యాదగిరిగుట్ట రూరల్: నవ దంపతుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ శివారులో గురువారం అర్ధరాత్రి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారిపడి నవ దంపతులు కోరాడ సింహాచలం (25), కొంగరపు భవాని(19) మృతి చెందారు.
చనిపోవడానికి ముందు రైలు లో సింహాచలం, భవాని ఏదో విషయంపై గొడవ పడుతుండగా, తోటి ప్రయాణికులు తీసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో గొడవ జరిగిన తర్వాతే భార్యాభర్తలిద్దరూ రైలు నుంచి కిందపడిపోయారని తెలుస్తోంది. ముందుగా నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నారా.? లేదా భార్యను సముదాయిస్తున్న క్రమంలో ఇద్దరూ కలిసి జారి పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో ఎవరు చిత్రీకరించారనే దానిపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.


