స్కూల్ మైదానంలో పరిగెడుతూ కింద పడడంతో గొంతు కింద భాగంలో దిగిన పెన్సిల్
ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత
పెన్సిల్పై రక్తపు మరకలు లేకపోవడంతో తల్లిదండ్రుల అనుమానాలు
బాలుడి స్నేహితులు, పాఠశాల సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు
కూసుమంచి: ప్రమాదవశాత్తు కిందపడ్డ బాలుడి చేతిలోని పనునైన పెన్సిల్ గొంతు కిందభాగంలో దిగడంతో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంకు చెందిన మేడవరపు ఉపేంద్రాచారి – మౌనిక దంపతులకు కుమారుడు విహార్ (8), కుమార్తె వర్షిత సంతానం. విహార్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ, వర్షిత ఎల్కేజీ చదువుతున్నారు. రోజులాగే బుధవారం ఉదయం పిల్లలిద్దరూ బస్సులో పాఠశాలకు వెళ్లారు.
మధ్యాహ్నం మూత్రవిసర్జన కోసం విహార్ మిగతా విద్యార్థులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత పాఠశాల మైదానంలో పరుగెత్తుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అయితే బాలుడి చేతిలో పదునుగా చెక్కిన పెన్సిల్ ఉండటంతో బోల్తా పడగానే బాలుడి గొంతు కిందిభాగంలో అది దిగబడింది. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో విద్యార్థులు పైకి లేపి ఉపాధ్యాయులకు తెలిపారు.
కరస్పాండెంట్ నాగార్జున, ఉపాధ్యాయులు వచ్చి బాలుడిని తొలుత స్థానిక ఆర్ఎంపీ వద్దకు, అక్కడి నుంచి అంబులెన్స్లో ఖమ్మం తరలించే క్రమంలో ఊపిరి వదిలాడు. కాగా, ఉదయం ఆనందంగా ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఇంకాసేపట్లో వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా ప్రమాదం విషయం తెలియడంతో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. విహార్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
పెన్సిల్పై రక్తపు మరకలు లేవెందుకు?
కాగా, విహార్ చేతిలోని పెన్సిల్ గొంతులో గుచ్చుకోవడమే మృతికి కారణమని చెబుతున్నా.. పెన్సిల్కు రక్తపు మరకలు లేకపోవడంపై బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, బాలుడు బోల్తా పడినప్పుడు చేతిలోని పెన్సిల్ గొంతులో దిగిందని.. ఆ వెంటనే విహార్ స్నేహితులు కంగారుగా వెల్లకిలా తిప్పేలోగా పెన్సిల్ గొంతు నుంచి ఊడి కింద పడిందని చెప్పినట్లు తెలిసింది.
ఆ తర్వాతే గొంతు వద్ద గాయం నుంచి రక్తస్రావం మొదలైందని వెల్లడించారని సమాచారం. ఈ విషయమై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సైతం విహార్ స్నేహితులు, పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు.


