోర్టులో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాంబ్ స్క్వాడ్తో వచ్చిన పోలీసులు కోర్టుతోపాటు పరిసరాలను తనిఖీ శారు. ఈ సందర్బంగా లాయర్లు, ఉద్యోగులు, కక్షిదారులను బయటకు పంపించివేశారు.కృష్ణాజిల్లా : మచిలీపట్నం జిల్లా కోర్ట్ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. జిల్లా జడ్జి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు.ఇదీ చదవండి: రూ. 25 కోట్లు : జంట ఘరానా మోసం.. చివరికి -
హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
సభను తప్పుదోవ పట్టిస్తే మేము ఊరుకోవాలా? భట్టి
అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్హరీష్ రావు చెప్పిన లెక్కలు తప్పు: భట్టి హరీష్ రావు మాట్లాడుతుంటే తమ వైపు నుంచి ఎవరూ అడ్డుపడలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తే మేము ఊరుకోవాలా? హరీష్ రావు చెప్పిన స్టాంప్ డ్యూటీ లెక్కలు తప్పు. మున్సిపాలిటీల ఖాతాలో పడాల్సిన డబ్బులను స్టాంప్ డ్యూటీగా హరీష్ రావు తప్పుడు ఆరోపణ చేశారు. సభను ఇంత సమయం వాయిదా ఎలా వేస్తారని తలసాని అడగడం ఆశ్చర్యంగా ఉంది’ అని చెప్పారు. రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీఅసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా మంత్రి పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.మండలి రేపటికి వాయిదా తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. మళ్లీ రేపు ఉదయం సమావేశాలు ప్రారంభం కానున్నాయి.రైతు బంధు ఎగ్గొట్టారు: హరీష్రావు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చాని, ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని బడ్జెట్లో చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ‘ఈ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల రైతు బంధు ఎగ్గొట్టింది. రాష్ట్రమంతా రైతు రుణమాఫీ అమలు కాలేదు. రైతుల పాలిట అభయ హస్తం భస్మాసుర హస్తంగా మారింది. రైతు రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఏ నియోజక వర్గంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. రుణమాఫీ అమలు పూర్తయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఏ గ్రామం వెళ్లినా తమకు రుణమాఫీ కాలేదని రైతులు చెబుతున్నారు. ఆత్మహత్యలు ఆగాలని కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టారు. ఎన్ని విపత్తులు వచ్చినా రైతు బంధును కేసీఆర్ ఆపలేదు. మేము ఒక్క సీజన్ కూడా రైతు బంధును ఎగ్గొట్టలేదు’ అని హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ వాకౌట్తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పనందుకు నిరసనగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. టెండర్ ఇవ్వకపోతే స్కామ్ అని అంటారా?: మండిపడిన మంత్రిఫిలిప్పీన్స్ దేశానికి - బియ్యం ఎగుమతి పై మధ్యవర్తి లేరు- ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిలిప్సీన్స్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య డైరెక్ట్ ఒప్పందం ఉందిహరీష్ రావు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం.. కంప్లిట్లి ఫాల్స్.కేంద్రం ఎగుమతికి - ఫిలిప్పీన్స్ కి సంబంధం లేదు.సభలో హరీష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.హరీష్ రావు అడిగిన సంస్థకు టెండర్ ఇవ్వకపోతే స్కామ్ అని అంటారా?సివిల్ సప్లై శాఖలో ఆర్థిక భారం పెరిగింది.4వేల అదనపు భారం సివిల్ సప్లై శాఖ పై ఉంది.ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ శాసన సభలో బియ్యం పై రాసాభాససన్న బియ్యం బోనస్ పెండింగ్ నిదులు ఇవ్వాలని BRS డిమాండ్.పెండింగ్ బోనస్ బకాయిల విడుదల పై సమాధానం ఇవ్వని ప్రభుత్వం.ప్రేమ్ చంద్ అనే వ్యక్తిని సలహాదారుగా పెట్టుకున్నారా? లేదా? BRS ప్రశ్నకు జవాబు ఇవ్వని మంత్రి ఉత్తమ్.బియ్యం స్కామ్ పై హౌస్ కమిటీకి డిమాండ్ చేసిన హరీష్ రావు.హరీష్ రావు అడిగిన కంపినికి ఇవ్వనందుకే ఆరోపణలు అన్న ఉత్తమ్.హౌస్ కమిటీ వేయాలనే హరీష్ రావు డిమాండ్ కు.. ముందుకి రాని ఉత్తమ్ కుమార్ రెడ్డిప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఫీలిపిన్స్ కు బియ్యం పంపడం పెద్ద స్కామ్ అంటూ మండిపడ్డారు.మంత్రి ఉత్తమ్ సభను పక్కదారి పట్టిస్తున్నారు.ఘరానా మోసగాడు అయిన ప్రేమ్ చంద్ అనే వ్యక్తిని సలహాదారుగా పెట్టుకున్నారు?బియ్యం ఎగుమతి కేంద్రానికి కాకుండా పిలిపిన్స్ కు ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు?బియ్యం ఎగుమతికి టెండర్లు పిలిచారా?ఏడాది నుంచి కాకినాడ పోర్ట్ లో పెట్టారు? ఏడాది నుంచి పోర్ట్ లో పెడితే ముక్కిపోదా?బియ్యం ఎగుమతి లో స్కామ్ జరిగింది.ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే హౌస్ కమిటీ వేయాలి.హెలికాప్టర్ లో కాకినాడ వెళ్లారు.. కానీ అక్కడ నష్టం వచ్చింది.నామినేషన్ బేసిస్ లో ప్రైవేట్ సంస్థకు ఎలా కేటాయిస్తారు? ఛలో అసెంబ్లీకి బీజేపీ పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్చేస్తూ బీజేపీ ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శలు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీలో ఈరోజు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఉగాది, రంజాన్ పండుగల విరామం తర్వాత ఉభయ సభలు ఇవాళ(సోమవారం) పునఃప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలంగాణ వైద్య విధాన పరిషత్ (రద్దు) బిల్లు, 2026ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా వైద్య వ్యవస్థలో పాలనాపరమైన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, అలాగే గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ చర్యలు, భూ రికార్డుల డిజిటలైజేషన్ వంటి లాంటి అంశాలపై వాడి వేడి చర్చజరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్.. -
మళ్లీ కట్టెల పొయ్యి..!
భద్రాద్రి కొత్తగూడెం: గ్యాస్ కొరతతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గృహావసరాలకు గ్యాస్ కొరత లేదని అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే డెలివరీకి కనీసం పదిరోజుల సమయం పడుతోంది. గ్యాస్ సిలిండర్ తీసుకున్న 45 రోజుల తర్వాతనే గ్యాస్ తిరిగి బుక్ చేసుకోవాలని నిబంధనలు విధించారు. ఈలోగా గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి వెలిగించాలి్సందే. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లకు మరింత కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవటంతో కొన్ని హోటళ్లను మూసేశారు. కొందరు కట్టెల పొయ్యిలతో తంటాలు పడుతున్నారు.వేధిస్తున్న కొరతగ్యాస్ కొరతతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు అవసరాల కోసం గ్యాస్ను బుక్ చేసుకునేందుకు తొందరపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు.. వినియోగదారుల అవసరాన్ని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. గ్యాస్ కొరత కారణంగా పల్లె ప్రజలు మళ్లీ కట్టెల కోసం వెతుకుతున్నారు. పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లి ఎండిన చెట్లు, కొమ్మలను వంట చేసుకునేందుకు తెచ్చుకుంటున్నారు. కొందరు కూలీలు కట్టెలు తీసుకువచ్చి గ్రామాలు, పట్టణాల్లో అమ్ముతున్నారు. గతంలో కట్టెల మోపు రూ.200 ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు. ఎడ్లబండ్లతో కట్టెలు తీసుకువస్తే రూ.2,500 నుంచి రూ.3,000 తీసుకుంటున్నారు.భారంగా హోటళ్ల నిర్వహణప్రస్తుతం వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ భారంగా మారింది. టిఫిన్ సెంటర్లు, భోజన హోటళ్లు గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. సిలిండర్లు దొరకక కొందరు హోటళ్లను బంద్ చేసుకుంటున్నారు. కొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లపై కూలీలతో కట్టెలు తెప్పించుకుని వంట చేస్తున్నారు. పోడుసాగుతో అడవుల విస్తీర్ణం తగ్గిపోవటంతో కట్టెలకు కూడా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. కట్టెల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావటంతో రేటు బాగా పెరిగిపోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెలతో చేసిన వంటల ఖర్చు గ్యాస్తో చేసిన ఖర్చును మించిపోతుండటంతో ధరలూ పెంచేశారు. గతంలో ఉన్న ధరలకు అదనంగా 30 శాతం ధరలను పెంచి టిఫిన్లు, భోజనం విక్రయిస్తున్నారు. పట్టణాల్లో కర్రీ పాయింట్లు కూడా గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. కొన్ని కర్రీ పాయింట్లలో ధరలను రెట్టింపు చేశారు. టీ, కాఫీ సెంటర్లపై కూడా గ్యాస్ కొరత ప్రభావం చూపింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న టీని రూ.15 చేశారు. రూ.20 ఉన్న కాఫీని రూ.25 చేశారు. స్వీట్లు తయారు చేసే నిర్వాహకులు కూడా గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కంటే తక్కువగా తినుబండారాలు తయారు చేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోవటంతో స్వీట్లు, తినుబండారాల రేట్లను పెంచుతున్నారు.ప్రత్యామ్నాయం ఏమిటో?గతంలో వరిపొట్టు, బొగ్గుతో పొయ్యిలను ఏర్పాటు చేసుకుని హోటళ్లు నడిపేవారు. పొట్టు, బొగ్గు ధరలు బాగా పెరగటంతో అందరు గ్యాస్పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో ఆహార సంబంధిత వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత పెద్దగా ఏమీ లేదని, దానివల్ల ఇబ్బందులు ఏమీ లేవని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ కొరత ఎంతకాలముంటుందో, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలను చూపుతుందో వేచిచూడాలి. -
Banjara Hills: ఇంట్లోనే వ్యభిచారం.. అలేఖ్య అరెస్ట్..!
హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడి చేసి యువతితో పాటు విటుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. యూసుఫ్గూడ శ్రీకృష్ణానగర్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడులు చేశారు. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా అలేఖ్యరెడ్డి(26) అనే మహిళ ఆరు నెలలుగా వ్యభిచారం నడిపిస్తుందని పోలీసులు గుర్తించారు. ఆమె వెంకటేష్ అనే ఏజెంట్, రామ అనే వ్యక్తి పరిచయాల ద్వారా వ్యభిచారం నడిపస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అలేఖ్యరెడ్డి పోలీసులకు వివరించింది. ఆమెతో పాటు విటుడు వెంకట వినయ్కుమార్(27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా పెరిగిన చికెన్ ధరలు
జోగిపేట(అందోల్): మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ఆదివారం కిలో చికెన్ ధర రూ.360కి చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు నాన్వెజ్ తినడమే కష్టంగా మారింది. లైవ్ చికెన్ రూ.230, స్కిన్లెస్ రూ.360, చికెన్ రూ.320 చొప్పున చికెన్ దుకాణాలలో విక్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా ఇంతరేటు పెరగడం గమనార్హం. గతంలో వారానికి ఒకసారైనా చికెన్ కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నాయి. చికెన్ ధరల పెరుగుదలకు పలు కారణాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీఫారాల్లో ఉత్పత్తి తగ్గడం, పక్షుల ఆహార వ్యయం పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల ధరలు పెరిగినట్లు తెలిపారు. అలాగే వేసవి ప్రభావం కారణంగా కోళ్ల మరణాలు కూడా పెరిగి సరఫరా తగ్గిందని పేర్కొన్నారు. ఇక వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇప్పటివరకు కుటుంబంతో కలిసి వారానికి ఒకసారి చికెన్ తినేవాళ్లం. ఇప్పుడు ధరలు ఎక్కువ కావడంతో నెలలో ఒకసారి కూడా కొనలేకపోతున్నాం’’అని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. మటన్ ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా, చికెన్ కూడా అదే దారిలో నడవడం వల్ల నాన్వెజ్ పూర్తిగా దూరమవుతోందని అంటున్నారు. హోటళ్లలో కూడా చికెన్ వంటకాల ధరలు పెరగడంతో కస్టమర్ల రాక తగ్గినట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. -
బ్యాటింగ్.. జస్టిస్ విజయ్సేన్ రెడ్డి.. బౌలింగ్.. జస్టిస్ లక్ష్మీనారాయణ
హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో మూడు రోజులపాటు జరిగిన హైకోర్టు జడ్జీలు–అడ్వొకేట్ల క్రికెట్ టోర్నమెంట్లో అడ్వకేట్స్ ‘ఏ’ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన తొలి రోజు పోటీల్లో చీఫ్ జస్టిస్ జట్టు ‘ప్రెసిడెంట్ లెవెన్’పై విజయం సాధించింది. అనంతరం అడ్వొకేట్స్ ‘ఏ’, ‘డీ’ జట్లు ఫైనల్కు చేరగా, ఆదివారం జరిగిన ఫైనల్లో అరవింద్ నేతృత్వంలోని ‘ఏ’ జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ‘డీ’ జట్టు 6 ఓవర్లలో 54 పరుగులు చేయగా, ‘ఏ’ జట్టు 4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్సేన్ రెడ్డి, జస్టిస్ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథులుగా హాజరై ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించి, సరదాగా కాసేపు ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. -
బాల్కనీ కుప్పకూలి.. ఇద్దరు బలి
పంజగుట్ట: రెండో ఫ్లోర్లోని బాల్కనీ కూలి తండ్రి, కొడుకు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంబాగ్కు చెందిన దేవిదాస్ (56), ఆయన కుమారుడు వివేక్ (32) ఎలక్ట్రిషన్లు. వీరు కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తుంటారు. బేగంపేటలోని కుందన్బాగ్ మెథడిస్ట్ కాలనీకి చెందిన ద్వారకా ప్రసాద్ వీరికి ఎలక్ట్రిక్ పనులు ఇప్పిస్తుంటారు. ద్వారకా ప్రసాద్ ఉంటున్న ఇల్లు పురాతన కాలం నాటిది. ఈ భవనం రెండో అంతస్తులో ఆయన నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో ఎలక్ట్రిక్ పనులు చేయించేందుకు శనివారం దేవిదాస్, వివేక్లతో బాల్కనీ లిఫ్ట్ పక్కనే నిల్చొని మాట్లాకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బాల్కనీ కుప్పకూలింది. దీంతో ముగ్గురూ రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తు బాల్కనీపై పడి అది కూడా కూలడంతో నేలపై పడిపోయారు. దీంతో దేవిదాస్, వివేక్ తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలు కావడంతో ద్వారకా ప్రసాద్ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దేవిదాస్, వివేక్ల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. దేవిదాస్ అల్లుడు నవీన్ ధర్మశాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబాన్ని పోషిస్తున్న ఇద్దరు మృత్యువాత పడటంతో దేవిదాస్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
ఆధునిక ఇస్ఫహాన్.. మన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్–అమెరికాలు ఇరాన్ మీద దాడి ప్రారంభించినప్పటి కంటే ఓ నగరం మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు ‘హైదరాబాద్ నగరం’మనసు కలుక్కుమనే ఉంటుంది. అక్కడి చారిత్రక నిర్మాణాలకు నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసినప్పుడు మరింత ఆవేదనకు గురై ఉంటుంది. ఆ నగరమే ఇస్ఫహాన్. దాదా పు 3 వేల కి.మీ. దూరంలో ఉన్న ఆ నగరంపై బాంబులేస్తే హైదరాబాద్కు ఉలుకెందుకంటే... 22 ఆర్చి ద్వారాలతో అద్భుత శైలితో నిర్మితమైన పురానాపూల్, ఎత్తయిన నాలుగు మినార్లతో గంభీరంగా ఉండే చార్మినార్... షియా సంప్రదాయ కట్టడం బాద్షాహీ అషూర్ఖాన్... ఇవన్నీ ఆ ఇస్ఫహాన్ నగర ప్రభావంతో రూపొందినవే. వీటికి మూలం గోల్కొండ సామ్రాజ్య పేష్వాగా దశాబ్దాల పాటు కొనసాగిన మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ. ఆయన మాట ల్లో... ‘హైదరాబాద్ అంటే ఆధునిక ఇస్ఫ హాన్’. ఆయ నకు ఇస్ఫహాన్ అంటే మక్కువ ఎందుకంటే.. ఆయనది ఇస్ఫహానే. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రా యెల్–అమెరికా దాడులతో ఆ నగరం అతలా కుతల మవుతోంది. పర్షియన్ సంస్కృతి సంప్రదా యాలు, నిర్మాణాలను నిలువెల్లా అద్దుకున్న ఆ దేశం నిలువునా వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మిసైల్ విధ్వంసం సృష్టిస్తుందోనని అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. కానీ, ఆ దేశంలో మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్కు నష్టం జరిగిందని తెలిసి హైదరాబాద్ గుండె బరువెక్కింది. ఇస్ఫహా న్తో ప్రస్తుతం హైదరాబాద్కు వాణిజ్య సంబంధాలు పెద్దగా లేకున్నా, హైదరాబాద్ పుట్టుకలో ఆ నగర ప్రభావమే కీలకం కావటం విశేషం.చార్మినార్..హైదరాబాద్ నగర సంతకం చార్మినార్ ప్రధాన డిజైన్ ఈయనదే. భారీ మినార్లతో కట్టడాలుండటం పర్షియన్ పద్ధతి. అక్కడి మసీదులకు ఎత్తయిన మినార్లు ఉంటాయి. వాటి మీదకు ఎక్కి ప్రార్థనలకు స్థానికులను గట్టిగా అరిచి పిలిచేవారు. ఇస్ఫహాన్లో 1316లో నిర్మించిన మినార్ ఏ జొంబన్ మసీదు నమూనాతో చార్మినార్కు డిజైన్ చేశారు. దానిలాగే ఆర్చి, అలాగే మినార్లు (మినార్ ఏ జొంబన్కు రెండే) డిజైన్ చేశారు. అప్పటికే ఆయన్ను పేష్వా (ప్రధానమంత్రి)గా నియమించారు. 1590లో మొదలైన హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్ తరహాలో రూపొందించాలని నిర్ణయించి మొమిన్ తన మార్కు చూపించారు. అలా 40 ఏళ్లపాటు ఆయన పేష్వాగా కొనసాగారు. మళ్లీ ఇస్ఫహాన్కు వెళ్లకుండా ఇక్కడే ఉండి చనిపోయారు. ఆయన రూపొందించిన మీర్ మొమిన్ కా దాయరాలోనే ఆయన్ను ఖననం చేశారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ ఉంది. భారత సంప్రదాయాలను ధ్వంసం చేసి పర్షియా పద్ధతులను రుద్దినప్పటికీ, నగర నిర్మాణంలో ఆయన పాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చనిపోయే ముందు ఆయన రాసిన పుస్తకంలో హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్గా అభివర్ణించారు. అందుకే హైదరాబాద్ చరిత్రలో ఇస్ఫహాన్కు అంత ప్రాధాన్యం. యుద్ధంలో ఇస్ఫహాన్ దెబ్బతింటే హైదరాబాద్ మనసుకు గాయమైంది అందుకే.కులీ కుతుబ్షా పాలనలో..కులీకుతుబ్షాహీ పాలకుల్లో ఐదోవాడిగా పట్టాభిషిక్తుడైన మహమ్మద్ కులీకుతుబ్షా పాలనలో హైదరాబాద్ నగర నిర్మాణం మొద లైంది. అప్పటి వరకు గోల్కొండ పట్టణం ఒక్కటే ఉండేది. ప్రస్తుతం పాతనగరం ఉన్న ప్రాంతంలో కొన్ని ఊళ్లు మాత్రమే ఉండేది. నాలుగో రాజు ఇబ్రహీం కులీకుతుబ్షాహీ కాలంలోనే గోల్కొండ ఇరుకుగా మారటంతో మూసీకి ఆవల కొత్త నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన మొదలైంది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. ఇబ్రహీం ఆదేశాలతోనే మూసీ దాటేందుకు వీలుగా వంతెన నిర్మాణం మొద లైంది. అప్పుడు నగరంలోకి ఓ వ్యక్తి కాలు మోపాడు. ఆయనే మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ. ఈయన ఇరాన్ సఫావిద్ రాజ్య రాజధాని ఇస్ఫహాన్కు చెందిన ప్రముఖ పండితుడు. అక్కడి అస్తరాబాద్లో పుట్టినప్పటికీ, సఫా విద్ రాజకుమారుడు హైదర్కు ట్యూట ర్గా పనిచేసేవాడు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, వైద్యం, ఆధ్యాత్మికం... ఇలా పలు అంశాల్లో నైపుణ్యం ఆయన సొంతం. అక్కడి రాజు మృతితో ఆయన హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడి కుతుబ్షాహీ పాలకులు పర్షియాకు చెందిన వారే కావటంతో అప్పటికే పర్షియాకు చెందిన ఎంతోమంది నిపుణులు హైదరాబాద్కు వస్తు ండేవారు. అలా వచ్చిన ఆయన తన నైపుణ్యంతో వెంటనే పాలకులను ఆకట్టుకున్నాడు.పురానాపూల్ ...సరిగ్గా అది నగర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణం. అప్పటికే పురానాపూల్ వంతెన సిద్ధమవుతోంది. వెంటనే తన నైపుణ్యాన్ని దానిమీద ప్రయోగించారు. పర్షియన్ ఆర్కి టెక్చర్ నమూనాను చొప్పించి అప్పటికే ఉన్న డిజైన్ను మార్పించారు. ఇరాన్లో 13వ శతా బ్దంలో నిర్మించిన వంతెన డిజైన్తో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఇస్ఫహాన్లో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న వంతెనలు (కొన్ని పురాన్ పూల్ తర్వాత కట్టినవి) అచ్చు పురానాపూల్ వంతెనను స్ఫురిస్తాయి. -
కునుకుపై కినుక.. నిద్ర ఆరు గంటల్లోపే...
మంచి ఆరోగ్యానికి నిద్ర అత్యంత ముఖ్యం. మానసిక ఒత్తిడి, ఆందోళన, గతి తప్పిన జీవనశైలి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల అతివాడకం, ఆహార అలవాట్లు, అనారోగ్య సమస్యలు.. కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కంటినిండా నిద్ర ఒక కలగా మిగిలిపోతోంది. అయితే మంచిగా నిద్ర పట్టడానికి ఇంట్లో సంతోషకర వాతావరణం, రాత్రిపూట తేలికపాటి భోజనం, పగటిపూట వ్యాయామం దోహదం చేస్తాయన్నది అత్యధికుల మాట. – సాక్షి, స్పెషల్ డెస్క్⇒ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ తాజాగా విడుదల చేసిన దేశవ్యాప్త సర్వే ప్రకారం.. చాలా మంది భారతీయులు ఇప్పటికీ తగినంత అంతరాయం లేని నిద్రను పొందలేకపోతున్నారని వెల్లడైంది. అయితే గతేడాదితో పోలిస్తే పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 12 నెలల్లో అడ్డంకులు లేని నిద్ర రోజుకి ఆరు గంటలు మించలేదని 46% మంది భారతీయులు పేర్కొన్నారు. 2025లో ఈ అభిప్రాయాన్ని వెల్లడించిన వ్యక్తుల సంఖ్య 59% నమోదైంది. దేశవ్యాప్తంగా 2025 డిసెంబర్ నుంచి 2026 మార్చి వరకు 393 జిల్లాల్లో జరిగిన ఈ సర్వేలో 63% మంది పురుషులు, 37% మంది స్త్రీలు పాల్గొన్నారు. ప్రథమ శ్రేణి నగరాల నుంచి 42%, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి 26% మంది, మిగిలినవారు ఇతర నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.మంచి నిద్రకు దోహదం చేసే అంశాలు..అంశం - వెల్లడించిన వ్యక్తుల శాతం ఇంట్లో సంతోషకర వాతావరణం - 72తేలికపాటి రాత్రి భోజనం - 65పగటిపూట వ్యాయామం - 65సౌకర్యవంతమైన దుస్తులు - 43రాత్రి 10 గంటల కంటే ముందే పడుకోవడం - 29మనసుకు హాయినిచ్చే సంగీతం - 25దోమల నివారణ ఉత్పత్తులు - 22నిద్రకు ముందు పుస్తకాలు చదవడం - 14నిద్రకు అంతరాయం కలిగించే ప్రధాన కారణాలు..కారణం - శాతంఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం - 72ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే ఇంటి పనులు - 42వరుసగా 8 గంటల పాటు అస్సలు నిద్ర పట్టకపోవడం - 28దోమలు, బయటి శబ్దాలు వంటి ఇతర కారణాలు - 23స్లీప్ అప్నియా వంటి అనారోగ్య సమస్యలు - 19మొబైల్ కాల్స్, మెసేజ్ల వల్ల వచ్చే ఆటంకాలు - 14పిల్లలు/భాగస్వామి వల్ల కలిగే ఇబ్బందులు - 12సౌకర్యవంతంగా లేని మంచం/పరుపు - 9మెరుగైన నిద్ర కోసం..⇒ రోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం⇒ నిద్రపోయే 6–8 గంటల ముందే టీ, కాఫీ తాగడం ఆపేయండి⇒ పడుకోవడానికి కనీసం 2–3 గంటల ముందే భోజనం ముగించండి⇒నిద్రకు 2–3 గంటల ముందు ఫోన్లు, టీవీలు చూడటం ఆపండి⇒పడక గది చీకటిగా, నిశ్శబ్దంగా, కొంచెం చల్లగా ఉండేలా చూసుకోండి⇒రోజూ వ్యాయామం లేదా యోగా చేయండి⇒ రాత్రిపూట నీరు, టీ, తీపి పానీయాలు అతిగా తీసుకోవద్దు⇒పడుకునే ముందు పుస్తక పఠనం, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి⇒ పగటిపూట ఎక్కువ సేపు నిద్రపోకండి⇒సౌకర్యవంతమైన పరుపు, దిండును ఉపయోగించండి -
ఆర్థిక రంగానికి లైఫ్ సైన్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక రంగానికి లైఫ్ సైన్సెస్ వెన్నుదన్నుగా నిలవనుంది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రావడంతోపాటు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 190 యూనిట్లకు అనుమతులు మంజూరు చేశామని, తద్వారా రూ.73,360 కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది. తద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది.అదీకాక.. 2026–30 మధ్య కాలంలో రూ. 2.35 లక్షల కోట్ల (25 బిలియన్ డాలర్లు) పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించింది. తద్వారా ఏకంగా 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే జీనోమ్ వ్యాలీ లైఫ్ సైన్సెస్ రంగానికి కీలకంగా ఉంది. మరిన్ని పెట్టుబడులు రావడానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదం కానుందని సర్కార్ తెలిపింది. ఈ ఏడాది 1,457 కర్మాగారాలు రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కొత్తగా 1,457 తయారీ కర్మాగారాలకు అనుమతులు ఇచ్చారు. తద్వారా రూ. 7,388 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. తద్వారా 36,919 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పరిశ్రమ ల అధిపతులు ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్లో పేర్కొన్నట్లు వెల్లడించింది. కొత్తగా తయారీ రంగంలో వస్తున్న ఈ కర్మాగారాలన్నీ కూడా మేడ్చల్– మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే వస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పారిశ్రామిక వాడల్లోని 2,198 ఎకరాల భూములను పరిశ్రమలకు టీజీఐఐసీ కేటాయించినట్లు తెలిపింది. ఈ భూముల్లో పెట్టుబడుల కింద రూ. 88,534 కోట్లు వచ్చాయని, తద్వారా 75,008 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని వివరించింది. తయారీ రంగంలో 13 లక్షల మంది కార్మికులు.. రాష్ట్రంలో తయారీ రంగంలోని 21,436 కర్మాగారాల్లో దాదాపు 13 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ వెల్లడించింది. గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ) మొత్తం రూ. 16,48,613 కోట్లు కాగా.. ఇందులో తయారీ పరిశ్రమల రంగం వాటా రూ. 3,04,217 కోట్లుగా ఉంది. ఇందులో తయారీ రంగం వాటా రూ. 1,37,229 కోట్లు (45.1 శాతం), నిర్మాణరంగం రూ. 93,404 కోట్లు (30.7 శాతం), ఎలక్ట్రిసిటీ, యుటిలిటీస్ రంగం రూ. 37,692 కోట్లు (12.4 శాతం), మైనింగ్–క్వారీయింగ్ రూ. 35,892 కోట్లు (11.8 శాతం) గా ఉన్నట్లు వివరించింది. -
ఆధునిక ఇస్ఫహాన్.. మన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్–అమెరికాలు ఇరాన్ మీద దాడి ప్రారంభించినప్పటి కంటే ఓ నగరం మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు ‘హైదరాబాద్ నగరం’మనసు కలుక్కుమనే ఉంటుంది. అక్కడి చారిత్రక నిర్మాణాలకు నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసినప్పుడు మరింత ఆవేదనకు గురై ఉంటుంది. ఆ నగరమే ఇస్ఫహాన్. దాదా పు 3 వేల కి.మీ. దూరంలో ఉన్న ఆ నగరంపై బాంబులేస్తే హైదరాబాద్కు ఉలుకెందుకంటే... 22 ఆర్చి ద్వారాలతో అద్భుత శైలితో నిర్మితమైన పురానాపూల్, ఎత్తయిన నాలుగు మినార్లతో గంభీరంగా ఉండే చార్మినార్... షియా సంప్రదాయ కట్టడం బాద్షాహీ అషూర్ఖాన్... ఇవన్నీ ఆ ఇస్ఫహాన్ నగర ప్రభావంతో రూపొందినవే. వీటికి మూలం గోల్కొండ సామ్రాజ్య పేష్వాగా దశాబ్దాల పాటు కొనసాగిన మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ.ఆయన మాట ల్లో... ‘హైదరాబాద్ అంటే ఆధునిక ఇస్ఫ హాన్’. ఆయ నకు ఇస్ఫహాన్ అంటే మక్కువ ఎందుకంటే.. ఆయనది ఇస్ఫహానే. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రా యెల్–అమెరికా దాడులతో ఆ నగరం అతలా కుతల మవుతోంది. పర్షియన్ సంస్కృతి సంప్రదా యాలు, నిర్మాణాలను నిలువెల్లా అద్దుకున్న ఆ దేశం నిలువునా వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మిసైల్ విధ్వంసం సృష్టిస్తుందోనని అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. కానీ, ఆ దేశంలో మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్కు నష్టం జరిగిందని తెలిసి హైదరాబాద్ గుండె బరువెక్కింది. ఇస్ఫహా న్తో ప్రస్తుతం హైదరాబాద్కు వాణిజ్య సంబంధాలు పెద్దగా లేకున్నా, హైదరాబాద్ పుట్టుకలో ఆ నగర ప్రభావమే కీలకం కావటం విశేషం.కులీ కుతుబ్షా పాలనలో..కులీకుతుబ్షాహీ పాలకుల్లో ఐదోవాడిగా పట్టాభిషిక్తుడైన మహమ్మద్ కులీకుతుబ్షా పాలనలో హైదరాబాద్ నగర నిర్మాణం మొద లైంది. అప్పటి వరకు గోల్కొండ పట్టణం ఒక్కటే ఉండేది. ప్రస్తుతం పాతనగరం ఉన్న ప్రాంతంలో కొన్ని ఊళ్లు మాత్రమే ఉండేది. నాలుగో రాజు ఇబ్రహీం కులీకుతుబ్షాహీ కాలంలోనే గోల్కొండ ఇరుకుగా మారటంతో మూసీకి ఆవల కొత్త నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన మొదలైంది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. ఇబ్ర హీం ఆదేశాలతోనే మూసీ దాటేందుకు వీలుగా వంతెన నిర్మాణం మొద లైంది. అప్పుడు నగరంలోకి ఓ వ్యక్తి కాలు మోపాడు.ఆయనే మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ. ఈయన ఇరాన్ సఫావిద్ రాజ్య రాజధాని ఇస్ఫహాన్కు చెందిన ప్రముఖ పండితుడు. అక్కడి అస్తరాబాద్లో పుట్టినప్పటికీ, సఫా విద్ రాజకుమారుడు హైదర్కు ట్యూట ర్గా పనిచేసేవాడు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, వైద్యం, ఆధ్యాత్మికం... ఇలా పలు అంశాల్లో నైపుణ్యం ఆయన సొంతం. అక్కడి రాజు మృతితో ఆయన హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడి కుతుబ్షాహీ పాలకులు పర్షియాకు చెందిన వారే కావటంతో అప్పటికే పర్షియాకు చెందిన ఎంతోమంది నిపుణులు హైదరాబాద్కు వస్తు ండేవారు. అలా వచ్చిన ఆయన తన నైపుణ్యంతో వెంటనే పాలకులను ఆకట్టుకున్నాడు.పురానాపూల్ ...సరిగ్గా అది నగర నిర్మాణానికి ఏర్పాట్లు జరు గుతున్న తరుణం. అప్పటికే పురానాపూల్ వంతెన సిద్ధమవుతోంది. వెంటనే తన నైపుణ్యాన్ని దానిమీద ప్రయోగించారు. పర్షియన్ ఆర్కి టెక్చర్ నమూనాను చొప్పించి అప్పటికే ఉన్న డిజైన్ను మార్పించారు. ఇరాన్లో 13వ శతా బ్దంలో నిర్మించిన వంతెన డిజైన్తో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఇస్ఫహాన్లో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న వంతెనలు (కొన్ని పురాన్ పూల్ తర్వాత కట్టినవి) అచ్చు పురానాపూల్ వంతెనను స్ఫురిస్తాయి.చార్మినార్..హైదరాబాద్ నగర సంతకం చార్మినార్ ప్రధాన డిజైన్ ఈయనదే. భారీ మినార్లతో కట్టడాలుండటం పర్షియన్ పద్ధతి. అక్కడి మసీదులకు ఎత్తయిన మినార్లు ఉంటాయి. వాటి మీదకు ఎక్కి ప్రార్థనలకు స్థానికులను గట్టిగా అరిచి పిలిచేవారు. ఇస్ఫహాన్లో 1316లో నిర్మించిన మినార్ ఏ జొంబన్ మసీదు నమూనాతో చార్మినార్కు డిజైన్ చేశారు. దానిలాగే ఆర్చి, అలాగే మినార్లు (మినార్ ఏ జొంబన్కు రెండే) డిజైన్ చేశారు.అప్పటికే ఆయన్ను పేష్వా (ప్రధానమంత్రి)గా నియమించారు. 1590లో మొదలైన హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్ తరహాలో రూపొందించాలని నిర్ణయించి మొమిన్ తన మార్కు చూపించారు. అలా 40 ఏళ్లపాటు ఆయన పేష్వాగా కొనసాగారు. మళ్లీ ఇస్ఫహాన్కు వెళ్లకుండా ఇక్కడే ఉండి చనిపోయారు. ఆయన రూపొందించిన మీర్ మొమిన్ కా దాయరాలోనే ఆయన్ను ఖననం చేశారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ ఉంది. భారత సంప్రదాయాలను ధ్వంసం చేసి పర్షియా పద్ధతులను రుద్దినప్పటికీ, నగర నిర్మాణంలో ఆయన పాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చనిపోయే ముందు ఆయన రాసిన పుస్తకంలో హైదరాబాద్ను మరో ఇస్ఫహాన్గా అభివర్ణించారు. అందుకే హైదరాబాద్ చరిత్రలో ఇస్ఫహాన్కు అంత ప్రాధాన్యం. యుద్ధంలో ఇస్ఫహాన్ దెబ్బతింటే హైదరాబాద్ మనసుకు గాయమైంది అందుకే. -
మూసీ పేరుతో కాంగ్రెస్ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు దోచుకుందని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరుతో దోపిడీకి తెగబడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్రావు ఆరోపించారు. దీనివల్ల చివరకు తెలంగాణ మూసేసే పరిస్థితికి చేరుతుందని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవంపై ఆదివారం ఓ హోటల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో రాంచందర్రావు మాట్లాడుతూ పెన్షన్లకు, ఉద్యోగుల జీతాలకు, రైతు భరోసాకు, ప్రభుత్వాన్ని నడిపేందుకు పైసల్లేవంటూ నిత్యం మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ. లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. అప్పు చేసి సొమ్ము తీసుకొచ్చి, ఆ అప్పు భారాన్ని సామాన్యులపై వేస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు.55 కి.మీ. మూసీ సుందరీకరణకు ముందుగా రూ. 5 వేల కోట్లు వ్యయం అవుతుందని చెప్పి తీరా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ప్రజెంటేషన్ రోజున రూ. 7 వేల కోట్లు అవుతుందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని వృథా చేసే పనులను బీజేపీ అడ్డుకుంటుందని రాంచందర్రావు చెప్పారు. డీపీఆర్ ప్రకటన రోజున 10 వేల ఇళ్లు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని సీఎం వివరించారని.. కానీ అసెంబ్లీలో మాత్రం కేవలం 1,400 ఇళ్లను కూల్చాల్సి వస్తుందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కూల్చడం, నాశనం చేయడమే కాంగ్రెస్ డీఎన్ఏ అని దుయ్యబట్టారు.50 మీటర్ల వరకూ మూసీ బఫర్ అని నిర్ధారించిన ప్రభుత్వానికి.. నార్సింగి వద్ద మూసీలోనే కడుతున్న బహుళ అంతస్తుల భవనం కనిపించడం లేదా అంటూ విమర్శించారు. పేదల ఇళ్లు, స్థలాలను బలవంతంగా లాక్కొని, వాటి మీద గాంధీ విగ్రహం పెడతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. పేదలకు ముందుగా పునరావాసం కల్పించాకే మూసీ ప్రక్షాళనకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. అనంతరం మహారాష్ట్ర వాటర్ పాలసీ అండ్ మేనేజ్మెంట్ అడ్వైజర్ శ్రీరాం వెదిరె పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూసీ పునరుజ్జీవంపై ప్రసంగించారు. -
అవగాహనలేమితో తెలంగాణ పరువు తీస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరులో 1972 నుంచి ప్రపంచ స్థాయిలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ లేదా అమెరికా రీసెర్చ్ సెంటర్ అని పిలవడం సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం హరీశ్రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నల్లమల సరిహద్దులు, కృష్ణా–గోదావరి జలాలు, సుంకేశుల ప్రాజెక్టుల మీదే కాదు..కళ్ల ముందున్న సంస్థలపై కూడా సీఎంకు కనీస అవగాహన లేదు. ప్రాథమిక అవగాహన లేకుండా సీఎం తెలంగాణ పరువు తీస్తున్నాడు.ఇక్రిశాట్ ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు..ఇది సీజీఐఏఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ’అని హరీశ్రావు స్పష్టం చేశారు. దీని ఏర్పాటులో ఎఫ్ఏఓ, యూఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని, ప్రారంభంలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్లతోపాటు భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక అని వివరించారు. ‘దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణం.ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’అని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా, వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మానుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని హితవు పలికారు. -
ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు
సాక్షి, హైదరాబాద్: ఆర్యవైశ్యులు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలోనూ ఆర్యవైశ్యుల భాగస్వామ్యం కీల కమైందన్నారు. ఇటీవల ఆర్యవైశ్యులకు 6 మున్సిపల్ చైర్మన్ పదవులతోపాటు ఒక మేయర్ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడి యం వేదికగా శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవాన్ని ఆది వారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘అవకాశాలు వచ్చినా రాకు న్నా.. ఆర్యవైశ్యులు క్రమశిక్షణతో ఉంటారు.నాకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.. ఆయనతో వాదించడం, ప్రశ్నించడం గౌరవంగా ఉండేది. ఆర్యవైశ్యులు వారి హక్కులను కూడా శాంతియుత పద్ధతి లోనే తెలిపే ప్రయత్నం చేస్తారు. ఊరిలో ఒక్క ఆర్యవై శ్యు డున్నా.. ఊరంతా ఆయన చేతిలోనే ఉంటుంది. వ్యవసాయ కూలీలకు, రైతులకు, నమ్మకంతో అప్పులు ఇచ్చి తిరిగి తీసుకుంటారు’ అని చెప్పారు.ఈ సందర్భంగా వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత సీఎంను కోరగా.. శాసన సభ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, ఏపీ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే సూర్య నారా యణ, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది పీఠాధిపతులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సామూహిక పారాయణం.. గిన్నిస్ రికార్డుఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో భాగంగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కవి చింత శ్రీనివాస్ రచించి, స్వరకర్త శ్రీ జోశ్యభట్ల స్వరపరిచిన 102 చరణాల వాసవీ పారాయణాన్ని గాయని కల్పన పాడగా.. 21 వేల మంది (ఆన్లైన్, ఆఫ్లైన్లో కలిపి 30 వేల మంది) వైశ్యులు సామూహికంగా పారాయణం చేశారు. ఇది ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కాగా, 28 అడుగుల భారీ అమ్మవారి విగ్రహం వద్ద 16 మంది పీఠాధిపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. -
ప్రభుత్వాలు లేకున్నా పార్టీ ఉంటుంది
సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుంది..కార్యకర్తలు లేకుంటే పార్టీలు, ప్రభుత్వాలు ఉండవు.. పార్టీయే శాశ్వతం.. ఎందరో ప్రాణ త్యాగాల మీద నిర్మితమైన పార్టీ కాంగ్రెస్.. ఇది ప్రజల పార్టీ.. పార్టీ కోసం మనం కష్టపడితే ఫలితాలు దక్కుతాయి’అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహేశ్గౌడ్ మాట్లాడారు.ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ గెలవదని, ఏదైనా పోటీ ఉంటుందంటే అది బీజేపీతోనే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని, డీలిమిటేషన్ చేస్తే 140 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఏప్రిల్ చివరి లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ చైర్మన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, పల్లె శ్రీనివాస్గౌడ్, పోత్నక్ ప్రమోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీకనీకి వచ్చిండ్రా.. కార్యకర్తలపై ఎంపీ చామల ఫైర్భువనగిరి ఎంపీ చామల కాంగ్రెస్ పార్టీ కేడ ర్పై సీరియస్ అయ్యారు. సభలో ఎంపీ మా ట్లాడుతున్న సమయంలో కొందరు కార్యక ర్తలు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆగ్ర హించిన ఎంపీ ఏయ్ మాట్లాడకండయ్యా. మాట్లాడేది ఉంటే బయటకు పోయి మాట్లా డుకోండి.. ఇక్కడ సీరియస్గా మాట్లాడు తుంటే పీకనీకి వచ్చిండ్రా ఈడ అని అన్నా రు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. -
యాసంగి రైతులకు భరోసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు యాసంగి సీజన్లో ఆర్థిక ఊరట కల్పించే రైతు భరోసా పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు నిధులను విడుదల చేశారు. సోమవారం ప్రతి రైతుకు రూ.6 వేల సాయం (ఒక ఎకరానికి) అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 68,89,955 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తం 57.44 లక్షల ఎకరాలకు గాను రూ.3,446.94 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.రాష్ట్రంలో సాగు చేసే రైతులందరికీ ఎన్ని ఎకరాలున్నాయనే దానితో నిమిత్తం లేకుండా ఒక్క ఎకరం లోపు భూమికి మాత్రమే ఈ తొలి విడతలో సాయం జమ అవుతుంది. రెండు, మూడు విడతల్లో మిగతా భూమి ఎంత ఉంటే అంతకు రైతు భరోసా సాయం అందజేస్తారు. ఈ సీజన్లో రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో మొత్తం రూ.9 వేల కోట్లు 45 రోజుల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు ఉపయోగ పడేలా నిధులు అందడం వల్ల రైతులకు కొంత ఊరట లభించనుంది. -
పాడైతే... పడేయ్ బ్రో!
ఒకప్పుడు ఇళ్లలో ఏదైనా వస్తువు పాడైతే ప్రజలు దాన్ని మరమ్మతు చేయించుకొని తిరిగి ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఉపకరణాలను బాగు చేయించుకోవడం కంటే కొత్త వాటిని కొనడానికే నగరవాసులు మొగ్గు చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వినియోగదారుల ప్రవర్తన, మరమ్మతుల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించడానికి పర్యావరణ పరిశోధన, ప్రచార సంస్థ టాక్సిక్స్ లింక్ ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, నాగ్పూర్ రాంచీలలో సర్వే చేపట్టింది.‘స్టిచ్ ఇన్ టైమ్: ఎవాల్యుయేటింగ్ కన్జూమర్ బిహేవియర్ – ఎలక్ట్రానిక్స్ రిపేర్ యాక్సెసిబిలిటీ’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్లో రిపేరింగ్ కల్చర్ తగ్గిపోతోందని తేలింది. అన్ని ఆదాయ వర్గాల ప్రజల్లోనూ ఇదే ధోరణి ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. వేగవంతమైన వినియోగ సరళిని ప్రతిబింబిస్తూ ఢిల్లీ, హైదరాబాద్లలోని అన్ని ఆర్థిక వర్గాలలోనూ’ రీప్లేస్మెంట్ ట్రెండ్’ బలంగా కనిపిస్తోందని పేర్కొంది.ఓల్డ్ డివైజ్... పాడైతే డోంట్ యూజ్...స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల వంటి ఐటీ, టెలికం పరికరాల విషయంలో హైదరాబాద్లో గణ నీయమైన రీప్లేస్మెంట్ ట్రెండ్ కనిపించింది. పాతబడిన సాంకేతికత, మరమ్మతు ఖర్చుల కారణంగా రూ. లక్ష నుంచి ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న తక్కువ ఆదాయ వర్గాల్లో ఐటీ పరికరాల రీప్లేస్మెంట్ రేటు అత్యధికంగా 85.71 శాతం ఉంది. టోస్టర్లు, మిక్సర్లు, హెయిర్ స్ట్రెయిటనర్స్ వంటి చిన్న గృహోపకరణాలను 61.54 శాతం మారుస్తుండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్ల వంటి పెద్ద విద్యుత్ ఉపకరణాలను వాటి అధిక ధరల కారణంగా కొంత ఆల స్యంగా మారుస్తున్నారు.ఆదాయ స్థాయిలు పెరిగేకొద్దీ వస్తువుల మార్పిడి రేట్లు కూడా పెరుగుతున్నాయి. అధిక ఆదాయ వర్గాలు సౌకర్యానికి, సాంకేతిక ఉన్నతీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రూ. 20 లక్షలకుపైగా సంపాదించేవారు వస్తువుల మార్పిడికే పెద్దపీట వేస్తున్నారు. ఐటీ, టెలికం పరికరాలు, పెద్ద గృహోపకరణాల మార్పిడి రేటు ఆయా ఆదాయవర్గాల్లో 65 శాతంగా ఉంది.మరమ్మతుల సంస్కృతి తగ్గడానికి కారణాలివే..⇒ గృహోపకరణాలకు మరమ్మతులు చేయించడంలో విడిభాగాల లభ్యత ప్రధాన సమస్యగా ఉంది. ⇒ అధీకృతంకాని మరమ్మతు దుకాణాలు విడిభాగాల కోసం థర్డ్ పార్టీలపై ఆధారపడుతుండటంతో నగర వినియోగదారులు ఆయా దుకాణాలను అంతగా విశ్వసించట్లేదు. ⇒ అసలైన విడిభాగాల అధిక ధర, పరిమిత లభ్యత కారణంగా చాలా మరమ్మతు దుకాణాలు నాన్–ఒరిజినల్ విడిభాగాలపై ఆధారపడుతున్నాయి.⇒ సరైన శిక్షణలేని టెక్నీషియన్లు, పనిచేయని పరికరాల నుంచి విడిభాగాలను సేకరిస్తుండటం లేదా స్థానిక టోకు వ్యాపారులు అనధికారిక మార్కెట్ల నుంచి వాటిని కొనుగోలు చేయడం వల్ల కూడా నగరవాసులు మరమ్మతులవైపు ఆసక్తి చూపించట్లేదు.⇒ సాఫ్ట్వేర్ లాక్లు థర్డ్–పార్టీ మరమ్మతులను నిరుత్సాహపరిచే వారంటీలతో వస్తుండటం కూడా మరో కారణం.రిపేరింగ్ రంగానికి మంచి జరగాలంటే...⇒ అసలైన విడిభాగాలకు థర్డ్–పార్టీ మరమ్మతులపై ఆంక్షలను తొలగించాలి.⇒ సాంకేతిక నిపుణులకు ఆధునిక మరమ్మతు పద్ధతులను అందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.⇒ ప్రభుత్వ, ప్రైవేట్ మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.⇒ మరమ్మతులపై క్యాష్బ్యాక్ ఆఫర్లు లేదా పన్ను రాయితీలు ఇవ్వాలి.⇒ గడువుకు ముందే పరికరాలను మార్చే విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు గ్రీన్ ట్యాక్స్ విధించడం వంటి చర్యలు చేపట్టాలి.ఈ–వ్యర్థాలను తగ్గిస్తే ముడిపదార్థాల ఆదా..దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి 2010లో 34 బిలియన్ కేజీలు ఉండగా ప్రస్తుత పెరుగుదలనుబట్టి అది 2030 నాటికి 82 బిలియన్ కేజీలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. పరికరాలను మార్చడానికి బదులుగా మరమ్మతు చేయించడాన్ని ఎంపిక చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే శక్తిని, ముడి పదార్థాలను ఆదా చేస్తూనే పెరుగుతున్న ఈ–వ్యర్థాల సమస్యను తగ్గించవచ్చని నివేదిక సూచించింది. -
రియల్ ఎస్టేట్కు రిలీఫ్!
సాక్షి, హైదరాబాద్: టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో జారీ చేసిన ఉత్తర్వులతో ఫలితం కనిపించకపోవడంతో కీలక సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్–2012 నిబంధనలను కొంతమేర సరళీకరించింది. స్టేక్ హోల్డర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సాధారణ రియల్టర్లకు ఉపశమనం ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్రంజన్ జీఓ నంబరు 95 జారీ చేశారు. హైరైజ్ భవనమంటే...ఇక నుంచి 21 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తు గల భవనాలను మాత్రమే హైరైజ్ భవనాలుగా పరిగణిస్తారు. అయితే పారిశ్రామిక భవనాల్లోని చిమ్నీలు, కూలింగ్ టవర్లు, ఇతర భవనాల్లోని వాటర్ ట్యాంకులు, ఆర్కిటెక్చరల్ డిజైన్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు. ఇప్పటి వరకు 18 మీటర్ల ఎత్తు, అంతకంటే ఎక్కువ ఉంటే హైరైజ్గా పరిగణించేవారు. » 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో 18 మీటర్ల నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలను నిర్మించాలంటే టీడీఆర్ వినియోగించడం తప్పనిసరి. పార్కింగ్, ఇతరత్రా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. » హైరైజ్ భవనాల్లో టీడీఆర్ వినియోగంతో 10 శాతం వరకు సెట్బ్యాక్స్లో మినహాయింపు పొందొచ్చు. అయితే అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్బ్యాక్ తప్పనిసరి. నాన్–హైరైజ్ భవనాలకు కూడా కనీస సెట్బ్యాక్లు పాటిస్తూ టీడీఆర్ ద్వారా రాయితీ పొందొచ్చు. » మాస్టర్ ప్లాన్ రోడ్లలో మార్పులు చేసినా, తగ్గించినా, తొలగించినా, దరఖాస్తుదారులు అభివృద్ధి/కన్వర్షన్ చార్జీలు చెల్లించాలి. లేదా చార్జీలకు సమానమైన టీడీఆర్ను సమర్పించొచ్చు. టీడీఆర్ వినియోగంతో 2,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తులకు అనుమతి ఇస్తారు.40 అడుగుల రోడ్డు: 3 అదనపు అంతస్తుల వరకు60 అడుగుల రోడ్డు: 4 అదనపు అంతస్తుల వరకు80 అడుగుల రోడ్డు: 5 అదనపు అంతస్తుల వరకు » ఫైర్, ఎయిర్పోర్ట్ అథారిటీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు.గత జనవరిలో జారీ చేసిన జీఓకు చేసిన సవరణల మేరకు..10 నుంచి 20 అంతస్తుల లోపు హైరైజ్ భవనాల్లో 10 అంతస్తులపైన ఉన్న మొత్తం బిల్టప్ ఏరియాలో 3% టీడీఆర్ వినియోగం తప్పనిసరి. 20 అంతస్తులకు పైబడిన భవనాలకు 20 అంతస్తుల పైన ఉన్న ఏరియాలో 5% టీడీఆర్ తప్పనిసరి. నిర్మాణ అనుమతి సమయంలో 50% టీడీఆర్, మిగిలిన 50% టీడీఆర్ను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీకి ముందు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, గెజిట్లో ప్రచురించాలని పేర్కొన్నారు. » గత జనవరిలో జారీ చేసిన జీఓ మేరకు ‘క్యూర్’ పరిధిలో పది అంతస్తులు దాటిన హైరైజ్ భవనాల్లో 11వ అంతస్తు నుంచి అన్ని అంతస్తులకు బిల్టప్ ఏరియాలో 10 శాతం టీడీఆర్ తప్పనిసరి అని పేర్కొన్నారు. అనుమతి పొందే సమయంలోనే మొత్తం టీడీఆర్ ఇవాల్సి ఉంటుంది. ప్రస్తుత సవరణలతో అనుమతి సమయంలో 50 శాతం టీడీఆర్, భవన నిర్మాణం పూర్తయ్యాక ఓసీ జారీ సమయంలో మిగతా 50 శాతం టీడీఆర్ సమర్పిస్తే సరిపోతుంది. ఇది సాధారణ రియల్టర్లకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. -
పొంతన లేని సమాధానాలు!
మొయినాబాద్: ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. శంషాబాద్ పోలీస్స్టేషన్లో ఆరో రోజు ఆదివారం సిట్ విచారణ జరిగింది. స్టేషన్ బెయిల్ పొందిన వారిలో ఏడుగురు నిందితులు విచారణకు హాజరయ్యారు. వారిని వేర్వేరుగా విచారించారు. విచారణలో కొందరు నిందితులు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారిని పదేపదే విచారించి అసలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా డ్రగ్స్ సరఫరా, పెడ్లర్లపై దృష్టి సారించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతని తమ్ముడు రితేష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను కస్టడీకి తీసుకొని విచారిస్తే కీలక విషయాలు బయటకొస్తాయని.. కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు వెళ్తుందని పోలీసులు భావిస్తున్నారు.కస్టడీ పిటిషన్పై నేడు తీర్పుడ్రగ్స్ పార్టీ కేసులో ప్రధాన నిందితులు పైలెట్ రోహిత్రెడ్డి, రితేష్రెడ్డి, నమిత్శర్మ కస్టడీ పిటిషన్పై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. నిందితులను ఏడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు పిటిషన్ వేయడంతో కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు వరుస సెలవులు ఉండటంతో కస్టడీ పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది. -
టీపీసీసీ త్రిముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్ కుమార్గౌడ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ప్రకటించిన డీసీసీ కార్యవర్గాలతో సమావేశాలు నిర్వహించడమే ప్రధాన ఎజెండాగా సాగనున్న ఈ పర్యటనలో ఆయన త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రచారమే లక్ష్యంగా ఈ పర్యటనలు జరుగుతాయని తెలిపాయి. ఈ మేరకు ఆదివారం భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన బుధవారం మెదక్ వెళ్లను న్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ వెలువడనుంది. తొలి విడతలో 14 జిల్లాలురాష్ట్రంలోని 14 జిల్లాలకు ఇటీవల డీసీసీ కార్యవర్గాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా ఆ 14 జిల్లాల్లో పర్యటించాలని మహేశ్గౌడ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి డీసీసీలకు వివరిస్తారు. పార్టీ, ప్రభుత్వ ఆలోచనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీపై విశ్వాసం కలిగించేలా చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయను న్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతరాలు, అనుబంధ సంఘాల బలోపేతం తదితర అంశాలపై చర్చిస్తారని, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత సమన్వయ కమిటీ భేటీకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాగా, రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఇటీవల ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసేందుకు 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. కాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ కమిటీ భేటీ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, నామినేటెడ్ పదవులు, పార్టీ, అనుబంధ సంఘాల బలోపేతం తదితర అంశాలపై ఈ కమిటీ చర్చిస్తుందని, కమిటీ అభిప్రాయాలను ఏఐసీసీకి వెల్లడించి ఢిల్లీ పెద్దల అనుమతి మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని సమాచారం. -
రైతే రాజు కావాలి: సీఎం రేవంత్
సాక్షి, సిద్దిపేట: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతుభరోసా కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. తొలి విడత పెట్టుబడి సాయం కింద సీఎం నిధులు విడుదల చేశారు.ఆదివారం సెలవు కావడంతో సోమవారంఅన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఫ్యాక్టరీని రైతులకు అంకితమిచ్చారు. అలాగే రూ 475.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు మహోత్సవాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ‘రాష్ట్రంలో 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. అయితే రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందుకు అనుగుణంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తృణధాన్యాలు (మిల్లెట్స్), ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి. రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వ్యవసాయం చేయడం తెలుసు. చీడపీడలకు ఏ మందు వేయాలో కూడా తెలుసు..’ అని సీఎం చెప్పారు. అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలి ‘నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని 12,728 గ్రామాల్లోని రైతులంతా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా పంటలను ఎగుమతి చేసే దిశగా కృషి చేస్తోంది. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. గతంలో 114 నెలల్లో కేసీఆర్ సగటున ఒక్కో నెలకు రూ2,535 కోట్లు ఖర్చు చేస్తే 28 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున నెలకు రూ 5,,500 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. తాజాగా రైతు భరోసా తొలి విడత విడుదల చేశాం. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తాం. యూరియా కొరత వచ్చేలా ఉంది.. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉంది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా, ప్రధాని మోదీని కలిసి మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా తెచ్చుకునేందుకు బీజేపీ ఎంపీలు సహకరించాలి. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాం. 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబానికి చెందిన వారినే ఎమ్మెల్యేను చేశారు. మార్చి చూడండి మంచి జరుగుతుంది. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్లకు అప్పగిస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నియోజకవర్గమనే వివక్ష ఉండదు.. ‘ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపను. ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గత పాలకులు ఈ విధంగా విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. కానీ నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో రాజకీయాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పని చేస్తాం. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్పామ్ ఫ్యాక్టరీని కొడంగల్కే తీసుకెళ్లేవాడిని. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ కూడా పాల్గొని తన నియోజక వర్గం పరిధిలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారు..’ అని రేవంత్ చెప్పారు. ‘ప్రైవేట్ పాఠశాలల మోజులకు పోకండి.. ఆర్థికంగా నష్టపోకండి.. ప్రైవేట్ పాఠశాల కంటే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తున్నాం. అందుకే ఆ శాఖ నాదగ్గరే ఉంచుకున్నా..’ అని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందమే లక్ష్యం: మంత్రి తుమ్మల సిద్దిపేటజోన్/నంగునూరు(సిద్దిపేట): రైతు సంక్షేమ ప«థకాలను అమలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్పామ్ సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని, అవసరమైతే ప్రత్యేకంగా నిధుల మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ప్రకృతి పరంగా రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించని ఆయిల్పామ్ సాగుతో బోలెడు ఆదాయం పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా ఉందని, పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీనీ కచి్చతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతిగా దూరదృష్టితో పని చేస్తున్నారన్నారు. -
భార్యను హత్య చేసి.. బైక్పై తీసుకొచ్చి..
షాద్నగర్ రూరల్: కట్టుకున్న భార్యను అంతమొందించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బైక్పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసివెళ్లాడు. అంతేకాక రెండేళ్ల తమ కూతురును తల్లి మృతదేహం వద్ద వదిలివెళ్లాడు. రంగారెడ్డి జిల్లా దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి పదేళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి మహేందర్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శోభారాణి కోయిలకొండకే చెందిన నర్సింహులును రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కూతురు మమత ఉంది. మహేందర్ కూడా తల్లితోపాటే ఉంటున్నాడు. కాగా, నర్సింహులు తాగుడుకు బానిస కావడంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శోభారాణి ఆరునెలల క్రితం కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. సైకిల్ కొనిస్తానని చెప్పి.. భార్యతో మాట్లాడేందుకు నర్సింహులు రెండు రోజుల క్రితం రంగారెడ్డిగూడకు వచ్చాడు. శనివారం కుమారుడు మహేందర్కు సైకిల్ కొనిద్దామని చెప్పి శోభారాణిని మహబూబ్నగర్కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో నర్సింహులు భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కూతురు మమతను బైక్పై ముందు కూర్చోబెట్టుకొని, భార్య మృతదేహాన్ని వెనకాల కట్టేసి, రంగారెడ్డిగూడ శివారులోకి తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేశాడు. కూతురును అక్కడే వదిలేసి పరారయ్యాడు.కాగా తల్లి హత్యకు గురైందని తెలియని ఆ చిన్నారి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తుండగా, ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
పప్పుధాన్యాలు తగ్గుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగం కొన్నేళ్లుగా స్థిరమైన పురోగతిని నమోదు చేస్తున్నప్పటికీ, పంటల వైవిధ్యంలో వెనుకబడిపోతోంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉన్నప్పటికీ.. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ మినహా ఇతర పంటల సాగులో వెనుకబడిపోతున్నట్లు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గత మూడేళ్లలో వివిధ పంటల సాగు తీరుతెన్నులను ఈ సర్వే కళ్లకు కట్టింది. పంటల మార్పిడి విషయంలో రైతులు మేల్కొనకపోతే రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు కనుమరుగయ్యే పరిస్థితి రానుంది. 2023–24లో 207.95 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 2024–25 కల్లా 232.10 లక్షల టన్నులకు పెరిగింది. 2025–26 నాటికి ఇది 236.87 లక్షల టన్నులకు చేరుకుంది. దీంతో రాష్ట్రంలో పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగా చెబుతున్నా, రైతుల ఆలోచనలో మార్పు రావడం లేదు. ఇతర పంటలకు కోతులు, అడవి పందుల బెడద ఉండటం, దిగుబడిపై ఉన్న అనుమానాలను వ్యవసాయ అధికారులు నివృత్తి చేయకపోవడంతో రైతులు కొంతకాలంగా అలవాటైన పత్తి, వరి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో రైతుల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఇతర పంటలు సాగు చేసే రైతులకు బోనస్ ఇవ్వాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్లో పంటల బోనస్ కోసం రూ. 3,500 కోట్లు కేటాయించింది. ఇప్పుడు సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ను పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలకూ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఇదే విషయాన్ని నర్మెటలో ఆదివారం జరిగిన సభలో రేవంత్రెడ్డి చెబుతూ, పంటల వైవిధ్యం పెంచడానికి ఏంచేయాలనే అంశంపై నిర్ణయానికి రావాలని మంత్రి తుమ్మలకు సూచించారు. పప్పుధాన్యాల్లో తగ్గిన స్థిరత్వం రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్థిరత్వం తగ్గింది. హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2023–24లో 3.61 లక్షల టన్నులుగా ఉన్న పప్పు ధాన్యాల ఉత్పత్తి 2024–25లో 3.99 లక్షల టన్నులకు పెరిగినప్పటికీ, 2025–26లో ఇది 3.48 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉందని అంచనా. పెసర, కంది, శనగలు, మినుముల ఉత్పత్తి పడిపోతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి లభ్యత పెరగడంతో గతంలో పప్పుధాన్యాలు సాగు చేసిన భూముల్లోనూ వరి, పత్తికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించే విధానాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి స్థిరత్వం–మార్పు రాష్ట్రంలో పంటల ఎంపికలో స్థిరత్వం, మార్పు అనే రెండు ధోరణులను ఒకేసారి చూపిస్తోంది. ముఖ్యంగా వానాకాలం, యాసంగి సీజన్లలో వరి ఆధిపత్యం కొనసాగుతుండగా, మొక్కజొన్న వంటి పంటలు క్రమంగా విస్తరిస్తున్నాయి. సోయాబీన్, కందిపప్పు వంటి పంటలు తగ్గుదల చూపుతున్నాయి. యాసంగిలో జొన్న కొంత పెరుగుదల చూపుతుండగా, శనగ, వేరుశనగ తగ్గుతూ ఉన్నాయి. మొక్కజొన్న పంట 9.8 శాతం నుంచి 13 శాతం వరకు పెరగడం రైతుల్లో మార్పు సంకేతంగా కనిపిస్తోంది. -
25న రాజీనామా చేస్తున్నా..
జగిత్యాల టౌన్: పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను అవమానాలు భరించలేకే కాంగ్రెస్ను వీడాలని నిర్ణయం తీసుకున్నానని, ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దశాబ్దాల పోరాట ఫలితాన్ని ఎవరో కాజేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానని సీనియర్ నేత భావోద్వేగానికి గురయ్యారు. సంయమనం పాటించాలని మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారని, అయితే సంయమనంతో ఎలాంటి ఉపయోగమూ లేదని భావించి రాజీనామాకు సిద్ధపడ్డానని తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్రెడ్డి కూడా ఒక కారణమన్నారు. నాకు మంత్రి అయ్యే అర్హత లేదా?రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి ఏకైక సభ్యుడిగా తానూ అంతేస్థాయిలో పోరాటం చేశానని జీవన్రెడ్డి చెప్పారు. వారిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి పొందినప్పుడు తనకు మంత్రి పదవి ఆశించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అయ్యే అర్హత లేదా..? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చే నాటికి మండలి సభ్యుడిగా తనకు 20 నెలల కాలం మిగిలి ఉందని గుర్తు చేశారు. నేను ఒక్కసారి చెబితే..!జీవన్రెడ్డి, రజినీకాంత్తో పోస్టర్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలసిన ఒక పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అందులో ఒకవైపు జీవన్రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్స్టార్ జీవన్రెడ్డి’ అని ఉండటం హాట్టాపిక్గా మారింది. జీవన్రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మాది పీపుల్స్ బడ్జెట్
ఖమ్మం మయూరి సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో పొందుపరిచినవి కేవలం అంకెలు కావని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక నమ్మకమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమది పీపుల్స్ బడ్జెట్ అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో పుట్టడం మా అదృష్టం’అని ప్రతి పౌరుడూ గర్వపడేలా తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. కులమతాలు, ప్రాంతాల భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశామని.. జీవిత బీమా పథకం కింద రూ. 5 లక్షలు చెల్లిస్తామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు క్యాలెండర్ను ఏర్పాటు చేశామని.. నిర్మాణ దశను బట్టి వారానికోసారి బిల్లు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది అదనంగా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మరో లక్ష ఇళ్లను మంజూరు చేయాలని యోచిస్తున్నామని భట్టి చెప్పారు. విద్యార్థులే రేపటి సంపద.. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మే తమ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు పౌష్టికాహారం అందిస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు వారంలో రెండు రోజులు పాలు, రెండు రోజులు రాగి జావ అందిస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట.. రాష్ట్రంలో 68,89,955 మంది పట్టాదారులకు రైతుభరోసా కింద రూ. 3,446.94 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాబోయే 45 రోజుల్లో మూడు విడతల్లో ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయని స్పష్టం చేశారు. సన్నధాన్యం సాగు చేసిన రైతులకు రెండు సీజన్లలో కలిపి బోనస్ అందించామన్నారు. ఈ సందర్భంగా తాజా బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల గురించి భట్టి వివరించారు. సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
సాయమింతేనా ‘సఖి’!
సాక్షి, హైదరాబాద్: మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ–సఖి)ల పర్యవేక్షణ గాడి తప్పింది. ఈ కేంద్రాల్లో నమోదయ్యే కేసుల సంఖ్యను క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సమర్పిస్తున్నప్పటికీ వాటి విశ్లేషణ, సేవల విస్తరణపై అధికారులు దృష్టి పెట్టడంలేదు. కేసుల పరిష్కార చర్యల్లో భాగంగా సఖి కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే అందుకు తగిన న్యాయసహాయంతోపాటు వారి సమస్యలను ఆలకించే పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా సఖి కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి కేంద్రంలో 13 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా చాలాచోట్ల కేస్ వర్కర్, కౌన్సిలర్, లీగల్ అడ్వైజర్లు లేరు. దీంతో బాధితులకు న్యాయ సహాయం అందడం కష్టంగా మారింది. సఖి కేంద్రాల్లో ఖాళీల వివరాలను కేంద్రాలవారీగా సేకరించినప్పటికీ వాటి భర్తీకి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేయడంలేదు. దీనిపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లోని జాయింట్ డైరెక్టర్ను సంప్రదించగా ఆమె స్పందించలేదు. నాలుగు రెట్లు పెరిగిన లైంగిక వేధింపులు.. రాష్ట్రంలో చిన్నారులపై లైంగిక దాడులు మొదలు మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింస పెరుగుతున్నాయి. రెండేళ్లుగా సఖి కేంద్రాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. సఖి కేంద్రాలను ఆశ్రయిస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది లైంగిక వేధింపులకు గురైన వారే ఉంటున్నారు. 2024–25లో లైంగిక దాడులు, వేధింపులకు గురైనవారు 55 మంది సఖి కేంద్రాలకు వస్తే 2025–26లో జనవరి నాటికే 243 మంది ఆశ్రయించారు. మరోవైపు ఇదే కాలానికి అత్యాచార బాధితుల సంఖ్య 64 నుంచి 74కు (15.6 శాతం) పెరిగింది. అలాగే చిన్నారులపై లైంగిక దాడుల కేసులు 2024–25లో మొత్తం 553 కేసులు నమోదవగా 2025–26 జనవరి నాటికి వాటి సంఖ్య 613కు పెరిగింది. మునుపటి ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 10.8 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బాల్య వివాహ కేసులు 348 నమోదవగా ఈసారి ఆ సంఖ్య 382కు పెరిగింది. ఈ కేసుల నమోదు గతేడాదితో పోలిస్తే 9.8 శాతం పెరిగినట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరకట్న వేధింపులు, తద్వారా జరిగిన మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఈ విభాగంలో 2024–25లో 473 కేసులు నమోదైతే 2025–26 జనవరి నాటికి ఈ కేసుల సంఖ్య 594కు పెరిగింది. మునుపటి ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 25.6 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.గృహహింస కేటగిరీలో కేసుల సంఖ్య ఒకే విధంగా ఉంది. గతేడాది 6,907 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నాటికి 6,173 కేసులు నమోదయ్యాయి. అయితే మహిళల అక్రమ రవాణా కేసులు కాస్త తగ్గగా మిస్సింగ్, కిడ్నాప్ కేసులు గతంలో నమోదైన తరహాలోనే ఉన్నాయి. సైబర్ క్రైం, చీటింగ్, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసులు కూడా పెద్దగా పెరగలేదు. -
‘సిద్ధిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించండి’
నర్మెట్ట: సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ పర్యటనలో భాగంగా ఆయిల్ఫామ్ ప్యాక్టరీని ప్రారంభించారు. ఈ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను జమ చేశాం. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్గా ఇస్తాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం. 2029లో సిద్ధిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా. 1984 నుంచి 2029 వరకూ ఇక్కడ ఒకే కుటుంబం అధికారంలో ఉంది. 2029 మళ్లీ వస్తాం.. సిద్ధిపేటలో మళ్లీ సమావేశం పెడతాం. కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. అభివృద్ధికి అడ్డుపడతామంటే ఎలా?, చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తెలుసు. అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.సీఎం రేవంత్ కామెంట్స్.. ‘రైతు భరోసాకి 3600 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాము. రేపు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. మరో 45 రోజుల్లో రైతు భరోసా అందరికి వస్తుంది. ఉగాది రోజున ఇందిరమ్మ చీర ఇస్తే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకు కృతజ్ఞతలు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న నానుడి నిజం. అందుకే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. 114 నెలలు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. రైతుల కోసం రూ. 2533 కోట్లు ప్రతి నెల కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 28 నెలల్లో ప్రతి నెల రూ. 5500 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. తుపాన్కి కామారెడ్డి ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతుకి పంట నష్టం జరిగితే ఎకరానికి 10 వేల పరిహారం ఇచ్చాము. ఈ 28 నెలల్లో రైతుల కోసం లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని అన్నారు.సీఎం రేవంత్ పర్యటనపై బీఆర్ఎస్వీ నిరసనసీఎం రేవంత్ నర్మెట్ట పర్యటనపై బీఆర్ఎస్వీ(బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం) నిరసన వ్యక్తం చేసింది. ఫ్లకార్డులు ప్రదర్శించి సిద్ధిపేట అభివృద్ధి ఏది అంటూ నిరసన తెలిసింది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అంటూ ఫ్లకార్డులను బీఆర్ఎస్వీ ప్రదర్శించింది. సిద్ధిపేట నియోజకవర్గానికి నిధులేవి అని ప్రశ్నించింది. సిద్ధిపేట అభివృద్ధిపై వివక్ష అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. -
రాజీనామాపై జీవన్రెడ్డి క్లారిటీ.. చేరేది ఆ పార్టీలోకే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: రాజీనామాపై మాజీ మంత్రి జీవన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఇక కాంగ్రెస్లో కొనసాగలేనని.. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో రాజీనామాను ప్రకటించిన జీవన్రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించారు. పార్టీని వీడడానికి గల కారణాలపై కూడా జీవన్రెడ్డి లేఖ విడుదల చేశారు.కాంగ్రెస్లో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానన్న జీవన్రెడ్డి.. 40 ఏళ్ల బంధానికి స్వస్తి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా తనతో పాటు ప్రయాణం చేస్తున్న తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 25న సమావేశంలో చర్చించేందుకు కలుద్దామన్న జీవన్రెడ్డి.. గత 20 మాసాలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు మీరంతా గమనించారన్నారు.ఇదిలా ఉండగా, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ బుజ్జగింపులు ఫలించలేదు. శనివారం జగిత్యాలలోని జీవన్రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆ యనతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈనెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్రెడ్డి నుంచి మొదట నుంచి బలమైన సంకేతాలు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలు ఇప్పటికే జీవన్రెడ్డితో ఫోన్లో మాట్లాడగా, రెండురోజుల క్రితం పీసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్రెడ్డి ఇంటికి వచ్చి చర్చించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాజాగా మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు రంగంలోకి దిగారు. ఆయన ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. అయినా కూడా జీవన్రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. -
‘పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదు’
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్కు తాము వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. అయితే మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే ఉంటుందని విమర్శించారు. లక్షన్నర కోట్ల రూపాయిలతో కేసీఆర్ కాళేశ్వరం అంటే,.. ఇప్పుడు రేవంత్ మూసేశ్వరం అంటున్నారని సెటైర్లు వేశారు.ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో మూసీ పునరుజ్జీవం-వాస్తవాలు అంశంపై రాంచందర్ రావు అధ్యక్షతను చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకే నిధులు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మరి మూసీ ప్రక్షాళనకు ినిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అని ప్రశ్నించారు. -
బంజారాహిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. ఇవాళ ఉదయం వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్న సీఎం రమేష్ హడావుడి చేశారు.2006లో శివనారాయణ అనే వ్యక్తి.. సర్వే నెంబర్ 129/1లో ప్లాట్ నంబర్లు 29,30ల్లో భూమి కొనుగోలు చేశారు. ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో సీఎం రమేష్ కబ్జాకు యత్నించినట్లు సమాచారు. తన భూమిని సీఎం రమేష్ కబ్జాకు యత్నించారని శివనారాయణ ఆరోపిస్తున్నారు. మా భూమిలోకి ఎవరూ రావొద్దని ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. 2006 నుంచి సీఎం రమేష్ ఇబ్బందిపెడుతున్నారు’’ అని శివనారాయణరెడ్డి తెలిపారు. చివరికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పంచాయతీ చేరింది. -
ఒక్కో పని కోసం ఒక్కో మండలం... ఇదే సింగరాయపల్లి దుస్థితి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాలనా సౌలభ్యం ఏమో గానీ ఆ ఊరి ప్రజలు మూడు మండలాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సిందే. అవును.. మీరు చదువుతున్నది నిజమే ! ప్రస్తుతం పాల్వంచ మండలంలోకి మారిన ‘సింగరాయపల్లి’ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. తాలూకా వ్యవస్థను తొ లగించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన సమయంలో మాచారెడ్డి మండలం పరిధిలో సింగరాయ పల్లి గ్రామాన్ని చేర్చారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మాచారెడ్డి మండలంలో కొనసాగింది. 2016లో కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలు ఏర్పాటు చేసే క్రమంలో సింగరాయపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన రామారెడ్డి మండలంలోకి చేర్చారు. దీంతో గ్రామస్తులు తమ పనుల కోసం రామారెడ్డి మండలానికి వెళ్లి వచ్చేవారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాచారెడ్డి మండలంలోని పాల్వంచ కేంద్రంగా కొత్తగా మరో మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ప్రజల విన్నపం మేరకు అప్పటి ప్రభుత్వం పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సింగరాయపల్లిని పాల్వంచ మండలానికి మార్చారు. మాచారెడ్డి నుంచి రామారెడ్డికి, రామారెడ్డి నుంచి పాల్వంచ మండలానికి మారింది. గ్రామస్తులకు పాల్వంచ గ్రామం కొంత అనుకూలంగా ఉంటుందని భావించారు. అయితే మూడు మండలాలతో ఉన్న లింకు ఇబ్బందికరంగా మారింది. రామారెడ్డి పోలీస్ స్టేషన్ సింగరాయిపల్లి ఇప్పటికీ రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది. దీంతో కేసుల విషయంలో గ్రామస్తులు రామారెడ్డికి వెళ్లాల్సిందే. గ్రామంలో ఏ ఘటన జరిగినా రామారెడ్డి పోలీసులు రావాల్సిందే. కొత్త మండలంగా ఏర్పాటైన పాల్వంచకు పోలీస్ స్టేషన్ మంజూరు కాలేదు. దీంతో పోలీసు సేవలు రామారెడ్డి నుంచే అందుతున్నాయి. మాచారెడ్డి సొసైటీ ‘సహకార’ సేవల కోసం సింగరాయపల్లి గ్రామస్తులు మాచారెడ్డికి వెళ్లాల్సిందే. పాల్వంచలో సొసైటీ ఏర్పాటు కాలేదు. సహకార బ్యాంకు శాఖ కూడా రాలేదు. దీంతో రుణాలు, పంటలకు అవసరమైన ఎరువుల కోసం మాచారెడ్డికి వెళ్లాల్సిందే. ఏ పని మీద వెళ్లినా రోజంతా అటే గడిచిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల సేవలు పాల్వంచ మండలంలో అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాల్వంచలో తహసీల్ సేవలు పాల్వంచ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేస్తూ 2023 ఏప్రిల్ 18న జీవో విడుదలైంది. మే నెలలో తహసీల్ కార్యాలయం ఏర్పాటైంది. రామారెడ్డి మండలంలో కొనసాగిన సింగరాయపల్లి గ్రామాన్ని పాల్వంచ మండలానికి మార్చారు. తొలుత తహసీల్ కార్యాలయం ఒక్కటే ఏర్పాటైంది. గతేడాది జనవరి 28న మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సింగరాయపల్లి గ్రామస్తులు మండల పరిషత్ పనుల కోసం పా ల్వంచకు వెళ్తున్నారు. అయితే ప్రజాపాలనలో వివిధ పనులకు ఇప్పటికీ రామారెడ్డి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. పూర్తి స్థాయిలో మండల పరిషత్ సేవలను పా ల్వంచ మండలానికి ఇవ్వాలి. మూడు మండలాలు తిరగాల్సి వస్తోంది మా ఊరికి మూడు మండలాలతో లింకు ఉండడంతో చుట్టూ తిరగాల్సి వస్తోంది. అప్పట్లో అన్ని పనులకు రామారెడ్డికి వెళ్లేవాళ్లం. తరువాత పాల్వంచ మండలం అయ్యింది. దగ్గరైందన్న సంతోషం ఉన్నా, పనుల కోసం రామారెడ్డికి, మాచారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. – సొంటెం సాయిలు, గ్రామస్తుడురికార్డులను పాల్వంచకు మార్చాలిపాల్వంచలో మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటైనా ప్రజాపాలనకు సంబంధించిన పనుల కోసం రామారెడ్డి ఆఫీసుకు వెళ్లమంటున్నారు. మాకేమీ అర్థం కావడం లేదు. అన్ని రికార్డులను పాల్వంచకు మారిస్తే ఇబ్బంది పోతుంది. – కెంగర్ల భిక్షపతి, గ్రామస్తుడుమా ఇబ్బందులు తీర్చాలి ఎరువుల బస్తాల కోసం మాచారెడ్డి సొసైటీకి వెళ్లాల్సి వస్తోంది. కో ఆపరేటివ్ బ్యాంకు కోసం కూడా మాచారెడ్డికి వెళ్లాలి. పోలీసు స్టేషన్కు రామారెడ్డికి, మండలాఫీసుకు పాల్వంచకు వెళ్లాలి. మా ఇబ్బందులను గుర్తించి వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలి. – అన్నబోయిన శ్రీనివాస్, గ్రామస్తుడు -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)
-
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. భర్త హరిబాబు ఆరోగ్యం విషమం?
సాక్షి,జగిత్యాల: కోరుట్లలో సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైష్ణవి హత్యకేసులో రిమాండ్ ఖైదీ, ఆమె భర్త హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్న హరిబాబు పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు అతన్ని అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
గంపజాతర: గ్రామాన్ని కాపాడే విశ్వాస సంప్రదాయం
మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు.ఉదయం వెళ్లి.. సాయంత్రం రాక ప్రతి సంవత్సరం గంప జాతర పేరుతో గ్రామాన్ని వదిలి చెట్లకింద గడిపి పొద్దు పోయాక ఇళ్లకు చేరుకుంటే అంటురోగాలు, దారిద్య్రం దరిచేరవని ప్రజల నమ్మకం. గంప జాతర కార్యక్రమాన్ని ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. నిర్ణయించిన ప్రకారం ఆ రోజు తెల్లవారుజామునే లేచి వంటపాత్రలు గంపలో పెట్టుకొని గ్రామంలో ఎవరూ ఉండకుండా ఇళ్లకు తాళం వేసి వెళ్తారు. కాలకృత్యాలు సైతం ఊరు బయటనే తీర్చుకుంటారు. తిరిగి సాయంత్రం ఇళ్లకు వచ్చి శుద్ధి చేసుకుని దీపాలు వెలిగిస్తారు. ఆ రోజు ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని తీర్మానిస్తారు.ఆ తర్వాతే పొలం పనులు.. గ్రామాల్లో ఆచారంగా వస్తున్న గంపజాతర కార్యక్రమం నిర్వహించిన తర్వాతనే పొలం పనులు మొదలుపెడతారు. వర్షాలు కురువక ముందే గంపజాతర జరుపుకొంటారు. గంపజాతర నిర్వహించిన తర్వాత పంటలు వేసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటారు. వర్షాలు కురిసిన వెంటనే పంటలు వేసుకుంటారు.గతంలో వర్షాల కోసం.. మూడు నాలుగు దళాబ్దాల క్రితం వరకు గంపజాతరను అన్ని గ్రామాల్లో జరుపుకొనేవారని పెద్దలు చెబుతారు. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామాల్లో గంపజాతర నిర్వహించేవారని పేర్కొంటున్నారు. ఉదయం తెల్లవారక ముందే లేచి ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలేవారని, కాకపోతే చెట్ల కిందకు కాకుండా అడవిలోకి వెళ్లి ప్రకృతిని పూజించే వారని చెబుతున్నారు. గట్టిగా ఏడ్వడం, బాధ పడటం వంటివి చేసేవారని, తినడానికి మంచి ఆహారం కాకుండా చింతపండు, ఉప్పు, కారం వంటివి తీసుకెళ్లేవారన్నారు. రోజంతా అడవిలో బాధపడుతూ వర్షాలు కురవాలని ప్రకృతిని పూజించి సాయంత్రం ఇళ్లకు చేరుకునే వారని చెబుతున్నారు.క్రమంగా ఆచారంలో మార్పులు గతంలో ఉన్న గంపజాతర నిర్వహణ ఆచారాల్లో మానవ అభివృద్ధి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇళ్లను వదిలి గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం, ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని అంటున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగడం, పిల్లాపాపలు, మిత్రులు, కుంటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. జడ్చర్ల మండలం గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాల్లో గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జడ్చర్లతో పాటు కోయిలకొండ, మద్దూరు, దేవరకద్ర, కోస్గి, కొడంగల్, తాండూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తమ ఇంటి దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటంతో పాటు వారు పండించిన పంటలను గంపలో పెట్టుకొని పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే దాసంగాలు పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు.ప్రతిఏటా నిర్వహిస్తాం.. గంపజాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకరోజు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే కొన్నిరకాల రోగాలు దరిచేరవనే నమ్మకం అందరిలో ఉంది. అంతేకాకుండా గంపజాతర నిర్వహిస్తూ చెట్ల కింద ఆనందంగా గడపడానికి కూడా ప్రజలు దీన్ని నిర్వహిస్తున్నారు. – శిర్ప రవి, వేపూరు గ్రామం, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లా గ్రామస్తుల ఇష్టం మేరకే.. గ్రామస్తుల ఇష్టం మేరకే గంపజాతర నిర్వహించేందుకు అందరం కలిసి నిర్ణయిస్తాం. ప్రతి సంవత్సరం ఆచారంగా వస్తోంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం గ్రామంలో ప్రజలందరూ గంపజాతరకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నారు. – శ్రీదేవి, మాజీ సర్పంచ్, షేక్పల్లి, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లావిపత్కర పరిస్థితులు రావు.. గ్రామంలో గంపజాతర నిర్వహిస్తే అనుకోని విపత్కర పరిస్థితులు ప్రజలకు రావని, దారిద్య్రం, అంటురోగాలు రావని ప్రతి సంవత్సరం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం నిర్వహిస్తారు. గంపజాతర నిర్వహించడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్ముతాం. గంపజాతర నిర్వహించకపోతే గ్రామంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. – శ్రీకాంత్, నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లా -
పిల్లి కోసం ప్రాణం తీసుకున్న ఎంబీబీఎస్ విద్యార్థిని
సాక్షి,హైదరాబాద్: పిల్లిని దత్తత తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఓ యువ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.పోలీసుల వివరాల మేరకు.. నగరంలో అల్వాల్ ప్రాంతంలో రిసాలా బజార్ పరిధిలోని శివ్మన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ అలియాస్ శ్రేష్ట (23) నివసిస్తున్నారు.శ్రేష్ట ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.మరో వైపు సొంతంగా ఆస్పత్రి ప్రారంభించి రోగులకు వైద్యం అందించేందుకు అవసరమైన లైసెన్స్ కోసం ప్రయత్నిస్తోంది.ఇటీవల శ్రేష్ట ఓ పిల్లిని దత్తత తీసుకుంది. దాని బాగోగులు చూసుకుంటుంది. అయితే, పిల్లి పెంపకం ప్రారంభించిన నాటి నుంచి శ్రేష్టకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఆందోళనకు గురైన ఆమె తల్లి కుసుమలత,నాయినమ్మ పిల్లిని పెంచడం ఆపేయాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో శ్రేష్ట మనస్థాపానికి గురైంది.ఈ నేపథ్యంలో తల్లి,నాయినమ్మ పనినిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందింది.స్థానికుల సహాయంతో శ్రేష్టను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే యువతి మరణించినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రేష్ట మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
తెలంగాణ బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేస్తూ టీడీఆర్ (Transferable Development Rights) వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి.తెలంగాణలో నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ - 2012'కు కీలక సవరణలు చేస్తూ G.O.Ms.No.95ను విడుదల చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ పేరుతో వెలువడిన ఈ జీవోలో టీడీఆర్ వినియోగం, హై-రైజ్ భవనాల గుర్తింపు, సెట్బ్యాక్ సడలింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.కొత్త ఆదేశాలు ఇలా.. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై-రైజ్గా గుర్తింపు( పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ రూములు, వాటర్ ట్యాంకులు, ఇతర నిర్మాణ ఫీచర్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు).750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో TDR ద్వారా ఎత్తు పెంపు అనుమతి.నాన్ హై-రైజ్ భవనాలకు సెట్బ్యాక్ సడలింపు అవకాశం.హై-రైజ్ భవనాల్లో 10% వరకు సెట్బ్యాక్ రిలాక్సేషన్కు అనుమతి.మాస్టర్ ప్లాన్ రోడ్లు మారితే TDR లేదా ఛార్జీలు చెల్లించే ఎంపిక.2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతి.40 ఫీట్ల రోడ్డుపై 3 అంతస్తులు అదనంగా నిర్మాణం.60 ఫీట్ల రోడ్డుపై 4 అంతస్తులు అదనంగా అనుమతి80 ఫీట్ల రోడ్డుపై 5 అంతస్తులు వరకు అవకాశం.10 నుంచి 20 అంతస్తుల హై-రైజ్లో 3% TDR తప్పనిసరి20 అంతస్తులపై భవనాలకు 5% TDR తప్పనిసరిబిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50% TDR సమర్పణOC (Occupancy Certificate) ముందు మిగతా 50% సమర్పణ తప్పనిసరి -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఈనెల 25వ తేదీన తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ తర్వాత ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. కాగా, ఈసారి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయనతో మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ఇక, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. -
ఒక్కసారి నా కూతురితో మాట్లాడించండి సార్..!
పెద్దపల్లి జిల్లా: ప్రేమ పేరుతో ఒక యువకుడు తమ కూతురిని వివాహం చేసుకున్నాడని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదని ధర్మారానికి చెందిన కుంటయ్య కుటుంబ సభ్యులు శనివారం పురుగుల మందు డబ్బా పట్టుకుని పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితులు, పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన కుంటయ్య కూతురును జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గొడిసెల పేటకు చెందిన యువకుడు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో తన కూతురుతో ఒకసారి మాట్లాడాలని తండ్రి కుంటయ్య, తల్లితోపాటు సోదురుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే యువకుడి తల్లిదండ్రులను పిలిపించి యువతీకువకులను ఠాణాకు తీసుకురావాలని ఆదేశించారు. తర్వాత యువకుడి తల్లిదండ్రులను వారి ఇంటికి పంపించారు. ఆగ్రహానికి గురైన యువతి కుటుంబసభ్యులు.. వారిని ఎందుకు పంపించారని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో యువతీయువకులను ఠాణాలకు పిలిపిస్తామని చెప్పి కుంటయ్య కుటుంబసభ్యులను ఇంటికి పంపించారు. పోలీసులు యువకుడి తల్లిదండ్రులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ కుంటయ్య కుటుంబ సభ్యులు పురుగులమందు డబ్బా పట్టుకుని మళ్లీ పోలీస్స్టేషన్కు వచ్చారు. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అప్రమత్తమైన పోలీసులు.. పురుగులమందు డబ్బా స్వా«దీనం చేసుకుని వారిని బయటకు పంపించారు. గ్రామంలోకి వెళ్లిన కుంటయ్య.. మరో పురుగుల మందు డబ్బాతో మళ్లీ ఠాణా వద్దకు చేరుకున్నాడు. డబ్బా మూత తీసి పురుగుల మందు తాగేందుకు యతి్నంచాడు. అక్కడే ఉన్న స్థానికులు డబ్బాను లాక్కున్నారు. ఆవేదనకు గురైన కుంటయ్య కుటుంబసభ్యులు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో రద్దీ పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని యువతి కుటుంబసభ్యులను పోలీస్స్టేషన్లోకి తీసుకెళ్లారు. అదేసమయంలో ఠాణాకు వచి్చన ఎస్సై ప్రవీణ్కుమార్.. కుంటయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెళ్లి చేసుకున్న యువతీయుకులను ఆదివారం రప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుంటయ్య, కుటుంబసభ్యులు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఎస్సైని సంప్రదించగా.. వివాహం చేసుకున్న యువతీయువకులిద్దరి సర్టిఫికెట్లు పరిశీలించామని, పుట్టిన తేదీప్రకారం వారు మేజర్లు కావడంతో చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. అయినా.. వారిద్దరినీ పిలిపించే ప్రయత్నం చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
నా భార్య పక్కనే నా అంత్యక్రియలు చేయండి
కరీంనగర్ జిల్లా: అతనో ఎస్సై.. అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితం. ఈ నెల 17న కడుపునొప్పి బాధ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. తట్టుకోలేని ఎస్సై సైతం నీవెంటే నేనంటూ.. శనివారం అత్తగారింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు అనాథలు కాగా.. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లికి చెందిన దేసు చంద్రశేఖర్(36) ప్రస్తుతం కరీంనగర్ టూటౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన దివ్య(30)తో 2016లో వివాహమైంది. నగరంలోని హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శుభమన్యు(4) అశ్వద్ధామ(7) ఉన్నారు.దివ్య ఆత్మహత్యతో...అన్యోన్యంగా సాగుతున్న వారి జీవన ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దివ్య కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 17వ తేదీన గన్నేరుపువ్వు, ఆకు పసరు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివ్య పుట్టినిల్లు అయిన ఇల్లదంకుంట మండలం సీతంపేటకు తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియల సమయంలో దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణం అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో దాడికి ప్రయత్నించారు. దివ్య తండ్రి చంద్రశేఖర్ను ఓ గదిలో ఉంచి తాళం వేసి, అంత్యక్రియలు పూర్తిచేశారు.బట్టలు మార్చుకుంటానని వెళ్లి..భార్య మృతితో చంద్రశేఖర్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మూడో రోజు కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. శనివా రం ఐదవ రోజు కార్యక్రమం జరిగింది. శ్మశాన వాటిక వద్ద కార్యక్రమం పూర్తిచేసుకుని అంతా ఇంటికొచ్చారు. బట్టలు మార్చుకుంటానని గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్ గడియపెట్టుకుని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకున్నాడు. గదిలోంచి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని కనిపించాడు. వెంటనే జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఘటన సమయంలో చంద్రశేఖర్ తల్లిదండ్రులు, తమ్ముడూ అక్కడే ఉన్నారు.అనాథలైన పిల్లలుభార్య, ఇద్దరు పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగం.. సాఫీగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు కమ్ముకోవడంతో చంద్రశేఖర్ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణంగా ప్రేమించే భార్య మృతి చెందడంతో మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తల్లి మరణాన్ని మరవక ముందే ఐదు రోజుల వ్యవధిలో తండ్రి కూడా దూరమవడంతో పదేళ్లలోపు పిల్లలిద్దరూ ‘మమ్మీ,డాడీ’ అంటూ రోదించడం అక్కడివారిని కన్నీరు పెట్టించింది. చంద్రశేఖర్ తమ్ముడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మాధవి వివరించారు.అదే నా చివరి కోరిక అంటూ..చంద్రశేఖర్ చనిపోవడానికి ముందు తన తండ్రితో మాట్లాడుతూ.. ‘నేను ఒకవేళ చనిపోతే.. నా భార్య పక్కనే నా అంత్యక్రియలు చేయండి’ అంటూ చెప్పాడు. కాసేపటికే ఆత్మహత్య చేసుకోవడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సీతంపేటకు తీసుకొచ్చారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించి, దివ్య అంత్యక్రియలు చేసిన చోటే చంద్రశేఖర్ మృతదేహాన్ని ఖననం చేశారు. -
సిట్కు చిక్కిన డ్రగ్ పెడ్లర్
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు సిట్ అధికారులకు చిక్కాడు. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి డ్రైవర్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, డ్రగ్ పెడ్లర్ అభిషేక్సింగ్ను శనివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కోసం డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. ఇతని ద్వారా డ్రగ్స్ మూలాలను గుర్తించడంపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి బృందం సుమారు 24 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. లింక్లపై ఆరా.. అభిషేక్సింగ్ పోలీసులకు చిక్కడంతో అతని నుంచి డ్రగ్స్ ఎవరెవరు, ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారనే కోణంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇతనితో కొనుగోలుదారులు జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్ చాటింగ్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేయగా.. రోహిత్రెడ్డి, రితేశ్రెడ్డి, నమిత్శర్మ జైలుకు వెళ్లారు. మిగతా వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్తో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరైంది. మహేశ్కుమార్ మినహా.. మిగిలిన వారంతా ఐదు రోజులుగా శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరవుతున్నారు. కేసు దర్యాప్తుపై ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్బాబు ఎప్పటికప్పుడు కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఆయన నిందితులను నేరుగా విచారించి పలు విషయాలు తెలుసుకుంటున్నారు. రిమాండ్లో ఉన్న ముగ్గురిని కస్టడీకి తీసుకుంటే ఈ కేసులో పురోగతి సాధించవచ్చని సిట్ అధికారులు భావిస్తున్నారు. కస్టడీ పిటిషన్పై తీర్పు సోమవారం వెలువడే అవకాశం ఉందని చెపుతున్నారు. పోలీస్ పహారాలో ఫామ్హౌస్.. వివాదాలకు కేంద్ర బిందువైన మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఈ నెల 14న ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. డ్రగ్స్ పార్టీని భగ్నం చేసేందుకు ఈగల్ టీం, స్థానిక పోలీసులు వెళ్లడంతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కేసును సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. పార్టీలో పాల్గొన్న నిందితులకు చెందిన ఆరు లగ్జరీ కార్లు ఫామ్హౌస్లోనే ఉన్నాయి. ఆ రోజు నుంచి పోలీసులు ఫామ్హౌస్లో పహారా కాస్తూ.. బయటి వ్యక్తులను లోనికి రానివ్వడంలేదు. మరోవైపు అసైన్డ్ భూమిలో ఉన్న ఫామ్హౌస్ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూ రికార్డులను పరిశీలించిన అధికారులు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. అనుమతులు లేకుండా రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో చేపట్టిన నిర్మాణాలను కూల్చడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
సిటీ మెట్రో డీలక్స్, ఏసీ బస్సు చార్జీల తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు చార్జీలను ఆర్టీసీ తగ్గించింది. టికెట్ ధరలను సవరించనప్పటికీ, డిస్కౌంట్ పేరుతో ప్రస్తుతానికి తగ్గించింది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉండే చార్జీలతో సమం చేసింది. మూడు నెలల పాటు దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. చార్జీల తగ్గింపు నేపథ్యంలో ఈ మూడు నెలల పాటు ఆ బస్సులకు ఆదరణ పెరిగితే, ఇవే చార్జీలను కొనసాగించటంతోపాటు ఆ కేటగిరీ బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. పురుషులకు సీట్ల కొరత.. ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ (పల్లె వెలుగు కూడా), మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఈ వెసులుబాటు మొదలైనప్పటి నుంచి ఆ రెండు కేటగిరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇతర కేటగిరీ బస్సుల్లో వెళ్లే చాలామంది మహిళలు, అలాగే ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించే మహిళలు ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఫలితంగా ఆ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) వంద శాతాన్ని దాటింది. ముందు వైపు ఉండే మహిళల సీట్లు నిండిపోయి, వెనకవైపు సీట్లలో కూడా మహిళా ప్రయాణికులు కూర్చుంటున్నారు. ఫలితంగా పురుషులకు సీట్లు పరిమితంగానే ఉంటున్నాయి. దీనిపై పురుష ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో, మెట్రో డీలక్స్ పేరుతో కొత్త కేటగిరీ సర్వీసును ఆర్టీసీ మొదలుపెట్టింది. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు లేనందున ఎక్కువ సీట్లు పురుష ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఇది డీలక్స్ కేటగిరీ సర్వీసు కావటంతో టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉంది. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదుకాలేదు. దీనిపై ఇటీవల అధికారులు సర్వే చేసి కారణాలను విశ్లేషించారు. టికెట్ ధర ఎక్కువగా ఉందన్న మాట చాలా మంది నుంచి వినిపించింది. మహాలక్ష్మి పథకం వల్ల ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో తమకు సీట్లు దొరకటం లేదని, వాటిని వదిలి ఎక్కువ టికెట్ ఖర్చుతో డీలక్స్ బస్సులో వెళ్లటం ఏం న్యాయమని కొందరు ప్రశ్నించారు. దీంతో డీలక్స్ బస్సుల టికెట్ ధరను కొంత తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే, టికెట్ ధరలను సవరించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తిరిగి పెంచితే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థ తన అధికారాన్ని ఉపయోగించి డిస్కౌంట్ను ప్రకటించింది. మార్చి నుంచి మే వరకు ఇది అమలులో ఉంటుంది. ప్రస్తుతం సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉన్న టికెట్ చార్జీలనే వీటిల్లో అమలు చేస్తున్నారు. పనిలోపనిగా, నగరంలో తిరుగుతున్న మెట్రో లగ్జరీ(ఎయిర్పోర్టుకు తిరిగే పుష్పక్ కాకుండా) ఏసీ బస్సుల్లో కూడా ఎక్స్ప్రెస్ చార్జీలనే అమలు చేయనున్నారు. ఈ మూడు నెలల పాటు పరిశీలించి, ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే కొంతకాలం పాటు అవే చార్జీలను కొనసాగించటంతోపాటు, ఆ బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
ట్రిపుల్ ఆర్...ఇక జస్ట్ హైవేనే!
సాక్షి, హైదరాబాద్: ‘ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)ను మించిన అద్భుత ఎక్స్ప్రెస్ వేగా రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) రాబోతోంది, అది తెలంగాణకు గేమ్ ఛేంజర్ కాబోతోంది..’అంటూ ఊరించిన కేంద్రం చివరకు ఉసూరుమనిపించింది. ఓఆర్ఆర్తో పోలిస్తే ట్రిపుల్ ఆర్ దిగదుడుపుగానే ఉండనుంది. నిర్మాణ వ్యయానికి జడిసి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ను సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతో సరిపెట్టుకుని నిర్మించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. అంటే దానికి ఎక్స్ప్రెస్వే హోదా ఉండదు. ఫలితంగా ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి ముందే చాలా ప్రత్యేకతలను కోల్పోయింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణ వ్యయం ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి దాదాపు రూ.38 వేల కోట్లను మించేలా ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ రోడ్డుకు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించటం సరికాదని తేల్చిన అధికారులు, వీలైనంత మేర నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని గత రెండు నెలలుగా ఢిల్లీలో కసరత్తు చేపట్టారు. విడతల వారీగా ప్రత్యేకతలు తగ్గిస్తూ, బడ్జెట్లో కోత పెడుతూ అంచనా వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే 8 వరుసలకు బదులు 6 వరుసలకు కుదించారు. సర్వీసు రోడ్డు స్థానంలో సాధారణ యాక్సెస్ పాత్ తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని కూడా తొలగించారు. స్ట్రీట్ లైటింగ్ను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. అండర్ పాస్ల సంఖ్యను సగానికి తగ్గించేశారు. తాజాగా మరోసారి సమీక్షించిన అధికారులు ఇప్పుడు ఏకంగా ఎక్స్ప్రెస్వే హోదా తొలగించేశారు. దీంతో ట్రిపుల్ ఆర్ మరిన్ని ప్రత్యేకతలు కోల్పోనుంది. ఓఆర్ఆర్ ముందు వెలవెల పోనుంది. ఓఆర్ఆర్ మీద వాహనాలు గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తుండగా, ట్రిపుల్ ఆర్పై వేగం 100 ఉండనుంది. మొత్తం మీద ఈ కోతల వల్ల అంచనా వ్యయం 25 శాతం మేర తగ్గుతుందని భావిస్తున్నారు.ట్రిపుల్ ఆర్ ప్రతిపాదనలు తొలుత ఎలా... ఇప్పుడెలా?తొలుత: దేశంలోనే తొలి అతి పొడవైన ఎక్స్ప్రెస్వే రింగురోడ్డు. దాదాపు 362 కి.మీ. నిడివితో ఓ నగరానికి రింగు రోడ్డుగా ఉండటం దేశ రోడ్ నెట్వర్క్లో ఓ రికార్డు. ఇప్పుడు: నిడివిలో మార్పు లేనప్పటికీ, ఎక్స్ప్రెస్ వేకు ఉండే ప్రత్యేకతల్లో భారీగా కోత పెట్టి సాధారణ హైవేగా మార్చేశారు. తొలుత: దేశంలోనే 8 లేన్లతో కూడిన అతి పొడవైన రింగురోడ్డుగా దీన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్ ఔటర్ కూడా 8 వరుసలతో ఉండగా, దానికి రెట్టింపు నిడివితో ట్రిపుల్ ఆర్ను ప్రతిపాదించారు. ఇప్పుడు: 8 వరుసల ఆలోచనను విరమించుకున్నారు. మరో 20 ఏళ్ల వరకు రోడ్డు ట్రాఫిక్కు 6 వరుసలు సరిపోతాయని, 8 వరుసలు వృథా వ్యయమంటూ 6 వరుసలకు కుదించేశారు. తొలుత: సాధారణంగా ఎక్స్ప్రెస్వే/జాతీయ రహదారులపై పట్టణాలు, గ్రామాలు ఉన్న చోటనే లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. కానీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవునా దీపాలు ఏర్పాటు చేసిన తరహాలోనే ట్రిపుల్ ఆర్ పొడవునా ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ప్రతిపాదించారు. ఇప్పుడు: అంత నిడివితో ఎల్ఈడీ స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కేవలం జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.తొలుత: 162 కి.మీ. నిడివితో ఉత్తర భాగంలోనే మొత్తం 204 వంతెనలు నిర్మించాలని భావించారు. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే 11 ప్రాంతాల్లో భారీ ఇంటర్ఛేంజ్ వంతెనలు, మూసీ నది మీద వలిగొండ మండలం పొద్దుటూరు వద్ద, మంజీరా నది మీద పుల్కల్ మండలం శివ్వంపేట వద్ద, హరిద్రానది మీద తూప్రాన్ వద్ద 3 పెద్ద వంతెనలు, వాగులు వంకల మీద 105 సాధారణ వంతెనలు, పంట కాల్వలు, నీటిపారుదల శాఖ కాలువలు, చిన్న రోడ్లకు సంబంధించి 85 కల్వర్టులు ప్రతిపాదించారు. ఇప్పుడు: వంతెనల వ్యయం భారీగా ఉండటంతో పొదుపు చర్యలు ప్రధానంగా ఇక్కడే చేపట్టారు. వంతెనల సంఖ్యను సగానికి సగం కుదించనున్నారు. దీంతో కొన్ని చిన్న దారుల వద్ద రోడ్డును దాటే వీలుండదు. ముందుకో, వెనక్కో వెళ్లి యూ టర్న్ తీసుకుకోవాల్సి ఉంటుంది. తొలుత: ఓఆర్ఆర్ తరహాలో ట్రిపుల్ ఆర్కు కూడా సర్వీసు రోడ్డును ప్రతిపాదించారు. తర్వాత ఆ ఆలోచన విరమించుకుని సాధారణ యాక్సెస్ పాత్ను ఖాయం చేశారు. అంటే ఫుట్పాత్ లాంటివి లేని ఓ కచ్చా రోడ్డు అన్నమాట. ఇప్పుడు: కచ్చా రోడ్డుతో కూడిన యాక్సెస్ పాత్ను సైతం విరమించుకున్నారు. పెద్ద చెరువు కట్ట తరహాలో ఉండే ఈ ప్రధాన క్యారేజ్ వే దిగువన ఎలాంటి రోడ్డు ఉండదు. వట్టి ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. దానిపైనే వాహనాలు రాకపోకలు సాగించాలి. తొలుత: 8 వరసల రోడ్డు, ఎక్స్ప్రెస్ ప్రమాణాలతో నిర్మాణం, వాహనాల వేగ పరిమితి 120 కి.మీ.కుపైగా అయినందున రోడ్డు ఎంబ్యాంక్మెంట్(రోడ్డు కట్ట) 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించేలా డిజైన్ చేశారు. అప్పుడు రోడ్డు ఉపరితలంలో నిలువు వాలు 1,300 మీటర్ల ముందే ప్రారంభం అయ్యేలా నిర్మించేందుకు వీలవుతుంది. ఇప్పుడు: సాధారణ ఎన్హెచ్ ప్రమాణాలతో నిర్మిస్తున్నందున రోడ్డు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది.తొలుత: వాహనాలు గంటకు 160 కి.మీ. మించిన వేగంతో దూసుకుపోయినా ఇబ్బంది లేని విధంగా డిజైన్ ప్రతిపాదించారు. అధికారిక వేగ పరిమితిని 120 కి.మీ.గా పేర్కొన్నారు. రోడ్డు నిలువు వాలు (వర్టికల్ కర్వ్) 1300 మీటర్లు ఉండేలా డిజైన్ చేశారు. అంటే ఒక మీటర్ మేర రోడ్డు పల్లం (డీప్) కావాలంటే 1300 మీటర్ల నుంచే ఎత్తు తగ్గడం ప్రారంభమవుతుందన్న మాట. (వాలు మొదలు అవుతుంది) దీంతో 600 మీటర్ల ముందు వరకు రోడ్డు విజిబిలిటీ ఉంటుంది. అంత దూరంలో పిల్లి సైజు జంతువు రోడ్డు దాటుతున్నా కనిపిస్తుంది. ముందే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. ఇప్పుడు: గరిష్ట వేగం 100కు కుదించారు. రోడ్డు నిలువు వాలు 650 మీటర్లకు పరిమితం చేశారు. అంటే ఎత్తు, పల్లంల వద్ద వాహనాల గరిష్ట విజిబిలిటీ దూరం కవలం 360 మీటర్లు మాత్రమే ఉంటుంది. వాహనాలు ఒకవేళ పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్తే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
మావోలకు ‘డెడ్’లైన్.. మరో పది రోజులే!
సాక్షి, హైదరాబాద్: ‘మార్చి 31 నాటికి భారత దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం’గత రెండేళ్లుగా పలు వేదికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటన ఇది. తాజాగా ఈ నెల 6న ఒడిశాలోని కటక్ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవంలోనూ ‘తిరుపతి నుంచి నేపాల్లోని పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ నిర్మించాలని కలలు కనే శక్తులను మన భద్రత దళాలు కచ్చితంగా ఓడిస్తాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో నక్సలిజం అంతం కావడమే లక్ష్యం’అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్చి 31 లోపు అజ్ఞాతం వీడి లొంగిపోని మావోయిస్టుల పట్ల కఠిన వైఖరే అని కూడా అమిత్ షా సుస్పష్టంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం..ఈనెల 31న మావోయిస్టులకు ‘డెడ్’లైన్ పూర్తవుతుంది, మరో పదిరోజులే గడువు ఉంది, అయితే ప్రభుత్వాలు చెబుతున్నట్టు మార్చి 31 తర్వాత మావోయిస్టులు లేని భారత్ సాధ్యమేనా..? మరోవైపు పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు చెబుతున్నట్లుగా డెడ్లైన్లు పెట్టి సిద్ధాంతాలు అంతం చేయలేరన్న వాదనలు గెలుస్తాయా..? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఇంకా మావోయిస్టులలో వందలాది మంది సాయుధులు ఉన్నారని, మావోయిస్టులను అంతం చేయడం ప్రభుత్వాలు అనుకున్నంత సులువేంకాదని ఇటీవల జనజీవనస్రవంతిలోకి వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ఆ ఏడుగురు తిరిగొచ్చేనా...?మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2023లో 125 మంది ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య ఏడుకు పరిమితమైందని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ టిపిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, చంద్రన్న సహా ఎంతో మంది కీలక నేతలు నెలల వ్యవధిలోనే లొంగుబాట పట్టారు. అయితే తాము అరెస్టు అయ్యామని చెబుతున్నా..పోలీసులు సరెండర్ చూపినా..ఫలితం మాత్రం ఆయుధాన్ని వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారు. 2024 నుంచి తెలంగాణ పోలీసుల ఎదుట 721 మంది లొంగిపోవడంతోపాటు 266 ఆయుధాలను అప్పగించారు. తెలంగాణకు చెందిన ఏడుగురు మావోయిస్టులు ఇంకా యాక్టివ్గా ఉన్నట్టు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, గణపతి భార్య జోడే రత్నాబాయి, హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ , సికింద్రాబాద్కు చెందిన వార్త శేఖర్ , హైదరాబాద్కు చెందిన నక్క సుశీల అలియాస్ రేల, సిద్దిపేట జిల్లా మిర్దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భద్రాది జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్ ఉన్నారు. గణపతి లొంగుబాటుపై ఇప్పటికే తీవ్ర చర్చ.. దేశాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాలన్నా...అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించాలన్నా..అధికారిక రికార్డుల్లో ఉన్న మావోయిస్టులంతా అయితే లొంగిపోయారని, లేదంటే చనిపోయారని గుర్తించాల్సిందే. మావోయిస్టు అగ్రనేత, సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన నేత, తెలంగాణలో జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలీసులతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్, ఇతర దర్యాప్తు విభాగాలు సైతం గణపతి జాడ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, రాజిరెడ్డి సహా కేంద్ర కమిటీ సభ్యుల స్థాయిలో పని చేసిన వారు కూడా తమకు గణపతి జాడ తెలియదని చెబుతున్న నేపథ్యంలో గణపతి లొంగుబాటు సాధ్యమా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 31 తర్వాత పరిస్థితి ఏంటి? సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన దాడులను ఎదుర్కోలేక మావోయిస్టు అగ్ర నాయకత్వం సైతం అడవులు వీడి లొంగుబాట పడుతున్నా..ఇంకా వందల మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.అజ్ఞాతం వీడేందుకు కొందరు అంగీకరించడం లేదు. అయితే మార్చి 31 తర్వాత మిగిలే మావోయిస్టులపట్ల కేంద్రం వైఖరి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. లొంగకపోతే మార్చి 31 తర్వాత మావోయిస్టుల ఏరివేత తప్పద న్న సంకేతాలే పంపుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కోసం మరోసారి గడువు పెంచుతారా..లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.నిషేధం ఎత్తివేత షరతు ఫలించేనా?తాము అజ్ఞాతం వీడి జనంలో జనం మధ్య, ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో పోరాటాలు చేస్తామని ఇప్పటికే లొంగిపోయిన ఎంతో మంది కేంద్ర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే, మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే..అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని చెబుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డితో సమావేశంలోనూ మావోయిస్టు మాజీ కీలక నేతలు ప్రతిపాదించారు. సీఎం రేవంత్రెడ్డి కూడా ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో స్వయంగా కలిసి చెప్పారు. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. -
ఆరు గ్యారంటీల అమలుకు ‘ప్రైవేటు’ బిల్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. న్యాయవాదులుగానూ అనుభవం ఉన్న పార్టీ నేతలు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్తోపాటు మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాది మోహన్రావు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పె ట్టడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై చర్చించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని వారి చాంబర్లో కలిసి తాము ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లును అనుమతించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరనున్నారు. వచ్చే శుక్రవారం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరడంతోపాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బిల్లు కాపీలు ఇస్తారు. బిల్లుకు మద్దతు కోరుతూ అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలకు లేఖలు కూడా రాయాలని శనివారం జరిగిన భేటీలో నిర్ణయించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బిల్లు కోసం ఒత్తిడి ‘బీఆర్ఎస్ పెట్టే ప్రైవేటు బిల్లుకు మద్దతిచ్చేందుకు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డలందరూ స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి. ఆరు గ్యారంటీల ద్వారా లబ్దిదారులకు అందే డబ్బును నేరుగా వారి ఖాతాల్లోనే వేసేలా ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి రోజునే సీఎం రేవంత్ ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. గవర్నర్ నోటితో అసెంబ్లీ సంయుక్త సమావేశంలో చెప్పించి 840 రోజులు కావస్తున్నా వాటి ఊసేలేదు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో 1986లో బీజేపీ ఫ్లోర్ లీడర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును ఆమోదించిన చరిత్ర ఉంది. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే మేము ప్రవేశపెడుతున్న ప్రైవేటు మెంబర్ బిల్లును చర్చకు అనుమతించి ఆమోదించాలి. రాష్ట్రంలోని రైతులు, మహిళలు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు యువకులు సహా అన్ని వర్గాల తరపున ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. అభయహస్తం మేనిఫెస్టోను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మేము ప్రవేశపెట్టే బిల్లుకు అధికార పక్షం కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం’అని కేటీఆర్ అన్నారు. తొలి సంతకం ఫైల్ను పోగొట్టుకున్నారా? ‘అధికారంలోకి వచి్చన వెంటనే ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం తొలి సంతకం చేసిన ఫైలు కనిపించడం లేదా? లేకపోతే తరచూ విమాన ప్రయాణాలు చేస్తున్న సీఎం ఆ ఫైలును పోగొట్టుకున్నారా? ఎందుకంటే ఇప్పటివరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆరు గ్యారంటీల ఊసే లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఏడాది మాత్రమే సంపూర్ణ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు బిల్లు పెట్టడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ బిల్లుకు చట్టబద్ధత వస్తే రైతు భరోసా సహా ఇతర హామీలు ఎగవేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండదు. ఈ బిల్లును శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది’అని కేటీఆర్ వెల్లడించారు. -
శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?
సాక్షి, సిద్దిపేట: ‘సిద్దిపేటలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించే పనుల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ తెచ్చింది, చేసింది కాదు. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవే. శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?’అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కృషి ఫలితమే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అని, దానిని ఆదివారం రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారని అన్నారు.కానీ, ప్రజల మనోఫలకాల మీద తమ పేరు ఎప్పటికీ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముందే జిల్లాకు మంజూరై, రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,070 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్రావు.. సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగ లేఖను శనివారం సిద్దిపేటలో విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణాధారమన్నారు. కాళేశ్వరాన్ని, కూలేశ్వరం అని అంటున్న రేవంత్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు? రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిపేటలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,170 కోట్లు అర్ధంతరంగా రద్దు చేశారని హరీశ్ తెలిపారు. వీటిలో పశువైద్య కళాశాలను రేవంత్ కొడంగల్కు తీసుకెళ్లారన్నారు. ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?, ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారు? అని ప్రశ్నించారు. కాగా, సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతులకు దాదాపు రూ.300 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులకు మూడుసార్లు ఎగ్గొట్టిన దాదాపు రూ.170 కోట్ల రైతుభరోసా డబ్బులు చెల్లించాలని కోరారు. -
నేటి నుంచి యాసంగి రైతు భరోసా
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: రైతుభరోసా పథకం కింద యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో కొత్తగా నిర్మించిన ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి రైతుభరోసాను ప్రారంభించనున్నారు. మొదటి విడత కింద రూ. 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. తద్వారా ఎకరం లోపు విస్తీర్ణం భూములున్న సుమారు 73 లక్షల మంది రైతులకు డబ్బులు అందనున్నాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ సీజన్కు సంబంధించి ఎకరాకు రూ.6 వేలు చొప్పున రాష్ట్రంలోని సుమారు 150 లక్షల ఎకరాల భూములకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. రెండవ విడతగా 20 రోజుల తరువాత రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంబోత్సవానికి వ్యవసాయ, అనుబంధ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ నర్మెటలోనే ఉంటూ సీఎం పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కాళేశ్వరంతో సాగు కావట్లేదు: తుమ్మల ‘ప్రతిపక్ష నేతలవి చిల్లర మాటలే.. కాళేశ్వరం జలాలతో పామాయిల్ సాగు కావడంలేదు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచి్చన తర్వాతే సిద్దిపేట జిల్లా నర్మెటలో దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాం. ఫ్యాక్టరీని 16 నెలల్లోనే పూర్తి చేశాం’అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం అని వివక్ష చూపకుండా, సిద్దిపేట భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇక్కడే ఫ్యాక్టరీ మంజూరు చేశానని వివరించారు. కాళేశ్వరంతో పామాయిల్ సాగు కావడం లేదని, వాతావరణం అనుకూలంతో రాష్ట్రమంతా ఆయిల్పామ్ సాగవుతుందని తెలుసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తే అది రైతుల వడ్డీకే సరిపోయిందని, ఇంకా ఒక్కో రైతుపై రూ.12 వేలు వడ్డీ మీద పడిందన్నారు. ప్రతిపక్ష నేతలు కేవలం రైతులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రారంభాలు.. శంకుస్థాపనలు సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, పీహెచ్సీలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్, కొండపాకలో యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 30 వేల మంది రైతులతో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న రైతు ఉత్సవాలు సీఎం సభతో ముగియనున్నాయి. -
మూడు దశల్లో ‘భద్రాద్రి’ పునరాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి తొలి విడత పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. తొలి దశ పనులు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. శనివారం రాత్రి ఆయన ఆలయ పునరాభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్ హన్మంతరావు తదితరులతో సమీక్షించారు.పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తిచేసి, పుష్కరాల అనంతరం మిగతా పనులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి తీరంలో భక్తులకు వసతి కల్పించాలన్నారు. భక్తుల దర్శనాలు కొనసాగుతుండగానే ఆలయ అభివృద్ధి పనులు జరపనున్నందున, భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు జరగాలని చెప్పారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా ఆగమశాస్త్రబద్ధంగా పునరాభివృద్ధి ఉండాలని పేర్కొన్నారు. -
మన్నే మాణిక్యం!
(సాక్షి స్పెషల్ డెస్క్): వెండి కన్నా ఎక్కువ విలువైనది ఆ మన్ను.. అవును.. మీరు చదివింది నిజమే. మహారాష్ట్రలోని ఒక కుగ్రామం 2 కిలోల మట్టిని రూ. 68 లక్షలకు ఒక బయోటెక్నాలజీ కంపెనీకి అమ్మింది. ఆ మట్టిలో ఏముందో అనే కదా మీ సందేహం? ఆ మట్టిలో ఉన్న ఒక సూక్ష్మజీవి అనేక ప్రోబయోటిక్ ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతోంది. భారతీయ జీవవైవిధ్య చట్టాల ప్రకారం.. స్థానిక జీవ వనరులను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకునే కంపెనీలు తమ లాభాల్లో వాటాను స్థానిక పంచాయతీలకు పంచాలి. ఆవిధంగా దాపూర్ అనే గ్రామం నుంచి స్వీకరించిన రెండు కిలోల మట్టిలోని సూక్ష్మజీవులను ఉపయోగించుకున్నందుకుగాను సదరు కంపెనీ ఆ గ్రామ పంచాయతీకి రూ. 68 లక్షలను చెల్లించింది. ‘సూక్ష్మ’ంలో ధనందాపూర్ గ్రామం నాసిక్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల కోసం అన్వేషిస్తున్న అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఈ గ్రామ పరిసరాల్లో పొలాల మట్టిలో బాసిల్లస్ కోగులన్స్ అనే సూక్ష్మజీవిని రెండేళ్ల క్రితం గుర్తించి, స్థానిక గ్రామ పంచాయతీ ద్వారా రెండు కిలోల మట్టిని తీసుకెళ్లింది. బాసిల్లస్ కోగులన్స్లోని ఎంజైమ్స్ ద్వారా కడుపులో ఆరోగ్యదాయక సూక్ష్మజీవులను, జీర్ణశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడే 42 రకాల ప్రోబయోటిక్ ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసి విక్రయిస్తోంది.లాభాల పంపిణీ ఎలా? మన దేశంలోని జన్యు వనరుల వ్యవహారాలను జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్బీఏ) పర్యవేక్షిస్తుంటుంది. సూక్ష్మజీవులు, ఔషధ మొక్కలు, పశుజాతులు వంటి స్థానిక జన్యువనరులను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకునే కంపెనీలు యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ఏబీఎస్) యంత్రాంగం ద్వారా సంబంధిత గ్రామ పంచాయతీలకు లాభాల్లో నుంచి కొంత (ఆ ఉత్పత్తుల అమ్మకం ధరలో 0.1–0.5 శాతాన్ని లేదా కొనుగోలు ధరలో 1–5%) మేరకు చెల్లించాల్సి ఉంటుంది.ఆ మొత్తంలో నుంచి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే ఎన్బీఏ 5% నిర్వహణ ఖర్చుల కింద తీసుకొని, మిగతా 95% డబ్బును ఆ పంచాయతీకి ఇస్తుంది. 2014 నుంచి అమల్లోకి వచ్చిన ‘నగోయా ప్రొటోకాల్’అనే అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడిక ద్వారా ఏబీఎస్ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ విధంగా దాపూర్ గ్రామ పంచాయతీ ఖాతాలోకి రూ. 67,69,359 జమ అయ్యాయి. ఆ సూక్ష్మజీవి అక్కడ మాత్రమే ఉందా?బాసిల్లస్ కోగులన్స్ సూక్ష్మజీవి దాపూర్ గ్రామ పరిసరాల్లోని మట్టిలో మాత్రమే ఉందా? అంటే.. ‘అదేం కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల నేలల్లోనూ ఇది ఉంటుంది. అయితే, ఆ కంపెనీ ఈ గ్రామం నుంచి తీసుకెళ్లిన మట్టిలో నుంచి సూక్ష్మజీవిని సేకరించింది కాబట్టి వారికి లాభాల్లో వాటా చెల్లించింది’అని మహారాష్ట్ర రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు అధికారులు తెలిపారు. ఇలా వచ్చిన మొత్తాన్ని గ్రామంలో సాధారణ పనుల కోసం వాడకూడదు. ఔషధ మొక్కలు, దేశీ పశు జాతులు, స్థానిక పురాతన వంగడాలు వంటి జీవవైవిధ్యాన్ని, సంప్రదాయ విజ్ఞానాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించే పనులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దాపూర్ గ్రామస్తులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.బయోడైవర్సిటీ రిజిస్టరే కీలకం జన్యు వనరులను గుర్తించి, నమోదు చేసినప్పుడే వాటిని ఉపయోగించుకునే కంపెనీల నుంచి లాభాల్లో వాటా పొందటం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో ‘పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్’(పీబీఆర్)ల పాత్ర కీలకం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే జీవవైవిధ్య బోర్డుల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల ద్వారా బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల(బీఎంసీ)ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని పెద్దలు, సంప్రదాయ విజ్ఞానవంతులు, రైతులు ఇందులో సభ్యులుగా ఉంటారు. బీఎంసీ గ్రామ స్థాయిలోని పరిసరాల్లో ఏయే జన్యు వనరులు ఉన్నాయో గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తుంది.ఆ రిజిస్టర్లోని జన్యు వనరులను ఏ కంపెనీ అయినా ఉపయోగించుకుంటే చట్టప్రకారం లాభాల్లో నుంచి స్థానిక సమాజానికి వాటా పంచాలన్నది నియమం. అయితే, దేశవ్యాప్తంగా 2,76,653 బీఎంసీలు ఏర్పాటైనప్పటికీ, చురుగ్గా పనిచేస్తున్నవి కొన్ని మాత్రమే. 2017–2025 మధ్యకాలంలో విదేశీ కంపెనీల నుంచి రూ. 140 కోట్లు, దేశీయ కంపెనీల నుంచి రూ. 52 కోట్లను స్థానిక సమాజాలకు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
మార్గం ఉన్నా.. మోక్షం ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు మారినా రాష్ట్ర రైతాంగం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సాదాబైనామాల సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. దాదాపు 37 ఏళ్లుగా తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తున్న ఈ సమస్యకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిష్కార మార్గం దొరికినా మోక్షం మాత్రం కలగట్లేదు. భూభారతి చట్టంలో సాదాబైనామాలను చట్టబద్ధం చేసే ప్రక్రియకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఏడు నెలలు గడుస్తున్నా లక్షలాది సాదాబైనామా దరఖాస్తులు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అడ్డంకిగా అఫిడవిట్ నిబంధన.. సాదాబైనామాల సమస్యకు పరిష్కారం చూపించే భూభారతి చట్టం గతేడాది ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు నెలాఖరులో హైకోర్టు అందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ఇచి్చన ప్రభుత్వం ఆయా దరఖాస్తులను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించింది. అంతవరకూ బాగానే ఉన్నా చట్టంలో పేర్కొన్న విధంగా సాదాబైనామాలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ రూపొందించిన నిబంధనలు మళ్లీ సమస్యను జటిలం చేశాయి. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని 2014 జూన్ 2లోగా తెల్లకాగితం (సాదాబైనామా)తో కొని ఉంటే అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలని.. అప్పుడే సాదాబైనామా సరి్టఫికెట్ ఇవ్వాలనే నిబంధన పెట్టారు.దీంతో ఎప్పుడో దశాబ్దాల క్రితం తమకు అమ్మిన వారి నుంచి అఫిడవిట్లు తెచ్చుకోలేక చాలా మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తేసే దిశగా చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా వస్తాయని.. అమ్మినవారి అఫిడవిట్తో సంబంధం లేకుండా గతంలో లాగానే స్థానిక విచారణ ద్వారా సాదాబైనామాలను పరిష్కరిస్తామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. కానీ ఈ అఫిడవిట్కు మించిన సమస్యలు సాదాబైనామా దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాకపోవడం గమనార్హం.సాదాబైనామా దరఖాస్తును పరిష్కరించాలంటే ఆ భూమికి సంబంధించి భూభారతి పోర్టల్లో ఉన్న వివరాల్లో అమ్మిన వ్యక్తి పేరుపై పట్టా ఉండాలన్న నిబంధన ఈ సమస్యకు పీటముడి వేస్తోంది. ఎప్పుడో భూమి అమ్మినా ధరణి పోర్టల్ వచ్చాక తన పేరిట పట్టా రావడంతో అప్పట్లో అమ్మిన వ్యక్తి ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయడం లేదంటే కుటుంబ సభ్యుల పేర్లపై పట్టా బదిలీ చేయడం లాంటివి జరిగిపోయాయి. చాలా చోట్ల సర్వే నంబర్లు సరిపోలట్లేదు. భూమి ఒకచోట ఉంటే మరో సర్వే నంబర్పై కాగితం ఉండటంతో ఆ దరఖాస్తులను కూడా రెవెన్యూ అధికారులు పరిష్కరించట్లేదు. కాగితాలపై రాసుకున్న విస్తీర్ణం, భూభారతి పోర్టల్లో ఉన్న విస్తీర్ణంలో తేడా ఉన్నా పరిష్కరించలేమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.ఇలా చాలా దరఖాస్తులను తిరస్కరించామంటున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలన్నింటికీ వివరణ ఇస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి ఆర్డీవోలకు ప్రత్యేక ఉత్తర్వులు రావాలని.. అప్పుడే సాదాబైనామాలు పూర్తిస్థాయిలో పరిష్కారమవుతాయని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. సాదాబైనామాలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో అఫిడవిట్ నిబంధన ఎత్తేయడంతోపాటు సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అప్పుడు అలా... ఇప్పుడు ఇలా వాస్తవానికి సాదాబైనామాలను పరిష్కరించే ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. కానీ సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించిన అప్పటి ప్రభుత్వం ధరణి చట్టంలో ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని విస్మరించింది. దీంతో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించే అవకాశమే లేకుండా పోయింది. ఆ తర్వాత విషయం కోర్టు మెట్లెక్కింది. కోర్టు కూడా చట్టంలో లేనందున పరిష్కారం ఎలా చేస్తారని ప్రశ్నించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి ప్రత్యేక సెక్షన్ రూపొందించడంతో కోర్టు కూడా వాటి పరిష్కారానికి అనుమతినిచ్చింది. దీంతో ఇక సమస్య పరిష్కారమైనట్టేనని 9.2 లక్షల మంది దరఖాస్తుదారులు ఆశించారు. కానీ నేటికీ సమస్య అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే.. ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించాలి. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసిది ఆర్డీవో అయినప్పటికీ కలెక్టర్కు అప్పీల్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తే తిరస్కారానికి గురైన రైతులు కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవడం ద్వారా సాదాబైనామాల దరఖాస్తుదారులకు న్యాయం జరుగుతుంది. – భూమి సునీల్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు -
యాదగిరి గుట్టలో మహిళ కాలిపై వెళ్లిన ఆర్టీసీ బస్సు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచి్చన ఓ మహిళ కాలుపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నార్సింగికి చెందిన అనిత కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. శనివారం దర్శనం అనంతరం మధ్యాహ్నం కొండపై ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు ఆర్టీసీ బస్సు రావడంతో అది ఎక్కేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బస్సు ముందుకు వెళ్లగా అనిత కిందపడిపోయింది. దీంతో బస్సు వెనుక టైరు ఆమె కాలుపై వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. -
సిలిండర్ అందుబాటు గ్యాసే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్యాస్ ఇక్కట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. షేక్పేట్లోని మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం వినియోగదారులు గంటలతరబడి వేచి చూడడం కన్పించింది. సిలిండర్ కోసం 8 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని, గత రెండు రోజులుగా ఏకంగా ఏజెన్సీ వద్దకు వచ్చి లైన్లో నిలబడినా లభించలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరూ ఈ విధంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దీనిపై స్పందించడం లేదని, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత లేదని కొందరు వినియోగదారులు మండిపడ్డారు. ఎవరికి సిలిండర్లు అందిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. -
Telangana: యాదాద్రికి ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండున్నరేళ్లలో పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆరీ్వఎన్ఎల్) ఇటీవల ఈ ప్రాజెక్టు టెండర్లను దక్కించుకుంది. ఇప్పటికే రాయగిరి వరకు భూసేకరణ సైతం పూర్తి చేశారు.తొలుత రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును చేపట్టాయి. భూమి, వనరులు, అవసరమైన నిధులను అందజేసేందుకు అప్పటి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఇది పెండింగ్ జాబితాలో పడింది. చివరకు రైల్వేశాఖే సొంత నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా నిధులు కేటాయించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా రాయగిరి వరకు 33 కి.మీ. మేర రూ.430 కోట్ల అంచనాలతో నిర్మించనున్నారు. కొత్తలైన్లను నిర్మించడంతో పాటు అవసరమైన చోట్ల డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్వేస్టేషన్ల నిర్మాణం, ఆధునికీకరణ తదితర పనులు చేపట్టనున్నారు. భక్తకోటికి మార్గం సుగమం ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి వస్తే భక్తకోటి ఇష్టదైవం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం మరింత సులభతరం కానుంది. తక్కువ చార్జీలతోనే ప్రయాణికులు రాకపోకలు సాగించచ్చు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్లో వెళ్లి అక్కడి నుంచి 4 కి.మీ.రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోవచ్చు.ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో ప్రతి రోజు వేలాది మంది భక్తులు యాదాద్రి దర్శనానికి వెళ్తున్నారు. ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే లింగంపల్లి నుంచి నేరుగా యాదాద్రికి వెళ్లవచ్చు. ఉందానగర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా చేరుకొవచ్చు. మేడ్చల్ నుంచీ యాదాద్రికి సులభంగా రాకపోకలు సాగించవచ్చు. అభివృద్ధి పరుగులు.. యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలోనే ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం దీన్ని పట్టాలెక్కించనున్న దృష్ట్యా డిమాండ్ పెరగవచ్చని అంచనా. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగే అవకాశం ఉంది. -
TG: చిన్నారిపై వీధి కుక్కల దాడి
వరంగల్: వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. 35వ డివిజన్ లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి ఒంటరిగా వెళుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి గాయపడింది. ఆ సమయంలో స్థానికులు ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ చిన్నారి మీద కుక్కలు పడిన సమయంలో స్థానికులు చూసి గట్టిగా కేకలు వేయడంతో ఆ కుక్కలు పారిపోయాయి. చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం గాయపడిన ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ప్రైవేట్మెంబర్ బిల్లును ప్రవేశపెడతాం: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్మెంబర్ బిల్ పెడతామని తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలేనని అన్నారు.‘ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల చట్టం ఫైల్ పై సంతకం చేశారు. అప్పటి గవర్నర్ తమిళిసై కూడా ప్రసంగంలో అసెంబ్లీ లో చెప్పారు. 840 రోజులు అయినా అమలు చేయడం లేదు. వచ్చే శుక్రవారం రోజు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం తెలపాలని సభలో అడుగుతాం. గతంలో అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టిన చరిత్ర ఉంది. మీరు ప్రవేశ పెట్టలేదని మేము ప్రవేశ పెడతాం. స్పీకర్, చైర్మన్ సభ్యులను అందరినీ కలుస్తాం. బీజేపీ వ్యతిరేకించినా ఏం ఇబ్బంది లేదు. ఫైల్ దొరకడం లేదని అంటున్నారు. ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా? ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కాలిపోయిందా? అనే అనుమానం ఉంది. మిగిలింది ఒక బడ్జెట్ మాత్రమే.. ఇచ్చిన హామీలను ఇంకా ఎప్పుడూ అమలు చేస్తారు? ఆరు గ్యారెంటీల చట్టం అయితే అన్ని వర్గాల వారికి లాభం అవుతుంది. ప్రజల తరుఫున ఈ బిల్ పెడుతున్నాం. పబ్లిక్ డొమైన్ లో బిల్ పెడతాం. అన్ని పార్టీలకు సహకరించాలని లేఖ రాస్తాం. నందమూరి తారక రామరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ బిల్ పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిల్ పెట్టిన చరిత్ర కూడా ఉంది’ అని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. -
‘జీవన్రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నా’
కరీంనగర్ : జీవన్రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నానని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో జీవన్ రెడ్డి మనస్థాపం చెంది ఉండవచ్చని, ఆయన మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదన్నారు. ఈ మేరకు జీవన్రెడ్డి రాజీనామా చేస్తారని నిర్ణయంపై సాక్షీ టీవీతో శ్రీధర్బాబు మాట్లాడారు. జీవన్ రెడ్డికి భవిష్యత్ లో న్యాయం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చెప్పారని, పార్టీ ఆదేశం మేరకే ఆయనతో చర్చలు జరిపామన్నారు. తప్పకుండా జీవన్రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నానన్నారు. కాగా, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. -
షాకింగ్ సీన్.. కల్తీ సమోసాలు.. కుళ్లిన గుడ్లతో పఫ్స్..
సాక్షి, హైదరాబాద్: జియాగూడలో కల్తీ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, ట్రేడ్ లేకుండానే సమోసాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారీ చేస్తున్నట్లు నిర్థారించారు. రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు సీజ్ చేశారు.నిందితుడు అబ్దుల్ రషీద్.. అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000), ముడి పదార్థాలు మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు తమ ప్రాంతాల్లో కల్తీ ఆహారాన్ని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. -
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం
-
బీఆర్ఎస్లో కలకలం.. కౌశిక్రెడ్డిపై తిరుగుబాటు?
సాక్షి, కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ బీఆర్ఎస్లో కలకలం రేగుతోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు, కార్యకర్తల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్లో రహస్య సమావేశం సంచలనంగా మారింది. పార్టీకి రాజీనామాలు చేయడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకే భేటీ అంటూ ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది.సీనియర్ నాయకులు, మండల స్థాయి నేతలతో కౌశిక్ వ్యవహారం సరిగా లేదనే చర్చ సాగుతోంది. పార్టీ మార్పా? బీఆర్ఎస్లోనే ఉంటూ ఎమ్మెల్యే కౌశిక్పై పోరాటమా? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచ్లు, ఇతర నాయకులంతా వందమంది దాకా రహస్య భేటీకి హాజరయినట్లు తెలుస్తోంది. -
విడాకుల కేసు: అడ్వకేట్తో ఆమె సన్నిహితంగా..!
శంషాబాద్ రూరల్: భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో మహిళకు పరిచమైన ఓ అడ్వకేట్ ఆమెతో సన్నిహితంగా ఉంటున్నాడు.. ఇది తెలుసుకున్న భర్త.. వారిద్దరూ కారులో వెళ్తుండగా బైక్పై వెంబడించాడు. ఈ క్రమంలో భర్తతో పాటు మరో వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో అడ్వకేట్తోపాటు మహిళను పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శివప్రసాద్, ఝాన్సీ దంపతుల మధ్య మనస్పర్దలు రావడంతో భార్య దూరంగా ఉంటుంది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉంది. ఝాన్సీ ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ నాగోల్లోని హాస్టల్లో నివాసముంటుంది. ఈ క్రమంలో మాధవరావు అనే అడ్వకేట్తో పరిచయమైంది. అతనితో సన్నిహితంగా ఉంటోందని నాగోలులో టీషాపు నిర్వహించే శివప్రసాద్ స్నేహితుడు కోడి నరేష్ గమనించి చెప్పాడు. దీంతో భార్య కదలికలను గమనించసాగారు. ఈ నెల 19న ఝాన్సీ ఉప్పల్ బస్స్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా చూశారు. శివప్రసాద్, నరేష్ బైక్పై బస్సును వెంబడించారు. ఆరాంఘర్ చౌరస్తాలో బస్సు దిగిన ఝాన్సీ అక్కడ ఓ కారులో ఎక్కింది. వీరు కారును వెంబడిస్తూ మండలంలోని మేకలబండతండా శివారులో పీ–వన్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ కారును నిలపడంతో శివప్రసాద్ దగ్గరకు వెళ్లి మాట్లాడేప్రయత్నం చేశారు. అయితే కారును కొద్దిగా ముందుకు కదిలించి వేగంగా వెనక్కు వచ్చి ఇద్దరినీ ఢీకొట్టారు. ఈ ఘటనలో శివప్రసాద్, నరేష్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలో ఉన్న జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు మాధవరావు, ఝాన్సీని హత్యాయత్నం కేసులో శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. -
కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా.. ముహూర్తం ఫిక్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కాగా, కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని కోరుతున్నట్టు తెలిసింది. జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.మరోవైపు.. జగిత్యాలలో జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోదు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం. ఆయన మాతో చర్చించినవి అధిష్ఠానం ముందు ఉంచుతాం. జీవన్ రెడ్డి కాంగ్రెస్తోనే కొనసాగుతారనే నమ్మకం మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇక, జగిత్యాలలో మంత్రులతో జీవన్ రెడ్డి భేటీ తర్వాత ఉత్కంఠ నెలకొంది. అయితే, జీవన్ రెడ్డి మాత్రం ఈనెల మార్చి 25న జరిగే సమావేశం యథావిధిగా ఉంటుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు. దేవుడు శాసించాడు.. నేను అనుసరిస్తున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్యకర్తలంతా రెడీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మార్పు లాంఛనంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన నిర్ణయంపై జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. -
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మికుంట మండలం సీతంపేటలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భార్య మృతి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ.. అత్తగారి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపుతోంది. దివ్య మృతిపై అనుమానాలు తలెత్తడంతో చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.కాగా, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్యకు 2016లో ఎస్ఐ చంద్రశేఖర్తో కాగా.. భర్త రోజుమాదిరిగా మంగళవారం(మార్చి, 17) ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా దివ్య కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో అదేరోజు ఉదయం ఆమె గన్నేరుపూలు, ఆకులు మిక్సీ చేసుకొని తాగిన దివ్య.. తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పింది. దివ్యను ఆమె భర్త.. వెంటనే హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.అయితే, దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమంటూ మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇవాళ(మార్చి 21, శనివారం) ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గదిలో నుండి బయటికి రాకపోవడంతో అనుమానంతో చూడగా ఉరి వేసుకొని ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. -
నిందితుడిని కాపాడుతున్నారా?.. ఎస్పీ ఆగ్రహం
తాండూరు రూరల్: మహిళ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వడ్డీ వ్యాపారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఎస్పీ స్నేహ మెహ్ర కరన్కోట్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమో దు చేసి ఏడు రోజులు అవుతున్నా పురోగతి లేకపోవడంపై మండిపడ్డారు. శుక్రవారం బాధిత కుటుంబసభ్యులు వికారాబాద్లో ఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం సిరిగిరిపేట్కు చెందిన అగ్గనూర్ వీరప్ప, లక్ష్మి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి హన్మంత్రెడ్డి వద్ద వీరప్ప ఏడాది క్రితం వ్యవసాయ పనుల కోసం రూ.లక్ష అప్పు తీసుకున్నారు. పంట దెబ్బతినడంతో తీర్చలేదు. ఈ నెల 13న వడ్డీ వ్యాపారి హన్మంత్రెడ్డి.. వీరప్ప ఇంటికి వెళ్లి అతని భార్య లక్ష్మితో దురుసుగా ప్రవర్తించాడు. మనస్తాపం చెందిన ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు మృతురాలి భర్త వీరప్ప కరన్కోట్పీఎస్లో హన్మంత్రెడ్డి, ఉమాదేవిపై ఫిర్యాదు చేశాడు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె కరన్కోట్ పోలీసులకు ఫోన్ చేసి నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మంత్రెడ్డి ఇంటికి తాళం వేసి వెళ్లాడని, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని ఎస్ఐ వినోథ్ రాథోడ్ వివరణ ఇచ్చారు. అధికార పారీ్టకి చెందిన ఓ నేత నిందితులను కాపాడుతున్నట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. -
త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టు సమాచారం. రానున్న పది, పదిహేను రోజుల్లో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. మోదీ పర్యటన, జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.వివరాల మేరకు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ.. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో మోదీ తెలంగాణలో కూడా పర్యటించేలా స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అలాగే, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల కోసం పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక, ఇప్పటికే స్థానిక నేతలకు మోదీ టూర్పై రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే నేడు సికింద్రాబాద్ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటర్నల్ సమావేశం ఏర్పాటుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మోదీ టూర్ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాగా, మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగే అవకాశం ఉంది. -
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ను సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేయగా.. అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నారు. రోహిత్కు 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేశారు. అభిషేక్ సింగ్సెల్ఫోన్ డేటాను సిట్ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుండి ఎవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారు? అనే విషయంపై సిట్ కూపీ లాగుతోంది.కాగా, డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. పలు కీలక విషయాలను సేకరిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
ఆర్సీబీ టికెట్ కొంటే మెట్రోలో ఫ్రీ జర్నీ
బెంగళూరు (శివాజీనగర): ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఒక వారం మాత్రమే గడువు ఉంది. పోటీలను స్వస్థలం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిపేందుకు అనుమతి పొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు తన అభిమానులకు బంపర్ ఆఫర్ను ఇచ్చింది. టికెట్ కొనుగోలు చేసిన వారికి ‘నమ్మ మెట్రో’లో ఆయా రోజుల్లో ఉచితంగా ప్రయాణానికి అవకాశం లభించనుంది. మెట్రో ప్రయాణపు క్యూర్ కోడ్ సైతం లభించనుంది. టికెట్ కొనుగోలు ఎలా? ఈసారి ఆర్సీబీ జట్టు స్వస్థలంలో పోటీలకు ఆన్లైన్ టికెట్లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించింది. జట్టు అధికారిక వెబ్సైట్ లేదా, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. త్వరలో టికెట్ అమ్మకాల తేదీని ప్రకటిస్తారు. ఇతర వెబ్సైట్లకు గాని వ్యక్తులకు కాని టికెట్ అమ్మకాల హక్కులు లేవు. ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడు? 2026వ సంవత్సర ఐపీఎల్ టోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయమై తొలి దశ టైం టేబల్ను సైతం విడుదల చేశారు. పశి్చమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా తొలి 20 పోటీల టైం టేబల్ను మాత్రం ప్రకటించారు. టోర్నీ ప్రారం¿ోత్సవ పోటీల్లో ప్రస్తుతం చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైసర్స్ హైదరాబాద్ జట్లు ముఖాముఖి తలపడతాయి. ఈ పోటీలకు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి క్రీడా మైదానం అతిథ్యం ఇస్తోంది. తొలి దశలో ఆర్సీబీ తలపడే మ్యాచ్లు: -
భర్తను శ్మశానవాటికలో వదిలేసిన భార్య
జగిత్యాల క్రైం: అనారోగ్యంతో ఇంటిపెద్ద మంచానపడగా.. అతడు బతికుండగానే శ్మశానవాటికలో వది లేసిన దీనగాథ పలువురిని కన్నీరు పెట్టించింది. పోషణ భారమవుతోందని సొంతింటి వారే శ్మశానవాటిక లో వదిలివెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాం«దీనగర్కు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ది నిరుపేద కుటుంబం. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీధర్ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి మూడు నెలల కిందటే అనారోగ్యం బారిన పడి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. దీంతో భార్య కిరాణం షాపులో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లతో పాటు భర్తను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి శ్రీధర్ ను కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ శివారులోని శ్మశానవాటికలో వదిలేసి వెళ్లారు. శ్మశానవాటికలో ఒంటరిగా ఉన్న శ్రీధర్ను గమనించిన స్థానిక కౌన్సిలర్ భర్త రాము 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. కనికరం లేకుండా ప్రాణం ఉండగానే శ్మశానవాటికలో వదిలేసి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రెవెన్యూ, పోలీసులు జోక్యం చేసుకుని మానవతా దృక్పథంతో శ్రీధర్ను కుటుంబ సభ్యులే పోషించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
సిలిండర్ దొరికినోళ్లే ధురంధర్
హైదరాబాద్: నగరంలో గ్యాస్ కష్టాలు సాధారణంగా మారాయి. హోటళ్లు, పీజీలు ఇప్పటికే మూతపడుతుండగా.. మరోవైపు సాధారణ ప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్ బుకింగ్లు కాకపోవడంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. గృహిణులు అయితే చంటి పిల్లలతోనూ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. కాగా, హోటల్ నిర్వాహకులు కొందరు ఓపెన్ కిచెన్ లో వంట చేస్తున్నారు. సీఎన్జీతో నడిచే ఆటోలకూ కటకట ఏర్పడింది. దీంతో గ్యాస్ బంకుల వద్ద వాహనాలతో డ్రైవర్లు బారులు తీరుతున్నారు. -
వైద్యం, ఆరోగ్యానికి రూ. 13,679 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వార్షిక బడ్జెట్లో ఈసారి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. గత బడ్జెట్తో పోలిస్తే సుమారు 10 శాతం నిధులు పెంచింది. 2025–26లో ఆరోగ్యశాఖకు రూ. 12,393 కోట్లు ప్రతిపాదించగా తాజా బడ్జెట్లో రూ. 13,679 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 6,985 కోట్లు, ప్రగతి పద్దు కోసం రూ. 6,695 కోట్లను ప్రతిపాదించింది. నిర్వహణ పద్దులో పరిపాలన, ఉద్యోగుల జీతభత్యాలు మొదలైన వాటికి నిధులు కేటాయించింది. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ కోసం రూ. 1,143 కోట్ల మేర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. అంటే నెలకు సుమారు రూ. 100 కోట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు కేటాయించనుంది.ప్రగతి పద్దులో నిధుల కేటాయింపు ఇలా...వైద్య, ఆరోగ్యశాఖలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్వహణతోపాటు ఇతర వైద్య సంబంధమైన అంశాలకు బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దు కింద కేటాయించిన రూ. 6,695 కోట్లను ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలు, పథకాల అమలుకు వినియోగించనుంది. ఈ బడ్జెట్లో మాతాశిశు ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, మానసిక ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారీకి ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల స్థాయి పెంపుతోపాటు కొత్తగా ఏర్పాటు చేసే మూడు ‘టిమ్స్’, వరంగల్ ఆసుపత్రి కోసం నిధులు వెచ్చించనుంది. -
పన్ను రాబడులే‘పునాదిగా’
సాక్షి, హైదరాబాద్: పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే పునాదిగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్కు రూపకల్పన చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడులు 3,24,134 కోట్లు ప్రతిపాదించగా, అందులో రాష్ట్ర సొంత పన్ను రాబడులు రూ.1,48,165.75 వస్తాయని అంచనా వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద వస్తుందని అంచనా వేసిన రూ.33,181.64 కోట్లు కలిపితే అది రూ.1,81,347.39 కోట్లకు చేరనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రాబడుల్లో పన్ను ఆదాయం రూపంలోనే 56 శాతం నిధులు సమకూరుతున్నాయన్న మాట. ఈ రాబడులను శాఖల వారీగా పరిశీలిస్తే ఈసారి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.52,310 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా రూ. 38,105 కోట్లు, వాహనాల పన్ను రూపంలో రూ. 8,814 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక, 2025–26లో పన్ను రాబడులను పరిశీలిస్తే రూ.1,63,490 కోట్లు సమకూరింది.ఇందులో సొంత పన్నుల ఆదాయం రూ.1.34 కోట్లు కాగా, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,471 కోట్లు సమకేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే పన్ను రాబడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర పన్నుల్లో వాటాను మినహాయించి 2024–25లో వచ్చింది రూ.1.09 లక్షల కోట్లు కాగా, 2025–26లో రూ.1.34 లక్షల కోట్లు వచ్చాయి. అంటే రూ.25వేల కోట్ల మేర పన్ను రాబడులు పెరిగాయన్న మాట. ఈ నేపథ్యంలోనే రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ మేరకు పన్ను ఆదాయంలో వృద్ధి ఉంటుందనిఅంచనా వేసిన ప్రభుత్వం కేంద్ర పన్నుల్లో వాటాను కలిపి 1.81 లక్షల కోట్లు పన్ను ఆదాయాన్ని ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయం తగ్గినాబడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే గత రెండేళ్లుగా ఆశించిన మేరకు పన్నేతర ఆదాయం రావడం లేదు. 2024–25లో రూ.35 వేల కోట్ల పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు రూ. 25,807 కోట్లు వచి్చంది. అంటే బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడికి రూ.10వేల కోట్లు తేడా ఉంది. ఇక, 2025–26లో రూ.31,611.47 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ఆశించినా రూ.29,318 కోట్లు మాత్రమే సమకూరింది. అయినా పన్నేతర ఆదాయంపై ఆశలతో 2026–27 బడ్జెట్లోనూ రూ. 35,730.20 కోట్లను పన్నేతర ఆదాయం పద్దు కింద ప్రతిపాదించారు. గత ఏడాది ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్ల మేర పన్నేతర ఆదాయం పెంచడం గమనార్హం.సగానికి సగం తక్కువకేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు సగానికి సగం తగ్గాయని 2025–26 సవరించిన అంచనాలు చెబుతున్నాయి. 2024–25లో రూ.21,636.15 కోట్లు ఈ పద్దు కింద వస్తుందని అంచనా వేయగా, అందులో రూ.19,836 కోట్లు వచి్చనట్టు చూపెట్టారు. కానీ, 2025–26లో రూ. 22,782.50 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దును చూపెట్టగా, అందులో కేవలం రూ.11,161.49 కోట్లు మాత్రమే వచి్చంది. అయినా ఈసారి కేంద్రంపై భారీ ఆశలతో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దును పెంచి రూ.24,166 కోట్లుగా చూపెట్టడం గమనార్హం. మద్యం,రిజిస్ట్రేషన్ల ఆదాయంపైనే ఆశ మద్యం, రిజిస్ట్రేషన్లు.. ఈ రెండింటి ద్వారా వచ్చే ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థమవుతోంది. వాస్తవానికి 2025–26లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.19,087 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ, ప్రతిపాదిత బడ్జెట్ కంటే దాదాపు రూ.3 వేల కోట్లు తక్కువగా రూ.16,087 కోట్ల ఆదాయం వచ్చింది. అయినా 2026–27 బడ్జెట్లో ఈ శాఖ ద్వారా రూ.19,540 కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించడం గమనార్హం. దీనిని బట్టి ఈసారి భూముల విలువల సవరణ తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2024–25లో ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.25,617.53 కోట్లు సమకూరగా, ఏ4 (వైన్) షాపులకు టెండర్లు íపిలవడం ద్వారా రూ.2వేల కోట్లు ఎక్కువగా వస్తుందన్న అంచనాల మేరకు రూ.27 వేల కోట్లు ప్రతిపాదించారు. అయితే, వైన్షాపుల టెండర్ల ద్వారా సమకూరిన మొత్తంతో కలిపి కూడా ఎక్సైజ్ ఆదాయం రూ.23,623 కోట్లు మాత్రమే వచి్చంది. అంటే దాదాపు రూ.4 వేల కోట్లు తగ్గింది. ఈ బడ్జెట్లో కూడా ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.27,668 కోట్లుగా ప్రతిపాదించడం గమనార్హం. -
అప్పులు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే అప్పుల పద్దు ఈసారి బడ్జెట్లో కూడా పెరిగింది. అనివార్య ఖర్చులు, రెవెన్యూ వ్యయం సజావుగా సాగేందుకు వీలుగా వివిధ రూపాల్లో తీసుకునే రుణాలు 2026–27 బడ్జెట్లో రూ.80 వేల కోట్లు దాటాయి. 2025–26లో రూ.74,645 కోట్లను ప్రతిపాదించగా, ఈసారి అంతకంటే దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కువగా రూ.82,870.42 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాలే రూ.73,383 కోట్లు ఉన్నాయి. అలాగే కేంద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర రుణాలు, డిపాజిట్ లావాదేవీలు, అడ్వాన్సుల రూపంలో మరో రూ.4 వేల కోట్ల వరకు అప్పు తీసుకోవాలని ప్రతిపాదించారు.సగం వరకు చెల్లింపులకే..ఏటా తీసుకునే అప్పులతో పాటు పద్దులో చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. కాలపరిమితి తీరిన గత అప్పులు, అన్ని అప్పులకు వడ్డీలు ఏయేటికాయేడు చెల్లించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు చేస్తారు. ఈ మేరకు అప్పుల్లో అసలుతో పాటు వడ్డీల చెల్లింపు కింద రూ.41 వేల కోట్లు చూపెట్టారు. ఇందులో అసలు కంటే వడ్డీలే ఎక్కువ ఉండడం గమనార్హం. 2026–27లో అసలు కింద రూ. 19,785 కోట్లు చెల్లించనుండగా, వడ్డీల కింద రూ.21,304 కోట్లు కట్టనున్నారు. ఇవి పోను మిగతా రూ.41 వేల కోట్లు ఇతర ఖర్చుల కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.బడ్జెట్ కంటే ఎక్కువ సేకరణగత రెండు బడ్జెట్లను పరిశీలిస్తే ప్రతిపాదించిన వాటి కంటే ఎక్కువే అప్పులు సేకరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రూపాల్లో కలిపి 2024–25లో రూ.62 వేల కోట్లు తీసుకోవాల్సి ఉండగా, రూ.63,786 కోట్లను సేకరించింది. 2025–26లో రూ.74,645 కోట్ల మేర రుణాలు తీసుకోవాలని బడ్జెట్లో పెట్టగా రూ.77,359 కోట్లను సేకరించారు.మూడేళ్లలో రూ.20 వేల కోట్లు పెరిగిన రుణాలురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 2024–25లో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ ఏడాది పద్దు రూ. 62,440 కోట్లు ఉండగా, ఆ తర్వాతి ఏడాది రూ.74 వేల కోట్లకు పెరిగింది. ఈసారి రూ.82 వేల కోట్లకు చేరడంతో మూడేళ్ల కాలంలో ఒక్క అప్పుల పద్దే ఏకంగా రూ.20 వేల కోట్లు పెరిగినట్టయింది. అదేవిధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తో పోలిస్తే అప్పులు 32.5 శాతానికి చేరినట్టు బడ్జెట్ గణాంకాల్లో వెల్లడించారు. 2025–26లో కూడా ఇదే రీతిలో అప్పుల ప్రతిపాదనలుండడం గమనార్హం. -
9 కొత్తగా పథకాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి లెక్కల పద్దుతోపాటు కొన్ని కొత్త పథకాలకూ బడ్జెట్ వేదికైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలకు నిధుల కేటాయింపును ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కొత్తగా 9 పథకాలనూ ప్రకటించారు. వాటి వివరాలను శుక్రవారం బడ్టెట్లో ప్రస్తావించారు. వీటిల్లో కొన్ని పూర్తి కొత్త పథకాలు కాగా, కొన్ని అమలులో ఉన్న వాటి పరిధి పెంచారు. వీటికి నిధులను ప్రతిపాదించారు.‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకుటుంబానికి జీవనధారమైన ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబం ఇబ్బందులు పడకుండా బీమా సౌకర్యాన్ని క ల్పించాలని నిర్ణయించారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’అని నామకరణం చేశారు. రాష్ట్రంలో దాదాపు 1.15 కోట్ల కుటుంబాలు ఉన్నాయని సామాజిక, ఆర్థిక తారతమ్యాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ జీవిత బీమా పథకం వర్తిస్తుందని భట్టి ప్రకటించారు. బడ్జెట్లో ఈ పథకానికి రూ. 4వేల కోట్లు కేటాయించారు. చేయూత కింద...చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన 2 లక్షల పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 43 లక్షల మందికి చేయూత అందిస్తున్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రాష్ట్ర విద్యా కమిషన్ సూచన మేరకు మొత్తం 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎంపిక చేసిన ఈ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థ, ఇతర అన్ని వనరులతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్పు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు. ఈ పథకానికి రూ.500 కోట్లు ప్రతిపాదించారు.ఆరోగ్య భద్రత పథకం ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభించాలని బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు చికిత్స పొందడానికి వీలుంటుంది. ప్రతీ ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం ఉద్యోగుల భద్రత కోసం దేశంలో తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం ద్వారా రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ 2 కోట్ల అదనపు కవరేజీ లభిస్తుంది. ఇది 7.57 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు.విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మి డియెట్ వరకు విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతీ విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి జావ అందిస్తారు. దీనికి బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయించారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మి డియెట్ అభ్యసిస్తున్న విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పథకం ఇంటర్ విద్యార్థులకూ దక్కనుంది. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంవిదేశాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. యువతకు వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ, ఉపాధికి అవకాశం ఉన్న వివిధ దేశాల భాషల్లో అవగాహన క ల్పించటం, వారికి వీసా పొందటంలో మార్గనిర్దేశం చేయటం, విదేశీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు, ఆయా దేశాల్లో ఆరోగ్య సేవలు కల్పించటం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఇందుకోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లుబడ్జెట్లో వెల్లడించారు. దీనికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించారు. ఏటీసీ ట్రైనీలకు స్కాలర్షిప్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏటీసీ)లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెలా రూ. 2 వేలు స్కాలర్íÙప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.80 కోట్లు ప్రతిపాదించారు. -
పెంపుడు పిల్లి కోసం ప్రాణం తీసుకుంది
అల్వాల్: పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగి ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రిసాలా బజార్ పరిధిలోని శివ్మన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ శ్రేష్ట (23) ఎంబీబీఎస్ చదువుతోంది.కాగా ఇంట్లో పెంపుడు పిల్లి విషయమై తల్లి, కుమార్తెల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేష్ట చున్నీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందింది. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు 108 అంబులెన్స్కు సమాచా రం అందించగా.. శ్రేష్ట అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్వాల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెచ్చిపోయిన పిచ్చికుక్క
దుబ్బాక: పిచ్చికుక్క దాడిలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పట్టణంలోని 16వ వార్డులో పోలీస్స్టేషన్ సమీపంలో పిచ్చికుక్క కనిపించిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో 15 మంది గాయపడ్డారు. కాగా వీరిలో పర్స బాలయ్యకు తీవ్రగాయాలు కావడంతో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.మిగతా 14 మంది దుబ్బాక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క కనిపించిన వారందరిపై దాడి చేసి.. కరవడంతో తీవ్ర రక్త స్రావాలయ్యాయి. పట్టణంలోని 16 వార్డుకు చెందిన 12 మంది, 1, 20 వార్డులకు చెందిన ముగ్గురిపై దాడి చేసింది. అనంతరం ప్రజలు పిచ్చికుక్కను చంపారు. కౌన్సిలర్ రాజు, నాయకులు శ్రీరాం రవీందర్, సాయితేజగౌడ్ గాయపడిన వారికి చికిత్స చేయించారు. -
పండుగ వేళ.. తీరని విషాదం
భద్రాచలం అర్బన్/ఉయ్యూరు రూరల్/కుక్కునూరు/మంగళగిరి టౌన్/ఎటపాక: గోదావరి తీరం వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం దగ్గర గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ఏపీ వాసులు, ఇద్దరు భద్రాచలం వాసులుగా తేలింది. ముగ్గురి మృతదేహాలు లభించాయి. భద్రాచలం పట్టణానికి చెందిన చారిగుంట్ల శ్రీకర్గుప్తా(21) విజయవాడలోని అమరావతి ఎస్ఆర్ఎమ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, పొడిచేటి అభిరామ్(21) భద్రాచలంలో వేద విద్య అభ్యసిస్తున్నారు. వీరు ఏపీ, తెలంగాణ సరిహద్దులోని గోదావరి నదిలో గతంలో దిగిన ఫొటోలను తమ స్నేహితులకు చూపించారు. దీంతో ఆ ప్రదేశం బాగుందని మిత్ర బృందం భావించింది. ఈక్రమంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కనుమూరు గ్రామానికి చెందిన దగ్గుబాటి నవదీప్(19), ఉయ్యూరుకు చెందిన గోక తేజజ్ఞసాయి(19), మదనపల్లెకు చెందిన సతీశ్(19)తో పాటు మరో ఇద్దరు స్నేహితులైన సీహెచ్.దీపక్, గడ్డం హర్షవర్ధన్ ఐదుగురు గురువారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. వీరందరూ విజయవాడ సమీపంలోని విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. స్థానికులైన శ్రీకర్, అభిరామ్తో కలిసి మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం సరదాగా ఫొటోలు దిగేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి తీరానికి బయలుదేరారు. లోతు ఉన్న ప్రాంతం కావడంతో.. కొల్లుగూడెం దగ్గర గోదావరి నదిలో నీటి పాయ అవతలి ఒడ్డు(కుక్కునూరు) దిశగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక తిన్నెల్లో సుమారు రెండు కిలోమీటర్లు దూరం నడిచి, నీరు ఉన్న ప్రాంతానికి వారంతా చేరుకున్నారు. వీరు చేరుకున్న ప్రదేశానికి ఎగువన కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తుండగా దిగువన కొంత దూరంలో పాములేరు వాగు కలుస్తుంది. దీంతో పెద్ద బండరాళ్లతో కూడిన ఆ ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నీటి లోతు ఇరవై అడుగుల పైనే ఉంటుందని అంచనా. ఇది ప్రమాదకర ప్రదేశమని తెలియని విద్యార్థులంతా తమ ఫోన్లు ఒడ్డున ఉంచి నీళ్లలోకి దిగారు.సాయం అందలేదు వారిలో ముందుగా తేజజ్ఞ లోతును అంచనా వేయలేక మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరుగా శ్రీకర్గుప్తా, అభిరామ్, నవదీప్, సతీశ్ కూడా మునిగారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో నీళ్లలో ఉన్న దీపక్ బయటకు వచ్చాడు. నీళ్లలోకి వెళ్లి గల్లంతవుతున్న వారిని కాపాడేందుకు హర్షవర్ధన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాగే, భద్రాచలం వైపు ఒడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉండడం, కుక్కునూరు వైపు పూర్తిగా నీరు ఉండడంతో సమీపంలో సాయం చేసే వారెవరూ కనిపించలేదు. కనీసం చేపలు పట్టే వారు కూడా ఆ సమయంలో లేరు. ఉదయం 11గంటలకు గోదావరిలో నీటి పాయ దగ్గరకు చేరుకుంటే కాసేపటికే 11–15 గంటలకు ప్రమాదం జరిగింది. నీళ్లలో మునిగిన స్నేహితులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తమ ఫోన్ల ద్వారా 11–30 గంటలకు బయటకు సమాచారం చేరవేశారు.గజ ఈతగాళ్లతో గాలింపుస్నేహితులు ఐదుగురు గల్లంతైన సమాచారాన్ని దీపక్, హర్ష కలిసి శ్రీకర్ గుప్తా తండ్రికి ఫోన్లో చెప్పారు. దీంతో ఆయన భద్రాచలం పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులతో పాటు ఎటపాక అధికారులకు కూడా ఫోన్ చేశారు. గజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, నవదీప్, అభిరామ్ మృతదేహాలు బయటపడగా.. సతీష్కుమార్, తేజజ్ఞ ఆచూకీ తెలియరాలేదు. ఉయ్యూరు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి విషాద చాయలు అలుముకున్నాయి.మృతులు, గల్లంతైన వారి వివరాలు 01) చారుగుళ్ల శ్రీకర్ గుప్తా(21), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: చారుగుళ్ల రామకృష్ణ, భద్రాచలం 02) దగ్గుబాటి నవదీప్(19), విజయవాడ కేఎల్యూలో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: ఫణీంద్రనాథ్, కనుమూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 03) పొడిచేటి అభిరామ్(19), వేదవిద్య తండ్రి: వంశీ, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 04) పాశం సతీష్ కుమార్(19), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: పాశం నారాయణ, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ 05) గోకా తేజజ్ఞ సాయి(19), అమరావతి ఎస్ఆర్ఎంలో బీటెక్ సెకండ్ ఇయర్ స్వస్థలం: ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్స్థానిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శ యువకులు నదిలో గల్లంతైన ఘటనలో ఆంధ్ర అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ తరువాత ఘటనా స్థలానికి ఎటపాక, కుక్కునూరు మండల అధికారులు వచ్చారు. ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కూడా కాదంటూ వాదించుకున్న తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. కనీసం మండల సరిహద్దులు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా ? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకోవాల్సింది పోయి తమ ప్రాంతం కాదంటూ తప్పించుకునే వ్యవహార శైలి సరైనది కాదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దులు తెలియకుండా పాలనా వ్యవస్థ ఎలా నడిపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమని, ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా మృతుల కుటుంబాలకు సానుభూతి సాక్షి, అమరావతి: ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
వడగళ్ల వానతో 250 ఎకరాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న
జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో శుక్రవా రం కురిసిన భారీ వడగళ్ల వర్షానికి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మండలంలోని జక్రాన్ పల్లి, అర్గుల్, తొర్లికొండ గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల వాలింది. సుమారు 250 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం జరిగింది.అలాగే కల్లాలలో ఆరబెట్టిన పసుపు పంట తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించాలని, ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. -
కొనసాగుతున్న సిట్ విచారణ
మొయినాబాద్/శంషాబాద్ రూరల్: ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. నాలుగో రోజు శుక్రవారం శంషాబాద్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారులు నిందితులను విచారించారు. స్టేషన్ బెయిల్ పొందినవారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్యాదవ్ మినహా మిగిలిన ఏడుగురు అర్జున్రెడ్డి, కౌశిక్ రవి, శరత్కుమార్, విజయ కృష్ణ, రమేష్, శ్రావణ్కుమార్, ప్రియాంకరెడ్డి విచారణకు హాజరయ్యారు.సిట్ అధికారులు ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించి వారి నుంచి డ్రగ్స్కు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ లోక్సభ సమావేశాలు ఉన్నందున వచ్చే నెల 4 వరకు విచారణకు హాజరు కాకుండా మినహాయింపు తీసుకున్నారు. ఎంపీతోపాటు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకొని విచారిస్తేనే ఈ కేసులో అసలు విషయాలు బయటకొస్తాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. శంషాబాద్కు సీపీ సు«దీర్బాబుడ్రగ్స్ కేసు విచారణను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శంషాబాద్ పీఎస్కు చేరుకొని సిట్ అధికారులతో చర్చించారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది. పెడ్లర్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలను రాబట్టాలని సూచించారు. ఈ వివరాలు తెలిస్తేనే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోసారి వాయిదా.. డ్రగ్స్ పార్టీలో గన్ ఫైరింగ్ చేసి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, అతని తమ్ముడు రితీష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 17న రాజేంద్రనగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీనిపై 18న కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 20కి వాయిదా వేసింది. 20న శుక్రవారం కోర్టుకు సెలవు ఉండటంతో తీర్పు సోమవారానికి వాయిదా పడింది.పాత రికార్డుల పరిశీలనవివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన రోహిత్రెడ్డి ఫామ్హౌస్ను సీజ్ చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఫాంహౌస్ భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరినట్టు తెలిసింది. రెవెన్యూ అధికారులు సైతం ఫాంహౌస్ భూమికి సంబంధించిన రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. అజీజ్నగర్ సర్వేనంబర్ 177/33లోని 2.20 ఎకరాల్లో రోహిత్రెడ్డి ఫామ్హౌస్ ఉంది. 2006లో రోహిత్రెడ్డి తండ్రి విఠల్రెడ్డి పేరుతో ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది అసైన్డ్ భూమి కావడంతో రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అసైని అంతంగారి జంగయ్య పేరే వస్తోంది.అసైన్డ్ భూమి ఎలా రిజి్రస్టేషన్ జరిగింది ? అసలు పాత రికార్డుల్లో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారులు పాత దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఫామ్హౌస్ను సీజ్ చేయాల్సి వస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా పాత రికార్డులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఫామ్హౌస్ను సీజ్ చేయాల్సి వస్తే అసైన్డ్ భూముల్లో ఉన్న మిగతా ఫామ్హౌస్లు, కబ్జాదారులపైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ అధికారులు అసైన్డ్ భూముల్లో ఉన్న ఫామ్హౌస్లు, నిర్మాణాలు, కబ్జాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
గ్యారంటీలకు ఘోరీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘోరీ కట్టారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావు విమర్శించారు. ఇది దగాకోరు, ప్రజలను తీవ్రంగా నిరాశపరిచే బడ్జెట్ అని అన్నారు. వృద్ధాప్య, దివ్యాంగుల పింఛను పెంపు ఊసే లేదని, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ప్రస్తావన కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేల గురించిన కనీస ఊసు కానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు చేస్తూ అందులోనూ గత బడ్జెట్తో పోలిస్తే కోతలు పెట్టారన్నారు.ఆరు గ్యారంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు కుదించారని పేర్కొన్నారు. కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నారని ధ్వజమెత్తారు. 3 లక్షల పింఛన్లు తొలగించి, 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారని విమర్శించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. శుక్రవారం ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, కేపీ వివేకానంద, సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్లతో కలిసి హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. 20 పేజీలు, రూ.20 వేల కోట్లు పెంచారు తప్ప.. ‘బడ్జెట్ ప్రసంగాన్ని 20 పేజీలు, బడ్జెట్ను రూ.20 వేల కోట్లు పెంచారే తప్ప.. ఆరు గ్యారెంటీల ఊసెత్తలేదు. నిధుల కేటాయింపు చేయలేదు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. గత బడ్జెట్లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు. మళ్లీ అవే పథకాలు వల్లవేశారు. గత బడ్జెట్లోనే రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు కానీ పైసా విడుదల చేయలేదు. మళ్లీ ఈసారి బడ్జెట్లో అంతే మొత్తాన్ని ప్రతిపాదించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగింది. ఇందిరమ్మ, రాజీవ్గాంధీల పేర్లు చెప్పివారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు..’అని హరీశ్రావు విమర్శించారు. మూడు ముక్కలు చేయడం తప్ప.. ‘తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ పేరిట, హైదరాబాద్ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా మూడు ముక్కలు చేయడం తప్ప చేసిందేమీ లేదు. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. బడ్జెట్ అంతా బోగస్. అభయహస్తం కాదు రిక్త హస్తమని ప్రజలకు అర్థమైంది. పింఛన్ల పెంపు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులకు ప్రయోజనాలు లేవు. అన్ని కులాలకు, వర్గాలకు మొండిచేయి చూపారు. మూడేళ్లు కాకుండానే రూ.3.5 లక్షల కోట్ల అప్పలు మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. అంత అప్పు చేసి ఒక్క రూపాయితో ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా? కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. మిషన్ భగీరథ అమలు చేశారు. మెడికల్ కాలేజీలు కట్టించారు. కేసీఆర్ తాను తెచ్చిన అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించారు. మీరు వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనంతగా అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 29 శాతానికి పెంచారు..’అని బీఆర్ఎస్ నేత విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని.. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింప చేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ కేబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పారు. నాసిరకం పనులతో నాలుగు రోజులకే భాగోతం బయటపడింది. ఇండస్ట్రియల్ హబ్ కాదు.. కరప్షన్ హబ్గా మార్చారు. సింగరేణిని స్కాంల ఖనిగా, కుంభకోణాల కేంద్రంగా మార్చారు. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు. మీ పాలనలో 167 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులు అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. డిప్యూటీ సీఎం భట్టి దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని అంటుంటే.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం దివాళా తీసింది అంటున్నారు. ఇందులో ఏది నిజం? దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పాలనలో 14 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం మాత్రమే. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. పాలనలో ఫెయిల్ మీరు పాలనలో ఫెయిల్ అయ్యారు. హైడ్రా కూల్చివేతలు, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. గతేడాది యాసంగిలో సన్నరకం వడ్లకు రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. భూముల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. మేము నోటిఫికేషన్లు ఇస్తే.. నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మీరే ఇచ్చినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల రేషన్కార్డులు ఇచ్చినట్లు ఉత్తమ్కుమార్రెడ్డి చెబితే..భట్టి ఇవ్వలేదంటున్నారు..’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. మహాలక్ష్మీలో రూ.2,800 కోట్లు బకాయి ‘మహాలక్ష్మీ కింద ప్రభుత్వం రూ.2,800 కోట్లు బకాయి పడింది. ఆరీ్టసీకి రూ.9,222 కోట్లు ఇస్తే సంస్థ రూ.3 వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు కారి్మకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు?..’అని మాజీమంత్రి నిలదీశారు. -
రేషన్కార్డు ఉంటేనే కుటుంబ బీమా
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో నాకెలా తెలుస్తుంది. కొడుకు, కూతురు, అల్లుడు కలిసి గృహ నిర్బంధం చేశారేమో.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి చెవుల్లో పువ్వులు పెట్టుకొని రావడం కాదు. వారిని వంగోబెట్టి వీపు మీద బండపెట్టాలి. ఊళ్లలో తప్పులు చేసినోళ్లకు బంజరుదొడ్డి కాడ అట్లనే చేసేవారు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవిని ఎవరైనా అడగొచ్చని, మల్లికార్జునఖర్గే బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి ఏఐసీసీ ప్రెసిడెంట్కు ఎదిగారని గుర్తు చేశారు.చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని చెబుతారని, అలాగే తాను సీఎంగా ఉన్నాను కాబట్టి, మళ్లీ వచ్చేసారి కూడా తానే సీఎంనని చెప్పినట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎల్పీ సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎంను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలి కమిటీ హాల్లో ఆయన మీడియాతో ‘చిట్చాట్’చేశారు. సీఎం వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.... పనోడిలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తున్నా..: సీఎంగా కేంద్రం నుంచి నిధులు తేవడం కూడా ఓ పనే. నేను పాలకుడిని కాదు. సేవకుడిని. ప్రజలు ఐదేళ్ల కోసం ఓ పనోణ్ణి పెట్టుకున్నారు. గతంలో బాగా పనిచేస్తాడని పెట్టుకున్నాయన ఫాంహౌస్ల పడుకున్నందుకు ఆయన్ను మార్చారు. ఢిల్లీలో సీఎంకు కేంద్ర ప్రభుత్వం బంగ్లా ఎందుకిస్తుంది? గతంలో ఢిల్లీకి వెళ్లి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ప్రాయోజిత పథకాల మీద దృష్టి పెట్టి సాధించుకుంటున్నాం. డీపీఆర్ సబి్మట్ చేస్తే కేంద్రం 25 శాతం నిధులు ఇస్తది. మూసీకి కేంద్రం ఆమోదం తెలపలేదని ఎవరన్నారు? కేంద్రం ఆమోదం తెలిపితేనే మూసీనది ప్రక్షాళనకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రుణానికి ఒప్పుకుంది. మూసీ ప్రక్షాళన ఆగదు: మూసీనది ప్రక్షాళన ఆగదు. మూసీ బఫర్జోన్లో అటు ఇటు 50 మీటర్ల చొప్పున తీసుకొని అభివృద్ధి చేయాలి. 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో డిసెంబర్ 2024లో కన్సల్టెన్సీని అపాయింట్ చేస్తే 21 కిలోమీటర్లకు సంబంధించి లంగర్హౌస్ వరకు డీపీఆర్ రిపోర్టు ఇచ్చింది. అభివృద్ధి చేసే క్రమంలో ప్రజలకు జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనేది చూడాలి. ఈ విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వమని అడిగినం. పబ్లిక్ డొమైన్లో పెట్టినం. రేషన్కార్డు ఉంటేనే... రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే రేషన్కార్డు కలిగిన కుటుంబాలకే రూ.5 లక్షల కుటుంబబీమా అమలు చేస్తాం. ప్రస్తుతం వ్యవసాయ భూమి కలిగిన రైతులకు కల్పిస్తున్న రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్కార్డు కలిగిన కుటుంబాలకు ఇస్తాం. అప్పుడు రైతుబీమా కూడా అందులోకే వస్తుంది. కుటుంబ ఆర్థిక స్తోమత నిర్థారణకు రేషన్కార్డు ఒక్కటే కొలమానం. తెలంగాణ విద్యావిధానంలో సంస్కరణలు తెలంగాణ విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తున్నాం. అందుకోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న 10 ప్లస్ 2 విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. ఈ మేరకు విద్యాకమిషన్ ఇచ్చిన నివేదికను కె.కేశవరావు నేతృత్వంలోని ఓ కమిటీకి అప్పగించాం. ఈ కమిటీకి అభ్యంతరాలు, సూచనలు ఇస్తే, తుది నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. రూ.3.30 లక్షల కోట్ల పాత అప్పులు చెల్లించాం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు రూ.3.47 లక్షల కోట్లు అప్పుగా తెచ్చాం. అందులో రూ.3.30 లక్షల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కింద చెల్లించాం. ఇందులో రూ.44 వేల కోట్లు కాళేశ్వరం కోసం చేసిన అప్పులు చెల్లించాం. చేసిన మొత్తం అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లను మాత్రమే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాం. చట్టపరంగానే విచారణ ఫార్ములా–ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేస్ ఏదైనా చట్టప్రకారంగానే విచారణ జరుగుతుంది. ప్రభాకర్రావు 20 నెలలు ఇండియాలోనే లేడు. ఆయన వచ్చిన తర్వాత జరిపిన విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటున్నాయి. ఆరువేల ఫోన్లు ట్యాప్ అయినట్టు తేలింది. అందులో భాగంగానే స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఫోన్టాపింగ్ కేసులో క్లీన్చిట్ ఇచ్చినట్టు హరీశ్రావు చెబుతుండడం తప్పు. చక్రధర్గౌడ్ పంజగుట్ట పీఎస్లో తనను హరీశ్రావు బెదిరించాడని చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు అది. హరీశ్రావు బెదిరించినట్టు చక్రధర్గౌడ్ నిరూపించలేనందున కేసును కొట్టేశారు. దీనికి ఫోన్ట్యాపింగ్ కేసుకు ఏ సంబంధం లేదు. టెలిఫోన్ టాపింగ్ కేసులో ఇంకా హరీశ్రావు విచారణనే జరగలేదు. ఈ కేసులో నా ఫోన్లు ట్యాప్ అయినట్టు విచారణాధికారులు నిర్ధారించి విచారణకు పిలిస్తే నేను కూడా వెళతా. హిల్ట్ పాలసీపై ఏ విచారణ కోరినా ఆదేశాలిస్తా హిల్ట్ పాలసీలో రూ.5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు రోజుకోమాట మాట్లాడుతున్నారు. హిల్ట్ కింద 9 వేల ఎకరాలు లే అవుట్ చేసినా, అక్కరకొచ్చేది 4 వేల ఎకరాలే. 1970 నుంచి పరిశ్రమల కోసం ఇచ్చిన భూములను వారు ఎప్పుడో సొంతం చేసుకున్నారు. భూ బదలాయింపులకు సంబంధించి డబ్బులు కట్టి ఇండ్రస్టియల్ జోన్ నుంచి మల్టీ జోన్కు మార్చుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మొత్తం 9 వేల ఎకరాల భూములను హిల్ట్ పాలసీలో అమ్మినా లక్ష కోట్లు రావు కాదు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం లేదు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. జనాభా లెక్కల్లో అధికార యంత్రాంగం బిజీగా ఉండడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆగాం. ఇక కొత్తగా హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల ఏర్పాటుకు జనాభా లెక్కలకు సంబంధం లేదు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపలి మునిసిపాలిటీలు, గ్రామాల విలీన ప్రక్రియ, కొత్తగా 300 డివిజన్ల ఏర్పాటు అనేది గత డిసెంబర్ నాటికే పూర్తయింది. మండలాలు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు ఉండదు. జనాభా లెక్కలు పూర్తయి, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఏఏ మండలాలు, గ్రామాలు ఏఏ రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పరిధిలోకి వెళ్లాయో తేలిన తర్వాతే రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి, లోపాలను సరిదిద్దుతాం. భూముల విక్రయానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తే అందుకు కాంగ్రెస్ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను దురి్వనియోగం చేసినప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. మూల ధన వ్యయం కోసం భూములు విక్రయించగా వచ్చిన సొమ్మును వాడుకోవచ్చు. ప్రభుత్వ భూములు, రెవెన్యూ, టీజీఐఐసీ, హిల్ట్ పాలసీ మొదలైన ఏ భూములనైనా అవసరానికి అనుగుణంగా విక్రయించొచ్చు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు. నేను బీఆర్ఎస్ను విమర్శిస్తే బీజేపీ బండి సంజయ్ స్పందిస్తాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్, ఫాంహౌస్లో పోలీసులపై కాల్పులకు సంబంధించి బీజేపీ నాయకులు ఎక్కడైనా స్పందించారా? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడొద్దా?. జీవన్రెడ్డి విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ చూసుకుంటారు. ఆపరేషన్ కగార్ కేంద్రానికి సంబంధించినది. రాష్ట్ర పరిధిలోకి రాదు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి మంత్రి అజాహరుద్దీన్ ఉన్న గడువు ఏప్రిల్ 30. ఏప్రిల్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీగా రావొచ్చు. అజాహరుద్దీన్, కోదండరాంకు సంబంధించిన ఎమ్మెల్సీల ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. -
నిధుల మూట.. ప్రగతి బాట
సాక్షి హైదరాబాద్: ‘ధీరోదాత్తుడు ఎన్నడూ అవరోధాలకు బెదరడు. అవరోధాలనే అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగుతాడు. ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం అదే చేస్తోంది. ప్రగతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అందుకే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్పై నమ్మకం కలిగించాం. ఇక పురోగతిలో మా మార్కు చూపుతాం. గత రెండున్నరేళ్లుగా ఈ బాటలోనే సాగుతున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటికి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెడుతున్నాం.ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచి్చన హామీలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ‘ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే మా లక్ష్యం. మేము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం. ప్రజలు మాకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం.రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రాన్ని సుస్థిరమైన అభివృద్ధి వైపు నడిపించేదిగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను రూపొందించాం..’ అని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల బడ్జెట్ను డిప్యూటీ సీఎం ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఉప ముఖ్యమంత్రి మాటల్లోనే.. పన్నుల సొమ్ము ప్రజల అభ్యున్నతికే.. ⇒ వరసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు. మేం ప్రజలిక్చిన హామీలను, ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను ఈ రెండున్నరేళ్ల పాలనలో సంతృప్తి్కరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. పన్నుల రూపంలో వచి్చన సొమ్మును, తిరిగి ప్రజల అభ్యున్నతి కోసమే వెచి్చస్తున్నాం. ప్రతి పైసకు మేం కాపలాదారుగా ఉంటున్నాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, పారదర్శకతతో పాలన సాగిస్తున్నాం.రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్ట ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. ప్రజల జీవన స్థితిగతుల మార్పునకు దోహదపడే లెక్కలు. ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. దేశానికి బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ ⇒ 2025–6 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లుగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ 5 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ నిలుస్తోంది. గణనీయంగా పెరిగిన తలసరి ఆదాయం ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు 10.2 శాతం. అదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.2,19,575 కాగా వృద్ధిరేటు కేవలం 6.9 శాతం. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం æ1.9 రెట్లు ఎక్కువ. ⇒ ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలను రూపొందిస్తున్నాం. మరిన్ని కేంద్ర నిధులకు కృషి ⇒ 2014–15 నుంచి 2023–24 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి ఉన్న రూ.3 వేల కోట్లను విడుదల చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకార, సమాఖ్య వాద స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. 2021–22లో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.4,826 కోట్లు రాగా, మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ.7.72 వేల కోట్లను సాధించింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని నిధులను సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. గత ప్రభుత్వ అప్పులతో తీవ్ర భారం ⇒ గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20–39 సంవత్సరాలకు పొడిగించింది. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025–26 నుంచి 2031–32 దాకా చెల్లించాల్సిన రూ.34.58 వేల కోట్ల రుణం రూ.11.915 వేల కోట్లకు తగ్గింది. లక్షల కోట్ల పెట్టుబడులు ⇒ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రధాన రంగాలలో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ముఖ్య వేదికగా నిలిచింది. దీని ద్వారా దాదాపు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దావోస్ వేదికగా ఆవిష్కరించిన ‘నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 వల్ల రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. సింగపూర్, వియత్నాంకు చెందిన సంస్థల నుంచి మొత్తం రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వ్యవసాయానికి ప్రాధాన్యం... ⇒ దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడులలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు ప్రతిపాదించాం. రూ.కోట్లలో మహిళలకు ఆదా ⇒ ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ద్వారా రూ.752 కోట్ల మేర మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటివరకు 10.97 కోట్ల సున్నా బిల్లులు జారీ అయ్యాయి. ఫలితంగా రూ.3,954 కోట్లను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. హైదరాబాద్ సమ్మిళిత, సమాన అభివృద్ధి ⇒ హైదరాబాద్ అభివృ·ద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఔటర్ అవతల, లోపల ఉన్న 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ 3 కార్పొరేషన్లుగా మార్చి సమ్మిళిత, సమాన అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నాం. 30 వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి దానిని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించేలా కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడం కోసం ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో 67,763 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు అవసరమైన మానవ వనరులను అందించడంలో రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే మా విధానం ⇒ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా సమతుల్యంగా బడ్జెట్ను రూపొందించాం. పన్నులతో సామాన్యుడిపై భారం మోపకుండా, ఉన్న వనరులను సది్వనియోగం చేస్తూ, కొత్త సంపదను సష్టించి, దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం.‘పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి..’ అన్న మహాత్మాగాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని పదేళ్ల విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పునాది ఈ బడ్జెట్. ఈ పునాది ఆధారంగా ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణను నిర్మించేందుకు ఇది బ్లూ ప్రింట్. డిజిటల్ జనగణనకు ముమ్మర ఏర్పాట్లు ⇒ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు రాష్ట్రంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. తెలంగాణ ప్రజల ఆశాదీపం ⇒ బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు. మన జీవితం. మన భవిష్యత్తు ⇒ కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించడం ⇒ ఆసరా కోసం చూసే బలహీనులను ఆదుకోవడం ⇒ నీడలేని వారికి నీడ కల్పించడం ⇒ పంట పొలాలకు నీళ్లు పారించడం.. ఫలసాయం పెంచడం ⇒ కష్టపడే వారికి పని కల్పించడం..ఇష్టపడేలా పాలన అందించడం ⇒ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. ⇒ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా. -
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
‘తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది’
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పెదవి విరిచారు. తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందంటూ విమర్శించారు బండి సంజయ్. ‘ చిప్ప చేతికిచ్చే పాలన కాంగ్రెస్ది. మనది బిచ్చపు బతుకులేనా...?, ఇప్పుడు తెలంగాణా సమాజం ఆలోచించాల్సిన సమయం.. ఇది ప్రజలను వంచించే బడ్జెట్. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేదేమీ లేదు. రైతుభరోసా విషయంలో రైతులు అమాయకులనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయిలు మాత్రమే కేటాయిస్తావా..?, ఆరు వాయిదాలకు నాల్గు వాయిదాలు మాత్రమే ఇస్తుండు. మిగిలిన రెండు వాయిదాలు ఎగ్గొట్టే ప్లాన్ వేసిండు. ఈ ఒక్కసారిచ్చి పాతదివ్వక, వచ్చేదివ్వక ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటుడు ఈ ముఖ్యమంత్రి. రైతుకూలీలకు 12 వేలిస్తామని చెప్పి ఏమైందిప్పుడు..?బీఆర్ఎస్ చేసిన 8 లక్షల కోట్లు అప్పు తీరుస్తామన్నవాడు.. ఇంకా అదే పాట పాడుతున్నాడు. ఆరు గ్యారంటీలు గాలికొదిలేసిండు ఈ సీఎం. ఇంకా లక్ష కోట్ల అప్పు చేస్తానని చెబుతుండు.. బీఆర్ఎస్ ఏం ఇచ్చిందని గాడ్ది గుడ్డు చూపిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా గాడ్ది గుడ్డు చూపించిండు’ అని ధ్వజమెత్తారు. -
గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)
-
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న సౌమ్యామిశ్రా
హైదరాబాద్ : జైల్భవన్లో ఈ రోజు (శుక్రవారం) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. జైళ్లశాఖ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో సత్కరించారు. ఈ అవార్డును డైరెక్టర్ జనరల్ విక్రమ్ త్రివేదీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సౌమ్యా మిశ్రాకు అందజేశారు.జైళ్ల శాఖలో సౌమ్యామిశ్రా చేసిన సంస్కరణలకు గానూ ఆమెకు ఈ అవార్డు అందజేసినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. జైళ్ల ఆధునీకరణ, సంక్షమే కార్యక్రమాలు, సంస్కరణాత్మక విధానాల ప్రోత్సాహం తదితర రంగాలలో ఆమె విశిష్ట సేవలు అందించినట్లు పేర్కొన్నారు.డిప్యూటీ సూపరిండెంట్ పోలీస్ వంశీ మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన, సామాజిక సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధులు డా. ఉలాజీ ఎలియాజర్ (కోఆర్డినేటర్), ఆకాంక్ష షా (ప్రతినిధి)తో పాటు ఇతరులు హాజరయ్యారు. -
నో స్టాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్
-
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని.. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవంటూ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా విధానం అమలులోకి వస్తోందన్నారు. చిట్చాట్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది. గత ప్రభుత్వం అప్పులు తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది. ఆ తప్పులు మేం చేయలేం’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3.47లక్షల కోట్ల అప్పులు చేశాం. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్ల కేసిఆర్ చేసిన అప్పులే మేం కట్టాం. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా 44 వేల కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చాం. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు కొనసాగుతాయి. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘డ్రగ్స్ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు?. కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తా. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు. -
వైష్ణవి సమాధి వద్దే నిద్రపోతూ..!
జగిత్యాల: అదొక అన్న ఆత్మ వేదన.. చెల్లెలు ఇక తిరిగిరాదని తెలిసినా ఆమె సమాధి వద్దే పడుకుని కన్నీళ్లు ఇంకిపోయేలా విలపిస్తున్న రోదన. ఇటీవల యూట్యూబర్ వైష్ణవి భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆ హృదయ విదారక ఘటనను తలుచుకుని వైష్ణవి అన్న సంతోష్ కుమిలిపోతున్నాడు. చెల్లెలు సమాధి వద్దే నిద్రిస్తున్నాడు. తన చెల్లెలకు ఏమి ఇష్టమో దాన్ని తినిపించడానికి సమాధి వద్దే ఉంటున్నాడు. జీవితం ముగిసినా బంధం మాత్రం శాశ్వతం. నిద్రలోనూ చెల్లి జ్ఞాపకాలు.. అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చెల్లి సమాధి వద్ద అన్న నిద్రపోవడం అనేది కేవలం శరీర విశ్రాంతి కాదు, అది హృదయపు ఆవేదనకు ప్రతిరూపం. మట్టి కింద నిశ్శబ్దంగా ఉన్న చెల్లి జ్ఞాపకాలతో, అన్న కన్నీటి చుక్కలు రోదిస్తున్న తీరు వారి మధ్య అనురాగపు బంధానికి నిదర్శనం.చెల్లెలు ఇక రాదని తెలుసు. సమాధిలో ఉన్న చెల్లెలు పైకి లేచి రాదని తెలుసు. కానీ చెల్లెలు ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. వైష్ణవి ఇష్టంగా తినే అహారం సమాధివద్ద పెడుతున్నాడు సంతోష్. ఈ హృదయ విదారక ఘటనను చూసి చుట్టపక్కల వారు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.వైష్ణవి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్కోరుట్ల మండలం మాదాపూర్లో మూడురోజుల క్రితం హత్యకు గురైన యూట్యూ బర్ వైష్ణవి ఘటనలో నిందితులైన హరిబాబు తల్లి చిత్తరి లక్ష్మి, సోదరులు చిత్తరి ఆనంద్, చిత్తరి ఆశో క్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.వైష్ణవిని హత్య చేసిన ఆమె భర్త చిత్తరి హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి బంధు వులు గురువారం కోరుట్ల కొత్త బస్టాండ్ వద్ద ధర్నా కు దిగారు. ఫ్లకార్డులతో మాదాపూర్ నుంచి తర లివచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు న్యా యం చేయాలని నినాదాలు చేశారు. దీంతో జాతీ య రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త -
భట్టి బడ్జెట్.. అంతా బోగస్: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందని.. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. ‘‘మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప.. స్కీములు ఉన్నాయా?. మూడేళ్లు కూడా నిండకముందే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టుకుని రాజ్యాంగ విలువలపై మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ హరీష్రావు దుయ్యబట్టారు.‘‘టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదు. పాలన గాడి తప్పడంతో తలసరి ఆదాయం తగ్గింది. బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచింది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. గత బడ్జెట్లో నిధులు కేటాయింపు చేసినా ఖర్చు చేయలేదు. తిరిగి ఈ బడ్జెట్లో అదే పాట పాడారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోలేదు. క్యూర్,ప్యూర్,రేర్ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు. హైదరాబాద్ను మూడు ముక్కలు చేశారు. బడ్జెట్ అంతా బోగస్ అని తేలిపోయింది, ముచ్చటంతా మూడు ముక్కలాట కోసమే ఆరు గ్యారెంటీలపై లేదు’’ అని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అసెంబ్లీలో బడ్జెట్ పై భట్టి స్పీచ్
-
బడ్జెట్ అంతా మోసం.. చెవిలో పువ్వులు పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బడ్జెట్ అంతా మోసం అంటూ చెవులకు పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ ఎంట్రీ మెట్ల వద్ద నిరసన చేపట్టారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్లు మోసం మోసం అంటూ నినాదాలు చేశారు.ఆరు గ్యారెంటీలు మోసం మోసం అంటూ నినాదాలు.. 420 హామీలు మోసం మోసం. ఉద్యోగులకు సీఆర్సీ మోసం మోసం.. మహిళలకు మోసం.. మోసం’’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కూడా నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ నినాదాలు చేశారు. -
బడ్జెట్.. విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్లో అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థల వంటశాలల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలు కేటాయించింది.బడ్జెట్లో విద్యకు 8.22 శాతం కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం, ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం, వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు, 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు కేటాయించింది. అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీలకు నెలకు రూ. 2000 స్కాలర్ షిష్లు ఇవ్వాలని నిర్ణయించింది. -
Film Awards 2025: చిరంజీవి పవర్ ఫుల్ స్పీచ్
-
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. -
చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్.. సర్కార్ స్వాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు, సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది. మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రి మండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆరి్ధక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.దశలవారీగా టేకోవర్...మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది.ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది.గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది.దీంతో మెట్రో మొదటిదశను స్వా«దీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి.ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది.అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. -
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్.. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నారు. పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను పలువురు అభినందించారు.


