breaking news
Telangana
-
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెక్షన్ 21(3) తొలగింపునకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్ను ప్రభుత్వం తీసుకురానుంది.కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. -
2030 నాటికి అదే లక్ష్యం!.. మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వైపు సాగుతోంది. అయితే.. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో రూ. లక్ష కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ఐదు లక్షల మందికి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ మినిష్టర్ 'దుద్దిల్ల శ్రీధర్ బాబు' (D. Sridhar Babu) అన్నారు. ఆస్ బయోటెక్ అండ్ విక్టోరియా ప్రభుత్వం సంయుక్తంగా మెల్బోర్న్లో నిర్వహించిన ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన 'రోడ్మ్యాప్ 2030'ను రూపొందించిందని ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు అన్నారు. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా ప్రపంచ భాగస్వామ్యాలను వేగవంతం చేయడానికి తెలంగాణ సమగ్ర లైఫ్ సైన్సెస్ విధానాన్ని సిద్ధం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.గ్లోబల్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ (CBRE) నివేదిక గురించి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో - బోస్టన్, శాన్ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యోలతో పాటు.. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025లో హైదరాబాద్ కూడా స్థానం సంపాదించింది అన్నారు.బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్కేర్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల అవసరాలను తీర్చడానికి "రెడీ-టు-డిప్లాయ్ బయో డిజిటల్ వర్క్ఫోర్స్"ను నిర్మించడంలో తెలంగాణ భారీగా పెట్టుబడులు పెడుతోందని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ బలం దాని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో ఉంది. మా నినాదం మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, తెలంగాణలో ఆవిష్కరణ అని పేర్కొన్నారు. -
Hyderabad: విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని ఓ హోటల్లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. నిన్న రాత్రి(అక్టోబర్ 22 బుధవారం) ఆర్ ఇన్ హోటల్లో టాస్క్ఫోర్స్ పోలీసుల సోదాలు నిర్వహించారు. విదేశాల చెందిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విదేశీ అమ్మాయిలతో పాటు నిర్వాహకుల్ని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీసులకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మేన బావతో వివాహం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. గాంధారి మండల కేంద్రానికి సమీపంలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడు, నిందితులను మేడ్చల్ జిల్లా కీసర వాసులుగా గుర్తించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 న గాంధారి శివారు లోని చద్మల్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. హత్య జరిగగిన సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు మృతదేహం పక్కన మరో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. అతడు ఇచ్చిన ఆనవాళ్లు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను మేడ్చల్ జిల్లా కీసర మండలం భవానీ నగర్కు చెందిన ఏలూరి ఆంజనేయులు, ఇరగడింట్ల నవనీతలుగా గుర్తించారు. వారిని బుదవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.మేన బావతో 2012లో వివాహం..కీసర ప్రాంతానికి చెందిన నవనీత కు మేన బావ నరేష్తో 2012 లో వివాహం జరిగింది. వారిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. కొంత కాలం క్రితం వారిద్దరూ ఆంజనేయులు వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ముగ్గురూ కలిసి ఏడాది క్రితం పెద్దగుట్టకు దైవదర్శనానికి వచ్చి వెళ్లారు. కొద్ది రోజులుగా ఆంజనేయులు, నవనీతల వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్ ప్రశ్నించడం, నవనీతను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. 15 న మరోసారి దైవదర్శనం కోసం అని చెప్పి నవీన్ను ఒప్పించి ముగ్గురూ కలిసి బైక్పై పెద్దగుట్ట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి మద్యం సేవించారు. నరేష్కు అతిగా మద్యం తాగించి కాలువలో పడేశారు. ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి కాల్చివేశారని ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంజయ్, రవికుమార్, సాయిబాబా, ప్రసాద్, బంతీలాల్ లను అభినందించారు. -
టాలీవుడ్లో రాణిస్తున్న యువ కెరటం
ఆదిలాబాద్ జిల్లా: మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువకుడు నటనలో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న తను ఇప్పుడు ఏకంగా సినిమాలో హీరోగా నటిస్తూ అందరి మన్ననలు పొంతున్నాడు. ఆయనే కుంటాలకు చెందిన రాధా –శేఖర్ రావు పాటిల్ దంపతుల కుమారుడు దావు నవికేత్. హైదరాబాద్లో బీపార్మసీ చదివేందుకు వెళ్లిన నవికేత్ చదువుకునే రోజుల్లో సినిమా రంగంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి నటనపై ఉన్న అభిరుచి ఆయనను సినిమాల వైపు మళ్లించింది.తనదైన గుర్తింపు..చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే అనే మూవీతో వెండితెరపై నటించే అవకాశం నవికేత్కు దక్కింది. దేత్తడి యూట్యూబ్ ఛానల్ ద్వారా నటనలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ అంతా ఈజీ కాదు మూవీలో ప్రత్యేక పాత్రలో మెప్పించాడు. జెర్సీ సినిమాలో హీరో నానితో కలిసి క్రికెటర్గా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. లవ్ స్టోరీ సినిమాలో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవితో కలిసి నటించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం భార్గవ చారి దర్శకత్వంలో జకాస్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఆలీ, పృథ్వి హాస్యనటులతో డబ్బులు ఎవరికి ఊరికే రావు వర్కింగ్ టైటిల్లో హీరోగా అవకాశం సంపాదించాడు. చట్టానికి వ్యతిరేక పనులు చేసే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఆధారంగా వీఎస్వీ(వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన) డైరెక్షన్లో రూపొందిస్తున్న విద్రోహి మూవీలో నవికేత్ నటిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 24న విడుదల కానుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్లి సినిమాలో రాణిస్తున్న నవికేత్ కొత్త నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.సినిమా రంగంపై ఆసక్తిచదువుకునే రోజుల్లో నట నపై ఆసక్తి ఉండేది. అదే నన్ను సినిమా రంగం వైపు మళ్లించింది. అందివచ్చిన అవకాశాలను ఎప్పుడూ వదులుకోలేదు. నటనలో ప్రతిభ కనబర్చి మంచి పేరు సంపాదిస్తా.– దావు నవికేత్, నటుడు టాలీవుడ్లో రాణిస్తున్న యువ కెరటం -
కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణభవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారు. కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారు. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది. అసమర్థ, పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రిని నాజీవితంలో చూడలేదు. రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలి. 500కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చింది. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్.. శంకరాహిల్స్లో ఏం చేస్తున్నారో.. సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో మాకు అన్నీ తెలుసు.ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల విషయంలో గొడవలతో తెలంగాణ పరువు పోయింది. తన మాట వినలేదని.. మంచి అధికారి మీద మంత్రి జూపల్లి కక్ష తీర్చుకుంటున్నాడు. ముమ్మాటకీ రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠానే నడుపుతుంది. దండుపాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కాదు.. మాఫియా రాజ్యాం నడుస్తుంది. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారు. తుపాకీ ఇచ్చింది రేవంత్.. పెట్టింది రోహిణ్ రెడ్డి అని మంత్రి కొండా కుమార్తె చెప్తుంది. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపటం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి.మంత్రి ఉత్తమ్కు సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలి. పింక్ బుక్, రెడ్ బుక్ లేదు.. ఖాకీ బుక్ మాత్రమే ఉందని శివధర్ రెడ్డి అన్నారు. ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలి. మంచి అధికారిగా శివధర్ రెడ్డికి పేరుంది. రోహిణ్ రెడ్డి, సుమంత్ ను లోపల వేసి తన నిజాయితీని డీజీపీ నిరూపించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ ఇల్లా.. సెటిల్మెంట్కు అడ్డానా?. కేబినెట్ మీటింగ్లోనే మంత్రులు తిట్టుకుంటున్నారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదు?. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారు.ప్రభుత్వ పెద్దల అన్యాయాలకు అండగా నిలిచే అధికారులకు శిక్ష తప్పదు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుంది. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే.. వందల కోట్లు అయినా సంపాదించుకోవాలని మంత్రులు చూస్తున్నారు. తెలంగాణ పరువును సీఎం, మంత్రులు నడిబజారులో నిలబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తల దించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. పారిశ్రామికవేత్తల తలకు తుపాకీలు పెట్టి బెదిరిస్తున్నారు. ఐఏఎస్ రిజ్వీ చాలా సిన్సియర్ అధికారి. ఆయన్ను బలిపశువును చేశారు. పదేళ్లు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్కు వెళ్ళే పరిస్థితి తెచ్చారు. జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందాం అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో అన్క్లెయిమ్డ్ డబ్బు రూ.2,095.10 కోట్లు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని వినియోగదారుల ఖాతాల్లో రూ.2,095.10 కోట్లు పేరుకుపోయాయి. ఇలాంటి 78,53,607 ఖాతాలను ఆర్బీఐ గుర్తించింది. చాలా మంది తమ ఆర్థిక విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. వారికి అనుకోకుండా ఏమైనా జరిగినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నాయన్న విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మరోవైపు కొందరు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసి మరిచిపోతుంటారు. ఇలా ఆగస్టు 31, 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 78,53,607 ఖాతాల్లో రూ 2,095.10 కోట్లు పేరుకుపోయాయి.ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాను పదేళ్లకు మించి ఆపరేట్ చేయకపోతే అందులో ఉన్న డబ్బు డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏఎఫ్) ఖాతాకు చేరుతుంది. ఆర్బీఐ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఖాతాలపై బ్యాంకులు ఈ నెల 13వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయి.ఎస్బీఐలోనే అధికం..రాష్ట్రవ్యాప్తంగా 30 బ్యాంకులలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా.. అందులో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లోనే 21,61,529 ఖాతాలలో రూ 586.98 కోట్లు మూలుగుతున్నాయి. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20,70,208 ఖాతాల్లో రూ.467.76 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ అన్క్లెయిమ్డ్ డబ్బు అధికంగా ఉండిపోయింది.ఉద్గం పోర్టల్ ద్వారా వివరాలు..చనిపోయిన వారి బ్యాంక్ ఖాతాల్లో ఏమైన డబ్బులు ఉన్నాయని భావిస్తే వారి కుటుంబ సభ్యులు ఉద్గం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. మొదట ఉద్గం పోర్టల్లో లాగిన్ కావాలి. తర్వాత కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేయాలి. అప్పుడు ఖాతాలోని నగదు నిల్వ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ డబ్బు ఉంటే సంబంధిత బ్యాంక్ను సంప్రదించి, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలను సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఖాతాదారుడు బ్యాంక్లో డబ్బులు జమచేసి మర్చిపోతే సదరు ఖాతాదారుని ధ్రువీకరణ పత్రాలు, కేవైసీ పత్రాలతో సంప్రదించాలి. అన్నీ పరిశీలించిన తర్వాత బ్యాంకు ఖాతాలోని డబ్బులను అప్పగిస్తుంది. డిసెంబర్ 31వ తేదీవరకు క్లెయిమ్ చేసుకోకపోతే డీఈఏఎఫ్లో ఆ డబ్బు జమ అవుతుంది.ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తాంబ్యాంక్లో డబ్బులు జమచేసి పదేళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తాం. వీటిపై డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తాం. చనిపోయినవారి ఖాతాల్లో ఉన్న డబ్బులను సంబంధిత కుటుంబ సభ్యులు తగిన పత్రాలను అందించి డ్రా చేసుకోవచ్చు. ఉద్గం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు.– హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్, సిద్దిపేట -
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది. -
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 100 మంది రౌడీషీటర్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియతో పాటు నామినేషన్ పత్రాల స్రూ్కట్నీ కూడా పూర్తయ్యింది. అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రచారంతో పాటు ర్యాలీలు, రోడ్షోలు, పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈమేరకు అందరూ సమన్వయంగా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి కిందికి వచ్చే టోలిచౌకి, గోల్కోండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట, సనత్నగర్ తదితర ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషిటర్లను బైండోవర్ చేశారు. నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలకు విభాగం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచడానికి ఎన్నికల సమయంలో రౌడీషిటర్ల బైండోవర్ చేస్తుంటారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఎనిమిది పోలీస్స్టేషన్ల పరిధిలోని 100 మంది రౌడీషీటర్లతో పాటు 50 మంది సస్పెక్ట్ïÙట్లు కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ ప్రక్రియలో రౌడీషిటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ప్రవర్తన సరిదిద్దుకోవాలని, న్యాయస్థానం ముందు హామీపత్రంపై సంతకం చేయాలని పోలీసులు కోరతారు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.నేర కార్యకలాపాలను నివారించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం, రౌడీషిటర్లు తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రోత్సహించడం బైండోవర్ల ముఖ్య ఉద్దేశ్యం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటికే పోలీసులు అడుగడుడుగునా పికెటింగ్లు ఏర్పాటుచేయడంతో పాటు రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానితుల కదలికలపై దృష్టిపెట్టారు. రౌడీషిటర్ల కదలికలను కూడా గమనిస్తున్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషిటర్ల కదలికలపై దృష్టి పెట్టడమే కాకుండా వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా..? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. వీరందరికీ ఇప్పటికే కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచి్చన మరుసటి రోజు నుంచే అన్ని పోలీస్స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లను బైండోవర్ చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో వీరు పాల్గొంటున్నారా..? లేకపోతే ఏదైనా సమస్యలు సృష్టించేందుకు ప్రయతి్నస్తున్నారా..? అన్నది పోలీసులు గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే సోమాజీగూడ, షేక్పేట, యూసుఫ్గూడ, రహమత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ తదితర ఏడు డివిజన్ల పరిధిలో 407 పోలింగ్ బూత్లను 139 లొకేషన్లలో ఏర్పాటుచేశారు. ఇందులో 57 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. క్రిటికల్ పోలింగ్ బూత్ల పరిధిలో ఉంటున్న రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టారు. -
కొండా ఫ్యామిలీ ఎపిసోడ్.. కాంగ్రెస్, రేవంత్కు నష్టమేనా?
గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్ఎస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు. కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్లో సద్దుమణిగినప్పటికీ, పలు ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను మిగిలే ఉంటాయి!.ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టీఆర్ఎస్కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్లో అటు రేవంత్కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కొత్త అల్లుడికి 150 రకాల వంటలతో విందు
వనపర్తి జిల్లా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్తగారింటికి మొదటి సారి వచ్చిన అల్లుడికి మరిచిపోని ఆతిథ్యాన్ని ఇచ్చారు అత్తామామలు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 150 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేయడంతో అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతుల కూతరు శిరీషను అదే గ్రామానికి చెందిన మహంకాళి రాముడు కుమారుడు మహంకాళి మహేష్కు ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు.ఈక్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లుడు బుధవారం అత్తగారింటికి రాగా.. అతడికి 150 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వేపుళ్లు, పచ్చళ్లు. చట్నీళ్లు, పప్పులు, స్నాక్స్, స్వీట్స్, మటన్, చికెన్, బిర్యానీలను చూసి అల్లుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. తనపై అభిమానంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి అత్తామామల ఆశీర్వాదం తీసుకున్నారు. -
మేడ్చల్ కాల్పుల ఘటన.. ఇబ్రహీం సహా ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులు(అజ్జు, శ్రీనివాస్) పోలీసుల అదుపులో ఉన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కీసర మండలం రాంపల్లికి చెందిన గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ కొన్ని రోజులుగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం కారులో ఇంటి నుంచి ఘట్కేసర్కు వస్తున్న క్రమంలో బహుదూర్పురకు చెందిన ఇబ్రహీం వెంబడించాడు. యంనంపేట వద్ద కారును అడ్డగించి అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే సోనూ సింగ్పై నిందితుడు రెండు రౌండ్ల కాల్పులను జరిపాడు. దీంతో ఆయన పక్కటెముకల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి గాయమైంది.అనంతరం, స్థానికులు బాధితుడిని హుటాహుటిన మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ, అతడికి సర్జరీ చేశారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించి పరిశీలించారు. కాల్పులకు గల కారణాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా సీపీ తెలిపారు. -
జూబ్లీహిల్స్ నామినేషన్ల స్క్రూటినీ పూర్తి.. మిగిలింది 81 మందే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByPoll) బరిలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం, బుధవారం నామినేషన్ల స్క్రూటినీ(Nominations Scrutiny Completed) ప్రక్రియ ముగిసింది. 17 గంటల పాటు జరిగిన వడపోత అనంతరం పోటీలో 81 మంది అభ్యర్థులు మిగిలారు. 135 నామినేషన్లను ఎన్నికల అధికారి ఖరారు చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఇక, రేపు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంది. వీరిలో ఎంత మంది విత్డ్రా చేసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. స్క్రూటినీ సందర్బంగా సరైన ఫార్మాట్లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటంతో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు రంజిత్ కుమార్ సింగ్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు.ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.ఇది కూడా చదవండి: స్థానికంపై నేడు నిర్ణయం! -
మంటగలుస్తున్న మానవత్వం
వర్గల్(గజ్వేల్): ఆస్తుల ఆశలో బంధాలు బలహీనమవుతున్నాయి. మానవత్వం మంట కలుస్తున్నది. ఆత్మీయ అనురాగాలు మసకబారుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన సంతానమే కాలయములవుతున్నారు. వర్గల్ మండలం మీనాజీపేట హత్యోదంతం ఘటన తల్లీకూతుళ్ల అనుబంధానికి మచ్చగా మారింది. ఆస్తి కోసం ఓ కూతురు తల్లినే కడతేర్చిన తీరు నివ్వెరపరుస్తున్నది. నీడనిస్తున్న చెట్టునే నరికినట్లు, కుటుంబానికి అండగా నిలిచిన తల్లిని హతమార్చి, భర్తతో సహా ఆ కూతురు కటకటాల పాలైంది. అమాయకులైన ఆమె పిల్లలను, తండ్రిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. పచ్చని సంసారం.. కకావికలంవర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాల్నర్సయ్య, బాలమణి(55) దంపతులకు కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. కుమారుడు గిరి చేతికందే తరుణంలో మృతిచెందాడు. కాగా పెద్దకూతురు లావణ్యకు తునికి బొల్లారం భిక్షపతితో పెళ్లి చేశారు. తమకు మగదిక్కు లేకపోవడంతో చిన్నకూతురు నవనీత, మధు దంపతులు, వారి ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడే ఉంటున్నారు. పొలం పనులను తండ్రి చూసుకుంటుండగా, తల్లి బాలమణి దినసరి కూలీగా ఆ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్నది. ఈ క్రమంలో ఆస్తిలో కొంత భూమి పెద్ద కూతురు లావణ్యకు ఇవ్వాలనే తల్లిదండ్రుల ఆలోచన పచ్చని కాపురంలో చిచ్చుగా మార్చింది. మృత్యురూపమెత్తిన చిన్న కూతురుఅన్నీ తానై తల్లిదండ్రులను చూసుకుంటుంటే, ఆస్తిలో కొంత భూమిని అక్కకు ఎలా ఇస్తారంటూ చిన్న కూతురు నవనీత గొడవపడింది. ఈ క్రమంలో అసలు అమ్మనే లేకుండా చేస్తే ఆస్తి తనకే మిగులుతుందని పథకం రచించింది. తన భర్త మధు, తూప్రాన్ మండలం యావాపూర్కు చెందిన వరుసకు సోదరుడైన రామని గౌరయ్యతో కలిసి ఈ నెల 10న ఇంట్లోనే తల్లిని ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. మృతదేహాన్ని తునికి బొల్లారం అయ్యప్ప చెరువులో పడేసి వెళ్లిపోయారు. తరువాత అమ్మ కనపడటం లేదంటూ నాటకానికి తెరలేపింది. ఈ క్రమంలో బాలమణి మృతదేహం లభ్యమవడంతో గుట్టురట్టయింది. కూతురే ఆస్తి కోసం భర్త, మరొకరితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తెలిసింది. చివరకు భర్తతో సహా కటకటాలపాలైంది.పసిపిల్లలతో.. బాల్నర్సయ్య కూతురు, అల్లుడు కలిసి చేసిన దారుణానికి తన భార్య బాలమణి కానరాని తీరాలకు చేరడంతో బాల్నర్సయ్య తల్లడిల్లిపోతున్నాడు. పట్టుమని ఏడేండ్ల వయసు కూడా లేని మహనీత(7), రాంచరణ్(4)ల తల్లిదండ్రులు కటకటాల పాలవడంతో, అమ్మమ్మకు ఏమైందో, తల్లిదండ్రులకు ఏమి జరిగిందో తెలియని అమాయకత్వంలో తాత పంచన ఒంటరిగా మిగిలిపోయారు. ఆస్తి కోసం కన్నతల్లిని హత్య చేసి నా కూతురు పుట్టెడు దుఃఖం మిగిలి్చందని బాల్నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పాలు తాగే ప్రాయంలో ఉన్న యేడాదిన్నర చిన్న కొడుకును తల్లి వెంటే పంపించారు. -
వైద్యం కోసం విమానం దిగిన ప్రయాణికురాలు
శంషాబాద్: విమానం ఎక్కిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తడంతో ఓ ప్రయాణికురాలు టేకాఫ్ జరిగే విమానాన్ని నిలిపివేసి దిగిపోయిన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం బెల్గావి వెళ్లేందుకు ఇండిగో విమానం 7512 విమానం సాయంత్రం 4.10 గంటలకు టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంతలోనే ఓ ప్రయాణికురాలు మౌనా రవి తాను తీవ్రమైన చర్మ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్నానని తనను దింపివేయాలని కోరింది. దీంతో అధికారులు విమానం టేకాఫ్ను నిలిపివేసి ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నపటికి మళ్లీ ప్రయాణం కొనసాగించలేదు. దీంతో ఆమె లేకుండానే సాయంత్రం 5.25 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బెల్గావ్ బయలుదేరింది. బెంగళూరు విమానం రద్దు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం రద్దయ్యింది. 74 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు టేకాఫ్ తీసుకుని బయలుదేరాల్సిన విమానాన్ని ఆపరేషనల్ కారణాలతో రద్దుచేసినట్లు ఎయిర్లైన్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
డీజీపీ టెలీ కాన్ఫరెన్స్లో సీపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్ డీజీపీ...రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమినరేట్కు బాస్ నగర కొత్వాల్. వీరిద్దరి మధ్యా సరైన సమన్వయం లేకపోతే..! గతంలో పని చేసిన డీజీపీలు, నగర పోలీసు కమిషనర్ల విషయంలో అదే జరిగింది. ఫలితంగా ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్కు నగర కొత్వాల్గా పని చేసిన అధికారులు దూరంగా ఉంటూ వచ్చారు. డీజీపీగా బత్తుల శివధర్రెడ్డి, కొత్వాల్గా విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిస్థితి మారింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డీజీపీ నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్కు నగర పోలీసు కమిషనర్ కచి్చతంగా హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం డీజీపీ నిర్వహించే ఈ కాన్ఫరెన్స్కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లతో పాటు ప్రత్యేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం తీసుకున్న తాజా విధానపరమైన నిర్ణయాలను డీజీపీ వెల్లడిస్తుంటారు. దీనికి తోడు ముందు జరిగిన కీలక ఘట్టాలు, లోటుపాట్లు, ఆ రోజు జరుగనున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చ జరుగుతుంది. ఆయా సందర్భాల్లో పోలీసు విభాగం అనుసరించాల్సిన వ్యూహాల పైనా దిశానిర్దేశం ఉంటుంది. ఇంతటి కీలకమైన డీజీపీ టెలీ కాన్ఫరెన్స్కు దాదాపు మూడున్నరేళ్లుగా పని చేసిన హైదరాబాద్ పోలీసు కమిషనర్లు దూరంగా ఉన్నారు. అసలు పాల్గొనకపోడం, అడపాదడపా పాల్గొనడంతో పాటు తమకు బదులుగా వేరొక ఆఫీసర్ హాజరయ్యేలా చేయడం వంటివి జరిగాయి. కొత్వాల్ కంటే జూనియర్లు డీజీపీలుగా ఉండటం, డీజీపీకి కొత్వాల్కు మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో పాటు అనేక వ్యక్తిగత కారణాల వల్లా ఇలా జరిగింది. దీని ప్రభావం పోలీసింగ్పై పడటంతో పాటు అనేక లోటుపాట్లు చోటు చేసుకున్నారు. శివధర్రెడ్డి, సజ్జనర్ ఈ విధానానికి స్వస్తి చెప్పారు. సంప్రదాయ పద్దతుల్ని మళ్లీ అమలులోకి తీసుకువస్తూ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్లో నగర పోలీసు కమిషనర్ కచి్చతంగా పాల్గొంటున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేని పక్షంలో డీజీపీ అనుమతి తీసుకుంటున్నారు. ఇలా నగర, రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న ఇతర అధికారులకు బాస్ ఈజ్ బాస్ అనే స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. -
బయటకు రాని బతుకమ్మ చీరలు!
హైదరాబాద్: బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలు ఇప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని గోదాములకే ఈ చీరలు పరిమితమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలందరికి రేషన్ కార్డుల ప్రాతిపదికన బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఇందిరా మహిళా శక్తి పొదుపు సంఘాల మహిళలకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసేందుకు గత నెల 25 వేల చీరలు మలక్పేటకు చేరాయి. అయితే ఇవి సరిపోవని తేలడంతో..మిగతా చీరలు వచ్చాక పంపిణీ చేసేందుకు అధికారులు పండగకు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ గడువులోగా మిగతా చీరల దిగుమతి జరగలేదు. ఈ కారణంతో బతుకమ్మ వేడుకలకు చీరల పంపిణీ చేపట్టలేదు. అన్ని సర్కిళ్ల పరిధిలోని వార్డు కార్యాయాల్లో పొదుపు సంఘం ఖాతా బుక్కును చూపించి పేర్లు నమోదు చేసుకొన్న మహిళలకు చీరల పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ పంపిణీ జరగకపోవడంతో మహిళలు నిరాశకు లోనయ్యారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కొందరు మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేస్తే విమర్శలు వస్తాయని భావించిన అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారని తెలిసింది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇంధీరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తారని చర్చించుకుంటున్నారు. మలక్పేటలో 50 వేల చీరలు.. జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ కార్యాలయాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు వార్డు కార్యాలయంలో అధికారులు పంపిణీ వ్యవహారాలు చూస్తున్నారు. ఆరు డివిజన్లలో 25 వేల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో పొదుపు మహిళకు 2 చీరల చొప్పున మొత్తం 50 వేల చీరలు పంపిణీ చేయనున్నారు.అర్బన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో.. ఆయా డివిజన్ పరిధి వార్డు కార్యాలయాల్లోనూ ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. పొదుపు సంఘాల మహిళల రుణాలు తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) అధికారుల పర్యవేక్షణలో చీరలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో మహిళా సంఘం పరిధిలో 8 నుంచి 13 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఒక్కో మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు అందించే బాధ్యతలను ఆయా డివిజన్ అర్బన్ కమ్యూనిటీ ఆఫీసర్ నేతృత్వంలో రీసోర్స్ పర్సన్లకు అప్పగించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చేనెలలో ఈ మహిళలకు ఇందిరమ్మ చీరలు అందుతాయని భావిస్తున్నారు. -
‘జూబ్లీహిల్స్’పై నేడు కేసీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారపర్వంపై దృష్టి కేంద్రీక రించింది. ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ అభ్యర్థితోపాటు పార్టీ డివిజన్ ఇన్ చార్జ్లు, స్టార్ క్యాంపెయినర్లు, ప్రచారంలో పాల్గొంటున్న కీలక నేతలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది. గురువారం జరిగే భేటీలో పార్టీ ప్రచార వ్యూహం, సమన్వయం, ప్రచార ఎజెండాపై కేసీఆర్ దిశానిర్దే శం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్రావు బుధవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, ఓటరు మనోగతం తదితరాలపై చర్చించినట్టు సమాచారం. బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో కసరత్తు జరిగినట్టు తెలిసింది.బహిరంగ సభకు విముఖత: ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ప్రచారానికి కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో విస్తృత ప్రచారానికి అవలంబించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దృష్టి సారించారు. నగరంలో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని భారీ సభలు, సమావేశాల జోలికి వెళ్లకుండా డివిజన్ల వారీగా హాల్ మీటింగ్స్, కార్నర్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్లకు చేరువయ్యేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్టీ బృందాలు ప్రతీ ఇంటిని సందర్శించేలా షెడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రచారం చివరిదశలో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
స్థానికంపై నేడు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విష యం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కేబినెట్ సమావేశమై న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.అయితే పాత విధానంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర హైకోర్టు చేసిన సూచనను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఇలావుండగా.. ఇద్దరుకు మించి సంతానం కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న నిబంధనను ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఆ మేరకు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసేలా గవర్నర్కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించనుంది. ఎస్ఎల్బీసీ కాంట్రాక్టు రద్దు ..?శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మా ణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులపై కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాల్సి ఉంటుంది. అలా చేస్తే పెరిగిన ధరల ఆధారంగా అంచనాలు కొన్ని రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆయా అంశాలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడా తేల్చవచ్చని అంటున్నారు. కాళేశ్వరం టెండర్లకు ఓకే?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గం రాటిఫై చేయనుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు ఆమోదం తెలపనున్నట్టు తెలిసింది. విజయోత్సవాల్లో భాగంగా సనత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. -
ఫిరాయింపుల విచారణ తిరిగి షురూ!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభం కానుంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం హైదరాబాద్కు చేరుకుంటారు. బార్బడోస్, ఫ్రాన్స్, లండన్, ఇటలీలో స్పీకర్తోపాటు మండలి చైర్మన్, వైస్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శితో కూడిన ప్రతినిధి బృందం 18 రోజుల పర్యటన అనంతరం రాష్ట్రానికి చేరుకుంటోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ సెప్టెంబర్ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డిని బీఆర్ఎస్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌఖిక, లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఈ నెల 4 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.మరో నలుగురి విచారణకు షెడ్యూల్?పది మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటుండగా నలుగురికి సంబంధించిన విచారణ షెడ్యూల్ను మాత్రమే స్పీకర్ గతంలో ప్రకటించారు. మరో నలుగు రు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకటరావుపై బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై నెలాఖరులోగా స్పీకర్ విచారణ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. కోర్టు విధించిన అక్టోబర్ 30 గడువులోగా విచారణ పక్రియ ముగిసే అవకాశం కనిపించడం లేదు.మరోవైపు స్పీకర్ నోటీసు లు అందుకున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదని సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు తమ వివరణ ఇచ్చి ఉంటే సంబంధిత కాపీలు తమకు అంది ఉండేవని బీఆర్ఎస్ శాసనసభాపక్షం వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కోరాలనే యోచనలో స్పీకర్ కార్యాలయం ఉన్నట్లు సమాచారం. -
రెండేళ్లలో ఉస్మా‘నయా’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. వందేళ్ల అవసరాలకు తగినట్లుగా కొత్త ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై బుధవారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్టు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని, అవసరమయ్యే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి ప్రణాళికలో మార్చురీ గది నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. రోడ్డుకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని సూచించారు. రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలి ఆసుపత్రి చుట్టూ ముందుగా రోడ్లు నిర్మించి, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఇప్పటినుంచే రూపొందించాలని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ ప్రతి పది రోజులకోసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు, ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణం పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్రాజ్, డీజీపీ శివధర్రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్రాజ్, క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఇలంబర్తి, ముషారఫ్ అలీ ఫరూఖీ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, డీఎంఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ 2002లో మీ పేరుందా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బిహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమాన్ని త్వరలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఓటర్ల జాబితాలో చోటు కోసం ఓటరు తనతోపాటు తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులేనని రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈసీ సృష్టించడంతో ఈ కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. నిర్దేశిత 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా సమర్పించాలని బిహార్ ఓటర్లను ఈసీ కోరింది. బిహార్లో చివరిసారి 2003లో ఎస్ఐఆర్ నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో చోటు పొందిన 4.96 కోట్ల మంది ఓటర్లకు మాత్రం ఈ ధ్రువపత్రాల నుంచి మినహాయింపు కల్పించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. చివరిసారిగా ఉమ్మడి ఏపీలో 2002లో నిర్వహించిన ఎస్ఐఆర్ ద్వారా రూపొందించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో వచ్చే ఏడాది ఎస్ఐఆర్ను నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐఆర్– 2002లో రూపొందించిన ఓటర్ల జాబితాను ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తన వెబ్సైట్ (https:// ceotelangana.nic.in/)లో పొందుపరిచింది. ఎస్ఐఆర్–2002లో ఓటరు పేరు/తమ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయో లేవో ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు తెలుసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా ఓటర్ల పేర్లను సులువుగా వెదకవచ్చు. ఎస్ఐఆర్ 2002లో తమ పేరు/తల్లిదండ్రుల పేర్లు ఉన్నట్టు రుజువులు సమరి్పస్తే కొత్త ఎస్ఐఆర్లో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు కావాలి.. పుట్టిన తేదీ ఆధారంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పౌరసత్వ రుజువు కోసం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించి బిహార్లో దరఖాస్తులను ఈసీ స్వీకరించింది. 1987 జూలై 1కి ముందు భారతదేశంలో పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీతోపాటు పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రం ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేసే పత్రాలను సమర్పించాలి. 2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిండ్రులిద్దరికి సంబంధించిన పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన పౌరులైతే సంబంధిత దేశంలోని భారత దౌత్య కార్యాయలం జారీ చేసిన బర్త్ రిజిస్ట్రేషన్ను సమర్పించాలి. ఒకవేళ భారత పౌరసత్వం స్వీకరించి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు దాఖలు చేయాలి. ఇతర ఏ దేశ పౌరసత్వం స్వీకరించలేదని స్వీయ ధ్రువీకరణ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 11 పత్రాలతో పాటుగా ఆధార్ కార్డును సైతం రుజువుగా ఎన్నికల సంఘం బిహార్లో స్వీకరించింది. ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాలు ఇవే.. – కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లేదా గుర్తింపు కార్డు. – 1987 జూలై 1కి ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థ/బ్యాంకు/పోస్టు ఆఫీసు/ఎల్ఐసీ/ప్రభుత్వ రంగ సంస్థ జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు/ధ్రువీకరణ పత్రం/డాక్యుమెంట్. – జనన ధ్రువీకరణ పత్రం – పాస్పోర్టు – గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదోతరగతి/విద్యార్హత పత్రాలు – రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ – ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా కుల ధ్రువీకరణ పత్రం – నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సెక్స్ – రాష్ట్ర ప్రభుత్వం/స్థానిక సంస్థలు రూపొందించిన ఫ్యామిలీ రిజస్టర్ – ప్రభుత్వం భూమి/ఇళ్లు కేటాయిస్తూ జారీ చేసిన పత్రం -
అవినీతి ‘పోస్టు’లకు చెక్
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం అవినీతికి నిలయాలుగా మారిన రవాణా శాఖ చెక్ పోస్టులు ఎట్టకేలకు కనుమరుగైపోనున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఆయా పోస్టులను తక్షణమే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వీటిని రద్దు చేయాలని కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఇవి ఇంతకాలం కొనసాగుతూ వచ్చాయి. అయితే..వాటి కోసమే ప్రత్యేకంగా అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేయాలన్నట్టుగా.. ఆయా చెక్పోస్టుల్లో అవినీతి పేట్రేగుతుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది. వాటిని తొలగిస్తున్నట్టుగా ఆగస్టులోనే ఉత్తర్వు జారీ చేసింది. కానీ వాటిని తొలగించకపోవడంతో సీఎం స్పందించారు. సాధారణ హెచ్చరికతో వాటిని తొలగించరని భావించిన ముఖ్యమంత్రి.. బుధవారం సాయంత్రానికల్లా వాటిని ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించటంతో రవాణా శాఖ ఆగమేఘాల మీద వాటి తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్ర సరిహద్దుల్లోని 15 చెక్పోస్టుల్లో ఉన్న సిబ్బందిని జిల్లా రవాణా శాఖ కార్యాలయాలకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత..: డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ లావాదేవీలను ప్రమోట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీ అమలు తర్వాత రవాణా శాఖ చెక్పోస్టులను తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు సూచించింది. కానీ ఇవేవీ తెలంగాణ రవాణా శాఖను ప్రభావితం చేయలేకపోయాయి. ఆన్లైన్ చెల్లింపులు ప్రారంభించినా, సరిహద్దు చెక్ పోస్టుల్లో మాత్రం మాన్యువల్ లావాదేవీలనే కొనసాగిస్తూ వచ్చింది. దీంతో చెక్ పోస్టుల్లో పర్మిట్లు, ఓవర్లోడ్ చెకింగ్స్ పేరుతో వాహనాలను నిలిపేసి భారీగా డబ్బులు వసూలు చేయటాన్ని అక్కడి సిబ్బంది ‘విధి’గా పెట్టుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు వాహన్, సారథి పోర్టల్లో చేరినా..ఒక్క తెలంగాణ మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. చివరకు కేంద్రం గట్టిగా చెప్పటంతో ఏడాది క్రితం తెలంగాణ కూడా అందులో చేరింది. కానీ ఇప్పటివరకు వాటిని ఓ గాడిలో పెట్టలేక పోయింది. – ప్రస్తుతం రాష్ట్రాల మధ్య తిరిగే ట్రక్కులు ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటున్నాయి. అలా ఒకచోట చెల్లింపులు జరిగినా, రాష్ట్రాలలోని రోడ్ల విస్తీర్ణం, వాహనాల సంఖ్య ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. – అంతర్రాష్ట్ర బస్సులు కూడా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంటున్నాయి. వాటికి కూడా చెక్పోస్టు తనిఖీలు అవసరం లేదు. – పర్మిట్లు తీసుకోవటం, చార్జీలు చెల్లించటం.. అంతా ఆన్లైన్ ఆధారంగా జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వాటి డేటా ఉంటుంది. వాహన్–సారథి పోర్టల్ ఆధారంగా డేటా విషయంలో సమన్వయం సాధ్యమవుతోంది. – అన్ని టోల్ ప్లాజాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనాల కదలికలు రికార్డవుతున్నాయి. ఏ సందేహం ఉన్నా, వాటి ఆధారంగా పసిగట్టే వీలుంది. ఇష్టారాజ్యంగా వసూళ్లు..పోస్టింగులకు లక్షలు తనిఖీల పేరుతో వచ్చిపోయే వాహనాలను ఆపి డబ్బులు వసూళ్లు చేయడమే చెక్పోస్టుల సిబ్బంది పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి. ఈ చెక్పోస్టుల్లో ప్రజా ప్రతినిధులు సిఫారసు చేస్తే తప్ప పోస్టింగులు రావు. అంతేకాదు ఒక్కో పోస్టుకు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ అవినీతి సొమ్ము దిగువ నుంచి పైస్థాయి వరకు పంపిణీ అవుతోందనే ప్రచారం ఉంది. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని చెక్ పోస్టులకు గిరాకీ మరీ ఎక్కువ. వాటిల్లో పోస్టింగ్ కోసం మంత్రుల స్థాయిలో పైరవీలు చేయాల్సిందేనని అంటారు. ఇక ఒక్కో చెక్పోస్టులో రోజుకు రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు ఉంటాయని సమాచారం. కాగా ఈ మొత్తం ప్రతినెలా వాటాల రూపంలో చేతులు మారుతుంటుందని చెబుతున్నారు. – ఇటీవలి కాలంలో వాహనదారులు అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. మరోవైపు ఈ చెక్పోస్టులను తొలగించాలంటూ వందల సంఖ్యలో వినతులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చెక్పోస్టులు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ఏర్పాట్లుఓవర్ లోడింగ్, అక్రమ రవాణా, పర్మిట్లు లేకుండా సరిహద్దు దాటడం లాంటి వాటి విషయంలో నిఘా తప్పనిసరి. చెక్పోస్టులను తొలగించి మొబైల్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. చాలా రాష్ట్రాలు వాటిని అనుసరిస్తున్నాయి. మొబైల్ బృందాలు రోడ్లపై తిరుగుతూ అనుమానం ఉన్న వాహనాలను నిలిపి తనిఖీ చేస్తున్నాయి. ఏమాత్రం లోపాలు గుర్తించినా..వాహనాలను సీజ్ చేయటం, పెనాల్టీ విధించటం, పర్మిట్ రద్దు చేయటం, లైసెన్సులు స్వాధీనం చేసుకోవటం, రద్దు చేయటం... ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇంతకాలం చెక్పోస్టులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటంతో మొబైల్ తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఉన్న ఫళంగా చెక్పోస్టులను తొలగించటంతో యుద్ధప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 15 చెక్పోస్టుల్లో 75 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిని ఆయా జిల్లా రవాణా శాఖ కార్యాలయాలకు అటాచ్ చేశారు. వీరితో పాటు, ఆయా కార్యాలయాల్లోని సిబ్బంది నుంచి కొంతమందిని గుర్తించి మొబైల్ బృందాలుగా ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది -
మేడ్చల్: పోచారంలో కాల్పుల కలకలం
మేడ్చల్: పోచారంలో కాల్పుల కలకలం రేగింది. ఈ రోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) సాయంత్రం సమయంలో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఇబ్రహీం పరారయ్యాడు. ప్రస్తుతం ఇబ్రహీం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంత్ సింగ్ సోనూ అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులకు తెగబడ్డాడు. ప్రశాంత్ సింగ్ సోనూ గోవుల రక్షణ చేస్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. కాల్పుల బారిన పడ్డ ప్రశాంత్ సింగ్ పరిస్థితి ఎలా ఉందనేది, అసలు కాల్పులు ఎందుకు జరిపాడనే విషయాలు తెలియాల్సి ఉంది. -
తెలంగాణ-ఆర్ఎమ్ఐటీల మధ్య వ్యూహాత్మక ఒప్పందం
హైదరాబాద్: జీవవిజ్ఞాన (లైఫ్ సైన్సెస్) విద్య మరియు పరిశోధన రంగాల్లో గ్లోబల్ సహకారాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియాలోని RMIT University వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఇరు సంస్థలు Letter of Intent (LoI) పై సంతకాలు చేశాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RMIT విశ్వవిద్యాలయం డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాథరిన్ ఇట్సియోపోలస్ (Catherine Itsiopoulos), తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరయ్యారు.RMIT విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని ప్రముఖ గ్లోబల్ విద్యాసంస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ-ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అప్లైడ్ రీసెర్చ్లో అగ్రగామిగా ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో "ఇంటర్నేషనల్ అవుట్లుక్" విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచింది. RMIT విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన భాగస్వామ్యాలు మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన సంబంధాల వల్ల పేరుపొందింది. దాని సైన్స్ విభాగం బయోటెక్నాలజీ, బయోసైన్స్, మాలిక్యులర్ బయాలజీ రంగాల్లో ఆధునిక పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలకు అత్యాధునిక ల్యాబ్లు మరియు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.తాజాగా RMIT విశ్వవిద్యాలయం, బిట్స్ హైదరాబాద్తో కలిసి “BITS–RMIT హయ్యర్ ఎడ్యుకేషన్ అకాడమీను ప్రారంభించింది. ఆస్ట్రేలియా మరియు భారతదేశాల మధ్య అధునాతన పరిశోధన, విద్యా మార్పిడి, ఆవిష్కరణ ఆధారిత విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ నుండి పరిశోధకులు జాయింట్ పీహెచ్డీ ప్రోగ్రామ్లను కొనసాగించవచ్చు. విద్యార్థులు తమ విద్యా కాలంలో కొంత భాగాన్ని బిట్స్ హైదరాబాద్లో, మరికొంత భాగాన్ని RMIT మెల్బోర్న్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులు రెండు దేశాల మధ్య మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కలిసి పరిశోధనలు చేస్తారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించి, భారతదేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను బలపరచడమే లక్ష్యం.ఈ సందర్భంగా మంత్రి డి. శ్రీధర్బాబు మాట్లాడుతూ - తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలపై, వారి ఆలోచనలపై పెట్టుబడి పెట్టే దిశగా ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తోంది. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ స్థాపన దిశగా సాగుతున్న సమయంలో, ఇలాంటి ఒప్పందాలు దేశంలోని బయోటెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగల నైపుణ్యం గల యువతను తయారు చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.RMIT డిప్యూటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఇట్సియోపోలస్ (Itsiopoulos) మాట్లాడుతూ - తెలంగాణతో కలిసి తదుపరి తరానికి చెందిన పరిశోధకులు, ఆవిష్కర్తలను తీర్చిదిద్దడం మాకు గర్వకారణం. ఇండస్ట్రీ ఆధారిత విద్య, సంయుక్త పరిశోధనతో మేము ప్రభావవంతమైన మార్పు తీసుకురావాలని తెలంగాణతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రేపటి జీనోమ్ వ్యాలీకి రూపకల్పన వంటిది. RMIT అందించే ప్రామాణిక విద్యను, హైదరాబాద్లో ఉన్న అత్యుత్తమ బయోటెక్ వేదికలతో మిళితం చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించటమే కాదు… మన పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ, భారత్ను ప్రపంచ ఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నిస్త్తున్నారు. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు బుధవారం (సెప్టెంబర్ 22) ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి ఎం. రఘునందన్ రావుకు కమర్షియల్ టాక్స్ అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవాదాయశాఖ డైరెక్టర్గా ఎస్ హరీశ్కు, గనులశాఖ డైరెక్టర్ భవేష్ మిశ్రాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. దేవాదాయ శాఖ నుంచి శైలేజా రామయ్యను సర్కార్ రిలీవ్ చేసింది. మైన్స్ అండ్ జియాలజి డైరెక్టర్ గా భావేష్ మిశ్రాను నియమించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలను గరిమా అగర్వాల్కు అప్పగించింది. గరిమా అగర్వాల్ ప్రస్తుతం సిద్దిపేట అదనపు కలెక్టర్గా సేవలందిస్తున్నారు. కాగా, సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. -
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ‘నేనే మాగంటి గోపినాథ్ వారసుడిని’..
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎంపికలో బిగ్ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసుడిని తానేనంటూ తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు.ఆ లేఖలో ‘తన తల్లి మాలినీ దేవిని హిందూ వివాహ చట్ట ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సునీత అఫిడవిట్ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్కు ఈసీ ఆమోదం తెలిపింది. మరోవైపు షేక్పేట్ ఆర్వో కార్యాలయానికి మాగంటి సునీత వచ్చారు. నామినేషన్లో తాను పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ ఎన్నికల అధికారులకు డిక్లరేషన్ ఫారమ్ అందజేశారు. -
TG: ‘అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులను తక్షణం మూసివేయండి’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ చెక్ పోస్టులు తక్షణం మూసిఏయాలనే ట్రాన్స్పోర్ట్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోరి అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్పోర్టు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని, సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలి. చెక్ పోస్టుల వద్ద ఎవరూ ఉండరాదని పేర్కొంది. ‘చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించాలి. ఆర్థిక మరియు పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలి. చెక్ పోస్టు మూసివేతపై సమగ్ర నివేదిక ఈరోజే సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి’ అని ట్రాన్స్పోర్ట్ శాఖ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇదీ చదవండిL ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ సోదాలు..దానం సపోర్ట్ చేస్తే తప్పేంటి..? -
‘దానం సపోర్ట్ చేస్తే తప్పేంటి?.. కొండా ఫ్యామిలీ వివాదం ముగిసింది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ బహిరంగంగానే కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదం ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు.టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మా స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరు ఉంటే తప్పేంటి?. ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు.. దానం నాగేందర్ సపోర్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. మా పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి?. ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ చూసుకుంటారు. జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తాం.కొండా సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్లో మళ్ళీ ఇలాంటివి జరగవని కొండా దంపతులు ముఖ్యమంత్రితో చెప్పారు. కొండా సురేఖ వివాదం ముగిసింది. రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఢిల్లీ వెళ్తాం. డీసీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
కేసీఆర్తో కేటీఆర్, హరీష్ కీలక భేటీ
సాక్షి, ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో(KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills By poll) ప్రచారం, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్టు సమాచారం. తాజా భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్కు చేరుకున్నారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే, తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక, రేపు(గురువారం) కేసీఆర్.. జూబ్లీహిల్స్ ఇన్చార్జ్లతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
బీహార్కు పైసలిస్తారు.. విద్యార్థులకు లేవా?.. మంత్రులకు బండి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Govt) కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా అని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది అని విమర్శలు చేశారు.హైదరాబాద్లోని నల్లకుంట పరిధిలోని ఉన్న శంకర్మఠ్కు బుధవారం ఉదయం బండి సంజయ్ వెళ్లారు. శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా?. కమీషన్లు రావనే సాకుతోనే సర్కార్ పెద్దలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదా?. అసెంబ్లీ (Telangana Assembly) సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా?. పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.బీహార్ ఎన్నికల(Bihar Elections) కోసం తెలంగాణ నుంచే పైసలు పంపుతున్నారు కదా. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని దిన స్థితిలో ప్రభుత్వం ఉందా?. తక్షణమే బకాయిలు రూ.10 వేల కోట్లు చెల్లించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి నిరసనలకు దిగుతాం. ఖబడ్దార్ మంత్రులను రోడ్లపై తిరగనీయబోమని హెచ్చరిస్తున్నాం. ఇదే సమయంలో కళాశాలల యజమాన్యాలు కూడా ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులని అన్నారు. అలా చేస్తే.. భవిష్యత్తులో వారికి ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలపైనా ప్రైవేటు ఆసుపత్రులు రోడ్డెక్కడం తథ్యమని అన్నారు. మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారని.. వచ్చిన సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్కు కప్పం కడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. -
ఆదివాసీ చైతన్య ప్రతీక : విప్లవయోధుడు కొమురం భీమ్
తెలంగాణ అడవుల్లోని ఆదివాసీల వేదనను వీరత్వంగా మార్చిన కొమరం భీమ్ (Kumaram Bheem ) జీవిత గాథ మొత్తం భారత ఆదివాసీ పోరాటాల చరిత్రలో ప్రత్యేకమైనది. 1901లో, అప్పటి ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా)‘సంకెపల్లి’ సమీపంలో గోండు తెగలో జన్మించిన భీమ్, బాల్యంలోనే సామాజిక అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు. అడవి ఆధారిత జీవన విధానాన్ని ధ్వంసించే అధికారాలకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. తండ్రి చుక్కా భీమ్ను అటవీ అధికారుల దౌర్జన్యంలో కోల్పోవడం ఆయన జీవితాన్ని మార్చింది. 1930వ దశకంలో నిజాం పాలన గిరిజనులకు నరకమే. పన్నులు, అడవిలో ప్రవేశ నిషేధం, వేట నియంత్రణ, రజాకార్ల దుర్మార్గాలు– ఇవన్నీ సాధారణ గిరిజనులను మట్టుబెట్టాయి. ఈ సందర్భంలో భీమ్ నినదించిన ‘జల్, జంగిల్, జమీన్’ (నీరు, అడవి, భూమి) గిరిజనుల ప్రాణాధారాలేమిటో ఎలుగెత్తి చాటాయి. ‘జోడేఘాట్’ ఉద్యమ కేంద్రంగా మారింది. 1928–1940లో జోడేఘాట్ అడవులు ఆయన ఉద్యమానికి స్థావరంగా నిలిచాయి. కొమరం సూరు, వెడ్మ రాము, జంగు, సోమయ్యల వంటి సహచరులు గిరిజనుల్లో చైతన్యాన్ని నింపారు. నిజాం సైన్యం, రజాకార్లు ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించినా, భీమ్ వెనకడుగు వేయలేదు. ఆయన గెరిల్లా పోరాటం ప్రజామద్దతుతో ఆధారంతో నడిచింది. 1940 అక్టోబర్ 27న ఆశ్వయుజ పౌర్ణమి రాత్రి, నమ్మకద్రోహం కారణంగా భీమ్ స్థావరాన్ని నిజాం సైన్యం చుట్టుముట్టింది. భీమ్ చివరి శ్వాస వరకు వెనకడుగు వేయకుండా పోరాడి వీరమరణం పొందాడు. అయినా భీమ్ ఆలోచనలు మరణించలేదు. ‘జల్, జంగిల్, జమీన్’ భావన నేటికీ గిరిజన ఉద్యమాలకు మార్గదర్శకంగా ఉంది. 2006లో పార్లమెంట్ ఆమోదించిన ‘ఫారెస్ట్ రైట్స్ యాక్ట్’ ద్వారా గిరిజనులకు వారి సంప్రదాయ హక్కులుగా అడవులపై హక్కులు కల్పించబడ్డాయి. ఇది కొమరం భీమ్ ఆలోచనలకు చట్టబద్ధ రూపం. కొమరం భీమ్ పోరాటం హింస పట్ల వ్యతిరేకంగా, ప్రజా చైతన్యానికి ఆధారంగా సాగింది. నేటి యువతకు ఆయన జీవితం స్పష్టమైన దిశానిర్దేశం. ప్రకృతి, ప్రాథమిక హక్కులు, సమాజం భవిష్యత్తు కోసం ‘జల్, జంగిల్, జమీన్’ తత్త్వం మరింత ప్రాసంగికమైంది. జోడేఘాట్లో నిర్మించిన కొమరం భీమ్ స్మారక చిహ్నం, గిరిజన ఉద్యమ చైతన్యానికి ప్రేరణ. ‘కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా’ ఆయన ఆత్మగౌరవానికి భారతదేశం ఇచ్చిన గుర్తింపు. ఈ అక్టోబర్ 22న ఆయన జయంతి సందర్భంగా, పూలమాలలు సమర్పించడం కంటే ముఖ్యమైన నివాళి – ఆత్మగౌరవ గిరిజన భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం! ఇదే మనం చెయ్యగలిగే గొప్ప గౌరవార్పణ. – కాయం నవేంద్ర, జాతీయ కన్వీనర్, అఖిల భారతీయ వనవాసి(నేడు కొమరం భీమ్ జయంతి) -
Jubilee Hills By Poll: స్వతంత్ర అభ్యర్థిగా వీరబోగ వసంత రాయలు
హైదరాబాద్: నెత్తిమీద మహరాజులు ధరించే టోపీ, ఒంటి మీద కుర్తా, అలనాటి లెగ్గిన్, వంకీలు తిరిగిన బూట్లు, మెడలో రాజహారాలు, చేతులకు కడియాలు, రాజసంగా ఓ చేతిలో కత్తి ధరించి గుర్రపు బగ్గీపై నామినేషన్ వేసేందుకు వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడో ఇండిపెండెంట్ అభ్యర్థి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరబోగ వసంత రాయలు ప్రజాపతి (వీబీవీఆర్) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి మంగళవారం నియోజకవర్గానికి వచ్చారు. యూసుఫ్గూడలోని పోచమ్మబస్తీ నుంచి ఆయన ఈ విధమైన వేషధారణతో గుర్రపు బగ్గీపై వెళ్తుండగా అందరూ మొబైల్ కెమెరాలతో క్లిక్ మనిపించారు. ప్రజాక్షేమమే లక్ష్యమని, సంపాదన ముఖ్యం కాదని అందుకే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఒక్కటే సిగ్నల్.. కళ్లు బయర్లు కమ్మే చలాన్లు!! ఎట్టకేలకు చిక్కాడిలా..
ఈ మధ్య సోషల్ మీడియాలో బైకులపై ఉన్న చలాన్ల గురించి నడుస్తున్న చర్చ గురించి తెలిసిందే. వేలల నుంచి లక్షల దాకా చలాన్లు ఉన్న బైకుల ఫొటోలను కొందరు తరచూ వైరల్ చేస్తున్నారు. అక్కడ ఆ అవసరం లేకుండానే పోలీసులకు చిక్కాడు ఓ చలాన్ల ధీరుడు!హైదరాబాద్: : తరచూ ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్రూట్లో వెళ్లడంతో ఆటోమెటిక్ సీసీ కెమెరా ద్వారా రూ.58895 జరిమానా పడినట్లు గుర్తించిన వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు సదరు వాహనాన్ని సీజ్ చేశారు. సంఘటనకు సంబందించి వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భూపతిగట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని హస్తినాపురం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు విలియంకేరికి చెందిన బైక్ నంబర్ ఏపి37డీఎస్ 3639 వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఏకంగా రూ.58895 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. అతను ప్రతిరోజు గుర్రంగూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే యూటర్న్ వద్ద రాంగ్రూట్లో ఒక్కోరోజు నాలుగైదు సార్లు వెళితే నాలుగైదు జరిమానాలు ఆటోమెటిక్గా జరిమానాలు పడినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్చేసిన పోలీసులు పెండింగ్ చలానాలు చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని యజమానికి సూచించారు. దీంతో అతను డబ్బులు చెల్లించి బైక్ తీసుకెళతానని చెప్పి వెళ్లినట్లు సీఐ తెలిపారు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలోని విజయవాడ, నాగార్జున జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన యూటర్న్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు లేరనే ఉద్దేశంతో వాహనదారులు రాంగ్రూట్లో వెళుతున్నారు. ప్రతి యూటర్న్ వద్ద తాము ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ యూటర్న్ లు ఉన్న ప్రాంతంలో వాహనదారులు రోజుకు ఎన్నిసార్లు రాంగ్ రూట్లో వెళితే అన్ని సార్లు రూ. 1235 చొప్పున జరిమానా పడుతుందన్నారు. ప్రతిఒక్కరూ గమనించి రాంగ్రూట్లో వెళ్లవద్దని, జరిమానాలే కాకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని సీఐ హెచ్చరించారు. -
సుశీల నా కోరిక తీర్చు.. రౌడీ షీటర్ టార్చర్..!
ఖమ్మం జిల్లా: మండలంలోని వీవీ.పాలెంనకు చెందిన ఓ వివాహిత రౌడీషిటర్ వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన బోడా సుశీల (28).. మరో మహిళతో కలిసి సోమవారం కొణిజర్ల మండలం అమ్మపాలెంలోని పత్తి చేనులో పనికి వెళ్లింది. గ్రామానికే చెందిన రౌడీషీటర్ వినయ్ పొలంలో ఉన్న సుశీల వద్దకు వెళ్లి తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె ఎదురుతిరగడంతో దాడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆమె ఇంటికి వచ్చి బలవన్మరణానికి పాల్పడింది. సుశీలకు భర్త, ఓ కుమారుడు ఉన్నారు. రౌడీ షీటర్ వినయ్ తరచూ వేధిస్తుండడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేశామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, సదరు రౌడీషిటర్ వినయ్ కారులో సుశీలను బలవంతంగా తీసుకెళ్లి అమ్మపాలంలో వదిలేశాడని, ఈ విషయంలో అనుమానాలు ఉన్నా యని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాక మృతురాలి ఒంటిపై గాయాలు ఉన్నా పట్టించుకోకుండా.. ఉరివేసుకుని, సహజ మరణంగా వైద్యులు తేల్చారంటూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సుశీల భర్త, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో సీఐ ఉస్మాన్షరీఫ్, ఎస్ఐలు వెళ్లి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈక్రమాన కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. -
ఐదేళ్లుగా బహ్రెయిన్ మార్చురీలో మృతదేహం
మెట్పల్లి: సుమారు పదిహేడేళ్ల క్రితం.. ఎన్నో ఆశలతో ఆ యువకుడు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అతడికి అప్పటికే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఏడారి దేశానికి వలసవెళ్లాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్ల వరకు తరచూ ఫోన్ చేసిన అతడు.. అనంతరం ఆచూకీ లేకుండాపోయాడు. అప్పటినుంచి ప్రతిరోజు అతని ఫోన్ కోసం.. ఇంటికి వస్తాడనే ఆశతో గుమ్మం వైపు చూసీచూసీ కుటుంబ సభ్యులు అలసిపోయారు. ఎక్కడో బతికి ఉంటాడని, ఎప్పుడైనా ఇంటికొస్తాడని అనుకుంటున్న వారికి రెండురోజుల క్రితం అతడు సజీవంగా లేడనే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని తెలియడంతో వారంతా ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాంనగర్కు చెందిన భారతి, అశోక్ దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే వారు మరణించారు. వారి చిన్న కుమారుడు నరేశ్ను అతని చిన్నమ్మ శ్రీపాద లక్ష్మీ దత్తత తీసుకుంది. 2007లో అతడికి కథలాపూర్ మండలానికి చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలానికే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లాడు. రెండేళ్ల వరకు కుటుంబసభ్యులు, బంధువులకు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. తర్వాత చాలాకాలం పాటు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. అక్కడ ఉంటున్న ఈ ప్రాంతం వారిని ఆరా తీసినప్పటికీ సమాచారం లభించలేదు. పాస్పోర్ట్ గడువు ముగిస్తే ఇంటికి వస్తాడని భావించారు. అయినా రాకపోవడంతో నరేశ్ (39) ఆచూకీ కోసం అతని భార్య కథలాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏళ్లు గడుస్తున్నా అతని ఆచూకీ దొరకకున్నా.. ఎక్కడో సజీవంగా ఉంటాడని భావిస్తున్న కుటుంబసభ్యులకు రెండు రోజుల క్రితం గుండెలను పిండేసే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే నరేశ్ మృతి చెందాడని, అతని మృతదేహం బహ్రెయిన్లోని ఓ మార్చురీలో ఉందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాస్పోర్టు గడువు ముగిసినప్పటికీ నరేశ్ అక్కడే ఉండిపోవడం.. మరణించిన తర్వాత అతని వివరాలు తెలియకపోవడంతో ఇంతకాలం మృతదేహాన్ని అక్కడి మార్చురీలోనే భద్రపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని వివరాలు తెలియడంతో భారత ఎంబసీ అధికారులు.. వాటిని బహిర్గతం చేయడం ద్వారా కుటుంబసభ్యులకు చేరింది. నరేశ్ సోదరుడు ఆనంద్ మృతదేహాన్ని తెప్పించి తమకు అప్పగించాలని మంగళవారం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ద్వారా సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. 17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన నరేశ్ కొంతకాలానికే ఆచూకీ లేకుండా పోవడం.. చివరకు అక్కడే అసువులు బాయడం స్థానికులను కలచివేసింది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పార్టీలకు షాకిస్తూ భారీ సంఖ్యలో నామినేషన్లు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు వచ్చారు. దీంతో, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఆఖరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. బుధవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.నామినేషన్ల చివరిరోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. మంగళవారం గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. తొలి 6 రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బుధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 321 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక నామినేషన్లను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు.. రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
ఆయుధం లేకుండానే యుద్ధానికి!
సాక్షి, హైదరాబాద్: సరిహద్దులో సైనికులంతా అస్త్రశస్త్రాలతో కదన రంగంలోకి దూకి శత్రువులపై పోరాడుతుంటే సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే పోలీసు కానిస్టేబుళ్లు మాత్రం అసాంఘిక శక్తులు, ముష్కరులతో ఉత్త చేతులతోనే పోరాడాల్సి వస్తోంది. ఈ కారణంగానే తాజాగా నిజామాబాద్లో ఘరానా దొంగ రషీద్ను పట్టుకొని పోలీసు స్టేషన్కు తరలించే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ను నిందితుడు కత్తితో పొడవడంతో అమరుడయ్యాడు. గతంలోనూ పలువురు కానిస్టేబుళ్లు ఆయుధాలేవీ లేకుండానే నేరస్తులతోపాటు ఉగ్రవాదులకూ ఎదురెళ్లిన సందర్భాలు ఉన్నాయి. నెత్తురోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు... రాష్ట్ర నిఘా విభాగంలో కానిస్టేబుల్గా పని చేసిన కుక్కుడపు శ్రీనివాసులు 2017లో ప్రతిష్టాత్మక శౌర్యచక్ర పతకాన్ని నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. దేశవ్యాప్తంగా 25 ఉగ్రవాద కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఆలంజెబ్ అఫ్రిదీని శ్రీనివాసులు 2016 జనవరిలో పట్టుకున్నారు. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అఫ్రిదీ కదలికల్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు బెంగళూరులోని పరప్పణ అగ్రహార ప్రాంతంలో గుర్తించారు.దీంతో పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ శ్రీనివాసులుపై అఫ్రిదీ, అతని భార్య కత్తితో దాడి చేశారు. పేగులు బయటకు వచ్చి నెత్తురోడుతున్నా లెక్కచేయకుండా శ్రీనివాసులు స్థానిక పోలీసులు వచ్చే వరకు అఫ్రిదీని ఒడిసిపట్టుకున్నారు. విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు శౌర్యచక్ర అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం సహా పోలీసు విభాగంలో పనిచేసే అధికారికి శౌర్యచక్ర పతకం లభించడం అదే తొలిసారి. నేరగాళ్లతో పోరాడిన వాళ్లెందరో... గత మూడేళ్లలో నేరస్తులను పట్టుకొనే క్రమంలో అనేక మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అయినా వెనక్కు తగ్గకుండా నిందితులను పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్ఓటీలో కానిస్టేబుల్గా పనిచేసిన రాజు నాయక్కు శౌర్య పతకం లభించింది. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో భార్యాభర్తల్ని చంపి దోపిడీకి పాల్పడిన రౌడీషీటర్ కరణ్సింగ్ను పట్టుకునే క్రమంలో రాజు ఛాతీలో కత్తి దిగింది. అయినా రాజు తన సహచరులు వచ్చే వరకు కరణ్సింగ్ను విడిచిపెట్టలేదు. ఘరానా దొంగ బత్తుల ప్రభాకర్ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మాదాపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.ఈ క్రమంలో నిందితుడు కాల్పులు జరపడంతో ఎస్ఓటీ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి తొడలోకి తూటా దూసుకుపోయింది. అయినప్పటికీ ఆయన మిగిలిన కానిస్టేబుళ్లతో కలిసి ప్రభాకర్ను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. మాదాపూర్ సీసీఎస్లో కానిస్టేబుళ్లుగా పనిచేసే యాదయ్య, దినేశ్.. స్నాచర్లు రాహుల్, కిషన్ల కోసం ముమ్మరంగా గాలించారు. బీహెచ్ఈఎల్ ప్రాంతంలో వీరిని గుర్తించి పట్టుకున్నారు. ఆ సందర్భంలో రాహుల్ కత్తితో దాడి చేయగా యాదయ్యకు ఏకంగా ఏడు కత్తిపోట్లు పడ్డాయి.పోలీసు వద్ద ఆయుధాలు కనుమరుగు... విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి ఆయుధం అనేది శరీరంలో భాగం లాంటిది. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్ల క్రితం వరకు అధికారులతోపాటు కీలక విభాగాల్లో పని చేసే కానిస్టేబుళ్లు తమ వద్ద తుపాకీ ఉంచుకునే వారు. అయితే కొన్నేళ్ల క్రితం అమలులోకి వచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు చేపట్టే పోలీసులెవరూ తుపాకులు ఉంచుకోవద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులతో స్నేహపూర్వకంగా మెలిగేందుకు, మానవ హక్కులకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆయుధాలను దూరంగా ఉంచుతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఐదింట నాలుగు యూపీఐ!
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రూపురేఖలను యూపీఐ అని పిలిచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మార్చేసింది. జాతి, మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా యూపీఐ విస్తరించింది. 2022 జనవరి నాటికి యునిక్ యూపీఐ వినియోగదారుల సంఖ్య కేవలం 26.9 కోట్లు. ఈ ఆగస్టు నాటికి ఈ సంఖ్య 50.4 కోట్లకి చేరింది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2022–23లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 74 శాతం కాగా.. 2024–25 నాటికి ఏకంగా 84 శాతానికి పెరిగింది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో సెప్టెంబరులో 1963 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.24.90 లక్షల కోట్లు. 2024 సెప్టెంబరులో లావాదేవీల సంఖ్య 1504 కోట్లు కాగా, వాటి విలువ రూ.20.63 లక్షల కోట్లు. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే అగ్రస్థానం. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రతి ఐదింటిలో నాలుగు యూపీఐవేనంటే అది ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.‘కానీ’–అమెజాన్పే సర్వేమేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘కానీ’, అమెజాన్ పే కలిసి సంయుక్తంగా దేశంలోని 120 పట్టణాల్లో.. డిజిటల్ చెల్లింపులపై అధ్యయనం చేశాయి. మొత్తం 6,000 మందిని సర్వే చేశారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సహా చిన్నచిన్న పట్టణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లలో యూపీఐది సింహభాగం కాగా.. ఆఫ్లైన్లో మాత్రం ఇప్పటికీ నగదుదే అగ్రస్థానం.రికార్డు స్థాయిలో..2022–23 నుంచి 2024–25 మధ్య రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో.. రాష్ట్ర జీడీపీలో సుమారు 8 శాతం విలువైన యూపీఐ లావాదేవీలు జరగడం విశేషం. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. టాప్ రాష్ట్రాలు..‘ఆన్లైన్’ బాటలో...మొత్తం సర్వే చేసిన వారిలో 90% మంది.. ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులనే ఎంచుకుంటున్నట్టు తెలిపారు. ఆఫ్లైన్ కొనుగోళ్లలోనూ (దుకాణాల వంటి చోట్లకు వెళ్లి చేసేవాటిలోనూ).. 56% మంది డిజిటల్ చెల్లింపులే చేశారట. కరెంటు, గ్యాస్ బిల్లు వంటి (యుటిలిటీ) ముఖ్యమైన చెల్లింపులు కూడా 87% మంది డిజిటల్లోనే చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ వాలెట్ల వాడకమూ పెరిగింది. యుటిలిటీ, సబ్స్క్రిప్షన్ల కోసం డిజిటల్ వాలెట్లు వాడుతున్నట్టు 13% మంది చెప్పారు.మహిళలూ ముందంజలో..పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులకు ఇష్టపడుతుండటం గమనార్హం. ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో 88 శాతం మగవాళ్లు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నామంటే.. ఇలా చేస్తామన్న మహిళలు 89 శాతం కావడం విశేషం. మెట్రో నగరాల్లో ఇలాంటి మహిళల శాతం 63 శాతం కాగా, చిన్న పట్టణాల్లో ఇది 47 శాతం.ఎందుకు ‘డిజిటల్’ వైపు?ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఇష్టపడటానికి రెండు ప్రధాన కారణాలు చెప్పారు. అన్ని చోట్లా వాటిని అంగీకరిస్తున్నందున చేస్తున్నామని 57 శాతం, సౌకర్యవంతంగా ఉండటం వల్ల వాటిని వదల్లేకపోతున్నామని 61% మంది చెప్పారు.టాప్ –4 విభాగాలుఎన్పీసీఐ గణాంకాల ప్రకారం.. 2022–23 నుంచి 2024–25 మధ్య యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరిగిన టాప్ విభాగాలు..⇒ కిరాణా, సూపర్ మార్కెట్లు⇒ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లు⇒ ఈటింగ్ ప్లేసెస్, రెస్టారెంట్లు⇒ టెలికమ్యూనికేషన్ సేవలు -
అదరగొడుతున్న ఆఫ్ క్యాంపస్
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగ నియామకాల ట్రెండ్ మారింది. క్యాంపస్ నియామకాలకన్నా ఆఫ్ క్యాంపస్ నియామకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఐటీ దిగ్గజాలన్నీ దీనికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు తగ్గట్టు మానవ వనరుల సమీకరణకు ఇదే సరైన మార్గమని భావిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మారడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూకుడుగా వెళ్తుండటంతో స్కిల్ ఉన్న వారికే కంపెనీలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో గత మూడేళ్లుగా 78 శాతం ఏఐ, డేటాసైన్స్లో నైపుణ్యం ఉన్న వారినే కంపెనీలు ఎంపిక చేసుకున్నట్లు నౌకరీ డాట్ కామ్ అధ్యయనంలో తేలింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్లో 84 శాతం నియామకాలు ఆఫ్ క్యాంపస్ (off-campus) ద్వారానే చేపట్టినట్లు డెలాయిట్ సంస్థకు చెందిన సీనియర్ హెచ్ఆర్ ఒకరు తెలిపారు. వేతనాలు కూడా క్యాంపస్ నియామకాలకన్నా ఆఫ్ క్యాంపస్ ద్వారా నియమించుకున్న వారికే ఎక్కువ ఇస్తున్నారు. డెలాయిట్ ఇండియా నివేదిక ప్రకారం ఈ ఏడాది క్యాంపస్ నియామకాల్లో వేతనాలు 3.91 శాతం పెరిగితే ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో 15 శాతం వార్షిక వేతన ప్యాకేజీ పెరిగింది. యాన్ ఇండియా క్యాంపస్ స్టడీ 2025–26 ప్రకారం 73 శాతం సాధారణ కంపెనీలే క్యాంపస్ నియామకాలు చేపట్టాయి. ఐటీ దిగ్గజ సంస్థల్లో 85 శాతం కంపెనీలు ఆఫ్ క్యాంపస్ ద్వారానే నియామకాలు చేశాయి. కారణాలేంటి? ఐటీ రంగంలో అనుభవం ఉంటే తప్ప ఉద్యోగులను తీసుకొనే పరిస్థితి లేదు. కానీ క్యాంపస్ నియామకాల్లో ఫ్రెషర్స్ను మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉన్నందున కాలేజీల్లో కాకుండా ఇతర సంస్థల్లో, ఆన్లైన్ విధానంలో కోడింగ్పై (Coding) పట్టు సాధించిన వారిని నియమించుకోవడంపై కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. ఇంకో ప్రధానాంశం ఏమిటంటే క్యాంపస్ నియామకాల్లో కేవలం కంపెనీ హెచ్ఆర్ విభాగం మాత్రమే ఇంటర్వ్యూ చేస్తోంది. అదే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అయితే ఆన్లైన్ ద్వారా వివిధ స్థాయిల నిపుణులు అభ్యర్థిని లోతుగా ప్రశ్నించే వీలుంది. దీనివల్ల నైపుణ్యం ఉన్న వారినే ఎంపిక చేసుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ఆఫ్ క్యాంపస్లో రాణించాలంటే.... నైపుణ్యం ఉన్నప్పటికీ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో చాలా మంది ఎంపిక కావడం లేదు. పెద్ద ఐటీ సంస్థలు దాదాపు ఆరు రౌండ్ల దాకా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. అయితే చాలా మంది అభ్యర్థులు ధైర్యంగా మాట్లాడలేక, బెరుకుగా సమాధానాలు ఇస్తుండటం వల్ల తొలి రౌండ్లోనే నిష్క్రమిస్తున్నారని ఐబీఎం హెచ్ఆర్ సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు. రెజ్యూమ్ రూపకల్పనలోనూ తప్పులు చేస్తున్నారని.. అనుభవానికి మించి ఎక్కువ కేడర్ పోస్టులకు దరఖాస్తు చేస్తుండటం వల్ల తొలి దశలోనే దరఖాస్తు తిరస్కరణకు గురవుతోందని పేర్కొన్నారు. అలాగే నైపుణ్యం ఉన్నా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా కొందరు అభ్యర్థులు విఫలమవుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఈ నైపుణ్యాలను ఆన్లైన్ వేదికల ద్వారా నేర్చుకోవచ్చని.. తద్వారా ఆప్ క్యాంపస్ కొలువులు సాధించడం కష్టమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఐటీ నియామకాల్లో ఎక్కువ భాగం ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అవుతున్నాం. ఇది తేలికగా ఉంటోంది. అభ్యర్థి సామర్థ్యాన్ని గుర్తించడానికి వివిధ కేటగిరీ నిపుణులూ ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇది సాధ్యం కాదు. అందుకే గత మూడేళ్లలో పెద్ద కంపెనీలు 70 శాతం మేర ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్ వైపు మళ్లాయి. – అంబరీష్ నికోలన్ (ఓ ఎంఎన్సీ హెచ్ఆర్ మేనేజర్) సమర్థతకు ఇదే వేదిక ఫైనలియర్లో క్యాంపస్ నియామకాల కోసం పెద్ద కంపెనీలేవీ రాలేదు. ఆశించిన వేతన ప్యాకేజీ ఇవ్వలేదు. దీంతో కొన్ని కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నా. ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్కు ప్రయత్నించి ఓ ఎంఎన్సీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం సాధించా. మన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఇదే సరైన మార్గం. – సంజయ్ త్రిపూర్ (బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్) -
పాత నేరస్తుడు రియాజ్ కాల్చివేత
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసిన పాత నేరస్తుడు షేక్రియాజ్ సోమవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీస్ కాల్పుల్లో మరణించాడు. పరారీలో ఉన్న రియాజ్ను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 4వ అంతస్తులో ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వార్డులోకి సాధారణ తనిఖీల్లో భాగంగా ఏఆర్ ఎస్సై, ఏఆర్ కానిస్టేబుల్ మరో ఇద్దరు సిబ్బంది వెళ్లారు. గదిలో రియాజ్ తలుపులు, కిటికీలు పగులగొట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్ను బెడ్వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అయితే రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. వద్దంటూ వారించినా వినలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఏఆర్ ఎస్సై కాల్పులు జరపగా, షేక్ రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. జడ్జి సమక్షంలో పంచనామా నిర్వహించి రాత్రి 7 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం పూర్తిచేసి రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో రియాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రిలో కాల్చివేత ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్టు సీపీ సాయిచైతన్య తెలిపారు. కత్తితో పొడిచి తప్పించుకొని.. ఈనెల 18న పాత నేరస్తుడు షేక్రియాజ్ ఇంటికి వచ్చాడని సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్, ఎస్సై విఠల్, ఇతర సిబ్బందికి సమాచారం వచ్చింది. బాబాన్ సాహెబ్ పహాడ్లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద రియాజ్ కనిపించడంతో కానిస్టేబుల్ ప్రమోద్ వెంబండించి పట్టుకున్నారు. అనంతరం బైక్పై తీసుకెళుండగా, రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో కత్తితో బలంగా పొడిచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ప్రమోద్ చనిపోయాడు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సారంగాపూర్ శివారులో పాతబడిన ఓ లారీ క్యాబిన్లో రియాజ్ ఉన్నట్టు స్థానికులు చెప్పగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రియాజ్ పారిపోతుండగా, ఆసిఫ్ అనే యువకుడు రియాజ్ను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్ రెండు చేతులకు గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులు చుట్టుముట్టి రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడు.గాయపడిన ఆసిఫ్ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నాడు. -
సాగర్ కుడివైపున సీసీ కెమెరాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయానికి కుడి వైపున ఏపీ భూభాగం పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతిచి్చంది. ఇందుకోసం ఇంజనీర్లు, సిబ్బందిని డిసెంబర్ 31 వరకు ఏపీ వైపు ఉన్న డ్యామ్పైకి అనుమతించాలని సీఆర్పీఎఫ్ కమాండింగ్ అధికారికి మంగళవారం లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం నిర్వహణ ఏపీ పరిధిలోకి వెళ్లగా నాగార్జునసాగర్ తెలంగాణ నిర్వహణ కిందకు వచ్చింది. గతంలో ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్ కుడిభాగంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలంగాణ ఆరోపించింది. ఆ ఘటన తర్వాత ఇరురాష్ట్రాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చడానికి కేంద్రం సాగర్ కుడిభాగంలో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. ప్రస్తుతం కుడి భాగంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడ ఎలాంటి మరమ్మతులు చేయాల్సి వచి్చనా కృష్ణా బోర్డు అనుమతితోనే రాష్ట్ర ఇంజనీర్లకు అనుమతిస్తున్నాయి. జలాశయం భద్రతా చర్యల్లో భాగంగా కుడి భాగంలో సీసీ కెమెరాలతోపాటు పిడుగుల నుంచి రక్షణ కోసం లైట్నింగ్ అరెస్టర్లు, సర్జ్ ప్రొటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమ ఇంజనీర్లతోపాటు కాంట్రాక్టర్ల సిబ్బందిని అనుమతించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేయడంతో బోర్డు అనుమతిచ్చింది. -
బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా పార్టీకి చెందిన 40 మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ తరఫున ప్రతిపాదించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గుప్తా ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రచార వాహనాల పాస్లు మంజూరు చేసింది. ఈసీ అనుమతి పొందిన స్టార్ క్యాంపెయినర్లు వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం నిర్వహించేలా అనుమతి ఇచ్చింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇంకా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వి.ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వి.శ్రీనివాస్గౌడ్, ఎస్.నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ఉన్నారు. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అనిల్జాదవ్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, ముఠా గోపాల్, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తాతా మధు, ఎల్.రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రచారంలో పాల్గొంటారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్దన్రెడ్డి, షకీల్ అమీర్ మొహమ్మద్, నేతలు రావుల శ్రీధర్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, అబ్దుల్లా సోహైల్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ నిర్ణయించింది
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ని ఎంఐఎం నేతలు నిర్ణయించారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించిన వెంటనే మజ్లిస్ నేతలు కలసి, తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కలో చేరడం మజ్లిస్కు అలవాటేనన్నారు. కిషన్రెడ్డి మంగళవారం బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్రెడ్డి నామినేషన్ సందర్భంగా యూసఫ్గూడలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ పనైపోయింది. ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. హైదరాబాద్ను లండన్, న్యూయార్క్, వాషింగ్టన్, సింగపూర్గా మారుస్తా అన్న వ్యక్తి ఫాంహౌస్లో పడుకున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజీనామా చేసిన తరువాత ఫాంహౌస్ నుంచి బయటకు రాని వారికి ఓటు వేస్తామా’అని అన్నారు. జూబ్లీహిల్స్ అంటే అక్కడ అన్నీ అద్దాల మేడలని ప్రజలకు ఒక దురభిప్రాయం ఉందని, ఇక్కడ వీధుల్లో చూస్తే మురుగు నీరు, చెత్త, వెలగని వీధి లైట్లు, పార్కుల కబ్జాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. గుడి భూములు ఎంఐఎంకు: బండి సంజయ్ జూబ్లీహిల్స్లోని పెద్దమ్మతల్లి ఆలయానికి చెందిన 11 ఎకరాలను ఎంఐఎం పార్టీ వారికి రాసివ్వడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సల్కం చెరువులో ఎంఐఎం కాలేజీ కడితే వారితో కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యం పెట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లో సైకిల్కి కూడా గతి లేని నాయకులు ఇప్పుడు కేజీల కొద్దీ బంగారు ఆభరణాలు వేసుకుని, పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై మేం మాట్లాడం, మూసీపై మీరు మాట్లాడకండి అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. ఎంఐఎంలో ఇద్దరు జోకర్లు ఉన్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి చెరో రూ.200 కోట్లు తెచ్చుకుని, పతంగి పార్టీని యూసఫ్గూడ చౌరస్తాలో వేలం వేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కాంగ్రెస్కు అభ్యర్థి దొరకలేదని, అందుకే మజ్లిస్ నుంచి ఒక వ్యక్తిని అద్దెకు తెచ్చుకున్నారని బీజేపీ రాష్త్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, దానికి జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రఘునందన్రావు పాల్గొన్నారు. -
చివరిరోజు 189 నామినేషన్లు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు. ఇలా మొత్తం 189 నామినేషన్లకు అధికారులు టోకెన్లు అందించారు. ఈ టోకెన్ల ప్రకారం అభ్యర్థులను లోపలకు పిలిచారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టగా రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్ల పత్రాలను మాత్రమే రిటర్నింగ్ అధికారి తీసుకోగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బు«§ధవారం వరకు గడువు కోరారు. దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 316 నామినేషన్లు దాఖలయ్యాయి. ట్రిపుల్ ఆర్ బాధితులు... ప్రతిపాదిత రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్ఆర్ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. -
రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పండి
శేరిలింగంపల్లి/బండ్లగూడ: (హైదరాబాద్): రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారుకు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి లింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్షాకోట్లో హైడ్రా కూల్చివేతల బాధితుల దీపావళి పండుగలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..బస్తీల ప్రజలకు ఇబ్బంది కలగవద్దని, గడప దగ్గరలోనే వైద్య సేవలు అందించేలా రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. అందులో 350 బస్తీ దవాఖానాలను ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేస్తే, ఇప్పుడు వాటిని నిర్వీర్యంగా మార్చారు. కనీసం బీపీ మీటర్లు కూడా పనిచేయడం లేదు. గతంలో బస్తీ దవాఖానాలలో 134 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తూ 110 రకాల మందులు అందించే వాళ్ళం. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటికి సుస్తీ పట్టింది. ప్రస్తుతం 60 నుంచి 70 రకాల మందులే ఇస్తున్నారు. 40 రకాల మందులు సరఫరా చేయడం లేదు. వైద్య పరీక్షలు కూడా అన్నీ జరగడం లేదు. రేవంత్రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. సీఎం సొంత నియోజకవర్గంలోనే 108 సర్వీస్ సకాలంలో రాక, వైద్యం సకాలంలో అందక మనిషి ప్రాణం పోయింది..’అని హరీశ్రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు ‘ఆస్పత్రులలో కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వల్ల 20 శాతం ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలి వెళుతున్నారు. రూ.1,400 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండగా.. వాటిని చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా మారిందో అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ బీజేపీతో కలవదు. మాది లౌకిక పార్టీ. కానీ కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నగరంలో పేదల ఇళ్లు కూల్చడం ఆగాలన్నా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రేవంత్రెడ్డి నయా నరకాసురుడు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం వారికి కునుకు లేకుండా చేస్తోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే బస్తీ దవాఖానాల్లో మందులు లేకున్నా, డాక్టర్లు లేకున్నా, వైద్య పరీక్షలు లేకున్నా నాకే ఓటేశారని రేవంత్రెడ్డి అనుకుంటాడు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్కే ఓటెయ్యాలి. హైదర్షాకోట్ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు తమకు అండగా ఉండాలని కోరారు. మీ కష్టాల్లో అండగా ఉన్నది బీఆర్ఎస్ పారీ్టయే..’అని హరీశ్రావు చెప్పారు. పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
మావోలు లొంగిపోవాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమంలోని అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం అందరికీ తెలుసునని, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసే అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. మంగళవారం గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. పోలీసుల కృషితో ఇప్పుడవి దాదాపు లేకుండా పోయాయి. గ్రేహౌండ్స్ కమాండోలు సందీప్, శ్రీధర్, పవన్ కల్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందితే.. అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్లగొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వహణలో మరణించారు. మూడురోజుల కిందట నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు. అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, ప్రమోద్ లాస్ట్ డ్రాన్ శాలరీ అతని పదవీ విరమణ సమయం వరకు కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షల ఎక్స్గ్రేషియాం, పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం..’ అని సీఎం చెప్పారు. దేశానికే ఆదర్శంగా మన పోలీసులు ‘రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరగనివ్వకుండా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణను పూర్తి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకే పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలు ఇచ్చాం. డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ‘ఈగల్’ వింగ్ను ఏర్పాటు చేశాం. కొత్త తరహా నేరాలు సవాలుగా మారుతున్నాయి ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం గర్వకారణం. సాంకేతిక రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తెలంగాణకు దక్కిన గౌరవం. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది..’ అంటూ రేవంత్ కితాబునిచ్చారు. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి ‘పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చాం. పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్లు సారథ్యం వహించడం గర్వించదగ్గ పరిణామం. కీలక విభాగాలను సమర్థవంతంగా నడిపిస్తున్న వారిని చూసి గర్విస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు మహిళా అధికారులు డీసీపీలుగా ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లను, ఎస్ఐలను రిక్రూట్ చేశాం. రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించాం. శాంతిభద్రతలు బాగున్నచోటే అభివృద్ధి సాధ్యం. ఇందులో పోలీసుల పాత్ర కీలకం. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా నష్టపరిహారం సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం అందిస్తున్నాం. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను.. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు కోటి రూపాయలకు, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలకు, డీఎస్పీ, అదనపు ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలకు, ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రూ.2 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మనది ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ మరవకూడదని, ‘ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే ఫార్ములాతో మనం ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూస్తూ నిష్పాక్షికంగా వ్యవహరించడం ‘ఫెయిర్ పోలీసింగ్’ అయితే.. పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేస్తూ, శాంతిభద్రతలను కఠినంగా కాపాడటం ‘ఫర్మ్ పోలీసింగ్’. విధి నిర్వహణ సరిగా చేస్తూ ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్నీ పొందడమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’..’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీకి అందజేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
Hyd: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు
హైదరాబాద్: నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు అధికారులు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 21వ తేదీ) నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయం కాంపౌండ్క భారీగా క్యూకట్టారు స్వతంత్ర్య అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వేసినట్ల తెలుస్తోంది. గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లన మాత్రమే ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) సైతం ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గత బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది.ఇదీ చదవండిపార్టీలో నా న్థానం ఏమిటి..? -
‘‘కేసీఆర్పై కోపంతో..’’ కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్, హరీష్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. భ్రాంతి కాకూడదు!
హైదరాబాద్లో భూమి ధరలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికిందంటే ఆశ్చర్యమేస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవన్న వార్తలొస్తున్న వేళ ఒక కంపెనీ ఇంత మొత్తం పెట్టిందంటటే నమ్మశక్యం కాదు. వేలం పాటలో కొన్నమాటైతే వాస్తవం. అయితే కొనుగోలు ధర పూర్తిగా చెల్లించినప్పుడే ఈ విలువ ధృవీకరణ అవుతోంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నది దుష్ప్రచారమేనని వాస్తవం లేదని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో రూ.2800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే, అది రూ.4804 కోట్లు అని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకన్నది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతోపాటు దేశాద్యంతం కూడా మందగతిలోనే ఉందని వారు చెబుతున్నారు.కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గ్లోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్లకు దక్కించుకుంది. పెస్టీజ్ రియాల్టీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.2913 కోట్ల ఆదాయం దక్కిందన్నమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో రూ.225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే.. వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకూ కొనసాగుతాయా అన్న అనుమానం వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76 శాతం పెరిగిందన్నమాట. హైదరాబాద్ సాధిస్తున్న సుస్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవమైతే ఫర్వాలేదు కానీ.. బలవంతంగా మార్కెట్ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం బెడిసికొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు.ఎకరా భూమికి రూ.177 కోట్లు, రూ.141.5 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తరువాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు రూ.30 - 40 వేల కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్ల అంచనా. అయితే ఆ ప్రాంతంలో ఎఫ్ఎస్ఏ ఎక్కువ కాబట్టి ఏభై, అరవై అంతస్థుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని... ఆ రకంగా చదరపు అడుగుకు రూ.10 - 20 వేలకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై ఒక శాతం కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ బిల్డర్ ప్రశ్నించారు.కోకాపేటలో పక్కనే 50 - 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాని ధర రూ.వంద కోట్లయితే తనదీ అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఒక కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్ను వదులుకుంది మినహా ఎకరాకు రూ.వంద కోట్లు చెల్లించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుత వేలం పాటలలో పాల్గొన్న కంపెనీలలో ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడియన ఆయన కంపెనీనే ఇంత భారీ మొత్తానికి వేలం పాటలో పాల్గొనడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్న. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్పై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్టుమెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్తో, కూస్తో బెటర్గా ఉండవచ్చేమో కాని, ఈ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి. హెచ్ఎండీయే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లను వేలం వేస్తే, మూడు మాత్రమే అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ.500 కోట్లు వస్తాయని ఆశిస్తే, రూ.38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం రూ.177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథ ఉంది. దీనిని కప్పిపుచ్చడానికి రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఇతరత్రా మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధర పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ రెండు కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. అక్కడ కూడా లావాదేవీలు పుంజుకుంటాయి. రీజినల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ - విజయవాడ రోడ్లు విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే వంటివి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం నేచురల్ గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవీ మరీ పెరిగిపోతే మధ్య తరగతికి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అడాప్ట్-ఎ-విలేజ్’కి అపూర్వ స్పందన
సాక్షి, హైదరాబాద్: శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అడాప్ట్-ఎ-విలేజ్కి అనూహ్య స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో.. ఎన్నారై దాతల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల్లో వేల మంది చికిత్స అందుకుంటున్నారు. మరిన్ని గ్రామాల్లో ఉచిత మొబైల కంటి శిబిరాలు(Mobile Eye Surgical Unit) నిర్వహించేందుకు ఇంకొందరు ముందుకు వస్తున్నారుశంకర నేత్రాలయ USA అక్టోబర్ 17న అడాప్ట్-ఎ-విలేజ్ దాతలతో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అనేక దాతలు తమ అనుభవాలను పంచుకున్నారు. అమెరికా, సింగపూర్, యూకే నుంచి ఎన్నారైలు ఈ సేవా కార్యక్రమాన్ని మద్దతు ప్రకటించారు. తమ వంతుగా సాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కంటి శిబిరాలు నిర్వహించి వీలైనంత మందికి ఉచిత చికిత్స అందించబోతున్నారు. దాతలు తమ స్వగ్రామాల్లో శిబిరాలు నిర్వహణకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. వందల మందికి కంటి శస్త్రచికిత్సలు, స్క్రీనింగ్లు, భోజనం, రవాణా సేవలు ఉచితంగా అందజేస్తారు. అక్టోబర్ 30వ తేదీ దాకా 11 రోజులపాటు అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కొండా రెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి ఇందుర్తి, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి, హూస్టన్కు చెందిన రియల్టర్ రాఘవేంద్ర రెడ్డి సుంకిరెడ్డి తదితరులు హాజరయ్యారు. దాతలు ముందుకు రావడంతో పాటు.. స్థానిక వైద్యులు, రోటరీ క్లబ్స్, పలువురు నాయకుల సహకారంతో ఈ శిబిరం విజయవంతంగా ముందుకు సాగుతోందని బాలరెడ్డి తెలిపారు. -
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని, పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే పోలీసుల అత్యాగాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. మంగళవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. దేశం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు అమరులయ్యారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ అమరవీరులకు నాలుగు కోట్ల ప్రజల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలోనే ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను భారీగా పెంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం... రోజు రోజుకు నేరాల స్వభావం మారుతోంది. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. శాంతి భద్రతల కట్టడికి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. అందుకే అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా పని చేస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణే మా ధ్యేయం. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉంది. సాంకేతికతలో తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు మంచి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం. ఇటీవల కొందరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. తెలంగాణ అభివృద్ధిలో వారి వంతు తోడ్పాటు అందించాలి. అలాగే.. పోలీసుల గౌరవం పెరిగితేనే ప్రభుత్వ గౌరవం కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్న ఈ రోజుల్లో.. పోలీసుల ప్రతీ అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి అని సీఎం రేవంత్ సూచించారు.తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రసంగిస్తూ.. పోలీస్ అధికారులు అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిధులు నిర్వహించాలి. దేశంలోనే తెలంగాణ పోలీసులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఒకరోజు గుర్తు చేసుకుంటే సరిపోదు. వాళ్ళ కుటుంబాన్ని పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పై ఉంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో చనిపోయిన కుటుంబాలకు అధిక ఎక్స్గ్రేషియా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని అన్నారు. -
అర్ధరాత్రి దాకా పోస్ట్మార్టం.. తెల్లవారక ముందే అంత్యక్రియలు పూర్తి
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోలీసులు కస్టడీ నుంచి పారిపోయే క్రమంలో అతగాడు దాడికి యత్నించగా.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోయిన సంగతి తెలిసిందే.జీజీహెచ్ ఆస్పత్రి మార్చురీలో గత అర్ధరాత్రి దాకా రియాజ్ మృతదేహానికి పోస్ట్మార్టం జరిగింది. మూడు గంటల ప్రాంతంలో బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహం ఆసుపత్రి నుండి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బోధన్ రోడ్డులో గల స్మశాన వాటికలో తెల్లవారక ముందే మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రియాజ్(24)పై 40 కేసులతో(దొంగతనాలు, దాడులు) పాటు రౌడీ షీట్ ఉంది. ఈ క్రమంలో అక్టోబర్ 17వ తేదీన అతని గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్(CCS) సిబ్బంది ఇద్దరు రంగంలోకి దిగారు. అయితే అతన్ని బైక్పై తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్(48)ను తన దగ్గర ఉన్న కత్తితో పొడిచి పరారయ్యాడు. రెండ్రోజుల పాటు 8 పోలీసుల బృందాలకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఈ ఘటనను రాష్ట్ర పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. అయితే.. రెండ్రోజుల తర్వాత ఆదివారం.. అతన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ క్రమంలో గాయాలు కావడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఖైదీల వార్డులో చికిత్స చేయించారు. అయితే సోమవారం ఉదయం తప్పించుకునే ప్రయత్నంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వద్ద గన్ లాక్కునే ప్రయత్నం చేసి పారిపోసాగాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులకు దిగడంతో బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి స్పందిస్తూ.. రియాజ్ కాల్పులకు దిగి ఉంటే మరిన్ని ప్రాణాలు పోయి ఉండేవని, పోలీసులు సకాలంలో స్పందించారని అన్నారు. మరణించిన ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయాల ఆర్థిక సాయం , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారాయన.ఇదీ చదవండి: తెలంగాణ మంత్రి వద్ద సీనియర్ నేత ఆవేదన చూశారా? -
సీఎం రేవంత్రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ పాల్గొన్నారు. ఇటీవల సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు.కొండా సురేఖ, మురళికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
పార్టీలో నా స్థానం ఏంటి?.. మంత్రి ముందు జీవన్రెడ్డి ఆవేదన
సాక్షి, జగిత్యాల జిల్లా: తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారంటూ మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్రెడ్డి వాపోయారు. బీఆర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీపై జీవన్రెడ్డి అసంతృప్తి చేశారు. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమ స్థానమేంటని ప్రశ్నించారు.తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై చురకలు అంటించారు. మంత్రి శ్రీధర్బాబు, అడ్లూరి అడుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. -
హైదరాబాద్: స్వీట్స్ షాప్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు స్వీట్స్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు. సుమారు 45 షాపులపై దాడులు నిర్వహించారు. -
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం: డీజీపీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ను కాపాడేందుకు పోలీసు శాఖ నిబద్ధతో ఉందని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ను డీజీపీ శివధర్రెడ్డి దృవీకరించారు.ఈ సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. ‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి ఆర్ధిక సాయం, ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. 300గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తాం. ప్రమోద్ ఉద్యోగ విమరణ పొందే వరకు వచ్చే శాలరీని వారి కుటుంబానికి అందిస్తాం.దీంతో పాటు ప్రమోద్ కుటుంబానికి పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16లక్షలు,పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8లక్షల పరిహారం ఇస్తాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి. కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీస్ శాఖ తరుఫున నివాళులు’ అని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు.నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు.రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. -
రేపే దీపక్ రెడ్డి నామినేషన్.. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రుల రాక!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలు విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవుతున్నాయి.ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రేపు(మంగళవారం) తన నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో యూసఫ్గూడ హైలం కాలనీ నుంచి షేక్పేట్ తహశీల్దార్ ఆఫీస్ వరకు నామినేషన్ ర్యాలీ చేపట్టనున్నట్టు సమాచారం. ఆయన నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముగ్గులు సీఎంలు ముఖ్యఅతిథిలుగా రానున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారికంగా కన్ఫరేషన్ ఇచ్చారు. అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల కన్ఫరేషన్ కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. కాగా, నామినేషన్ ర్యాలీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున జనసమీకరణతో భారీ ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. -
కానిస్టేబుల్ ప్రమోద్ కేసు: రియాజ్ ఖతం, డీజీపీ ఏమన్నారంటే..
సాక్షి, నిజామాబాద్: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుడు రియాజ్(24) ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జరగ్గా.. పోలీసులు దానిని ఖండించిన సంగతి తెలిసిందే. అయితే.. స్వయంగా తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న రియాజ్ సోమవారం పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఆపై పారిపోతున్న రియాజ్పై పోలీసులు కాల్పులు జరపగా.. అక్కడిక్కడే మృతి చెందాడు. రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్రెడ్డి స్పందిస్తూ(Telangana DGP reacts On Riyaz Encounter).. ‘‘పోలీసుల కాల్పుల్లోనే రియాజ్ చనిపోయాడు. ఆస్పత్రి నుంచి పారిపోతున్న క్రమంలో అతను మరోసారి దాడికి తెగబడ్డాడు. బయట కాపలా ఉన్న పోలీసుల దగ్గర ఉన్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అందుకే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఒకవేళ రియాజ్ గన్పైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవే. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది అని అన్నారు. రియాజ్ చేతిలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్చైన్స్నాచర్ టు కానిస్టేబుల్ హత్య.. చిన్నచిన్న దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు పాల్పడే రియాజ్ ఆచూకీ గురించి శుక్రవారం(అక్టోబర్ 17వ) తేదీన నిజామాబాద్ సీసీఎస్కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్పై ఎక్కించుకున్నారు.అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో.. మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు 8 బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు.. రూ.50 వేల రివార్డుతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. ఈలోపు.. రియాజ్ను ఆదివారం మధ్యాహ్నాం ఎట్టకేలకు చిక్కినట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్ అంటూ ప్రచారం.. శుక్రవారం ప్రమోద్ను హత్య చేశాక.. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైకుపై పరారైన అతను మహ్మదీయకాలనీలోని తన ఇంటికి వెళ్లి, దుస్తులు మార్చుకుని బయటకొచ్చాడు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకుని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలను డ్రోన్ కెమెరాల సాయంతో జల్లెడపట్టారు. అయితే.. ఈలోపు ఓ చోట రియాజ్ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కొని.. పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా.. రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమచేతిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది. అయితే ఆ సమయంలో రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు ప్రచారం జరగ్గా.. పోలీసులు ఖండించారు. నిందితుడు రియాజ్ను సజీవంగానే పట్టుకున్నామని, తీవ్రంగా గాయపడటంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని, గాయపడ్డ అసిఫ్ను కూడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని స్పష్టత ఇచ్చారు. ఈలోపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయే క్రమంలో ఎన్కౌంటర్ కావడం గమనార్హం.ఇదీ చదవండి: పోలీసులకే రక్షణ లేదు.. ఇలాగైతే ఎలా? -
సీఎం వద్దే హోంశాఖ.. పోలీసులకే రక్షణ లేదు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దీపావళి సందర్బంగా హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రౌడీషీటర్.. పోలీసును హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బహిర్గతం చేసింది. పోలీసులకే రక్షణ లేకపోవడమేంటి?. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ శాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేది వాస్తవం కాదా?. మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే అంత ఓపెన్గా మాట్లాడుతుంటే.. ఇంకా తప్పు జరగలేదని ఎవరు భావించాల్సి ఉంటుంది?. ఈ అంశంపై సిట్ విచారణ చేపట్టాలి. పెట్టుబడిదారులను బెదిరించి.. గన్ కల్చర్ చేపట్టి వాటాలు పంచుకుంటున్నారు. మేము అగ్రికల్చర్ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్ కల్చర్ను తీసుకొచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కారులో వచ్చి 50 కోతులు కొన్న వ్యాపారి.. ఎన్ని లక్షలంటే?
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని కోతులను పట్టుకున్న కాంట్రాక్టర్ హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు ఆదివారం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఎర్టిగా కారులో ఒకరు 50 కోతులకు ఓ కాంట్రాక్టర్కు రూ.2 లక్షల వరకు సొమ్ము చెల్లించి తరలించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టుకున్న కోతులను ఏటూరునాగారం అడవుల్లోకి తర లించాల్సిన కాంట్రాక్టర్ వ్యాపారికి విక్రయిస్తు న్నారనే సమాచారం మేరకు ఓ జర్నలిస్టు బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా.. కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. కోతుల విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు బల్దియా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సీసీ కెమెరాల్లో రికా ర్డు అయినట్లు చర్చ జరుగుతోంది. ఈవిషయ మై సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. తనకు కూడా సమాచారం అందిందని, సోమ వారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాల యంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వివరా లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కోతు లను విక్రయించినట్టు తేలితే సదరు కాంట్రాక్ట ర్పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
Telangana: పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్పే, గూగుల్పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
కష్టపడ్డారు.. ఉన్నతికి చేరుకున్నారు
మహేశ్వరం/కొత్తూరు: ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూనే.. మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కలగన్నారు. కష్టపడ్డారు. ఫలితం దక్కించుకున్నారు. వారిలో ఒకరు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికగా, మరో ఇద్దరు కానిస్టేబుల్గా పనిచేస్తూ.. ఏఎస్ఓగా ఒకరు, ఎస్ఐగా మరొకరు ఎంపికయ్యారు. నగరంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తదితర అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకొన్నారు.పేద రైతు కుటుంబంలో.. పేద రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశా లలో చదివాడు. గ్రూప్– 2లో రాష్ట్ర స్థాయిలో 171 ర్యాంకు సాధించి, డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యో గం సాధించాడు గిరిజన బిడ్డ దేవేందర్. మండల పరిధి పెద్దమ్మ తండా అనుబంధ నల్లచెర్వుతండా కు చెందిన కాట్రావత్ లక్ష్మీ– రాములు నాయక్ దంపతుల కుమారుడు దేవేందర్ నాయక్ శనివారం రెవెన్యూ అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో రెవె న్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యాడు. ఇంతకు ముందే.. దేవేందర్ గ్రూప్– 3లో 305 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించారు. గ్రూప్– 4లో 141వ ర్యాంకు సాధించి, శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 1లో 433 మార్కులు సాధించినప్పటికీ.. కొద్దిపాటి తేడాతో అదృష్టం చేజారింది. అయినా నిరుత్సాహం చెందకుండా.. డీటీ కొలువు సాధించాడు.కానిస్టేబుల్గా కొనసాగుతూ.. కొత్తూరు: కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంకు సాధించి, సెక్రటేరియట్లో ఏఎస్ఓగా ఉన్నతస్థితికి చేరుకుంది. పట్టణానికి చెందిన గాలిగాని యాదయ్య మూడో కూతురు ఉమ.. చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. సర్కారు బడుల్లో విద్యనభ్యసించి గ్రూప్– 1, ఎస్ఐ, ఉద్యోగానికి పలుమార్లు పరీక్షలు రాసి కొద్దిపాటి మార్కులతో రాణించలేక పోయింది. ఆ తరువాత కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అయినప్పటికీ.. పట్టువదలక.. పోటీ పరీక్షలు రాసి.. గ్రూప్–2లో మెరిసింది. ప్రస్తుతం ఉమకేశంపేట పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది.కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా..యాచారం: ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తూ.. ప్రస్తుతం అదే శాఖలో ఎస్ఐగా ఉన్నతికి చేరుకుంది మండల పరిధి నందివనపర్తి అనుబంధ గ్రామం పిల్లిపల్లికి చెందిన అయ్యాగాని ప్రవళిక. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె.. బీపార్మసి పూర్తి చేసింది. తాజాగా వెలువడిన గ్రూపు– 2లో రాణించి, ఎస్ఐగా ఎంపిౖకైంది. గతంలో గ్రూప్– 4లో వార్డు ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్– 1లో ఉద్యోగం సాధించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రవళిక తల్లిదండ్రులు పాండు, శోభలు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. -
వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో నరకాసుర వధ (ఫొటోలు)
-
తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అంతలోనే అనంతలోకాలకు..
నల్గొండ జిల్లా: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి.వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్‡కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది. వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్‡కృçష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్ కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.నేత్రదానం..నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు. -
అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు మస్తు డిమాండ్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదీలు విదేశీ రహదారులపై రయ్మంటూ దూసుకెళ్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం వివిధ దేశాలకు వెళ్లేవారు పాస్పోర్టులు, వీసాలతో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను కూడా ఒక తప్పనిసరి అవసరంగా భావించడం విశేషం. రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)కి ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఈ ఐడీపిపైన అక్కడ వాహనాలను నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. సాధారణంగా యూఎస్కు వెళ్లేవారి నుంచి ఐడీపీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత డాలర్ కలలు కరిగిపోవడంతో విద్యార్థులు ఎక్కువగా యూరోప్ బాట పడుతున్నారు. దీంతో ఇప్పుడు యూఎస్కు వెళ్లే వాళ్లు మాత్రమే కాకుండా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు వెళ్లే వాళ్లు కూడా ఇంటర్నేషనల్ పరి్మట్ల కోసం బారులు తీరుతున్నారు. ఏటా సగటున 10 వేల నుంచి 12 వేల అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను అందజేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13,151 పరి్మట్లను అందజేశారు. ఈజీగా డ్రైవింగ్.. లక్షలకొద్దీ వాహనాలు, కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్ రద్దీ నడుమ హైదరాబాద్లో బండి నడిపిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా దూసుకుపోగలుగుతాడనేది జగమెరిగిన సత్యం. అందుకే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వాళ్లు అక్కడి రోడ్లపైన తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు సొంత డ్రైవింగ్ తప్పదు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ పరి్మట్లకు డిమాండ్ పెరిగింది. విద్యార్ధులు, ఉద్యోగులతో పాటు మహిళలు సైతం ఐడీపీల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరిగా మారడంతో డ్రైవింగ్ కూడా అనివార్యమైంది. మరోవైపు మన ఐడీపీలు ఉన్న వాళ్లకు ఆయా దేశాల్లో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం కూడా తేలిక. పెద్దగా కఠినమైన డ్రైవింగ్ పరీక్షలు లేకుండానే లైసెన్సులు అందజేస్తారు. ఐడీపీలు పొందడం ఇలా.... పాస్పోర్టు కలిగిన వారు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లను తీసుకోవచ్చు.ఇందుకోసం రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘సారథి’ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. అలాగే రూ.1500 ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. అనంతరం పాస్పోర్టు,ఆధార్. డ్రైవింగ్ లైసెన్సు, తదితర డాక్యుమెంట్లతో సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలోని అధికారులను సంప్రదిస్తే అప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్పరి్మట్లను అందజేస్తారు. ఇది తీసుకున్న రోజు నుంచి ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుంది.ఆ తరువాత దీన్ని పొడిగించుకొనేందుకు అవకాశం లేదు. మరోసారి స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ దేశాల్లోనే స్థిరపడేవారైతే ఏడాదిలోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవలసి ఉంటుంది.నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట్, బండ్లగూడ, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మెహదీపట్నం, తదితర ప్రాంతీయ రవాణాకార్యాలయాల నుంచి సగటున 120 నుంచి 150 పర్మిట్ ను అందజేస్తున్నట్లు అంచనా.కొన్ని దేశాల్లో మన ఐడీపీ చెల్లుబాటు కాదుమన అంతర్జాతీయ డ్రైవింగ్ పరి్మట్లకు సుమారు 150 దేశాల్లో ఆమోదం ఉంది.కానీ కొన్ని దేశాల్లో మాత్రం చెల్లుబాటు కాదు.జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో భారతీయ ఐడీపీలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అక్కడ రవాణాశాఖ నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. యూఎస్,బ్రిటన్,న్యూజిలాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, తదితర దేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం 6 నుంచి 9 నెలల వరకు అనుమతినిస్తారు.డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు దృష్ట్యానే ఈ అనుమతుల్లో తేడాలు ఉన్నట్లు రహదారిభద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. -
మూసాపేట్లో బుల్లెట్ కలకలం
హైదరాబాద్: మూసాపేట మెట్రో స్టేషన్లో ఓ బాలుడి వద్ద బుల్లెట్ దొరకడంతో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ బాలుడు (12) మూసాపేట పరిధి ప్రగతినగర్లో తల్లితో పాటు ఉంటూ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి.. తండ్రితో విడిపోయి గత ఆరేళ్లుగా బిహార్కు చెందిన మహమ్మద్ ఆలంతో కలిసి ఉంటోంది. అతను మూసాపేటలోని ప్రగతినగర్లో నివాసముంటూ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో బాలుడిని బాగా చదువుకోవాలని, ఆటలాడవద్దని తండ్రి మందలించటంతో ఇంటి నుంచి పారిపోవాలని, ఇంట్లో ఉన్న బ్యాగులో బట్టలు, డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద ఉండగా బాలుడి బ్యాగ్ను తనిఖీ చేయగా బుల్లెట్ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు బాబును స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ సమాచారం రాబట్టగా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వెళ్లిపోతున్నానని, బ్యాగులో బట్టలు, డబ్బులు తీసుకుని వెళుతున్నానని, తనకేమీ తెలియదన్నాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పటంతో ప్రగతినగర్కు వెళ్లి విచారించగా... మహమ్మద్ ఆలం తాత అన్సారీ ఆర్మీలో పనిచేసే వారని, తను చనిపోయినప్పటికి ఆయన బుల్లెట్ అలాగే ఉందని, ఇటీవల బిహార్కు వెళ్లినప్పుడు బుల్లెట్ను శుభ్రం చేసి జ్ఞాపకంగా పర్సులో దాచుకున్నానని తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 9 ఎంఎం కేట్రిడ్జ్ బుల్లెట్గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
హైదరాబాద్ : సంబరంగా దీపావళి సదర్ వేడుకలు (ఫొటోలు)
-
జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2026)ను వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ప్రవేశపరీక్ష తొలిదశకు ఈ నెలలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు రెండో దశను నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశ కోసం జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఎన్టీఏ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. ఈసారి జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. -
వారు కోవర్టులు.. విప్లవ ద్రోహులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి... సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి 2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి. నిజాలు దాచి .. నిందలు మోపుతూ.. ఆపరేషన్ కగార్తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెపె్టంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు. బహిష్కరిస్తున్నాం సోను, అతని అనుచరులు ఆయుధాలు పారీ్టకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్జెడ్సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది నుంచి వారు కాంటాక్ట్లో ఉన్నారు.. గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్లను హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ భారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్పే, గూగుల్పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
ఈడీ అటాచ్ చేసినా.. ఆస్తులను అమ్మేశారు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో వివిధ స్కీమ్ల ముసుగులో రూ.6,000 కోట్ల స్కామ్కు పాల్పడిన నౌహీరా షేక్ మరో కుంభకోణానికి తెరలేపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల్ని వివిధ మార్గాల్లో నకిలీ పత్రాల సాయంతో విక్రయించారు. హైదరాబాద్లోని కొన్ని ఆస్తుల్ని అమ్మేయగా... ముంబైలో విక్రయానికి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన ఈడీ అధికారులు ఆ ప్రయత్నాలు అడ్డుకోవడంతోపాటు ఈ దందాలో నౌహీరాషేక్కు సహకరించిన సబ్రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.స్కీముల పేరుతో రూ.వేల కోట్ల మోసాలు హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ సహా వివిధ రకాలైన స్కీమ్ల పేరు చెప్పిన నౌహీరా షేక్ దేశవ్యాప్తంగా అనేకమంది నుంచి డిపాజిట్లు సేకరించింది. గరిష్టంగా 36 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి దాదాపు రూ.5 వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించి మోసం చేసింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు భారీగా ఆస్తులు సీజ్ చేశారు.అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం అటాచ్ చేసిన ఆస్తులను కోర్టు అనుమతితో వేలం వేయడం ద్వారా ఈడీ నగదుగా మారుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని విక్రయించడం ద్వారా ఈడీ అధికారులు రూ.93 కోట్లు సమీకరించారు. అయితే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఫ్లాట్లను విక్రయించడానికి నౌహీరా షేక్ పథకం వేసింది. హైదరాబాద్లో ఉన్న కొన్నింటిని అమ్మేసి సొమ్ము చేసుకుంది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ముంబైలో ఉన్న రూ.12 కోట్ల విలువ చేసే మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. వీటిపై కొందరితో సేల్ అగ్రిమెంట్లు చేసుకున్న నౌహీరా షేక్ రూ.3 కోట్లు అడ్వాన్స్గా తీసుకుంది. ఓ ఫ్లాట్ ఖరీదు చేసిన యజమానిని విచారించిన ఈడీ వాంగ్మూలం సైతం నమోదు చేసింది.సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వ్యవహారం నౌహీరా షేక్ వేసిన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నెల 10 తేదీన వీటి విచారణ జరిగింది. ఈ సందర్భంలో ఈడీ అధికారులు అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసు కువెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యా యస్థానం ఆయా ఆస్తుల్ని ఈడీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా నౌహీరా షేక్ను ఆదేశించింది. అలా చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోపక్క ఈడీ అధికారులు హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆస్తులనూ నౌహీరా షేక్ విక్రయించినట్టు గుర్తించారు. వీటి రిజిస్ట్రేషన్కు సహకరించిన సబ్రిజిస్ట్రార్ల వ్యవహారం ఆరా తీస్తోంది. -
శుభాకాంక్షల మాటున సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షల సందేశాలు పంపుకోవడం అత్యంత సాధారణం. ఇటీవల వాట్సాప్లో ఇలాంటి సందేశాలు ట్రెండీగా మారాయి. తమ బంధువులు, స్నేహితులకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలన్న తొందరలో కొందరు సైబర్ భద్రతా మరుస్తున్నారు. పండుగ శుభాకాంక్షల పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపుతున్నట్టు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరి స్తున్నారు. దీపావళి ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లతోపాటు ఇప్పుడు శుభాకాంక్షలకు సంబంధించిన మోసపూ రిత లింక్లు పంపుతున్నట్టుగా వారు చెపుతున్నారు.ఏదైనా కంపెనీ తరఫున మీకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా పంపే ఈ లింక్లలో ‘మీ పేరు, ఫొటోతో మీకు తెలిసిన వారికి శుభాకాంక్షలు వినూత్నంగా చెప్పండి’అనే సందేశాన్ని జోడిస్తున్న ట్టు తెలిపారు. ఇలాంటి లింక్లపై క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లడంతోపాటు వారు మన ఫోన్లో మాల్వేర్ యాప్లు ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) సమాచా రం ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఈనెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 390 మంది బాధితులు ఈ తరహా నకిలీ లింక్లపై క్లిక్ చేయడం ద్వారా రూ.8.5 లక్షలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలియనివారి వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే సందేశాల్లోని లింకులపై క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఒక్క మద్యం షాపు.. 34 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఒక్కో వైన్షాపు కోసం సగటున 34 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2025–27 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని 2,620 వైన్ (ఏ4) షాపుల నిర్వహణ కోసం లైసెన్సులు మంజూరు చేసేందుకు తొలి విడత గడువు ముగిసే సమయానికి మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారికంగా వెల్లడించింది. తద్వారా దరఖాస్తు ఫీజు రూపంలో మొత్తం రూ.2,680 కోట్లు సమకూరింది. ఇది గత రెండేళ్ల కాలానికి దరఖాస్తు ఫీజు రూపంలో వచ్చిన దాని కంటే కొంచెం ఎక్కువ కావడం గమనార్హం.కాగా, ఈ దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ మరో మూడు రోజులు పెంచింది. ఈనెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈనెల 23న జరగాల్సిన డ్రాలు ఈనెల 27న తీస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే అత్యధికంగా శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 8 వేలకు పైగా వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్లో కేవలం 622 దరఖాస్తులు మాత్రమే రాగా, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,620 దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలివి..ఆదిలాబాద్ (711), ఆసిఫాబాద్ (622), మంచిర్యాల (1,617), నిర్మల్ (942), హైదరాబాద్ (2,960), సికింద్రాబాద్ (2,787), జగిత్యాల (1,834), కరీంనగర్ (2,635), పెద్దపల్లి (1,378), సిరిసిల్ల (1,324), ఖమ్మం (4,094), కొత్తగూడెం (3,799), గద్వాల (723), మహబూబ్నగర్ (2,360), నాగర్కర్నూల్ (1,424), వనపర్తి (676), మెదక్ (1,369), సంగారెడ్డి (4,190), సిద్దిపేట (2,642), నల్లగొండ (4,620), సూర్యాపేట (2,617), భువనగిరి (2,649), కామారెడ్డి (1,444), నిజామాబాద్ (2,633), మల్కాజ్గిరి (4,879), మేడ్చల్ (5,203), సరూర్నగర్ (7,595), శంషాబాద్ (8,110), వికారాబాద్ (1,750), జనగామ (1,588), భూపాలపల్లి (1,658), మహబూబాబాద్ (1,674), వరంగల్ రూరల్ (1,825), వరంగల్ అర్బన్ (3,012). -
వారు కోవర్టులు.. విప్లవ ప్రతిఘాతకులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచి్చంది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట ఈనెల 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి...సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి.నిజాలు దాచి .. నిందలు మోపుతూ..ఆపరేషన్ కగార్తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెప్టెంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు.బహిష్కరిస్తున్నాంసోను, అతని అనుచరులు ఆయుధాలు పార్టీకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్జెడ్సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది నుంచి వారు కాంటాక్ట్లో ఉన్నారు..గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్లను హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణభారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
సీఎంకు రైతుల తిప్పలు కనిపించవా?
చిన్నకోడూరు (సిద్దిపేట): సీఎం రేవంత్రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆయన ఆదివారం సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని మాచాపూర్లో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరి గిందని, మక్కలు మార్కె ట్లో పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే 30 శాతం వరకు రైతులు దళారులకు విక్రయించారన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్క జొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగు ఎట్లుందమ్మా: వ్యవసాయం ఎట్లుందమ్మా.. ఇబ్బందులు వస్తున్నా యా అంటూ హరీశ్రావు రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఏమున్న ది సారూ అన్నింటికీ ఇబ్బంది అవుతోందంటూ రైతులు బదులిచ్చారు. చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్లో పొలాల వద్ద సద్ది తింటున్న రైతులతో హరీశ్రావు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘యూరియా కోసం రోజుల తర బడి పడిగాపులు కాసినా ఒక్క బస్తా దొరక లేదు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ చేయలేదు. సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతోంది. మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్లే ఆసరా’ అని రైతులు చెప్పారు. రేవంత్ పాలన రైతులను నట్టేట ముంచిందని, రైతుల ఉసురు తప్పక తగులుతుందని హరీశ్ పేర్కొన్నారు. -
కమీషన్ల కోసం మంత్రుల కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండరాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. -
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి
చార్మినార్: రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాసేవ చేసేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయేరోజుల్లో తాము శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఆది వారం చార్మినార్ వద్ద రాజీవ్గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి..కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్కు రాజీవ్గాంధీ సద్భావన అవార్డును టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాజీవ్గాంధీ దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, ఓటుహక్కు వయసు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో ప్రజాసేవ చేస్తుండగా, రాజకీయాల్లో మాత్రం ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాహుల్గాంధీ భారత్ జూడోయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ప్రస్తుతం కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ కేవలం మన రాష్ట్రంలోనే అమలు జరుగుతోందని మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, జి.చిన్నారెడ్డి, మదన్మోహన్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం
కవాడిగూడ: యాదవులకు రాజకీయ రంగంలో సముచిత స్థానం కల్పిస్తామని...హైదరాబాద్ కా సదర్ ..యాదవుల ఖదర్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కులీకుతుబ్షాల కాలం నుంచి యాదవులపై నమ్మకం, విశ్వాసం ఉందని, యాదవులకు నమ్మిన వారికోసం ఏదైనా చేసే తెగువ ఉందని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో సదర్ వేడుకలను ఎంపీ అనిల్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ముందుగా, శ్రీకృష్ణ భగవానుడికి, దున్నపో తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లా డుతూ యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను యాదవ ప్రతినిధులు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యాదవుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఎంపీ అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాదవులకు సముచిత స్థా నం లభించిందన్నారు.సదర్ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పుడోలు.. కోలాటం.. బోనాలు, కళారూపాలు ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా జంటనగరాల నుంచి యాదవులు వారి దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో చేయి ంచిన విన్యాసాలు అలరించాయి. సీఎం రేవంత్రెడ్డి మాట్లా డుతుండగా పాత పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
ఏఐ వాణిజ్యం ఇంతింతై!
కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తులు.. 2025 మొదటి ఆరు నెలల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు, సర్వర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు.. ఇలా ఏఐలో అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. మనదేశం నుంచి ఏఐ సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నా.. ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.2024 మొదటి ఆరు నెలల్లో కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తుల వాణిజ్యం విలువ 1.61 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2025లో ఇదే సమయంలో 1.92 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 20 శాతం వృద్ధి అన్నమాట. మనదేశంలో 2023–24తో పోలిస్తే 2024–25లో ఏఐ సంబంధిత దిగుమతులు 13.1 శాతం పెరిగాయి. వీటి మొత్తం విలువ 66.8 బిలియన్ డాలర్లు.ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అత్యాధునిక కంప్యూటింగ్ హార్డ్వేర్ కోసం మనం ఇప్పటికీ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. మనదేశ మొత్తం దిగుమతుల్లో.. అమెరికా నుంచి వచ్చే 5 ఉత్పత్తులదే ఏకంగా 50 శాతం వాటా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశం నుంచి బోర్డులు, ప్యానెళ్లు వంటి వాటి ఎగుమతులు 2023–24తో పోలిస్తే అత్యధికంగా 58.5 శాతం పెరిగాయి.ప్రపంచ దేశాల్లో ఏఐకి సంబంధించి విధానపరమైన చర్యలు చేపట్టిన దేశాలు ఇప్పటికీ తక్కువే ఉన్నాయని డబ్ల్యూటీవో నివేదిక చెబుతోంది. అధిక ఆదాయ దేశాల్లో 68 శాతం దేశాలు ఈ చర్యలు చేపడితే.. ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో కేవలం 30 శాతమే ఈ జాబితాలో ఉన్నాయి. -
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీ రుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గోషామహల్లోని పోలీస్ స్టేడి యంలో అమరవీరుల స్తూపానికి మంగళవారం నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి సహా పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు డీజీ పీ శివధర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించా రు. ఈనెల 21నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపను న్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పో లీస్ కార్యాలయాలలో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పోలీస్ స్టేషన్ పరి«ధులలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31వ తేదీన జరగనున్న జాతీయ సమైక్యతా దినం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ కు చెందిన పోలీస్ సిబ్బంది ఐదుగురు సహా దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణా లను అర్పించారని తెలిపారు. ‘అక్టోబర్ 22 –24 మధ్య మర ణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను సందర్శించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు. అమరవీరుల విగ్రహాలకు, ఫొటోలకు వారి స్వగ్రామాలలో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు. -
అద్భుతం ..వీరి సాహసం..
కాచిగూడ: హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలిచే విధంగా నగరానికి చెందిన తల్లీ కొడుకులు హిమలయ పర్వతాల మధ్యలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. ఈ యాత్రలో తల్లీ కొడుకులిద్దరూ చూపిన పట్టుదల, దైర్య, సాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. జేపీ మెర్గాన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రవ్వ శరణ్య (39), బాచుపల్లిలోని కెన్నెడీ గ్లోబల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఆమె కుమారుడు మకం శ్రేయాన్షు (12) అక్టోబర్ 5, 2025న ఈ సహస యాత్రను ప్రారంభించారు.దాదాపు రెండు వారాల పాటు మంచు పర్వతాలపై కఠిన వాతావరణ పరిస్థితులు, తక్కువ ఆక్సిజన్తో కూడిన మార్గాలను అధిగమించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. శనివారం వారు సురక్షితంగా హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా శరణ్య తన అనుభవాన్ని పంచుకుంటూ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రత్యేక శిక్షణ.. శేయాన్షు తల్లిదండ్రులు గోవర్థన్–శరణ్య. యాత్రకు ముందు శ్రేయాన్షు ప్రత్యేక శారీరక దారుఢ్యంలోనూ, ట్రెక్కింగ్లోనూ శిక్షణ పొందాడు. పాఠశాల అధ్యాపకులతో పాటు పలువురు ప్రముఖులు, సహ విద్యార్థులు, తోటి సహచరులు తల్లీ కొడుకులిద్దరినీ అభినందించారు. ఇది కేవలం సాహసయాత్ర మాత్రమే కాదు, ‘ధైర్యం, పట్టుదల, కుటుంబ బంధం’ అనే విలువలకు ప్రతీకంగా నిలుస్తుంది. తల్లి, బిడ్డ కలిసి సాధించిన ఈ విజయం తెలంగాణకు గర్వకారణమని పలువురు కొనియాడారు. వయస్సు, వృత్తి, పరిస్థితులు కాదు.. మన సంకల్పమే పర్వతాలను అధిరోహించే శక్తినిస్తుందని చెబుతున్నారు యాత్రికులు.అంతసులభం కాదు.. చలిని తట్టుకోవడం అంత సులభం కాదు.. అదే విధంగా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకునే సమయంలో శ్వాస ఆడకపోవడం లాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎంతో దృఢ సంకల్పంతో, పట్టు వీడకుండా తొలి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ ఎక్కాలన్న లక్ష్యాన్ని చేరుకున్నాం.. ‘ఇది కేవలం శారీరక పరీక్ష మాత్రమే కాదు, మానసిక స్థైర్యం, పట్టుదల, ఈ యాత్రతో నా కుమారుడితో అద్భుతమైన బంధం ఏర్పడింది.’ ప్రతి అడుగు మా సంకల్పాన్ని మరింత దృఢం చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను నా కుమారుడితో కలిసి అధిరోహించడం మాకు జీవితాతంతం గుర్తుండిపోయే గొప్ప యాత్ర. –రవ్వ శరణ్య క్లిష్టమైన ప్రయాణం.. ఇది చాలా క్లిష్టమైన ప్రయాణం. అయినప్పటికీ ప్రతి రోజూ కొత్త పాఠాలు నేర్పింది. ధైర్యం, క్రమశిక్షణ, కష్టాన్ని తట్టుకునే శక్తి అవసరాన్ని ఈ యాత్రలో తెలుసుకున్నా. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నా కల. హైదరాబాద్లోనే అని చిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ పూర్తి చేసిన పిల్లల్లో నేను ఒకడిని. – శ్రేయాన్షు -
'వెలుగులు' పంచుదాం..
వెలుగులు విరజిమ్మే దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను పారదోలి సంతోషాలను పంచుతుంది. అయితే అలాంటి దీపావళికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. మన ఆనందం మరొకరికి బాధ కలిగించొద్దని, వ్యక్తిగత బాధ్యత, శ్రద్ధ, జాగ్రత్తలతో పాటు, పర్యావరణ స్పృహ, సామాజిక బాధ్యతను గుర్తించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టపాసులు కాల్చే క్రమంలో చుట్టుపక్కల వారికి హాని కలుగకుండా జాగురూకతతో మెలగాలి. భారీ శబ్దాలతో చిన్నపిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. పశువులు, పెంపుడు జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తెరగాలి. వీటితో పాటు టపాసుల నుంచి వచ్చే పొగ, స్పార్క్స్ వల్ల కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి సహజమైన, సంప్రదాయ వెలుగులతో పండుగను ఆస్వాదించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మన జీవితాల్లో వెలుగులు పంచే దీపావళి మరొకరి జీవితాల్లో చీకట్లు నింపకుండా జాగురూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగల్లోనూ అధునాత పోకడలు సంతరించుకుంటున్నాయి. ఈ దీపావళికి ముఖ్యంగా యువత పర్యావరణ సంరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలను గౌరవిస్తూ.. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పండుగ నియమావళి, సూచనలపై ముందస్తుగానే ప్రచారం చేశారు. పండుగ ఉత్సాహం, సంతోషం బాధ్యతతో కూడిన సమతుల్యాన్ని పాటించాలని నగర పోలీసు శాఖ, పర్యావరణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యత.. భారీ శబ్దాల వల్ల జంతువులు భయపడి జనాలపై దాడికి దిగే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం కాలి్చన టపాసుల కారణంగా అవి గాయపడే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించాలి. ముందుగా ఇళ్లలోని పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో పాటు వీధుల్లోని జంతువులకు హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలి. మన చుట్టూ ఉండే ప్రదేశాల పట్ల కూడా బాధ్యతతో మెలగాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనతో పాటు ఇతర పౌరులూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చే స్మోక్ క్రాకర్స్ దీర్ఘకాలం పాటు మనకు హాని కలిగిస్తాయని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్లను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి. ప్రజల్లో కొత్త చైతన్యం.. నగరంలోని పలు హౌసింగ్ సొసైటీలు, యువజన సంఘాలు ‘గ్రీన్ దీపావళి’ కార్యక్రమాలను చేపట్టాయి. క్రాకర్ ఫ్రీ జోన్లను ఏర్పరచి, పర్యావరణ స్నేహపూర్వక పండుగకు ఆయా కమ్యూనిటీలు ప్రోత్సహిస్తున్నాయి. కేవలం విద్యుత్ కాంతులు, లేదా సంప్రదాయంగా వస్తున్న నూనె దీపాలు, కొవ్వుతులను వినియోగించి పండుగను జరుపుకోవాలని, పిల్లల్లోనూ ఆ దిశగా చైతన్యం తీసుకురావాలని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనలు ఇవే.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు టపాసుల అమ్మకాలు, వినియోగానికి ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నాయి. అనుమతులు లేని చోట టపాసులు నిల్వ చేయడం, అమ్మకం చట్టరీత్యా నేరం. భారీ శబ్దాలు చేసే, అధికంగా పొగను విడుదల చేసే టపాసులకు పరిమితులు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత టపాసులు పేల్చకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అపార్ట్మెంట్లలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఇతరుల ప్రైవసీ, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అగ్నిమాపక సూచనలు..నగరంలోని అగ్నిమాపక శాఖ, వైద్యులు పౌరులకు పలు సూచనలు జారీ చేశారు. టపాసులు వాడేటప్పుడు పిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు, పొడవైన దుపట్టాలు ధరించడం ప్రమాదకరం. ఇళ్లల్లో దీపాల వద్ద కర్టెన్లు, పేపర్ అలంకరణల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, నీటి బకెట్, ఫైర్ కంట్రోలర్స్ వంటి భద్రతా సామగ్రి ఇళ్లల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదవ శాత్తూ గాయాలైతే తక్షణ వైద్య సహాయం పొందలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొగతో కళ్లకు ప్రమాదం.. క్రాకర్స్ కాల్చే సమయంలో వచ్చే ప్రమాదకరమైన పొగ వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ పొగ నేరుగా కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి వీలైనంత దూరంగా కాల్చాలి. కొన్ని రకాల క్రాకర్స్ నుంచి వెలువడే నిప్పు రవ్వలు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు క్రాకర్స్ నుంచి వెలువడే కాంతి కూడా కంటిలోని నల్లగుడ్డుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే అదే పనిగా ఆ వెలుగును చూడకుండా ఉంటే మంచిది.ఏవైనా జరిగి కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని నలపకుండా స్వచ్ఛమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కళ్లలో దురద వస్తే వైద్యుల సూచన మేరకు చుక్కల మందు స్వేస్తే సరిపోతుంది. కొందరు ఏడాది పిల్లలతో కూడా క్రాకర్స్ కాల్పిస్తుంటారు.. ఇది ప్రమాదకరమైన చర్యగా గుర్తించాలి. వీలైతే సన్గ్లాస్, సాధారణ కళ్ల జోడు పెట్టుకుంటే మంచిది. – పి.సత్యవాణి, ప్రొఫెసర్, సరోజినీదేవి నేత్రాలయం, మెహిదీపట్నం -
ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్టౌన్/తానూరు /వాంకిడి/భిక్కనూరు/మద్నూర్/పాల్వం చరూరల్/ అశ్వారావుపేట/పెనుబల్లి: రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు ల్లో మెరుపు దాడులు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ సమీకృత చెక్పోస్టు, నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడా చెక్పోస్టు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చెక్పోస్టుల్లో ఏసీబీ బృందాలు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తనిఖీలు చేపట్టాయి. భరోజ్ చెక్పోస్టులో లెక్కకు మించి ఉన్న రూ.1.26 లక్షలు, బెల్తరోడాలో రూ.3 వేలు, వాంకిడి చెక్పోస్టులో రూ.5,100 నగదు సీజ్ చేశారు. డబ్బాల్లో లంచాలుఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన డబ్బాల్లో డబ్బు వేసి వెళ్తున్నట్లు గుర్తించారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులో సోదాలు నిర్వహించి రికార్డుల్లో చూపని రూ.5 వేల నగదు, అక్కడే ఉన్న ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.46,300 నగదును గుర్తించారు. మొత్తం రూ.51,300ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడుల సమయంలో చెక్పోస్టులో ఏంవీఐ మహ్మద్ అప్రోజొద్దీన్ విధుల్లో ఉన్నారు. మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద జరిపిన దాడుల్లో రూ.36 వేల అక్రమ నగదు లభించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం చెక్పోస్టుతో పాటు అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. పాల్వంచ చెక్ పోస్టులో రూ.26 వేలు, ముత్తగూడెం చెక్పోస్టులో రూ.6,660 అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు భారీగా ఫిర్యాదులు రావటంతో ఏసీబీ చీఫ్ చారుసిన్హా ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని చెక్పోస్టుల్లో ఆకస్మిక సోదాలు చేశారు. నల్లగొండ జిల్లా విష్ణుపురం చెక్పోస్ట్, కోదాడ, సలాబత్పూర్, పెందుర్తి, జహీరాబాద్ చెక్పోస్టుల్లో కూడా సోదాలు నిర్వహించారు. చెక్ పోస్టుల వద్ద వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా లెక్కల్లో లేని రూ.4.18 లక్షల నగదు సీజ్ చేశారు. దీనిపై సంబంధిత ఆర్టీఏ అధికారులకు నోటీసులు ఇచ్చారు. -
రైతును రాజును చేద్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతుకు అన్యాయం చేస్తే సొంత కుటుంబానికి అన్యాయం చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసి భూమి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగానికి అండగా నిలబడాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా, జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమురం భీమ్ పోరాడినా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్ర జెండా ఎగిరినా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగాయి. కన్నతల్లిపై ఎంత మమకారం ఉంటుందో, తెలంగాణలో భూమిపై కూడా అదే అనుబంధాన్ని చూపిస్తారు. భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలైనా, నిరుపేద నిరక్షరాస్యులైనా నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. విసునూరు దొరలు చెరబట్టాలనుకున్న ఎకరం భూమి కోసం వీరనారిగా మారిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. భూ యజమానుల హక్కులు, ఆ భూముల సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేయర్ల చేతుల్లో ప్రభుత్వం పెట్టబోతోంది. ఈ క్రమంలో తప్పులకు తావిస్తే ప్రజలు సర్వేయర్లతోపాటు ప్రభుత్వంపై కూడా తిరగబడే అవకాశం ఉంది’అని తెలిపారు. బంగాళాఖాతంలో విసిరేశారు గత ప్రభుత్వ హయాంలో ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఈ ధరణి దరిద్రంతోనే ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది కూడా ఈ చట్టమే. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు. ఆ భూ దోపిడీ నుంచి విముక్తి కోసమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమి తెలంగాణ రైతాంగం దగ్గర ఉంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు, రైతుకు అండగా ఉండేందుకే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చాం’అని సీఎం తెలిపారు. త్వరలోనే గ్రూప్–3, 4 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11 వేల మందికి నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు. మా సైన్యం మీరే.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, ఆదర్శ రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలబట్టేందుకు తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్ను తీసుకొస్తోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలో అందరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేస్తుందని, సమస్యలను తెలిసిన వారిని పరిష్కారం అడగడం ద్వారా నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఆ లక్ష్యం నెరవేరడంలో మీ సహకారం కావాలి. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలి. రైతు రాజు కావాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. మీ శ్రమకు ఫీజు తీసుకోండి. కానీ రైతులకు అన్యాయం చేయొద్దు. క్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను తీసుకుని మీరు వెళుతున్నారు. మాకెవరూ ప్రతినిధులు లేరు. మాకు సైన్యం లేదు. మీరే మా ప్రతినిధులు, మా సైనికులు మీరే. ప్రభుత్వ ఆలోచనలు, బాధ్యతలను మీ భుజస్కందాలపై పెట్టి పంపుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే’అని సర్వేయర్లకు సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి, ప్రజలు మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి లైసెన్స్డ్ సర్వేయర్ల రూపంలో ప్రభుత్వం దీపావళి కానుక అందించిందని చెప్పారు. 3,456 మందికి సర్వే లైసెన్స్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్, టి. రామ్మోహన్రెడ్డి, కె.ఆర్. నాగరాజు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, టీజీఐఐసీ చైర్మన్ టి.నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారా త్రోబాల్ ప్లేయర్కు రామన్న భరోసా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ నుంచి శ్రీలంకలో పారా త్రోబాల్ ఆడడానికి అర్హత సాధించారు.పేద కుటుంబానికి చెందిన అర్చనకు చిన్నతనం నుంచే క్రీడలంటే ఆసక్తి. అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తనకు ఇష్టమైన ఆటలో గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం సోషల్ మీడియా ద్వారా తెల్సుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తనకు భరోసా ఇచ్చి క్రీడా పరికరాలు, ఆర్ధిక సహాయం చేసి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారని అంటున్నారు పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ‘రామన్న అంటేనే ఒక భరోసా.. సామాన్యులకు కొండంత అండ’ అని బీఆర్ఎస్ పేర్కొంది. రామన్న భరోసా ❤️అన్నా అంటే చాలు.. నేనున్నానంటూ భుజం తట్టి ప్రోత్సాహిస్తాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ… https://t.co/Vjzaimft7r pic.twitter.com/mrI21wBFNe— BRS Party (@BRSparty) October 19, 2025 -
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ దొరికాడు
సాక్షి.హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య కేసు నిందితుడు దొరికినట్లు నిజామాబాద్ సీపీ చైతన్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. అందులో..‘నిజామాబాద్ టౌన్ 6 పోలిస్స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఆసిఫ్,రియాజ్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రియాజ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు’ పేర్కొన్నారు. -
కాంగ్రెస్పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ అక్కడే కొట్టబోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. -
ఆ కుట్రలను తిప్పి కొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్కు అందించిన నిర్వాహకులను అభినందిస్తున్నా. దేశంలో గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయ పదం. గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చింది. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇందిర వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.‘‘గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదు. మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోంది. సల్మాన్ ఖుర్షీద్కు రాజీవ్ సద్భావన అవార్డ్ అందించడం మనందరికీ గర్వకారణం. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారు...రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 21 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి?. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలి’’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఇద్దరూ విప్లవ ద్రోహులే.. శిక్ష తప్పదు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ(Maoists Central Committee) తాజాగా లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులు ఎదుట లొంగిపోయిన వారికి ప్రజలకే బుద్ధి చెబుతున్నారని హెచ్చరించడం సంచలనంగా మారింది.ఇటీవల మావోయిస్టుల(Maoists) కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venu gopal), ఆశన్నలు(Ashanna) పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. తాజాగా అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. విప్లవ ద్రోహులుగా మారి శత్రవులు ఎదుట లొంగిపోయిన ఇద్దరికి తగిన శిక్ష ప్రజలే విధిస్తారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే, 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం.. పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే. ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడు అని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. -
మావోయిస్టులకు మద్దతిస్తారా?.. బండి సంజయ్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలను హెచ్చరించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు.. అంతర్గత భద్రత విషయంలో రాలే లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా.. ఇదే మా హెచ్చరిక. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుంది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు. అవినీతి, మాఫియా, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్ను సైతం వెలికి తీస్తున్నాయి.దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు. కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయి. ఎంత పెద్ద వారైనా సరే అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదు. మావోయిస్టుల వైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే సమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లినట్లు ఆయన అనుచరుడు పోలీసులకు తెలిపినట్లు వచ్చిన వార్త కథనాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ పోస్టు చేయడం సంచలనంగా మారింది.Telangana politicians - consider this a warning.Those allegedly supporting armed networks while preaching democracy on stage, cut your links or get exposed.Central agencies won’t stop at Maoist cadres. Under the guidance of Hon’ble PM Shri @narendramodi ji and Hon’ble HM Shri… pic.twitter.com/ucicID1msj— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 19, 2025ఇదిలా ఉండగా.. మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అసలు మావోయిస్టులతో సంబంధాలున్న నాయకులు ఎవరా? అని చర్చ మొదలైంది. ఒకవేళ ఈ పేర్లు బహిర్గతమైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. మావోయిస్టు గెరిల్లాలు ,కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య రహస్య కుమ్మక్కు జరిగిందని ఆయన వివరించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అలాగే హిడ్మా తెలంగాణ వైపు వచ్చారని ఆయన సన్నిహితులు పోలీసులకు వెల్లడించినట్లు మరో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి. -
Hyderabad: బాలుడి దగ్గర బుల్లెట్.. మెట్రో స్టేషన్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం రేపింది. మూసాపేట్ మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడు వద్ద బుల్లెట్ లభించింది. దీంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్ను స్వాధీనం చేసున్న కూకట్పల్లి పోలీసులు.. బాలుడిని విచారిస్తున్నారు.నిన్న రాత్రి(అక్టోబర్ 18, శనివారం) మెట్రోలో ప్రయాణించేందుకు బాలుడు మూసాపేటలోని స్టేషన్కు రాగా.. మెట్రో భద్రతా సిబ్బంది ఆ బాలుడిని తనిఖీ చేశారు. ఆ బాలుడి వద్ద ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ సౌండ్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాలుడి వద్ద 9 ఎంఎం బుల్లెట్ను గుర్తించారు. బుల్లెట్ ఎలా వచ్చిందంటూ ఆ బాలుడిని మెట్రో సిబ్బంది ప్రశ్నించారు.సరైన సమాధానం చెప్పకపోవడంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.. ఆ బుల్లెట్పై ఆరా తీశారు. పలు కోణాల్లో ఆ బాలుడిని విచారిస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
బీసీ బంద్లో దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బంద్ విజయవంతమైంది. బీసీ బంద్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక, బంద్ సందర్భంగా దాడులకు పాల్పడుతూ ఓవరాక్షన్ చేసిన ఎనిమిది మందిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పలు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు.తెలంగాణవ్యాప్తంగా బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో షాపులపై దాడులు చేసిన వారిపై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బంద్ సందర్బంగా విద్యానగర్ నుంచి బర్కత్పురా వరకు బీసీ జేఏసీ నేతలు ర్యాలీగా వచ్చారు. అనంతరం, పలువురు కార్యకర్తలు, నేతలు.. పలు షాపులు, షోరూమ్స్, పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. దీంతో, దాడులపై నల్లకుంట, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దాడులకు పాల్పడిన ఎనిమిది మంది బీసీ జేఏసీ ప్రతినిధులను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..
దుష్ట ప్రవృత్తి గల నరకాసురుడిపై సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేసే ఎందరో నరకాసురులకు సత్యభామలుగా మారిన పోలీసు ఆ‘షీ’సర్లు చెక్ చెప్తున్నారు. నేడు నరక చతుర్దశి సందర్భంగా మహిళా పోలీస్ అధికారుల ప్రాధాన్యం గురించి... హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్పీఏ) తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో 36 శాతం మహిళలే. ఎన్పీఏ చరిత్రలో ఇదో రికార్డు. దీనికిముందే ఇలాంటి అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది. సెప్టెంబర్లో చోటు చేసుకున్న ఐపీఎస్ అధికారుల బదిలీతో రాష్ట్ర పోలీసు విభాగంలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మకుటాలను 33.3 శాతం మహిళలే ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1979 వరకు మహిళా ఐపీఎస్లే లేరు. ఆ ఏడాది ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న హైదరాబాదీ యువతి అరుణ బహుగుణ చిత్తూరు జిల్లా మదనపల్లె అదనపు ఎస్పీగా పోస్టింగ్ పొందారు. ఇది అప్పట్లో సంచలనం. ఆపై కాలక్రమంలో మహిళ ఐపీఎస్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ 2014 వరకు వీరికి సముచిత పోస్టింగ్స్ ఉండేవి కాదు. అత్యవసర సందర్భాల్లో అక్కరకు రావడానికి కమిషనరేట్కు ఒక మహిళ ఐపీఎస్కు పోస్టింగ్ ఇచ్చేవాళ్లు. మిగిలిన అధికారుల్ని అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించే వారు. రానురాను ఆ సీన్ పూర్తిగా మారిపోతూ వచ్చింది. పోలీసు విభాగంలో మహిళ ఐపీఎస్ అధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పోస్టింగ్స్ ఇవ్వడం అనివార్యంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహిళ భద్రత విభాగం, షీ–టీమ్స్ ఏర్పాటైన తర్వాత వీటిలో అనివార్యంగా మహిళ ఐపీఎస్లకే పోస్టింగ్ ఇస్తూ వచ్చారు. కమిషనరేట్లలో డీసీపీ పోస్టులతో పాటు కొన్ని జిల్లాలకు మహిళల్ని ఎస్పీలుగా నియమించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న మూడో వంతు హెచ్ఓడీ పోస్టులతో పాటు హైదరాబాద్, రాచకొండల్లోని డీసీపీ పోస్టుల్లో అత్యధికంగా మహిళా ఐపీఎస్లే ఉన్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడెమీకి అభిలాష్ బిస్త్, నేరగాళ్లలో మార్పునకు కృషి చేసే జైళ్లశాఖకు సౌమ్య మిశ్ర, రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చారు సిన్హా, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన బి.సుమతి, హోంగార్డ్స్ వింగ్కు స్వాతి లక్రా నేతృత్వం వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఈ ప్రకారం చూస్తే 15 హెచ్ఓడీ పోస్టుల్లో ఏడింటికి ఐదుగురు మహిళ ఐపీఎస్లు నేతృత్వం వహిస్తున్నట్లు లెక్క. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు శిఖా గోయల్ చీఫ్గా, అవినీతి నిరోధక శాఖకు చారు సిన్హా ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు ఉన్నత స్థాయిలో కూడా ఉండేవారు కారు. అయితే కాలక్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో హఠాత్తుగా తలెత్తే పరిణామాలతోపాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది. కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళ ఉన్నతాధికారి ఉండాలని ప్రభుత్వమూ భావించినప్పటికీ చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్జోన్కు మాత్రమే మహిళ అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసువింగ్లో మహిళ ఉన్నతాధికారి ΄ోస్టు ఇదొక్కటే అనే భావన కొనసాగింది.ప్రస్తుతం పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ కమిషనరేట్లో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్కు ఒక్కో డీసీపీ నేతృత్వం వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏడు జోన్లలో మూడింటికి మహిళ ఐపీఎస్లే డీసీపీలుగా ఉన్నారు. మధ్య మండలానికి శిల్పవల్లి, ఉత్తర మండలానికి సాధన రష్మీ పెరుమాళ్, దక్షిణ మండలానికి స్నేహ మెహ్రా డీసీపీలుగా ఉన్నారు. వీరికి తోడు పరిమళ నూతన్, పరిపాలన విభాగం సంయుక్త సీపీగా, రక్షితమూర్తి, సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా, అపూర్వ రావు– స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా, ఎన్ .శ్వేత డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ గా, డి.కవిత,సైబర్ క్రైమ్ విభాగం డీసీపీగా, లావణ్య జాదవ్– ఉమెన్ సేఫ్టీ డీసీపీగా పని చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్లోని అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్కు డీసీపీగా రితిరాజ్ వ్యవహరిస్తున్నారు. ఇక రాచకొండలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. వీటిలో మల్కాజ్గిరి, ఎల్బీనగర్, మహేశ్వరానికి పద్మజ రెడ్డి, అనురాధ, సునీత రెడ్డి డీసీపీలుగా ఉన్నారు. వీరిలో సునీత రెడ్డి మాత్రమే నాన్ ఐపీఎస్ అధికారి. ఈ జోనల్ డీసీపీలతోపాటు మహిళ భద్రత విభాగం, సైబర్ క్రైమ్ వింగ్స్లను ఆ‘షీ’సర్స్ నేతృత్వం వహిస్తున్నారు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 19-26)
-
ఎన్నికల వేళ ఆయుధాల డిపాజిట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి పొందిన ఆయుధాలను లైసెన్స్దారులు తమ సమీప ఠాణాల్లో అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వెపన్ లైసెన్స్ హోల్డర్లు తమ ఆయుధాలను పోలీస్స్టేషన్లో అప్పగించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వెపన్ లైసెన్స్దారులకు గత రెండు నెలల నుంచే ఆయా పోలీస్స్టేషన్ల అధికారులు సమాచారం ఇచ్చారు. వాటిని ఠాణాల్లో గానీ, గుర్తింపు పొందిన సంబంధిత ఆయుధ విక్రయ కేంద్రాల్లో గానీ డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. శాంతి భద్రతలు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఎన్నికల సమయంలో తుపాకులను డిపాజిట్ చేయాలనే నిబంధనే ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీని పరిధి కిందికి వచ్చే పోలీస్ స్టేషన్లలో లైసెన్స్దారులు గత కొద్ది రోజుల నుంచి వాటిని అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి కిందికి పంజగుట్ట, మధురానగర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, గోల్కొండ, సనత్నగర్ తదితర పోలీస్స్టేషన్లు వస్తాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ఎనిమిది ఠాణాల పరిధిలో 234 లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్డ్ తుపాకులు తెప్పించుకుని పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రియల్టర్లు ఈ ఆయుధాలను కలిగి ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తుపాకులు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఎన్నికలు అయ్యే వరకు పోలీసులు వాటిని డిపాజిట్ చేసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆఫ్ ఆర్మ్స్ లైసెన్స్ వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతిఒక్కరికీ ఐడీ నెంబర్ కేటాయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 234 మంది లైసెన్స్దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి తుపాకులను డిపాజిట్ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 80 శాతం ఆయుధాలు డిపాజిట్ చేయడం జరిగింది.క్రిమినల్ కేసులు నమోదైతే లైసెన్స్ రద్దు.. ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదైతే వారికి ఆయుధ లైసెన్స్ను రద్దు చేయనున్నారు. అంతేకాకుండా ఆయుధాన్ని అనవసరంగా ఉపయోగించినా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అనుమతి పొందిన ప్రాంతం కంటే ఇతర ప్రాంతాల్లో ఆయుధం సంచరించినా లైసెన్స్ను రద్దు చేస్తారు. -
ప్రయాణికుల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ వాహనాలు బీసీ బంద్ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. దీపావళి వేడుకలు, వరుస సెలువుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన నగరవాసుల పైన దారిదోపిడీకి పాల్పడ్డాయి. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన రెట్టింపు వసూలు చేశాయి. బంద్ సందర్భంగా సిటీబస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం నిలిచిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి. మహాత్మాగాం«దీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అప్పటికే బస్స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులు ఏదో ఒకవిధంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో క్యాబ్లు, టాటాఏస్లు, మ్యాక్సీక్యాబ్లు, తదితర వాహనదారులు అడ్డగోలుగా దోచుకున్నాయి. గత్యంతరం లేకపోవడంతో ఎక్కువ చార్జీలను చెల్లించి వెళ్లాల్సి వచి్చంది. బీసీ బంద్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులు స్తంభించాయి. మరోవైపు నగరంలోని 25 డిపోల్లో మరో 2850 కి పైగా సిటీ బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. వీకెండ్ కావడంతో వివిధ అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటికి వచ్చిన జనాన్ని ఆటోవాలాలు దోచుకున్నారు.సెవెన్ సీటర్ ఆటోలు, శేర్ ఆటోల్లో సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు... ఓలా, ఉబెర్, ర్యాపిడీ వంటి సంస్థలతో అనుసంధానమయ్యే క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను బంద్ దృష్ట్యా జిల్లాలకు మళ్లించారు. మరోవైపు పలు ఐటీ సంస్థలకు వాహనాలను నడిపే ట్రావెల్ ఏజెంట్లు సైతం దీపావళి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు రోడ్డెక్కాయి. ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఆరాంఘర్, బీఎన్రెడ్డినగర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ క్యాబ్లు బారులు తీరాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హన్మకొండ వరకు ఆర్టీసీ లగ్జరీ బస్సుల్లో రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ రూట్లో రాకపోకలు సాగించే క్యాబ్లు సైతం ఈ చార్జీలను వసూలు చేస్తాయి. కానీ బంద్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్వాలాలు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేయడం గమనార్హం. ఎల్బీనగర్ నుంచి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట్, నల్లగొండ, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సైతం ఇదేవిధంగా క్యాబ్వాలాల దారిదోపిడీకి గురయ్యారు. మెట్రోలు ఫుల్... బీసీబంద్ దృష్ట్యా మెట్రో రైళ్లు కిక్కిరిశాయి. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–ఎంజీబీఎస్ రూట్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయించారు. మరోవైపు ఆటోరిక్షాలకు సైతం డిమాండ్ పెరిగింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటోల్లోనూ చార్జీలు అమాంతంగా పెరిగాయి.బంద్ కారణంగా ఆసుపత్రులకు వెళ్లే వారు, అత్యవసర పనులపైన బయటకు వెళ్లిన వాళ్లు పెద్ద మొత్తంలోసమరి్పంచుకోవాల్సి వచి్చంది. బంద్లో పలువురు నేతలుబీసీలకు 42 శాతం రిజర్వేషన్కు మద్దతుగా అన్ని పారీ్టలు, ప్రజాసంఘాలు, బీసీ సంఘాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రజారవాణా స్తంభించినప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. సీపీఎం, సీపీఐ, సీసీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, తదితర వామపక్ష పారీ్టలు, ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, తదితరులు నారాయణగూడ వైఎంసీఏ నుంచి కాచిగూడ చౌరస్తా, కోఠీ , సుల్తాన్ బజార్, రామకోఠీ, బొగ్గులకుంట మీదుగా అబిడ్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ , సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సీపీఐఎల్ ఎల్ మాస్ లైన్ హన్మే‹Ù, గదేగోని రవి, తదితరులు పాల్గొన్నారు. -
పరువు హత్య.. కోడలి ప్రాణం తీసిన మామ
సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తలాండి శ్రావణి (22), శివార్ల శేఖర్ ప్రేమించుకుని గతేడాది కులాంతర వివాహం చేసుకున్నారు. శేఖర్ తండ్రి సత్తయ్య అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. భార్య శ్రావణి ఉరఫ్ రాణితో కలిసి శేఖర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. శనివారం శేఖర్ తన అత్తామామలు చెన్నయ్య, అనూషతో కలిసి వంట చెరుకు తీసుకురావడానికి గ్రామ సమీపంలోని అడవికి వెళ్లాడు. గర్భిణి అయిన శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉంది. సత్తయ్య గొడ్డలితో ఇంట్లోకి చొరబడి శ్రావణిపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో బయటకు పరుగులు తీసినా వెంబడించి దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
మూలవిరాట్టును వీడియో తీయడమా?
సాక్షి, హైదరాబాద్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి మూలవిరాట్టు దర్శనం విషయంలో అధికారులు చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నందున పనులు పూర్తయ్యే వరకు ప్రధాన ఆలయంలో దర్శనాలను నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అప్పటి వరకు సమీపంలోని భీమేశ్వరాలయంలోని మూర్తినే సాధారణ భక్తులు దర్శించుకుని పూజాధికాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై కొందరు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న దర్శన భాగ్యాన్ని కల్పించకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన దేవాలయ మూలవిరాట్టు దర్శనాన్ని ఎల్ఈడీ తెరల ద్వారా కల్పించాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ ఇటీవల ప్రకటించింది.ఇప్పుడు ఈ విషయంపై అర్చకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారత్లోని ప్రధాన దేవాలయాల్లో స్వామి, అమ్మవారి మూలవిరాట్టు చుట్టూ విద్యుత్తు కాంతులు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం నూనె దీపం వెలుగులోనే దేవుళ్ల దర్శనాలుంటాయి. మూల విరాట్టు వీడియోలు, ఫొటోలు తీయడం కూడా నిషేధం. ఎల్ఈడీ తెరలపై స్వామి వారి దర్శనం కల్పించాలంటే కచ్చితంగా వీడియో తీయాలి. స్వామివారి మూలవిరాట్టుపై విద్యుత్తు కాంతి ప్రసరించడం, వీడియో తీయడం... ఇలా రెండు అపచారాలకు కారణమవుతుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటోలు, వీడియో తీయరాదని హెచ్చరిక బోర్డులు పెట్టే దేవాదాయశాఖనే దానిని ఎలా ఉల్లంఘిస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీంతో దేవాదాయ శాఖ అయోమయానికి గురవుతోంది. శృంగేరీ స్వామి సూచనల మేరకు... శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ విదుశేఖర భారతి స్వామి ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఆయన ఆదివారం రాత్రి వేములవాడకు చేరుకోనున్నారు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు తీసుకుని ఆ మేరకే చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించవని భావిస్తున్నారు. దేవాలయాల్లో దర్శనాలు, వైదిక కార్యక్రమాలన్నీ శాస్త్రబద్ధంగానే కొనసాగాల్సి ఉంటుందని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష కుమారశాస్త్రి పేర్కొన్నారు. -
మీ ఆలోచనలే.. దుష్ట చతుష్టయం
అసమాన నాయకత్వ ప్రతిభ కనబరిచే టీమ్ లీడర్లు బయటి నుంచి ఎదురయ్యే సవాళ్ల వల్ల కాకుండా.. తమ అపరిమితమైన ఆత్మవిశ్వాసం వల్ల విఫలమవుతుంటారని ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ (హెచ్.బీ.ఆర్.) తాజా సంచికలోని ఒక వ్యాసం విశ్లేషించింది. ఇందులో ముఖ్యంగా కొన్ని లక్షణాలు.. ఇటు నాయకులు / లీడర్లు / బాస్లకే కాదు.. ఇంటిని నడిపే ఇంటి యజమానులకూ వర్తిస్తాయి అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.‘ఇనుమును ఏదీ నాశనం చేయలేదు.. దాని తుప్పు తప్ప. అలాగే ఒక మనిషి పురోగతిని ఆపేసేది తన మనస్తత్వమే తప్ప బయటి వ్యక్తులో, అంశాలో కాదు’– రతన్ టాటాప్రతి పనిలో నేనుండాలితమ ముద్ర కనిపించాలి అనే తాపత్రయంతో ప్రతి పనిలో ‘నేనుండాలి’ అని అనుకుంటారు చాలామంది.దుష్ఫలితం: అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. టీమ్లో చొరవ లోపిస్తుంది. ‘అన్నీ ఆయన చూసుకుంటాడులే’ అనే ధోరణి కిందివారిలో పెరిగిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. పిల్లలు పెద్దయ్యాక కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్లను స్వతంత్రంగా పనిచేయనివ్వరు.ఇలా మార్చుకొని చూడండి: ‘నేను ఏదైనా చేయగలను. కానీ ప్రతి పనీ నేనే చేయాల్సిన అవసరం లేదు’ అనే ధోరణి మంచిది. అప్పుడు అందరికీ పనిచేసే అవకాశం వస్తుంది. వినూత్నంగా ఆలోచిస్తారు. నాయకుడు అంటే నడిపించాలి కానీ ప్రతి స్థాయిలో ప్రతి పనీ తానే చేయాల్సిన అవసరం లేదు.సంస్థల్లోని నాయకులు లేదా ఇంటికి యజమానిలో అజ్ఞాతంగా ఉండే ఆధిపత్య భావనలు వారి పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసి, వారి అభివృద్ధికి ఆటంకంగా మారతాయి. మొదట బలాలుగా కనిపించిన ఈ భావనలు క్రమేణా బలహీనతలుగా మారతాయి. బాహ్య అడ్డంకుల్లా ఇవి పైకి కనిపించవు. ఎవరికి వారు వీటిని గుర్తించి, సానుకూలంగా మలుచుకుంటే వైఫల్యాలను నివారించవచ్చు. ఎందుకంటే.. నిజమైన నాయకత్వ పురోగతి అంతర్గతంగా ప్రారంభమవుతుంది. ఏమిటీ భావనలు.. వీటి దుష్ఫలితాలేంటి.. వీటిని ఎలా అధిగమించాలి?వెంటనే పని పూర్తి చేసేయాలిప్రాధాన్యతలతో సంబంధం లేకుండా.. ప్రతి పనినీ తక్షణమే పూర్తి చేయాలి, వెంటనే ఫలితాలు కనిపించాలి అనే ధోరణితో చాలామంది ఉంటారు.దుష్ఫలితం: పిల్లలకు అన్ని అంశాల్లోనూ ఇలాగే చెప్పడం వల్ల వారికి ప్రాధాన్యతలు తెలియవు. బృందం విషయానికొస్తే.. ప్రతి పనిలోనూ ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి ఏర్పడి తప్పులు జరగొచ్చు.ఇలా మార్చుకొని చూడండి: ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి’ అన్నట్టు అవసరమైన పనిపై ముందు దృష్టి పెడతాను అనుకోవాలి. ప్రాధాన్యతలు గుర్తించడమే సగం విజయం. పిల్లలు కూడా రోజువారీ చేసే పనుల్లో ఎక్కువ ఫలితం ఇచ్చే పనికి అధిక ప్రాధాన్యత.. తక్కువ ఫలితం ఇచ్చే దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటారు. దానికి తగ్గట్టుగా సమయం, ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారు.నేను తప్పులు చెయ్యకూడదుపనిలో కచ్చితత్వం కోసం తపన పడుతూ ఇలా ఆలోచిస్తుంటారు. దుష్ఫలితం: వినూత్న విధానాలను ప్రయత్నించే ధైర్యం చేయలేకపోవడం, అతి జాగ్రత్త, ఎప్పుడూ ఫలితంపైనే అధిక శ్రద్ధ.ఇలా మార్చుకొని చూడండి: ‘తప్పులు జరగకుండా చూడటం కాదు, సరిగ్గా పని జరిగేటట్లు చూడాలి’ అనే ధోరణి ఏర్పరచుకోవాలి. ఇది కింది వాళ్లను మూస ధోరణిలో కాకుండా కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితంపై శ్రద్ధ కాకుండా.. పనిని సరిగ్గా చేయడం అలవాటవుతుంది.అందరూ నాలాగే పని చెయ్యాలిఇంట్లో లేదా ఆఫీసులో అందరూ తమలాగే ఆలోచించాలని, పనిచేయాలని.. ఆలోచిస్తారు, ఆశిస్తారు.దుష్ఫలితం: వ్యక్తిగత సామర్థ్యాలలోని వ్యత్యాసాలు గుర్తించరు. ఎవరి సామర్థ్యానికి, పనిచేసే ఒడుపునకు తగ్గట్టు వారిని స్వేచ్ఛగా పనిచేయనివ్వరు. ముఖ్యంగా పిల్లల విషయంలో వారి వయసును కూడా ఒక్కోసారి మర్చిపోయి వారిపై ఒత్తిడి పెంచుతుంటారు.ఇలా మార్చుకొని చూడండి: ‘నాలా అందరూ ఆలోచించలేకపోవచ్చు, పనిచేయలేకపోవచ్చు’ అనే వాస్తవాన్ని గుర్తించండి. వారి వారి సామర్థ్యాలు, తెలివితేటలకు అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పించండి. ముఖ్యంగా ఇది పిల్లల మానసిక వికాసానికి దోహదపడుతుంది. -
‘సాక్షి’పై పథకం ప్రకారమే కుట్ర..
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రికపై పథకం ప్రకారమే ఏపీలోని కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. ఆయన శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఇలాంటి కుట్ర లు ఈ ఒక్కసారే కాదు.. ప్రతిసారీ ఏదో విధంగా వేధిస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్నారు.అందుకు ఉదాహరణ ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసులు పెట్టడమే’ అని పేర్కొన్నారు. దీన్ని తాము సీరియస్గా పరిగణిస్తున్నామని, ఏదో సాకుతో కేసులు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇ లాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. ‘సాక్షి’కి, జర్నలిస్టులకు బాసటగా నిలబడతామని అంటూ, రాజ్యాంగంపై చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం, విశ్వాసం ఉన్నా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ఏపీ కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తోందని సాక్షి పత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సరైంది కాదని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటనలో ఖండించారు. తక్షణమే కేసులను ఉపసంహరించుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా కు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం సరికాదన్నారు. వార్తలు, కథనాలు, ప్రసారాలపై అభ్యంతరాలుంటే ప్రెస్కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా ‘సాక్షి’పై పదేపదే కేసులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. ఎడిటర్కు నోటీసులు.. మీడియా స్వేచ్ఛను హరించడమే.. ప్రచురితం చేసిన వార్తా కథనాలకు సంబంధించి ఆధారాలు వెల్లడించాలంటూ ఎడిటర్పై పోలీసులు ఒత్తిడి చేయడం, నోటీసులు జారీచేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్ 143) ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతిసాగర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎడిటర్ ధనంజయరెడ్డికి పలుమార్లు నోటీసులు జారీ చేయడం, ప్రచురితమైన వార్తలకు సంబంధించి సోర్స్ను బహిర్గతపరచాలని హుకుం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి చర్యల్ని జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. -
మన భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూగర్భ జలాల్లో పరిమితులకి మించి ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్తోపాటు ఇతర రసాయన మూలకాలున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల పరిశీ లన కోసం బావుల నుంచి 2024లో వానాకాలానికి ముందు 412, వర్షాల తర్వా త 375 నీటి నమూనాలను సేకరించి హైదరాబాద్లోని రీజనల్ కెమికల్ ల్యాబొరేటరీలో పరీక్షించి ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది. చాలా జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మనుషుల ఆరోగ్యానికి హానికరమైన మూలకాలు న్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. రాష్ట్రంలోని భూగర్భ జలాలు ప్రధానంగా క్యాల్షియం బైకార్బొనేట్ రసాయన పదార్థాన్ని అధిక మోతాదులో ఉన్నట్టు తేలింది. అధిక మోతాదులో క్యాల్షియం తీసుకుంటే మూత్రపిండాలు, మూత్రా శయంలో రాళ్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని కేంద్రం తెలిపింది. 19% జలాల్లో మోతాదుకి మించి ఫ్లోరైడ్బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల ప్రకారం లీటర్ నీళ్లలో మిల్లిగ్రామ్ కంటే తక్కువగా ఫ్లోరైడ్ ఉంటేనే తాగడానికి అత్యంత సురక్షితమైన నీటిగా పరిగణిస్తారు. వర్షాలకి ముందు తీసిన 252 నమూనాలు (61.2శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 252 నమూనాలు(67.2శాతం) ఈ పరిమితికి లోబడే ఉన్నాయి. లీటర్ నీళ్లలో 1.01–1.5 మిల్లీగ్రామ్ ఫ్లోరైడ్ ఉంటే అనుమతించదగినదిగా భావిస్తారు. వర్షాకాలానికి ముందు తీసిన 79 నమూనాలు (19.2శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 50 నమూనాలు (13.3శాతం) ఈ మేరకు అనుమతించదగిన స్థాయిల్లో ఫ్లోరైడ్ను కలిగి ఉన్నట్టు తేలింది. వర్షాకాలానికి ముందు తీసిన 81 నమూనాలు(19.7శాతం), వర్షాకాలం తర్వాత తీసిన 73 నమూనాలు(19.5శాతం) అనుమతించదగిన స్థాయికి మించి ఫ్లోరైడ్ను కలిగి ఉన్నట్టు నిర్థారణ జరిగింది. తాగునీళ్లలో అధిక మోతాదులో ఫ్లోరైడ్ ఉంటే మనుషులను ఎముకుల గూళ్లుగా మార్చే ఫ్లోరోసిస్ అనే వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. దంతాల సమస్యలూ ఉత్పన్నమవుతాయి.ఫ్లోరైడ్ నల్లగొండలోనే అత్యధికం..నల్లగొండ జిల్లాలో వర్షాలకి ముందు తీసిన భూగర్భ జలాల నమూనాల్లో అత్యధికంగా లీటర్కి 5.84 మి.గ్రా. ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలోనే అత్యధిక పరిమాణంలో ఫ్లోరైడ్ కలిగి ఉన్న జిల్లా ఇదే. అయితే, వర్షాల తర్వాత 3.55 మి.గ్రా.కు తగ్గింది. ఇతర జిల్లాల్లో చూస్తే.. వర్షాలకి ముందు యాదాద్రి భువనగిరిలో 4.42, వర్షాల తర్వాత 2.69.. వరంగల్లో వర్షాలకి ముందు 2.48, వర్షాల తర్వాత 5.59, హన్మకొండలో వర్షాలకి ముందు 4.34, వర్షాల తర్వాత 2.34, ఆదిలాబాద్లో వర్షాలకి ముందు 3, వర్షాల తర్వాత 5.5 మి.గ్రా. ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. రాష్ట్రంలో పరిమితికి మించి ఫ్లోరైడ్ కలిగిన జిల్లాలు 2017లో 26 ఉండగా, 2024లో 24కి తగ్గాయి.గద్వాలలో అత్యధికంగా క్లోరైడ్బీఐఎస్ ప్రమాణాల ప్రకారం లీటర్కి 250 మిల్లీగ్రామ్ క్లోరైడ్ కలిగిన జలాలను సరక్షితమైనవిగా పరిగణిస్తారు. ప్రత్యామ్నాయ తాగునీటి సదుపాయం లేని ప్రాంతాల్లో లీటర్కి 1000 మి.గ్రా. వరకు ఫ్లోరైడ్ను అనుమతిస్తారు. క్లోరైడ్ పరిమాణం అంతకు మించితే నీళ్లు తాగడానికి పనికిరావు. వర్షాకాలానికి ముందు జరిపిన పరీక్షల్లో రాష్ట్రంలో జోగులాంబ గద్వాల జిల్లాలో లీటర్ భూగర్భజలాల్లో ఏకంగా 7657 మి.గ్రా. క్లోరైడ్ ఉన్నట్టు తేలింది. ఇతర జిల్లాల్లో పరిశీలిస్తే నల్లగొండలో 2947, భువనగిరిలో 884, సంగారెడ్డిలో 869, రంగారెడ్డిలో 794, మెదక్లో 716, ఖమ్మంలో 714, నాగర్కర్నూల్లో 554 మి.గ్రా. క్లోరైడ్ ఉన్నట్టు నిర్థారణ జరిగింది. గుండె, మూత్రపిండాలు, అజీర్ణం వంటి రోగాలతో బాధపడే వారికి మోతాదుకి మించిన క్లోరైడ్ ప్రమాదకరం.జూపల్లిలో నైట్రేట్ తీవ్రత అధికం..బీఐఎస్ ప్రమాణాల ప్రకారం గరిష్టంగా లీటర్కి 45మి.గ్రా. నైట్రేట్ కలిగి ఉన్న జలాలనే తాగడానికి సురక్షితంగా పరిగణిస్తారు. అధిక మోతాదులో నైట్రేడ్ కలిగి ఉన్న తాగునీటితో నవజాత శిశువుల్లో మెథెమోగ్లోబినెమియా అనే రక్త రుగ్మత, పెద్దల్లో ఉదరకోశ క్యాన్సర్లతోపాటు కేంద్ర నాడి వ్యవస్థపై తీవ్ర దుష్రభావం చూపుతుంది. నాగర్కర్నూల్ జిల్లాలోని జూపల్లిలో అత్యధికంగా వర్షాలకి ముందు లీటర్కి 249.6 మి.గ్రా.లు, వర్షాల తర్వాత లీటర్కి 533.2 మి.గ్రా. నైట్రేట్ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో 34.7శాతం మోతాదుకి మించి నైట్రేట్ను కలిగి ఉన్నట్టు వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మినహా అన్ని జిల్లాల్లోని భూగర్భ జలాలు మోతాదుకి మించి నైట్రేట్ను కలిగి ఉన్నాయి. -
ఉద్యోగులే మా వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు పైశాచికానందంలో మునిగితేలుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. కలుషి తాహారం, రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనలు జరిగిన వెంటనే అక్కడ వాలిపోయి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఘటనలు జరగకుండా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. శనివారం శిల్పకలావేదికలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అథితిగా హాజరై గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం కొత్తగా ఉద్యోగాలు పొందినవారిని ఉద్దేశించి మాట్లాడారు.నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలిఅమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం విమర్శించారు. ‘వాళ్ల (గత పాలకులు) కుటుంబంలో ఖాళీగా ఉన్నవారికి ఉద్యోగాలు (పదవులు) ఇచ్చారు. కరీంనగర్ ఎంపీగా ఓడిన వ్యక్తికి రెండు నెలల్లో, నిజామాబాద్ ఎంపీగా ఒడిన బిడ్డకు రోజుల వ్యవధిలోనే కొలువులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న వాళ్లను నిలువునా ముంచారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేశాం. ఏడాదిలోపే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్స్ ఉద్యోగాలను కూడా అవరోహణ క్రమంలో భర్తీ చేస్తున్నాం. మొన్న గ్రూప్–1, ఈరోజు గ్రూప్–2, త్వరలో గ్రూప్–3.. ఇలా భర్తీ చేస్తున్నాం. ఉద్యోగాలు సాధించిన వారిని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నాం. నిరుద్యోగుల జీవితాల్లో చీకటి రోజులు పోయి వెలుగు నిండాలి. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యవస్థ మాకు లేదు.. మీరే మా వ్యవస్థ. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్లు. మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ–2047 విజన్కు అనుగుణంగా పనిచేయాలి. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలపాలి. రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ నెలవారీ జీతం నుంచి 10 నుంచి 15 శాతం కోతపెట్టి ఒకటోతేదీన వారి ఖాతాల్లో జమచేస్తాం. గత పాలకులు దోపిడీ చేసిన సొమ్మును పంచుకోవడంలో లొల్లి జరుగుతోంది. ఆ విషయాన్ని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్ను రాజేసి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారిపట్ల అధికారులంతా జాగ్రత్తగ ఉండాలి. ప్రమాదాలు, ఫుడ్ పాయిజన్తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి’అని సీఎం సూచించారు.మానవ వనరులను ఖాళీగా ఉండనీయం: భట్టిరాష్ట్రంలోని మానవ వనరులను వృధాగా ఉంచలేమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడికన్నా వెళ్లాలి... లేదా ఉద్యోగమన్నా చేయాలి అని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు బడికి రావాలని, వచ్చిన ప్రతిబిడ్డ ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని నైపుణ్యాలు పొందాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఒకే రోజు 783 మందికి గ్రూప్– 2 నియామక పత్రాలు అందించడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అటవీ x రెవెన్యూ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ–అటవీశాఖల మధ్య నెలకొన్న సరిహద్దుల పంచాయితీ ఎంతకీ కొలిక్కి రావడం లేదు. ఈ రెండు శాఖల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న భూవివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు భూముల సంయుక్త సర్వే చేపడతామని చెబుతున్నా, అది ఆచరణలోకి రావడం లేదు. ముందుగా ఏవి అటవీ భూములు, ఏవి రెవెన్యూ భూములు అన్న దానిపై స్పష్టత సాధించే విషయంలోనే అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. అటవీభూమి 60 లక్షల ఎకరాల్లో... తెలంగాణలో 60.64 లక్షల ఎకరాల మేర తమ శాఖ భూములు ఉన్నట్టుగా రికార్డుల్లో ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇందులో 49.80 లక్షల ఎకరాల భూముల్లో ఎలాంటి వివాదాలు లేకపోగా, రికార్డుల పరంగా క్లియర్గా ఉన్నాయంటున్నారు. గతంలోనే సిద్ధం చేసిన లెక్కల ప్రకారం..ప్ర«దానంగా పదిన్నర లక్షల ఎకరాల పరిధిలో అటవీ, రెవెన్యూశాఖల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం కోసం సంబంధిత శాఖలు ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాం నాటి గణాంకాలను బట్టి చూస్తే... » మహబూబాబాద్ జిల్లాలో 3.44 లక్షల ఎకరాలుండగా, అందులో అత్యధికంగా 2.89 లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నట్టు తెలిసింది. » వరంగల్ రూరల్ జిల్లాలో 38 వేల ఎకరాలుండగా, వాటిలో 26వేల ఎకరాల్లో భూ వివాదాలున్నాయి. » కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 5.29 లక్షల ఎకరాలుండగా, వివాదాల్లో 1.86 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 4.33 లక్షల ఎకరాలకుగాను 1.50 లక్షల ఎకరాల్లో వివాదాలు, వికారాబాద్ జిల్లాలో 1.08 లక్షల ఎకరాలకుగాను 42 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకుగాను 70 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలుండగా వాటిలో 35 వేల ఎకరాల దాకా, నల్లగొండ జిల్లాలో 52 వేల ఎకరాలకుగాను 13 వేల ఎకరాలు భూ వివాదాల్లో ఉన్నట్టుగా తెలిసింది. » అటవీశాఖకు చెందిన ఎలాంటి వివాదాలకు తావులేని భూమిగా గుర్తించిన 49.80 లక్షల ఎకరాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎల్ఆర్ఎంఎస్–నోషనల్ ఖాతా మార్కింగ్)లో మెజారిటీ భూములు రికార్డుకాగా, కొంతమేర నోషనల్ ఖాతా మార్కింగ్ చేపట్టాల్సి ఉంది. పక్కాగా స్థిరీకరణకు సర్కార్ దృష్టి రెండేళ్ల కాలంలో పోడు సమస్యతోపాటు, వివాదాలున్న అటవీ భూముల సమస్యను కూడా పరిష్కరించే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ భూమిని, రెవెన్యూ రికార్డులతో సరిచూసుకొని ఇకపై పక్కాగా స్థిరీకరించుకోవాలని, భవిష్యత్లో ఎలాంటి ఆక్రమణలకు తావు ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అటవీ అధికారులు పనిచేసేలా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్టుగా తెలిసింది. అటవీ భూముల సరిహద్దులు లెక్క తేల్చి, సరిహద్దుల గుర్తింపు, కంచె లేదా కందకాల ఏర్పాటు ద్వారా భవిష్యత్ ఆక్రమణలు అడ్డుకోవచ్చునని అటవీ అధికారులు సూచిస్తున్నారు. రెవెన్యూ శాఖ అ«దీనంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములపై తాజాగా అన్ని జిల్లా స్థాయిల్లో ఇటీవల సర్వే ప్రారంభమైంది. అయినా, ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. రెండు శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడితేనే ఇది పరిష్కారమయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.లెక్కల రికార్డులేవి? » అటవీ, రెవెన్యూ రికార్డుల్లో ఆయా శాఖలకు సంబంధించి ఎంత భూములున్నాయన్న దానిపైనా ఇంకా పూర్తి స్పష్టత లభించలేదని అధికార వర్గాల సమాచారం. కొన్నేళ్లుగా ఈ భూముల పంచాయితీకి తెరదించాలని తాము చూస్తున్నా, రెవెన్యూశాఖ పెద్దగా స్పందించడం లేదని అటవీశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఏ శాఖకు ఆ శాఖ వేర్వేరుగా రికార్డులను నిర్వహించడంతోపాటు, వాటి నమోదు కూడా సరిగా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అటవీ భూముల సర్వే చేయకపోవడం, రెండు శాఖలు ఆయా జిల్లాల్లో తమ భూమి అంటే తమ భూమి అని రికార్డులకు ఎక్కించడం వల్ల ఎదురైన వివాదాల పరిష్కారానికి సామరస్యంగా చర్యలు చేపట్టాలనే అభిప్రాయంతో వారున్నారు. -
రోడ్ల విస్తరణకు రూ.868 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లను వెడల్పు చేయటంతోపాటు పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్)నుంచి రూ.868 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో 34 రోడ్లను వెడల్పు చేయటంతోపాటు అవసరమైనచోట వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్ వసూలు చేస్తున్న సెస్లో రాష్ట్రాల వాటాగా కేంద్రం సీఆర్ఐఎఫ్కు జమచేసి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజా విడతలకు సంబంధించి ఈ మొత్తం మంజూరైంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఆయా పనులు చేసి యూసీలు సమర్పిస్తే, అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ పనులకు సంబంధించి త్వరలో టెండర్లు పిలవనున్నారు. చాలాకాలంగా రాష్ట్రంలో రోడ్లను వెడల్పు చేయకపోవటంతో పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని కీలక రోడ్లను ఈ నిధులతో మెరుగుపరచనున్నారు. చేపట్టనున్న పనులు ఇవే.. » హైదరాబాద్–కరీంనగర్ రోడ్డు నుంచి కరీంనగర్–కామారెడ్డి రోడ్డును అనుసంధానిస్తూ రూ.77 కోట్లతో భారీ వంతెన నిర్మించనున్నారు. మధ్యలో మానేరు బ్యాక్ వాటర్ ముంపు వల్ల ఈ రెండు రోడ్ల అనుసంధానం లేదు. రాజీవ్ రహదారి మీదుగా కామారెడ్డి వెళ్లాలంటే కరీంనగర్ పట్టణంలోకి వెళ్లి మళ్లాల్సి వస్తోంది. దీంతో బావాపేట–ఖాజీపేట– పోతూరు–గుండ్లపల్లి మీదుగా వంతెనను నిర్మించి రెండు రోడ్లను అనుసంధానించనున్నారు. » మహబూబ్నగర్–నల్లగొండ రోడ్డును 13.2 కి.మీ. మేర రూ.50 కోట్ల వ్యయంతో మెరుగుపరచనున్నారు. కనగల్ కూడలి నుంచి నాగార్జునసాగర్ కూడలి వరకు ఈ పనులు జరుగుతాయి. » మంథని–రామగుండం రోడ్డును రూ.21 కోట్లతో 13.1 కి.మీ. మేర అభివృద్ధి చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ రోడ్డు నుంచి దెద్రా గ్రామం వరకు 20 కి.మీ. మేర కొత్త రోడ్డును రూ.30 కోట్లతో నిర్మించనున్నారు. మంచిర్యాల జిల్లా టేకుమట్ల సమీపంలో, కుందారం ఎస్సీ కాలనీ సమీపంలో, నక్కలపల్లి పవనూర్ రోడ్డు మీద కిష్టాపూర్ గ్రామం సమీపంలో... మూడు హైలెవల్ వంతెనలకు రూ.20 కోట్లు కేటాయించారు. » జగిత్యాల జిల్లాలోని మ్యాకవెంకయ్యపల్లి–పత్తిపాక మధ్య ఎల్లాపూర్ మీదుగా 11.5 కి.మీ. మేర రూ.20 కోట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నారు. » మొయినాబాద్–సురంగల్–శ్రీరామ్నగర్–వెంకటాపూర్ ల మీదుగా చందానగర్ టూ కవేలిగూడ రోడ్డును 14 కి.మీ. రోడ్డును రూ.30 కోట్లతో వెడల్పు చేయనున్నారు. » కరీంనగర్, నల్లగొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం,హనుమకొండ, వనపర్తి, సంగారెడ్డి, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో 34 రోడ్లను వెడల్పు చేస్తూ అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించనున్నారు. » కొడంగల్ పట్టణంలోని లహోటీ కాలనీ పార్క్ నుంచి వినాయక చౌరస్తా, శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా బాపల్లి తండా జంక్షన్ వరకు రూ.60 కోట్లతో రోడ్డు విస్తరణకు పరిపాలన అనుమతులు ఇస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) కింద ఈ పనులు చేపడుతారు. -
ఎత్తులు.. పై ఎత్తులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో పట్టు నిలుపుకొనేందుకు ఓ వైపు మావోయిస్టులు.. మరోవైపు భద్రతా దళాలు గడిచిన పదిహేనేళ్లుగా వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేశారు. చివరికి అపరిమితమైన వనరులు కలిగిన భద్రతా దళాల ధాటికి దండకారణ్యంలో మావోలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఎదురైంది. ఇదే చివరకు భారీ లొంగుబాట్లకు దారి తీసిందన్న చర్చ జరుగుతోంది.రంగంలోకి పారా మిలిటరీ..దండకారణ్యంలో 1980లో అడుగుపెట్టిన మావోయిస్టులు ఇరవై ఏళ్లకు పైగా అక్కడ తిరుగులేని శక్తిగా మారారు. మరో పదేళ్లకు ఆ పార్టీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి 12 కంపెనీలు వచ్చి చేరాయి. సాంస్కృతిక విభాగమైన చేతన నాట్యమండలి సభ్యుల సంఖ్య 7 వేలు దాటింది. దండకారణ్యంలో ప్రబల శక్తిగా నానాటికి విస్తరిస్తున్న మావోయిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు ముందుగా సల్వాజుడుం, ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్హంట్ను 2009లో ప్రభుత్వం ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ పోలీస్, బీఎస్ఎఫ్ తదితర దళాలను రంగంలోకి దించింది. దీంతో మావోయిస్టులే లక్ష్యంగా భద్రతా దళాల కూంబింగ్ పెరిగింది. ఎదురు కాల్పుల్లో ఆ పార్టీ సభ్యులు నష్టపోవడం పెరిగింది.పారా మిలిటరీని ఎదుర్కొనేలా..వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లను సమీక్షించిన ‘దాదా’లు నాలుగు కిలోమీటర్ల నడక వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. తమ బస (క్యాంప్) సమాచారం పోలీసులు/భద్రతా దళాలకు చేరాక వారు తమను చుట్టుముట్టేందుకు ఎంత సమయం పడుతుంది, ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంత సమయం అవసరం, తప్పించుకున్న తర్వాత చెల్లాచెదురైన దళాలు 24 నుంచి 72 గంటల్లోగా ఎక్కడ, ఎలా కలుసుకుంటే మంచిదనే అంశాలపై అధ్యయనం చేశారు. గ్రామం లేదా రోడ్ పాయింట్ (పోలీసులు వాహనాలు వచ్చే స్థలం) నుంచి కనీసం నాలుగు కిలోమీటర్ల పాటు అడవిలో నడిస్తే తప్ప చేరుకోలేనంత దట్టమైన అడవిలోనే క్యాంపులు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాక తమ వద్దకు వచ్చే భద్రతా దళాలపై అంబూష్లు చేసే వ్యూహాలు నేర్చుకున్నారు. దీనికి తోడు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల యుద్ధరీతులను అధ్యయనం చేశాక.. వేగంగా బంకర్లు, బూబీట్రాప్స్ నిర్మించడంపై దళాలకు శిక్షణ ఇచ్చారు. దీంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు వెళ్లిన బలగాలు అనేకసార్లు మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్నాయి.కట్టుదిట్టం చేసినప్పటికీ..ఆపరేషన్ గ్రీన్హంట్ చేపట్టి పదేళ్లు దాటినా సానుకూల ఫలితం రాకపోవడంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్షిప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ– డ్యాష్బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్) తెరపైకి వచ్చింది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించే పనిపై ప్రభుత్వం, బలగాలు దృష్టి సారించాయి. ఆఖరికి వాయుమార్గాన దాడులకు సైతం తెర తీశారు. ఎన్ని చేసినా 2021 ఏప్రిల్లో తెర్రం దగ్గర జరిగిన దాడిలో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం భద్రతా దళాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. అంతేకాక మావోలను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం భద్రతా దళాలకు అవసరం పడింది.4 కిలోమీటర్ల ప్రణాళికమావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒక పారామిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసే ప్రణాళికకు 2019లో శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం అడవిలో క్యాంప్ ఏర్పాటుచేసి 24 గంటలూ జవాన్లు అక్కడే ఉంటారు. ఆ క్యాంప్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిత్యం కూంబింగ్ చేస్తారు. అలా మావోలను మరింతగా అడవి లోపలికి నెట్టేస్తారు. నెల వ్యవధిలోనే ఆ ప్రాంతంపై పట్టు సాధించి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన మరో కొత్త క్యాంప్ ఏర్పాటు చేస్తారు. క్యాంపుతో పాటే భారీ వాహనాలు తిరిగేలా తాత్కాలిక రోడ్లు, మొబైల్ టవర్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. ఇలా రెండేళ్లలోనే 300కి పైగా క్యాంపులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ప్రాంతంపై పట్టున్న డీఆర్జీ దళాలు ప్రభుత్వ అమ్ముల పొదిలో వచ్చి చేరాయి. దండకారణ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి లొంగుబాటుకు సిద్ధం కావాల్సి వచ్చింది. -
కుంగుబాటు.. మహిళల్లోనే అధికం
సాక్షి, హైదరాబాద్: కుంగుబాటు, మానసిక ఒత్తిడి సమస్యలు పురుషుల కంటే మహిళల్లో రెండురెట్లు అధికంగా ఉన్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. స్త్రీలలో ఉండే వేలాది ప్రత్యేకమైన జన్యు వైవిధ్యాలే ఇందుకు కారణమని గుర్తించారు. ఈ ప్రత్యేక జన్యు నిర్మాణం మహిళలను సామాజిక, పర్యావరణ ఒత్తిళ్లకు అధికంగా ప్రభావితం చేస్తోంది. ఇటీవల నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైన ‘సెక్స్–్రస్టాటిఫైడ్ జీనోమ్–వైడ్ అసోసియేషన్ మెటా–అనాలిసిస్ ఆఫ్ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’అనే పరిశోధన పత్రంలో ఈ అంశం వెల్లడైంది. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (ఎండీడీ)తో ముడిపడి ఉన్న ఏడు వేల కంటే ఎక్కువ జన్యు వైవిధ్యాలు పురుషుల్లో ఉంటే.. అందుకు అదనంగా మహిళలు ఆరు వేల జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నారని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా కుంగుబాటు (డిప్రె షన్)తో బాధపడుతున్న 1.3 లక్షల మంది మహిళలు, 65 వేల మంది పురుషుల జన్యు డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అలాగే డిప్రెషన్లో లేని 2.9 లక్షల మందికి చెందిన జన్యు డేటాను కూడా విశ్లేషించారు. ఈ సర్వేలో ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, యూకే, యూఎస్లకు చెందినవారు అధికంగా పాల్గొన్నారు. ఏమిటీ జన్యు వైవిధ్యాలు? » జన్యు వైవిధ్యం అంటే కేవలం డీఎన్ఏ క్రమంలో మార్పు. వీటిలో కొన్ని వైవిధ్యాలు అంత ప్రమాదకరం కాదు. మరికొన్ని కుంగుబాటు, నిరాశతో సహా అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వైవిధ్యాలు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావొచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు. మహిళల్లో ఈ వైవిధ్యాలు మెదడు అభివృద్ధి, హార్మోన్లు, జీవక్రియ వంటి ప్రక్రియలతో సంకర్షణ చెందుతాయి. దీనివల్ల వారు కుంగుబాటుతోపాటు ఇతర రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కుంగుబాటుతో బరువు పెరుగుదల, నిద్రలేమి.. » కుంగుబాటు, ఒత్తిడితో బాధపడుతున్న మహిళలు బరువు పెరగటం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారని సర్వేలో పేర్కొన్నారు.» మహిళల నిరాశ లక్షణానికి జన్యు మార్పులు కారణమని పరిశోధకులు కనుగొన్నారు. » దీనికి విరుద్ధంగా నిరాశతో బాధపడుతున్న పురుషులు తరచుగా కోపం, దూకుడు ప్రదర్శిస్తారు » డిప్రెషన్–లింక్డ్ డీఎన్ఏ తేడాలు వారసత్వంగా రావచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు.» ఇవి పుట్టుకతో వచ్చే డీఎన్ఏ తేడాలు అని పరిశోధకులు చెప్పారు. » ఈ పరిశోధన ఫలితాలు కుంగుబాటు నిర్ధారణ, చికిత్సకు లింగ నిర్దిష్ట విధానాల అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. » ఉదాహరణకు మహిళలకు జీవక్రియ మార్గాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మంచి చికిత్స అందించవచ్చు » పురుషులకు వారి ప్రవర్తన లేదా న్యూరోకాగ్నిటివ్ నమూనాలపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. -
గులాబీ సైన్యమంతా ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడం లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సుమారు 60 మంది క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు. స్థానిక కేడర్తో సమన్వయంజూబ్లీహిల్స్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డివిజన్లలో సంపూర్ణంగా, మరో మూడు డివిజన్లలో పాక్షికంగా విస్తరించి ఉంది. యూసుఫ్గూడ, రహమత్నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్పేట, బోరబండ డివిజన్లు పూర్తిగా, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్లు పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. డివిజన్ వారీగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. వీరు స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన 60 మంది ముఖ్యనేతలకు మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్ల పరిధిలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ముఖ్యనేత తమతోపాటు వచ్చిన అనుచరులతో కలిసి తమకు కేటాయించిన బూత్లలో ప్రచారం చేస్తున్నారు. అలాగే, బయటి నుంచి సుమారు వేయి మంది జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి నేతలు ప్రచారానికి తరలివచ్చినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్ల వారీగా ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇన్చార్జీలకు ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. భారీగా నకిలీ ఓటర్లు నమోదయ్యారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఓటరు జాబితాను వడపోస్తూ అసలైన ఓటర్లను చేరుకోవాలని భావిస్తోంది.సాదాసీదాగా నామినేషన్నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని సాదాసీదాగా సాగేలా బీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఈ నెల 19న మరో సెట్ దాఖలు చేయనున్నారు. 19న భారీ ర్యాలీ నిర్వహించాలని భావించినా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నట్లు తెలిసింది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్రావు రోడ్ షోలు, హాల్ మీటింగ్స్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
‘సిక్’ లీవ్ అని చెప్పేద్దామా?
సాక్షి, హైదరాబాద్: భారతీయుల్లో వర్క్–లైఫ్ బ్యాలెన్స్ సమస్యలు అధికంగా బయటపడుతున్నాయి. దాదాపు 75 శాతం మంది వృత్తి నిపుణులు మానసిక ఆరోగ్యం సరిచేసుకునే విషయంలో వెనుకబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన నౌక్రీ పల్స్ 2025 సర్వేలో పాల్గొన్నవారిలో నలుగురు ఇండియన్లలో ముగ్గురు సెలవుకు మానసిక ఆరోగ్య కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని తేలింది. పనిలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో... పేలవమైన పని–జీవిత సమతుల్యతలో 39%తో భారత్ వృత్తి నిపుణులు ముందువరసల్లో నిలుస్తున్నారు. దాదాపు 80 పరిశ్రమలలో 19,650 మంది వృత్తి నిపుణులపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో... 30 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెలవు తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజైన్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఇది అధికంగానే ఉన్నట్టుగా తెలిసింది. ఈ విషయంలో ఫ్రెషర్లు, కెరీర్ ప్రారంభంలో ఉన్న నిపుణులు (0–5 సంవత్సరాల పని అనుభవం) ఎక్కువగా సంకోచిస్తారు.ఉద్యోగులు వెనుకాడడానికి కారణాలు... » మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగా సెలవు తీసుకుంటే తమను అసమర్థులుగా చూస్తారని 31 శాతం మంది ఉద్యోగులు భయపడుతున్నారు » తమ విషయంలో సహోద్యోగులు ఏమని ఆలోచిస్తారోననే ఆందోళనతో 27% మంది ఉన్నారు » సెలవు తీసుకునేందుకు తాము సాకులు వెతుకుతున్నామని 21% మంది ఆందోళన చెందుతున్నారు » ఇది కెరీర్ వృద్ధిని ప్రభావితం చేస్తుందని 21% మంది నమ్ముతున్నారు వాస్తవాలకు బదులు సెలవుకు చెబుతున్న కారణాలు... » తమ మానసిక ఆందోళనలతో తలెత్తిన పరిస్థితిని 45% జనరల్ సిక్ లీవ్గా పరిగణన» 28% ఇతర కారణాలు » 19% సెలవులకు దూరం» 9% ఇతర కారణాలు చూపుతున్నారు... -
ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల బురిడీ!
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా వారి ఉచ్చులో టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పడ్డారు. ఫేక్ ఐడీలతో బెదిరించి భారీ స్థాయిలో దోచుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైనట్లు వెబ్ మీడియా ద్వారా తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. ముంబై సైబర్క్రైమ్ అధికారులుగా నటించిన మోసగాళ్లు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ను మనుషుల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ బెదిరించి ఆయన నుంచి డబ్బులు గుంజారు. ప్రొవిజనల్ బెయిల్ పేరుతో రూ.1.07 కోట్లను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటున్న ఎమ్మెల్యే పుట్టాకు అక్టోబరు 10 ఉదయం 7.30 గంటలకు ఫోన్ కాల్ వచి్చంది. ఫోన్ చేసిన వ్యక్తి తను ముంబై సైబర్ క్రైమ్ విభాగం అధికారిగా పరిచయం చేసుకున్నారు. ఆపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, 17 ఫిర్యాదులు కూడా అందాయని చెప్పాడు. ఆధార్, సిమ్కార్డు వాడి నకిలీ బ్యాంకు ఖాతా కూడా తెరిచారని, ముంబైలో కొనుగోలు చేసిన సిమ్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు చెప్పాడు. కొద్ది నిమిషాలకు మరో వ్యక్తి వాట్సాప్ వీడియా కాల్లోకి వచ్చాడు. తాను సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారి అని చెప్పి నకిలీ అరెస్టు వారెంట్, సీబీఐ అకౌంట్ ఫ్రీజ్ ఆర్డర్ చూపించి నమ్మించినట్లు సమాచారం. ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే తన ఖాతాకు ఎక్కడి నుంచి డబ్బులు వచి్చందని అవతలి వ్యక్తిని ప్రశ్నించారు. కెనరా బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు డిపాజిట్ అయ్యాయని, వాటిని తిరిగి ఇచ్చేలా సహకరించకపోతే అరెస్టు చేస్తామని మోసగాళ్లు బెదిరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అక్టోబర్ 15లోపు రూ.1.07 కోట్లు సైబర్ మోసగాళ్ల అకౌంట్కు పంపించినట్లు సమాచారం. కాగా, మరో రూ.60లక్షలు పంపిస్తే కోర్టు క్లియరెన్స్ సర్టిఫికెట్ పంపిస్తామని చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే, గురువారం రాత్రి హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
పత్తి కొనుగోలు మరింత లేటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి పంట సేకరణ వేగవంతమైనప్పటికీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదు. దళారీ వ్యవస్థను, జిన్నింగ్ మిల్లుల అక్రమ దందాను నిరోధించేందుకు సీసీఐ తెచ్చిన కొత్త నిబంధనలతో తలెత్తిన వివాదంతో మిల్లర్లు ఈనెల మొదటి వారందాకా పత్తి కొనుగోళ్ల టెండర్లలో పాల్గొనలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చొరవతో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోళ్లకు ముందుకొచ్చినప్పటికీ మిల్లులను నోటిఫై చేసే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో దీపావళి మరుసటి రోజు నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చెబుతున్నప్పటికీ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పత్తికి పెద్ద మార్కెట్ అయిన వరంగల్ జిల్లాలోని ఎనుమాముల పత్తి లోడ్లతో నిండిపోయింది. వచ్చిన పత్తిని జిన్నింగ్ మిల్లుల ఏజెంట్లు, దళారీలు తక్కువ ధరకే కొంటున్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 ఉండగా, రూ. 6వేల లోపే కొంటున్నారు. సీసీఐ కొనుగోళ్లు ఆలస్యమయ్యే కొద్దీ రైతులు దళారులను ఆశ్రయించడం పెరుగుతోంది.ఎల్–1, ఎల్–2 మిల్లుల ఎంపిక తరువాతే...పత్తి జిన్నింగ్ కోసం సీసీఐ విడుదల చేసిన టెండర్లో లింట్ శాతం, ఎల్–1, ఎల్–2 కింద మిల్లుల కేటాయింపు, అలాట్మెంట్ స్లాట్ బుకింగ్, ఏరియా మ్యాపింగ్ కోసం ఉన్న నిబంధనలను మిల్లర్లు తొలుత వ్యతిరేకించారు. దాంతో రెండుసార్లు టెండర్లు ఆహ్వానించినా, పాల్గొనలేదు. ఈనెల 6న మంత్రి మిల్లర్లతో సమావేశమై భరోసా ఇవ్వడంతో మిల్లులు టెండర్లు దాఖలు చేశాయి. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 343 మిల్లులకు పత్తిని జిన్నింగ్ చేసే సామర్థ్యం ఉండగా, ఇప్పటివరకు 22 జిల్లాల కలెక్టర్లు 220 మిల్లులను నోటిఫై చేశారు. మిగతా 8 జిల్లాల్లో నోటిఫై కావాల్సి ఉంది. మిల్లులను నోటిఫై చేశాక ఎల్–1, ఎల్–2 కింద ఎంపిక చేయాల్సి ఉంది. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా రైతులు తాము విక్రయించాల్సిన పత్తి కోసం స్లాట్ బుక్ చేసుకుంటే, ముందుగా ఎల్–1 కింద మిల్లులకు పత్తిని కేటాయిస్తారు. ఎల్–1లోని మిల్లుల కెపాసిటీకి తగినంత పత్తిని పంపాక, ఎల్–2 మిల్లులకు పంపిస్తారు. వర్షాలతో దెబ్బతిన్న పంటరాష్ట్రంలో రెండు నెలలుగా కురుస్తున్న అకాల వర్షాలతో చాలాచోట్ల పత్తి పంట దెబ్బతింది. పత్తి చేన్లలో నీరు నిలిచి దిగుబడిపై ప్రభావం చూపినట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి విడత పికింగ్ (ఏరిన) పత్తిని రైతులు తమ వద్ద నిల్వ చేశారు. రాష్ట్రంలో ఈసారి 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. అయితే వర్షాల కారణంగా దెబ్బతినడంతో అది 25 లక్షల మెట్రిక్ టన్నుల లోపే ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా, 21 లక్షల మెట్రిక్ టన్నుల మేర పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.క్వింటాల్కు రూ.1,300 నష్టంకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.8,110 చెల్లించి సీసీఐ కొను గోలు చేస్తోంది. ప్రస్తుతం అదే క్వాలి టీ ఉన్న పత్తికి ప్రైవేటు వ్యాపారులు రూ.6,800 చెల్లిస్తున్నారు. అంటే క్వింటాల్కు రూ.1,300 వరకు నష్టపోతున్నాం. – రవి, పత్తి రైతు చౌళ్లపల్లి,అత్మకూరు మండలం, హనుమకొండ జిల్లా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలిసీసీఐ లేకపోవడం వల్ల పత్తి నాణ్యత ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర చెల్లించడం లేదు. సీసీఐ ఉంటే క్వింటాకు రూ.వేయి అదనంగా వస్తుంది. అందువల్ల వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి.– పల్లెశ్యాం, పత్తి రైతు తోగరు రామయ్యపల్లె, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా యాప్లో నమోదు చేసుకోవాలిపత్తి రైతులు తమ పంట వివరాలను మండల వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి. తాత్కాలి కంగా నమోదు ప్రక్రియ పూర్తయితే మరోసారి నమోదు చేసే అవకాశా ల్లేవు. యాప్లో నమోదు చేసుకోకుంటే కొనుగోళ్ల సమ యంలో ఇబ్బందులు తప్పవు. – ఉప్పుల శ్రీనివాస్, ఆర్జేడీఎం, వరంగల్ -
ఇక 20% టెక్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక సాంకేతికతపై బోధన పెంచుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అన్ని స్థాయిల్లోనూ 20 శాతం మేర కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ టెక్నాలజీ సిలబస్తో కూడిన బోధనాంశాలు ఉంటాయని చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మండలి పురోగతిపై బాలకిష్టారెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థలను ప్రపంచశ్రేణి విద్యాసంస్థలతో అనుసంధానించేందుకు రోడ్మ్యాప్ రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రీజనల్ అకడమిక్, ఇన్నోవేషన్ క్లస్టర్లను కొత్తగా తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పాలనా వ్యవస్థను విస్తరిస్తామని తెలిపారు. ఓపెన్–యాక్సెస్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫాంలను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్–2047’లక్ష్యాలతో ముందుకెళ్తామని.. డ్యూయల్ డిగ్రీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల కట్టడిరాష్ట్రంలోని డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీల ఫీజుల నియంత్రణ చేపట్టాలని అన్ని వర్గాలు కోరుతున్నందున ఈ అంశాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రస్తుతం వర్సిటీల్లో పరిశోధనల స్థాయి తగ్గిందని.. వాటిని తిరిగి పెంచేందుకు అధ్యాపకులకు అవార్డులు ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. డీగ్రీ కోర్సుల్లో ఇకపై గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని సిలబస్ తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ‘న్యాక్’అక్రెడిటేషన్ పొందేందుకు కృషి చేస్తామని.. ‘న్యాక్’కు దరఖాస్తు చేసే కాలేజీలకు రూ. లక్ష ప్రోత్సాహకం ఇస్తామని బాలకిష్టారెడ్డి అన్నారు.అందుబాటులో ఆంగ్ల విద్యవిద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఆంగ్ల విద్యపై పట్టు సాధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. దీనికోసం సరళమైన భాషలో పీడీఎఫ్, ఆడియోతో కూడిన ఆన్లైన్ మెటీరియల్ను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ‘అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య’అనే పేరుతో దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ కౌన్సిల్ వెబ్సైట్కు లాగిన్ అయి ఈ మెటీరియల్ ఉచితంగా పొందొచ్చని సూచించారు. విలేకరుల సమావేశంలో మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. -
మూసీ.. మూసేసి..
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని మూసేసి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నార్సింగి ఎగ్జిట్ సమీపంలోని మంచిరేవులలో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్మించిన వాంటేజ్ వెంచర్పై సమగ్ర విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ఈ సంస్థ మూసీ నదీ గర్భంలో దాదాపు మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఓఆర్ఆర్లో భూమి పోవడంతో.. శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ మంచిరేవులలో వెంచర్ నిర్మించడానికి గతంలో దాదాపు పది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే, అందులోని ఆరు ఎకరాలను ఓఆర్ఆర్, సర్వీసు రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కానీ, రికార్డుల్లో మాత్రం రెండు ఎకరాలను మాత్రమే సేకరించినట్లు చూపారు. ఇక్కడే భూ యజమాని తెలివిగా ఆలోచించి పక్కనే ఉన్న మూసీపై కన్నేశాడు. భూసేకరణలో రెండు ఎకరాలు మాత్రమే పోయినట్లు చూపించి మూసీ నదీగర్భంలోకి చొరబడి ఏకంగా మూడు ఎకరాలను ఆక్రమించాడు. దీనిపై వివిధ విభాగాల నుంచి ఎన్ఓసీలు.. హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకున్న శ్రీ ఆదిత్య సంస్థ వాంటేజ్ నిర్మాణాన్ని చేపట్టింది. అంతకు ముందే మూసీ నదిలో ఓ రిటైనింగ్ వాల్ నిర్మించింది. అది వివాదాస్పదం కావడంతో హెచ్ఎండీఏ వాంటేజ్ నిర్మాణానికి అనుమతులను రద్దు చేసింది. దీంతో రిటైనింగ్ వాల్ను కూల్చేసిన శ్రీ ఆదిత్య సంస్థ.. అనుమతుల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం నుంచి అనుకూలంగా ఆదేశాలు పొంది యధేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఈ కబ్జాపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నా.. ఏ అధికారి కూడా వాంటేజ్ జోలికి వెళ్లలేదు. కొన్ని నెలలుగా ఈ నిర్మాణంపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. మ్యాప్స్తో కీలక ఆధారాలు హైడ్రా బృందాలు వాంటేజ్ వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాయి. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు, విలేజ్ క్రెడెస్టియల్ మ్యాప్స్తోపాటు గూగుల్ హిస్టారికల్ శాటిలైట్ ఇమేజెస్ను అధ్యయనం చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్నారెస్సీ) రూపొందించిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ (డీఈఎం) మ్యాప్స్తో మూసీ పరీవాహక ప్రాంతాన్ని సరిచూశారు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ వాంటేజ్ కోసం మూసీలో మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు తేలింది. దీనిపై మరికొన్ని ఆ«ధారాలు సేకరించిన తర్వాత ఆ సంస్థకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయంపై రంగనాథ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఉస్మాన్సాగర్ నుంచి ఇటీవల దిగువకు వదిలిన నీరు దాని సామర్థ్యంలో పావు వంతు మాత్రమే. ఆ వెంచర్ చేసిన కబ్జా కారణంగా ఆ నీరు కూడా దిగువకు వెళ్లలేక ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును ముంచేసింది. ఉస్మాన్సాగర్ నుంచి పూర్తిస్థాయిలో నీరు విడుదలైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. నోటీసుల జారీచేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. చెరువులు, కుంటల కబ్జా కంటే మూసీ కబ్జా వల్ల నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది’అని పేర్కొన్నారు.వరదలతో బండారం బట్టబయలు ఇటీవల మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో వాంటేజ్ టవర్స్లోకి భారీగా వరదనీరు వచి్చంది. ఉస్మాన్సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలటంతో మూసీలో ప్రవహించాల్సిన నీరు.. ఎంఎఫ్ఎల్తోపాటు బఫర్ జోన్ ఆక్రమణకు గురి కావడంతో ఓఆర్ఆర్ సరీ్వస్ రోడ్డును సైతం ముంచేసింది. ఎగువన అనేక ప్రాంతాలకు పొంచి ఉన్న ముంపు ముప్పును ఎత్తి చూపింది. దీంతో ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. -
బంద్ సంపూర్ణం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఈ బంద్లో పాల్గొనడంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడా హింసాత్మక ఘటనలు లేకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించగా... వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే బీసీ జేఏసీ నేతలు, పార్టీల నాయకులు బస్సు డిపోలు, బస్స్టాండ్ల ఎదుట బైఠాయించారు. అన్ని జిల్లాల్లోనూ నాయకులు బంద్ విజయవంతానికి సహకరించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఎంజీబీఎస్, జేబీఎస్తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని బస్డిపోల వద్ద నిరసన కార్యక్రమాలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగినప్పటికీ... బస్సులు లేకపోవడంతో విద్యార్థులు హాజరు కాలేదు. మరోవైపు జేఏసీ నేతలు వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి బంద్ పాటించాలని కోరుతూ వాటి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని పక్షాల మద్దతుతో సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి. అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఈ బంద్లో పాల్గొనడం గమనార్హం. ⇒ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ బస్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, వందలాది బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, బీసీ ఉద్యమ గీతాలతో ఆటపాటలు, ధూమ్ధామ్ నిర్వహించారు. ⇒ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని పలువురు మంత్రులు నినదించారు. లోయర్ ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్కుమార్, సాట్స్ చైర్మన్ శివసేనరెడ్డి పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. కానీ, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు మద్దతు అంటూ కేంద్రంలో మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. ⇒ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన బంద్లో పాల్గొన్నారు. ⇒ మంత్రి కొండా సురేఖ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు బంద్లో పాల్గొన్నారు. ఆమె రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టిన బీజేపీకి ››బీసీల పాపం తగులుతుందన్నారు. ⇒ ఆర్టీసీ క్రాస్రోడ్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్యాదవ్, ముఠాగోపాల్, గంగుల కమలాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బంద్లో పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9లో చేరిస్తేనే చట్టబద్దత వస్తుందని తెలిసీ కూడా జీవో తీసుకుని ఎన్నిలకు వెళ్లేలా నోటిఫికేషన్ ఇచ్చి, న్యాయస్థానాలు కొట్టేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ⇒ సికింద్రాబాద్లో నిర్వహించిన బీసీ బంద్లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు కమిషన్లు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. దిల్సుఖ్నగర్ డిపో వద్ద జరిగిన నిరసన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులు రోడ్డెక్కకుండా అడ్డుకునేందుకు బీసీ జేఏసీ నేతలు యత్నించగా పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన చర్యలతో తోపులాట చోటుచేసుకుంది. ⇒ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరన్వహించిన మానవహారంలో కల్వకుంట్ల కవితతోపాటు ఆమె కుమారుడు పాల్గొన్నారు. ⇒ బంద్కు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నారాయణగూడ నుంచి కోఠి వరకు జరిగిన ర్యాలీలో సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఎ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, న్యూ డెమోక్రసీ అధికారప్రతినిధి జేవీ చలపతిరావు, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ పి.సంధ్య, పీడీఎస్యూ నాయకులు మహేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. =ఎల్బీనగర్ చౌరస్తాలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, టి.చిరంజీవులు పాల్గొన్నారు. ప్రయాణికుల పాట్లు... రాష్ట్ర బంద్ నేపథ్యంలో బస్డిపోలు, బస్టాండ్ల వద్ద నిరసన కార్యక్రమాలు జోరందుకోవడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీపావళి పండుగ పురస్కరించుకుని ఊళ్లకు వెళ్లేవారు, రోజువారీ జీవనోపాధి కోసం ప్రయాణించే వాళ్లు బస్సుల కోసం బస్టాండ్ల వద్ద పడిగాపులు కాశారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు రెట్టింపు డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. చాలాచోట్ల ఆటోలు, టాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనదారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4గంటల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి. బంద్ విజయవంతం: ఆర్.కృష్ణయ్య హిమాయత్నగర్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, గ్రామాల్లో బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ విజయవంతమైందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. ఈ బంద్కు అన్ని పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బషీర్బాగ్ దేశోద్దారక భవన్లో మీడియా సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ విజీఆర్ నారగోని, కో–ఛైర్మన్ దాసు సురేశ్, కో–ఆర్డినేటర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ ఉద్యోగులు, 135 కులసంఘాలు, ప్రతి ఒక్కరూ బీసీ బంద్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. బీసీల ఆకాంక్షల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలన్నారు. 76 ఏళ్ల నుంచి బీసీలకు మోసం జరుగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం లాగా, సాగర హారం, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. చట్ట సభల్లో తమ రిజర్వేషన్లు సాధించే వరకు తెగించి పోరాడుతాం అని స్పష్టం చేశారు. -
చేపలు పడుతూ లోయలో పడ్డాడు.. ఎలా బయటకొచ్చాడంటే..!
జోగుళాంబ గద్వాల్: చేపల వేటకు వెళ్లి కెనాల్లో పడ్డ జెయింట్ వీల్ నిర్వాహకుడిని ఎస్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, పోలీస్ బృందాలు సాహాసోపేతంగా కాపాడాయి. గూడెందొడ్డి కెనాల్లో చేపలు పట్టేందుకు రమేష్, తనాజీలు వెళ్లారు. తనాజీ దాదాపు 25 అడుగుల ఎత్తునుండి జారిపడగా.. వారిని కెనాల్లో పడ్డ వ్యక్తిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు.కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన తనాజీ జాతర్లలో జెయింట్ వీల్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ప్రస్తుతం ధరూర్ మండల పరిధిలోని పాగుంట గ్రామ జాతరలో జెయింట్ వీల్ నిర్వహించడానికి వచ్చాడు. తనాజీ ఇవాళ మధ్యాహ్నం సమయంలో తన సహచరుడు రమేష్తో కలిసి చేపలు పట్టేందుకు గుడెం దొడ్డి కెనాల్ వద్దకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో రమేష్ పూర్తిగా కెనాల్లోకి దిగగా, తనాజీ కూడా దిగేందుకు ప్రయత్నిస్తుండగా సుమారు 25 అడుగుల ఎత్తు నుండి జారి కెనాల్లో పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన రమేష్ తక్షణమే “100 డయల్”కి కాల్ చేసి ధరూర్ పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న వెంటనే ధరూర్ పోలీస్ సిబ్బంది రామిరెడ్డి, వినోద్ కుమార్లు సంఘటన స్థలానికి బయలుదేరుతూ, వివరాలను ధరూర్ ఎస్ఐకి తెలియజేశారు. ఎస్ఐ వెంటనే ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్ళి, వారి అనుమతితో ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే వారు సంఘటన స్థలానికి చేరుకొని, సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి తనాజీని కెనాల్లో నుంచి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తరువాత తనాజీకి కాలు, చేయి, విరిగినట్లు గుర్తించి,108 అంబులెన్స్ ద్వారా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందిన వెంటనే, స్పందించిన పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు అభినందించారు. -
‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు
హైదరాబాద్: ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదన్నారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు. మేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే "ఎలీ లిల్లీ" లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్డీఐలు..‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
కానీ.. ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు యువత ఆకాంక్షలను రాజకీయాల కోసం వాడుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వారి కుటుంబం కోసమే గత పాలకులు ఆలోచించారు. గత పాలకులు నిజాం నవాబులతో పోటీపడి సంపద పెంచుకున్నారంటూ ఆరోపించారు.‘‘గత పదేళ్లలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించలేదు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. ఎకరానికి రూ.కోటి సంపాదించే విద్య ఉందని గత పాలకులు చెప్పారు. కానీ ఆ విద్యను రైతులకు మాత్రం నేర్పలేదు. గత పాలకులు వారి కుటుంబసభ్యులకే పదవులు ఇచ్చుకున్నారు. కానీ గ్రూప్-2 నియామకాలు చేపట్టాలని ఆలోచించలేదు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ జరగలేదు అంటే… ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నాం...మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్..మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా పనిచేయాలి. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు..వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
Telangana: మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన వచ్చింది. నిన్నటి వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు మరో 50 వేల దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా. ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెల 23న మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ డ్రా నిర్వహించనున్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఎక్సైజ్ శాఖ రిజర్వేషన్లు కల్పించింది. యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మద్యం దరఖాస్తులు చేసుకున్నారు.దరఖాస్తుల ద్వారా మూడు వేల కోట్ల పైగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఏపీకి చెందిన మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67 వేల దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ అధికారులు స్వీకరించారు. -
‘బీసీ రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉన్నాం’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు గాను 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పునరుద్ధాటించారు. బీసీ సామాజిక న్యాయ వ్యతిరేకి ఎవరైనా ఉన్నారంటే అది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. ఈరోజు(శనివారం, అక్టోబర్ 18వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ నిర్వహించిన బంద్లో వివేక్ పాల్గొన్నారు. చెన్నూర్, మందమర్రి, మంచిర్యాలలో చేపట్టిన రాష్ట్ర బంద్లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పరుత్వం అనేది బీసీ రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో సైతం బీసీ అనుకూల విధానాలను రాష్ట్ర ప్రభుతం అమలు చేస్తూనే ఉంటుందని, చట్టపరమైన, రాజకీయ పరమైన సవాళ్లకు భయపడకుండా తమ పొరాటాన్ని సాగిస్తూనే ఉంటుందన్నారు. . -
అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు సీఎం రేవంత్. ‘ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదు.ఇప్పటికైనా అలసత్వం వీడండి. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు. అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలి. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సీఎస్ సమీక్షించాలి. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలి. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టఘి. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వండి. ఇకపై సీఎస్ తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలి. నేనే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తా’ అని సీఎం తెలిపారు. -
నల్గొండలో ఉద్రిక్తత.. కార్ల షోరూమ్పై బీజేపీ కార్యకర్తల దాడి
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్లపల్లిలో ఉన్న పవన్ నెక్సా మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. బంద్ చేయకుండా షోరూం ఓపెన్ చేశారంటూ ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడి షోరూమ్గా గుర్తించారు. బంద్ చేయకుండా షోరూం తెరవడంతో బీజేపీ, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో రాళ్లతో దాడి చేశారు. -
తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్.. వెలిసిన ‘వాంటెడ్ రియాజ్’ పోస్టర్లు
సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యోదంతాన్ని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో నిందితుడు రియాజ్ను పట్టుకుని తీరాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 8 బృందాలు రంగంలోకి దిగాయి. చిన్నచిన్న దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు పాల్పడే రియాజ్ గురించి శుక్రవారం నిజామాబాద్ సీసీఎస్కు సమాచారం అందింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి అతన్ని పట్టుకునేందుకు బైక్పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో రాత్రి 8గం. ప్రాంతంలో రియాజ్ను పట్టుకుని.. ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్పై ఎక్కించుకున్నారు. అయితే అప్పటికే తన దగ్గర దాచుకున్న కత్తి తీసి.. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని, మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. దీంతో రియాజ్ పేరిట మోస్ట్ వాంటెడ్ పోస్టర్లు వెలిశాయి. అతని ఆచూకీ చెబితే రూ.50 వేలు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఎనిమిది బృందాలు అతని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
అజ్ఞాతంలోనే తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్
సిరిసిల్ల: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తొలిసారి నక్సలైట్లు ఆయుధాలను అప్పగించి సామూహికంగా లొంగుబాటు మొదలైంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉండేది. సమసమాజ స్థాపన కోసం ఆయుధాలను పట్టి ఎందరో అడవిబాట పట్టారు. ఏళ్లుగా ఉద్యమదారుల్లో నడిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా ! అంటూ ఆ అజ్ఞాతవాసుల కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. జనజీవనంలోకి వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా? అనే చర్చ సాగుతోంది.27 ఏళ్ల కిందట అడవిబాటరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపలి్లకి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ ఎనిమిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు శ్రీనివాస్ రాకపోవడం విషాదం.పోలీస్ కౌన్సెలింగ్తోనే వెలుగులోకి...శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ కనిపించకపోవడంతో ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నాడని గుర్తించి.. బండలింగంపలి్లలోని అతని తల్లిదండ్రులు నారాయణ, భూదమ్మ ఇంటికెళ్లి.. కొడుకును లొంగిపోయేలా చూడండి.. అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంఘటనతోనే కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిసింది. ఒడిషా ప్రాంతంలో పనిచేస్తున్నాడని తరా>్వత వారికి తెలిసింది. కానీ ఆచూకీ లభించలేదు. కన్న కొడుకును చూడకుండానే తల్లిదండ్రులు కన్నుమూశారు.రా అన్నా.. కలిసుందాం అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. – తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్)తమ్మీ రారా..నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారంనాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పదోతరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నకొడుకు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులోనే అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల కిందట మరణించాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా చంద్రయ్య ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినే దేవవ్వ ధర్మారంలో ఉంటున్నారు. -
కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ!?
సాక్షి, హైదరాబాద్: 42 శాతం రిజర్వేషన్ల సాధన డిమాండ్తో బీసీ సంఘాలు ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత శనివారం ఉదయం ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో.. ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లితో పాటే నిరసనల్లో పాల్గొన్న ఆదిత్య.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ఫ్లకార్డు చేతబూని నినాదాలు చేస్తూ కనిపించాడు.‘‘కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు.. ప్రతి ఇంటి నుండి అందరూ బయటకు వచ్చి రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు ఎంతో అవసరం’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ కవితను ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో నొచ్చుకున్న ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు రాగా.. అనూహ్యంగా ఇవాళ్టి బంద్, ధర్నాల్లో పాల్గొనడం గమనార్హం. దీంతో 20 ఏళ్లకే కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రెడీనా? అనే చర్చ నెట్టింట జోరుగా నడుస్తోంది. -
‘బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా’
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కారణంగా బంద్ కొనసాగుతోంది. బంద్లో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొంటున్నారు. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణభవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండాపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం. కానీ, బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లని జీవోలను, ఆర్డినెన్స్ను విడుదల చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి’ అని కామెంట్స్ చేశారు. మాజీమంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘బీసీ బంద్లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
నవీన్ యాదవ్ ఆస్తులు రూ.29.66 కోట్లు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పి.నవీన్యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్ను ఆయన జతపర్చారు. ఈ మేరకు తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.4 లక్షలు, భార్య చేతిలో రూ.2 లక్షలు నగదు ఉందని, ఐదు బ్యాంక్ ఖాతాల్లో రూ.37.6 లక్షలు తన పేరు, తన భార్య పేరున రెండు అకౌంట్లలో రూ.10 వేలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. రూ. 7 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని, తన పేరున స్కోడా కారు, తన భార్య పేరిట హుందాయ్ ఐ10 కారు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున రెండు కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున 14.39 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్గూడలో 860 గజాల ఇంటి స్థలం, భార్య పేరుతో 4.30 ఎకరాల వ్యవసాయ భూమి, 466 గజాల స్థలంలో ఇళ్లు ఉన్నాయన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు తన పేరిట, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పొందుపర్చారు. -
దీపావళి సెలవులు.. కూకట్పల్లి కిటకిట (ఫొటోలు)
-
సినీతారల మార్ఫింగ్ ఫొటోలతో ఓటు ముద్రించిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: తయారు చేసి వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్రెడ్డి మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా సినీతారలు రకుల్ ప్రీత్సింగ్, సమంత రూత్ ప్రభు, తమన్నా భాటియాల ఫొటోలను ముద్రించి నియోజకవర్గ ఓటర్లుగా గుర్తు తెలియని వ్యక్తి వైరల్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్స్ అండ్ కార్స్..సేల్స్ అదుర్స్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల అమ్మకాలు టాప్గేర్లో పరుగులు తీస్తున్నాయి. గత నెలలో జీఎస్టీ తగ్గించినప్పటి నుంచి అమ్మకాలు ఊపందుకున్నాయి. దసరా సందర్భంగా కేవలం 12 రోజుల వ్యవధిలో 55 వేలకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ వాహనాలపైన జీవితకాల పన్ను రూపంలో రవాణాశాఖకు సుమారు రూ.360.08 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది కంటే ఇది ఎక్కువ. అలాగే ఈ దీపావళి సందర్భంగా కూడా అమ్మకాల జోరు అదేవిధంగా కొనసాగుతున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి వాహనాల అమ్మకాల్లో కొంత వరకు స్తబ్దత నెలకొంది. జీఎస్టీ తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం జూలై, ఆగస్టు నెలల్లో అమ్మకాలు భారీగా తగ్గాయి. సెపె్టంబర్ 22 నుంచి ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా ఈ ఊపు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల ఖరీదైన కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాహనాలకే బుకింగ్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని డీలర్లు చెప్పారు. సొంత కారు కల సాకారం... అనూహ్యంగా పెరిగిన వాహనాల ధరల దృష్ట్యా వాహనం కొనుగోలు చేయలేని మధ్యతరగతి వేతనజీవుల ‘సొంత కారు’ కల జీఎస్టీ తగ్గింపుతో సాకారమవుతోంది. తమ చిరకాల వాహనయోగ కోరికను తీర్చుకొనేందుకు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. దసరా సందర్భంగా గత నెల 22వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు 13,,022 కార్లు, మరో 1221 క్యాబ్లు, అలాగే 41,089 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు గత సంవత్సరం (దసరా సందర్భంగా) అక్టోబర్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 9,768 కార్లు, 856 క్యాబ్లు, 38,955 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే వాహనాల విక్రయాలు పెరిగినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ దీపావళి పర్వదినం సందర్భంగా కూడా అదే జోరు కనిపిస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు వివిధ శ్రేణులకు చెందిన వాహనాలపైన ఆటోమొబైల్ డీలర్లు సైతం ప్రత్యేక ఆఫర్లు, రాయితీలను ప్రకటించారు. దీంతో ధరల తగ్గింపులో ఆకర్షణీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ విధంగా కూడా చాలామంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలల వరకు బుకింగ్లు.. ‘కొన్ని కేటగిరీలకు చెందిన వాహనాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.దీంతో చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. 3 నెలల వరకు కూడా ఇప్పటికే బుక్ అయ్యాయి.’ అని సోమాజిగూడ ప్రాంతానికి చెందిన ఒక డీలర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో రోజుకు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. వాటిలో 400 నుంచి 500 వరకు కార్లు ఉంటే మిగతావి ద్విచక్ర వాహనాలే.‘ ఇప్పుడు హైదరాబాద్తో పాటు తెలంగాణ అంతటా వాహనాల అమ్మకాలు పెరిగినట్లు బేగంపేట్కు చెందిన ఒక ఆటోమొబైల్ డీలర్ చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం హైఎండ్ వాహనాల కంటే చిన్న కార్లపైన ఎక్కువగా ఉంది. రూ.20 లక్షల కంటే తక్కువ ఖరీదైన వాహనాల ధరలు తగ్గాయి. ఈ ధరల్లో వివిధ రకాల బ్రాండ్లకు చెందిన వాహనాలపైన సుమారు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయి. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆటోమొబైల్ డీలర్లు సుమారు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు ధరల తగ్గింపుతో ఆఫర్లను, రాయితీలను అందజేస్తున్నారు. -
ఇక మెట్రో స్వాదీన ప్రక్రియ వేగవంతం..
సాక్షి, హైదరాబాద్: మెట్రో మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకొనే ప్రక్రియపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టిసారించింది. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేసి వీలైనంత తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ధేశించింది.ఈ క్రమంలోనే చీఫ్సెక్రెటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆరి్థక, న్యాయ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మెట్రో మొదటి దశపైన ఎల్అండ్టీతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం మేరకు అన్ని అంశాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.ఈ నివేదిక ఆధారంగా మెట్రో స్వాధీన ప్రక్రియను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తిచేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఎల్అండ్టీతో కలిసి నిరి్మంచిన మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నిర్వహణలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని రెండోదశపైన కేంద్రం పలు సందేహాలను లేవనెత్తిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు ఎల్అండ్టీ పేర్కొన్నది. ఈ మేరకు ప్రభుత్వానికి, ఎల్అండ్టీ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆస్తులు, అప్పులు, మెట్రో నిర్వహణ, తదితర అంశాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి నివేదికను రూపొందించనున్నారు.కేబినెట్ సబ్కమిటీకి నివేదిక.... సాంకేతిక, న్యాయపరమైన అంశాలపైన ఈ కమిటీ దృష్టి సారించనుంది. అలాగే ఎల్అండ్టీకి వివిధ ప్రాంతాల్లో అప్పగించిన భూములను, ఆస్తులను స్వా«దీనం చేసుకోవడంతో పాటు ఆ సంస్థకు చెల్లించనున్న రూ.2000 కోట్ల చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలపైన కూడా సీఎస్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ కార్యాచరణ రూపొందించనుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. ఎల్అండ్టి వైదొలగనున్న దృష్ట్యా రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అలాగే ఇప్పటికే ఎల్అండ్టీ నుంచి వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చిన మాల్స్, భూముల యాజమాన్యాన్ని కూడా ప్రభుత్వానికి బదిలీ చేయవలసి ఉన్నది. ఈ మేరకు ఎల్అండ్టీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తూ ఈ ఆరి్థక సంవత్సరం ముగింపు నాటికి స్పష్టత వచ్చేవిధంగా చర్యలు చేపట్టనున్నారు. సీఎస్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్కమిటీకి అందజేయనుంది. రెండోదశకు మార్గం సుగమం... మెట్రో రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ కేంద్రం నుంచి అనుమతి లభించకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొంది. పీపీపీ పద్ధతిలో కొనసాగే మొదటి దశకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిరి్మంచనున్న రెండోదశకు మధ్య సరైన సమన్వయం కుదరకపోవడం వల్ల కేంద్రం పలు అంశాలను ప్రస్తావించింది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఈ అంశాలపైన కూడా దృష్టి సారించనుంది. ‘ఎల్అండ్టీ వైదొలగిన అనంతరం రెండో ప్రాజెక్టులు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోకి వస్తాయి.దీంతో ఇప్పుడు స్తబ్దత నెలకొన్న అన్ని అంశాలపైన కూడా స్పష్టత వస్తుంది.’ అని హెచ్ఎంఆర్ఎల్ అధికారి ఒకరు తెలిపారు.మొత్తం 8 మార్గాల్లో నిర్మించనున్న రెండోదశ పైన కేంద్రానికి డీపీఆర్లను సమరి్పంచి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో సీఎస్ కమిటీ అన్ని విధాలుగా ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదం చేయగలదని భావిస్తున్నారు.ఒక్క లైన్ పట్టాలెక్కినా చాలు.. నిజానికి రెండో దశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలను 2028 నాటికి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కేంద్రం నుంచి ఏ విధమైన సహకారం లభించకపోవడంతో తీవ్ర జాప్యమైంది. ఇప్పుడు ఎల్అండ్టీ నుంచి ప్రాజెక్టును స్వా«దీనం చేసుకోనున్న దృష్ట్యా మూడేళ్లలో రానున్న ఎన్నికల నాటికి ఏదో ఒక మార్గంలో మెట్రో కారిడార్ను నిరి్మంచాలని భావిస్తున్నారు. పాతబస్తీ రూట్లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కి.మీ.ల మార్గాన్ని చేపట్టి ఎన్నికల నాటికి కొంతమేరకు పురోగతి సాధించినా ఆశించిన ఫలితాలను పొందవచ్చునని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. -
Jubilee Hills Bypoll: పోలింగ్ రోజు సెలవు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అలాగే, ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ నివాసిగా ఉండి ఓటరుగా పేరు నమోదు చేసుకున్న ఉద్యోగులకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల పోలింగ్ రోజున ఈసీ సెలవు ప్రకటించింది. బీహార్తో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. మొదటి దశ: నవంబర్ 6, 2025 (గురువారం), ద్వితీయ దశ: నవంబర్ 11, 2025 (మంగళవారం), 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా నవంబర్ 11, 2025న జరగనున్నాయి. ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని విభాగం 135B ప్రకారం.. వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమ, ఇతర ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి, తాను ఓటు హక్కు కలిగిన నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఒక చెల్లింపు సెలవు (Paid Holiday) మంజూరు చేయాలని ఈసీ పేర్కొంది. -
బస్సులు బంద్.. పండుగ వేళ ప్రయాణీకుల ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ శనివారం రాష్ట్రబంద్ను నిర్వహిస్తోంది. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు డిపోల వద్ద నిలిచిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు బస్ డిపోల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు.. ఆసుపత్రులు, మందుల దుకాణాలకు మినహాయింపు ఉంటుందని బీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు.అయితే, పండుగ వేళ కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణీకులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. ఎంజీబీఎస్లో బస్సులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో, సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు, జేబీఎస్, హయత్నగర్, మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, రాజేంద్రనగర్, ఉప్పల్, నగర శివారుల నుంచి బస్సులు లేకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి వరకు పలు జిల్లాల నుంచి నగరానికి బస్సులు వచ్చాయి. అలాగే, సిటీ నుంచి బస్సులు వెళ్లాయి. దీంతో, ఆ బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు.. రైళ్ల రాకపోకలు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో కాలేజీలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర బంద్ నేపథ్యంలో శనివారం ఓయూలో జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ.. 9వ షెడ్యూల్ చేర్చి చట్టసవరణ చేయాలంటూ బీసీ సంఘాలు శనివారం తెలంగాణ బంద్కు పిలుపు ఇచ్చాయి. ఈ బంద్కు అన్ని పార్టీలతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలు మద్దతు ప్రకటించాయి. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వివరాలను తమ ముందు ఉంచాలని జీపీ, ఈసీ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. దీనికి రెండు వారాలు సమయమిస్తూ, విచారణను వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంచిర్యాల మండలం లక్సెట్టిపేట్కు చెందిన రేంక సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘రిజర్వేషన్లపై పిటిషన్ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ నిలిపివేస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పష్టత వచ్చినా ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలి’అని కోరారు.ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు, షెడ్యూల్కు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం తరఫున షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాలు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ అవసరం లేదని, ఎన్నికల తేదీలు తెలియజేస్తే చాలని స్పష్టం చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
మంత్రులు వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం.. దండుపాళ్యం ముఠా కంటే అధ్వానంగా తయారైందని..కేబినెట్ మీటింగ్లో మంత్రులు అరడజను వర్గాలుగా విడిపోయి తన్నుకుంటున్నారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. కమీ షన్లు, కాంట్రాక్టులు, వసూళ్లు, వాటాలు, కబ్జాలు, పోస్టింగుల కోసం పోటీలు పడుతూ పాలన గాలికి వదిలి వ్యక్తిగత పంచాయితీలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్య మంత్రి, మంత్రులు పరస్పరం తిట్లతో గడుపుతున్నారని, అతుకుల బొంత ప్రభుత్వ మనుగడపై అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు.దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీమంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్రావు, పార్టీ నేతలు చిరుమర్తి లింగయ్య, పల్లె రవికుమార్తో కలిసి శుక్రవారం తెలంగాణభవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశం ద్వారా తీపి కబురు చెప్తారని ఆశించిన అన్ని వర్గాల ప్రజలు నిరాశకు గురయ్యారన్నారు.రేవంత్ ‘గన్ కల్చర్’ తెచ్చారు‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యాపార వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పెట్టుబడులతోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేశాం. కానీ రేవంత్రెడ్డి రాష్ట్రంలోకి గన్ కల్చర్ తెచ్చి వ్యాపారవేత్తలను తుపాకులతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకులు పెడుతున్నారని, సీఎం జపాన్ నుంచి ఫైళ్లు ఆపించారని ఓ మంత్రి కుమార్తె స్పష్టంగా చెప్తోంది.కాంట్రాక్టుల కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా హీరోలు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఇక్కడ జరుగు తున్న అరాచకాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లేదా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్తో విచారణ జరిపించాలి. సీఎం తుపాకీ పంపారు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ స్పందించాలి’అని హరీశ్రావు అన్నారు. దేని కోసం విజయోత్సవాలు..?‘ప్రభుత్వ సంస్థలను అప్పుల కుప్ప చేసి ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు తెచ్చారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకునేందుకు హ్యామ్ మోడల్ పేరిట రూ.10,547 కోట్లతో రోడ్లకు టెండర్లు పిలిచారు. బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోవడంతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను రేవంత్ ప్రభుత్వం దొంగ దెబ్బతీసింది. 23 నెలల పాలనలో అన్ని పథకాలు, హామీలను అమలు చేయకుండా డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు జరపాలని నిర్ణయించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పెరిగిన అరాచకాలపై విచారణ ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తాం’అని హరీశ్రావు చెప్పారు. -
బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న బంద్ ఇది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుందని.. ఆ పార్టీ నైజం రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం మొత్తం తెలిసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క అన్నారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో శుక్ర వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం, పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా శనివారం నిర్వహించే బీసీల బంద్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ రిజ ర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలోనే ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని భట్టి తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా అనుమతి రాలేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం నాయకత్వం వహించాలని సూచించారు.సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా రూ.400 కోట్ల బోనస్ ప్రకటించామని భట్టి తెలిపారు. సింగరేణి కార్మి కులకు దీపావళి బోనస్ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొత్త సీతారాములు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రన్వేకు అటు పౌర విమానాలు ఇటు ఐఏఎఫ్ జెట్లు!
సాక్షి, హైదరాబాద్: సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్వే.. దానికి ఓవైపు విమానాశ్రయం.. మరోవైపు భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) స్టేషన్. అంటే పౌర విమానాలు, ఎయిర్ఫోర్స్ విమానాలకు కామన్ రన్వే అన్నమాట. ఇదీ సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఆదిలాబాద్ విమానాశ్రయ ముఖచిత్రం. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మాస్టర్ప్లాన్ సిద్ధం చేసింది. తొలుత చిన్న విమానాశ్రయాన్నే నిర్మించాలని భావించినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్లోనూ భారీ విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఏఏఐ నిర్ణయించింది.ఎయిర్బస్ ఏ–320, బోయింగ్–737 రకం విమానాల రాకపోకలకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఆమోదం తెలిపింది. అలాగే రాత్రివేళల్లోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్లు జరిగేలా వసతుల కల్పనకు కూడా సమ్మతించింది. దీంతో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులో వరంగల్ విమానాశ్రయ ప్రతిపాదన తర్వాత గ్రీన్సిగ్నల్ ఇచ్చిన రెండో విమానాశ్రయం ఇదే కానుంది. వరంగల్ విమానాశ్రయంతోపాటే దీన్ని కూడా నిర్మించనున్నారు.ఇప్పటికే అన్ని రకాల సర్వేలు ముగిసి టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా తుది సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఏఐ కోరింది. దానికి ఇక్కడి నుంచి సమాధానాలు ఢిల్లీకి చేరాయి. వాటి ఆధారంగా మాస్టర్ప్లాన్ సిద్ధమైంది.దాదాపు 650 ఎకరాల్లో నిర్మాణం..ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్లో నిజాంకాలం నాటి ఎయిర్స్ట్రిప్ ఉంది. అక్కడకు కేవలం ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లు మాత్రమే అడపాదడపా వస్తుంటాయి. వీఐపీలు వచ్చినప్పుడు అక్కడి హెలిపాడ్ను వాడుతుంటారు. ఈ హెలిపోర్టును ఎయిర్ఫోర్స్ స్టేషన్గా మార్చుకోవాలని చాలాకాలంగా ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. తొలి నుంచీ హెలిపోర్టుకు చెందిన 369 ఎకరాల స్థలం దాని అధీనంలోనే ఉంది.అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం ప్రతిపాదించగా అందుకు ఐఏఎఫ్ సమ్మతించి ఉమ్మడి అవసరాలకు వాడుకునేలా దాన్ని నిర్మించేందుకు అంగీకరిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయడంతో ఎయిర్పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 250–300 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు.తాజాగా అన్ని అడ్డంకులు తీరిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలు తీర్చేలా ఇక్కడ నైట్ ల్యాండింగ్తో కూడిన పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న ఏఏఐ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆదిలాబాద్లో ఎయిర్బస్–380, బోయింగ్–777 విమానాలు (అతిపెద్ద విమానాలు) దిగే సామర్థ్యంతో కూడిన రన్వే అవసరమా లేక ఎయిర్బస్–ఏ320, బోయింగ్–737 రకం విమానాలు దిగే సామర్థ్యంతో కూడిన రన్వే కావాలా అని ప్రశ్నించింది.ఎయిర్బస్–ఏ320, బోయింగ్–737 స్థాయి విమానాలు దిగే రన్వే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 2.8 కి.మీ. నుంచి 3 కి.మీ. పొడవైన రన్వే నిర్మాణానికి నిర్ణయించారు. దానికి ఓవైపు ప్రయాణికుల విమానాలు నిలిచే స్థలం, ప్రయాణికుల ప్రాంగణం మరోవైపు ఎయిర్ఫోర్స్ స్టేషన్ నిర్మించనున్నారు. సాధారణ ప్రయాణికులు, పౌర విమానాలు రెండో వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయనున్నారు. వాయుసేనకు దాదాపు 50–80 ఎకరాల స్థలం కేటాయించి మిగతా మొత్తాన్ని ప్రయాణికుల విమానాశ్రయానికి వినియోగించనున్నారు. -
నేడు బీసీ జేఏసీ రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా శనివారం తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రబంద్కు అన్ని రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర బంద్లో పాల్గొని విజయవంతం చేయాలంటూ పార్టీలు... వారి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇవ్వడం, ఆ దిశగా అసెంబ్లీలో చట్టాలు చేసి కేంద్రానికి పంపడం... మరోవైపు ఆర్డినెన్స్ జారీ చేసినా, గవర్నర్ ఆమోదించకపోవడం...చివరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయగా... వాటిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.బీసీలకు కేవలం స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ పెరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఈనెల 12న బీసీ జేఏసీ ఏర్పాటైంది. ప్రజాజీవనాన్ని స్తంభింపజేసి బీసీల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకే రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఈ బంద్కు అన్ని వర్గాల మద్దతును కోరారు.బీసీ జేఏసీ నిర్ణయం మేరకు ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచి్చన వెంటనే ప్రధాన రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు ప్రకటించడంతోపాటు రాష్ట్ర బంద్లో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ బి.మహేశ్కుమార్ గౌడ్ ఆదేశించారు.మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్రంలోని ప్రజాసంఘాలన్నీ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న బంద్కు అన్ని పక్షాల మద్దతు లభించడం ఇదే తొలిసారి. -
మావోయిస్టు విప్లవ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశ సాయుధ విప్లవ చరిత్రలోకెల్లా మావోయిస్టుల అతిపెద్ద లొంగుబాటు ఛత్తీస్గఢ్లో నమోదైంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సహా 210 మంది మావోయిస్టులు శుక్రవారం లాంఛనంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 111 మంది మహిళలు, 99 మంది పురుషులు ఉన్నారు.వారందరిపై కలిపి రూ. 9.18 కోట్ల రివార్డు ఉంది. హోదా పరంగా చూస్తే లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, నలుగురు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఒక రీజనల్ కమిటీ సభ్యుడు, 21 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 61 మంది ఏరియా కమిటీ సభ్యులు, 22 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులతోపాటు 98 మంది పార్టీ సభ్యులు తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా 19 ఏకే–47లు, 17 ఎస్ఎల్ఆర్లు, 23 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక ఇన్సాస్ లైట్ మెషీన్ గన్, 36 (.303 రకం) రైఫిళ్లు, 11 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, నాలుగు కార్బైన్లు తదితర ఆయుధాలను అప్పగించారు. బస్తర్ జిల్లా కేంద్రమైన జగ్దల్పూర్లోని పోలీస్ లైన్లో ఉన్నతాధికారుల సమక్షంలో ‘పున మార్గ్’పేరిట ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయి, హోంమంత్రి విజయ్శర్మ వర్చువల్గా పాల్గొన్నారు. ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మావోయిస్టులకు స్థానికంగా ఉన్న మాంజీ చాల్కీ తెగకు చెందిన నాయకులు గులాబీ పూలు అందించి జనజీవన స్రవంతిలోకి ఆహ్వనించారు. ఆ తర్వాత వారికి దేశ రాజ్యాంగ ప్రతులు అందచేశారు.ఈ సందర్భంగా సీఎం విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ సాయుధ పోరాటాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో తాజా లొంగుబాట్లు కీలక మలుపుగా నిలుస్తాయన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్లుగా 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ఉద్ఘాటించారు. అంతకు ముందు అడవిని వీడి గురువారం రాత్రి జగ్దల్పూర్ చేరుకున్న మావోయిస్టులను ప్రత్యేక బస్సుల్లో పోలీస్లైన్ వరకు తీసుకొచ్చారు. మారిన పరిస్థితులతోనే.... అనంతరం ఆశన్న మీడియాతో మాట్లాడుతూ మారిన పరిస్థితుల కారణంగానే లొంగిపోయామని చెప్పారు. ప్రస్తుతం విప్లవకారులకు అడవుల్లో ఆశ్రయం పొందే వీల్లేని పరిస్థితి నెలకొందని.. కానీ తమ సహచరులు ఇంకా అజ్ఞాతంలో ఉంటూ సాయుధ పోరాటం చేయాలనే దృక్ఫథంతో ఉన్నారని తెలిపారు. అందులో ఎవరైనా జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే ఫోన్లో తనను సంప్రదించాలని సూచించారు. అబూజ్మాడ్ ఖాళీ పోలీసు వర్గాల అంచనా ప్రకారం దేశంలో మావోయిస్టు ఉద్యమానికి దండకారణ్యం ప్రధాన స్థావరంగా ఉంది. ఇందులో ఛత్తీస్గఢ్–మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్మాడ్ అడవులు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉండేవి. కానీ మల్లోజుల, ఆశన్న బృందాల లొంగుబాట్లతో అబూజ్మాడ్లో ఆ పార్టీ పట్టు కోల్పోయినట్టయింది. అయితే ఇప్పటికీ దట్టమైన అడవితోపాటు ఇంద్రావతి నేషనల్ పార్క్, తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ బస్తర్ డివిజన్లలో మావోయిస్టుల ప్రభావం ఉంది. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక 477 మంది మావోయిస్టులు మృతిచెందగా 1,785 మంది అరెస్టయ్యారు. అలాగే 2,110 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముఖ్యులు 1) తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న – కేంద్ర కమిటీ సభ్యుడు 2) భాస్కర్ అలియాస్ రాజ్మన్ – డీకేఎస్జెడ్సీ 3) రాణిత – డీకేఎస్జెడ్సీ 4) రాజు సలాం – డీకేఎస్జెడ్సీ 5) దన్నువెట్టి అలియాస్ సంతు – డీకేఎస్జెడ్సీ 6) రతన్ ఎలాం – రీజనల్ కమిటీ సభ్యుడు -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అధికారులు, ఉద్యోగులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చు అనే దానిపై రెండుమూడు రోజుల్లోనే స్పష్టత వస్తుందని సంకేతాలిచ్చినట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుతోపాటు ఎన్నికల తేదీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఎన్నికలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు..: ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యలు, చట్టపరమైన అంశాలపై ప్రభుత్వం కోరిన వివరణకు కూడా పీఆర్శాఖ సమాధానం పంపించినట్టు తెలుస్తోంది. ఇదివరకు జరిగిన కసరత్తులో నాలుగైదు జిల్లాల వరకు మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ స్థానాల రిజర్వేషన్ల ఖరారులో తప్పులు దొర్లినందున ఈసారి అలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం.గురువారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో పాటు 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రెండువారాల్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలను తెలియజేయాలంటూ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)లను తాజాగా శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో ఇంకా స్పష్టత రాలేదనే ఉద్దేశంతో అధికారులు అలసత్వం చూపొద్దని పీఆర్ఆర్డీ శాఖ సూచించింది.శుక్రవారం జెడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై పీఆర్ఆర్డీ డైరెక్టర్ స్పష్టతనిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర పభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే మళ్లీ రిజర్వేషన్ల (50 శాతం మించకుండా) ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలిసింది. హైకోర్టు ఆదేశాలతో ఎస్ఈసీ కూడా ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమైనట్టు సమాచారం.ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల శాతం ఖరారుతోపాటు, ఫలానా తేదీ లోగా ఎన్నికలు జరపాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు అందగానే ఎన్నికల నిర్వహణ పనులు వేగవంతం చేయనుంది. గతంలోనే ఐదు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ జారీచేసినందున, రిజర్వేషన్లు ఖరారై, తేదీలపై స్పష్టత వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్నట్టు ఎస్ఈసీ వర్గాల సమాచారం. -
హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నాన్ స్టాప్ ప్రయాణం వీలుకానుంది. 147 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్గల్, ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించి అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇప్పటికే హెచ్ఎండీఏ నిర్మిస్తున్న రావిర్యాల (ఓఆర్ఆర్) నుంచి ఆమన్గల్ వరకు కొత్త రహదారిని ఈ గ్రీన్ఫీల్డ్ రహదారితో అనుసంధానించనున్నారు. ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే... మన్ననూరు నుంచి శ్రీశైలం 54 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది.రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు రూ. 7,500 కోట్ల వ్యయ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం తెలి సిందే. ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించనుంది. నిర్మాణ భారాన్ని తగ్గించుకోవడానికి.. తుక్కుగూడ నుంచి దిండి వరకు 85.8 కి.మీ. మేర నాలుగు వరుసలుగా రహదారి విస్తరణ.. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 54 కి.మీ. వరకు ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ మేరకు దిండి నుంచి మన్ననూరు వరకు ఉన్న ప్రాంతాన్ని ఎన్హెచ్ఏఐకు బదిలీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.అయితే భూసేకరణ, ప్రస్తుతం రహదారి వెంబడి యుటిలిటీ షిఫ్టింగ్కు భారీ వ్యయం అవుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల (ఓఆర్ఆర్ జంక్షన్) నుంచి ఆమన్గల్ వరకు 41.5 కి.మీ. వరకు గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం రోడ్లతోపాటు ఫుట్పాత్లు, డ్రైనేజీలు, యుటిలిటీల వంటి అన్ని రకాల అవసరాల కోసం 100 మీటర్ల వరకు భూములను సమీకరిస్తోంది.రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న రోడ్డు ముగింపు తర్వాత అక్కడి నుంచే ఆమన్గల్–మన్ననూరు వరకు 52.2 కి.మీ. గ్రీన్ఫీల్డ్ రహదారిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ రహదారి అలైన్మెంట్కు కల్వకుర్తి బైపాస్లోని ప్రస్తుత ఎన్హెచ్–765, ఎన్హెచ్–167లను అనుసంధానించనుంది. ఈ కొత్త రహదారి పొడవు 11 కి.మీ. ఉంటుంది. దీని డీపీఆర్ను ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ (ఏఏసీ) ఆమోదం కోసం పంపింది. -
కార్పొరేట్ ‘చదివింపులు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు మెరుగైన విద్య అందించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు వీలుగా సరికొత్త మార్గాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు.ఇందులో భాగంగా స్కూళ్ల అభివృద్ధికి నిధులిచ్చే దాతలు, పూర్వ విద్యార్థుల తోడ్పాటు తీసుకోవాలని కోరారు. మౌలిక వసతుల కల్పనలో ఇది సరైన మార్గమని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.ఆయా స్కూళ్లలో ఆట స్థలాలు, అవసరమైనన్ని తరగతి గదులతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. స్థలం సమస్య వల్ల సౌకర్యాలలేమి ఎదుర్కొంటున్న పాఠశాలలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లోకి తరలించాలని ఆదేశించారు. విదేశాల్లో విద్యా వ్యవస్థల పరిశీలనకు టీచర్లను పంపే ప్రక్రియను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇతర దేశాల్లోని మెరుగైన విధానాలను అనుసరించాలని సూచించారు. నిధుల కొరత వల్ల.. విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలు, జరుగుతున్న కృషిని అధికారులు సీఎంకు వివరించారు. అయితే నిధుల కొరత అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు నిధులు మంజూ రు కాలేదని.. ముఖ్యంగా చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్ల చొప్పున, మిగతా వర్సిటీలకు రూ. 35 కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయింపులు చేసినా ఇప్పటికీ నిధులివ్వలేదని పేర్కొన్నారు.దీనివల్ల వర్సిటీల్లో కొత్త కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకుండా పోతోందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. ప్రస్తుతానికి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటున్నందున కార్పొరేట్ సంస్థల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలను అభివృద్ధి చేసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన పేర్కొన్నట్లు అధికార వర్గాల సమాచారం. నర్సరీ స్కూళ్లపై దృష్టి నర్సరీ స్కూళ్ల ఏర్పాటుపై సీఎం సమీక్షిస్తూ వాటి ఏర్పాటు, ప్రజల్లో అవగాహన గురించి అధికారులను వివరాలు అడిగారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు కొత్త స్కూళ్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు సరికొత్త రీతిలో బోధన జరిగేలా చూడాలన్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళకుండా పేద విద్యార్థులను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.వచ్చే విద్యా సంవత్సరం ఇది అమలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.కాగా, ఉన్నత విద్యామండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉన్నత విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. -
లేజర్.. డేంజర్!
శంషాబాద్: విందులు వినోదాలు చేసుకునేవారికి అవి మిరుమిట్లు గొలిపే కాంతులు.. కానీ, వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విమాన పైలట్లకు మాత్రం అవి కంగారు పుట్టించే వెలుగులు. విమానాల టేకాఫ్, ల్యాండింగ్లపై తీవ్ర ప్రభావం చూపే లేజర్ లైట్లను విమానాశ్రయాల సమీపంలో వినియోగించరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించినప్పటికీ.. కొందరు తరచూ వాటిని వాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో కూడా వీటి వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ప్రారంభంలో చిన్నచిన్న గ్రామాలే ఉండేవి. గత దశాబ్దకాలంగా చుట్టూ జనావాసాలు, వాణిజ్య కార్యకలాపాలు భారీగా పెరిగాయి. అనేక కన్వెన్షన్లతోపాటు కొందరు సంపన్నులు ఎయిర్పోర్టుకు అత్యంత సమీపంలోనే విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు.ఎయిర్పోర్టు సమీపంలో లేజర్ లైట్ల వినియోగంపై ఆంక్షలు ఉన్నప్పటికీ కొదరు పట్టించుకోవటంలేదు. ఆరేళ్ల క్రితం కొందరు బాలురు బర్త్డే పార్టీ చేసుకుని లేజర్ లైట్లు వేయటంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగేందుకు గల్ఫ్ ఎయిర్లైన్స్ విమాన పైలట్ కంగారు పడ్డాడు. అప్పట్లో ఇది పెద్ద కలకలమే రేపింది. తాజాగా మూడు రోజుల క్రితం కూడా ఓ విమానంపై గ్రీన్ కలర్ లేజర్ కాంతులు పడ్డాయనే సమాచారంపై అంతర్గత విచారణ చేపట్టారు.కఠిన నిబంధనలున్నాయి..శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో లేజర్ లైట్లు, డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదు. ఎవరైనా ఈవెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ముందుగానే నిబంధనలు వివరించి లేజర్ లైట్లు వాడకూడదని స్పష్టంగా చెబుతాం. ఎయిర్పోర్టు పరిసరాల్లో నిబంధనలు అతిక్రమించి ఎవరైనా వినియోగిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. – బి. రాజేష్, శంషాబాద్ డీసీపీఏమిటి నిబంధనలు? విమానాశ్రయం పరిసరాల్లో లేజర్ కాంతుల వాడకంపై డీజీసీఏ పలు నిబంధనలు పెట్టింది. విమానాశ్రయానికి పది కిలోమీటర్ల లోపు వివిధ జోన్లుగా విభజించి నిబంధనలు పెట్టారు. కాంతి ప్రసార వేగం ఆధారంగా నిబంధనలు రూపొందించారు. మొదటిది లేజర్ బీమ్ ఫ్రీ ఫ్లైట్ జోన్. ఈ జోన్ పరిధిలో లేజర్ కాంతులు పూర్తిగా నిషిద్ధం. రెండోది లేజర్ బీమ్ క్రిటికల్ ఫ్లైట్ జోన్. ఇందులో లేజర్ కాంతి ప్రసారం మేరకు నిబంధనలుంటాయి. మూడోది లేజర్ బీమ్ సెన్సిటివ్ ఫ్లైట్ జోన్.పైలట్ల కష్టాలు..టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో లేజర్ కాంతులతో పైలట్లు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. వేగవంతమైన కాంతి ద్వారా పైలట్లకు ఫ్లాష్ బ్లైండ్నెస్ ప్రమాదం ఉంటుంది. దీంతో తాత్కాలిక దృశ్యలోపంతో పైలట్లు కంగారు పడతారు. దీంతోపాటు ఆఫ్టర్ ఇమేజ్ ప్రభావం ఉంటుంది. లేజర్ కాంతి పడి తర్వాత పోయినా ఆ దృశ్యం కళ్లలో నిక్షిప్తమై మరోమారు కనిపిస్తుంటుంది. ఇది దృష్టిభ్రమ లాంటింది. ఇది కూడా పైలట్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది.తీవ్ర ప్రభావం ఉంటుంది రన్వేపై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటుచేసే లైటింగ్, సహజ వెలుగుల ప్రభావంతో టేకాఫ్, ల్యాండింగ్లు ఆధారపడి ఉంటాయి. అకస్మాత్తుగా లేజర్ కాంతులు పడితే పైలట్లు తీవ్ర ప్రభావానికి లోనవుతారు. దృశ్యలోపం కూడా సంభవిస్తుంది. ఎయిర్పోర్టు పరిసరాల్లో లేజర్ కాంతులపై కఠిన నిబంధనలు కొనసాగించాలి. – నవీన్చందర్, విశ్రాంత పైలట్ -
ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రతీ ప్రభుత్వ పారశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 17వ తేదీ) విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ‘ పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ పై దృష్టి సారించండి. ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలి. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలి. ఇందుకు విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించండిసరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించండి. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయండి విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయండి 2026 జూన్ లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
హరీష్కు మంత్రి సీతక్క కౌంటర్
హైదరాబాద్: క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. క్యాబినెట్లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘ నిన్న క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు. క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. నిన్న వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం హరీష్ రావు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే’ అని విమర్శించారు మంత్రి సీతక్క.ఇదీ కూడా చదవండి:‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’ -
‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మంత్రులు వారి పంచాయితీలు చెప్పుకోవడానికే క్యాబినేట్ మీటింగ్లు పెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం (అక్టోబర్ 17) తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీష్రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ మాట్లాడుతూ.. ‘మంత్రులు గ్రూపులుగా విడిపోయారు. దంళుపాళ్యం ముఠాకంటే అధ్వాన్నంగా మారింది. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే క్యాబినెట్ మీటింగ్. కేసీఆర్ ఢిల్లీలో తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాటా, నీళ్ల వాటాను సాధించారు. కానీ సీఎం రేవంత్రెడ్డి కమీషన్లు.కాంట్రాక్టుల వాటాల కోసం కొట్లాడుతున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. రేవంత్రెడ్డి పాలనతో అతితక్కువ ఇండస్ట్రీలు వచ్చాయి. టీఎస్ ఐపాస్ ఏర్పడిన తర్వాత పరిశ్రమల రాక సంఖ్య పెరిగింది.మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యాత ఇచ్చాం. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు గురి పెడుతున్నారు. గన్ కల్చర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేపు తెలంగాణ బంద్.. డీజీపీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రేపటి (అక్టోబర్18,శనివారం) బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్రెడ్డి సూచించారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా చూసుకోవాలని.. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ అన్నారు. బంద్ పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఈ నెల 18న బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం చేపట్టబోయే బంద్కు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ ప్రజలను కోరింది.బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరిగే బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ బీసీ సంఘాలు ఆల్ పార్టీల ఆధ్వర్యంలో బషీరాబాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీసీ జేఏసీ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొన్నారుబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు తలపెట్టిన రేపటి తెలంగాణ బంద్ కార్యక్రమానికి అదిలాబాద్ భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పత్రిఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఖమ్మం: రేపు జరగబోయే బంద్కు సంపూర్ణ మద్దతు కోరుతూ డిప్యూటీ సీఎంకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నలమాస సుగుణ ఖమ్మం టౌన్ మహిళా అధ్యక్షురాలు గాజుల శ్రీదేవి ఖమ్మం టౌన్ అధ్యక్షుడు గద్దె వెంకటరామయ్య ఉపాధ్యక్షుడు అమృతం మల్లికార్జున్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
పిట్ట కొంచెం.. కూత ఘనం..! మూడున్నరేళ్ల వయస్సులోనే..
ఆ చిన్నారికి మూడున్నరేళ్లే.. అయినా టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అద్భుతంగా పాడుతోంది. ఆమె పాటలు వింటున్న గ్రామస్తులు చిన్నారిని అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లెకు చెందిన ఆవునూరి సంజీవ్, మౌనిక కూతురు వరుణవి. టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అలాగే పాడుతుండడంతో తల్లిదండ్రులు రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఓ ప్రైవేటు టీవీ నిర్వహించే ప్రోగ్రామ్కు ఆహ్వానించారు. ఆమె పాడిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సుమారు నాలుగు నెలలుగా ప్రోగ్రామంలో పాల్గొంటోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..)