breaking news
Opinion
-
బాధ్యత నిండిన భవిత కోసం...
కృత్రిమమేధ (ఏఐ) ప్రపంచాన్ని సమ్మోహపరుస్తోంది. దాని ప్రభావంతో మానవ జీవితంలోని ప్రతి పార్శ్వమూ రూపాంతరం చెందుతోంది. మానవాళికీ, అవనికీ మేలు చేకూర్చగల గొప్ప సామర్థ్యం దానికి ఉందనడంలో సందే హం లేదు. అయితే, అది చూపగల ప్రభా వాల గురించే తీవ్ర ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. ముఖ్యంగా చాలామంది ఉపాధి కోల్పోతారని, తప్పుడు సమా చారం పెరుగుతుందని చెబుతున్నారు. మానవాళికి ఏఐ గొప్ప మేలు చేసినదవుతుంది, లేదా భయంకరమైన శత్రువుగా పరిణమిస్తుందని నేను భావిస్తున్నాను. ఏఐకి మార్గదర్శక సూత్రాలు లేదా నియంత్రణలు తీసుకురావాలనే ప్రయత్నం ఊపందుకుంది. నేను ‘కరుణా పూరిత ఏఐ’ అనే కొత్త భావనను పరిచయం చేయాలనుకుంటు న్నాను. ఇది దయా గుణంలో ఏఐకి దారి చూపుతుంది. దానిగురించి మరింత వివరించే ముందు ఇపుడు ఎదురవుతున్న కొన్ని తీవ్రమైన సవాళ్ళు ఏమిటో చూద్దాం. ఏఐ విసురుతున్న సవాళ్ళు ఒకటి – భారీ ప్రయోజనాలు పణంగా ఉన్న రేసులో ఏఐ అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా పరిణమించింది. ఏఐ తెచ్చి పెట్టగల లాభాలు, అధికారం కోసం కొద్దిపాటి దేశాల మధ్య, దిగ్గజాల వంటి టెక్ కంపెనీలు, ప్రైవేటు సంస్థల మధ్య పోటీ మొద లైంది. సంపన్న దేశాలు, అభివృద్ధిలో ఇంకా అఆలు కూడా నేర్చు కోని దేశాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఏఐపై గుత్తాధిపత్యం సంపాదించినవాళ్ళు రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపైన కూడా అసా ధారణమైన పట్టును ప్రదర్శించ గలుగుతారు. రెండు – ఏఐ ఇక ఎంతమాత్రం సాంకేతిక సాధనం కాదు. అది తనకుతాను మార్గదర్శనం చేసుకుని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వయం ప్రతిపత్తిగల ఏజెంట్గా పరిణమిస్తోంది. ఇపు డున్న మానవ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏఐ సిస్టంలు సిద్ధమవుతున్నాయి. వీటిలో పక్షపాతపూరిత చారిత్రక కథ నాలు, భ్రమలు, విశ్వాసాలు, అభూత కల్పనలు, అసత్యాలు కూడా ఉన్నాయి. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఏఐ ఆటోమేటిక్గా సృష్టించగలదు. మోసపూరిత చర్యలకు వెసులుబాటు కల్పించ గలదు. విభేదాలను, విద్వేషాలను రెచ్చగొట్టగలదు. హింసకు కూడా ప్రేరేపించగలదు. మానవ సంభాషణలను ఏఐ సిస్టంలు తిమ్మిని బమ్మి చేయగలవు. బ్యాంకులను వంచించడం, డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ, ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతతో సహా ఏఐ సంబంధిత నేరాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మూడు – సమాజంపై సైకలాజికల్ ప్రభావం. ముఖ్యంగా ఏఐపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న యువత దాని ప్రభావా నికి లోనవుతున్నారు. భవిష్యత్తులో వచ్చే సూపర్ ఇంటెలిజెన్స్ ఊహించనలవికానిది. తల్లితండ్రులు, టీచర్లు, సహాధ్యాయులతో నామమాత్రపు చనువు, లేదా అసలేమీ పట్టనట్లుగా పెరిగే తరాన్ని ఊహించుకోండి. ఏఐ ప్రాథమిక రూపంపై ఆధారపడిన సోషల్ మీడియా ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతోందో ఇప్పటికే మనం గమనిస్తున్నాం. కౌమారంలో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు మానసిక వైకల్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒంటరితనం, మనోవ్యధ, ఆందోళనతో వారు సతమతమవుతున్నారు. నాలుగు – సహజంగానే మెషీన్ మెదడు మానవ మెదడు కన్నా చురుకుగా పనిచేస్తుంది. ఏఐ వల్ల లాభాలు ఉత్తేజపరచేవిగాను, వినోదపరచేవిగాను కనిపిస్తున్నప్పటికీ, ఎవరు ఎవరిని అంతిమంగా నియంత్రిస్తారనే తాత్త్విక ప్రశ్న తలెత్తుతోంది. సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, న్యాయం, పరిపాలనను కాపాడే నిర్ణయాలు ఎవరివవుతాయి? భావోద్రేకాలు, స్పందించే గుణం ఉన్న మానవ మెదళ్ళవా, లేక ఇతరుల బాధలను, కష్టాలను కనిపెట్టగల జీవశాస్త్ర సామర్థ్యం కొరవడిన కలనగణితాలవా? కరుణ ఆధారంగా...నైతికత, నియంత్రణలు ముఖ్యమే. కానీ, వాటికి పరిమి తు లున్నాయి. వాటిని సృష్టించేది, పర్యవేక్షించేది మనుషులే కదా! తన మార్గాన్ని నిర్ణయించుకోవడంలో మెషీన్ మెదడు యుక్తితో, వేగంతో వ్యవహరిస్తుంది. ఏఐ వెనుక ఉండే మానవ మనస్తత్త్వం మారకపోతే ఎటువంటి నియంత్రణనైనా అది పక్కన పెట్టి ముందుకు వెళ్ళి పోగలదు. కనుక, ఏఐ దిక్సూచి కరుణను ఆధారం చేసుకున్నదిగా ఉండాలి. కరుణను నేనొక విలువగానో, సద్గుణంగానో, బలహీ నమైన మనస్కుల నుంచి వ్యక్తమయ్యేదిగానో, లేదా నైతిక నైరూప్య ఆలోచనగానో చెప్పడం లేదు. ఇతరుల బాధను చూసి అలాంటి కష్టం తనకూ రావచ్చుననే జ్ఞానంతో, ఎదుటి వ్యక్తిని దాన్నుంచి బయటపడేయడానికి కార్యాచరణకు దిగాలని ప్రోత్సహించే శక్తిగా చూస్తున్నాను. న్యాయం, సమానత్వం, శాంతి, స్వావలంబనను ఏర్పరచడానికి అటువంటి చోదక శక్తి అత్యవసరం. మనసు లోపల ఉండే ఆర్ద్రతను కనిపెట్టవచ్చు. వ్యక్తులు,సంస్థలలో దానిని పెంపొందించవచ్చు. దీని నిమిత్తం మేమొక శాస్త్రీయ చట్రాన్ని అభివృద్ధి చేశాం. దానిని ‘సత్యార్థి కంప్యాషన్ కోషియంట్’గా పిలుస్తున్నారు. యుక్తితోనే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించగల భవిష్యత్తుకు అది తోడ్పడ గలదు. అందరూ పంచుకోవలసిన విలువలు, సంపద, బాధ్యత, జవాబు దారీతనంతో కూడిన ప్రపంచాన్ని అది స్వప్నిస్తోంది. ఏఐని సృజించే, అమలుపరచే, దాన్నుంచి లబ్ధి పొందేవారిలో మనం దయా గుణాన్ని ప్రోత్సహించాలి. కరుణలో చైతన్యం, అను సంధానమవడం, స్పందించడం, కార్యాచరణకు దిగడమనే నాలుగు కీలక కోణాలున్నాయి. మానవ, జీవావరణ సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆ నాలుగింటి గురించి ఏఐ అభివృద్ధిలో చొప్పించాలి. తొలు తటి ఆలోచన నుంచి తుది ఉత్పత్తి వరకు ఆ అంశాలను సమైక్య పరచాలి. సమస్య నిర్వచనం, వ్యూహం, డేటా సేకరణ, ఇంజనీరింగ్, మోడల్ డెవలప్మెంట్, మదింపు, పరీక్ష, డిప్లాయ్మెంట్, ఇంటెగ్రేషన్, నిర్వహణ... ఇలా అన్నింటిలోనూ ఆ నాలుగూ మమేక మవ్వాలి. ఈ విధానం కంప్యాషనేట్ ఏఐ అభివృద్ధికి దారి తీస్తుంది. టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లు, ప్రభుత్వాలతో సహా ఈ విభాగంలో పాత్రధారులైన అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాలి. ఉమ్మడి శ్రేయస్సును ప్రాధాన్యంగా ఎంచుకోవాలి. ఋగ్వేదం‘సంగచ్ఛధ్వవం, సంవదధ్వవమ్, సం వో మనాంసి జానతావ్ు’అంటుంది. మనందరం కలసి నడుద్దాం. ఉమ్మడి భాషను మాట్లాడు కుందాం. అందరి క్షేమం కోసం అందరం పంచుకునే విధంగా సమష్టిగా విజ్ఞానాన్ని సృష్టించుకుందాం అని దాని అర్థం.-వ్యాసకర్త నోబెల్ బహుమతి గ్రహీత-కైలాశ్ సత్యార్థి -
బహుళత్వ భావనకే గొడ్డలి పెట్టు
మన రాజ్యాంగ నిర్మాతలు జాతీయ గీతానికి ఏదో లాంఛనంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. భిన్నత్వాన్ని కనుమరుగు కానివ్వకుండానే ఏకత్వాన్ని చాటడానికి మన గణతంత్ర రాజ్యం ఉద్దేశపూర్వకంగానే ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎంచుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వు ఆ గీతానికి సంబంధించి ఇంతకాలం ఉన్న ప్రాధాన్యతా క్రమాన్ని మార్చేసింది. అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతానికి ముందు జాతీయ గేయమైన వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఆ ఆదేశం సారాంశం. పైగా ఆరు చరణాలను పూర్తిగా ఆలపించాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులో ఆదేశించింది. అధికారిక కార్యక్రమాలలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తే చాలునని రాజ్యాంగ పరిషత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆ విధంగా పక్కనపెట్టినట్లయింది. ఈ వైఖరి జాతీయ గీతానికి అగ్ర ప్రాధాన్యం కట్టబెట్టిన రాజ్యాంగ అధికరణం 51(ఎ)ని అగౌరవపరచడమే!రాజ్యాంగ హోదాల్లో తేడాజాతీయ చిహ్నాల వరుస క్రమాన్ని నిర్వచించడానికీ, జాతీయ గీతం స్థానాన్ని తెలుపడానికీ రాజ్యాంగ పరిషత్ ఎంతో యోచించి నిర్ణయం తీసుకుంది. దాన్ని 1950లో ఉద్దేశపూర్వకంగానే సుస్థిర పరచారు. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో జాతి జనులను ఉత్తేజపరచిన మూడు గీతాలను పరిశీలించి, రెండింటిని ఎంపిక చేసుకున్నారు: అవి: జనగణమన, వందేమాతరం, సారే జహా సే అచ్ఛా!‘వందేమాతరం’ గేయం బంకించంద్ర ఛటోపాధ్యాయ 1882లో రాసిన ‘ఆనందమఠ్’ నవలలోనిది. దాన్ని రవీంద్రనాథ్ టాగోర్ స్వర పరిచారు. అది స్వాతంత్య్ర సమరాన్ని ప్రస్తుతించే శక్తిమంతమైన గేయం. అయితే, లౌకికవాదం, సమాన పౌరసత్వం పట్ల గణతంత్ర రాజ్యానికి ఉన్న రాజ్యాంగపరమైన నిబద్ధతను దృష్టిలో పెట్టుకున్న రాజ్యాంగ పరిషత్, దానిలో ఉన్న ప్రాథమిక ఆందోళనను గుర్తించింది. ప్రారంభంలోని చరణాలు మాతృభూమిని స్థూలంగా పౌర పదాలతో ప్రార్థిస్తే, తరువాతి చరణాలు భరతమాతను హిందూ దేవతగా అభివర్ణించాయి. అన్ని మతాలకు చెందిన పౌరులూ సమాన మేనని ప్రతిన బూనిన దేశంలో, దేశ మాతను ఆ రకంగా రూపుకట్టించడం చాలా మందికి రాజీపడటం కష్టమైన అంశంగా తోచింది. దానికనుగుణంగా, రాజ్యాంగ పరిషత్ కూడా జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న తేడాను గుర్తించింది. రెండింటికీ రాజ్యాంగపరంగా వేర్వేరు హోదాలు కల్పించింది. ఆ తేడాను సాక్షాత్తూ రవీంద్రనాథ్ టాగోర్ కూడా గుర్తించారు. దాంతో రాజ్యాంగ పరిషత్ నూతన గణతంత్ర రాజ్య సమ్మిళిత భావనా పూర్ణతనూ, బహుళత్వాన్నీ పూర్తిగా నింపుకొన్న గీతా నికి ప్రత్యేక స్థానాన్ని పదిలపరుస్తూ, స్వాతంత్య్రోద్యమంలో భావో ద్రేక పాత్ర వహించిన వందేమాతరాన్ని తగు రీతిలో గౌరవించింది.సమైక్యపరిచే ‘గీతం’భారతదేశ సార్వభౌమాధికారాన్ని, బహుళత్వాన్ని పంచుకుంటున్న రాజ్యాంగ భవిష్యత్తును అనునిత్యం గుర్తు చేసేదిగా ఉన్నందున రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24న ‘జనగణమన’ను జాతీయ గీతంగా అధికారికంగా స్వీకరించింది. దానికి 52 సెకన్ల ఆలాపనను నిర్దేశించింది. భారత భాగ్యవిధాత అంటూ 1911లో స్వరపరచిన ఈ గీతాన్ని మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో కోల్కతాలో ఆలపించారు. ఒక్క చరణంలోనే భారత దేశాన్ని పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ,వంగ ప్రాంతాల సమ్మిశ్రితంగా పేర్కొంది. ఏక జాతీయతను డిమాండ్ చేయకుండానే అందరినీ ఆ తాను ముక్కలుగా పేర్కొంది. భారతీయ పాలితుడు ఆ విధంగా ఏకరూపతలో మిళితం అయి పోకుండానే, రాజకీయ భవితవ్యాన్ని పంచుకునేవాడు, బహుళ అస్తిత్వాలతో నివసించగల సామర్థ్యం ఉన్నవాడు. దేశ విభజన, మతపరమైన హింసాకాండ వేదనల నీడలో రాజ్యాంగ పరిషత్ చర్చలు జరుపవలసి వచ్చింది. భారత్ అధికా రికంగా లౌకిక పంథాను అనుసరించాలా లేక మెజారిటేరియన్ అస్తిత్వాన్ని సంతరించుకోవాలా అనే మీమాంస ఏర్పడింది. ఈ నేపథ్యంలో, జాతీయ గీతం ఎంపిక మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ విషయంలో రాజ్యాంగ నిర్ణేతల నిర్ణయం తాత్విక మైనదని కూడా చెప్పాలి. వారు సాంస్కృతిక మెజారిటేరియనిజం కన్నా పౌర జాతీయతనే ఎంచుకున్నారు. జాతీయ చిహ్నాలు సమైక్య పరచనూగలవు, మినహాయించనూగలవని వారికి తెలుసు. జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న ఈ తేడా అలంకారప్రాయమైనది కాదు. సారభూతమైనది. మెజారిటేరియన్ ప్రేరణలు లేదా సాంస్కృతిక ఏకరూపత కన్నా సమాన పౌరసత్వ భావననే రాజ్యాంగ చట్రం ప్రతిబింబించింది. రాజ్యాంగ దృక్పథమే ఆదర్శంఅనేక దేశాల జాతీయ గీతాలకూ, భారతదేశ జాతీయ గీతానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. చాలా జాతీయ గీతాలు సైనిక సమ రాన్ని లేదా విప్లవ హింసను ముందుంచుతాయి. కానీ ‘జనగణమన’ అలాంటిది కాదు. వివిధ ప్రాంతాలు, భాషా సమూహాల మధ్య ఐక్యతను ప్రబోధించేదిగా అది రూపొందింది. వైవిధ్య సహనశీలత రూపుదాల్చిన సమాఖ్య ప్రజాస్వామ్యానికి జాతీయ గీత నిర్మాణ రీతి అత్యంత అనువైనది. జాతీయ గీతంలోని పంక్తులు భారత రాజ్యాంగ సారాంశానికి అద్దం పడతాయి. ప్రస్తుత పాలనా యంత్రాంగం ఈ రాజ్యాంగ దృక్పథంతో తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు రాజ్యాంగపరమైన చిహ్నాలపై ప్రభావం చూపేవిగా ఉన్నాయి. వందేమాతరం గేయాన్ని మొదట ఆలపించాలనడం అలాంటిదే. జాతీయ గేయాన్ని కొన్ని పంక్తులకే పరిమితం చేయడానికీ, ఆ రెండింటి మధ్య వరుస క్రమాన్ని మొదట్లోనే నిర్ణయించడానికీ రాజ్యాంగ పరిషత్ను పురిగొల్పిన ఆందోళనను ఇది మళ్ళీ ముందుకు తెస్తోంది.చర్చ, అసమ్మతి, ఆలోచనల తర్వాతనే 1950లో రాజీ సూత్రం ఏర్పడింది. ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఆ సమతూకాన్ని అస్థిరపరచడం ప్రభుత్వ ధోరణిని, ఎన్నికల రాజకీయాల సమీక రణల కసరత్తును మాత్రమే వెల్లడిస్తుంది. ‘జనగణమన’ ఆలాపన సమయంలో మనం నిల్చుంటున్నామంటే దాని శ్రావ్యతకు ముగ్ధులై మాత్రమే కాదు; ఇండియా పట్ల రాజ్యాంగానికి ఉన్న ఆలోచన, ఈ దేశంలో నివసిస్తున్న అందరికీ రిపబ్లిక్ సమానంగా చెందుతుందనే భావనను గౌరవిస్తూ, దానితో ఏకీభవిస్తూ నిలుచుంటున్నాం. ప్రతీకాత్మకంగానైనా లేదా సారభూతంగానైనా ఆ భావనకు కోత పెట్టడం జాతీయ గీత విస్తృత దార్శనికతను భంగపరచడమే అవు తుంది. ... జయ జయ జయ జయహే!జోయా హసన్వ్యాసకర్త జేఎన్యూలో ‘సెంటర్ ఫర్ పొలిటకల్ స్టడీస్’ ప్రొఫెసర్ ఎమిరిటా (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వంగ దేశం హసించునా?
బంగ్లాదేశ్ రాజకీయాలు సుస్థిరంగా, ప్రజాస్వామికంగా మారి, ఆ దేశం అభివృద్ధి మార్గంలో ప్రయాణించే పరిస్థితులు ఏర్పడితే, అది బంగ్లాదేశ్ ప్రజలకే గాక దక్షిణాసియా అంతటికీ సంతోషించదగ్గ విషయమవుతుంది. అక్కడ రెండేళ్ల కిందటి జెన్–జీ ఉద్యమంతో ఆరంభించి, గత వారం వెలువడిన ఎన్నికల ఫలితాల వరకు గల పరిణామాలన్నింటిని సమీక్షించినప్పుడు, ఆ వర్ధమాన దేశం ఒక కొత్త మలుపు తీసుకోగల అవకాశాలైతే స్థూలమైన దృష్టికి కనిపిస్తున్నాయి. ‘దిగంబర’ ఉద్యమం55 ఏళ్ల చరిత్ర గల బంగ్లాదేశ్లో ఒక సరికొత్త స్థితి రెండేళ్ల నాటి జెన్–జీ ఉద్యమంతో మొదలైంది. అంతకుముందు అంతా కుట్రలు, సైనిక నియంతృత్వాలు, అప్రజాస్వామికతలే. ప్రజలు మాత్రం వెనుకబాటుతనంలో, అవినీతి, అణచివేతలో మగ్గిపోతూ వచ్చారు. భౌగోళిక రాజకీయ వ్యూహాలలో ఒక కీలక స్థానంలో ఉన్న ఆ ప్రాంతం పెద్దవారి క్రీడలకు రంగస్థలమైంది. ఇదంతా ఇపుడు రాత్రికి రాత్రి మారిపోయి నవోదయమవుతుందని కాదు. కానీ, జెన్–జీ ఉద్యమ పరిణామాలు బంగ్లాదేశ్ సమాజానికీ, రాజకీయాలకూ ఒక గట్టి కుదుపును ఇచ్చాయన్నది గుర్తించాలి. ఆ ఉద్యమం స్వయంగా ఒక ప్రత్యామ్నాయ వేదికను సృష్టించకపోవచ్చు, కకా వికలమై మరెవరితోనో కలిసి కేవలం ఆరు సీట్లే గెలిచి ఉండవచ్చు. కానీ చరిత్ర పరిణామాలను సవ్యంగా అర్థం చేసుకునేందుకు గీటు రాళ్లు అవి కావు. ఒక పోలిక చెప్పాలంటే – బంగ్లాదేశ్ జెన్–జీ ఉద్యమ ప్రభావం రాజకీయాలలో, సమాజంలో ‘దిగంబర కవిత్వం’ కవిత్వం వంటిది. కుళ్లిన గతంపై తిరుగుబాటు చేసి కుదిపి వేసి, సరి కొత్త పరిణామాలకు దారులు తెరవటం వంటిది. ఆ చారిత్రక పాత్రను నిర్వర్తించిన వెనుక దిగంబర కవిత మిగలలేదు. ఇపుడు జెన్–జీ మిగలలేదు.ఆరు రంగాల్లో సంస్కరణలుకానీ, 55 సంవత్సరాల బంగ్లాదేశ్లో ఒక పరిస్థితి ఏర్పడినట్ల యితే కనిపిస్తున్నది. క్రమంగా ఏదైనా జరగవచ్చు గాక! ప్రస్తుతాని కైతే ఒక ఆశాభావం ఏర్పడుతున్నది. అందుకు నిర్దిష్టమైన కార ణాలూ ఉన్నాయి. ఉద్యమం దరిమిలా సైన్యం అధికారాన్ని చేజిక్కించుకోవటం గాక, ఉద్యమకారుల అభీష్టం మేరకు ఒక తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. భవిష్యత్తులో ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడినా అనుసరించటం కోసం 6 రంగాలలో సంస్క రణల కోసం కమిషన్లు ఏర్పడ్డాయి. అవి ఎన్నికల సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సంస్కరణలు, పాలనా సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, అవినీతి నిరోధక సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు. వీటిపై సిఫారసులన్నింటినీ ‘జాతీయ ఏకీభావ కమిషన్’ పరిధిలోకి తెచ్చి దేశంలోని మొత్తం 33 చిన్నా పెద్దా పార్టీలు, కూటములతో చర్చించి 84 సిఫారసులతో సుదీర్ఘమైన నివేదికను ప్రకటించారు. ఏ సిఫారసును ఎవరు ఆమోదించారు, ఎవరు కాదన్నారు అనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. అంతిమంగా ఆమోదం పొందినందున వాటన్నింటినీ రాజ్యాంగ సవరణ ఆ మేరకు జరిగిన వెనుక కొత్త ప్రభుత్వం అమలుపరచవలసి ఉంటుందన్నారు. ‘జూలై ఛార్టర్’ పేరిట ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఆరు విధాలైన సంస్కరణలపై చర్చల క్రమంలో ప్రధాన పార్టీలైన బంగ్లా దేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లామీ కూడా పాల్గొని అన్నింటినీ ఆమోదించటం గమనించదగ్గది. గత వారం పార్లమెంటుకు జరిగిన ఎన్నికలతో పాటు ఈ ‘ఛార్టర్’పై కూడా జరిగిన రెఫరెండంలో 60 శాతానికి పైగా అనుకూలత లభించింది.అందుకు కట్టుబడి ఉన్నట్లు కొత్త ప్రధాని తారిఖ్ రహమాన్తో పాటు, జమాత్ నాయకుడైన ప్రతిపక్ష నాయకుడు షఫీఖుర్ రహమాన్ పునరుద్ఘాటించటం గమనించదగ్గది. మునుముందు ఆచరణ ఎట్లుండగలదన్నది వేచి చూడవలసిన విషయమే అయినా, అసలు ఒక ఉద్యమాన్ని పురస్కరించుకుని ఇన్ని విధాలైన సంస్కరణ కమి షన్లు, వాటిపై అన్ని పార్టీలతో చర్చల ద్వారా ఎన్నికలకు ముందే ఏకీభావ సాధన అన్నదే దానికదిగా ఒక అద్భుతమైన విషయం. దీనంతటికీ తగినట్లు, బంగ్లాదేశ్లో ఎన్నికలు 17 సంవత్సరాల తర్వాత పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగినట్లు అక్కడి యువత, ప్రజలతో పాటు అంతర్జాతీయ పరిశీలకులంతా ప్రకటించటం విశేషం. తాము గెలిచినా, ఓడినా ఫలితాలను అంగీకరించగలమని బీఎన్పీ, జమాతే పార్టీలు రెండూ ఎన్నికలకు ముందే ప్రకటించాయి. విజయోత్సవాలు వద్దని బీఎన్పీ నాయకత్వం, ఓటమిపై నిరసన ప్రదర్శనలు వద్దని జమాతే నాయకత్వం నిర్ణయించటం వంటివి మనం ఇటీవలి సంవత్సరాలలో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ దేశాలలో ఎక్కడా చూడనిది.సమాన సత్సంబంధాలుకొత్త నాయకత్వం ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 14వ తేదీ నాటి మొదటి మీడియా సమావేశంలో అంతర్గత విధానాల గురించి, విదేశాలతో సంబంధాల విషయమై కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. అంతర్గతంగా ఆర్థికాభివృద్ధి, మెరుగైన పాలన, ఉద్యోగ కల్పన, అవినీతి నియంత్రణ, ప్రజాస్వామిక విధానాలు, అన్ని మతాల పట్ల సమాన దృష్టితో సహా జూలై ఛార్టర్లోని అంశాలకు కట్టుబడి ఉండటం తమ ప్రాధాన్యాలని ప్రకటించింది. అభివృద్ధి, ఉద్యోగ కల్పన జరిగితే మతతత్త్వ ధోరణులు అవే బలహీన పడ తాయని పరోక్షంగా జమాతేను ఉద్దేశించి ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది. పై స్థాయిలో అవినీతిని అరికడితే కింది వరకు ఆ సూచనలు పోగలవన్నది మరొక ముఖ్యమైన సూచన. ఇండియా, చైనా, పాకిస్తాన్, అమెరికా సహా అన్ని దేశాలతో సమానమైన సత్సంబంధాలు తమ విధానమని తారిఖ్ రహమాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ కొత్తమలుపు తిరిగేందుకు తప్పనిసరి అయిన, సరైన విధానం అదే కూడా! ఈ అవసరాన్ని ఇతరులు కూడా గుర్తెరిగి సహకరిస్తే బంగ్లాదేశ్తో పాటు మొత్తం దక్షిణాసియాకు మేలు కలుగుతుంది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వారి త్యాగాలకు ఇదా విలువ?
ఏ వ్యవస్థను ఎక్కువ విశ్వసిస్తారని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే... సాయుధ దళాలు అగ్ర భాగాన నిలుస్తాయి. వరద జలాలలో వంతెనలు నిర్మించడం, మైనస్ ఉష్ణోగ్రతలలో సరిహద్దులను కాపలా కాయడం నుంచి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ సిందూర్ వరకు సైన్యం అందించే సేవలు వెల కట్టలేనివి. వారు విధి నిర్వహణలో రక్తాన్ని, చెమటను, కన్నీటిని చిందించవలసి ఉంటుంది. మనం మన సైనికుల గౌరవాన్ని ఎంతగానో కాపాడు తున్నట్లు చెప్పుకుంటాం. నిజంగా వారిని అంత నెత్తిన పెట్టుకుంటున్నామా? అదే నిజమైతే, 2026 బడ్జెట్ ప్రతిపాదనలలో కొన్నింటిపై మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సర్వీసు కాలం పూర్తయ్యేంత వరకు సేవలందించిన, అవయవాలను కోల్పోయిన సైనికులకు ఇచ్చే పెన్షన్పై పన్ను విధించే ప్రతిపాదన సబబేనా? సైనిక వికలాంగులపై పన్నా?సాయుధ దళాలకు ఇస్తున్న అంగవైకల్య పింఛను మొత్తాలు 1922 నుంచి పన్ను మినహాయింపు పొందుతున్నాయి. ఈ మినహా యింపును పరిమితం చేసే విధంగా ఆదాయ పన్ను చట్టాలకు సవరణ తీసుకురానున్నట్లు 2026 ఫైనాన్స్ బిల్లు పేర్కొంది. అవయవాలు కోల్పోయిన కారణంగా విధుల నుంచి పూర్తిగా వైదొలగవలసి వచ్చిన సైనికులకు మాత్రమే ఆ మినహాయింపును వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శరీరంలో ఏ అవయ వాన్ని అయినా కోల్పోయినా, విధులలో కొనసాగగల శక్తి సామర్థ్యా లున్నాయని మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుని సర్వీసులో కొనసాగి రిటైరైనవారికి ఇచ్చే పెన్షనుకు ఆ మినహాయింపు వర్తించదు. వారు ఒక చెయ్యి లేదా కన్ను లేదా కాలు కోల్పోయినా పన్ను పడుతుంది. సర్వీసులో కొనసాగగల అర్హత లేనంతగా గాయపడిన వారు మాత్రం మినహాయింపు పొందగలుగుతారు. క్షతగాత్రులైన సైనికులను దయాదాక్షిణ్యాలపైన బతుకుతున్న వారిగా చూడకూడదు. వారు కూడా ఇంచుమించుగా అనన్య సామాన్యమైన శౌర్యవంతులే. తమకు కలిగిన గాయానికి భయపడ కుండా, దాని నుంచి మరింత శక్తిని, స్ఫూర్తిని కూడదీసుకుని తమకు అప్పగించిన విధులకు అంకితమవడం నిజానికి ప్రశంసించవలసిన విషయం.ముగ్గురు వీరుల ముచ్చటఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా 1971 యుద్ధంలో మనకు విజయాన్ని అందించారు. పాకిస్తాన్ సైన్యం లొంగుబాటు బాట పట్టేటట్లు చేసి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి తోడ్పడ్డారు. ఇంతవరకు మనకున్న ఇద్దరు ఫీల్డ్ మార్షళ్ళలో ఆయనొకరు. వృత్తి జీవితం ఆరంభంలోనే గాయపడిన చరిత్ర సామ్కు ఉంది. 1942 సిట్టాంగ్ యుద్ధంలో తన పటాలాన్ని జపాన్ సేనలకు వ్యతిరేకంగా నడిపిస్తూ బులెట్ల బారినపడ్డారు. ఆయన కడుపు, పేగులలోకి తొమ్మిది బుల్లెట్లు దూసుకుపోయాయి. ఎంత తీవ్రంగా గాయపడ్డారంటే, శస్త్ర చికిత్స చేసేందుకు సర్జన్ కూడా సంశయించారు. పైగా ‘ఒక కంచర గాడిద తన్నింది’ అంటూ సామ్ దాని గురించి హాస్యస్ఫోరకంగా చెప్పుకున్నారు. మేజర్ జనరల్ ఇయాన్ కార్డొజో అనుభవం కూడా తక్కువ దేమీ కాదు. సామ్ నేతృత్వం వహించిన 1971 యుద్ధంలో కార్డొజో కూడా పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్ అధికారి అయిన కార్డొజో అప్పటి తూర్పు పాకిస్తాన్లో భాగమైన సిల్హెట్లో మందుపాతర పేలుడులో తన కుడి కాలును కోల్పోయారు. ఆయన ఆ సంఘటనను ఎలా ఎదుర్కొన్నారో రోమాంచితమైన రీతిలో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎముకలు కనిపించే విధంగా మాంసం ముక్కలు కాలు నుంచి కిందపడితే ఆయన తన పిడిబాకును బయటకు తీయించి ఛిద్రమైన ఆ భాగాన్ని తెగ్గొట్టవలసిందిగా కింది సిబ్బందిని ఆదేశించారు. ఆ అసాధారణ సైనికుడు మొదట ఒక బెటాలియన్కి, ఆ తర్వాత బ్రిగేడ్కి నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఒక అవయవాన్ని కోల్పోయిన అధికారి ఆ స్థాయిని అందుకోవడం అదే మొదటిసారి. ఒక కాలు లేకపోయినా, మంచులో నడుస్తూ కొండలపైకి ఎక్క గలననీ, చెప్పిన పనులు చేయగలననీ ఆయన పై అధికారులను ఒప్పించి చేసి చూపించగలిగారు. గాయం వల్ల డెస్కు పనులకే పరిమితమయ్యేందుకు తిరస్కరించారు. చివరగా, లెఫ్టినెంట్ జనరల్ విజయ్ ఒబెరాయ్ గురించి చెప్పు కుందాం. దేశంలో అత్యధిక పతకాలను అందుకున్న అధికారులలో ఆయనొకరు. భారత్–పాకిస్తాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో ఆయన కూడా కుడి కాలు కోల్పోయారు. అయినా, మరో నాలుగు దశాబ్దాలపాటు సైన్యానికి సేవలందించగలిగారు. కృత్రిమ కాలుతో మారథాన్లలో కూడా పాల్గొన్నారు. అవయవాలు కోల్పోయిన సైనికులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టే విధంగా ‘వార్ ఊండెడ్ ఫౌండేషన్’ను నెలకొల్పారు. ఆయన భారత సైన్య ఉప ప్రధానాధికారి స్థాయి వరకు ఎదిగారు. జీవన సంధ్యలో ఏదీ భరోసా?ఆదర్శంగా తీసుకోవలసిన జాతీయ హీరోల గాథలవి. అలాంటివారు చాలామంది ఉన్నారు. అటువంటి వీరుల డిజెబిలిటీ పెన్షన్పై పన్ను విధించడం సమంజసమా? అదీ వారి జీవన సంధ్యలో, ఆర్థిక భద్రత అత్యంత అవసరమైన కాలంలో పన్ను ప్రతిపాదన తీసుకురావడం ఎంతవరకు సముచితం? ధైర్య సాహసాలకుగానూ ఇటీవల వాయు సేనా మెడల్ అందుకున్న కార్పొరల్ వరుణ్ కుమార్ను దేశం కొనియాడింది. ఆపరేషన్ సిందూర్లో శత్రు క్షిపణి దాడిలో ఆయన తన కుడి చేతిని కోల్పోయారు. ఆయన చెరగని చిరునవ్వుతో తన ఎడమ చేయితోనే వైమానిక దళ ప్రధానాధికారికి శాల్యూట్ చేసిన ఫొటో ఎవరి హృదయాలనైనా కదిలిస్తుంది.నౌకా, వైమానిక, సైనిక దళాలకు చెందిన 10,000–12,000 మంది డిజెబిలిటీ పెన్షన్లు అందుకుంటున్నారని డేటా సూచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై పడిపోయే ఖర్చు కూడా పెద్దగా ఏమీ లేదు. జనరల్ మాలిక్ చెప్పినట్లుగా పెద్ద మొత్తాల ఖర్చులను గాలి కొదిలేసి, చిన్న మొత్తాల ఖర్చులను లెక్కలోకి తీసుకోవడం వివేకం అనిపించుకోదు. అసలిది ఖర్చుల కోణం నుంచి చూడవలసిన అంశం కాదు. ఒక సైనికుడి గౌరవ పరిరక్షణకు సంబంధించినది. దీని కోసం చర్చలు జరుపవలసిన లేదా పోరాడవలసిన అవసం ఏ సైనికుడికీ రాకూడదు. ఈ పన్ను ప్రతిపాదనను కేంద్రం పునః పరిశీలించి తీరాలి. బర్ఖా దత్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎదగడానికి నాలుగు ట్రిక్కులు!
వృత్తిపరమైన ఐంద్రజాలికులు వాస్తవంగా ఉన్నవి నాలుగు రకాల ట్రిక్కులేనని చెబుతారు. అవి: ఒక రూపాన్ని మన కళ్ళకు కట్టించడం; దేన్నయినా అదృశ్యం చేయడం; రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం; చివరగా ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం. ఈ నాలుగింటినీ జీవితానికి అన్వయించుకుంటే మనమూ ఎదుటివారిని ఆశ్చర్యచకితులను చేయగలం. ఎలాగంటారా... మొదటి ట్రిక్కు: మన ఉనికిని చాటుకోవడమంటే, భౌతికంగా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు; మనల్ని మనం అత్యుత్తమమైన రీతిలో ప్రదర్శించుకోవడం! మనం ఊసరవెల్లి లాంటివాళ్ళం. తల్లితండ్రుల ముందు ఒకలా, స్నేహితుల వద్ద మరోలా ప్రవర్తిస్తాం. కానీ, ఈ బాహ్యమైన నేను కాకుండా ‘లోపల మరో నేను’ ఉంటాడు. మన అసలు స్వరూపం అదే! మనకు ఇష్టమైన వ్యాపకంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరింపజేసేది వాడే! మనం అరమరికలు లేకుండా ఎవరి వద్ద వ్యవహరించగలమో, ఎవరు మన ‘లోపలి మనిషి’ని అభినందించగలుగుతారో అలాంటి వాళ్ళ వద్దనే ఆ ‘లోపలి మనిషి’ బయటపడతాడు. మిషిగన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, బోస్టన్లో మొదటి ఉద్యోగంలో చేరాను. అక్కడి బాస్ నన్ను తీర్చిదిద్దుతానన్నాడు. నేనెంతో సంతోషపడ్డాను. తీరా, నేను ఉద్యోగంలో చేరేందుకు వెళ్ళేటప్పటికి, ఆయన కాస్తా ఉద్యోగం వదలి వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది అనుకున్నాను.తిరస్కరణతో... జీవితం తలకిందులవదు!‘‘ఈ ఏడాది ఏం చేయబోతున్నానో ‘నాకు లోపల’ తెలిసి పోతోంది. నా కష్టాలు, కన్నీళ్ళతోనే ఓ నవల రాస్తా’’నని నా స్నేహి తురాలితో చెప్పాను. అందుకామె నవ్వలేదు. ‘బ్రహ్మాండం. అదే పనిలో ఉండు’ అంది. ఆమె నా లోపలి మనిషిని గుర్తించి అతడి సత్తాపై నమ్మకం ఉంచిందన్నమాట. అలా వెన్ను తట్టేవారు మన అమ్మ, నాన్న, తాత, బామ్మ ఎవరైనా కావచ్చు. అటువంటి బేషరతు మద్దతు లభించినపుడు మనలోని నిజమైన సామర్థ్యం బయటకు వస్తుంది. అందుకని, ఇపుడు మీ స్నేహితులను అంటిపెట్టుకుని ఉండండి. వారి ప్రేమ, నమ్మకం ముందుకు నడిపిస్తాయి. నేనా పుస్తకాన్ని పూర్తి చేసి, ప్రచురణకు అభ్యర్థిస్తూ పంపిస్తే, ప్రచురించలేమంటూ 24 ఉత్తరాలొచ్చాయి. ప్రచురణకర్తలు ఉన్నది 20 మందే! అంటే, కొందరు రెండుసార్లు తిరస్కరించారన్నమాట. వాళ్లకు ఆ పుస్తకం నచ్చకపోతే మరో పుస్తకం రాస్తానని అను కున్నాను. అదీ నచ్చకపోతే ఇంకోటి రాస్తానని ధైర్యం చెప్పు కున్నాను. ఆ తదుపరి పుస్తకం ప్రచురణకు నోచుకుంది. భయాన్ని బలంగా మలచుకోండి!మనం అదృశ్యం చేయాల్సింది భయాన్ని! ఇదే రెండో ట్రిక్కు. హైస్కూలులో ఉండగా, ఓ చోట ఐస్క్రీమ్ అందించే ఉద్యోగం చేశాను. ఒకావిడ వచ్చి ఐస్క్రీమ్ ఆర్డరు చేసింది. ఒక్క క్షణంలో ఇస్తానన్నాను. ఈ క్షణంలోనే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. కానీ నేను బెదిరిపోలేదు. దాంతో ఈ దిక్కుమాలిన షాపులో జీవితాంతం గడుపుతావంటూ తిట్టిపోసింది. నిజం ఒప్పుకొని తీరాలి. నేను కలవరపడిన మాట వాస్తవం. కానీ, ఆ మహిళ నాలో రేకెత్తించిన భయం నాలో కసిని పెంచింది. కనుక, భయాన్ని పారదోలండి. భయం ఏదో చెరుపు చేస్తుందని కాదు. భయాన్ని ప్రేరణగా తీసుకుని ప్రయోజనం పొందే ప్రయత్నం చేయండి. ఒకరు తక్కువ అంచనా వేసినంత మాత్రాన కుంగిపోనవసరం లేదు. నిశ్శబ్దంగానే మీ విషయంలో వారి అంచనాలు తప్పు అని నిరూపించండి. దయాగుణంతో విప్లవం తేవచ్చు!రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం ఇంద్ర జాలంలో మూడవ ట్రిక్కు అనుకున్నాం కదా! ఇక్కడ సహానుభూతి గురించి చెప్పుకోవాలి. ఇతరుల కష్టాలను వారి దృక్కోణం నుంచి చూడటం అలవరచుకోవాలి. నాకు 13 ఏళ్ళపుడు మా నాన్న ఉద్యోగం పోయింది. దాంతో మేం బ్రూక్లిన్ నుంచి మయామీకి మకాం మార్చాం. అక్కడ మా తాత, నాయనమ్మ ఉన్నారు. అమ్మ, నాన్న, చెల్లి, నేను, ఆ పెద్దవాళ్ళు కలిసి మొత్తం ఆరుగురం కొన్ని నెలలపాటు సింగిల్ బెడ్రూమ్ అపార్టుమెంట్లోనే తలదాచు కున్నాం. ఇంతమంది ఏమిటంటూ కొందరు గొడవకు దిగారు. పొరుగునే ఉన్న మరో వాటా ఆవిడ తాను అపార్టుమెంటును ఖాళీ చేస్తున్నాననీ, పెద్దవాళ్ళు ఇద్దరూ అందులో ఉండ వచ్చనీ చెప్పి అనునయించింది. కాకతాళీయంగా ఆవిడ పేరు మెర్సీ. ఔను! పేరుకు తగ్గట్లు దయచూపిన మహాత్మురాలు. ఈ నిరాశావాద ప్రపంచంలో సిసలైన దయాగుణం గాయాలను మాన్పుతుంది. క్రూరంగా వ్యవహరించడం, విషం కక్కడం, అభిప్రా యాలతో ఏకీభవించనివారి పట్ల కరకుగా ప్రవర్తించడం మన సంస్కృతిలో భాగాలైపోయాయి. కానీ, క్రూరత్వం బలానికి రుజువు కాదు. బాధపడుతున్నవారి స్థానంలోకి మనం వెళ్ళ గలిగితే అది బలం అనిపించుకుంటుంది. ఇక్కడున్నవారిలో కొందరికి రకరకాల కష్టాలు ఉండ వచ్చు. నేటి గ్రాడ్యుయేట్లలో మా అబ్బాయి కూడా ఉన్నాడు. మా అమ్మ, నాన్న ఉండి ఉంటే, ఈ కార్యక్రమాన్ని చూసి ఎంత సంతోషించేవారో అని నాకూ అనిపిస్తోంది. జీవితంలో మున్ముందు మీకెదురయ్యే ప్రతి వ్యక్తీ మీకు పైకి కనిపించని సమస్యతో సతమత మవుతూ ఉండవచ్చు. వారి స్థానంలోకి వెళ్లి వారి గురించి ఆలోచించండి. ప్రపంచానికి మరింత సహానుభూతి, మరింత వినయ విధేయతలు, ముఖ్యంగా మానవ మర్యాదలను కనబరచడం అవసరం. మీరు నిజంగా ప్రపచాన్ని నివ్వెరపరచదలచుకుంటే, మీలోని దయా గుణాన్ని బయటకు తీయండి. మార్పు చెందుతూనే ఉండాలి!ఇంద్రజాలంలో చివరి ట్రిక్కు– ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం! అన్ని ట్రిక్కుల కన్నా ఇదే కష్టమైనది. రూపాంతరం చెందడం. చిన్నప్పుడు మనం రకరకాల రూపాలను ఇష్టపడినా, పెద్ద యిన తర్వాత, ఒక మూసలో ఒదిగిపోయేందుకు మొగ్గు చూపుతాం. ప్రపంచం పట్ల, మీపట్ల మీకొక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. కానీ, మారకపోతే మకిలిపట్టిపోతాం. ఆశలు, ఆశయాలను సమయానుకూలంగా సవరించుకోవడంలో తప్పు లేదు. మనల్ని మించినవారు లేరనుకుంటే పప్పులో కాలేసినట్లే. తమ ఆలోచనా ధోరణిని తామే ప్రశ్నించుకుని, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని భావించే లక్షణాన్ని నేను కొందరు అత్యంత ప్రజ్ఞావంతులలో గమనించాను. నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మారాలి. అన్నీ తెలిసిపోయాయని ఎన్నడూ అనుకోకండి. అవకాశాలు అనంతంగా ఉంటాయి. వాటిని అందుకునేందుకు సిద్ధ పడాలి అంతే! ఎక్కడెక్కడ మీ ప్రతిభా నైపుణ్యాలను కనబరచడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ అన్వేషించండి. ఒకటే మార్గంలో పయనించాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఒక్కొక్క నైపుణ్యాన్ని ఒక్కొక్కచోట ఉపయోగించుకోవచ్చు. -
దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఈ ఏడాది ఆదిలోనే హంస పాదు ఎదురైంది. శ్రీహరికోట నుంచి జనవరి 12న ప్రయోగించిన పోలార్ ఉప గ్రహ వాహక నౌక (పీఎస్ఎల్వీ) విఫలమైంది. ఈ వాహక నౌక వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు, మన దేశానికి చెందిన ఒక వ్యూహాత్మక ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉంది. మిగిలిన అంతరిక్ష పరిశోధనా సంస్థల మాదిరిగానే ఇస్రో కూడా గతంలో కొన్ని వైఫల్యాలను చవి చూసింది. కానీ, కొన్ని సందర్భాల్లో అంతరిక్ష ప్రయోగాలు ఆందోళనను రేకెత్తిస్తాయి. లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన, నిశితంగా సమీక్షించుకోవలసిన అవసరాన్ని చాటుతాయి. తాజా వైఫల్యం పలు కారణాల రీత్యా ఆ కోవకు చెందినదే!పరుగెత్తని పంచకల్యాణిపీఎస్ఎల్వీకి 63 సార్లు విజయం సాధించిన ఘన చరిత్ర ఉంది. చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయాలు దాని ఖాతాలోకే వస్తాయి. దాన్ని తమ పంచకల్యాణి గుర్రంగా ఇస్రో చెప్పుకొంటుంది. ఒకటి రెండు వైఫల్యాలు లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేనివిగానే కనిపించవచ్చు. కానీ, పీఎస్ఎల్వీకి ఇది వరుసగా రెండో వైఫల్యం. గతేడాది మే 18న ప్రయోగించిన దానికి కూడా ఇదే గతి పట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ రాకెట్ మూడవ దశలోనే లోపం తలెత్తింది. గత (2025) ప్రహసనం ఆధారంగా ఈసారి ఏమైనా మార్పులు చేసిందీ లేనిదీ ఇస్రో వెల్లడించలేదు. వైఫల్యాలను కూలంకషంగా విశ్లేషించుకునే బలమైన వ్యవస్థ ఇస్రోకు ఉంది. దీనికి 2021లో జియో ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ) వైఫల్యంపై వెల్లడైన నివేదికే ఉదాహరణ. క్రయోజనిక్ దశ జ్వలన సమయంలో దిగువ లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంకులో పీడనం, ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ సక్రమంగా పనిచేయక పోవడానికి కారణమైందనీ, ఫలితంగా మొత్తం మిషన్ విఫలమైందనీ ఆ ఉదంతంలో తేల్చారు. కానీ, 2025 మే నాటి వైఫల్యం గురించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. పారదర్శకంగా వ్యవహరించడంలో ఇస్రోకు మంచి చరిత్రే ఉంది. అది ఆ బాట నుంచి వైదొలగుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఉపగ్రహాలకే ఎదురుదెబ్బవరుసగా రెండు పీఎస్ఎల్వీ వైఫల్యాలతోపాటు, గతేడాది కాలంలో, ఇస్రో మరో వైఫల్యపు అపఖ్యాతిని కూడా మూట గట్టుకుంది. కానీ, అది రాకెట్ వైఫల్యం కాదు. ఉపగ్రహ వైఫల్యం! ఇస్రో 2025 జనవరి 29న చేపట్టిన జీఎస్ఎల్వీ ప్రయోగంతో శ్రీహరికోట నుంచి వంద సార్లు ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును సృష్టించింది. ఆ వాహక నౌక ప్రయోగానంతరం, అది ఎన్విఎస్–02 నావిగేషన్ ఉపగ్రహాన్ని దానికి ఉద్దేశించిన ట్రాన్స్ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించింది. అయితే, ఆన్బోర్డ్ థ్రస్టర్లను జ్వలింప జేసేందుకు ఆక్సిడైజర్కు వీలు కల్పించే కవాటాలు తెరుచుకోని కారణంగా, నిర్ణయించిన స్లాట్లో ఉపగ్రహం కుదురుకోలేక పోయిందని చెప్పింది. ఏడాది కాలంలో మూడు వైఫల్యాలు ఎదురవడం అటు ఇస్రోకు గానీ, ఇటు దాని దేశ, విదేశీ కస్టమర్లకు గానీ తీవ్ర పర్యవసానాలనే కలుగ జేస్తోంది. పైగా, ఈ వైఫల్యాల కారణంగా కోల్పోయిన మూడు భారతీయ ఉపగ్రహాలు కీలకమైన సైనిక ఉపగ్రహాలు. ఆశించిన కక్ష్యలో కుదురు కోలేకపోయిన ఎన్విఎస్–02 ఒక నేవి గేషన్ ఉపగ్రహం. అది స్టాండర్డ్ పొజి షనింగ్ సర్వీసులతో పాటు, ‘రిస్ట్రిక్ టెడ్ సర్వీసులను’ కూడా సమకూరు స్తుంది. గతేడాది వైఫల్యంతో ఇఓఎస్– 09 ఉపగ్రహాన్ని కోల్పోయాం. ఆపరేషనల్ అప్లికేషన్లలో ఉన్న ఏజన్సీలకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించేట్లుగా దాన్ని డిజైన్ చేశారు. దానిలో సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఇమేజ్లను సమకూర్చగల సామర్థ్యం ఆ పేలోడ్కు ఉంది. రక్షణ పరిశోధన ఏజన్సీలు అభివృద్ధి చేసిన ఇఓఎస్ –ఎన్1 (అన్వేషగా పిలుస్తున్నారు) భూ పరిశీలనా ఉపగ్రహాన్ని ఈ జనవరిలో ప్రయోగించిన పోలార్ వాహక నౌకలో అమర్చారు. అంతరిక్షం నుంచి సైన్యానికి ఉపయోగపడగలిగిన మూడు వ్యూహాత్మక ఆస్తులను కోల్పోవడం అంతరిక్ష, రక్షణ ఏజన్సీలకు మేలుకొలుపు కావాలి. అంతరిక్షం నుంచి సైన్యం ప్రయోజనాలను తీర్చగలిగిన దాదాపు 52 ఉపగ్రహాలను వచ్చే ఐదేళ్ళలో ప్రయోగించాలని బెంగళూరులోని డిఫెన్స్ స్పేస్ ఏజన్సీ ప్రణాళికలతో ఉంది. అంతరిక్ష ఆధారిత నిఘా (ఎస్బిఎస్) ప్రాజెక్టు 3వ దశ కింద వాటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఉపగ్రహాలను తయారు చేసినా, ప్రైవేటు కంపెనీల ద్వారా పొందినా, వాటిని అంతరిక్షంలోకి చేర్చవలసిన బాధ్యత ఇస్రోపైనే ఉంటుంది. వాణిజ్య నష్టం అపారంఈ నెలలో వెళ్ళిన వాహక నౌక ఇఓఎస్–ఎన్1తో పాటు దేశ, విదేశీ కస్ట మర్లకు చెందిన 15 ఉపగ్రహాలను మోసు కెళ్ళింది. వాటిలో ‘ధ్రువ స్పేస్’కు చెందిన ఐదు ఉపగ్రహాలున్నాయి. ఆ ఐదింటిలో నేపాల్ది ఒకటి. బ్రెజిల్కు చెందిన ఆల్టో స్పేస్కు చెందిన మరో ఐదు ఉపగ్రహాలున్నాయి. బ్రిటన్–థాయి లాండ్ సంయుక్త ఉపగ్రహంతోపాటు, భారతీయ కస్టమర్లకు చెందిన మరో రెండు చిన్న ఇతర ఉపగ్రహాలు, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ చేయూతతో స్పెయిన్ కంపెనీ తయారు చేసిన ‘కిడ్’ ఉపగ్రహం కూడా ఉంది. ధ్రువతోపాటు ఇతర భారతీయ అంకుర సంస్థలు పీఎస్ఎల్వీ పైనే ఆశ పెట్టుకున్నాయి. అవి పెద్ద మొత్తంలో నగదుతోపాటు విలువైన కాలాన్ని, అవ కాశాన్ని కూడా కోల్పోయినట్లు లెక్క. ఉప గ్రహాల సైజును బట్టి వాటిని తయారు చేసేందుకు కంపెనీలకు కొద్ది నెలల నుంచి కొద్ది ఏళ్ళు పట్టవచ్చు. కోల్పో యినవాటి స్థానంలో అవి కొత్త వాటిని వేగంగా తయారు చేసుకున్నా, పీఎస్ ఎల్వీలో చోటు కోసం అవి చాలాకాలం ఎదురుచూడక తప్పదు. దీనికితోడు, రాకెట్ విశ్వసనీయత దెబ్బ తినడం వల్ల బీమా ఖర్చులు పెరుగుతాయి. అది తిరిగి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుంది. వరుసగా రెండు వైఫల్యాల నేపథ్యంలో, భవిష్యత్ పీఎస్ఎల్వీ ప్రయోగాలను సమీక్షించుకోవడం ఇస్రోకు తక్షణ కర్తవ్యంగా మారు తోంది. ఈ ఏడాది మరికొన్ని ఇతర ప్రయోగాలు నిర్వహించవలసి ఉంది. ముఖ్యంగా గగన్యాన్ కార్యక్రమం కింద సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష నౌకను కక్ష్యలో తిప్పనున్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను పంపడంపై జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాం. ఈ స్థితిలో ఇస్రోపై బృహత్తర బాధ్యత పడుతోంది. అది టెక్నికల్, క్వాలిటీ, మేనేజీరియల్ ప్రక్రియలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాలి. విశ్వసనీయమైనదని ఉన్న పేరును కాపాడుకునేందుకు అదొక్కటే మార్గం! దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
అప్పులే ఆధారమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 2026 –27 బడ్జెట్లో రెవెన్యూ – వ్యయం మధ్య అధిక వ్యత్యాసం, మూలధన కల్పన తక్కువగా ఉండటం; ఆరోగ్యం, సామాజిక సేవలకు వనరుల కేటా యింపు తక్కువగా ఉండటం; రుణాలు, కేంద్ర సహాయంపై అధి కంగా ఆధారపడటం; సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమయిన చర్యలు లోపించడం కారణంగా సంతులనం లోపించింది. రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలో వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, మరోవైపు రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు కారణంగా ప్రాధాన్యతా రంగా లపై పెట్టుబడి తగ్గుతుంది. తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి క్షీణించడంతో పాటు ప్రభుత్వానికి రుణ భారం పెరిగి అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయం తగ్గుతుంది. కొరవడిన ఆర్థిక క్రమశిక్షణ2024 జూన్ తర్వాతి కాలంలో ప్రభుత్వం రుణాలపై అధికంగా ఆధార పడటం, రెవెన్యూ సమీకరణలో నిర్మాణా త్మక బలహీనతలు, వ్యయ యాజమాన్యంలో విఫలమవ డాన్ని సూచిస్తున్నది. పన్నేతర రాబడిలో తగ్గుదల, మూలధన వ్యయం తగ్గుదల, కమిటెడ్ వ్యయం (వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు)లో పెరుగుదలను ఇటీవలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టపరుస్తున్నది. కాగ్ గణాంకాల ప్రకారం, 2025 –26 ఆర్థిక సంవత్సరంలో 2025 నవంబర్ నాటికి రెవెన్యూ లోటు రూ. 54,355 కోట్లకు చేరు కుంది. 2026–27 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ. 3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం 77.1 శాతం కాగా, మూలధన వ్యయం 16.2 శాతం. మూలధన వ్యయాన్ని 2025–26 బడ్జెట్లో రూ. 40,636 కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుత 2026–27 బడ్జె ట్లో రూ. 53,915 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా రుణా లపై ఆధారపడినట్లయితే భవిష్యత్తు బడ్జెట్లలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులపై వెచ్చించవలసి ఉంటుంది. తద్వారా నూతన మూలధన ప్రాజెక్టులు, సంక్షేమంపై వ్యయం తగ్గుతుంది. రాష్ట్ర మొత్తం రుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 మధ్య కాలంలో రూ. 2,61,302 కోట్ల నుండి రూ. 4,85,491 కోట్లకు చేరు కోగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల కాలం నాటికి (మార్చి 2025) ఈ మొత్తం రూ. 6,62,557 కోట్లకు చేరుకుందని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు పార్ల మెంటులో ప్రస్తావనకు రావడం జరిగింది. 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సగటున రూ. 31,000 కోట్లను మూల ధన వ్యయానికి కేటాయించింది. కోవిడ్–19 సమయంలో రెవెన్యూ రాబడి తగ్గినప్పటికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కొని ఒకవైపు సంక్షేమంపై వ్యయాన్ని పెంచుతూ మరోవైపు దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మూలధన పెట్టు బడులను పెంచగలిగి, ఆర్థిక క్రమశిక్షణను పాటించడాన్ని గమనించాలి. మానవాభివృద్ధి, రైతుల సంక్షేమం, హౌసింగ్, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాలకు 2019–24లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో జీఎస్ డీపీ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది.మరోవైపు రుణాలవృద్ధిలోనూ తగ్గుదలను గమనించవచ్చు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతల క్రమంలో పేదరిక స్థాయి 2015–16లో 11.77 శాతం నుండి 2023 నాటికి 4.2 శాతానికి తగ్గింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంతో పోల్చినప్పుడు 2026 –27లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటులో తగ్గుదలను ప్రతిపాదించినప్పటికీ రెవెన్యూ రాబడిలో తగ్గుదల కారణంగా తిరిగి బడ్జెట్ లోటులు పెరిగే అవకాశం ఉంది. రుణాలపై, కేంద్ర గ్రాంట్లపై అధికంగా ఆధారపడటం వలన స్వయం నిరంతర ఆదాయ వృద్ధి ప్రశార్థకంగా కన్పిస్తున్నది.ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, వివిధ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ, ‘ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం’ నియమావళిని పాటిస్తూ, పన్నేతర రాబడిని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాల అమలు లక్ష్యాన్ని సాధించడం, తప్పనిసరి వ్యయానికి సంబంధించి కాలానుగుణంగా సమీక్ష, అధిక వడ్డీతో కూడిన స్వల్పకాల రుణాల తగ్గింపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు కృషి చేయాలి.-వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి), ఇక్ఫాయ్ -ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
సభ్యుల మధ్య లోపిస్తున్న సమాచారం
లోక్సభలో బడ్జెట్పై చర్చను అడ్డుకున్న వ్యవహారం సద్దుమణగింది. కానీ, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాపై ప్రతిపక్షాలు అవి శ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో పాలక, ప్రతిపక్షాల మధ్య మరో ఘర్షణాయుత అంకానికి తెర లేచింది. సభా వ్యవహారాలలో తమకు తగినంత సమయం ఇవ్వలేదని ప్రస్తుత సమావేశాల పొడవునా ప్రతిపక్షాలు స్పీకర్ బిర్లాపై ఆగ్రహంగా ఉన్నాయి. మాజీ ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలను చర్చకు పెట్టాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రచురణకు ఇంకా ఆమోదం తెలుపవలసి ఉంది. ప్రచురణకర్తలు అనుమతి కోరుతూ పుస్తక ప్రతిని రక్షణ శాఖకు పంపినట్లు జనరల్ నరవణె వెల్లడించారు. రాహుల్ ఆ పుస్తకం హార్డ్ కాపీని పార్లమెంట్ ఆవరణలో చూపించారు. పుస్తకం సాఫ్ట్ కాపీలు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవు తున్నాయి. ప్రచురణకు ఆమోద ముద్ర కోసం ఎదురు చూస్తున్న పుస్తకం ఇంటర్నెట్లో ఎలా అందుబాటులోకి వచ్చిందంటూ దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎంతవరకు రాయొచ్చు?ప్రచురణకు అనుమతి పొందని పుస్తకంలోని అంశాలను ఎలా లేవనెత్తుతారన్న వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. అది సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ, 2020లో తూర్పు లద్దాఖ్లో భారత–చైనా సైనికుల మధ్య ఘర్షణలకు సంబంధించి నరవణె ఏం రాసిఉంటారో ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వం పెదవి విప్పక పోవడం వల్ల ఈ అంశంపై దాని అభిప్రాయం ఏమిటో తెలుసు కోకుండానే, సర్క్యులేషన్లో ఉన్న అంశాలను ఆధారం చేసుకుని చాలా మంది ఒక నిర్ధారణకు వచ్చేసే ప్రమాదం ఉంది. జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చేటపుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. సీనియర్ పదవులను నిర్వహించిన సైనిక, పౌర అధికారులు రహస్య విషయాలను బయటకు పొక్కించే ఉబలా టాన్ని వదులుకోవడం మంచిది. తాము సర్వీసులో ఉన్నపుడు రాజ కీయ నాయకత్వంతో జరిపిన మాటామంతీ నమ్మకం పునాదిగా సాగి ఉంటుందనే సంగతిని వారు గుర్తెరగాలి. దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని భావించినపుడు ఆ చర్చల వివరాలను రాయకపోవడం వారికి గౌరవ ప్రదమే కాదు, పాటించవలసిన విధి కూడా. సర్వీసులో ఉన్నపుడు, రిటైరైన తర్వాత కూడా ఏది ఎంత వరకు చెప్పాలో అంతవరకు చెప్పడమే విధాయకం. నాయకులు పొరపాటు చేశారని లేదా తమ నమ్మకాన్ని వమ్ము చేశారని ఈ అధి కారులు భావించినా, ఆ నమ్మకానికి గండి కొట్టే విధంగా వ్యవహరించే లగ్జరీ లేదా స్వేచ్ఛ (రిటైరైన తర్వాత కూడా) వారికి ఉండదు. సీనియర్ సైనిక, పౌర అధికారులు తమకు అప్పగించిన పను లకు తమ బాధ్యతల పరిధి లోపలే వారు భాష్యం చెప్పాల్సిఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని తమ విచక్షణకు విడిచిపెట్టినపుడు తమ సైనిక బాధ్యతలకు పరిమితమై మాత్రమే వారు వాటికి భాష్యం చెప్పాలి తప్ప, వాటిని దౌత్య, రాజకీయపరమైన పరిధి వరకు తీసుకెళ్ళకూడదు. రాజకీయ నాయకత్వం దేశ ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని, దౌత్య, రాజకీయ పరమైన అంశాలను పరి గణనలోకి తీసుకుని, అటువంటి సందర్భాలలో తమకు ఆ విచక్ష ణాధి కారాలు కల్పించిందని సైనిక నాయకులు గ్రహించాలి. కొరవడిన సంభాషణభిన్న రాజకీయ పార్టీల మధ్య తగినంత కమ్యూనికేషన్ లోపించిన వెలితిని లోక్ సభలో ఇటీవలి ప్రతిష్టంభన, తదనంతరం ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెల్లడిస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై పాలక, ప్రతిపక్ష నాయకులు ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునే వారని మాజీ సివిల్ సర్వెంట్ల అనుభవాలను చదివితే తెలుస్తుంది. దౌత్యపరంగా ఏదైనా ఒక పెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్న పుడు లేదా దేశం హఠాత్తుగా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్పుడు ప్రభుత్వ నేతలు ప్రతిపక్ష నాయకులకు పరిస్థితిని వివరించిన సందర్భాలు దౌత్యవేత్తగా గడిపిన వృత్తి జీవితంలో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతమాత్రాన ఆ యా అంశాలపై ఆ యా పార్టీల వైఖ రులు కానీ, రాజకీయ గతులు కానీ మారిపోవు. కానీ, ఆ యాఅంశాలపై ఎదురవుతున్న సవాళ్ళు, అవకాశాలకు సంబంధించి రాజకీయంలోని అన్ని వర్గాలవారికి ఒక అవగాహన కల్పించినట్లు అయ్యేది. భిన్న స్రవంతులకు చెందిననాయకులు కొన్ని సందర్భా లలో నేరుగా మాట్లాడుకునేవారు. ఒక్కోసారి వారు నమ్మినబంట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు.నేడు పాలక, ప్రతిపక్ష నాయకులు వైషమ్యాలు, కోపతాపాలు, దూషణలతో కూడిన దాడులకు దిగడం చూస్తూంటే, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ నెరపుకునే ఆ సంప్రదాయం లోపించిందని లేదాఉండవలసినంతగా లేదని తేటతెల్లమవుతోంది. గోప్యంగా వివరించొచ్చు!నరవణె పుస్తకంలోని అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించి నపుడు, ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకున్న ఎటువంటి చర్చకు తాము అనుమతించలేమని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఆ పుస్తక ప్రచు రణకు అనుమతించకపోవడానికి గల కారణాలను తాము విడిగా వివరించగలమని తెలిపి ఉండాల్సింది. పుస్తకంలో ఉన్నదని చెబు తున్న ఉదంతంతో సహా, తూర్పు లద్దాఖ్ ఘటనల పూర్వాపరాల గురించి గోప్యంగా వివరించి ఉండవచ్చు. రాజకీయ నాయకులందరూ దేశ ప్రయోజనాలకు అంకితమై ఉన్నవారేనన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పవలసి వస్తోంది. వేటిని వెల్లడించవచ్చు వేటిని రహస్యంగా ఉంచాలనే వివేచన వారందరికీ ఉండి ఉంటుంది. మాజీ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ హయాంలో విదేశీ వ్యవహారాలపై స్థాయీ సంఘం సమావేశంలో జరిగిన ఓ ఘటనను చెబుతాను. వేటిపై చర్చించవచ్చునో, వేటిని చర్చించకూడదో రాజకీయ తర గతికి తెలుసునని ఆ సంఘటన నిరూపించింది.అఫ్గానిస్తాన్లో ‘నార్తర్న్ అలయన్స్’కు భారత్ చేస్తున్న సాయం గురించి అప్పటి విదేశాంగ కార్యదర్శి కె. రఘునాథ్ను లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన సూటిగా జవాబివ్వకుండా అరకొర మాటలతో దాట వేస్తు న్నారు. సభ్యులు అసహనానికి లోనవడంతో, గుజ్రాల్ జోక్యం చేసు కుని, విదేశాంగ శాఖ ఏం చేస్తున్నదీ తనకు తెలుసునని, చర్చనుఅంతటితో ముగించారు. ఏ సభ్యుడూ ఇక నిరసన తెలుపలేదు. -వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-వివేక్ కాట్జూ -
చైనాను బెదరగొడితే చాలు!
ప్రపంచం దృష్టి వెనిజులా, గ్రీన్ల్యాండ్, ఇరాన్ పరిణామాలపై కేంద్రీకృతం అయి ఉండటంతో, అమెరికన్లు మళ్లీ మళ్లీ ప్రక టిస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహం చర్చకు రావటం లేదు. ఈ వ్యూహంలో భారత దేశాన్ని కూడా భాగంగా చేసి చూపుతున్నందున, మౌలికంగా ఆ వ్యూహం ఏమిటో తెలుసుకోవటం అవసరం. ఆ వ్యూహం ఏమిటో తెలిసేందుకు మూడు డాక్యుమెంట్లను చూడవలసి ఉంటుంది: ఒకటి – 2022 ఫిబ్రవరిలో అప్పటి డెమోక్రటిక్ బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’. రెండు – 2025 నవంబర్లో ప్రస్తుత రిపబ్లికన్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’. మూడు – ఇదే ప్రభుత్వం 2026 జనవరిలో, అనగా గత నెలలో ప్రకటించిన ‘నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ’. వీటన్నింటిలో ఇండో–పసిఫిక్ గురించిన సారాంశం ఈ విధంగా ఉంది. ప్రపంచ వాణిజ్యానికే అతిపెద్ద, అత్యంత క్రియా శీలమైన మార్కెట్ ప్రాంతం ఇది. కనుక అమెరికా భద్రత, స్వేచ్ఛ, సౌభాగ్యాలపై చాలా ప్రభావం చూపుతుంది.చైనా సవాల్ఈ ప్రకటనతో ఆరంభించిన అమెరికా వ్యూహం, తమ ప్రయోజనాల పరిరక్షణకు అక్కడ ఏమేమి చేయాలన్న విషయమై చాలానే చెప్పింది: పశ్చిమార్ధ భూగోళాన్ని మన్రో, డోన్రో డాక్ట్రిన్లను అనుసరించి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాము. పశ్చిమాసి యాలో ప్రయోజనాలు ఇజ్రాయెల్ ద్వారా నెరవేరుతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ సహచరులే గనుక, వారు తమ రక్షణ వ్యయాన్ని మాత్రం పెంచి తమతో నిలబడితే సరిపోతుంది. ఆర్కిటిక్కు సంబంధించి గ్రీన్ల్యాండ్ను ఏదో ఒక విధంగా అధీనంలోకి తెచ్చుకుంటే ఆ సమస్య తీరుతుంది. ఉక్రెయిన్ యుద్ధం తేలిపోతే రష్యాతో పేచీ ఉండదు. పైగా అది ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే. ఆ విధంగా ఇక మిగిలేది ఇండో–పసిఫిక్ ఒక్కటే!ఇండో–పసిఫిక్ మాత్రమే మిగిలి ఉండటం ఎందుకంటే చైనా కారణంగా. మరొక విధంగా చెప్పాలంటే, మొత్తం ప్రపంచపు భౌగోళిక వ్యూహంలోనే అమెరికాకు మిగిలి ఉండగల సమస్య చైనా అన్నమాట. వేరెవరో అనవలసిన అవసరం లేకుండా, వ్యూహ పత్రా లలో అమెరికన్ ప్రభుత్వాలే అరమరికలు లేకుండా చెప్పాయి. చైనా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికంగానే గాక సైనిక బలం రీత్యా కూడా ఎదిగి ఇపుడు తమకు పోటీదారుగా మారిందన్నాయి. ఒత్తిడిలో అమెరికాఈ స్థితిని ఎదుర్కోవటం ఎట్లాగన్నది ప్రశ్న. మరొక మాటలో చెప్పాలంటే ఈ స్థితిని ఎదుర్కొని అమెరికా అగ్రస్థానాన్ని పదిలపర చుకోవటం, చైనాను ఇంతకుమించి ముందుకు రానివ్వక పోవటం అన్నమాట. రాగల కాలంలో అమెరికన్ వ్యూహాల కేంద్రీకరణ అంతా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉంటుందన్నది స్పష్టం. వాస్తవా నికి ఈ ఆలోచనలు కొత్తవి కావు. పశ్చిమాసియాలో ఎదురు దెబ్బల తర్వాత డెమోక్రటిక్ అధ్యక్షుడు ఒబామా(2009–17), ఇక తమ దృష్టి అటునుంచి ఆసియాకు మారాలని ప్రతిపాదించారు. బైడెన్ (2021–25) పైన పేర్కొన్న ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’ని ప్రకటించారు. చైనాపై వాణిజ్య, పారిశ్రామిక యుద్ధాలను ట్రంప్ శక్తి మేర సాగించారు. అమెరికా ప్రయోజనాల కోసం ఇండో–పసిఫిక్ విధాన మన్నది డెమోక్రటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాల రెండింటి ఉమ్మడి సంప్రదాయం అయింది.తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఏ వ్యూహ పత్రమూ ప్రకటించని ట్రంప్ ఇపుడు ఏడాదిలోనే రెండు పత్రాలు తేవటం గమనించదగ్గది. పదేళ్ల క్రితంతో పోల్చితే అమెరికా బలహీన పడగా, చైనా బలపడింది. అమెరికాపై పలు విధాలైన ఒత్తిళ్లు పెరుగు తున్నాయి. చైనాను కట్టడి చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా చూసినట్లయితే వారికి వేర్వేరు దేశాల నుంచి ఇంధనంతో సహా వనరుల సేకరణకు, మార్కెట్లకు, పెట్టుబడులకు ఆటంకాలు కల్పించాలి. వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని, ఇంతవరకు వలె గాక రాగల కాలంలో తమ అభివృద్ధిని వేగవంతం చేయాలి. సైన్స్, టెక్నాలజీ ఆధునికీకరణలు, వాటి ఆధారంగా ఆధునిక ఉత్ప త్తులు భవిష్యత్తుకు కీలకం అయినందున, ఆ రంగాలలో చైనా పురో గతి ఒక సవాలుగా మారినందున... ఆ విషయమై మరింత దృష్టి పెట్టాలి.ఎన్ని వ్యూహాలు?సైనిక విషయాలకు వస్తే వ్యూహ పత్రాలు ఒక సూత్రాన్ని పదే పదే పేర్కొనటం గమనించదగ్గది. అది– చైనాను కట్టడి చేయటమైతే తప్పనిసరి. కానీ యుద్ధం ద్వారా కాదు. ఒక బెదురు అన్నది సృష్టించి నిలువరించటం ద్వారా! బెదురును సృష్టించటం ఏ విధంగా? ఒకటి– ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని తమ సైనిక స్థావ రాలను (66 అని అంచనా) శక్తిమంతం చేయటం. రెండు– అక్కడి తమ కూటమి దేశాల సైన్యాలను బలోపేతం చేయటం. వారు తమ రక్షణ వ్యయాలను పెంచటం. మూడు– ఒకే చైనా విధానాన్ని కొన సాగిస్తూనే, తైవాన్ను తమ రక్షణ వ్యూహం కోసం ఉపయోగించు కోవటం. నాలుగు– జపాన్ నుంచి బోర్నియో వరకు వరుసగా గల మొదటి వరుస దీవులను (ఫస్ట్ ఐలాండ్ ఛెయిన్) దాటి చైనా యుద్ధ నౌకలు పసిఫిక్లోకి రాకుండా అడ్డుగోడ వంటిది తయారు చేయటం అన్నది వ్యూహం. దీనంతటి అమలు కోసమే ఇండియాతో కూడిన ‘క్వాడ్’ను 2017లో క్రియాశీలం చేసి, 2021లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో కలిసి ‘ఆకస్’ తదితర సంస్థలు ఏర్పాటు చేశారు.ట్రంప్ వ్యూహ పత్రాలలో ఆసక్తికరమైన అంశం ఒకటి కనిపి స్తుంది. దాని ప్రకారం, చైనా అభివృద్ధికి వారు వ్యతిరేకం కాదు. కానీ అమెరికా అగ్రస్థానానికి మాత్రం చైనా సవాలు కారాదు. ఇందు కోసం ఇండో–పసిఫిక్లోని అన్ని దేశాలనూ రకరకాల పేర్లతో ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహాల అమలుకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఇండో–పసిఫిక్లోనూ అనేక దేశాలు అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగపడేందుకు సిద్ధంగా లేక బహుళ ధ్రువ ఆలోచనలు, అమెరికా–చైనా మధ్య సమతుల్యతల పాటింపు వంటివి చేస్తున్నాయి. ఇండియా కూడా ఈ కోవలోకే వస్తుంది. ట్రంప్ బుల్డోజరిజం కెనడా, యూరప్లలోనే వ్యతిరేకతను ఎదు ర్కొంటూ, ఆ దేశాలు చైనాతో వరుస ఒప్పందాలు చేసు కోవటం ఇందుకు అద్దం పడుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిందలతో సవాళ్లు సమసిపోవు!
పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ యోధులు జన వరి 31న బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచ్ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్ (24)గా బీఎల్ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్ దేశీయాంగ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.బుగతీ హత్యతో మరో తిరుగుబాటునఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్ ప్రాంతం పాక్లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్ పైపులైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ ఖాన్ బుగతీని అప్పటి పాక్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్ ఖేర్ బకష్ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. వనరులు బలూచిస్తాన్వి అయినా...అక్బర్ ఖాన్ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. పాక్ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్ ఇపుడు ట్రంప్కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. మారిన పోరాట పంథాబలూచ్ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.బీఎల్ఏకు 2018 నుంచి బషీర్ జెబ్ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కు అల్లా నాజర్ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో జెబ్ డిప్లొమా చేయగా, నాజర్ వృత్తి రీత్యా డాక్టర్. వీరి నేతృత్వంలో బలూచ్ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్ఏ చెప్పుకొంది. నేటి సోషల్ మీడియా యుగంలో జెబ్, నాజర్ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.దాడులతో భంగపడిన సైన్యం బలూచ్ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మూలాన్ని గుర్తించని జెన్–జీ ఉద్యమాలు?
బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో జెన్–జీ ఉద్యమాలు జరిగి, అక్కడి ప్రభు త్వాలు కూలిపోవడం తెలిసినదే. ఈ ఆందోళనలకు ప్రేరణ ఆ యా సమాజా లలో పెరిగిపోతోన్న నిరుద్యోగం, ధరలు, అవినీతి వంటి అంశాలే. ఈ రెండు దేశాలు త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతు న్నాయి. సరికొత్త రాజకీయ ‘అవతారం’ ఎత్తిన పాత రాజకీయ పక్షాలు కానీ... ప్రస్తుతం రాజకీయ రూపం సంతరించుకున్న జెన్–జీ ఉద్యమ కారులు కానీ సమస్యల పరిష్కారం కోసం ముందుకు తెస్తోన్న క్రొంగొత్త, సృజనాత్మక అజెండా మాత్రం ఏమీ లేదు! ఈ పోరాటాల వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, ఇవి ఆవేశకావేశాల ప్రాతిపదికన సాగాయే తప్ప, స్పష్టమైన కార్యాచరణతో జరిగినవి కావు. నేపాల్, బంగ్లాదేశ్లలోనే కాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నిరు ద్యోగ సంక్షోభానికి జవాబు వెతకడం కష్టంగా మారుతోంది.ప్రస్తుత నిరుద్యోగ విలయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది– 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడి ఉపాధి కల్పన కుంటుపడింది. రెండోది– దశాబ్దాలుగా సాగుతున్న సాంకేతిక పురోగతి నేడు పరాకాష్టకు చేరింది. మానవ శారీరక శ్రమను రోబోలు ఆక్రమిస్తుంటే, మేధా శ్రమ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కైవసం చేసు కుంటోంది. ఫలితంగా బ్లూ కాలర్, వైట్ కాలర్ రంగాల్లో మనిషికి స్థానం లేకుండా పోతోంది. ఉదాహరణకు, అమెజాన్ సంస్థలో 30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించనున్నారు. దీనికి కారణం ఆ కంపెనీ ఒక ఉద్యోగస్థుడికి సాలీనా సగటున 36 వేల డాలర్ల వేతనం చెల్లించవలసి ఉంటే... అదే స్థానంలో మర మనిషిని (రోబో) పెట్టుకుంటే అయ్యే ఖర్చు 3,600 డాలర్లు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తన సంస్థకు సంబంధించిన కొత్త కోడ్ను గూగుల్ 2025 నాటికి 30% మేరకు రాయగలుగు తోంది. అంటే, ఆ మేరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోతలు అనివార్యమన్నమాట. వ్యవస్థ ఇక కొత్త ఉద్యోగాలను ఇవ్వలేదని గ్రహించిన బిల్గేట్స్ వంటి వారు ‘సార్వజనీన కనీస ఆదాయం’ (యూబీఐ) వంటి ప్రతిపాదనలు తెస్తున్నారు. అంటే, పెరిగిపోతున్న నిరుద్యోగుల తిరుగుబాట్లను అడ్డుకోవడానికి ప్రజల ఖాతాల్లో కొంత నిరుద్యోగ భృతి జమ చేసి వ్యవస్థను కాపాడుకోవాలనేది వారి ఎత్తుగడ. ఈ స్థితిని 180 ఏళ్ల క్రితమే కారల్ మార్క్స్ తన ‘కమ్యూనిస్ట్ ప్రణా ళిక’లో అంచనా వేశారు. ‘...ఒక వర్గాన్ని పీడించాలంటే ఆ పీడిత వర్గం తన బానిస బతుకును కొనసాగించడానికైనా హామీ ఇవ్వాలి... కానీ, ఈనాటి బూర్జువా వర్గ ఆధిపత్యం కింద, ఈనాటి పారిశ్రామిక క్రమంలో ఆధునిక శ్రామికుడు ఎదగడం మాట అటుంచి, నానాటికీ అడుగుకి పోతున్నాడు... కార్మికుడు బుక్కాపకీరుగా మారుతున్నాడు. తన బానిసకు బానిస బతుకునైనా నమ్మకంగా చూపించగల సత్తా దానికి (వ్యవస్థకు) లేదు. తన బానిస శ్రమ మీద బతకాల్సిన వర్గం అది. కానీ, ఆ పరిస్థితి మారి ఆ బానిసే దాని బిచ్చం (పైన పేర్కొన్న సార్వజనీన కనీస ఆదాయం) మీద ఆధారపడాల్సి వస్తే అటువంట ప్పుడు బూర్జువా వర్గం కింద సమాజం ఇక ఎంతమాత్రమూ బతక లేదు. కాబట్టి (ఆ) వర్గ పతనం తప్పదు. కార్మిక వర్గ విజయమూ తప్పదు.’ అదీ విషయం. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ దాని పరిణామక్రమంలో మార్క్స్ చెప్పిన పై దశను చేరుకుంది. ప్రస్తుత వ్యవస్థలో నిర్జీవమైన పెట్టుబడి (డబ్బు), సజీవమైన మనుషులపై పెత్తనం చేస్తోంది. నిన్నటి ఉత్పత్తి సాధనాలే నేడు విధ్వంసక శక్తులుగా మారుతున్నాయి. ఈ వ్యవస్థాగత లోపాలను గుర్తించకుండా చేసే ఏ ఉద్యమమైనా నిష్ప్రయోజనమే! కమ్యూనిజా నికి కాలం చెల్లిందన్న ప్రచారపు బూజును తలల నుంచి దులుపుకొని ఆ సిద్ధాంతపు వెలుగులో సమకాలీన సమస్యలను చూడగలిగితేనే మరో ప్రపంచానికీ, మానవాళి మహోదయానికీ దారులను అన్వేషించగలం.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు -
రైతుల పాలిట పిడుగుపాటు
షేక్స్పియర్ నాటకంలోలాగా, ఎవరి మాటలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో తెలియని సంకటం. ‘అమెరికన్ రైతులకు మేలు చేసే విధంగా’ ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు ట్రంప్కు అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ కృతజ్ఞతలు తెలి పారు. సున్నిత అంశాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు తగు రక్షణ కల్పి స్తూనే అమెరికాతో ‘చారిత్రక’ ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు మోదీని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఒప్పందంలోని వివరాలు పూర్తిగా వెల్లడైన తర్వాతనే, అది రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాలకు ఉభయ తారకమైనదా లేక బెదిరింపు ధోరణితో మెడలు వంచి ఒప్పిస్తున్నదా అన్నది తేలుతుంది. కానీ, ఇంతవరకు బహిర్గతమైన వివరాలే రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముంచెత్తితే ప్రమాదమే!దేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే దయనీయ స్థితిలో ఉంది. ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా 30–40 శాతం తక్కువ ధరకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఈ స్థితిలో భారత మార్కెట్లోకి ద్వారాలు తెరిస్తే... హెచ్చు సబ్సిడీలు పొందు తున్న, చౌకైన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యవసాయ వనరుల నిర్వహణ (2020) సర్వే ప్రకారం, అమెరికన్ రైతులు ఏటా భారీ సబ్సిడీలు పొందుతున్నారు. అక్కడి రైతుకు ఏటా సగటున 66,314 డాలర్ల సబ్సిడీ లభిస్తున్నట్లు అంచనా. ఆ సబ్సిడీలు మార్కెట్లోని హెచ్చుతగ్గుల నుంచి అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయి. రైతులకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ (ఎఫ్బీయే) కింద ఎకరాకు వస్తు చెల్లింపుల కింద మొత్తం 12 బిలియన్ డాలర్లను సమకూర్చాలని అమెరికన్ ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ఆ పథ కాన్ని ‘ఒక పెద్ద అందమైన బిల్లు’గా అభివర్ణిస్తున్నారు. అయితే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకా లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. నాన్–ట్యారిఫ్ ప్రతిబంధకాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. రైతుల నిరసన హెచ్చరికలురైతుల ప్రయోజనాలను జాగ్రత్తగా ‘సంరక్షించిన’ తర్వాతనే ఒప్పందం కుదిరిందని మన వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రయోజనాలకు భంగం వాటిల్లదనే హామీలు వెలువడుతున్నా ఇది రైతుల్లో సందిగ్ధాన్ని సృష్టిస్తోంది. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేస్తే, ఆహార పదార్థాలు దేశంలోకి కుప్పతెప్పలుగా వచ్చిపడతాయని 2020–21లో న్యూఢిల్లీ చుట్టుపక్కల రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన సంయుక్త్ కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది. 2020–21 తరహాలోనే కొత్తగా నిరసనలకు దిగుతామని అది బెదిరిస్తోంది. భారతీయ రైతులు 2000–01 నుంచి 2024–25 మధ్య కాలంలో సమష్టిగా రూ. 111 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారని ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ‘‘అది రైతులకు అశని పాతమే కాదు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అవుతుంది’’ అని హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్ల తోటల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు హరీశ్ చౌహాన్ అంటున్నారు.యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్లతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆపిల్ పండ్లకు మార్కెట్ అసాధారణమైన రీతిలో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఆపిల్ తోటల పెంపకం పరిశ్రమ క్రమంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని భయ సందేహాలు వ్యక్తమవు తున్నాయి. సుంకాలు ఏమీ లేకుండా అమెరికా ఆపిల్ పండ్లు దిగు మతి అయితే, మన దేశంలో ఆపిల్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పోతుందని హరీశ్ హెచ్చరిస్తున్నారు. సుంకాలు లేకపోతే సమస్యే!పడిపోయిన ధరలతో పత్తి, సోయా, ఉల్లిపాయల రైతులు ఇప్ప టికే బిక్కుబిక్కుమంటున్నారు. సుంకాలు ఏమీ లేకుండా అవి దిగు మతి అయి, ధరలు మరింతగా పతనమైతే, వారు ఆ పంటలను వదిలేసి చేతులెత్తేయడం మినహా చేయగలిగింది లేదు. ఏడాదికి 500 బిలియన్ల విలువైన అమెరికన్ ఎగుమతుల గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. అందులో ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటి రంగాలవి కూడా ఉన్నాయి. అయితే, అది ఏడాదికి దాదాపు 100 బిలియన్ డాలర్ల చొప్పున ఐదేళ్ళ కాలానికి లెక్క చెప్పినదై ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తు న్నారు. అమెరికన్ ఎగుమతులన్నీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులతోనే నిండి ఉంటాయని భావించడం కూడా సబబు కాదు. పత్తి, పప్పుధాన్యాలు, ఉల్లిపాయల వంటి వస్తువుల విషయంలో ఒక కోటా మేరకు మాత్రమే మార్కెట్ అందుబాటులో ఉంటుందని వార్తలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడం లాంటిదేనని అర్థం చేసుకోవాలి. గత ఏడాది సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో, పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తొలగించినపుడు చౌక ధరకు పత్తి బేళ్ళు అపారంగా వచ్చిపడ్డాయి. దేశంలో పత్తి ధరలు తగ్గాయి. అందుకు వస్త్ర పరిశ్రమవారు సంతోషించారు కానీ, రైతులు నష్ట పోయారు. మూడు నెలల్లో 30 లక్షల పత్తి బేళ్ళు దిగుమతి అయ్యాయి. పత్తి ధర క్వింటాల్కు రూ. 1,000–రూ.1,500 వరకు పడిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దాలని ట్రంప్ చూస్తున్న నూతన వాణిజ్య వ్యవస్థ... ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకమైనది. ట్రంప్ తన కొత్త వ్యవస్థకు ‘యూరో పియన్ యూనియన్ కూడా తలొగ్గేట్లు చేయాలని చూస్తున్నారు. వాణిజ్య సంస్థ 1995లో ఏర్పడినప్పటి నుంచి అమెరికా పప్పులు ఉడకడం లేదు. అది ఇపుడు ఎలాగైనా తన పంతం నెగ్గించు కోవాలని చూస్తోంది. ఒత్తిడికి లొంగిపోతున్న దేశాలతో, నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిష్కృతమవుతోంది. ‘కండ గలవాడిదే రాజ్యం’ అన్న లోకోక్తి ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెప్పాలి. దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
దేశ రాజకీయాల్లో భూకంపం
భారత్–చైనా సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా, లేదా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం (Four Stars of Destiny) అధికారికంగా ఇంకా ప్రచురణ కాలేదు. కానీ, ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ‘క్యారవాన్’ మ్యాగజైన్ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. 2020 జూన్ నాటి సంగతి. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాశ్ రేంజ్ వైపు కదలడం మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుద్ధ ప్రకటన!2020 ఆగస్టు 31. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్ దూరంలో మోహరించాయి. భారత కమాండర్లు అప్రమత్తమై దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విధానపరంగా ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలూ లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి. అప్పటి ఆర్మీ చీఫ్ నరవణె రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్ చేసి ‘ఏం చేయాలి?’ అని అడిగారు. వెంటనే స్పందన రాలేదు. తరువాత రక్షణ శాఖ మంత్రి నుండి ఫోన్ వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు. ‘ప్రధానితో మాట్లాడాను... జో ఉచిత్ సమ్ఝో వో కరో’ (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి). ఈ సూచన విని షాక్కు గురైనట్టు నరవణె రాసుకున్నారు. యుద్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది.ఇలాంటి ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్పేయి హయాంలోనూ వచ్చాయి. వాళ్ళిద్దరూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణె ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని మోదీలో అలాంటి నిర్ణయాత్మక స్పష్టత కనిపించలేదూ అని! ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్థే నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని సైన్యం పాటిస్తుంది. చైనా విషయంలో మోదీ తడబడి నట్టుగా నరవణె కథనం ద్వారా అర్థం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది.జాతీయ భద్రత కారణంగా నరవణె పుస్తకాన్ని (Naravane Book) పరిశీలించాల్సి ఉందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర గడిచినా సమీక్ష పూర్తి కాలేదు. ప్రచురణకు అనుమతి రాలేదు. జాతీయ భద్రత కన్నా తమకు ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ ఉన్నాయి. ఒక ఆర్మీ మాజీ ఛీఫ్ తన యుద్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా? ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో నరవణె పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించి నపుడు అధికార పక్షాలు అడ్డుకున్నాయి.చదవండి: నరవణె పుస్తకంపై పెంగ్విన్ కీలక ప్రకటన‘అగ్నివీర్’, ‘అగ్నిపథ్’ పథకాల మీద కూడా నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడా తక్కువనీ గుర్తు చేశారు. భారత సైన్యం భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. క్యారవాన్ పత్రిక (caravan magazine) ఆ పుస్తకంలోని కొన్ని అంశాలతో ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. మిగిలిన పుస్తకంలో ఇతర సందరాల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి ఉండవచ్చు. మొత్తం పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.- డానీ వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
అసమానతలను రాజేయనున్న ఏఐ
దావోస్లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో చర్చించిన ప్రాథమికాంశాలలో ‘కృత్రిమ మేధ (ఏఐ)– దాని ప్రభావం’ కూడా ఉంది. ఏఐని ఆశ్రయించక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అనుసరించడంలో మందగమనంతో సాగవచ్చు నేమోకానీ, ఏదో ఒకనాడు దాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. ఏఐని ఆశ్రయించడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి; అదే సమయంలో... అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలలో కొన్ని ఆందో ళనలున్నాయి. ‘ఫోరమ్’ సర్వే ఏం చెబుతోంది?ఆర్థికవేత్తలలో ఫోరమ్ ఈ అంశంపై నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటి స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని దాదాపు 54 శాతం మంది అంగీకరించారు. కంపెనీలు ఏఐని ఎక్కువ వినియోగించు కుంటే లాభాల మార్జిన్లు పెరుగుతాయని సుమారు 45 శాతం మంది నమ్ముతున్నారు. అంటే, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇది వివక్షకు దారితీయవచ్చని 21 శాతం మంది భయాలు వ్యక్త పరిచారు. వివిధ రంగాల పరిశ్రమల సామర్థ్యం ఏఐతో మెరుగుపడుతుందని మన దేశంలోనూ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐని ఎక్కువ వినియోగించుకోవడం వల్ల అన్ని కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ విభాగం సేవలు మెరుగుపడతాయి. ఆ విభాగం చాట్ బాట్స్ను సృష్టించుకోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దాదాపు అన్ని సేవా రంగాల పరిశ్రమలూ అటువంటి సాధనాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు రిటైల్ కస్టమర్లతో ప్రమేయమున్న అన్ని వ్యాపార సంస్థలూ ఏఐని ఆశ్రయించక తప్పదు. కీలక రంగాల్లో ఏఐ వినియోగంబ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగంలో రుణ యోగ్యతను మదింపు చేసేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. రుణం కోరుతున్న కంపెనీకి చెందిన మొత్తం సమాచారాన్ని ఏఐ సమీకరించి, తిరిగి చెల్లించగల సామర్థ్యంపై అంచనాలు అందివ్వగలదు. కలన గణితాలను ఆధారం చేసుకుని, ఏ మేరకు రుణం మంజూరు చేయవచ్చునో, ఎంత వడ్డీ వసూలు చేయవచ్చునో తెలుపుతుంది. ముందే నిర్ణయించిన సూచికలను ఆధారం చేసుకుని ఆ కంపెనీ ఎగవేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చెప్పగలుగు తుంది. ఏఐ వినియోగం వల్ల మోసాన్ని కనిపెట్టడం తేలిక. ఫలితంగా, ఆ రంగానికి ఎంతో మేలు చేసినదవుతుంది. ఐటీ రంగంలో ఇప్పటికే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం కోడింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ పనిని ఏఐకి అప్ప గిస్తున్నారు. ఈ కంపెనీలు సూచిస్తున్న పరిష్కారాలు క్లయింట్లకు ఉపయోగపడుతున్నాయి. ఆ క్లయింట్లు ఏఐ వినియోగంతో హెచ్చు సామర్థ్య స్థాయులతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటు న్నారు. రిటైల్ రంగంలో, కస్టమర్ సంబంధ మాడ్యూల్ మొత్తాన్ని ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఉత్పత్తులను సమర్థంగా డెలివరీ చేసేందుకు ఉపయోగపడుతోంది. స్టోరుకు వెళ్ళే వినియోగ దారుల ఇష్టాలు, అభిరుచుల సమాచారం మొత్తాన్ని ఏఐ క్రోడీక రిస్తోంది. వాటికి తగ్గట్లుగా ఆ యా ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తేలికవుతోంది. ఆరోగ్య రక్షణ రంగంలో సప్లై చెయిన్ నిర్వహణను ఏఐ సమకూరుస్తోంది. ఏ వ్యాపార రంగానికైనా ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోందనీ, దాన్ని ఉపయోగించు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ వీటివల్ల స్పష్ట మవుతోంది. కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా క్రమేపీ ఏఐని ఆసరా చేసుకుంటు న్నాయి. ఏఐ సాధనాలు అందించిన ఇన్పుట్ల ఆధారంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడే ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురుకాగల పోటీని అంచనా వేసుకోగలుగు తున్నాయి. కాకపోతే, ఏఐని ఒక టెక్నాలజీగా వినియోగించుకోవడం చౌక కాదు. విద్యుచ్ఛక్తి ఎక్కువ అవసరమవుతుంది. గ్లోబల్ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2035 నాటికి 1,200 టెరావాట్–గంట లను మించిపోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అంటే, 2024 స్థాయులకన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. ఏఐ వృద్ధికి సమాంతరంగా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచు కోవాలి. అయితే, మున్ముందు ఈ వ్యయాలు తగ్గుతాయనీ, లాభాలు పెంచుకునే వీలుంటుందనీ కంపెనీలు భావిస్తున్నాయి. ఖర్చుల మాట అట్టేపెట్టినా, మన దేశంలో పరిస్థితులు ఎలా మార తాయన్నది చూసుకోవాలి.దేశ కార్మికశక్తికి సవాల్మనది మిగులు కార్మిక ఆర్థిక వ్యవస్థ. ఉద్యోగాల అవసరం ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిపుణులైనవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. నైపుణ్యం పెద్దగా అవసరం లేని లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం ఒక సవాల్. ఏఐ వినియోగాన్ని పెంచుకుంటున్న కంపెనీలు ఇపుడున్న సిబ్బందిని తిరిగి నిపుణులుగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వారిని గాలికి వదిలేసినట్లు అవుతుంది. అయితే, కొత్తగా నైపుణ్యాలను నేర్పించడానికి వయసు ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. కనుక, ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగి తీరుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని అంతర్భాగం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే మాట కూడా నిజం. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మాత్రం కోతల బెడద తప్పకపోవచ్చు.సర్వేలో వెల్లడైన రెండవ పెద్ద అంశం– అసమానత. పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఏఐ నిచ్చెనమెట్లు ఎక్కేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటుంది కనుక, అది వాటికి సాధ్యం కాని పని. ఇది ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. కొన్ని సంస్థలు పోటీ పడలేక రంగం నుంచి వైదొలగక తప్పని స్థితి ఏర్పడవచ్చు. ఈ అసమానత సమస్య సిబ్బందికి కూడా వర్తిస్తుంది. అవస రమైన నైపుణ్యం ఉన్నవారికి వెంటనే ఉద్యోగాలొస్తాయి. మామూలు ఉద్యోగాలలో కంటే ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయి. మిగిలిన రంగాలవారి కన్నా ఐటీ రంగం ఎక్కువ జీతభత్యాలు ఇవ్వజూప గలగడం ఇప్పటికే చూస్తున్నాం. ఏఐ విషయంలోనూ అదే జరుగు తుంది. వస్తూత్పత్తి నుంచి కస్టమర్ సర్వీస్ వరకు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలకు అవసరమైన చట్రాలను డిజైన్ చేయగలిగిన ఏఐ నిపుణులకి ఎక్కువ జీతాలు ఇవ్వజూపుతాయి.మదన్ సబ్నవీస్వ్యాసకర్త ఆర్థికవేత్త, రచయిత -
రైతుకు భరోసానివ్వని బడ్జెట్
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా రోజుల క్రితమే ‘వ్యవసాయం, రైతాంగ సంక్షేమ’ మంత్రిత్వ శాఖ అనే పేరు పెట్టుకొంది. కానీ సంక్షేమం అన్నది మారిన పేరులో తప్ప క్షేత్ర స్థాయిలో కనబడటం లేదు. 2026 –27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ను చూసినప్పుడు అతి కీలకమైన వ్యవ సాయ రంగం క్రమంగా తన ప్రాధా న్యాన్ని కోల్పోయిందన్న బాధ కలగక మానదు. బడ్జెట్కు ముందురోజు విడుదలైన ఆర్థిక సర్వే, వ్యవసాయ రంగ దుఃస్థితిని తేటతెల్లం చేసింది. మొత్తం జీడీపీ (దేశ స్థూలోత్పత్తి) 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4.6 నుంచి 3.1 శాతానికి తగ్గుతుందని తేల్చారు. సాధారణంగా వృద్ధిరేటు మందగిస్తుందని తెలిసినప్పుడు దానిని పైకి లాగే చర్యలు తీసుకోవడం సహజం. ఆశ్చర్యంగా, తాజా బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ. 1.62 లక్షల కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల (2025–26 ఆర్థిక సంవత్సరంలో) కంటే ఇది 5.3 శాతం మాత్రమే ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటే, ఈ పెరుగుదల నామమాత్రం.పరిశోధనలకు ఊతమేది?వ్యవసాయ రంగ ఉపరితల ముఖచిత్రాన్ని చూస్తే, గొప్ప గానే ఉన్నట్టు కనిపిస్తుంది. 2024–25లో 35.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండాయి. ఈ మొత్తం 145 కోట్ల జనాభాకు సరిపోవడమే గాక, ఎగుమతులు చేయడానికి ఆస్కారం ఉంది. పాడి, పండ్లు, కూరగాయలు, మత్స్య సంప దపై రాబడి సంతృప్తిగానే ఉంది. మరి సమస్యేమిటి? ఆర్థిక సర్వే వెల్లడించిన సమాచారం ప్రకారం – తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటల ఉత్పాదకత, ఉత్పత్తి గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ స్థాయితో పోల్చుకుంటే మనం అట్టడుగున ఉన్నాం. దానివల్ల పంటలు గిట్టుబాటు కావడం లేదు. వారసత్వంగా సంక్రమి స్తున్న మార్కెటింగ్ సౌకర్యాల లేమి, ఇన్ఫుట్స్ వ్యయం గణనీ యంగా పెరగడం, చీడపీడలు, అకాల వర్షాలు, వర్షా భావం మొదలైనవి వెంటాడుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ‘మన కర్తవ్యం’ అని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్... ఉత్పాదకత పెంపుదలకు అవసరమైన ‘వ్యవసాయ పరిశోధన, విద్య’కు గతేడాది కేటాయించిన రూ.10,281 కోట్ల నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,967 కోట్లకు తగ్గించి వేయడం ఓ వైచిత్రి. వ్యవసాయ రంగంలో పరిశోధన, విద్యకు చాలా దేశాలు తమ వ్యవసాయ బడ్జెట్లో 1 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. దీన్ని స్థిరమైన ఉత్పాదకత వృద్ధికి సంబంధించి బెంచ్మార్క్గా పేర్కొంటారు. కానీ మనం మాత్రం ఇందుకు 0.5 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నాం. వ్యవసాయ పరిశోధనలపై పెట్టే ప్రతి రూపాయీ అదనపు రాబడిని తెచ్చి పెడుతుందని శాస్త్రజ్ఞులు రుజువు చేసినా, మన ప్రభుత్వాలు ఎందుకనో వినవు, కనవు.పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు మేలు చేకూర్చేందుకు ఇంతకు ముందుకంటే ఈ రంగాలకు దాదాపు 27 శాతం నిధులు కేటాయించడం ఒక్కటే సానుకూల అంశం. ఈ రంగాల ద్వారా రాబడి ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా తీరప్రాంత రాష్ట్రాలకు మత్స్య సంపదపై వచ్చే ఆదాయాన్ని వ్యవసాయంలో కలిపేసి... వ్యవసాయ రంగంలో తమ అభివృద్ధి 10 నుంచి 15 శాతంగా ఉన్నట్లు మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా చెప్పుకొంటున్నారు. దిగుమతుల బెడదదేశీయ రైతాంగానికి మరో పెను సవాలు పెరగనున్న వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు. అమెరికాకు చేసే ఎగు మతులపై తాజాగా ట్రంప్ 18 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని ఓ చల్లని కబురు చెప్పిన మాట నిజమే. కానీ, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అన్నింటిపై భారత్ ఎటువంటి సుంకాలూ విధించబోదని ట్రంప్ పేర్కొనడం పిడుగులాంటి వార్తే! ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంచడం ద్వారా ఇక్కడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నూనె గింజల దిగుమతులపై సుంకం విధించకుంటే దేశీయ నూనెగింజల రైతులు మునిగిపోతారు. కానీ, బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలేమీ చేయలేదు. దేశీయ వ్యవ సాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వకుండా దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నారు? అమెరికా ఉత్పత్తుల దిగుమతు లపై పూర్తిగా సుంకం ఎత్తివేస్తే... భారత రైతాంగం ఇకపై కొన్ని రకాల పంటల సాగును శాశ్వతంగా మానుకోవాల్సిందే. ఇక, తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొబ్బరి బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో తెలియదు. ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని 1.7 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాది ఇది 1.86 లక్షల కోట్లు. సబ్సిడీలు అధికంగా ఇవ్వాల్సి వస్తుందని ఎరువుల లభ్యతను కావాలనే కేంద్రం తగ్గించేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఏదీ?అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించే అంశంలో చట్టబద్ధత కల్పించాలని ఎంతో కాలంగా రైతు సంఘాలు కోరుతున్నాయి. దాన్ని పెడచెవిన పెట్టారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపైన కూడా స్పష్టమైన దిశానిర్దేశం కొరవడింది. వ్యవసాయ పనిముట్లపై ఇంకా అధికశాతం జీఎస్టీ కొనసాగుతూనే ఉంది. కాఫీ గింజల్ని ప్రాసెస్ చేసే పరికరాల పైన కూడా కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలన్న కాఫీ గింజల ఉత్పత్తిదారుల డిమాండ్ను పట్టించుకోలేదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని గత రెండు, మూడేళ్లుగా చెబుతూనే ఉన్నా... దానిని అమలు చేస్తున్న రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. సంప్రదాయంగా వరి పండించే తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని కొబ్బరి, జీడి, చందనం వంటి పంటలకు మళ్లమని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ, ప్రభుత్వాల పరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎక్కడ? భవిష్యత్తులో వరి, గోధుమ వేసినట్లయితే నష్టపోతారని ఆర్థిక సర్వేలో చెప్పారు. వరి పండించే చిన్న సన్నకారు రైతాంగానికి తగిన అవగాహనతో పాటు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఫలితం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించు కోవడానికి ‘భారత్ విస్తార్’ పథకం ద్వారా రైతులకు వారి భాష లోనే సలహాలు, సూచనలు అందించాలన్న చొరవను స్వాగతించాల్సిందే. కానీ ముందుగా మౌలికమైన మార్పులు తేవడానికీ, ముఖ్యంగా పంటల మార్పిడికి రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికీ అవసరమైన నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
జెఫ్ బెజోస్ (వ్యాపార దిగ్గజం) రాయని డైరీ
సంతకం పెడుతున్నప్పుడు చేయి వణికిందంటే చేయకూడని పని ఏదో చేస్తున్నట్లు! లేదా, జరగవలసిన పనే ఏదో జరుగుతున్నట్లు!! ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఒకేసారి 300 మంది జర్నలిస్టులను తొలగిస్తూ నేను చేసిన సంతకం... చేయక తప్పనిదా? చేసినా తప్పవనిదా? సిబ్బందిని తగ్గిస్తూ, నేను సంతకం చేస్తున్నప్పుడు నా వేలికి అంటిన ఫౌంటైన్ పెన్ ఇంకు నాకు భారంగా తోచింది. అయితే, నా గుండెను బరువెక్కించిన విషయం వేరే ఉంది. ఏ పత్రికలోని ఉద్యోగులనైతే తొలగించ టానికి నేను సంతకం చేయవలసి వచ్చిందో సరిగ్గా ఆ పత్రికే, నా తొలగింపుల సంతకపు కాగితానికి ‘ఒత్తు’గా ఉండటం నా మనసును కలవరపరిచిన కో–ఇన్సిడెన్స్!తొలగింపుల జాబితాలో తమ పేరు కనిపించిన ఉద్యోగులకు కూడా నాలాగే గుండె బరువెక్కి ఉంటుంది. కాళ్ల కింద భూమి కదిలే ఉంటుంది. కానీ, చెట్టును బతికించటానికి కొమ్మలను నరికేయక తప్పని స్థితి. ఈ ఏడాది మళ్లీ మరొక 100 మిలియన్ డాలర్ల నష్టాల్లోకి పేపర్ వెళ్లబోతోంది. పోయిన సంవత్సరం వంద మిలియన్ల నష్టం! ఆ ముందు ఏడాదీ వంద మిలియన్ల నష్టం! పన్నెండేళ్ల క్రితం నేను ‘వాషింగ్టన్ పోస్ట్’ను కొన్నదే 250 మిలియన్ డాలర్లకు!పేరున్న ఒక న్యూస్ పేపర్గా మాత్రమే ఆనాడు నేను ఈ 148 ఏళ్ల చరిత్ర కలిగిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికను కొనలేదు. ప్రజాస్వామ్య మూలస్తంభాన్ని కొన్నట్లుగా కొన్నాను. లాభాలు చూసుకోలేదు. కానీ ఇప్పుడు నష్టాలను చూసుకోవలసి వస్తోంది. ‘వాషింగ్టన్ పోస్ట్’లో న్యూస్ రూమ్లు, న్యూస్ బ్యూరోలు ఎక్కువైపోయాయి. న్యూస్ పేపర్ చదివేవాళ్లు తక్కువైపోయారు. ‘న్యూయార్క్ టైమ్స్’కూ, ‘వాల్స్ట్రీట్ జర్నల్’కూ... ‘వాషింగ్టన్ పోస్ట్’ పోటీ ఇవ్వలేకపోతోంది.‘‘ఏం చేద్దాం, మిస్టర్ మ్యాక్’’ అని అడిగాను ఒకరోజు. ఆయన మౌనంగా ఉండిపోయారు! మ్యాక్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఆయన పక్కనే సీఈవో విలియం ఉన్నారు. ‘‘మీరు చెప్పండి మిస్టర్ విలియం’’ అన్నాను. ఆయనా మౌనంగా ఉన్నారు!! ఆ ఇద్దరి మౌనాల తర్వాత నేను తీసుకోవలసి వచ్చిన కఠినమైన నిర్ణయమే... ‘వాషింగ్టన్ పోస్ట్’లోని కొన్ని డెస్క్లను, కొన్ని బ్యూరోలను ఎత్తివేయటం, మూకుమ్మడిగా కొందరు జర్నలిస్టులను తొలగించటం.270 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్న జెఫ్ బెజోస్కు 100 మిలియన్ డాలర్ల నష్టం ఒక లెక్కా అని ఎవరికైనా అనిపించవచ్చు. ఇది లెక్కల విషయం కాదు. నెలనెలా తన బిలియనీర్ యజమాని జేబు లోంచి వచ్చే డబ్బుతో ఏ సంస్థా నడవకూడదు. ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి దిగ్గజమైతే తన ఇంజిన్ తోనే రన్ అవ్వాలి. అలా నడవటమే పత్రికకు, పత్రికలోని ఉద్యోగులకు గౌరవం. అమెజాన్ ఆఫీస్ బిల్డింగ్కు నేను పెట్టుకున్న పేరు ‘డే–1’. కొత్తగా పెట్టిన కంపెనీ తొలి రోజు ఎంత ఎనర్జిటిక్గా ఉంటుందో, పదివేల ఏళ్ల తర్వాత కూడా ఆ కంపెనీ, తొలి రోజు ఉన్నట్లే ఉండాలన్నది ‘డే–1’ వెనుక నా ఫిలాసఫీ. కంపెనీ ‘డే–2’ లోకి వచ్చిందంటే... స్తబ్ధత, అసంబద్ధత, క్షీణత తప్ప ఇక అక్కడేం లేవని!‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రస్తుతం ‘డే–2’ లో ఉంది. తిరిగి ‘డే–1’లోకి తెచ్చేందుకే ఈ తొలగింపులు, ఎత్తివేతలు అంటే ఎవరైనా ఎందుకు సంతోషిస్తారు? ఆఖరికి మ్యాక్, విలియమ్ కూడా సమ్మతంగా లేరు. 18 సొంత కంపెనీలు ఉండొచ్చు, 31 కంపెనీల్లో వాటాలు ఉండవచ్చు. బిలియన్ల కొద్దీ ఆస్తులు ఉండవచ్చు. లక్షలాది మంది వర్కర్లు ఉండవచ్చు. కానీ, కొద్దిమంది ఉద్యోగులను తొలగించవలసి వచ్చినప్పుడు మాత్రం... అన్నన్ని కంపెనీలు, అన్నన్ని వాటాలు, అన్నన్ని ఆస్తులు, అంతంత మంది వర్కర్లు ఉన్న ఏ బిజినెస్ టైకూన్కైనా ఒక్క అపరాధ భావన మాత్రమే తోడుగా ఉంటుందేమో! -
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
సినిమా రంగం అంటే సామాన్య ప్రజలకు అదొక రంగుల ప్రపంచం, కలల సౌధం. వెండితెరపై కనిపించే తారల వెలుగుల వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని అవమానాలు దాగి ఉన్నాయో బయటి ప్రపంచానికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రతిభ ఉంటే చాలు, ఆకాశమే హద్దుగా ఎదగవచ్చనే ప్రచారం ఈ పరిశ్రమలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఒక అగ్ర కథానాయకుడు మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనే సంస్కృతే లేదనీ, నటీనటులు క్రమ శిక్షణతో ‘స్ట్రిక్ట్’గా ఉంటే ఎవరూ ఇబ్బంది పెట్టరనీ ఉద్బోధించారు. తన కుమార్తెను కూడా ఈ రంగంలోకి రావాలని ప్రోత్సహించానని ఆయన ఉదాహరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళా నటీమణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. వెనుక అండదండలు ఉన్న వారసులకూ, ఏ అండా లేని సాధారణ యువతులకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వారు ఎత్తిచూపారు. ప్రతిభ ఉన్నా ‘కమిట్మెంట్’, ‘అడ్జస్ట్మెంట్’ పేరుతో శారీరక లొంగుబాటు కోరడం ఇక్కడ నిత్యకృత్యమనీ, అది లేకుండా అవ కాశాలు రావడం దాదాపు అసాధ్యమనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్ట్రిక్ట్’గా ఉండటం అంటే వచ్చిన అవ కాశాన్ని వదులుకుని వెనక్కి వెళ్లిపోవడమే తప్ప మరో మార్గం లేదని వారు కుండబద్దలు కొట్టారు. అసలు ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే మాటకూ అర్థం ఏమిటి? ‘కాస్టింగ్’ అంటే సినిమా నిర్మాణంలో నటీ నటులను, ఇతర సాంకేతిక నిపుణులను ఎంచుకునే ప్రక్రియ. ‘కౌచ్’ అంటే ఆ ఎంపిక సమయంలో చర్చలు జరిపే పెద్ద సోఫా. అది పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అమెరికన్ భాషా శాస్త్రవేత్త బెంజమిన్ జిమ్మెర్మ్యాన్ వివరణ ప్రకారం, సినిమాలో అవకాశం ఇవ్వాలంటే పడక సుఖం కోరడం అనే వికృత ధోరణే ఈ పేరుతో పిలవబడుతోంది. పైకి మాత్రం చాలా మర్యా దగా ‘కమిట్మెంట్’ ఉండాలనీ, కొంత ‘అడ్జస్ట్’ కావా లనీ అంటుంటారు. ఇది 1910–1920 కాలంలో హాలీవుడ్, బ్రాడ్వే నాటక రంగాల్లోనే ప్రబలంగా ఉండే దని చరిత్ర చెబుతోంది. నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే ఈ దోపిడీకి ‘కాస్టింగ్ కౌచ్’ అనే పేరు స్థిరపడిపోయింది.సినిమా రంగంలోని ఈ అనారోగ్యకర ధోరణు లను, దానిపట్ల ఉన్న ఆకర్షణ గురించి 80 ఏళ్ళనాడే చలం, తన ‘సినిమా జ్వరం’ అనే వ్యాసంలో సినిమా జాడ్యం ముసలివాళ్ళ దగ్గిర్నించీ పసిపిల్లల దాకా గట్టిగా పట్టుకుందనీ, ఇది మరింతగా విస్తరించబోతోందనీ జోస్యం చెప్పారు. పూర్వం యోగుల కటాక్షం కోసం శిష్యులు వేచి చూసినట్లు, నేటి యువతీ యువకులు ఒక్క అవకాశం కోసం దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సేవ చేస్తున్నారని ఆయన విమర్శించారు. సినిమా రంగం అత్యంత పవిత్రమైనదనీ, ఇక్కడ శీలానికి భయం లేదనీ చెప్పే దొంగ రాతలు ప్రజలను వంచించ డమేనని చలం ఘాటుగా స్పందించారు. ‘అడవిలో పాములు, పులులు ఉన్నాయని హెచ్చరించడం న్యాయం. జాగ్రత్తగా వెళ్ళు అనడం ధర్మం. కానీ పులిని బ్రహ్మస్వరూపంగా భావించమని, అడవిలో ఏమీ లేవని చెప్పి పంపడం ఘాతుకం’ అని ఆయన అభిప్రాయ పడ్డారు. వాస్తవాలను దాచిపెట్టి అబద్ధపు పేర్లతో లోకాన్ని మోసం చేయడం వల్లే సగం సమస్యలు పుడు తున్నాయని ఆయన ఆనాడే స్పష్టం చేశారు.హిందీ నుంచి తెలుగు దాకా...ఈ జబ్బు కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. హాలీవుడ్ చరిత్రకారుడు కారీ రిక్కే రాసిన దాని ప్రకారం... ఆనాటి సుప్రసిద్ధ నటి మార్లిన్ మన్రో హాలీ వుడ్ను ఒక ‘కిక్కిరిసిన వేశ్యావాటిక’గా అభివర్ణించింది. హారీ కోహ్న్ వంటి బడా నిర్మాతలు నటీమణులను పడక గదిలో పరీక్షించకుండా అవకాశాలు ఇచ్చేవారు కాదని ప్రతీతి. హాలీవుడ్లో ఈ జాడ్యంపై 2018–2020 కాలంలో ప్రపంచవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం పెల్లు బికింది. తెలుగు చిత్రసీమలో కూడా 2017లో ఫిలిం నగర్ సాక్షిగా ఒక నటి చేసిన అర్ధనగ్న నిరసన ప్రదర్శన పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనల తర్వాత వాస్తవాలను తేల్చడానికి, ఇటువంటి దుర్మా ర్గాలు జరగకుండా చూడటానికి కొన్ని కమిటీలు ఏర్పాటై నట్లు వార్తలు వచ్చినా, ఆశించిన మార్పు మాత్రం అగుపించలేదు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా కేవలం కమిటీలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని కాలం నిరూపించింది.సినిమా అనే విచిత్రమైన సరుకును తయారుచేసే పెట్టుబడిదారీ విధానంలోనే ఈ దోపిడీ మూలాలు ఉన్నాయి. సినిమాల ప్రారంభం నుండి స్త్రీ దేహాన్ని కేవలం ఒక భోగ వస్తువుగా, సెక్స్ సింబల్గా చూపే ధోరణి పెరిగింది. మహిళలను కేవలం లాభాలు తెచ్చి పెట్టే సరుకులుగా (‘కమోడిఫికేషన్’) మార్చే ఈ వ్యవ స్థలో మార్పు రానంత కాలం ఎన్ని నిరసనలు తెలిపినా ఫలితం శూన్యం. చలం తన వ్యాసంలో చెప్పినట్లు, స్టూడియోలు, దర్శకులు ఉన్నతమైన ఆశయాలు, ప్రజల మీద ప్రేమ గలవారైతే తప్ప పరిస్థితులు మారవు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అదొక కళ అనీ, అందులో పనిచేసే వారు మనుషులనీ గుర్తించినప్పుడే ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే వికృత క్రీడకు ముగింపు లభిస్తుంది.– బి.ఆర్. బాపూజీహైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ -
పరిశోధనలు ప్రైవేటు పరమా?
సాధారణంగా అందరూ అనుకునేట్టు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కేవలం పన్నులు, ఆదాయం, ఆ యారంగాలకు కేటాయింపులు మాత్రమే కాదు. కీలక రంగాల విషయంలో ప్రభుత్వ ఆలోచనలు, విధానపరమైన మార్పులు ఇందులోనే వ్యక్తమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానరంగం ఉరకలేస్తున్న తరుణంలో అంతర్జా తీయ రాజకీయ పరిణామాలనూ దృష్టిలో ఉంచుకుంటే ఈ ఏడాది బడ్జెట్ సరికొత్త సవాళ్లకు సమాధానాలు తెలిపేదిగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఈ దిశలో బడ్జెట్ నిరాశ పరిచిందనే చెప్పాలి. ప్రభుత్వం ప్రకటించుకున్నట్టు ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ కాదు. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల విషయంలో ఇది యథాతథ స్థితిని కొనసాగించే సాధారణ బడ్జెట్. మార్పునకు సూచికలేనా?ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. కొత్త టెలిస్కో పులు, వేధశాలల ఏర్పాటును ప్రస్తావించారు. అరుదైన మూలకా లకు సంబంధించిన కారిడార్ల గురించి, సెమీ కండక్టర్ మిషన్ రెండో అధ్యాయం ప్రారంభం, బయోఫార్మా తయారీ వ్యూహాలూ ప్రసంగంలో ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సిన పనులే. అయితే ఏవీ ఓ గొప్ప మార్పునకు సూచికలైతే కావు. ‘ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ (ఐఐఏ) 15 ఏళ్లుగా నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోపు తయారీ కోసం శ్రమిస్తోంది; ఐదేళ్లుగా నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు నిర్మాణ ప్రయత్నాల్లోనూ ఉంది. ఆర్థిక మంత్రి వీటి గురించే బడ్జెట్లో ప్రస్తావించారు. వీటి డిజైనింగ్, స్థలంఎంపిక, పరిశోధన వేదిక పునాదులు, సిబ్బంది వంటి కీలకమైన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. స్థలం ఎంపిక కోసం ఆర్థిక మంత్రి స్వయంగా లద్దాఖ్ను సందర్శించారు కూడా.సూర్యుడిపై పరిశోధనల విషయంలో భారత్ సామర్థ్యం గట్టిదే. ప్రతిపాదిత టెలిస్కోపు కూడా ఆదిత్య ఎల్, ఉదయ్పూర్లోని మల్టీ అప్లికేషన్ సోలార్ టెలిస్కోపుల ద్వారా అందుతున్న సమాచారానికి సాయంగా నిలుస్తుంది. కొత్త టెలిస్కోపు నిర్మాణ వ్యయం దాదాపు రూ.3,500 కోట్లుగా లెక్కగట్టారు. అయితే ఐఐఏకు అదనపు బడ్జెట్ కేటాయింపులేవీ జరగలేదు. ఐఐఏ సహా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్్సకు అనుబంధంగా ఉన్న 25 అటానమస్ సంస్థలకు ఈ ఏడాది బడ్జెట్లో దక్కింది రూ.1,623 కోట్లు మాత్రమే.సాధారణ ప్రక్రియలో భాగమే!రానున్న ఐదేళ్లలో రూ.10,000 కోట్లతో బయోఫార్మా ‘శక్తి’ కార్యక్రమాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బయలాజిక్స్, బయో సిమిలర్స్ తయారీ చేపడతారు. అయితే మంత్రి ప్రకటించిన మొత్తం... మూడు కొత్త ‘నేషనల్ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ (నైపర్)ల నిర్మాణానికీ, వీటికి అనుబంధంగా ఉన్న వెయ్యి అక్రిడి టెడ్ క్లినికల్ ట్రయల్స్కూ ఖర్చు చేస్తారు. ఈ రెండూ సాధారణ ప్రక్రి యల్లో భాగమే కానీ, బయోఫార్మాకు ప్రత్యేకమైనవి ఏమీ కాదు.‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ను బలోపేతం చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ఇది అవసరమే కానీ బయో ఫార్మా వ్యూహంలో దీన్ని భాగం చేయడం ఆశ్చర్యకరం. శక్తి కార్యక్ర మంలో భాగంగా కేటాయించిన పదివేల కోట్ల రూపాయల్లో నైపర్ లకు ఎంత, మిగిలిన వాటికి ఎంతెంత అన్న స్పష్టత లేదు. వాస్తవా నికి, శక్తి కార్యక్రమం 2017లో వరల్డ్ బ్యాంక్ సాయంతో నేషనల్ బయోఫార్మా మిషన్లో భాగంగా 25 కోట్ల డాలర్లతో చేపట్టారు. దీని ద్వారా టీకాలు, బయోసిమిలర్లు, వైద్య పరికరాల తయారీ, పరిశో ధనలు చేయాలన్నది లక్ష్యం. హాట్ టాపికే కానీ...బడ్జెట్ ప్రసంగంలో సెమీ కండక్టర్లు, రేర్ఎర్త్ మినరల్స్, ఏఐ వంటి వాటి ప్రస్తావన వచ్చినప్పటికీ ఏదీ గేమ్ఛేంజర్ స్థాయికి చేరలేదు. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ కేంద్రం ఒకదాన్ని గత ఏడాది నవంబరులో ప్రారంభించామని ప్రకటించిన మంత్రి... ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని తెలిపారు. గతేడాది ప్రకటించిన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్లో ఇవన్నీ భాగం కావడం గమనార్హం. కొన్నేళ్లుగా బడ్జెట్ ప్రసంగాల్లో తరచూ వినిపించిన ఇంకో ఆలోచన ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’. ఈసారి దీన్ని కేవలం ప్రస్తావనకు మాత్రమే పరిమితం చేశారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినా గతేడాది రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపులు కూడా అంతే మొత్తంలో ఉండటం గమనార్హం. గతేడాది ప్రకటించిన రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) స్కీమ్ ద్వారా ప్రైవేట్రంగ డీప్ టెక్ ప్రాజెక్టులకు వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లు అందాల్సి ఉండగా గతేడాది రూ.20,000 కోట్లు దక్కాయి. ఇందులో ఖర్చ య్యింది రూ. 3,000 కోట్లు మాత్రమే. కేంద్ర కేబినెట్ దీన్ని గత ఏడాది జూలైలో ఆమోదించడం ఇందుకు కారణం. నియమ నిబంధనలు కాస్తా నవంబరుకు కానీ పూర్తి కాలేదు.కేటాయింపులో ఖర్చు చేసిన మొత్తం తక్కువైనా... అమలు తీరులో ఎన్నో లోపాలున్నా ఆర్డీఐకి జరిపిన కేటాయింపులను బట్టి చూస్తే... ప్రభుత్వం పరిశోధనలను ప్రైవేట్పరం చేసేందుకు నిర్ణ యించినట్టుగా కనిపిస్తోంది. ‘అనుసంధాన్’కు కేవలం రూ. 2,000 కోట్లే దక్కాయి. ఆర్డీఐకి ఇంతకు పది రెట్లు ఎక్కువ కేటాయించారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలకు కేటాయింపులు తగ్గిపోగా... ప్రైవేట్ రంగానికి ఎక్కువయ్యాయి. ఇదేమంత మంచి పరిణామం కాదు.-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మ -
లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. సీబీఐ ఛార్జ్షీట్లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్ లోని ‘నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్షీట్లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డివ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -
దారీ తెన్నూ లేని జెన్–జీ తుపాను
బంగ్లాదేశ్లో ఈ నెల 12న, నేపాల్లో వచ్చే నెల 5న పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, అక్కడ తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కూలదోసిన జెన్–జీ ఉద్యమాలు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ఆ రెండు తిరుగుబాట్లు చేసిన యువతరానికి అందుకు తగిన కారణాలైతే ఉన్నాయి. కొన్ని లక్ష్యాలనూ ప్రకటించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ తమ సిద్ధాంతాలు ఏమిటో తెలియక, తగిన రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేక, నాయకులను ఎంపిక చేసుకోలేక అన్ని విధాలా అయోమయాలకు గురయ్యారు. చివరకు ఎన్నికలు ప్రకటించే వేళకు అనేక గ్రూపులుగా మారి ఎవరి దారి వారిదయింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజాలు ఈ సరికే నిరాశకు గురైన స్థితిలో, ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిపాలనలు ఏ విధంగా ఉండేదీ అర్థంకాని పరిస్థితి కనిపిస్తున్నది.స్పష్టత లేని బంగ్లా యువతబంగ్లాదేశ్ విద్యార్థి–యువజనుల తిరుగుబాటు 2024 జూన్లో మొదలైంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా సాగించిన అణచివేతను తట్టుకుని మరింత తీవ్రంగా మారింది. రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిష్కరించలేక షేక్ హసీనా రాజీనామా చేసి భారత దేశానికి పారిపోయి వచ్చారు. ఆ దరిమిలా, నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్ను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రకటించారు.అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా, తిరుగుబాటుతరం ఏమి చేయగలదీ స్పష్టత రాలేదు. వారిలో పలు గ్రూపులు తయారు కాగా, కనీసం కొందరు ముఖ్యులతో కలిపి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేక పోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. కానీ అందులో ఐక్యత లేక పోయింది. అంతకన్నా ముఖ్యంగా, తమ సిద్ధాంతం ఫలానా అని నిర్ణయించుకుని దేశానికి తెలియజెప్పలేక పోయారు. నమ్మకం కోల్పోయిన తిరుగుబాటుతిరుగుబాటులో వారికి మద్దతుగా నిలిచిన ప్రజలు కోరుకున్నది నిర్దిష్టమైన నాయకత్వం, సిద్ధాంతాలు గల ఒక ప్రత్యామ్నాయ పార్టీని! విద్యార్థులు, యువకులు దేనికి నిరసనగా,ఏ లక్ష్యాలతో తిరుగుబాటు జరిపారో వాటి నుంచి, పాత పార్టీలకు భిన్నమైన ఒక కొత్త పార్టీని!! కానీ, తిరుగుబాటు రోజుల నుంచి సుమారు సంవత్సర కాలం గడిచినా ఇవేవీ జరగలేదు.షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఇక రంగంలో ఉండదని తేలిపోగా, మిగిలిన రెండు ప్రధానమైనవి ఖలీదా జియా మరణం తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రహమాన్ నాయకత్వాన గల‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’, ‘జమాతే ఇస్లామీ పార్టీ’లు. విద్యార్థుల తీరు వల్ల వారి పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లగా, ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఎన్పీ,జమాతే అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల పార్టీ ఎక్కడో వెనుకబడి పోయింది. దానితో ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకత్వం జమాతేతో పొత్తు కలవగా, ఒక మతతత్వ పార్టీతో ఐక్య సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు బయటకు పోయారు. బయటి సమాజంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నుంచి గెలిచేది ఎందరనే ప్రశ్న ఎట్లున్నా, వారి ఉద్యమం ఈ రోజున ఎక్కడ మిగిలింది, తమ లక్ష్యాలను ఏ మేరకు సాధించనున్నది, తమపై ఆశలు పెట్టుకుని బలపరచిన ప్రజలకు ఏమి చెప్పగలదన్నది మౌలికమైన ప్రశ్న. అందులో విఫలమైన పక్షంలో, ఇకభవిష్యత్తులోనూ అవే పాత పార్టీలు అధికారానికి రాగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, ఆ నాయకత్వాలు తామేదో మారామని బయటకు చెప్తున్నా అటువంటి ఆశలు ఎవరికీ లేని స్థితిలో, ఉద్యమ ప్రభావాలు శూన్యంగా మిగల నున్నాయంటే పొరపాటు ఉండబోదు. మునుముందు మరొక మారు తిరుగుబాటు తలెత్తితే ప్రజలు విశ్వసించటం తేలిక కాబోదు.చీలిన నేపాల్ గ్రూపులునేపాల్ను గమనించినా పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అక్కడి జెన్–జీ ఉద్యమం నిరుడు సెప్టెంబర్లో ఒకేమారు అగ్నిపర్వతం వలె పేలి కేవలం రెండు రోజులలో ప్రభుత్వాన్ని కూలదోసి, పార్లమెంటును రద్దు చేయించింది. వారి నిరసనలు కూడా బంగ్లాదేశ్లో వలె అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, బంధుప్రీతి, ఆర్థిక సమస్యలు, అసమర్థ పాలనకు సంబంధించినవే. అక్కడి ప్రజలు వారిని పూర్తిగా బలపరచి, వారి నాయకత్వాన ప్రత్యామ్నాయ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడగలవని ఆశించారు. తిరుగుబాటు ఆకస్మికం అయినందున దేశమంతటా ఎక్కడికక్కడ కలిపి మొత్తం సుమారు 60 జెన్–జీ గ్రూపులు ఉనికిలోకి రాగా, వాటిలో కనీసం కొన్ని ముఖ్యమైనవి ఒక్కటై ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవనుకున్నారు.కానీ, నెలలు గడిచిపోతున్నా అది జరగకపోగా అనేక గ్రూపులు తమ గత కాలపు సిద్ధాంతాలు, వ్యక్తిగత అనుబంధాలను బట్టి, లేదా టికెట్లు ఆశించి ప్రధానమైన అయిదు పాత పార్టీలతో చేరాయి. రెండు మూడు గ్రూపులు సొంత పార్టీలు ఏర్పాటు చేశాయి గానీ అవి బలహీనంగా మిగిలిపోయాయి. ఉద్యమకారులకు, ప్రజలకు కూడా తగినంత అభిమానం ఉన్నట్లు భావించే మాజీ ఉపప్రధాని రవి లమిఛానే, ఖాట్మండు మాజీ మేయర్ బాలేన్ షా, జాతీయ విద్యుత్ సంస్థ మాజీ ఎం.డి. ఘీషింగ్ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కొన్ని ఆశలు రేకెత్తించింది గానీ, మొదలైన వారం రోజులకే చీలిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇంతటి తిరుగుబాటు జరిగి, దాని నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధానులు ఓలీ పార్టీ, ప్రచండ పార్టీ, బాబూరాం భట్టరాయ్ పార్టీ, మాజీ ఉపప్రధాని లమిఛానే పార్టీలు ప్రకటించినా, ఆ పాఠాలు ఏమిటో, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటో వివరిస్తూ మేనిఫెస్టోలను ఏ ఒక్కరూ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు హతాశులై మిగిలారు.గత రెండేళ్ళలో బంగ్లాదేశ్, నేపాల్లోనే కాదు. మరొక డజను దేశాలలోనూ జెన్–జీ తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి రెండు చోట్ల కొన్ని రాయితీలు సాధించినా ప్రత్యామ్నాయాలన్నవి ఎక్కడా ఏర్పడ లేదు. ప్రతిచోటా వెనుకటి పార్టీల రాజ్యమే కొనసాగుతున్నది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఉద్యమాలు తగినంత కాలం సాగి, తమ వైన సిద్ధాంతాలు, నాయకత్వాలతో ఒక రూపానికి వచ్చి, ప్రజలను మెప్పిస్తే తప్ప, ప్రత్యామ్నాయాలు సిద్ధించవు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్ను బ్యారేజ్గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
ఆర్థిక క్రమశిక్షణ
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆర్థిక లోటు 2025–26లో జీడీపీలో 4.4 శాతం కాగా, 2026–27లో 4.3 శాతంగా ప్రతిపాదించడం, కేంద్ర ప్రభుత్వ రుణంలోనూ 2025–26తో పోల్చినప్పుడు (జీడీపీలో 56.1 శాతం), 2026–27లో జీడీపీలో 55 శాతంగా ప్రతిపాదించడం ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా పేర్కొనవచ్చు. ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం తగ్గి ప్రాధా న్యతా రంగాలకు అధిక వనరులు సమకూరడంతోపాటు ద్రవ్యోల్బణంలో క్షీణత, స్థిర స్థూల ఆర్థిక వాతావరణం లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మరోవైపు సంక్షేమంపై వ్యయం తగ్గినట్లయితే వినియోగం, సమష్టి డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడుతుంది.కనెక్టివిటీ సానుకూలంఆర్థిక వృద్ధి సాధనలో ప్రధాన అంశమైన మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఏడు కొత్త హై–స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ చర్యతో రోజువారీ ప్రయాణ సౌకర్యాల మెరుగుదల, ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాల మెరుగుదల, వివిధ ప్రాంతాల మధ్య వస్తు ప్రవాహం, ఉత్పాదకత పెరుగుదల, ప్రయాణ సమయాలలో తగ్గుదల వలన ‘ఆర్థిక హబ్’ల మధ్య కనెక్టివిటీ లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కారిడార్ల నిర్మాణం వలన తయారీ రంగం, సేవలు, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 2025–26 బడ్జెట్తో పోల్చినప్పుడు 2026–27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయంలో పెరుగుదలను 11.5 శాతంగా ప్రతిపాదించారు. తద్వారా నిర్మాణ రంగం, సిమెంటు, స్టీల్, యంత్రాలు, సేవలకు సంబంధించి డిమాండ్లో పెరుగుదల ఏర్పడవచ్చు. నిర్మాణ రంగంలోని శ్రామికులకు ప్రత్యక్షంగా ఉపాధి పెరగడంతోపాటు, లాజిస్టిక్స్; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సప్లయ్ గొలు సులో పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఎక్కువవు తాయి. మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వ పెట్టుబడు లలో పెరుగుదల వలన ప్రైవేటు సంస్థల వ్యయం, నష్ట భయం తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలంలో పురోగమించడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ లక్ష్య సాధనకు వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్ అయిన ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల లావాదేవీ పన్నును పెంచడం వలన నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్లో క్షీణత ఏర్పడింది. సెక్యూరిటీల లావాదేవీల పన్నును పెంచడంలో ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయి. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంపొందించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడు (ఎఫ్ఐఐ)లను ఆకర్షించడంతో పాటు, ఉన్న పెట్టుబడులను నిలుపుకొనే విధంగా చర్యలు తీసుకోవడం, రాబోయే రోజుల్లో కార్పొరేటు రాబడులు మెరుగవు తాయనే విశ్వాసం కల్పించడం లాంటి అంశాలు మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడతాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
అతి విశ్వాసంతో స్వారీ
మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కూడా ఆశించిన మేర ఆదాయ అంచనాలను చేరుకోలేదు. దీనిని బట్టి ప్రభుత్వపరంగానూ ఆయా అంశాలు, రంగాల్లో ఆశించిన మేర పెట్టుబడులు, ఖర్చు పెట్టలేదు. గత బడ్జెట్లోనూ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించినా అందులో రూ. 200 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రైవేట్ రంగం నుంచి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోతే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులు ఏ మేరకు ఉపయోగపడతాయనేది చర్చనీయాంశమవుతోంది. మన బడ్జెట్లన్నీ కూడా ఎక్కువ మటుకు పెట్టుబడి దారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. వీటిపై సమ తూకం సాధించే క్రమంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామనీ, దీనినుంచి మంచి ఫలితాలు వస్తా యనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందనేది చూడాల్సి ఉంది. 7.5 కోట్ల యూనిట్లలో 32 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలు కూడా క్రియా శీలమై కొంత శాతం ఉపాధిని కల్పిస్తే వీటి పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి. జాతీయస్థాయిలో 6.4 శాతం నుంచి 7.2 శాతం దాకా వృద్ధిరేటు సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వృద్ధి నుంచి ఏ వర్గానికి ఎంత పంపిణీ అవుతుందనేది ముఖ్యం. కొన్నేళు్లగా చూస్తే మన వృద్ధి ఎగుడుదిగుళ్లు గానే ఉంటోంది. ఉదాహరణకు.. తాజా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం చూస్తే... మొత్తం వంద రూపాయల జీడీపీ ఉత్పత్తిలో పై వర్గానికి 60 శాతం, మధ్య తరగతికి 25 శాతం, దిగువన ఉన్న వారికి 15 శాతం వస్తోంది. అధిక ఆదాయం పొందుతున్న వారు కొంత అధిక పన్ను కట్టాల్సి ఉండగా ఈ వర్గాన్ని ముట్టుకునే సాహసం చేయడం లేదు. అదీగాకుండా ఆరోగ్య రంగం విషయాని కొస్తే... మెడికల్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా డబ్బు భరించగలిగిన విదేశీయులకు నాణ్యతా పరమైన వైద్యసేవలు అందించి, దేశంలోని పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేని సామాన్యులకు ఆ నాణ్యమైన వైద్య సేవలు ఏవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పౌరు లందరికీ సమానమైన వైద్య సేవలను అందించి... అప్పుడు వ్యాపారం చేస్తే బాగుంటుంది. బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, దానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల్లో గత కొన్నేళ్లలో ఎలాంటి వృద్ధీ లేదు. దీనికి భిన్నంగా భారత పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైంది. దేశీయంగా తగిన డిమాండ్ లేదనీ, తమ పరి శ్రమల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లేదనీ వారు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్లో... విదేశాల్లో పెట్టుబడులపై నిబంధనలను మరింతగా సులభతరం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం కంటే కూడా ఇక్కడి నుంచి బయటి దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా కేంద్రప్రభుత్వం మాత్రమే పెట్టు బడులు పెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు గతేడాది రూ.11.20 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.12.25 లక్షల కోట్లకు పెంచుతామని బడ్జెట్లో ప్రతిపాదించారు. వృద్ధిరేటును నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వపరంగా రోడ్లు, కమ్యూ నికేషన్లు, తదితరాలన్నీ చేస్తుంటే దానిని ప్రోత్సాహకంగా తీసుకుని, ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. కానీ అవి రావడం లేదు. మెరుగైన ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసం, నమ్మకం పెట్టుకోవడం వల్ల మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ రక్షణ బడ్జెట్ను ఒక్కసారిగా రూ.27 లక్షల కోట్లు (గతం కంటే 21 శాతం పెంపుదల) ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా విజయం సాధించామనే భావనతో ఈ రంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వృద్ధి రేటు 6–7 శాతం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రొఫెసర్ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్సీయూ స్కూల్ ఆఫ్ సోషల్సైన్సెస్ మాజీ డీన్ -
సాగుకు ఒరిగేది తక్కువే!
డిజిటల్ వ్యవసాయం ద్వారా అద్భుతం సాధిస్తున్నామని చెబు తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణి బడ్జెట్ కేటాయింపుల్లోనూ కనిపించింది. అయితే భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్ల పట్ల బడ్జెట్లో ప్రతి స్పందన దాదాపు శూన్యం అని చెప్పాలి. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి, తగ్గుతున్న మార్కెట్ రాబడి కారణంగా రైతు ఆదాయాలు తరుగుతున్నాయి. పెరుగుతున్న వివిధ పంటల దిగుమతి, అమెరికా దేశం నుంచి ఒత్తిళ్లను ఆర్థిక సర్వే 2025–26 అంగీకరించినా బడ్జెట్లో కనీస స్పందన లేదు.పెరుగుతున్న వాతావరణ ప్రభావానికి, ప్రభుత్వ పెట్టుబడుల మధ్య పొంతన అసలు లేదు. ఆశించినట్టుగా 2026 –27 బడ్జెట్లో సహజ వ్యవసాయం వంటి పైలట్ కార్యక్రమాలకు నిధులను గణనీయంగా పెంచినట్లు కనిపించడం లేదు. డిజిటల్ వ్యవ సాయం మీద పెట్టుబడుల వల్ల ఒరిగేది చాలా తక్కువ. డిజిటల్ టెక్నాలజీ కేవలం ప్రకృతి వైపరీత్యాల గురించి హెచ్చరించడానికి మాత్రమే పనికొస్తుంది. స్థిరమైన పంటల ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతు ఆదాయ సంక్షోభాన్ని పరిష్క రించడంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ–నామ్, ధరల డ్యాష్బోర్డ్లు, గిడ్డంగి రసీదు వ్యవస్థలు వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు.ధరల స్థిరీకరణ, వైవిధ్యభరితమైన సేకరణ, వ్యవసాయ–ప్రాసెసింగ్ సామర్థ్యం, మార్కెట్ కార్యకలాపాలలో బలమైన ప్రభుత్వ జోక్యం లేకుండా... డిజిటల్ వ్యవస్థలనేవి రైతుల ఆదాయాలను రక్షించడం కంటే ధరలను అస్థిర పరచేందుకే అవకాశం ఎక్కువ ఉంది. వ్యవసాయానికి ఇచ్చిన మొత్తం నికర కేటాయింపు రూ.1,30,561 కోట్లు (2025–26 సవరించిన బడ్జెట్ కేటాయింపు కన్నా 6% ఎక్కువ). ఇందులో ప్రధానంగా ‘పీఎమ్– కిసాన్ సమ్మాన్ నిధి’కి రూ. 63,500 కోట్లు (49%), వడ్డీ సబ్సిడీలకు రూ. 22,600 కోట్లు (17%),పంట బీమా (పీఎమ్ఎఫ్బీవై)కు రూ. 12,200 కోట్లు (9%) కేటాయింపులు జరిగాయి.‘కృషియోన్నతి యోజన’కు కేటాయింపులు 65% (రూ. 6,800 నుండి 11,200 కోట్లకు) పెరిగాయి. ఇందులో కొత్తగా ‘కూరగాయలు/ పండ్ల మిషన్ ’ ఉంది. సహజ వ్యవసాయ మిషన్కు ఇచ్చిన నిధులలో కేవలం 3% వృద్ధి (రూ.725 నుండి 750 కోట్లకు) మాత్రమే ఉంది. ఇక, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 41% కేటాయింపులు పెరిగాయి.వడ్డీ చెల్లింపుల భారంబడ్జెట్లో కొత్త కార్యక్రమాలు (2026–27) చూస్తే... ‘భారత్–విస్తార్’ అనే బహుభాషా ఏఐ సాధనం ఏర్పాటుకు రూ. 150 కోట్ల కేటాయింపు జరిగింది. ఇది రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయం చేస్తుందని భావిస్తు న్నారు. అధిక విలువ కలిగిన వ్యవసాయ పంటలకు మద్దతు పేరిట తీరప్రాంత/కొండ ప్రాంతాలలో కొబ్బరి, గంధపు చెట్ల పెంపకానికి రూ. 350 కోట్లు ఇచ్చారు. మఖానా అభివృద్ధికి రూ. 90 కోట్లు ఇచ్చి, పసుపుకు మాత్రం ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదు.బడ్జెట్ వ్యూహాత్మక దృష్టి కేవలం డిజిటల్ వ్యవసా యానికి పరిమితం అయ్యింది. డ్రోన్లు, ఏఐ, డిజిటల్ వ్యవస్థల వంటివి భాగంగా ఉండే సాంకే తిక పరిజ్ఞానాన్ని వాడటం; ‘పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’కి అధిక నిధులను కేటాయించడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించడం, అధిక విలువ కలిగిన పంట లను వైవిధ్యీకరించడం, సహజ వ్యవసాయ పరి వర్తనకు స్థిరమైన నిధులను అందు బాటులోకి తేవడం వంటి వాటికి బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది.మొత్తం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు కేటాయించినది 2.7% మాత్రమే! మొత్తం బడ్జెట్ ప్రాథమ్యాలతో పోలిస్తే... ప్రభుత్వం అప్పులపై వడ్డీ చెల్లింపుల (రూ. 14.4 లక్షల కోట్లు) పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. వ్యవసాయానికి రూ. 1.3 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వం మీద ఉన్న అప్పుల భారం అభివృద్ధి మీద వ్యయాన్ని పరి మితం చేస్తుందని స్పష్టం అవుతున్నది. వ్యవసాయ బడ్జెట్ నిరాడంబరమైన వృద్ధిని చూపుతోంది. వాస్తవ అభివృద్ధి/ వ్యవసాయ రంగ పరివర్తన వ్యయం కేవలం రూ. 33,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వం ప్రతి 2 రోజులకు వడ్డీ చెల్లింపులపై చేసే ఖర్చు కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.డా‘‘ దొంతి నరసింహారెడ్డివ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
అంతా ప్రైవేటు రూటే!
ఈ ఏడాది బడ్జెట్లో అమెరికా టారిఫ్ల తాకిడిని తట్టుకోవడంపై దృష్టిని కేంద్రీకరించినట్టు కేంద్రం చెబుతూనే వారితో ఒప్పందానికి తలుపులు తీసి ఉంచింది. ఈయూతో ఒప్పందం కూడా చాలా విధాలుగా మన దేశీయ ఉత్పత్తులను, వ్యాపారాలను దెబ్బ తీస్తుంది. అంతర్జాతీయంగా చాలా ఆర్థికాంశాలు మన అధీనంలో లేకుండాపోయాయంటూ ఆర్థిక సర్వేలోనే కేంద్రం మూడు అవకాశాలు సూచించింది. అధ్వాన్నమైన పరిస్థితి వస్తే 2008 నాటి ఆర్థిక సంక్షోభం కన్నా దారుణంగా ఉండొచ్చని కూడా పేర్కొంది. మరి బడ్జెట్లో స్వావలంబన కోసం ఏవైనా నిర్మాణాత్మక పథకాలున్నాయా అంటే చాలా భాగం విదేశాలతో ముడిపడిన ప్రైవేటు ప్రాజెక్టులే. అన్నీ ప్రైవేటుకు అప్పగించే పీపీపీ నమూనా దీనంతటి వెనక దాగి ఉంది. ఆర్థిక సర్వేలోనే కేంద్రం ప్రైవేటు రంగంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ సంస్థల్లో సర్కారుకు 51 శాతం వాటా ఉండాలనే విధానాన్ని మార్చి... 26 శాతం ఉంటే సరిపోతుందని సూచించింది. ఆర్థిక అంచనా ఆందోళన కరంగా ఉంటే ముందు ఆదుకో వలసింది పేద, మధ్య తరగతి వర్గాలను! కానీ ఆర్థిక క్రమశిక్షణ పేరిట వారికి ఇచ్చే సంక్షేమ పథకాలనే నిర్మలమ్మ టార్గెట్గా చేసుకున్నారు. 2025–26లో పన్ను ఆదాయం ఆశించిన మేర కైనా పెరిగింది లేదు. 2026– 27కు చూపించిన అంచనాలు 2025–26 స్థాయిలోనే ఉండటం ఇందుకు నిదర్శనం. కార్పొరేట్ రంగానికి లక్షల కోట్ల రాయితీల వల్ల గండి కొనసాగించారు. పీఎమ్ పోషణ్, పీఎమ్శ్రీ, పంటల బీమా వంటి వాటన్నిటికీ కేటాయింపుల్లో కోత వేశారు. మహిళల కోసం ఉద్దేశించిన నిధులలో 51,444 కోట్లు కోత పెట్టారు. 2026–27లో ఎరువులు, ఆహారం, పెట్రోలియం, సబ్సిడీ లలో మరింత కోత ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమం ప్రధానంగా భావించకపోవడం వల్లనే నగదు బదిలీలు 1.7 కోట్లు దాటిపోతున్నాయని సర్వేలోనే ఆందోళన వెలిబుచ్చింది. గిగ్ వర్కర్ల జీతాలు పెరVýæక పోవచ్చని కూడా సర్వేలోనే వెల్లడించింది. కొత్త లేబర్ కోడ్లు, పనిగంటల పెంపు వంటివన్నీ కలిపి చూసుకుంటే ఏలినవారు ఏ దిశలో ఆలోచించారో తెలుస్తుంది. ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే.ఏఐ డేటా సెంటర్లకు, క్లౌడ్ కంపెనీలకు 2047 దాకా భారీ రాయితీలు ప్రకటించింది. కంటైనర్లపై, విమాన తయారీ పరికరాలపై రాయితీలు కూడా కార్పొరేట్లకే కానుక లవుతాయి. ఇన్ఫ్రా రంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులకు ఆధారమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అరుదైన మృణ్మయ నమూనాలపై ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడి కన్నుపడింది గనక ఏపీలోనూ అలాటి ఒక పరిశోధనా కేంద్రం నెలకొల్పు తామన్నారు. ఈనగాచి నక్కల పాలైనట్టు ఇవన్నీ తర్వాత ప్రైవేటు బాటలోకి తరలించబడతాయి. రక్షణ రంగం కేటా యింపుల పెంపు కూడా ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఖర్చయి పోతుంది. అప్పుల శాతం జీడీపీలో 50 శాతానికి తగ్గించడం లక్ష్యమైందంటే పరిస్థితి తెలుస్తోంది. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించవలసిన రాష్ట్రాలు ఎంత మొరపెట్టుకున్నా వాటి కేటాయింపుల పెంపు లేదు. 16వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ గత ఏడాది ఇచ్చిన 41 శాతం వాటాను కొనసాగించ డమే గొప్ప వరంగా బడ్జెట్ చిత్రించింది. 2025–26 బడ్జె ట్లో చెప్పినదానితో పోలిస్తే ఆచర ణలో కేంద్ర పథకాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఇతర బదలా యింపుల కింద వచ్చే మొత్తం రాష్ట్రాల వాటాకు రూ. 2,03,801 కోట్లు కోత పడింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు రాష్ట్రాలపై ముందే వేటు వేసింది. ‘వీబీ జీ రామ్ జీ’ – కింద మరింత తగ్గింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలను ఆదుకో వడానికి ముందుకు రాకపోవడం దారుణం, విభజిత రాష్ట్రమైన ఏపీ వంటి వాటిని తీసుకుంటే... ఒక్కటంటే ఒక్క పథకం కింద కూడా నిధులు ఇవ్వలేదు. పోలవరం నిర్మాణానికి కేటాయింపు రూ. 3000 కోట్లు తగ్గించారు. నిర్వాసితులకు అవసరమైన 21 వేల కోట్లలో ఎంత ఇచ్చేదీ పేర్కొనలేదు. అమరావతి గురించి అప్పుల గొప్పలు చెప్పడం తప్ప సహాయం ఊసే లేదు. విశాఖ ఉక్కుపై ముఖ్య మంత్రి చంద్రబాబు వంటి వారు కార్మికులపై విరుచుకుపడ్డారు గానీ బడ్జెట్లో నిర్దిష్ట ప్రకటనలేమీ చేయించలేక పోయారు. అసలు కూటమిలో ఉండటం వల్ల రాష్ట్రానికిఏమి తీసుకురాగలిగారంటే శూన్యమే! అలాగే తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు కోరిన అంశాలేవీ చోటు సంపాదించ లేకపోయాయి. కనుక ఏ విధంగా చూసినా నిర్మలమ్మ బడ్జెట్ నిస్సారమైన, నిరుత్సాహ కర వ్యవహారం. పైగా బడ్జెట్లో చూపించకుండా తర్వాత పన్ను పెంచడం ఇటీవలి రివాజు గనక పారా హుషార్!తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ
మంచి టీమ్కి హెడ్గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్లోని వాళ్లు టీమ్లో ఉంటూనే హెడ్గా పని చేయాలి, హెడ్గా ఉన్నవాళ్లు హెడ్గా ఉంటూనే టీమ్లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్ తయారవుతారు! మునుపటి 8 బడ్జెట్లు కూడా నాకు ఇదే నేర్పించాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్సభలో నా 9వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా మాత్రమే ఇది నా బడ్జెట్. అసలు కసరత్తంతా నా టీమ్ది. కనుక, బడ్జెట్ సమర్పణ కూడా అదృశ్యంగా నా టీమ్దే అవుతుంది. సెక్రెటరీలు ఆరుగురు, అడ్వైజర్ ఒకరు... మొత్తం ఏడుగురు అపర చాణక్యులు!బడ్జెట్లో ఏముందో ఇంకొన్ని గంటల్లో దేశ ప్రజలకు తెలిసిపోతుంది. బడ్జెట్ను తయారు చేయటంలో నా టీమ్ కష్టం ఎంతుందో చెప్పాలంటే మాత్రం అది బడ్జెట్ ప్రసంగాన్ని మించిన ప్రసంగమే అవుతుంది! టీమ్లోని అనురాధా ఠాకూర్ ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ. బడ్జెట్ రూమ్లోకి ప్రవేశించిన తొలి మహిళ! నేటి బడ్జెట్కు ప్రాథమిక రూపశిల్పి. హల్వాను అడుగంటకుండా ఉడికించటంలోని వివిధ స్థాయుల సన్నని మంటల గురించి తెలిసిన నిపుణురాలు. ఇంట్లో మనుషుల్ని కదిలించకుండానే ఇంటి గదుల్ని, గోడల్ని పునర్నిర్మించగల నేర్పరి.అజయ్ సేuЇ ఫైనాన్స్ సెక్రెటరీ. గ్రాండ్ మాస్టర్! బడ్జెట్ టీమ్లోని సెక్రెటరీలందరికీ కెప్టెన్. ‘ఆర్థిక లోటు’ వార్నింగ్ సిగ్నల్ ఎర్రగా వెలిగి ఆరిపోతున్నా కూడా చలించని శాంత మనస్కుడైన పైలట్! అరవింద్ శ్రీవాత్సవ రెవిన్యూ సెక్రెటరీ. బడ్జెట్లో కొత్త ముఖం. ముక్కులుపిండకుండా, బుగ్గలు పుణికి పన్నులు వసూలు చేయగల టాక్స్ కలెక్టర్. బడ్జెట్ స్పీచ్లో పార్ట్–బి ఆయనదే. పన్నుల పెంపు, తగ్గింపు ఉండేది ఆ పార్ట్లోనే. డిన్నర్ బిల్లుని సమానంగా పంచే ధర్మరాజు. ఒకరెవరైనా అదనంగా ఆర్డర్ చేసి ఉంటే, వారికి అదనంగా ‘వడ్డించే’ నియమబద్ధుడు.ఉమ్లున్మాంగ్ ఉవల్నామ్ ‘ఎక్స్పెండిచర్’ సెక్రెటరీ. ప్రభుత్వాన్ని దేనినీ కొననివ్వరు. ఏం అడిగినా సరే, ‘ఇప్పుడు కాదు బాస్’ అనేస్తారు.అనంత నాగేశ్వరన్ ఛీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. డేటా డిటెక్టివ్. సంక్లిష్టమైన ప్రపంచ గందరగోళాన్ని ‘ఆర్థిక సర్వే’గా అనువదిస్తారు. గాలివానలు సహాయకరంగా ఉంటాయా, లేక మనం తుపానులోకి వెళ్లబోతున్నామా అన్నది ఆర్థిక శాఖకు చెబుతారు. వర్షం వచ్చే ముందు మీ గొడుగు విరిగిపోయిందన్న విషయాన్ని కూడా కచ్చితంగా మీకు గుర్తు చేస్తారు.నాగరాజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ. బ్యాంకుల వైద్యుడు. బ్యాంకుల ఆరోగ్యాన్ని పరిరక్షించటం కోసం, మీరు ‘టీ’ తాగి చేసిన డిజిటల్ చెల్లింపులు లోప భూయిష్ఠంగా లేకుండా చూసుకునేది ఆయనే. అరుణిష్ చావ్లా ఇన్వెస్ట్మెంట్లు, పబ్లిక్ అసెట్ల కార్యదర్శి. ప్రభుత్వ కంపెనీల వాటాల కోసం కొనుగోలుదారులను వెతికి పెడతారు. వెతికి పడతారు. ఆయనొక ఇ–బే వేలం పవర్ సెల్లర్. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ఎవరి చేతనైనా ఏదైనా కొనిపించేస్తారు.నిజంగా, ఎంత గొప్ప టీమ్! కాకపోతే, ఇలాంటి టీమ్ ఉన్న ప్రతి లీడర్కీ ఎదురయ్యే సమస్య ఒకటే. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ఇడ్లీ, వడ మాత్రమే అయినా ఆ రెండిట్లోంచి కూడా ఒక దానిని ఎంపిక చేసుకోలేక సతమతం అవటానికి తగినంత సమయాన్నింకా చేతిలో మిగిల్చే ఉంచుతారు! నాదీ ఇప్పుడు అటువంటి సమస్యే. ఏ కలర్ శారీ బాగుంటుందా అని ఆలోచిస్తూ, తెరిచి ఉన్న అల్మరా ముందు నిలబడి పోవటం అన్నది నాకు ఏనాడూ సమయం దొరకని పని. కానీ ఇవాళ నా టీమ్ నా చేత ఆ పనిని చేయించబోతున్నట్లే ఉంది! -
హైందవానికి ఆలన... జగన్ పాలన
చెరువు లేని చోట చేపలు పట్టిస్తాననీ, ఆకాశంలో కదలకుండా సూర్యుణ్ణి అలాగే ఉంచేస్తాననీ, గాలి పూసి ఏ గాయం అయినా మాయం చేస్తాననీ చెప్పి, ప్రసార మాధ్యమాల ద్వారా అది ఆయనకే సాధ్యం అని ఊదర గొట్టించి, మాటి మాటికీ ప్రజలను నమ్మించి అందలం ఎక్కి గొంతు కోసేవారు ఒకరు. ఇచ్చిన మాట కోసం, చేసిన వాగ్దానం కోసం, చెప్పిన నిజం నిలబెట్టడం కోసం, పేదవాడి కడుపు నింపడం కోసం, దిగువనున్న వారికి ఎగువ తరగతి చదువు అందివ్వడం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, సంక్షేమ పథకాల నిత్యవికాసం కోసం, జనం కొరకు, జనం మధ్య నిలబడి పనిచేసినవారు మరొకరు.మొదటి వారు చంద్రబాబు నాయుడు అయితే, రెండవ వ్యక్తి జగన్మోహన్రెడ్డి. అబద్ధానికీ నిజానికీ, చీకటికీ వెలుగుకూ మధ్య ఉన్నంత స్పష్టమైన తేడా ఈ ఇద్దరిలో! ఏమీ చేయకుండానే చేసినట్లు, చేస్తున్నట్లు, చేస్తూనే ఉన్నట్లు చెప్పి నమ్మించగలగడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పత్రికలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన రాగానికి తాళం వేసి, తప్పెట్లు మోగించి అభివృద్ధి ఆకాశం దాటేసింది అంటూ అరుస్తాయి. చిటికెల పందిళ్ళకు, ఊహల ఉత్సవాలకు, గాలిలో ఘనమైన మేడలకు, గ్రాఫిక్ ఇంద్రజాలాలకు బ్రాండ్ అంబా సిడర్ చంద్రబాబు. నేలమీద నిలబడి, కరోనాలో సైతం ప్రజల కోసం కష్టపడి, చేసిన ప్రతి వాగ్దానాన్నీ నిలబెట్టుకుని పెద్దగా ప్రచారం చేసుకోలేక పోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.శ్రీవారి పనులు ఆపొద్దు!పదుల సంఖ్యలో ఆలయాలను నేలమట్టం చేసిన చంద్రబాబు సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని నిలబెడతానని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. దేవుడిని, దేవుడి ప్రసాదాన్ని రాజకీయం చేసిన మొదటి రాక్షస రాజకీయ నాయకుడు ఈయనే. నిజానికి హైందవ ధర్మానికీ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికీ అపారమైన సేవ చేసిన వ్యక్తి జగన్ మాత్రమే. అంత సేవ చేసిన ఆయనను చంద్రబాబు విష ప్రచారపు ముసుగు వేసి అన్యుడని అవహేళన చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఎన్నికల వరకు తిరుమల శ్రీవారికి, హైందవ ధర్మానికి ఆయన చేసిన సేవ ప్రత్యక్షంగా చూసినవాడిగా, ఆత్మ సాక్షిగా గుండెమీద చేయి వేసుకుని ఈ మాటలు చెబుతున్నాను. ఈ వ్యాసం రాస్తున్నాను. అందరికీ తెలియాల్సిన పచ్చి నిజాలివి. పచ్చమీడియా ఎప్పటికీ అంగీకరించని వాస్తవాలివి. తిరుమల శ్రీవారి మీద జగన్కు అపారమైన భక్తి, విశ్వాసం. 2019లో అఖండమైన మెజారిటీతో జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ఆయన తిరుమలకు వచ్చి, శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరమే అధికార పీఠంపై కూర్చున్నారు. ఆ రోజు జగన్తో పాటు నేనూ కారులో ఉన్నాను. అప్పుడు గరుడ వారధి (శ్రీనివాస సేతు) పనులు జరుగుతున్నాయి.ఆ స్తంభాలను చూసి ‘ఏమిటిది’ అని అడిగారు. ‘‘ఇది శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం నిర్మి స్తున్న ఫ్లై ఓవర్. దాదాపు 40 కోట్లు చంద్రబాబు హారతి చేశాడు. దీన్ని ఆపడం మంచిది’’ అని కారులోని ఓ ముఖ్య వ్యక్తి చెప్పాడు. దానికి జగన్ నవ్వుతూ, ‘‘శ్రీవారికీ, ఆయన భక్తులకూ ఉపయోగపడే వంతెనను ఆపడం అన్యాయం. వాటా తీసుకున్న వారి పాపం వారికే తగులుతుంది, తగిలింది. ఆపొద్దు, మరింత మెరుగుగా నిర్మించండి’’ అన్నారు. అభివృద్ధి పనులు ఎవరు ప్రారంభించినా ఆపకూడదు అన్నది ఆయన భావన.అప్పటికి కొద్దికాలం క్రితమే ఆయన సుదీర్ఘమైన పాద యాత్రతో 3,648 కి.మీ. నడిచి ఉన్నారు. ఆ అలసట కూడా మరిచి శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన పాదరక్షలు లేకుండా వెళ్ళారు. అలాంటి భక్తుడిని అన్యమతస్థుడు అని చంద్రబాబు, ఆయన మీడియా కొండంత ప్రచారం చేశాయి. జగన్ ఎంత సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తా రంటే, ఆయనకు తిరుపతి గంగమ్మ గురించి ఆమె శ్రీవారి చెల్లెలు అని చెప్పాను. ఆయన ముందుగా, ముఖ్యమంత్రిగా గంగమ్మను దర్శించుకునే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయాల పునరుద్ధరణ, గోసంరక్షణశ్రీవారి వైభవ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు జగన్ చేసిన సేవ మరెవ్వరూ చేయలేదు. భక్తికీ, రాజకీయానికీ ముడిపెట్టేంత నైచ్యానికి ఆయన ఏనాడూ దిగ జారలేదు. ధర్మాచరణ అంటే రాజకీయ అవసరాలకు శ్రీవారినీ, ప్రసాదాన్నీ వాడుకోవడం కాదు. శ్రీవారి ప్రసాదంలో పంది కొవ్వు, చేపకొవ్వు కలిసి కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేసిన వాళ్ళు భక్తులా? నిజానికి ఆ కొవ్వు వారి మస్తిష్కపు మకిలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలో నిరంతర వేదఘోష ప్రతిధ్వనించింది. కోవిడ్ కాలం నుండి ‘నాద నీరాజన వేదిక’ మీద నిత్యం భారత, భాగవత, రామాయణ, సుందరకాండల ప్రవచన పరిమళం ఆ వైకుంఠాన్ని చేరింది.శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది జగన్. ఆ నిధుల ద్వారా దేశ వ్యాప్తంగా 3,500 ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ జరిగింది. దాన్ని సహించలేక ఆ రోజు ఆ ట్రస్టును విమర్శించాడు చంద్రబాబు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకో వెళ్తున్నాయనీ, అధికారం వస్తే ఆ ట్రస్టు రద్దు చేస్తామనీ బీరాలు పలికాడు. ఇప్పుడు ఆ టికెట్ల సంఖ్య పెంచి, ఆలయాలు నిర్మిస్తాం అంటున్నాడు. ఎంత వంచన! గోసంతతిని మరింత పెంచాలని భావించి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విరాళాల క్రింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు, ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకువచ్చాం. వాటి సంర క్షణ, సంతతి వృద్ధికి మొదటిసారిగా ప్రణాళికలు తయారు చేసి అమలు పరిచాం. తెలుగు రాష్ట్రాలలోని గోశాలలను గుర్తించి మేత, నిర్వహణ వ్యయం అందించాం. అనేక ఆలయాలకు గోవులను విరాళంగా అందించాం. గోసేవా భాగ్యం హైందవ భక్తులందరికీ అందాలని అలిపిరి వద్ద గోమాత ప్రదక్షిణ శాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుత ప్రభుత్వంలో గోశాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పత్రికలు, మీడియా చెప్పాయి. ఇప్పటి దేవ స్థానం అధ్యక్షుడే ముందు కాదని... తర్వాత అంగీకరించాడు. వెన్నలాంటి మనసున్న వేంకటేశ్వరుడు నవనీత ప్రియుడు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ యాంత్రికంగా జరిగేది. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగను చిలికించి అప్పుడే తీసిన ఆ నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించే ఏర్పాటు చేశారు. ఎంత భాగ్యం ఇది. ఎంత సేవ ఇది. ఎంత మంచి ఆలోచన ఇది.ఎన్నెన్ని సంస్కరణలు!తిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను, మఠాధిపతులను ఆహ్వానించి హైందవ ధర్మ పరిరక్షణకు, వ్యాప్తికి అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. ఇతర మతాల వారు హిందూమతం స్వీకరించాలి అనుకుంటే అందుకు కేంద్రం తిరుమల కావాలని తీర్మానించాం. అందుకు ఒక వేదిక ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇంతటి విప్లవాత్మక నిర్ణయం మొదటిగా తీసుకున్నది తి.తి.దేవస్థానమే. దానికి కారణం జగన్. వేదమూర్తి, వేదస్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేద ఘోష వినిపించాలని, భక్తులు అది విని తరించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం ప్రారంభించాం. యువతరాన్ని సక్రమ మార్గంలో ఉంచాలని, శ్రీవారి భక్తి మరింతగా వారి హృదయాలలో నిండా లని శ్రీవారి గోవింద నామకోటి ప్రారంభించాం. యువతీ యువకులు గోవింద నామకోటి రాసి, ఆలయ అధికారులకు అందజేస్తే వారి కుటుంబానికి శ్రీవారి బ్రేక్ దర్శన సౌకర్యం కలిగించాం. దేశంలోని ప్రముఖ పండితుల సహాయంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలాన్ని గుర్తించాం. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించాం.శ్రీవారికి, శ్రీవారి వివిధ ఆలయాలలో ఉపయోగించిన పుష్పాలను వృథాగా పారవేయక వాటితో అగరుబత్తుల తయారీ ప్రారంభించాం. సప్తగిరులకు గర్తుగా ఏడురకాల పరిమళాల అగరుబత్తులు తయారు చేశాం. స్వామివారికి అలంకరించిన సుమాల పరిమళం... అగరుబత్తీగా మన ఇంట వెలగడం, ఆ పరిమళ భక్తి పరవశంలో మనం లీనం కావటం ఎంత అదృష్టం. అదీ గాక దీనివల్ల ఎందరో మహిళలలకు ఉపాధి ఏర్పడింది. బ్రేక్ దర్శనాలను దాదాపు తగ్గించి, సామాన్య భక్తుల దర్శ నాలకు ప్రాముఖ్యం ఇచ్చాం. క్యూలైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు కాఫీ, టీ, పాలు పంపిణీ చేశాం. కొండ మీద ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాం. శ్రీవారి ప్రసాదాల కవర్లను కూడా ప్లాస్టిక్ రహితంగా తయారుచేయించాం. కొండమీద పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాం. శిలాతోరణం వద్ద 10 ఎకరాలలో పవిత్ర ఉద్యాన వనం, గోగర్భం డ్యామ్ వద్ద 25 ఎకరాలలో పవిత్ర శ్రీగంధ ఉద్యానవనం ఏర్పాటు చేశాం.2021 అక్టోబరు 30, 31 తేదీలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జాతీయ గో సమ్మేళనం నిర్వహించాం. వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. తిరుమలలో నేడు ప్రతి పౌర్ణమికి శ్రీవారికి జరుగు తున్న గరుడసేవ ప్రవేశపెట్టింది జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాలుగు మాడ వీధులలో భక్తులు పాదరక్షలు ధరించ రాదని నిర్ణయం తీసుకున్నవారు జగన్మోహన్ రెడ్డి. అలిపిరి నుంచి కాలినడకన దర్శనం చేసుకున్న సమయంలో వారికి ఈ ఆలోచన వచ్చిందట. అలాంటి వ్యక్తిని, భక్తుడిని బూట్లు ధరించి పూజలు చేసేవారు విమర్శించడం ఎంత అన్యాయం?భక్తుల కోసం...అలిపిరి కాలినడక మార్గపు పైకప్పు ఎప్పుడో 40 సంవ త్సరాల క్రితం నిర్మించారు. అది పూర్తిగా పాడయింది. భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఓ దాత సహాయంతో, దాదాపు 25 కోట్ల వ్యయంతో దానిని పునర్నిర్మించాం. ఆ ఆదేశం ఇచ్చింది జగనే. ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. కార్తీక మాసంలో మహిళల సామూహిక దీపారాధన ఉత్సవాలను 2020 నవంబరు 30న ప్రారంభించాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించాం.తిరుమలలో రూ. 100 కోట్ల వ్యయంతో మ్యూజియం అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ మ్యూజియంలో సుమారు 4 వేల అరుదైన, అపురూపమైన హైందవధర్మ కళాఖండాలు, దేవతామూర్తులు రూపకల్పన చేశాం. శ్రీవారి వైభవం ప్రపంచంలోని వారందరూ తెలుసుకోవాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ను హిందీ, కన్నడ భాషల్లో ప్రారంభించింది జగనే.తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో అధునాతన సి.టి. స్కాన్, ఎక్స్ రే మిషన్లు, 34 కోట్ల రూపాయల వ్యయంతో రోగుల కోసం నూతన గదులు నిర్మించాం. పేదలకు ఉచితంగా మోకాలు ఆప రేషన్లను ఆరోగ్యశ్రీ క్రింద చేయించాం. చెవుడు, మూగ పిల్లలకు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషను ఉచితంగా చేయించాం. పెదవి చీలికతో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్మైల్ లైన్ సంస్థ సహకారంతో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు నిర్వహించాం.శ్రీవారికి తల్లి వకుళమాత. ఆమె ఆలయాన్ని ఏ పాలక మండలీ, ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. ఆ శిథిల ఆలయాన్ని ఓ దాత సాయంతో 12 కోట్ల రూపాయల వ్యయంతో వైభవంగా నిర్మించాం. దాన్ని జగన్ 2022 జూన్ 23న ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి జరిగే అన్ని సేవలూ భక్తులందరూ దర్శించాలని, వైభవోత్సవాల పేరుతో వివిధ ప్రాంతాలలో నిర్వహించాం. మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి వారి అనుమతితో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులు ఉండేలా మార్పు చేశాం. దానివల్ల ఏటా దాదాపు 8 లక్షలమంది భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించు కున్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల వారికి స్వామిపట్ల మరింత భక్తి భావం ఏర్పడాలని, వారికి ఉచిత రవాణా, ఆహార, వసతి ఏర్పాట్లను చేసి వైకుంఠద్వార దర్శనం చేయించాం.ఉద్యోగుల కోసం...తి.తి.దే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగి చని పోయిన 90 రోజుల లోపు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తెచ్చాం. అంతకు ముందు ఆ ఉద్యోగం రావడానికి సంవత్సరాలు పట్టేది. ఇందులో భాగంగా ఒకేరోజు 119 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చాం. ఈ మార్పులు జగన్ వల్లే సాధ్యమయ్యాయి. తి.తి.దేవస్థానం ఉద్యోగులకు చెన్నై, బెంగళూరు నగరా ల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించేలా 2022 జనవరి 7న ఒప్పందం చేసు కున్నాం. శ్రీవేంకటేశ్వర మ్యాన్పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 14 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒకే గొడుగు కిందికి తెచ్చాం. వీరందరికీ సీనియారిటీ, హెూదాను బట్టి జీతాన్ని 3 వేల నుంచి 20 వేల వరకు పెంచాం.తి.తి.దేవస్థానం ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మేలు ఒక చరిత్ర. ఈ ఉద్యోగులందరికీ న్యాయ వివాదాలు లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం వడమాలపేట మండలం, పాదిరేడు అరణ్యం గ్రామం వద్ద 300 ఎకరాల భూమిని సేకరించాం. ఇందుకోసం ఉద్యోగులు చెల్లించాల్సిన రూ.60 కోట్లు యాజమాన్యమే కలెక్టరుకు చెల్లించేలా చేసి భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఈ భూమిని చదును చేసి, రోడ్లు, కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించాం. ప్రతి ఉద్యోగికీ 50 అంకణాల భూమి చొప్పున 5,518 మంది ఉద్యోగులకు జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం ఆ భూమిని ఆనుకుని ఉన్న మరో 132 ఎకరాల భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాం. తి.తి.దే. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శ్రీకాళహస్తి మండలం, పల్లం వద్ద భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాం. కానీ అధికార మార్పిడి వల్ల నీలినీడలు ఏర్పడ్డాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి వేల ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వం మీద ఎంతో ఆర్థికభారం పడినా ఆయన ఏ సంక్షేమ పథకమూ ఆప లేదు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే జనం కోసం, సత్యం కోసం నిలబడినవారు బలయ్యారు. సోక్రటీసుకు విషం పెట్టి, బ్రూనోను శరీరమంతా తగులబెట్టి చంపారు. భగత్సింగును ఉరితీశారు. అల్లూరి సీతారామ రాజును కాల్చి చంపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల నరికారు. ప్రజల కోసం నిలబడిన వారి అధికారం, జీవిత కాలం స్వల్పమే అయింది. జగన్ అధికార కాలం కూడా వేల అబద్ధాల మబ్బుల ముందు మసక బారింది. ఆయన ఓడిపోయాడే గాని ఇంకా చనిపోలేదు కదా అని తన అనుయాయ, శిష్యుని చేత బహిరంగంగా అనిపించిన పాషాణ హృదయ కుటిలత్వం చంద్రబాబుది. హైందవ ధర్మ రక్షణకు జగన్ చేసింది కొండంత, ఇక్కడ నేను చెప్పింది గోరంత. ఆయనపై నీచ నికృష్ట ఆరోపణలు చేసిన బూట్ల బాబు, గాలి సోకినట్లు గోల చేసే పవనానందులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అందుకే మళ్ళీ మళ్ళీ అంటాను: హైందవానికి ఆలన – జగన్ పాలన అని. ఓం నమో వేంకటేశాయ!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
పరిశ్రమలకు మేలు చేసే ఒప్పందం
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సుదీర్ఘమైన, క్లిష్టమైన చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చినది మాత్రమే కాదు; మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న తీరుకు అది ప్రతీకగా నిలుస్తోంది. పైగా ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర ప్రయోజనాలున్న రెండు పెద్ద ఆర్థిక వ్యవ స్థలను అది కలుపుతోంది. ఈ రెండింటి వాటా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నాల్గవ వంతుగా ఉంది. భవిష్యత్తులో కూడా ఆర్థిక బంధం స్థిరంగా కొనసాగేందుకు అది పునాది వేసింది. ఇది తాత్కాలిక బేరసారాల ప్రయోజనాల చుట్టూ అల్లుకున్నది కాకపోవడం వల్లనే ‘అన్ని భాగస్వామ్యాలకు మాతృక’ లాంటిది అనే పేరు తెచ్చుకుంది. ఇది దీర్ఘకాలిక ఆశయంతో సమగ్రంగా రూపుదిద్దుకున్న ఒప్పందం. వస్తు వాణిజ్యం, సేవలతోపాటు ఇన్వెస్ట్ మెంట్, డిజిటల్ ట్రేడ్, సతత వికాసం, రాకపోకలు, సాంకేతిక పరి జ్ఞాన సహకారాన్ని కూడా జోడించుకోవడం వల్ల ఇదేదో కేవలంసుంకాలలో వెసులుబాటు కల్పించుకున్నదిగా కాక, రెండు పక్షాలకు ప్రయోజనదాయకమైన ఆర్థిక చట్రాన్ని రూపొందించుకోగలిగింది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే, పోటీ సామర్థ్యం ప్రస్తుతం మార్కెట్ల సౌలభ్యానికి మాత్రమే పరిమితమైనదిగా లేదు. దానికి ఒక స్థిరమైన, నమ్మకమైన, స్థితి స్థాపక సామర్థ్యమున్న వాతావరణం అవసరమవుతోంది.స్థిరమైన మార్కెట్ఐరోపా వంటి విస్తృత, నియమ–ఆధారిత మార్కెట్ వల్ల ఒక లాభం ఉంది. వివిధ సంస్థలు స్వల్పకాలిక లాభాలకు అతీతంగా, పెట్టుబడులు, ఎగుమతులు, ఉత్పాదక సామర్థ్యం, భాగస్వామ్యా లపై దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, పాదరక్షలు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాల విడి భాగాల వంటి ఎక్కువ మంది శ్రమ అవసరమైన రంగాలకు అది మరీ అవసరం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించగల శక్తి కూడా ఆ రంగాలకు ఉంది. ఆయా రంగాలకు యూరోపియన్ మార్కెట్లు మునుపటికన్నా మెరుగ్గా అందుబాటులోకి వస్తే గణనీయమైన లాభం చేకూరుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలతో సహా భారతీయ సంస్థలకు మరో మహత్తర అవకాశం లభిస్తోంది. అవి కేవలం ధర విషయంలో పోటీపడటం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మరింత మన్నికైన, విలువ ఆధారిత వస్తువుల ఉత్పత్తికి, విక్రయానికి యూరోపియన్ సంస్థలతో భాగ స్వామ్యం కుదుర్చుకోవడం తేలికవుతుంది. కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం వల్ల రిస్కులుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునేందుకు భారత్–యూరప్ కంపెనీలు రెండూ సప్లై చైన్లను చురుకుగా విస్తరించుకుంటున్నాయి. స్థాయి, సమరశీల సంస్కరణల అజెండా, మెరుగుపడిన పారిశ్రామిక మౌలిక వసతులతో యూరప్కుఇండియా నమ్మదగిన ఉత్పత్తి కేంద్రంగా, నవీకరణ భాగస్వామిగా ఆవిర్భవించగల స్థితిలో ఉంది. ఆ రకమైన మార్పునకు చాలా వరకు టెక్నాలజీ సహకారం పునాదిని అందిస్తుంది. కాలుష్య రహిత టెక్నాలజీలు, డిజిటల్ మౌలిక వసతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ, అడ్వాన్డ్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో బలమైన సహకారాన్ని పాదుకొల్పుకునేందుకు తగిన పరిస్థితులను ఈ ఒప్పందం సృష్టిస్తోంది. నవీకరణలో ఐరోపాకున్న బలం, భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టగల భారత్ సామర్థ్యం ఈ విషయంలో సహజసిద్ధమైన పరస్పర ప్రయోజనదాయకమైన అంశాలుగా పరిణ మిస్తాయి. అధునాతన టెక్నాలజీలను అనుసరించడంలోనేకాదు, వాటి సహ అభివృద్ధిలో, స్థానికీకరణలో, నియోగించడంలో పాలు పంచుకునే అవకాశం భారత్ పరిశ్రమలకు లభిస్తుంది. ఫలితంగా, హెచ్చు విలువ కలిగిన వస్తూత్పత్తి, టెక్నాలజీ సునిశిత రంగాల్లోకి భారత్ పయనం వేగవంతమవుతుంది.పరస్పర తోడ్పాటు సేవలు, మానవ మూలధనంపై ఈ ఒప్పందం చూపగల ప్రభావం కూడా తక్కువదేమీ కాదు. జనాభా వర్గాలలో భారత దేశానికి ఉన్న సానుకూలాంశం వ్యూహాత్మక ఆస్తిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోని పెద్ద యువ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియా, టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన, ఆరోగ్య రక్షణ, వ్యాపార సేవలు వంటి వివిధ విభాగాల్లోకి వృత్తినిపుణులను తీసుకురాగలదు. యూరప్లో వయసు మీదపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండ వచ్చు. కానీ, వాటి ఆర్థిక వ్యవస్థలు నవీకరణతో నడుస్తున్నాయి. వాటికి సేవలను, మొబిలిటీని అందుబాటులోకి తెచ్చేందుకు యూరప్తో సంబంధాలు నెరపడంలో భారత నిపుణులకున్న సామ ర్థ్యాన్ని ఈ ఒప్పందం మెరుగుపరుస్తుంది. భద్రత–రక్షణ రంగాల్లో కూడా ఉభయ పక్షాల ప్రయోజనాలు సమ్మిళితం కావడం ఈ ఒప్పందంలో మరో ముఖ>్యంశం. అధునా తన రక్షణ పరికరాలు, ద్వంద్వ వినియోగ టెక్నాలజీ ఆవరణ వ్యవస్థ లలో తోడ్పాటుకు భారతీయ పరిశ్రమలకు ఈ ఒప్పందం ద్వారాలు తెరుస్తోంది. క్రమేపీ సమస్యాత్మకంగా మారుతున్న ప్రపంచ వాతా వరణంలో బలహీనతలను తగ్గించుకుంటూ, దేశీయ పారిశ్రామిక సామర్థ్యాలను పటిష్టపరచుకునేందుకు కూడా వీలుంది. మరో రకంగా కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గణనీయమై నదే. సమ్మిళితం ద్వారా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారతదేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈఒప్పందం ఎంతగానో అవసరమవుతుంది. దేశీయ ఉత్పాదక సామ ర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా నిష్ఠగా ఈ ఒప్పందాన్ని అమలు జరిపితే, భారతదేశపు పారిశ్రామిక పథం రూపురేఖలు కొన్ని దశాబ్దాలపాటు కొత్త అంచులను తాకుతూ ముందుకు సాగుతాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత పారిశ్రామిక రంగ స్థితి ఎక్కడో అంచుల లోకాక, కేంద్ర స్థానాన్ని సుస్థిరంగా ఆక్రమించుకోగలుగుతుంది. -వ్యాసకర్త భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)- చంద్రజిత్ బెనర్జీ -
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
ఆర్థిక సర్వేకు కొత్త రూపునివ్వాలి!
మన దేశం స్వాతంత్య్రం సంపాదించు కున్న కొత్తలో ముఖ్యమైన విధానపరమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయీ అంటే అవి ప్రణాళికా సంఘం ప్రచురించిన పంచవర్ష ప్రణాళికలే! ప్రణాళికా సంఘం ప్రాధాన్యం కోల్పోయి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాభవం పెరిగిన తర్వాత, బడ్జెట్కు ముందు ఆర్థిక శాఖ సమర్పించే ఆర్థిక సర్వే క్రమేపీ ఎక్కువ మందిని ఆకర్షించడం మొదలైంది. ఈ సర్వే కొన్నేళ్ళుగా పెక్కు ఉపయోగకరమైన విధానపరమైన ఐడియాలను, ఆలోచనలను రేకెత్తించే అంశాలను మన ముందు ఉంచుతూ వస్తోంది. ఉదాహరణకు, చైనాపై వాణిజ్య, పెట్టుబడులపరమైన ఆంక్షలను విధించడంలోని ఔచిత్యాన్ని 2023–24 ఆర్థిక సర్వే ప్రశ్నించింది. అప్పటికి భారత్–చైనా సంబంధాలు కదలని స్థితిలోనే ఉన్నాయి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే బదులు భారత దేశంలో వస్తూత్పత్తి చేసేందుకు చైనా సంస్థలకు అనుమతించడం మెరుగైన ఆలోచన అనిపించుకోవచ్చని సర్వే వాదించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మొదట్లో ఆ ఆలోచనను తోసిపుచ్చినా, అది పునః పరిశీలించదగ్గ ప్రతిపాదనేనని ఆ తర్వాత అంగీకరించింది. సంక్షేమ పథకాల ఫలాలు అందవలసిన వారికి అందడం లేదనీ, వాటిలో లొసుగులు ఉన్నాయనీ గతంలో ఆర్థిక సర్వేలు ఎత్తి చూపాయి. లబ్ధిదారులకు నేరుగా నగదు బదలీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాయి. ఈ ప్రతిపాదన 2009–10, 2010–11 సంవత్సరాల సర్వేలలో మొదట చోటుచేసుకుంది. దానిపై అప్పట్లో మొదట్లో పెద్ద దుమారమే రేగింది. కానీ, అప్పటి నుంచి రైతులు, మహిళలు, ఇతర ఉద్దేశిత లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా నగదు బదలీ చేయడం సంప్రదాయసిద్ధమైన విధాన సాధనాలలో అంత ర్భాగంగా మారింది. మరింత ఉపయోగపడేలా...ఆర్థిక సర్వే కొత్త ఆలోచనలను అందించి, ఎక్కడెక్కడ దిద్దు బాటు చర్యలు అవసరమో సూచించగలదు. కానీ, సర్వేలో పది సూచనలు ఉంటే, ఏదో ఒక దానిపై చర్చించి, అమలులోకి తెస్తు న్నారు. మిగిలిన తొమ్మిదింటిని గాలికి వదిలేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే, సర్వేలో చూపే టేబుల్స్, ఛార్టులలో గాఢత లోపిస్తోంది. మరి పౌరులు, సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రజా సేవకులకు మరింత ఉప యోగకరమైనవిగా ఆర్థిక సర్వేలు ఉండేటట్లు చేయడం ఎలా? మొదట... వాటిని ప్రాధాన్యం కలిగినవిగా మార్చాలి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో రూపుదిద్దుకోగలిగిన వివిధ సందర్భాలను సర్వే స్థూలంగా వివరించగలగాలి. ఆ యా సందర్భా లలో వివిధ మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటరీ ఏజన్సీలు విధాన పరంగా ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందో కూడా సూచించాలి. అటువంటి పరిణామాల విశ్లేషణ చిన్న వ్యాపార సంస్థలు రానున్న నెలలకు సంబంధించి అత్యవసర ప్రణాళికలు తయారు చేసుకునేందుకు సహాయపడుతుంది. బాహ్య వాతావరణం మార గానే, దానికి తగ్గట్లుగా విధానపరంగా చకచకా మార్పులతో స్పందించేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. రకరకాల ప్రత్యామ్నా యాలను లెక్కలోకి తీసుకుంటూ స్వల్ప, మధ్యకాలిక అంచనాలకు రావడంలో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్తో కలసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేయవచ్చు. ఈ అంచనాలను బట్టి ఎటువంటి పరిస్థితులు తలెత్తగలవో ప్రణాళిక వేసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో ప్రతి 3 నెలలకోసారి ఈ అంచనాలను అప్డేట్ చేయవచ్చు. ఏం చేయాలి?ఒకటి – చాలా భాగం భారతీయ వ్యాపార సంస్థలు సొంత ఆర్థిక, భౌగోళిక రాజకీయ సలహాదారులను నియమించుకోగలిగిన స్థోమత ఉన్నవి కావు. కీలక ఆర్థిక ప్రశ్నలపై మార్గదర్శనం చేయడం ద్వారా సర్వే బృందం ఆ లోటును భర్తీ చేయవచ్చు. రెండు – సర్వే చాట భారతంలా కాకుండా వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. అది భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఇయర్ బుక్లా కాకుండా ముఖ్యమైన ఆర్థిక సవాళ్ళపై దృష్టి కేంద్రీకరించిన సంగ్రహ డాక్యుమెంట్గా ఉండాలి. అప్పుడే అది నిజంగా ఉపయోగ పడుతుంది. నిర్ణయాలు తీసుకునేవారిలో చాలా మందికి సుదీర్ఘ పాఠాలను చదివేంత తీరిక ఉండదు. మూడు– ఆర్థిక సర్వే అందరి భాగస్వామ్యంతో రూపొంది నదిగా ఉండటం సముచితం. వివిధ ఆర్థిక మంత్రిత్వ శాఖలు,రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య లపై సర్వే బృందం ఇన్పుట్స్ సేకరించాలి. ఆ యా అంశాలపై ఆలోచించదగ్గ విధాన ప్రతిపాదనలు చేసిన వారికి విధాన నోట్సును తయారు చేసేందుకు స్వల్పకాలిక గ్రాంటులు మంజూరు చేయవచ్చు. ఆ సమావేశాల్లో పాల్గొనేవారు అకడమిక్ పరిశోధకులు, పాలసీ ప్రాక్టీషనర్లు ఇద్దరి మాటలను వినేవారుగా ఉండాలి. ఎటొచ్చీ వయసు విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకోవడం వాంఛ నీయం. విధాన నిర్ణయ ప్రక్రియలో యువత పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. బహిరంగ పోటీ వల్ల తుది ఎంపిక లను సీరియస్గా తీసుకోగల అవకాశం ఉంటుంది.హ్యాకథాన్ అవసరంఎవరో తెలివైన కొద్దిమంది పురుషులు, మహిళలతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ లాంటి సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం కష్టం. చాలామంది విధాన నిర్ణేతలు తాత్కాలిక ప్రాతి పదికపై బయటవారి సలహాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతూంటారు. కానీ, దీనికి ఒక విధానపరమైన బృందం అవసరం. ఆబృందాన్ని నేటి కంప్యూటర్ పరిభాషలో హ్యాకథాన్ అందాం. విద్యా వేత్తలు, విధానపరమైన పరిశోధకుల నుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే సంస్థాగత వేదికగా అది పని చేస్తుంది. నూతన విధాన పరిష్కారాలను ప్రతిపాదించేవారు సంకుచిత ప్రయోజనాల నిమిత్తం ఆ పని చేయడం లేదనీ, వారు పోటీతో కూడిన ప్రక్రియ ద్వారా ఎంపికై వచ్చినవారనీ విధాన నిర్ణేతలకు తెలిస్తే, వారు ఆ పరిష్కారాలను సానుకూలంగా పరిశీలించే అవ కాశం ఎక్కువ. హ్యాకథాన్ సూచించిన కొన్ని పరిష్కారాలు నేడు పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి కాకపోయినప్పటికీ, అవి రేపటికైనా ఉపయోగపడేవిగా ఉంటాయి. నేటి యువ హ్యాకథాన్ విజేత రేపటి సీనియర్ విధానపరమైన నిర్ణేతగా పరిణమించనూ వచ్చు.ప్రమిత్ భట్టాచార్య వ్యాసకర్త ‘డేటా ఫర్ ఇండియా’ రిసెర్చ్ హెడ్; ‘న్యూఇండియా ఫౌండేషన్’ ఫెలో (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఈసారి రాజకీయ దావోస్
స్విట్జర్లాండ్లోని దావోస్లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లు ఇంతకుముందు 1971 నుంచి 55 సార్లు జరిగాయి గానీ, ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తినట్లు లేవు. సాధారణంగా ఆ సదస్సు అజెండా లోకి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ప్రైవేట్ రంగానికీ ప్రభుత్వాలకూ మధ్య సహ కారం, సామాజిక అసమానతలు, సాంకే తిక రంగం, వాతావరణ పరిరక్షణ, రాజ కీయ సుస్థిరతల వంటి అంశాలు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆర్థిక రంగ కోణం నుంచే చూస్తారు. అందుకే వాటికి ఆర్థిక సదస్సులనే పేరు వచ్చింది. కానీ, ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన సమావేశాలలో ఈ అంశాలపై ఏ చర్చలు జరిగినా జరగకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వివాదాలు రాజ్యమేలాయి. అది ఆర్థిక దావోస్కు బదులు రాజకీయ దావోస్ అయింది.మిత్రుల మధ్యే భేదాభిప్రాయలుతిరిగి అందులోనూ గమనార్హమైన విశేషం ఒకటున్నది. దావోస్ సమావేశాలు మొదలైనప్పటినుంచి ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా, యూరప్ కలిసి శాసిస్తూ వచ్చాయి. అటువంటిది ఈసారి ఆ రెండు పక్షాల మధ్యనే భేదాభిప్రాయాలు ఏర్ప డ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సమావేశా లతో ఆరంభించి అమెరికా, యూరప్లు కలిసి పలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను సృష్టించాయి. అన్ని చట్టాలూ తామే చేశాయి. ఆర్థిక, వాణిజ్య రంగాలను తమ గుప్పిట పెట్టుకుని లాభ పడ్డాయి. అటువంటిది ఈసారి సమావేశాలు వచ్చేసరికి అంతర్గత విభేదాలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఈసారి దావోస్ భిన్నమైనది కావటం అందువల్లనే!అయితే ఇది ఆకస్మిక పరిణామం కాదు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఏడాదిగా ఉభయపక్షాల మధ్య పొగ రాజుకుంటూనే వస్తున్నది. అది, తక్కిన దేశాలతో పాటు యూరప్పై భారీ సుంకాలు, ఉక్రెయిన్ విషయంలో రష్యా అను కూల వైఖరి తీసుకోవటం, యూరప్ తన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసి తన భద్రతను తాను చూసుకోవాలనటం, ‘నాటో’తో సంబంధాలు గతంలో వలె ఉండబోవన్న సూచనలు, యూరప్ ఇంతకాలం ‘తమపై పడి తిన్న’దనే తరహా వ్యాఖ్యలు, యూరప్లోని ఉదార వాద ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా తమ తరహా మితవాద – జాతీయవాద పార్టీలకు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆ పొగకు కారణమయ్యాయి. అలాగే గత కొద్ది నెలలుగా యూరప్ను ఈసడించి మాట్లాడటం ఒకటైతే, గత నవంబర్లో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో అదే వైఖరిని చూపుతూ, అసలు యూరోపియన్ నాగరికత అన్నదే ‘తుడిచి పెట్టుకుపోయే’ పరిస్థితి వచ్చిందనటం మరొకటి అయింది.గ్రీన్ల్యాండ్తో పైపైకి...ఆ విధంగా పొగలు దట్టం కాగా, తమ సాటి ‘నాటో’ దేశమైన డెన్మార్క్కు చెందిన గ్రీన్ల్యాండ్ విషయమై జరుగుతున్న తతంగంతో ఆ పొగ కాస్తా భగ్గున మంటగా మారింది. మొదట ఇదే విధంగా కెనడాను సైనిక బలంతోనైనా తమ 51వ రాష్ట్రంగా మార్చుతామన్న ట్రంప్ పుట్టించిన ఆ మంటలు ఇప్పటికీ ఆగ్రహాన్ని రగుల్చుతుండగా, ఇపుడు గ్రీన్ల్యాండ్ను బలప్రయోగంతో 51వ రాష్ట్రం చేయగల మనటం అగ్నికి ఆజ్యంగా మారింది. గత వారపు దావోస్కు ముందు అందరూ ఎవరి దేశంలో వారుండి రాళ్ళు విసురుకోగా, దావోస్లో ఒకేచోట సమావేశమయే పరిస్థితితో బాహాబాహీ వంటి సన్నివేశాలు కనిపించాయి.ఇది అంతిమంగా ఏ విధంగా పరిణమించేదీ చెప్పలేము. మౌలికంగా ఇరువురివీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలు. ఉభయుల ప్రయోజనాలు కలిసి ఉన్నాయన్నది ట్రంప్ వ్యూహపత్రంలోనూ వివరించిన విషయమే. కానీ గతానికీ, ఇప్పటికీ ఒక కీలక మైన తేడా ఉంది. ‘అమెరికా ఫస్ట్’, ‘మాగా’ లక్ష్యాలను ప్రకటించిన ట్రంప్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ అందుకోసం ఉప యోగించుకోవటమే తన విధానమైనట్లు ఆ పత్రంలో దాపరికం లేకుండానే ప్రకటించారు. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుండటం వల్లనే ఇరువురి మధ్య గతంలో లేని విధంగా పొగలు, మంటలు రాజుకుంటున్నాయి. దావోస్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, అవి ముగిసిన తర్వాత కూడా రెండు వైపుల నుంచి వినవచ్చిన మాటలను గమనించగా, రాజీలు కనీసం ప్రస్తుతానికి జరగక పోవచ్చు. తన వ్యూహాలు, ఎత్తుగడలు నెగ్గే పరిస్థితి లేదని ట్రంప్ గ్రహించి బాగా వెనుకకు తగ్గితే తప్ప. కానీ ఆయన స్వభావం తెలిసిన వారిలో అటువంటి ఆశాభావం కనిపించటం లేదు.ఢీ అంటే ఢీపరిస్థితి అర్థం అయేందుకు రెండువైపుల నుంచి వినవచ్చిన కొద్ది మాటలను గమనించాలి. ట్రంప్ అన్నది, ‘నేను మితిమీరిన బలప్రయోగానికి నిర్ణయిస్తే తప్ప బహుశా మాకేదీ లభించదు. అపుడు మమ్ములను ఎవరూ ఆపలేరు. అయితే నేనాపని చేయను’. ఇది గ్రీన్ల్యాండ్ గురించినది. మరొకవైపు యూరోపియన్ యూని యన్ కమిషనర్ ఉర్సులా వ్యాఖ్యలు ఇవి: ‘గతాన్ని (ఇరువురి సంబంధాలపై) గుర్తు చేసుకున్నంత మాత్రాన గత వ్యవస్థలు,సంబంధాలు తిరిగి రావు. ఈ మార్పే గనుక శాశ్వతమైతే, యూరప్ కూడా శాశ్వతంగా మారాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని ఒక కొత్తదైన యూరప్ను శాశ్వతంగా నిర్మించుకోవాలి’. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన గీతా గోపీనాథ్, ‘అమెరికా, యూరప్ల మధ్య విశ్వాసమన్నది పూర్తిగా భంగపడి పోయింది. ఇపుడు యూరప్ ఆర్థికంగా, అంతర్గత భద్రత రీత్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ఆలోచిస్తున్న’దని అన్నారు.ఈ కొత్త పరిస్థితికి బాగా అద్దం పట్టింది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఉత్తేజకర ప్రసంగం. అది అంతే ఆలోచనాస్ఫోరకం కావటంతో వెంటనే దావోస్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్కు అదే స్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది. దానిపై ఆయన వ్యాఖ్యను హైదరాబాద్ పరిభాషలో చెప్పాలంటే, ‘యాద్ రఖ్లో బేటా, దేఖ్ లూంగా’ అవుతుంది. అట్లా అని ఊరుకోలేదు. అమెరికా లేనిదే కెనడా అసలు బతకలేదన్నారు. దానిని కార్నీ తిప్పి కొట్టడమేగాక, పది రోజుల క్రితం చైనా వెళ్లి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. పైగా చైనా నమ్మదగ్గ భాగస్వామి అనీ, అమెరికా కాదనీ ప్రకటించటాన్ని ట్రంప్ గుర్తు చేసుకుంటూ... ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు కెనడాపై వందశాతం సుంకాలు విధించగలనని ప్రకటించారు. వాస్తవానికి కార్నీ ప్రసంగం పూర్తి పాఠంగా పత్రిక లలో రాదగ్గది. మొత్తంమీద ఈసారి దావోస్ సమావేశాల ప్రభావం దీర్ఘకాలం ఉండనున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కనబడే వృద్ధిలో కనబడనివి...
దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్టకేలకు అధిక వృద్ధి బాట పట్టిందని వ్యాఖ్యాతలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ముందస్తు అంచనాలను కూడా లెక్కలోకి తీసుకుంటే, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు 8.1 శాతం. నమోదైనవాటిలో ఇదే ఉత్తమం. కానీ, దీన్ని సందర్భానుసారంగా చూడాలి. గడచిన ఐదేళ్ళ రికార్డు, చతికిల పడిన స్థితి నుంచి చూసి చెబుతున్నది. కోవిడ్ ఏడాది 2020–21లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోవిడ్కు ముందరి ఏడాది (2019–20)ని ప్రాతిపదికగా చేసుకుంటే, తాజాగా ఆరేళ్ళలో వృద్ధి రేటు 5.7 శాతంగా తేలుతుంది. అంతకుముందు 19 ఏళ్ళలోని వృద్ధి రికార్డు కన్నా అది మందగమనం కిందనే లెక్క. కోవిడ్కు ముందరి ఏడాది వరకు సగటున 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది.తాజా వృద్ధిరేటు 2020–21 క్షీణత నుంచి ఏ మేరకు కోలుకున్నామనేదానికి ప్రాతినిధ్యం వహిస్తోందా అనేది కీలక ప్రశ్న. నిలకడగా సాధించగలిగిన వృద్ధిరేటు ఇపుడు ఎంతని చెప్పగలం? వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6.5 శాతం వృద్ధిరేటు ఉండగలదని కొందరు అంచనాలు వెల్లడించారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకుంటే, మూడేళ్ళ (2024–27) చక్రభ్రమణంలో సగటు వృద్ధి రేటు 6.8 శాతం ఉండవచ్చు. మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో కూడా అదే రేటు ఉంది. స్థిర వృద్ధి రేటులో గణనీయమైన పెరుగుదల ఇంకా ఏదీ లేదని ఇది సూచిస్తోంది. విరుద్ధ సూచికలుగతంలో చాలా సందర్భాలలో, ఏదో ఒక ఆర్థిక సూచి సరైన స్థితిలో లేనట్లుగానే కనిపించేది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండ టమో, లేదా ద్రవ్యలోటు మాదిరిగానే వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటమో జరిగేది. దానికి భిన్నంగా నేటి ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగ దశలో ఉన్నట్లుగా చిత్రితమవుతోంది. అయినా, స్థూల గణాంకాలు అప్రమత్తతను సూచిస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గుతున్న బాటలోనే ఉంది. కానీ, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో అది 4.4 శాతంగా ఉంది. అంటే, మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో (3.6 శాతం) కన్నా అధికం. ప్రభుత్వం పెట్టుబడుల ప్రవాహాన్ని ఉధృతం చేయడం, మరింత నిజాయతీతో కూడిన పద్దులు... బహుశా అందుకు కారణం కావచ్చు. ప్రభుత్వ రుణం కూడా తగ్గుతున్న సరళిలోనే ఉన్నప్పటికీ, అధికంగానే కొనసాగుతోంది. జీడీపీలో 81 శాతంగా ఉన్న ప్రభుత్వ రుణం, ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారితే, దాన్ని ఎదుర్కోగల ద్రవ్యాచరణకు అది వెసులుబాటు కల్పించగలిగినదిగా లేదు. కాగా, వృద్ధికి కీలకమైన పొదుపు, ఇన్వెస్ట్మెంట్ రేట్లు గతంలో కన్నా తక్కువగా ఉన్నాయి. స్థూల స్థిర మూలధన సమీకరణ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జీడీపీలో 30 శాతంగా ఉంది. ఇది 2012–13 వరకు ఉన్న ఎనిమిదేళ్ళ సగటు 34 శాతం కన్నా తక్కువ. ఆర్థిక కలాపంలో వస్తువులు, సరుకుల ఎగుమతుల వాటా కొంత కాలంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా, దీన్ని వేగవంతమైన వృద్ధి రేటుకు విరుద్ధమైన సూచిగానే చూస్తారు. బాగుంది కానీ...వృద్ధి రేటు పెరుగుతున్న సరళికి ఆలంబనగా నిలిచే డేటా ఏదైనా కావాలనుకుంటే, ఇతరత్రా సంఖ్యలను చూడక తప్పదు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ అభివృద్ధి సూచిలో మన దేశం ఈ ఏడాది ‘మధ్యస్థ’ నుంచి ‘అధిక’ కేటగిరీలోకి పురోగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది విద్యాస్థాయులు, ఆయుర్దాయం, ఆదాయాలలో వచ్చిన స్థిర మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. దీంతో మురిసిపోవడానికి లేదు. ఈ సూచిలో ‘అత్యధిక’ కేటగిరీ కూడా ఉంది. దానిలో 70కి పైగా దేశాలున్నాయి. ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే, పన్ను రేట్లు (కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, జీఎస్టీ) గతంలో కన్నా హేతుబద్ధంగా ఉన్నాయి. డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులు విస్తృత వినియోగాన్ని సంతరించుకున్నాయి. భౌతిక మౌలిక వసతుల్లో భారీ పెట్టుబడులు అభినందనీయం. ఇవి రోడ్డు, రైలు మార్గాలలో సరుకుల రవాణాను వేగవంతం చేశాయి. అదే సమయంలో, వాణిజ్య వాహనాల అమ్మకాలలో అది ప్రతికూల ప్రభావం చూపడం వేరే సంగతి. సంస్కరణల వల్ల స్థిరాస్తి, వస్తూత్పత్తి వంటి రంగాలు లబ్ధి పొందాయి. ఎలక్ట్రానిక్స్ రంగ నేతృత్వంలో వస్తూత్పత్తి ఎట్టకేలకు కొంత వేగాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా కింది స్థాయి వరకు కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. కానీ పారిశ్రామిక విభాగాల్లో మూలధన వస్తువుల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. తీవ్ర పేదరికం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరగడం శుభ సూచకం. కానీ, అది వినియోగ వస్తువుల డిమాండ్ బాగా పెరిగేటంతగా తోడ్పడకపోవచ్చు. వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నవారు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. దానిలోంచి కొందరు బయటకు రావడానికి బదులుగా కొత్తవారు కూడా ఉపాధికి అదే రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. చేయాల్సింది ఎంతో!ఆదాయ నిచ్చెనలో పై మెట్లపై ఉన్నవారి వినియోగ రుణం ఎక్కువగా ఉంది. గృహోపయోగ వస్తువులపై రుణాలు 2021–22లో ఉన్న రూ. 8.99 ట్రిలియన్ల నుంచి 2023–24లో రూ. 18.79 ట్రిలియన్లకు రెట్టింపయ్యాయి. ఇప్పటికే చేసిన అప్పులు చెల్లించ వలసి రావడం వల్ల భవిష్యత్ వినిమయంపై దాని ప్రభావం పడుతుంది. చాలా రంగాల్లో వృద్ధి ఇప్పటికే మందంగా ఉంది. ముఖ్యంగా, రైళ్ళలో ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగానే పెరుగుతూ వస్తోంది. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్న ప్పటికీ అదీ పరిస్థితి. వినియోగదారులలో అగ్ర భాగాన ఉన్న 20 శాతం మందిపైనే దృష్టి పెడుతున్నట్లు మొన్నామధ్య ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందుకే ఆశ్చర్యం కలిగించలేదు. కానీ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 వరకు గడిచిన ఐదేళ్ళలో 11 శాతం మాత్రమే వృద్ధి చెందింది. దేశం 1991లో సంస్కరణల బాట పట్టిన తర్వాత, ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పు తగినంత చోటుచేసుకోలేదని వీటన్నింటి బట్టి తెలుస్తోంది. తలసరి ఆదాయాలు దాదాపు ఐదు రెట్లు పెరిగినప్పటికీ, జీడీపీలో పరిశ్రమ వాటా అప్పటిలానే ఇప్పుడు కూడా ఒకటో వంతుగానే ఉంది. వ్యవసాయ రంగ వాటా కూడా క్షీణించింది. పంట దిగుబడులు ప్రపంచ ప్రమాణాల కన్నా తక్కువ స్థాయులలో ఉన్నాయి. సేవల రంగమే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగంగా పరిణమించింది. అది చాలా వరకు, ఆర్థిక వ్యవస్థలో అవ్యవస్థీకృత భాగంగానే కొనసాగుతోంది. సరైన ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా సత్వర సేవల రంగాన్ని చూపలేం. ఉత్పాదకత పెంపుదల మూడు సంస్థాగత మార్పులపై ఆధార పడి ఉంది. వస్తూత్పత్తి రంగం గణనీయమైన రీతిలో పెద్దదిగా మారాలి. ఆర్థిక వ్యవస్థ మరింత నియతమైనదిగా మారాలి. పట్టణీ కరణ వేగంగా సాగాలి. ఆర్థికవ్యవస్థ తగినంత వేగాన్ని పుంజు కోవడానికి చేయవలసింది చాలా ఉంది. టి.ఎన్. నైనన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రాజ్యాంగం ఓ ‘సోషల్ డాక్యుమెంట్’
రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26న ఆమోదించుకొని శాసనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రెండేళ్ల 11 నెలల 11 రోజుల సుదీర్ఘ కసరత్తు చేశాక బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ దేశానికి ఓ ఆదర్శ ప్రాయమైన రాజ్యాంగాన్ని అందించింది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వ భావనలను ఫ్రెంచ్ రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొన్నారు. పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, మార్గదర్శక సూత్రాలను ఐర్లాండ్ నుంచి, సుప్రీం కోర్టు విధివిధా నాలను జపాన్ నుంచి స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించే పరిపాలనకు రాజ్యాంగమే మార్గదర్శి. చట్టాల రూపకల్పనకు దిక్సూచి. దేశ ప్రజలకు రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. బాధ్యతలను అందించింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు, ప్రభుత్వాలు చేసిన హామీలను, చేసిన చట్టాల అమలులో లోపాల్ని సవాలు చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలోని అనేక దేశాలు రాజకీయ, సామాజిక అస్థిరతలతో కుప్పకూలాయి. కానీ, ఎంతో విశాలమైనదీ, అతి పెద్ద జనాభాతో కూడి అనేక భిన్న సంస్కృతులు, భాషలు, వర్గాలు,సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ ‘భిన్నత్వంలో ఏకత్వం’లా సుదృఢంగా భారతదేశం 8 దశాబ్దాలుగా నిలబడగలిగిందంటే నిస్సందేహంగా మనకున్న అతి గొప్పదైన రాజ్యాంగమే కారణం. రాజ్యాంగం కేవలం ఒక నియమాల సంకలనం కాదు. సమసమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు దారిచూపే ఓ ‘దీపం’. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించాలో నిరంతరం గుర్తు చేసే ఓ దార్శనిక పత్రం.ప్రవేశిక ప్రాధాన్యంరాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్దేశించింది. ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము’ అనే వాక్యంతో మొదలుపెట్టి ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాము’ అని ఉంటుంది. భారత రాజ్యాంగం దేశంలో ఏ ఒక్క వర్గానిదో, మతానిదో కాదు. కులం, మతం, వర్గం, భాష, లింగ వివక్ష, విద్య... ఇంకా ఇతర ప్రమాణాలతో నిమిత్తం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరి సమానత్వం కోసం ఏర్పరిచింది. సార్వభౌ మత్వం అంటే అర్థం ప్రజలు మాత్రమే సర్వాధికారులు. ప్రభుత్వా లన్నది ప్రజలకు సేవ చేయడానికి ఉనికిలో ఉంటాయి. ప్రభుత్వాల అధికారాలన్నీ ప్రజల చేత, ప్రజల తరఫున, ప్రజల కోసం పాలించ డానికి ఇవ్వబడేవే! రాజ్యాగం గొప్పదైనంత మాత్రాన ఆశించిన ఫలితాలు అంద వని ముసాయిదా ప్రతిని సమర్పించి 1949 నవంబర్ 26న చేసిన చరిత్రాత్మక ప్రసంగంలోనే అంబేడ్కర్ పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగం ఎలా పని చేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడిలేదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అనే అంగాలను మాత్రమే రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఆకాంక్షలను, రాజకీయాలను కోరుకొంటున్నారన్న దానిపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది’’ అంటూ స్పష్టం చేశారు.మంచీ... చెడూ...రాజ్యాంగబద్ధమైన పాలనలో దేశం కొన్ని మైలురాళ్లు చేరుకున్న మాట వాస్తవం. 1947లో దేశ ప్రజల సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పడు అది 72 సంవత్సరాలకు పెరిగింది. అక్షరాస్యత 16% నుండి 80 శాతానికి చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.773 కోట్ల టన్నులకు పెరిగింది. 1947లో కేవలం 1,500 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు దాదాపుగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యాలు ఏర్పర్చు కోగలిగాము. రహదారుల నిర్మాణం కూడా 4 లక్షల కిలోమీటర్ల నుంచి నేడు 60 లక్షల కిలోమీటర్లకు చేరుకోగలిగాము. అంటరాని తనం చట్టపరంగా తొలగించబడింది. దళితులు, గిరిజనులపై జరిగే అకృత్యాల నుండి పరిరక్షించే చట్టాలు రూపొందించబడ్డాయి. వివక్షకు గురైన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆహారం, సమాచారం హక్కుగా కల్పించబడ్డాయి. నిరాదరణకు గురైన సామా జిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రు లుగా, న్యాయమూర్తులుగా నియమించబడటం చెప్పుకోదగిన మార్పు. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందినవారి సంస్కృతి, మతపర విశ్వాసాలకు చట్టపరంగా రక్షణలు కల్పించడం జరిగింది. అయితే, రాజ్యాంగం కల్పించిన మహత్తర అవకాశాలను పూర్తి స్థాయిలో ఈ 8 దశాబ్దాల రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందనడం ఓ చేదు వాస్తవం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల స్ఫూర్తి అమలు కాలేదు. ఫలితంగానే, దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లోకి పోయింది. 90 శాతం సంపద 10 శాతం మంది వద్ద పోగుపడింది. ధనికులు మరింత ధనికులు కాగా, పేదలు మరింత పేదలు అవుతున్నారు. విధానపరమైన వైఫల్యాలే దేశాభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. రాజ్యాంగం ద్వారా రూపొందించే సంస్థలలో ప్రజా భాగస్వామ్యం, పాత్ర తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.అవగాహన పెరగాలి!రాజ్యాంగంలో ఏర్పర్చుకొన్న సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వాలు జరగడంతోనే ఈ సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. ఏటా ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్లలో సంక్షేమానికి కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇవి ప్రాధాన్య రంగాల స్థాయి నుంచి మొక్కుబడి స్థాయికి దిగజారి పోయాయి. ప్రభుత్వాలకు ఆదాయం ప్రజల పన్నుల ద్వారా సమకూరుతున్నదే. పన్నుల్లో ఎంతమేరకు తిరిగి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారో లెక్కలు తీస్తే సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్థం అవుతుంది. సామాజిక న్యాయం జరగకపోతే రాజ్యాంగం ఆశించిన తీరులో అభివృద్ధి జరగదు. రాజ్యాంగ సూత్రాల స్ఫూర్తితో పని చేస్తేనే పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడతాయి. అధికార వికేంద్రీకరణ జరగాలి. అన్ని వర్గాల ప్రజలను సాధికారుల్ని చేయగలిగితేనే... భారత రాజ్యాంగం ఆశించిన మేరకు ఫలితాలు అందుతాయి. భారత రాజ్యాంగాన్ని ఓ సోషల్ డాక్యుమెంట్గా అమలు చేసినప్పుడే ప్రజల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంత రాలు తగ్గుతాయి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పర్చుకోవాలి. రాజ్యాంగం అందించిన హక్కులను ఉపయోగించుకొని ప్రభుత్వాలను నిలదీయాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు (నేడు గణతంత్ర దినోత్సవం) -
సునీల్ మిత్తల్ (వ్యాపార కుబేరుడు) రాయని డైరీ
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా షేక్ చేస్తున్నారు ఆయన. షేక్ చేయటం అంటే, కదిపేయటం మాత్రమేనా, ‘కలిపేయటం’ కూడా! ట్రంప్ పిచ్చికి ఒక పద్ధతి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. పెద ఉప్పెన ఒకటేదైనా వచ్చిపడాలి... మనుషులంతా ఒకరిలోకి ఒకరు మునగదీసుకోవటానికి! దేశాలైనా అంతే, ఉపద్రవం వచ్చిపడితే హద్దులు చెరిపేసుకొని భూభాగాలన్నీ ఒకచోట చేరిపోవలసిందే. మనుషులకన్నా ఏం గొప్పవని ఈ దేశాలు!ట్రంప్ ఇప్పుడొక ఉప్పెన. ఒక ఉపద్రవం. నాకనిపిస్తోందీ... యూరప్ చాలా కాలంగా సెలవుల్లో ఉన్నట్లుగా ఉండటం వల్ల ట్రంప్ను తమాయించుకోలేక పోతున్నదని! సెలవుల నుంచి తిరిగొచ్చాక, ఇంట్లో పని ఉంటుంది; ఒంట్లో బద్ధకంగా ఉంటుంది. ట్రంప్ ఆ బద్ధకాన్ని వదిలించి, మూలన ఉన్న చీపురును చేతికి అందుకునేలా చేశారు. ‘‘గ్రీన్ల్యాండ్ను కలిపేసుకుంటాం’’ అని ఆయన ఒక్కమాట అనగానే ఐరోపా దేశాలన్నీ మెలకువలోకి వచ్చేశాయి! ఆయన ఒక్కసారిగా ట్యారిఫ్లు పెంచేయగానే ఇండియా వంటి దేశాలతో ట్రేడ్ డీల్స్ కోసం పరుగులు పెడుతున్నాయి. ఈయూ లీడర్లు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. ‘యూరోపియన్ కమిషన్’ ప్రెసిడెంట్ మిస్ ఉర్సులా వాండర్, ‘యూరోపియన్ కౌన్సిల్’ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా... రేపు జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు ప్రత్యేక అతిథులు. ఆ మర్నాడే ‘ఇండియా–ఈయూ’ సదస్సు. బహుశా, సెలవుల నుంచి ఎలా తేరుకొని ఎలా పనిలో పడిపోవాలో తెలుసుకునేందుకు ఇండియాతో ఆ సదస్సులో యూరప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇండియాకు వర్క్ తప్ప వెకేషన్ అలవాటు లేదు కనుక ప్రతిఫలంగా యూరప్ నుంచి వర్క్ తీసుకోవచ్చు. ట్రంప్ విషయంలో ఇండియా ‘‘ఇలా ఉండాల్సింది’’, ‘‘అలా ఉండాల్సింది’’ అని ఇండియాలోనే కొందరు విమర్శిస్తున్నారు! ‘ఉండాల్సింది’ అనే మాటను ఎప్పుడైనా సరే, భుజాల మీద బరువు లేని తేలికపాటి మనుషులు మాత్రమే అనగలరు. నేను బిజినెస్మేన్నే కావచ్చు. కానీ నేను జియోపాలిటిక్స్ స్టూడెంట్ని కూడా! ట్రంప్ ట్యారిఫ్ల శబ్దానికి ప్రతీకారంగా ఇండియా మౌనం వహించటమే దీటైన జవాబు అని నేను నమ్ముతాను. శబ్దానికి శబ్దంతో సవాలు విసిరితే అది తగాదా అవుతుంది. మౌనాన్ని అస్త్రంగా సంధిస్తే అవతలి వాళ్ల శబ్దాలు తాటాకు చప్పుళ్లుగా మాత్రమే మిగులుతాయి! ఇది కదా ప్రత్యర్థి ప్రకోపాన్ని శక్తిహీనం చెయ్యటం! గాజాను గొప్ప రియల్ ఎస్టేట్గా మారుస్తానని ట్రంప్ దావోస్ ఎకనమిక్ ఫోరమ్లో అన్నారు! ఒక పిచ్చివాడు అనలేని మాట అది. పచ్చి వ్యాపారి మాత్రమే అలా అనగలడు. చందమామ కోసం గెడకర్రతో ఆకాశాన్ని కదిలిస్తే కనీసం చుక్కలైనా రాలకపోతాయా అని ఆలోచిస్తారు ట్రంప్. ట్రంప్ అనే అధ్యక్షుడిలో ట్రంప్ అనే అనేకమంది వ్యాపారులు ఉన్నారు. లేకుంటే ఆయన గాజాను, గ్రీన్ల్యాండ్ను పునర్నిర్మించాల్సిన నివాస ప్రాంతాలుగా కాకుండా, కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్సులుగా ఎందుకు చూస్తారు? ఎకనమిక్ ఫోరమ్లో ట్రంప్ 72 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ప్రతి మాటలోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే క్లాసిక్ నినాదం చాలా కఠినంగా ధ్వనించింది!ఫస్ట్ అన్నప్పుడు పరుగెత్తి ఫస్ట్ రావాలి. కానీ ట్రంప్, అమెరికాను ఉన్నచోటనే ఉంచి, అమెరికా ఫస్ట్ అనిపించేలా ప్రపంచం ఉన్న ఆర్డర్ని మార్చాలని చూస్తున్నారు! ఆశ్చర్యం ఏముంది?! ఫక్తు వ్యాపారి అలాగే కదా చూస్తాడు, అలాగే కదా చేస్తాడు! -
కమ్యూనిస్టు కూటమికి ఎదురుగాలి
కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజక వర్గాల్లో ఓటర్లంతా దళితులే ఉండరు. కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదీ పరిస్థితి. మరోవైపు ఎన్డీయే కూటమి ఉనికి పెంచుకుంటుంటే, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రత్యర్థి కూటమి ‘యూడీఎఫ్’ బలపడుతోంది. దేశంలోనే ఏకైక కమ్యూనిస్టు ప్రభు త్వాన్ని కేరళలో నడుపుతున్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) పదేళ్ల పాలన తర్వాత ఎదురీదుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సైద్ధాంతిక మందగింపు, కులాల కుమ్ములాటలు కూటమిని బల హీనపరుస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల్లో వివిధ ప్రభా వాల వల్ల ఎల్డీఎఫ్ బలహీనపడ్డ తీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పతనం తర్వాత దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్టు (కూటమి) ప్రభుత్వం ఇక్కడుంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో గెలుపు వరించాలంటే 71 స్థానాల మేజిక్ ఫిగర్ చేరుకోవాలి. 16 రిజర్వుడ్ (పద్నాలుగు ఎస్సీ, రెండు ఎస్టీ) స్థానాలపై పట్టు కీలకం! 2011, 2016, 2021 మూడుఅసెంబ్లీ ఎన్నికల్లోనూ 14లో 12 ఎస్సీ స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయ పరంపర కొనసాగించింది. ఇతర స్థానాల్లోనూ ఎల్డీఎఫ్ దళితుల మద్దతు అపారంగా పొందుతూ వచ్చింది. కార్మికోద్యమాలు, బడు గుల సంక్షేమం, పింఛన్లు, రిజర్వేషన్లు వంటి అంశాల్లో కమ్యూని స్టుల సహజ సైద్ధాంతిక బలం, వ్యవస్థీకృత నిర్వహణ వంటివి దళితుల మద్దతు కూడగట్టడంలో కూటమికి కలిసి వచ్చిన అంశాలు. కానీ, ఇప్పుడా మద్దతు సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో... ఎన్నిక లకు సంబంధించి కేరళలో ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రారంభించింది. వేగంగా మార్పులుకేరళ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో మూడు ముఖ్య కూట ముల గెలుపోటములను ప్రధానంగా మూడంశాలు ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు మూస విధానాలను వ్యతిరేకిస్తూ ఆశావహంగా పెరిగిన నగర–పట్టణ ఓటర్ ఆకాంక్షలు; కులాల కుంపట్లతో, విభిన్న సామాజిక వాదాలతో వచ్చిన చీలికల్లో ‘ఎల్డీఎఫ్ ఓటు బ్యాంకులు’ బలహీనపడటం; కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ బీజేపీ, తిరిగి పుంజుకుంటూ, యూడీఎఫ్ కిందటిఅసెంబ్లీ ఎన్నికల నుంచి బలపడుతూ రావటం... ఈ మూడంశాలు ‘ఓటు రాజకీయాల్ని’ ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ బీజేపీ ఎదుగుదల నేరుగా సొంతానికైనా లాభించ వచ్చు, లేదా ఓటు బ్యాంకు చీలికల వల్ల పరోక్షంగా యూడీఎఫ్కైనా మేలు చేయ వచ్చన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో తిరువ నంతపురం కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడం, అంతకు ముందరి అసెంబ్లీ ఎన్నికల (2021) ఫలితాలకు భిన్నంగా పలుచోట్ల యూడీఎఫ్ కొత్తగా బలపడటం ఇందుకు నిదర్శనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వాతావరణం కొనసాగితే.... నికరంగా నష్ట పోయేది ఎల్డీఎఫ్ అనడంలో సందేహమే లేదు. గతంతో పోల్చి చూస్తే దేశవ్యాప్త రాజకీయ పరిణామాల ప్రభావం కేరళ రాజకీయాలపైన ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడం, ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గెలవడం ఓ పెద్ద పరిణామమే! పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయ కుడు కె.సి. వేణుగోపాల్కు ఏఐసీసీలో ప్రాధాన్యం పెరగటంవంటివి కేరళ రాజకీయాల్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్సభ స్థానాన్ని గెలవటం, మరుసటి యేడు (2025) జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం బీజేపీకి కలిసివచ్చిన అంశాలే! లోక్సభ ఎన్ని కల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత లభించగా అందులో 2 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. పరిమిత వర్గాల్లోనే అయినా దళి తుల్లో బీజేపీ బలపడటం సీపీఎంకు ఆందోళన కలిగిస్తున్న అంశం. చీలిక విసిరిన సవాల్ దళిత ఉప కులాల్లో వచ్చిన చీలికలు అటు యూడీఎఫ్కు, ఇటు ఎన్డీయేకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి. ఫలితంగా రిజర్వుడు స్థానాల్లో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మొత్తం కేరళలో ఎస్సీల జనాభా 9 శాతం. దళితుల్లో ప్రధానంగా ఉన్న పులియలకు తోడు పరయ, కురవ, కనక్కన్, తండన్ వంటి ఉప కులాలున్నాయి. రెండు ఎస్టీ రిజర్వు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నా, 14 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 12 చోట్ల ఎల్డీఎఫ్ వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటికాంగ్రెస్ చేతిలో ఉంటే మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యత 3–6 స్థానాలకు పెరిగితే, ఎల్డీఎఫ్ పట్టు 10–7 స్థానాలకు పరిమితం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దళితుల్లో అధిక సంఖ్యాకులైన పులియ సామాజికవర్గం పైన కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. ఎస్సీల్లోని ఇతర ఉపకులాలు సహజంగానే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఎస్సీల్లో కుల వివాదాలకు, వైషమ్యాలకు, తద్వారా చీలికకు హేతువవుతోంది. అది కూడా పరోక్షంగా కమ్యూనిస్టులు దళితుల్లో పట్టు కోల్పోవడానికి కారణంగా నిలుస్తోంది. పార్టీ సైద్ధాంతికంగా మంద గిల్లడం, ఇతరేతర కారణాల వల్ల పులియ వర్గంలోనూ కమ్యూని స్టులకు కొంత పట్టు సడలింది. కురవ సామాజికవర్గ మద్దతు పరంగా ఎల్డీఎఫ్కు గట్టి పట్టున్న దక్షిణాది జిల్లాలు కొల్లం, పత్తనంతిట్టలలోనూ కులాల్లో వచ్చిన చీలిక వారిని బలహీనపరిచింది.ప్రజానాడి సంకేతాలే కీలకంప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ స్థానిక స్వపరిపాలనను పటిష్ఠపరచుకున్న కేరళలో గత స్థానిక ఎన్నికలు జనం మనోగతాన్ని కొంతమేర వెల్లడి చేశాయి. అలా చూస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునకు భిన్నమైన ఫలితాలు 2025 స్థానిక ఎన్నికల్లో వచ్చాయి. అవి యూడీఎఫ్, ఎన్డీయేకు కొంత ఆశావహంగానే ఉన్నాయి. వరుస రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పు, దళిత ఉప కులాల్లో వచ్చిన చీలిక పాలక ఎల్డీఎఫ్ వ్యతిరేక వాతావరణాన్నే స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకున్న దాదాపు మూడు మాసాల వ్యవధిలో పరిస్థి తులు ఇంకా ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే!-వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -దిలీప్ రెడ్డి -
అధికారం లేని ఆర్థిక రాజధాని
ముంబై మునిసిపల్ ఎన్నికలను నాలుగేళ్ళు ఆలస్యంగా నిర్వహించారు. రాజ్యాంగ ఉల్లంఘనతో సమానమైన ఈ జాప్యం భారతీయ ప్రజాస్వామ్యం గురించి చెప్పకనే చెబుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా, పర్యవసానాలపై ధ్యాస లేకుండా భారతదేశపు సంపన్న మునిసిపాలిటీ పాలనను సస్పెన్షన్లో ఉంచారు. అయితే, మూడవ అంచెలోని రాజ్యాంగపరమైన స్వయం– పాలనా ప్రభుత్వం ఐచ్ఛికమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 227 మంది సభ్యుల బృహన్ ముంబై పాలక సంస్థ (బీఎంసీ)లో బీజేపీ 2017 నాటి (82) స్థితిని మెరుగుపరచుకుని ఈసారి 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనలో చీలిక దానికి బాగా ఉపయోగపడింది. మహారాష్ట్రలో ఎన్నికలు జరి గిన ఇతర పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా కమలమే ఎక్కువచోట్ల వికసించింది. కానీ, ముంబై ఫలితం కనీసం ఒక చక్కని రాజకీయ భాష్యా నికైనా అనువైనదిగా లేదు. ఎందుకంటే, ముంబై మామూలు నగరం కాదు. అదొక నగర రాజ్యం. దాని బడ్జెట్ ముందు దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్లు కూడా తక్కువే. అది భారతదేశపు ఆర్థిక రాజధాని. బాలీవుడ్కు నెలవు. కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి వాలే పెద్ద చెట్టు. సృజనాత్మక కళాకారుల ఆట మైదానం. ఆ విధంగా అది సాంస్కృతిక చోదక శక్తి. దాని బహుళత్వం, విస్తృత దృక్పథ స్వభావం దాని సంపదకు ఏమీ తీసిపోనంత విలువైనవి. బాధ్యత లేని సంస్థలుఅయినా ఎందుకో నామమాత్రపు జవాబుదారీతనమనే జబ్బుతో, ఈ మహా నగరం బాధపడుతోంది. దాని పాలనా విభా గాలు సాలెగూడును తలపిస్తాయి. బీఎంసీ (పౌర సంస్థ), ఎంఎంఆర్డీఏ (ప్రాంతీయ ప్రణాళిక), ‘బెస్ట్’ (రవాణా), ఎంహెచ్ఏడీఏ (గృహ నిర్మాణం), ఎస్ఆర్ఏ (మురికివాడల వాసులకు పునరా వాసం), రైల్వేలు... ఇలా చెప్పుకొనేందుకు చాలా ఉన్నాయి. కానీ, ఏ సంస్థా పూర్తి బాధ్యత తీసుకోదు. ఒకదాని పరిధిలోకి ఒకటి చొరబడే వీలుంటుంది. నింద నుంచి తప్పించుకునే మార్గాలను అవి జాగ్రత్తగా రూపొందించుకున్నాయి. ప్రణాళిక– అమలు, రవాణా– భూవినియోగం, హౌసింగ్–కనెక్టివిటీల మధ్య సంబంధం లేదు. నగరం స్తంభిస్తే ఏ సంస్థనూ బాధ్యురాలిగా చేయడానికి లేదు. కనుక బీఎంసీ ఎన్నికలను పర్మిషన్లు, కాంట్రాక్టులు, భారతదేశపు అత్యంత విలువైన పట్టణ జాగ్రఫీని తీర్చిదిద్దగల హక్కుపై పట్టు సంపాదించ డానికి జరిగినవిగా చెప్పుకోవాలి. ముంబైలో వైచిత్రి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది అసాధా రణమైన సంపదను సృష్టిస్తోంది. అయినా, దాని పౌరులు దుర్బలురు. రియల్ ఎస్టేట్ బంగారం అంత విలువైనది. అయినా, పట్టణ జనాభాలో చెప్పుకోతగినంత మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తంమీద లెక్కకు వచ్చే కుబేరుల్లో కొంతమంది ఇళ్ళు అక్కడే ఉన్నాయి. సాధారణ పౌర జీవనం బీటలువారిన ఫుట్పాత్లు, క్రిక్కిరిసిన రైళ్ళ గుండా సాగిపోతుంది. వర్షా కాలం వచ్చిందంటే, ఇంట్లోకి వరద నీరు రాదనే గ్యారంటీ లేదు. ముంబైని అంతర్జాతీయ ఫైనాన్సియల్ కేంద్రం (ఐఎఫ్సీ)గా తీర్చిదిద్దుతామని 2006లో అప్పటి ప్రధాని వాగ్దానం చేశారు. సింగపూర్, దుబాయ్, హాంగ్కాంగ్ లేదా లండన్లతో పోటీ పడగలిగిన నగరం ఏదైనా ఉందీ అంటే అది ముంబయ్యే! ప్రణాళి కలు రచించారు. కమిటీలు వేశారు. రెండు దశాబ్దాలు గడిచినా, ముంబై అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ కాలేకపోయింది. అది ఇప్పటికీ భారతదేశపు ఆర్థిక రాజధానిగానే ఉంది. అది దేశం ఇచ్చిన పతకం. అంతర్జాతీయ గమ్యస్థానంగా గౌరవం దక్కనే లేదు.అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం?ఐఎఫ్సీ కల సాకారం కాకపోవడానికి బ్యాంకర్లు, వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారు, న్యాయవాదులు లేదా మూలధనం కొరవ డటం కారణం కాదు. అంతర్జాతీయ నగరాలుగా గుర్తింపు పొంద డానికి పొందికతో కూడిన పాలన, ఉత్తమ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు పెద్ద స్థాయిలో ఉండటం అవసరం. అవి కొరవడటం ముంబై వైఫల్యానికి కారణం. ఈ విషయంలో గుజరాత్ లోని ‘గిఫ్ట్’ సిటీ ముందంజ వేయగలిగింది. ముంబైకున్న సాంస్కృతిక లేదా మార్కెట్ పరిపూర్ణత దానికి ఉండబట్టి కాదు. స్నేహ పూర్వక రెగ్యులేషన్, నగదు ప్రోత్సాహకాలు, ఉన్నత స్థాయి నుంచి లభించిన ప్రోద్బలం ఇతోధికంగా తోడ్పడ్డాయి. ముంబైకున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరిమితం. అక్కడి ఆస్తి పన్ను రేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆకర్షణీ యమైన కోస్టల్ రోడ్ ప్రాజెక్టునకు కేంద్రం నుంచో, ఇతర వనరుల నుంచో నిధులు అందాల్సిందే. మెట్రో నెట్వర్క్ కూడా చాలావరకు బాహ్య వనరులపైనే ఆధారపడింది. నిర్మాణం పూర్తయి, అమ్ముడుకాని ఫ్లాట్లు రెండు లక్షలకు పైగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. సబబైన ధరలకు గృహ సదుపాయం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ లేదా రోడ్డు మరమ్మతులు వంటివి ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా కనిపించవు. రాయితీలు, ఉచిత బస్సు ప్రయాణాలు మేనిఫెస్టోలలో కనిపించాయి కానీ, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో పేర్కొన లేదు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే పాలనా వ్యవస్థ పురపాలక సంస్థే. కానీ, వాటి రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీ యాల్లా తయారయ్యాయి. స్వయం పాలన సాగినప్పుడే...ట్రిపుల్ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) ఇంజిన్ నినాదం 2017లో మాదిరిగానే మళ్ళీ పనిచేసింది. చీలికలు పీలికల రాజకీయ పర్వంలో ఓటర్లు సుస్థిరతనే ఎంచుకున్నట్లు సంకేతమిచ్చారు. కాస్మోపాలిట నిజంకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ‘మరాఠీ అస్మిత’కు ముప్పు వాటిల్లుతోందంటూ చూపించబోయిన బూచి పనిచేయలేదు. ముంబై ప్రధాన సమస్య దాన్ని ఎవరు పాలిస్తున్నారు అన్నది ఒక్కటే కాదు. నికరంగా నగర–ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటన్నది! భారత పబ్లిక్ ఫైనాన్స్, గవర్నెన్సు... రెండూ కూడా నగరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగానే చూస్తున్నాయి తప్ప, వాటిని స్వయం ప్రతిపత్తి అవసరమైన ఆర్థిక ఇంజిన్లుగా చూడటం లేదు. వాటికి సామర్థ్యాన్ని సమకూర్చుకునే శక్తినిచ్చి, దీర్ఘకాలిక విస్తృత ప్రణాళికలో భాగం చేయడం లేదు. పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రే అట్టేపెట్టుకోవడం ఊహించదగిన అంశం అవుతోంది. అది బంగారు బాతు లాంటి శాఖ. అంతర్జాతీయ నగరంగా మారాలని ముంబై నిజంగా భావించే పక్షంలో, దానిలో సంస్థాగతమైన మార్పులు అవసరం. నగరంలో పరిస్థితులకు ఒకే సంస్థ బాధ్యత వహించేటట్లు చేయాలి. వివిధ ఏజెన్సీలను ఒక కోవలోకి తేవాలి. కోశ సంబంధ స్వయం ప్రతిపత్తి ఉండాలి. నియమ నిబంధనల ననుసరించి పర్మిషన్లు తప్పక లభిస్తాయనే నమ్మకం కలగాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో బతికే గుమాస్తాలా మునిసిపాలిటీ పరిణమించకూడదు.అజీత్ రానాడేవ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త -
'వ్యూహం' అమలు తీరు ఇదేనా?
అమెరికా గత నవంబర్లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్ల్యాండ్కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.మొత్తంగా వశమైతేనే...గ్రీన్ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్లోని డెన్మార్క్కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరప్లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్ల్యాండ్లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు. అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్ల్యాండ్, డెన్మార్క్లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.మిత్రులు సైతం దూరంగ్రీన్ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.వాడుకొని వదిలెయ్!ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సంస్కరణలతోనే సత్వర వృద్ధి
ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోపక్క అమెరికా ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. ఈ కీలక ఘట్టంలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి ముందస్తు అంచనాలు కొన్ని శుభ వార్తలను మోసుకొచ్చాయి. స్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి రిజర్వ్బ్యాంక్ తొలుత అంచనా వేసినట్లు 6.5 శాతం కాక, 7.4 శాతం ఉండగలదనే అంచనాకు రావడం పరిస్థితులలో వచ్చిన మార్పును సూచిస్తోంది. సంస్కరణలు మార్పు తెచ్చాయనీ, వృద్ధి ఇదే స్థాయిలో నిలకడగా కొనసాగేందుకు వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనీ కూడా ఇది సూచిస్తోంది. వస్తువు – సేవల పన్ను (జీఎస్టీ)లో శ్లాబులను మార్చడం, చాలా వాటిపై పన్నుల శాతాలు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తేటపడింది. జీఎస్టీలోని నియంత్రణ సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ మార్పుచేర్పులు ఎప్పుడో చేసి ఉండ వలసింది.కాలం చెల్లిన చట్టాలకు గుడ్బై!అలాగే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని చర్యలను ఇటీవలి కాలంలో తీసుకున్నారు. పార్లమెంట్ ఐదేళ్ళ క్రితమే ఆమోదించిన నాలుగు కార్మిక స్మృతులను అమలులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన దాదాపు 29 వేర్వేరు చట్టాల స్థానంలో ఆ స్మృతులు వచ్చి చేరాయి. వలస పాలన కాలంనాటి ఆ చట్టాలను కూడా ఎన్నడో మార్చి ఉండాల్సింది. చట్టాల సంఖ్య ఎక్కువ కావడంతో కార్మిక సమస్యలు ఏళ్ళ తరబడి చిక్కుముడులకు లోనవుతూ వచ్చాయి. ఫలితంగా, వ్యాపార సంస్థలు ఆ చట్టాలను అనుసరించడంలో గందరగోళం నెలకొంటూ వచ్చింది.కొత్త లేబర్ కోడ్స్ ఆర్థిక వృద్ధికి తక్షణం తోడ్పడగల సంస్కరణ కాకపోవచ్చు. కానీ, పెట్టుబడులు పెట్టదలచుకున్నవారికి తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్న అంశాల్లో అవి స్పష్టతను, సరళతను తెచ్చాయి. ఉదాహరణకు, ఇంటి నుంచి పని చేసే విషయంలో అవి మరింత వెసులుబాటుకు అవకాశం కల్పించాయి. పర్మనెంట్ ఉద్యోగాలకు బదులు స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్సర్ ఉద్యోగాలు పెరుగుతున్న ‘గిగ్’ ఆర్థిక వ్యవస్థలో వర్కర్లకు మరింత సామాజిక భద్రతను కల్పించేందుకు తోడ్పడనున్నాయి. ఆ స్మృతుల్లో ఇప్పటికీ లోపాలు ఉంటే ఉండవచ్చు; వాటిని భవిష్యత్తులో పరిష్కరించు కోవచ్చు. మొత్తానికి, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం వల్ల దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరం అయింది. వృద్ధి సానుకూలమే!ఇతర రంగాలలో కూడా సంస్కరణల అవసరం ఉంది. మొదటి ముందస్తు అంచనాలలో అన్నీ సానుకూలంగా ఏమీ లేకపోవడం ఆ వాస్తవాన్ని మరింత వెల్లడిస్తోంది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో వృద్ధి రేటు మందగించింది. మొదటి రెండు త్రైమాసికాలలో వరుసగా 7.8 శాతం, 8.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. తర్వాత, రెండు త్రైమాసి కాలలో ఇది 6.9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నారు. తిరిగి సానుకూలంగా ఉన్న అంశాల వైపు దృష్టి సారిద్దాం. వస్తూత్పత్తి 4.5 శాతం నుంచి 7.4 శాతానికి విజృంభించినట్లు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 2025–26 ఆర్థిక సంవ త్సరంలో అధిక వృద్ధి సాధించేందుకు ఊతం ఇచ్చింది. సగటున దాదాపు 8 శాతం చొప్పున, గత మూడేళ్లలో వృద్ధిలో కనిపించిన వేగం కూడా గణనీయమైన విషయమే. ఇప్పటికి కొద్ది ఏళ్ళ నుంచి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, మధ్య–ఆదాయ ట్రాప్ నుంచి తప్పించుకునేందుకూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకూ, ఇంకా వేగంగా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేటపుడు, ఆర్థిక మంత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. దృష్టి పెట్టాల్సినవి!అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల మారిపోతున్న ప్రపంచంలో వాణిజ్యమే పెద్ద అంశంగా కనిపిస్తోంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులు 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై మరికొంత సుంకాలు విధిస్తామని ఆయన బెదిరిస్తున్నారు. భారత –అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేక కారణాల రీత్యా, ముఖ్యంగా ట్రంప్ అహంకారం వల్ల, ఇప్పటికీ తుదిరూపు దిద్దు కోలేక పోతోంది. మన దేశానికి కొత్త అమెరికా రాయబారిగా వచ్చిన సెర్జియో గోర్ కనబరుస్తున్న సానుకూలత వల్ల, ఈ ఒప్పందం కుదరవచ్చని ఆశలు పొటమరిస్తున్నాయి. దానిమాటెలా ఉన్నా... ఎగుమతులపై ఆధార పడిన, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు బడ్జెట్ కొంత ఆసరా కల్పించవలసి ఉంది. రత్నాలు, ఆభరణాలు వంటి పరిశ్రమలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు అమెరికా సుంకాలతో బాగా దెబ్బతినిపోతాయని భయ పడిన మాట వాస్తవం. కానీ, అవి వేగంగా ఇతర మార్కెట్లకు విస్తరించడం వల్ల కనీసం తాత్కాలికంగానైనా ఆ ప్రభావాన్ని తట్టుకో గలుగుతున్నాయి. నవంబర్ (2025)కు సంబంధించిన డేటా, ఈ విభాగాల ఎగుమతుల్లో ఆశ్చర్యకరంగా పెరుగుదలను కనబరచింది. ఆ విభాగాల ఎగుమతులు 2025 నవంబర్లో దాదాపు 19 శాతం పెరిగాయి. ఎగుమతులలో వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల విభాగాలు ప్రధాన ఆలంబనగా నిలిచాయి. ఇంకా ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే, భారీ సుంకాల ప్రతిబంధకాలు ఉన్న ప్పటికీ, అమెరికాకు ఎగుమతులు 22 శాతం పెరిగాయి. మొబైల్ ఫోన్లు, ఎగుమతుల్లో ప్రధాన వస్తువుగా నిలుస్తున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే వాటి ఎగుమతులు మూడు రెట్ల పెరుగుదలను చవిచూశాయి. నిరుద్యోగిత రేటు మూడునెలల కాలంలో అత్యల్ప స్థాయికి అంటే 8.6 శాతానికి తగ్గిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ’ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం దానికి కారణంగా పేర్కొంది. అయితే, వ్యవసాయమే ఇప్పటికీ 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న వారిని తగినంతగా ఇముడ్చుకోగలిగినంతగా వస్తూత్పత్తి రంగం వ్యాకోచించలేదు. ఈ రంగం విషయంలోనే, భారత్, ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఇతర దేశాల్లో చిన్న, మధ్య తరహా వస్తూత్పత్తి సంస్థలు తగినంతగా విస్తరించగలిగాయి. వ్యాపార నిర్వహణ సులువుగా సాగే అవకాశాన్ని కల్పించే విధంగా బడ్జెట్ రూపొందాలి. అప్పుడే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవసరమైన స్థాయిల్లో వృద్ధి రేటును తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్సియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అందరినీ కలుపుకొంటేనే అభివృద్ధి
సమాజంలో అణగారిన వర్గాల ప్రజలను సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం ద్వారా సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడమే సామాజిక సమ్మిళితత్వం. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుక బడిన తరగతుల వారికి రిజర్వేషన్లు, పేదరిక నిర్మూలనపై దృష్టి సారించడం, భూసంస్కరణల అమలు; 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పట్టణ స్థానిక సంస్థలను పటిష్ఠపరచటం వంటి చర్యలు సామాజిక సమ్మిళితత్వం సాధించటంలో పూర్తిగా విజయవంతం కాలేకపోయాయి. అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కుల ఆధారిత వివక్ష, అవస్థాపనా సౌకర్యాల అందుబాటులో వ్యత్యాసాలు, అసంఘటిత రంగంలో ఉపాధి అధికంగా ఉండటం లాంటి అంశాలు సామాజిక సమ్మిళితత్వానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వివిధ రాష్ట్రాల చర్యలుకుల, మత, రాజకీయ వివక్షకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రంగాలలో సంస్కరణలను ప్రవేశ పెట్టింది. సామాజిక ఇంజి నీరింగ్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యంతోపాటు కౌన్సిల్, స్థానిక సంస్థలలో నామినేషన్ కోటాలో ప్రాధాన్యమిచ్చింది. దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా విప్లవాత్మకమైన చర్యలను విద్య, ఆరోగ్య రంగాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించింది. తెలంగాణలో దళిత బంధు, ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ, శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇటీవలి ప్రభుత్వం మహిళలు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆరు గ్యారెంటీలతో అనేక ప్రోత్సాహ కాలను ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు విద్యనభ్యసించే వారిలో పౌష్టికాహారం పెంపు, డ్రాపవుట్ రేట్ తగ్గింపు లక్ష్యంగా ఆర్థికంగా వెనుకబడిన, గిరిజన ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఉదయం అల్పాహార పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించే 6 నుండి 12వ తరగతి బాలికలకు నెలవారీ రూ. 1,000 ఆర్థిక సహాయం వంటి చర్యలను చేపట్టింది. వృద్ధులు, వితంతు వులు, అంగవైకల్యం కలిగినవారు, పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన సామా జిక భద్రతా మిషన్ సత్ఫలితాలనిచ్చింది. భూమి హక్కు, విద్య అందుబాటుకు కేరళ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.ఢిల్లీ ప్రభుత్వం అల్పాదాయ, అణగారిన వర్గాల ప్రజలకు ఒక పరిమితి వరకు ఉచిత విద్యుత్, నీరు అందించడం; ప్రైవేట్ ఆసు పత్రులలో ఉచిత ట్రీట్మెంట్ కోసం ప్రజల ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడం, వికలాంగులకు పెన్షన్ లాంటి చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల మంది స్వయం సహాయక బృందాల సభ్యులతో ఆర్థిక సాధికారత పెంపు, ఎస్టీ, ఎస్సీ యువతలో ఎంట్రప్రెన్యూర్షిప్ పెంపు లాంటి చర్యలు చేపట్టింది.గుజరాత్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల బాలికల్లో పాఠశాల నమోదు నిష్పత్తి పెంచడానికి చర్యలతోపాటు, మల్టీపర్పస్ మహిళా సంక్షేమ కేంద్రాలను ప్రారంభించింది. బిహార్ ప్రభుత్వం మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతి మహిళ అకౌంట్లో రూ. 10,000 జమ చేయడం, సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తున్నది.ఆచరణలో విఫలంవివిధ కార్యక్రమాల ప్రభావం వలన విద్యావకాశాలు మెరుగ యినప్పటికీ, ఉన్నత విద్యలో ఇప్పటికీ లక్షిత వర్గాల ప్రజల నమోదు తక్కువగా ఉండటం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు అల్పా దాయ వర్గాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం వివిధ ప్రాంతాల మధ్య వేరుగా ఉండటం స్పష్టమవుతున్నది.భూసంస్కరణలు ఆచరణలో విఫలమయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమి ఆర్థిక కమతంగా లేకపోవడం వలన ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణంలో మార్పు సంభవించలేదు. మార్చి 2003 నాటికి 56.73 లక్షల లబ్ధిదారులకు 52.93 లక్షల ఎకరాల భూమిని పునఃపంపిణీ చేయడం జరిగింది. మొత్తం లబ్ధిదారులలో ఎస్టీల వాటా 15 శాతం కాగా, ఎస్సీల వాటా 36 శాతం. దేశంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 2 శాతం మాత్రమే భూసంస్కరణలలో భాగంగా పంపిణీ చేయడం జరిగింది.ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం, దేశంలో స్వయం ఉపాధిలో నిమగ్నమయిన వారి నెలవారీ ఆదాయం రూ. 13,279గా నమోదు కావడాన్ని బట్టి వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయపరమైన అసమానతలు స్పష్టమవుతున్నాయి. లాక్డౌన్ తర్వాతి కాలంలో గ్రామీణ వ్యవసాయేతర వేతన రేటులో ఏ విధమైన పెరుగుదల లేకపోగా వ్యవసాయ వేతనాలలో 2 శాతం మాత్రమే పెరుగుదల ఏర్పడింది. దళితులు, ఆదివాసీలలో ఆయుఃప్రమాణం ఉన్నత వర్గాలతో పోల్చినప్పుడు 3 నుండి 5 సంవత్సరాలు తక్కువ.ప్రపంచ అసమానత నివేదిక 2026 ప్రకారం జాతీయాదాయంలో 58 శాతం సంపన్నులైన మొదటి 10 శాతం ప్రజలలో కేంద్రీకృతం కాగా, చివరి 50 శాతం ప్రజల వాటా 15 శాతం మాత్రమే. మొదటి 1 శాతం ప్రజల వాటా మొత్తం సంపదలో 40 శాతం. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 28.4 శాతం కాగా, ఎస్సీ వర్గాల వారిలో ఇది 23 శాతం, ఎస్టీ వర్గాల వారిలో కేవలం 17.2 శాతం. శిశు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 29.2 కాగా, ఎస్సీలలో 39.6గా ఉంది. అయిదు సంవత్సరాల లోపు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 33.2 కాగా, ఎస్సీలలో ఇది 45.9. విధానాలు ఎలా ఉండాలి?అయితే, సుస్థిర ఆర్థిక విధానాలకు పూర్తిగా తిలోదకాలిచ్చి అధికంగా సంక్షేమంపై దృష్టి సారిస్తే మాత్రం పనిచేసే వయస్సుగల జనాభాను నిరుత్సాహపరుస్తుంది. పటిష్ఠమైన ఉత్పాదకతతో కూడిన శ్రామిక శక్తి, మార్కెట్ అవకాశాల పెంపు, సామాజిక స్థిరత్వాన్ని పెంపొందించే విధానాలు ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహద పడతాయి. సంక్షేమం లక్ష్యంగా అవలంబించే సమ్మిళిత సాధన విధా నాలను ఆర్థికాభివృద్ధి, నాణ్యమైన సేవలు, సామాజిక మార్పుతో అనుసంధానపరచాలి. సుస్థిరతకు మద్దతు నిచ్చే పటిష్ఠమైన ఆర్థిక వృద్ధి జరగనప్పుడు, సంక్షేమం మాత్రమే నాణ్యతతో కూడిన ఉపాధి, మార్కెట్ అందుబాటుకు దారి తీయదు. వ్యక్తుల సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి లింగ సంబంధిత; జాతులు, అంగ వైకల్యం కల్గినవారి మధ్య అసమానతలు తొలగించే ఆర్థిక విధానాలు అవసరం. పురోగామి పన్ను విధానం, కనీస వేతనాల చట్టాలు, సామాజిక భద్రతా పథకాలు అల్పాదాయ వర్గాల వ్యయార్హ ఆదాయ పెరుగుదలకు దారి తీసి స్వదేశీ వినియోగ మార్కెట్ను విస్తృత పరచగలవు. తద్వారా సమష్టి డిమాండ్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపార అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా చిన్న వ్యాపారాలు వృద్ధి చెంది నూతన వ్యవస్థాపకులు పెరుగుతారు. సమీకృత పట్టణ ప్రణాళిక, సమ్మిళిత ఫైనాన్స్ సేవలు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన విధానాలు అవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జ్),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
నవ లోకం... మన కోసం!
గతాన్ని సమీక్షించుకుంటూనే, రాబోయే కాలంలో శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ ఎటువంటి అద్భుతాలు సృష్టించనున్నది, ప్రపంచ యవనికపై మన దేశం ఏ ఏ మైలురాళ్లను అధిగమించబోతోంది అనే అంశాలను తరచి చూడాల్సిన సమ యమిది. శాస్త్ర – సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఎక్స్–రే వంటివి కనిపెట్టడాలు అనుకోకుండా జరిగినవే అయినా, భారీ ప్రాజెక్టులు మాత్రం పక్కా ప్రణాళికతోనే పట్టా లెక్కుతాయి. ఏళ్ల తరబడి సాగే కఠోర శ్రమ, వ్యూహాల ఫలితంగానే ఆ యా రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.1969 తర్వాత మళ్లీ ఇప్పుడు జాబిల్లిపై మనిషిని దించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టిమిస్’ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి పైకి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు చైనా సైతం తన ‘ఛాంగ్ ఈ–7’ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు సిద్ధమైంది. సూర్యరశ్మి సోకని ఈ ప్రాంతంలో ఘనీభవించిన నీటి జాడలు ఉన్నట్లు తేలడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. చైనా ఈ ఏడాదే ‘జున్టియాన్’ టెలిస్కోపును, ‘మెంగ్ఝౌ–1’ వ్యోమ నౌకను పరీక్షించనుంది. 2026 నాటికి ‘లాంగ్ మార్చ్–10’ ద్వారా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలన్నది చైనా లక్ష్యం.అంతరిక్ష రక్షణ విషయానికొస్తే, నాసా ’డార్ట్’ తరహాలోనే ఒక సరికొత్త ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘2015 ఎక్స్ఎఫ్261’ అనే ఖగోళ శకలాన్ని నేరుగా ఢీకొట్టి దాని మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేయనున్నారు. గతంలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లనే రాక్షసబల్లులు అంతరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. భవిష్యత్తులో అటువంటి ముప్పులు రాకుండా ఉండటంతో పాటు, ఆయా గ్రహశకలాల్లో ఉండే అరుదైన ఖనిజాలను మన అవసరాలకు వాడుకోవడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. కిలోమీటరు పొడవుండే ఉల్కా శకలాలను ఒడిసిపట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడం ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న సవాలు.గగన్ యాన్ పరీక్ష...భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంత రిక్ష ప్రయోగం ‘గగన్ యాన్ ’కు 2026 సంవత్సరం చాలా కీలకం కానుంది. అసలు ప్రయోగానికి ముందు సిబ్బంది లేకుండా అనేక ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హ్యూమనాయిడ్ రోబో ‘వ్యోమమిత్ర’, అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌక నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్, ప్యారాచ్యూట్ వ్యవస్థ పనితీరు, గగన్ యాన్ క్యాప్సూల్ను కక్ష్య వరకూ తీసుకెళ్లడం వంటివన్నీ ఉన్నాయి. ‘బ్లూ ఆరిజిన్’ తన హెవీ లాంచర్తో జాబిల్లిపైకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది అటు ప్రభుత్వ, ఇటు వ్రైవేట్ కంపెనీల అంతరిక్ష ప్రయోగాలు, జాబిల్లి యాత్రలు చాలానే ఉన్నాయన్నమాట. భారతదేశం దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన మూడంచెల అణు శక్తి కార్యక్రమం ఈ ఏడాది కీలకదశకు చేరనుంది. చెన్నై సమీపంలోని కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్బీఆర్) ఈ ఏడాది పని చేయడం మొదలుపెడు తుంది. ముందుగా ప్రయోగాత్మకంగా మొదలై... ఈ ఏడాది చివరి కల్లా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అంచనా. దేశంలో విస్తృతంగా లభ్యమయ్యే థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తుందీ రియాక్టర్. విజయవంతమైతే దేశ ఇంధన భద్రత మరింత పటిష్ఠమవుతుంది. దేశం మూడు దిక్కులా ఆవరించిన విశాల సముద్రాన్ని మానవ ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకోవాలన్న భారతదేశ ఆశయం ఈ ఏడాది కార్యాచరణ దిశగా అడుగులు వేయనుంది. సముద్రయాన్లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ‘మత్స్య– 6000’ జలాంతర్గామి ముగ్గురు శాస్త్రవేత్తలను ఆరువేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లనుంది. సముద్ర మట్టంతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతాల్లో జలాంతర్గామి తొడుగులోని ప్రతి చదరపు సెంటీమీటర్ 600 కిలోల బరువును తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత దృఢమైన ప్రత్యేకమైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు.వాతావరణ అంచనాలు అతి సంక్లిష్టమైన భారత దేశ వాతావరణ అంచనాల కోసం ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ల వినియోగం మొదలు కానుంది. ఏడాది చివరికల్లా ఇది సిద్ధమవుతుందని అంచనా. ‘మిహిర్’ వంటి సూపర్ కంప్యూటర్ల సాయంతో ఆరు కిలో మీటర్ల పరిధికి సంబంధించిన వాతావరణ అంచనాలను పది రోజుల ముందే ఇవ్వవచ్చునని భారత వాతావరణ విభాగం చెబుతోంది. వరదల్లాంటి విపత్తుల నుంచి మెరుగైన సన్నద్ధత కలిగి ఉండేందుకు, వ్యవసాయానికీ, పర్యాటక రంగానికీ ఎంతో ఉపయోగపడనుంది ఇది. శిలాజ ఇంధన వినియోగాన్ని వేగంగా తగ్గించాలన్న లక్ష్యం వైపు భారత్ అడుగులేస్తోంది. ఇందుకు తగ్గట్టే సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పవన విద్యుత్తులో నాలుగో స్థానంలో ఉంటే... సౌరశక్తి సామర్థ్యంలో మనది మూడో స్థానం. అయితే భారతదేశ స్థాపిత విద్యుదుత్పత్తి 482.82 గిగావాట్లలో ఇది సగం కంటే కొంచెం ఎక్కువ. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మనం నాలుగేళ్ల ముందుగానే ఈ స్థాయికి చేరుకున్నాం. ‘ఒన్ సన్ ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ కార్యక్రమం కారణంగా సౌరశక్తి రంగంలో మన పురోగతి ఇకపై కూడా కొనసాగనుంది. కృత్రిమ మేధఏఐ వాడకంతో ఈ ఏడాది టిక్కెట్ల బుకింగ్ మొదలుకొని వాహ నాల రవాణా వరకూ అనేక విషయాలు మరింత సౌకర్యవంతం కానున్నాయి. అతి తక్కువ బడ్జెట్తో చైనా సంస్థ అభివృద్ధి చేసిన ‘డీప్సీక్’ వంటివి ఏఐని మరింత వైవిధ్యభరిత అవసరాల కోసం వాడుకునే అవకాశం కల్పించనున్నాయి. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ వినియోగం కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా... ఇంగ్లీషులో కాకుండా కొరియన్ భాషలోనూ ఏఐ అందుబాటులోకి రావచ్చు. బయో టెక్నాలజీజన్యుపరమైన తప్పులను వెతకడం కంటే... వాటిని సరిచేయ డంపై ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. మన డీఎన్ఏలో జరిగే అతి చిన్న మార్పు కూడా వ్యాధులకు కారణ మవుతుందన్నది తెలిసిందే. ఈ మార్పులను సరిచేసేందుకు ‘క్రిస్పర్–క్యాస్9’ వంటి ఆధునిక జన్యు ఎడిటింగ్ టూల్స్ అందు బాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీలు ఒకే ఒక్క జన్యువులోని మార్పులను సరి చేసేందుకు ఉపయోగించవచ్చు.అంతేకాదు క్రిస్పర్ టెక్నాలజీతో అననుకూల వాతావరణాలను కూడా తట్టుకుని పండే పంటలను అభివృద్ధి చేసేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టు కోవడంలో, ఆహార భద్రత కోసం ఇది ఎంతో కీలకం. ఇలా ఈ ఏడాది సైన్స్–టెక్సాలజీ రంగంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసు కుని మానవ చరిత్రలో మైలురాళ్లు కానున్నాయి.టి.వి.వెంకటేశ్వరన్ వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ మొహాలీ -
శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!
ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.తప్పు జరిగితే వదిలేవారా?వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా? టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్కుమార్ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.గోశాల గోవుల మరణాలుటీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్ గెస్ట్హౌస్ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి? వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బీఆర్ నాయుడు ఉన్నారు.అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.సంస్కరణలా? ఇబ్బందులా?సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? ‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
నయా వలసవాద కేంద్రం అమెరికా
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం 2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. బుడ్డిగ జమిందార్వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
'క్విక్' డెలివరీలో భద్రత ఎంత?
సుమారు రెండేళ్ళ క్రితం నాటి ఘటన. డెలివరీ బాయ్ ఇంటి తలుపు తట్టాడు. వస్తువును అందుకునేందుకు తలుపు తెరవగానే ఆతని చీలమండపై లోతైన గాయం కనిపించింది. చిరిగిన ప్యాంటు అతని యాక్సిడెంట్ గురించి చెప్పకనే చెబుతోంది. నొప్పిని ఓర్చుకుంటూనే చెప్పిన సమయానికే వస్తువును అందజేశాడు. నేను ఊహించినట్లుగానే, అతని స్కూటర్ను ఏదో కారు ఢీకొట్టిందని తెలి సింది. కిందపడి గాయపడ్డాడు. అదృష్టవశాత్తు, స్కూటర్కు ఏమీ కాలేదని అతను ఊరట చెందడం నన్నింకా బాధించింది. అది అతనికి దినసరి అద్దెపై ఇచ్చింది కనుక, దానికి ఏమైనా అయితే, అతని అరకొర ఆదాయానికి మరింత చిల్లుపడుతుంది. నైతిక బాధ్యతగా భావించి ఒకటి రెండు బ్యాండ్–ఎయిడ్లు, ఒక 200 రూపాయల నోటు అతని చేతిలో పెట్టాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొమ్మని ఒక సలహా కూడా ఇచ్చాను. కానీ అతను ఆ నోటును జేబులో కుక్కుకుని, మళ్ళీ పనిలో పడతాడనే అనిపించింది. అతనికి గాయానికి ఏదో మందు పూయించుకోవ డమో లేదా కట్టు కట్టించుకోవడమో చేసేంత వ్యవధి కూడా లేదు. ఇతని తప్పిదం వల్లనే ఆ యాక్సిడెంట్ అయివుంటుందని కూడా నా అనుమానం. డెలివరీ బాయ్లు తాము తీసుకెళుతున్నవాటిని వీలై నంత త్వరగా అందించాలన్న తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించు కోకపోవడం, రాంగ్ సైడులో వెళ్ళిపోవడం నేను అంతకుముందు గమనించక పోలేదు. ట్రాఫిక్ ఉల్లంఘనలుఅంత హడావిడి పడవలసిన అవసరం లేదని వారికి పని ఇస్తున్న క్విక్–సర్వీస్ కంపెనీలు వాదిస్తాయి. ఆ రంగం పరిభాషలో వారు ‘భాగస్వాముల’ కింద కూడా లెక్క. తాము వారికి సరుకును అందించే ‘గుప్త’ ప్రదేశాలు, గమ్యస్థానాలకు తక్కువ సమయంలో వెళ్ళదగినవిగానే ఉంటాయని అవి చెబుతాయి. సిద్ధాంతం ప్రకారం డెలివరీ బాయ్ నడచుకుంటూ వెళ్ళి కూడా ఇచ్చి రావచ్చు. వారు గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళుతున్న మాట కూడా నిజం. అయినా, వారు ట్రాఫిక్ రూల్స్ను ఎప్పటి కప్పుడు ఎందుకు అతిక్రమిస్తున్నట్లు? ఒక్క బెంగళూరు నగరంలోనే, 2025లో వీరు దాదాపు 64,000 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. ఇది నవంబర్ 15 నాటి వరకు అందు బాటులో కొచ్చిన డేటా మాత్రమే. మరి, డెలివరీ బాయ్లు ఎందుకంత పరుగులు తీస్తున్నట్లు? ఈ ప్రశ్నకు జవాబు క్విక్–సర్వీస్ రంగ లాభ నష్టాల లెక్కల్లో ఉంది. బాయ్లు గంటకు సగటున రూ. 102 సంపాదిస్తారని కామర్సు కంపెనీలు పేర్కొంటున్నాయి. అవి తమకయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకోవడం లేదని యూనియన్లు చెబుతున్నాయి. పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు పోగా, మహా అయితే, గంటకు రూ. 81 చొప్పున లభిస్తుందని అవి అంటున్నాయి. నెలకు 26 రోజులు ఎవరన్నా రోజుకు 10 గంటలు పనిచేస్తే వచ్చేది రూ. 21,000. నెలకి ఆ పాటి సంపాదించాలన్నా ఆ 10 గంటల లోపల డెలివరీ వర్కర్ 30–35 ట్రిప్పులు వేయాలి. ఒక డెలివరీ పూర్తి చేసి, దాన్ని యాప్లో మార్క్ చేసిన తర్వాతనే, అతనికి మరో ట్రిప్పునకు అవకాశం లభిస్తుంది. వారికి వెంట వెంటనే డెలివరీ అవకాశాలు రావు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. అందుకని వేగంగా చేరవేస్తే మరో అసైన్మెంట్ లభిస్తుందని తాపత్రయపడతారు. సరుకును అందివ్వడంలో మందకొడిగా వ్యవహరిస్తే వర్కర్లు పరోక్షంగా శిక్షకు గురవుతారని యూనియన్లు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు వెన్ను తట్టి ఇచ్చిన ‘బ్యాడ్జీ’లను కంపెనీలు వెనక్కి తీసేసుకుంటాయి. ఆ మేరకు డెలివరీ అవకాశాలు తగ్గిపోతాయి. ఇంతమందికి చేర్చగలిగితే అంటూ లక్ష్యాలు నిర్దేశించి, వాటిని పూర్తి చేసినవారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇది వారు బండ్లు నడపడంలో వ్యక్తిగత భద్రతను గాలికొదిలేసేటట్లు చేస్తోంది. శ్రమ–ఒత్తిడిఅయినా, వేలాది మంది ఈ ఉద్యోగానికి ఎందుకు తరలి వస్తున్నట్లు? ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు లేకపోబట్టే అని దానికి జవాబు చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు రెండూ అంతగా లేకపోవడంతో, వారికి ఇంతకన్నా గత్యంతరం కనిపించడం లేదు. దేశంలో గిగ్ వర్కర్లలో దాదాపు మూడొంతుల మంది 24–38 ఏళ్ళ మధ్య వయసు వర్గం వారని వివిధ సర్వేలలో తేలింది. వారిలో చాలా మంది మిడిల్ లేదా హైస్కూలు విద్యతో ఆపేసినవారని మరికొన్ని సర్వేల్లో వెల్లడైంది. దీన్ని బట్టి వారు ఏదైనా మంచి ఉద్యోగం లభిస్తుందేమోనని కొంత కాలం ఎదురు చూసి, ఆ తర్వాత, క్విక్–కామర్స్ డెలివరీలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని స్పష్టమవుతోంది. కానీ ఈ ఉద్యోగాల్లో చేరుతున్నవారిలో చాలామంది శ్రమ, ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలల లోపలే వీడ్కోలు పలుకుతున్నారు. సత్వర సేవ సంస్థల మధ్య ముఖ్యంగా బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టోల మధ్య పోటీ పెరిగింది. వేటికవి వ్యాపార విస్తరణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా, చేతులూ కాల్చుకుంటు న్నాయి. ఉదాహరణకు, కడచిన నాలుగు త్రైమాసికాలలో బ్లింకిట్కు వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచన వంటివాటికి ముందు ఆదాయాన్ని సర్దుబాటు చేసి చూసినా కూడా దాదాపు రూ. 600 కోట్ల నష్టం వచ్చినట్లు చెబుతున్నారు. ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికను మినహాయించగా తేలిన లెక్క అది.అంటే, అసలు నష్టం అంతకన్నా ఇంకా ఎక్కువే ఉండవచ్చు. బ్లింకిట్ తమ వేదిక, డెలివరీ రుసుము కింద కొద్ది మొత్తాన్ని వసూలు చేస్తోంది. స్విగ్గీ ఒక నిర్దిష్ట మొత్తానికి మించిన విలువైన ఆర్డర్లకు ఏ రకమైన చార్జీలూ వసూలు చేయడం లేదు. దీంతో క్విక్–కామర్స్ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వ్యయాలు మరీ పెరగకుండా చూసుకుంటూనే, సేవలను మరిన్ని విభాగాలకు పెంచి, మరింత మంది కస్టమర్లను కూడగట్టుకోవాలి. ఇంకా ఎక్కువ రాయితీలు ఆఫర్ చేయాలి. అదే సమయంలో, డెలివరీకి మరింత మంది సిబ్బందిని తీసుకోవాలి. ఇదొక దురవస్థఅయితే, గత కొద్ది నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉపాధి అవకాశాలు (వార్షికంగా లెక్కగట్టి చూసినపుడు) 4.5 శాతం నుంచి 5 శాతం రేటు చొప్పున పెరిగినట్లు ‘సెంటర్ ఫర్ మానిట రింగ్ ఇండియన్ ఎకానమీ’ చెబుతోంది. గత ఏడాది అదే కాలంతో పోల్చి చూసినపుడు ఆ రకమైన మెరుగుదల కనిపించినట్లు అది పేర్కొంది. ‘కోవిడ్’ తర్వాత ఉద్యోగ వృద్ధిలో ఇదే వేగవంతమైన రేటు. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి తిప్పలు పడాల్సిన అవసరం తప్పుతోంది. గ్రామాలకు తిరిగి వెళ్లినా ఫరవాలేదని భరోసా ఏర్పడుతోంది. మరింత నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సమ్మెకు దిగడానికి గిగ్ వర్కర్లకు అందుకే ధైర్యం వచ్చింది. కానీ, దురదృష్టవశాత్తు, ఇది ఈ రంగంలోని అందరికీ నష్ట దాయకంగానే ఉంది. మూసేయకుండా వ్యాపారం కొనసాగించా లంటే, క్విక్–కామర్స్ సంస్థలు ఇప్పటికన్నా ఎక్కువ ఇవ్వగలిగిన స్థితిలో లేవు. ఇంతోటి ఆదాయానికి అంత ఒత్తిడిని తట్టుకోవడం అవసరమా అని డెలివరీ వర్కర్లు భావిస్తున్నారు. ఇంకో వైచిత్రి ఏమిటంటే, ప్రారంభ స్థాయి వైట్–కాలర్ ఉద్యోగులకన్నా, ప్రస్తుతా నికి డెలివరీ వర్కర్లు గడిస్తున్నదే కాస్త ఎక్కువ. అలాగని ఎంబీఏ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు రాలేరు కదా! ఇది సత్వర పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని ప్రతిష్టంభన.అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త ఆర్థికాంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అసలు సంక్షోభం అమెరికాదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల ప్రపంచం సంక్షోభంలో పడుతున్నదనేది సర్వసాధారణ అభిప్రాయం. స్థూలంగా చూసినపుడు అది సరైన అభిప్రాయమే. కానీ కొంత లోతులకు వెళ్లి పరిశీలించి నట్లయితే, అమెరికాయే సంక్షోభానికి గుర వుతున్నదనీ, ఆ స్థితి నుంచి కాపాడుకు నేందుకే ట్రంప్ ఇటువంటి విపరీత ధోర ణిని అనుసరిస్తున్నారనీ బోధపడుతుంది.వందల సంవత్సరాల పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని గమనించినప్పుడు, అందులో పలు విధాలైన దుర్మార్గాలు కనిపిస్తాయి. హిట్లర్ వంటి వారు తీవ్రమైన మారణకాండకు కూడా పాల్పడ్డారు. కానీ, ట్రంప్ వంటి ఏ నియమ నిబంధ నలూ లేని సర్వతోముఖ అరాచక విజృంభణ ఏ దశలోనూ లేదు. ‘నాకు అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఏ నియమాలూ, చట్టాలూ లేవు. నా మనసుకు తోచింది చేస్తా’నని ఆయన బాహాటంగా ప్రకటిస్తూ, అందుకు తగినట్లే వ్యవహరిస్తున్నట్లు ఇంతవరకు ఏ సామ్రాజ్యవాదీ చేయలేదు.అరాచకానికి కారణాలు?అయితే ఇందుకు మూలకారణం ట్రంప్కు గల విలక్షణమైన అరాచక వ్యక్తిత్వం మాత్రమేనా? అమెరికా కొంత కాలంగా ఎదు ర్కొంటున్న రకరకాల తీవ్ర సమస్యలు, ఎదురు దెబ్బలు, ఇతరుల నుంచి సవాళ్ళు తీవ్రమైన ఒత్తిడులను, ఒక కొత్త చారిత్రక దశను సృష్టిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ కారణంగా, ప్రపంచంపై అమె రికా గత పాతికేళ్ళ ఏకధ్రువ ఆధిపత్యం స్పష్టమైన రీతిలో బీటలు వారుతున్నది. పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే మరొక 15–20 సంవత్సరాలలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోవటం తథ్యమన్న భావన పాశ్చాత్య ప్రపంచం సహా ప్రపంచమంతటా ఏర్పడింది. వాస్తవానికి ఈ కోణం కొంతకాలంగా అందరూ చర్చిస్తున్నదే తప్ప కొత్తది కాదు. కానీ ఎందుకోగానీ, వెనిజులాపై ప్రళయ భీకరమన్నట్లు జరిగిన సైనిక చర్య, ఆ వెనువెంటనే ట్రంప్ ఇతర ప్రకటనలతో ప్రపంచం దృష్టి ఈ నేపథ్యం నుంచి మళ్ళీ తక్షణ ఘటనలు, తదనంతర ప్రకటనలే సర్వస్వమన్నట్లు మారింది.ఇంతకూ ట్రంప్ను ఈ ఆకస్మిక అరాచక ధోరణికి పురికొల్పిన నేపథ్య పరిణామాలేమిటి? 1991లో సోవియట్ యూనియన్ కుప్ప కూలిన తర్వాత అవతరించిన ఏకధ్రువ ప్రపంచానికి, సుమారు 15 సంవత్సరాలు గడిచేసరికి అదే రష్యా దేశం పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకుంటుండటంతో మొదటి సవాలు మొదలైంది.అందుకే అమెరికా అధ్యక్షులందరూ వరుసగా యూరప్తో కలిసి ‘నాటో’ను విస్తరించటం మొదలుపెట్టారు. ఇది జరుగుతుండగా మరొకవైపు చైనా అదే కాలంలో మరొక సవాలుగా ఎదగసాగింది. ఇవి చాలదన్నట్లు అదే సమయంలో (2008) అమెరికాతోపాటు యూరప్ అంతా ఆర్థిక సంక్షోభానికి గురయింది. ఈ పరిణామాలు అక్కడి సమాజాలపై ప్రభావాన్ని చూపటంతో ‘ఆక్యుపై వాల్స్ట్రీట్’ ఉద్యమం (2011) వచ్చి ఆ దేశాలను ఊపివేసింది. పుండుపై కారం చల్లినట్లు చైనా, రష్యాల ఆర్థిక వ్యవస్థలు మరింత ఊపందుకో సాగాయి. ఆ పరిస్థితులకు జడిసిన అమెరికా తన సైనిక బడ్జెట్లను ప్రతి సంవత్సరం పెంచసాగింది. ఇదే క్రమం ఇపుడు తాజాగా ట్రంప్, ఆ బడ్జెట్ను ఒకేసారి ఏకంగా 50 శాతం పెంచి 1.5 ట్రిలి యన్ డాలర్లకు ప్రతిపాదించే పరిస్థితి వచ్చింది.రక్షణ బడ్జెట్ పైపైకి...21వ శతాబ్దం వచ్చినప్పటి నుంచి అమెరికా పరిస్థితి ఏమిటో సూక్ష్మంగా అర్థం చేసుకునేందుకు బహుశా ఈ వివరణలు సరి పోతాయి. అమెరికా పతన క్రమం గురించి ఎంత తీవ్రమైన ఆందో ళన చెందకపోతే ట్రంప్ రక్షణ బడ్జెట్ను ఈ స్థాయికి పెంచజూస్తారు! యథాతథంగానే సుమారు 900 బిలియన్ డాలర్ల మేర గల ఈ బడ్జెట్, అమెరికా తరువాత వరుసలో గల తొమ్మిది దేశాల బడ్జెట్ కన్నా ఎక్కువ. అదిగాక ‘నాటో’ దేశాల బడ్జెట్లు ఉన్నాయి. అవి ఆ మొత్తాలను రెట్టింపు చేయాలని ఇటీవల ఒత్తిడి చేస్తున్నారాయన. ప్రపంచ పరిస్థితులు తమకు వ్యతిరేకమవుతున్నాయనీ, తమ ఆధి పత్యం చేజారుతున్నదనీ, దాని అర్థం వివిధ దేశాల వనరులు, మార్కెట్లు, వాటిపై పరోక్ష రాజకీయ నియంత్రణలు చేజారటమనీ క్రమంగా ఎంతగా భయపడకపోతే ట్రంప్ ఇదంతా చేస్తారో ఆలో చించండి. అది కూడా తమకు ఎటు నుంచీ సైనిక ముప్పు లేనపుడు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రణాళికలో ఒక సంకేతం వంటిదే వెనిజులాపై దాడి. అందువల్ల నిజమైన దీర్ఘకాలిక సంక్షోభం వెనిజులాది కాదు, ప్రపంచానిది కాదు. అది స్వయంగా అమెరికాది! అందుకు అనుబంధంగా యూరప్ది, ‘నాటో’ది, సామ్రాజ్యవాదానిది. ముఖ్యంగా సామ్రాజ్యవాద కూటమికి అధిపతిగా అమెరికాకు ఎదురవుతూ వస్తున్న సవాళ్లు ఇంకా ఉన్నాయి. వాటన్నింటి జమిలి ప్రభావాన్నే మనమిపుడు చూస్తున్నాము. ఇదే కాలంలో ఇటువంటి ఇంకా పలు పరిణామాలు అమెరికాను భయపెట్టాయి. కరోనా (2020–22) సమస్యను అమెరికా ఎదుర్కొనలేక పోవటమే గాక ఆర్థికాభివృద్ధి దెబ్బతినగా, చైనా అందుకు విరుద్ధ ఫలితాలు సాధించటం వాటిలో ఒకటి. ప్రపంచంలో అమెరికా అగ్రస్థానానికి ఆధారాలు... సైనిక బలం, ఆర్థిక బలం, శాస్త్ర–సాంకేతిక బలం, డాలర్ బలం, ప్రపంచ వ్యాప్తంగా గల రాజకీయ ప్రాబల్యం. వీటన్నింటికి చైనా, రష్యాల నుంచే గాక బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం కోసం పలు రూపాలలో జరుగుతున్న ప్రయత్నాలు క్రమంగా ముందుకు సాగు తున్నాయి. వాటిని నిరోధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఈ విషయాలు స్వయంగా అమెరికన్, యూరో పియన్ రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులుఅంగీకరిస్తున్నవే!అందుకే ఆక్రమణలుఅమెరికాతోపాటు పాశ్చాత్య సామ్రాజ్యవాద సంక్షోభమంటున్నది ఈ స్థితినే! దీనిని తట్టుకునేందుకు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంతో ఆరంభించి, పదవిని స్వీకరించిన తర్వాత గత ఏడాది కాలంలో కాలుగాలిన పిల్లి తరహా చర్యలు అనేకం ఇంటా బయటా, చివరకు మిత్ర దేశాలపైనా తీసుకుంటూ వస్తున్నారు. ఆ ఫలితాలతో సంతృప్తి లేక, కనీసం పశ్చి మార్ధ గోళాన్ని, పశ్చిమాసియాను అయినా పూర్తిగా నియంత్రిం చేందుకు గత నవంబర్లో ‘జాతీయ భద్రతా వ్యూహపత్రం’ ఒకటి ప్రకటించారు. ‘మన్రో డాక్ట్రిన్’కు తోడు ‘డోన్రో డాక్ట్రిన్’ అంటూ లాటిన్ అమెరికాతో పాటు ఈ ప్రాంతాల వనరులన్నీ చేజిక్కించు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రీన్ల్యాండ్, పనామా ఆక్రమణలూ ఇందులోకే వస్తాయి. అంతిమంగా ఈ భయకంపిత అరాచక చర్యలు అమెరికా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో పరిష్కరిస్తాయా అన్నది ప్రశ్న. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
'బురద' రాజకీయాలు మానాలి!
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.ఈ పథకం ద్వారా కేసీ కెనాల్కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్సీ నీటిని తోడవచ్చు. ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్సీలూ, కేసీ కెనాల్కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్ఎమ్సీ వద్ద రోజుకు మూడు టీఎమ్సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.అవగాహన లేని వ్యాఖ్యలుకొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
వికసిత భారత నిర్మాణంలో ‘జెన్–జీ’
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం ‘జెన్–జీ’. 1995 నుంచి 2010 మధ్యలో జన్మించిన ఈ ‘జెన్–జీ’ గురించి 2025లో ప్రపంచమంతా మాట్లాడుకుంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటా చర్చ జరిగింది. వీరి ఉద్యమాన్ని కొందరు సానుకూలమైన అంశంగా గమనించారు. స్వాతంత్య్రం, స్పష్టత, మార్పు తదితర అంశాలపై యువత ఆలోచిస్తున్న తీరునూ, ఏకతాటిపైకి వచ్చి పోరాడిన తీరునూ అభినందించారు. మరికొందరు... యువతలో హఠాత్తుగా పెరుగు తున్న నిరాశ, నిస్పృహలకు కారణంగా నేపాల్, మడగాస్కర్ దేశాల ఘటనలను ఉదాహరణలుగా చెబుతున్నారు.ఇలాంటి భిన్నమైన వాదనలను పక్కనపెడితే... ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి ఆశలు, ఆకాంక్షలతో పాటుగా వారి సామర్థ్యం పెరుగుతోంది. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్న పట్టుదల, అంకితభావం పెరుగుతోందనేది నిర్వివాదాంశం. భారత దేశంలోనూ విపక్ష పార్టీ సభ్యులు కొందరు... ఇక్కడి ‘జెన్–జీ’ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా తమ శక్తిసామర్థ్యాలను సమాజ పురోగతి కోసం, దేశాభివృద్ధి కోసం వినియోగిస్తూ... స్పష్టమైన ఆలోచనలతో ‘వికసిత భారత నిర్మాణం’లో భాగస్వాములవుతున్నారు.భారత యువత ‘వివేకం’నేటి ప్రపంచం ‘జెన్–జీ’ గురించి మాట్లాడుతోంది. కానీ,వందేళ్ల క్రితమే స్వామి వివేకానంద యువత సామర్థ్యం, వారికి సరైన మార్గదర్శనం చేయడం ద్వారా దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం ఎలా ఉండాలనేదానిపై ఆలోచించారు. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యువత గురించి మాట్లాడినా... వివేకానందుడి బోధనల గురించి ప్రస్తావించకుండా ఆ సమావేశం సంపూర్ణం కాదు. అంతటి గొప్ప దీర్ఘదర్శి స్వామి వివేకానంద. ఇవాళ (జనవరి 12) వారి 164వ జయంతి. ‘జెన్–జీ’ సామర్థ్యానికి మరింత పదునుపెట్టి... వికసిత భారత నిర్మాణంలో వారిని భాగ స్వాములను చేసే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సంద ర్భమిది. వ్యక్తిత్వం, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చు కోవడం, స్వీయ అవగాహన, సంస్కృతి–సంప్రదాయాలపై గౌరవం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ నిర్మాణంలో మనం ఏం చేయాలనే అనేక అంశాలపై వివేకానందుని బోధనల ప్రభావం ఉంటుంది.వివేకానందుడు వందేళ్ల క్రితం ఉద్బోధించిన ఆధునిక దృక్పథం, నాగరికత విలువల పునాదులు మొదలైన విషయాలన్నీ... నేటి భారత యువతలో కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాల్లోని యువత ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ, వీరంతా భావిభారత నిర్మాణంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. స్వచ్ఛ భారత్, మేరీ మాటీ మేరా దేశ్ (మొక్కల పెంపకం), నషా ముక్త్ భారత్ (మాదక ద్రవ్యాల విని యోగ రహిత భారతం) వంటి ఎన్నో ప్రజాచైతన్య కార్యక్రమాలకు యువతే నేతృత్వం వహించి వాటిని విజయవంతం చేస్తోంది. నవీన సాంస్కృతిక సారథులుఆధునిక సాంకేతికత వినియోగంలోనూ, స్టార్టప్ల రూపకల్పన లోనూ మన యువత సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ‘ఇండియా స్టాక్’ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పరిజ్ఞానాన్ని కూడా యువత స్వీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వినూత్న మార్కెట్ పరిష్కారాలకు బాటలు వేయడం, యూనికార్న్ (రూ.వందకోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టే స్టార్టప్)ల ఏర్పాటు వంటి వాటి ద్వారా ఉద్యోగాల సృష్టికర్తలుగా వారి పాత్రను మరింత బలోపేతం చేసుకుంటున్నారు.యువత సంస్కృతికి దూరంగా వెళ్తోందనే దుష్ప్రచారం జరుగు తోంది. కానీ ఆధ్యాత్మిక మూలాలను తెలుసుకోవడంపై, మన వైభవోపేతమైన చరిత్రను అధ్యయనం చేయడంపై యువత మక్కువ చూపుతోంది. 2022 ఆగస్టు 15 నాడు... దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పంచ్ ప్రాణ్ (5 తీర్మాణాల) గురించి వివరించారు. ప్రతి భారతీయుడూ తన లోని బానిస మనస్తత్వపు ఆలోచనలను తొలగించుకుని... మన సంస్కృతీ సంప్రదాయాలు, ఘనమైన చరిత్ర పట్ల గర్వపడాలని సూచించారు. అందుకే యువత... ఓవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే... మరోవైపు భారతీయ నాగరి కత మూలాలను, మన విలువలతో కూడిన సంప్రదాయాల సారాన్ని గ్రహించి ఆచరణలో పెట్టే దిశగా కృషి చేస్తోంది.ఇవాళ యువత ఆధ్యాత్మిక పర్యాటకం, భారతీయ తాత్వికతపై ఆసక్తిని కనబరుస్తోంది. యోగా, శాస్త్రీయ సంగీతం, ఇతర సాంస్కృతిక పద్ధతులను అలవర్చుకుంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగిన ‘కుంభమేళా’లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఈ ఏడాది కొత్త సంవత్సరాన్ని జరుపుకొనేందుకు వేలాదిమంది ‘కాశీ విశ్వనాథ మందిరాన్ని’ ఎంచుకోవడం... యువతలో వస్తున్న పరివర్తనకు ఉదాహరణలు.రాజకీయాల్లో యువశక్తిదీని కారణంగా యువత ఆలోచనల్లోనూ సానుకూలమైన మార్పు కనబడుతోంది. దేశ రాజకీయ, సంస్థాగత అంశాలపై దీని ప్రభావం స్పష్టంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా... యువత ఆకాంక్షలకు పెద్దపీట వేస్తున్నాయి. నాయకత్వంలోనూ యువ భారతానికి ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. 2024లో దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత... రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. దీన్ని ఆచరణలో పెడుతూ, ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం ప్రారంభమైంది. దేశ యువత ఏమనుకుంటోందో తెలుసుకునేందుకు ప్రధానమంత్రి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. వారి ఆకాంక్షలను, వారి ఆలోచనలను, వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ కూడా... ఇటీవలి కాలంలో యువ నాయకులకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పజెబుతోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువకుడిని నియమించింది. రాజకీయంలో పెద్దలకు ఉండే అనుభవాన్ని యువత జోరు, వారి ఆవిష్కరణల సామర్థ్యంతో సమతుల్యం చేయాలన్న ప్రధాని ఆలోచనలకు కార్యరూపం ఇది.దేశ యువశక్తి బలం, క్రమశిక్షణ, నైతికతలోనే భారతదేశ పునరుజ్జీవనం ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవాళ అక్షరసత్యాలుగా మనముందున్నాయి. ఈ ‘జెన్–జీ’పై, యువశక్తిపై ప్రబలమైన విశ్వాసంతోనే... 2047 నాటికి వికసిత భారత నిర్మాణం జరగాలనే సంకల్పాన్ని ప్రధాని దేశం ముందుంచారు. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక సాంకేతికతకు వారథులుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ‘జెన్–జీ’ పాత్ర అత్యంత కీలకం. అందుకే స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ, భారతదేశాన్ని మళ్లీ విశ్వగురువుగా నిలబెట్టుకునేందుకు... ఆధునిక, ఆధ్యాత్మిక భారతాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు ప్రధాన మంత్రి సంకల్పించిన మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాము లమవుదాం!జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి(నేడు స్వామి వివేకానంద జయంతి; జాతీయ యువజన దినోత్సవం) -
మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా?
ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ భారతా వని సిగ్గుతో తలదించు కోవాల్సిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా ఆవిష్కృతమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ వరకు నగరాలన్నీ ఒకే రకమైన అనాగరిక ప్రవర్తనకు వేదికలయ్యాయి. ఫుల్లుగా మద్యం సేవించిన మందుబాబులు రోడ్లపై వేసిన వీరంగం చూస్తే వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు ఉండవేమోనన్న భావన కలుగుతుంది. పీకల దాకా తాగి తామేమి చేస్తున్నామో కనీస స్పృహ లేకుండా ఫుట్పాత్లపై పడిపోవడం, వాంతులు చేసుకోవడం, శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి దృశ్యాలు వీక్షకులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం అంటే కేవలం మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల్లో మునిగి పోవడమేనా? దేశంలోని 29 రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, డిసెంబర్ 31న జరిగిన మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ. 1,671 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వాటానే అత్యధికం. ఒక నిమిషానికి తెలంగాణలో 95 బాటిళ్లు, ఆంధ్రప్రదేశ్లో 93 బాటిళ్ల చొప్పున అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడాల్సిన రాష్ట్రాలు, మద్యం అమ్మకాల్లో పోటీ పడటం శోచనీయం.యువత భవితవ్యం ప్రశ్నార్థకంమద్యం అలవాటు క్రమంగా గంజాయి, ఇతర ప్రమాదకర మత్తుపదార్థాల వైపు మళ్లుతోంది. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే రేవ్ పార్టీలు ఇప్పుడు నగరాల శివార్లలోని ఫామ్హౌస్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. పోలీసులు దాడులు చేసి కేసులు పెడుతున్నా, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. కేవలం మద్యం తాగడానికే పరిమితం కాకుండా, యువత మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారంలో కూరుకుపోతోంది. అంతర్జాతీయ ముఠాల ప్రమేయంతో సరిహద్దులు దాటి మత్తు పదార్థాలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి.మరీ దారుణమైన విషయం ఏమిటంటే, స్కూల్ పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఇలాంటి వ్యసనాలకు బానిసలైతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? తమ కష్టార్జితాన్ని పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డలు మత్తులో జోగుతున్నారని తెలిస్తే వారి గుండెలు పగిలిపోవా?మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికత, సుశిక్షితులైన పోలీసు యంత్రాంగం అవసరం. కానీ అనేక రాష్ట్రాల్లో అటువంటి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలు లోపించాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయం ముసు గులో గంజాయి సాగు చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. మానవ వనరులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలుమరోవైపు ప్రభుత్వాల ద్వంద్వ నీతి కూడా విమర్శలకు తావిస్తోంది. మాదక ద్రవ్యాల వినియో గానికి వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఎందుకు పాకులాడు తున్నాయి? మద్యం కూడా ఒక మత్తు పదార్థమే కదా! దానివల్ల కలిగే అనర్థాల గురించి ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఏ రకమైన అభివృద్ధి?మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబడిగా పరిగణించకూడదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. మద్యపానం మనిషి శారీరక, నైతిక, మేధాపరమైన పతనానికి దారితీస్తుందని మహాత్మాగాంధీ ఎప్పుడో హెచ్చరించారు. గాంధీ పుట్టిన గుజరాత్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మద్యంలో పదో వంతు భారతదేశంలోనే వినియోగం అవుతున్నట్లు ‘లాన్సెట్’ నివేదికలు చెబుతున్నాయి. కల్తీ సారా, గుడుంబా వంటి ప్రాణాంతక పదార్థాల వల్ల ఎంతో మంది అకాల మృత్యువాత పడుతున్నారు. మద్యం తయారీ పరిశ్రమ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతోందని ‘అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వెల్లడించడం దేశ ఆరోగ్య స్థితిగతులకు అద్దం పడుతోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించి, మత్తు ప్రవాహాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలి. లేనిపక్షంలో 2047 నాటికి మనం కలలుగంటున్న ‘వికసిత్ భారత్’ కాస్తా ‘మద్యపాన భారత్’గా మారే ప్రమాదం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలే కాదు, ఆరోగ్యవంతమైన సమాజం కూడా అని గుర్తించాలి. మన ప్రయాణం ఏ దిశగా సాగుతోందో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
అమర్త్య సేన్ (నోబెల్ ఆర్థికవేత్త) రాయని డైరీ
ఇష్టమైన ప్రయాణాలకు, ఇష్టమైన మనుషుల్ని కలవటానికి సాకులు వెతుక్కోవడం బాగుంటుంది. బలంగా లేని సాకులు మనల్ని దొంగలా పట్టివ్వటం మరింత బాగుంటుంది. ‘‘స్కూల్కి ఎందుకు వెళ్లనంటున్నావ్ అమ్మూ బాబూ’’ అని అడిగేవారట అమ్మ, నా చిన్నప్పుడు. ‘‘నాకు తెలీదు. నువ్వే చెప్పమ్మా’’ అనేవాడినట నేను... అమ్మ ఒడిలోకి దూకేస్తూ! ‘‘దొంగ...’’ అని అమ్మ ఒకటే నవ్వట! జనవరి 16 మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈసీ నుంచి నాకు నోటీసు! బెంగాల్ వెళ్లేందుకు వెతుక్కో నక్కర్లేని ఒక సాకు దొరకటం నా 92 ఏళ్ల వయసును ఉత్సాహపరిచే సంగతే!ఇండియా వెళ్లినప్పుడు, శాంతి నికేతన్ లో నేనుండే నా పూర్వీకుల నివాసానికి పొరుగునే ఉంటాడు నా కజిన్ శాంతాభాను సేన్ ! ఇండియా పొరుగున బంగ్లాదేశ్ ఉండటం నాకెంత సంతోషమో, శాంతాభాను నా పొరుగున ఉండటం నాకంత సంతోషం. మనసుకు నచ్చినవాళ్లు, మనం చెయ్యెత్తితే చూసి పలకరింపుగా నవ్వేంత దూరంలో ఉండటం ఎంత సంపద, ఎంత ఆరోగ్యం మనిషికి! ఈసీ అధికారులు నాకు ఇవ్వవలసిన నోటీసును, నేను అక్కడ లేనందువల్ల శాంతాభాను చేతికి అందజేసి వెళ్లారట.85 ఏళ్లు దాటినవారు విచారణ కోసం ఈసీ ఆఫీసుకు వెళ్లనవసరం లేదనీ, ఈసీనే ఆ వయసు దాటినవారి ఇంటికి వెళ్లాలనీ నిబంధన. అలాగైతే విచారణ కోసం ఈసీ అధికారులు ప్రస్తుతం కేంబ్రిడ్జ్లో నేను ఉంటున్న ఇంటికి రావాలి. కొన్ని లాజిక్లు అంతదూరం రాలేవు. కొంత దూరం మాత్రమే వచ్చి ఆగిపోతాయి. బెంగాల్ ఓటర్ల రికార్డులలో అమ్మకు, నాకు మధ్య ఏజ్ డిఫరెన్ ్స 15 ఏళ్ల కంటే తక్కువ ఉందనీ, అదెలా సాధ్యమో లాజిక్కి అందటం లేదనీ ఈసీ! బెంగాల్లో ఓటర్ల జాబితాను గట్టిగా సవరిస్తున్నారు. ఆ సవరణల్లో ఈ ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ బయట పడిందట! రెండు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు. నిజానికీ, అమ్మకూ నాకూ మధ్య 19 సంవత్సరాలకు పైగా వ్యత్యాసం ఉంది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ను చూపిస్తే నా ఓటు ఉంటుంది. నేను బెంగాల్ వెళ్లి, ఓటేయొచ్చు. రికార్డులలో ఏది ఫీడ్ అవుతుందో, ఆ ఫీడ్ అయిందే లాజిక్కు. రికార్డులను దాటుకుని లాజిక్కులు బయటికి రాలేవు. ‘‘సేన్! మీరు లాజికల్గా ఆలోచించటం లేదు, పేదలు... పేదలు అంటూ ఆర్థికశాస్త్రాన్ని కారుణ్యంతో నింపి, ‘మదర్ థెరెసా ఆఫ్ ఎకనామిక్స్’లా తయారవుతున్నారు’’ అంటుంటారు నా తోటి ఎకనమిస్టులు. ఆర్థికశాస్త్రం కఠినంగానే ఉండాలి. కానీ, ఆర్థికశాస్త్రానికి మనసెందుకు ఉండకూడదు? లాజిక్ తప్పిపోతుందనా?‘‘నేను స్కూలుకు వెళ్లను’’ అని, ఆఖరి నిమిషంలో స్కూల్ బాక్స్ను పక్కన పెట్టేసి, అమ్మ ఒడిలోకి దూకేసినప్పుడు అమ్మ నన్ను తన కడుపులోకి కూడదీసుకుని నా బుగ్గపై ముద్దు పెట్టడం నాకు గుర్తుంది. స్కూలు కఠినంగా ఉంటుందని, అమ్మ కూడా కఠినంగానే ఉండాలా? పేదల విషయంలో ఆర్థికశాస్త్రం కూడా అమ్మలానే ఉండాలంటాను నేను. ఆర్థికశాస్త్రం మాత్రమే కాదు, ఓటర్ల విషయంలో ఈసీ కూడా!ఓటర్ల జాబితాను సవరిస్తున్నప్పుడు ‘జీవించే ఉన్నారా?’ అని చూస్తున్న ఈసీ, ఎవరెక్కడ జీవిస్తూ ఉన్నా ప్రాణాలు మాత్రం ఇక్కడే కదా ఉంటాయి అన్నది కూడా ఆలోచించాలి. కేంబ్రిడ్జిలో ఉంటున్నంత మాత్రాన, బెంగాల్లో లేనట్లు కాదు. నాకైతే, విచారణ సాకుతో హార్వర్డ్ క్యాంపస్లోని ‘ఆర్నాల్డ్ ఆర్బోరెటమ్’ పూలతోటల నుంచి వీచే తీపి సువాసనలను ఓ నాలుగు రోజులు సెలవడిగి, బెంగాల్ వెళదామనే ఉంది! -
రాయలసీమ ఆశాదీపం
రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఆశాదీపం అయ్యింది. అయితే ఇటీవల తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరిపి ఈ పథకాన్ని నిలిపివేయించానని ప్రకటించడం, సీమ ప్రాజెక్టులను అక్రమమైనవిగా అభివర్ణించడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రాయలసీమ నీటి హక్కుల వెనుక ఉన్న భౌగోళిక, సాంకేతిక వాస్తవాలను నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.కేటాయింపులుండీ వాడుకోలేక...రాయలసీమ దాహార్తిని తీర్చే క్రమంలో గాలేరు–నగరి, హంద్రీ –నీవా, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎస్సార్బీసీ, గుండ్రేవుల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దాదాపు 144.7 టీఎంసీల నికర జలాల కేటాయింపులు చట్టబద్ధంగా ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. ప్రస్తుతం సీమలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యం 100 టీఎంసీల కంటే తక్కువగానే ఉంది. సరైన కాల్వల వ్యవస్థ లేకపోవడం వల్ల ఏటా కేవలం 50 నుంచి 60 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. అంటే, తమకు దక్కాల్సిన వాటాలో సగం కూడా వాడుకోలేక పోతున్న ఈ ప్రాంతంపై ‘జల దోపిడీ’ చేస్తున్నారనే నిందలు వేయడం అత్యంత విచారకరం.రాయలసీమ ప్రాజెక్టులకు జీవనాధారమైన పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి వంటి మలుపులకు శ్రీశైలం రిజర్వాయర్ ప్రధాన వనరు. గతంలో శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలుగా ఉండేది. కానీ తీవ్రమైన పూడిక పేరుకుపోవడం వల్ల అది ప్రస్తుతం 200 టీఎంసీల లోపుకు పడిపోయింది. దీనికి అదనంగా, తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఖాళీ చేయడం వల్ల జలాశయం మట్టం వేగంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నెలల తరబడి వచ్చే కృష్ణా, తుంగభద్రల ప్రవాహాలు ఇప్పుడు కేవలం కొన్ని వారాలకే పరిమితమవు తున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం ఉండాలి. పూడిక, విద్యుత్ అవసరాల కారణంగా ఈ మట్టం నిర్వహించడం అసాధ్యంగా మారుతోంది, ఫలితంగా వరద జలాల మీద ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ– నీవా వంటి ప్రాజెక్టులకు గండం ఏర్పడుతోంది.పథకం ఆవశ్యకతవరద సమయంలో కృష్ణా నది నుంచి సుమారు 700–800 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వృథాగా వెళ్తోంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి ఉన్న పరిమితులను అధిగమించేందుకు, కేవలం వారం పది రోజులు మాత్రమే లభించే వరద సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం సాధ్యమవుతుంది.ముచ్చుమర్రి వంటి ఎత్తిపోతల కేంద్రాలకు అనేక సాంకేతిక పరిమితులు ఉన్నాయి. ముచ్చుమర్రి నుంచి నాలుగు రోజులు నిరంతరాయంగా నీటిని తోడితే కానీ ఒక టీఎంసీ నీరు రాదు. 40 టీఎంసీల లక్ష్యంతో నిర్మించిన హంద్రీ–నీవాకు ఇది ఏమాత్రం సరిపోదు. అలాగే మల్యాల నుంచి నీటిని తీసుకోవాలంటే కనీసం 842 అడుగుల మట్టం అవసరం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే 800 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని రూపొందించారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 800 అడుగుల కంటే తక్కువ మట్టం నుంచి నీటిని లిఫ్ట్ చేసే పథకాలను నిర్మించుకుంది. అటువంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ తన చట్టబద్ధమైన వాటాను వినియోగించు కోవడానికి 800 అడుగుల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసు కోవడం ఏమాత్రం అక్రమం కాదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉండి, నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదు. అది ఏపీ ప్రాథమిక హక్కు కూడా!శాశ్వత పరిష్కారంరాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే అది గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు వెన్నెముకగా మారుతుంది. పోతి రెడ్డిపాడు ద్వారా ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి రిజర్వాయర్ల ముంపు సమస్యలను పరిష్కరించి, అక్కడ 35 టీఎంసీల నీటిని నిల్వ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవాతో అనుసంధానం చేస్తే, చిత్తూరు జిల్లాలోని మదన పల్లి డివిజన్ నుంచి కుప్పం వరకు గాలేరు–నగరి నీటిని సరఫరా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది. ఇది రాయలసీమ కరవు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా మారుతుంది.ఈ పథకానికి అనుమతులు సాధించడం అసాధ్యమైన పని కాదు. సీడబ్ల్యూసీ నియమించిన కమిటీలు ఒక కీలకమైన సిఫార్సు చేశాయి: డ్యామ్ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు, ఆ లోటును భర్తీ చేయడానికి ఎగువన నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చు. శ్రీశైలం సామర్థ్యం 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు తగ్గిపోయిన వాస్తవాన్ని ప్రభుత్వం సమర్థంగా వాదించాలి. శ్రీశైలం భద్రతను, తగ్గిపోయిన నిల్వ సామర్థ్యాన్ని సాధికారిక సంస్థల ముందు నిరూపించగలిగితే, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం సులభమవుతుంది.తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజ నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేసిందనే నెపంతో ప్రాజెక్టు అవసరాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ వాదనకు ఆయుధంగా మారుతుంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఈ పథకానికి మిగిలి ఉన్న అనుమతులను తీసుకురావడానికి, పెండింగ్లో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి.శ్రీశైలం ఎగువ భాగం నుంచి నీటిని తీసుకోవడం సీమ ప్రజల ప్రాథమిక హక్కు అని జాతీయ వేదికలపై గట్టిగా వినిపించాలి. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ కేవలం ఒక ఇంజినీరింగ్ నిర్మాణం కాదు, అది సీమ రైతాంగం ఆత్మగౌరవ ప్రతీక. ఈ పథకం కార్యరూపం దాల్చితేనే వెనుకబడిన ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
దాపరికం లేని సామ్రాజ్యవాదం
ఇందులో కొత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలేమీ లేవు. వెనిజులాపై సైనిక దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణలో ఉన్నది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే వివరించి చెప్పారు. అదీగాక, లాటిన్ అమెరికాతో కూడిన పశ్చిమార్ధ భూగోళం 1823 నాటి ‘మన్రో డాక్ట్రిన్’ నిర్దేశించినట్లు ఎప్పటికీ తమదిగానే ఉంటుందనీ, అందుకు అదనంగా ఇపుడు ‘ట్రంప్ డాక్ట్రిన్’ ప్రకారం అందుకోసం సైనిక బలాన్ని వినియోగించగలమనీ బాహాటంగా ప్రకటించారు. వెనిజులా ఆపరేషన్ తర్వాత ‘అందుకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యం ఇక ఎవరికీ ఉండద’ని హెచ్చరించారు. నిజానికి ఈ ఆపరేషన్కు ముందు నవంబర్లో విడుదల చేసిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో ఉన్నది కూడా ఇదే!ఏ చట్టాలూ పాటించరా?వెనిజులాలో అమెరికాది అతి నగ్నమైన సామ్రాజ్యవాద చర్యను ఇంత సూటిగా, అన్ని కోణాల నుంచి ట్రంప్ వివరించినట్లు ఆయన విమర్శకులు కూడా చెప్పలేరేమో! అమెరికా అధ్యక్షునిది అన్ని విషయాలలోనూ దాపరికం లేనితనమే. అందుకు ఆయనను అభినందించవచ్చు కూడా! ఒక్క విషయంలో మాత్రం మదురోపై అసత్య ప్రచారాలు చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి, అందుకోసం స్వయంగా ఒక కంపెనీని నడుపుతూ, అమెరికాకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని! ఇవి తప్పుడు ఆరోపణలని అమెరికన్ మీడియాయే పలుమార్లు రాసినందున ఆ విషయమై చర్చించటం వృథా. పైగా, డ్రగ్స్ రవాణా కేసులలో శిక్షలు సైతం పడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తదితరులకు క్షమాభిక్ష ప్రకటించి జైలు నుంచి విడుదల చేసిన ట్రంప్, మాదక ద్రవ్యాల కారణంగా మదురోపై చర్య తీసుకుంటున్నట్లు వాదించటం హాస్యాస్పదమని అమెరికన్ మీడియా కొట్టివేస్తున్నది. మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నదంటూ ఇటీవలి వారాలలో సుమారు 30 వెనిజులా పడవలపై బాంబింగ్ చేసి, 100 మందికి పైగా ప్రాణాలు తీసినదంతా ఎటువంటి ఆధారాలు చూపకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని అదే మీడియా గుర్తు చేస్తున్నది. అమెరికా ప్రజాప్రతినిధులు, నిపుణులు పలువురు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. వారిలో ట్రంప్కు చెందిన రిపబ్లికన్లు సైతం ఉన్నారు. చర్చలకు సిద్ధమని మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చర్య జరగటం గమనించదగ్గది.ఈ విధమైన దాడి చేయవలసిన అగత్యం ఇపు డేమి ఏర్పడింది? చమురు నిల్వల స్వాధీనం మాత్ర మేనా, మరేమైనా ఉందా? మదురోను పదవీచ్యుతు డిని చేయటంతో వెనిజులా తమ అధీనంలోకి వచ్చి నట్లేనా? మదురో స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షు రాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాము కోరుకున్నట్లు పాలించ గలరన్న సూచన జరిగేదేనా? అంతిమంగా అధికారం ‘భద్రంగా, సవ్యంగా, న్యాయబద్ధంగా’ మరొకరికి బదిలీ కావటం అంటే ఏమిటి? అంతవరకు వెని జులాను ‘తామే పాలించగల’మన్న ట్రంప్ ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యకుగానీ, ఆయన చేసిన ప్రకటనలకు గానీ అర్థం, అమెరికా తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ,అంతర్జాతీయ చట్టాలకు గానీ ఎంతమాత్రం కట్టుబడి ఉండబోదని స్పష్టంగా ప్రకటించటమేనా?మేమే బాస్!దాడికి కారణం చమురు నిల్వలన్నది విస్తారంగా వినవస్తున్న మాట. కానీ అది ఒక కోణం. ‘మన్రో డాక్ట్రిన్’ ప్రకారం తమ ఇలాకాగా పరిగణించే లాటిన్ అమెరికాలో తమను ధిక్కరించే ప్రభుత్వాలు గానీ, వామపక్ష ప్రభుత్వాలు గానీ ఏర్పడితే కూలదోయటం గత 70 ఏళ్లలో కనీసం 15 సార్లు జరిగింది. వెనిజులా ప్రభుత్వం కూల్చివేతకు హ్యూగో ఛావేజ్ కాలం నుంచి 20 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది నేపథ్యం కాగా, వెనిజులా సహా పలు లాటిన్ అమెరికన్ దేశాలలో కొంత కాలంగా రష్యా, చైనాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం ట్రంప్కు అన్నింటికీ మించిన ఆందో ళనగా మారింది. ప్రస్తుత దాడి సందర్భంగా ఆయన మన్రో డాక్ట్రిన్, ట్రంప్ డాక్ట్రిన్ ప్రస్తావనలు, పశ్చిమార్ధ గోళం వైపు ఇక ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరన్న హెచ్చరికలు, తమ సైనిక బలం గురించిన మాటలు, ఇవన్నీ అటువంటి ఆందోళన నుంచి వచ్చినవే. చమురు ఆ తర్వాతి సంగతి. అమెరికా ప్రాబల్యం ఇతరత్రా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా బలహీనపడుతున్నందున, పశ్చిమార్ధ గోళంలో, దానితో పాటు పశ్చిమాసియాలో తమ బలాన్ని ఏ విధంగానైనా నిలుపుకొని తీరాలన్నది ట్రంప్ పట్టుదల. వెనిజులాపై దాడి, అదే పని చేయగలమంటూ ఇరాన్కు హెచ్చరికలు, ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా ఆక్రమణ వంటి చర్యల ద్వారా ఆ లక్ష్యం దీర్ఘకాలంలో ఎంతవరకు నెరవేరగలదన్నది వేచి చూడాల్సిన విషయం.పోతే, వెనిజులాలో ఉపాధ్యక్షురాలి నాయకత్వాన కొనసాగుతున్న ప్రభుత్వం, సైన్యం కూడా ట్రంప్ దాడిని ఖండిస్తూ, ‘తమ దేశం ఎప్పటికీ అమెరికన్ వలస కాబోద’ని స్పష్టం చేశాయి. అటువంటి స్థితిలో అధి కారం ‘భద్రంగా న్యాయబద్ధంగా’ బదిలీ కావటం ఏ విధంగా ఆచరణ సాధ్యం? బలమైన సోషలిస్టు శక్తులు, ఆ ప్రాంతమంతటా గెరిల్లా గ్రూపులు, అదే మూడ్లో ఉన్న వెనిజులా సైన్యం దృష్ట్యా పరిణామాలు ఏవిధంగా ఉండవచ్చు? కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక జోక్యాలు, ఎన్నికైన ప్రభుత్వాలను ‘నియంతృత్వ’మనే ప్రచారాలతో పడగొట్టడాలతో లాటిన్ అమెరికా అంతటా ప్రజాభిప్రాయం చాలావరకు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాపై విమర్శలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం దృష్టి నుంచి అంతిమంగా తేలే ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉదారవాద వ్యవస్థలు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పరస్పర సంబంధాలు, దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం వంటివి బలహీనపడుతున్నా ఇంకా నిలిచి ఉంటాయా, లేక అమెరికా సామ్రాజ్యవాదానికి మరింత బలవుతాయా అన్నది. బలి చేయటమేనన్నది నిర్ణయమైతే ట్రంప్ గురి క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, ఎస్సీఓ, డీ–డాలరైజేషన్ ప్రయత్నాల వైపు మళ్లుతుంది. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
కానివారికి కంచాల్లో వడ్డిస్తారా!
గుర్తుండే ఉంటుంది, 2022లో నిస్సాగు నిరసన చేపట్టారు కొందరు పెద్ద రైతులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడం వల్ల పూర్వంలా కూలీలు తక్కువ దినవేతనాలకు దొరకడం లేదన్నది వారి అసంతృప్తికి కారణం. అందువల్ల తమ సాగు వ్యయ భారం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసారి సాగు విరామాన్ని పాటించారు. ఉపాధి పథకం కార్మికుల చేత రైతుల వ్యక్తిగత వ్యవసాయ పనులు చేయించాలన్న డిమాండ్కు మద్దతుగానూ ఇది జరిగింది. ఈ పథకం వల్ల కూలీలు ప్రియ మైపోయారన్నదే నిజమైతే, రైతులు వారిని భరించలేకపోతున్నా రన్నదే వాస్తవమైతే ఆ మేరకు పంటల మద్దతు ధరను పెంచి ఆదు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దానిని సాధించుకోవచ్చు. రైతుల సమస్య అదొక్కటే కాదు. ఉపాధి పథకం భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికుల్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచినమాట నిజమే. వాస్తవానికి అదిఅంత గొప్ప పథకమేమీ కాదు. పేద కార్మికులకు తమ కాళ్ళ మీద తాము బతగ్గలిగే పూర్తి స్థాయి బలాన్ని అది కల్పించలేదు. వారి చేతిలోని ఊతకర్రకు కొంచెం అదనపు ఊతాన్ని మాత్రమే ఇచ్చింది. దానికే వారు తమను దాటిపోతున్నారని దేశమంతటా గల పెద్ద రైతులు భావించడం విడ్డూరం. దీని మూలాల్లో ఫ్యూడల్ శక్తుల అసహనం ఇమిడి ఉన్నదనే అభిప్రాయాన్ని తోసిపుచ్చలేము. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు గాంధీ పేరు తీసేసి, ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని తెచ్చింది. పేద వర్గాల పొట్ట కొట్టి...గత పథకంలో మాదిరిగా ఈ కొత్తది డిమాండ్ ఆధారంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించబోవడం లేదు. పనిని హక్కుగా గుర్తించి దానిని కల్పించడం తన బాధ్యతగా ఎన్డీయే ప్రభుత్వం భావించడం లేదు. కేంద్రం తాను అనుకున్న చోట మాత్రమే ఈ పథకం కింద పనులు మంజూరు చేస్తుంది. డిమాండ్ ఆధారిత పని కల్పనకు తెర దించబోతున్నారు. పథకం మొత్తం ఖర్చులో పూర్వం మాదిరిగా 90 శాతానికి బదులు 60 శాతం నిధులనే కేంద్రం భరిస్తుంది. అందువల్ల రాష్ట్రాల వాటా 10 నుంచి 40 శాతానికి చేరుకుని భారీగా పెరిగిపోనున్నది. అన్నింటికీ మించి సాగు సీజన్లో 60 రోజులపాటు ఉపాధి పనులను నిలిపివేయడం కొత్త పథకంలోని ప్రధానమైన ప్రజావ్యతిరేక లక్షణం. మహాత్మా గాంధీ ‘నరేగా’ కార్మి కులకు ప్రసాదించిన ఉపాధి భరోసా ఈ విధంగా డొల్ల అయి పోతుందన్న మాట! దీనితో ముమ్మర సీజన్లో అధిక కూలీని సాధించుకునే హక్కును కార్మికులు కోల్పోనున్నారు. పేదలు, అణగారిన వర్గాలు పెత్తందారుల కింద బతకాలనే వ్యవస్థను పునరుద్ధరించాలని బీజేపీ కోరుకుంటున్నది. హిందూ సమాజ రక్షణే తమ విధి అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవలే అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దానిని చేసి చూపిస్తున్నది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భూస్థాపితం చేయా లని ప్రధాని మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఆ పథకాన్ని వదిలించుకోడం అంత తేలిక కాదని కూడా ఆయన గ్రహించారు. అందుకే అవసరమైన నిధులు విడుదల చేయకుండా దానికి నెమ్మది నెమ్మదిగా విషం ఇచ్చి చంపుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా తెర దించారు. కోవిడ్ కాలంలో నగరాలు, పట్టణాల నుంచి కాళ్లీడ్చుకుంటూ స్వస్థలాలకు చేరిన అసంఖ్యాక గ్రామీణ యువతకు పనులు కల్పించి ఆదుకున్న ‘నరేగా’ను అంతమొందిస్తున్నందుకు ఇప్పుడి ప్పుడే పల్లెల్లో నిరసన రూపుదిద్దుకుంటున్నది. మైనారిటీలను దూరం పెట్టి...స్వతంత్ర భారత రాజ్యాంగంలో బీజేపీకి బొత్తిగా గిట్టని పదాలు సోషలిస్టు, సెక్యులర్. ఈ రెండింటినీ 1976లో అప్పటికాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ‘ప్రవేశిక’లో చేర్చింది. వాటిని సుప్రీంకోర్టు ధ్రువపరిచింది. భావజాలపరంగా, సంకేతాత్మకంగా సోషలిస్టు పదానికి మహాత్మా గాంధీ ‘నరేగా’ ప్రాతినిధ్యం వహి స్తున్నది. దానిని కూల్చివేయడం ద్వారా సోషలిస్టు తరహా వ్యవస్థ మూలాలను బీజేపీ ఛేదించగలిగింది. సెక్యులర్ లక్షణానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న సర్వమత సమభావాన్ని నిర్మూలించాలని ఎదురు చూసిన ఆ పార్టీ అందుకోసం ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను (సర్) ఎంచుకున్నది. సరిహద్దు రాష్ట్రాల్లోకి పొరుగు దేశాల ముస్లింల వలస పరాకాష్ఠకు చేరుకున్నదనే నెపం ఇందు కోసమే దూసుకొచ్చింది. మొత్తం మీద మైనారిటీ ఓటర్లను భారీ ఎత్తున తొలగించడం ద్వారా దేశ లౌకిక లక్షణాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ సమకట్టిందనే అభిప్రాయం ధ్రువపడింది. ‘సర్’ మరో ఎన్ఆర్సి (జాతీయ పౌరసత్వ రిజిస్టర్) అనే విమర్శ బయలుదేరింది. దీని ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన మైనారిటీలను విదేశీయులుగా ముద్రవేసి అస్సాంలో మాదిరిగా వెనక్కు పంపిస్తారనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీ ఓటర్ల సంఖ్యను తగ్గించడం ద్వారా బీజేపీ తన గెలుపు అవకాశాలను గ్యారంటీ చేసుకుంటున్నది. బహుళత్వ రాజ్యాంగాన్ని హిందూత్వ పాలనాపత్రంగా మార్చివేసే తెగువకు పాల్పడు తున్నది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఉద్దేశించిన త్రిసభ్య కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించినప్పుడే ఎన్నికల యంత్రాంగాన్ని దుర్వినియోగానికి దారి ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ, ప్రాణప్రదం అయిన నిష్పాక్షిక ఎన్ని కల వ్యవస్థకు తూట్లుపొడవటం అందువల్లనే సాధ్యమవుతున్నది. దాని విష శిశువే ‘సర్’!జి. శ్రీరామ్మూర్తివ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఒక అజేయ స్ఫూర్తి సంకేతం
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ‘‘సౌరాష్ట్రే సోమనాథం చ...’’ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటిచెబుతుంది: ‘‘సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే‘ లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్’’ అంటే– ‘‘సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు’’ అని అర్థం. కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే, సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.అఖండ ధైర్యానికి నిర్వచనంసోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారత దేశంపైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశదేశాలకు విసృతంగా మోసుకెళ్లారు. తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్పై పదేపదే దాడులకు ‘ప్రేరేపించింది.’ దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. ఎందరో మహానుభావులుకానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నయ్ నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా– ‘‘దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతోపాటు గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీవన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంత శక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జాతీయ మనోభావనం జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మనాశనం, వినాశమే!’’ స్వాతంత్య్రానంతరం సమర్థుడైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్... అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మున్షీని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. ‘సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ద ష్రైన్ ఎటర్నల్)’ గ్రంథంతోపాటు... సోమనాథ్పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి, మున్షీ తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు... ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వతత్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందన్తి శస్త్రాణి’ అని గీతలో చెప్పినట్టు – అది ధ్వంసం చేయ శక్యంగాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు? ఒక ఆశాగీతంవందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొని నిలబడి... నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే... మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం... ‘భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య’ అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – ‘‘లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ... రాగద్వేషాలనూ, సమస్త క్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాలు’’ అని అర్థం. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కు ఉంది. 1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా... సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలెన్ని ఎదురైనా... ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మంపై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే... మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కల్యాణమే పరమావధిగా... మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది. జై సోమనాథ్! నరేంద్ర మోదీభారత ప్రధాని, శ్రీ సోమనాథ్ ట్రస్టు చైర్మన్ -
బ్యాంకింగ్ వ్యవస్థకు ‘రెపో’ సవాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు గుండె కాయ వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఒక విలక్షణ మైన ‘రెపో’ సంక్షోభంలో చిక్కుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) అనుసరి స్తున్న ద్రవ్య విధానాలు ఒక వైపు రుణాల వృద్ధికి రెక్కలు ఇస్తుంటే, మరోవైపు డిపాజిట్ల సేకరణకు గడ్డుకాలం దాపురించేలా చేస్తున్నాయి. సాధా రణంగా వడ్డీ రేట్లు తగ్గితే ఆర్థిక కార్యకలాపాలు పుంజు కుంటాయి. అయితే అదే సమయంలో బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు హరించుకుపోవడం ఇప్పుడు వ్యవస్థాగత స్థిరత్వానికి సవాలుగా మారింది.ప్రస్తుత బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, రుణాల విస్తరణకు, డిపాజిట్ల రాకకు మధ్య అగాథం స్పష్టంగా కనిపిస్తోంది. 2025 నవంబర్ నాటి గణాంకాల ప్రకారం, బ్యాంకుల రుణ వృద్ధి 11.42 శాతంగా నమోదు కాగా... డిపాజిట్ల వృద్ధి కేవలం 10.19 శాతా నికే పరిమితమైంది. ఈ 1.23 శాతం వ్యత్యాసం బేసిస్ పాయింట్ల లెక్కన చూస్తే 123 పాయింట్లు. 2024 అంతా నికి ఈ అంతరం కేవలం 0.58 శాతమే. అంటే ఏడాది కాలంలోనే నిధుల కొరత రెట్టింపు స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 6.50 శాతం నుంచి 5.25 శాతానికి అంటే ఏకంగా 125 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల... అప్పులు చౌకయ్యాయి. అదుపు తప్పుతున్న క్రెడిట్–టు–డిపాజిట్ నిష్పత్తిఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం, బ్యాంకులు పంపిణీ చేసిన మొత్తం రుణాలు సుమారు రూ. 194 లక్షల కోట్లు ఉంటే, డిపాజిట్లు రూ. 241 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ వ్యవస్థలో క్రెడిట్ –టు–డిపాజిట్ నిష్పత్తి సాధారణంగా 75 నుండి 80 శాతం మధ్య ఉండాలి. కానీ ప్రస్తుతం ఇది 82 శాతానికి చేరింది. అంటే బ్యాంకులు సేకరిస్తున్న ప్రతి వంద రూపాయల్లో 82 రూపాయలను అప్పులుగా ఇచ్చేస్తు న్నాయి. మిగిలిన మొత్తంలో క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్ట్యాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) వంటి చట్టబద్ధ నిల్వలను పక్కన పెడితే, బ్యాంకుల వద్ద అత్యవసర ద్రవ్య లభ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది.బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడానికి ప్రధాన కారణం సామాన్యుడికి దక్కే వడ్డీ ఆశించిన స్థాయిలో లేక పోవ డమే. ముఖ్యంగా స్థిర ఆదాయంపై ఆధారపడే సీని యర్ సిటిజన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాంకుల్లో దొరికే స్వల్ప వడ్డీ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే మార్గాల వైపు ప్రజలు మళ్లుతున్నారు. మ్యూచు వల్ ఫండ్స్, షేర్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు నేడు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్య స్థానాలుగా మారాయి. ప్రభుత్వ చిన్న పొదుపు పథ కాలు సైతం బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. దీనికి తోడు పెరిగిన విని యోగ వ్యయం కారణంగా ప్రజల చేతుల్లో పొదుపు చేసేందుకు మిగులు ఆదాయం తగ్గడం కూడా బ్యాంకు లకు ప్రతిబంధకంగా మారింది. బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డీ పథకాలు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ, యాన్యుటీ స్కీమ్లు ప్రవేశపెడుతున్నప్పటికీ, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం ముందు ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.ద్రవ్య కొరత ప్రభావండిపాజిట్ల కొరత ఇలాగే కొనసాగితే బ్యాంకులు తమ ఆర్థిక అవసరాల కోసం బాండ్ మార్కెట్ లేదా అంతర్–బ్యాంక్ మార్కెట్ల నుంచి భారీ వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. రూపాంతర రహిత రుణపత్రాలు (నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్స్), మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా నిధులు సేకరించడం వల్ల బ్యాంకుల నిర్వహణ వ్యయం భారమవుతుంది. ఇది బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడమే కాకుండా, అంతిమంగా ఖాతాదారులపైనే ప్రభావం చూపుతుంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ పెంచితే, ఆటోమేటిక్గా రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగు తాయి. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గృహ, వ్యక్తిగత రుణాలను భారం చేస్తుంది. పర్యవసానంగా కొత్త పెట్టుబడులు తగ్గి ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం పొంచి ఉంది. అలాగే నిధులు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి విపరీతంగా ప్రవహించి అక్కడ ‘ఆస్తి బుడగలు’ ఏర్పడే అవకాశం ఉంది. ఇది విదేశీ పెట్టుబడులు తరలిపోవడానికీ, రూపాయి విలువ పడిపోవడానికీ దారితీయవచ్చు.బ్యాంకుల్లో నిధులు తగ్గడానికి కేవలం వడ్డీ రేట్లే కారణం కాదు, వ్యవస్థపై నెలకొన్న అభద్రతా భావం కూడా ఒక ముఖ్య కారణం. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శక్తులు దాదాపు రూ. 1.70 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని ఎగ్గొట్టాయి. సైబర్ నేరగాళ్లు సామా న్యుల ఖాతాలను ఖాళీ చేస్తూ స్వైరవిహారం చేస్తున్నారు. లక్షల ఖాతాల నుంచి వేల కోట్ల రూపాయలు మాయమవుతుండటంతో హడలిపోతున్న పొదుపుదారులు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి వెనుకాడుతున్నారు. పరిష్కారం దిశగా అడుగులుప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ సమగ్ర వ్యూహంతో ముందుకు రావాలి. కేవలం రెపో రేట్ల మార్పులతోనే సరిపెట్టకుండా, డిపాజిట్ల వృద్ధిని ప్రోత్సహించేలా పన్ను రాయి తీలు లేదా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. రుణ ఎగవేతదారులు, సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసు కున్నప్పుడే ప్రజల్లో బ్యాంకులపై భరోసా కలుగుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకింగ్ స్థిరత్వం, తక్కువ వడ్డీకి రుణ లభ్యత అనే మూడు అంశాల మధ్య సమ తుల్యత సాధించడం దేశ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత కీలకం. బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు, డిపాజిట్లు అనేవి ఒకే బండికి ఉన్న రెండు చక్రాల వంటివి. ఒక చక్రం తిరుగుతూ రెండో చక్రం మొరాయిస్తే ఆ బండి గమ్యాన్ని చేరడం అటుంచి, ప్రమాదంలో పడుతుంది.బోగా దీపికవ్యాసకర్త పరిశోధకురాలు -
జోహ్రాన్ మమ్దానీ (న్యూయార్క్ మేయర్) రాయని డైరీ
నీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారన్నది నీ బలాన్ని తెలుపుతుంది. నువ్వు ఎవరి పక్కన నిలబడి ఉంటున్నావన్నది వారి పట్ల నీలోని బలమైన ఆపేక్షను చూపుతుంది.నేను, న్యూయార్క్ సిటీ... నా బాల్య మిత్రులం. ఎప్పటికీ ఒకరి పక్కన ఒకరం నిలబడి ఉండేవాళ్లం.హడ్సన్ నది ఒడ్డున , న్యూయార్క్ సిటీ నా భుజం పైన చెయ్యేసి నడుస్తుంది. నాకెంతో ఇష్టమైన గోధుమ పిండి ‘బురిటో’ను క్వీన్స్ – బ్రూక్లిన్ స్టేషన్ల మధ్య తిరుగుతుండే ‘క్యూ’ ట్రైన్లో తనతో ఇష్టంగా పంచుకోనిస్తుంది. వలస వచ్చిన వారిని కలవనివ్వటం అంటే, రమ్మని పిలిచి కలవటం కాదు. రావచ్చా అని అడిగి వెళ్లి కలవటం. న్యూయార్క్ మర్యాదగల మనిషి. మానవ మర్యాదల కోసం చూడని నగరం. ఇలాగే కదా నాగరికత ఉండాల్సింది! జనవరి 1 అర్ధరాత్రి... కొత్త ప్రయాణికుడిలా ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్లో దిగాన్నేను. లగేజ్ లేదు. లగేజ్లు మోయటానికి వచ్చినవాడి దగ్గర లగేజ్ ఎందుకు ఉంటుంది?‘‘ఎవరతను, ఈ టైమ్లో దిగాడు?’’‘‘న్యూయార్క్ సిటీ కొత్త మేయర్!’’‘‘అది తెలుసు. ఎవరతను?’’‘‘డెమోక్రాటిక్ సోషలిస్ట్!’’‘‘అదీ తెలుసు. ఎవరతను?’’‘‘ఒక యువకుడు!’’‘అది తెలుస్తూనే ఉంది. ఎవరతను?’’‘‘వలస వచ్చినవాడు’’ ‘‘అది కూడా తెలుసు. ఎవరతను?’’‘‘ఒక ముస్లిం’’ ‘‘ఓరి దేవుడా! న్యూయార్క్ సిటీ ఒక ముస్లింని, ఒక వలస మనిషిని, ఒక డెమోక్రాటిక్ సోషలిస్ట్ని, ఒక అనుభవం లేని వాడిని తన మేయర్గా ఎన్నుకుందా? ఏం కర్మ ఈ 400 ఏళ్ల మహా నగరానికి?!’’నాతో తలపడి నన్ను గెలిపించిన ఆండ్రూ క్యూమో, కర్టిస్ స్లివా, ఎరిక్ ఆడమ్స్ ఆత్మలు సబ్వేలో బాధతో మూలుగుతున్నట్లుగా అనిపించింది!ఇందులో దేనికి నేను క్షమాపణలు చెప్పి ఈ ఆత్మల ఘోషను చల్లార్చాలి? వలస వచ్చినందుకా? ముస్లింని అయినందుకా? యువకుడిని అయినందుకా? డెమోక్రాటిక్ సోషలిస్టును అయినందుకా?... లేక, ఇవన్నీ అయి కూడా, న్యూయార్క్ సిటీ మేయర్గా ఓడిపోనే పోనందుకా?!న్యూయార్క్ వలసల నగరం. వలసలు నిర్మించిన నగరం. వలసల శ్రమతో నడిచే నగరం. ఇక నుంచి ఒక వలసదారుడు నడిపే నగరం కూడా.ఈ మూడు పరాజిత ఆత్మలు నాతో పాటుగా రోజూ సిటీ హాల్లోని మేయర్ ఆఫీస్కి వచ్చి, డ్యూటీ చేసి వెళుతుంటాయా? వెంటాడే వాళ్లు, వేటాడేవాళ్లు ఎక్కడికైనా వస్తారు!ఇకపై వాషింగ్టన్ నుంచి వచ్చిన వారెవరైనా న్యూయార్క్ సిటీలోని ఒక వలసదారుడిని తాకాలంటే, ముందుగా జోహ్రాన్ మమ్దానీ అనే ఈ కొత్త న్యూయార్క్ మేయర్ను దాటే వెళ్లాలి.కర్టిస్ స్లివా వ్యథాత్మ అసహనంగా అంటోంది: ‘‘జోహ్రాన్, నువ్వు ఎవరివైనా, ఎక్కడి నుంచి వచ్చినా... ప్రమాదకారివి అవటం మాత్రం మొదట నువ్వు డెమోక్రాటిక్ సోషలిస్ట్వి అయినందువల్లనే...’’నవ్వొస్తోంది నాకు. మనిషన్న వారెవరైనా డెమోక్రాటిక్ సోషలిస్ట్ అవకుండా ఉండగలరా? కర్టిస్ రిపబ్లికన్. మేయర్ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు గెలుచుకున్న కర్టిస్ కానీ; 41 శాతం ఓట్లు సాధించిన ఆండ్రూ క్యూమో కానీ; పాయింట్ 3 శాతం ఓట్లు పొందిన ఎరిక్ ఆడమ్స్ కానీ, వ్యక్తులుగా డెమోక్రాటిక్ సోషలిస్ట్లు కాకుండా పోతారా?!డెమోక్రాటిక్ సోషలిస్ట్గానే నేను ఎన్నికయ్యాను. డెమోక్రాటిక్ సోషలిస్టుగానే న్యూయార్క్ సిటీని నడిపిస్తాను. ఆ నడక నాకు న్యూయార్క్ సిటీ నేర్పిందే! -
మెరుగయ్యామా?
ఒక దేశం గడిచిపోయిన సంవత్సరాన్ని వెనుకకు తిరిగి సమీక్షించుకోవట మంటే, ఆ సంవత్సరంలోని పరిణామాలను తారీఖులు, దస్తావేజుల పద్ధతిలో నెమరు వేసుకోవటం కాదు. అంతకుముందటి సంవత్సరంతో పోల్చినప్పుడు ఏమైనా మెరుగుపడిందా అని సరిచూసుకోవటం. రాజకీయంగా, పరిపాలనాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, వాటితో పాటు బయటి దేశాలతో సంబంధాల రీత్యా! వీటికి సంబంధించిన అంశాలు అన్నింటికి అన్నీ మెరుగుపడి ఉండకపోవచ్చు. అది సాధ్యం కూడా కాదు. కొన్ని ఒడుదొడుకులు తప్పవు. కానీ, మొత్తం మీద సారాంశం ఏమిటన్న దానిని బట్టే ఒక దేశం ముందుకు పోవటం ఆధారపడి ఉంటుంది.పైన పేర్కొన్న అయిదు ప్రధాన రంగాలకు సంబంధించి, గడిచిపోయిన 2025వ సంవత్సరంలో అనేకానేకం జరిగాయి. వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రం పేర్కొని ఆ ప్రభావాలను అంచనా వేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యమైనవి అనే మాటను ముందు నిర్వచించుకోవాలి. కొన్నింటికి తక్షణ ప్రాముఖ్యం ఉండి క్రమంగా తేలిపోతాయి. కొన్నింటికి తదనంతర కాలంలోనూ ప్రభావాలు కొనసాగుతాయి. ఇక్కడ చూసేందుకు ప్రయత్నిస్తున్నది ఈ రెండో తరహా వాటి గురించి.బలపడిన బీజేపీముందుగా రాజకీయాలను గమనిస్తే, 2025వ సంవత్సరం వచ్చే వేళకు దేశం ముందుండిన ప్రధానమైన ప్రశ్న, 2024లో వరుసగా కేంద్రంలో, రాష్ట్రాలలో పరాజయాల పాలైన ప్రతిపక్షాలు ఇప్పటికైనా కూడదీసుకోగలవా అన్నది. కాంగ్రెస్ను, దాని నాయకత్వాన గల యూపీఏను 2014లో వెనుకకు తోసిన బీజేపీ, క్రమంగా ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపరుస్తున్న క్రమం 2025లో, ఆ తర్వాత 2026లో ఆగగలదా? కాంగ్రెస్, దాని కూటమి పార్టీలు కలిసి 2027 కల్లా పుంజుకుని బీజేపీకి నిజమైన సవాలుగా నిలవగలవా అన్నది పెద్ద ప్రశ్న అయింది. అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరిగిన ఢిల్లీ, బిహార్, 2026లో జరగనున్న అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కలిపి మొత్తం ఆరు రాష్ట్రాలు. వీటిలో ప్రతిపక్ష రాష్ట్రం ఢిల్లీని బీజేపీ ఇప్పటికే గెలుచుకోగా, ప్రతిపక్షం ఎన్నో ఆశలు పెట్టు కున్న బిహార్, అంతకుముందటి కన్న భారీ ఆధిక్య తతో బీజేపీ వశమైంది. 2026లో జరిగే అస్సాంపై ప్రతిపక్షాలకు, కేరళపై బీజేపీకి అంచనాలు లేక పోవచ్చు గానీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు కోసం ఆ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తున్నది. 2025 చివరన నికరంగా కనిపిస్తున్నదేమంటే, బీజేపీ 2024 కన్న ఇప్పుడు మరింత బలపడి, 2026లో ఇంకా బలపడే సూచనలు కనిపిస్తుండగా, ప్రతిపక్షాల పరిస్థితి అందుకు విరుద్ధ దిశలో సాగుతున్నది.ఆర్థికం యథాతథందేశం ఆర్థికంగా 2025లో మెరుగుపడిందా, క్షీణించిందా అన్న ప్రశ్నపై తీవ్రమైన చర్చలు సాగు తున్నాయి. అవి స్థూలంగా చూసినపుడు ఉత్తర – దక్షిణ ధ్రువాలన్నంత భిన్నంగా ఉన్నాయి. వాస్తవా నికి ఆర్థిక రంగం 2024తో పోల్చినప్పుడు కొద్దిపాటి తేడాలతో యథావిధిగానే సాగుతున్నది తప్ప భారీ మార్పులంటూ కనిపించవు. ఉత్పాదక రంగం, వాణిజ్యం, ఆదాయాలు, ధనిక పేద తారతమ్యాల పెరుగుదల, అదే సమయంలో మధ్యతరగతి పెరుగు దల, అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆర్థిక – వాణిజ్య సవాళ్లు, రూపాయి విలువ ఆగకుండా పతనమవుతుండటం, వాణిజ్య లోటు పెరుగుతూనే ఉండటం, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగు దల, వ్యవసాయ రంగ సమస్యలు అన్నింటిదీ 2024 నాటి పరిస్థితే. అదే సమయంలో మరొకవైపు, పలు విధాలైన సక్రమ, అక్రమ రాయితీలతో కొందరి సంపదలు కొండలవలె పెరగటం కూడా 2025లో కొనసాగింది. మరొకవైపు వివిధ అంతర్జాతీయ సూచీలలో ఎందులోనూ భారతదేశపు ర్యాంకింగులు మెరుగుపడలేదు.ఆర్థిక రంగానికి సంబంధించి 2025వ సంవత్సరపు రెండు గమనార్హమైన విషయాలున్నాయి. ఒకటి – అమెరికా విధించిన భారీ సుంకాలు, ఇండియాను లొంగదీసేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వాణిజ్య ఒప్పందం. రెండవది – అమెరికా ఒత్తిడిని సరకు చేయకుండా భారత ప్రభుత్వం ‘బ్రిక్స్’లో కొనసాగుతూ ఆ వ్యవస్థను శక్తిమంతం చేస్తుండటం. ఇవిగాక, అమెరికా కూటమి నుంచి వైవిధ్యంకోసం పలు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని మోదీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధమైన పరిస్థితులు, పరిణామాలు 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయం నుంచి ఇదే మొదటిసారి. 2025లో ఎదురైన ఈ సవాళ్ల వంటివి లోగడ లేవు. వీటిని సానుకూలంగా ఎదుర్కొనగలగటంపై వర్తమానంతోపాటు దీర్ఘకాలిక భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. దెబ్బతిన్న సంబంధాలుబయటి ప్రపంచంతో ఆర్థిక సంబంధాల పరిస్థితి ఇది కాగా, రాజకీయ సంబంధాలు మాత్రం సంతోషకరంగా సాగలేదు. పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్తో సంబంధాల క్షీణత, శ్రీలంకతో సత్సంబంధాల కోసం పడుతున్న శ్రమ ఇందుకు తార్కాణం. చైనా, రష్యాలకు, ఇండియాకు మధ్య సంబంధాల అభివృద్ధి ముఖ్యంగా అమెరికా తీరు కారణంగా ముగ్గురికీ అవసరమనే గుర్తింపు గతంలో కన్న ఎక్కువగా ఏర్పడటం, అందుకు తగిన వ్యవహరణ అన్నది 2025లో కనిపించిన కొత్త విశేషం. చివరగా సమాజం విషయానికి వస్తే, యథాతథంగానే పెరుగుతున్న ఆర్థిక అసంతృప్తికి తోడు, ఒకవైపు అల్పసంఖ్యాక వర్గాలు, మరొకవైపు దళితుల భద్రత 2024 కన్న స్పష్టమైన రీతిలో మరింత క్షీణించింది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పాలకుల ‘బంగారు’ పిచ్చి
ప్రజా పథకాల అమలులో చిత్తశుద్ధి ముఖ్యం గానీ, పేరు మార్పుతో ప్రజలకు ఒరిగేదేముంది? కేంద్రంలో ఎన్డీయే సర్కారు ‘మహాత్మాగాంధీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాక విధానాలనూ మార్చి కొత్త పథకం తెస్తోంది. పాలన వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వ్యవస్థ పేరు మార్పునకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అమలు అధోగతి పాలై, వ్యవస్థ కుప్పకూలుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా చట్టం ద్వారా పథకం పేరు మార్చే క్రమంలో ఆర్డినెన్స్ తేవడానికి రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. కొత్త పేరు ‘స్వర్ణ గ్రామం’ ‘స్వర్ణ వార్డు’ అట! ఈ ‘స్వర్ణం’ పిచ్చి ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త కాదు. పాతికేళ్ల కింద ‘స్వర్ణాంధ్ర’ రాగాలు పాడారు. బంగారం ధరలు సామాన్యులకు అందనంత పైపైకి వెళుతుంటే, జనానికి చేరువగా పాలనను తెచ్చే పథకాలకు ఈ ‘బంగారం’ పేర్లేంటో అర్థమే కాదు!ప్రభుత్వ పాలనను పౌరులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో వికేంద్రీకృత ‘సచివాలయ’ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో 2019లో తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా ఏర్పడ్డవే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు. పౌరులకు పెన్షన్ వంటి వ్యక్తిగత లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు రెవెన్యూ, విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయం, పశుపోషణ, మహిళా భద్రత వంటి వివిధ విభాగాల సేవల్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల్ని ఏర్పరచి, అందులో పది మందికి పైగా ఉద్యోగుల్ని నియమించి ఈ వికేంద్రీకరణ చేపట్టారు. ముందు కన్సాలిడేటెడ్ వేతనాలపై పనిచేసిన ఈ సిబ్బంది ఇప్పుడు పూర్తిస్థాయి స్కేల్–జీత భత్యాలు పొందుతున్నారు. దీనికి తోడు సగటున ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున ‘స్వచ్ఛంద సేవకుల’ను నియమించి, వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం నడిపింది. వాలంటీర్లకు నెలనెలా అయిదువేల రూపాయల గౌరవ భృతి ఇచ్చేది. సచివాలయానికి, గ్రామస్థులు/వార్డు పౌరులకు మధ్య సంధానకర్తగా ఉండే ఈ వాలంటీర్లు పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అప్పగించడం నుంచి పలు సేవలు అందించేది. కుల, జన్మ, మరణ ధ్రువపత్రాలను ఇప్పించడం, వేర్వేరు సేవలకు సంబంధించిన దరఖాస్తుల్ని సచివా లయం ద్వారా సంబంధిత శాఖా కార్యాలయాలకు చేర్చడం, సర్కారు స్పందనల్ని, పరిష్కారాల్ని పౌరులకు అందించడం వరకు వారికి సహాయకారులుగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ రద్దయింది. మొదట మొత్తంగా 15,000 పై చిలుకు సచివాలయాలు ఏర్ప డగా 1.34 లక్షల ఉద్యోగులు, 2.52 లక్షల వాలంటీర్లు ఇందుకోసం నియమితులయ్యారు. 35 విభాగాలకు చెందిన 500 సేవలు సకాలంలో, సజావుగా ప్రజలకు అందాలని, ఏ అంశమైనా గరిష్ఠంగా 72 గంటల్లో పరిష్కారమవ్వాలని ఉద్దేశించారు. అసలీ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలే దిశలో సాగుతోంది. ఏపీ మంత్రివర్గంలోని ఒకరు ప్రైవేటు సంభాషణలో అన్నట్టు ‘ఆకాశాన్నంటుతున్న ధరలతో ఒక బంగారు చెవిపోగు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈ స్వర్ణ గ్రామమేంటో, స్వర్ణ వార్డేంటో!’ అనే భావన అక్షర సత్యం. ఏపీ సీఎం చంద్రబాబు తొలిదఫా ముఖ్యమంత్రి అయిన కాలంలో ‘స్వర్ణాంధ్ర’ కలలు కనేది! అదే క్రమంలో ‘విజన్ 2020’ విధాన పత్రాన్ని ప్రకటిస్తే నాటి విపక్ష నేత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి దాన్నొక ‘దశాబ్ది ఉత్తమ కాల్పనిక పత్రం’గా విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ‘విజన్–2047’ అంటూ రెండు దశాబ్దాల కలల్ని ఇప్పట్నుంచే ఆమ్మ జూపుతున్నాయి. తక్షణ ఆచరణలో నిబద్ధత, చిత్తశుద్ధి లేకుండా సుదూర భవిష్యత్తుకు గేలాలు వేయడం, ‘బంగారు తాపడం’ పూయడం మాయ కాక మరేమవుతుంది? తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి పదేళ్లు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘బంగారు తెలంగాణ’ నినాదం కూడా విమర్శలను ఎదుర్కొంది. చేసేందుకు ఎంతో ఉంది!ఏపీలో పదిహేను వేల వరకున్న గ్రామ వార్డు సచివాలయాల్లో కనీసం రోజూ ఆఫీస్ ఊడ్చేవారు లేరు. అందుకవసరమైన వ్యవస్థే లేదు. ఏమంటే ‘ఇందుకోసం నిధులు లేవు, జీరో బడ్జెట్’ అని నోడల్ అధికారిగా ఉన్న ఒక డిప్యూటీ ఎంపీడీవోనే చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద లక్ష్యాలతో వస్తే మొదట వాలంటీర్లతో చేయించిన పనులు ఇప్పుడు తమతో చేయిస్తున్నారనే ఆవేదన, తమ సేవలకు తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆక్రోశం మెజారిటీ సచివాలయ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.‘సచివాలయ వ్యవస్థ’ తాజా స్థితిపై రాష్ట్రవ్యాప్త అధ్యయనం చేపట్టిన ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ పరిశీలనకు వస్తున్న అంశాలు ఆసక్తికరంగానే కాదు, ఒకింత ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. పెద్దమొత్తంలో ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న ఈ వ్యవస్థను సంస్కరించకుండా ఇలాగే నడిపిస్తే సమీప కాలంలోనే కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవస్థ సమర్థ నిర్వహణకు సరైన నిఘా, నియంత్రణ, అజమాయిషీ తక్షణావసరమని సర్వేలో వెల్లడవుతున్న అభిప్రాయం. ఈ అధ్యయనం జరుగుతున్న సమ యంలోనే ‘పేరు మార్పు’ మంత్రివర్గ నిర్ణయం వెలువడింది. అవస రానికి మించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారనేది ఒక విమర్శ. అందుకే, ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధం చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టారు. ఇదివరకున్నట్టు అన్ని సచివా లయాల్లో 11 మంది కాకుండా, జనాభాను బట్టి 6, 7, 8 మంది సిబ్బందితో సరిపెట్టడం, ఆ మేర సర్దుబాటు చేయడం అనే ప్రక్రియ మొదలైంది. కానీ అది సవ్యంగా జరగటం లేదు. దాన్ని సరిగా జరిపించి, ఆశించిన లక్ష్యం మేరకు ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో, సులభంగా అందేట్టు చూడాలి. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసే దిశలో ఇదొక మార్గం కావాలి. ప్రభుత్వం నిరంతర ప్రక్రియపాలనలోకి రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రభుత్వమన్నది నిరంతరంగా ఉండే ఒక బాధ్యత, అంతకు మించి జవాబుదారీతనం! నిన్నటి ప్రభుత్వ విధానాలను, పేర్లను నేడు గౌరవించక, గుడ్డిగా మార్చేసే వారికి రెండు, మూడు దశాబ్దాల ‘విజన్ ’ పేరిట కార్యక్రమాలు మొదలెట్టే నైతిక హక్కు ఏముంటుంది? ‘మీరు ఎన్నికైంది అయిదేళ్లకోసమే కదా, మీలాగానే మీ తర్వాత వచ్చినవారు మీ విధానాలను కొనసాగించక, పక్కన పడేస్తే ఏమిటి పరిస్థితి?’ అని అడిగితే ఏం సమాధానమిస్తారు! పైగా ప్రజోపయోగంగా విధానాలను సరిదిద్దకుండా పేరు మారిస్తే ఏమొస్తుంది? ‘ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అన్నట్టుంటే– గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థే కాదు, ఏదీ సవ్యంగా ఉండదు. పౌర సేవల్ని సజావుగా అందిస్తూ, పాలనను ప్రజలకు చేరువ చేసే చిత్తశుద్ధిని ప్రభుత్వాలు ప్రదర్శించాలి. ఇదే ప్రజాస్వామ్య ధర్మం!దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్, సోషల్ ఎనలిస్ట్;డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ -
పేరుకు అభివృద్ధి... 'చేసేది విధ్వంసం'
బొగ్గు గనులు ‘ఇంధన భద్రత’గా మారాయి. రేవులు ‘వ్యూహాత్మక మౌలిక వసతులు’ అయ్యాయి. సఫారీ పార్కులు ‘సంరక్షణ’ ముద్ర వేసుకుంటున్నాయి. వీటిని ఒకే తాటిపైకి తెస్తున్నది జాగ్రఫీ కాదు, వాటి రాజకీయ ఆర్థిక వ్యవస్థ. హరిత ఆవరణ వ్యవస్థ అడవులు,కొండలు, దీవులను అభివృద్ధి పేరిట పెట్టుబడి ఆస్తులుగా మార్చేస్తోంది. హరియాణాలో ఆరావళి పర్వత శ్రేణిలో 3,800 ఎకరాలకు పైగా ప్రాంతాన్ని మెగా సఫారీ పార్కుగా మార్చాలన్న ప్రతిపాదన అందుకు తిరుగులేని నిదర్శనం. ఎకో టూరిజం, జీవవైవిధ్య పెంపుదల పేరు చెప్పి అది టూరిస్టులకు కన్నుల పండువను, డెవలపర్లకు లాభాలను వాగ్దానం చేస్తోంది. కానీ, అది అడవుల ఆవరణకు, జల వనరులకు, గ్రామాల ఉమ్మడి ఆస్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఆరావళికి మాత్రమే పరిమితమైంది కాదు. హసదేవ అరండ్లో బొగ్గు బ్లాకుల నుంచి దేహింగ్ పటకాయీలో చమురు, మైనింగ్; గ్రేట్ నికోబార్లో ట్రాన్స్– షిప్మెంట్ పోర్టు వరకు, భారతదేశపు అత్యంత బలహీనమైన జీవావరణ వ్యవస్థలు, అభివృద్ధికి పొలిమేరలుగా పునర్నిర్మాణం చెందుతున్నాయి. సఫారీ అనేది మినహాయింపు కాదు. అదొక నమూనా! జీవనాధార వ్యవస్థకు ముప్పుఆరావళి పర్వతాలు గుజరాత్లో మొదలై రాజస్థాన్, హరి యాణా గుండా సాగి ఢిల్లీ వరకు 670 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థగా దీన్ని చెబుతారు. ఇది భౌగోళిక అవశేషం కాదు. జీవావరణ మౌలిక వ్యవస్థ. థార్ ఎడారి తూర్పు వైపు మరింత విస్తరించకుండా ఇవి దాన్ని కాస్త మందగింపజేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాయవ్య భారతాన భూగర్భ జలాల రీఛార్జీకి ఇవి ఉపయోగ పడుతున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ వంటి జిల్లాల్లో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. ఆ జిల్లాలకు ఆరావళి పర్వతాలే జీవనాడి. అవి రుతుపవన వర్షాలను పీల్చుకుంటూ భారీ స్పాంజ్లుగా ఉపయోగపడుతున్నాయి. నీటికి ఎంతో కటకటలాడే ప్రాంతంలో జలవనరులు అంతో ఇంతో నిండటానికి తోడ్పడుతున్నాయి. పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో, పులిమీద పుట్రలా సుప్రీం కోర్టు భౌగోళిక శాస్త్ర ప్రమాణాలను ఉటంకిస్తూ, ‘సైన్స్’ పేరుతో ఆరావళి పర్వతాల రూపురేఖలకు ఆ మధ్య కొత్త నిర్వచనం ఇచ్చింది. చుట్టుపక్కల భూమి కన్నా కనీసం 100 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలని పేర్కొంది. ఈ విషయంలో అది రెగ్యులేటరీ అస్పష్టతను తొలగించేందుకు కేంద్రం ఇచ్చిన నిర్వచనం పైనే ఆధారపడింది. కాగితాలపై ఇది సాంకేతిక సునిశితత్వంగా కనిపించవచ్చు. వాస్తవంలో, ఇది లీగల్ భూకంపం లాంటిది.ఆరావళులలో చాలా భాగాలు ముఖ్యంగా హరియాణా, రాజస్థాన్ లోనివి తక్కువ ఎత్తులోనే ఉంటాయి. అవి కోర్టు చెప్పిన ఎత్తును అందుకోలేకపోవచ్చు. కానీ, జీవావరణ పరంగా అత్యంత కీలకమైనవి. పర్వతాలను పునర్ నిర్వచించడం ద్వారా భారీ భూభాగాలను పరిరక్షణ నుంచి మినహాయిస్తే, అవి గనుల తవ్వ కాలు, రియల్ ఎస్టేట్, హైవేలు, సఫారీ లాంటి ప్రాజెక్టులకు ఆల వాలం అవుతాయి. (అయితే, సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును పునఃపరిశీలిస్తోంది.)చెప్పేదొకటి... చేసేదొకటి!వన్య ప్రాణులను సంరక్షిస్తామని సఫారీ ప్రాజెక్టు చెబుతోంది. కానీ, పెళుసుగా ఉన్న ప్రాంతంలో రోడ్లు, లాడ్జీలు, పార్కింగ్ లాట్లు, ఇతర ఎన్క్లోజర్లు నిర్మించడం ద్వారా చేసే పనులు సంరక్షణ కిందకు రావు. అడవులకు కంచె నిర్మిస్తారు. ప్రజలను వాటిని దాటి వెళ్ళ నివ్వరు. ఉన్నత వర్గాల సరదాలకు అనుగుణంగా ప్రకృతిని తాము ఎంచుకున్న పద్ధతిలో నిర్వహిస్తారు. గురుగ్రామ్, నుహ్లలోని స్థానిక ప్రజానీకం పశుగ్రాసం, కట్టెలు, నీరు, రుతువులను బట్టి లభించే ఉపాధి మార్గాలకు ఆరా వళులపైనే ఆధారపడుతోంది. ఇది ఉన్నవి లాగేసుకోవడం ద్వారా వేరే వారికి పోగేసిపెట్టడమే! దాన్ని ‘ఎకో–టూరిజం’గా రీప్యాకేజీ చేయడమే. మధ్యభారతంలోని విస్తారమైన అడవుల్లో ఛత్తీస్గఢ్లోని హసదేవ అరండ్ ఒకటి. టేకు చెట్లకు, ఇనుమద్ది, సాళువ, గుగ్గిలం చెట్లుగా పిలిచే రకం చెట్లకు ఇది ప్రసిద్ధి. ఇంధన భద్రత పేరుతో బొగ్గుకు ఈ ప్రాంతాన్ని త్యాగం చేశారు. అధికారుల ప్రోద్బలంతో మైనింగ్ బ్లాకులు తెరిచారు. ఆరావళికి ఎకో–టూరిజం మాదిరిగానే హసదేవకు బొగ్గు ఎసరు పెట్టింది. రెండు ఉదంతాల్లో పేర్లు మారినా వాటిల్లే హాని ఒక్కటే!కాగితాలపై పచ్చదనం... ఆచరణలో అరాచకం అస్సాంలోని దేహింగ్ పటకాయీని ‘అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్’గా అభివర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణకు, బొగ్గు గనుల తవ్వకానికి అనుమ తించారు. రెగ్యులేటరీ మినహాయింపులనిచ్చారు. అనుమతులకు ముందే పనులు చకచకా సాగిపోయాయి. మొదట తవ్వి తీయడం, తరువాతే పరిశీలనలు. టెక్నోక్రాటిక్ పరిభాషతో ఆ ప్రాజెక్టులను సమర్థిస్తున్నారు. ప్రభావం మదింపు, నిపుణుల కమిటీలు, నష్టాన్ని తగ్గించే ప్రణాళికలు అంటారు. కానీ, ఈ మంత్రాంగాలు సంరక్షణ చర్యలగా కన్నా, ముందే నిర్ణయించిన ఫలితాలను చట్టబద్ధం చేసే సాధనాలుగానే ఎక్కువ ఉపయోగపడతాయి. జాతీయ భద్రత, వ్యూహాత్మక మౌలిక వసతుల పేరుతో గ్రేట్ నికోబార్లో మెగా ట్రాన్స్–షిప్మెంట్ పోర్టును, విమానాశ్రయాన్ని, టౌన్ షిప్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్షారణ్యాలకు, కోరల్ ఎకోసిస్టవ్ులకు, స్థానిక శోంపెన్ జనజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. ఇక్కడ గ్రీన్ ఎన్క్లోజర్ భౌగోళిక రాజ కీయాల ముసుగు వేసుకుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవా వరణం సలాం చేయవలసిందే. ఈ ఉదంతాలన్నింటిలోనూ చట్టం లోపించలేదు. దాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. ఆరావళి, హసదేవ, ఇతర దుర్బల మండ లాలను కాపాడేందుకు సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అడపాదడపా జోక్యం చేసుకుంటూనే ఉన్నాయి. 1900 నాటి పంజాబ్ భూసంరక్షణ చట్టం వంటివి భూ వినియోగ మార్పుపై కొన్ని పరిమితులను విధించగలిగాయి. అయినా, కమిటీలు, పునర్ వర్గీకరణలు, నీరుగార్చిన మదింపులు, ఇప్పుడు ఏకంగా మారిన నిర్వచనాలను కవచాలుగా ధరించి మెగా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.దేవాశీస్ చక్రవర్తివ్యాసకర్త అంతర్జాతీయ మీడియా స్కాలర్,సామాజిక శాస్త్రవేత్త (‘యూరేసియా రివ్యూ’ సౌజన్యంతో) -
ఈ యేటి మేటి మాట... ట్రంపిజం
ఈ ఏడాది ఎక్కువసార్లు పతాక శీర్షికలకు ఎక్కిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేననడంలో సందేహం లేదు. ఐదు భిన్నమైన కారణాల రీత్యా ఆయన వార్తల్లో అగ్రభాగాన నిలిచారు. ఒకటి– అమెరికా ఫస్ట్ విధానం. రెండు– ఆయన సుంకాల యుద్ధం. మూడు– దక్షిణం, పశ్చిమం, ఆగ్నేయాసియా నుంచి యూరప్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ద్వైపాక్షిక ఘర్షణల్లో తల దూర్చా లని కోరుకోవడం. నాలుగు– అమెరికా, చైనా, రష్యాల మధ్య సమీక రణలను మార్చడం. చివరగా, వ్యక్తిగత లైంగిక జీవితానికి సంబంధించి వార్తల కెక్కడమే కాకుండా, దర్యాప్తునకు లోనవడం!భద్రతా వ్యూహంతో మరోసారి...తాజాగా ట్రంప్ పాలనా యంత్రాంగం రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది అమెరికా భద్రతా వ్యూహంలో పశ్చిమ అర్ధ గోళానికున్న ప్రాధాన్యాన్ని చాటడమే కాకుండా, ఆ ప్రయోజనాలను కాపాడు కునేందుకు సైనిక చర్యను ప్రతిపాదించింది. దౌత్య, సైనికపరంగా అమెరికా వాస్తవిక ప్రవర్తనను ప్రభా వితం చేయడంలో ఈ వ్యూహం ఎంత ముఖ్యమైనదిగా పరిణ మిస్తుందనేది వేచి చూడవలసి ఉంది. మన దేశంలో చాలావరకు, మనతో సంబంధాలు నెరపడంలో వ్యూహ పత్రం దృక్కోణం ఏమిటి? ట్రంప్ ప్రపంచ వీక్షణం, ‘పెద్ద వ్యూహం’లో భారత్ స్థానం ఎక్కడ? అమెరికా–భారత్ సంబంధాలు మున్నెన్నడూ ఎరుగనంతగా క్షీణించిపోయాయనే అందరూ అంటున్నమాట. ముఖ్యంగా, నాయకత్వ స్థాయి సాంగత్య స్వరూప స్వభావాలలో, ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి అపనమ్మకం తిరిగి చోటు చేసుకుంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆమె గురించి నీచంగా మాట్లా డారు. భారత్ కూడా దానికి తగ్గట్లుగానే తలుపులు బిడాయించుకుని కూర్చుంది. భారత్, దాని నాయకత్వం గురించి వాషింగ్టన్ చర్చలలో ఎంత హీనంగా ప్రస్తావనకు వచ్చిందీ, ఆ తర్వాత బహిరంగపరచిన రహస్య పత్రాలు, కొందరు రాసుకున్న జ్ఞాపకాల పుస్తకాల ద్వారా వెల్లడైంది. ఇపుడు టెలివిజన్, సోషల్ మీడియాలో క్షణాల్లో అవి వెలికి వస్తున్నాయి. కనుక, ఇది స్నేహ సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపి తీరుతుంది. మూడు ముఖ్య సంగతులువ్యూహ పత్రం విషయానికొస్తే, ఇంతవరకు మూడు సంగతులు స్పష్టమయ్యాయి. ఒకటి–దాడులు, ప్రమాదాల నుంచి సామూహిక స్వీయ రక్షణకు ‘ఒక గ్రూపు’గా ఏర్పడే ధోరణిని కొనసాగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికాలను ‘బయటి’ శక్తులకు ‘అందని దుర్గాలు’గా ప్రకటించి, పశ్చిమ అర్ధ గోళంపై పట్టు సంపాదించాలనుకుంటున్నారు. కొన్ని విధాలుగా ఇది ఆసియాలోని అభిప్రాయాలనే ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలోని ఈ భాగంవారు కూడా అమెరికాను ‘బయటి’ శక్తిగానే భావిస్తారు. అయితే, ఆసియా నుంచి అమెరికా సేనలను ట్రంప్ ఉపసంహరించుకుంటారనీ, ఈ ప్రాంత భద్రతను ప్రాంతీయ శక్తుల చేతులకే విడిచిపెడతారనీ అనడానికి ఆధారాలు కనిపించడం లేదు. రెండు– మిగిలిన వాటన్నింటి కన్నా చైనాతో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా అటు సవాల్గానూ, ఇటు సమ వుజ్జీగా పరిగణించి వ్యవహరించవలసిన శక్తిగానూ కూడా ఉంది. ‘జి–2’ ఆలోచనతో ఆయన చేసిన ట్వీట్ ఆసియాలో కలకలం సృష్టించింది. ఇంచుమించు రష్యా కోరుకుంటున్న విధంగానే, యూరప్లో యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచంలోని మూడు పెద్ద (అమెరికా, రష్యా, చైనా) శక్తులు తమ భద్రత, పరపతి ఉన్న ప్రాంతాలకు పరిమితమయ్యే హక్కు ఉందనే లోపాయకారీ అవగాహనను బలపరుస్తున్నారు. కానీ, భారత్పై దీని పర్యవసానాలుంటాయి. చివరగా, వ్యూహ పత్రాన్ని అమెరికా విరమణ ప్రకటనగా, దేశ, విదేశాలలో ముఖ్యంగా యూరప్లో చాలా మంది భాష్యం చెబుతున్నారు. కానీ, ఆ రకమైన నిర్ధారణకు రావడం ట్రంప్ ప్రపంచ వీక్షణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి దాని వ్యూహ పత్రంలో ఎక్కడా ఒక్క మాట లేదు. అమెరికా శైలి మాఫియాప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 750 సైనిక స్థావరాలలో 1,60,000కు పైగా అమెరికా సైనిక దళాలు న్నాయి. అమెరికా సాయుధ దళాలున్న అత్యంత ముఖ్యమైన కేంద్రాలు జర్మనీ, జపాన్, ఇటలీ, కొరియాలలో ఉన్నాయి. అవి రెండవ ప్రపంచ యుద్ధకాలం నుంచి అమెరికా ‘అధీనం’లో ఉన్నాయి. ‘నాటో’ కూటమి దేశాల్లోనూ, పశ్చిమాసియా ‘క్లయింట్’ దేశాల్లో ముఖ్యంగా బహరైన్, కువైట్లలోనూ అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఈ స్థావరాల నిర్వహణకు ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనాలున్నాయి. సేనలు లేదా స్థావరాల సంఖ్యను తగ్గించుకోవడం గురించి వ్యూహ పత్రం ఎక్కడా మాట్లాడలేదు. మరింతగా ‘భారాన్ని పంచుకోవలసిన’ అవసరం గురించి మాత్రం అది ప్రస్తావించింది. ‘నాటో’ కూటమి దేశాలు, జపాన్, కొరియా, గల్ఫ్ దేశాలు వాటి రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని అమెరికా కోరుతోంది. ఇతర దేశాల్లో అమెరికా సేనల ఉనికి అవసరం ఏమిటో, అది ఎంతకాలమో, ట్రంప్ గానీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా అధ్యక్షులైన ఇత రులు గానీ వివరించిన పాపాన పోలేదు. భారతదేశంతో సహా ఇంకా అనేక దేశాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాల రీత్యా మాత్రమే అమెరికా సేనలు పరిమిత సంఖ్యలో కనిపి స్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగానే, కొన్ని దేశాల్లో అవి పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నది వాస్తవం. ఆ యుద్ధం ముగిసేనాటికి అమెరికా ‘విముక్తి’ కల్పించిన ‘ఆక్రమించిన’ దేశాల్లో అమెరికా సేనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వ్యూహ పత్రం, ఆ యా భూభాగాల నుంచి సేనల ఉపసంహరణ లేదా తగ్గింపునకు పిలుపు ఇవ్వలేదు. అవి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా సేనల నిర్వహణకు ఆయా దేశాలు కొంత పైకాన్ని చెల్లించాలని మాత్రమే అది అడుగుతోంది. ఇది కళాత్మక మాఫియా శైలి అవుతుంది. ఇతర పెద్ద శక్తుల నుంచి ఎదురు కాగల బెడద నుంచి ‘రక్షణ’ కల్పిస్తున్నందుకు ‘మామూలు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నమాట!ఇది చూడండి: యూరప్, ఆసియాలలో శక్తిమంతమైన సైనిక యంత్రాలుగా చైనా, రష్యా నడుచుకునేందుకు అమెరికా అనుమతి స్తుంది. చైనా, రష్యా పొరుగునున్న దేశాలు ప్రపంచ శక్తి అయిన అమెరికా పెత్తనం నుంచి తమను కాపాడుకునేందుకు ఈ ప్రాంతీయ శక్తుల పంచన చేరవచ్చు. ఇక సేనల తగ్గింపు ప్రసక్తి ఎక్కడ? ట్రంపి జంగా అభివర్ణించదగిన ఈ విధానంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉండబోతోందన్నది 2020లలో కాలగతిని నిర్వచించనుంది.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అక్కరకు రాని చట్టాలతో భయమేల?
గత నెల కొత్త కార్మిక చట్టాలు (లేబర్ కోడ్స్) అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధ నల్లో ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, ఎవరూ వాటి జోలికి పోవడం లేదు. కార్మిక వర్గాన్ని అవి ఎలా కట్టడి చేస్తు న్నాయి అనే అంశం మీదనే చర్చ జరుగు తోంది. నిజానికి ఈ కొత్త చట్టాల్లో కార్మికులకు లెక్కలేనన్ని తీపి గుళికలు ఉన్నాయి. అయినా సరే, సమ్మె అంశం ఒక్కటే ఒక ఎర్ర మిరపకాయలా కొట్టొచ్చి నట్లు కనిపిస్తోంది. దీంతో, సమ్మెలను అరికట్టే నిబంధనలే ప్రము ఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ భయాలకు హేతువు లేదు. వాస్తవం ఏమిటంటే, దేశంలో సమ్మెల సంఖ్య క్రమంగా తగ్గి పోతోంది. అయినా, మొట్టమొదటి ఫ్యాక్టరీ సైరన్ మోగిన నాటి నుంచీ కార్మిక అశాంతి భయమే కార్మిక చట్టాల్లో ప్రధానంగా ఉంటూవస్తోంది. పారిశ్రామిక రంగ చరిత్ర చూసినట్లయితే, చట్టాలు అత్యంత కఠినంగా ఉన్న కాలంలోనే సమ్మెలు అత్యధికంగా జరిగాయి. ఇది ఆశ్చర్యకర వాస్తవం. ‘రాబర్ బ్యారన్స్’గా పేరుమోసిన 19వ శతా బ్దపు అమెరికన్ పారిశ్రామికవేత్తలు, వడ్డీ వ్యాపారులు తమ కిరాయి గూండాలతో కార్మికులను చితకబాదించేవారు. ఆ రోజులు పోయాయి.అనుమానపు చూపులుకాలగమనంలో కార్మిక వర్గం మార్పు చెందింది. అయినా ఫ్యాక్టరీ చట్టాలు మారలేదు. పాత మనస్తత్వం నుంచి బయట పడ లేదు. 2003–14 మధ్యకాలంలో దేశంలో సమ్మెలు 75 శాతం తగ్గాయి. 2019కి వస్తే కేవలం 59 సమ్మెలు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 30కి పడిపోయింది. కార్మిక చట్టాలు నిరస నలను, సమ్మెలను మరింత కష్టతరంగా మార్చేస్తున్నాయి.చివరకు ఎలా తయారయ్యిందంటే... ప్రభుత్వాలు, పారిశ్రా మికవేత్తలు, యాజమాన్యాలు చేపట్టే ప్రతి చర్యనూ కార్మికసంఘాలు అనుమానిస్తున్నాయి. కార్మిక చట్టాలు ప్రతిపాదించే సానుకూల చర్యలను గుర్తించడం లేదు. భవిష్యత్తులో సమ్మె జరిగే జాడే కనిపించడం లేదు. అయినా, ఒకవేళ సమ్మె చేయాలనుకుంటే అది మరింత కష్టతరం అవుతుందని యూనియన్లు బెంబేలెత్తి పోతున్నాయి.కొత్త చట్టాలు కార్మికులకు ఒనగూర్చే ప్రయోజనాలు చూడండి: ఇక మీదట 240 రోజులకు బదులు 180 రోజులు పనిచేస్తే చాలు వార్షిక సెలవులు అందుబాటులోకి వస్తాయి. ఆర్జిత ప్రసూతి సెల వులు 12 వారాల నుంచి 16 వారాలకు పెరిగాయి. ‘గిగ్ వర్కర్లు’ రిటైర్మెంట్ ప్రయోజనాలకు అర్హులు. పురుషులు, మహిళలు సమాన పనికి సమాన వేతనం పొందుతారు. ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులకు పునఃశిక్షణ కోసం 15 రోజుల వేతనం లభిస్తుంది.అయితే కార్మిక ప్రతినిధులు వీటిని కంటితుడుపు చర్యలుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే, కొత్త చట్టాల ప్రకారం 300 కంటే తక్కువ మంది పనిచేస్తున్న సంస్థలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే కార్మికులను తొలగించవచ్చు. ఇప్పటి వరకు ఈ పరి మితి 100గా ఉండేది. అలాగే, సమ్మె చేయాలంటే 14 రోజులకు బదులు 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఈ రెంటితో కార్మిక వర్గపు కోరలు పీకేసినట్లు అవుతుందని యూనియన్లు భావిస్తు న్నాయి. కరవలేని అరుపులకు ఇక విలువేముంటుంది?ఉద్యోగుల సంఖ్య 299కి మించనట్లయితే, ఆ ఫ్యాక్టరీలు ప్రభు త్వానికి తెలియజేయకుండా ఉద్యోగులను తొలగించవచ్చు. ఇదే మంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే 100 నుంచి 199 మంది కార్మికులను నియమించుకునే సంస్థలు కేవలం 4.5 శాతం మాత్రమే ఉన్నాయి. యజమానులు సమ్మెల భయంతో ఉంటే, కార్మికులు లాక్ అవుట్ల భయంతో ఉన్నారు. కానీ సమ్మెలతో పాటు లాక్ అవుట్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. 2022లో కేవలం 34 లాక్ అవుట్లు మాత్రమే జరిగాయి. మరి భయం ఎందుకు?ప్రయోజనాలు ఎంతమందికి?గుర్తించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే, కొత్త కోడ్స్లోని సానుకూలతలు దేశంలోని అధిక శాతం కార్మికులకు వర్తించవు. 20 కంటే తక్కువ మంది కార్మికులతో నడిచే ఫ్యాక్టరీలే దాదాపు 50 శాతం ఉన్నాయి. వీటికి ఆరోగ్య భద్రత నిబంధనలు సైతం వర్తించవు. కార్మికులు నిర్లక్ష్యానికి గురవుతారు. కార్మికుల సంఖ్య 300 దాటేంత స్థాయికి ఈ సంస్థలు చేరుకుంటాయని ఊహించడంకష్టం. సంఘటిత రంగంలో ఉద్యోగాల వాటా క్రమంగా తగ్గుతూ వస్తోందని (2017–20) ఆర్థిక సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడీ వాటా కేవలం 17 శాతమే. ఆఖరుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ల్లోనూ ఇలాంటి ఉద్యోగాలు తగ్గాయి. ఈ సంస్థల్లో 2016–17లో 11.29 లక్షల మంది సంఘటిత కార్మికులు పని చేస్తూ ఉండగా, 2020–21లో వీరి సంఖ్య 8.61 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోనే ఇలా ఉంటే, ప్రైవేట్ రంగం పరిస్థితి చెప్పేదేముంటుంది?2023–24 ఆర్థిక సర్వే ప్రకారం, భారత కార్మికుల్లో 57 శాతం మంది స్వయం ఉపాధి మీదే ఆధారపడుతున్నారు. నిర్వచనం ప్రకారం వారు ఏ కార్మిక చట్టాల పరిధిలోకీ రారు. సంఘటితరంగంలో ఉపాధి తగ్గిపోతోంది కాబట్టే, సమ్మెలు తగ్గుతున్నాయి. మరోవంక, అసంఘటిత కార్మికులు పెరుగుతుండగా, లాక్ అవుట్ల సంఖ్యా క్షీణిస్తోంది. 2017లో 80.8 శాతం ఉన్న అసంఘటిత కార్మి కులు 2022లో 82.6 శాతానికి పెరిగారు.ప్రభావం ఎంత?కొత్త లేబర్ కోడ్స్ వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందా? మార్పు నామమాత్రమే! ఫ్యాక్టరీల్లో ప్రత్యక్ష ఉపాధి 2011లో 61 శాతంఉండగా, 2023లో 47 శాతానికి పడిపోయింది. సంఘటిత రంగం తన ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా అసంఘటిత రంగానికి తరలిస్తోంది. పెద్ద కార్ల కంపెనీలు సైతం ఛోటామోటా వర్క్షాప్స్ నుంచి విడి భాగాలు సమకూర్చుకుంటున్నాయి. ఆ కార్లపై ఉండే లోగో కేవలం లిప్స్టిక్ లాంటిది!భారత పారిశ్రామిక రంగంలో అసంఘటిత కార్మికులు అత్య ధికంగా ఉన్నంత కాలం కొత్త కార్మిక చట్టాలు ఎన్ని వచ్చినా పెద్దగా ఉపయోగపడవు. వ్యాపార ప్రముఖులు, కార్మిక సంఘాలు ఈ వాస్తవం గుర్తించాలి. ఒప్పందాలు కుదుర్చుకుని పనిచేసే కొద్దిమంది ఉన్నత వర్గ కార్మికులకే ఇవి ప్రయోజనం చేకూర్చగలవు. కాని వారు ఎంత మంది? అతి చిన్న వర్గం. అది పెరిగే అవకాశమూ లేదు. కార్మికులు భయపడే లాక్ అవుట్లు, పెట్టుబడిదారులు భీతిల్లే సమ్మెలు అరుదైనవిగా మారుతున్న ఈ రోజుల్లో కొత్త కార్మిక చట్టాలపై ఇంత గడబిడ అవసరమా?-వ్యాసకర్త సోషియాలజిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-దీపాంకర్ గుప్తా -
అల్లకల్లోల ప్రపంచంలో అద్వితీయ చైనా
సోవియట్ సోషలిస్ట్ నమూనా పతనం తర్వాత, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్య మంలో ఏర్పడిన శూన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ఒక గొప్ప చర్చకు వేదికగా మార్చు కుంది. సోవియట్ మోడల్ను గుడ్డిగా అనుసరించడం కంటే, మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలను చైనా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవాలని ఆ దేశ నాయకత్వం నిర్ణయించింది. దీని ఫలితంగా పుట్టిందే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిజం’. 1947లో స్వాతంత్య్రం పొందిన భారత దేశం కంటే రెండు ఏళ్ళు ఆలస్యంగా, 1949 అక్టోబర్1న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఏర్పడినప్పటికీ, నేడుఆ దేశం సాధించిన ప్రగతి అసాధారణం. కొనుగోలుశక్తి సామర్థ్యం పరంగా చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించి, అనేక రంగాలలో అగ్రగామిగా నిలిచింది.భారతదేశం నేడు దారిద్య్రం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రూపాయి పతనం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) భారత ఆర్థిక గణాంకాల పారదర్శకతను ప్రశ్నిస్తూ ‘సీ గ్రేడ్’ ఇచ్చింది. ఒకవైపు డాలర్తో రూపాయి విలువ 90 రూపాయలకు పడి పోతుంటే, మరోవైపు ‘మేడ్ ఇన్ చైనా –2025’ ప్రణా ళికతో చైనా పారిశ్రామిక మౌలిక సదుపాయాలనుసంపూర్ణ ఆటోమేషన్ దిశగా మలుస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. ఇది ఆ దేశ ఉత్పత్తి సామర్థ్యానికి నిదర్శనం.1978లో డెంగ్ జియావో పింగ్ ప్రారంభించిన ‘ఓపెనింగ్ అప్’ సంస్కరణలు చైనా స్వరూపాన్ని మార్చివేశాయి. గత మూడు దశాబ్దాలలో 85 కోట్లమంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయడం ప్రపంచ మానవాభివృద్ధి చరిత్రలోనే ఒక అద్భుతం. 30 ఏళ్ళ క్రితం 66%గా ఉన్న పేదరికాన్ని 2020 నాటికిసంపూర్ణంగా నిర్మూలించి, ప్రపంచానికి ఒక పాఠంగా చైనా నిలిచింది.ప్రపంచ ఉత్పత్తిలో చైనా వాటా ఆశ్చర్యకరంగాఉంది. ఉక్కు ఉత్పత్తిలో 53.9%, సిమెంట్ ఉత్పత్తిలో 51.1% వాటాతో చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచంలోని మొత్తం హై స్పీడ్ రైల్ లైన్లలో 66% ఒక్క చైనాలోనే ఉన్నాయి. షిప్ బిల్డింగ్ రంగంలో కూడా అమె రికా, ఐరోపాలను తలదన్నేలా 51% భారీ ఓడలను చైనా నిర్మిస్తోంది. ముఖ్యంగా, ‘కొస్కో’ వంటి ప్రభుత్వ సంస్థలు 24,000 కంటైనర్ల సామర్థ్యం గల భారీ ఓడ లను అత్యంత చౌకగా నిర్మిస్తున్నాయి. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఈ రంగంలో ఉనికి లేని చైనా, నేడు జపాన్, సౌత్ కొరియాలను కూడా సవాలు చేస్తోంది.చైనా నేడు ఏఐ రేసులో అగ్రస్థానంలో ఉంది. 2024లో పరిశోధనల కోసం ఆ దేశం 570 బిలియన్ డాలర్లను కేటాయించింది. సుమారు 5,000 ఏఐకంపెనీలు, 16,000 ఇంక్యుబేటర్లతో పూర్తి స్థాయి ఆటోమేషన్ దిశగా అడుగులు వేస్తోంది. సామాజిక సామరస్యం కోసం 700 మిలియన్ల ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో ‘సోషల్ క్రెడిట్ సిస్టం’ (ఎస్సీఎస్)ను అమలు చేస్తూ నేరాల రేటును గణనీయంగా తగ్గించింది. విద్యా రంగంలో కూడా ప్రతి ఏటా 5 మిలియన్ల ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విద్యార్థులు పట్టా పొందుతున్నారు. ఇది అమెరికాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ.అభివృద్ధికి వెన్నెముక విద్యుత్తుచైనా విద్యుత్ వినియోగం అమెరికా, యూరో పియన్ యూనియన్, ఇండియా, రష్యాల మొత్తం వినియోగం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. త్రీ గార్జెస్ డ్యామ్ (22,500 మె.వా.) వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, దానికంటే రెండింతలు పెద్దదైన మెడోగ్ హైడ్రో పవర్ స్టేషన్ (60 వేల మె.వా.) నిర్మాణాన్ని ప్రారంభించింది. కాలుష్య రహితవిద్యుత్తు కోసం న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియపై పరిశోధనలు చేస్తోంది. 2025 నాటికి ఏఐ డాటాసెంటర్ల కోసం భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తినిలక్ష్యంగా పెట్టుకుంది.వ్యవసాయ ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత విషయంలో చైనా స్వయం సమృద్ధిని సాధించింది. ‘బేదో’ శాటిలైట్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రైవర్ లేని వరి నాటు యంత్రాలతో వ్యవసాయ రంగంలో 72% ఆధునికీకరణను సాధించింది. కొండ ప్రాంతాలలో నేలకోతను అరికట్టడానికి ‘మూడు పాళ్ళు అడవి, రెండు పాళ్ళు గడ్డిభూమి’ విధానాన్ని అమలు చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తోంది. దీనివల్ల మృత్తిక క్రమక్షయం78% తగ్గింది. 1990లో 170గా ఉన్న పట్టణాల సంఖ్య నేడు 700కు పెరిగింది. ఇందులో 17 మెగా సిటీలుఉన్నాయి. ఒకప్పుడు చిన్న చేపలు పట్టే గ్రామమైన షేన్జెన్, నేడు ప్రపంచానికి ‘సిలికాన్ వ్యాలీ’గా రూపాంతరం చెందింది. ఈ అద్భుతమైన అభివృద్ధి వెనుక క్రమశిక్షణ కలిగిన రాజకీయ సంకల్పం, విప్లవాత్మక నాయకత్వం ఉన్నాయి. చైనా కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాక, అగ్రరాజ్యాల ఆధిపత్య వలస వాదానికి వ్యతిరేకంగా, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేస్తోంది. చైనా అభివృద్ధి నమూనా ఇతర దేశాలకు గుడ్డిగా ఎగుమతి చేసేది కాదనీ, ప్రతి దేశం తమ భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందాలనీసీపీసీ భావిస్తోంది. పర్యావరణ హితమైన ‘నూతన ఉత్పత్తి శక్తుల’ ఆవిష్కరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చైనా, పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక వ్యవ స్థాగత సవాలుగా నిలిచింది.చైనా సాధించిన ఈ ప్రగతి కేవలం అంకెల్లో మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులో కనిపిస్తుంది. పర్యా వరణం, సాంకేతికత మానవ వనరుల సమతుల్యతతో కూడిన ఈ నమూనా ప్రపంచ దేశాలకు ఒక సరికొత్త దిశను చూపిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు చైనా ప్రస్థానం కేవలం ఒక దేశాభివృద్ధి మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య జరిగిన విజయ వంతమైన ప్రయోగం.-వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు-నైనాల గోవర్ధన్ -
'ఆరావళి'ని ఎందుకు కాపాడాలంటే..?
భారతదేశ చరిత్రకు ఆరావళి పర్వత శ్రేణి ఒక మౌన సాక్షి. కోట్లాది సంవత్సరాలుగా ఏర్పడిన ఈ పురాతన పర్వత వ్యవస్థ ఉత్తర భారతదేశానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది. కానీ నేడు అభివృద్ధి ముసుగులో మైనింగ్ దోపిడీకి బలవుతోంది. ఇది కేవలం పర్యా వరణ సమస్య కాదు; ప్రజల జీవన హక్కులపై దాడి.ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆరావళి పర్వతాలను (Aravalli Range) ప్రధానంగా ఎత్తు (100 మీటర్లు) ఆధారంగా నిర్వచించింది. ఇది కీలక ప్రాంతాలను రక్షణ పరిధి నుంచి తొలగించే ప్రమాదాన్ని తెచ్చింది. ఈ నిర్ణయం చట్టపరంగా సాంకేతికంగా ఉన్నా, దాని ప్రభావాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.ఆరావళి ఒక పర్వత శ్రేణి కాదు, ఒక జీవవ్యవస్థ. అవి కేవలం రాళ్ల సమూహం కాదు, భూగర్భ జలాలకు సహజ భండారం; ఎడారీకరణను అడ్డుకునే చివరి గోడ; అడవులు, వన్యప్రాణులకు నివాస స్థలం; ఢిల్లీ – ఎన్సీఆర్కు సహజ గాలి శుద్ధి యంత్రం. భౌగోళిక నిర్మాణం, అడవుల విస్తరణ, శిలా స్వభావం, నీటి ప్రవాహం వంటివన్నీ కలిసి ఆరావళిని జీవవ్యవస్థగా నిలబెట్టాయి. ఎత్తు ఆధారంగా ఈ వ్యవస్థను విభజించడం అంటే శాస్త్రానికే అవమానం. ఆరావళిలో మైనింగ్ నష్టాలు తాత్కాలికం కావు. పర్వతాలను పేల్చడం ద్వారా శిలా నిర్మాణాలు శాశ్వతంగా ధ్వంసమవుతాయి. భూగర్భ జలాల సహజ ప్రవాహం తెగిపోతుంది. అడవులు తిరిగి పునరుద్ధరించలేని విధంగా నశిస్తాయి. ‘సస్టెయిబుల్ మైనింగ్’ భావన ఒక మిథ్య.హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నీటి కొరత ఇప్పటికే తీవ్రమ వుతోంది. మైనింగ్ వల్ల సహజ వ్యవస్థ దెబ్బతింటే, కోట్లాది ప్రజలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల అడవులు... ధూళిని, ఇసుక గాలులను అడ్డుకుంటూ సహజ రక్షణ గోడలా పనిచేస్తాయి. ఆ గోడను కూల్చేసి, కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వ ద్వైదీ భావానికి ప్రతీక. ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను అడ్డుకునే చివరి అవరోధం. ఈ అవరోధం బలహీనపడితే, ఎడారీకరణ హరియాణా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు విస్తరించే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్ తరాలపై విధించే శిక్షతో సమానం.చదవండి: విభేదాలు ప్రమాదకరం కాదు! ప్రకృతి వనరులు కొద్దిమంది కార్పొరేట్ లాభాల కోసం త్యాగం చేయ బడితే, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అభివృద్ధి అంటే నీటి భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల భద్రతకు హామీ ఇచ్చేదిగా ఉండాలి. ఆరావళిని కాపాడటం అంటే ఒక పర్వత శ్రేణిని కాపాడటం కాదు, దేశపు జీవనాధారాలను కాపాడటం. నిజమైన అభివృద్ధి ఎప్పుడూ పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగుతుంది.- కె. నారాయణ చైర్మన్, కంట్రోల్ కమిషన్; కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా -
పరిహారం ‘అణు’వంతేనా?
భారత రూపాంతరీకరణకు ఉద్దేశించిన ‘అణు శక్తి స్థిర వినియోగ–పురోగతి బిల్లు (శాంతి) 2025’కు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది అణు శక్తికి సంబంధించి మూడు కీలక అంశాలపై చిరకాలంగా ఉన్న చర్చను మళ్ళీ రేకెత్తించింది. అవి: అణుశక్తి అభివృద్ధి–నియంత్రణ; ప్రమాదాలు సంభవించినపుడు సివిల్ లయబిలిటీ; అణు శక్తి ఉత్పాదనలో ప్రైవేటు భాగస్వామ్యం. అటామిక్ ఎనర్జీ చట్టం (1962), సివిల్ లయబిలిటీ–న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. అణుశక్తి అభివృద్ధి –వినియోగానికి 1962 నాటి చట్టం వీలు కల్పిస్తే, అణు ప్రమాదాలు సంభవించిన పక్షంలో బాధ్యత వహించడం, పరిహారం చెల్లించడా నికి సంబంధించి ఒక చట్రాన్ని 2010 నాటి చట్టం అందించింది. స్వతంత్ర నియంత్రణకు సుముఖం కాదా?విద్యుదుత్పాదనకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్) అందుబాటులోకి రావడం, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యు దుత్పాదన గడించాలనే ఆశావహ లక్ష్యసాధనకు ప్రైవేటు రంగ భాగస్వామ్యం అవసరమవడం అనే రెండు కారణాల రీత్యా కొత్త చట్టం అవసరమైందని ప్రభుత్వం వివరించింది. అణు విద్యుదుత్పాదనలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెర వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... నియంత్రణ, లయబిలిటీ చట్రాలు రెండూ అత్యంత ముఖ్యమైనవిగా పరిణమించాయి. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. నియంత్రణకు సంబంధించి కొత్త చట్టం యథాతథ స్థితినే కొనసాగించింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) గతంలో మాదిరిగానే పని చేస్తుంది. అణుశక్తి అభివృద్ధి మొగ్గ తొడుగుతున్న 1960లలో, రేడియేషన్ సదుపాయాలలో రేడియేషన్ సురక్షణను అమలుపరచేందుకు, అటా మిక్ ఎనర్జీ శాఖ (డీఏఈ)కు వెలుపల డైరెక్టరేట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (డీఆర్పీ) ఏర్పాటు చేశారు. హోమీ భాభా తర్వాత అణుశక్తి శాఖ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ సారాభాయ్, స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారుగానీ, ఆ భావన అమలుకు నోచుకోక ముందే, ఆయన కన్నుమూశారు. ఆయన వారసుడు హోమి ఎన్.సేత్నా ఏఈఆర్ఏ ఆలోచనను పక్కనపెట్టి, డీఆర్పీని కొనసాగించాలని నిర్ణయించారు. రాజా రామన్న 1983లో నియంత్రణ సంస్థ (ఏఈఆర్బీ)కు పచ్చ జెండా ఊపారు. కానీ, అది ఇతర రంగాలలోని అదే రకమైన సంస్థలలాగా పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినది కాదు. ఈ 2025 చట్టం కూడా ప్రస్తుత ఏఈఆర్బీ చట్రాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచనకు అణుశక్తి వ్యవస్థ సానుకూలంగా లేదని స్పష్టమవుతోంది. అణుశక్తి శాఖ పరిధిలోనే ఏఈఆర్బీ పనిచేస్తున్నప్పటికీ, గతంలో అది నీళ్ళు నమలకుండా పనిచేసిన దాఖలాలు లేకపోలేదు. వివిధ సందర్భాలలో నియమాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించినపుడు ఏఈఆర్బీ–ముఖ్యంగా ఎ. గోపాలకృష్ణన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు– విద్యుదుత్పాదన కేంద్రాలు, ఇతర సంస్థలపై ఆంక్షల రూపంలో కొరడా ఝళిపించింది. పరిహారానికి పరిమితులా?ఇపుడు ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తున్నారు కనుక, నిజాయతీగా పనిచేసే, సాంకేతికంగా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ అవసరం ఉంది. దేశ పురోగతి ముసుగులోనే అయినప్పటికీ, ఏఈఆర్బీ యథాతథ స్థితిని కొనసాగించడం శుభ సూచకం కాదు. ప్రైవేటు రంగాన్ని అనుమతించిన అంతరిక్ష రంగంలో కూడా ప్రభుత్వం స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడానికి బదులుగా ఇన్–స్పేస్ పేరుతో, ఏ ఎండకా గొడుగు పట్టే సంస్థనే సృష్టించింది. ఒక విధానాన్ని ప్రోత్సహించే, నియంత్రించే రెండూ ఒకే చూరు కింద ఉండకూడదన్నది మూలసూత్రం కావాలి. అణు దుర్ఘటనలు సంభవిస్తే కలిగే నష్టానికి లయబిలిటీ విషయంలో నియంత్రణ సంస్థ ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న. నియంత్రణ కఠినంగా లేకపోతే, ప్రమాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. లయబిలిటీకి సంబంధించి అంతర్జాతీయంగా పాటించే నియమాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జాతీయ చట్టాలు కూడా వాటికి అనుగుణంగా రూపొందాలి. అణు ప్రమాదం సంభవించిన చోట మూడవ పక్షానికి పరిహారం చెల్లించే బాధ్యత న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఆపరేటర్ పైనే ఉంటుందని అంతర్జాతీయ కట్టుబాట్లు చాలా వరకు నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ కిందనే లెక్క. కానీ, ఇతర సదుపాయాలున్న న్యూక్లియర్ సైట్ వద్ద కూడా దుర్ఘటన సంభవించవచ్చు. లయబిలిటీని అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ప్రస్తుత చట్టంలో పరిహారంపై రూ. 3,000 కోట్ల పరిమితి విధించడం, దాన్ని న్యూక్లియర్ ప్లాంట్ ప్రదేశంతో ముడిపెట్టడం అసంబద్ధం. చిన్న రియాక్టర్లకు (150 మెగావాట్ల నుంచి 750 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్నవి) లయబిలిటీని మరీ తక్కువగా రూ. 300 కోట్లుగా నిర్ణయించారు. ఇక 150 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాటికి కేవలం రూ. 100 కోట్లనే నిర్ణయించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ప్రోత్సహిస్తున్న సంస్థలను మచ్చిక చేసుకునేందుకే అలా నిర్ణయించారని తేటతెల్లమవుతోంది. హెచ్చు సామర్థ్యమున్న భారీ అణు విద్యుదుత్పాదన కేంద్రాలను నెలకొల్పేందుకు పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అవసరమవుతాయి. అవి నిర్మాణం పూర్తి చేసుకుని, ఉత్పాదన ప్రారంభించేందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. అణు విపత్తులలో లయబిలిటీ చట్రాన్ని సడలించడం ద్వారా, మాడ్యులర్ రియాక్టర్ల వల్ల పెద్ద నష్టం ఉండ బోదని ఆ పరిశ్రమ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. లయబిలిటీలను వర్గీకరించడం ద్వారా కొత్త చట్టం ఆ పరిశ్రమను సంతృప్తి పరచింది. భోపాల్ దుర్ఘటన పాఠాలు నేర్చుకున్నామా?అణు రియాక్టర్ల వద్ద (అణు ఇంధన వలయ సదుపాయాలతో కూడుకుని) తలెత్తే ప్రమాదాలను కొత్త చట్టం నిర్వచించి, లయబిలి టీలను కూడా నిర్ణయించింది. కానీ, ‘అణు సదుపాయాలు’గా నిర్వ చించిన చోట్ల ప్రమాదాలు సంభవిస్తే, లేదా అణు ధార్మికత వెలు వడితే ఏమిటన్న దానిపై మౌనం వహించింది. అలాంటి పరిస రాలలో ఏదైనా సంభవిస్తే ఆ నష్టాలకు పరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది? ‘న్యూక్లియర్ డ్యామేజీ’ అనే దానికి మాత్రం చట్టంలో విçస్తృతార్థం ఇచ్చారు. ప్రాణ నష్టం, గాయపడటం, ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, అణు ప్రమాదం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు అయ్యే వ్యయం అంటూ దానిలో చాలా వాటిని చేర్చారు. కానీ, లయబిలిటీ పరిమితిని మాత్రం రూ. 100 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లుగా పేర్కొన్నారు. 2010లో సంభవించిన సముద్ర ప్రమాదానికి గానూ బ్రిటిష్ పెట్రోలియం సంస్థ 65 బిలియన్ డాలర్లు చెల్లించింది. అదే భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకవడాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ఉపద్రవంగా చెబుతారు. కానీ దాని బాధితుల్లో పరిహారం కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా ఉన్నారు. పర్యావరణ నష్టానికి ఎవరూ చెల్లించింది ఏమీ లేదు. మళ్లీ మధ్యవర్తిత్వం నెరపే ప్రయత్నమూ లేదు. అణుశక్తి విషయంలో అడుగు ముందుకేసే ముందు గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పెంపొందించే పని, నియంత్రణ ఒకే చూరు కింద సంసారం చేయకూడదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ కామెంటేటర్ -
ఉపాధి పెంపునకు అవకాశాలెన్ని?
ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి భారత్లో అభివృద్ధికి నూతన మార్గాలుగా రూపొందినప్పటికీ ఉపాధి సృష్టి, సమానత్వ సాధనలో వ్యత్యాసాలు పెరగడానికీ కారణమయ్యాయి. ఆధునిక ఆర్థిక వృద్ధి లక్ష్యసాధనలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మధ్య వనరుల పునఃపంపిణీ ప్రక్రియను నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. చారిత్రకంగా, వివిధ దేశాలు ఈ నిర్మాణాత్మక మార్పులో భాగంగా రెండు దశలను చవి చూశాయి. వ్యవసాయ రంగం నుండి తయారీ; తయారీ రంగం నుండి సేవా రంగానికి శ్రామికుల బదిలీ. తక్కువ ఉత్పాదకతతో కూడిన ప్రాథమిక కార్యకలాపాల నుండి ఆధునిక, అధిక ఉత్పాదకతతో కూడిన రంగాల వైపు శ్రామిక, మూలధన, సాంకేతికత లాంటి వనరుల బదిలీ; ఉపాధి పంపిణీ, విలువ జోడించిన పంపిణీ, అంతిమ వినియోగ పంపిణీలో తయారీ, సేవా రంగాల వాటా అధికంగా ఉండటం; భౌతిక, మూల ధన కల్పన; గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వల సలు; జనన, మరణ రేట్లలో తగ్గుదల లాంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పునకు సూచికలుగా భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో 2011–12 తదుపరి కాలంలో ఈ నిర్మాణాత్మక మార్పులలో తగ్గుదలను గమనించవచ్చు.ఎందుకీ మందగమనం?గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగినప్పటికీ, ఉపాధిలో పెరుగుదల కనీసం రెట్టింపు కాలేదు. శ్రామిక మార్కెట్లో దృఢత్వం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, సమగ్ర ఆర్థిక విధానాలు అమలు చేయక పోవడం, ఆహారానికి సంబంధించి సాపేక్ష ధరలలో పెరుగుదల, పరపతి వృద్ధి తక్కువగా ఉండటం, తూర్పు ఆసియాలో మాదిరి వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాల వైపు శ్రామికుల బదిలీలు తక్కువగా ఉండటం, తక్కువ వేతనంతో కూడిన నిర్మాణ రంగం, అసంఘటిత రంగంలో ఉపాధిలో తక్కువ నైపుణ్యత కల్గిన అధిక శ్రామిక శక్తి కేంద్రీకృతం కావడం లాంటి అంశాలు భారత్లో నిర్మాణాత్మక మార్పు ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. సంస్కరణల అమలు కాలంలో నిర్మాణాత్మక మార్పు వేగంగా ఉండగలదని భావించినప్పటికీ సప్లయ్ వైపు వ్యవసాయ రంగాన్ని తయారీ రంగం అధిగమించినప్పటికీ, డిమాండ్ వైపు తయారీ రంగం వ్యవసాయ రంగాన్ని అధిగమించలేక పోయింది. తయారీ రంగ ఉత్పత్తి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతున్నప్పటికీ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ఉపాధి వృద్ధిలో ఆశించిన పెరుగుదల సంభవించలేదు.యువతలో ఉపాధిభారత్ మొత్తం జనాభాలో 15–29 వయో వర్గ జనాభా 27 శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో వీరి వాటా 26.9 శాతం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, యువతలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 5.7 శాతం నుండి 2023లో 10 శాతానికి పెరిగింది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన యువత తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2022లో యువతలో నిరుద్యోగిత భారత్లో 23.2 శాతం కాగా మొత్తం నిరుద్యోగం 7 శాతంగా అంచనా. అంత ర్జాతీయ శ్రామిక సంస్థ అంచనా ప్రకారం, 2023లో భారత్లోని మొత్తం గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 42.3 శాతం. నియంత్రణతో కూడిన శ్రామిక చట్టాల వల్ల సంఘటిత రంగంలో ఉపాధి తగ్గుదల, సేవారంగ ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం, ఆటోమేషన్ కారణంగా ఉపాధి క్షీణించటం; ఐటీ, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ లాంటి రంగాలలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రీకృతం కావడం, వివిధ అంశాలలో లింగ సంబంధిత అసమానతలు, నాణ్యతతో కూడిన శిక్షణ కొరత, నూతన సాంకే తికతకు అనుగుణంగా తగిన నైపుణ్యత శ్రామికులలో లేకపోవడం వంటివి నిరుద్యోగం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. వివిధ దేశాల అనుభవాలుమానవ మూల ధనం, సేవలు, నవకల్పనలపై అధిక పెట్టు బడుల ద్వారా సింగపూర్ శ్రమ సాంద్రత ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ స్థితి అధిక వేతనాలు, ఉపాధి నాణ్యత పెరుగుదలకు దారి తీసింది. వృత్తి విద్య, శిక్షణకు జర్మనీ ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో ఆధునిక తయారీ, అధిక నైపుణ్యత అవసరమైన సేవలలో ఉపాధి అవకాశాలు పెరి గాయి. చైనాలో నిర్మాణాత్మక మార్పులు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి కావడానికీ, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల పెరుగుదలకూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య లింకేజెస్ పెరగడానికీ దోహదపడ్డాయి. మలేషియాలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ప్రాథమిక వస్తువులపై ఆధారపడటం తగ్గి తయారీ, సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో మలేషియా అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆదాయ స్థిరీకరణ సాధించింది. దక్షిణ కొరియా, తైవాన్ నిర్మాణాత్మక మార్పుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల నుండి పారి శ్రామిక పవర్ హౌసెస్గా రూపాంతరం చెందాయి. తక్కువ ఉత్పా దకతతో కూడిన వ్యవసాయ రంగం నుండి అధిక ఉత్పాదకతతో కూడిన తయారీ రంగానికి శ్రామికుల బదిలీ ఆయా దేశాల ఆర్థిక సామర్థ్య పెరుగుదలకు దారి తీసింది.యువతలో ఉపాధి పెంపునకు చర్యలుభారత్లో ముఖ్య ఆర్థిక రంగాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం 2030 నాటికి యువతలో ఉపాధి వృద్ధి అధికంగా వ్యవ సాయం, దాని అనుబంధ రంగాలలో ఉంటుంది. ఈ రంగం నైపుణ్యత లేని, తక్కువ నైపుణ్యత కల్గిన శ్రామిక శక్తికి ఉపాధినందిస్తుంది. ప్రస్తుత ఉపాధి వృద్ధిని కొనసాగించడంతో పాటు, పెరుగు తున్న ఉపాధి డిమాండ్ను తీర్చాలంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల మందికి వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పించాలి. యువతలో ఆర్థిక అవకాశాలు మెరుగుపర్చడానికి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్, ఆంట్రప్రెన్యూర్షిప్పై ఆసక్తి కనబరచే విధంగా వారిని ప్రోత్సహించాలి. 2022–23లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 13.4 శాతంగా నమోదైంది. ఉపాధి సామర్థ్య రంగాలైన డిజిటల్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, ఈ–కామర్స్; చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ఉన్నత విద్యలో పరిశ్రమల లింకేజ్ను పటిష్టపరచడం ద్వారా, ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా కరికులంలో మార్పులు చేయాలి. నియంత్రణల సడలింపు ద్వారా ప్రైవేటు రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు యువతలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచ గలవు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికమైన నవ కల్పనలు యువతలో ఉపాధి క్షీణతకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో బ్లూ కలర్ ఉపాధి సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. శ్రమ సాంద్రత పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల ద్వారా తయారీ రంగాన్ని పటిష్ట పరచాలి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్చార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
నేపాల్ దారి అగమ్యగోచరం
నేపాల్లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ 1990లో ఏర్పడిన 35 సంవత్సరాల తర్వాత, రాచరిక వ్యవస్థ పూర్తిగా 2008లో రద్దయిన 17 సంవత్సరాలకు, ఆ దేశ భవిష్యత్తు ‘అగమ్యగోచరమేనా?’ అనే ప్రశ్న వేసుకోవలసి రావటం నిజంగానే విచిత్రమైన పరిస్థితి. గత సెప్టెంబర్ నాటి జెన్–జీ భూకంపం సృష్టించిన స్థితిగతులు, రేకెత్తించిన ప్రశ్నల కారణంగా దేశం ఈ దశలోకి ప్రవేశించింది.2008 వరకు ఒకవైపు రాచరికాన్ని, మరొకవైపు ప్రజాస్వామిక పార్టీల ద్వంద్వ పాలనను, 2008లో రాచరికం రద్దు తర్వాత నుంచి మధ్యేమార్గ పార్టీలు, సాధారణ కమ్యూనిస్టులు, మావోయిస్టుల పాలనను చూసిన యువతరం, దానికి మద్దతుగా నిలిచిన సమాజం కలిసి అగ్నిపర్వత విస్ఫోటనం వంటి తిరుగుబాటు చేశాయి. అనగా అది ప్రస్తుత తరపు తిరుగుబాటు. మరి ఈ తరం గడిచిపోయి మరొక 15–20 సంవత్సరాలకు కొత్త తరం ఉనికిలోకి వచ్చే సమ యానికి పరిస్థితి ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారణమైన పరి స్థితులు అప్పటికి మారుతాయా? మారగలవన్న హామీని ఇపుడున్న రాజకీయ పార్టీలు యువతరానికి, ప్రజలకు ఇవ్వగలవా?కనీసం ప్రశ్నించుకోని వైనంఈ ప్రశ్నలను ఇంతే సూటిగా అన్ని ప్రధాన పార్టీల నాయ కులను నేను అడిగాను. ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ఏ ఒక్క పార్టీ కూడా సెప్టెంబర్ పరిణామాల అనంతర కాలంలో ఈ ప్రశ్నలను తనకు తాను వేసుకోలేదు. ప్రశ్నలు వేయగానే అందరిలో కన్పించిన మొదటి స్పందన నా వైపు శూన్యంగా చూడటం. కొద్దిసేపటికి తేరు కుని స్పష్టాస్పష్టంగా కొద్ది మాటలేవో చెప్పటం. ప్రస్తుతం మిత వాదులు, మధ్యేమార్గీయుల నుంచి మావోయిస్టుల వరకు అందరూ తమను తాము కూడదీసుకోవటం, పార్టీలలో తలెత్తిన అంతర్గత సంక్షోభాలను, చీలిక అవకాశాలను నియంత్రించటం, చీలినవారు ఇతరులతో కలిసి కొత్త పార్టీలు ఏర్పాటు చేయటం, మార్చి 5న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడటం వంటి పనులలో తలమునకలై ఉన్నారు.మరొకవైపు చూడగా, తిరిగి అధికారంలోకి రావాలనే కోరికలో నైతే ఎటువంటి మార్పు లేదు. తిరుగుబాటు తరాన్ని ఎట్లా చల్లబరచటం, వీలైనన్ని జెన్–జీ గ్రూపులను తమ వైపు ఏ విధంగా ఆకర్షించటం, ప్రజలలో తమ పార్టీలకు ఉండిన సంప్రదాయికమైన నెట్వర్క్ ఇటీవలి పరిణామాల వల్ల చెదిరి పోకుండా తిరిగి ఎట్లా కూడదీయటమన్నవి అందరి ప్రాధాన్యాలుగా మారాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా అందరి నోటినుంచి దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు నిత్య పారాయణం వలె వినవస్తున్నాయి. అవి: జెన్–జీ ఆలోచనలూ, మావీ ఒకటే; వారి డిమాండ్లన్నీ సమంజసమైనవే; వారూ, మేమూ కలిసి పని చేయాలని భావిస్తున్నాము. అందరి మాటల సారాంశం స్థూలంగా ఇదే. ఇటువంటి మొక్కుబడి మాటలు బయటకు మాట్లాడటం తప్ప, తమవైపు నుంచి గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగవలసిన మార్పుల గురించి అంతర్గతంగా ఏ పార్టీ కూడా ఒక పద్ధతిలో చర్చించలేదని ఆ యా పార్టీల సీనియర్ నాయకులే నాతో స్వయంగా చెప్పారు.రాజకీయ శూన్యంజెన్–జీ గ్రూపులు కొన్ని ఇటీవలి వారాలలో వేర్వేరు పార్టీలతో చేరినా, అసలు పార్టీ నాయకులు, వారి తీరు, ఒకవేళ గెలిచినట్లయితే పరిపాలన ఎంతవరకు మారవచ్చుననే ప్రశ్నపై ఆ యువకులలో పూర్తి ఆశాభావం కన్పించటం లేదు. ఏ పార్టీతో చేరని గ్రూపులే ఎక్కువ. వాటి గురించి చెప్పనక్కర లేదు. అవి తమ వాదనలు, ఒత్తిడులు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. విషయం ఏమంటే, ఆ నాయకులు ఏమి చెప్తున్నా ఇప్పటికీ తిరిగి విశ్వాసం కలగటం లేదు. అందుకే ఇటీవలి ఒపీనియన్ పోల్లో ఏ నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. ఇందులోని విచారకర స్థితి ఏమంటే, స్వయంగా జెన్–జీ గ్రూపులు ఏకమై ఒక దేశవ్యాప్త పార్టీని ఏర్పాటు చేయటంగానీ, లేదా ఇపుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని పొందగల ఒక కొత్త పార్టీగానీ ముందుకు రాకపోవటం వల్ల రాజకీయంగా అతి పెద్ద శూన్యం కనిపిస్తున్నది. మొదటినుంచి గల పార్టీలు విశ్వాసాన్ని కోల్పోయి, అటువంటి కొత్త ప్రత్యా మ్నాయాలూ ఏర్పడనపుడు, సమస్యలూ, అసంతృప్తులూ అదే విధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, నేపాల్ దేశ భవిష్యత్తు ఏమిటి? ఆ స్థితి అగమ్యగోచరంగా తోస్తున్నదనటం అందు వల్లనే!పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానంగా కొద్దిమంది నాయకులు మాత్రం నాతో కొన్ని మాటలు అన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని పార్టీల అగ్రనాయకత్వాలు కూడా జెన్–జీకి, ప్రజలకు మూర్తీభవించిన విలన్లుగా కనిపిస్తున్నందున అందరూ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగి ఇతరులకు నాయకత్వం అప్పగించాలి. కొత్త కార్యవర్గాలలో యువకులకు భారీగా అవకా శాలు కల్పించాలి. నాయకులంతా అవినీతిని, బంధుప్రీతిని పూర్తిగా వదలుకోవాలి. అధికారంలోకి వచ్చినట్లయితే పారదర్శక పాలన, సమర్థవంతమైన పాలన, సమర్థులూ నిజాయితీపరులైన వారికి అధికారంలో స్థానం, వేగవంతమైన, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, యువతకు ఉపాధి అవకాశాలు అనే వాటిపై చిత్తశుద్ధి చూపగలమని ప్రకటించి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రస్తుత జెన్–జీ తరంగానీ, లేదా కొత్త తరం గానీ ఇంతకన్న తీవ్రమైన తిరుగుబాటు చేయగలదు. రాజకీయ పార్టీలకు ఇది చివరి అవకాశం వంటిది.కోల్పోయిన విశ్వాసంవీరు ఇట్లా అంటున్నట్లు బయట వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలతో నేను ప్రస్తావించాను. వారిలో ఒక్కరు కూడా ఆ మాటలను నమ్మలేదు. గతంలో పలుమార్లు ఈ తరహా మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. మరి భవిష్యత్తేమిటి? అది వారికీ అగమ్య గోచరంగానే ఉంది. నిజానికి రాచరిక వ్యవస్థలోనే బహుళ పార్టీల ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ కోసం 30 ఏళ్లపాటు తీవ్రమైన ఉద్యమాలు జరిపి సాధించిన నేపాలీ కాంగ్రెస్, సాధారణ కమ్యూనిస్టులూ సక్రమంగా పాలించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మావోయిస్టులు దశాబ్దంపాటు భీకరమైన పోరాటం సాగించి, కేవలం ప్రభుత్వానికి అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఇండియా ఆధునిక ఆయుధాలు సమకూర్చటం వల్ల, చివరి దశలో వెనుకకు తగ్గారు. అయినా ఇతరులతో కలిసి 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వామ పక్షాలే పాలించాయి. వీరి పాలన సవ్యంగా సాగినా ఈ విపత్తు ఎదురయేది కాదు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి 47 సంవత్సరాల పాటు విఫలమై, అందరికందరూ విశ్వాసాన్ని కోల్పోయినందునే, ప్రత్యామ్నాయ సృష్టి అయినా జరగనందునే, నేపాల్ భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వెనిజులా ముడిచమురుపై డేగకన్ను
అమెరికా చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఖర్చు బిల్లును 2026 సంవత్సరానికి గానూ 90,100 కోట్ల డాలర్లతో ప్రతినిధుల సభ ఆమో దించింది. లాటిన్ అమెరికాలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యయ బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే జూలైలో కేటాయించిన 15,600 కోట్ల డాలర్ల అనుబంధ సైనిక వ్యయ నిధులతో కలిపితే, 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడానికి అమెరికా మొత్తం లక్షా 5,700 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. ‘ఆపరేషన్ దక్షిణ గోళం’ పేరిట కరేబి యన్ ప్రాంతానికి ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లు, యుద్ధనౌకలను తరలించడం... 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత అతిపెద్ద సైనిక మోహరింపుగా పరిగణించవచ్చు. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను అణచివేసే ఇఎ18జి వార్జెట్లు ఇప్పటికే ప్యూర్టోరికో చేరు కున్నాయి.అమెరికా చూపు ఇప్పుడు వెనిజులాలోని అపారమైన ముడి చమురు నిల్వలపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 20 శాతం ముడిచమురు నిల్వలు (సుమారు 30,000 కోట్ల బారెల్స్) ఈ చిన్న దక్షిణ అమెరికా దేశంలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. గతంలో అధ్యక్షుడు ఛావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేసి, 2005లో భూసంస్కరణల ద్వారా సామాన్య రైతాంగాన్ని భూస్వాముల నుండి విముక్తి చేశారు. అదే ఏడాది 13 లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడి స్వల్ప ధరలకే ముడిచమురును అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. 2008లో బ్యాంకులను జాతీయం చేయడం, రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యాన్ని వెనిజులా తగ్గించింది. ఇవన్నీ అమెరికాకు మింగుడుపడని అంశా లుగా మారాయి.ప్రస్తుతం ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాదం’ ముసుగులో మదూరో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాషింగ్టన్ కుయుక్తులు పన్నుతోంది. ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే సంస్థతో వెనిజులా నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తుండగా, అధ్యక్షుడు మదూరో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వాదనలను తిరస్క రిస్తున్నారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.యుద్ధ తంత్రాన్ని అమెరికా మరింత క్రూరంగా మార్చి, నేరుగా భూభాగంలోకి సైన్యాన్ని పంపకుండా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో దాడులు చేసే వ్యూహంలో ఉంది. ఇటీవల డ్రోన్ల దాడిలో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. ఆయుధ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తోంది.గత నాలుగేళ్లలో ఉక్రెయిన్కు 17,000 కోట్ల విలువైన ఆయుధాలను, ఇజ్రాయెల్కు భారీగా ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తూ అమెరికా తన యుద్ధ దాహాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమా సియాలో చమురు ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ను అంగరక్షకుడిగా వాడుకున్నట్లే, ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. 1946 నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్కు సుమారు 35,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించిన అమెరికా, ఇప్పుడు సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వెనిజులాపై దాడికి సిద్ధమవు తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ సాగుతున్న ఈ యుద్ధ క్రీడలో వెనిజులా ఇప్పుడు బలిపీఠంపై ఉంది.– జమిందార్ బుడ్డిగఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
మయన్మార్లో ఎన్నికల తంతు
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.ప్రధాన రాజకీయ పార్టీ ఎన్ఎల్డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు. 2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది. అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.అదుపు సాధించని సైన్యంవేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.భారత్కు భద్రతా సమస్యభారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.పాలు పోని ఇండియాసూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది. ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పనిలో పారదర్శకతకు పట్టం
సంక్షేమ సంస్కరణల విషయంలో బహి రంగ చర్చ అవసరమైనదే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)’ (వీబీ జీ– రామ్ జీ) బిల్లుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమౌతున్న ఆందోళనలు... చారిత్రక ఉపాధి హామీ చట్టంలో వచ్చే మార్పులు కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయేమో అనే భయం నుంచి వచ్చాయి. అటువంటి ఆందోళనలను గౌరవించాల్సిందే. అయితే ఊహల కంటే కూడా ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లు అసలు ఏం చేస్తుందో క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. ఈ బిల్లులోని అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే, ఇది ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని ఇస్తోంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు ఉపాధి కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతిని అందించే నిబంధనను కూడా ఈ బిల్లు కలిగి ఉంది. 125 రోజుల గ్యారంటీ పని!జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో బలహీనత అనేది ఉద్దేశంలో లేదు... నిర్మాణపరమైన లోపాలలో ఉంది. ఈ విషయంలో సంస్కరణలు అవసరం. ‘వీబీ–జీ రామ్ జీ’ని ఈ వాస్తవికతకు అనుగుణంగా అంచనా వేయాలి. హక్కులను బలహీనపరచడానికి బదులుగా ప్రతిపాదిత చట్రం ‘ఎంజీ నరేగా’లోని లోపాలను నేరుగా పరిష్కరిస్తుంది. కార్మికులకు రావలసిన వాటిని నిరాకరించే అనర్హత నిబంధనలను తొలగించడంతో పాటు పారదర్శకత, సామాజిక తనిఖీ, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టబద్ధమైన బాధ్యత లను బలోపేతం చేస్తుంది. ‘వీబీ–జీ రామ్ జీ’ గ్రామీణ ఉపాధి విషయంలో డిమాండ్– ఆధారిత స్వభావాన్ని దెబ్బతీస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లును క్షుణ్ణంగా చదివితే ఆ వాదన నిలబడదు. సెక్షన్ 5(1) ప్రకారం, గ్రామీణ కుటుంబానికి చెందిన వయోజనులు ఎవరైనా శారీరక శ్రమతో నైపుణ్యం లేని పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల ఉపాధిని కల్పించాల్సిన స్పష్టమైన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఉపాధి హామీని 125 రోజులకు విస్తరించడం, ‘ఎంజీ నరేగా’ కాలం నాటి అనర్హత నిబంధనలను తొలగించడం ద్వారా ఈ బిల్లు ఈ హక్కును మరింత బలోపేతం చేస్తోంది. తద్వారా నిరుద్యోగ భృతిని ఒక నిజమైన చట్టబద్ధమైన రక్షణ కవచంగా పునరుద్ధరిస్తోంది.బలోపేతం కానున్న జీవనోపాధి హామీఈ సంస్కరణ ఉపాధిని పక్కన పెట్టి కేవలం ఆస్తుల కల్పనకే ప్రాధాన్యత ఇస్తుందన్నది మరో విమర్శ. ఈ బిల్లు స్పష్టంగా చట్ట బద్ధమైన జీవనోపాధికి హామీని ఇస్తూనే ఉపాధిని ఉత్పాదక, మన్నికైన ప్రభుత్వ ఆస్తుల కల్పనతో అనుసంధానిస్తుంది.షెడ్యూల్ ‘ఐ’తో కలిపి సెక్షన్ 4(2)... నీటి భద్రత, కీలకమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించే పనులు అనే నాలుగు ప్రధాన రంగాలను గుర్తించింది. దీనివల్ల వేతన ఉపాధి అనేది తక్షణ ఆదాయ మద్దతును అందించడమే కాకుండా దీర్ఘకాలిక గ్రామీణ దృఢత్వం, ఉత్పాదక తకు కూడా దోహదపడుతుంది. అందువల్ల ఉపాధి, ఆస్తుల కల్పన అనేవి పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కావు. అవి ఒకదానికొకటి తోడ్పడుతూ సుసంపన్న గ్రామీణ భారతానికి పునాది వేస్తాయి.కేంద్రీకరణ కాదు, సమన్వయం ద్వారా వికేంద్రీకరణఈ బిల్లు అధికారాల కేంద్రీకరణను వ్యతిరేకిస్తోంది. సెక్షన్ 4(1) నుంచి 4(3)... అన్ని పనులను గ్రామ స్థాయిలో స్థానిక అవస రాల ఆధారంగా రూపొందించిన, గ్రామసభ ఆమోదించిన వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్లతో (వీజీపీపీలు) అనుసంధానిస్తాయి. పాత చట్రంలో ఉన్న ప్రధాన లోపం విభజన. దీనిని తొలగించేందుకు అన్ని పనులను వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్లో (వీబీఎన్ఆర్ఐఎస్) చేర్చాలని ఈ బిల్లు చెబుతోంది. దీని వల్ల ప్రణాళికా రచనలో ఏకరూపత, పారదర్శకత ఉంటాయి. ఇది కేవలం పై నుంచి రుద్దిన కేంద్రీకరణ కాదు. సెక్షన్ 16, 17, 18, 19 ప్రకారం ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అధికారాలు ఆ యా స్థాయుల్లోని పంచాయతీలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, జిల్లా అధికారు లకు ఉంటాయి. ఈ బిల్లు కేవలం పనుల పట్ల స్పష్టత, సమన్వయం, సమగ్రతను కల్పిస్తుందే తప్ప నిర్ణయాధికారాన్ని కేంద్రీకరించదు. స్థానిక ప్రాధాన్యతల ఆధారంగా ప్రణాళికలను రూపొందించడంలో గ్రామ సభలదే ప్రధాన పాత్ర.భద్రత, ఉత్పాదకత మధ్య సమతుల్యతసాగు పనులు ఎక్కువగా ఉండే సమయాల్లో వ్యవసాయ కూలీల కొరతపై ఉన్న ఆందోళనలను ఈ బిల్లు స్పష్టంగా పరిష్కరించింది. ఈ బిల్లు కింద సెక్షన్ 6 ప్రకారం విత్తనాలు నాటడం, కోతల సమయాలను కలుపుకొని ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల వరకు పనులు చేపట్టుకూడదని ముందుగానే ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.ముఖ్యంగా సెక్షన్ 6(3) ప్రకారం వ్యవసాయ–వాతావరణ పరిస్థితుల ఆధారంగా జిల్లా, బ్లాక్ లేదా గ్రామ పంచాయతీ స్థాయుల్లో వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసేందుకు రాష్ట్రాలను ఇది అనుమతిస్తుంది. ఈ అంతర్నిర్మిత సౌలభ్యం పెరిగిన ఉపాధి హామీని వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించకుండా... దానికి అనుబంధంగా ఉండేలా చూస్తుంది. చాలా తక్కువ సంక్షేమ చట్టాలు మాత్రమే సాధించగలిగిన ఒక సున్నితమైన సమతుల్యత ఇది. కేటాయింపుల ద్వారా సమానత్వంఆర్థికపరమైన కోతలకు సంబంధించిన ఆందోళనలను కూడా విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 4(5), సెక్షన్ 22(4) ప్రకారం నిబంధనల్లో చెప్పిన అంశాల ఆధారంగానే రాష్ట్రాల వారీగా నిధు లను కేటాయిస్తారు. ఈ చట్రం రాష్ట్రాలను కేవలం అమలు చేసే వాటి గానే కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా పరిగణిస్తుంది. నిర్దేశించిన కనీస చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా సొంత పథకాలను నోటిఫై చేసి అమలు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ఆచరణ పరంగా ‘సహకార సమాఖ్య’ ఇది. సాంకేతికత కారణంగా లబ్ధిదారులు దూరమవుతారనే వాదన ఈ బిల్లులో పొందుపరిచిన రక్షణ చర్యలను విస్మరిస్తోంది. సెక్షన్ 23, 24లు బయోమెట్రిక్ ధ్రువీకరణ, జియో–ట్యాగ్ పనులు, రియల్–టైమ్ డ్యాష్బోర్డ్లు, క్రమబద్ధమైన బహిరంగ వెల్లడి ద్వారా సాంకేతికతతో కూడిన పారదర్శకతను తప్పనిసరి చేస్తాయి. ఇవి నకిలీ హాజరు, ఉనికిలో లేని కార్మికులు, ధ్రువీకరించలేని రికార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయి. సెక్షన్ 20 అనేది గ్రామ సభ ద్వారా సామాజిక తనిఖీలను బలోపేతం చేస్తుంది. సాంకేతికత జవాబుదారీతనాన్ని దాటవేయదు... పునాదిగా నిలుస్తుంది.హామీకి మళ్లీ విశ్వసనీయతఉపాధి హామీని పెంపొందించడం, స్థానిక ప్రణాళికను అంత ర్భాగం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతతో కార్మిక భద్రతను సమ తుల్యం చేయడం, పథకాలను అనుసంధానించడం, మెరుగైన పరిపాలనా మద్దతు ద్వారా క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, పరిపాలనను ఆధునీకరించడం ద్వారా ఆచరణలో తర చుగా విఫలమౌతున్న ఒక హామీకి విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎంపిక అనేది సంస్కరణ, సానుభూతికి మధ్య కాదు... తక్కువ ఫలితాలనిచ్చే నిలకడ లేని హక్కు, గౌరవం – స్పష్టమైన ఉద్దేశ్యంతో ఫలితాలను అందించే ఆధునిక చట్రానికి మధ్య ఉంది. ఈ కోణంలో చూస్తే ‘వీబీ–జీ రామ్ జీ’ అనేది సామాజిక రక్షణ నుంచి వెనక్కి తగ్గడం కాదు, దాన్ని పునరుద్ధరిస్తోంది.శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాసకర్త కేంద్ర గ్రామీణాభివృద్ధి,వ్యవసాయం–రైతు సంక్షేమ మంత్రి -
సంప్రదాయ ఫార్మసీలు నిలబడాలి!
ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఔషధ మార్కెట్పై గుత్తాధిపత్యం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ–ఫార్మసీ రంగంలోకి దిగుతున్నాయి. 2021 జూన్లో టాటా గ్రూప్కు చెందిన ‘టాటా డిజిటల్’ సుమారు రూ. 1,500 కోట్లతో ‘1ఎమ్జీ’ అనే ఈ–ఫార్మసీ స్టార్టప్లో 65% వాటాను కొనుగోలు చేసి, ఈ ప్రక్రియకు పునాదులు వేసింది. 2024లో సుమారు రూ. 28 వేల కోట్లుగా ఉన్న భారతదేశ ఆన్ లైన్ ఫార్మసీ మార్కెట్ విలువ 2025–2033 కాలానికి 16.65% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ను నమోదు చేస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సంప్రదాయ ఫార్మసీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలున్నాయి. ఆన్ లైన్ ఔషధాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తమిళనాడు డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ 2018లో దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, తరువాత ఆన్లైన్ విక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ–ఫార్మసీ డ్రాఫ్ట్ రూల్స్–2018’ని రూపొందించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో నమోదైన కేసులోనూ ఇదే డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తామని ఈ–ఫార్మసీలు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు వివిధ హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ ఆన్లైన్ విక్రయాలకు అనుమతించింది. రాబోయే ఈ–ఫార్మసీల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా ఈ–ఫార్మసీ సంస్థలు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన షెడ్యూల్–ఎక్స్ (నార్కోటిక్, సైకోట్రోపిక్, ట్రాంక్విలైజర్లు, ఔషధాలు) మాత్రం అమ్మడం లేదు. షెడ్యూల్–హెచ్ మందులను కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నాయి. ముసాయిదాలో చెప్పినట్టు ఎలక్ట్రానిక్ కాపీని నిల్వ చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేపు రాబోయే చట్టం ఈ–ఫార్మసీలకు మరింత సాధికారతను ప్రసాదించబోతుందన్నది సుస్పష్టం. ప్రజలు కూడా ఆన్లైన్ మందుల కొనుగోలుకు మద్దతునిస్తున్నారన్న విషయం అనేక పరిశోధన పత్రాలు రూఢి చేస్తున్నాయి.కరోనా మహమ్మారి తదనంతర కాలంలో ప్రజలకు విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగంలోకి రావడం, 30 నిమిషాల్లో హోం డెలివరీ వంటి సేవలు, ఈ–ఫార్మసీలోకి పెద్ద కార్పొరేట్లు ప్రవేశించడం, సంప్రదాయ ఫార్మసీల కన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వంటి అంశాలు అటు మిలీనియల్స్నూ, ఇటు జెనరేషన్ జెడ్నూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సంప్రదాయ ఫార్మసీలు ఆన్లైన్ బాట పట్టకపోతే వాటి మనుగడకు తీవ్రమైన ముప్పు తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ ఫార్మసీలు–కస్టమర్లకు అనుసంధానంగా నడుస్తున్న ఈ–ఫార్మా మార్కెట్ ప్లేస్ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలిస్తే మళ్లీ రిటైల్ ఫార్మసీ రంగం భద్రంగా ఉంటుంది. లేదంటే దేశంలో ఉన్న దాదాపు 10 లక్షల ఫార్మసీలలో పనిచేస్తున్న కోటిమందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.– శ్రీపాద రమణ ‘ ఔషధ రంగ నిపుణులు -
క్రైస్తవానికి పునాది లౌకికవాదం!
సమాజం లార్వా నుండి ప్యూపా రూపంలోకి, అటునుండి సీతాకోక చిలుకలా మారే ఒక నిరంతర ప్రక్రియలో ఉంటుంది. సమాజ గతి చలనం ఎన్ని సంస్కృతులు, ఎన్ని జాతులు, మతాలు, ఖండాలు ఏర్పడినా... అది ఒక సమూహంగా మనడానికి గతి మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని అనుభవ రీత్యా నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. కొన్ని శాస్త్రీయ పరిణామాలు ఉంటాయి. వీటన్నిటికీ కావాల్సిన ఫౌండేషన్ – ఒక బేసిక్ సోషల్ ఫ్యాబ్రిక్. అది సమాజం మొత్తానికీ ఉమ్మడిగా సమ్మతమైన మోరల్ కోడ్, సోషల్ కోడ్! ఇది వ్యక్తిగత అభిరుచులు, నమ్మకాలు, హక్కులకు అతీతంగా సామూహిక ప్రయోజనాల మీద నిలబడి ఉండాలి. లేనప్పుడు– వ్యక్తిగత హక్కులు, సామూహిక నిబంధనలకు లోనై– ఒక ఘర్షణ పూరితమైన, ఒక తిరోగమన సమాజానికి దారి తీస్తుంది. ఈ కోడ్ – సమానత్వం, సౌభ్రాతృత్వంతో సమ్మిళితమైన స్వేచ్ఛ కలిగి ఉండాలి. స్వేచ్ఛ పరిమాణం ఎంత అన్నది మరో ప్రశ్న. తిరిగి అది ‘ర్యాడికల్ ఇండివిడ్యువలిజం’ను ప్రేరేపిస్తే అది మరో తిరోగమన రూపాన్ని తీసుకుంటుంది. ఈ బ్యాలన్స్ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇప్పటికీ ఎవాల్వ్ అవుతూ ఉంది. అయితే – ఎంతో విపరీతమైన ఘర్షణ రూపంలో కొన్ని తిరోగమన సమాజాలలో ఎంతో రక్తపాతం తర్వాత వస్తుంది. అందుకే వీటన్నిటికీ కావాల్సిన సత్తా ఉండే సోషల్, మోరల్ ఫ్యాబ్రిక్– ఒక మతమే! మతం అంటే ‘కల్ట్’లా ఉండటం కాదు. రోజుకు ఎన్ని సార్లు పూజించాలి, ఏం బట్టలు కట్టాలి, మీసాలు ఎలా పెంచాలి... ఇలాంటి ‘రూల్స్’ మతాన్ని పోషించడం మొదలు పెడితే అది ‘కల్ట్’ అవుతుంది. ఆ ‘కల్ట్’ ఒక మూస పోసిన విధానంలో మను షులను సామాజిక సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు అతీతంగా తయారు చేస్తుంది. అటు నుండి ఒక పిడివాదం మొదలవుతుంది. అది ఒక ఫండమెంట లిజానికి దారి తీస్తుంది. దైవ విశ్వాసాలకు, సోషల్ లాజిక్కు సరిగ్గా కుట్లు వేసి అందంగా తీర్చగలిగేదే ఆదరించదగ్గ మతం అవుతుంది. దేవుడు ఒక సామాజిక అవసరం.ఒక మతానికి కావాల్సిన లిట్మస్ టెస్ట్ అంబేడ్కర్ చెప్తాడు: ‘మతం అన్నది ముఖ్యంగా నియమ సూత్రాలకు సంబంధించినది అయి ఉండాలి. ఎప్పుడైతే అది నిబంధనల చుట్టూ తిరుగుతుందో మతానికి ఉండాల్సిన సారమైన (సామాజిక) బాధ్యతను చంపేస్తుంది’ (‘కుల నిర్మూలన’ నుండి). మత ప్రాతిపదిక మీదనే–అంబే డ్కర్ ప్రగతి వాద కోణంలో మాట్లాడితే– దేవుడు ఈ ‘లిట్మస్ టెస్ట్’కు నిలబడలేని మనిషి/ ఆత్మ/ శక్తి అయితే ఆ దేవుడు నీతిమంతుడు కాలేడు. సమాజంలో ఒకరి అభిప్రాయాలకు, నమ్మకాలలో ఎన్ని తేడా, తారతమ్యాలు ఉన్నా... కలిసి ఒక సామూహిక ప్రయోజనాన్ని పండించడం కోసం ప్రజలు నడవడం ఈ రోజు సమాజానికి కావాల్సిన అత్యవసరమైన అంశం. యేసు క్రీస్తు యోహాను సువార్త గ్రంథంలో ఇలా అంటాడు: ‘నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు కూడ ఒకరిని మరొకరు ప్రేమించవలెను.’ అదే రకంగా మార్కు సువార్త గ్రంథంలో ‘నీవు నీ పొరుగువానిని నీలాగునే ప్రేమింపవలెను’ అంటాడు. ఇది సింపుల్గా కనిపించవచ్చు. కానీ చాలా డెప్త్ ఉన్న స్టేట్మెంట్. ఇక్కడ పొరుగు క్రైస్తవుడిని ప్రేమించ మని యేసు క్రీస్తు చెప్పలేదు. లేదా నాస్తికుడిని ప్రేమించవద్దు అని చెప్పలేదు. హంతకుడు, దొంగ ఎవరైనా సరే వాళ్ళను ప్రేమించవద్దు అని చెప్పలేదు. పది మంది కుష్టువాళ్ళను బాగు చేస్తే అందులో ఒక కుష్టువాడు మాత్రమే జీసస్ను ఫాలో అవుతాడు. ఆయన ‘ముందుగా నన్ను ఫాలో అయితేనే నిను బాగుపరుస్తా’ అనే కండి షన్ పెట్టి బాగుపరచలేదు. జీసస్ విధానం పూర్తిగా పక్షపాత రహితం, రాజకీయ స్వార్థాల నుండి దూరం, అందరినీ చేరదీసే స్వభావం, విశ్వమానవతా దృష్టి కలిగినది. ఆ అర్థంలో ఆయన ఆచరణలో ‘లౌకికత’ ఉంటుంది. ముగింపుగా – క్రిస్టియానిటీ ఎదగడానికి ప్రభుత్వ చట్టాలు అవసరం లేదు. క్రిస్టియానిటీ యుద్ధాలు చేసి ఎదగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే– క్రిస్టియానిటీకి మూలం సెక్యులరిజం!– పి. విక్టర్ విజయ్ కుమార్ ‘ రచయిత, విమర్శకుడు(క్రిస్మస్ ఆగమన కాలం సందర్భంగా) -
ఓపెన్ చెరసాల కాదు... అది ఉత్తమ కళాశాల!
నేను 1983లో నాగార్జున సాగర్లోని ఏపీ గురుకుల జూనియర్ కళాశాలలో సీటు దొరికిందని తెలిసి ఎంతో సంతోషించాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం. అలా ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జునసాగర్కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాలలో గడిపిన మూడేళ్ల రోజుల్ని ‘సెంట్రల్ జైలు’గా భావించిన నేను, ‘ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలులా ఉండొచ్చ’ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను.అయితే వారంలోనే అది ఓపెన్ చెరసాల కాదు, ఉత్తమ భవి ష్యత్ తయారీశాల అని అర్థమై గొప్ప ఊరట కలిగింది. ఆదివారంతో బాటు, పండగ సెలవొస్తే చాలు... విజయపురి సౌత్లో రామ కృష్ణ థియేటర్, అందులోంచి ఆట మొదలవ్వడానికి ముందు విని పించే ‘నమో వేంకటేశా ’పాట తెచ్చిన ఉత్సాహం, భాను వీడియో అంటూ బస్టాండ్ దగ్గర ఉన్న వీడియో థియేటర్, డ్యామ్కి అటు చివర మూడు కిలోమీటర్ల దూరంలోని హిల్ కాలనీ వరకూ క్రమం తప్పని పాదయాత్ర... అన్నీ నిన్నమొన్నటి విషయాల్లాగానే ఉన్నాయి. ఇక, మా సీనియర్లు ఎవ్వరూ ర్యాగింగ్ చెయ్యలేదు... కాకపోతే అందరినీ ‘సర్’ అని పిలవాలి. మా బోటనీ సర్ ఎప్పుడూ ‘ఇలాగే చదువు, నువ్వు డాక్టర్ అయిపోయినట్టే’ అంటూ ప్రోత్సహించే వారు. అభిమానం కనబడేది. రెండుసార్లూ టీచర్స్ డేకి నేను బోటనీ క్లాస్ తీసుకున్నాను (పిల్లలతో ఆ రోజు చెప్పించేవారు). క్లాస్ లాస్ట్లో ఆయన్ని అనుకరిస్తూ గొంతు మార్చి కామెడీ చేస్తే ఒక్కడు కూడా నవ్వలేదు. ఏమిటా అని చూస్తే ఆయన ఎప్పుడు వచ్చి కూర్చున్నారో తెలియదు కానీ లాస్ట్ బెంచ్ నుండి లేచి వచ్చారు. బిక్కచచ్చిన నన్ను ‘వెరీ గుడ్’ అంటూ కదిలిపోయారు. ఇంకోసారి ఇంగ్లీష్ సర్ దివాకర్ గారు బోర్డు వైపు తిరిగి క్లాస్ చెప్తుంటే ఏదో చిన్నతనపు అల్లరి చేశాం. ఆయన చూడలేదనుకున్నాం. కానీ ముద్దా యిలందరినీ లేపారు. నన్నులేపి ‘చేసిందంతా చేసి, ఎంత అమాయ కపు మొహం పెట్టావు రా నాయనా’ అని నవ్వేశారు. చాలా చిక్కని స్నేహాలు. అరమరికలు లేనివి. ఇంట్లోంచి తెచ్చు కున్న ఊరగాయలు, జంతికలు ఉమ్మడి ఆస్తి. కలిసి పోటీగా చదువు కోవడం, ఒకరి డౌట్లు ఒకరు తీర్చుకోవడం మాత్రమే కాదు... ఆట లైనా, పాటలైనా, షికార్లయినా, జట్లుగానే! రష్యా, ఉక్రెయిన్ స్థాయిలో గొడవపడినా రెండో రోజుకి సంధి కుదిరిపోవాల్సిందే. ఒక సారి సెలవులు ఇచ్చిన టైమ్కి వరదలు. ట్రైన్లు లేక బస్సుల్లో బయ లుదేరాం. అవి కూడా డైరెక్ట్గా లేవు. ఉత్తరాంధ్ర వాళ్ళం నలుగురం కలిసి రాజమండ్రి చేరుకున్నాం. ఎవరి దగ్గరా డబ్బులు మిగల్లేదు. అయినా భయం లేదు. అందులో రవిది వైజాగ్. ధైర్యం చెప్పాడు. ‘నా చేతికి వాచీ ఉందిరా, ఏం ఫరవాలేదు’ అని. బస్టాండ్లో ఒకా యన్ని పరిచయం చేసుకుని, పరిస్థితి చెప్పి మా నలుగురికీ టికెట్స్ తీయమని చెప్పాడు. తన వాచీ ఉంచుకుంటే, తర్వాత రోజు కలిసి డబ్బులిచ్చి రిటర్న్ తీసుకుంటానన్నాడు. ఆయన ‘అదేమీ వద్దులే ’ అని చెప్పి మాకు టికెట్స్ తీసి ఇచ్చాడు. మేం వైజాగ్లో రవి ఇంటికి చేరిపోయి, వారి ఆతిథ్యం పొంది, మరుసటిరోజు మా ఇళ్లకు చేరాం.ఇలా చెప్తూ పోతే బోలెడు. నా పేరు అచ్చులో చూసుకోవడం మొదటిసారి అక్కడే. ‘ఆశాజీవులు’ అని కవిత రాస్తే ఆ సంవత్సరం మేగజైన్లో అచ్చయింది. చదువుతో బాటు అందమైన అనుభవాలు, స్నేహాలు, జీవిత పాఠాలు మిగిల్చిన మా ‘ఏపీ గురుకుల జూనియర్ కళాశాల’ మా అందరికీ ఉన్నతి కలుగ జేసిన మేధా తయారీ శాల.– డా‘‘ డి.వి.జి. శంకరరావు ‘ పార్వతీపురం మాజీ ఎంపీ(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల ఆరంభమై రేపటికి 50 ఏళ్ళు) -
‘ఆత్మనిర్భరత’కు రష్యాయే ఆలంబన
భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు – విక్రేతకు మధ్య ఉండే వాటి కన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్వేర్ సమీకరించు కున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞా నాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఉక్రెయిన్పై యుద్ధం 2022లో మొద లెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల న్యూఢిల్లీకి రెండు రోజుల పర్యటనపై వచ్చి వెళ్ళడం ఇదే మొదటి సారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆతిథేయిగా వ్యవహరించిన ఈ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య చెక్కు చెదరకుండా నిలిచిన వ్యూహాత్మక భాగ స్వామ్యం ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో శ్రీకారం చుట్టుకున్న సహకారాన్ని ఉభయ దేశాలు కొన్ని దశాబ్దాలుగా పెంపొందించుకుంటూ వస్తున్నాయి.ఉక్రెయిన్పై యుద్ధానికిగాను రష్యా అధ్యక్షుడిని ఏకాకిని చేయా లని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు కోరు కోవడంతో ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి వ్యక్తమైంది. ఉక్రెయిన్పై యుద్ధ నేరాలకు సంబంధించి అంత ర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్కు అరెస్టు వారంట్లు జారీ చేసింది. అయినా ఘనంగా, సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పల కాలన్న భారత్ నిర్ణయంలో స్వీయ వ్యూహాత్మక ప్రాధాన్యముంది.రష్యా నుంచి చమురు దిగుమతులను, రక్షణ సామగ్రి కొను గోళ్ళను తగ్గించుకోవాలని అమెరికా నుంచి మనపై ఒత్తిడి పెరుగు తున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. తమ సంబంధాలు ‘బాహ్య ఒత్తిడులకు లోబడేవి కావు’ అని రెండు పక్షాలూ పునరు ద్ఘాటించాయి. ఉభయ సేనల మధ్య సాంకేతిక సహకారం ఒక ముఖ్య అంశంగా కొనసాగుతోందని సంయుక్త ప్రకటనలో నామ మాత్రంగా ప్రస్తావించి వదిలేశారు. రష్యా నుంచి వచ్చిన ఆయు ధాలు, ఇతర రక్షణ సామగ్రి నిర్వహణకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య క్రమం కింద టెక్నాలజీ బదలీ ద్వారా భారతదేశంలోనే స్పేర్ పార్టులు, పరికరాలు, చిన్నాచితక వస్తువులు, ఇతర ఉత్పత్తులను సంయుక్తంగా తయారు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. భారత సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు సంయుక్త సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించారు.భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు–విక్రేతకు మధ్య ఉండే వాటికన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్ వేర్ (మొదటి మిగ్ పోరాట విమానం, పెత్య/కమోర్త తరగతి నౌకలు, ట్యాంకులను) సమీకరించుకున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞానాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఆ విధంగా సోవియట్/రష్యా మూలాలున్న పరికరాలలో చాలా భాగం భారతదేశంలో ‘తయారైనట్లు’ పైకి కనిపించినప్పటికీ, అది చాలా వరకు దిగుమతి చేసుకున్న కిట్లు/కాంపొనెంట్ల కూర్పు నకు మాత్రమే పరిమితమైంది. ఆయుధాల ఫ్యాక్టరీలలో, లేదా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్.ఎ.ఎల్)లో సాగింది ప్రాథమికంగా విడి భాగాల అసెంబ్లింగ్ కలాపం మాత్రమే. రివర్స్–ఇంజనీరింగ్ లేదా దేశీయ డిజైన్ చేపట్టేందుకు జరిగిన కృషి అతి స్వల్పం లేదా అసలు ఏమీ లేదనే చెప్పాలి.చైనాతో పోల్చుకుంటే, డిజైన్ డొమైన్లోకి దిగడంలో అశక్తత /విముఖత కనిపిస్తుంది. సోవియట్ హయాం నాటి సైనిక సామగ్రిని చైనా ఎంతో విజయవంతంగా రివర్స్–ఇంజనీరింగ్ చేసి విజయం సాధించింది. సుఖోయ్ ఎస్ యు–27 ఫ్లాంకర్ ను ఆధారం చేసుకుని అది షెన్యాంగ్ జె–11యుద్ధ జెట్ విమానాన్ని అభివృద్ధి చేసింది. లైసెన్సు పొందిన ఉత్పత్తి ఒప్పందం కింద పీపుల్స్ లిబ రేషన్ ఆర్మీ 1990లలో రష్యా నుంచి సు–27 ఎస్కే యుద్ధ విమా నాలను సమీకరించింది. తర్వాత, రష్యా సరఫరా చేసిన కిట్లను ఉపయోగించుకుని, 2000ల మధ్య నాటికి ఆ విమాన రివర్స్–ఇంజ నీరింగ్లో సఫలమై జె–11ఎ విమానాలుగా తయారు చేసింది.సు–27 సోవియట్ యూనియన్లో 1970లలో డిజైన్ అయి, 1985లో సర్వీసులో ప్రవేశించింది. ఈ సోవియట్ టెక్నాలజీని మక్కికి మక్కి కాపీ కొట్టి చైనా జె–11 తయారు చేసుకుంది. డిజైన్లో సాధించిన ఈ పురోగతితో చైనా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకుంది. స్వయం సమృద్ధిని సమీకరించుకుంది. తర్వాత, ఇదే యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ (అదే పెద్ద కొనుగోలు దారు)కు విక్రయించింది.భారత్ మొదటి సుఖోయ్ సు–30ని 1997లో సమీకరించుకుంది. కానీ, దేశంలో అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా, దిగుమతు లపై ఆధారపడడం కొనసాగింది. యుద్ధ విమాన (రఫేల్) ప్రత్యా మ్నాయ సరఫరాదారుగా ఫ్రాన్స్ ముందుకొచ్చింది. పుతిన్ పర్యట నతో ఐదవ తరం సు–57 యుద్ధ విమానాలపై మళ్ళీ ఆసక్తి రేగుతోంది. భారత్ సోర్స్ కోడ్ యాక్సెస్ను, స్టెల్త్ ఉన్నతీకరణలను కోరుతోంది. దీన్ని సమీకరించుకోవడం వల్ల దేశీయ ‘తేజస్’కు ఏమైనా ఊతం చేకురుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కొన్ని నవీన రంగాలలో అమూల్యమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయాన్ని మాస్కో (సోవి యట్ యూనియన్గా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా) భారతదేశానికి సమకూర్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. క్షిపణులు, అణుశక్తి చోదిత జలాంతర్గత ప్రొపల్షన్ (ఐ.ఎన్.ఎస్. అరిహంత్) అందుకు నిదర్శనం. ఇక సంయుక్త రంగ బ్రహ్మోస్ది దిగ్విజయ మైన గాథ. తేలిక రకం బ్రహ్మోస్ను తయారు చేయడం ప్రస్తుత సమావేశ చర్చనీయాంశాలలో చేరింది. ప్రధాన సైనిక సామగ్రి డిజైన్, తయారీ పరిజ్ఞానం ఒక దేశాని కుండే వజ్ర వైడూర్యాల లాంటివి. ఇది అలమారాలో పెట్టి అమ్మే పరిజ్ఞానం కాదు. అందు కనే, భారత–రష్యాల మధ్య సైనిక సరఫరాలలో ఎంత పటిష్ఠమైన బంధం ఉన్నా డిజైన్ పరిజ్ఞానాన్ని పంచుకోవడమన్నది లేదు.ఆత్మనిర్భరతను వీలైనంత త్వరగా, పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్ళే దృఢ నిశ్చయాన్ని భారత్ కనబరిస్తే పుతిన్ పర్యటన తద నంతర ఫలాలపై ఆశ పెట్టుకోవచ్చు. నిజంగానే, రెండు దేశాలు రక్షణ రంగ పరిశోధన–అభివృద్ధిలో, వస్తూత్పత్తిలో సహకారముంటే మరింత ప్రగతిని సాధించవచ్చు. కానీ, ఈ విషయంలో భారత్ తొలగించుకోవలసిన సాలెగూళ్ళు చాలానే ఉంటాయి.మాస్కోకి కూడా ఢిల్లీతో గాఢమైన సైనిక సహకారం విషయంలో కొన్ని లక్ష్మణ రేఖలున్నాయి. అది బీజింగ్ సందేహాలను కూడా తీర్చవలసి ఉంటుంది. అదే మాదిరిగా, భారత్ కూడా రష్యాతో కలసి అడుగులేయడంలో అమెరికా పెడుతున్న తంపులను గుర్తెరిగి ప్రవర్తించవలసి ఉంటుంది. పుతిన్ పర్యటన ద్వైపాక్షిక స్నేహ సంబంధానికి మెరుగులు దిద్దింది. కానీ, రెండు దేశాలకూ కొత్త సవాళ్ళు కూడా ముందుకొచ్చి నిలుస్తున్నాయి. సి. ఉదయ భాస్కర్,వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ -
సంక్షోభంలో నేపాల్ పార్టీలు
జెన్–జీ అనూహ్యమైన తిరుగుబాటు ఉధృతితో నేపాల్ రాజకీయ పార్టీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయంటే అతిశ యోక్తి కాదు. పార్టీల నాయకత్వం, సిద్ధాంతాలు, జెన్–జీ రేకెత్తించిన ప్రశ్నలు, వారంటే ఇంకా కొనసాగుతున్న భయం – ఇట్లా అనేక విషయాలు ఒక్కుమ్మడిగా తుఫాను వలె కమ్ముకు రావటంతో పార్టీ అగ్రస్థాయి నాయకత్వాలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏమి చేయాలనే స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెన్–జీ ఆందోళన సెప్టెంబర్ ఆరంభంలో జరిగి, మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలలే మిగిలి ఉండగా ఇదీ పరిస్థితి.ఒక్కో పార్టీ... ఒక్కో సమస్యఅన్నింటికన్న పెద్దది అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా తొలగిపోవాలంటూ జాతీయ కౌన్సిల్ సభ్యు లలో 54 శాతం మంది నోటీసు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గగన్ థాపా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తూ, దేవుబా తప్పుకోనట్లయితే పార్టీని చీల్చగలమని హెచ్చరించారు. రెండవ పెద్దది అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ ఎంఎల్) అధ్యక్షుడు, ఉద్యమ కారణంగా పదవీభ్రష్టుడైన ప్రధానమంత్రి కె.పి. ఓలీ రాజీ నామా చేయాలని పట్టుబడుతున్న అసమ్మతి వర్గం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తీరాలని ఒత్తిడి చేసి ఒప్పించింది. మూడవ పెద్దది అయిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఉరఫ్ ప్రచండ, తనంతట తానే రాజీనామా చేసి, పార్టీని సైతం రద్దుపరచి, కొన్ని ఇతర వామ పక్షాలతో ఐక్యమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ను ప్రారంభించారు. దానికి ఆయన సమన్వయకర్త మాత్రమే! ఆ తర్వాతది అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్య క్షుడు, ప్రచండ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండిన రాబీ లమీ ఛానే, ఒక కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలపై అరెస్టయి ఇటీవలే జైలుకు వెళ్లారు. తన పార్టీ స్తబ్ధతలో ఉంది. ప్రచండ తర్వాతి స్థానంలో ఉండి ప్రధానిగా కూడా పనిచేసి, తర్వాత నయాశక్తి పార్టీ ప్రారంభించిన జెఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి, రాచరికం పతనం తర్వాత ప్రజాస్వామిక రాజ్యాంగ రచనకు ఆధ్వర్యం వహించిన డా‘‘ బాబూరాం భట్టరాయ్, తమ పార్టీని రద్దు చేసి, మరికొందరితో కలిసి ప్రగతిశీల్ లోక్ తాంత్రిక్ పార్టీని నెలకొల్పారు. దానికి ఆయన ‘పార్టీ పేట్రన్’ మాత్రమే! రాచరికం తిరిగి రావాలి, లేదా కానిస్టిట్యూషనల్ మోనార్కీ కావాలనే హిందూవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ (ఆర్పీపీ)లో నాయకత్వ సమస్యలైతే తలెత్తలేదుగానీ, జెన్–జీ ఉద్యమ కారణంగా తెలిసీ తెలియని సవాళ్లు ఏవి ఎదురు కాగలవోనన్న అయోమయం వారిని ఆవరించింది.జెన్–జీ నేర్పిన పాఠాలేమిటి?ఇదంతా నాయకత్వాలు, పార్టీ నిర్మాణాల పరిస్థితి కాగా, ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు, లేదా ఇప్పటికే గల పార్టీలలో మరిన్ని చీలికలు, పునరేకీకరణలు, ఐక్య సంఘటనల ఆవిర్భావం జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయదలచుకునే పార్టీల రిజిస్ట్రేషన్ తొలి గడువు ముగిసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆ గడువును పొడిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన విషయం, జెన్–జీ గ్రూపులు కొన్నికొన్ని కలిసి ఇప్పటికే మూడు పార్టీలను ప్రారంభించాయి. మరి రెండింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెన్–జీలంతా కలిసి ఒకే పార్టీగా ఏర్పడక పోవటం పట్ల ప్రజలలో తగినంత నిరాశ కనిపిస్తున్నది.ఆందోళన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అన్నింటికన్న ముఖ్య మైన విషయాలు కొన్నున్నాయి. యువతరం ఆగ్రహం, ఆందోళన రాజకీయ పార్టీలకు ఇచ్చిన షాక్ ఎంత తీవ్రమైనది? దానినిబట్టి వారు తమ సిద్ధాంతాలు, విధానాలు, వ్యక్తిగత వ్యవహరణలలోని లోపాలను చిత్తశుద్ధితో గుర్తించి సమీక్షించుకున్నారా? లేక కొంత కాలానికి అంతా సమసిపోయి పాత పద్ధతులలో వ్యవహారాలు సాగించవచ్చుననుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు తటస్థులైన పరిశీలకులకు తోచటం అట్లుంచి, నేపాల్ సామాజికుల నుంచి కూడా విన్న నేను, వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ప్రశ్నలు వేసి వారి ఆలోచనలను గ్రహించేందుకు ప్రయత్నించాను.వారి సమాధానాలను బట్టి, మిశ్రమాభిప్రాయాలు కలిగాయి. వాస్తవానికి యువతరం లేవనెత్తిన విషయాల తీవ్రత, రెండు రోజుల పాటు అగ్నిపర్వతం వలె బద్దలైన నిరసనల తీవ్రతలను బట్టి పార్టీ లలో మిశ్రమాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ, కనిపించిందేమిటి? కొందరు నిజంగానే తమ వైఫల్యాలను గుర్తించారు. మావోయిస్టుల సాయుధ ఉద్యమం ఫలితంగా రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి, పూర్తి స్థాయిలో ఆధునిక పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 17 సంవత్సరాలుగా పరిపాలనలు సవ్యంగా సాగి ఉంటే, ఈ రోజున జెన్–జీకి గానీ, ప్రజలకు గానీ ఇంతటి అసంతృప్తికి అవ కాశం ఉండేది కాదని ఈ వర్గం అరమరికలు లేకుండా అంగీకరించింది. అవినీతి పోవటం, సమర్థమైన పారదర్శక పాలన, సామాజిక న్యాయంతో కూడిన వేగవంతమైన అభివృద్ధి అనే మూడు తప్పని సరి అనీ, అది జరగాలన్నదే జెన్–జీ తమకు నేర్పిన పాఠమనీ ఈ వర్గం అభిప్రాయపడుతున్నది. వేర్వేరు పార్టీలకు చెందిన వేర్వేరు నాయకుల మాటలు వేరైనా, వారి నుంచి సారాంశం ఇదే!అదే మొండి ధోరణిఇందుకు భిన్నమైన పరిస్థితి కూడా మరొకవైపు గమనించాను. వారు, 2008 నుంచి అభివృద్ధి తగినంత చేశామని లెక్కలు చెప్తు న్నారు. ఆ లెక్కలు నిజమే అయినా సమస్య ఏమంటే, 2008 తర్వాత ప్రజల ఆకాంక్షలకు, చదువులూ, నైపుణ్యాలూ గణనీయంగా పెరుగు తున్న యువతరం అవసరాలకు, నిజాయితీగా పరిపాలిస్తే సాధించ గలిగిన వాటికి పొంతన కుదరటం లేదు. ఇది చాలదన్నట్లు మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీల విచ్చలవిడి అవి నీతి! ఈ రెండవ వర్గం ప్రచారం, జెన్–జీ ఆందోళన వెనుక విదేశీ ఎన్జీఓలు ఉన్నాయని! తమకు గల పార్టీ యంత్రాంగం, డబ్బు బలంతో తిరిగి అధికారానికి రాగలమన్నది వీరి నమ్మకం. ఆందోళ నల వల్ల అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని ఓలీ ఈ ధోరణికి ప్రతినిధి కావటం విశేషం. ఆయన నేర రికార్డు గల వ్యక్తి ఆధ్వర్యాన ప్రైవేట్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు. ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్లో ఏ ఒక్క నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మార్చి ఎన్నికలలో ఏమయేదీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. 2008 నుంచి 17 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారిన తీవ్ర అస్థిరతల రికార్డు ఇప్పటికే ఉండగా, రాగల కాలంలో ఏమి జరగవచ్చునో ఊహించటం కూడా కష్టమే.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
క్షమించండి, తీర్పు అనంగీకారం!
‘తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్’ కేసులో సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యం: తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించ లేదు. వాటిని ఆయన రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా ఆ బిల్లులకు సమ్మతి తెలుపలేదు. మరోసారి పరిశీలించవలసిందిగా కోరుతూ శాసనసభకు తిప్పి పంపనూ లేదు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం–గవర్నర్ మధ్య వివాదానికి దారితీసింది.ఇక్కడ మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి: 1. ఆమోదం పొందని బిల్లుపై సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు చెప్పగలదా? శాసనసభ ఆమోదించి పంపినా గవర్నర్ లేదా రాష్ట్రపతి దానికి సమ్మతి ఇవ్వనప్పుడు అది చట్టం హోదా పొందినట్లేనని భావించ వచ్చా? 2. ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ గవర్నర్ లేదా రాష్ట్రపతిని, ఆర్టికల్ 142 కింద, సంపూర్ణ న్యాయం అనే సూత్రం ప్రాతిపదికగా సుప్రీం కోర్టు బలవంత పెట్టగలదా? 3. శాసన సభ–గవర్నర్ మధ్య వివాదాన్ని పరిష్కరించే అధికారం రాజ్యాంగం సుప్రీం కోర్టుకు దఖలు పరిచిందా?రాజ్యాంగం ఏం చెబుతోంది?ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్ బిల్లును అందుకున్న తరువాత సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదముద్ర వేయాలి లేదా తన వ్యాఖ్యలు జోడించి వెనక్కు పంపాలి లేదా రాష్ట్రపతికి నివేదించాలి. ఒకసారి తిప్పిపంపిన తర్వాత, శాసనసభ ఆ బిల్లును మళ్లీ పంపితే, దానికి ఆమోదముద్ర వేయడం తప్ప గవర్నర్కు మరో మార్గం లేదు. తమిళనాడు విషయంలో బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు, వెనక్కు పంపలేదు. శాసనసభ తనకుతానుగా అదే బిల్లును రెండోసారి ఆమోదించి గవర్నర్కు పంపింది. గవర్నర్ ఎంతకాలం బిల్లును పెండింగులో పెట్టగలరు? రాజ్యాంగం కాలపరిమితి విధించడం లేదు. ‘సాధ్యమైనంత త్వరగా’ తిప్పి పంపాలని మాత్రమే చెబుతోంది. ఒకవేళ బిల్లు ఆమో దించడానికి నిరాకరిస్తే? అలాంటప్పుడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్ లేదా రాష్ట్రపతి మీద చట్టసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. రెండు, ఆ బిల్లును మరోసారి పరిశీలించి ఆమోదించి పంపడం. తమిళనాడు శాసనసభ ఈ రెండో మార్గం ఎంచుకుంది. అది ప్రారంభించిన ఈ రాజ్యాంగ సంప్రదాయానికి రాజ్యాంగబద్ధత ఉందా? సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చర్చించలేదు. మరొక పరిస్థితిని పరిశీలిద్దాం. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం నివేదించినప్పుడు, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయకుండా నిలిపివేస్తే, రాష్ట్ర శాసనసభ ఏం చేయాలి? రాష్ట్రపతి నుండి ఎలాంటి సందేశం రాకపోతే, శాసనసభ స్వయంగా బిల్లును పున:పరిశీలించి రెండోసారి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. బిల్లు రెండోసారి సభ ఆమోదం పొందినప్పుడు, ఆమోద ముద్ర వేయడం తప్ప రాష్ట్రపతికి మరో మార్గం లేదు. ఆర్టికల్ 143 కింద, రాష్ట్రపతి సుప్రీం కోర్టును అడిగిన ప్రశ్న: రాష్ట్రపతి ఎంతకాలం బిల్లును నిలిపివేయవచ్చు? దీనికి సమాధానంగా ఒక సంప్రదా యాన్ని నెలకొల్పే అవకాశం ఇదే ఆర్టికల్ కల్పిస్తోంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో మార్గదర్శక న్యాయస్థానంగా వ్యవహరించకుండా, దేశానికి సూపర్ హీరోగా, బాస్గా వ్యవహరించింది.ప్రస్తుత పరిస్థితిప్రస్తుత కేసులో రాష్ట్రపతి బిల్లును తిప్పి పంపలేదు, ఆమోద ముద్రా వేయలేదు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఇవ్వకపోయినా, లేదా సందేశంతో వెనక్కు పంపకపోయినా, శాసనసభకు ఉన్న ప్రత్యామ్నాయం ఆ బిల్లును తిరిగి పరిశీలించడం. అలా రాష్ట్రపతి సలహా లేకుండా బిల్లును పున:పరిశీలించి ఆమోదిస్తే, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయడం తప్ప మరోలా చేయలేరు. భవిష్య త్తులో శాసనసభకు రాష్ట్రపతికి మధ్య విభేదాలు వస్తాయని రాజ్యాంగం ఊహించలేదు.కానీ సుప్రీం కోర్టు తీర్పు వ్యవస్థల అధికార పరిధి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే ప్రధాన సమస్య. ఆర్టికల్ 145 ప్రకారం, సుప్రీం కోర్టుకు తన కార్యకలాపాలకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం ఉంది. అలాగే, ఆర్టికల్స్ 118, 208 ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు తమ సభావ్యవహారాల నిర్వహణకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం కలిగి ఉన్నాయి. ఆర్టికల్స్ 122, 212 ప్రకారం సభా కార్యకలాపాలను కోర్టులో ప్రశ్నించే వీల్లేదు. రాష్ట్రం, కేంద్రం నడుమ వివాదమా?భారత రాజ్యాంగం శాసనసభ, గవర్నర్ మధ్య సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించింది. అయితే, ఆచరణలో అనేక సందిగ్ధతలు ఉత్పన్నమవుతున్నాయి. బిల్లులు స్పీకర్ ద్వారా మాత్రమే గవర్నర్కు చేరతాయి. గవర్నర్ సమ్మతి పొందే వరకు బిల్లు శాసనసభ ఆస్తిగా ఉంటుంది. ఆమోదముద్ర పడిన తర్వాత అది చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదముద్ర పొందనంత వరకు ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు.ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభ ప్రక్రియలు న్యాయస్థాన అధికార పరిధిలోకి రావు. అదే సమయంలో, ఆర్టికల్స్ 32, 131 ప్రకారం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదా రాష్ట్రం–కేంద్రం నడుమ వివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి. గవర్నర్ లేదా రాష్టపతి బిల్లుపై సంతకం చేయకపోవడం రాష్ట్రం–కేంద్రం మధ్య వివాదం అవుతుందా? అలా అయ్యేట్లయితే అది సుప్రీం పరిధిలోకి వస్తుంది. సమస్య ఏమిటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశాన్ని పరిశీలించలేదు. ఈ ప్రతిష్టంభనను అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, శాసనసభ బిల్లును రెండోసారి ఆమో దించడం. దీనివల్ల గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా తప్పించు కోలేరు. రెండవది, ఆర్టికల్ 156(1) ప్రకారం, రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో ఉంటారు. అసెంబ్లీ తీర్మానం చేసి, గవర్నర్ను వెనక్కి పిలిపించవలసిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఈ మార్గాన్ని ఉపయోగించకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఉత్పన్నమైంది.గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసినప్పుడు, ఆయన తన అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించినట్లే. అందువల్ల రాష్ట్రపతి, గవర్నర్ ఒకే గుర్తింపు కలిగిన వారవుతారు. ఈ ముఖ్యాంశాన్ని సుప్రీం కోర్టు పరిశీలించలేదు. ఆర్టికల్ 12 ప్రకారం ‘స్టేట్’ అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ; కేంద్రంలో కేంద్రప్రభుత్వం, పార్లమెంటు అవుతాయి. కాబట్టి, రాష్టం గవర్నర్పై పిటిషన్ వేయడం అంటే తన మీద తనే కేసు వేసుకున్నట్లు అవుతుంది. ఇదెలా సాధ్యం? రాష్ట్రంలోని ఒక విభాగం మరొక విభాగానికి వ్యతి రేకంగా రిట్ పిటిషన్ను ఎలా దాఖలు చేయగలదో తేల్చడంలో అత్యున్నత న్యాయస్థానం విఫలమైంది. ఈ కారణాల వల్లనే నేను ఆ తీర్పుతో ఏకీభవించడం లేదు.ప్రకాశ్ అంబేడ్కర్వ్యాసకర్త లోక్సభ, రాజ్యసభ మాజీ సభ్యులు, అడ్వకేట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
మహాకవి గురజాడ మార్గం
వెయ్యేళ్ళుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి, మరో వెయ్యేళ్ళ ముందుచూపుతో రచనలు చేసి సంఘ సంస్కరణ కావించిన మహా కవి గురజాడ వేంకట అప్పారావు. బౌద్ధాన్ని గురజాడ విశ్వసించారు. బుద్ధిజం ఏనాడైతే మన భారతదేశం ఎల్లలు దాటి వెళ్ళిందో ఆనాటి నుండి మన దేశం వెనుకబడిందన్నారు. దేవుళ్ళూ దయ్యా లని పూజలు చేస్తాం. సాటి మనిషికి సాయపడం. అదే కదా మూర్ఖత్వం. మనకు భౌతిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. వెనుకబడటానికి మూలం మూఢవిశ్వాసం. ప్రపంచ దేశాలు హేతు వాద దృక్పథంతో విజ్ఞాన శాస్త్ర ఫలాలు పొందుతుంటే మన దేశం నమ్మకాలు, ఆచారాలు అంటూ అనాలోచితంగా వెనుకబడిపోతోందని ఆయన ఉద్దేశం. రవి కాంచని చోటు కవిగాంచునన్నారు. ఆ కవి గురజాడ.సమాజం ఆనాడు అవినీతి క్రిములమయం. మానవత్వం మంటగలిసిపోయింది. బైరాగులు, పెత్తందార్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. దానికి తోడు పురుషాహంకారం ప్రజ్వరిల్లింది. కన్యాశుల్కం అన్న పేరుతో పసిపిల్లలను పశువుల కన్నా హీనంగా విక్రయించడం, కాటికి కాళ్ళు చాచుకుని ఉన్న ముసలివారికి ఇచ్చి వివాహం చేయడం, వితంతువుల దౌర్భాగ్యం, దొంగ జాతకాలు, సాక్ష్యాలు, గిరీశం లాటి గిర్రలు, రామప్పంతుల లాంటి జాకాల్స్, లుబ్ధావధానులు లాంటి లోభులు, అగ్నిహోత్రావధానుల్లాంటి మూర్ఖులు సమాజానికి పట్టిన చీడపీడలు. గురజాడ విద్యా ప్రాముఖ్యాన్ని తన రచనల ద్వారా నొక్కి చెప్పారు. విద్య నేర్వడం వలన మధురవాణి సానుల్లో సంసారిగా భాసించింది. ‘దిద్దుబాటు’ కథలో చదువుకున్న కమలిని తన భర్త గోపాలరావుని లేఖ ద్వారా మార్చుతుంది. ఆంగ్లేయులు వారి రాజ్యాన్ని సుస్థిరం చేసు కోవడం కోసం ఆంగ్ల భాషలో విద్యను ప్రవేశ పెట్టారు. స్త్రీల కోసం కోపగృహం, మైల గదులు ఉండేవి. ‘మైలగియిలా ఇంగ్లీషు వారికి లక్ష్యం లేదంటాడు’ గిరీశం. సాంఘిక చైతన్యం, సంఘ సంస్కరణ అవసరం అని గురజాడ ఆశించారు. ‘వెనుక చూసిన కార్యమేమోయి, మంచి గతమున కొంచె మేనోయి, మందగించక ముందుకడుగేయి వెనక బడితే వెనకే నోయీ’ అన్నారు. మతం ఏదైనా బాధ లేదు, మనుషులు ఒక్కటిగా ఉండాలని ఉప దేశించారు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలచును అంటారు గురజాడ. అలాగే సజీవ భాష, నాల్క మీద నర్తించే భాషలో నా కలం బలంగా పలుకుతుంది అన్నారు. ‘దేశ మును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచు మన్నా’ అన్న కవి. ఇంకా ‘గుడిలో రాతి దేవుని కంటే మనతో ఉన్న మనిషిని ప్రేమించాలి’ అన్నారు. ఈ రెండు వాక్యాల సారమే గురజాడ వారి రచనల సందేశం. – డా‘‘ జక్కు రామకృష్ణ ‘ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, విజయనగరం -
అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం
ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ రాక ఒక పాత సంగతిని గుర్తుకు తెస్తోంది. దాదాపు ఐదు న్నర దశాబ్దాల క్రితం భారతదేశంతో ‘స్నేహ ఒడంబడిక’ కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో చేతులు కలిపేందుకు అప్పటి సోవియట్ యూనియన్ నాయకులు ఇలాగే ఢిల్లీ వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో మారణ హోమాన్ని అంత మొందించే ప్రత్యక్ష ప్రమేయానికి ముందు అది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం రెండు అగ్ర రాజ్యాల మధ్యన చీలిపోయింది. కానీ, ఇపుడు అంతర్జాతీయ వ్యవస్థ ఏ దిశగా సాగుతోందో తెలియని ఒక కొత్త స్థితిలోకి జారు కుంది. అమెరికా శక్తిమంతమైనదిగానే కొనసాగుతోంది కానీ, దాన్ని అంతగా నమ్మడానికి లేదనే అభిప్రాయం పాదుకుంది. చైనా శిఖరా రోహణ ఇతర ప్రవర్ధమాన దేశాలలో ఆందోళనను పెంచుతోంది. ఐరోపా మరింత స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు తారట్లాడు తోంది. గాలివాటుగా ఉన్న భారత–రష్యాలు అవసరార్థమే అయిన ప్పటికీ, వ్యూహాత్మక పొందికను పునరుద్ధరించుకుంటున్నాయి. ఒకరికొకరు నిలబడి...అమెరికా నిలకడలేనితనంతో దానిపై చాలా దేశాలకు నమ్మకం కొరవడింది. దానికి తోడు అది ఎక్కడెక్కడో సుదీర్ఘ కాలం యుద్ధా లను కొనసాగించి, చివరకు అక్కడ పరిస్థితులు కుదుటపడక పోయినా నిష్క్రమిస్తూ వచ్చింది. అమెరికా లోపల కూడా పరి స్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తాజాగా, సుంకాల విష యంలో అది అనుసరిస్తున్న తలతిక్క ధోరణి అందుకు ఉదాహరణ. ఇదంతా ప్రపంచంలో ఒక అస్థిర వాతావర ణానికి దారితీసింది. చైనా తన వంతు ఆకర్షణలను, భయాలను రెండింటినీ సృష్టించు కుంది. క్రమేపీ అది దృఢ వైఖరిని చాటడం పెరగడంతో, దాని ప్రత్య ర్థులు, మిత్రులు కూడా దానిపై చిరకాల అభిప్రాయాలను పునరా లోచించుకోవడం ప్రారంభించాయి. ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టిన తర్వాత, చైనాతో రష్యా వ్యూహాత్మక ఏకీకరణ బలపడిందికానీ, సంబంధాలు అసమంగానే ఉన్నాయి. మాస్కో వ్యూహాత్మక ఆలోచనల ప్రకారం, దీర్ఘకాలంలో తనకు బెడదగా పరిణమించగల శక్తి అమెరికా కన్నా చైనాకే ఉంది. మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని కనబరచేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, సైబీరియాకు సంబంధించి రష్యా పడుతున్న ఆందోళన, చైనాకు తాను జూనియర్ భాగస్వామిగా మారవలసి వస్తుందే మోననే భయం క్రెమ్లిన్ను మరోసారి భారతదేశానికి సన్నిహితం చేస్తున్నాయి. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుందని కాదు. చైనాపై తాను ఎక్కువ ఆధారపడకుండా భారత్ తనకొక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని రష్యా ఆలోచన. స్నేహమే కాదు, వ్యూహాత్మకం కూడా!సోవియట్ యూనియన్ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుకుంటూ వచ్చాయి. కశ్మీర్పై భారత్ ఇరకాటంలో పడకుండా ఐరాసలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. దానికి తగ్గట్లుగానే, ఉక్రెయిన్పై యుద్ధం పర్యవసానంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదేపదే కోరినా భారత్ తలొగ్గలేదు. ఈ విషయమై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్ ఖాతరు చేయలేదు. దీనికి రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధం ఒక్కటే కారణం కాదు. ఈ బంధాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలకు తమవైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.దానికి తోడు, కొన్నేళ్ళుగా ఎన్నడూ చూడనంత అస్థిర పరిస్థి తులు ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ ఒక్క దేశమూ పరిస్థితులను శాసించగలిగిన స్థితిలో లేదు. అగ్ర రాజ్యంగా నిలవాలని కలలు కంటున్న దేశపు అడుగులకు మడుగు లొత్తడానికి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో చాలా మధ్య స్థాయి దేశాలు సిద్ధంగా లేవు. తమ వ్యూహాత్మక స్వయం ప్రతి పత్తిని కాపాడుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారత – రష్యాలకు ఆ సెంటిమెంట్లో ఒక ఉమ్మడి ప్రయోజనం కనిపిస్తోంది. పరస్పర రక్షణభారత్–రష్యాల మధ్య స్నేహ సంబంధాలకు రక్షణ అంశమే ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో పరస్పర సహ కారానికి సంబంధించిన ఒప్పందం కుదరబోతోంది. అది కార్య రూపం ధరిస్తే ఇరు దేశాలు సైనిక స్థావరాలను, రేవులను, వైమానిక క్షేత్రాలను పరస్పరం వినియోగించుకోవచ్చు. దీంతో ఇండో–పసిఫిక్ నుంచి ఆర్కిటిక్ వరకు కార్యకలాపాలు నిర్వహించగలిగినదిగా భారత్ తయారవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రష్యా భౌతికంగా కాలు మోపేందుకు వీలు చిక్కుతుంది. ప్రపంచంలో సగం వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ ప్రాంతమే జీవనాడి. భారత–రష్యా అధికారులు అత్యంత ఆశావహమైన సైనిక– సాంకేతిక ప్యాకేజీకి రూపుదిద్దుతున్నారు. దీనివల్ల ఎస్–400 గగన రక్షణ వ్యవస్థలను మరిన్ని చోట్ల ఏర్పాట్లు చేయవచ్చు. సు–30 ఎంకెఐ యుద్ధ విమానాలను భారత్ చాలా ఎక్కువగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరింత దూరం వెళ్ళగలిగినవిగా బ్రహ్మోస్ క్షిపణు లను ఉన్నతీకరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. సు–57ఇ స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సంబంధించి తాత్కాలిక చర్చలైనా మొదలయ్యేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక భారత్–రష్యా స్నేహంలో అణు సహకారం మరో అంశం. బృహత్తర వీవీఈఆర్–1200 రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలతో రోసాటమ్, భారత అణు శక్తి సంస్థలు ముందుకు ఉరకాలని చూస్తున్నాయి. అలాగే, కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ల అన్వేషణ రెండు దేశాల మధ్య సంబంధాలను గుణాత్మకంగా మార్చివేయవచ్చు. వీటి అంత ర్జాతీయ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉంది. ఖనిజాలు సుసంపన్నంగా ఉన్న రష్యా తూర్పు దూర ప్రాంతాలలో సంయుక్త రంగంలో పనులు సాగించాలని భారత్ ఎదురు చూస్తోంది. భారత వైజ్ఞానిక సంస్థలు, రష్యా పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాలు ఏర్పడితే దేశీయంగా రేర్–ఎర్త్ ప్రాసెసింగ్కు, పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీకి రంగం సిద్ధమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యున్నత ఎలక్ట్రానిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల వాల్యూ చైన్ను నియంత్రించగల పరిశ్రమలు రెండు దేశాలకు సొంతమవుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 65–66 బిలియన్ డాలర్లుంది. 2030 నాటికి దీన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమయ్యేది కేవలం పొత్తు కాదు. స్నేహ సంబంధాలు ఏవీ దెబ్బతిని లేవు కనుక ఇండో–సోవియట్ మైత్రి పునరుద్ధరణ అనడానికి కూడా లేదు. ఇది మరింత ఆచితూచి వేస్తున్న అడుగు కాబోతోంది. మరింత ఆచరణాత్మక దృక్పథం కన పడబోతోంది. అధికార కేంద్రాలు మసకబారి, సమీకరణాలు అను క్షణం మారిపోతున్న వర్తమాన ప్రపంచంలో అంతకన్నా ఇంకేం కావాలి!జయంత రాయ్ చౌధురీవ్యాసకర్త పీటీఐ వార్తా సంస్థ తూర్పు ప్రాంత మాజీ అధిపతి -
సింగపూర్ చూపుతున్న మార్గం
ఢిల్లీలో ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన ఉగ్ర దాడి, భారత్ ఎదుర్కొంటున్న ఆంతరంగిక భద్రతా సవాళ్ళపైకి మరోసారి దృష్టిని మరల్చింది. ఈ దాడిలో 13 మంది చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీలో హైకోర్టు వద్ద 2011లో జరిగిన బాంబు పేలుడు తర్వాత, అంతటి భీతావహమైన దాడి చోటుచేసుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. ముంబయిలో 2008 నవంబర్ 26న భారత్ పెద్ద ఉగ్ర దాడిని చవిచూసింది. ఆ దాడిలో పాల్గొన్నవారిలో ఒకడైన కసబ్కు పాకిస్తాన్తో ఉన్న సంబంధం స్పష్టంగా వెల్లడైంది. వైట్ కాలర్ ఉగ్రవాదంఅయితే, ఢిల్లీ ఘటన ఇస్లామీయ ర్యాడికలైజేషన్లో వచ్చిన పెద్ద మార్పునకు అద్దం పడుతోందని చెబుతున్నారు. అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పాకింది. వృత్తి నిపుణులు (ఈ కేసులో డాక్టర్లు) తమకు తాము ఉగ్రవాదులుగా మారుతున్నారు. వారు డిజిటల్ సాధనాలను, సంస్థాపరమైన సౌలభ్యాన్ని వినియో గించుకుంటున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తదనంతర దర్యాప్తులో అనేక సంగతులు వెల్లడయ్యాయి. ఊహకందని ఉగ్ర సాలెగూడు జమ్ము–కశ్మీర్, హరియాణా, ఉత్తర ప్రదేశ్లను మించి విస్తరించినట్లు తేలింది. ఒక వైట్–కాలర్ ఉగ్ర వ్యవస్థ బయటపడింది. దానికి పాకిస్తాన్లోని జైష్–ఏ–మహమ్మద్ (జెమ్), అన్సార్ గజవత్ ఉల్– హింద్తో సంబంధాలున్నాయి. వారు అనుసరించిన ఎత్తుగడలు హమాస్ నుంచి స్ఫూర్తి పొందినవిగా కనిపిస్తున్నాయని కూడా ప్రాథ మిక నివేదికలు సూచించాయి. విదేశీ సూత్రధారుల (ఉదాహరణకు తుర్కియేలోని ‘ఉకాస’) ఆదేశాలను పాటించినట్లు కూడా వెల్లడవు తోంది. దానికి వారు సెషన్, టెలిగ్రామ్ వంటి యాప్లను వాడు కున్నారు. సోదాలలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు, డిటొ నేటర్లు, అసాల్ట్ రైఫిళ్ళు, (42 వీడియోలతో సహా) ప్రాపగాండా సామగ్రి దొరికాయి. ‘జెమ్’ వంటి ఉగ్ర తండాలు, వాటి అనుబంధ వర్గాలు స్లీపర్ సెల్స్ సృష్టించేందుకు, విద్యావంతులైన యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అందుకు సామాజిక మాధ్యమా లను వాడుకుంటున్నాయని తేటతెల్లమైంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితులు, అశాంతి ఈ వ్యవహారాలలో ఒక వారధిగా పనిచేయడానికి అవకాశం కల్పించి ఉండవచ్చునని కూడా అను మానిస్తున్నారు.సింగపూర్కూ తప్పని సంకటంఇటీవలి నా సింగపూర్ సందర్శన సందర్భంగా నాకు కొన్ని నిగూఢమైన అంశాలు తెలిసి వచ్చాయి. సోషల్ మీడియా, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజె¯Œ ్స ఆధారిత ఇస్లామీయ ర్యాడికలైజేషన్ విసురు తున్న సవాల్, అది ఆ నగర రాజ్యంలోని యువ వర్గాలపై చూపు తున్న ప్రభావం దిగ్భ్రమకు గురిచేశాయి.సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్భంధంలోకి తీసుకుంటున్న యువ ర్యాడికల్ సింగపూరియన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోందని మరిన్ని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు జాగు చేయకుండా వెంటనే నివారణ చర్యలకు దిగడం వల్ల చాలా ప్రమాదకర ఘటనలు తప్పిపోయాయి. సింగపూర్లో తుపాకీ నిరోధక చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటిని తప్పించుకుని ఒక ఆయుధాన్ని తయారు చేసేందుకు, 17 ఏళ్ళ ఓ యువకుడు 3–డి ప్రింటింగ్ను వినియోగించుకునే ప్రణాళికలో ఉన్నాడు. కానీ, ఆంతరంగిక భద్రతా విభాగం (ఐఎస్డీ) ఈ ఏడాది మార్చిలో అతడిని నిర్బంధంలోకి తీసుకోగలిగింది. అతడి నుంచి రాబట్టిన విషయాలు మరింత ఆశ్చర్యం గొలిపాయి. అతడు ఆ ఆయుధాన్ని ఉపయోగించి స్థానిక మసీదు ఒక దానిలో కనీసం 100 మందిని చంపేసి, తనను తాను కాల్చుకుని చనిపోయే ఆలోచనలో ఉన్నాడు. దీనికి ముందు, ఫిబ్రవరి నెలలో, ఐఎస్డీకి ఓ 15 ఏళ్ళ అమ్మాయిపై అనుమానం కలిగింది. ఆమె కదలికలపై నిఘా పెట్టి, తర్వాత నిర్భంధంలోకి తీసుకుంది. ఆంతరంగిక భద్రతా చట్టం కింద సింగపూర్లో ఓ అమ్మాయిని అరెస్టు చేయడం అదే మొదటి సారి. ఆమె ‘ఐసిస్’ సభ్యుడిని పెళ్ళి చేసుకుని, దానికి అనుకూ లమైన కుటుంబాన్ని పెంచాలని భావిస్తోంది. సిరియాలో పోరాటంలోకి దిగి, అమర వీరురాలిగా మారాలని కలలు గంటోంది. అరికట్టే చర్యలు ఈ పెడ ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు సింగపూర్ ప్రభుత్వం రెలిజియస్ రీహ్యాబిలిటేషన్ గ్రూప్ (ఆర్.ఆర్.జి.) పేరుతో 2005లోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవస్థీకృత ఉగ్ర తండాల సభ్యుల నుంచి పొంచి ఉన్న బెడదను ఎదుర్కోవడాన్ని అది మొదట లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా జెమా ఇస్లామియా (జేఐ) నుంచి ఉన్న ముప్పును నివారించే పనిలోపడింది. కాలక్రమంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఆర్.ఆర్.జి. తన కార్యాచరణను మార్చుకుంటూ వచ్చింది. అసలు మతం ఉద్దేశాలు, ఆశయాల గురించి యువతకు సక్రమ అవగాహన కల్పించే పనిని ప్రశంసనీయమైన రీతిలో కొనసాగిస్తూ వచ్చింది. యువతలో కొందరు ఆవేశం, నిరాశా నిస్పృహలతో హింసకు దిగడాన్ని గమనించి అది పరిష్కారం కాదని పరివర్తనకు దారి చూపింది. అది సత్ఫలితాలను ఇచ్చినట్లు ఒక విస్తృత సర్వేలో తేలింది. సింగపూర్ ఐ.ఎస్.ఏ. కింద Výæడచిన దశాబ్దంలో కేవలం 17 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. ముఖ్యంగా, ఆ నగర రాజ్యంలో పెద్ద ఉగ్ర ఘటన ఏదీ చోటుచేసుకోలేదు. అయితే, సింగపూర్ ముస్లిం వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్ ఫైజల్ ఇబ్రహీం తాజా ర్యాడికలై జేషన్ను గమనించకపోలేదు. ‘‘దేశాల మధ్య అనుసంధానకత్వం పెరిగిపోతున్న ప్రపంచంలో ఉగ్ర సామగ్రి తేలిగ్గా అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ సాధనాలలో సైద్ధాంతిక ప్రబోధాలు ప్రతిధ్వని స్తున్నాయి. యువత ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడుపు తూండటం వల్ల ర్యాడికలైజేషన్కు వెసులుబాటు ఏర్పడడమే కాక, ఆ ప్రక్రియ వేగం పెరుగుతోంది’’ అన్నారు.అయితే, భారతదేశాన్ని ఆ నగర రాజ్యంతో పోల్చుకోలేం. సింగపూర్ జనాభా అరవై లక్షలు మాత్రమే. భారత్ జనాభా ఇంచు మించు 150 కోట్లు. వైవిధ్యంతో కూడిన భారతీయులు దాదాపు 800 జిల్లాలలో విస్తరించి ఉన్నారు. వివిధ మతాలు, భాషలు, కులాలకు చెందిన వారి సామాజిక–సాంస్కృతిక మిశ్రమత్వం మరింత జటిలమైంది. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఏఐ ఆధారిత ర్యాడికలైజేషన్ తీరుతెన్నులకు సరిహద్దులు లేవు. సింగ పూర్ ఆర్.ఆర్.జి. నమూనాను సమీక్షించి, భారతదేశానికి తగ్గ విరుగుడు కార్యక్రమాలను రూపొందించుకోవచ్చు.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
రైతుల హక్కుల మాటేమిటి?
దాదాపు రెండు దశాబ్దాల చర్చలు, కోర్టు కేసులు, విత్తన వైఫల్యాలు, పెరుగుతున్న సాగు వ్యయాల తర్వాత, భారత దేశం మరోసారి తన విత్తన చట్టాలను మార్చే దశకు వచ్చింది. 2004, 2019 ముసాయిదాల తర్వాత వచ్చిన విత్తనాల ముసాయిదా బిల్లు 2025 ఎన్నో ఆశలను రేకెత్తించింది. నేడు రైతులు ఎదుర్కొంటున్న అస్థిర విత్తన నాణ్యత, ఊగిసలాట ధరలు, పెరుగుతున్న కార్పొరేట్ ఆధి పత్యం వంటి భారాలను దృష్టిలో పెట్టుకుని రైతులను బలోపేతం చేస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ బిల్లులో ‘వ్యాపార సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)కు ఉన్న ప్రాధాన్యం, ‘వ్యవసాయ సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ ఫార్మింగ్)కు లేదు.నష్టపోయిన రైతుల్ని వదిలేసి...బిల్లులోని ఉద్దేశ్య వాక్యం దీని అసలు వైఖరిని తేటతెల్లంచేస్తోంది. ఇది ‘నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరాను సులభ తరం చేయుటకు’ అని చెబుతుందే తప్ప, రైతుల హక్కులు, పంట నష్టపరిహారం, ధరల నియంత్రణ వంటి అంశాలపై ఒక్క మాటా లేదు. ఇది ముసాయిదాలో లోపం కాదు. ఇది చట్టం ఏ ధోరణిలో ఉన్నదో స్పష్టంగా తెలియజెబుతోంది. అసలు బిల్లే పరిశ్రమ – వాణిజ్య చట్టంలా కనిపిస్తుంది తప్ప, రైతుల హక్కుల చట్టంలా కాదు! నాణ్యత నియంత్రణ బలోపేతం అవుతుందనీ, కేంద్రీకృత విత్తన ట్రేసబిలిటీ పోర్టల్ వస్తుందనీ బిల్లు మద్దతుదారులు చెబు తున్నారు. క్యూఆర్ కోడ్లు, డిజిటల్ ట్రేసింగ్– ఇవన్నీ కాగితంపై బానే కనబడతాయి. కానీ ఇవి న్యాయం సాధించడానికి సరిపోవు. ట్రేసబిలిటీ డేటా ఆధారంగా చెడు బ్యాచ్లు ఆటోమేటిక్గా వెనక్కి పోతాయనీ, పునరావృత దోషులను బ్లాక్ లిస్ట్లో పెడతారనీ, రైతులకు నష్టపరిహారం స్వయంచాలకంగా అందుతుందనీ బిల్లు ఎక్కడా నిర్దేశించలేదు.విత్తనాల ముసాయిదా బిల్లులోని అత్యంత పెద్ద లోపం? రైతులకు చట్టబద్ధ, కాలపరిమితి ఉన్న నష్టపరిహారం వ్యవస్థ లేకపోవడం! తేలిక, చిన్న, పెద్ద తప్పులకు భారీ జరిమానాలు, జైలు శిక్ష వరకూ బిల్లు నిర్దేశిస్తోంది. కానీ ఆ జరిమానాలు రైతులకు కలిగిన నష్టాలను భర్తీ చేయలేవు. పాత, నాసిరకం, నకిలీ విత్తనం వల్ల పంటనష్టం జరిగిన రైతు, ఇంకా వినియోగదారుల కోర్టులకే వెళ్లాలి; సాక్ష్యాధారాలు సమర్పించాలి; సంవత్సరాల తరబడి కేసును లాగాలి. చిన్న రైతులకు ఇది సాధ్యం కాని వ్యవస్థ.ధరల నియంత్రణపై చేతులెత్తేసి...ధర నియంత్రణ విషయంలో కూడా బిల్లు బలహీనంగానే ఉంది. సెక్షన్ 22 ప్రకారం ధరలను కేవలం ‘అత్యవసర పరిస్థితుల్లో’ – అసాధారణ పెరుగుదల, కొరత, ఏకాధిపత్య ధోరణి సమయాల్లో మాత్రమే నియంత్రించవచ్చు. దీని అర్థం: సాధారణ పరిస్థితుల్లో విత్తన ధరలపై ప్రభుత్వం తన చేతులు దులుపుకొంటుంది. గతంలో రాష్ట్రాలు అత్యవసర ఉత్పత్తుల చట్టం కింద బీటీ కాటన్ ధరలు, రాయల్టీలను నియంత్రించిన చట్టపరమైన హక్కులు ఇప్పుడు క్షీణి స్తాయి. విత్తన మార్కెట్ ఇప్పటికే కొద్ది కంపెనీల చేతుల్లో ఉండగా, ఈ బలహీన నియంత్రణ రైతులపై మరింత భారాన్ని మోపుతుంది. ఇంకో ప్రధాన సమస్య– ఈ బిల్లు కేంద్రాధిపత్యాన్ని బలపరచడం, రాష్ట్రాల హక్కులను బలహీన పరచటం! సెక్షన్ 17(8)లో సూచించిన ‘కేంద్ర అక్రెడిటేషన్ వ్యవస్థ’ వల్ల, ఒకసారి కేంద్రం నుండి అక్రెడిటేషన్ పొందిన కంపెనీలు అన్ని రాష్ట్రాల్లో ఆటోమే టిక్గా నమోదు అయినట్లే! రాష్ట్రాలు సాంకేతిక, ఆర్థిక, వసతి కారణాల మీద ఆ కంపెనీలను నిరాకరించలేవు. సెక్షన్లు 38, 41తో కలిపి చూస్తే, ఈ బిల్లు రాష్ట్రాల విత్తన పాలనా హక్కులను దాదాపుగా తొలగిస్తుంది.వెరైటీ ట్రయల్స్, సర్టిఫికేషన్లో విదేశీ సంస్థలను అనుమతించే నిబంధనలు దీనికంటే ప్రమాదకరమైనవి. ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థానిక శాస్త్రీయ పరీక్షలను పక్కన పెట్టి, విదేశీ ట్రయల్ డేటాకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత వాతావరణానికి సరిపోని వెరైటీలు వేగంగా మార్కెట్లోకి రావచ్చు. ఇది విత్తన స్వావ లంబనకు ముప్పు. జన్యుమార్పిడి పంటలు (జీఎం) లేదా ‘ప్రొప్రై టరీ హైబ్రిడ్స్’ నిర్బంధం లేకుండా ప్రవేశించే పరిస్థితి వస్తుంది. కమ్యూనిటీ విత్తన వ్యవస్థలు, ఇప్పటికీ అనేక పంటలలో ప్రధాన విత్తన వనరుల గురించి బిల్లులో కేవలం ప్రస్తావన స్థాయిలోనే చూపారు. రైతు–బ్రీడర్ల హక్కులు, ఎఫ్పీఓలు చేసే స్థానిక విత్తన వ్యాపారం, కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు–వీటిని బలపరచడంలో బిల్లు పూర్తిగా విఫలమైంది. కాంట్రాక్ట్ ఆధారంగా విత్తనాలు ఉత్పత్తి చేసే విత్తన రైతుల హక్కులను కూడా పూర్తిగా పట్టించుకోలేదు.పాలనా నిర్మాణం అంతా కూడా కేంద్రీకృతమైపోయింది. రైతుల ప్రతినిధులు సెంట్రల్ కమిటీలో కొన్ని రొటేటింగ్ సీట్లు పొందినా, ఎన్ఫోర్స్మెంట్ లేదా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ వ్యవస్థల్లో వారికి ప్రత్యక్ష పాత్ర లేదు. దీని వల్ల పెద్ద కంపెనీలు వ్యవస్థను సులభంగా తమ వైపు తిప్పుకోగలవు. చిన్న డీలర్లు, చిన్న కంపెనీలు మాత్రమే నియంత్రణ బరువును మోస్తాయి.మరి బిల్లు ఎలా ఉండాలి?నిజమైన రైతు కేంద్రీకృత విత్తన చట్టం ఎలా ఉండాలంటే:1. నష్ట పరిహారం ఆటోమేటిక్ కాల పరిమితితో, పంట నష్టానికి అనుసంధానంగా ఉండాలి. కంపెనీల నుంచే సీడ్ లయబిలిటీ ఫండ్ ఏర్పడాలి. 2. విత్తన ధరలు, రాయల్టీలను శాశ్వతంగా నియంత్రించే స్వతంత్ర సంస్థ ఉండాలి. అందులో రైతులు, రాష్ట్రాలు, శాస్త్రవేత్త లకు భాగస్వామ్యం ఉండాలి. 3. స్థానిక అవసరాల ప్రకారం విత్తన రకాలను అనుమతించడానికి/నిరాకరించడానికి రాష్ట్రాలకు పూర్ణ అధికారం ఉండాలి. 4. రైతు బ్రీడర్లను, కమ్యూనిటీ సీడ్ వ్యవస్థలను బలపరచాలి. 5. సీడ్ ప్రొడ్యూసర్ రైతులకు న్యాయమైన కాంట్రా క్టులు, కచ్చితమైన చెల్లింపులు, రక్షణ ఇవ్వాలి. 6. లెసెన్సింగ్, ట్రేస బిలిటీ రెండూ తప్పనిసరి కావాలి. 7. జెర్మినేషన్, పేరెంటేజ్, రాయల్టీ, రిజిస్ట్రేషన్ వివరాలపై పూర్తి పారదర్శకత ఉండాలి.8. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్’ చట్టంలోని రైతుల హక్కులు బలపడాలి తప్ప బలహీనపడకూడదు. ‘విత్తనాల బిల్లు 2025’ భారత విత్తన వ్యవస్థను సమానత్వం, ప్రతిస్పందనశీలత, స్వావలంబన దిశగా మలిచే అవకాశం. కానీ బిల్లు రైతుల రక్షణ కంటే వ్యాపార నిర్వహణ సులభతరంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే, ఆ అవకాశం వృథా అవుతుంది. బిల్లుకు తుది రూపం దిద్దేముందు రైతు సంఘాలు, రాష్ట్రాలు, శాస్త్ర సమాజం, ప్రజా పరిశోధనా సంస్థలతో కేంద్రం అర్థవంతమైన సంప్రదింపులు జరపాలి. విత్తనం వేస్తున్న రైతు ప్రమాదం భరించాల్సిన చివరి వ్యక్తి కాకుండా ఉండేలా చట్టాన్ని పునర్నిర్మించాలి. డా. జి.వి.రామాంజనేయులు వ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అంతిమంగా రష్యాకు మేలు...
రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని విరమించేందుకు 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం ఆగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఉక్రెయిన్ ‘నాటో’ సభ్యత్వం స్వీకరించకూడదనేది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో ‘నాటో’ స్థావరాలను స్థాపించి మాస్కో పొలిమేర్ల వరకూ అమెరికా మిలిటరీ క్షిపణుల్ని మోహరించే ప్రయత్నంలో భాగంగా ‘నాటో’లో సభ్యత్వానికి ఉక్రెయిన్ను ప్రోత్సహించాయి. దీంతో తన ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్పై యుద్ధానికి దిగింది రష్యా.ఉక్రెయిన్ తూర్పు భాగంలో 25 శాతం భూభాగాన్ని రష్యన్ సేనలు ఆక్రమించాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మిత్రులు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఉక్రెయిన్ ప్రధాన పట్టణాలను ఆక్రమించి రాజధాని కీవ్ దిశగా రష్యన్ సేనలు దూసుకెళుతున్నాయి. ‘మీరు శాంతియుతంగా లొంగకపోతే ఉక్రెయిన్ను నామరూపాలు లేకుండా చేస్తామ’ని రష్యా హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో యుద్ధాన్ని ప్రోత్సహించిన అమెరికాయే ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి, ఉక్రెయిన్ ఓటమి నుంచి బయటపడే మార్గాల్ని అన్వేషిస్తోంది. 28 శాంతి ప్రతి పాదనల్లో ప్రధానంగా 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పాన్ని వాస్తవ రష్యన్ నియంత్రణ ప్రాంతంగా గుర్తించి... అమెరికా గుర్తింపుతో సహా అంతర్జాతీయ గుర్తింపును పొందేలా చూడాలి. యుద్ధంలో రష్యా వశపరచుకున్న డొనెట్స్క్ పొరుగున ఉన్న లుహాన్స్క్ ప్రాంతాలను రష్యాకు ఇవ్వాలి. రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఇవ్వాలి. అక్కడ మిగిలి ఉన్న ఉక్రెయిన్ ట్రూపులను వెనుకకు పిలవాలి. ‘నాటో సభ్యత్వాన్ని కోరను’ అని ఉక్రెయిన్ చేయాలని చెబుతున్న ప్రతిజ్ఞను ఈ శాంతి ముసాయిదాలో చేర్చారు. ఇందుకోసం ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి. ప్రతిఫలంగా ఉక్రెయిన్ భద్రతా హామీలను పొందుతుంది. ఉక్రెయిన్లో విదేశీ మిలిటరీ స్థావరాలు కానీ, దూరపు శ్రేణి క్షిపణులను కానీ మోహరించ కూడదు. ఉక్రెయిన్ ఆర్మీని 6 లక్షలకు మించకుండా కుదించడం, ‘నాటో’ ఇకపై రష్యా వైపు విస్తరించదనీ, రష్యా ఇకపై పొరుగు దేశాలపై దాడి చేయకూడదనీ ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఉక్రెయిన్ పారిశ్రామిక వాడలన్నీ రష్యా స్వాధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్ అణుశక్తిగా ఎన్నటికీ ఉండ కూడదు. యుద్ధ నష్టపరిహారం వంటివి ఇరువైపులా ఉండవు. రష్యాపై ఆంక్షలను ఎత్తివేసి, 2014లో తొలగించిన జీ8 దేశాల కూటమిలో సభ్యత్వం తిరిగి ఇస్తారు. ఉక్రెయిన్లో 100 రోజులలోగా అధ్యక్ష ఎన్నికలు జరగాలి. యూరోపియన్ యూనియన్ అధికారులు మాత్రం ఈ శాంతి ప్రణాళిక కోసం తమతో సంప్రదించలేదనీ, ఇది రష్యా అనుకూల ప్రణాళిక అనీ అంటున్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ ప్రతిపా దనల్ని ఒప్పుకొని ఉంటే యుద్ధమే ఉండేది కాదు. ఇంత విధ్వంసమే జరిగేది కాదు. లక్షలాది మంది పశ్చిమ యూరప్కు వలసలు పోయేవారు కాదు. ఐతే బ్యాంకుల్లో స్తంభించిన 30,000 కోట్ల డాలర్ల రష్యా కరెన్సీ గురించి ఇంకా స్పష్టత రాలేదు. శాంతి ఒడంబడిక జరిగితే అంతిమ విజేతగా రష్యా నిలవనుంది. రష్యాను బలహీనపర్చి, రష్యాను విభజించి వలస దేశంగా మార్చి ఖనిజసంపదను దోచుకోవాలన్న అమెరికా, పశ్చిమ దేశాల ఆశలు అడియాసలుగా మిగిలిపోతాయి.పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ దిగజారుడులో ఉంది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్తూ ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సహాయానికి కూడా వెళ్లాలనే ఆలోచనలో యూకే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపటం ద్వారా అమెరికా, మిత్రదేశాలు తమ పరువును కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నాయనడం సముచితం.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
అందరికీ ఆహార భద్రత ఓ ఎండమావేనా!
దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది ఆహార భద్రత. ప్రపంచ ఆహార భద్రత సూచీ ప్రకారం 2022 నాటికి 113 ప్రధాన దేశాలలో భారత్ 68వ స్థానం పొందగా 2024 నాటికి, అంటే రెండేళ్ల తర్వాత 127 ప్రధాన దేశాలలో 105వ స్థానానికి దిగజారింది. దేశ జనాభాలో ఆకలితో బాధపడుతున్న వారిసంఖ్య 22 కోట్లుగా అంచనా వేస్తుండగా, అందులో అధిక శాతం మంది వ్యవసాయం వృత్తిగా చేసుకొన్న రైతులు, రైతు కూలీల కుటుంబాల వారే. దేశ జనాభాకు తిండిగింజల్ని పండిస్తున్న రైతాంగమే కడుపు నిండా తిండికి నోచుకోకపోవడం అన్నది జీర్ణించుకోలేని చేదు వాస్తవం. ఇతర రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో ఆదాయాలు పెరగడం లేదు. జాతీయ శాంపుల్ సర్వే ప్రకారం 1960–2020 మధ్య వ్యవసాయ రంగంలో నికరా దాయం 4 రెట్లు మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో పారిశ్రామిక నికరాదాయం 75 రెట్లు పెరిగింది. 2004లో ఒక వ్యవసాయ రంగ శ్రామికుడి ఉత్పాదకత రూ. 11,964 ఉండగా, పారిశ్రామిక రంగ కార్మికుడి ఉత్పాదకత రూ. 66,323గా ఉన్నట్లు తేలింది. అంటే ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు వ్యవసాయదారుల కంటే ఎక్కువ ఆదాయం వస్తోందన్నమాట! ఈ కారణంగానే కార్మికులు, కూలీలు వ్యవసాయ రంగాన్ని వీడి పెద్ద సంఖ్యలో ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. ప్రతీ ఏటా సాగు ఖర్చులు నిరంతరంగా పెరుగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటేటా 14 ప్రధాన పంటలకు కొంతమేర కనీస మద్దతు ధరల్ని పెంచుతున్న మాట నిజమే గానీ, ఆ పెరిగే మొత్తం రైతు కుటుంబ, సాగు ఖర్చులను పూడ్చలేక పోతున్నాయి. హరిత విప్లవం స్ఫూర్తిగా...దేశంలో 1950 దశకం చివర్లో వచ్చిన ‘హరితవిప్లవం’ కారణంగా వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరిగాయి. హరిత విప్లవం నాటి సమయంలో దేశంలోని పలు రాష్ట్రాలు వ్యవసాయ, భూ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశాయి. అధిక దిగుబడి సామర్థ్యం గల వంగడాలను ప్రవేశపెట్టాయి. బంజరు భూములు సాగులోకి వచ్చాయి. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువుల ఉపయోగం మొదలైంది. యంత్రాల వినియోగం కూడా రావడంతో సకాలంలో వ్యవసాయ పనులు పూర్తికావడం సాధ్యమైంది. గోధుమ, వరి, నూనె గింజలు, పప్పు ధాన్యాలు పుష్కలంగా పండి వాటి ఉత్పత్తి సాలీనా 7 శాతం చొప్పున పెరిగింది. దాంతో, ప్రజల అవసరాలకు పోను కొంతమేర ఎగుమతులు చేసే స్థాయికి దేశం చేరింది. ఇప్పుడు దేశంలో సాగు భూములు క్రమంగా కుంచించుకు పోతున్నాయి. వ్యవ సాయ యోగ్యమైన భూముల్ని పారిశ్రామిక వాడలుగా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేయటం గత దశాబ్దకాలంగా ఎక్కువైంది. హరిత విప్లవమే కాదు... 1980–90 మధ్యకాలంలో పాల ఉత్పత్తిని పెంచడానికి పలు చర్యలు చేపట్టి శ్వేత విప్లవాన్ని సాధ్యం చేశారు. చేపలు, రొయ్యల ఉత్పత్తుల తలసరి లభ్యతను పెంచి నీలి విప్లవాన్నీ, అలాగే నూనెగింజల ఉత్పత్తిలో అనూహ్య వృద్ధిని సాధించి ‘బ్రౌన్ రివల్యూషన్ను సాధించిన ఘనత మనది. అయితే ‘అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి దప్పులు మరొక చోట’ అన్నట్లుగా తలసరి ఆహార ధాన్యాల లభ్యత పెరిగినప్పటికీ దేశాన్ని ఆకలి రహిత భారత్గా తీర్చిదిద్దలేక పోవడం లోపమే!ప్రజలందరికీ ఆహార భద్రత ఉండాలంటే ఏడాది పొడవునా వారికి ఉపాధి, మెరుగైన ఆదాయం లభించాలి. అరకొరగా తీసుకొనే ఆహారంలో తగినన్ని పోషకాలు లేకపోవడంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఆహార భద్రతకు తోడుగా పోషకాహార భద్రత కల్పించాలంటే, ప్రజల ఆహార అలవాట్లను మార్చాలి. ఇటీవలి కాలంలో పాతకాలపు ఆహారపు అలవాట్లకు మెజారిటీ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అంటే, వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన, జొన్న, సజ్జ, రాగులు, ఊదలు, కొర్రలు వంటివాటిని ఎక్కువగా తీసుకొంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలతో పాటు చిరు ధాన్యాలను కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలి.ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరాలంటే ముందుగా రైతులకు ఆదాయ భద్రత కలగాలి. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది గానీ అది ఆచరణలో అరకొరగానే అమలు జరుగుతోంది. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలు, గిడ్డంగుల సౌకర్యం మెరుగుపడాలి. వ్యవసాయ దిగుమతులు తగ్గాలి. సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. ఆహార భద్రత అనే అంశం రైతాంగం ఆదాయ భద్రతతో ముడిపడి ఉందనే వాస్తవాన్ని గ్రహించనంత వరకూ, ఆ దిశగా చర్యలు చేపట్టనంత వరకూ అందరికీ ఆహార భద్రత అన్నది ఓ ఎండమావిగానే మిగిలిపోతుంది.డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త మాజీ కేంద్ర మంత్రి, శాసన మండలి సభ్యులు -
చిత్తశుద్ధి లేని అరకొర ప్రయత్నాలు
తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లపాటు నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది. స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ఎంతో ఆర్భాటం చేసింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఇదివరకు అమలు చేసిన రిజర్వేషన్ల శాతం కంటే మరింత తగ్గించి బీసీలను నిలువునా ముంచేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పుడు... వ్యూహాత్మక కార్యాచరణ ఏమైంది? కేవలం ఆర్భాటం చేస్తూ బిల్లులు రూపొందించి అసెంబ్లీలో ఆమో దింపజేయడం, ఆ తర్వాత హడావిడిగా ఆర్డినెన్స్ ఇవ్వడం, వాటికి దిక్కులేకపోవడంతో జీఓ జారీ చేయడం అంతా ఒక కల్పనగానే ఉంది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా... పార్టీ పరంగా ఇస్తామంటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం చూస్తుంటే నాటకీయంగా తప్పించుకున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ ఎన్ని కలు పార్టీ గుర్తుతో జరగనప్పుడు, పార్టీ అభ్యర్థులుగా ఎలా ఎంపిక చేస్తారు?ఉత్తుత్తి ప్రయత్నం...రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. తొలి వంద రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మూడు నెలల తర్వాత కుల సర్వేపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్లో ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కుల సర్వే అని, ఆ తర్వాత డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, చివరకు వన్ మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సమగ్ర సర్వే చేసి వాటి వివరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ముందుగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేయడం, లోతుగా సర్వే చేపట్టిన నివే దికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపాలి. అక్కడ ఆమోదం పొందితేనే అవి చెల్లుబాటు అవుతాయి. తమిళనాడు నమూనా ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. ఇందుకు కేంద్రంపైన ఒత్తిడి తీవ్రతరం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఒత్తిడి చేయకుండా ‘జంతర్మంతర్’లో ధర్నా చేసి చేతులు దులుపుకొంది.కేంద్రంలో 243 మంది ఎంపీలున్న ఇండియా కూటమి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు ప్రయత్నం చేయలేదు. కనీసం తెలంగాణ ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోదీని కలిశారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో సంప్రదింపులు ఎందుకు చేయలేదు? తమిళనాడు తరహా అఖిలపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించలేదు. ఢిల్లీకి అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కేంద్ర స్థాయిలో పరపతి లేని అనామకులు మాత్రమే ‘జంతర్మంతర్’ వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తారు. అన్ని రకాల అధికారాలున్న కాంగ్రెస్... బీసీ రిజర్వేషన్ల పట్ల కపటప్రేమను ప్రదర్శించింది. ఆర్డినె¯Œ ్స జారీ చేసి గవర్నర్ ఆమోదించలేదంటూ... చివరకు ఎలాంటి ఆధారాలూ లేకుండా జీఓలు జారీ చేసి బీసీ రిజర్వే షన్లు పెంచుతున్నామని చెప్పుకొంది. కానీ ఆ ఉత్తర్వులు న్యాయవ్యవస్థ ముందు నిలవలేదు.ఐక్యతే అసలు మంత్రం...కామారెడ్డిలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభలో మూడు తీర్మానాలు చేయించాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలనీ; కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమా వేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పార్లమెంట్లో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలనీ; స్థానిక రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూ ల్లో చేర్చి, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనీ తీర్మానాలు చేయించాను.ఇప్పుడు గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతి పదికన ఖరారు చేశారో ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. గతంలో 20 శాతానికి పైగా రిజర్వేషన్లు దక్కితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టారు. శాస్త్రీయత లేకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉత్తర్వులు ఇస్తే అవి చెల్లుబాటు కావు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హర్షిస్తూ బీసీ సంఘాలు పాలాభిషేకాలు, పూలాభిషే కాలు చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై కనీసం ఆలోచన చేయలేని స్థితిలో సంఘాలున్నాయి. బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సిందే! రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వ్యూహా త్మకంగా పంచాయతీలను విభజించుకుని దళిత, గిరిజన, బీసీలను సర్పంచులుగా గెలిపించుకోవాలి.జస్టిస్ వి. ఈశ్వరయ్యఉమ్మడి ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజే, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ -
సమాజం ఎవరికీ పట్టదా?
సమాజం పరిస్థితి తీవ్రమైన విచారాన్ని కలిగిస్తున్నది. ఈ మాట అంటున్నది అభివృద్ధి, పేదరికం, అవినీతి, తారతమ్యాలు, కులతత్వం, మతతత్వం వంటి విషయాల గురించి కాదు. ఆ సమస్యలపై చర్చలు ఎప్పుడూ జరుగుతున్నవే. ఉద్యమాలూ సాగుతున్నవే. అందుకు పరిష్కారాలపై అనేక థియరీలు, ఆలోచనలు చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తావిస్తున్నది వీటన్నింటికి భిన్నమైనది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, వ్యక్తులకు తమతో తమకు ఉండే ఆత్మ సంబంధాలు, ఈ సంబంధాలకు ఆలవాలమయే విలువల గురించి. ఇవి అన్నింటికీ అన్నీ క్రమక్రమంగా క్షీణిస్తుండటం గురించి.సామాజిక క్షీణత ఆ యా కాల పరిస్థితులను బట్టి ఈ సంబంధాలు బలంగా ఉండటం, బలహీనపడటం జరుగుతూనే ఉంటుంది. అది సాధారణ స్థాయిలో ఉండటానికీ, ఒక ధోరణిగా మారి తీవ్రతరం కావటానికీ తేడా ఉంది. దానికదే ఒక ఆందోళనకరమైన స్థితి కాగా, అంతే ఆందోళన కలిగిస్తున్నది మరొకటి ఉంది. అది, ఈ విషయమై ఎవరికీ పట్టినట్లు లేకపోవటం. ప్రభుత్వం, పార్టీలు, పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు, వివిధ మతాల పెద్దలు, గురువులు, సంస్కర్తలు, లెక్క లేనంతగా ఉన్న సంఘాల వారు, ఆ యా ఇజాల వారు. అందరికీ అందరూ. ఎవరికి ఏదీ పట్టడం లేదు. ఒక మాట సూటిగా చెప్పుకోవాలంటే, మనుషులు తమను తాము చంపుకోవటం, ఇతరులను చంపటం ఎక్కువవుతున్నాయి. అందుకు స్థూలంగా కనిపిస్తున్న కారణాలు ఆర్థికం, లైంగికం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం, బలహీనపడుతున్న కుటుంబ సంబంధాలు, పెరిగిపోతున్న అసహనం వంటివి. ఇది స్థూలమైన పరిభాష. వీటిలో ఒక్కొక్క అంశాన్ని విడిగా పరిశీలిస్తే అన్నింటికీ కలిపి ఒక సమగ్ర సామాజిక స్థితి కనిపిస్తుంది. ఈ అంశాలలో కొన్నింటికి పరస్పర సంబంధం ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. వాటి జమిలి ప్రభావాలతో మన సమాజం, మనుషులు, కుటుంబాలు ప్రమాదానికి గురవుతున్నాయి. వాస్తవానికి ఇటువంటి అధ్యయనాలను సామాజిక శాస్త్రజ్ఞులు చేయాలి. సమాజ అధ్యయన శాస్త్రంలోకి రాజకీయం, ఆర్థికం, సమాజ సంస్కృతి, కుటుంబం, వ్యక్తిత్వ రూపకల్పనలు, మానసికతలు వీటన్నింటి పరస్పర సంబంధాలు, పరిణామాలు, మంచి చెడులు అన్నీ వస్తాయి. సామాజిక శాస్త్రం మనకు శ్రీకృష్ణుని నోటిలో సమస్త విశ్వ సందర్శనం వంటిది. కానీ దురదృష్టవశాత్తు, ఇతరత్రా మన విద్యా రంగాల వలె, సామా జిక శాస్త్ర విభాగాలు కూడా బలహీనపడుతూ, ఇటువంటి అధ్యయ నాలు చేయటం లేదు. తెలుగు రాష్ట్రాలలోని ఈ విభాగాల వారికి ఆ స్పృహ అయినా ఉన్నట్లు లేదు.చెదురుతున్న సంబంధాలువివరాలలోకి వెళితే, పైన పేర్కొన్న కారణాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు జరగని రోజంటూ ఉండటం లేదు. డబ్బు, వ్యసనాలు, లైంగికాలు, హీన సంస్కృతి, వినియోగదారీతత్వం పాత్రలు పెరుగుతూ, మనుషులకు తమతో తమకు స్వీయ సంబంధాలు, వ్యక్తిత్వాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాల పాత్రలు, అనుబంధాలు బలహీనపడి అప్రధానమవుతున్నాయి. ధన ప్రభావం, క్రమంగా వ్యాపిస్తున్న కొత్త కన్జూమరిజం, కొత్త సంస్కృతి ప్రభావం పట్టణ ప్రాంతాలకు, కొన్ని తరగతులకు పరిమితమై ఉండక గ్రామాలకూ, అన్ని తరగతులకూ విస్తరిస్తున్నది. పట్టణాలకు ఎక్స్పోజర్, కొత్త మీడియా, వినోదం, బలహీనపడిన విద్య, కుటుంబ శిక్షణలు, క్రమశిక్షణలు, కన్జూమరిజం పెంచుతున్న కోరికలు ఈ సరిహద్దులను చెరిపివేస్తున్నాయి. అది జరిగినప్పుడు మనిషి ఒక భిన్నమైన ప్రపంచంలోకి ప్రవేశించటంతో మొదట తనతో తనకే స్వీయ సంబంధం చెదిరిపోతుంది. వ్యక్తిత్వం కలుషి తమవుతుంది. ఒకసారి అది జరగటం మొదలైతే కుటుంబంతో, ఇతర వ్యక్తులతో, సమాజంతో సంబంధాలు చెదిరిపోవటమన్నది తార్కికమైన సహజ పరిణామం. అది, వేర్లకు పురుగుపట్టిన చెట్లు మామూలు గాలికే కూలిపోవటం వంటిది. అట్లా కూలటంలో భాగంగానే అన్ని విధాలైన సంస్కారాలూ దెబ్బతిని వ్యక్తులు ఆత్మహత్యలకు, హత్యలకు, కుటుంబ సభ్యులపై దాడికి, లైంగిక నేరాలకు, ఇతర నేరాలకు, వ్యసనాలకు, తత్సంబంధిత అకృత్యాలకు పాల్ప డటం పెరుగుతున్నది. ఇదే సామాజిక క్షీణ స్థితి. పైన చెప్పుకున్నట్లు, ఇటువంటి స్థితి ఏర్పడటం వర్తమానకాల పరిస్థితుల ప్రభావంతో జరుగుతున్నది. అటువంటికాల పరిస్థితులకు పరిష్కారం ఏమిటన్నది ఒక ప్రశ్న కాగా, పరిష్కార ప్రయత్నాలు ఒక స్థాయిలో జరుగుతూనే వీలైనంత నివారణ ప్రయత్నాలు కూడా ఏమి జరగాలన్నది మరొక ప్రశ్న. ఈ ధోరణిని భిన్న కోణాల నుంచి మౌలికంగా ఎదుర్కోవటం, పరిష్కరించటం, ప్రభుత్వాలు విధానపరంగా తీసుకోగల చర్యలపై ఎక్కువగా ఆధారపడిఉంటుంది. పైన పేర్కొన్న వివిధ సమస్యలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు సాధ్యమే. విద్య, వినోదం, ఆర్థికం, కొత్త తరహా మీడియా, కన్జూమరిజం, సమస్త అంశాలలో డబ్బు పాత్ర మొదలైనవి విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి రాగలవు.క్రియాశీలంగా మారితేనే...కానీ, అది మాత్రమే ఎంత మాత్రం చాలదు. అందుకు సమాజ పరంగా జరిగేది సరిసమానంగా అనుబంధం కావాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు, సమాజం ఏదీ శ్రద్ధ చూపటం లేదన్నది సమస్యగా మారింది. ఒకోసారి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించినా కనీసం సామాజికులు, సంస్కర్తలు, మత పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు ఇటువంటి పరిస్థితుల పట్ల ఆందోళన చెంది చైతన్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. సంస్కరణోద్యమాలు తెస్తారు. ఆ విధంగా పాలకులపై కూడా ఒత్తిడిని సృష్టిస్తారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినా ఇటువంటి సామాజిక వర్గాల క్రియాశీలతపై సమాజాలు ఆశలు పెట్టుకుంటాయి. కానీ ఈ వర్గాలు నిష్క్రియాపరంగా మారటం ఇంకా పెద్ద సమస్య అవుతున్నది. వారికి రాజకీయాలపై ఉన్న ఆసక్తి సమాజం పట్ల కలగటం లేదు. కనీసం ఇప్పటికైనా, ఈ సామాజిక ఉపద్రవం మరింత తీవ్రంగా మారకముందే, ఈ వర్గాలు కళ్ళు తెరవటం అవసరం. లేనట్లయితే, కొంతకాలంగా మారుతున్న కాల పరిస్థితుల ప్రభావాలు పెరిగి సమాజం మరింత ప్రమాదకరం అవుతుంది. టంకశాల అశోక్-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అంతుచిక్కని అగ్నిశిఖల ముప్పు
దీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఇథియోపియా ఉత్తర ప్రాంతంలోని హేలీ గబ్బి అగ్నిపర్వతం అసాధారణ రీతిలో బద్దలైన ఘటన అనూహ్యంగా ఆందోళనలోకి నెట్టింది. పేలుడుతో అత్యంత భారీగా రేగిన ధూళి మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమన్, ఒమన్ సహా చివరకు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతం నుంచి భారతదేశం వైపు కమ్ముకొస్తూ ఉండడం మన ఆందోళనకు కారణం. ఎదుట ఉన్నదేదీ కనిపించనివ్వని ఆ భారీ దుమ్ము ధూళి ఏకంగా కొన్ని వందల కిలో మీటర్లు ప్రయాణించి వివిధ ఖండాలకు విస్తరించింది. ఇప్పటికే భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాల విమాన ప్రయాణ సర్వీసులకు చిక్కులు తెచ్చింది.ఏం జరిగింది?ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు ఈశాన్యాన 800 కి.మీల దూరంలో అఫార్ ప్రాంతంలో ఉందీ హేలీ గబ్బి అగ్నిపర్వతం. ముఖ్యంగా భూ ఉపరితలంపై కదిలే పెద్ద శిలల పొరల మీద ఉంది. తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ జోన్ కిందకొచ్చే ఆ ప్రాంతంలో అటు ఆఫ్రికన్, ఇటు అరేబియన్ భూ ఫలకాలు ఘర్షించుకుంటూ, ఏటా 0.4 నుంచి 0.6 అంగుళాల మేర పరస్పర వ్యతిరేక దిశలో కదులుతుంటాయి. 12 వేల ఏళ్ళుగా గమ్మునున్నట్టు తోచిన సదరు వాల్కనో ఈ నవంబర్ 23న విస్ఫోటనం చెంది, అనేక గంటలు నిప్పులు విరజిమ్మింది. ఆ ఘటనలో ఎవరూ మరణించలేదు కానీ, ఆ ప్రాంత ప్రజలు, జీవజాలంపై సుదీర్ఘ ప్రభావం ఉండనుంది. ముందస్తు హెచ్చరికలు లేవా?ఇథియోపియాలో దాదాపు 50 అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో అనేకం కొన్ని వేల ఏళ్ళుగా నిద్రాణంగా ఉన్నాయి. నిజానికి, ఈ జూలైలోనే దగ్గరలోని ఎర్తా ఆలె అగ్నిపర్వతం బద్దలైంది. భూగర్భంలో 30 కిలోమీటర్ల కింద అంతశ్శిలాద్రవం చొచ్చుకుపో యింది. భూగర్భ కదలికలతో హేలీ గబ్బి సైతం విస్ఫోటనం చెందే ప్రమాదం ఉందని సూచనలు అందాయి. గత ఆదివారం అదే జరిగింది. భారీ శబ్దంతో అగ్నిపర్వతం పేలినప్పుడు 14 కి.మీ.ల మేర ఆకాశంలోకి ధూళి మేఘాలు విస్తరించాయి. పర్వతాలంత ఎత్తున గగన భాగాన్ని కప్పేసిన ఆ బూడిద పర్యాటక ప్రాంతాలైన చుట్టుపక్కలి పర్వతప్రాంత గ్రామాలను చుట్టేసింది. దట్టమైన పొగ, గాఢాంధకారంతో గాలి పీల్చడానికైనా లేదు. తాజా ఘటనను బట్టి ఆ అగ్ని పర్వత ప్రాంతం గురించి లోతైన అధ్యయనం జర గనే లేదనీ, ఆ లోటు పూరించాల్సి ఉందనీ తేలింది.ఎంత కష్టం... ఎంత నష్టం...అగ్నిపర్వత భస్మ మేఘాల్లో కరకైన కణాలుంటాయి. లక్షల టన్నుల ఆ కణాలు లోపలికి చొచ్చుకుపోయి విమానాల ఇంజన్లను చెడగొడతాయి. విమానయానం ప్రమాదకరమవుతుంది. 1982లో బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం ఇలానే భస్మ మేఘం గుండా వెళ్ళి 4 ఇంజన్లూ ఆగిపోయాయి. కష్టపడి పావుగంటలో పైలట్లు 3 ఇంజన్లను పునరుద్ధరించేసరికి జనం బతికిపోయారు. మునుపు 2010లో ఐస్ల్యాండ్లో ఓ అగ్నిపర్వతం కొద్ది నెలలు నిరంతరం విస్ఫోటనం చెంది, 11 కి.మీ.ల మేర బూడిదను విరజిమ్మింది. బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను ఈ భస్మ మేఘాలు తాకాయి. బ్రిటన్ 6 రోజులు వైమానిక మార్గాన్ని మూసేయాల్సి వచ్చింది. 95 వేల విమా నాలు రద్దయ్యాయి. యూరప్లో అనేక దేశాలు గగన తలాన్ని మూసేశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద వైమానిక షట్డౌన్ అదే! రోజూ 12 లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. బ్రిటన్ 145 కోట్ల డాలర్లు నష్టపోయింది.గతిని మార్చేసిన గతం...అగ్నిపర్వత విస్ఫోటనాలంటే ఆషామాషీ కాదు. అవి మానవాళి చరిత్రనే మార్చేసిన ఘట్టాలున్నాయి. 1783 నాటి లకీ విస్ఫోటనంతో యూరప్లో వాన రాకడే మారింది. ఫ్రాన్స్లో ఆకలి మంటలు రేగి, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు ఇండొనేసియాలోని తంబోరాలో విస్ఫో టనం యూరప్లో ఎడతెగని వానలు సహా కొన్నేళ్ళు ప్రపంచ పర్యావరణాన్నే మార్చేసింది. వర్షంతో చిత్తడిగా మారిన నేల వల్లే వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓటమి పాలయ్యారట. ఏమైనా, ఇప్పుడు హేలీ గబ్బి దెబ్బకు ఆఫ్రికాలోని అతి పెద్ద వైమానిక కేంద్రాల్లో ఒకటైన ఇథియో పియా సహా అనేక ఖండాల్లో విమాన సర్వీసులు ఇరుకున పడ్డాయి. 4 వేల కి.మీ.ల దూరంలో ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, పంజాబ్లకు ఈ ధూమం విస్తరించింది. విమాన సర్వీసులు అనేకం రద్దయ్యాయి. కొద్ది రోజుల్లో ఈ ధూళి తగ్గినా, ఆ మేఘాల్లోని హానికారక వాయువులతో జాగ్రత్త పడక తప్పదు. -
ఫెడరలిజంను బలహీనపరిచే సలహా
తమిళనాడు గవర్నర్ అనేక బిల్లులను, అవినీతి కేసులపై దర్యాప్తు అనుమతి ఫైళ్ళను, ఖైదీల విడుదల ప్రతిపాదనలను నెలల తరబడి నిలిపివేసి పరిపాలనను దెబ్బకొట్టారు. ఇలా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ‘ఇది రాజ్యాంగ విరుద్ధం’ అంటూ గతంలో సూటిగా చెప్పింది. కానీ ఆశ్చర్య కరంగా, అదే అంశంపై, 14 ప్రశ్నలతో రాష్ట్రపతి కోరిన సలహా కేసులో (ప్రెసిడె న్షియల్ రిఫరెన్స్ కేసు) మాత్రం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ పీఠం అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. మన రాష్ట్రపతికి ధర్మాసనం అద్భుతమైన ‘సలహా’ రూపొందించింది. ఆ సలహా అర్థం ఇదీ: ఎ) గవర్నర్కు కాల గడువు (టైమ్ లిమిట్) విధించలేం. బి) రాష్ట్రపతి నిర్ణయాలను కోర్టు ప్రశ్నించలేదు. (సి) గవర్నర్ పరిపాలనను నిలి పేసినా, ఏమీ చేయలేం. ఎంత అన్యాయం? దేశ ప్రధాన న్యాయ మూర్తి తన పదవీ విరమణ చేయడానికి ముందు ఇటువంటి సలహా తీర్పును ఇచ్చి రాజ్యాంగ ఆత్మకు, ఫెడరలిజానికి, పరిపాలనా సమతౌల్యానికి పెద్ద దెబ్బ కొట్టారు.కేంద్ర ప్రతినిధిగా మార్చే పరిస్థితిఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సలహా ఎందుకు ప్రమా దకరం? దీనివల్ల ఒక్క తమిళనాడుకే కాదు, ప్రతి బీజేపీయేతర రాష్ట్రంలో కొత్త రాజ్యాంగ సంక్షోభం వచ్చిపడింది. బిల్లులు గవర్నర్ దగ్గరే నెలల తరబడి నిలిచిపోవడం, విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ నియామకాల్లో పూర్తిగా పక్షపాతం, అవినీతి కేసుల్లో అభియోగ అనుమతులపై నిర్ణయాలు పెండింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియా మకాల నిలిపివేత వంటి దారుణమైన వైఫల్యాలకు ఈ సంక్షోభం కారణం కానుంది. అంతా గవర్నర్ ఇష్టం ప్రకారం చేయడానికి ఉంటే ఇక జనం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించడం సాధ్యమా? ఫైళ్ళు, నియామకాలు అన్నీ ఆగిపోయే పనులను గవ ర్నర్ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఇది రాజ్యాంగా ధికారి అయిన రాజ్ ప్రముఖ్ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మార్చే పరిస్థితి. రాష్ట్రపతి గారు సార్వభౌమ ప్రజల తరఫున పనిచేసే అత్యున్నత రాజ్యాంగాధికారే. కానీ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం వారు నియమించేవారు. (ఎన్నికల్లో గెలవకుండా) ఎంపిక చేయబడినవారే రాజ్ ప్రముఖ్ అవుతారు. ఈ సలహా వంటి తీర్పు వల్ల రాష్ట్రపతినీ, గవర్నర్నూ ఒకే స్థాయిలో గానీ, హోదాలో గానీ (కాన్స్టిట్యూషనల్ పెడెస్టల్) పెట్టడం రాజ్యాంగ ఆత్మను అవమానించడమే!సరైన కాలం అంటే?గవర్నర్ల రాజకీయ పక్షపాతం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెను సమస్యగా మారింది. ‘గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం తీసు కోవాలి’ అని సుప్రీంకోర్టు తన సలహా తీర్పు వెలువరించింది. ఎంత వ్యవధి సమంజసం? ఒక నెల సరైనదా? ఒక సంవత్సరం సరైనదా? మూడు సంవత్సరాలు సరైనవా? ఎవరికీ తెలియదు. ఈ అస్పష్టత రాజకీయ పక్షపాతంతో వ్యవహరించే గవర్నర్లకు పెద్ద ఆయుధం. దీనివల్ల పరిపాలన నిలిచిపోతుంది, లెజిస్లేచర్ సంక ల్పానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రజాభిప్రాయం నీరుగారిపోతుంది. గవర్నర్ ‘రబ్బర్ స్టాంప్’ కాదు. కానీ పాలనకు స్పీడ్ బ్రేకర్ అయిపోవడం న్యాయమా? గవర్నర్ బిల్లులను ఆపాలని అనుకుంటే పూర్తిగా ఆపగలిగే అవకాశం కొనసాగుతుంది. ఒకసారి బిల్లును ఆమోదించకుండా అసెంబ్లీకి తిప్పిపంపిన తరువాత, మళ్లీ అదే బిల్లును పంపితే గవర్నర్ వెంటనే ఒప్పుకోవాలి. కానీ ఆ పనీ చేయ కుండా, రాష్ట్రపతికీ పంపకుండా వదిలేస్తూ పోతూ ఉంటే పరిపాలన స్తంభించిపోతుంది. ఈ లోగా అయిదేళ్ల పాలన ‘కాలధర్మం’ చెందు తుంది. బిల్లులు, చట్టాలను నిష్క్రియ, ఆలస్యాలతో చంపేస్తారా? చేతలలో చంపరు. కానీ తిండి ఇవ్వక వదిలేస్తే వాడే చస్తాడు అన్నట్టుంది. ఫెడరలిజంపై చావు దెబ్బసమాఖ్య విధానంలో కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలు సమతౌల్యంగా ఉండటం కీలకం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సలహా (అడ్వైజరీ ఒపీని యన్) రాష్ట్రం ఆమోదించిన బిల్లులను... రాష్ట్ర ప్రజా మద్దతుతో వచ్చిన లెజిస్లేచర్ బిల్లులను, గవర్నర్ ఒకరే నెలల తరబడి అడ్డుకునే పరిస్థితిని అన్యాయంగా రాజ్యాంగబద్ధం చేసిపెట్టింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. కేంద్ర అధికారుల అతి చర్యలను బలపరుస్తుంది. అంతేగాక ఫెడరలిజం మూల సూత్రానికి విరుద్ధం అవుతుంది. ఈ సలహా తీర్పులో ‘‘రాజ్యాంగాధికారులు తమ విధులు నిర్వ ర్తించకపోతే కోర్టు నిష్క్రియగా ఉండదు’’ అని చెప్పడానికి బాగానే ఉంది. కానీ దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఈ సలహా వినాల్సిన అవసరం లేదు. గడువు (టైమ్ లైన్) పెట్టలేమనీ, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి నిర్ణయాలను ప్రశ్నించలేమనీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కచ్చితంగా అటువంటి అధికారాలను వాడుకుంటాయి. అంటే, మన సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సమస్యను గుర్తించినప్పటికీ, పరిష్కారాన్ని చూపలేదన్న మాట! ఇది ఫెడరల్ రాజ్యాంగ సంక్షోభ నివారణకు సరైన మార్గం కాదు.గవర్నర్ తన ఇష్టానుసారం ఆలస్యాలు చేయడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. ప్రజాస్వామ్య సంకల్పాన్ని, రాష్ట్రాల పరిపా లనను అణగదొక్కడం అవుతుంది. అధికారాలను సరిగ్గా సమంగా విభజించే సిద్ధాంతాన్ని వక్రీకరించడం అవుతుంది. ఇది రాజకీయ అవినీతి మాత్రమే కాదు. రాజ్యాంగ అనైతికం కూడా అవుతుంది. ఈ అవినీతిని ఆపడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సలహా తీర్పు ప్రభావంతమైన పరిష్కారం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాత్ర అత్యంత కీలకం. ఆర్టికల్ 143 కింద ఇచ్చే కోర్టు సలహా బైండింగ్ కాదు. అందుకే రాజ్యాంగాన్ని మనస్సాక్షి ప్రకారం, నమ్మిన దేవుడి ముందు ప్రమాణం చేసిన అత్యున్నతాధికారి అయిన రాష్ట్రపతి గారూ! మీ ప్రమాణాన్ని గుర్తు చేసుకోండి. మీరు మన రాజ్యాంగపు ఆత్మను రక్షించవలసిన బాధ్యత కలిగినవారు. ఫెడరల్ సమతౌల్య తను, ప్రజాస్వామ్య కర్తవ్యాలను పరిరక్షించవలసి ఉంటుంది. కనుక రాజ్యాంగ విరుద్ధమైన, ఫెడరలిజాన్ని బలహీనపరిచే ఈ అడ్వై జరీ ఒపీనియన్ను తిరస్కరించడం రాష్ట్రపతి ప్రాథమిక రాజ్యాంగ బాధ్యత.మాడభూషి శ్రీధర్-వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
ఆశ్చర్యం కలిగించని పరాభవం
‘సొంత గుడిసె వేసుకోలేనోడు ఊరంతటికీ వేస్తాడా’ అని ఆఫ్రికాలో ఒక సామెత ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరాభవంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆ ఫలి తాలు ‘ఆశ్చర్యకరంగా’ ఉన్నాయన్నారు. కానీ అంతకన్నా భిన్నంగా ఉంటేనే ఆశ్చర్య పోవాలి. అక్కడ ఆ పార్టీ 2020లో 70 సీట్లకు పోటీ చేసి, కేవలం 19 గెల వగా... ఈసారి 61కి గానూ 6 స్థానాలు గెలిచింది. మహాగఠ్బంధన్ మొత్తంగానే ఓడినప్పటికీ, ఆ కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అయినందున దాని గురించి ప్రత్యేకంగా చర్చించటం అవసరమవుతున్నది. రెండేళ్ల క్రితం సగం దేశంలో ‘భారత్ జోడోయాత్ర’ జరిపిన రాహుల్ గాంధీ ఇపుడు బిహార్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సాగించి, దేశమంతటా ప్రజా స్వామ్య ప్రియులలో కనీసం కొందరికి కొన్ని ఆశలు కల్పించారు. కానీ, 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగింది ఏమీ లేదు.నాయకత్వానికి సవాలురాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిన 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటంలో తన పాత్ర ఏమీ లేదు. అంతకుముందటి వాజ్పేయి ప్రభుత్వం చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని ప్రజలు మెచ్చనందున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓడిపో యింది. తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ కూటమి రెండవ సారి 2009లో అధికారానికి రావటంలో కొన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి పెరుగుదల పాత్ర వహించాయి. ఆ వెనుక 2014లో కాంగ్రెస్ ఓటమిలోనూ రాహుల్ బాధ్యత లేదు. వివిధ కుంభకోణాల వల్ల అది జరిగింది. ఆ విధంగా గుర్తించవలసిందేమంటే, రాహుల్కి నాయకత్వ పరీక్ష అంటూ మొదలైంది 2014 నుంచి! అప్పటినుంచి గత 11 సంవత్సరాలుగా ఆయన ఏమి చేశారన్నది ప్రశ్న.వాస్తవానికి అంతకుముందు కూడా రాహుల్ గాంధీ కొన్ని పరి మితమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్కు మొదటినుంచీ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రం, బలమైన కేంద్రం. అక్కడ రైతుల పార్టీలు, దళితుల పార్టీలు, సోషలిస్టు పార్టీలు బలపడి వివిధ సామాజిక వర్గాలు దూరమైనందువల్లనే కాంగ్రెస్కు పునాది లేకుండా పోయిందని తనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) ప్రొఫెసర్లు బోధపరచటంతో, వారి సూచనల ప్రకారం యూపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ గాంధీ నడుం కట్టారు. సోదరి ప్రియాంక ఆయనకు తోడయ్యారు. ఆ రాష్ట్రాన్ని నేడు గెలిస్తే రేపు దేశాన్నంతా గెలవగలమన్నది ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం. అందుకు తల్లి దీవెనలు కూడా పొందారు. కానీ, ఉత్తర ప్రదేశ్లో పార్టీ బలోపేతం అనే మొదటి పరిమిత పరీక్షలో ఆయన విఫల మయ్యారు. రెండవ పరిమిత పరీక్ష 2007లో పార్టీ ప్రధాన కార్య దర్శిగా నియమితుడై, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలకు ఇన్ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావిడి చేసిన ఆయన, ఆ సంస్థలను పునర్ని ర్మించలేకపోయారు.వైఫల్యాలపై అధ్యయనం శూన్యంఇటువంటి పదేళ్ల పరిమిత వైఫల్యాల నేపథ్యం నుంచి, 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చి పడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా గాంధీ తన సమర్థతను పలు సందర్భా లలో రుజువు చేసిన దశ గడచిపోయింది. పార్టీ సాంకేతికంగా చీల లేదు గానీ పలువురు సీనియర్లు బీజేపీలో చేరటమో, మృతి చెంద టమో, వార్ధక్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించ టమో మొదలైంది. పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు దూరం కావటం రాహుల్ రాజకీయ ప్రవేశం కన్నా చాలా కాలం క్రితం నుంచే మొదలు కాగా, ఈసరికి బాగా వేగం పుంజుకున్నది. పార్టీ మరికొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాలన్నింటి జమిలి స్థితి... ఆయన తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి రావటం. పార్టీ నాయకులకు ఒకప్పుడు ఉండిన సలహాదారులు, సహాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హేమాహేమీలు కాగా, ఈ దశ వచ్చేసరికి దాదాపు అందరూ పనికిరానివాళ్లు, స్వార్థపరులు వచ్చి చేరారు. రాహుల్ గాంధీకి అది మరొక పెద్ద కొరతగా మారింది.ఇటువంటివి చెప్పుకొన్నప్పుడు రాహుల్పై కొంత సానుభూతి కలగవచ్చు. కానీ అటువంటి అవసరమేమీ లేదు. ఆ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి. పైన చెప్పుకొన్నట్లు 2004–14 మధ్య పదేళ్ల కాలంలో ప్రతికూల పరిస్థితులు పరిమితమే అయి, తన పరీక్షలు కూడా పరిమితమే అయి, తన మాటకు పార్టీలో ఎంత మాత్రం ఎదురు లేకుండా ఉండినప్పటికీ, ఆయన తన నాయకత్వ సమర్థతను రుజువు చేసుకోలేక పోయారు. పార్టీ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే పోయింది. పార్టీ ఆయా వర్గాలకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల వల్ల; అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆచరణ వైఫల్యాల వల్ల దూరమవుతూ వస్తున్నది? ఆ పరిస్థితి మారాలంటే ఏమేమి చేయాలి? అనే అధ్యయనాలు, ప్రణాళి కలు ఆయనకు ఎప్పుడూ లేకపోయాయి. మౌలికంగా అవి ఉండి ఉంటే, 2014లో కాంగ్రెస్ ఓడి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇతరత్రా పైన పేర్కొన్న లోటుపాట్లు ఉండినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ‘సొంత గుడిసె’ వేసేందుకు సమ కట్టగల స్థితిలో ఉండేవారు.యూపీఏ ఉన్నట్టేనా?అది రాహుల్ గాంధీలో మౌలికంగా లేనందువల్లనే 2014 నుంచి ఇప్పటివరకు ‘సొంత గుడిసె’ వేయలేక పోవటమే గాక, ‘ఊరంతటికీ వేసే ప్రయత్నాలు’ సహజంగానే నెరవేరటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. కేవలం మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకొన్నది. యూపీఏ కూటమి గత లోక్సభ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి కూడా కేవలం తన వల్ల అంతలోనే గందరగోళంగా మారింది. దాని అజెండా ఏమిటో అర్థం కావటం లేదనీ, ఎన్నికల తర్వాత తిరిగి ఒక్క సమా వేశమైనా జరగలేదనీ, ఇక తమకు దానితో నిమిత్తం లేదనీ, ఒంట రిగా పోటీ చేయగలమనీ, రాహుల్ అధికారంతో వ్యవహరిస్తున్నా రనీ కొందరు భాగస్వాములు ప్రకటించగా... అసలు ఆ కూటమి అన్నదే ఇక లేదని సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ వంటివాడు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేక పోగా, కొందరిని బయటకు పంపేట్లు తానే వ్యవహరించారు. కొత్తగా ఒక్క పార్టీ అయినా దగ్గరకు రాలేదు. అట్టహాసపు యాత్ర లేవో చేస్తున్నా, ఆ నినాదాలు ఒక స్థాయిలో మంచివే అయినా, సాధారణ ప్రజల సమస్యలకు, వాటికి సంబంధం ఉండటం లేదు. ఈ విధమైన 21 సంవత్సరాల (2004–25) నేపథ్యాన్ని, 11 సంవత్సరాల (2014–25) నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, రాహుల్ గాంధీ ‘సొంత గుడిసె’ను గానీ, ‘ఊరికి గుడిసె’ను గానీ వేయలేక పోవటంలో ఆశ్చర్యం లేదు; హరియాణా, మహారాష్ట్ర,ఢిల్లీతో మొదలైన పరాభవం ఇపుడు బిహార్లోనూ కొనసాVýæడంలో ఆశ్చర్యపడేది ఏమీలేదు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
'ప్రాధాన్యాలను' గుర్తించడమే గెలుపు
ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన తొలి, ఏకైక కంపెనీగా ‘ఎన్విడియా’ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఎన్విడియా సహ–వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తైవానీస్–అమెరికన్ వ్యాపారవేత్త జెన్సెన్ హూవాంగ్ కాలిఫోర్నియాలోని ‘క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (కాల్టెక్) పట్టభద్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: ఇది నిజంగా సంతోషకరమైన రోజు. మీరంతా ‘కాల్టెక్’ నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో కొందరు నన్నూ, మా సంస్థనూ ఎంతో ప్రభావితం చేశారు. ‘ఎన్విడియా’లోని ఇద్దరు చీఫ్ సైంటిస్టులు ఇక్కడి నుంచి వచ్చినవారే. నిజానికి, సలహాలు ఇవ్వడమంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడిన ఉదంతాలను, జీవితాను భవాలను కొన్ని చెబుతాను. సలహాలు వాటిలోనే అంతర్లీనంగా ఉంటాయి. ప్రపంచంలో ఒక టెక్ కంపెనీకి ఇంత సుదీర్ఘ కాలంగా సీఈఓగా ఉన్నది బహుశా నేనే అనుకుంటా. నేను ఈ 31 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎంచుకున్న రంగం నుంచి బయటపడకుండా చూసు కున్నాను. విసుగు చెందలేదు. ఉద్వాసనకు గురయ్యే పరిస్థితులు తెచ్చుకోలేదు. మేధాపరమైన నిజాయతీ, ఒదిగి ఉండటం మా కంపెనీని కాపాడాయని చెప్పగలను. ఏఐ వెంట పరుగెత్తాలి!‘కుడా’ అనే ప్రోగ్రామింగ్ మోడల్ తయారు చేసేందుకు మాకు 20 ఏళ్ళకు పైగా పట్టింది. అది నేడు కంప్యూటింగ్ రంగాన్ని విప్లవా త్మకంగా మారుస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో పర్యవసానాలకు దారితీయగల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి దిగాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తాను. ఏకకాలంలో, బహు ముఖాలుగా వికసనం పొందుతూ ముందుకు సాగుతున్న టెక్నాలజీ అదొక్కటే!ఏఐ వెంట నడవడం కాదు పరుగెత్తండని నేను ‘తైవాన్ యూనివర్సిటీ’ విద్యార్థులకు సూచించాను. ఏఐ విప్లవంతో మమేకం కండని చెప్పాను. ఆ తర్వాత, ఒక ఏడాది గడిచేటప్పటికే అది నమ్మలేనంతగా మారిపోయింది. ఈ అసాధారణ పరిణామాలను మీరు అంతర్ దృష్టితో అవగాహన చేసుకోవాలి. మీ ముందున్న ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసు కుని ముందుకు సాగండి. ఆధునిక కంప్యూటింగ్ మూలాలు ఐబీఎం సిస్టమ్ 360లో ఉన్నాయి. నేను పుట్టిన ఏడాది తర్వాత, అది మార్కెట్లోకి వచ్చింది. చిప్ల రూపకల్పన నేర్చుకున్న 1980లలోని తొలి తరం వి.ఎల్. ఎస్.ఐ. ఇంజినీర్లలో నేనొకడిని. అప్పటి పాఠ్య పుస్తకాన్ని కాల్టెక్లో చదివినవారే తయారు చేశారు. ఆ పుస్తకం ఐసీ డిజైన్ను విప్లవీకరించింది. మా తరం సూపర్ జైంట్ చిప్లు డిజైన్ చేసేందుకు, అంతి మంగా సీపీయూ తయారీకి వీలు కల్పించింది. కంప్యూటింగ్లో బ్రహ్మాండమైన వృద్ధికి సీపీయూ బాటలు పర చింది. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత సామూహిక ఉత్పత్తి మొదలైంది. అది పైకి కనిపించనిది. తేలిగ్గా కాపీ చేయదగి నది. అదే సాఫ్ట్వేర్. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. సాఫ్ట్వేర్ను విక్రయించి సొమ్ము చేసు కోవచ్చుననే భావన అప్పట్లో ఒక స్వైర కల్పన మాత్రమే. నేడు అది అత్యంత ముఖ్యమైన వస్తువు అయిపోయింది. ఎన్విడియా తీసుకొచ్చిన ‘కుడా’ ఫలితంగా కంప్యూటింగ్లో వచ్చిన వేగం మరింత ముందుకు సాగేందుకు తోవ చూపింది.అలెక్స్ నెట్కు శిక్షణ ఇచ్చేందుకు కొందరు ఎన్విడియాకు చెందిన ‘కుడా జీపీయూ’లను ఉపయోగించుకున్నారు. డీప్ లెర్నింగ్ ఆవిర్భవించింది. ఆ కీలక పరిణామం ఏఐ విప్లవానికి నాంది పలికింది. భారీ జీపీయూ క్లస్టర్లను నిర్మించకుండా డీప్ లెర్నింగ్కు ఉన్న పరిమితులను అన్వేషించేదెట్లా? వాటిని నిర్మించడానికి కోట్లాది డాలర్లు అవసరం. అంత ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుందా? క్లస్టర్లను నిర్మించకపోతే, అది ఎప్పటికీ మనకు తెలియదు. వేలాది ఇంజినీర్లు డీప్ లెర్నింగ్ పైన, అడ్వాన్సింగ్, స్కేలింగ్ డీప్ లెర్నింగ్ పైన పదేళ్ళపాటు కృషి చేశారు. మా మొదటి ఏఐ సూపర్ కంప్యూ టర్ డీజీఎక్స్–1ను శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్కు 2016లో అందించాం. ఏఐపై పనిచేస్తున్న నా స్నేహితుల బృందం ‘ఓపెన్ ఏఐ’ పేరుతో ఆ కంపెనీని నెలకొల్పింది. వాళ్లే ‘చాట్జీపీటీ’ తెచ్చారు.తోటమాలి నేర్పిన పాఠంఏఐలో తదుపరి అల రోబోటిక్స్ కాబోతోంది. రోబోలు, రోబో టిక్ వాహనాలు, హ్యూమనాయిడ్ రోబోలు, చివరకు రోబోలు కాప లాగా ఉండి నడిపించే భారీ గిడ్డంగులను నిర్మించే వందలాది కంపె నీలతో మేం కలసి పనిచేస్తున్నాం. కానీ, మా రోబోటిక్స్ పయనంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాం. డీప్ లెర్నింగ్ అంటే ఎవరికీ అర్థం కాని సమయంలో కలన గణితాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచపు మొదటి రోబోటిక్ కంప్యూటర్ను నిర్మించాం. మేం పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే, మార్పు చెందే, చతికిల పడినా తిరిగి లేవ గలిగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వయసులో ఉండగా, ఒక వేసవిని జపాన్లో గడిపాం. ఒక వారాంతంలో క్యోటో వెళ్ళి, సిల్వర్ టెంపుల్ చూశాం. అది ఆకర్షణీయమైన మోస్ గార్డెన్కు ప్రసిద్ధి. అక్కడ ఒక ఒంటరి తోటమాలిని గమనించాను. అక్కడ ప్రపంచంలో దాదాపు ప్రతి రకం నాచునూ పెంచుతారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. ‘నిర్జీవంగా మారిన నాచును తొలగిస్తున్నాను’ అని జవాబిచ్చాడు. ‘కానీ మీ గార్డెన్ చాలా పెద్దది కదా!’ అన్నాను. ‘నేను 25 ఏళ్ళుగా ఈ తోట ఆలనాపాలనా చూస్తున్నాను. నాకు కావలసినంత సమయం ఉంది’ అని జవాబిచ్చాడు. జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత సునిశితమైన పాఠాలలో అదొకటి. ఈ తోటమాలి తనకు వచ్చిన కళకు అంకితమయ్యాడు. మనమూ అదే బాటలో నడిస్తే, మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. నేను చేయవలసిన పనుల ప్రాధాన్య క్రమాన్ని రాసుకుని, ప్రతి రోజూ ఉదయం, ఆ జాబితాలోని మొదటి పనితో ప్రారంభిస్తా.ఏ పని తర్వాత ఏ పని చేయాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉంటాను. నేను పనిలో ఉండగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి లేదా అడిగి అవాంతరం కల్పించినా ‘నాకు చాలా సమయం ఉంది. నా పని పూర్తి చేసుకోగలను’ అని చెబుతాను.సూపర్ పవర్స్మనం పడే వేదనలు, కష్టాలు మన వ్యక్తిత్వాన్ని పటిష్ఠ పరు స్తాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నించి చూద్దామనే లక్షణం అలవడుతుంది. నా సామర్థ్యాలలో నేను ఎక్కువ విలువ ఇచ్చు కునేది నా ఇంటెలిజెన్స్కు కాదు. కష్టనష్టాలను భరించగల నా సహనశీలతకు; ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ పనిపై సుదీర్ఘమైన కాలం పనిచేయగల నా పట్టుదలకు; ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగల శక్తికి; త్వరలోనే మరో అవకాశం రాబోతోందనే నా ఆశాభావానికి! వాటినే నేను నా ‘సూపర్ పవర్లు’గా పరిగణిస్తాను. మీకు కావాల్సింది కనుగొనగలరని భావిస్తున్నాను. మొదటి రోజునే ఒక నిర్ణయానికి వచ్చేయాలని అనుకోవద్దు. తక్కువ కాలంలోనే దాన్ని కనుగొనగలగడం కూడా ముఖ్యం కాదు. కానీ, మీ జీవిత కాలాన్ని అంకితం చేయడానికి ఒక పనిని మీరు కనుగొన గలరని ఆశిస్తున్నాను. మీ నైపుణ్యాలకు దానిలో పదును పెట్టుకోండి. అది మీ జీవితకాల కృషి కావాలి. చివరగా, చెప్పేది ఒక్కటే. జీవితంలో దేని తర్వాత ఏమిటో నిర్ణయించుకోవాలి. జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. కానీ, ప్రాధాన్య క్రమాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యమైన పనులు చేసేందుకు కావలసినంత సమయం చిక్కుతుంది. -
మళ్లీ అణ్వాయుధ పోటీ?
అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పున రుద్ధరించవలసిందిగా రక్షణ (ఇప్పుడు ‘యుద్ధ విభాగం’గా పిలుస్తున్నారు) శాఖను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 29న ప్రకటించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే! అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి, అణు పాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. ‘‘చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది’’ అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది స్పష్టం. రష్యా పుట్టిస్తున్న దడట్రంప్ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళగల రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీ క్షించింది. బురైవెస్నిక్ (ఆకాశం నుంచి జారిపడే) క్రూజ్ క్షిపణిని... అక్టోబర్ 21న, అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను... అక్టో బర్ 28న పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం కాదు. సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి రావు. ప్రయోగ వాహకాలను పరీ క్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా పునరుద్ఘాటించింది. కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14,000 కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతమున్న క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం. ఇక పొసైడాన్... మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10,000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. గరి ష్ఠంగా గంటకు 100 నాట్ల (185 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగ లదు. నీటిలో 1,000 మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక రణతంత్ర సామర్థ్యాలకు అందనిది. అణ్వాయుధాన్ని కూడా తగిలించుకున్న పొసైడాన్ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించగలదు. భూగోళానికి, మానవాళికి ఇది చూపించగల ప్రళయం మాటలకు అందనిది. ‘ఐరన్ డోమ్’తో మారిన పరిస్థితిప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడిక (ఏబీఎం)కు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహన (మ్యాడ్)ను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఏబీఎం ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న సంక్లిష్టమైన,సాంకేతిక–వ్యూహాత్మక ఒడంబడిక. పోగుపడుతున్న సామూహిక విధ్వంసక ఆయుధాల (డబ్లు్య.ఎం.డి.)తో రెండు అగ్ర రాజ్యాల మధ్య అభద్రత నెలకొన్న నేపథ్యంలో కుదుర్చుకున్నది. అయితే, 2001 సెప్టెంబర్ 11 (9/11) పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలోనున్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. కడచిన దశాబ్దంలో అది వైఫల్యాలను చూసింది. సైంటిస్టులు ప్రమాదాల్లో హతులయ్యారు. కానీ, కార్యక్రమం కొన సాగింది. అక్టోబర్ 21న విజయవంతమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రక టన బహుశా పుతిన్ను ఈ పరీక్షకు పురిగొల్పి ఉండవచ్చు. ‘అమె రికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు’ శీర్షికతోనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనా. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తుకు తెస్తోంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా? నిరాయుధీకరణే దారిపాకిస్తాన్తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వా యుధాలు డోమ్లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ‘‘సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించడం అస్థిరతకు ద్వారాలు తెరుస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుస్తుంది’’ అని ఆసియా –పసిఫిక్ లీడర్షిప్ నెట్వర్క్ (ఏపీఎల్ఎన్) అనే ప్రాంతీయ బృందం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఆ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నారు. ట్రంప్ అణు సంయ మనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను ఉల్లంఘిస్తారో చూడవలసి ఉంది. అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయు ధీకరణకు ఎల్లప్పుడూ పోరాడే భారత్ తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది. వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
శత్రువు తెలుసు, మిత్రులెవరో తెలీదు!
వర్తమాన భారత సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణి స్తున్నారు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (సీసీడీ) అనే భావన ఇప్పుడు క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. ఈ కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజా స్వామ్య కూటమి (ఎన్డీఏ).ఈ వ్యవస్థ మారాలని అత్యధికులు ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది – ఎన్డీఏను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరి ష్కారం. అయితే, ఆచరణ అంత సులువు కాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే మాటకు అర్థాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా అన్వయించుకోవచ్చు.లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మనదేశంలో సాగిన ఉద్యమాలన్నీ పౌర సమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా వెలిగిన పౌర సమాజాన్ని కూడ ఇప్పుడు సీసీడీ కలుషితం చేసేసింది. సమానత్వ, సహోదర, సామ్యవాద భావాల నుండి సమా జాన్ని తప్పించే పనిలో పడింది. దీనిని శుద్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం ఉంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో మనకు నచ్చని పార్టీనో, కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ కూడా కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారు. వాళ్ళలో ఓ70 కోట్ల మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం చేసేబృహత్తర పథకాన్ని రచించి కచ్చితంగా ఫలితాలనుసాధించే కార్యాచరణ ఒకటి ఉండాలి.అయితే, ప్రజాస్వామ్యం పేదది కాదు; పేదోళ్ళదిఅంతకన్నా కాదు. రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి నడిపే నియంతృత్వంగా ప్రజా స్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పార డాక్సీ! ఈ వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి అన్నమాట! ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.అయితే, సమాజం చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సీసీడీ ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమను తాము అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు పలకలేదు. 2014 నుండి 2024 వరకు జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం మాత్రమే!అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు ఎన్డీఏ కూటమికి వ్యతి రేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్థం ఏమిటీ? ఎన్డీఏ కూటమి తన సొంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యత వల్ల మాత్రమే గెలుస్తున్నది.విపక్షాలు ఏకం అయితే ఎన్డీఏ కూటమిని ఓడించడం సులువు అని దీన్నిబట్టి అర్థమవుతుంది. ఒక సీటు దగ్గర, ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుని విడిపోతుంటాయి. మరోవైపు, ఎన్డీఏ కూటమి ఏకశిలా సదృశంగా సమైక్యంగా ఉంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్ వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీశ్ కుమార్ వంటి సోషలిస్టులు కూడా ఉంటారు. అయినా, అందరూ ఒక్కటై ఉంటారు. అది వాళ్ళ విజయ రహస్యం.విపక్షాలను ఏకం చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) అనే ఒక పౌరసంస్థ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుం బిగించింది. ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నా లజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగా ఉన్నాసరే ఎన్నికల్లో ఓడి పోయింది. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్కు ఓట్లు పెద్దగా పెరVýæకపోయినా (4–5 శాతం), సీట్లు మాత్రం భారీగా పెరిగి, అధికారాన్ని చేపట్టింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నచోటనే ‘ఎద్దేలు కర్ణాటక’ ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ సంస్థ ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి. ఇదొక సానుకూల సంకేతం. తొలి అడుగులో, వామపక్ష (మార్క్స్), సామాజిక న్యాయ (అంబేడ్కర్) ఆదర్శాలుగల రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సీసీడీ, ఎన్డీఏ కూటమి బాధిత సమూహాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మత సామరస్యం ప్రధాన ఆదర్శం. అలాగే బీసీలు, ఆదివాసీలు, మహిళలు, కార్పొరేట్ ప్రాజెక్టుల నిర్వాసితులు. ఆధిపత్య కులాల్లోని పేదలు, ఉదారవాదులకు వారివైన ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. ఇలా విభిన్న లక్ష్యాలున్న సమూహా లన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి. లోక్ సభ ఎన్నికల్లో ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యాన్ని సాధించగలమనే దాని మీదనే ఇప్పుడు మేధామథనం సాగాలి.-వ్యాసకర్త సమాజ విశ్లేషకులు-డానీ -
వైట్ కాలర్ ఉగ్రవాదం... ఓ వాస్తవం
నవంబర్ 10 సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడుతో న్యూఢిల్లీ గతుక్కుమంది. భద్రతా సంస్థలు ఒక ప్రధాన నిందితుడిని గుర్తించగలిగాయి. కశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఈ డాక్టర్ అధునాతన టెర్రర్ మాడ్యూల్లో భాగమని భావిస్తున్నారు. ఈ వైట్–కాలర్ టెర్రర్ మాడ్యూల్కు పాకిస్తాన్లో పేరుమోసిన జైషే మహమ్మద్ సంస్థతో సంబంధం ఉన్నట్లు వెలుగు చూస్తున్న సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు తాము నేరుగా ప్రమేయం పెట్టుకోకుండా, విద్యావంతులైన స్థానిక రిక్రూట్లతో దుశ్చర్యలకు పాల్పడే ధోరణి పెరుగుతోంది. విద్యావంతుల దుశ్చర్య‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా, ఉగ్రవాద ప్రయత్నాలలో ఎక్కడా విరామం కనిపించడం లేదు. భద్రతా దళాలు మే నెల నుంచి, కొన్ని డజన్ల ప్రయత్నాలను భగ్నం చేసినట్లు నిపుణుల అంచనా. స్థానిక మాడ్యూళ్ళ ప్రమేయమే చాలా వాటిలో ఉంది. కారు పేలుడుకు ముందు, వివిధ చట్ట సంస్థల అధికారులు రెండు గణనీయమైన డంపులను బట్టబయలు చేయగలిగారు. పోలీసులు నవంబర్ 9న వసతి భవనాల నుంచి 350 కిలోల అమోనియం నైట్రేట్తో సహా దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కశ్మీర్ నుంచి పనిచేస్తున్న ఒక ఉగ్ర ముఠాకు చెందినవి. స్వాధీనపరచుకున్న వాటిలో అసాల్ట్ రైఫిళ్ళు, పిస్తోళ్ళు, బాంబుల తయారీకి ఉపయోగపడే టైమర్లు, రిమోట్ డిటొనేషన్ సాధనాలు కూడా ఉన్నాయి. గుజరాత్ ఉగ్ర నిరోధక స్క్వాడ్ (ఏటీఎస్) అదే రోజున ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసింది. వారి నుంచి బిరెట్టా పిస్తోళ్ళు, తూటాలు స్వాధీనపరచుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ డాక్టర్లు, విశ్వవిద్యాలయ ఉద్యో గులు నిందితులుగా ఉన్నారు. వైట్–కాలర్ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణికి ఇవి మరిన్ని ఆధారాలను సమకూర్చాయి. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సాగి స్తున్న సీమాంతర ఉగ్రవాదంలో మారిన వ్యూహానికి ఢిల్లీ ఘటన అద్దం పడుతోంది. అది ఇక ఎంతమాత్రం విదేశీ ముష్కరులపై ఆధార పడటం లేదు. సరిహద్దుల నుంచి నేరుగా చొర బడేటట్లు చేయడం లేదు. భారతదేశం లోపల వృత్తి నిపుణులను మతోన్మాదులుగా తయారు చేసి వారిని దాడులకు ఉపయోగించుకునే పనికి పాకిస్తాన్ నిగూఢ వ్యవస్థ పాల్పడుతోంది. ఇది తమకేం సంబంధం లేదని చెప్పుకొనేందుకు పాక్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం. దీనివల్ల ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్తో, దాని లోని సంస్థలతో నేరుగా ముడిపెట్టడం కుదరదు.మారిన పాక్ వ్యూహంపాక్ ఇలా వ్యూహం మార్చుకోవడం వెనుక దేశీయ, అంతర్జాతీయ అంశాలు చాలా ఉన్నాయి. ఉగ్ర సంఘటనల్లో పాత్రకుగానూ అంతర్జాతీ యంగా ఎదురయ్యే విఘాతాలను తప్పించుకోవా లని పాక్ యోచిస్తోంది. ‘ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ ఈ మధ్య అంటే అక్టోబర్ నెలలో పాకిక్కు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. నిషే ధిత జాబితా నుంచి 2022లో బయటపడినందుకు సంబరపడిపోవద్దనీ, అది గుప్త ధనాన్ని మార్చడం, ఉగ్రవాదులకు నగదు చేకూర్చడానికి సంబంధించి అంతర్జాతీయ పర్యవేక్షణ నుంచి తప్పించుకున్నట్లు కాదనీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోపల కూడా పరిస్థితులు సవ్యంగా లేవు.‘తెహ్రీక్–ఏ–తాలిబాన్ పాకిస్తాన్’ మళ్ళీ విజృంభిస్తోంది. అఫ్గానిస్తాన్తో ఘర్షణ కొనసాగుతోంది. ఫలితంగా, పాక్ సైన్యం ఆంతరంగిక భద్రతా విధుల పైనా, డ్యూరాండ్ రేఖ పైనా ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తోంది. ప్రాంతీయ ఘర్ష ణల్లో వ్యూహాత్మక లివరేజీని నిలబెట్టుకుంటూనే అంతర్జాతీయంగా తనకున్న చెడ్డ పేరును చెరిపేసు కుని, కొత్త అవతారం దాల్చినట్లుగా కనిపించవలసిన అవసరాన్ని అది గుర్తించింది. భారతదేశపు భద్రతా సంస్థలు కనివిని ఎరుగని సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. విదేశీ చొర బాటుదారులకు, దేశీయ కుట్రదారులకు మధ్యనున్న రేఖలు చెరిగిపోతున్నాయి. టెర్రర్ మాడ్యూళ్ళు వృత్తి నిపుణుల ముసుగును కూడా వేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అవి ఏవో చెదురుమదురు దాడులకు ఉద్దేశించినవి కావనీ, సరిహద్దుకు ఆవల నున్న సూత్రధారుల ఆదేశాల మేరకు విస్తృత దాడులకు పథకాలు రచించుకున్నాయనీ తేలుతోంది. భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరిస్తూ నూతన రిక్రూట్మెంట్ మార్గాల రూపు రేఖలను కనిపెట్టవలసి ఉంది. వృత్తి విద్యా సంస్థల్లో రాడికలైజేషన్పై మానవ ఇంటెలిజెన్స్ పెంచు కోవాల్సి ఉంది. ఎవరెవరు చేతులు కలుపుతున్నారో గ్రహించేందుకు ఫోరెన్సిక్ డేటాను, డిజిటల్ నిఘాను వినియోగించుకోవాలి. సంస్థలు కూడా ఉద్యోగాలిచ్చే ముందు క్షుణ్ణంగా నేపథ్యాలు తెలుసు కోవాలి. యూనివర్సిటీలు, వృత్తి విద్యా సంస్థల లోపల కౌంటర్–రాడికలైజేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఫ్రాన్స్ 2018లో చేపట్టిన ‘కాపాడుకునేందుకు నివారణ’ మార్గాన్నే మనమూ అనుసరించవచ్చు. సామాజిక, విద్యా, భద్రతా, జైలు వ్యవస్థలను కూడగట్టుకుని ప్రభుత్వం సమ న్వయ కార్యాచరణ ద్వారా ఎవరూ ఉగ్రవాదం వైపు మళ్ళకుండా నివారించడంపై దృష్టి పెట్టాలి.లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్.కె. సైనీ (రిటైర్డ్)వ్యాసకర్త సైనిక దళ మాజీ వైస్ చీఫ్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)విశ్లేషణఎర్ర కోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనను ఉగ్ర దాడిగా ముద్ర వేయడంపై ప్రభుత్వం అభినందనీయమైన రీతిలో ఆచితూచి వ్యవహరించింది. దర్యాప్తు మొదలైన రెండు రోజుల తర్వాతే, దాన్ని ధ్రువపరచింది. కొన్ని ప్రాథమిక వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఒక మాడ్యూల్ కశ్మీర్లో పనిచేస్తోంది. పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు సహారన్పుర్, ఫరీదాబాద్ మీదుగా దేశ రాజధానికి చేరుకున్నాయి. ఆ రెండూ పరస్పర సంబంధం కలిగినవనీ, పాలుపంచుకున్నది ఒకే మాడ్యూలేననీ కొత్త డేటా తెలుపుతోంది. కానీ ఎవరి ప్రేరణతో జరిగిందనేది స్పష్టం కాలేదు. దీన్ని మరింత ప్రమాదకరమైనదిగా భావించవలసి వస్తోంది. ఇది అజ్ఞాతంగా పాకుతూ పోయే వైరస్ లాంటిది. డాక్టర్ టెర్రర్పోలీసులకు సహకరించవద్దని ఉద్భోదిస్తూ జైషే–మహమ్మద్ పోస్టర్లు నౌగామ్, శ్రీనగర్లలో అక్టోబర్లో దర్శనమిచ్చాయి. అప్రమత్తంగా ఉన్న పోలీస్ సూపరింటెండెంట్ వాటికి కారకుడైన వ్యక్తిని గుర్తించారు. అతను అదీల్ అహ్మద్ రాథెర్ అనే డాక్టర్. అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశా లలో సీనియర్ రెసిడెంట్గా పనిచేశాడు. జమ్ము–కశ్మీర్ పోలీసులు ఆ వైద్య కళాశాలలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కనుగొన్నారు. వాళ్ళు ఉత్తర ప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేయడంతో, అది నవంబర్ మొదటి వారంలో సహారన్పుర్కు మకాం మార్చిన రాథెర్ అరెస్టుకు దారి తీసింది. అక్కడ తీగ లాగితే ఫరీదాబాద్లో డొంక కది లింది. ముజమ్మీల్ గనాయీ అరెస్టయ్యాడు. పుల్వామాకు చెందిన అతడు ఫరీదాబాద్లోని అల్–ఫలా ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తు న్నాడు. ఇవి నవంబర్ మొదట్లో జరిగిన సంఘ టనలు. ఫలితంగా, ఫరీదాబాద్లో అమో నియం నైట్రేట్తో సహా సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. మరింత మంది ఉగ్రవాదులను పసిగట్టే పనిని పోలీసులు నవంబర్ 10న ప్రారంభించి నప్పటికీ, ఆ సాయంత్రం ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలింది. సీసీటీవీ ఫుటేజీలో ఉమర్ ఉన్–నబీ అనే మరో డాక్టర్ పైకి తేలాడు. కారు నడిపింది అతడేనని ఫోరెన్సిక్ ఆధారాలు వెల్ల డించాయి. అతనూ ఫరీదాబాద్లోని అదే ఆస్ప త్రికి చెందినవాడు. షోపియాన్లో ఒక రాడికల్ ఇమామ్ను, అల్–ఫలాకు చెందిన మహిళా డాక్టర్ను లక్నోలో అదుపులోకి తీసుకున్నారు. మరింత మంది పట్టుబడవచ్చు. అసలు కారు బాంబును ఉద్దేశపూర్వకంగానే పేల్చారా అనేది సందేహంగా మారింది. అక్కడికి కొద్ది వందల గజాల దూరంలో శ్రీ గౌరీ శంకర్ ఆలయం ఉంది. అక్కడ కారు బాంబును పేల్చి ఉంటే మరింత మంది చని పోయి ఉండేవారు. ఉగ్ర వాదులు సాధారణంగా కోరుకునే మతపరమైన కల్లోలాలను రేకెత్తించి ఉండేది. ముఠాలోని ఇతర సభ్యులు పట్టుబడటంతో, అతను భయోత్పాతానికి లోనై పేల్చేసుకున్నాడన్నది ఒక భావన. ఏ విధంగా చూసినా, ఇది రెండేళ్ళుగా సాగుతున్న పథకంగా కనిపిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’కు ముందే ఈ సెల్ క్రియాశీలంగా ఉంది కనుక, జైష్, లష్కర్ల పురిటి గడ్డపై వైమానికి దాడులకు ప్రతీకారంగా ఇది జరిగి ఉండవచ్చునుకోవడానికి లేదు. కాచుకుని ఉన్న శత్రువులుఇది సడీచప్పుడు లేకుండా పనిచేస్తూ వచ్చిన, విస్తృతమైన స్లీపర్ సెల్. అనుమానించడానికి ఏమాత్రం అవకాశం లేని వ్యక్తులు దీనిలో ఉన్నారు. వారందరూ కశ్మీర్కు చెందినవారు కాదు. ఈ ధోరణిని అర్థం చేసుకునేందుకు స్పెయిన్, ఇటాలియన్ పోలీసుల చర్యలోకి వెళ్ళాలి. వారు అక్కడ ఒక పెద్ద పాకిస్తానీ సెల్ను కనుగొన్నారు. అది జనాన్ని ఉగ్రవాదం వైపు నడిపిస్తోందని తేలింది. దాని ఆనుపానులు కనుగొనేందుకు పోలీసులకు రెండేళ్ళు పట్టింది. ఈ ఏడాది మార్చిలో మాత్రమే వారు కొందరిని అరెస్టు చేయగలిగారు. ఒక కీలక వాస్తవాన్ని గుర్తించి తీరాలి. ఉగ్రవాదాన్ని సరికొత్తగా సృష్టించలేం. ప్రస్తుతమున్న వేర్పాటువాద పరిస్థితిని ఆధారం చేసుకునే అది పైకి లేస్తుంది. వీటిలో రెండవ దానికి పాకిస్తానే చక్కని ఉదాహరణ. ఢిల్లీ ఇంతవరకు ఉపేక్షించిన ఒక అంశానికి వ్యతిరేకంగా కార్యాచరణకు దిగాలి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత విద్వేషం సెగలు గక్కుతోంది. రెండు వర్గాలకు చెందిన మనుషులు చనిపోయిన అంశాన్ని మీడియా ప్రముఖంగా పేర్కొనవలసిన అవసరం ఉంది. ఇది దేశాల సరిహద్దులను దాటిన అంతర్జాతీయంగా కనిపిస్తున్న ధోరణి. కీలక ఉగ్రవాద నాయకులు తుర్కియేలోని ‘సూత్రధారుల’తో సమావేశమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అంకారాను హెచ్చరించడం కూడా సమయోచితం అనిపించుకుంటుంది. భారతదేశాన్ని ఎలాగైనా ముక్కచెక్కలు చేయాలని చాలా మంది శత్రువులు కాచుకుని కూర్చున్నారు. భారత్–పాక్ యుద్ధానికి దిగాలని చూస్తున్నారు. భారత్ ఆర్థికంగా స్థిరంగా వృద్ధి చెందుతూండటం అనేక రాజధానులలో గణనీయమైన ఆందోళన రేకెత్తిస్తోంది. తారా కార్థా వ్యాసకర్త నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మాజీ డైరెక్టర్(‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇండియాకు మునీర్ బెడద తప్పదా?
పాకిస్తాన్ పార్లమెంట్ ప్రస్తుతం ప్రతిపాదిత 27వ రాజ్యాంగ సవరణపై చర్చిస్తోంది. ఈ సవరణ 243వ అధికరణాన్ని పూర్తిగా మార్చేసి దేశ సాయుధ దళాలపై నియంత్రణ, ఆధిపత్యానికి సంబంధించి మౌలికంగా కొత్త రూపు నివ్వనుంది. దేశ రాజకీయ రంగస్థలంపై సైన్యానికున్న పట్టును దృష్టిలో పెట్టుకుని చూసినపుడు, ఆ చర్చ చాలావరకు నిరుపయోగమైనదే అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో భారత్–పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన తర్వాత, పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి అసీమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి లభిస్తున్న వ్యక్తిగత మద్దతు ధీమాతో ఆయన సాయుధ దళాలపై తన అధికారాన్ని మరింత పటిష్ఠపరచుకుంటున్నారు. పౌర ప్రభుత్వ–సైనిక సంబంధాలలో ఇప్పటికే మొగ్గు సైన్యం వైపు ఎక్కువగా ఉంది. తక్కెడలో సైన్యం వైపు బరువు మరింత పెరిగేటట్లు మునీర్ చూసుకుంటున్నారు. పదాతి దళానికే పెద్ద పీటప్రతిపాదిత రాజ్యాంగ సవరణ పౌర–సైనిక సంబంధాలలో, సైన్యం పాత్రలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టే లక్ష్యాలతో ఉంది. త్రివిధ దళాలపైన పెత్తనం వహించేటట్లుగా రక్షణ దళాల ప్రధానాధికారి (సీడీఎఫ్) పదవిని సృష్టించాలని ప్రతిపాదిస్తోంది. సీడీఎఫ్గా ఎప్పుడూ పదాతి దళాల ప్రధానాధికారే ఉండాలని పేర్కొంటోంది. ఆయన పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచుతోంది. సీడీఎఫ్కు వీలు కల్పించేందుకు, చిరకాలంగా ఉన్న త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్ (సి.జె.సి.ఎస్.సి.) పదవిని త్వరలో రద్దు చేయనున్నారు. సంయుక్త కమిటీకి ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా రిటైరవడం, ఆ పదవి రద్దవడం ఒకేసారి జరగనున్నాయి. ఐదు నక్షత్రాల ర్యాంకులు పొందిన సైనిక అధికారులకు ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ వంటి సైనిక బిరుదులను ప్రదానం చేయడం అసాధా రణం ఏమీ కాదుకానీ, అటువంటివారిని అభిశంసన ద్వారా తప్ప వేరే విధంగా తొలగించడానికి వీలు లేకపోవడం పాక్లో కనిపించే విచిత్రమైన అంశం. అన్ని అణు, వ్యూహాత్మక సంపత్తులను పర్యవేక్షించే విధంగా జాతీయ వ్యూహాత్మక దళ కమాండర్ (సి.ఎన్.ఎస్.సి.)గా ఒకరిని నియమించాలని కూడా ఆ సవరణ ప్రతిపాదిస్తోంది. ఆర్మీ చీఫ్ సిఫార్సు మేరకు, సైన్యం నుంచే ఒకరిని ఆ పదవిలో ప్రధాన మంత్రి నియమిస్తారు. సూటిగా చెప్పాలంటే, దానిపై నియంత్రణ పౌర ప్రభుత్వం నుంచి చేజారిపోతోంది. వీసమెత్తు ప్రతిఘటన లేకుండా, పాక్లో బాహాటంగా, ఇలా అధికారం కేంద్రీకృతం కావడం, పర్వేజ్ ముషారఫ్ హయాంతో సహా, ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈ పరిణామాలు పాక్, భారత్ రెండింటిపైనా గణనీయమైన ప్రభా వాన్ని చూపనున్నాయి. అనూహ్యంగా ఎదిగిన మునీర్పాక్ను 1977 నుంచి 1988 వరకు పాలించిన సైనిక పాలకుడు జియా–ఉల్–హక్ తర్వాత, తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్ కానున్నారు. జియా కంటే కూడా మునీరే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడనుకోవాలి. సైనిక తిరుగుబాటు మాట లేకుండానే ఆయన మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చు కున్నారు. అసీమ్ అధికారాన్ని పటిష్ఠపరచుకున్న తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఆయన 2022 నవంబర్లో ఆర్మీ చీఫ్ అయ్యారు.హిందువులు, ముస్లింలు కలసి ఎన్నడూ సహజీవనం సాగించలేరంటూ వ్యాఖ్యానించి, హిందూ వ్యతిరేక ధోరణితో ఈ ఏడాది మొదట్లో వార్తల కెక్కారు. ఘోరమైన పహల్గామ్ దాడికి సరిగ్గా ఒక నెల ముందు ఆయన నోటి నుంచి ఆ ప్రేలాపనలు వెలువడ్డాయి.పాక్లో అడుగుజాడలున్న ఉగ్రవాదులు పహల్గామ్లో పౌరులను పొట్టనబెట్టుకోవడంతో, పాక్పై భారత్ దాడులను నిర్వ హించింది. ఆ స్వల్పకాలిక సమరంలో, తాను 1971 మాదిరి విజ యాన్ని సాధించినట్లుగా పాక్ నిస్సిగ్గుగా ఒక ప్రాపగాండా ప్రారంభించింది. దాన్ని ఊతంగా చేసుకునే మునీర్ దేశంలో తన స్థితిని పటిష్ఠపరచుకుని, ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ గడించారు. పాక్ను ట్రంప్కు చేరువ చేసే పనిని యుక్తితో నిర్వహించారు. సౌదీ అరేబి యాతో రక్షణ ఒప్పందాన్ని ఆధికారికం చేసుకోవడంతో సహా పశ్చి మాసియాకు స్నేహహస్తాన్ని చాచే వ్యూహాత్మక ప్రణాళికను రచించడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణతో, మునీర్ పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగించినట్లవుతుంది. త్రివిధ దళాలు ఆయన కనుసన్న ల్లోనే మెలుగుతాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరమ అధ్వాన్నంగా తయారైన పరిస్థితుల్లో, తెలివిగా పావులు కదుపుతూ, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని హస్తగతం చేసుకోకపోయినా నేడు పాక్లో ఆయనకు ఎదురు చెప్పగలవారు లేరు. ప్రస్తుత సవరణ, వైమానిక, నౌకా దళాలను కూడా ఆర్మీ చీఫ్ పరిధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆ రెండు దళాలకు రుచించకపోవచ్చు. సైనిక ప్రధానాధికారే ఎల్లప్పుడూ సి.ఎన్.ఎస్.సి.గా ఉంటాడని నిర్దేశించడాన్ని అవి వ్యతిరేకించవచ్చు. క్షిపణులు సాధారణంగా నౌకాదళం వద్ద ఉంటాయి. ఇపుడీ సవరణతో మొత్తం పాక్ అణ్వాయుధాలన్నీ పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వస్తాయి. సైన్యానికి ప్రస్తుతం ఉన్న పైచేయిని ధ్రువపరచే ప్రయత్నం మాత్రమే మునీర్ చేస్తూ ఉండవచ్చు. కానీ, ఇది కార్యనిర్వాహక వ్యవస్థ ఆదేశంగా కాకుండా, రాజ్యాంగ సవరణ రూపం పొందుతోంది. కనుక, భవిష్యత్ నాయకులకు, దీన్ని తిరగదిప్పడం అసాధ్యంగా పరిణమించవచ్చు. భారత్ ద్వేషమే ఆయుధంభారత్ పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం. ఇపుడు మరిన్ని అధికారాలున్న మునీర్ కింద పనిచేసే సైన్యం, భారత్కు గణనీ యమైన సవాల్గా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు. చిర కాలంగా, పాక్ సైన్యం దృష్టంతా భారతదేశంపైనే ఉంటూ వస్తోంది. అది ఇపుడు మరింత కేంద్రీకృతమవుతుంది. సాధారణ ప్రజానీకం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తానీ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికే వాటంగా ఉంటుంది. ప్రజల దృష్టిని మళ్ళించే అత్యంత ప్రభావయుక్తమైన వ్యూహంగా, అది భారతదేశంపై యుద్ధానికి, లేదా ఘర్షణకు దిగవచ్చు. భారత్కు వ్యతిరేకంగా సైన్యం చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపు తారు. అది వారిని ఏకం చేసే ఆయుధంగానూ పనికొస్తుంది. కనుక, మునీర్ ఎత్తుగడలను భారత్ తప్పనిసరిగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. హ్యాపీమ్యాన్ జాకబ్ వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ డిఫెన్స్ రిసెర్చ్’ ఫౌండర్–డైరెక్టర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పత్తి రైతుకు మరో పాడుకాలం
పత్తి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చూడగా, 1990ల కాలం అని వార్యంగా గుర్తుకు వస్తున్నది. అప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలలో పత్తి రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్రాలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని విదర్భ అయితే లెక్కలేనన్ని ఆత్మహత్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అటువంటి విపత్కర పరిస్థితి ఇంకా ఏర్పడనైతే లేదు; కానీ, నెమ్మదిగా రూపు తీసుకుంటున్న పరిణామాలను చూడగా, ఆ దుఃస్థితి పునరావృతం కాగలదేమోననే అనుమానం కలుగుతున్నది.1990లలో జరిగిందేమిటి?పత్తికి, నూలు వస్త్రాలకు భారతదేశం క్రీస్తు పూర్వం నుంచే పేరెన్నిక గన్నది కాగా, బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిందే మిటో తెలిసిందే. అక్కడి మిల్లుల కోసం ఇక్కడి రైతును కొల్లగొట్టి, స్థానిక చేనేత పరిశ్రమను ధ్వంసం చేసి, నేత కార్మికుడిని ఆకలి చావుల పాలు చేశారు. స్వాతంత్య్రానంతరం 1990లు వచ్చేసరికి అధికాదాయం పేరిట పత్తి పంటను విపరీతంగా ప్రోత్సహించి, అమ్మకాలను మాత్రం అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి, ధరలతో ఆటలాడారు. రైతు మరో పంటకు మారలేక, అక్కడే నిలవలేక, అప్పుల బాధకు తాళలేక, చావును ఎంచుకున్నాడు. ఆ సరికే భారత దేశపు డబ్ల్యూటీవో సభ్యత్వం, పశ్చిమ దేశాలకు కలసి వచ్చిన స్వేచ్ఛా వాణిజ్యం రైతు ఆత్మహత్యకు ఉరితాళ్లను పేనాయి.డబ్ల్యూటీవో సమయంలో వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల విషయమై ఇండియా, చైనా, బ్రెజిల్ తదితర దేశాలు ఒక్కటై గట్టిగా నిలబడి కొన్ని రాయితీలు సాధించాయి. ఆయా రంగాలపై కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నందున వాటిని కాపాడుకునేందుకు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతులపై తగినన్ని సుంకాలు విధించే హక్కు సంపాదించటం వాటిలో ఒకటి. ముఖ్యంగా అమెరికా తమ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండగా, ఇతర దేశాలు ఆ పని చేయరాదని ఆంక్షలు విధించటాన్ని అంగీకరించబోమన్నది మరొకటి. ఇంత జరిగినా పాశ్చాత్య దేశాలు పత్తి కొనుగోళ్లు, తమ పత్తి ఎగుమతులు, అందుకు కోటాలు, వస్త్రాల ఎగుమతిలో కోటాలు వగైరా ఎత్తుగడలతో సృష్టించిన సమస్యలు తక్కువ కాదు. అధిక దిగుబడి వంగడాలపై వారిదే ఆధిపత్యం అయ్యింది. దీనంతటి ప్రభావాలు బట్టల మిల్లులు, పత్తి వ్యాపారులపై కన్నా పత్తి రైతుపైనే పడింది. ఇపుడు, స్వేచ్ఛా వాణిజ్యం తమకు లాభసాటిగా లేనట్లు భావిస్తున్న ప్రస్తుత అమెరికా ప్రభుత్వం, డబ్ల్యూటీవో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించజూస్తుండటంతో, పత్తి రైతుకు 1990ల కాలం వలె కారు మేఘాలు తిరిగి కమ్ముకొస్తున్నాయి.అమెరికా ఒత్తిడితమ కొత్త వ్యూహంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని గాలికి వదలిన అమెరికా, వేర్వేరు దేశాలతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నది. అందుకోసం చర్చల పేరిట ఒత్తిడి, బ్లాక్మెయిలింగ్ పద్ధతిని అనుసరిస్తున్నది. ఇతరులను దారికి తెచ్చు కునేందుకు మొదటనే సుంకాలను భారీ ఎత్తున పెంచివేసి, అవతలి దేశాలు వాటి సుంకాలను తాము చెప్పినట్లు మార్చాలని, ఎత్తి వేయాలని షరతులు పెడుతున్నది. తమ పత్తి, మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తులకు పూర్తిగా గేట్లు తెరవాలంటున్నది. లేనట్లయితే, సుంకాలూ, వాణిజ్యాలతో సంబంధం ఉన్న రంగాలలోనే గాక,లేని విషయాలలోనూ ఏకపక్షపు చర్యలు తీసుకోగలమని హెచ్చరిస్తున్నది.ఈ పరిస్థితుల మధ్య జరిగిందే అమెరికన్ పత్తి దిగుమతులపై ఉండిన 11 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేయటం. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరుగగా, తిరిగి డిసెంబర్ వరకు పొడిగించారు. ఇది తాత్కాలిక చర్య అని పైకి చెప్తున్నారు గానీ, నమ్మదగినట్టు లేదు. ఎందుకంటే, ఇదే సమయంలో అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందం ఈ సంవత్సరం ఆఖరు నాటికి జరగవచ్చునని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్తో పాటు అమెరికన్ అధికారులు కూడా చెప్తున్నారు. అందు వల్ల, ఇప్పుడు తాత్కాలికం అంటున్నది దీర్ఘకాలికం కాగల ప్రమాదం పొంచి ఉంది. లేదా కనీసం 11 శాతం సుంకం గణనీయంగా తగ్గవచ్చు. ఏది జరిగినా ఇక్కడి పత్తి రైతుకు తీవ్ర ప్రమాదమే!సుంకం ఎత్తివేత ప్రత్యేకంగా అమెరికాకు మాత్రమే చేయలేరు గనుక మౌలికంగానే రద్దు కావటంతో అమెరికా సహా వేర్వేరు దేశాల నుంచి పత్తి నిల్వలు వచ్చిపడటం మొదలైంది. భారత ప్రభుత్వం తన నష్టాలు తాను చేయటం మొదలు పెట్టింది. గతంలో రైతులు ఎంత పత్తి తెచ్చినా కొనుగోలు చేస్తుండిన కాటన్ కార్పొరేషన్, ఎకరానికి 12 క్వింటాళ్లు మాత్రమేనని ఈసారి సీజన్కు ముందు షరతు విధించింది. పంట మార్కెట్కు రావటం మొదలైన తర్వాత తన ప్రకటనను తానే ఉల్లంఘిస్తూ 7 క్వింటాళ్లు మాత్రమే అంటు న్నది. తక్కిన పంటను వ్యాపారులు మద్దతు ధర కన్న తక్కువకు కొంటున్నా అధికారులు మాట్లాడటం లేదు. ఇదిగాక, ‘కపాస్ కిసాన్’ అనే కొత్త నిబంధన ఒకటి తీసుకువచ్చి, అందుకు అవస రమైన స్మార్ట్ ఫోన్లు లేని, ఆ సాంకేతికత తెలియని సామాన్య రైతులను యాతనలకు గురి చేయటం మొదలు పెట్టింది. ఇక, పత్తిలో తేమ నిబంధనలు ఎప్పుడూ ఉన్నవే.ఒప్పందం ఇంకెలా ఉండగలదో!అధికారికంగా సుంకాల ఎత్తివేత నుంచి మొదలుకొని, క్షేత్ర స్థాయిలో ఈ విధమైన ఎత్తుగడలు గానీ, కొత్త కాదు. అదే కథ తిరిగి నడుస్తున్నది. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతున్న తీరును చూసినప్పుడు, పత్తి రైతుకు 1990ల నాటి పరిస్థితి పునరావృతం కాగలదేమోననే భయం కలుగుతుండటం అందువల్లనే! మనం మరొకటి గమనిస్తున్నట్లు లేము. పత్తితో పాటు మొక్కజొన్నను, సోయాను కూడా అమెరికా బలవంతంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకు సహకరిస్తున్నారా అనే అనుమానం కలిగేట్లు, మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేయటంలోనూ పత్తి పంట తరహా షరతులు విధిస్తున్నారు. ఎకరానికి 18 క్వింటాళ్లు మాత్రమే కొనగలమన్నది ఆ నిబంధన. దీనిని బట్టి, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎట్లుండవచ్చునో ఎవరి ఊహ వారు చేయవచ్చు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇది భారతీయ–అమెరికన్ల విజయం
‘భారతీయులు వెళ్లిపోవాలి’... ఇదే ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మూకలు ఏడాదిగా చేస్తున్న నినాదం. భారతి సంతతి అమెరికన్లు వారి నినాదం విన్నారు, వెళ్లిపోయారు; కానీ ఇండియాకు కాదు. తాము ఎప్పటినుంచో మద్దతిస్తూ వచ్చి మధ్యలో వదిలేసిన డెమాక్రటిక్ పార్టీలోకి తిరిగి వెళ్లారు! న్యూయార్క్ నగర పునాదులను వారు కదిలించారు.సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ తాజా మేయర్ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించారు. మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో చిత్తుగా ఓడిపోయారు. మమ్దానీ న్యూయార్క్ మొట్టమొదటి ముస్లిం మేయర్. భారత మూలాలున్న తొలి మేయర్. ఈ వందేళ్లలో ఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు కూడా! మారిన రాజకీయ మొగ్గు‘అమెరికన్ డ్రీమ్’ను సాకారం చేసుకునేందుకు వచ్చిన భారతీయులు– విద్యావంతులు, కుటుంబ జీవులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఒక ఆదర్శప్రాయమైన సమాజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంప్రదాయికంగా మేము డెమాక్రటిక్ పార్టీ సానుభూతిపరులం. ఇటీవలి కాలంలో మాలో చాలామంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గడం మొదలైంది. క్రమశిక్షణ, వ్యాపార వ్యవస్థాపక సామర్థ్యం, కుటుంబ విలువల పరంగా అది మా జీవి తానుభవానికి దగ్గరగా ఉండటం, మరోవంక డెమాక్రాట్లు రాను రానూ సాంస్కృతిక పోరాటాల్లో మునిగిపోవటం ఇందుకు కారణాలు. నేను కూడా ఈ ఆకర్షణలో పడ్డాను. 1980లో అమెరికా వచ్చి నప్పటి నుంచీ నేను డెమాక్రాట్స్కే ఓటు వేశాను. గత అధ్యక్ష ఎన్ని కలకు మాత్రం దూరంగా ఉన్నాను. జో బైడెన్కు వయసు మీరడం, స్పష్టమైన దిశ కొరవడటం వల్ల ఆయన అభ్యర్థిత్వం నాకు నచ్చ లేదు. మరోవంక, రిపబ్లికన్ పార్టీ చెబుతున్నదీ కొంతవరకు సబబు గానే అనిపించింది. కుటుంబం, మతవిశ్వాసం అంశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాలు, సోషలిజం గురించి ఆయన చేసిన హెచ్చరికలు నన్ను ఆకట్టు కున్నాయి. మాలో ఇండియాలో పుట్టిపెరిగిన వారున్నారు. వారికి ‘సామ్యవాదం’ అనేది శుద్ధమైన సిద్ధాంతంగా అనిపించదు. రేషన్ క్యూలైన్లు, సరుకుల కొరతలు, ప్రజలు ఏది తినాలో ఎంత సంపా దించాలో నిర్ణయించే అవినీతిపరులైన అధికార గణం... ఇవన్నీ సామ్యవాదపు వాస్తవికతకు అద్దం పడతాయి. చెదిరిన ఆశలునాలాంటి వలసదారులకు, కింది స్థాయి నుంచి ఉన్నత స్థానా లకు ఎదిగిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ఉషా వాన్స్ వంటి వారికి రిపబ్లికన్ పార్టీ ద్వారాలు తెరుస్తుందని నేను అనుకున్నాను. కానీ గడచిన ఏడాది కాలంలో మా ఆశలు హరించుకుపోయాయి. ఒకప్పుడు ఎవరితోనైతే స్నేహం చేసిందో ఇప్పుడు వారిమీదే ‘మాగా’ ఉద్యమం నిప్పులు చెరుగుతోంది. లారా లూమర్ వంటి ఇన్ఫ్లుయె న్సర్లు ఇండియన్ ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకున్నారు. మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి కాంగ్రెస్ సభ్యులు హెచ్–1బి వీసాలకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. భారతీయులు ‘అమెరికన్ల ఉద్యోగాలు దొంగిలిస్తున్నారు’ అని దుష్ప్రచారం చేశారు. సంకే తాలు స్పష్టంగా వెలువడుతున్నాయి: మేం అమెరికాకు ఎంత చేసినా, ఎప్పటికీ పూర్తి అమెరికన్లం కాబోము!అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్లు రెండు శాతంకంటే తక్కువే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు 6 శాతం. మా సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. ‘ఫార్చ్యూన్ 500’ జాబితాలోని 16 కంపెనీలకు భారత సంతతి సీఈవోలే సారథ్యం వహిస్తున్నారు. వారి నాయకత్వంలోని ఈ కంపెనీల వార్షిక ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు పట్టుగొమ్మలుగా ఉన్న చిన్న వ్యాపా రుల నుంచి యూనివర్సిటీలు, ఆసుపత్రులను నిర్వహించే సైంటి స్టులు, ఇంజినీర్లు, వైద్యుల వరకు పలు రంగాల్లో విస్తరించి ఉన్న భారత సంతతి ప్రజలు మరే ఇతర దేశాల వలసదారుల కంటే మిన్నగా అమెరికాను బలోపేతం చేస్తున్నారు. అమెరికా అభ్యున్నతికి దశాబ్దాలుగా శ్రమిస్తున్న మమ్మల్ని ‘గో హోమ్’ అనడం ద్రోహమే!భారత సంతతి అమెరికన్లకు గుండెకాయ లాంటి న్యూజెర్సీ లోని ఎడిసన్ ఓటర్లు ఈ అవమానానికి తగిన జవాబు చెప్పారు. 2024లో అక్కడి ఒక ప్రదేశం ట్రంప్కు 30 పాయింట్ల ఆధిక్యంఇచ్చింది. ఈ నెలలో, డెమాక్రాట్ మికీ షెర్రిల్ దాన్ని 76 పాయింట్ల తేడాతో గెలుచుకున్నాడు. 106 పాయింట్ల ఈ స్వింగ్కు విధానాలతో సంబంధం లేదు; ఆత్మగౌరవం తెచ్చిన మార్పు ఇది.డెమాక్రాట్లా? రిపబ్లికన్లా? ఏమైనా, పార్టీ విధేయతకు సంబంధం లేని కారణాలతోనే భార తీయ అమెరికన్లు డెమాక్రాట్ల చెంతకు తిరిగి వస్తున్నారు. ఆత్మ గౌరవం, అస్తిత్వ రక్షణ అవసరమే ఈ మార్పు తెచ్చింది. అంతేగానీ ప్రగతిశీల రాజకీయాల పట్ల మూఢభక్తి ఇందుకు కారణం కాదు.డెమాక్రటిక్ పార్టీ అన్ని వర్గాలనూ కలుపుకొనిపోవడం గురించి మాట్లాడుతుంది. అయితే, ఒకప్పడు తనకు కంచుకోటలా ఉన్న మధ్యతరగతితో ఇప్పుడు సంబంధం కోల్పోయింది. వలసదారులు పాటించే కుటుంబ విలువల నుంచి అది దూరం జరిగింది. శ్రామిక కుటుంబాల రోజువారీ బతుకు పోరాటాలను విస్మరించింది. అతి వాదుల చేతిలో ఆ పార్టీ బందీగా మారింది. సంస్కృతుల పోరా టాల్లో అది మునిగితేలుతోంది. ‘బాలికలు దుస్తులు మార్చుకునే గదుల్లో (లాకర్ రూమ్స్లో) బాలురు ఉండటం’ అనే అంశం మీద స్కూళ్లు చర్చలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. ఒకపక్క మౌలిక విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న సమయంలో ఇలాంటి చర్చలు జరగడం పట్ల ‘నా’ లాంటి వలసదారులు సహా పలువురు అమెరి కన్ తల్లితండ్రులు దిగ్భ్రాంతి చెందారు.మమ్దానీ గెలుపు ఈ నూతన వాస్తవికత రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తోంది. ఒక సమాజపు ఆత్మవిశ్వాసం, స్వరం ఆయన ఎన్నిక వెనుక ఉన్నాయి. అదే సమయంలో, వాస్తవిక దృక్పథం లోపించిన సిద్ధాంతంతో ముడిపడిన ప్రమాదాలనూ అది వెల్లడిస్తోంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు నిర్వహిస్తామన్న ఆయన వాగ్దానం దయాపూరితంగా కనబడుతుంది. కానీ, పాత కాలపు ఇండియన్ సోషలిస్టు మోడల్ గురించి తెలిసిన నా లాంటి వారికి ఈ కథ ముగింపు ఎలా ఉండబోతోందో బాగా తెలుసు. అధికార గణస్వామ్యం, జనాకర్షక విధానం స్వల్పకాలంలో ప్రశంసలు కురిపించవచ్చు. అయితే అవి ప్రగతికి శత్రువులు. నాణ్యతకు బదులు నాసిరకంలో సమానత్వం వస్తుంది.రిపబ్లికన్లకు ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే వారు తమ దౌర్జన్య వైఖరిని విడనాడాలి. ఒకప్పుడు తమకు వన్నె తెచ్చిన తెగువ, యోగ్యత, ఆశావాదం వంటి విలువలను తిరిగి ఒంటబట్టించుకోవాలి. అందాకా, వారికి దూరమైన ఓటర్లు దూరంగానే ఉంటారు.వివేక్ వాధ్వావ్యాసకర్త విశ్లేషకుడు – ‘వయోనిక్స్ బయోసైన్సెస్’ సీఈఓ(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అమెరికాతో ఆచి తూచి...
ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చినట్లేనా? సంతకాలు చేయడమే తరువాయి అంటూ ఆరు నెలలుగా వింటున్నాం. అయినా, ఉభయ పక్షాలూ ఆ చివరి ఘట్టం చేరుకోలేకపోతున్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియా మీద విధించిన 25 శాతం అదనపు సుంకం విషయానికి వద్దాం. ప్రైవేటు రంగ సంస్థలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాయి. మరి ఆ 25 శాతం అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేస్తుందా? అలాంటి సంకేతాలేమీ లేవు.చమురు కొనకపోయినా...ఇండియా–యూఎస్ రక్షణ సహకారం మరో పదేళ్లు కొన సాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా యుద్ధ వ్యవహారాల మంత్రి పీట్ హెగ్సేథ్ ‘ఏసియాన్’ రక్షణ మంత్రుల సదస్సు సందర్భంగా అక్టోబర్ 31న కౌలాలంపూర్లో ప్రకటించారు. దీంతో వాణిజ్య వివాదం త్వరలోనే పరిష్కరం కాగలదన్న ఆశలు చిగురించాయి. ఇండియాకు రక్షణ సామగ్రి సరఫరా చేయడం ద్వారా అమెరికా బిలియన్ల డాలర్లను అర్జిస్తోంది. కాబట్టి మనపై ఆంక్షలు తొలగిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అమెరికా అధ్యక్షుడి లెక్కలు వేరేగా ఉంటాయి. ఇండియా జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాబోయే రోజుల్లో ఎస్–500 తరహా రష్యా అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ట్రంప్ అభ్యంతరం చెప్పరని అనుకోలేం. వాటిని సమకూర్చుకునేట్లయితే తాము ఇండియాకు రక్షణ పరికరాలను, విడిభాగాలను విక్రయించబోమంటూ పేచీ పెట్టరన్న గ్యారంటీ లేదు. చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తారని అనుకున్నామా? రష్యా చమురుకు చైనా కూడా భారీ కొనుగోలుదారు. నాటో కూటమి సభ్యులైన టర్కీ, హంగరీ సైతం గణనీయంగా ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అయినా, అమెరికా ఇండియాను మాత్రమే వేరు చేసి ఆంక్షల శిక్ష విధించింది. బూసాన్ (దక్షిణ కొరియా)లో ఎపెక్ సదస్సు సందర్భంగా ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ చర్చలు జరిపారు. అందులో రష్యా చమురు ప్రస్తావన తేలేదని అన్నారు. ఇండియా మీద ఆంక్షల కత్తి ఝుళిపించిన ట్రంప్ చైనా విషయంలో అలా చేయలేక పోయారు. ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా ముందే హెచ్చరించడం అందుకు కారణం కావచ్చు.‘క్వాడ్’ లేనట్లేనా?అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం చైనా ముప్పు నుంచి కాపాడుతుందన్న నమ్మకాన్ని పునఃసమీక్షించుకోవాలి. నంబర్ 1, నంబర్ 2 దేశాల నడుమ నెలకొన్న వ్యవస్థాగత పోరు సమసి పోనప్పటికీ, ఇరు దేశాలూ వ్యూహాత్మక సర్దుబాట్లు చేసుకుంటున్నందువల్ల ఇండియా ఎత్తుగడలు ఫలించే అవకాశం తగ్గిపోతుంది. యుక్తమైన దౌత్యవిధానం అనుసరించడం ద్వారానే ఈ ముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది.అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహం యథాతథంగా కొనసాగు తుందనడానికి ఇటీవలి ట్రంప్ ఆసియా పర్యటనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ వ్యూహంలో ఇండియా ప్రయోజనాలకు సంబంధించిన ‘క్వాడ్’ అంశం మరుగున పడింది. ఈ ఏడాది అఖరున క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగాల్సి ఉంది. ఇది అనుమానమే. ట్రంప్ ఎక్కడా క్వాడ్ ఊసెత్తలేదు. భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ సైతం ప్రస్తావించక పోవడం గమ నార్హం. అవి ట్రంప్ మనసెరిగి మసలుకున్నట్లుంది.ఒకవేళ ఆస్ట్రేలియా, జపాన్లతో ఇండియా తన సహకారాన్ని ముమ్మరం చేసుకుని ఒక త్రైపాక్షిక కూటమి (ట్రయడ్) ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది అనుకుంటే, దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయన్నది మరో ప్రశ్న. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇండియాకు ఉన్న ఇతర అవకా శాలను చూద్దాం. యూరప్తో సన్నిహిత సమగ్ర భాగస్వామ్య ఒప్పందం వీటిలో ఒకటి. యూరప్ రక్షణ పరిశ్రమ భారీ విస్తరణ కోసం నమ్మకమైన విపణి, అగ్రశ్రేణి మానవ వనరులు అవసరం.ఇండియా వీటిని సమకూర్చగలదు. యూరప్, ఇండియాల మధ్య దృఢ మైన రక్షణ భాగస్వామ్యం ఉన్నట్లయితే, నిలకడ లేని అమెరికా విధానా లకు విరుగుడుగా అది ఉభయ పక్షాలకూ ఉపయోగపడుతుంది. ఇండియా బలాలుఅరిగిపోయిన రికార్డులా నేను మళ్లీ చెబుతున్నా. ఉపఖండ సరిహద్దుల భద్రత మన తక్షణ ఆవశ్యకత. పొరుగు దేశాలతో ద్వైపా క్షిక సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యపడు తుంది. మనం దక్షిణాసియా వృద్ధికి ఒక కేంద్రకంగా, భద్రత కల్పించే శక్తిగా మారడం ముఖ్యం. అనూహ్యంగా అనిపించినా కాలక్రమంలో పాకిస్తాన్ కూడా ఈ పరిధిలోకి వచ్చి తీరాలి. మన ప్రాంతానికి వాతావరణ మార్పు అతిపెద్ద సవాలు కాబోతోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడం ప్రాంతీయ దేశాల నడుమ సహకారంతోనే సాధ్యమవుతుంది. ఈ విపత్తుపై ఉమ్మడి పోరాటానికి సారథ్యం వహించే శక్తి ఇండియాకు మాత్రమే ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లోనూ ఇండియా ప్రముఖ పాత్ర వహించాలి. ఇందుకు వీలుగా ఆర్సీఈపీ, సీపీటీపీపీ స్వేచ్ఛా వాణిజ్య కూటముల్లో సభ్యత్వం కోసం ప్రయత్నించాలి. శాస్త్ర సాంకేతిక మానవ వనరులతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సంక్షుభిత సమకాలీన ప్రపంచంలో చెక్కు చెదరని రాజకీయ సుస్థిరత... ఈ రెండూ ఇండియా సొంతం. వివేకంతో వినియోగించుకోగలిగితే దేశాన్ని ఇవి వ్యూహాత్మకంగానూ ముందంజ వేయిస్తాయి. చైనాతో సంబంధాలను మెరుగుపరచడంలో వీటి పాత్ర ఉంది. ఏమైనప్పటికీ, విదేశీ విధానంలో, రక్షణ వ్యవహారాల్లో బయటి శక్తుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణ యాలు తీసుకోగల ‘వ్యూహాత్మక స్వతంత్రత’ సాధించడానికి... సామర్థ్యం కంటే సంకల్పం ముఖ్యం.శ్యామ్ శరణ్వ్యాసకర్త కేంద్ర విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆపద పైబడుతున్నా... అదే వైఖరి
బ్రెజిల్లోని బెలేమ్ నగరంలో ఈ రోజు (నవంబర్ 10) నుంచి ‘సీఓపీ30’ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనిలో 100కు పైగా దేశాల ప్రతి నిధులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలను అప్డేట్ చేసుకునేందుకూ, పుడమి తాపాన్ని నిరోధించే చర్యల అమలును ముందుకు తీసుకెళ్ళేందుకూ ఈ సమావేశాలు నిర్ణయాత్మక మైలురాయి కానున్నాయని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఆతిథ్యమిస్తున్న దేశంగా బ్రెజిల్ దీన్ని ఫలితమిచ్చిన శిఖరాగ్ర సమావేశంగా మలచాలని కోరుకుంటోంది. నడుం బిగించేందుకు ఇదే సమయమని సమావేశాల అధ్యక్షుడు ఆంద్రే కొర్రియా దొ లాగో అన్నారు. అయినా పెరిగిన భూతాపంవాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కూడా దీనికి కలసి వస్తోంది. అది కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకునే లక్ష్యంగా కుదిరిన గొప్ప ఒప్పందం. కానీ, దాని లక్ష్యసాధన దిశగా తీసుకుంటున్న చర్యలు ఇప్పటికీ అరకొరగానే ఉంటున్నాయి. పుడమి సగటు ఉష్ణో గ్రత పారిశ్రామిక విప్లవం ముందు రోజుల కన్నా, 1.5 సెంటిగ్రేడ్ దాటకుండా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2024లో అది మొదటిసారి దాన్ని దాటేసింది. తీవ్ర వాతావరణ ఉపద్రవాలు పెరుగుతూ పోతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో 80కి పైగా దేశాలలో సముద్రపు దిబ్బలు నిర్జీవంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్పును ఆపడం కష్టమైన ‘నిర్ణయాత్మక దశ’కు పుడమి చేరుకుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సమ తూకానికి ఎంతో ముఖ్యమైన అమెజాన్ సతత హరితారణ్యాలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఓపీ30 సమావేశాలు అమెజాన్కు సమీపంలోని నగరంలోనే జరుగుతున్నాయి. ప్యారిస్ ఒప్పందానికి పరీక్షప్యారిస్ ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు సుముఖంగా ఉన్నాయో లేదో సీఓపీ30 సమావేశాలలో తేలిపోనుంది. దుబాయ్లో 2023లో జరిగిన సీఓపీ28 సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పరిస్థితిని మొదటిసారిగా సమీక్షించుకున్నారు. శిలాజ ఇంధనాల నుంచి మారడాన్ని ఆ సమావేశాల తుది ప్రకటనలో మొదటిసారిగా ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరిగిన సీఓపీ29 సమావేశాల్లో నూతన వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వార్షిక వాతావరణ ఫైనాన్స్ 2035కల్లా 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరేటట్లు చూసుకోవాలని అంగీకారానికి వచ్చారు. జాతీయ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అమలుపరచడం, ఇంతవరకూ తీసుకున్న చర్యలను సమీక్షించడం బెలేమ్ సమా వేశాల్లో జరగనుంది. వివిధ దేశాలు ఏ మేరకు ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయో వాటిని జాతీయ నిశ్చయ వాటాలు (ఎన్డీసీలు)గా పిలుస్తున్నారు. వీటిని ప్రతి ఐదేళ్ళ కొకసారి అప్డేట్ చేసుకుంటున్నారు. ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేసిన 190కి పైగా దేశాలలో దాదాపు 70 ఇప్పటికే తమ లక్ష్యాలను అప్డేట్ చేశాయి. ప్రపంచ ఉద్గారాలలో మూడో వంతు పైగా వాటాకు మాత్రమే లెక్క తేలే విధంగా అవి ప్రణాళికలు సమర్పించాయి. పుడమి తాపాన్ని 1.5 సెంటిగ్రేడ్ పరిమితికి లోపల ఉంచేందుకు 2030 నాటికల్లా గ్రీన్హౌస్ వాయువు (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి)లను సుమారు 31 గిగా టన్నులకు తగ్గించవలసి ఉంది. అయితే, అప్డేట్ చేసిన ఎన్డీసీలను లెక్కలోకి తీసుకున్నా అది 2 గిగా టన్నులకు మించడం లేదు. అమెరికా తడబాటు – చైనా ఎడబాటుభౌగోళిక రాజకీయాలు బహు సున్నితంగా ఉన్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల మధ్య నమ్మకం కొరవడటం ప్రధాన సమస్యలలో ఒకటిగా పరిణమించింది. ఇది వాతావరణంపై చర్చలకు అవరోధం కానుంది. అంతర్జాతీయ వాతావరణ మార్పు నిరోధక సహాయ కార్యక్రమాలకు అమెరికా నుంచి అందే విరాళాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కోత పెట్టారు. ప్రభుత్వ వనరులను సైనిక, భద్రతాపరమైన అంశాలకు మళ్ళిస్తున్నారు. తలో చేయి వేస్తామని చెప్పిన దేశాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. వాగ్దానం చేసిన మొత్తాలను తగ్గించి ఇస్తున్నాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇబ్బందులను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో సామాజిక ఉద్యమాల, పేద దేశాల ప్రతినిధుల హాజరు అంతంతమాత్రంగానే ఉండవచ్చుననిపిస్తోంది. చాలా దేశాలు తమ ప్రతినిధి బృందాల సంఖ్యను కుదించుకున్నాయి.కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండగల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి మధ్యాదాయ దేశాల నాయకత్వాలు ముఖ్య పాత్ర వహించవలసి ఉంది. ప్రపంచ ఉద్గారాలలో సుమారు సగ భాగం ఈ దేశాల నుంచే ఉన్నాయి. ఇవి తమ దేశాల్లో పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే, మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ పైన కూడా పెద్ద బాధ్యతే ఉంది. వాతావరణ మార్పు ఇంత పెను సమస్యగా పరిణమించడంలో చారిత్రకంగా వాటి బాధ్యత చాలానే ఉంది. గ్రీన్హౌస్ వాయువుల విడుదలలో ప్రపంచంలో రెండవ పెద్ద పాత్ర అమెరికాదే! ప్యారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియ ట్రంప్ 2025 జనవరిలో తిరిగి అధికారానికి వచ్చాక ఊపందుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించే లక్ష్యాన్ని చేరుకోగల గతిని నీరుగార్చనుంది. నిధుల మంజూరులో ఇచ్చిన మాటను అమెరికా ఎన్నడూ పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఆ లోటును ఫెడరల్ ప్రభుత్వం బదులు, రాష్ట్రాలు, స్థానిక పాలనా సంస్థలు తీరుస్తాయని భావిస్తున్నారు. ఇక తమ గ్రీన్హౌస్ వాయువుల విడుదలను 2035కల్లా 7 నుంచి 10 శాతం మధ్యకు తగ్గించుకుంటామని చైనా నాయకుడు షీ జిన్పింగ్ గత సెప్టెంబరులో ఐరాస సర్వ ప్రతినిధి సభలో చెప్పారు. ప్రపంచ ఉద్గారాలలో చైనా వాటా సుమారు మూడో వంతుగా ఉంది. దానితో పోలిస్తే, ఆయన చెబు తున్న మాటలు పెద్దగా లెక్కలోకి రావు. వాతావరణ మార్పును అరికట్టే నాయకత్వం నుంచి అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉపసంహరించుకోవడంతో చైనాయే నేతృత్వం వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ ‘ఏకైక నాయక’ పాత్రను చేపట్టడంలోని బరువు బాధ్యతలు చైనాకు బాగా తెలుసు. అందుకే నాయకత్వ బాధ్యత లను పంపిణీ చేయాలనీ, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పటిష్ఠపరచాలనీ చైనా భావిస్తోంది.అమందా మగ్నానివ్యాసకర్త బ్రెజిల్ పర్యావరణ పాత్రికేయురాలు -
తేజస్వీ యాదవ్ (సీఎం అభ్యర్థి) రాయని డైరీ
దేశంలో ఏదైనా ఒక రాష్ట్రానికి 14 కోట్ల మంది సీఎంలు ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో శ్రీ మోదీజీ, శ్రీ నితీశ్ కుమార్ నవంబర్ 14న ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నేను సీఎంని అయితే బిహార్ ప్రజలంతా సీఎంలు అయినట్లే!ఎల్లుండి, నవంబర్ 11న రెండో విడత పోలింగ్. 14న ఫలితాలు. 6న మొదటి విడత పోలింగ్ పూర్తయింది. నాన్నగారు, అమ్మ, నేను, రాజశ్రీ, భారతి అక్క, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఓటేసి వచ్చాం. తేజ్ ప్రతాప్ అన్నయ్య కూడా మాతో ఉంటే బాగుండేది.నాన్నగారు తేజ్ అన్నయ్యను ఇంట్లోంచి, పార్టీ నుంచి వెళ్లి పొమ్మన్నాక తేజ్ అన్నయ్య వేరే పార్టీ పెట్టుకున్నారు. మాలో ఎవరితోనూ మాట్లాడటం లేదు. మొన్న పట్నా ఎయిర్ పోర్టులో ఒకరికొకరం ఎదురుపడినప్పుడు కూడా తేజ్ అన్నయ్య ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు! నేను చాలా ఫీల్ అయ్యాను. తేజ్ అన్నయ్య ‘జనశక్తి జనతా దళ్’ అనే పార్టీ పెట్టుకుని మహువా నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్జేడీలోని ‘జేడీ’ని అలాగేఉంచేసుకుని, ‘రాష్ట్రీయ’కు బదులుగా ‘జనశక్తి’ అని పెట్టుకున్నారు. అంటే పూర్తిగా పార్టీలోంచి వెళ్లినట్లు కాదు. నేను పోటీ చేస్తున్న రాఘోపుర్, తేజ్ అన్నయ్య పోటీ చేస్తున్న మహువా... రెండూ వైశాలి జిల్లాలోనివే. నాన్నగారు, అమ్మ,మా ఇద్దరి తలపై చేయి ఆన్చి వేర్వేరుగా మాకు ఆశీస్సులు అందించారు. అంటే అన్నయ్య పూర్తిగా ఇంట్లోంచి వెళ్లినట్లు కాదు. ఎవరో అమ్మాయితో తను రిలేషన్లో ఉన్నట్లు తేజ్ అన్నయ్య ఫేస్బుక్లో పోస్టు పెట్టడంతోనే వచ్చింది అసలు ఇదంతా! పాపం వదిన ఆ రోజు ఎంతగా చిన్నబోయారో ఇంట్లో అందరం చూశాం. అమ్మ వదినను గుండెల్లోకి తీసుకుంది. నాన్న గారు తేజ్ అన్నయ్యను గట్టిగా మందలించారు. ‘‘వ్యక్తిగా నీతి తప్పిన వారికి సమాజం కోసం పోరాడే శక్తి తగ్గుతుంది’’ అన్నారు. ఇంట్లోంచి, పార్టీలోంచి అన్నయ్యను పంపించేశారు.బయటికి వెళ్లి, కొత్త పార్టీ పెట్టగానే తేజ్ అన్నయ్య మొదట అన్నమాట... ‘‘మృత్యువునైనా ఆలింగనం చేసుకుంటాను కానీ తిరిగి ఆర్జేడీని ఆశ్రయించేది లేదు’’ అని! ఆ మాటకు నాన్నగారు, అమ్మ చాలా బాధపడ్డారు.తేజ్ అన్నయ్య జేజేడీ పార్టీ 22 చోట్ల పోటీ చేస్తోంది. ఆ పార్టీ అన్ని చోట్లా గెలిచి, నేను సీఎం అవటానికి 22 సీట్లు తగ్గితే అన్నయ్య అప్పుడేమంటారో చూడాలి. 2020 ఎన్నికల్లో నేను సీఎం అవటానికి తగ్గింది 12 సీట్లే! ఒంట్లో హుషారుగా లేక నాన్నగారు ప్రచారానికి రాలేకపోతున్నారు. కానీ, నాన్నగారి మాటలు నేరుగా ఇళ్లలోకే వెళ్లి పోతాయి. బిహార్లోని ప్రతి ఇల్లూ భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు నాన్నగారి సత్తువ కలిగిన మాటలను రొట్టెల్లా పంచుకుంటుంది. నాకింకా ఆ ఒరవడి రాలేదు.నితీశ్జీ ఇరవై ఏళ్లుగా బిహార్కు సీఎంగా ఉంటున్నారు. నాన్నగారు ఏమంటారంటే... ‘‘పెనం మీద రొట్టెను తిరగెయ్యకపోతే మాడిపోతుంది. ఇరవై ఏళ్లు అంటే చాలా ఎక్కువ సమయం’’ అని!ఈ ఒక్క మాట చాలు, రోజుకు నేను పది ర్యాలీలు తీసి, పది ప్రసంగాలు చేసినంత!ఇవాళ రాహుల్జీ పట్నా వస్తున్నారు. ఇవాళ జరిగే అన్ని ర్యాలీలలో ఆయన నా వెంట ఉంటారు. ప్రచారానికి సిద్ధం అవుతుంటే... ‘‘చల్లగా ఉండు’’ అని నాన్నగారు, అమ్మ వచ్చి నన్ను దీవించారు. నాకు మిఠాయిలు తినిపించారు. అమ్మ నా నుదుటిపై ముద్దు పెట్టింది.ఇంట్లోంచి నేను బయలుదేరుతుంటే... తేజ్ అన్నయ్య నుంచి ఫోన్... ‘‘హ్యాపీ బర్త్ డే రా తమ్ముడూ...’’ అని!!నాన్నగారికి నెహ్రూజీ అంటే ఇష్టం. ఈసారి ఎన్నికల ఫలితాలు సరిగ్గా నెహ్రూజీ బర్త్డే రోజే వస్తున్నాయి. బిహార్ ప్రజలంతా సీఎంలు కాబోతున్న రోజు కూడా అదే! -
వినిమయ తత్వమే కాలుష్య కారకం
దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రత గురించి ఇప్పటికే చాలా విన్నాం. మనం పీల్చే విషపు గాలి పర్యవసానాలు, నష్టా లపై నిపుణులు అడపాదడపా హెచ్చరి స్తూనే ఉన్నారు. కోవిడ్–19 వల్ల కన్నా వాయు కాలుష్యం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ‘ఎయిమ్స్’ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం వాయు కాలుష్య దీర్ఘకాలిక ప్రభావాలు దగ్గులు, ఊపిరి సలపకపోవడానికి మాత్రమే పరిమితమైనవి కావు. అది హార్ట్ ఎటాక్, స్ట్రోక్, చివరకు క్యాన్సర్కు కూడా కారణమవుతోంది. అయినా, మనం సంక్షోభం మూలాలలోకి వెళ్ళేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం సూచించే తాత్కాలిక పరిష్కాలతో తృప్తి పడుతున్నాం. ఎయిర్ ప్యూరిఫయర్లు కొనేందుకు, బయటకు వెళ్ళేటపుడు ఎన్ 95 మాస్కులు ధరించేందుకు అలవాటు పడుతున్నాం. కృత్రిమ వర్షాలను సాంకేతిక అద్భుతంగా మురిసిపోతూ, అవి తేగల ఊరట కోసం ఎదురు చూస్తున్నాం. ఒక ప్రజా సమస్యకు ఆ రకమైన ప్రైవేటు పరిష్కారాలనుమించి ఆలోచించేందుకు తెగువ, రాజకీయ, నైతిక విశ్వాసం అవసరం. మనం సాధారణంగా మార్చేసిన జీవన విధానాలకు సంబంధించి ప్రపంచ దృక్కోణాన్ని ప్రశ్నించేందుకు మనమంతా ఏకం కావాల్సి ఉంది.వినిమయ తత్వపు విషవలయంఢిల్లీ వాయు కాలుష్యం విస్తృతమైన వాతావరణ మార్పు సంక్షో భంతో ముడిపడి ఉన్నదనీ, అవి రెండూ అవిభాజ్యమైనవనీ నిజాయితీగా అంగీకరిద్దాం. అది ఆధునికత తెచ్చిపెడుతున్న అనర్థం. ముందు వెనుకలు ఆలోచించని సాంకేతిక ప్రగతి కోసం ప్రకృతిని జయించాలని చూస్తున్నాం. దాంతో, టెక్నో–క్యాపిటలిజం స్థిరంగా వృద్ధి చెందుతూ వచ్చింది. వస్తు వినియోగ తత్వానికి మనం క్రమంగా బానిసలమైపోయాం. మవ చుట్టూ ఉన్న వాటిలో చెట్టు, పుట్ట, నది, పర్వతం ఏదైనా కావచ్చు– ప్రతీదీ వాటివైన స్వరూప స్వభావాలను, ప్రయోజనాన్ని కోల్పోయాయి. ప్రకృతి అంటే కొల్లగొట్టదగిన వనరు అనే భావన పాదుకుపోయింది. మరింత విద్యుచ్ఛక్తి, మరిన్ని కార్లు, మరింత వస్తు సామగ్రి, మరిన్ని దుస్తులు... వస్తు వినిమయ తత్వానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. రోడ్ల విస్తరణకు వేలాది చెట్లను నరికేసేందుకు మనం సంశయించడం లేదు. విద్యుదుత్పాదనకు నదుల సహజ ప్రవాహ గతులను మార్చేస్తున్నాం. ఔను. ఆధునికత సంక్షోభం ఢిల్లీ వాయు కాలుష్య రూపంలో జడలు విప్పుకుని దర్శనిమిస్తోంది. ఒక్కసారి ఢిల్లీ రోడ్లను పరికిస్తే వాహనాలు వరదెత్తినట్లుగా కనిపిస్తాయి. దేశ రాజధానిలో 1.2 కోట్ల వాహనాలు రిజిస్టరయ్యాయనీ, వాటిలో 33.8 లక్షలు ప్రైవేటు కార్లేననీ ఢిల్లీ స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ (2023) సూచిస్తోంది. వేగం, చలన శక్తి ఆధునికతలో అంతర్భాగాలవడంతో మనకు మరిన్ని కార్లు, విమానాలు అవసరమవుతున్నాయి. పర్యవసానంగా శిలాజ ఇంధనాలను వెలికి తీయడం అవిశ్రాంతంగా సాగుతోంది. కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఆధునికత, టెక్నో–క్యాపిటలిజం విష విలయంలో చిక్కుకున్నాం. తప్పులో మన వాటా?ఢిల్లీలో కాలుష్యానికి ప్రాథమిక కారణం పొరుగు రాష్ట్రాలలో పంట కోతల తర్వాత గడ్డి గాదాన్ని మంటపెట్టడం వల్ల కాదని నిజాయితీగా అంగీకరించాలి. ఢిల్లీ వాయు కాలుష్యానికి వాహనాల ఉద్గారాలు ప్రధాన దోహదకారిగా ఉన్నాయనే వాస్తవాన్ని మనం ఎలా విస్మరించగలం? సూక్ష్మ ఘన, ద్రవ ధూళి కణాలు, దుమ్ము, మసి, పొగల మిశ్రమాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)గా పిలుస్తు న్నారు. ఢిల్లీలో వార్షిక పీఎం 2.5 శాతంగా ఉంది. దానిలో వాహన ఉద్గారాల వాటాయే 10 నుంచి 30 శాతంగా ఉందని లెక్క తేలింది. అలాగే, పరిశ్రమలు, విద్యుదుత్పాదన కేంద్రాలు విడిచిపెట్టేవి, వ్యర్థ పదార్థాలను దగ్ధం చేయడం వల్ల వచ్చేవి, నిర్మాణ పనుల వల్ల రోడ్లపైకి వస్తున్న దుమ్ము నగరంలో వాయు కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. కానీ, ఈ ప్రశ్నలను లేవనెత్తడం కష్టం. ఎందుకంటే, అవి మనల్నే వేలెత్తి చూపుతాయి. మనం అనుసరిస్తున్న హైపర్ ఆధుని కత జీవన మార్గాలపై ఇంటరాగేషన్కు దిగుతాయి. కనుక, ఆత్మ పరిశీలనకు మనం విముఖులుగా ఉంటాం. దానికి బదులు, మన పడక గదుల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను వాడితే మనం సురక్షితంగా ఉంటామని మనకు మనం సర్ది చెప్పుకోవడం తేలిక. పెద్దగా ఆందో ళన చెందనక్కర లేకుండా టెక్నో–సైన్స్ కృత్రిమ వర్షాలను కురిపించగలదని సంతృప్తి పడటం తేలిక. ఎలక్ట్రిక్ కార్లను వాడటం ప్రారంభిస్తే సమస్య పరిష్కారమైపోతుందని నమ్మడం తేలిక. కట్టె పొయ్యిలు, బొగ్గు కుంపట్లు వంటి వాటి ద్వారా కాలుష్యానికి కారణమవుతున్నారని పేదలను నిందించడం తేలిక. లగ్జరీ ఎస్యూవీలు, స్పీడుగా దూసుకుపోయే కార్లు, ఖరీదైన వస్తువుల వినియోగం కర్బన ఉద్గారాలకు గణనీయంగా తోడ్పడు తున్నాయని చెబితే ధనికులకు, అత్యంత సంపన్నులకు కోపం వస్తుంది. కాలుష్య పర్యవసానంగా ఏర్పడుతున్న ప్రతికూల అనా రోగ్య పరిస్థితుల బారిన ధనికులకన్నా పేదలు ఎక్కువ పడుతున్నా రనే వాస్తవాన్ని తేలిగ్గా పక్కన పెట్టేస్తున్నారు. నిజంగా కావాల్సినవి!కాలుష్య రహిత భవిష్యత్తుకు నూతన జీవన పద్ధతులు, పట్టణ ప్రణాళికలు తప్పనిసరి. న్యూరోటిక్ స్పీడు నుంచి మందగమనానికి, భారీ ఎక్స్ప్రెస్ వేల నుంచి నడకకు, సైకిళ్ళు తొక్కడానికి ప్రోత్సహించే రోడ్లకు, ప్రైవేటు వాహనాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ లకు మారక తప్పదు. ఆకర్షణీయంగా కనిపించే వినిమయ తత్వం నుంచి నిరాడంబర, నిలకడగా సాగించగలిగిన జీవన విధానాలకు మళ్ళాలి. అవసరం లేనివాటి కోసం వెంపర్లాడటం మానుకోవాలి. మనం, మన సంతానం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయ పడగల వాటిని అలవరచుకోవాలి. శుద్ధమైన తాగునీరు, గాలి, చెట్లు, నీటి వనరులు, నీలాకాశం, ఎటుచూసినా హరిత పరిసరాలు మనకు నిజమైన అవసరాలు. ప్రాధాన్యాలను ఎంచుకోవాల్సింది మనమే. మనం ఏ విధమైన అభివృద్ధిని కోరుకుంటున్నామో, ఆ దిశగా అడుగులు వేసేందుకు మనమే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.-వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-అవిజిత్ పాఠక్ -
ఈసీ మౌనం సిగ్గుచేటు!
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా ప్రయోగిస్తానంటూ చెప్పిన ‘హైడ్రోజన్ బాంబు’ ఎట్టకేలకు బిహార్ తొలి దశ పోలింగ్కు 24 గంటల ముందు బుధవారం బద్దలైంది. ఇది నిరుడు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల జాబితాకుసంబంధించింది. రాహుల్ చెబుతున్న ప్రకారం అందులో 25 లక్షలమంది నకిలీ ఓటర్లున్నారు. సహజంగానే ఎన్నికల సంఘం(ఈసీ) మినహా దేశంలో అందరికీ ఈ విషయం దిగ్భ్రాంతి కలిగించింది. బ్రెజిల్లో ఉంటున్న పోర్చుగీసువాసి హెయిర్ డ్రెసర్ లారిసా నెరి అనే యువతి ఫొటోకు ఈ జాబితాలో చోటు దొరికింది. ఒకసారి కాదు... 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 22 సార్లు వినియోగించారు. ‘సెర్చ్’లో దొరక్కుండా ఒక్కో చోట ఒక్కో పేరు తగిలించారు. స్వీటీ, సరస్వతి, సీమ...ఇలా బహుళ నామధేయాలతో ఆమె మన ఎన్నికల జాబితాలో వర్ధిల్లింది. బహుశా 22 సార్లూ తన ఓటు హక్కు ‘విని యోగించుకుని’ ఆమె తన ‘పవిత్ర కర్తవ్యాన్ని’ నెరవేర్చి ఉంటుంది. మీడియా సమావేశంలో ఆమెను రాహుల్ బ్రెజిల్ మోడల్గా చెప్పారు. ఇది స్పీడ్ యుగం కనుక ఆ సమా వేశం ముగిసిన వెంటనే విషయం ఆమెకు చేరిపోయింది. ఏనాడూ సందర్శించని దేశంలో ఎన్నికల జాబితాలో తన పాత ఫొటో రావటంపై ఆమె బోలెడు ఆశ్చర్యపోతోంది. జనాన్ని దగా చేయటానికి తన ఫొటో వినియోగించి ఉంటారని సరిగానే గుర్తుపట్టింది.నకిలీ ఓటర్ల పంచాయతీ రాహుల్–ఈసీలకు సంబంధించింది కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరి మాటే నిజం కావాలి కనుక జరిగిందేమిటో ఈసీ సంజాయిషీ ఇచ్చితీరాలి. తప్పు తనవైపుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ ఆరోపణ అవాస్తవమైతే ఆయనపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదీ చేయకుండా ‘అప్పుడెందుకు చెప్పలేద’ంటూ దబాయింపులకు దిగటం నైతిక పతనానికి చిహ్నమవుతుందే తప్ప సమర్థవంతమైన జవాబు కానేరదు. సీ–డాక్ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ ఉపకర ణాన్ని 2022లో వినియోగించారు. వార్షిక ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) పేరిట జరిగిన ఆ ప్రక్రియలో దాని సాయంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఓట్లు తొలగించారు. ఇవన్నీ ఒకటికన్నా ఎక్కువసార్లు నమోదైన ఓట్లు, చెల్లని ఓట్లు. ఆ ఉపకరణం ఒకటికన్నా ఎక్కువసార్లు వినియోగించిన ఫొటోను కూడా పసిగడుతుంది. దానికి ఎందుకు స్వస్తి చెప్పారో ఈసీ సంజాయిషీ ఇవ్వాలి.అసలు ఈసీకీ, ఈ 12.5 శాతానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధమేమిటో అర్థంకాదు. రాహుల్ లెక్క ప్రకారం హరియాణాలో 12.5 శాతం మంది నకిలీ ఓటర్లు. చిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైన వెంటనే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికీ, నాలుగు రోజుల తర్వాత అదే సంస్థ చెప్పిన శాతానికీ మధ్య వ్యత్యాసం కూడా 12.5 శాతమే! ఇంత శ్రద్ధగా లెక్క పాటిస్తున్న మాయావులెవరో ఈసీ తేల్చుకోవాలి. రాహుల్ ఆరోపణలకు ఈసీ ఎగవేత ధోరణిలో జవాబిస్తున్నందువల్ల కేంద్రం జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. జాబితాలో చేరిన నకిలీ ఓట్ల సంగతలా ఉంచి... గల్లంతైన ఓట్లు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్డీటీవీ బృందం ఆరా తీసిన ప్రకారం హరి యాణాలో ఒక గ్రామంలోని పలు కుటుంబాల్లో రెండు నుంచి నాలుగు ఓట్లు గల్లంత య్యాయి. చిత్రమేమంటే వీరు ఆ ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఓటేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మాదిరి లీలలు బహు విధాలు! నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచే అక్రమాలు మొదలైపోయాయి. నిజానిజాలేమిటో నిర్ధారించుకోకుండానే కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా జిల్లాల్లో ఉన్నతాధికారుల్ని మార్చారు. అయి దేళ్లుగా అమలవుతున్న పథకాలు ఆపేశారు. బదిలీల వెనకున్న కుతంత్రమేమిటో పోలింగ్ రోజు హింస బయటపెట్టింది. పోలైన నాలుగు కోట్లకుపైగా ఓట్లలో 51 లక్షలు సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఇక ఈవీఎంల విన్యాసాలు అనంతం. సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో 28,000 ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది 87 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించింది. వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసి 17 నెలలు గడుస్తున్నా జవాబు లేదు! కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధించి కూడా ఇలాగే ఫిర్యాదులొచ్చాయి. ఈ స్థితిలో జరుగుతున్న, జరగబోయే ఎన్నికలపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇకనైనా ఈసీ బాధ్యులు నోరు విప్పాలి. ఆ ఉద్దేశం లేకుంటే తప్పుకోవాలి. -
‘కృత్రిమ’ కంటెంట్కు కళ్లెం ఇలాగా?
డీప్ఫేక్, జనరేటివ్ ఏఐల సాయంతో సృష్టించిన ఆడియో, వీడియో సమాచారం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన కంటెంట్ను నియంత్రించేందుకు ఉద్దేశించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. ఇవి 2021 నాటి ఐటీ చట్టానికి కొనసాగింపుగా ఉండ నున్నాయి. కంప్యూటర్లు, ఏఐ, అల్గారిథ మ్ల వంటి వాటి సాయంతో సృష్టించిన, అభివృద్ధి చేసిన, మార్పులు చేసిన సమాచారం, కంటెంట్ అన్నింటినీ కృత్రిమ మీడియాగా పరిగణిస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్పై కొన్ని నెలలుగా ఈ కృత్రిమ కంటెంట్ మోతాదు విపరీ తమైన విషయం తెలిసిందే. ఎప్పుడూ అనని మాటలను, చేయని పనులను చేసినట్టుగా చూపించే ఈ రకమైన కంటెంట్ను నియంత్రించకపోతే ప్రమాదమే. ట్రంప్, మోదీ మధ్య జరిగినట్టుగా చెబు తున్న టెలిఫోన్ సంభాషణ కూడా ఈ కోవకే చెందుతుంది. ‘చట్టబద్ధమైన’ హెచ్చరిక ఉండాలి!ఏఐ ఆధారిత డీప్ఫేక్లను తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, ఒకరి పరపతిని తగ్గించేందుకు, ఆర్థికపరమైన నేరాలు చేసేందుకు వాడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో ప్రజలను ప్రభావితం చేసేందుకూ వాడటం కద్దు. ఇలాంటి అభ్యంతరకరమైన సమాచారం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్’ (యాభై లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్స్)కు సలహా, సూచనలు ఇవ్వడానికే పరిమితమైంది. ఫిర్యా దులపై స్పందించేందుకు, చట్టపరమైన నిబంధనలు అమల్లో ఉండేలా చూసేందుకు ఈ కంపెనీల్లో వ్యవస్థలు ఉండాలి.కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నిబంధనలు... కంటెంట్ తీరుతెన్నులను గుర్తించేందుకు; సృష్టి, పంపిణీ, విస్తృతి వంటివి తెలుసుకునేందుకు బాధ్యత ఎవరిదన్న విషయాలపై చట్ట బద్ధతను కోరుతున్నాయి. ఏఐ ఆధారంగా సృష్టించిన కంటెంట్ మొత్తాన్ని మెటాడేటాలో స్పష్టం చేసేలా చేయడం ద్వారా దీన్ని సాధించాలన్నది లక్ష్యం. ఫలితంగా ఏది కృత్రిమమైంది? ఏది కాదన్న విషయం స్పష్టమవుతుంది. ఏది కృత్రిమ సమాచారం అన్న విషయాన్ని ఆయా సోషల్ మీడియా సంస్థలే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోపాటు ఏఐ కంపెనీలు, అవి అందించే టూల్స్కు కూడా వర్తిస్తాయి. ఏఐ టూల్స్ సిద్ధం చేసే కంపెనీలు కూడా సమాచారం ఏ రకమైందన్న విషయాన్ని స్పష్టం చేయాలి. పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మాదిరిగా ‘ఈ కంటెంట్ కృత్రిమమైంది’ అన్న లేబిలింగ్ శాశ్వతంగా ఉండాలన్న మాట! కనిపించే స్క్రీన్లో ఈ హెచ్చరిక కనీసం పది శాతం సైజులో ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆడియో విషయానికి వస్తే మొదటి పది శాతం నిడివిలో ఈ హెచ్చరిక వినిపించాలి. తాము అప్లోడ్ చేసే సమాచారం ఏ రకమైందో వినియోగదారులే ప్రకటించేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకోవాలి. సదుద్దే శంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్... ఏఐ ఆధారిత కంటెంట్ దేన్నైనా నిరోధించినా, తొలగించినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం వీరికి లభించే చట్టపరమైన రక్షణ కొనసాగుతుంది. కృత్రిమ మేధ ఏదైనా సరే... నియంత్రణ ప్రభుత్వాలకు కష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు. ఏఐ కంటెంట్ చాలా సంక్లిష్టమైంది. ఛాట్జీపీటీ, జెమిని, డాల్–ఈ వంటి ఏఐ టూల్స్ మాత్రమే కాదు.. మరెన్నో రకాల ఏఐలు, ప్లాట్ఫామ్స్ కంటెంట్ సృష్టిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ ఆర్ట్ జనరేటర్, వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్ఫేక్ యాప్స్ వంటివన్నీ కలిస్తేనే కృత్రిమ కంటెంట్ సృష్టి, వ్యాప్తి సాధ్యమవుతోంది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్రధాన సోషల్ మీడియా కంపె నీలు మాత్రమే భారత్లో ఉండగా... మిగిలినవి ప్రపంచంలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ భారత ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తేవడం దుస్సాధ్యం.హడావిడిగా నిబంధనలా?కేంద్రం డీప్ఫేక్స్ విషయంలో ప్రతిపాదించిన కొత్త నిబంధ నలు హడావిడిలో చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకోలా చెప్పాలంటే రాజకీయ నేతలపై వస్తున్న వరుస డీప్ఫేక్ వీడియోలపై అప్పటి కప్పుడు స్పందించినట్టుగా అనిపిస్తోంది. ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించేలా ఆలోచించి రూపొందించి ఉంటే బాగుండేది. ఈ కొత్త నిబంధనలన్నీ డీప్ఫేక్స్ లేదా అభ్యంతరకరమైన కంటెంట్ను తొల గించడంపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అలాంటి కంటెంట్కు బాధ్యతను సోషల్ మీడియాపైనే మోపే ప్రయత్నం జరిగింది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరి భౌతిక లక్షణాలు, గొంతుల రక్షణకు వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించి ఉండాల్సింది. సినీతారలు తమ ముఖాలు, గొంతులను ఏఐ ద్వారా అనధికారికంగా ఎవరూ వాడకుండా ఉండే హక్కును కోరుతున్నారు.డీప్ఫేక్లపై వివిధ దేశాలు వేర్వేరు పద్ధతుల్లో స్పందిస్తు న్నాయి. డెన్మార్క్ పౌరులందరి వ్యక్తిగత లక్షణాలను ప్రత్యేకమైన హక్కుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. అమెరికా ఎన్ని కల్లో ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో, వీడియో కంటెంట్ను నిషేధించేలా చట్టాన్ని ప్రతిపాదించారు. ఆన్ లైన్ భద్రతకు సంబంధించి ఫ్రాన్స్ ఒక సమగ్రమైన చట్టం చేసే ప్రయత్నాల్లో ఉంది. యూకే కూడా ఆన్ లైన్ సేఫ్టీ చట్టాలకు సవరణలు చేసింది. దీని పరిధిలోకి డీప్క్స్, ఫొటోల మార్ఫింగ్ను కూడా చేర్చింది. వీటన్నింటిలో యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం సమగ్రంగా ఉందని చెప్పాలి. ఏఐతో రాగల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, నియంత్రణ అవసరాన్ని, లోటు పాట్లను చర్చించి దీన్ని రూపొందించారు. భారతదేశంలో మాత్రం ఎలాంటి బహిరంగ చర్చ లేకుండా ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ప్రతిపాదిత నిబంధనలపై వ్యాఖ్యానించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చారు. కీలకమైన, దేశ ప్రజల్లో చాలామందిపై ప్రభావం చూపే అంశమైనందున మరింత విస్తృత చర్చ జరిగి ఉండాల్సింది. వేర్వేరు రంగాల భాగస్వాములతో చర్చించి ఉంటే నిబంధనలు మరింత సమర్థంగా ఉండేవి. పనిలో పనిగా 2021 నాటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఎంత సమర్థంగా పనిచేస్తోందో కూడా చర్చించే అవకాశం దక్కేది. ఇందులో లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు కొత్త నిబంధనలను మరింత సమర్థంగా రూపొందించేందుకు అవకాశం దక్కేది. అసలు సమస్యలుప్రభుత్వ సంస్థలు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరి కంటెంట్ను మాత్రమే తొలగిస్తాయన్న అను మానం నిత్యం ఉంటుంది. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కొందరు తప్పుడు, ఏఐ జనరేటెడ్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే రోబోట్లు లేదా అపరిచితులు సృష్టించే కంటెంట్ విషయంలో టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అవిశ్వసనీయ వైఖరి అన్నది కొత్త నిబంధనల అమలులో అతి పెద్ద ప్రతిబంధకం అని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ మాదిరిగా అన్ని విషయాలనూ నియంత్రించే సమగ్రమైన చట్టం భారతదేశానికి అవసరం. డిజిటల్ అక్షరాస్యత, ఆన్ లైన్ భద్రతలపై ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఆ సమావేశాల్లో తేలిందేమిటి?
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు ఏడు రోజులలో ఆసియాలో కీలకమైన ఆర్థిక సమావేశాలు వరుసగా జరిగాయి. జరిగింది ఆసియాలోని మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలలో అయినా, అమెరికా, చైనా, రష్యా సహా ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి. ఆ సమావేశాలలో జరిగిన చర్చలు, జరిగిన ఒప్పందాలు మొత్తం ప్రపంచ వాణిజ్య, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల విషయమై భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనా ధోరణులు ఏ విధంగా ఉండనున్నాయో ఆ సమావేశాలలో స్పష్టమైంది. కానీ, అగ్రస్థాయి ఆసియా దేశం అయి ఉండి, ఆర్థిక పరిమాణంలో నాల్గవ స్థానానికి చేరిన ఇండియా ప్రధాని మోదీ మాత్రం ఆ సమావేశాలలో పాల్గొనక అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు ప్రభుత్వం అధికారికమైన వివరణ కూడా ఏమీ ఇవ్వక ఊహాగానాలకు వదలివేసి మరింత ఆశ్చర్యపరిచింది.ట్రంప్ వర్సెస్ ఇతర దేశాలుమొదట మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ‘ఆసియాన్’, ఆర్సీఈపీ (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్), తర్వాత దక్షిణ కొరియా నగరం బూసాన్లో ఏపీఈసీ (ఆసియా– ఫసిఫిక్, ఎకనమిక్ కో–ఆపరేషన్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అమెరికా, చైనా అధ్యక్షులు విడిగా సమావేశమయ్యారు. వీటి మధ్య అమెరికా అధ్యక్షుడు జపాన్ వెళ్లి అక్కడి ప్రధానితో చర్చలు జరిపారు. ‘ఆసియాన్’లో 11 దేశాలకు, ఆర్సీఈపీలో 15 దేశాలకు, ఏపీఈసీలో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. మొత్తం అన్ని ఖండాలకు చెందిన ఈ దేశాలను కలిపి చూస్తే, ప్రపంచ జనాభాలో, ఆర్థిక శక్తిలో, వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం వాటిదే. చర్చలు, తీర్మానాలు, ఒప్పందాల చివరన రెండు ధోరణులు స్పష్టంగా తేలాయి. ఒకటి – అమెరికా తన ‘అమెరికా ఫస్ట్’ నినాదా నికి అనుగుణంగా ఆ యా దేశాలతో విడివిడిగా చర్చించి ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే చేసుకోవటం. చైనా మినహా మరెవరిపై సుంకాలు తగ్గించకపోవటం. ఆ యా సంస్థల సామూహిక చర్చలలో అధ్యక్షుడు ట్రంప్ అసలు పాల్గొనక పోవటం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల పట్ల విముఖత చూపటం. ఇందుకు భిన్నంగా, అమెరికాకు సన్నిహితంగా భావించే వాటితో సహా తక్కిన అన్ని దేశాలు, ఎటువంటి మినహాయింపు లేకుండా, స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టు బడులు వర్తమాన ప్రపంచానికి తప్పనిసరి అవసరమని తీర్మానించాయి. వారిలో కొందరు ఒత్తిడి కారణంగానైతేనేమి, సైద్ధాంతిక మైత్రి వల్లనైతేనేమి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసు కున్నారు. ప్రధానంగా అరుదైన లోహాలు, ఖనిజాలు, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, రక్షణ, రవాణా పరికరాలకు సంబంధించి! అదే సమయంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుకూలిస్తూ, ఒత్తిడులను వ్యతిరేకిస్తూ తీర్మానించారు. పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ – ప్రొటెక్షనిజాన్నీ, ప్రపంచం తిరిగి ఆటవిక రాజ్య స్థితికి వెళ్లటాన్నీ విమర్శించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలలో ఒకటైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ అయితే తాము వాణిజ్య పరంగా అమెరికాపై ఆధారపడే సాంప్రదాయిక స్థితి నుంచి దూరంగా జరగదలచుకున్నామనీ, రాగల కాలంలో అమెరికా బయటి దేశాలతో వాణిజ్యాన్ని రెట్టింపు చేయగలమనీ ప్రకటించారు. ఆ వెంటనే చైనా అధ్యక్షునితో సమావేశమై, ‘మరింత సుస్థిరమైన, సమ్మిళితమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి’ చైనాతో కలిసి పనిచేయగలమన్నారు. త్వరలో చైనా సందర్శనకు అంగీకరించారు.ప్రాంతీయ సంబంధాల సరళతరంవాస్తవానికి ఒకవైపు అమెరికా, మరొకవైపు తక్కిన ప్రపంచపు ఈ విధమైన ధోరణులు కొంత కాలంగా కనిపిస్తున్నవే. అది ట్రంప్కు తెలియనిది కాదు. ఆయన తన విధానాలను ఈ ఆసియా సమావేశాల సందర్భంగా మార్చుకోగలరని కూడా ఎవరూ ఆశించి ఉండరు. అయితే రెండు ధోరణులు కూడా ఈ వారం రోజుల సమా వేశాల కాలంలో మరింత స్థిర రూపం తీసుకోవటమన్నది గమనించదగ్గది. అంతా మన మంచికే అన్న సామెత వలె, ఈ పరిణామాలు ప్రపంచ దేశాల మధ్య బహుముఖ సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణకు మార్గాన్ని మరింత సుగమం చేయగలవు.ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. అవి – సాధారణంగా అమెరికా పలుకుబడి కింద పని చేస్తాయనే పేరున్న ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్) ఈ సమావేశాలకు ముందు చెప్పిన మాటలు. నిబంధనలకు విరుద్ధంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల దృష్ట్యా వివిధ దేశాలు తమ ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను సరళతరం చేసుకోవాలని ఐరాస వాణిజ్య విభాగం అధికారులు సూచించారు. తర్వాత ఆసియా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై ఐఎంఎఫ్ ఒక నివేదికను విడుదల చేస్తూ– ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి ప్రధానంగా వాణిజ్యంపై ఆధార పడి ఉందనీ, అందువల్ల అక్కడి దేశాలు సుంకాలు కాని ఇతర వాణిజ్య ఆంక్షలను తగ్గించుకోవటం, ప్రాంతీయ వాణిజ్యాన్ని సమీ కృత పరచుకోవటం, ఆ విధంగా అమెరికా సుంకాల ఒత్తిడి నుంచి తప్పించుకోవటం, ప్రపంచ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవటం చేయాలనీ చెప్పింది. ఇండియా ఏం చేస్తున్నట్టు?ఇంత ముఖ్యమైన సమావేశాలకు కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపిన భారత ప్రభుత్వం దీనంతటి నుంచి గ్రహించవలసింది చాలానే ఉంది. ఉదాహరణకు మనం ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ అని చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాము గానీ, ఆర్సీఈపీలో సభ్యత్వమైనా లేదు. ఆసియాన్లో సభ్యత్వం లేకున్నా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదా ఉంది. ‘ఆసియాన్’ కూటమితో వాణిజ్య, ఆర్థిక సంబంధాల గణనీయమైన అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ఆ పని మందకొడిగానే సాగుతున్నది. చైనా 771 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, మన వాణిజ్యం విలువ 131 బిలియన్లు మాత్రమే. భౌతికంగా, డిజిటల్ పరంగా సంబంధాలు చాలా పరిమితం. పోతే... ఐరాస, ఐఎంఎఫ్ సూచనలను అన్వయించుకుని చూస్తే – ఇండియా ఉన్న దక్షిణాసియాలో, ‘సార్క్’లో ఆర్థిక సమన్వయం, వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్తో సమస్య వల్ల అథమ స్థాయిలో ఉన్నాయి. ‘బిమ్స్టెక్’ అనే మరొక సంస్థను పాకిస్తాన్ను మినహాయిస్తూ ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడటం లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
'నేర్చుకోవడమే' నిత్యానందం
ఎప్పుడైనా నేనిచ్చే సలహా ఒకటే. మనం చదువుకునే విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాకరమైనదే కావచ్చు. కానీ, అక్కడి ప్రొఫెసర్లు, వాతావరణం నచ్చనప్పుడు, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు వెనుకాడకూడదు. నేను పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూలులో రెండేళ్ళు చదివిన తర్వాత, అక్కడి పరిస్థితులు నచ్చక ఇదే నెబ్రాస్కా–లింకన్ యూనివర్సిటీకి వచ్చేశాను. ఈ యూనివర్సిటీలో ప్రతి నిమిషం ఆనందంతో గడిపాను. ఇక్కడే 1951లో గ్రాడ్యుయేట్ అయ్యాను. విద్యాలయం విషయంలోనే కాదు, చదువు పూర్తయ్యాక, ఉద్యోగం చేసే సంస్థల విషయంలో కూడా వాటి పేరు ప్రఖ్యాతులను పక్కనబెట్టి, మన మనసు చెప్పిన మాట ప్రకారం నడచుకోవాలి. మొదట ఏదో ఓ కొమ్మ...జీవితంలో సంతృప్తినిచ్చే, మనసారా కోరుకునే ఉద్యోగం మనకు మొదట్లోనే లభించకపోవచ్చు. అది ఎక్కడో ఉంటుంది. ఆరంభంలోనే ఆ అవకాశం లభించకపోవచ్చు. కానీ, రోజులు వెళ్ళదీయాలి కనుక, లభించిన ఉద్యోగాన్ని మొదట చేపట్టక తప్పదు. అలాగని, వచ్చిన దానితోనే సంతోషపడిపోకూడదు. మీరు అభిమానించని కంపెనీలో లేదా మీరు ఇష్టపడే వ్యక్తులు లేని చోట ఉండిపోయి అదే పనిలో కొనసాగాలని అనుకోవద్దు. నచ్చిన ఉద్యోగంలో చేరండి. అది ఇచ్చే సంతృప్తి కోసం ఉద్యోగానికి వెళ్ళేందుకు ఉదయమే పక్క మీంచి లేచి కూర్చుంటారు. ఆ మేరకు నేను అదృష్టవంతుడిననే చెప్పు కోవాలి. ఇష్టపడే పనిలోకే రాగలిగాను. దానిని మించింది మరొకటి ఉండదని చెప్పగలను. చేస్తున్న పని అసలు పనే అనిపించదు. ఏరోజు కారోజు త్వరగా పనిలోకి దిగాలని అనిపిస్తుంది. ఉద్యోగాల వేట మొదలు పెట్టిన మొదటి రోజునే మనకు అటువంటిది దొరక్కపోవచ్చు. కానీ, ఎక్కడో ఉండే ఉంటుంది. దాని కోసం అన్వేషించాలి. దాన్ని సక్రమంగా నిర్వహించేందుకు సంసి ద్ధులమై ఉండాలి. యజమానులు ఎటువంటివారిని నియమించా లని ఎదురు చూస్తున్నారో వారు కోరుకునే విధంగా మనం తయారు కావాలి. అప్పుడే వారు మనల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు. తక్షణ ఆర్థిక ప్రయోజనాలను పక్కనపెట్టి, ఒక్కోసారి జీతభత్యాలు లభించకపోయినా సరే, ఇష్టపడే వృత్తి వ్యాసంగాలనే చేపట్టాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. బాగా రాసే, బాగా మాట్లాడే కళను సంతరించుకోవాలి. నిన్న మనకు తెలియని చాలా విషయాలను నేడు తెలుసుకుని రోజుకు స్వస్తి పలికితే అంతకన్నా అద్భుతమైన కాలం ఇంకేముంటుంది? ప్రతిభావంతులైన విద్యార్థులను చూస్తే, నాకు ప్రపంచంపై ఆశావాదం రేకెత్తుతుంది. ఎదుగుదలపై నమ్మకం ఉంచి రంగంలోకి దిగాలనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో అది నన్ను ‘బుల్లిష్’గా వ్యవహ రించేటట్లు చేస్తుంది. మీరూ నాలాగానే జీవితం పొడవునా రకరకాల పరిస్థితులను ఎదుర్కోనున్నారు. నేను చూసిన మహా మాంద్యం లేదా రెండవ ప్రపంచ యుద్ధం, చవిచూసిన ఎత్తు పల్లాల లాంటి ఆశ్చర్యకర ఘటనలు మీకూ మున్ముందు అనుభవంలోకి రావచ్చు. అంతిమంగా గెలుపు మీదే అవుతుంది. అయితే, ఏ రంగంలో రాణించడానికైనా కమ్యూనికేషన్ నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. విజేతలుగా నిలుస్తామని అంటే అర్థం మనకి ప్రతి రోజు అద్భు తంగా గడుస్తుందని కాదు. ప్రపంచం ఎన్నటికీ అలా నడవదు. మరో దేశంలోనో, మరో కాలంలోనో ఉండి ఉంటే, రాణించి ఉండే వారమనుకోవడం తప్పు. ఉన్న చోటునే, ఉన్న పరిస్థితుల్లోనే పైకి ఎదిగేందుకు ప్రయత్నించాలి. నా ఉద్దేశం – అందరికీ అవకాశాలు తప్పకుండా వస్తాయి. కానీ, జీవితం అన్నాక ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. అనారోగ్య సమస్యలో మరొకటో తలెత్తుతాయి. ప్రతి రోజూ ఎంతో కొంత కొత్త విజ్ఞానాన్ని సముపార్జించుకోవడాన్ని అల వాటు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో గ్రహించి ఉంటారు. ఇక ముందు కూడా అదే ధోరణితో జీవితాన్ని కొనసాగించాలి. నిరంతరం చదవాలి!పుస్తకాలు చదవడాన్ని మించిన గొప్ప అలవాటు మరొకటి లేదు. అది వజ్రాయుధం లాంటిది. తెలియని విషయాలను తెలుసు కోవాలనే ఉత్సుకత ఉండాలి. ఎవరో ఒక వ్యక్తితో మాత్రమే విందు ఆరగించే అవకాశం లభిస్తే, దాన్ని బతికివున్న వ్యక్తితో వినియోగించుకుంటారా లేక చనిపోయిన వారిలో ఎవరినైనా ఎంచుకొంటారా అని కొన్నిసార్లు కొందరు నన్ను అడుగుతూంటారు. దానికి, చదవడాన్నే సహచరుడిగా చేసుకుంటాననేది నా జవాబు. మనం బెంజమిన్ ఫ్రాంక్లిన్ పుస్తకాన్ని చదువుతూంటే, ఆయనతో కూర్చుని విందును ఆరగిస్తున్నట్లే లెక్క. ఆ మాటకొస్తే, ప్రపంచ చరిత్రలోని ఏ మహా వ్యక్తితోనైనా మనం గడపవచ్చు. నిజం చెప్పాలంటే, మనం వారితో చాలా సుదీర్ఘమైన విందు ఏర్పాటు చేసుకోవచ్చు. పుస్తక పఠనం ద్వారా మనం రకరకాల ఆలోచనా స్రవంతులను ఆకళింపు చేసుకున్న వారమవుతాం. నేను కాళ్ళున్న పుస్తకం లాంటివాడినని ఎవరో ఓసారి వ్యాఖ్యానించారు. నేర్చుకోవడంలో, చదవడంలో ఎంతో ఆనందం ఉంది. నేర్చుకోవడం జీవితాంతం సాగే ప్రక్రియ. జీవితాన్ని అదే ఆసక్తికరంగా మారుస్తుంది.చదువుకోవడంలో లక్ష్యం కేవలం విషయ పరిజ్ఞానం సంపా దించడం కాదు. తోటివారితో ఎలా మెలగాలో తెలుసుకోవడం. వారితో స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడం. ఇక్కడ కాలేజీలో, అంతకుముందు స్కూల్లో మీరు కొందరితో స్నేహం చేసి ఉండ వచ్చు. సన్మిత్రులు కూడా జీవితంలో ముఖ్యమే! విజయానికి నిర్వచనంవ్యాపారంలోనో, వృత్తి జీవితంలోనో, లేదా వ్యక్తిగత జీవితంలోనో విజయాన్ని లేదా సఫలత పొందడాన్ని ఎలా నిర్వచించు కోవాలనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. అసలు జీవన సాఫల్యం అంటే ఏమిటి? ఇది గొప్ప ప్రశ్న. తొంభై ఏళ్ళు వచ్చేసరికి కుబేరులుగా మారిన వారిని నేను చాలా మందిని ఎరుగుదును. అలాగని వారి జీవితాలను విజయాలుగా అభివర్ణించలేం. వారి వారి రంగాల్లో చాలా ప్రఖ్యాతి వహించిన వారు కూడా నాకు తెలుసు. కానీ, వాటినీ విజయాలుగా భావించలేం. 70 ఏళ్ళు వచ్చేసరికి అందరూ ఇష్టపడే పురుషుడిని, లేదా స్త్రీని నేను ఎన్నడూ చూడలేదు. వారున్న హోదాలో కొనసాగాలని వారికి అనిపించవచ్చు. దాన్ని విజయంగా తప్ప, మరి ఏ విధంగా నైనా అభివర్ణించవచ్చు.మన పిల్లలు, జీవిత భాగస్వామి, సహోద్యోగుల ప్రేమను చూరగొంటే అది సఫలత అనిపించుకుంటుంది. అటువంటి వారిని తమ జీవితకాలంలో చూస్తూ వచ్చి 65 లేదా 70 ఏళ్ళ వయసుకు చేరినవారు జీవన సాఫల్యం పొందినట్లు లెక్క. ఎంతో ప్రజ్ఞాపాటవాలు ఉండి, సిరి సంపదలు, పేరు ప్రఖ్యాతులు గడించుకుని ఉన్న వారిని చాలా మందిని చూశాను. కానీ, వారిలో ఏదో వెలితి. నలుగురి ప్రేమనూ చూరగొనలేని జీవితం ఎంత గొప్పదైనా అది వట్టి డొల్ల కిందే లెక్క! -
ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా?
మరోసారి తెలుగు నేలపై గుడిలో జరిగిన తొక్కిసలాటలో భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో కార్తిక ఏకాదశి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొక్కిసలాటలో రైలింగ్ విరిగి పోయి భక్తులు ఒకరి మీద ఒకరు పడి అక్కడికక్కడే 9 మంది మర ణించారు. తీవ్రంగా గాయాల పాలైన భక్తులు మరికొందరు ఉన్నారు యథావిధిగా పాలకులు జరిగిన దుర్ఘటనకు దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఆలయాల వద్ద పర్వదినాలలో భక్తులు ఎంతమంది వస్తారో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం ఆలయ నిర్వాహకుల వైఫల్యమే. అంబులెన్సులు కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమైన విషయం. అది ప్రైవేట్ ఆలయమనీ, నిర్వాహ కులు భక్తులకు భద్రతా విషయంలో సరియైన చర్యలు తీసుకోలేదనీ స్వయానా ముఖ్యమంత్రి ఆరోపించడం గమనార్హం. సహజంగా ప్రైవేటైజేషన్ పాలసీని మనసా వాచా కర్మణా ఆహ్వానించి సమర్థించే మనిషి ఆలయం విషయంలో అది ప్రైవేటు వ్యక్తి నడిపిస్తున్నా డనీ, దానిలో భద్రతా చర్యలు కొరవడ్డాయనీ, అధికారులకు సరైన సమాచారం లేదనీ ఆరోపించడం వింతగా ఉంది. దేవుడి విషయంలో భక్తులకు అది ప్రైవేట్ ఆలయమా, లేక టీటీడీ నిర్వహి స్తున్న ఆలయమా అనే విచక్షణ ఉండదు. వాళ్లకు దేవుడు, భక్తి ప్రధానం కానీ ఆలయ నిర్వాహకులు కాదు.ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో కూడా వర్షా లకు తడిసి ఉన్న గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాల య్యారు. అక్కడ కూడా సరైన భద్రతా ఏర్పాట్లు లేవనేది సుస్పష్టం.ఈ సంవత్సరం జనవరిలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు కొనుగోలుకై జరిగిన తోపులాటలో ఆరుగురు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మరి తిరుపతిలో కొన్ని వేలమంది రక్షక భటులు భద్రతా పర్యవేక్షణ చేస్తుంటారు. భక్తుల క్యూలను ఎప్పటికప్పుడు నియంత్రి స్తుంటారు. అయినా భక్తుల తోపులాటలు తొక్కిస లాటల ముందు రక్షకభటుల పనితనం తెల్లబోయింది.కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తులది కావచ్చు. మరి సింహాచలం, తిరుపతి దేవస్థానాలు ప్రభుత్వమే నిర్వహిస్తున్నది కదా! మరి అక్కడ ఎవరిని నిందించాలి? పోయిన ప్రాణాలు తిరిగిరావు. దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియా, సంతాపం అన్ని యథా ప్రకారమే జరిగాయి. కానీ ఎవరు పాఠాలు నేర్చుకుంటున్నట్లు కనపడటం లేదు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలు కూడా మనం చూశాం. అధికారులు కూడా తాము చేయాల్సిందంతా చేశామని చేతులు ఎత్తేస్తే జరిగే ఘోర ప్రమా దాలు ఇలాగే ఉంటాయి. ఇవి ప్రకృతి విపత్తులు కావు, మానవ తప్పిదాలు మాత్రమే అని గమనించాలి.– శ్రీశ్రీ కుమార్ ‘ కవి–రచయిత -
50 ఏళ్ల శ్రమ ఫలం
అర్ధ శతాబ్దపు స్వప్నం సాకారమై క్రికెట్లో మన నారీమణులు సాధించిన ప్రపంచ కప్ విజయం వెనుక వారు ఎన్నో ఏళ్ళుగా ఎదుర్కొన్న పెను సవాళ్ళు, ఛీత్కారాలు ఉన్నాయి. అమ్మాయిల క్రికెట్ నిన్న మొన్నటి దాకా ఆటలో అరటి పండు లాంటిదే. ‘పురుషుల క్రికెట్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు?’ అని మిథాలీ రాజ్ను ఆ మధ్య ఓ జర్నలిస్ట్ అడిగాడు. ‘ముందు ఆ పురుష పుంగవులను కలిసి వారికిష్టమైన మహిళా క్రికెటర్ ఎవరో అడిగి తెలుసుకుని రండి’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చి పడేశారామె. చులకన భావం ఒక్కటే మన క్రికెట్ వనితల సమస్య కాదు. మన దేశంలో మహిళల క్రికెట్ చాలా కాలం పాటు ఓ మొక్కుబడి వ్యవహారంగానే ఉంటూ వచ్చింది. నిధుల కొరత, అరకొర సదు పాయాల వల్ల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి దేశాల క్రికెట్ ప్రమాణా లను అందుకోవడం మన అమ్మాయిలకు కష్టంగా ఉండేది. మన దేశంలో మగపిల్లలు క్రీడలపై ఆసక్తి చూపిస్తేనే అది తలిదండ్రులకు నచ్చదు. ఇక ఆడపిల్లల్ని ఆటలకు పంపడం గురించి చెప్పేదేముంది! బ్యాట్లయినా లేని రోజుల నుంచి...పురుషులతో పోలిస్తే చాలా ఆలస్యంగా మన మహిళలు అంత ర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. 1976లో మన మహిళా జట్టు మొట్టమొదటి క్రికెట్ టెస్ట్ ఆడింది. కొన్ని సంవత్సరాల తరబడి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని సందర్భాలు 1980, 1990 దశ కాల్లో ఉండేవి. అప్పట్లో నిధుల కొరత వల్ల మన జట్టు ఫంక్షన్ హాళ్ళలో, స్కూలు బిల్డింగుల్లో బస చేసేది. అక్కడ ఎలుకలు, బొద్దింకలతో సహజీవనం చేయాల్సి వచ్చేదని తొలినాళ్ళలో భారత మహిళా జట్టు కెప్టెన్ గా ఉన్న శాంతా రంగస్వామి చెబుతోంది. టీమ్ మొత్తానికి కలిపి రెండు, మూడు బ్యాట్లు మాత్రం ఉండేవట! మిథాలీ రాజ్ ఆడిన రోజుల్లో కూడా సరైన టాయిలెట్ సదుపాయలు లేక పోవడాన్ని ‘శభాష్ మిథు’ బయోపిక్లో చూపించారు. ఇన్ని ఇబ్బందులున్నా అప్పట్లో శాంతా రంగస్వామితో పాటు, డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్, మిథాలీ, ఝులన్ గోస్వామి లాంటి మెరిక ల్లాంటి క్రికెటర్లు పుట్టుకొచ్చారు. 2005 ప్రపంచ కప్లో మన జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది కూడా!అప్పట్లో రైల్వేస్ వారు మన మహిళా క్రికెటర్లకు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించేవారు. 2006లో మహిళల క్రికెట్ను బి.సి.సి.ఐ. పరిధి లోకి తీసుకొచ్చారు. అయితే మన క్రికెట్ బోర్డు వారు ప్రేమ కొద్దీ చేసిన పని మాత్రం కాదది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐ.సి.సి.) ఆదేశాల మేరకు మహిళల క్రికెట్ను బి.సి.సి.ఐ.లో విలీనం చేశారు. ఈ మార్పు తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. కనీసం రిజర్వేషన్ ఉన్న రైల్వే కంపార్ట్మెంట్లలో ప్రయాణం, కొన్నిసార్లు విమానయానం కూడా సాధ్యపడింది. ఆర్థికంగా కూడా మహిళా క్రికెటర్లు కొంత లాభపడ్డారు. ఇందిరా గాంధీతో 1975 నాటి తొలి భారత మహిళా క్రికెట్ జట్టు సీరియస్గా తీసుకోవడం మొదలైంది!హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, దీప్తీ శర్మ, షెఫాలీ వర్మ లాంటి కొత్త తరం రంగంలోకి దిగాక అమ్మాయిల క్రికెట్కి కొత్త కళ వచ్చింది. ఈ తరం అమ్మాయిలు ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పాటు, తమ ఆట తీరులో కూడా దూకుడు పెంచారు. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ ఆడిన ఇన్నింగ్స్ భారత మహిళల క్రికెట్లో గేమ్ ఛేంజర్. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్లో ఆమె కేవలం 115 బంతుల్లో అజేయంగా 171 పరుగులు చేసింది. హర్మన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ మొత్తం క్రికెట్ ప్రపంచం విస్తుపోయేలా చేసింది. అప్పటి ఫైనల్లో కూడా మన జట్టు గెల వాల్సింది గానీ తొమ్మిది పరుగుల తేడాతో కప్ పోగొట్టుకుంది. ఆ ప్రపంచ కప్ తర్వాత మన క్రీడాభిమానులు అమ్మాయిల క్రికెట్ను కూడా సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఫ్యాన్ ఫాలో యింగ్ బాగా పెరిగింది.2022 నుంచి మహిళా క్రికెటర్లకు పురుషులతో సరిసమానంగా మ్యాచ్ ఫీజ్ ఇవ్వాలని బి.సి.సి.ఐ. నిర్ణయించింది. అలాగే మహిళా ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కూడా ప్రారంభించడం మరో ముఖ్యమైన పరిణామం. కడప జిల్లాలోని ఓ మారుమూల పల్లెకు చెందిన శ్రీచరణి ఈ డబ్ల్యూపీఎల్ ద్వారానే భారత జట్టులోకి వచ్చింది. శ్రీచరణి లాగానే డబ్ల్యూపీఎల్ వల్ల గ్రామాల నుంచి, దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కొత్త క్రికెటర్లు వస్తున్నారు. అమన్ జోత్ కౌర్ తండ్రి ఒక వడ్రంగి. తండ్రి తయారు చేసిచ్చిన బ్యాట్తోనే ఆమె క్రికెట్లో ఓనమాలు దిద్దుకుంది. షెఫాలీ వర్మ మగవాళ్ల హెయిర్ కట్తో కనిపిస్తుంది. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు మగపిల్లాడిగా నటిస్తూ మగవాళ్లతో కలిసి ఆడేది. గ్రామీణ వాతా వరణం నుంచి వచ్చిన ఈ కొత్త తరం అమ్మాయిలు కసిగా, నిర్భయంగా ఆడుతున్నారు. మంచి ఫలితాలు తెస్తున్నారు. మగవాళ్లతో పోటీ!2022 కామన్వెల్త్ క్రీడల్లో మన అమ్మాయిలు క్రికెట్లో రజత పతకం గెలుచుకున్నారు. 2023 ఆసియా క్రీడల్లో మన దేశానికి క్రికెట్లో మొట్టమొదటి స్వర్ణ పతకం మన మహిళా జట్టే అందించింది. ఇప్పుడు ప్రపంచ కప్లో జయకేతనం ఎగరవేశారు. 1983 విజయం పురుషుల జట్టును అమాంతంగా ఎలా సూపర్ స్టార్స్ను చేసిందో, ఈ గెలుపు మహిళల క్రికెట్లో కూడా ఒక సువర్ణాధ్యాయా నికి తెర లేపనుంది అనడంలో సందేహం లేదు. 2017లో హర్మన్ ఆడిన ఇన్నింగ్స్ లాగానే మొన్నటి సెమీ ఫైనల్లో జమీమా రోడ్రిగ్స్ సెంచరీ కూడా భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది. ఇకపై సూపర్ స్టార్డమ్ కేవలం మగ క్రికెటర్లకే పరిమితం కాకపోవచ్చు. వారు అమ్మాయిలతో పోటీ పడాల్సి రావచ్చు. వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్!సి. వెంకటేశ్వ్యాసకర్త జర్నలిస్ట్, స్పోర్ట్స్ కామెంటేటర్ -
పేదరికాన్ని జయించిన ‘దేవభూమి’
కేరళ రాష్ట్రానికి ‘దేవభూమి’ అనే పేరుంది. కేరళీయులు తమ రాష్ట్రాన్ని దేవుడి సొంతిల్లు (గాడ్స్ ఓన్ కంట్రీ) అని సగర్వంగా చెప్పుకొంటారు. ఇప్పుడు వాళ్లు సగర్వంగా చెప్పుకొనే మరో ఘనత కూడా వారి సొంతమైంది. నవంబర్ 1 నుంచి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా ప్రకటించుకుని కేరళ చరిత్ర సృష్టించింది. కటిక పేదరికం తుడిచి పెట్టుకుపోవడం అన్నది ఓ స్ఫూర్తిదాయక విజయం.ఎందుకంటే, దేశంలో అనేక రాష్ట్రాలో పేదరికం తీవ్రంగా ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్లలో ఇది ఏకంగా 37%. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన 1956 నవంబర్ 1న కేరళ ఏర్పడింది. అప్పటి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వం వరకు వామపక్ష పార్టీల కూటములు దాదాపు 40 ఏళ్లు అధికారంలో ఉంటే, మిగతా కాలం కాంగ్రెస్ కూటములు పాలన సాగించాయి. 1973–74 నాటికి కేరళలో పేద రికం 59.8%. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన కావాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. దేశంలో ఏ ఒక్క వ్యక్తీ ఆకలితో పస్తు పడుకోని విధంగా పాలన సాగించాలని గాంధీజీ చెప్పేవారు. అధికారంలో ఉన్నవారు ‘పేదరికం లేని సమాజం’ తమ లక్ష్యం అని ఘనంగా చాటుకొంటుంటారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో ఆ అడుగులు ఎంత వేగంగా పడ్డాయన్నదే ప్రశ్న!అన్ని సూచికల్లో మిన్ననిజానికి కేరళలో మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోల్చిచూసినపుడు భారీ పరిశ్రమల్లాంటివి కనిపించవు. అయినప్ప టికీ, మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికలలో అగ్రగామిగా నిలుస్తోంది. ‘పేదరిక నిర్మూలన’లో 2021లో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆధ్యయన పత్రం ప్రకారం, అన్ని రాష్ట్రాలకంటే కనిష్ఠంగా 0.71%గా ఉన్నట్లు తేలింది. 2026 మార్చ్ నాటికి 0.002 శాతానికి చేరనుందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేల్చాయి. ఈ ఏడాది మార్చ్ నుంచి రాష్ట్రావతరణ దినోత్సవమైన నవంబర్ 1 నాటికి రాష్ట్రాన్ని ‘నో పావర్టీ స్టేట్’ (పేదరిక రహిత రాష్ట్రం)గా చేయాలని సంకల్పించి, ఆ లక్ష్యానికి అనుగుణంగానే ‘జీరో హంగర్’ (సున్నా ఆకలి) రాష్ట్రంగా తీర్చిదిద్దడం విశేషం. పినరయి విజయన్ ప్రాతి నిధ్యం వహిస్తున్న ‘ధర్మదాం’ నియోజక వర్గం ఇప్పటికే దేశంలో పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించ బడింది. ఎలా సాధ్యమైంది?కేరళలో తొలి నుంచి ప్రజాచైతన్యం ఎక్కువ. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక, సంస్కరణోద్యమాలు ప్రజ లలో సామాజిక అంశాలపై అవగాహన కల్పించాయి. అక్కడ మొద ట్నుంచీ స్థానిక ప్రభుత్వాలు బలంగా పని చేస్తున్నాయి. స్థానిక సంస్థలకు ఉన్న 29 అధికారాలు మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి బదిలీ చేయడం అన్నది దేశంలో ఒక్క కేరళలోనే జరిగింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలలో స్థానిక ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇస్తోంది. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 5,415 ఉన్నాయి. ‘స్త్రీ క్లినిక్స్’ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఎంతో జవాబుదారీతనంతో పేషంట్లను చూస్తారన్న పేరు తెచ్చుకొన్నారు. మహిళల ప్రసూతి సమయంలో శిశువుల మరణాల సంఖ్య ప్రతి వెయ్యి కాన్పులకు 5 మాత్రమే! జాతీయ సగటు ప్రతి వెయ్యికి 28గా ఉంది. రాష్ట్రంలో సగటు జీవిత వయస్సు 77.28 ఏళ్లుగా ఉంటే, జాతీయ సగటు 70.77. రక్షిత నీటిని అందించడం, పర్యావరణానికి అధిక ప్రాధాన్యం కల్పించడం, వైరస్లు, అంటువ్యాధులు వంటి వాటిని ఆదిలోనే సమర్థంగా ఎదుర్కోవడం వంటి చర్యల సామాన్య ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. పేదరికంపై యుద్ధంపలు రంగాలలో అభివృద్ధి సాధనకు కేరళ అనుసరిస్తున్న విధా నాన్ని ‘కేరళ మోడల్’గా పిలుస్తారు. దీన్ని దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వివిధ రంగాలలో అనుసరిస్తున్నాయడంలో అతిశయోక్తి లేదు. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించడానికి 2021లో కేరళ ప్రభుత్వం క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి, రాష్ట్రంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల సంఖ్య 64,006 అని గుర్తించింది. పేదరికం లెక్కింపునకు కుటుంబ ఆదాయం, వారు తింటున్న తిండి, ఆరోగ్య ప్రమాణాలు, సొంత ఇంట్లో ఉంటున్నారా లేక అద్దె ఇల్లా, సదరు ఇల్లు ఏ విధంగా ఉంది... ఇత్యాది అంశాలను ప్రామాణికంగా తీసుకొన్నారు. ఈ కుటుంబాలలో చాలామటుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి లేవు. దీంతో, వారికి వెనువెంటనే కల్పించే సదుపాయాలతోపాటు దీర్ఘకాలంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి, వారికి రేషన్ అందేలా చేశారు. 4,000 కుటుంబాలకు ఇండ్లు కట్టించి ఇచ్చారు. మరో 1,500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిలావస్థకు చేరుకొన్న వాటిల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మర మ్మత్తు కోసం రూ. 2 లక్షల సహాయం అందించారు. కేరళ ప్రతి ఏటా 11 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. దాదాపు మూడున్నర కోట్ల జనాభా గలిగిన కేరళ బడ్జెట్ ఏటా 12 శాతం వృద్ధితో సగటున 2 లక్షల కోట్లు దాటుతోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్న రుణాలు కేంద్రం విధించిన పరిమితి అయిన స్థూల ఉత్పత్తిలో 3 శాతం మించకుండా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉంది కనుకనే, నేలవిడిచి సాము చేయకుండా ఏర్పరుచుకొనే నిర్దిష్ట లక్ష్యా లను నిర్ణీత కాలంలో పూర్తి చేయగలుగుతోంది.అలాగని, పినరయి విజయన్ పాలనలో వైఫల్యాలు లేవా అంటే... ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకొంటే చాలానే కనబడతాయి. వ్యక్తిగతంగా ఆయనపై అనేక ఆరోప ణలున్నాయి. అయితే, కేరళ సాధించిన విజయాలను చూసినప్పుడు ప్రభుత్వ నిర్మాణాత్మక చర్యలను అభినందించాల్సిందే. పేదరికంపై విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు. ఈ ఘన విజయాన్ని భారతీయులందూ ఆస్వాదించాలి, స్ఫూర్తి పొందాలి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,ఏపీ శాసన మండలి సభ్యులు -
పరేశ్ రావల్ (నటుడు) రాయని డైరీ
సినిమాలో దమ్ము లేదని టాక్! దమ్ము ఉందా లేదా అన్నది కాదు, అసలైతే ‘టాక్’ ఉంది. అది కదా ఒక మంచి సినిమాకు నిజంగా ఆదరణ. సినిమా చూసేసి, ఖాళీ పాప్కార్న్ బకెట్ను సీటు దగ్గరే వదిలేసినట్లు, సినిమాను సినిమా హాల్లోనే వదిలేసి పోతే... అప్పుడు కదా ఆ సినిమా పోయినట్లు! ‘‘పరేశ్జీ! మీరెందుకు ఇలాంటి సినిమాను ఎంచుకున్నారు? పైగా మీరొక మాజీ లోక్సభ ఎంపీ. ఇంకా పైగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్పర్సన్! కళంకం కాదా ఆ స్థానానికి?!’’శుక్రవారం రిలీజ్ అయిన ‘ద తాజ్ స్టోరీ’ గురించే ఈ ప్రశ్నలన్నీ! నేనేమీ ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్లే వచ్చి ప్రశ్నల మీట్ పెట్టారు. ‘‘చూడండీ ఒకటి చెబుతాను. ఏ నటుడూ సినిమాను ఎంచుకోడు. సినిమానే నటుడిని ఎంచుకుంటుంది. ‘తాజ్ స్టోరీ’లోని విష్ణుదాసు తన పాత్ర కోసం ఈ ముంబయిలో నన్ను వెతికి పట్టుకున్నాడు’’ అన్నాను.‘‘కానీ పరేశ్జీ, ఆ విష్ణుదాసు... తాజ్మహల్ కింద నిజానికి ఏం ఉండేదో వెలికి తీసేందుకు తవ్వకాలు జరిపించాలని కోర్టు సీన్లో వాదిస్తున్నాడు. అంటే, ఆ పాత్రలో మీరు వాదిస్తున్నారు. ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు పరేశ్జీ?’’ – మరో ప్రశ్న.‘‘ఎందుకు?’’ అనే ప్రశ్నకు నా దగ్గర ఎప్పుడూ సరైన సమాధానమే ఉంటుంది. అయితే అది అర్థం చేసుకోటానికే సరైన మనుషులు ఉండాలి. నేను ఎప్పుడూ అహ్మదాబాద్ వెళుతుండే వాడిని. ఎందుకంటే అక్కడ నా సిస్టర్ ఉండేవారు. నేను ముంబైలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీనే ఇష్టపడుతుంటాను. ఎందుకంటే ఢిల్లీకి మనోహరమైన చరిత్ర ఉంది. అక్కడ స్వీట్స్ కూడా బాగుంటాయి. ‘‘పరేశ్జీ, మీరెంతో మనోహరమైనవిగా భావించే ఢిల్లీ చరిత్ర పుటల కంటే కూడా దేశ ప్రజల మనోభావాలు మరింత మనోహరమైనవి, తియ్యనైనవి. కానీ మీరేం చేస్తున్నారు! విష్ణుదాసు అవతారం ఎత్తి, తాజ్ మహల్ను తవ్వి తీయిస్తే ఏదో బయట పడుతుందని ఆశిస్తున్నారు. ఎందుకు మీరిలా చేస్తున్నారు పరేశ్జీ... అదీ, దేశం కొద్దో గొప్పో ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో!’’ – ఇంకొక ప్రశ్న.కళాస్వేచ్ఛ గురించి ఈ విమర్శకులకు ఎందుకు పట్టదు! ‘‘మోదీజీని మెప్పించేందుకే మీరు విష్ణుదాసు పాత్రను భుజం మీద వేసుకున్నారని తెలుస్తూనే ఉంది పరేశ్జీ. తాజ్ మహల్ ఒకప్పుడు హిందూ రాజు రాజభవనం అని, షాజహాన్ దానిని స్వాధీనం చేసుకుని ముంతాజ్ మహల్ సమాధిగా మార్చాడని సినిమాలో మీరు వాదించటం చూస్తే అలాగే అనిపిస్తోంది’’ అని మరొక యక్షుడు!‘‘భారతీయ కళాకారులకు ‘పీఆర్’ లేకపోవడం వల్ల వామపక్ష చరిత్రకారులు గతాన్ని వక్రీకరించి మొఘలులను కీర్తించారని ఆ సీన్లో విష్ణుదాసుగా మీరు ఆరోపించడం కూడా మోదీజీ కోసమే కదా?’’ – ఇంకో ప్రశ్న!మహా భారతంలో ధర్మరాజును పరీక్షించింది ఒకరే యక్షుడు. శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు సవా‘లక్షులు’! ‘‘మంచిది మిత్రులారా! మరొక సినిమాతో, మరొక శుక్రవారం కలుద్దాం’’ అన్నాను, నవ్వుతూ పైకి లేస్తూ. ‘‘చివరి ప్రశ్న పరేశ్జీ, ఆ మరొక సినిమా కూడా ఇలాగే, ఈ ‘తాజ్ స్టోరీ’లానే ఉంటుందా?’’ – వ్యంగ్యం. నేనూ వారికి చివరి జవాబు ఇచ్చాను. ‘‘కొరుకుడు పడని కాలాల మీద నేను మనసు పడతాను. కొరుకుడు పడని మనుషుల మీద ఆ కాలాల వలను విసిరి, వారిని పడతాను’’ అన్నాను. ‘‘అర్థం కాలేదు పరేశ్జీ’’ అన్నారు!‘‘ఒక సినిమా ఆడనంత మాత్రాన ఇక సినిమాలనే తీయకూడదని కాదు’’ అని వారికి విడమరిచి చెప్పవలసి వచ్చింది. -
కొనడం కన్నా మానడం మేలు
రష్యాకు చెందిన ‘రోస్నెఫ్ట్’, ‘ల్యూక్ ఆయిల్’ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెడుతూ అక్టోబరు 22న అమెరికా తీసు కున్న నిర్ణయం రష్యానూ, రష్యా చమురు కొంటున్న దేశాలనూ ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. రష్యా ముడిచమురు ఆదాయంలో 57 శాతం ఈ రెండు దిగ్గజసంస్థల ద్వారానే సమకూరుతుంది. ఇతర చిన్నాచితకా కంపెనీల ద్వారా మిగిలిన 43 శాతం లభిస్తోంది. చిన్న కంపెనీల మీద ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ, ఇండియా వంటి ప్రధాన చమురు దిగుమతి దేశాల మీద అమెరికా చర్య ప్రభావం గణనీయంగా ఉంటుంది. బ్లాక్ లిస్టెడ్ కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయ బోమని ఇండియా చమురు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతులు ఒకప్పుడు కేవలం1 శాతం ఉండేవి అలాంటిది ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అవి 38 శాతం గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఇండియా ఇలా రష్యా ముడి చమురు కొంటూ పుతిన్ యద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చౌకగా లభిస్తున్నందువల్లే దేశ ప్రయోజనాల దృష్టిలో తాము రష్యా చమురు కొంటున్నామని భారత ప్రభుత్వం ఈ ఆరోపణను కొట్టివేసింది. ఇండియా సందిగ్ధంఅమెరికా తాజా నిర్ణయంతో ఇండియా సందిగ్ధంలో పడింది. ఏదో ఒక విధంగా రష్యా చమురు కొనుగోళ్లను కొనసాగించడమా, లేదంటే రష్యా చమురుకు పూర్తిగా దూరం కావటమా అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నిజానికి రెండు సర్వసత్తాక దేశాల నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం ఎలా జరగాలో శాసించే హక్కు అమెరికాకు లేదు. తమ కంపెనీలు రెండిటిని అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ, చమురు ఎగుమతులు నిలిపివేయాలని రష్యా భావించడం లేదు. కానీ బ్లాక్ లిస్టెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే దేశాల మీద అమెరికా ద్వితీయ స్థాయి ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున, అంత రిస్కు తీసుకుని రష్యా చమురు కొనాలా వద్దా అనేది ఇండియా, చైనా వంటి దిగుమతిదారులు తమకు తాముగా తీసు కోవలసిన నిర్ణయం. ఇప్పుడు ఇండియా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. అమె రికా ఆంక్షలు విధించినా సరే రష్యా చమురును ఇకమీదటా కొనడం వాటిలో ఒకటి. అమెరికా ఆంక్షలు వర్తించకుండా దళారుల ద్వారా సమకూర్చుకునే వీలుంది. రష్యా రహస్యంగా నడుపుతున్న రహస్య (షాడో) ట్యాంకర్ల ద్వారానూ తెప్పించుకోవచ్చు. ఏదో విధంగా చౌక ధరలకు రష్యా చమురు తెప్పించుకోవడం సాధ్యమే. అయితే ఈ చర్యలు ట్రంప్కు ఆగ్రహం కలిగిస్తాయి. చపల చిత్తుడైన ట్రంప్ఆంక్షలను ధిక్కరించడం తెలివైన పని అనిపించుకోదు. ట్రంప్తో ఢీకొనడం అంటే, తలను రాతి గోడకేసి కొట్టుకోవడమే. అమెరికాతో తలపడటంలో మన కంటే గట్టిదైన చైనా సైతం ఆ రెండు రష్యాకంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.వాణిజ్య ఒప్పందమే ఆచరణీయంట్రంప్తో తల గోక్కోవడం కంటే, ఆచరణీయ వైఖరి అవలంబించాలి. విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు ముప్పు వాటిల్లని రీతిలో, దౌత్య ఇంధన ఆర్థిక ప్రయోజనాలను సమతుల్యం చేసేట్లు ఈ వైఖరి ఉండాలి. ఇది రెండో మార్గం. మన చేతిలో ఉన్న ముక్కలతోనే మనం ఆడాలి. సమకాలీన భౌగోళిక రాజకీయాల్లో ఆచరణవాదమే నడుస్తోంది. ఇండియా భిన్నంగా వ్యవహరించలేదు. అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నామా అన్నది ముఖ్యం కాదు. దేశానికి గరిష్ఠ ప్రయోజనం దేనివల్ల సిద్ధిస్తుందో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి.ఒకటి: ఆంక్షలకు గురికాని రష్యా ఇంధన కంపెనీల నుంచి కొను గోళ్లు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది. రోస్నెఫ్ట్, ల్యూక్ఆయిల్ నుంచి కాకుండా మిగిలిన రష్యా కంపెనీల నుంచి కొంటే అమెరికా సెకండరీ ఆంక్షలు వర్తించవు. ఆంక్షలు ఆ రెండు కంపెనీల మీదే కానీ రష్యా ఆయిలు మీద కాదు. అయినా సరే ఇది అనుకున్నంత సులభం కాదు. రెండు: అమెరికా ఆంక్షలను ఇండియా తోసిరాజన గలదా, ఆ సాహసం ఫలితమిస్తుందా, అమెరికాతో ముడిపడి ఉండే విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మాత్రమే రష్యా చమురు కొనుగోళ్ల కొనసాగింపుపై ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.ఇండియా వస్తువుల మీద ట్రంప్ తొలుత విధించిన 25 శాతం సుంకాలను వీలైనంత తగ్గించేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసినట్లయితే, తరువాత మోపిన 25 శాతం అదనపు సుంకాలను కూడా తగ్గించడానికి లేదా రద్దు చేయడానికి వీలు ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికాతో సానుకూల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోడానికి అనువుగా రష్యా చమురుకు స్వస్తి పలికే అంశాన్ని పరిశీలించాలి. ప్రతిష్ఠ స్థానే ప్రయోజనాలుట్రంప్ ఏకపక్ష ఆంక్షలను తోసిరాజన్నట్లయితే, దేశ గౌరవం ఇనుమడిస్తుంది. కానీ దానివల్ల ఒనగూరే ప్రయోజనాలు పరిమిత మైనవి. వాటి కంటే మనం ఎదుర్కొనే రిస్కులు ఎక్కువ. కాబట్టి, అమెరికా విధానంలో మార్పు కోసం రష్యా నుంచి చమురు కొను గోళ్లను నిలిపివేసే ఆలోచన చేయాలి. తద్వారా, దక్షిణాసియాలోఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ అవలంబిస్తున్న ప్రతికూల భౌగో ళిక రాజకీయ వైఖరికి తెరపడుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ బలాబలాల సమతౌల్యాన్ని సానుకూల రీతిలో పునురు ద్ధరించుకునేందుకు అమెరికా సహకారం తీసుకుని తీరాలి. ప్రాంతీ యంగా వారి వ్యూహాత్మక ప్రయోజనాలకూ ఢోకా ఉండదన్న భరోసా ఇవ్వాలి. స్పష్టంగా చెప్పాలంటే, రష్యా చమురు కంపెనీల మీద అమెరికా ఆంక్షలు ధిక్కరించడానికి ఇండియాకు ఉన్న అవకాశాలు పరి మితం. ఈ తప్పనిసరి పరిస్థితి నుంచి ఎంతో కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేయాలి. కీలకమైన తన వ్యూహాత్మక ప్రయోజనాలు పరిరక్షించేట్లయితే, రష్యాపై ఆంక్షల పట్ల అభ్యంతరం లేదనిఇండియా ప్రతిపాదించాలి. జాతి గౌరవం, దేశ ప్రతిష్ఠ అంటూ అతిశయాలకు పోతే ప్రయోజనం ఉండదు. -వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-హ్యాపీమాన్ జాకబ్ -
రైతుల కడుపు కొట్టేలా దిగుమతులా?
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలి బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ సమావేశంలో సరైన వైఖరినే ప్రదర్శించారు. భారతదేశం తలకు పిస్తోలు గురి పెట్టి ఎవరూ బలవంతంగా ఒప్పందాలపై సంతకాలు చేయించలేరని తెగేసి చెప్పారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ధైర్యంగా పలికిన మాటలు నాకొక పాత సంఘటనను గుర్తుకు తెచ్చాయి. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. ఒకప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఉన్న జగ్జీవన్ రామ్ కోపంతో దాని సమావేశం నుంచి ఒక సారి వాకౌట్ చేశారని చెబుతారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం, ‘‘మీ వ్యవసాయ ఎగుమతులను మాపై రుద్దాలని చూస్తే సహించేది లేదు’’ అని అమెరికా సీనియర్ అధికారి ఒకరికి జగ్జీవన్ రామ్ నిస్సంకోచంగా చెప్పారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వివిధ హోదాలలో దాదాపు అందరు వ్యవసాయ మంత్రుల వద్ద పని చేశారు కదా! మీకు ఎవరు ఉత్తమమైన వ్యవసాయ మంత్రిగా తోచా’రని అడిగినపుడు స్వామినాథన్ పై ఉదంతం చెప్పారు. జగ్జీవన్ రామ్ 1974 నుంచి 1977 వరకు వ్యవసాయ, సేద్యపు నీటి శాఖ మంత్రిగా పనిచేశారు. కాచుకుని ఉన్న అమెరికావిస్తారమైన భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి అడుగు పెట్టాలని అమెరికా ఏనాటి నుంచో కాచుకుని ఉందని మనం గుర్తుంచుకోవాలి. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలలో భారత్ ఇంతవరకు దృఢ వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య సంపదల రంగాలను కాపాడుకుని తీరుతామని చెబుతోంది. కానీ, మన దేశంలోని కొన్ని బలమైన వర్గాలు ఎప్పుడూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతూ వస్తున్నాయి. ఆత్మనిర్భరత సాకుతో అవి తమ వైఖరిని సమర్థించుకుంటున్నాయి. అమెరికా సంస్థలకు ద్వారాలు తెరిస్తే– దేశంలోని పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పాడిపరిశ్రమ, యాపిల్, ఇతర పండ్ల విభాగాల వారి ప్రయోజనాలను పణంగా పెట్టినట్లు అవుతుంది. అమెరికా సహజంగానే తన తదుపరి లక్ష్యంగా మొదట వరిని, తర్వాత గోదుమలను ఎంచుకుంటుంది. అమెరికా సిసలైన ప్రయోజనాలు వీటిలోనే ఇమిడి ఉన్నాయి. జన్యుపరంగా సవరించిన (జీఎం) యాపిల్స్, మొక్కజొన్న, సోయాబీన్ల ప్రవేశం వివాదాస్పదంగా మారడంతో, దానికి సంబంధించిన కార్యనిర్వాహక పత్రాన్ని నీతి ఆయోగ్ ఇప్పటికే ఉపసంహరించుకుంది. సుంకాలు లేని విధంగా పత్తి దిగుమతికి అనుమతిస్తున్నట్లుగానే, పాలు, పాల ఉత్పత్తులకు కూడా మార్కెట్ ద్వారాలు తెరవడం సముచితంగా ఉంటుందని వాదించే ఆర్థికవేత్తలు కొందరు తయారయ్యారు. కానీ, వారొక సంగతిని గ్రహించడం లేదు. అమెరికాలో సుమారు 8,000 మంది పత్తి రైతులున్నారు. అక్కడి వ్యవసాయ క్షేత్ర సగటు పరిమాణం 600 హెక్టార్లు. వారికి ఏటా లక్ష డాలర్లకు పైగా సబ్సిడీ అందుతుంది. అది అంతర్జాతీయ ధరలను తగ్గిస్తుంది. ఫలి తంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతులు దెబ్బతింటారు. మన దేశంలో పత్తి రైతులు 98 లక్షల మందికి పైగా ఉన్నారు. వారి కమతాలు సగటున 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే. చౌక ధరలకు, సబ్సిడీ దిగుమతులను అనుమతిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి బతుకు బండలవుతుంది. దానికి బదులు, దేశీయ పత్తి పరిశ్రమ మన రైతులకు అండగా నిలిస్తే, అది నిజంగా ఉభయ తారకమైనది అవుతుంది. పత్తి దిగుమతిపై సుంకాలు పైసా కూడా లేకుండా చేయడం ద్వారా, భారత్ తన రైతులను తోడేళ్ళ బారిన పడేసినట్లయింది. చౌక దిగుమతులతో రైతులకు నష్టంపప్పు ధాన్యాల విషయంలో సరఫరా–డిమాండ్ సూత్రం పనిచేయడం లేదు. పప్పు ధాన్యాల విస్తీర్ణం 3.07 కోట్ల హెక్టార్ల నుంచి గత ఐదేళ్ళలో 2.76 కోట్ల హెక్టార్లకు కుంచించుకుపోయింది. దానివల్ల డిమాండ్ కొద్దిగా పెరిగినా, ఆ మేరకు రైతుల మార్కెట్ యార్డు ధరలు ఏమీ పెరగలేదు. నిజానికి, వాటి ప్రస్తుత మార్కెట్ ధరలు, ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా సుమారు 30 శాతం తక్కువగా ఉన్నాయి. దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన వెలితిని చౌక దిగుమతులు భర్తీ చేయడమే దానికి కారణం. ఆ దిగుమతులు కూడా అవసరమైన దానికన్నా రెండింతలున్నాయి. చాలా రకాల చిక్కుళ్ళు సుంకాలు లేకుండా దిగుమతి అయ్యాయి. ఒక్క 2024–25లోనే 7.6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. అలాగే, 2020 –21లో పప్పు ధాన్యాల దిగుమతికి రూ. 12,153 కోట్లను వెచ్చిస్తే, గడచిన ఐదేళ్ళలో దిగుమతి వ్యయం ఇప్పటికే అంటే 2024–25లో రూ. 47,000 కోట్లను దాటినట్లు వార్తలు సూచిస్తున్నాయి. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే నెపంతో జీఎం సోయా గింజల దిగుమతిని సమర్థించుకుంటున్నారు. నిజానికి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని సోయా రైతులు గిట్టుబాటు ధర కోసం లబోదిబోమంటున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 5,328గా నిర్ణయించగా, మార్కెట్ ధరరూ. 3,500 నుంచి రూ. 4,000 మధ్య ఊగిసలాడుతోంది. ఒత్తిళ్లకు లొంగకూడదు!కేంద్రం తగిన నియమ, నిబంధనలను రూపొందించేంత వరకు జీఎం ఆహార పదార్థాల దిగుమతి, అమ్మకాలను నిలిపి వేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దిగుమతులకు అది కాస్త బ్రేకు వేయవచ్చు. జీఎం సోయాబీన్ దిగుమతులకు ద్వారాలు తెరవవలసిందని అమెరికా గతంలోనూ మనపై ఒత్తిడి తెచ్చింది. బయోటెక్నాలజీ –ఫుడ్ సెక్యూరిటీ ఫోరమ్ (ఢిల్లీ) చేపట్టిన ఉద్యమం వల్ల, ఎట్టకేలకు భారతీయ రేవులకు అమెరికా సోయా బీన్ చేరగానే దాన్ని (దేశీయ ఉత్పత్తితో కలపకుండా) వేరుగా ఉంచా లని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆదేశించింది. అమెరికా సరఫరాదారులు తమ దేశంలోని సీనియర్ అధికారుల మద్దతుతో ఆ చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, భారత్ ఆ ఒత్తిడికి తలొగ్గ లేదు. ఇప్పుడూ అదే రకమైన వైఖరిని అనుసరించాలి. ఆహార పదార్థాలను నౌకల నుంచి దించుకొనే దయనీయమైన పాత రోజులలోకి భారత్ మళ్ళీ జారి పోకూడదు.దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
బిహార్ టైమ్ వస్తుందా?
మొదట, మనం 20వ శతాబ్దపు చివరి దశాబ్దంలోకి వెళదాం. ఒకరోజు ఇద్దరు సహోద్యోగులతో కలిసి పట్నా నుంచి ధన్బాద్కు వెళ్తున్నాను. శీతకాలంలో సూర్య కాంతి కూడా మసకగానే ఉంది. అపుడు నా కంటపడిన దృశ్యాన్ని తలచుకుంటే ఇప్పటికీ నా మనసు కలుక్కుమంటూనే ఉంటుంది. చీర చుట్టుకున్న ఓ మహిళ గజగజ వణికిస్తున్న చలిలో ఒక మురికి కుంటలోకి దిగబోతోంది. స్నానం చేసిన తర్వాత కట్టుకునేందుకు, బహుశా మరో చీర లేదనుకుంటా! రోడ్డు మీద వెళుతున్న వాహనాలలోని వ్యక్తులు ఆమె వంక చూపులు సంధిస్తున్నారు. ఆమె సంకోచాన్ని నేను అర్థం చేసుకున్నాను. అటువైపు చూడకుండా ఉండే ప్రయత్నంలో ఉన్నాను. కానీ, ఆ తర్వాత చూసిన దృశ్యం మా ఇబ్బందిని మరింత పెంచింది. ఆమె నెమ్మదిగా తుంటిపై కూర్చుని అదే కుంటలోని నీటితో నోటిని పుక్కిలించడం మొదలుపెట్టింది. కాలం తెచ్చిన మార్పుఆ తర్వాత కాలగతిలో ఎన్నో పరిణామాలు సంభవించాయి. బిహార్ రెండు రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకృతమైంది. ధన్బాద్ ఇపుడు జార్ఖండ్లో భాగమైంది. బిహార్ మహిళల స్థితిగతులలో సమూలమైన మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, సమాజం రెండింటి ప్రమేయం... మహిళలు పెద్ద అంగ వేసేందుకు సాయ పడిందని ప్రభుత్వ డేటా సూచిస్తోంది. బిహార్లో మహిళా అక్షరాస్యత రేటు 2000 సంవత్సరంలో 33%గా ఉన్నది నేడు 73.91%కి చేరినట్లు అంచనా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వనితలకు 35% రిజర్వేషన్ కల్పించడంతో, కార్యాలయాల్లో పురుషులు–మహిళల నిష్పత్తి మెరుగుపడింది. నేడు పోలీసు శాఖలో మహిళలు 37%గా ఉన్నారు. అలాగే, మహిళా ఉపాధ్యాయుల సంఖ్య 2,61,000గా ఉంది. బిహార్ స్త్రీలు నేడు కలం, పిస్తోలు రెండింటినీ ఝళిపి స్తున్నారు. ఇక క్రియాశీల స్వయం సహాయక బృందాలు బిహార్లో 10.6 లక్షల మేరకు ఉంటాయి. వీటి ద్వారా 1.45 కోట్ల మంది మహిళలు తమ వ్యక్తిగత ఆర్థిక విజయాలను సాధిస్తున్నారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఈ మహిళలు బ్యాంకుల నుంచి మొత్తం రూ. 15,000 కోట్ల రుణాన్ని స్వీకరించారు. రుణాలను తీర్చడంలో కూడా వారి రికార్డు పురుషుల కన్నా మెరుగ్గా 99%గా ఉంది. మనకు 1980లు, 1990ల నాటి దురదృష్టకర దృశ్యాలు ఇపుడు కనిపించకపోవడానికి అదే కారణం. గడచిన 2015, 2020 ఎన్నికల్లో 60% మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు ఒక శక్తిమంతమైన ఓటు బ్యాంకుగా రూపుదిద్దుకున్నారని అది సూచి స్తోంది. ప్రతి రాజకీయ పార్టీ వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించడానికి అదే కారణం. అయితే, ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే! ఒక్క పరిశ్రమా లేక...మహిళా సాధికారత ఉన్నప్పటికీ, వారి కుమారులు, భర్తలు, కుటుంబంలోని ఇతర సభ్యులు పొట్ట చేతపట్టుకుని వలసపోక తప్పని పరిస్థితులు నేటికీ ఉన్నాయి. ఈ నిస్సహాయ స్థితి నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించిన అన్ని సంకేతాలూ వెలతెల పోతున్నాయి. రాష్ట్రంలో వస్తూత్పత్తి పరిశ్రమ ఒక్కటి కూడా పెద్దది లేక పోవడం ఉద్యోగాలు కొరవడటానికి ప్రధాన కారణం. రాష్ట్రంలో వ్యవసాయ కమతాల పరిమాణం కూడా కుంచించుకుపోతోంది. తరచూ అతివృష్టి, అనావృష్టితో పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయా నికి దూరం జరుగుతున్నారు. ప్రస్తుతం సాగుతున్న భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో తనకంటూ చెప్పుకోతగినవి రాష్ట్రానికి పెద్దగా ఏమీ లేవు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుప్పుకూలుతున్నాయి. వస్తూత్పత్తి, మౌలిక వసతుల కల్పన రంగాల నుంచే దేశంలో 80% ఉద్యోగావకాశాలు వస్తున్న సంగతిని మరచిపోకూడదు. వీటన్నింటి వల్ల దాదాపు 3 కోట్ల మంది అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు పాతిక శాతం ఉపాధి నిమిత్తం వలసపోక తప్పని స్థితిలో ఉన్నారు. ప్రస్తుత బిహార్ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగావకాశాలు ప్రధానాంశంగా మారాయంటే ఆశ్చర్యపోవాల్సింది లేదు. వలసలు ఆగేనా?ఛఠ్ పూజ కోసం గ్రామాలకు తిరిగి వచ్చిన వారితో మాట్లాడిన వాటిల్లో కేవలం రెండు ఉదంతాల గురించి ప్రస్తావిస్తాను. వారి బాధ మొత్తం బిహారీ యువత ఆవేదనకు అద్దం పడుతుంది. బెంగళూరులోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో మాధేపురాకు చెందిన గంగారామ్ పనిచేస్తున్నారు. బిహార్ వదిలి ఎందుకు బయటకు వెళ్ళి పోవాల్సి వచ్చిందని అడిగినప్పుడు – ‘‘బిహార్లో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. ఏ పనీ దొరకదు. పొట్ట నింపుకొని, కుటుంబాన్ని పోషించుకునేందుకు మేం బయటకు వెళ్ళక తప్పింది కాదు. బయటకు వెళ్ళాలనే ఉద్దేశం మాకేమీ లేదు. ఇక్కడే పని దొరికితే మేం ఇల్లు విడిచి ఎందుకు వెళతాం?’’ అని ఆయన అన్నారు. తదు పరి ప్రశ్న కోసం ఎదురు చూడకుండా గంగారామ్ ఇంకా ఇలా చెప్పారు: ‘‘సంపాదించాల్సిన వయసు రాగానే మేం రాష్ట్రం విడిచి పెట్టేస్తున్నాం. దాంతో కుటుంబంతో, సమాజంతో మా అనుబంధాలు బలహీనమవుతున్నాయి. రెండేళ్ళ కొకసారి మేం ఇంటి ముఖం చూస్తున్నాం. తిరిగి బయలుదేరుతున్నపుడు, ఎన్నాళ్ళు ఇలా అయినవాళ్ళకి దూరంగా ఉంటాం అనిపిస్తుంది. వేరే రాష్ట్రా లలో మాకు మంచి మర్యాద కూడా దక్కదు’’.కొత్త ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కురుకుంటున్నారనే ప్రశ్నకు ముంబయిలో ఉద్యోగం చేస్తున్న సంజయ్ చంద్రవంశీ ఇలా చెప్పారు: ‘‘ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా వారు తమ శక్తియుక్తులన్నింటినీ, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడంపై పెట్టాలి. బిహార్లో ఫ్యాక్టరీలు నెలకొంటే, నాలాంటి లక్షల మంది ఢిల్లీ, ముంబయి, సూరత్ లేదా బెంగళూరు వంటి చోట్లకు వెళ్ళా ల్సిన అవసరం ఉండదు. మేం ఉన్నచోటే ఉద్యోగం దొరక్కపోవచ్చు కానీ, కనీసం రాష్ట్రంలో ఉంటాం కదా!’’ రోటీ ఔర్ రోజ్గార్ (తిండి, ఉద్యోగం) అని గొంతు చించుకుంటున్న నాయకులు, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, నిర్మాణాత్మక వైఖరిని చేపడతారా? శుష్క వాగ్దానాల బదులు, పరిష్కారాల కోసం బిహారీలు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం క్రితం, పట్నాలో ఓ యువతి నన్ను అడిగింది: ‘క్యా అబ్ బిహార్ కీ బారీ హై?’ (ఈసారైనా బిహార్ వంతు వస్తుందా?) వెలుగు కోసం బిహార్ ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి.శశి శేఖర్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తదుపరి గురి వెనిజులా?
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు గల లాటిన్ అమెరికా దేశం వెనిజులాను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఇపుడు సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్, గాజా యుద్ధాల తర్వాత ఈ కొత్త పరిణామాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తు న్నాయి. తమ సన్నాహాలలో భాగంగా అమెరికా ఇటీవలి వారాలలో వెనిజులా సమీపంలోని కరీబియన్ సముద్రానికి 10 యుద్ధ నౌకలను, 10 ఎఫ్–35 యుద్ధ విమానాలను, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌకను, ఒక అణుశక్తి జలాంత ర్గామిని మోహరించింది. ఇందుకు అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న కారణాలు అదే ప్రాంతంలో గల ట్రినిడాడ్ దేశంతో కలిసి యుద్ధ విన్యాసాలు జరపటం, అదే విధంగా వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల రవాణాను నిలువరించటం! కానీ, గత 35 సంవత్సరా లుగా ఎన్నడూ లేని స్థాయిలో సాగుతున్న మోహరింపుల ఉద్దేశం అదేనని ఎవరూ నమ్మటం లేదు.చమురు కోసమేనా?వెనిజులాలోని చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారల్స్ అని అంచనా. వాటితో పోల్చినపుడు సౌదీ అరేబియా నిల్వలు 267 బిలియన్లు, ఇరాన్వి 208 బిలియన్లు, రష్యావి 80 బిలియన్లు కావ టాన్ని బట్టి పరిస్థితిని ఊహించవచ్చు. అయితే, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, పెట్టుబడులకు – మౌలిక ఏర్పాట్లకు గల కొరత కారణంగా అక్కడ ఉత్పత్తి స్వల్పంగానే జరుగుతున్నది. మరొకవైపు అక్కడి నిల్వలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు పాశ్చాత్య దేశాల కంపెనీల ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఆ నిల్వలన్నింటి యాజ మాన్యం అక్కడి ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. సోషలిస్టు పార్టీకి చెందిన హ్యూగో చావెజ్ ప్రభుత్వం లోగడ తీసుకున్న ఈ నిర్ణ యాన్ని, ఆయన వారసుడైన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో కొనసాగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరిపడని ట్రంప్, ఆయనను పడగొట్టేందుకు తన మొదటి పాలనా కాలంలోనూ ప్రయత్నించారు గానీ వీలుపడలేదు.వెనిజులాలో సోషలిస్టు పార్టీ బలమైనది. తమ దేశంలోగానీ, మొత్తం లాటిన్ అమెరికాలో గానీ అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చావెజ్ తన రోజులలో ప్రపంచవ్యాప్తంగా పేరు పడ్డారు. ఆయన మరణం తర్వాత అధ్యక్షుడైన మదురో స్వరంలో అటువంటి తీవ్రత లేకపోయినా, విధానాలలో ఎటువంటి మార్పూ లేదు. మదురో సమాజంలోని అడుగుస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వాడు. 2013 నుంచి ఇప్పటికీ వరుసగా అధ్యక్షునిగా ఎన్నికవు తున్నారు. ఆయనకు ప్రజల మద్దతు సరేసరి కాగా, సమాజంలోని ఎగువ తరగతులు, పట్టణవాసులతోపాటు సైన్యం సమర్థన కూడా పూర్తిగా ఉందన్నది అంచనా. అందువల్లనే ఆయన్ని అమెరికా అనేక ఇతర లాటిన్ అమెరికా దేశాలలో చేసినట్లు అంతర్గత కుట్రల ద్వారా పడగొట్టలేక పోతున్నదనే అభిప్రాయం ఉంది. మాదక ద్రవ్యాల సాకుతో...ఒక విశేషం చెప్పుకోవాలి. గత ఎన్నికలలో మదురోతో పోటీ చేసి ఓడిన మరియా కొరీనా మచాడోకు ఇటీవలి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వెనిజులా సమీపాన అమెరికా సేనల మోహరింపుపై, ‘యుద్ధాన్ని మదురో ప్రారంభించారు, ట్రంప్ ముగించనున్నారు’ అని వ్యాఖ్యానించి ఆమె అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ నేపథ్యం ఇట్లుండగా, వెనిజులాపై చర్యలకు ట్రంప్ సాకులు వెతకటం మొదలుపెట్టారు. అందులో మొదటిది నిరుటి అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయనీ, అందువల్లనే మరియా మచాడో ఓడిందనీ ఆయన ఆరోపణ. మరొక దేశపు ఎన్నికల సక్ర మాలు, అక్రమాలను నిర్ధారించటమనే సాకుతో తమకు సరిపడని ప్రభుత్వాలను పడగొట్టజూడటం అమెరికాకు గతం నుంచి ఉన్న సంప్రదాయమే! అంతెందుకు? వెనిజులాకు సరిగా పొరుగునే గల బ్రెజిల్లో, ఎన్నికలలో గెలిచిన అధ్యక్షుడు లూలాతో ఓడిన బోల్సొ నారో తిరుగుబాటును, ఆయనపై కోర్టు చర్యలను ట్రంప్ బాహాటంగా వ్యతిరేకించారు. తన మిత్రుడైన బోల్సొనారోపై చర్యలు తీసు కున్నందుకు బ్రెజిల్పై సుంకాలను 50 శాతం పెంచారు. అమెరికా ఉద్దేశంలో ఇదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ. కనుక ఇపుడు వెనిజులా ఎన్నికలు, మచాడో ఫిర్యాదులు అమెరికా అధ్యక్షునికి సాకులుగా ఉపయోగపడుతున్నాయి. అయితే, గత ఏడాదిగా సాగుతున్న ఈ ప్రయత్నాలు నెరవేరక పోతుండటంతో ట్రంప్ ఇటీవల కొత్త సాకు ముందుకు తెస్తున్నారు. వెనిజులా నుంచి తమ దేశంలోకి కొకైన్, ఫెంటానిల్ వంటి డ్రగ్స్ భారీగా రవాణా అవుతున్నాయంటున్నారు!మాదక ద్రవ్యాల సమస్య అమెరికాలో తీవ్రంగా ఉంది. కానీ అందులో వెనిజులా పాత్ర ఏమిటన్నది ప్రశ్న. అమెరికా సంస్థ ప్రక టించిన మాదక ద్రవ్యాల నివేదిక – 2025లో వెనిజులా ప్రస్తావన లేదు. కొకైన్, ఫెంటానిల్ తదితరాలన్నీ ఉత్పత్తి అవుతున్నది కొలంబియా, పెరూ, బొలీవియా, మెక్సికో వంటి చోట్ల. రవాణా మాత్రం స్వల్పస్థాయిలో వెనిజులా మీదుగా జరుగుతున్నది. ఇతరత్రా కూడా బయటి నిపుణుల అభిప్రాయం అదే.ఏకపక్ష దాడులుఈ వివరాలన్నీ గమనించినపుడు, అమెరికా అధ్యక్షుని లక్ష్యం మదురో ప్రభుత్వాన్ని పడగొట్టి తమ అనుకూలురను అధికారానికి తేవటమని తేలికగా అర్థం చేసుకోవచ్చు. ఆ మాట ట్రంప్ గత పర్యాయమే అన్నట్లు పైన చూశాము. అదే మాటను ఈసారి డొంక తిరుగుడుగా చెబుతుండగా, తన విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూటిగానే అంటున్నారు. ఇటీవలి వారాలకు వస్తే, అక్కడ జోక్యం చేసుకుని రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సీఐఏను ఆదేశించినట్లు ట్రంప్ బాహాటంగానే ప్రకటించారు. మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ వెనిజులా తీరంలో పది బోట్లపై వైమానిక దాడులు జరిపి సుమారు యాభైమంది ప్రాణాలు తీశారు. ఆ రవాణా అబద్ధమని, అవన్నీ మామూలు బోట్లని మదురో ఖండించారు. మాదక ద్రవ్యాలకు ఆధారాలు దాడికి ముందుగానీ, తర్వాతగానీ ఉన్నాయా అన్న మీడియా ప్రశ్నలకు ట్రంప్ సమాధానమివ్వలేదు. ఐక్యరాజ్యసమితి సముద్రయాన, సముద్ర తీర చట్టాల ప్రకారం అసలు అటువంటి దాడుల అధికా రమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయినా ఇదంతా ప్రపంచపు అమాయకత్వంగాని, అమెరికా ప్రయోజనాలకు ఎప్పుడు ఏది ప్రతిబంధకమైంది గనుక!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
'స్వీయ నిబద్ధతే' జీవిత సారం
సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వక్తలు మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి, ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టండి, మీ భవిష్య త్తుకు ఆకాశమే హద్దు లాంటి మాటలు చెబుతూంటారు. విఫల మవడం కూడా ముఖ్య మని చెప్పే స్నాతకోపన్యాసాలను నేను ఇష్టపడతాను. కొన్నేళ్ళ క్రితం స్టీవ్ జాబ్స్ చేసిన ప్రసంగంతో ఈ ధోరణి మొదలైంది. కానీ మీరు స్టీవ్ జాబ్స్ అయితేనే వైఫల్యం కూడా గొప్పగా ఉంటుంది. లేదంటే కుంగదీస్తుంది. అందుకే విఫలం కాకపోవడమే మంచిది.ఏజెన్సీ మూమెంట్!వచ్చే రెండేళ్ళలో మీలో కొందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కొందరికి అర్హతకు తగిన ఉద్యోగాలు దక్కకపోవచ్చు. జీవితానికి సరైన దిశా నిర్దేశం, ఒక ప్రణాళిక అంటూ లేకపోయాయని మీలో సగం మంది భావించవచ్చు. కానీ, ఇదంతా ఒక ప్రక్రియలో భాగమే! మీకు ఇష్టమైన వాటిని కనుగొనే, మీకవి నిజంగానే ఇష్టమైనవో కావో పరీక్షించే ప్రక్రియలో భాగం. మనందరం కొన్నింటిని ఇష్టపడతాం. కొందరు స్నేహితులను, కొన్ని సబ్జెక్టులను, కొన్ని కలలను, కొన్ని వృత్తిపరమైన లక్ష్యాలను ఇష్టపడతాం. కానీ, వాస్తవికత అనే గీటురాయిపై వాటిని పరీక్షించి చూసేంత వరకు, వాటి స్వాభావికత గురించి మీకు నిజంగా తెలి యదు. నేను గ్రాడ్యుయేట్ అయినపుడు, రచయిత కావాలనీ, కొన్నాళ్ళు టీచింగ్ చేపట్టాలనీ, నాటక రచయిత లేదా నవలా రచయిత కావాలనీ కోరుకున్నా. రాజకీయాల్లోకి ప్రవేశించాలనీ, పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనాలనీ కూడా అనుకున్నా.ఇరవై ఏళ్ళ ప్రాయంలోని మిగిలినవారి మాదిరిగానే, నేను కూడా నాకిష్టమైన వ్యాపకాలను పరీక్షించి చూసుకున్నాను. ఆ క్రమంలో కొత్తగా ఇష్టమైనవిగా తోచినవాటిని కూడా రుచి చూశాను. ఇది మాల్లో, ప్యాంటు, చొక్కా వేసుకుని సరిపోయాయో లేవో అద్దంలో చూసుకోవడం లాంటిదే. పదేళ్ళు గడిచే సరికి నాటక రచన కుదరని పనిగా తోచింది లేదా ఇష్టం పోయిందని చెప్పాలి. కొన్ని కొత్తవి దృష్టి పథంలోకి వచ్చాయి. రాజకీయాలకన్నా రచన మరింత ముఖ్యమైనదని తేల్చుకున్నా. నాకు ఇష్టమైన వాటిని ఒక కాగితంపై ప్రాధాన్యతా క్రమంలో రాసుకున్నా. ఎక్కువగా ఇష్టపడుతున్నవాటికి నా శక్తియుక్తులను వీలైనంత ఎక్కువగా వెచ్చించడం ప్రారంభించా. ఒక క్రమపద్ధతిలో ఆ జాబితాను సిద్ధం చేసుకునే సామర్థ్యాన్ని చూపారంటే, ‘ఏజెన్సీ మూమెంట్’కు వచ్చినట్లే. అంటే, రూపాంతరీకరణ గ్రహింపును సంతరించుకున్నట్లే! ఒక వ్యక్తి బాహ్య ఒత్తిడుల నుంచి బయటపడి, స్వీయ విచక్షణ ప్రమాణాలు, విలువలను ఆధారం చేసుకుని ఇష్టంతో కార్యాచర ణకు దిగడం ప్రారంభించడాన్ని ‘ఏజెన్సీ మూమెంట్’ అంటారు. వేరెవరో విజయాన్ని నిర్వచించిన సూత్రాలకు అనుగుణంగా మీకు మీరు మూస పోసుకోవడం మానేస్తారు. మీ సొంత ప్రమాణాలు మీకుంటాయి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం మానే స్తారు. జీవితాన్ని మీదైన రీతిలో మలచుకోవడం ప్రారంభిస్తారు. చాలా మంది 30 ఏళ్ళకు కొద్ది ముందు ఆ స్థితికి చేరుకుంటారు. మరికొన్ని ఇతర ‘ఏజెన్సీ మూమెంట్లు’, తదనంతర జీవితంలో 53 లేదా 75 ఏళ్ళ వయసులో కలుగవచ్చు. మీకు ఇష్టమైన వ్యాప కాల ప్రాధాన్యతా క్రమం మారుతుంది. దాన్ని గ్రహించి, అందుకనుగుణంగా, సర్దుబాట్లు చేసుకోక తప్పదు. ఒకసారి ‘ఏజెన్సీ మూమెంట్లు’ సాధించాక, నిబద్ధత చూపడం మొదలుపెట్టవచ్చు.స్వేచ్ఛ వర్సెస్ నిబద్ధతమన సమాజం నిబద్ధతతో మెలగడాన్ని పెంపొందించే రకమై నది కాదు. దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను అట్టేపెట్టుకుంటాం, మరో వైపు దేన్నైనా కోల్పోతామేమో అనే భయంతో ఉంటాం. టిండర్, ఓకేక్యూపిడ్, ఇన్స్టాగ్రామ్, రెడిట్ వంటి డీకమిట్మెంట్ సాధనా లతో నిండిన సమాజంలో జీవిస్తున్నాం. ఒకదాని తర్వాత మరో దానికి వెంటవెంటనే వెళ్ళేవిధంగా మొత్తం ఇంటర్నెట్ మనల్ని పురిగొల్పుతుంది. మన ఏకాగ్రతను భగ్నం చేయడమే మన చేతిలోని ఫోన్ల పని. ఒక అంశంపై కనీసం 30 సెకన్లు కూడా దృష్టి పెట్టలేని వాళ్ళం, జీవితం పట్ల నిబద్ధత ఏమి చూపగలం? మీ స్వేచ్ఛకు మీరు ఎంత బాగా అడ్డుకట్ట వేసుకోగలుగుతారనే దానిపైనే జీవితంలో ఏదైనా నెరవేరడం లేదా నెరవేరకపోవడం ఆధారపడి ఉంటుంది. నిబద్ధతతో మెలగడమే ప్రాథమిక కర్తవ్య మనే సంగతిని 30 ఏళ్ళ ప్రాయంలో గ్రహిస్తాం. నిబద్ధతతో మెల గాల్సి ఉంటుందంటే, మొదట భయం వేయవచ్చు. కానీ, నిబద్ధత అంటే, ఏదైనా ఒకదాని పట్ల ఇష్టం ఏర్పడి, అది నెరవేరకపోయినా, జీవితంలో ముందుకు సాగే విధంగా, నడవడికను రూపొందించు కోవడమే! అది జీవిత భాగస్వామి, ఉద్యోగం, పని చేస్తున్న కంపెనీ ఏదైనా కావచ్చు. నిబద్ధత ఒక నైతిక కార్యాచరణఒక కెరీర్ లేదా ఒకేషన్ పట్ల బద్ధులమై ఉన్నామని 28–32 ఏళ్ళ మధ్యలో గ్రహిస్తాం. కానీ, కెరీర్ వేరు, ఒకేషన్ వేరు. కెరీర్ను మీరు ఎంచుకుంటారు, ఒకేషన్ మిమ్మల్ని ఎంచుకుంటుంది. ఫ్రాన్సిస్ పెర్కిన్స్ అనే యువతి 20వ ప్రాయం చివరలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ, అగ్ని ప్రమాదాన్ని చూశారు.వందలమంది మంటలకు ఆహుతయ్యారు. మంటల నుంచి రక్షించుకునే క్రమంలో పైనుంచి దూకేసి చనిపోయారు. తర్వాత, ఆమె తన జీవితం మొత్తాన్నీ కార్మికుల భద్రత, హక్కుల సాధనకు వెచ్చించారు. మనకు ప్రీతిపాత్రమైన దానిని అంతర్ దృష్టితో కనుగొనలేం. దీనిపై అధ్యయనాలు సాగాయి. మనలో ఎనభై శాతం మందికి ప్రీతిపాత్రమైనది అంటూ ఉండదు. బయటకు చూడటం ద్వారా, అవసరాలను చూసినపుడు ఆర్ద్రతతో స్పందించడం ద్వారా దాన్ని కనుగొనవచ్చు. భాగస్వామి లేదా పిల్లల పట్ల చూపించేది మరో నిబద్ధత. వివాహం 30 లేదా 40 లేదా 50 ఏళ్ళ సంభాషణ. అన్ని గొప్ప అంకిత భావాల మాదిరిగానే, ప్రేమ కూడా రెండు భిన్నమైన స్థాయు లలో సమాంతరంగా పనిచేస్తూ వస్తుంది. ఒకటి – సడలని వాస్తవి కత. రెండు– భావాతీత ఇంద్రజాలం. ఇంట్లోకి సరుకులు కొనడం, ఇల్లు శుభ్రం చేయడం, రాజీపడవలసి రావడం, తేలికపాటి బలహీనతలతో సర్దుకుపోవడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. కవితాత్మకమూ, భావాతీతమూ, ఆదర్శవంతమూ, విశ్వజనీనమూ అయినది ప్రేమలోని మరో కోణం. చాలా భాగం వనరులు పరిమితమైనవి. మనం ఉపయోగించుకుంటున్న కొద్దీ అవి తరిగిపోతాయి. కానీ, ప్రేమ వేరు. ప్రేమిస్తున్న కొద్దీ మీరు ఇంకా ప్రేమించగలుగుతారు. ఒక బిడ్డను ప్రేమిస్తున్నంత మాత్రాన, మరో బిడ్డ పుడితే, ఆ రెండవ బిడ్డను తక్కువగా ఏమీ ప్రేమించరు. పంచుతున్న కొద్దీ ప్రేమ విస్తారమవుతుంది. ప్రేమలో ఉన్నవారు కష్టనష్టాలను తట్టుకునేందుకు కూడా సిద్ధపడతారు. రెండు వేర్వేరు నగరాల్లో ఉంటున్న యువతీ యువకులకు కలసి ఉండడంలో అర్థం లేదని చెప్పండి. వారు ఒప్పుకోరు. విడిపోయి సంతోషంగా ఉండటం కన్నా, కలసి ఉండి, కష్టసుఖాలు పంచుకునేందుకే ఇష్టపడ తారు. నిబద్ధతలో ఉండే గొప్ప అంశమది. నిబద్ధత ఒక నైతిక కార్యాచరణ. ఒక వృత్తిని నిర్వహించడం నైతిక చర్య. 30 లేదా 50 ఏళ్ళ వివాహ బంధానికి కట్టుబడి ఉండడం నైతిక చర్య. మాట ఇచ్చి నిల బెట్టుకోవడం నైతిక చర్య. ఒక మంచి, నైతిక వ్యక్తిగా పరిణమించడ మంటే, ప్రలోభాలను నియంత్రించలేకపోవడం కాదు. నిబద్ధతతో వ్యవహరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం. -
ఇప్పటికీ మారేది లేదా!
దగ్గు మందు సేవించిన పిల్లలు వరుసగా మృత్యువాతపడటం ఇటీవల కలకలం సృష్టించింది. ఔషధాల నియంత్రణ వ్యవస్థ పనితీరు దేశంలో అధ్వానంగా ఉన్న స్థితిని ఇది మరోసారి కళ్ళకు కట్టింది. కల్తీ మందులు సేవించి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఇటీవలి సంవత్స రాలలో దేశ, విదేశాలలో చోటుచేసు కున్నాయి. అవి మన దేశంలో తయారైనవి కావడంతో తీరని తలవంపులు తెచ్చి పెట్టాయి. ఇలాంటి విషాదకర ఘటనలు వెలుగు చూసిన ప్రతిసారీ మన స్పందన ఒకే విధంగా ఉంటుంది. యథావిధిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దర్యాప్తునకు ఆదేశిస్తాయి. చెదురు మదురుగా కొన్ని మందుల పరిశ్రమలలో సోదాలు నిర్వహిస్తారు. నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేటట్లు చూడాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు వెళతాయి. అనతి కాలంలోనే ‘పరిస్థితులు’ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారవుతాయి. సడలింపులతో సమస్యలుడైఇథిలీన్ గ్లైకాల్(డి.ఇ.జి.), ఇథిలీన్ గ్లైకాల్ వల్ల కల్తీ అయిన దగ్గు మందులను సేవించినవారికి పొత్తి కడుపులో నొప్పి,వాంతులు, అతిసారం, మూత్రం పోయలేకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు మొదలవుతాయి. కొన్ని కేసుల్లో మూత్ర పిండాలకు తీవ్ర గాయమై, అది మరణానికి కూడా దారితీయవచ్చు. భారత దేశంలో తయారైన ఔషధాల వల్ల జాంబియా, ఉజ్బెకిస్తాన్, కామె రాన్, ఇరాక్ తదితర దేశాలలో డజన్ల కొద్దీ పిల్లలు మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో అప్రమత్తమైంది. ఔషధాల తయా రీకి ఉపయోగించే ముందు ముడి పదార్థాలలో డి.ఇ.జి. ఉందేమో పరీక్షించవలసిందని ఆ సంస్థ జాతీయ అధికారులకు సలహా ఇచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారాలో దగ్గు మందు మరణాలకు డి.ఇ.జి.యే కారణమని తేలింది.విధిగా పాటించవలసిన ‘మంచి తయారీ విధానాల’కు (జీఎంపీ) ఔషధ తయారీ సంస్థలు తిలోదకాలిస్తున్నాయని స్పష్ట మవుతోంది. అవి అనుసరించడం, లేదా అవి తప్పించుకునేందుకు ప్రభుత్వమే అవకాశమిస్తోందా అంటే... రెండూనని జవాబు చెప్పు కోవాలి. కలుషిత మందుల వల్ల మరణాలు సంభవించగానే, జీఎంపీని అమలుపరచడం, వాటిని మరింత కఠినంగా రూపొందించడం గురించిన మాటలు వినవస్తాయి. వెంటనే, చిన్న, మధ్యతరహా ఔషధాల తయారీ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పారిశ్రామిక సంఘాలు నిబంధనల అమలుకు సమయాన్ని అడుగుతాయి. లేదా వాటిని అమలుపరచగల సామర్థ్యం తమకు లేదంటూ సడలింపు లను కోరతాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దెబ్బతింటుందని, ప్రభుత్వం కూడా వాటిపట్ల సానుభూతితో వ్యవహరిస్తుంది. జాంబియాలో 68 మంది పిల్లలు మరణించాక కూడా, విధానాలను సరిగా అనుసరించడం లేదంటూ భారతీయ సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థనే వేలెత్తి చూపాయి. భారతీయ ఎగుమతులను నీరు గార్చే కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలకు దిగాయి. ‘మంచి తయారీ విధానాల’ ( జీఎంపీ)లోని ‘ఎం’(తయారీ)కు సంబంధించిన రివైజ్డ్ నియమాలను సంస్థలు విధిగా పాటించవలసిన అవసరం ఉందని, ఛింద్వారా ఘటన తర్వాత, ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ పునరుద్ఘాటించారు. సవరించిన జీఎంపీ నిబంధనలను కఠినంగా అమలుజరపవలసిందని రాష్ట్రా లను కోరారు. ‘‘ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల ఉన్నతి పథకా నికి దరఖాస్తు చేసుకున్న కొన్ని సంస్థలకు 2025 డిసెంబర్ వరకు పొడిగింపు ఇచ్చాం’’ అని ఆయన వివరించారు. అంటే, జీఎంపీ నూతన షెడ్యూలును ఇప్పుడిప్పుడే అమలుపరచబోవడం లేదని అవగతమవుతోంది. పేరుకు కఠిన నిబంధనలే కానీ...భారతదేశంలో తయారైన దగ్గు సిరప్లు వివిధ దేశాలలో మర ణాలకు కారణమవడంపై అంతర్జాతీయంగా హాహాకారాలు రేగడంతో నూతన షెడ్యూలును ప్రవేశపెట్టారు. అది 2024 జూన్ నుంచి పెద్ద సంస్థలకు అమలులోకి వచ్చింది. (రూ. 250 కోట్లకన్నా తక్కువ టర్నోవరు ఉన్న) చిన్న, మధ్య తరహా తయారీ సంస్థలకు 2025 డిసెంబర్ వరకు పొడిగింపునిచ్చారు. నిజానికి, చాలా భాగం కలుషిత మందులు ఈ సంస్థల నుంచే వస్తున్నాయి. తయారీ సంస్థల్లో చాలా వాటికి మినహాయింపు లభించే విధంగా ఈ టర్నో వరు పరిమితిని నిర్ణయించారు. మందుల తయారీ సంస్థలు ఫార్మ స్యూటికల్ క్వాలిటీ సిస్టం, క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్, కంప్యూ టరైజ్డ్ స్టోరేజీ వ్యవస్థలు వంటి విధానాలకు కట్టుబడి ఉండాలని షెడ్యూలు ఎం నిర్దేశిస్తోంది. సునిశిత పునః పరీక్షకు మధ్యంతర, తుది ఉత్పత్తుల నమూనాలను తయారీ సంస్థలు తప్పకుండా అట్టే పెట్టవలసి ఉంటుంది. కనుక, నిబంధనలకు లోటు లేదు. మరింత కఠినమైన విధంగా వాటిని సవరిస్తున్నారు కూడా! కానీ, వాటిని అమలుపరచే సంకల్ప దీక్ష కొరవడుతోంది. ఈ నిబంధనలను అమలుపరచేటట్లు చూసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులపై ఉంది. కానీ, తగినంత సిబ్బంది లేదు. ఉద్దేశపూర్వకంగానే సిబ్బందిని అరకొరగా ఉంచుతున్నారని అనుకోవాలి. అనేకానేక నిపుణుల ప్యానెళ్ళు, సమీక్షా కమిటీలు, పార్లమెంటరీ ప్యానెళ్ళు గత రెండు దశాబ్దాలుగా ఈ సంగతిని వెల్లడిస్తూనే ఉన్నాయి. కానీ, క్షేత్ర స్థాయిలో మార్పు లేదు. ఔషధ తయారీ సంస్థలు ఎక్కువగా కేంద్రీకృతమైన తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయి. పేషెంట్కు ప్రాధాన్యత ఉండొద్దా?పరిశ్రమను కాపాడటం కోసం నిబంధనలను పాటించకపోయినా పట్టించుకోవడం లేదు. లేకపోతే, మన దేశంలో పిల్లల మరణాలకు డి.ఇ.జి. కారణమై ఉండేది కాదు. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న దగ్గు సిరప్లు జాంబియా, తదితర దేశాలలో పిల్లల మరణాలకు కారణమైనప్పుడే, ఆ రసాయనిక పదార్థం కారణమని గుర్తించారు. అప్పుడే దగ్గు మందులను తయారు చేసే సంస్థలన్నింటా దేశవ్యాప్తంగా తనిఖీలు జరిపి ఉండవలసింది. అవేవీ జరగకపోవడం వల్ల, ఛింద్వారాలోనూ మరణాలు సంభవించాయి. ‘‘భారతదేశంలో డ్రగ్ రెగ్యులేషన్ వ్యవస్థను పట్టిపీడిస్తున్న చాలా జాడ్యాలకు, డ్రగ్ రెగ్యులేటర్ సంకుచిత ప్రాధాన్యాలు, దృక్కో ణాలే కారణం. కొన్ని దశాబ్దాలుగా అది మందుల తయారీ సంస్థల వ్యాప్తికి, వెసులుబాటుకే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. దాంతో, దుర దృష్టవశాత్తు, అసలు లెక్కలోకి రావలసిన వినియోగదారుని ప్రయో జనాలు అటకెక్కుతున్నాయి’’ అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 59వ నివేదిక పేర్కొంది. ఈ నివేదికను 2012లో పార్లమెంట్కు సమర్పించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటాన్నే కేంద్ర ఔషధ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ ప్యానెల్ సిఫార్సు చేసింది. అయినా కల్తీ మందులు ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. ప్రజారోగ్యం కన్నా పరిశ్రమల ప్రయో జనాలకు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మార్క్ జుకర్బర్గ్ (మెటా సీఈవో) రాయని డైరీ
చీఫ్ ఏఐ ఆఫీసర్గా ‘మెటా’ లోకి వచ్చీ రావటంతోనే అలెగ్జాండర్ వాంగ్ చేసిన రెండో పని... జింజర్ ఫైర్బాల్ తెప్పించుకుని వాక్ ఏరియాలో నాతో కలిసి నడుస్తూ తాగటం.ఇక అతడు చేసిన మొదటి పని... 600 మంది ఏఐ నిపుణులను ఒకేసారి ఫైర్ చేసి, నవంబర్ 21లోగా రిజైన్ చేయాలని కోరుతూ వాళ్లందరికీ లెటర్స్ మెయిల్ చేయించటం.28 ఏళ్ల వయసుకే కాఫీ, టీలను త్యజించినవాడు వాంగ్. నిజంగా జ్ఞానోదయం పొందినవారు మాత్రమే పని మధ్యలో ఒక కప్పు సాదాసీదా వేడి నీటితో తమ ఇంద్రియాలను పునరుజ్జీవింప జేసుకోగలరని అంటాడతడు. ‘‘ఎవర్నీ ఫైర్ చెయ్యకుండా మెటా ‘ఏఐ’ని నడిపించలేమా వాంగ్?’’ అన్నాను. ఫైర్బాల్ జ్యూస్ను సిప్ చేస్తున్న క్రీస్తు పూర్వపు చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్లా... నా వైపు చూశాడు వాంగ్,‘‘హైర్ చేసేటప్పుడు ఎంపిక చేసుకుంటాం కదా, ఇదీ అంతే మార్క్. ఫైర్ చేయటానికి ఎంపిక చేసుకుంటున్నాం’’ అన్నాడు.ట్రంప్ కంటే మొండివాడు వాంగ్. ‘‘ఏఐ వార్లో అమెరికా గెలిచి తీరవలసిందే’’ అని ట్రంప్కే నేరుగా లెటర్ రాసినవాడు! వాంగ్ ‘రూట్స్’ చైనావి. వాంగ్ ‘హార్ట్ బీట్స్’ అమెరికావి.‘‘కానీ వాంగ్, కొన్నిసార్లు ఆఫ్రికా ఖండంలోని ఆకలి చావుల కన్నా, మన ఇంటి ముందర నిర్జీవంగా పడి ఉన్న ఉడుతే మనల్ని ఎక్కువగా కలచివేస్తుంది!’’ అన్నాను. మెటాకు నేనొక ‘ఔట్మోడెడ్’ వెర్షన్ అన్నట్లుగా నా వైపు చూశాడతడు. ‘‘ఓకే మార్క్... మళ్లీ కలుద్దాం’’ అనేసి వెళ్లిపోయాడు.ఎంప్లాయీస్ని తొలగించినందుకు యూజర్స్ చేస్తున్న కామెంట్స్ అన్నీ వాంగ్ మీద వస్తున్నవే! వాంగ్ చైనీస్ పర్సన్ కనుక అతడు ఫైర్ చేసిన వాళ్లలో ఒక్కరు కూడా చైనీస్ ఉండకపోవచ్చని ఒకరు కామెంట్ చేశారు!దారుణమైన కామెంట్ కూడా ఒకటి ఉంది. జుకర్బర్గ్ భార్య చైనీస్ పర్సన్ కనుక, వాంగ్ అనే చైనీస్ పర్సన్ కి ‘మెటా’లో అంత పెద్ద ఉద్యోగం దొరికిందని!!నిజానికి, మెటాలోకి వచ్చేటప్పటికే వాంగ్ ‘స్కేల్ ఏఐ’ అనే ఒక పెద్ద కంపెనీకి కో–ఫౌండర్. అందులో సగ భాగాన్ని మెటా కొనేయటంతో అతడు మెటాలోకి వచ్చాడు కానీ, మెటాలో ఉద్యోగం దొరకటం వల్ల వచ్చినవాడు కాదు.వాంగ్ వెళ్లిపోయాక, వాకింగ్ ఏరియా నుంచి నా డెస్క్లోకి వచ్చి కూర్చున్నాను. ఓపెన్ డెస్క్ అది. చుట్టూ ఎంప్లాయీస్ ఉంటారు.‘‘మార్క్! మీతో మాట్లాడాలి. యాక్చువల్లీ మీతో మాట్లాడటం కోసమే నేను ఎదురు చూస్తున్నాను’’ అంటూ – ఇండియన్ యాక్సెంట్తో ఒక అమ్మాయి. చాలా కోపంగా ఉంది. చాలా అంటే చాలా! ‘‘షూట్ మీ..’’ అన్నాను నవ్వుతూ.తను నవ్వదలచుకోలేదని ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది.‘‘మార్క్! ఎంప్లాయీస్ అంటే స్ప్రెడ్షీట్స్ కాదు.. మనుషులు. యునీక్ స్కిల్స్, ఎమోషన్ ్స, అనుభవం ఉన్నవారు. ఎలా తీసేస్తారు అంతమందిని? అంతమంది అని కాదు. అసలు వారిలో ఒక్కరినైనా?!!’’ – స్థిరంగా, స్ట్రాంగ్గా అంటోంది. అం... టూ...నే ఉంది! తను వెళ్లాక, వాంగ్కి కాల్ చేసి... ‘‘ఏఐ ల్యాబ్స్ నుంచి ఫైర్ చేసిన వాళ్లలో తను కూడా ఉందా?’’ అని అడిగాను. కాసేపటి తర్వాత వాంగ్ కాల్ బ్యాక్ చేసి, ‘‘ఏఐ ల్యాబ్స్ ఫైరింగ్ లిస్ట్లో తను లేరు మార్క్! కానీ తను చేస్తున్నది ఏఐ ల్యాబ్స్లోనే!!ఇంటెర్న్. సూపర్ ఇంటెలిజెంట్ అని విన్నాను’’ అన్నాడు వాంగ్. ఆ అమ్మాయి తన కోసం తను ఫైట్ చెయ్యటం లేదంటే తను ఎవరితోనైనా ఫైట్ చేయగలదని! అమెరికన్ కంపెనీలు ప్రపంచంలో నంబర్ 1గా ఉండటానికి నాకిప్పుడు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి –ప్రాక్టికల్గా ఉండే చైనీస్ చీఫ్ ఆఫీసర్స్. రెండు – ‘ఫైటింగ్ స్పిరిట్’ ఉన్న ఇండియన్ ఇంటెర్న్లు! -
ట్రంప్ ‘ఏడువారాల నగలు’
మహారాణులకు, ఏడువారాల నగల వలె, అమెరికా మహారాజు డోనాల్డ్ ట్రంప్కు ఏడువారాల వ్యూహాలుంటాయి. ఈ స్థితిని ప్రపంచం పలు విషయాలలో గమనిస్తున్నది. గమనించి మొదట భయ పడింది. తర్వాత అయోమయానికిగురైంది. చివరకు పరిస్థితి కొంత వినోదాత్మకంగా మారగా, ప్రేక్షకులలో కొందరు ట్రంప్ తలపై ఆయన ఇటీవల స్వయంగా ధరించి పోస్ట్ చేసిన రాజు గారి కిరీటానికి బదులు సర్కస్ క్లౌన్ టోపీని చూస్తున్నారు. కొందరు ఏమిచేయాలో తోచక విసుగెత్తి తలలు పట్టుకుంటున్నారు.అమెరికా అధ్యక్షుని గురించి పైన చేసిన వ్యాఖ్యలేవీ కాలక్షేపపు ఊహాగానాలు కావు. ప్రతి ఒక్కటీ వాస్తవంగా జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకుని అన్న మాటే. అట్లా పరిగణించిన విష యాలు ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, భారత దేశంతో ఆర్థిక – వ్యూహాత్మక సంబంధాలు, చైనాతో వాణిజ్య – వ్యూహాత్మక తగవులు. వీటికి సంబంధించి కొన్ని మాసాల నుంచి మొదలుకొని నేటివరకు మాట్లాడుతున్నవి, చేస్తున్నవి, చేస్తానని చేయనివి, తాను చేయకున్నా ఇతరులు చేయాలనేవి, ఇతరులు చేయాలంటూ తిరిగి అందుకు మార్పులు చేసేవి, తాను చేస్తాననే వాటిలో మార్పులు తెచ్చేవి... అన్నింటినీ ఒక కాలక్రమంలో పేర్చి పెట్టి చూస్తే, మొత్తం మీద కనిపించేది ట్రంప్ చక్రవర్తి ‘ఏడువారాల నగలు’. మనంఅంటున్న ఈ మాట ఆయనకు చేరే అవకాశం లేదుగానీ, ఇటీవల అమెరికన్ పౌరులు ‘నో కింగ్’ అంటూ పెద్ద ఎత్తున జరిపిన నిరసనలను హాస్యాస్పదంగా చూపేందుకు తానే హాస్యాస్పద వేషధారణ చిత్రాన్ని పోస్ట్ పెట్టినట్లు, ఏడువారాల నగలతో ఏడు పోస్టులు పెట్టే వారేమో!చక్రవర్తి ఎందుకు?ట్రంప్ చేస్తున్నదంతా ఒక వ్యూహంలో భాగమని ఆయన అంతే వాసులు ప్రచారం చేసి లోకాన్ని నమ్మించజూశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక విషయమై అవతలి వారిని పిచ్చుకపై వేస్తాను సుమా బహ్మాస్త్రం అన్నట్లు మొదటే భయపెడతారు. అట్లా వేయటం నిజంగా తన ఉద్దేశం కాదు. కానీ అట్లా భయపెడితే అవతలి వారు బ్రహ్మాస్త్ర ప్రయోగం నిజంగానే జరగవచ్చునని భయ పడిపోయి, తన ఆదేశాలను శిరసావహించగలరన్నది ట్రంప్ అంచ నాలట! దానిని వారు బ్రహ్మాస్త్ర వ్యూహమన్నారు. ఇది యథాతథంగా వినేందుకు గొప్పగా తోస్తుంది. మధ్యయుగాల నాటి ‘బెనెవెలెంట్ డిక్టేటర్ (ఉదార నియంత) లక్షణాల తరహాలో కనిపిస్తుంది. ట్రంప్ వ్యక్తిత్వంలో, వ్యవహరణలో నిజంగానే ఈ లక్షణాలు ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. పరిస్థితి అంతవరకే అయితే ఫరవాలేదు. నిజం చెప్పాలంటే ‘ఉదార నియంత’ భావన ఆధునిక ప్రజాస్వామ్య భావనలకు సరిపడేది కాదుగానీ, ఒకోసారి అందువల్ల కొంత మంచి కూడా జరుగుతుంటుంది. అదే సమయంలో ఎక్కువసార్లు బెడిసి కొడుతుంది. ఈ రెండింటిలో ఏమి జరిగేదీ అవతలి పక్షాల పైనా, వాస్తవ పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, కిరీటం ధరించిన ‘కింగ్ ట్రంప్’ గారి ‘బెనెవె లెంట్ డిక్టేటర్’ వ్యూహం కొద్ది సందర్భాలలో తప్ప పనిచేయదు. వాస్తవానికి ఈ హెచ్చరిక ఆయనకు అందరికన్నా ముందు చేసినవాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా. అయినదానికి కాని దానికి ట్యారిఫ్లు పెంచుతూ, వాణిజ్య ఒప్పందాల గురించి బెది రిస్తూ, చివరకు బ్రెజిల్ ప్రతిపక్ష నాయకుడు బోల్సొనారోపై చర్యల విషయంలోనూ జోక్యం చేసుకొనజూసినపుడు, ‘‘ప్రపంచం చక్ర వర్తిని కోరుకోవటం లేదు. అమెరికన్లు ట్రంప్ను ఎన్నుకున్నది చక్ర వర్తి అయేందుకు కాదు’’ అని ఘాటుగా మాట్లాడారాయన. పరిస్థి తిని ట్రంప్ అర్థం చేసుకోలేదన్నది వేరే విషయం! మార్చేందుకే మాట ఉన్నది...ప్రస్తుతానికి వచ్చి, పైన పేర్కొన్న వేర్వేరు విషయాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు నాలుగు రోజులకు ఒక విధంగా మాట మార్చటం చూస్తున్నాం. ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటలలో ఆపివేయగలనంటూ మొదలుపెట్టిన ఆయన, ఇపుడు ఏమిచేయాలో తోచక, టేబుల్కు రెండు వైపులా తానే నిలిచి తనతో తానే పింగ్పాంగ్ ఆడుతున్నారు. ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ను హెచ్చరిస్తారు. డోన్బాస్ను వదలుకోవాలని మంగళవారం ఆదేశించి క్రిమియాను సైతం స్వాధీన పరచుకునేందుకు జెలెన్స్కీకి తోమహాక్లు అంద జేయగలనంటూ బుధవారం నాడు పుతిన్ను భయపెట్టజూస్తారు. గురువారంరోజు ఇద్దరితోనూ ఖనిజ ఒప్పందపు చర్చలు నడుపు తారు. శుక్రవారం యూరోపియన్ దేశాలను మీ దారి మీదేనని చెప్పి, శనివారం నాడు ‘నాటో’ను అందరం కలిసి బలోపేతం చేద్దామంటారు. ఈ విధంగా ఉక్రెయిన్ విషయమై ప్రపంచం గమనించి అబ్బు రపడుతున్న ‘ఏడువారాల నగల ప్రదర్శన’ వంటిదే ఇతర సంద ర్భాల్లోనూ చూస్తున్నాము. ఉక్రెయిన్ వలెనే మరొక యుద్ధమైన గాజాను గమనించండి. గతాన్ని కొద్దిసేపు అటుంచి ఇటీవలి పరిణామాలనే గమనిస్తే– 20 అంశాల ప్రకటన, షర్మ్ అల్ షేక్ సంతకాలతో మొత్తం పశ్చిమాసియాలోనే ‘శాశ్వత శాంతి’ సిద్ధించిందని ప్రకటించారు ట్రంప్. అది తొందరపాటనీ, మొదటి దశ అయిన కాల్పుల విరమణే ఇంకా స్థిరపడవలసి ఉందనీ అందరూ ఎత్తిచూపారు. కానీ అధ్యక్షుడు మాత్రం నోబెల్ శాంతి ప్రకటన ముగిసినదే తడవు హమాస్కు హెచ్చరికలు మొదలుపెట్టారు.అంతర్గత అరాచక శక్తులను అదుపు చేసేందుకు హమాస్ ఆయు ధాలను ఉంచుకోవచ్చునని ఒకరోజు ప్రకటించి, ఒకరోజు తిరిగే సరికి అస్త్రసన్యాసం చేస్తారా లేక ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ‘సర్వనాశనం’ చేయాలా అని బెదిరింపులు మొదలుపెట్టారు. ఇజ్రా యెల్ బాంబింగులు, సహాయ సరఫరాల నిలిపివేతలపై మౌనం వహిస్తున్నారు. గతంలోకి వెళితే, ఆయన గాజా, పాలస్తీనా విధా నాలు, రకరకాల ప్రకటనలు తెలిసినవే గనుక ఇక్కడ రాయ నక్కర లేదు. 20 అంశాల ప్రకటన అయితే బయటి వారితో తాత్కా లిక ప్రభుత్వం, బయటి దళాలతో భద్రతావ్యవస్థ, బయటి వారి ప్రణాళికల మేరకు అభివృద్ధి అని చెప్పటం మినహా, స్వతంత్ర పాలస్తీనా గురించి నిశ్చితంగా ఏమీ పేర్కొనక పోవటం తెలిసిందే. వీటన్నింటి చుట్టూ తిరుగుతూ ట్రంప్ వేర్వేరు మాటలతో ఏడు వారాల నగలు ధరిస్తూనే ఉన్నారు. మధ్యయుగాల క్రీడభారత దేశం, చైనాలతో ట్యారిఫ్లు, వాణిజ్య ఒప్పందాలకుసంబంధించి కూడా సరిగా ఇదే జరుగుతున్నది. ఒక రోజు బెదిరింపులు, ఈసడింపులు, మరునాడు సానునయమైన మాటలు. ఒక రోజు సంయుక్త సమావేశపు ప్రతిపాదనలు, మరొకరోజు వాయి దాలు... ఇది ఈ రెండు ఆసియన్ దేశాల విషయంలోనూ జరుగు తున్నది. ట్రంప్కు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, కొద్ది తేడాలతో రెండు దేశాలు కూడా ఒక పరిమితిని దాటి తమ జాతీయ ప్రయో జనాలను వదులుకునేందుకు సిద్ధంగా లేవు. చైనా అయితే తన ఆర్థిక బలిమి వల్ల, కొన్ని రంగాలలో అమెరికాను పూర్తిగా ధిక్కరించ గలగటం ట్రంప్కు పాలుపోని పరిస్థితి అయింది. అయినా చైనా, ఇండియాలను గెలవనివ్వకూడదు గనుక, తరచూ ‘నగల మార్పిడి’ చేసుకుంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకుని మారవలసింది ఏమంటే, తన వ్యూహంలో బలహీనతలు అనేకం ఉన్నాయి. ప్రపంచం ఒకప్పటి వలె లేదు. అందువల్ల, మధ్య యుగపు రాజువలె కిరీట ధారణ, రాణివలె ఏడువారాల నగలు చూసి చిత్తభ్రమలకు లోనై లొంగిపోయే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతున్నది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
‘ఆడపడుచు కట్నాలు’ ఫలిస్తాయా?
రానున్న బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటు నిర్ణయాత్మకం కాబోతోందా? వారు కింగ్ మేకర్లు కాబోతున్నారా? 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు 54.6 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే, స్త్రీలు వారికన్నా ఎక్కువగా 59.7 శాతం మంది పోలింగ్లో పాల్గొన్నారు. బిహార్లో ఇలా మహిళలు పెద్ద యెత్తున ఓటు వేసేందుకు తరలిరావడం దశాబ్దం పైనుంచి కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విజయాన్ని ఖాయం చేయడంలో వారి ఓటు సహాయపడిందనడంలో సందేహం లేదు. కానీ ఈ నవంబర్లో పరిస్థితిలో మార్పు రావచ్చు. వివాదాస్పదంగా మారిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం తర్వాత సిద్ధమైన ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని మొత్తం 7.43 కోట్ల మందిలో మహిళల (3.5 కోట్ల మంది) కన్నా పురుషులు (3.92 కోట్ల మంది) ఎక్కువగా ఉన్నారు. అంటే, ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 892 మంది చొప్పున ఉన్నారు. ఈ మార్పు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే, 2015–20 మధ్యలో పురుష ఓటర్ల సంఖ్య 34.42 లక్షలు పెరిగితే, మహిళా ఓటర్లు 39.62 లక్షల మంది పెరిగారు.మహిళల నాడి తెలుసుకొని...బిహార్ ఎన్నికల్లో కులం పాత్ర ముఖ్యమైనదే కానీ, ప్రధానంగా నితీశ్ కుమార్ ఉత్సాహ ప్రోత్సాహాలతోనే ఎన్నికల రాజకీయాల్లో మహిళలు పాల్గొనడం పెరిగింది. పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు నిర్ణాయక శక్తిగా మారే విధంగా, వారు చురుకుగా పోలింగ్లో పాల్గొనేటట్లుగా ఆయన 2005 నుంచి కీలకమైన చర్యలు తీసుకుంటూ వచ్చారు. నిజం చెప్పాలంటే, రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిన కారణంగానే గత రెండు ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించగలిగారు. మహిళా సాధికారతకూ, మద్యనిషేదానికీ నితీశ్ ముడిపెట్టారు. తాగుడు వ్యసనం వల్ల మహిళలే ఎక్కువ ఇక్కట్లు పడుతున్నారంటూ ఆయన చేసిన వాదన వారిని ఆకట్టుకుంది. స్కూళ్ళకు వెళ్ళే బాలికలకు సైకిళ్ళు, యూనిఫారాలు పంపిణీ చేయడం ద్వారా, మహిళా ఓటర్లను కూడగట్టుకునే పనిని ఆయన 25 ఏళ్ళ క్రితమే ప్రారంభించారు. వారిలో కొందరు వనితలు వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారిగా నిరూపించుకున్నారు. కొందరు మాతృమూర్తులయ్యారు. ఇన్నేళ్ళుగా నితీశ్ పట్ల వారి మమకారం చెక్కుచెదరకుండా వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ‘లాడ్లీ బెహనా యోజన’, ‘లడ్కీ బహిన్∙యోజన’ పథకాలను అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రారంభించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు; కానీ, మహిళలపై నితీశ్ ప్రభావం అంతకన్నా పెద్దది.పోటాపోటీ వరాలుఅయితే, మహిళల్లో నితీశ్ పట్ల ఆదరణ తగ్గినట్లు ఇటీవలి ఒక ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని మహిళల్లో చాలా మంది భావిస్తున్నారు. రాజకీయంగా మరింత పెద్ద పాత్ర వహించే విధంగా నితీశ్ తన కుమారుడు నిశాంత్ను తీర్చిదిద్దడం మొదలుపెట్టడానికి బహుశా అదే ప్రధాన కారణం కావచ్చు. రాష్ట్ర ఆర్థిక మంత్రి మార్గదర్శకత్వంలో నిశాంత్ ఎక్కువ సమయాన్ని సమస్తిపూర్ నియోజకవర్గంలో వెచ్చిస్తున్నప్పటికీ, ఆయన ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయడం లేదు. కనుక, రానున్న ఎన్నికల్లో నితీశ్దే ప్రధాన పాత్ర. మహిళా ఓటర్లపై తన పట్టును కొనసాగించేందుకు నితీశ్ యుక్తిని ప్రదర్శించారు. మహిళా ఔత్సాహికæ పారిశ్రామికవేత్తలకు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ కింద ఇవ్వదలచిన రూ. 10,000 కోట్ల మొదటి విడత మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించారు. వ్యవస్థాపక సామర్థ్యం కనబరచిన మహిళలకు వచ్చే ఆరు నెలల్లో, మరో రూ. 2 లక్షల చొప్పున బదిలీ అవుతాయి. ఈ పథకం కింద దాదాపు రూ. 21,000 కోట్లను వెచ్చించనున్నారు. నితీశ్ ఈ ఏడాది సెప్టెంబర్లో మరికొన్ని పథకాలు ప్రకటించారు. సుమారు 1.89 కోట్ల మంది వినియోగదారులకు రూ. 5,000 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల ఉచిత విద్యుత్తును అందించనున్నారు. సామాజిక భద్రతా పింఛను పథకం 1.11 కోట్ల మందికి లబ్ధి చేకూర్చనుంది. జీవిక, అంగన్వాడి, ‘ఆశా’ వర్కర్ల గౌరవ వేతనాలను పెంచారు. దీనివల్ల, ప్రభుత్వ ఖజానాపై మరో రూ.9,300 కోట్ల భారం పడనుంది. కొత్తగా ప్రకటించిన కేటాయింపుల వల్ల ఏటా అదనంగా రూ. 40,000 కోట్లు ఖర్చు కానున్నాయి. రాష్ట్ర వార్షిక రాబడి మొత్తం దాదాపు రూ. 56,000 కోట్ల మేరకు ఉంటుంది. రూ. 7 లక్షల కోట్ల వ్యయమయ్యే ఈ ఉచిత పథకాల వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారని ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. కానీ, జనాకర్షక వాగ్దానాలు చేయడంలో ఆయనా ఏమీ వెనుకబడి లేరు. ప్రతిపక్ష ‘మహాగuЇబంధన్’ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదనలోని ఆర్థికాంశాలను తేజస్వి పరిశీలించలేదని వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రం అంత భారాన్ని మోయగల స్థితిలో ఎంతమాత్రం లేదు.తగ్గని అతివల అగచాట్లుఇటీవల రాష్ట్రం నలుమూలల పర్యటించి, గ్రామాలు, పట్టణాలలోని మహిళలతో మాట్లాటిన సామాజిక ఉద్యమకారిణి షబ్నం హష్మీ వారి స్థితిగతులు ఏమీ బాగా లేవని చెబుతున్నారు. వనితలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారనీ, ‘హఫ్తాలు’ (రౌడీ మామూళ్ళు) చెల్లించుకోలేని మహిళల ఇళ్ళకు గూండాలు వచ్చి, ఉన్న వస్తువులను పట్టుకుపోతున్నారనీ ఆమె అంటున్నారు. ముఖ్యంగా, బిహార్ ఉత్తర ప్రాంతంలో మహిళలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారని ఆమె చెబుతున్నారు. తమపైన, తమ పిల్లలపైన హింసాయుత చర్యలు పేట్రేగిపోతున్నాయని వారిలో చాలా మంది వాపోయారని హష్మీ వెల్లడిస్తున్నారు. రేషన్ కార్డు సంపాదించడాని కైనా లేదా రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడానికైనా అడుగడుగునా లంచాలు చెల్లించుకోవాల్సి వస్తోందన్నది మహిళల నుంచి ఎదురైన మరో ప్రధాన ఫిర్యాదు. నితీశ్ కుమార్ మహిళలకు స్నేహపూర్వకమైన పథకాలు చేపడుతున్నారని చేస్తున్న ప్రచారంలో పస లేదనీ, వాస్తవానికి, సామూహికంగా వలసపోతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మహిళల్లో పెరిగాయనీ హష్మీ మాట. కాగా, గత ఎన్నికల్లో ఆర్.జె.డి., ఇతర ప్రతిపక్షాల వైపు ఓటర్లు మొగ్గినట్లు విశ్లేషణలు సూచించిన ప్రాంతాల్లో మహిళలు, ముస్లింల పేర్లు మాయమయ్యాయని లక్నో యూనివర్సిటీ మాజీ వైస్–చాన్స్లర్ ప్రొఫెసర్ రూప్ రేఖ అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు లక్నోలో పార్టీకి అనుకూలమైన, వ్యతిరేకమైన ప్రతి గడపనూ గుర్తించడాన్ని ఆమె అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ‘‘క్షేత్ర స్థాయిలో వారి (బీజేపీ) కార్యకర్తలు మరింత చురుకుగా ఉన్నారన్నది వాస్తవం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఏమైనా బిహార్లో తరాలలో మార్పు వచ్చిందనడంలో ఇసుమంత సందేహం కూడా అవసరం లేదు. తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్ ఈ మార్పునకు కరదీపకులుగా ఉన్నారు. బిహార్లో పాచికలు పైకి ఎగిరాయి. అవి ఎవరికి అనుకూలంగా పడతాయన్నది ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే!రష్మీ సెహగల్వ్యాసకర్త రచయిత్రి, సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
పక్కనపెట్టిన ప్రోటోకాల్తో తంటా
‘‘దౌత్యమంటే 50 శాతం ప్రోటోకాల్, 30 శాతం ఆల్కహాల్, 20 శాతం టి.ఎన్. కౌల్’’ అని మన దేశంలో చమత్కారంగా అంటూంటారు. ఒకప్పుడు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన టీఎన్ కౌల్ పేరు తో ఆ చమత్కారం వాడుకలోకి వచ్చింది. ఆయన మాస్కో, వాషింగ్టన్ వంటి ముఖ్యమైన చోట్ల భారత రాయబారిగానూ పనిచేశారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా దౌత్యం తీరుతెన్నులు మారుతున్నాయి. సంప్రదాయ ఉల్లంఘనల చిక్కుఇటీవలి కాలంలో భారతీయ దౌత్య సంప్రదాయాల్లో గణనీయమైన మార్పు అక్టోబర్ 11న కనిపించింది. మన దేశంలో అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్జియో గోర్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. న్యూఢిల్లీలో గోర్ నూతన బాధ్యతలకు సంబంధించి చాలా విషయాలు సంప్రదాయానికి భిన్నంగానే సాగాయి. 38 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన ఇంత పెద్ద బాధ్యతల్లోకి వచ్చారు. ఆయనకు దౌత్య అనుభవం సున్నా. ఒక రాయబారి పదవికి ఆయనకున్న శక్తిసామర్థ్యాలేమిటి అనేది అమెరికా సెనేట్ ముందు శల్యపరీక్షకు లోనుకాలేదు. అమెరికా కాంగ్రెస్కు నిలయమైన క్యాపిటల్ హిల్లో ప్రోటోకాల్ ఎలా ఉల్లంఘనకు లోనైందో, అదే మాదిరిగా భారతదేశంలో అధికార కేంద్రమైన రైజీనా హిల్లోనూ ఉల్లంఘనకు లోనైంది. దానికి ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చిందో మోదీ ప్రభుత్వం ఇటీవలనే తెలుసుకుంది. రాయబారిగా నియమితులైనవారు తమ నియామక పత్రాలను రాష్ట్రపతికి సమర్పించిన తర్వాతనే, అధికారిక లాంఛనాలు అమలులోకి వస్తాయి. ఆ తతంగం పూర్తి కాకుండానే ప్రధాని తన కార్యాలయంలో గోర్తో సమావేశమయ్యారు. ఈ సంఘటన చోటుచేసుకోకపోయి ఉంటే, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళపై ప్రస్తుత గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. మోదీ–గోర్ మధ్య సంభాషణను ఆధారంగా చేసుకుని, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళను ఆపేస్తోందంటూ అక్టోబర్ 15న ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు. ఈ ‘సంచలన వార్త’ను ప్రకటించేందుకు గోర్ అనుమతిని ట్రంప్ కోరారు. మోదీతో తాను ఫోన్లో సంభాషించినపుడు, మోదీ తనతో ఆ మాట అన్నట్లు, ట్రంప్ ఎన్నడూ చెప్పలేదు. మోదీ ‘‘రష్యా నుంచి చమురు కొనబోవడం లేదని ఈ రోజు (అక్టోబర్ 15) నాకు హామీ ఇచ్చారు’’ అని మాత్రమే ట్రంప్ చెప్పారు. ఈ అంశంపై మోదీ ఆలోచనలను సరిగ్గానో లేదా తప్పుగానో అధ్యక్షుని చెవిన వేసింది గోరేనని, ట్రంప్ మీడియా సమావేశం పూర్తి వీడియో చూస్తే తేటతెల్లమవుతుంది. శ్వేతసౌధంలో ఉన్నదే సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తి గనక, ప్రధానికీ, గోర్కూ మధ్య సమావేశం ఏర్పాటు చేస్తే, అది ఊహించని పర్యవసానాలకు దారితీస్తుందని ప్రధాని సలహాదారులు గ్రహించి ఉండవలసింది. భారతదేశంలో దౌత్యం తాలూకు సంప్రదాయాల గురించి బొత్తిగా అనుభవం లేని వ్యక్తికి, నేరుగా ప్రధానితో సమావేశమయ్యే అవకాశం కల్పించకూడదు. చివరగా జరగవలసిన పని మొదట్లోనే జరిగింది. దౌత్యవేత్తలు గట్టిగా ఉంటే...అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000వ సంవత్సరంలో భారత పర్యటనకు రావడానికి ఒక వారం ముందు, ఒక విమానం నిండా మెరైన్లు, క్లింటన్ ముందస్తు భద్రతా దళ సిబ్బంది ఆ రోజు మధ్యాహ్నం భారత్కు బయలుదేరుతారని క్లింటన్ పాలనా యంత్రాంగంలోనివారు వాషింగ్టన్ లోని భారతీయ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. మెరైన్లు సకాలంలో భారతీయ వీసా తీసుకున్నారా అంటూ రాయబారి కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా ఉన్న టి.పి. శ్రీనివాసన్ మర్యాదపూర్వకంగానే ప్రశ్నించారు. అప్పటికి వారు వీసాల కోసం కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ‘‘అమెరికా మెరైన్లు వీసాలపై ప్రయాణించరు’’ అని ఫోన్ చేసిన వ్యక్తి కసురుకుంటున్న రీతిలోనే చెప్పారు. కానీ, శ్రీనివాసన్ అదరలేదు. ‘‘మెరైన్లకు వీసాలు లేకపోతే వారు భారత్ వెళ్ళడానికి ఉండదు. వారి విమానం న్యూఢిల్లీలో ల్యాండ్ అవడానికి వీలుపడదు’’ అని నిష్కర్షగా చెప్పేశారు. దాంతో అమెరికన్లు దారికి వచ్చి, ప్రయాణ నియమాలను పాటించారు. గోర్ విషయంలో మాదిరిగానే, భారత్ ప్రోటోకాల్ను ఉల్లంఘించిన ఉదంతం మరోటి కూడా గుర్తుకు వస్తోంది. భారత్లో అమెరికా రాయబారిగా నియమితుడైన రిచర్డ్ సెలెస్ట్, 1997 నవంబర్లో న్యూఢిల్లీలో దిగుతూనే, అప్పటి విదేశాంగ కార్యదర్శి కె.రఘునాథ్ ఇచ్చిన ప్రైవేటు విందుకు హాజరయ్యారు. అప్పటి ప్రధాని ఐ.కె. గుజ్రాల్ అంతకు రెండు నెలల ముందు న్యూయార్క్లో క్లింటన్ను కలుసుకుని, ఆయనను భారత పర్యటనకు ఆహ్వానించారు. విదేశాంగ విధానంపై తనదైన ముద్రవేయాలని చూస్తున్న గుజ్రాల్, అప్పటికి 19 ఏళ్ళ విరామం తర్వాత, ఒక అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వస్తే, తన పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయని భావించారు. క్లింటన్ పర్యటనకు వేగంగా మార్గం సుగమం చేయవలసిందిగా సెలెస్ట్ను కోరారు. సెలెస్ట్ ఆ మాటలకు పడిపోలేదు. తన నియామక పత్రాలను రాష్ట్రపతికి సమర్పించి, రాజకీయ వాస్తవ పరిస్థితులను బేరీజు వేశారు. భారత పర్యటనకు అది సరైన సమయం కాదని గుట్టుచప్పుడు కాకుండా క్లింటన్కు సలహా ఇచ్చారు. గుజ్రాల్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదనే నిర్ధా్ధరణకు క్లింటన్ పాలనా యంత్రాంగం వచ్చింది. ఆ తర్వాత, ఐదు నెలలకే గుజ్రాల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఉల్లంఘనకూ ఓ లెక్కుండాలి!భారత్లోగానీ, మరెక్కడైనాగానీ రాయబారులుగా నియమితులైనవారు ప్రభుత్వాధినేతలను కలుసుకోవడం అసాధారణమైన విషయం ఏమీ కాదు. కాకపోతే, ఆ దౌత్యవేత్త నమ్మకస్థుడిగా పేరు తెచ్చుకుని, ఆతిథేయ దేశం గురించి సరైన సలహా ఇవ్వగలిగిన యోగ్యత కలిగినవారై ఉంటారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా గుజ్రాల్ మాదిరిగానే తొందరపడబోయి 1979లో అభాసు పాలయ్యారు. అప్పట్లో ఆయన మరో అగ్ర రాజ్యపు రాయబారిని సమావేశానికి పిలిచారు. కాబూల్పై సోవియట్ దురాక్రమణకు సంబంధించి సోవియట్ రాయబారి యులి వొరొంత్సోవ్కు క్లాసు పీకాలని చరణ్ సింగ్ ఉద్దేశం. తీరా, సోవియట్ రాయబారి మాటలకు చరణ్ సింగ్ ఖంగు తిన్నారు. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ ప్రధాని కాబోతున్న ఇందిరా గాంధీని కలిసి మాట్లాడాననీ, మాస్కో వైఖరిని అర్థం చేసుకున్న రీతిలో ఆమె మాట్లాడారనీ వొరొంత్సోవ్ కుండబద్దలు కొట్టారు. అవతలి పక్షం కూడా న్యాయబద్ధంగా వ్యవహరించగలదనే నమ్మకం ఉంటే, ప్రొటోకాల్ను అప్పుడప్పుడు ఉల్లంఘించినా ఫరవాలేదు. లేకపోతే, అది వికటించే ప్రమాదం ఉందని గ్రహించాలి. కె.పి. నాయర్వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఏఐలో మౌలిక సవాళ్ళు
కృత్రిమ మేధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉద్యోగాల స్వభావంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కృత్రిమ మేధ మానవ మనుగడకు ప్రమాదమని కొంతమంది వాదిస్తున్నప్పటికీ, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన భారత్కు, ఏఐ లాంటి నూతన సాంకేతికత విషయంలో ‘గ్లోబల్ లీడర్’గా స్థానం సంపాదించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జెనరేటివ్ ఏఐ వినియోగించే సంస్థలు 2023లో 33 శాతం కాగా, 2024లో అవి 71 శాతానికి పెరిగాయి. పటిష్ఠమైన వృత్తి నైపుణ్యం కల్గిన శ్రామికులు, సాంకేతికతపై సంస్థల భారీ పెట్టుబడులు, డిజిటల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కారణంగా భారత ఏఐ మార్కెట్ 2027 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ‘బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు’ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఏఐ కారణంగా డేటా ఎన్నొటేషన్, ఏఐ ఇంజినీరింగ్, కస్టమర్ సేవలు, ఎథికల్ ఏఐలో 40 లక్షల మందికి నూతన ఉపాధి లభిస్తుందని ‘నీతి ఆయోగ్’ అభిప్రాయపడింది. ఏఐ విజయంలో స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. ఇంటర్నెట్ లేకుండానే ఏఐ ఎలా?ఏఐ సాంకేతికత కారణంగా భారత్లో ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ సేవలు, విద్య, వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, డేటా భద్రత–ప్రైవసీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత, ఏఐ సొల్యూషన్స్ అమలుపరచడానికి తగిన పెట్టుబడి లేకపోవడం, డేటా నాణ్యత తక్కువగా ఉండటం, ఎథిక్స్ ఏఐ సొల్యూషన్ ప్రొవైడర్స్కు సవాలుగా పరిణమించడం లాంటివి ఏఐ సాంకేతిక వినియోగంలో ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి.జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్ట్గా 9, 10వ తరగతి విద్యార్థులకు 2019–20లో; సెకండరీ విద్య (6, 7 తరగతులు)లో 2022–23 నుండి ప్రవేశపెట్టింది. కానీ ఏఐని ఐచ్ఛిక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో 2021–22 నాటికి 33.9% పాఠశాలలు మాత్రమే ఇంటర్నెట్ లభ్యతను కలిగి ఉన్నాయి; ఆ యా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 50 శాతం కన్నా తక్కువమంది కంప్యూటర్ వినియోగం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఇది పాఠశాలల స్థాయిలో అవస్థాపనా సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతోంది. కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుండే పాఠశాల విద్యా ప్రణాళికలో ఏఐని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ క్రమంలో సీబీఎస్ఈ అన్ని తరగతులలో ఏఐని అనుసంధానపరచడానికి ఒక చట్రాన్ని (ఫ్రేమ్ వర్క్) రూపొందిస్తున్నప్పటికి, కోటిమంది ఉపాధ్యాయులకు ఏఐ–సంబంధిత విద్యలో శిక్షణనివ్వడం క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.రాష్ట్రాల్లో మౌలిక ఇబ్బందులుఏఐ అడాప్షన్లో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2023 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్లో ఏఐని చేర్చాలనీ; ఏఐ, రోబోటిక్స్ను మెడికల్ విద్యలో ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ అధికారులు, వైస్ ఛాన్స్లర్లకు సూచించారు. విద్యార్థులను ‘ఏఐ క్రియేటర్స్’గా రూపొందించాలనే లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, ఇతర రంగాలలో అభివృద్ధి నిమిత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏఐ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ, బోధనా పద్ధతులలో మార్పు నిమిత్తం టెక్ దిగ్గజాలతో కలసి పనిచేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏఐని ప్రోత్సహించడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలలో సమర్థత, సర్వీస్ డెలివరీ పెంపునకు ఆ యా శాఖల్లో ఏఐని అనుసంధానపరచింది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యంపై శిక్షణనివ్వడంతో పాటు, కోటి మంది ప్రజలకు 2027 నాటికి 300కు పైగా, పౌర సేవలను ఏఐ ద్వారా అందించాలనీ, ప్రపంచవ్యాప్తంగా మొదటి 25 ఏఐ ఇన్నోవేషన్ హబ్లలో హైదరాబాద్ స్థానం సాధించాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత లక్ష్యసాధనలో అవరోధంగా నిలిచే ప్రమాదం ఉంది.మరోవైపు కర్ణాటక 28 కోట్ల వ్యయంతో 2029 నాటికి 3,50,000 మందికి ఏఐ ఉపాధి లక్ష్యంగా ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర కూడా యూనివర్సిటీల్లో ఏఐ కేంద్రాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐలో ఉన్నత విద్య సర్టిఫికేషన్కి హరియాణా ప్రాధాన్యమిస్తోంది. బిహార్లో అవస్థాపనా సౌకర్యాల కొరత, పట్టణ – గ్రామీణ, ప్రభుత్వ –ప్రైవేటు రంగంలోని అసమానతల వల్ల కృత్రిమ మేధ ప్రగతి తక్కువగా ఉంది.సమంగా పంపిణీ కాకపోతే...కృత్రిమ మేధ ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కావడం లేదు. ఏఐ సాంకేతికత... ఉపాధి పెంపు, ఆదాయ సమాన పంపిణీ, సంపద కల్పనకు దారి తీయనట్లయితే సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఆదాయ స్థాయి, సామాజిక తరగతులు (సోషల్ క్లాస్) ఏఐ సాంకేతికత అందుబాటును నిర్ణయిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో బ్రాడ్బాండ్ కనెక్టివిటీ తక్కువగా ఉండటం వలన ఏఐ సాంకేతికత అందుబాటు అసమానతలకు కారణమవుతోంది. పైగా పరిమిత విద్యుచ్ఛక్తి లభ్యత ఏఐ సేవల వృద్ధిని ప్రభావితం చేస్తుంది. 2030–35 నాటికి ప్రపంచ విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 20 శాతంగా ఉండి పవర్ గ్రిడ్స్పై అధిక ఒత్తిడికి కలుగ జేస్తాయని అంచనా. భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేయడానికీ, గణనకు అవసరమయిన గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు పని చేయడానికీ, శిక్షణలో భాగంగా ప్రాసెసర్లు పని చేయడానికీ భారీ విద్యుత్ అవసరం. విద్యుత్ లభ్యత పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తక్కువ. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఏఐ అడాప్షన్లో తేడాలు ఎక్కువగా ఉంటాయి. పారిశ్రామికీకరణ, అధిక పట్టణీకరణ అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో విద్యుత్ వినియోగం అధికం కాగా; ఈశాన్య రాష్ట్రాలు, తక్కువ పారిశ్రామికీకరణ చెందిన బిహార్, జార్ఖండ్లో విద్యుత్ వినియోగం తక్కువ. డిజిటల్ లిటరసీ గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కాగా, పట్టణ ప్రాంతాలలో 61 శాతం. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లను సొంతంగా కలిగి ఉండటం కూడా ఏఐ సాంకేతికత వినియోగానికి తప్పనిసరి.కృత్రిమ మేధ వ్యాప్తి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ అసమానతలను తొలగించి సమానత్వ సాధనకు దోహదపడగలదు. అందుకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ నైపుణ్యం కల్గిన శ్రామిక శక్తిపై పెట్టుబడులు పెంచాలి. ఏఐ సాంకేతికతను మానవ శ్రేయస్సు పెంపొందించుకొనే విధంగా రూపొందించుకోవాలి. దానికోసం సమాజంలో విస్మరణకు గురైన వర్గాల ప్రజలకు ‘రీ–ట్రైనింగ్’ అందించే సామాజిక భద్రతా పథకాలు అవసరం. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇంచార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
నాడు అంబేడ్కర్.. నేడు జస్టిస్ గవాయ్..
దేశంలో మనువాదం తన ప్రభావాన్ని ఏమాత్రం కోల్పోలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన బూటు దాడి ప్రయత్నం మరోసారి నిరూపించింది. అలాగే గవాయ్ తల్లిని ఈ దాడికి ముందే ట్రోల్ (Troll) చేయడం చూస్తే... అణగారిన వర్గాల వారు స్వేచ్ఛగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సనాతనవాదులు ఇబ్బంది పెడతారని స్పష్టమవుతోంది. జస్టిస్ గవాయ్ కుటుంబంపై జరిగిన వివక్షా పూరిత భౌతిక, మానసిక దాడులను ఈ కోణంలోనే చూడాలి.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు (ఆర్ఎస్ఎస్) వందేళ్లు నిండిన సందర్భంగా మహారాష్ట్రలోని అమరావతిలో నిర్వహించనున్న సభకు జస్టిస్ గవాయ్ తల్లి ‘కళామతి థాయి’ని ప్రధాన వక్తగా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రంలో ఆమె పేరు కూడా వేశారు. అయితే ఆమె అనుమతితోనే ఆమె పేరును ఆహ్వాన పత్రంలో వేశారో లేదో గానీ... విషయం తెలుసుకున్న ఆమె సదరు సభకు తాను రాలేను అని నిర్వాహకులకు ఉత్తరం రాశారు. తన కుటుంబం దశాబ్దాలుగా అంబేడ్కర్ ఆలోచనల భావజాలంతో పనిచేస్తున్నదని అంటూ... తన భావజాలానికి భిన్నమైన వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె స్వాభిమాన ప్రకటన చేశారు. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. బీఆర్ గవాయ్ తండ్రి రామకృష్ణ సూర్యభన్ గవాయ్ (ramakrishna suryabhan gavai) అంబేడ్కర్ స్థాపించిన ‘రిపబ్లికన్ పార్టీ’ వ్యవస్థాపక సభ్యులు. ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మారక సమితి’ నాగపూర్ ప్రెసిడెంట్గా పని చేశారు. అంబేడ్కర్ తన చివరి రోజుల్లో వేలాదిమందితో కలిసి నాగపూర్లో ‘దమ్మ దీక్ష’ తీసుకున్నప్పుడు ఆయనతో పాటు బౌద్ధాన్ని స్వీకరించిన పాతికేళ్ల యువకుడు.ఇటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న కళామతి థాయి తిరస్కారాన్ని నిర్వాహకులు అవమానంగా భావించి సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో తన కొడుకు అయిన చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మీద దాడి ప్రయత్నం జరిగింది. అంత ఉన్నత పదవిలో ఉన్నా ఆయనపై పాదరక్షతో ఎందుకు దాడి ప్రయత్నం జరిగినట్లు? ప్రసిద్ద ఖజురహో పర్యాటక ప్రాంతంలో ‘10–12 శతాబ్దాల కాలానికి చెందిన ప్రాచీన విష్ణుమూర్తి విగ్రహానికి మరమ్మతులు జరిపించేలా కోర్టు ఆర్డర్ ఇవ్వాలి’ అని ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. సదరు విగ్రహం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉండటం మూలంగా దాని మీద కోర్టుల జోక్యం కుదరదని చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నారు. సదరు పిటిషన్ వేసిన న్యాయవాదికి ఆ విషయం తెలియంది కాదు. వాస్తవానికి అది కోర్టు పరిధిలో లేని అంశం. తెలిసి కూడా పదే పదే వాదన చేస్తున్న అతణ్ణి ఉద్దేశించి ‘వెళ్ళి ఆ దేవుడినే పార్థించండి’ అన్నారు. ఆ ఘటన తర్వాత ఆ మాటను అవమానంగా భావించిన మరో వకీలు రాకేశ్ కిశోర్ (Rakesh Kishore) చీఫ్ జస్టిస్ మీద దాడి చేశాడు.చదవండి: సంచలనం రేపిన లొంగుబాటు!ఆర్ఎస్ఎస్ ఉత్సవాలకు చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లిని వక్తగా పిలిచినట్టే... సరిగ్గా ఎనభై తొమ్మిదేళ్ల కింద ‘జాత్ పాక్ తోడక్ మండల్’ అనే సంఘం తమ వార్షిక ఉత్సవానికి అంబేడ్కర్ను (Ambedkar) ముఖ్యవక్తగా లాహోర్ ఆహ్వానించారు. కుల అసమానతలు తొలగించే లక్ష్యంతో ఏర్పాటు అయిన ఆ సంఘ బాధ్యులు మీటింగ్ జరగడానికి ముందే బాబా సాహెబ్ను తన ప్రసంగ పాఠాన్ని పంపించాల్సిందిగా కోరారు. ఆ ప్రసంగ పాఠాన్ని ముందే చదివిన నిర్వాహకులు అందులో ఉన్న అంశాల పట్ల అంగీకారం లేదని మీటింగ్నే రద్దు చేసుకున్నారు. ఆనాడు అంబేడ్కర్ కుల నిర్మూలన పట్ల తనకు ఉన్న మేధను జోడించి రాసుకున్న ఆ ప్రసంగ పాఠమే ‘కుల నిర్మూలన’. ఆనాడు అంబేడ్కర్కు జరిగిన అవమానం, నేడు గవాయ్ కుటుంబానికి జరిగిన అవమానం రెండింటికీ ప్రాచీన కాలం నుంచి నేటికీ కొనసాగుతున్న వివక్ష జాడ్యమే కారణం.- డాక్టర్ గుర్రం సీతారాములు ఇండిపెండెంట్ రిసెర్చర్ -
చైనా డ్యామ్తో మహా విపత్తు
ప్రపంచ జల సంతులనాన్ని తలకిందులు చేసే పనికి చైనా ఒడిగడుతోంది. దాని పర్యవసానాలు వాతావరణ మార్పు అంశమంతటి తీవ్ర ప్రభావం చూపబోతు న్నాయి. చైనా 168 బిలియన్ డాలర్లతో హిమాలయ సూపర్–డ్యామ్ నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టు మాత్రమే కాక, అంతర్జాతీయంగా అత్యంత ముప్పుతో కూడుకున్నది కావడం వల్ల భయాలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణిస్తోంది కానీ, నిజానికి దాన్ని ముంచుకొస్తున్న జీవావరణ మహా విపత్తుగా పేర్కొనాలి. యాలంగ్ జింగ్పొ నది మలుపు తిరిగి భారతదేశంలోకి ప్రవే శిస్తున్న చోటుకు కొద్ది వెనుకగా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నారు. దీన్ని మనం బ్రహ్మపుత్ర నదిగా పిలుచుకుంటాం. చైనా ప్రధాని లీ చాంగ్ గత జూలైలో ఈ ఆనకట్టకు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు గురించి అధి కారికంగా ప్రకటించారు. కానీ, ఆనకట్ట నిర్మాణ పనులు కొంతకాలంగా సాగుతున్నాయని ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. రహస్య నిర్మాణంచైనా నాయకుడు ఒకరు ఒక ఆనకట్టకు శంకుస్థాపన చేయడం చివరిసారిగా 1994లో జరిగింది. యాంగ్ చి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్కు అప్పటి ప్రధాని లి పెంగ్ శంకుస్థాపన చేశారు. దాని కన్నా కూడా బ్రహ్మపుత్ర మెగా డ్యామ్ పరిమాణంలో చాలా పెద్దది. ఈ ప్రతీకాత్మకత మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న చైనా ఆశ లతోపాటు, పెద్ద గండాన్ని సూచిస్తోంది. త్రీ గార్జెస్ డ్యామ్ను మొదట్లో ఆధునిక వింతగా కీర్తించారు. ఇపుడు దాన్ని పర్యావరణ, సామాజికపరమైన వైపరీత్యంగా గుర్తిస్తు న్నారు. దానివల్ల పది లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఈ డ్యామ్ తరచూ కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతోంది. భూగోళ కంపన సుస్థిరత దెబ్బతింది. దాని బ్రహ్మాండ జలాశయం చివరకు భూ భ్రమణాన్ని కూడా కొద్దిగా మందగింప జేసింది. చైనా చేపట్టిన నూతన ప్రాజెక్టు స్థితిగతులు మరింత ప్రమాద కరంగా ఉన్నాయి. ప్రపంచంలో భూకంపాలకు ఎక్కువ అవకా శాలున్న ప్రాంతాల్లోని ఒకదానిలో దాన్ని నిర్మిస్తున్నారు. సైనిక దళాలు పెద్ద యెత్తున మోహరించి ఉండే∙సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో అది ఉంది. భారతదేశపు విశాలమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా ‘దక్షిణ టిబెట్’గా పరిగణిస్తోంది. నిర్మాణంలో బల హీనత వల్లగానీ లేదా జలాశయం పురికొల్పగల భూగర్భ ఫలకాల చలనం వల్లగానీ డ్యామ్ కుప్పకూలితే, భారతదేశపు ఈశాన్య ప్రాంతం, బంగ్లాదేశ్ మహా విధ్వంసాన్ని చవిచూడవలసి రావచ్చు. త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా దాదాపు మూడింతల ఎక్కువ విద్యుదుత్పాదనకు వీలుగా రూపకల్పన చేసిన ఈ డ్యామ్కు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2021లో ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ నదుల పొడవునా పెద్ద పెద్ద ప్రాజెక్టులను రహస్యంగా నిర్మిస్తూ పోవడం చైనాకు రివాజుగా మారింది. జలం ఆధిపత్య సాధనంబ్రహ్మపుత్ర, మిగిలిన నదుల లాంటిది కాదు. హిమాలయ ఉత్తుంగ శిఖరాల నుంచి కిందకు దూకుతూ ప్రపంచంలోని అత్యంత నిటారైన, లోతైన లోయను సృష్టిస్తోంది. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ కన్నా ఇది రెండింతల లోతైనది. సాటిలేని నదీమ శక్తి కేంద్రీకృతమవుతున్న చోట డ్యామ్ను చైనా నిర్మిస్తోంది. టిబెట్లోని పర్వతాలపైన నీటి బుగ్గల నుంచి పుడుతున్న బ్రహ్మపుత్ర, ప్రపంచంలోని ఎత్తయిన ప్రాంతాల నుంచి ప్రవహించే ప్రధాన నదులలో ఒకటి. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే ఈ నది వ్యవసాయానికి, మత్స్యసంపదకు ఆలంబనగా ఉంటూ, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మనుగడ కల్పిస్తోంది. బ్రహ్మపుత్రకు ఏటా వచ్చే వరదలు విధ్వంసకరమైనవే అయి నప్పటికీ, అవి విష పదార్థాలను తోసుకుపోతాయి. భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి. సేద్యానికి ఎంతో ముఖ్యమైన పోషక విలువ లున్న అవక్షేపాలను పొలాలకు చేకూర్చుతాయి. కానీ సూపర్– డ్యామ్ ఈ గతిని తలకిందులు చేస్తుంది. ఒండ్రుమట్టికి అడ్డుకట్ట వేస్తుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలతో ఇప్పటికే సంకటంలోనున్న బంగ్లాదేశ్ డెల్టా కుంచించుకుపోతుంది. భారతీయ రైతులను సహజ ఫలదీకరణ ఆవృత్తాలకు దూరం చేస్తుంది. ఉప్పు నీరు చేరిపోవడం, వరదలు మరింత పరిపాటిగా మారతాయి. వచ్చిన చిక్కేమిటంటే, నీటిని వనరుగాకాక, ఒక శక్తి సము పార్జన సాధనంగా చైనా చూస్తోంది. నది టిబెట్ను విడిచిపెట్టే చోట మెగా–డ్యామ్ నిర్మించడం ద్వారా, దిగువ ప్రవాహ ప్రాంతాలలో నివసించే కోట్లమందికి ఇష్టముంటే నీరు ఇవ్వగలగాలని, లేకపోతే నీటిబొట్టు కూడా అందకుండా చేయగలగాలని చూస్తోంది. ఒకప్పుడు చమురుపై ఆధిపత్యం ప్రపంచ శక్తిని నిర్ణయించేది. ఈ 21వ శతాబ్దంలో, సరిహద్దులను దాటి ప్రవహించే నదులపై నియంత్రణ అంతే నిర్ణాయక శక్తిగా పరిణమించవచ్చు. ఈ డ్యామ్ ద్వారా చైనా, ఒక్క తూటా కూడా పేల్చనవసరం లేకుండా, నీటిని ఆయుధంగా మలచుకోగలుగుతుంది. ‘చమురు ఉత్పాదన, ఎగు మతి దేశాల కూటమి’ (ఒపెక్) చమురుపై ఒకప్పుడు ఎలాంటి వ్యూహాత్మక పట్టును అనుభవించిందో, నీటిపై అదే రకమైన శక్తిని చైనాకు ఈ డ్యామ్ కట్టబెట్టవచ్చు. ప్రమాదంలో జల భద్రతనిజానికి, ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ కలిపి నిర్మించిన డ్యామ్లకన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద డ్యామ్లను చైనా నిర్మించింది. అదే ఊపులో, అది 1990ల నుంచి అంతర్జాతీయ నదు లపై దృష్టి పెట్టింది. మికాంగ్ నదిపై అది కట్టిన 11 పెద్ద డ్యామ్లు దిగువ ప్రవాహ ప్రాంతాలను ఇప్పటికే అతలాకుతలం చేస్తున్నాయి. దుర్భిక్షాలు తీవ్రమవుతున్నాయి. థాయిలాండ్, లావోస్, కంబో డియా, వియత్నావ్ులలో జీవనోపాధులకు ఎసరు పెడుతున్నాయి. ఏ రూపంలో నీటి పంపకానికైనా ససేమిరా అనడాన్ని బీజింగ్ కొనసాగిస్తోంది. పొరుగునున్న దేశాలతో నీటి పంపక ఒప్పందాలు వేటిపైనా అది సంతకం చేయలేదు. ఐక్యరాజ్య సమితి 1997లో చేసిన జలవనరుల ఒడంబడికలోనూ అది చేరలేదు. తన సరి హద్దుల లోపలనున్న జలాలన్నింటిపైన ‘నిర్ద్వంద్వ సార్వభౌమాధి కారం’ చాటుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆసియాను మించి ప్రయోజనాలు ఇక్కడ పణంగా ఉన్నాయి. అంతర్జాతీయ సగటుకన్నా వేగంగా టిబెట్ వేడెక్కుతోంది. పీఠ భూమి హైడ్రాలజీని తారుమారు చేయడం ప్రాంతీయ జూదం మాత్రమే కాక, మొత్తం భూగోళానికి ముప్పు తేవడమే అవుతుంది. టిబెట్ నుంచి నదీ ప్రవాహాల గతులు మారుతున్న ప్రభావ ప్రకంప నాలు, ఆసియాను దాటి, బాహ్య వాతావరణ వ్యవస్థలు, ఆహార భద్రత, వలసల తీరుతెన్నులపైన కూడా కనిపిస్తాయి. దేశ సరిహద్దులను దాటి వెళ్ళే నదులపై ఏకఛత్రాధిపత్యం వహించడంలో బీజింగ్ సఫలమైతే, ఇతర దేశాలు కూడా అదే బాట పట్టవచ్చు. అది ఇతరత్రా బలహీనంగా ఉన్న సహకార నియమ నిబంధనలను నీరుగార్చవచ్చు. నైలు నదీ పరీవాహక ప్రాంతం నుంచి టైగ్రిస్–యూఫ్రటీస్ వరకు అదే పరిస్థితి నెలకొంటుంది. ఆ విధంగా, మెగా–డ్యామ్ ఒక్క ఆసియా సమస్య మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానిది. అందుకే అంతర్జాతీయ జల నిబంధనలను గౌరవించేట్లుగా అంతర్జాతీయ సమాజం చైనాపై ఒత్తిడి తేవాలి. బ్రహ్మచేలానీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’లో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్(‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ సౌజన్యంతో) -
సిద్ధరామయ్య (కర్ణాటక సీఎం) రాయని డైరీ
మనం ఏదైనా ఒకటి బలంగా అనుకున్నప్పుడు, దానిని నెరవేర్చటానికి పంచభూతాలన్నీ కలసికట్టుగా ఒక్కటై మనకు సహాయం చేస్తాయని అంటారు! ఈ మాట హైందవ పురాణ ప్రబోధమా, పవిత్ర ఖురాన్ సందేశమా, లేక పరిశుద్ధ గ్రంథ వచనమా అన్నది నాకు తెలియదు కానీ... మత విశ్వాసాలను గౌరవించటానికి ఆస్తికులు కానవసరం లేదు కనుక నేను ఈ మాటను గట్టిగా నమ్ముతాను. నాకు ఇంకొక మాట మీద కూడా గొప్ప నమ్మకం ఉంది. పదవి కోసం కాచుకొని కూర్చుండే మనుషులు ఆ పదవిలో ఉన్నవారిని తప్పించాలని బలంగా సంకల్పించినప్పుడు ఆ మహత్కార్యాన్ని పూర్తి చెయ్యటానికి గొలుసుకట్టుగా అంతా ఒక్కటవుతారని!సీఎంగా నిన్న మొన్న నేను చేసిన ప్రమాణ స్వీకారానికి అప్పుడే రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నాయి. ‘రొటేషనల్ ఫార్ములా’ ప్రకారం మిగతా రెండున్నరేళ్ల ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని పార్టీలో కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది.అసలు రాజ్యాంగంలోనే రొటేషన్ అన్నది లేనప్పుడు ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది?! శనివారం రాత్రి, అత్యవసరంగా డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మినిస్టర్లందర్నీ పిలిపించాను. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక్కరే రాలేదు. ‘‘డీకే డిన్నర్కి ఎందుకు రాలేదో కనుక్కోండి పరమేశ్వర గారూ’’ అన్నాను. ఆయన స్పందించలేదు. పరమేశ్వర హోమ్ మినిస్టర్. శివకుమార్ లాగే ఆయన కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. శివకుమార్కి ఫోన్ చేసే ఉద్దేశాన్ని పరమేశ్వర కనబరచకపోవడంతో నేనే శివకుమార్కి ఫోన్ చేసి, ‘‘ఎక్కడున్నారు డీకే? మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం. మీరొస్తే డిన్నర్ స్టార్ట్ చేద్దాం’’ అన్నాను. ‘‘రాత్రి పూట భోజనం మానేసి రెండున్నరేళ్లు అవుతోంది సిద్ధరామయ్య గారూ! మీరంతా ఉన్నారు కదా, కానిచ్చేయండి’’ అన్నారు శివకుమార్. పెద్దగా నవ్వాన్నేను. ఆయనా నవ్వారు తప్పితే వస్తున్నానని మాత్రం అనలేదు. మెల్లిగా భోజనాలు మొదలయ్యాయి. ‘‘చెప్పండి మిత్రులారా... పార్టీలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?’’ అని నేనూ మొదలు పెట్టాను. ‘‘నవంబర్ 20 తర్వాత సీఎంగా మీ ప్లేస్లోకి శివకుమార్ వస్తారని వినిపిస్తోంది సీఎం గారూ’’ అన్నారు ఎమ్మెల్సీ బోసురాజు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఆయన. ‘‘ఇంకా...!’’ అన్నాను. ‘‘మనలోనే కొందరు శివకుమార్తో టచ్లో ఉన్నట్లు వినిపిస్తోంది సీఎం గారూ’’ అని ఎనర్జీ మినిస్టర్ జోసెఫ్ జార్జి అన్నారు. ‘‘శివకుమార్తో టచ్లో ఉంటున్న ఆ కొందరు ఇప్పుడీ డిన్నర్ మీటింగ్లో ఉండి వుండవచ్చా జోసెఫ్ జార్జ్?’’ అని అడిగాను. డైనింగ్ హాల్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. హోమ్ మినిస్టర్ పరమేశ్వర అయితే మొదటి నుంచీ సైలెంట్ గానే ఉన్నారు.‘‘ఈ భోజన సమావేశంలో, ఆ కొందరు ఉన్నారో లేదో చెప్పలేను కానీ... ‘ప్రభు రాత్రి భోజనం’ గురించి మాత్రం చెప్పగలను సీఎం గారూ’’ అన్నారు జోసెఫ్ జార్జి.‘‘చెప్పండి’’ అనలేదు నేను. శిష్యులలో ఒకరు క్రీస్తును పట్టించిన ‘ద లాస్ట్ సప్పర్’ గురించి ఆయన చెప్పబో తున్నట్లు నాకు అర్థమైంది. భోజన సమావేశం ముగిసి అందరూ వెళ్లిపోతున్నప్పుడు పరమేశ్వరను ఆపాను. ‘‘డీకేకి మీరు ఫోన్ చేయకపోతే పోయారు. కలిసినప్పుడు మాత్రం ఆయనకో మాట చెప్పండి. ఇంకో రెండున్నరేళ్లు ఆయన తన రాత్రి భోజనాన్ని మానేయవలసి ఉంటుందని చెప్పండి’’ అన్నాను. ఆ మాట డీకేకి, పరమేశ్వరకి కూడా! -
రాజ్యాంగం వెర్సస్ రైఫిల్
మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడా సానుభూతి ఉంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరు నవ్వినా మరొకరు ఏడ్చినా జరగాల్సిందే జరుగుతోంది! మావోయిస్టు గెరిల్లాలు 70 మంది తుపాకులు తెచ్చి ముఖ్యమంత్రికి స్వాధీనం చేసి వారి చేతుల మీదుగా రాజ్యాంగ ప్రతుల్ని అందు కున్నారు. ఇదొక పారడాక్సీ వేడుక. రాజ్యాంగం వెర్సస్ రైఫిల్! ఆ వెంటనే ఛత్తీస్గఢ్లో ఆశన్న బృందం లొంగుబాటు. ఇలాంటి వేడుకలు సమీప భవిష్యత్తులో ధారావాహికంగా మరికొన్ని జరగవచ్చు. చాలామంది మరచిపోయినట్టున్నారుగానీ, దేశంలో రక్తపాత విప్లవాన్ని నివారించడానికే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. నిజాం సంస్థానంలోని తెలంగాణలో 1946 జూలై 4న రైతాంగ సాయుధ పోరాటం ఆరంభం అయింది. ఆ ఏడాది డిసెంబరు 9న భారత రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగింది. నాలుగు రోజుల తరువాత డిసెంబరు 13న జవహర్లాల్ నెహ్రూ లక్ష్య ప్రకటన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.రక్తపాత విప్లవ నివారణకే... రాజ్యాంగంలో పొందుపరచిన ప్రతి ఆదర్శం వెనుక రక్తపాత విప్ల వాన్ని నివారించాలనే లక్ష్యం ఉంది. అంబేడ్కర్ ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని సాధించకపోతే బాధితులు తిరగబడి ప్రజాస్వామిక భవనాన్ని పేల్చి పడేస్తారు అని రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో హెచ్చరించారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ ప్రకటనగా రూపొంద డానికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఒక కారణం అంటే అతిశయోక్తి కాదు. నక్సలైట్ పోరాటాల వ్యాప్తిని నిరోధించడానికే భూపరిమితి, అటవీ భూములు, ఆదివాసుల హక్కుల రక్షణ వగైరా చట్టాలు రూపొందాయి. రాజ్యాంగ తొలి ఆదర్శాలైన సమానత్వం సోదర భావాలకు మరింత స్పష్టతను చేకూర్చడానికి రాజ్యాంగ పీఠికలో మతసామరస్యం, సామ్య వాదం ఆదర్శాలు చేరింది కూడా నక్సలైట్ల భయంతోనే! అందుచేత నక్స లైట్ల పోరాటాలు, ప్రాణ త్యాగాలు వృథా ప్రయాసలు అనడానికి వీల్లేదు.రెండు అధ్యాయాలువందేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను మన ఆసక్తి మేరకు వంద సంకలనాలుగా రాయవచ్చు. రెండు అధ్యాయాల్లో రాయాలంటే మాత్రం దానికో ప్రమాణం ఉంది. అది: 1990లకు ముందు, 1990ల తరువాత. పెట్టుబడిదారీ సమాజం రెండు పనులు చేస్తుంది; యంత్రాల వినియో గాన్ని పెంచి సంపదని విపరీతంగా సృష్టిస్తుంది; అదే సందర్భంలో సృష్టి కర్తలకు యజమానులకు మధ్య శత్రుత్వం కూడా విపరీతంగా పెంచుతుంది. ఈ రెండు ధోరణులు సమాజాన్ని అనివార్యంగా సామ్యవాదం వైపునకు నడిపి స్తాయనేది మార్క్సిస్టు మూల సిద్ధాంతం. వైచిత్రి ఏమంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రామికులు, యజమానుల మధ్య శత్రుత్వాన్ని పెంచకుండానూ బతకలేదు; పెంచినా బతకలేదు. తెలివిగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడా నికి అది నిరంతరం సృజనాత్మకంగా జీవన్మరణ పోరాటాన్ని సాగిస్తుంటుంది. అయితే, అంతర్గత బలహీనతలు, లోపాలు, శాపాలు కమ్యూనిస్టులకు బోలెడు ఉన్నాయి. 1990లకు కొంచెం అటూ ఇటుగా తూర్పు యూరప్లోని సోషలిస్టు దేశాలు పతనమయ్యాయి. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైంది. చైనా లోనూ సోషలిస్టు ధోరణులు తగ్గి పెట్టుబడిదారీ ధోరణులు పెరిగాయి. ఫలితంగా, కమ్యూనిజానికి ఆమోదాంశమే ఇరుకున పడిపోయింది.‘పెట్టుబడిదారులారా... ఏకం కండి!’సరిగ్గా ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న ప్రపంచ పెట్టుబడి దారులు ఏకం అయ్యారు. అప్పటికే క్లౌస్ మార్టిన్ స్క్వాబ్ వంటివారు ప్రపంచ ఆర్థిక వేదికను నడుపుతున్నాడు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ‘నిర్మాణాత్మక సర్దుబాట్లు’ సిద్ధాంతాన్ని రూపొందించాయి. మరోవైపు, ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ విధానం వచ్చింది. ఇదే అదనుగా, గ్యాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ సూదర్ల్యాండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్మాణానికి నడుం బిగించాడు. చాలాకాలం ముందే ఆస్ట్రియా రాజకీయార్థికవేత్త జోసెఫ్ షుంపీటర్ ‘సృజనాత్మక విధ్వంసం’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. జోయెల్ మోక్యర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్ త్రయం దీనికో రోడ్ మ్యాప్ గీసిపెట్టారు. 2025 నోబెల్ బహుమానం ఇచ్చింది ఈ ముగ్గురికే! వీళ్ళందరూ తెలివైనవాళ్ళు. ఎక్కడా సామ్యవాదానికి వ్యతిరేకులం అని చెప్పరు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగానూ మాట్లాడరు. మార్కెట్ ప్రజాస్వామ్యం, పర్యావరణ రక్షణ వంటి అందమైన పదాల్ని వాడుతుంటారు. మార్క్సిస్టులు సామాజిక పరిణామాలకు కొలబద్దగా భావించే ఉత్పత్తి విధానాన్ని వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలకే అర్థం కాని ఒక మార్మిక వ్యవహారంగా మార్చేశారు. ఒకరోజు మార్కెట్లో వెలిగిన బ్రాండు మరు నాడు కనిపించదు. ఒకదాన్ని అర్థం చేసుకునేలోపునే దాన్ని తీసివేసి దాని స్థానంలో మరోదాన్ని ప్రవేశ పెడుతుంటారు. దీనికి వాళ్ళు పెట్టిన అంద మైన పేరు ‘సృజనాత్మక విధ్వంసం’! దీనికి తోడు అనేక దేశాల్లో మతతత్త్వాలను రెచ్చగొట్టడం మొద లెట్టారు. దీనితో రాజకీయ లబ్ధిని సులువుగా పొందడమేగాక కొత్త తరాలు సామ్యవాదం వైపునకు మరలకుండా అడ్డుకోవడమూ సాధ్యం అవుతుంది. దీనికి సమాంతరంగా సామాజిక ఉనికివాద ఉద్యమాలు తలెత్తి సన్నివేశాన్ని ఇంకా సంక్లిష్టంగా మార్చాయి. ఇంత జరిగిపోతున్నా సైద్ధాంతిక రంగంలో పెట్టుబడిదారీ వ్యూహకర్తల్ని ఢీకొనే ఆలోచనాపరుల్ని కమ్యూనిస్టు పార్టీలు సృష్టించుకోలేకపోయాయి. దానికి ప్రధాన కారణం కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న ఏకేశ్వరోపాసన! పార్లమెంటరీ పంథా ప్రత్యామ్నాయమేనా?ప్రపంచ పెట్టుబడిదారులు ఇంతగా విజృంభిస్తున్న సమయంలో, ఇండి యాలో ప్రధాన నక్సలైట్ పార్టీగా భావించే పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వ పోరులో నిండా మునిగి వుంది. ముందు కేజీ సత్యమూర్తిని తరిమేశారు. అవే పద్ధతుల్లో కొండపల్లి సీతారామయ్యను బయటికి పంపించారు. నిజా నికి కొండపల్లి, సత్యమూర్తి కలిసి కొనసాగినా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో అనూహ్య మార్పులు ఏమీ వచ్చేవి కావు. వాళ్ళు చేయగలిగింది చేసేశారు. చరిత్రలో వాళ్ళ పాత్రలు అక్కడికే పరిమితం. ఆ తరువాత విప్లవ పార్టీలకు నాయకత్వం వహించినవాళ్ళు ఆపాటి సమర్థులు కూడా కాదు. పెట్టుబడిదారీ సమాజంలో అతి వేగంగా జరిగిపోతున్న పరిణామాలను అర్థం చేసుకుని విరుగుడు కనిపెట్టే శక్తి వాళ్ళకు లేకపోయింది. బ్రిటిష్ కాలంలో 303 రైఫిల్ గొప్పది. ఓ నలభై ఏళ్ళ క్రితం ఏకే 47 గొప్పది. ఇప్పుడు మానవ రహిత డ్రోన్లు, యుద్ధ విమానాలు వచ్చేశాయి. పాత అవగాహనలతో, పాత ఆయుధాలతో కొత్త శక్తుల్ని ఎదుర్కోవడానికి సిద్ధమైతే అది దుస్సాహసం అవుతుంది! ఏ ఉద్యమంలో అయినా విధిగా మూడు తరాలుండాలి. యువతరం, మధ్యతరం, అనుభవతరం. అనుభవతరం బండిని లాగుతుండాలి. యువ తరం బండిని గెంటుతుండాలి. కొత్త తరాల్ని ఆకర్షించలేకపోతే విప్లవ పార్టీలు వృద్ధాశ్రమాలుగా మారిపోతాయి. ఆయుధాలను ఉపయోగించడం అటుంచి వాటిని మోయడం కూడా సాధ్యం కాదు. ఒక వ్యూహం ప్రకారం ఉద్యమాల్లోనికి యువతరం రిక్రూట్మెంటును ఆపగలిగినవాళ్ళు... కల్లోల ప్రాంతాల్లో ప్రాణరక్షణ మందుల సరఫరానూ ఆపేశారు. వృద్ధాప్యంలో వచ్చే జీవనశైలి వ్యాధులకు అడవిలో మందులు అందకపోతే అల్లకల్లోలం జరిగిపోతుంది. గ్లూకోజ్ స్థాయిలు పెరిగి రెటీనో పతితో అంధులైన నాయకులు దారి కనిపించక పోలీసులకు దొరికిపోతున్న బాధాకరమైన కేసులు ఇటీవలి కాలంలో అనేకం ఉన్నాయి. అణగారిన సమూహాల సహజమైన ఆప్షన్ సమసమాజమే. ఆ లక్ష్య సాధన కోసం పుట్టిన పార్టీలు బలహీనంగా ఉన్నప్పుడే మరోవైపు చూడాల్సి వస్తుంది. సాయుధ పోరాటానికి ప్రత్యామ్నాయం రాజ్యాంగం అనడం కూడా ఇప్పుడు సమంజసం కాకపోవచ్చు. పాలకులు మంచోళ్ళయితే చెడ్డ రాజ్యాంగం కూడా ప్రజలకు మంచిదయిపోతుంది; పాలకులు చెడ్డోళ్ళయితే మంచి రాజ్యాంగం కూడా ప్రజలకు చెడ్డదయిపోతుందని అంబేడ్కర్ చెప్పి ఉన్నారు. ఇప్పుడు సమస్య రాజ్యాంగం మంచిదా, కాదా అన్నది కాదు; పాలకుల స్వభావం ఏమిటీ అన్నదే అసలు సమస్య! మన రాజ్యాంగానికి ప్రాణం ప్రజాస్వామిక ఎన్నికలతో కూడుకున్న పార్లమెంటరీ వ్యవస్థ. ఈ రెండింటినీ, కార్పొరేట్ మతతత్వ నియంతృత్వం భ్రష్టు పట్టించింది. ఆయుధాలు అప్పగించిన మావోయిస్టులు పార్లమెంటరీ పంథా చేపడతారా? అక్కడ మార్పులు తేగలుగుతారా? దానికి సమాధానం కోసం మరికొంతకాలం వేచిచూడాలి.డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
బిహార్లో ప్రజాస్వామ్యం గెలిచేనా?
దేశంలో అన్ని ఎన్నికలనూ కురుక్షేత్ర సంగ్రామంగా మార్చడం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. అక్టోబర్ 6న ఎన్నికల నగారా మోగిన బిహార్లో మొదలైన ఎన్నికలసందడి అనేక ప్రత్యేకతలు కలిగిన దృష్ట్యా దేశ ప్రజల దృష్టి అటువైపు కేంద్రీకృతమైంది. 243 స్థానాలున్న బిహార్లోపోలింగ్ రెండు విడతలలో నవంబర్ 6, 11 తేదీలలో జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడుతాయి. ‘యువ బిహార్’ సాధ్యమా?ఉత్తరాది రాష్ట్రాలలో, ప్రత్యేకించి బిహార్లో అభ్యర్థులు ఎన్ని కలకు ముందు ఆ యా పార్టీలు మారటమే కాకుండా... కూట ముల్లోని పార్టీలు అటు ఇటు పిల్లిమొగ్గలు వేస్తుంటాయి. ప్రధాన కూటములుగా ఎన్డీయే, ఇండియా బ్లాక్ (మహా ఘట్బంధన్)లు రెండే ఉన్నాయి. ఎన్డీయేలో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ (యు), భారతీయ జనతా పార్టీ, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి (ఎల్జేపీ) ఉన్నాయి. కొత్తగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేసిన ‘జన్ సురాజ్’ పార్టీ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇక, ముస్లివ్ు ఓట్లను గంపగుత్తగా వేయించు కోగలననే ధీమాతో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. స్వర్గీయ రావ్ువిలాస్ పాశ్వాన్ తనయుడైన ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ‘అబ్ కీ బార్ యువ బిహార్’ అనే నినాదంతో బిహార్ యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే ఎన్డీయే కూటమికి ఇబ్బందికరమే! అందుకే ఎన్డీయే నుంచి చిరాగ్ పాశ్వాన్ బయటకు పోకుండా ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ను ప్రకటించకుండా బీజేపీ వ్యూహాత్మకంగా ఆయనకు చెక్ పెట్టింది. ‘యువ బిహార్’ కావాలంటే యువకుడైన ముఖ్యమంత్రి ఉండాలన్న సెంటిమెంట్ను ప్రశాంత్ కిశోర్ తేవడంతో... ఈసారి ఎన్డీఏ గెలిచినా, 75 సంవ త్సరాల వయస్సులో ఉన్న నితీష్ కుమార్ను మరోమారు ముఖ్య మంత్రిగా ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవచ్చు.ఓట్ల తొలగింపు రగడనిజానికి బిహార్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను మోదీ వర్సెస్ రాహుల్గాంధీల నడుమ సాగే పోరుగానే చూడాలి. గత ఏడాది రాహుల్ బిహార్లో చోటు చేసుకొన్న ఓటర్ల జాబితా సవరణలపై దృష్టి పెట్టారు. బిహార్లో చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించి కేంద్ర ఎన్నికల సంఘం పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ‘సర్’ ద్వారా ఓట్లను తొలగించడంతోకాంగ్రెస్ దానిపై పెద్దఎత్తున ఉద్యమించింది. స్వతంత్రంగా నడుచుకోవాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఓట్లను తొలగించిందని ‘ఓట్ చోరీ’ అంటూ ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకొంది. చివరకు ఓటర్ల తొల గింపు అంశం సుప్రీంకోర్టుకు చేరింది.భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేయడానికి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. రెండు విడతలుగా భారత్ జోడో యాత్రలు ఇందులో భాగంగానే చూడాలి. దేశంలో సమగ్రంగా, శాస్త్రీయంగా కులగణన చేయాలనీ కాంగ్రెస్ కోరుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అక్కడ స్వయంగా కులగణన చేసింది. దానిని తెలంగాణ మోడల్గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ పట్ల ప్రతికూలంగా మారినా మోదీ ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శ చేస్తోంది. బీజేపీ వైపు నుంచి, మోదీ వైపు నుంచి ‘ఇండియా’ కూటమిపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు కూడా పదునైనవే! దేశం వెనుకబడి పోవడానికీ, అన్ని వ్యవస్థలూ సకల అవలక్షణాలతో కునారిల్లడానికీ కారణం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘంగా పాలించడమేనని బీజేపీ విమర్శిస్తోంది. దాంతోపాటు మోదీ నేతృత్వంలో ఈ 12 ఏళ్లకాలంలో దేశం ఏ విధంగా ముందంజ వేసిందీ ఘనంగా చాటుకొంటున్నారు. తాజాగా తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను, ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు. అయితే, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే... జీఎస్టీ సంస్కరణలు చేశారనీ, ఆ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారనీ ప్రతిపక్షం ఆరోపి స్తోంది. 17 శాతం ముస్లివ్ు జనాభా గల బిహార్లో... మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో యథావిధిగా ఎవరితోనూ పొత్తు లేకుండా ఒవైసీ తన పార్టీ ‘మజ్లిస్’ను రంగంలోకి దించు తున్నారు. తమకు పడని ఓట్లు ఎదుటి పక్షానికి పడకుండా చీల్చడంలో ఇది బీజేపీకి లాభించేదే!కొత్త సంస్కరణలు ఇక్కడి నుంచే...తాజాగా పలు ఎన్నికల సంస్కరణలకు బిహార్ వేదిక కావడం విశేషంగా చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న 17 ఎన్నికల సంస్కరణల అమలు బిహార్ నుంచి మొదలు కాబోతోంది. ఈ సంస్కరణలలో ప్రధానంగా ఒక్కోపోలింగ్ బూత్ను 1,200 మంది ఓటర్లకే పరిమితం చేస్తున్నారు. ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు, పోస్టల్ బ్యాలెట్ను ముందుకు జరిపి తప్పనిసరి చేస్తున్నారు. ఓటరు గుర్తింపునకు ఆధార్ను వినియోగించుకోవచ్చు నని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఎన్నికల కమిషన్ తొలుత నిరాకరించినా చివరకు దిగొచ్చింది. గతంలో తన మీద వచ్చిన ఆరో పణలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చేది. ఈసారి అందుకు భిన్నంగా సీఈసీ తనను విమర్శించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన టీఎన్ శేషన్ అన్ని రాజకీయ పార్టీల వ్యవహార శైలి పట్ల కఠినంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి గౌరవాన్నిపెంచారు, ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడది మృగ్యమైంది.ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక పార్టీ లేదా కూటమి గెలు పొందుతుంది. అయితే, ప్రజాస్వామ్యం గెలిచిందన్న భావన ప్రజలకు కలగాలి. ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజలకు విశ్వాసం కలగాలి. గెలుపు కోసం ఎంతకైనా దిగజారడానికి రాజకీయ పార్టీలు సిద్ధపడి పోతున్న నేపథ్యంలో... ప్రజాస్వామ్యం గెలవాలని కోరు కోవడం అత్యాశ అవుతుందా? కొత్తగా కొన్ని సంస్కరణలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం డేటా, బ్యాటరీ లాగ్స్, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. పైగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను నాశనం చేయాలనిజిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఇటువంటి నిబంధనలు విధించడంపై ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, పొత్తులు కుదుర్చు కోవడంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనల నేపథ్యంలో బిహార్ ఎన్నికలు ఈసారి అత్యంత రసవత్తరంగా మారనున్నాయి.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
పదే పదే అదే దాడి!
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది ప్రజలకు సమాచారం తెలుసు కునే హక్కు కూడా! ప్రభుత్వ తప్పిదాలు లేదా లోపాలను ఎత్తి చూపినందుకు, ముఖ్యంగా మద్యం మరణాల వంటి సున్నితమైన అంశాలలో, సంపాదకుడిని లేదా విలేకరులను వేధించడం, బీఎన్ఎస్ 179(1) వంటి అసంబద్ధమైన సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం, ‘సోర్స్’ వివరాలను అడగటం వంటి చర్యలు చట్టబద్ధమైన పరిధిని దాటి అధికార దుర్వినియోగానికి (అబ్యూజ్ ఆఫ్ అథారిటీ) పాల్పడటం కిందికి వస్తాయి.పత్రికా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలు జరిగినప్పుడు, వివిధ కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు జర్నలిస్టులకు బలమైన రక్షణ కవచంగా నిలిచిన విషయం గమనార్హం. సత్యాన్ని ధైర్యంగా నిల బెట్టే ప్రతీ జర్నలిస్టుకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ఎప్పుడూ రక్షణగా నిలుస్తుంది.ఒక వార్తా దినపత్రిక సంపాదకుడికి, మద్యం మరణాల గురించిన వార్తను ప్రచురించినందుకు గానూ, పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 179(1) కింద నోటీసులు జారీ చేయడం, ఆ వార్తకు సంబంధించిన విలేకరుల అన్ని డాక్యుమెంట్లు, వివరాలను బీఎన్ఎస్ సెక్షన్ 94 కింద సమర్పించాలని డిమాండ్ చేయడం చట్ట బద్ధమేనా? ఇటువంటి పోలీసు చర్యలు, లేదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు జర్నలిస్టులను వేధించడం కాదా? అవి వేధింపులే!ఏదైనా దర్యాప్తు, విచారణ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఏదైనా పత్రం, ఇతర వస్తువు అవసరమని కోర్టు లేదా పోలీస్ స్టేషన్ అధికారి భావించినప్పుడు, దానిని సమర్పించమని బీఎన్ఎస్ సెక్షన్ 94 (పాత సీఆర్పీసీ సెక్షన్ 91) కింద ఎవరికైనా సమన్లు జారీ చేయవచ్చు. కానీ అది పాత్రికేయులకు వర్తిస్తుందా? సాధారణంగా, విచారణ కోసం పత్రాలను అడగడానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. అయితే, జర్నలిస్ట్ వనరు (సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) లేదా సమాచారాన్ని సమర్పించమని బలవంతం చేయడం, జర్నలిజం ప్రధాన సూత్రమైన ‘సోర్స్ గోప్యత’కు విరుద్ధం. విలేకరుల రక్షణ, పత్రికా స్వేచ్ఛ దృష్ట్యా, ఈ సెక్షన్ను విచక్షణా రహితంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం అవుతుంది. వార్తా ప్రచురణను కేవలం ప్రభుత్వంపై విమర్శగా భావించి, ఈ సెక్షన్లను ఉపయోగించి విలేకరుల వివరాలను, డాక్యుమెంట్లను కోరడం స్పష్టంగా ‘చట్టపరమైన వేధింపు’ కిందకు వస్తుంది.భారతదేశంలో జర్నలిస్టులు తమ వార్తా మూలాలను పోలీసు లకు బహిర్గతం చేయాలని ఏ చట్టం కూడా ఒత్తిడి చేయదు. సమాచా రాన్ని సేకరించే హక్కు, ప్రచురించే హక్కు – ఈ రెండింటినీ ఆర్టికల్ 19(1)(ఎ) కింద భారత రాజ్యాంగం ప్రసాదించింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సంబంధిత న్యాయస్థానం, అది కూడా అత్యవసర మైతేనే ఆ మూలాలను వెల్లడించమని ఆదేశించగలదు. కానీ పోలీసు లకు ఆ హక్కు లేదు. జర్నలిజంలో సమాచారాన్ని అందించిన వనరును రక్షించడం అత్యంత కీలకం. సోర్స్ను బహిర్గతం చేయమని బలవంతం చేయడం పత్రికా స్వేచ్ఛను అణిచివేయడమే అవుతుంది.జర్నలిస్టులకు ‘సుప్రీం’ బాసటరోమేష్ థాపర్ (1950) నుంచి ఆర్ణబ్ గోస్వామి (2020), ‘న్యూస్క్లిక్’ (2024) కేసుల వరకు, భారత అత్యున్నత న్యాయ స్థానం ఎప్పటికప్పుడు పోలీసుల లేదా రాజకీయ నేతల ఒత్తిడి లేకుండా మీడియా పని చేయాలనే హక్కును కాపాడుతూనే ఉంది. ‘ఆర్ణబ్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసును జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షా విచారించారు. ముఖ్యంగా టీవీ కార్యక్రమాల మీద పలు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం మీద విచా రణ జరిగింది. జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం, ప్రభు త్వాన్ని విమర్శించడం వారి హక్కుగా కోర్టు పరిగణించింది. రాజకీయ దురుద్దేశంతో ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు విరుద్ధం అని వ్యాఖ్యానించింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రతి పౌరుడికీ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది. ఈ హక్కులోనే పత్రికా స్వేచ్ఛ కూడా అంతర్లీనంగా ఉంది. పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్నప్పుడు, ఒక జర్నలిస్ట్ లేదా ఎడిటర్ తన రక్షణ కోసం హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులు తరచూ నాలుగు అంశాలను పరిగణన లోకి తీసుకుంటాయి: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్త ప్రచురిత మైందా? వార్తలో ఉన్న వివరాలు నిజమని భావించడానికి ప్రాథ మిక ఆధారాలు ఉన్నాయా? నేరారోపణ చేయబడిన సెక్షన్ (ఇక్కడ బీఎన్ఎస్ 179(1)) ఈ వార్తకు అసలు వర్తిస్తుందా? లేదా ఇది కేవలం జర్నలిస్టును వేధించడానికి లేదా భయపెట్టడానికి ఉపయో గించారా?ప్రభుత్వ చర్యలు పత్రికా స్వేచ్ఛను అరికట్టే విధంగా ఉండ కూడదు. అంటే భయపెట్టి, ఒత్తిడి చేసి జర్నలిస్టులు సత్యాన్ని రాసేందుకు వెనకాడేలా చేయడాన్ని ‘చిల్లింగ్ ఎఫెక్ట్’ అంటారు. సుప్రీం కోర్టు ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది. పత్రికా స్వేచ్ఛకు ఊతం‘న్యూస్క్లిక్’ ఎడిటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు అద్భు తమైన వ్యాఖ్యానాలు చేశాయి. తమకు ఇష్టం లేని రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను నిందితులుగా పరిగణించే అధికారం పోలీసులకు లేదని కోర్టులు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, సదరు వార్త సాధనాలను స్వాధీనం చేయాలని కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది.‘రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్’ కేసులో ఆర్టికల్ 19(1)(ఎ) కింద పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని 1950లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది ‘బ్రజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ’ కేసులో వార్తలను ప్రచురించడానికి ముందు సెన్సార్ షిప్ను కోర్టు కొట్టివేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు తొలి విజయం.‘అభిషేక్ ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’ (2024) కేసులో జర్నలిస్ట్ రాతలను ప్రభుత్వ విమర్శగా భావించినంత మాత్రాన, ఆ రచయితపై క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ చర్యలను విమర్శించే జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుంది. ‘సిద్ధార్థ్ వరదరాజన్, ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం’ (2025) కేసులో, ఒక వార్తా పోర్టల్కు సంబంధించిన సీనియర్ జర్న లిస్టులపై నిర్బంధ చర్యలు తీసుకోకుండా అస్సాం పోలీసులను సుప్రీంకోర్టు నిలువరించింది. ఈ చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా కోర్టు భావించింది.పత్రికా స్వేచ్ఛ గురించి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇస్తున్నా, వేధింపులకు సంబంధించి పోలీసులను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారు ఈ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి కేసులు నిలవవని వారికీ తెలుసు. అయితే ఈ లోపు తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ ‘చిల్లింగ్ ఎఫెక్ట్’తో భయ పెట్టడమే వారి ప్రధానోద్దేశం. ఇలాంటి చర్యలకు సైతం వారు కచ్చి తంగా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుందనేది వాస్తవం.పి. విజయ బాబు వ్యాసకర్త రాజ్యాంగ న్యాయ శాస్త్ర పట్టభద్రులు, సీనియర్ సంపాదకులు -
నష్టం తక్కువ... లాభం ఎక్కువ
2021 ఆగస్టులో అధికారాన్ని చేపట్టిన తర్వాత మొదటిసారి, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి న్యూఢిల్లీలో భారత్ ఆతిథ్యం ఇచ్చింది. తాలిబాన్ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించకుండానే, దానితో చర్చలు సాగించే విధానాన్ని ఇన్నాళ్లూ భారత్ అను సరిస్తూ వచ్చింది. ఆ మాటకొస్తే, రష్యా మాత్రమే కొద్ది నెలల క్రితం ఆ ప్రభు త్వాన్ని గుర్తించింది. ముత్తాకీ న్యూఢిల్లీ రావడం, ఆయన్ని అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రిగా భారత్ ప్రస్తావించడంతో, తాలిబన్ను అఫ్గానిస్తాన్ అధికారిక ప్రభుత్వంగా గుర్తించే దిశగా భారత్ మరో అడుగు వేసిన ట్లయింది. అలా చేస్తే, ఎదురుకాగల ఇబ్బందులు తక్కువ, ఒనగూడ గల వ్యూహాత్మక ప్రయోజనాలు ఎక్కువ.మూడు ముఖ్య అభ్యంతరాలుఅవాంఛనీయ విలువలను ప్రబోధిస్తూ, తన జనాభాలో సగం మందికి వ్యతిరేకంగా వివక్షాయుత విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకూడదన్నది ఒక వాదన. దీనిలో సహే తుకత ఉంది. అయితే, మనం ఒక విషయాన్ని దృష్టిలో ఉంచు కోవాలి. (క్రూరమైన పనులను నాజూకుగా చేస్తున్నంత మాత్రాన) అన్ని ప్రభుత్వాలూ నైతికంగా ఆమోదయోగ్యమైనవి కావు. అంగీ కారయోగ్యం కాని విలువలతో కూడిన ప్రభుత్వాన్ని గుర్తించినంత మాత్రాన, ఆ విలువలను మనం ఆమోదిస్తున్నట్లు కాదు. అంత ర్జాతీయ రాజకీయాలు అంతకు మించి జటిలమైనవి. వ్యక్తిగత స్నేహానికి ఎంచుకొనే ప్రమాణాలను, ప్రభుత్వాల విధాన నిర్ణయాలకు వర్తింపజేయలేం. అఫ్గానిస్తాన్ చట్టబద్ధమైన పాలకులుగా తాలిబాన్ను గుర్తించడం వల్ల, ఈ ప్రాంతంలో శుద్ధాచారవాదం పెరిగేందుకు దోహద పడినట్లు అవుతుందనేది రెండో అభ్యంతరం. కానీ, తాలిబాన్ను గుర్తించడం ద్వారా వారు ప్రధాన జీవన స్రవంతిలోకి రావడానికీ, సామాజికంగా మెరుగైన ప్రవర్తనను అలవరచుకోవడానికీ బాటలు పరచినట్లు అవుతుంది. 1996 నాటి తాలిబాన్ వేరు, 2025 తాలి బాన్ వేరు. వారు మరికాస్త మధ్యేవాదులుగా మారారు, ఆధునిక మార్గాలను అనుసరించేందుకు మరింత సుముఖంగా ఉన్నారు. స్త్రీ–పురుష వివక్ష చూపడంపై విమర్శలను ఎదుర్కొన్న తర్వాత, భారతీయ మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం ద్వారా, తాలి బాన్ తన తప్పును సరిదిద్దుకుంది. కొన్నిసార్లు మార్పు, ఏక పక్షంగా దూరం పెట్టడం కన్నా, నలుగురితో కలవడం, ఒత్తిడిని చవిచూడటం వల్ల వస్తుంది. వారి మత విశ్వాసాలు, విధానాలతో ఏకీభవించనంత మాత్రాన పొరుగు దేశాన్ని దూరంపెట్టడం గొప్ప రాజ్య లక్షణం అనిపించుకోదు. తాలిబాన్కు దగ్గరైతే పాకిస్తాన్తో మన సంబంధాలు మరింత క్షీణిస్తాయనేది మూడో అభ్యంతరం. వాస్తవం ఏమిటంటే, భారత్ –పాక్ సంబంధాలు ఇప్పటికే అట్టడుగుకు చేరాయి. ఈ చర్య వల్ల ఇప్పుడు ఆ గతిశీలతలో గణనీయంగా రాబోయే మార్పు ఏమీ లేదు. నాలుగు ప్రధాన ప్రయోజనాలుఐ.సి.814 విమాన హైజాక్ ఉదంతాన్ని పక్కన పెడితే, సాధా రణంగా భారత్ పట్ల తాలిబాన్ వైఖరి సానుకూలంగానే ఉంది. ఆ హైజాక్ సూత్రధారి పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ. ఆ ఘటనలో తాలిబాన్ కన్నా ఐఎస్ఐ పాత్ర ఎక్కువ. తాలిబాన్ 2021 ఆగస్టులో అధికారం చేపట్టిన నాటి నుంచీ భారత్తో సంబంధాలు మెరుగు పరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కశ్మీర్ను భారత్ – పాక్ మధ్య ద్వైపాక్షిక అంశంగా చూడటం ద్వారా, అది భారత్ వైఖరిని సమ ర్థిస్తోంది. రెండు – రష్యాను అనుసరిస్తూ మిగిలిన దేశాలూ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఎంతో కాలం పట్టదు. తాలిబాన్పై పశ్చిమ దేశాల ఒత్తిడీ తగ్గింది. చైనా, పాకిస్తాన్ కూడా రష్యాను అనుసరించే అవకాశం ఉంది. మిగిలిన దేశాలు గుర్తించేంత వరకు భారత్ వేచి చూసి, ఆ తర్వాత గుర్తిస్తే, దౌత్యపరంగా దానికి ఇపుడు న్నంత ప్రాధాన్యం ఉండదు. పైగా, త్వరగా గుర్తించడం వల్ల, వ్యూహాత్మకంగా మొదటి మిత్రుని సానుకూలత లభిస్తుంది. అఫ్గానిస్తాన్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించే అవకాశం దక్కుతుంది. మూడు – తాలిబాన్ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్తో సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం మనకే మంచిది. ఈ ప్రాంతంలోని దేశాలను భారత్కు దూరం చేయాలని చైనా – పాకిస్తాన్ వేస్తున్న పథకాలను అడ్డుకునేందుకు వీలవుతుంది. కాబూల్తో చైనా సాన్నిహిత్యం కూడా పెరుగుతోంది. దానితో వీలైనంత మేరకు సమతూకం సాధించేందుకు ఇది తోడ్పడుతుంది. కాబూల్లో ఎవరు అధికారంలో ఉన్నారనేదానితో ప్రమేయం లేకుండా, అఫ్గానిస్తాన్ చాలావరకు, భారతదేశానికి ముఖ్యమైన భాగస్వామిగా కొనసాగుతూ వస్తోంది. కాబూల్లో అనంగీకార ప్రభుత్వం ఉందని, ఆ భాగస్వామ్యాన్ని పాడుచేసుకోకూడదు. ‘అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వానికీ, ప్రాంతీయ సమగ్రతకూ, స్వాతంత్య్రానికీ’ భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది’’ అని ముత్తాకీ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన ప్రకటన ప్రధానంగా పాకిస్తాన్ను ఉద్దేశించినదిగానే కనిపిస్తోంది. అఫ్గాన్ ప్రభుత్వంతో క్రియాశీలంగా వ్యవహరించడంలోని వ్యూహా త్మక విలువను న్యూఢిల్లీ గుర్తించిందనీ, ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకు ఒక మార్గంగా దాన్ని భావిస్తోందనీ ఆ ప్రకటన సూచిస్తోంది. అంతిమంగా, భారత్ నుంచి దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంతర్జాతీయంగా గుర్తింపు కోసం తహతహలాడుతున్న తాలి బాన్కు ఎంతో ఊతాన్ని ఇస్తుంది. ప్రాంతీయంగా అ–మిత్ర వాతా వరణం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చర్య ద్వారా, మధ్య ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్నేహపూర్వక ఉనికితో భారత్ లబ్ధి పొందనుంది.హ్యాపీమాన్ జాకబ్వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రేటజిక్ డిఫెన్స్ అండ్రిసెర్చ్’ వ్యవస్థాపక డైరెక్టర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
శాంతి పర్వమా?
గాజా కాల్పుల విరమణ అంగీకారం అక్టోబర్ 10 నుంచి అమలులోకి వచ్చింది. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) పాలస్తీనియన్లను ఊచకోత కోయడం ఆగింది. ట్రంప్ కుదిర్చిన ఈ కాల్పుల విరమణను ఒక అత్యవసర కారణం రీత్యా స్వాగతించవలసి ఉంది. కొడిగడుతున్న మానవతా దీపానికి రెండు చేతులు అడ్డుపెట్టేందుకు ఈ సంధిని సమర్థించవలసి ఉంది. పాలస్తీనా పౌరులపై రెండేళ్ళుగా మోతాదుకు మించి సాగుతున్న దాడుల్లో 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతులయ్యారు. పౌరులు, సైనికులతో కలిపి సుమారు 2,000 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 55 లక్షల పాలస్తీనియన్లలో సుమారు ఇరవై లక్షల మంది నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి, మానవతా సంస్థలు, స్థానిక అధికారుల అంచనా.మానవ కల్పిత మహా విపత్తుగాజా శిథిలాల కుప్పగా మారింది. కరవు కాటకాలతో జనం సతమతమవుతున్నారు. ఇతర ప్రాంతాలకు పారిపోయిన పాలస్తీనియన్లు కాల్పుల విరమణ అమలులోకి రావడంతో గాజా నగరానికి, షేక్ రద్వాన్ వంటి ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. నుసేరత్, ఖాన్ యూనిస్ వంటి దక్షిణ ప్రాంత శిబిరాల నుంచి మిగిలిన అరకొర సామాను వేసుకుని అల్ రషీద్ వంటి ఉత్తర ప్రాంతాలకు నడక సాగిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను ‘మానవ కల్పిత మహా విపత్తు’గా ఐరాస అభివర్ణించింది. ఇపుడు గాజాలోకి రోజూ 600 సహాయ సామగ్రి ట్రక్కులు వస్తున్నాయి కనుక, ఈ కాల్పుల విరమణ ఫలితంగా కరవు తీవ్రత కొద్దిగా తగ్గవచ్చు. సహాయ సామగ్రి రాక పెరగడం, రఫా, ఇతర కూడలి మార్గాలను తిరిగి తెరవడం వల్ల, గాజాలో మిగిలినవారి కష్టాలకు తాత్కాలికంగానైనా ఉపశమనం లభించవచ్చు.అయితే, వాస్తవ పరిస్థితులు ఇప్పటికీ గుబులు రేకెత్తించేవిగానే ఉన్నాయి. సుస్థిర శాంతితో పాటు, సామాజిక–రాజకీయ న్యాయం పాలస్తీనియన్లకు అందని మావి పండుగానే మిగిలిపోవచ్చు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఒక రకంగా బలవంతంగానే ఈ కాల్పుల విరమ ణకు ఒప్పించారు. ట్రంప్, ఇతర ప్రాంతీయ భాగస్వాములు (ఈజిప్టు, ఖతార్, సౌదీ అరే బియా) ఊహిస్తున్నంత సుందర స్వప్నం సాకారం కాకపోవచ్చు. అయినప్పటికీ, పెడ మొహంతో ఉన్న నెతన్యాహూను బలవంతం గానైనా చర్చలకు కూర్చోబెట్టినందుకు ట్రంప్ను ఎంతో కొంత అభినందించాల్సిందే. పునర్నిర్మాణం ఎలా?శిథిలాలను తొలగించి, గాజాను పున ర్నిర్మించే పనికి శ్రీకారం చుట్టడం తక్షణ ప్రాధాన్యం కావాలి. యుద్ధానంతరం గాజా పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం వచ్చే పదేళ్ళలో 53.2 బిలియన్ డాలర్ల మేరకు ఉండవచ్చని అధికారిక అంచనాలు వెల్లడి స్తున్నాయి. ఐరాసకు చెందిన నష్టాలు – అవస రాల తాత్కాలిక సత్వర మదింపు సంస్థ, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంక్ కలసి ఆ రకమైన లెక్కకు వచ్చాయి. అవి 2023 అక్టోబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆ అంచనాకు వచ్చాయి. పాలస్తీనాకు అంత పెద్ద మొత్తాలను ఎలా అందుబాటులోకి తెస్తారో ఈ దశలోనే చెప్పడం కష్టం.ఐరాస పరిధికి బయట ఈ ఒడంబడిక కుదరడంతో, ఇది ఎంతవరకు ముందు సాగుతుందనే సందేహాలు రేకెత్తుతున్నాయి. దీన్ని బలమైన ప్రాంతీయ పక్షాల మద్దతుతో అమెరికా నేతృత్వాన సాగిన చొరవగానే చూస్తున్నారు. గాజాకు బయటనున్న స్థావరాల నుంచి హమాస్ ఏ విధంగా నియమాలను పాటిస్తుందో పర్యవేక్షించే ఒక బహుళ దేశీయ సైనిక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిలో అమెరికా దళాలు కూడా 200 వరకు ఉంటాయి. తాత్కాలిక టెక్నికల్ పాలనా బృందానికి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నాయకుడిగా ఉంటారు. ఇది ట్రంప్ శైలిలో నయా సామ్రాజ్యవాద పోకడను సూచిస్తోంది. ఈ ఒప్పందానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. మొదటి దశకు శుభారంభం చేసినందుకు నెతన్యాహును ప్రధాని మోదీ ప్రశంసించారు. సంక్లిష్టమైన శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పాల్గొన్న అనుభవం భారతదేశానికి ఉంది. కొరియా యుద్ధ విరమణ (1953) నుంచి తదుపరి ఐరాస ప్రత్యేక విధుల్లో భారత్ పాలుపంచుకుంది. విపత్తుల సహాయ కార్యక్రమాల్లో భారత్ తన సమర్ధతను విజయవంతంగా నిరూపించుకుంది. కనుక,గాజాకు ఇపుడు ఎంతో అవసరమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ పనులకు భారత్ చేదోడువాదోడు కాగలదు. కాల్పుల విరమణ ఒడంబడిక తాత్కాలికమైనది, విఘాతాలకు లోనుకాగల అవకాశం ఉన్నది. ఇది 2023 అక్టోబర్లో యుద్ధం మొదలైన తర్వాత సంధి కుదర్చడానికి సాగుతున్న మూడవ పెద్ద ప్రయత్నం. రెండు ప్రయత్నాలు గతంలో విఫలమయ్యాయి. ఈసారైనా సత్ఫలితాలు ఇస్తుందా? నిజానికి, ఐరాస ఆధ్వర్యంలోకి ఈ సంక్లిష్ట ఒప్పందాన్ని తీసుకురావడం వాంఛనీయం. కానీ, అటువంటి పరిణామానికి ఉన్న అవకాశం చాలా తక్కువ.సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
నవోదయమేనా?
ఒక సమస్య పట్ల తీవ్రమైన వైఖరిని తీసుకుని, అందుకు పరిష్కారం అని చెప్పే దానిలో కనిపించే కొద్దిపాటి మంచిని కూడా తిరస్కరించటం ఒక ధోరణి. జరిగిన మంచిని ఒక ముందడుగుగా భావించి మరింత ముందుకు పోజూడటం మరొక ధోరణి. వీటిలో ఏ సమస్య పట్ల ఏ ధోరణి తీసుకోవాలనేది అందుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్ళుగా సాగుతున్న గాజా యుద్ధానికి శాంతియుత పరిష్కారం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 9న వైట్హౌస్లో ప్రకటించిన 20 అంశాల ప్రణాళికపై 13వ తేదీన ఈజిప్టులోని షర్మ్ అల్షేక్ పట్టణంలో తనతోపాటు, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే ప్రభుత్వాధినేతలు సంతకాలు చేసి ఆమోదించారు. ఆ ముగ్గురూ హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలకు మధ్య వర్తిత్వం వహించినవారు. దశలు దశలుగా అమలుకు రాగలదనే ఆ 20 అంశాల ప్రణాళికలో మొదటి దశ ఈ 9–13 తేదీల మధ్య అమలు జరిగింది కూడా! అందులో భాగంగా ఉభయ పక్షాలు కాల్పులను విరమించాయి.బందీలను, ఖైదీలను విడుదల చేసుకున్నాయి. మూల సమస్య విస్మరణ హమాస్, ఇజ్రాయెల్ స్వయంగా ప్రకటించినట్లు, ట్రంప్ చొరవ, బలిమి లేనిదే ఇది ఎంత మాత్రం జరిగేది కాదు. హమాస్ ఎన్ని త్యాగాలతో ఎంత పట్టుదలగా పోరాడినా, స్వయంగా అరబ్ దేశాలే ద్వంద్వ వైఖరిని చూపుతున్న స్థితిలో ఇజ్రాయెల్ను ఓడించటం సాధ్యమయ్యేది కాదు. ఇజ్రాయెల్ ఒకవేళ హమాస్ సహా గాజా ప్రజలందరినీ తుడిచిపెట్టినా పాలస్తీనా జాతి,స్వదేశ ఆకాంక్షల సమస్య పరిష్కారమయ్యేది కాదు. అయినప్పటికీ ఆ విధంగా తుడిచి పెడతాము, గ్రేటర్ ఇజ్రాయెల్ను ఏర్పాటు చేస్తాము తప్ప, స్వతంత్ర పాలస్తీనా ప్రసక్తి ససేమిరా లేదన్నది నెతన్యాహూ వైఖరి. అందువల్ల, మొదటి నుంచి ఎన్ని ఊగిసలాటలాడినా చివరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటించి, దాని అమలు పర్యవేక్షణకు కూడా సిద్ధపడిన నాయకుడు ట్రంప్.ఇవీ మనకు కనిపిస్తున్న వాస్త వాలు. లేదా వాస్తవాలలో కొన్ని. తక్కిన వాస్తవాలేమిటో చూద్దాము. అన్నింటికన్నా ప్రధానమైనది, దశా బ్దాల ఘర్షణలకు మూలకారణమైన స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు. దాని గురించి ట్రంప్ 20 అంశాలలో గల ప్రస్తావన అత్యంత అస్పష్టమైన రీతిలో, ఎటువంటి కాలవ్యవధి లేకుండా, చిట్టచివరన వస్తుంది. షర్మ్ అల్షేక్ సమావేశం తర్వాత విడుదల అయిన సంయుక్త ప్రకటనలోనూ పాలస్తీనా దేశం ప్రస్తావన లేదు. ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు సమాన హక్కులు అవసరమని, గాజా సమస్య మొత్తం పాలస్తీనా సమస్యలో భాగమని మొక్కుబడిగా అనటం మినహా వారికి స్వయం నిర్ణయాధికారం ఉందని ఎక్కడా పేర్కొనలేదు. ఇటీవలనే పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్ దేశపు విద్యా మంత్రి బ్రిడ్జెట్ ఫిలిప్స్, రెండు స్వతంత్ర దేశాలు అవసరమన్నారు. ఆ తర్వాత జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఆ మాట అన్నారు. కానీ, ఆ మాట ట్రంప్తో అనిపించటం గానీ, సంయుక్త ప్రకటనలో చేర్చటం గానీ, ఆ మేరకు 20 అంశాల ప్రణాళికలో మార్పులు జరిపించటం గానీ చేయలేకపోయారు.ఇంకా అపనమ్మకమే...ఈ అస్పష్టమైన, అయోమయమైన పరిస్థితుల మధ్య ఏవైనా ఆశారేఖలున్నాయా? మళ్ళీ ట్రంప్ను చూద్దాము. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించటంలో ప్రపంచాభిప్రాయపు ఒత్తిడి కూడా పనిచేసిందని ఒక మాట అన్నారాయన. ఇజ్రాయెల్ సేనలు ‘చంపు, చంపు, చంపు’ అన్నట్లుగా వ్యవహరించాయని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ నుంచి టెల్ అవీవ్కు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో మీడియాతో, గాజా యుద్ధం ఇక శాశ్వతంగా ముగిసిందని ప్రకటించారు. తాము బందీలను విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్ తమపై తిరిగి దాడులు జరపవచ్చునని హమాస్ సందేహించగా, అటువంటిది జరగబోదని వారికి మధ్యవర్తుల ద్వారా హామీ ఇచ్చారు. హమాస్ నిరాయుధీకరణ షరతును సడలించి, వారు గాజాలో అంతర్గత శాంతిభద్రతలను నిర్వహించవచ్చునని అంగీకరించారు.వీటన్నింటి క్రమంలో నెతన్యాహూ ఎక్కడికక్కడ మొండితనంతో వ్యవహరించగా కఠినంగా మాట్లాడి దారికి తెచ్చారు. ఇటువంటివన్నీ పరిగణించినప్పుడు ఏమని భావించాలి? 3 వేల సంవత్సరాల సమస్య ఒక కొలిక్కి వచ్చిందని, మొత్తం పశ్చిమాసియాకే నవోదయం కలిగిందని, ఇది ఇక శాశ్వతమని అంటున్న ట్రంప్ మాటలు, తనకు సాధారణంగా మారిపోయిన అతిశయోక్తి ప్రాగల్భ్యమా? లేక, పాలస్తీనా ఏర్పాటు ఇక ఆపలేదనిదని గుర్తించి ఆ దిశగా తెర వెనుక నర్మగర్భమైన దౌత్యనీతిని నడుపుతుండటమా? అందువల్ల, మొదటి దశ అమలు వరకు ట్రంప్ను అభినందిస్తూనే, ఆయన ప్రకటించినట్లు ఇది శాశ్వత నవోదయం అనదగ్గ సంపూర్ణ సూర్యోదయం అనే నమ్మకం మాత్రం ఇంకా కలగటం లేదనాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
'మనసు మాటే' బతుకు బాట
గొలుసుకట్టు సరుకుల దుకాణాల సంస్థ ‘హోల్ ఫుడ్స్ మార్కెట్’ సహ వ్యవస్థాపకునిగా, దాని మాజీ సీఈఓగా జాన్ మెకే ప్రఖ్యాతి వహించారు. ఈ అమెరికన్ 44 ఏళ్ళ పాటు శ్రమించి దాన్నొక బహుళ జాతి సంస్థగా వృద్ధిలోకి తెచ్చారు. 2022లో అందులోంచి రిటైరయ్యాక ‘లవ్ లైఫ్’ పేరుతో ఆరోగ్య, స్వస్థతా వ్యాపారాన్ని ప్రారంభించారు. బెంట్లే కాలేజ్ పట్టభద్రులను ఉద్దేశించి మెకే చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: తల్లితండ్రులను మనసారా గౌరవించి, ప్రశంసించాలని బెంట్లే విద్యార్థులకు నేనిచ్చే మొదటి సలహా. కన్నవారు ప్రేమించినంతగా మనల్ని మరెవరూ ప్రేమించరు. మనల్ని పెంచి పెద్దచేసే క్రమంలో వారు కూడా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వారికి తెలిసినంతలో, ఉన్నంతలో మనల్ని తీర్చిదిద్దే కృషి చేశారని గుర్తించాలి. వారు మన కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసి ఉంటారు. వాటిలో కొన్ని మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. అంతరాత్మకు వ్యతిరేకంగా పోతే...జీవిత కాలం నిజంగానే చాలా చిన్నది. ఈ ప్రాథమిక సత్యాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. మృత్యువు అనివార్యం కనుక మన జీవి తాలను ఎలా గడపాలి? ఈ ప్రశ్నకు జవాబు విషయంలో యువ కుడిగా ఉన్నప్పటి నుంచి నాకొక స్పష్టత ఉంది. అంతరాత్మ ప్రబోధం మేరకు నడచుకోవాలి. ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టాలి. జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నామో, దేన్ని ఎక్కువ అభిమానిస్తామో ఆ రంగంలోకే దిగాలి. నేను 19 ఏళ్ళ వయసు నుంచి నా జీవితంలో అలాగే నడచుకునేందుకు ప్రయత్నించాను. కాలేజీ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి, హోల్ ఫుడ్స్ మార్కెట్ ప్రారంభించాలనే నిర్ణయం నా హృదయం నుంచే వచ్చింది. ఈ నిర్ణయం నా తల్లితండ్రులనూ, స్నేహితుల్లో చాలా మందినీ ఆశాభంగానికి గురిచేసింది. కానీ, నిస్సందేహంగా అది సరైన నిర్ణయమనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగాను. హృదయం చెప్పినట్లు నడుచుకోవడంలో రెండు ముఖ్యమైన కోణాలున్నాయి. మొదట– మనల్ని మనం తెలుసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనం నిజంగా అంతరాత్మ చెప్పినట్లు నడచుకుంటు న్నామా లేక ఎక్కడన్నా దారి తప్పామా అన్నది తెలుస్తుంది. మనం గాఢంగా ఇష్టపడే వ్యాపకాలను చేపడితే మనం రెట్టింపు శక్తితో పని చేస్తాం. సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, చేసే పనికి ఒక ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. అంతరాత్మ చెప్పినట్లు నడచుకోవడం మానేస్తే దానికి వ్యతిరేక ఫలితాలు సంభవిస్తాయి. శక్తి సన్నగిల్లుతుంది. సృజన కొరవడుతుంది. చేసే పనికి ఒక పరమార్థం అంటూ ఉండదు. ముఖ్యంగా సంతోషం కూడా లోపిస్తుంది. ఒక దిశ, దశ లోపించాయని అనిపించినపుడు మరో దాన్ని ఎంచుకోండి. కొన ఊపిరి ఉన్నంత వరకు ఏదీ చేజారిపోయినట్లు కాదు. దేనికీ కాలం మించిపోయినట్లు కాదు. హృదయం చెప్పిన మార్గంలో నడిచేందుకు మరొకటి అవసరం పడుతుంది. అది భయాన్ని జయించడం! జీవితానికి ఒక పూర్తి సార్థకత చేకూర్చుకోకుండా చాలా మందికి అడ్డుపడేది భయమే! చేపట్టే పనిలో విఫలమవుతామేమోననే భయం. ఆత్మీయులు మనం ఇష్టపడుతున్న రంగాన్ని తిరస్కరిస్తారేమోనని భయం. సక్రమంగా నిర్వహించగలమో, లేదోనని మనకే ఒక సందేహం. మనలో రేకెత్తే భయాన్ని బయటివారు ఎవరూ పోగొట్టలేరు. దాన్ని మనకు మనమే తొలగించుకోవాలి. భయం మన మనసు సృష్టించే ఒక బూచి. అది బయటిది కాదు. లోపలి నుంచి పుట్టుకొచ్చేది. పుడుతున్న చోటనే దాన్ని అంతం చేయాలి. ప్రేమే జీవిత మూలసూత్రంమన జీవితాల్లో ప్రేమను పెంచి పోషించుకోవడాన్ని ఒక మూలసూత్రంగా అనుసరించాలి. ఇక్కడ ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య లైంగికతకు సంబంధించినది కాదు. నేను చెప్పే ప్రేమ ఎదుటి వారి పట్ల దయతో వ్యవహరించడానికి చెందినది. ఎదుటివారు మంచిపని చేస్తే నిండు మనసుతో అభినందించగలగాలి. తోటి వారిని ప్రేమించడం వల్ల మన జీవితాలు సుసంపన్నమవుతాయి. ప్రేమతో మెలిగేందుకు మరో మూడు సుగుణాలు అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొదటిది – కృతజ్ఞత చూపడం! బతికున్నంత కాలం మనం ధన్యవాదాలు తెలుపవలసిన సందర్భాలు అనేకం ఎదురవుతూంటాయి. ప్రతి రోజూ ఉదయం పూట కొద్ది నిమిషాలు మనకు మేలు చేసినవారిని, మనల్ని సంతోషపరచినవారిని గుర్తు చేసుకోవాలి. అవకాశం రాగానే వారికి కృతజ్ఞత తెలియచేయాలి. వృత్తి ఉద్యో గాలలోనూ సంతోషపెట్టే పనులు చేసిన తోటి సిబ్బందిని అభినందించాలి. అది సంస్థ పనితీరు మెరుగుపడేందుకూ, మరిన్ని సత్ఫలి తాలు సాధించేందుకూ నిస్సందేహంగా తోడ్పడుతుంది. రెండవది – క్షమాగుణం! అరకొర అవగాహనతో, అపోహలతో ఎదుటివారి పట్ల ఒక నిర్ణయానికి వచ్చేస్తూంటాం. వారిపట్ల మనసులో అక్కసు పెంచుకుంటాం. మన బాధలకు వారే కారణం అనుకుంటాం. మన జీవితాల్లో ప్రేమ పొంగి పొరలకుండా అడ్డుకునేది అలా పొరపాటు అభిప్రాయాలను ఏర్పరచుకోవడమే! దానివల్ల మనకు మనమే ఎంత హాని చేసుకుంటున్నామో పూర్తిగా గుర్తెరగం. అది తెలిస్తే అటువంటి అలవాటు మానుకుంటాం. మనం చేసిందే ఒప్పు అని, ఎదుటివారిది తప్పు అని మనసులో బలంగా ఉండటం వల్ల క్షమించలేం. ఎదుటివారు తప్పు చేయడం వల్లనే మనం క్షమించవలసి వచ్చిందనే అభిప్రాయం కూడా మనకు తరచు కలుగుతూ ఉంటుంది. కానీ, క్షమించడమంటే అసంతృప్తినీ, కోపాన్నీ మన మనసు నుంచి పారదోలడమే! అంతేకానీ, మన విలువలను, నైతిక సూత్రాలను వదులుకుంటు న్నట్లు కాదు. క్షమించడం వల్ల మనం గతం నుంచి విముక్తుల మవుతాం. వర్తమానంలో ప్రేమను ఆస్వాదించగలుగుతాం. మూడవది – ఉదారత! దీన్ని చాలా మంది డబ్బు ఇవ్వడమే అనుకుంటారు. ఎదుటివారికి మన సమయాన్ని వెచ్చించి, సేవలందించడం కూడా ఉదారత చూపడమే. అవి మనం వారికిచ్చే కానుకలు. మనం దేన్నో త్యాగం చేస్తున్నామనుకోవడం, మన ప్రయోజనాలను పక్కనపెట్టి వారికి సేవ చేస్తున్నామనుకోవడం నిజమైన ఉదారత అనిపించుకోదు. వారి లాభం మనకు నష్టం అనే భావన రాకూడదు. ఉదారత అంటే మన హృదయం నుంచి ప్రవహించే ప్రేమకు పొడిగింపు మాత్రమే! ఆశాభంగపు పాఠాలుజీవితంలో ఆశాభంగాలు, అన్యాయాలు చాలా ఎదురవు తాయి. మనకు ఎదురయ్యే కష్టాలు, సవాళ్ళలో చాలా వాటిని మనం వృద్ధి చెందడానికి తోడ్పడే అవకాశాలుగా చూడటం నేర్చుకోవాలి. గతంలో చూడని నెలవులను మించి కొత్తవాటిలోకి ప్రవేశించేందుకు సహాయపడగల పాఠాలనుకోవాలి. పరిస్థితుల ప్రాబల్యం లేదా ఇతరుల వల్ల నష్టపోయిన వ్యక్తిగా మనల్ని మనం చూసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించాలి. మనల్ని చూసి ఎదుటివారు జాలి పడాలనుకోవడం కన్నా, మన మీద మనం జాలిపడటం కన్నా పెను విధ్వంసక భావావేశం మరొకటి లేదు. దాన్ని కనుక నిర్మూలించకపోతే – నిస్సహాయులం, నిర్వీర్యులం అయిపోతాం. హృదయం చెప్పినట్లు నడుచుకోలేం. జీవితం నేర్పాలనుకుంటున్న పాఠాలను అర్థం చేసుకునేందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం, ధ్యానం వంటివాటిని ఆశ్రయించవచ్చు. -
మాటల్లో తెంపరితనం వద్దు!
‘‘వ్యూహాత్మకంగా మన శత్రువులందరినీ మనం తృణీకరించవచ్చు. కానీ, తార్కికంగా మనం వారందరినీ సీరియస్గా తీసుకుని తీరాలి.’’ మావో జెడాంగ్ 1957లో చేసిన ఈ వ్యాఖ్య లోతైనది. ‘‘ప్రభుత్వ సౌజన్యంతో సాగే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తే, భారత్ ఆపరేషన్ సిందూర్–1 సందర్భంగా చూపిన సంయమనాన్ని ఈసారి ప్రదర్శించకపోవచ్చు, ఈసారి మేం మరో అడుగు ముందుకేసి, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాం. అది ప్రపంచ పటంలో తాము కొనసాగాలో వద్దో పాక్ ఆలోచించుకొనేటట్లు చేస్తుంది’’ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల అన్న మాటలు విన్నవెంటనే మావో వ్యాఖ్య గుర్తుకు వచ్చింది.మొన్న మే నెలలో, స్వల్పకాలికమే అయినా నిర్ణయాత్మకమైన రీతిలో చేసిన పోరాటంలో పాక్ వైమానిక దళం ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందీ భారత వైమానిక దళ చీఫ్ ఎ.పి.సింగ్ ఒక పత్రికా సమావేశంలో వివరించిన తర్వాత ద్వివేదీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. భారత్ వైపు చోటుచేసుకున్నట్లు చెబుతున్న నష్టాలను సింగ్ తోసిపుచ్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వారిద్దరి కేమీ తీసిపోనన్నట్లుగా మాట్లాడారు. వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా, భారత్ ఇచ్చే దీటైన జవాబు పాకిస్తాన్ ‘‘చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని రెండింటినీ’’ మార్చివేస్తుందని తన భుజ్ పర్యటనలో హెచ్చరించారు.తానేం తక్కువ తినలేదు!వీటిపై పాక్ అసాధారణమైన రీతిలో స్పందించింది. భారత దేశంలో ఏ మూలనైనా దాడి చేయగల సామర్థ్యం తమ సొంతమని ప్రకటించింది. ఒకవేళ అణ్వాయుధాలతో పాక్ను నిర్మూలించ దలిస్తే, అది పరస్పరమైనదిగా ఉంటుందని కుండబద్దలు కొట్టింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన పాకిస్తాన్ విఫల రాజ్యమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది గత 40 ఏళ్ళుగా భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. చేబదుళ్ళు తెచ్చుకుంటూ రోజులు నెట్టు కొస్తోంది. అయినప్పటికీ, 6,60,000 బలగం కలిగిన పాక్ సైన్యాన్నీ, దాని అణ్వాయుధాలనూ భారత్ తేలిగ్గా తీసుకోవడానికి లేదు.ప్రపంచం పటం నుంచి తుడిచిపెట్టేస్తూంటే పాక్ అణ్వాయుధాలను ప్రయోగించకుండా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటుందను కోవడం అవివేకం. అంత తేలికేం కాలేదు!పాక్ విజయ తంత్రాలను 1965లో ఛేదించడంలో భారత్ సఫలమైన మాట నిజమే కానీ, ఆ యుద్ధం ఒక రకంగా డ్రాగా ముగిసింది. రెండు పక్షాలూ ప్రత్యర్థి భూభాగాల నుంచి చెరికొంత ప్రయోజనాలను మూటగట్టుకున్నాయి. ఇక, పాక్తో భారత్ 1947 – 48 యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మొత్తం జమ్ము–కశ్మీర్ విముక్త మయ్యేదనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. దేశ విభజన రక్తపు చారికలు ఆరకముందే, ఒక దేశంగా ఇంకా పూర్తిగా పటిష్ఠం కాకముందే, ఆ యుద్ధం జరిగివుంటే మరింత వినాశకర పర్యవసానాలకు దారితీసి ఉండేది. మనం 1971లో తూర్పున చేసిన యుద్ధం బ్రహ్మాండంగా విజ యవంతమైంది. కానీ, అది మనం ఓటమికి అణువంత అవకాశం కూడా ఇవ్వకూడని యుద్ధమనే సంగతిని మరచిపోకూడదు. ఈ విషయమై పాశ్చాత్యుల కథనం మాత్రం వేరు. పాక్ ఆకాశంలో సత్తా చూపలేక, చతికిలపడి ఉండవచ్చు. కానీ, క్షేత్ర స్థాయిలో మనం గడించిన లాభాలు అంతంతమాత్రమే! పైగా మనం ఛంబ్ (పీఓకే)ను కోల్పోవలసి వచ్చింది.ఇక కార్గిల్ సంగతికొస్తే ఎత్తుగడ రీత్యా అది ఒక పరిమిత యుద్ధం. భారత్, పాక్ రెండూ అపుడు అణ్వాయుధ దేశాలు. భౌగో ళికపరంగా, తీవ్రత పరంగా యుద్ధాన్ని కొంత మేరకే పరిమితం చేయా లనే వ్యూహాన్ని న్యూఢిల్లీ అనుసరించింది. ఈ సందర్భంగా భారత్కు అంతర్జాతీయంగా లభించిన మద్దతు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా నుంచి లభించిన మద్దతు వల్ల కార్గిల్లోని మిగి లిన పర్వత శిఖరాల నుంచి పాక్ సేనలు తోక ముడవవలసి వచ్చింది. 2002లో నిర్వహించిన ‘ఆపరేషన్ పరాక్రమ్’ భారత్–పాక్ సేనల సమీకరణను చూసింది. కానీ, తొమ్మిది నెలల తర్వాత, తుది ఫలితం అనుకూలంగా వస్తుందనే పూచీ లేకపోవడం వల్ల, భారత్ దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ముంబయ్పై 2008 దాడి నేపథ్యంలోనూ అదే రకమైన పరిణామం చోటుచేసుకుంది.‘ఆపరేషన్ పరాక్రమ్’ ఉపసంహరణ తర్వాత, ఆ సారాంశాన్ని పర్వేజ్ ముషారఫ్ బాగా వివరించారు. ‘‘వారు (భారత్) మాపై దాడికి దిగరని, రెండు సైనిక శక్తులనూ బేరీజు వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. దాడికి దిగే సేన విజయం సాధించేందుకు సైనికపరంగా ఒక నిర్దిష్ట నిష్పత్తి అవసరం. మేం నిర్వహిస్తూ వస్తున్న ఆ నిష్పత్తులు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మరక్షణ చేసు కోవాల్సిన పక్షం తనను తాను కాపాడుకునేందుకు అవసరమైన దానికన్నా ఎక్కువ నిష్పత్తిలోనే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.ఇప్పుడేం మారిందని?పాక్పై భారత్ పదాతి దళాలతో దాడికి దిగితే విజయం ఖాయ మని సూచించేంతగా సంఖ్యలు, మోహరణలు, రక్షణ సామగ్రి పరంగా పరిస్థితిలో తేడా ఏమీ రాలేదు. మనం ఎంత చక్కగా సమా యత్తమై, ప్రేరణతో ఉన్నామో, అవతలి పక్షంవారు కూడా అలాగే ఉన్నారు. పైగా, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సేనల మోహరింపును ఎదుర్కొనేందుకు గడచిన ఐదేళ్ళుగా భారత్ తన సేనల కదలికలను నిశితంగా మార్చుకోవాల్సి వస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో, పాకిస్తానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రధాని మోదీ నూతన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. పాక్ను శిక్షించేందుకు అణు, సంప్రదాయ ఘర్షణల మధ్య తేడాను మెరుగైన రీతిలో వినియోగించుకోవాల్సి ఉందని ఆ మార్గదర్శక సూత్రాలు డిమాండ్ చేస్తున్నాయి. నాశనమైపోతారు జాగ్రత్తంటూ ప్రత్యర్థులను హెచ్చరించే బదులు, ప్రధాని చెప్పినట్లు నడచుకునేందుకు తగిన వ్యూహాలను పన్నడంపై సైన్యాధికారులు దృష్టి కేంద్రీకరించాలి. మనోజ్ జోషీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్’లో విశిష్ట పరిశోధకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నీరవ్ మోదీ (ఖైదీ బిలియనీర్) రాయని డైరీ
భారత ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినట్లయితే ఈ ఏడాది డిసెంబరులో విజయ్ మాల్యా, వచ్చే ఫిబ్రవరిలో నేను, మే నెలలో మా మామయ్య మెహుల్ చోక్సీ... ముగ్గురం ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో మా తొలి బర్త్డేలు జరుపుకొంటాం అనుకుంటా!జైల్లో నేను 55 లోకి, మామయ్య మెహుల్ చోక్సీ 67లోకి, విజయ మాల్యా 70లోకి అడుగు పెడతాం. ఏడాది నుంచి ఏడాదిలోకి అడుగు పెట్టడమే కానీ, మేమిక ఆర్థర్ రోడ్ జైలు నుండి బయటికి అడుగుపెట్టడం అనేదే ఉండదని భారతీయ శిక్షా స్మృతి ప్రకారం నా మనసుకు అనిపిస్తోంది.నేను 2019 నుండీ లండన్ జైళ్లలో ఉంటున్నాను. మాల్యా 2016 నుండీ లండన్ వీధుల్లో చల్లటి బీరు తాగుతూ బెయిల్ మీద ఉంటున్నారు. ఆయన ఒక్కసారీ జైల్లో లేరు. నాకు ఒక్కసారీ బెయిల్ రాలేదు. మామయ్య మెహుల్ చోక్సీని ఐదు నెలల క్రితమే... బెల్జియంలో అరెస్ట్ చేసి అక్కడే జైల్లో ఉంచారు. మోచేతి కర్రతో ఆయన నడుస్తుండటం ఫొటోల్లో చూసి నా మనసు చివుక్కు మంది. విధి ఎవర్ని ఎలా నడిపిస్తుందో ఊహించలేం. నేరం అన్నది చట్టం దృష్టిలో క్రూరమైనదే కావచ్చు. కానీ, నేరం కంటే క్రూరమైనది చట్టం. ఈ మాటనే 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఫోన్లో నేను మాల్యాతో అన్నప్పుడు, రెండుసార్లూ మాల్యా ఒక్క క్షణం ఆగి, పెద్ద పెట్టున నవ్వారు. ‘‘ఎందుకలా ఒక్క క్షణం ఆగారు మాల్యాజీ?’’ అని అడిగాను. ‘‘బీరు పొలమారింది’’ అన్నారు.‘‘మరి ఎందుకలా పెద్ద పెట్టున నవ్వారు మాల్యాజీ?!’’ అన్నాను.‘‘ఇంత వయసు వచ్చినా నాకు బీరును పొలమారకుండా తాగటం రానందుకు నవ్వొచ్చింది’’ అన్నారు!ఆ తర్వాతెప్పుడూ నేను చట్టం–నేరం అంటూ మాల్యాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. మధ్యలో మాల్యానే 2023లో ఒకసారి నాకు ఫోన్ చేశారు.‘‘ఎక్కడున్నావ్?’’ అన్నారు.‘‘ఇదిగో ఇప్పుడే సౌత్ వెస్ట్ లండన్ నుంచి, సౌత్ ఈస్ట్ లండన్ కి వచ్చాను మాల్యాజీ’’ అని చెప్పాను. ‘‘వావ్ వావ్... బెయిల్ వచ్చేసిందా!’’ అని చాలా సంతోషంగా అడిగారు మాల్యా. ఒకరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారిలో మాత్రమే అంతగా సంతోషం పొంగి పొర్లుతుంది.‘‘బెయిల్ కాదు కానీ, బెయిల్ లాంటిదే మాల్యాజీ. కరడుగట్టిన నేరస్థులతో కిక్కిరిసి ఉండే ‘హిజ్ మెజెస్టీస్ ప్రిజన్ ’ వాండ్స్వర్త్ నుంచి కొంచెం శుభ్రంగా ఉండే ‘హిజ్ మెజెస్టీస్ ప్రిజన్ ’ థేమ్స్సైడ్కు నన్ను షిఫ్ట్ చేశారు అన్నాను.‘‘అవునా... ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’’ అన్నారు మాల్యా. కొత్త సంతోషం పాత బాధల్ని మరిపిస్తుందని!నవంబర్ 23న వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో నా ‘అప్పగింత’ కేసు హియరింగ్. ‘‘నీరవ్ని మాకిచ్చేయండి ‘ప్రేమగా’చూసుకుంటాం’’ అని ఇండియా అంటోంది. మొదట నేను, నా వెనుకే మామయ్య, ఆ వెనుకే మాల్యా వరుసగా ఒక్కొక్కరంఇండియా ప్రేమకు పాత్రులం అవక తప్పేలా లేదు. బ్రేక్లో నా సెల్ నుంచి బయటికి వచ్చి మాల్యాకు ఫోన్ చేశాను. ‘‘హా... నీరవ్! నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా... బెల్జియం నుంచి నాకొక డాజిలింగ్, రేడియంట్, సింటిలేటింగ్,గ్లిజనింగ్, లస్ట్రస్... డైమండ్ నెక్లెస్ సెట్టును స్పెషల్గా తయారుచేయించి తెప్పించగలవా? ఫిబ్రవరిలో పింకీ బర్త్ డే ఉంది’’ అన్నారు! పింకీ... మాల్యా గర్ల్ ఫ్రెండ్. నేనిక్కడ జైల్లో మా ముగ్గురి ‘ఆర్థర్ రోడ్’ బర్త్డేల గురించి ఆలోచిస్తుంటే, మాల్యా అక్కడ బెయిల్లో తన గర్ల్ఫ్రెండ్ గ్రాండ్ బర్త్డే గిఫ్ట్ గురించి ప్లాన్ చేస్తున్నారు! -
ప్రజాస్వామ్యంలో ఏకతా శక్తి
ధార్మిక, సాంస్కృతిక, జ్ఞాన భూమి అయిన బిహార్లో గంగా, ఘాఘరా నదుల సంగమ స్థానాన ఉన్న సితాబ్ దియారా గ్రామంలో 1902 అక్టోబరు 11న జయప్రకాశ్ నారాయణ్ జన్మించారు. మనమంతా ఆత్మీయంగా జేపీ అని పిలుచుకునే జయ ప్రకాశ్ నారాయణ్... గొప్ప రాజ నీతిజ్ఞుడు, ప్రజాస్వామ్య రక్ష కుడు, ‘సంపూర్ణ క్రాంతి’ రూప శిల్పి. ‘లోక్ నాయక్’ బిరుదు ఆయనకు ఎవరో పెద్దలుఇచ్చింది కాదు... 1974 జూన్ 5న పట్నాలోని గాంధీ మైదా నంలో సమావేశమైన లక్షలాది ప్రజలు ప్రేమతో ఆయనను ‘లోక్ నాయక్’ అని పిలిచారు. రాజకీయ చేతనకు పునాది సితాబ్దియారాలో ప్రాథమిక విద్య అనంతరం పట్నా వెళ్లిన ఆయనను అక్కడి జాతీయవాద వాతావరణం ఆకట్టుకుంది. ఇంట ర్మీడియట్ చదువుతున్న రోజుల్లో దేశంలో బ్రిటిష్ ఆక్రమణవాదా నికి వ్యతిరేకంగా సాగుతున్న అహింసాయుత, సహాయ నిరాకరణో ద్యమం ఆయనపై అమితమైన ప్రభావం చూపింది. అమెరికాలో ఏడేళ్ల విద్యాభ్యాస సమయంలో మార్క్సిజం వైపు ఆకర్షితుడయ్యారు. దేశంలో సమస్యలన్నింటికీ మార్క్సిజమే పరి ష్కారం చూపుతుందని ఆ సమయంలో భావించారు. అయితే, భారత్కు తిరిగొచ్చిన తర్వాత ఈ దేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించే సాధ్యాసాధ్యాలను అన్వేషించిన అనంతరం... ‘ప్రజా స్వామ్య సామ్యవాదం’, ‘సర్వోదయ’ భావనలే ఇక్కడి సమస్యలకు పరిష్కారమన్న నిశ్చయానికి వచ్చారు. ఈ ఆచరణాత్మక దృక్పథమే జేపీ ఔచిత్యానికీ, రాజనీతిజ్ఞతకూ నిదర్శనం. శ్రమ విలువ తెలిసినవారు!వినోబా భావే భూదానోద్యమాన్నీ, సర్వోదయ తాత్వికతనూ మేళవిస్తే దేశంలోని భూ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారం లభిస్తుందని 1952లో జేపీ భావించారు. 1954–73 మధ్య కాలంలో ఆయన చేపట్టిన చంబల్ బందిపోట్ల పునరావాసం, అహింసాయుత సంపూర్ణ విప్లవం వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునూ, ప్రశంసలనూ పొందాయి. ‘శ్రమకు గౌరవం (డిగ్నిటీ ఆఫ్ లేబర్)’ అన్న భావనను జేపీ అర్థం చేసుకున్న తీరు కేవలం సైద్ధాంతికపరమైంది కాదు. స్వీయా నుభవాల నుంచి గ్రహించినదే. అమెరికాలో అభ్యసిస్తున్న రోజుల్లో ‘చదువుకుంటూనే సంపాదించుకోవడం’ ఆయనకు అలవడింది. ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న పనులు చేశారు. నిజాయతీగల శ్రమకు గౌరవం, న్యాయబద్ధమైన వేతనాలు, మానవీయ పని వాతా వరణం ఉండి తీరాలన్న ఆయన నిశ్చయాన్ని ఇవి మరింత బలో పేతం చేశాయి. కార్మిక వర్గ సంక్షేమమే న్యాయబద్ధమైన సమాజానికి పునాది అన్న దృఢమైన నిశ్చయంతో ఆయన భారత్కు వచ్చారు. ముఖ్యంగా 1947లో మూడు ముఖ్యమైన అఖిల భారత కార్మికసంఘాలు – అఖిల భారత రైల్వే సిబ్బంది సమాఖ్య, అఖిల భారత పోస్టుమెన్ – టెలిగ్రాఫ్ దిగువ స్థాయి సిబ్బంది సంఘం, అఖిల భారత ఆయుధ కర్మాగారాల కార్మికుల సంఘాలకు ఆయన అధ్య క్షుడిగా ఎన్నికయ్యారు.1960ల సమయంలో రుతుపవనాల వైఫల్యం బిహార్ను కరవు పరిస్థితిలోకి నెట్టింది. ఆ సమయంలో జేపీ తన భూదానోద్యమ సహచరులు, అనుచరులతో కలిసి ప్రజల బాధలను తగ్గించేందుకు సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. ‘బిహార్ రాహత్ కమిటీ’తో ఈ సమయంలోనే ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ‘దేశ సేవా దృక్పథా’న్ని ప్రత్యక్షంగా చూశారు. అది ఆయననెంతో ప్రభావితం చేసింది. నా అనుభవంజీవితంలో ప్రతి దశలోనూ అవినీతి సమస్యను ఎదుర్కొన్న జేపీ... భారతీయ సమాజ పునరుజ్జీవనం, పునర్నిర్మాణంలో భాగ స్వాములయ్యేలా దేశ యువతను ప్రేరేపించాల్సిన ఆవశ్యకతఉందని భావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్న తరుణంలో... ప్రజాస్వామ్య శక్తిపై వారిలో ఆశలనూ, నమ్మకాన్నీ పునరుద్ధరించారు. 1973లో వినోబా భావే పవనార్ ఆశ్రమం నుంచి ‘సంపూర్ణ విప్లవం’ దిశగా జేపీ స్పష్టంగా పిలుపు నిచ్చారు. ఆదర్శ మానవీయ సమాజాన్ని సాధించడమే ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమ లక్ష్యం. అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం గొంతె త్తిన ఆయన భావాలు నాటి రాజకీయాల్లో వేళ్లూనుకున్నాయి. ప్రజల్లో చైతన్యాన్ని రగల్చగల ఆయన సమర్థత, 1977లో దేశంలో ఓ కొత్త వ్యవస్థను నెలకొల్పే దిశగా వారి ఆగ్రహాన్ని ఆయన మళ్లించిన తీరు అనన్య సామాన్యం. 19 ఏళ్ల యువకుడిగా కోయంబత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్ర టరీగా ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమంలో భాగస్వామినయ్యే అవకాశం దక్కడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఈ దశలో, దేశ చరిత్రలో అత్యంత కీలక సమయంలో నేను నేర్చుకున్న విషయాలు యువ కుడిగా ఉన్న నన్ను... ఆత్మవిశ్వాసంతో కూడిన, సామాజిక అవగా హన కలిగిన నాయకుడిగా తీర్చిదిద్దాయి.మన ప్రియతమ నేత జయప్రకాశ్ నారాయణ్ను ప్రేమగా గుర్తు చేసుకుంటున్న మనం... దేశ స్వాతంత్య్రోద్యమం కోసం నిస్వార్థంగా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన ఆయన జీవిత భాగస్వామి ప్రభావతీ దేవినీ మరవకూడదు. గాంధీ ఆదర్శాల సాధన కోసం నిస్వార్థంగా ఆమె తన శక్తినంతా వెచ్చించారు.జేపీ వారసత్వం 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నుంచి 1970లో చేపట్టిన ‘సంపూర్ణ క్రాంతి’ దాకా... దేశం పట్ల ఉన్న ప్రేమ భావనే ఆయనను నిరంతరం ముందుకు నడిపింది. ప్రభుత్వంలో తనకు నచ్చిన పదవిని పొందే అవకాశం దొరికినప్పటికీ, అధికార వ్యామోహానికి ఆయనెప్పుడూ లొంగలేదు. నిస్వార్థ దేశసేవకే కట్టుబడి ఉన్నారు. ఎంత కఠినమైన సవాళ్లు ఎదురైనా, ప్రజలు తలచుకుంటే మార్పును తేగలరని చెప్పడానికి జేపీ జీవితం, బోధనలు నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటూనే – సమానత్వం, న్యాయం, శాంతి నెలకొని ఉన్న సమాజాన్ని నిర్మించాలన్నది ఆయన బోధనల సారాంశం. సామాజిక, ఆర్థిక న్యాయమూ, రాజకీయ స్వేచ్ఛ విడదీయలేనివని ప్రకటించిన దార్శనిక నాయకుడాయన. విప్లవమంటే హింస అని భావించే అవకాశం ఉంది. కానీ, జేపీ చేపట్టిన సంపూర్ణ విప్లవానికి అహింసే ప్రాతిపదిక. అహింసాయుత ప్రజా ఉద్యమం ద్వారా... వ్యవస్థాగతంగానూ, సామాజికంగానూ మానవత, నైతికత విలువల ఆధారంగా భారత పురోగమనానికి ఆయన పునాది వేశారు. జాగరూకులమై, నిస్వార్థం, సేవ, సత్యసంధతతో భారత అభ్యున్నతికి కృషి చేయడమే మనం ‘భారతరత్న’ జేపీకి అందించే నిజమైన నివాళి.-సి.పి. రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి -
ముళ్లదారిలో ఒక ముందడుగు
గాజాలో ‘శాంతి సాధన’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రణాళికలో ‘మొదటి దశ’ అమలుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించినట్లు 8వ తేదీ రాత్రి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనను హమాస్, ఇజ్రాయెల్ వెంటనే ధ్రువీకరించాయి. అది స్థూలమైన అంగీకారం. అమలు ఏ విధంగా అనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. యథాతథంగా ఈ మొదటి దశ అనే దానిలో కాల్పుల విరమణతో పాటు రెండు అంశాలున్నాయి. ఒకటి – ఇజ్రాయెలీ బందీలను హమాస్, వారి ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయటం. రెండు – ఇజ్రాయెలీ సేనలు ‘అంగీకృతమైన’ (అగ్రీడ్ అపాన్) రేఖ వద్దకు ఉపసంహరించుకోవటం. ఈ రెండు అంశాల అమలు ఎంత సాఫీగా జరగవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం. కాగా, రెండేళ్ళుగా సాగుతున్న గాజా మారణహోమంలో ఇపుడందరూ కొంత ఊపిరి తీసుకోగలరని మాత్రం చెప్పవచ్చు.ఏది అంగీకృత రేఖ?సరిగా రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్పై దాడి జరిపిన హమాస్, 250 మందిని బందీలుగా పట్టుకుంది. వారిలో ప్రస్తుతం సజీవులుగా 20 మంది, మృతదేహాల రూపంలో 28 మంది ఉన్నట్లు అంచనా. ఇజ్రా యెల్ వద్ద 250 మంది పాలస్తీనియన్లు జీవిత ఖైదీలుగా, సుమారు 1,300 మంది యుద్ధ ఖైదీలుగా ఉన్నట్లు చెప్తున్నారు. రెడ్ క్రాస్ ద్వారానో, మరొక విధంగానో వీరందరి విడుదలకు సమస్య ఉండక పోవచ్చు. కానీ, రెండవ అంశమైన ఇజ్రాయెలీ సేనల ఉపసంహరణ విషయం తేలటం తేలిక కాదు. ‘అంగీకృత రేఖ’ వద్దకు మాత్రమే పాక్షిక ఉపసంహరణ అన్నది ట్రంప్ ప్రణాళికలో గల అంశం కాగా, బందీలను తాము విడుదల చేయగానే పూర్తి ఉపసంహరణ జరగా లని హమాస్ షరతు పెడుతూ వచ్చింది. ఆ షరతును హమాస్ ఇప్పుడు సడలించిందా? ఏ విధంగా? ‘అంగీకృత రేఖ’ అర్థం పర స్పర అంగీకారమనా? లేక ట్రంప్, నెతన్యాహూల మధ్య అంగీ కారమా?ఇందులో ‘అంగీకృత రేఖ’ అనే మాట గురించిన సందేహాలు అనవసరమైనవిగా తోచవచ్చు. కానీ, ట్రంప్ 20 సూత్రాల ప్రణా ళికను ఎవరితోనూ సంప్రతించకుండా ట్రంప్, నెతన్యాహూల మధ్య రూపొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటే, ఈ సందేహాలు సహేతు కమైన వని అర్థమవుతుంది. పైగా, మొదట తాము ట్రంప్కు చేసిన సూచనలను ట్రంప్, నెతన్యాహూ సమావేశం దరిమిలా మార్చివేశా రని అరబ్ నాయకులు బహిరంగంగా ఆరోపించటం కూడా గమనించదగ్గది. ‘అంగీకృత రేఖ’ అన్నది రాగల రోజులలో ఏ విధంగా ‘పరస్పర అంగీకృతం’ అయే రీతిలో రూపొందగలదో చూడవలసి ఉంటుంది.ఆయుధాలు వదిలేస్తారా?కాల్పుల విరమణ జరిగిన అనేక సందర్భాలలో ఏవో కారణా లతో ఏదో ఒక పక్షమో, ఇరుపక్షాలో ఉల్లంఘనలకు పాల్పడటం సర్వసాధారణం. ఇజ్రాయెల్కు సంబంధించి వారు లెబనాన్, సిరియా, గోలన్ కనుమలు, జోర్డాన్ ప్రాంతాలలో చేస్తున్నది అదే. అందువల్ల, గాజాలో ఉపసంహరణను పర్యవేక్షించేది, ‘అంగీకృత రేఖ’ వద్దకు ఉపసంహరణ తర్వాత నియంత్రించేది ఎవరో ఇంకా సూచనలు లేవు. గాజా సమస్య కేవలం గాజాకు పరిమితమైనది కాదు. వెస్ట్ బ్యాంక్తో కలిపి మొత్తం పాలస్తీనా దేశం ఏర్పాటుకు సంబంధించినది. ఇప్పటికే 150 దేశాలు గుర్తించినప్పటికీ కేవలం ఇజ్రాయెల్ కోసమని అమెరికన్లు భద్రతా సమితిలో పదే పదే వీటో చేస్తున్న తమ విధానాన్ని మార్చుకుని, రెండు స్వతంత్ర దేశ వ్యవస్థలు ఏర్పడే వరకు ఈ సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఈ విషయమై ట్రంప్ 20 సూత్రాలలో అస్పష్టతలు, వంచనా కళలు తప్ప నిజా యతీ లేదు. గాజాకు సంబంధించి పాలస్తీనియన్లు, అరబ్బుల ఆలో చనలు ఒక విధంగా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ ఆలోచనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకొనేముందు... బందీలు, ఖైదీల విడుదల, అంగీకృత రేఖ వద్దకు సేనల ఉపసంహరణతో పాటుగా ఆ వెంటనే ముందుకు రాగల అంశాలేమిటో చూద్దాం. వాటిలో మొదటిది గాజా పౌరులకు సహాయం చేరటం. రెండవది హమాస్ నిరాయుధీకరణ. ఈ అంశాలు 20 అంశాలలో చేరి ఉన్నాయి గానీ, 8వ తేదీన ట్రంప్ చేసిన ప్రకటనలో లేవు. ఈజిప్టులో చర్చలు కొనసాగుతున్నందున సహజంగానే ముందుకు వస్తాయి. ఇందులో సహాయాల సరఫరాకు కూడా ఇంతకాలం ఆటంకాలు కల్పించిన ఇజ్రాయెల్, ఆ సహాయం హమాస్కు చేరుతున్నదనే వాదనలు చేసింది. సరఫరాలపై తమకు పూర్తి నియంత్రణ ఉండా లన్నది. ఇది పరిష్కారం కావలసి ఉన్న విషయం. హమాస్ నిరాయుధీకరణ జరిగి తీరాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ల పట్టు దల కాగా, స్వతంత్ర పాలస్తీనాకు మార్గం సుగమం అయ్యే వరకు ఆ పని చేయబోమని హమాస్ ప్రకటిస్తున్నది. కాకపోతే, గాజాలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వాములం కాబోమని సూచించింది. అయితే, పాక్షిక నిరాయుధీకరణ కోసం ఒప్పించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారన్నవి 9వ తేదీ నాటి వార్తలు. పాక్షిక మంటే ఏమిటో, హమాస్ నిర్ణయమేమిటో తెలియాలి.ధూర్త ఆలోచనఇవి రెండవ దశగా భావిస్తే, ట్రంప్ ప్రణాళికలోని తక్కినవన్నీ మహా సమస్యాత్మకమైనవి. ఒక్క మాటలో చెప్పాలంటే, స్వతంత్ర పాలస్తీనా అన్నదే లేకుండా ఆ రెండు భూభాగాలు తమ అధీనంలోకి రావాలన్నది అమెరికా, ఇజ్రాయెల్లకు ఈ రోజు వరకు కూడా ఉన్న పథకం కాగా, అందుకు ససేమిరా అన్నది పాలస్తీనియన్ల చరిత్రాత్మకమైన జాతిపరమైన ఆకాంక్ష. ట్రంప్ 20 సూత్రాలలో హమాస్ సంపూర్ణ నిరాయుధీకరణ, వారి రక్షణ వ్యవస్థలన్నింటి విధ్వంసం, ఆ సంస్థ కొత్త ప్రభుత్వంలో పాల్గొనకపోవటం, గాజాను డీ–ర్యాడికలైజ్ చేయటం, గాజా పరిపాలనకు బయటి వారితో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, అమెరికా ఆధ్వర్యంలో రక్షణ బలాలు, గాజాను సెజ్గా మార్చి, బయటివారే అభివృద్ధి ప్రణాళికలు రచించి, బయటి నిధులతో అభివృద్ధి పరచటం వంటివి ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనా అథారిటీ తాము ఆశించిన విధంగా ‘తనను తాను పూర్తిగా సంస్కరించుకున్న పక్షంలో’ స్వీయ నిర్ణయాధికారం, పాలస్తీనా ఏర్పాటు విషయాలు అపుడు ఆలోచిస్తారు. ఇదెంత ముళ్ల దారో, ధూర్తమైనదో స్పష్టంగా కనిపిస్తున్నదే!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ప్రజాభీష్టాన్ని పట్టించుకోవాలి!
స్వతంత్ర భారతదేశం పలు పునర్విభజనలతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడటాన్ని చూసింది. ఈ మార్పులు దేశంలోని బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సంక్లిష్టతలను ప్రతి బింబింపజేశాయి. లద్దాఖ్లో ప్రస్తుతం కనిపిస్తున్న అశాంతి, సార్వభౌమాధి కారాన్ని పంచుకునేందుకు చేస్తున్న సాధారణ వక్కాణింపు కాదు. వారు స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తున్నారు. జమ్ము–కశ్మీర్ను విభజించిన తర్వాత, 2019లో లద్దాఖ్కు కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) హోదా కల్పించారు. అయితే, తమ హక్కుల పరిరక్షణను కోరుతూ లద్దాఖీయులు 2021 డిసెంబర్లో తిరిగి వీధులకెక్కారు. లద్దాఖ్ ఎందుకు కీలకం?లద్దాఖ్ ఒక శీతల ఎడారి. దాని గణనీయమైన ప్రాంతం చైనా, పాకిస్తాన్ల ఆక్రమణలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణరంగం సియాచిన్ హిమనదం ఈ ప్రాంతం లోనిదే. వ్యూహ పరంగా లద్దాఖ్కు ఉన్న ప్రాధాన్యం, పొరుగునున్న రెండు శత్రు దేశాల ఉనికి వల్ల భారత్ అప్రమత్తంగా మెలగుతూ, అక్కడ సత్పరి పాలనకు బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి అవకాశాలను తగినంతగా పెంపొందించే విధంగా దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంద కపోతే, ఆ ప్రాంత పౌరుల్లో అసంతృప్తి, అశాంతి కొనసాగుతూనే ఉంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశపు భద్రతను, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది విఘాతంగా పరిణమించవచ్చు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయటడంలో లద్దాఖ్ నైసర్గిక స్వరూపం అధికారులకు సవాల్గా పరిణమిస్తోంది. లద్దాఖ్ ఇంత సంక్లిష్టమైనదిగా మారడానికి చారిత్రక కారణాలున్నాయి. డోగ్రా రాజు గులాబ్ సింగ్కు చెందిన సేనాపతి జోరావర్ సింగ్ 1834 –35లో ఈ ప్రాంతాన్ని జయించారు. జమ్ము–కశ్మీర్ అంశం వివాదంగా మారినపుడు, ఆ పెద్ద వివాదంలో లద్దాఖ్ చిక్కుకుంది. భారత సైన్యం 1947లో ప్రతిదాడులు చేపట్టి, ద్రాస్, కార్గిల్, లేహ్ల నుంచి చొరబాటుదారులను తరిమేయడంతో, జమ్ము–కశ్మీర్లోని మూడు పాలిత విభాగాల్లో లద్దాఖ్ ఒకటిగా రూపుదాల్చింది.నిరసనలకు కారణాలులద్దాఖ్ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. పేలవమైన ఆరోగ్య సేవలతో మరణాల రేటు అధికంగా ఉంటూ వచ్చింది. ఉపాధి అవకాశాలు వ్యవసాయానికి, ప్రభుత్వ రంగానికి, చాలా కాలం తర్వాత టూరిజానికి పరిమితమయ్యాయి. దాంతో ప్రభుత్వంపై లద్దాఖ్కు పేచీ తలెత్తింది. తమ సొంత ప్రతినిధుల చేతిలో అధికారం ఉంటేనే, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో నిరసనలు తలెత్తడం ఆశ్చర్యం కలిగించలేదు. అవి లేహ్, కార్గిల్లను ఏకం చేశాయి. ఇంజినీర్, విద్యావేత్త, గాంధేయవాది అయిన సోనమ్ వాంగ్చుక్ నాయకత్వ పాత్రను ధరించారు. వాంగ్చుక్ నూతన తరహా పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రూపొందడంతో, ఆయన ఇదివరకే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిరాహార దీక్షకు కూర్చుని, శ్రేయోభిలాషుల సలహా మేరకు, 21 రోజుల తర్వాత దాన్ని విరమించుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇసుమంత కూడా మార్చుకోలేదు. ఆయన గత నెలలోనూ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేహ్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడంతో, మళ్ళీ విరమించుకున్నారు. తదనంతరం, ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జోధ్పూర్ జైలుకు తరలించారు. చర్చలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. కానీ, ఆ ప్రక్రియలో వాంగ్చుక్కు పాత్ర కల్పించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వాంగ్చుక్ కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ హోదా, లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ల విషయంలో లేహ్ అపెక్స్ బాడీకి, కార్గిల్ డెమొక్రాటిక్ అలయ¯Œ ్సకు తన మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్ర హోదా వచ్చేనా?జమ్ము–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నపుడు లద్దాఖ్ నుంచి శాసన సభలో నలుగురు సభ్యులు, ఒక లోక్సభ సభ్యుడు ఉండే వారు. ఈ ప్రాతినిధ్యం తగినంతగా లేదనే భావన అప్పుడూ ఉంది. ఈ ప్రాంతం, ప్రజల పట్ల అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామిక, ప్రాతినిధ్య పరిపాలనను పటిష్ఠ పరచేందుకు లేహ్కు (1995లో), కార్గిల్కు (2003లో) లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళను జమ్ము– కశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. కానీ, ఇది క్షేత్ర స్థాయిలో పరిస్థితులలో మార్పు వచ్చేందుకు తోడ్పడలేకపోయింది. 2019 ఆగస్టు 5న, 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో కేంద్రపాలిత ప్రాంత హోదా డిమాండ్ నెరవేరిందికానీ, అవకాశా లను అది పరిమితం చేసింది. పాలనా యంత్రాంగంలోకి తీసుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటిదేమీ లేకపోవడం వల్ల కేంద్ర పాలిత హోదా ఎక్కువ ఉద్యోగావకాశాలను చూపలేకపోయింది. దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్ వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. యూటీ అనిపించుకున్నా వనరులపై హక్కులు ఉండవు కనుక, అది రాష్ట్ర హోదాను కోరుకుంటోంది. అధికార కేంద్రీకరణకు మొగ్గు చూపే బీజేపీ కేంద్రంలో గద్దెపై ఉండటం వల్ల, రాష్ట్ర హోదా మంజూరు కుదిరే పని కాదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుందనీ, బయటి ప్రాంతాల కార్మికులు ఉన్న కొద్ది పాటి అవకాశాలను ఎగరేసుకుపోతారనీ ఈ ప్రాంతంలో భయాందో ళనలు ఉన్నాయి. అందుకే, తమను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యులులో చేర్చాలనీ, రాష్ట్ర హోదా కల్పించాలనీ అడుగుతున్నారు. లద్దాఖ్కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంట్ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్య పెంపునకు పురిగొల్పే విధంగా ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని లద్దాఖ్ ప్రజానీకం చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదే!అజయ్ కె. మెహ్రావ్యాసకర్త ‘సెంటర్ ఫర్ మల్టీ లెవెల్ ఫెడరలిజం’లోవిజిటింగ్ సీనియర్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఊహకందని అంచనాలతో ఉత్కంఠ!
పండుగల సమయంలోనూ బిహార్ రాజకీయాలలో మునిగితేలుతుంది. బిహా రీలకు రాజకీయాలకు మించిన కాలక్షేపం లేదు. బిహార్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగ నున్న నేపథ్యంలో ఎన్నికల పండుగ మొద లైపోయింది. నితీశ్ కుమార్ ఎక్కడుంటే అధికారం అక్కడేనని గడిచిన రెండు దశాబ్దాలలో బిహార్లో ఒక కొత్త నానుడి రూపుదిద్దు కుంది. పొత్తు పెట్టుకున్న పార్టీలను దూరం పెట్టేదిగా బీజేపీ పేరు మోసినప్పటికీ, రాష్ట్రంలో అది జూనియర్ భాగస్వామిగా సంతృప్తి పడటానికి బహుశా అదే కారణం. నితీశ్ నేతృత్వంలోని జేడీ (యు)తో పొత్తు పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నాయక త్వంలోని ఆర్జేడీ కూడా అదే రకమైన సంకట స్థితిని ఎదుర్కొంది.నితీశ్ సరసన లేని ఏ పార్టీ అయినా, ఆయనపై విషం చిమ్మడం ఖాయం. అయినప్పటికీ, ఆయనతో అంటకాగాలని రహస్యంగా కోరుకుంటాయి. లాలూ 2022లో నితీశ్తో చేతులు కలపడానికి ఇదే కారణం. 2017లో చీలిక చేదును మిగిల్చినా లాలూ దాన్ని దిగ మింగుకోవాల్సి వచ్చింది. మహాఘట్ బంధన్ రెండు విడతల హయాంలో నితీశ్తో ఎన్నడూ పొత్తు పెట్టుకోమని బీజేపీ నాయ కులు బాహాటంగా ప్రతిన బూనారు. కానీ తమ ‘సహజ భాగ స్వామి’తో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. నితీశ్ బలాబలాలుగతంలో బిహార్లో ఎన్నికల విజయాన్ని నితీశ్ ఎలా సొంతం చేసుకున్నట్లు? నితీశ్ 2005లో బిహార్ సీఎం అయినపుడు తన శక్తి యుక్తులన్నింటినీ శాంతి భద్రతల నిర్వహణపై కేంద్రీకరించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా, విద్యా రంగాలు మెరుగుపడ్డాయి. స్కూళ్ళలో అడ్మిషన్లను, హాజరును పెంపొందించేందుకు ఆయన 2006లో ‘స్కూల్ చలో అభియాన్’ ప్రారంభించారు. బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అలా 2005లో ఒక మౌన విప్లవం మొదలైంది. రాష్ట్రంలో 2005లో కేవలం 1.8 లక్షల మంది బాలికలు 10వ తరగతి పరీక్షకు కూర్చుంటే, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయ బోతున్న 15.85 లక్షల మంది విద్యార్థులలో సగంపైగా బాలికలే. ప్రతి ఒక్కరికీ ఇల్లు, తాగునీటి సదుపాయం కార్యక్రమాన్ని నితీశే మొదట ప్రారంభించారు. కానీ, అంతగా సఫలీకృతులు కాలేక పోయారు. రాష్ట్రం నుంచి జనం ఇప్పటికీ వలస పోతూనే ఉన్నారు. అనేక మానవ, అభివృద్ధి సూచికలలో బిహార్ అట్టడుగున ఉంది. నితీశ్ మూడవ, నాల్గవ విడత పాలన అనేక కారణాల రీత్యా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి నితీశ్ వివిధ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య స్థితి కూడా నిశిత పరిశీలనకు గురవుతోంది. ఈ కారణంగానే, ఈసారి నితీశ్ ప్రభుత్వం కోటి మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున నగదు జమ చేసింది. రకరకాల రాయితీలను, వరాలను ప్రకటించింది. తేజస్వి ప్లస్ కూటమినితీశ్ ప్రధాన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, గత ఎన్నికల్లో అద్భు తమైన ఫలితాలు సాధించారు. ఆయన మహాఘట్ బంధన్ కేవలం 16,825 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్, వామ పక్షాలు ఇప్పటికీ ఆయనకే మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్ల పునాదికి కోత పడినప్పటికీ, రాహుల్ గాంధీ తన యాత్రలో తేజస్విని పటిష్ఠపరచేందుకు ప్రయత్నించారు. మొత్తం ప్రతిపక్షమంతా తేజస్వి వెనుకనే నిలిచిందని చాటేందుకు దీపాంకర్ భట్టాచార్య (వామపక్షం), అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), సంజయ్ రౌత్ (శివసేన), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సొరేన్ (జేఎంఎం), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్) ఆయన యాత్రలో పాల్గొన్నారు. అయితే, ఆయన సహచరుల,సొంత కుటుంబ సభ్యుల మితిమీరిన ఆశలు పెను సవాలును విసురుతున్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కొత్త ఓటర్ల జాబితా 69 లక్షల ఓటర్ల తొలగింపును, 21 లక్షల మంది పేర్ల కొత్త జోడింపును చవి చూసింది. మహాఘట్ బంధన్ కొన్ని నెలలుగా దాన్నొక రాజకీయ అంశంగా మారుస్తూ వస్తోంది. సీట్ల పంపకంపై ప్రస్తుతం మహా ఘట్ బంధన్లో బురద జల్లుకునే కార్యక్రమం సాగుతోంది. ఇది ప్రతిసారీ కనిపించేదే. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలసి పోటీ చేయడం మాత్రం ఖాయం. పీకే ప్రభావంప్రశాంత్ కిశోర్, ఆయన ‘జన్ సురాజ్’ పార్టీ మరో ప్రభావిత అంశం కానుంది. ఆయన గతంలో, 2014 ఎన్నికలకు ముందు బీజేపీకి ఎన్నికల నిర్వహణ సేవలందించారు. తదనంతరం,కాంగ్రెస్, వైసీపీ, తృణమూల్, ఆప్, డీఎంకేలతో పాటు, చివరకు నితీశ్ కుమార్కు కూడా సేవలందించారు. రాష్ట్రంలో ఈ విడత ఎన్నికల సందర్భంగా, ప్రతి జిల్లాలోనూ ప్రశాంత్ కిశోర్ పాదయాత్రలు చేశారు. గత ఏడాదిగా ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ప్రజలతో నేరుగా సంభాషించారు. రాత్రిపూట గ్రామాల్లోనే బస చేశారు. నితీశ్, బీజేపీ, ఆర్జేడీలపై సమానంగా విమర్శలు గుప్పించారు. ఆయన పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన పార్టీకి నిధుల కొరత కూడా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో కింగ్ మేకర్గా మారతారా? విజ యానికి పెద్ద సంఖ్యలో జన వాహినులు, ఆకర్షణీయమైన నినా దాలు అవసరమేగానీ, అవి విజయానికి పూచీ నివ్వలేవు. బీజేపీ గురించి కూడా ముచ్చటించుకుందాం. ఈ కాషాయ పార్టీకి అద్భుతమైన సంస్థాగత బలం ఉంది. కుల సమీకరణలు కూడా దానివైపు పటిష్ఠంగా ఉన్నాయి. జేడీ(యు)తోపాటు, చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయేను తిరుగులేని కూటమిగా నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో, జేడీ (యు)తో పోల్చుకుంటే బీజేపీ రెట్టింపు సీట్లకు పైగా గెలుచుకున్నా, ముఖ్యమంత్రిగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టలేదు. విశ్వస నీయమైన ముఖం ఏదీ లేకపోవడం దాని బలహీనత. ఈ అంశంపై ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లోనైనా ఆ పార్టీ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. బిహార్ ఒక ఆసక్తికరమైన దశలోకి అడుగిడుతోంది. చివరి నిమిషం వరకు అంతిమ ఫలితం నిర్ణయం కాదని గత అసెంబ్లీ ఎన్నికలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంరంభపు హడావిడి సద్దుమణగి,అంతిమ సంఖ్యా బలాలు వెల్లడైన తర్వాత, అసలు క్రీడ ఆరంభం కాబోతోంది. శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
'ఇష్టం ఉంటే' కష్టం ఉండదు!
కొత్తగా పట్టభద్రులైన వారికి అభినందనలు. ప్రత్యక్షంగా మీ ముందు లేకుండా, ఇలా ఇంటి నుంచి వర్చ్యువల్ ప్రసంగం చేస్తా నని నేను ఊహించలేదు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆశావహ దృక్ప థంతో మెలగడం కష్టమే! కానీ, మీరు మరింత శక్తిమంతులుగా, ఉన్నతు లుగా నిరూపించుకోగలరనడంలో సందేహం లేదు. ఎందు కంటే, మీకంటే ముందు చాలా మంది దాన్ని రుజువు చేశారు. వందేళ్ళ క్రితం, 1920లో స్పానిష్ ఫ్లూ సమయంలోనూ కొందరు పట్టభద్రులుగా బయటకు వచ్చారు. అప్పటికి యాభై ఏళ్ళ తర్వాత, 1970లో వియత్నాం యుద్ధ కాలంలోనూ గ్రాడ్యుయేట్లు అయినవారున్నారు. అంతెందుకు, సెప్టెంబర్ 11 ఘటనకు కొద్ది నెలల ముందు 2001లో చదువు పూర్తి చేసుకుని యూనివర్సిటీల నుంచి బయటకొచ్చినవారు లేరా? మహమ్మారులను, యుద్ధాలను, ఇతర సంక్షోభాలను దాటుకుని వచ్చినవారు ఎందరో ఉన్నారు. వారు కొత్త సవాళ్ళను అనేకం ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని సంద ర్భాలలోనూ వారు విజయులుగా నిలిచారు. ఆశావాదంతో బతకమని మన సుదీర్ఘ చరిత్ర చాటుతోంది. ఆశావహులై ఉండండి. వర్తమానంలోని ప్రతి తరం, తమ తర్వాత రాబోయే తరం గురించి తక్కువ అంచనా వేసే విచిత్ర ధోరణిని నేను గమనించాను. ఒక తరం సాధించిన ప్రగతి తదుపరి తరానికి పునాది అవుతుందని గ్రహించ లేకపోవడమే దానికి కారణం. కొత్త వ్యక్తుల సమూహం అన్నింటినీ సాధ్యం చేసి చూపిస్తుంది. మీ అనన్యమైన దృక్పథం ఇంతవరకు ఊహించని వాటిని కూడా మన ముందుకు తేవచ్చు. టెక్నాలజీలో పుట్టిన తరంటెక్నాలజీ అంతగా అందుబాటులో లేని కాలంలో పెరిగి పెద్దవాడినయ్యాను. నాకు పదేళ్ళు వచ్చేదాకా నేను టెలిఫోన్ ముఖమే చూడలేదు. చదువుకునేందుకు అమెరికా వచ్చిన తర్వాతనే కంప్యూటర్ను రోజూ వాడుకోవడం కుదిరింది. పాత రోజుల్లోకి వెళితే, ఎంతో కాలానికి ఇంటికొచ్చిన టెలివిజన్లో ఒకే ఛానల్ ఉండేది. మీకిపుడు రకరకాల ఆకృతుల్లో, పరిమాణాల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా, దేని గురించైనా కంప్యూటర్ను అడగగలిగే సామర్థ్యం మీకిపుడు ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ, అటువంటి సామర్థ్యాన్ని నిర్మించడంపైనే నేను ఓ దశాబ్ద కాలం పనిచేశాను. మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోను. ఈ రకమైన ప్రగతి నన్ను మరింత ఆశావహుడిని చేస్తుంది. టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాలు మిమ్మల్ని బహుశా నిస్పృహకూ, అసహనానికీ లోనుచేస్తూ ఉండవచ్చు. ఆ అసహనాన్ని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే, అదే కొత్త టెక్నాలజీ విప్లవాన్ని సృష్టిస్తుంది. నా తరం కలలుకనే సాహసం చేయలేనివాటిని మీరు తయారు చేసి చూపించగలరు. వాతావరణ మార్పు లేదా విద్యా రంగ సమస్యల పట్ల మా వైఖరి కూడా మిమ్మల్ని నిస్పృహకు గురిచేసి ఉండవచ్చు. అసహనంతోనే మెలగండి. అది ప్రపంచానికి అవసర మైన ప్రగతిని సృష్టిస్తుంది. పరిస్థితులను మార్చాలి, ఏదో చేయాలి అనే తపన నవీకరణలకు దారితీసి, ప్రపంచానికి కొత్త రూపురేఖలను సంతరిస్తుంది. టెక్నాలజీ మన కుటుంబాలకు ఎంతగా అందుబాటు లోకి వస్తే, మన జీవితాలు అంతగా మెరుగవుతాయి. మెరుగైన సెమీకండక్టర్లను తయారు చేయడం ద్వారా ఆ పని చేయగలనని నేను గ్రాడ్యుయేట్ని అయినపుడు భావించాను.అప్పటికి అంతకన్నా ఉత్తేజకరమైన అంశం ఏముంది? నేను అమెరికా రావడం కోసం విమాన టికెట్కు మా నాన్న ఒక ఏడాది జీతాన్ని వెచ్చించవలసి వచ్చింది. ఇంటికి ఫోన్ చేసేందుకు నిమి షానికి 2 డాలర్లకు పైగా ఖర్చయ్యేవి. బ్యాక్ ప్యాక్ కొనేందుకు కూడా ఇండియాలో మా నాన్నకు వచ్చే ఒక నెల జీతం అంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అందరి కోసం టెక్నాలజీనేను స్టాన్ఫోర్డ్లో చేరిన ఏడాదే ఇంటర్నెట్ రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది. అదే ఏడాది మొజాయిక్ బ్రౌజర్ విడుదలైంది. అది వరల్డ్ వైడ్ వెబ్, ఇంటర్నెట్లను ప్రాచుర్యంలోకి తెచ్చింది. టెక్నాలజీని మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ నెట్ ఏకైక ఉత్తమ మార్గం అవుతుందని నాకు అప్పటికింకా తెలియలేదు. ఆ సంగతి గ్రహించాక, గూగుల్లో నేను నా కలలను సాకారం చేసుకునే పనికి ఉద్యమించాను. నా నేతృత్వంలో సాగిన కృషితో 2009లో క్రోమ్ మొదలైంది. సరసమైన ధరలకు ల్యాప్ టాప్లను, ఫోన్లను అందించడంలో గూగుల్ చేసిన కృషికి సహాయపడ్డాను. గ్రాడ్యుయేషన్ తర్వాత పీహెచ్డీ చేసివుంటే అమ్మ, నాన్న గర్వపడేవారే. కానీ, టెక్నాలజీ ప్రయోజనాలను అనేకమందికి అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడిని. గూగుల్ సీఈఓగా ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడగలిగి ఉండేవాడిని కాదు. మీదైన రీతిలో ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చండి. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని, మీదైన విశిష్టమైన మార్గంలో సాను కూల ప్రభావాన్ని చూపేందుకు, దాన్ని వినియోగించుకోండి. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో 27 ఏళ్ళ క్రితం మొదటిసారి అడుగిడి నపుడు ఇవేవీ నా ఊహల్లో లేవు. అదృష్టంతోపాటు టెక్నాలజీ పట్ల గాఢమైన వ్యామోహం, విశాల దృష్టితో వ్యవహరించడం నన్నిక్క డకు తీసుకొచ్చాయి. అసహనమూ మంచిదే!ప్రపంచంలో మిగిలిన వాటన్నింటి కన్నా మిమ్మల్ని ఏది ఎక్కువ ఉత్తేజపరుస్తోందో దాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మీ తల్లితండ్రులు చెప్పారని లేదా మీ స్నేహితులు చేస్తున్నారని లేదా సమాజం మీ నుంచి ఆశిస్తోందనే కారణంతో మీకిష్టం లేని పనుల్లోకి దిగకండి. ఊహించని దారులు గణనీయమైన ప్రభావానికి దారితీస్తాయి. ఎంచుకున్న రంగం ఇష్టమైనదైతే మనసు పెట్టి పనిచేయగలుగుతారు. అదృష్టం, పరిస్థితుల కన్నా, మీ వ్యామోహమే మిమ్మల్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా పనిచేస్తుంది. అది మీ గమనాన్ని తీర్చిదిద్ది, కలకాలం నిలవగల వారసత్వాన్ని మిగల్చగలుగుతుంది. దేనినైనా అక్కున చేర్చుకునేందుకు సిద్ధ్దంగా ఉండండి. ఉన్న వాటిని ఇంకా మెరుగుపరచాలనే అసహనంతోనే వ్యవహరించండి. ఆశావహ దృక్పథాన్ని వీడవద్దు. ఇదే నేనిచ్చే సలహా. మీరు ఆ పని చేయగలిగితే చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అన్నింటినీ మార్చగలిగిన అవకాశం మీకుంది. మీరు మారుస్తారనే నమ్మకం కూడా నాకుంది! -
ఒక తల్లి – ఆమె కూతురు
అరుంధతీ రాయ్ తన పేరులోని ‘ఫస్ట్ నేమ్’ వదులుకున్నారని మీకు తెలుసా? 18 ఏళ్లప్పుడు ‘‘నా మొదటి పేరు సుజానాను వదిలేసుకున్నాను. అప్పట్నుంచీ క్రమంగా, ఉద్దేశపూర్వకంగా, వేరెవరి మాదిరిగానో రూపాంతరం చెందుతూ వచ్చాను’’ అని తన తాజా పుస్తకంలో వెల్లడించారు. ‘మదర్ మేరీ కమ్స్ టు మి’లో ఆమె ఇలాంటి ఇంకా అనేక చిరు జ్ఞాపకాలను పంచుకున్నారు. మత్తుమందు లేకుండా గర్భస్రావం చేయించుకున్న సంగతి మన దృష్టిని ఆకర్షించే మరో దృష్టాంతం. అప్పటికి ఆమెకు ఇరవై రెండేళ్ళు. ‘‘అది భయంకరం. కానీ, అలా జరిగిపోయిందంతే’’ అని రాశారు. అదే రోజు రాత్రి ఆమె మరుసటి రోజు షూటింగ్లో పాల్గొనేందుకు హోశంగాబాద్ నుంచి పంచ్మఢీ వెళ్ళే రైలు ఎక్కేశారు. తల్లి మేరీ రాయ్తో ఆమెకు పడేది కాదు. ఈ పుస్తకం పాక్షికంగా ఆ సంగతులనూ, అరుంధతి జీవితంలోని వివిధ దశల్లోని ఆత్మా నుగత వివరాలనూ వెల్లడిస్తుంది. అవి తరచూ కలతకు గురి చేస్తాయి. అరుంధతి తన తల్లిని ‘శ్రీమతి రాయ్’ అనే సంబోధిస్తూ వచ్చారు. పుస్తకం వెనుక వైపు అట్టలో ఆమెను ‘బందిపోటు’ అని పేర్కొన్నారు. కానీ, ఈ పుస్తకం చదువుతూంటే ఆమె నాకు రాక్షసిగానే తోచారు. అరుంధతికి ఆరేళ్లున్నప్పుడు మొదటిసారి విమాన ప్రయాణంలో ‘‘అమ్మా! పిన్ని నీలాగా కాకుండా అంత సన్నగా ఉంటుంది ఎందుకని?’’ అని ప్రశ్నించడం ద్వారా తల్లికి చిర్రెత్తుకొచ్చేటట్లు చేసింది. ఆ ప్రశ్నకు ఆవిడ ఎంతగా కోప్పడిందంటే, అరుంధతి దానికి భయపడి విమానం కూలిపోవాలని కోరుకున్నారట. ‘‘విమానం కూలి మేమంతా చస్తే సరిపోతుంది అనిపించింది.’’అరుంధతిని మేరీ తరచు ‘బిచ్’ అనే తిట్టేవారు. సోదరుడు క్రిస్టొఫర్ను ఇంకా దారుణమైన మాటలన్నారు. ‘‘తను కౌమారంలో ఉన్నప్పుడు, అమ్మ ఒకసారి అందికదా: ‘నువ్వు అసహ్యంగా ఉన్నావు, తెలివితక్కువ సన్నాసి, నేను నీ స్థానంలో ఉంటే ఈపాటికి ఆత్మహత్య చేసుకునేదాన్ని.’’ మేరీ రాయ్లో మెచ్చుకోదగిన పార్శ్వం కూడా ఉంది. ఆమెది దృఢ సంకల్పం. ఆమె నెలకొల్పిన పల్లికూడంను చక్కని పాఠశాలగా పరిగణించేవారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను చెప్పడంతోబాటు మంచి నడవడికను అలవరచేవారు. వారి స్నానపానాలను, మరుగు దొడ్లను శుభ్రం చేయడాన్ని మేరీ స్వయంగా పర్యవేక్షించేవారు. ఓసారి బాలురు ఆడపిల్లల వక్షోజాలు, వేసుకునే బ్రాల గురించి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించినపుడు, మేరీ తన కప్ బోర్డు నుంచి ఒక బ్రాను బయటకు తెచ్చి ‘‘ఇదే బ్రా. దీన్ని ఆడవాళ్లందరూ వేసుకుంటారు. మీ అమ్మలు వేసుకుంటారు. తొందరలోనే మీ అక్కచెల్లెళ్ళు వేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అంతగా ఉత్తేజపరుస్తోందనుకుంటే, దీన్ని ఉంచుకోండి’’ అన్నారట. అరుంధతి నటించిన లేదా స్క్రిప్టు సమకూర్చిన ‘మాసీ సాహెబ్’, ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’, ‘ఎలక్ట్రిక్ మూన్’ లాంటి చిత్రాలతో ఈ పుస్తకం అరుంధతి జీవితపు తొలినాళ్ళలోకి తీసుకెళుతుంది. అయితే ‘గార్డియన్’ పత్రిక చిత్ర సమీక్షకుడు డెరెక్ మాల్కమ్ ‘‘పేరు మార్చి ఉండాల్సింది. ‘గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే దానికి ఇంగ్లీషులో అర్థమే లేదు’’ అని పెదవి విరిచారు. అరుంధతి, ఆమె బృందం ఆ వ్యాఖ్యను బాగా వాడుకున్నారు. ‘‘మిష్టర్ మాల్కమ్, ఇంగ్లండ్లో మీరు ఇక ఎంతమాత్రం ఇంగ్లిష్ మాట్లా డటం లేదు’’ అని పబ్లిసిటీ చేశారు. ఆమె జైలులో గడిపిన ఒక రోజు గురించి కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది. ‘‘జైలు గది తలుపు వెనుక వైపు మూసుకున్న శబ్దం, నాలోని ధైర్యాన్ని, విశ్వాసాన్ని నీరుగార్చేసింది. నేను మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానన్నది స్పష్టం. అక్కడున్నన్నాళ్ళూ ఏమి చోటుచేసుకోవడానికైనా అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. నిజానికి, ఆమె అంత దుర్బలంగా ఏమీ అయి పోలేదు. అక్కడ ఆమె కొందరిని స్నేహితులుగా చేసుకున్నారు. జైలు పక్షులను తనవైపు తిప్పుకొని ఉంటారని నా అనుమానం. పుస్తకం చివరి పేజీల కొచ్చేసరికి, తల్లితో ఆమెకున్న సంక్లిష్ట సంబంధాన్ని అర్థం చేసుకుంటాం. ఒక్కోసారి ఆమె తల్లిని ద్వేషించారు. మరికొన్ని సందర్భాల్లో ప్రేమించారు. శ్రీమతి రాయ్ చని పోవడానికి కొద్ది నెలల ముందు కుమార్తెకు ఒక మెసేజ్ చేశారు. ‘‘ఈ ప్రపంచంలో నిన్ను మించి నేను ఎవరినీ ఎక్కువగా ప్రేమించింది లేదు.’’ అది అరుంధతిని ఆశ్చర్యపరచింది. కానీ, జవాబు మాత్రం అంతే ప్రేమాస్పదమైన రీతిలో ఇచ్చారు. ‘‘నాకింత వరకు తెలిసినవారిలో నువ్వు చాలా అసాధారణమైన, అద్భుతమైన మహిళవి. నేను నిన్ను ఆరాధించే వ్యక్తిని.’’తల్లితో పడకపోయినా, ఆమె లేని లోటును అరుంధతి అను భవిస్తోందనే నా సందేహం. ‘‘నేను నిన్ను కలుస్తాను’’ అంటూ పుస్తకాన్ని ముగించారు.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐటీ పరిశ్రమకు గడ్డు రోజులు
అత్యంత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ వృత్తినిపుణులు ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలని కలలుగనడం సహజం. భారీ టెక్ లేదా భారతీయ సాఫ్ట్వేర్ సంస్థల ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానికి, ఆరేళ్ళ పాటు చెల్లుబాటయ్యే హెచ్–1బి వీసా చేజిక్కించుకోవాలని అర్రులు చాస్తారు. కానీ, ఆ రకం వీసాల సంఖ్యపై పరిమితి ఉంది. గ్రహీతలను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి ఆ వీసాకున్న ప్రతికూలాంశాలు. హెచ్–1బి వీసా దారులు అమెరికాలో గ్రీన్ కార్డును చేజిక్కించుకోగలగడం, దీర్ఘకాలంలో పౌరసత్వాన్ని కూడా సంపాదించుకోవడం దానికున్న అనుకూలాంశాలు. హెచ్–1బి వీసాతో వృత్తి జీవితం మొదలుపెట్టి, తదనంతర కాలంలో ఉన్నత స్థాయికి చేరిన వారి జాబితా పెద్దదే. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ,గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా స్థాపకుడు జెన్సెన్ హుయాంగ్, జూమ్ స్థాపకుడు ఎరిక్ యువాన్ వంటి వారిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మారిన పరిస్థితులుఈ వీసాలపై 1,00,000 డాలర్ల చొప్పున ఒక విడత లెవీని ట్రంప్ ప్రభుత్వం విధించింది. అంత భారం మోయడం కష్టమని పెద్ద టెక్ కంపెనీలు శ్వేత సౌధానికి నచ్చజెబితే ఈ అంశానికి సంబంధించి, ఇతర కోణాలలో కూడా వీలైనంత త్వరగా మార్పు రావచ్చు. కానీ దీనివల్ల అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపైనే పెను ప్రభావం పడబోతోందనడంలో సందేహం లేదు. హెచ్–1బి వీసాలకు సౌజన్యం వహిస్తున్న పది టాప్ కంపెనీలలో భారతీయ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక్కటే ఉంది. అమెజాన్ 10,000 వీసాలకు పైగా సంఖ్యతో 2025లో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. దానితో పోలిస్తే 5,500 వీసాలతో టి.సి.ఎస్. చాలా వెనుక నున్నట్లు లెక్క. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఆపిల్ వంటి ఇతర దిగ్గజాలు జాబితాలో చాలా దిగువన ఉన్నాయి. అంతమాత్రాన ఈ పరిణామం వల్ల భారతీయ సాఫ్ట్వేర్ రంగా నికి వాటిల్లే నష్టం లేదనుకోవడం పొరపాటు. ఎందుకంటే, హెచ్– 1బి వీసాదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే. దెబ్బ మీద దెబ్బఅమెరికన్ కంపెనీలు ఇకమీదట కూడా, బయట దేశాల నుంచి ఎక్కువ పనులు చేయించుకోవాలని కోరుకుంటాయా, ఫలితంగా, భారత్లో మరిన్ని గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) నెలకొంటాయా అనేది ప్రశ్న. దేశంలో వాటిని నెలకొల్పడంలో అగ్ర టెక్ సంస్థలు పట్టుదలతో ఉన్నాయి. అమెరికా వంటి అధునాతన ఆర్థిక వ్యవస్థలోకన్నా తక్కువ జీతభత్యాలతో భారతదేశంలో నిపుణులైన వారిని నియమించుకోవడం తేలిక. ఐటీ సేవలకు భారతీయ కంపెనీలపై ఆధారపడటం ఇక ముందు కూడా కొనసాగవచ్చు. కానీ అధిక ఫీజు వల్ల అటువంటి సేవలు మరింత ఖరీదైనవిగా మారతాయి లేదా లాభదాయకతను తగ్గిస్తాయి. ఒక విడత ఫీజు చెల్లించడం వల్ల అయ్యే ఖర్చు, తత్ఫ లితంగా ఒనగూడగల ప్రయోజనాన్ని విశ్లేషించుకుని కంపెనీలు కొత్తవారిని తీసుకునే వ్యూహాలను రూపొందించుకుంటాయి. ఈ ఫీజు వసూలు చాలా కాలం కొనసాగితే, ఈ వీసాకు సౌజన్యం వహించడాన్ని అవి తగ్గించుకోవచ్చు. ఎల్1, ఓ1 వంటి ఇతర వీసా మార్గాలున్నాయి. కానీ, వీటికి షరతులుంటాయి. అందరు దర ఖాస్తుదారులు వాటిని ఉపయోగించుకోలేరు. ఔట్ సోర్సింగ్కు ఇచ్చే కంపెనీలపై పన్ను విధించాలని అమె రికాలో ఇప్పటికే ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ బిల్లు భారతీయ ఐటీ పరిశ్రమ పాలిట పెను తుపాను అవుతుంది. సాఫ్ట్వేర్ సర్వీసులను ఎగుమతి చేయడం ద్వారానే భారతీయ ఐటీ పరిశ్రమ బ్రహ్మాండ మైన వృద్ధిని సాధించగలిగింది. వాటి వ్యూహంలో హెచ్–1బి వీసాలు కూడా అంతర్భాగం.అవకాశాల తలుపులుసంక్షోభాలు అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తాయని అంటారు. హైటెక్ నవీకరణ, పరిశోధనకు దేశంలో తగిన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం–పరిశ్రమలు ఇప్పటికైనా చేతులు కలపాలి. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు భారతీయ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి వహించాయి గానీ, అత్యధునాతన టెక్నాలజీని తీర్చిదిద్దే వాగ్దానాన్ని అంతగా నిలబెట్టుకోలేకపోయాయి. అట్టడుగు స్థాయి నుంచి సమూల మార్పులు తీసుకురాగలిగినదిగా భారతీయ ఐటీ రంగం ప్రతిష్ఠను సంతరించుకోలేకపోయింది. ఇతర దేశాలలో వచ్చిన నవీకరణలను అనుసరించేదిగానే అది పేరుపడింది. అమెరికా చేరిన భారతీయ ప్రజ్ఞావంతులు అక్కడి సంస్థలను డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో అగ్ర స్థానాన నిలపడంలో కృతకృత్యులవుతున్నారు. పరిశోధన, అభివృద్ధి, కొత్త వెంచర్ల ప్రారంభానికి అమెరికాలో వాతావరణం అనుకూలంగా ఉండే మాట నిజమే. భారత్లో అందుబాటులో ఉన్న మానవ ప్రతిభా వ్యుత్పత్తుల సంపదను వినియోగించుకునేందుకు ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులను కల్పించాలి. ఇందుకు ప్రభుత్వాన్ని ఒక్కదాన్నీ నిందించి ప్రయోజనం లేదు. భారతీయ కంపెనీలు పరిశోధన–అభివృద్ధి విభాగంపై నిధులు వెచ్చించేందుకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దేశంలో ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్లు అపారంగా ఉన్నారు. వారిని ప్రోత్సహించే వాతావరణాన్ని దేశంలోనే సృష్టించు కోవలసిన అవసరం మున్నెన్నటికన్నా ఇపుడే ఎక్కువగా ఉంది. సుష్మా రామచంద్రన్వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్) రాయని డైరీ
ఇండియా, పాకిస్తాన్ రెండూ కూడా ఫైనల్స్కు చేరుకుంటే, రెండు జట్ల మధ్య – ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్నట్లే – ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇదే ప్రేమదాస స్టేడియంలో పోరు మొదలౌతుంది. ‘ప్రేమ’దాస స్టేడియంలో ‘పోరు’!! భలే ఉంటాయి ఈ అనుబంధాలు... కొట్లాడుకునే అక్కచెల్లెళ్ల మధ్య, ఘర్షణలు పడే అన్నదమ్ముల మధ్య! ఒకరి ఇంట్లోకి ఒకరు అడుగు పెట్టరు. పొరుగింట్లోనో, ఆ పై ఇంట్లోనో పంచాయితీ! ‘‘అలాగైతేనే వస్తాం’’ అని మొదటే అగ్రిమెంట్! నవ్వొస్తోంది నాకు!షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనీ, సెల్ఫీలు తీసుకోవాలనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనకూడదనీ రూల్ బుక్లో ఏమైనా ఉందా అని ‘బోర్డు’లో పెద్దవాళ్లు అంటున్నారు! అది నిజమే కానీ... షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదనీ, సెల్ఫీలు తీసుకోకూడదనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనాలనీ కూడా రూల్ బుక్లో ఉండదేమో కదా! ఇలాంటప్పుడే, అమాయకమైన చిరునవ్వుతో – పైవారి ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన నాకు వస్తుంటుంది.‘‘అలా చెయ్యకు హ్యారీ’’ అనేవారు చిన్నప్పుడు నాన్న. చిరునవ్వుతో సరిగ్గా అలానే చెయ్యబుద్ది అయ్యేది నాకు!‘‘అలా చెయ్యటం కరెక్ట్ కాదు హర్మన్ ’’ అనేవారు కాలేజ్లో ప్రిన్సిపాల్. చిరునవ్వుతో సరిగ్గా అదే కరెక్ట్ అనాలనిపించేది నాకు!ఇప్పుడిక బీసీసీఐ సెక్రెటరీ! ‘మహిళల ప్రపంచ కప్లో భారత్–పాక్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు! చిరునవ్వుతో సరిగ్గా నాకేం అనిపిస్తోందంటే, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోబోమనే గ్యారంటీ కూడా ఏమీ లేదని! మనసులో దగ్గరితనాన్ని ఉంచుకుని దూరాన్ని ఎంతకాలం నటించగలం? మాట్లాడాలని లోలోపల పీకుతూ ఉంటే మౌనాన్ని ఎలా పాటించగలం?కొద్దిసేపట్లో భారత్–పాక్ల మధ్య లీగ్ మ్యాచ్. అది వదిలేసి, ఎప్పుడో నెల తర్వాత నవంబర్ 2న ఎవరి మధ్య జరుగుతుందో కూడా తెలియని ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాన్నేను!నిజంగానే భారత్–పాక్ ఫైనల్కి చేరుకుంటే, ఫైనల్లో గెలుపెవరిది అనే మాట అటుంచి... ఫైనల్లోనైనా టాస్ వేశాక షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా, ఆట ముగిశాకైనా చేతులు కలుపుకుంటామా అన్నదే ఆలోచిస్తూ యావద్దేశంతో పాటుగా నేను కూడా ఆ రోజు తెల్లవారుజాము నుంచే టెన్షన్ టెన్షన్గా ఉంటాననుకుంటా!ఫాతిమా సనా పాక్ కెప్టెన్ . చిన్న పిల్ల. నాకంటే 13 ఏళ్లు చిన్న. ఎం.ఎస్.ధోనీ తన ఇన్ స్పిరేషన్ అట. ధోనీలా కూల్గా ఉండి ఈ వరల్డ్ కప్లో తన జట్టును గెలిపిస్తుందట! బహిరంగంగానే చెప్పేసింది. అది కదా ‘హై–స్పిరిటెడ్’ అంటే. కానీ బీసీసీఐ వేరే ‘హై’లో ఉంది. మొన్నటి మెన్ ్స క్రికెట్ ‘సంప్రదాయాన్నే’ ఉమెన్ ్స క్రికెట్ కూడా ఫాలో అవాలట! అంటే, నో షేక్ హ్యాండ్స్ అని. 2022 వరల్డ్ కప్లో – న్యూజిలాండ్లో భారత్–పాక్ ఆటకు పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన ఆర్నెల్ల వయసున్న కూతుర్ని వెంటపెట్టుకుని వచ్చింది. తల్లీకూతుళ్లతో కలిసి టీమ్ ఇండియాలోని అందరం సెల్ఫీ తీసుకున్నాం. ఆ గేమ్లో ఇండియా గెలిచింది కానీ, ఇండియాను బిస్మా మరూఫ్ కూతురు తన బోసి నవ్వుల్తో ‘క్లీన్ బౌల్డ్’ చేసేసింది. ఆ పాప పేరు కూడా ఫాతిమానే!లీగ్ మ్యాచ్ టైమ్ అయింది. టాస్ కోసం లోపలికి వెళుతున్నాం. గెలుపు, ఓటమి... తర్వాతి సంగతి. ఫీల్డ్లో ఫాతిమా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను చెయ్యి చాస్తానా? లేక, ఫాతిమా షేక్ హ్యాండ్ కోసం నేనే ముందుగా చెయ్యి చాస్తానా? అంతా ఫాతిమా చేతుల్లో ఉంది.ఊహు... చేతుల్లో కాదు, ఫాతిమా చిరునవ్వులో ఉంటుంది. -
స్వదేశీ అమలుకు అడ్డంకేమిటి?
‘స్వదేశీ’ అనే గొప్ప నినాదాన్ని స్వాతంత్య్రోద్యమ కాలంలో అప్పటి నాయకులు ఒకసారి ఇచ్చారు. స్వాతంత్య్రాన్ని సాధించుకుని కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ప్రస్తుత నాయకత్వం మరొకసారి ఇస్తు న్నది. ఆ నినాదం పారిశ్రామిక వర్గాలను గానీ, సమాజాన్ని గానీ అపుడెట్లా ఉత్తేజ పరిచింది, ఇపుడెట్లా చేస్తున్నది? ఆ దరి మిలా నినాదపు అమలు అపుడెట్లా జరగింది, ఇపుడెట్లా జరుగుతున్నది?ఇందుకు సమాధానాన్ని మామూలు పద్ధతిలో వెతికి అపుడు గొప్పగా ఉండేదనీ, ఇపుడు ఆశించిన ఫలితాలు లేవనీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ అది విషయాలను సమగ్ర దృష్టితో పరిశీలించి చేసే విమర్శ కాబోదు. ఎందుకంటే, స్వాతంత్య్రోద్యమ కాలపు స్వదేశీ నినాద స్ఫూర్తి లోపించటం స్వాతంత్య్రం లభించిన తర్వాత కాంగ్రెస్ పాలనా కాలం నుంచే మొదలై, ప్రస్తుత బీజేపీ పాలన వరకు కూడా కొనసాగుతున్నది. ఎందుకన్నది ప్రశ్న. ఆ స్ఫూర్తి తిరిగి రావటం ఎట్లాగన్నది విషయం.బెంగాల్ విభజన కాలంలో...చర్చలోకి వెళ్లేముందు ఈ రెండు సందర్భాలలో ‘స్వదేశీ’ భావనల నేపథ్యం కొంత చూడాలి. ఆ మాట మొదటిసారిగా బ్రిటిష్ వలస పాలనా కాలంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావిన్స్ను 1905లో రెండుగా విభజించినపుడు అందుకు నిరసనగా అక్కడి నాయకులు, సమాజం ముందుకు తెచ్చినటువంటిది. వారు బ్రిటన్కు సంబంధించిన అన్నింటిని బహిష్కరించి హింసాత్మక ఉద్యమం సాగించగా విభజన రద్దయింది. తర్వాత కొన్నేళ్లకు ఉద్యమ ప్రవేశం చేసిన గాంధీజీ ఆ నినాదానికి కొత్త అజెండాను రూపొందించారు. ప్రస్తుతం మనం అంటున్న స్వదేశీ నినాదానికి మూలాలు ఆయన అజెండాలో ఉన్నాయి. అందులో భాగంగా ఆయన ప్రజలకు బోధించింది ఆర్థిక స్వావలంబన, స్వయంసమృద్ధి, స్థానిక ఉత్పత్తుల వాడకం, అందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, వీటన్నింటికి సమాంతరంగా విదేశీ వస్తు బహిష్కరణ. ఆ కాలంలో టాటా, బిర్లా వంటి భారీ పారిశ్రామికసంస్థలు ఒక మేర బ్రిటిష్ కంపెనీల సహకారంతో నడిచినప్పటికీ, మరొకవైపు గాంధీజీ నినాదం ప్రజల స్థాయిలో ఒక ఉద్యమంగా సాగింది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిశ్రామి కాభివృద్ధి కోసం ప్రయత్నించటం అవసరమే అయినా, అందుకు సమాంతరంగా ఖాదీ గ్రామీణోద్యోగ రంగాన్ని కొంతకాలం మొక్కు బడిగా నడిపి దిక్కులేనిదిగా వదిలారు. పారిశ్రామిక రంగం క్రమంగా స్వదేశీ – విదేశీ మిశ్రమంగా మారింది. ప్రజలలో సైతం గత కాలపు స్ఫూర్తి అంతరించి విదేశీ ఉత్పత్తుల పట్ల మోజు పెరుగుతూ పోయింది. ఆ మాటే వినని తరం...1991లో భారతదేశం డబ్లు్యటీవోలో ప్రవేశించి, ఆర్థిక సంస్కర ణల ద్వారా విదేశీకి తలుపులు పూర్తిగా తెరిచింది. మతం విష యాన్ని అట్లుంచితే, జాతీయతా భావనలు బలంగా ఉండే ఆరెస్సెస్ ద్వారా అదే సంవత్సరం స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పడింది గాని పరిమితంగానే పనిచేయగలిగింది. తర్వాత కాలంలో వాజ్పేయి ప్రధానిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా స్వదేశీని పక్కకు పెట్టింది. అందుకు కారణం, భారత పారిశ్రామిక, వాణిజ్య వర్గా లలో అత్యధికులు విదేశీ పెట్టుబడులతో కలిసి ఉమ్మడి ఉత్పత్తులు, వ్యాపారాల వైపు మొగ్గటం. బయటినుంచి ప్రత్యక్ష పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, ఎగుమతులకు తగిన స్థాయిలో ఉత్పత్తులు చేసేందుకు టెక్నాలజీ దిగుమతులు, ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ అభివృద్ధి అవసరమనే దృష్టి పెరుగుతూ పోయాయి. ఈ కొత్త దశలో అత్యధికులు ‘స్వదేశీ’ అనే మాటనే విని ఉండరు. 1947కు ముందటి స్వదేశీ దృక్పథం, స్ఫూర్తీ, ఆ తర్వాత అర్ధ శతాబ్దం గడిచి, రెండు తరాలు మారి, రెండు ప్రధానమైన పార్టీల పరిపాలనను కూడా చూసిన వెనుక, ఉక్కిరిబిక్కిరై అవసాన దశలోకి ప్రవేశించింది.ఈ విధమైన రెండు దశల వెనుక 2014లో అధికారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, మరొక పేరుతో తిరిగి స్వదేశీ నినాదాన్ని ఇచ్చారు. అందుకు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటి పేర్లు పెట్టారు. ఆయన గుజరాత్కు చెందినవారు కావటం, గుజరాత్ – మహారాష్ట్ర ప్రాంతంలో స్థానిక పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు బలంగా ఎదగటం ఒకటైతే, విదేశీ పెట్టుబడులు, కంపెనీలు రావాలి గానీ అవి తమకు అనుకూలమైన విధంగా వ్యవ హరించాలనుకునే ధోరణులు పెరగటం మరొకటిగా మారి, ఈ కొత్త తరహా స్వదేశీ నినాదానికి భూమికగా మారాయి. దీనితోపాటు ఆత్మనిర్భర్కు మూల స్తంభాలని అయిదింటిని పేర్కొన్నారు. అవి ఆర్థికం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థలను నిర్మించి బలోపేతం చేయటం, సమాజాన్ని క్రియాశీలం చేయటం, దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచటం. నాలుగు కీలకాంశాలుఅప్పటినుంచి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిన సమీక్షలు ప్రోత్సాహకరంగా లేకపోవటం గమనించదగ్గది. ఆత్మ నిర్భర్కు మూలస్తంభాలుగా పైన పేర్కొన్న అయిదు రంగాలలో పెరుగుదల లేదని కాదు. కానీ అది సాధారణమైన రీతిలో జరుగు తుండేదే తప్ప ప్రత్యేకమైన ఊపు ఏదీ రాలేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం జపాన్ను మించి నాల్గవ స్థానానికి చేరటానికి ఒక కారణం మన దేశ పరిమాణం ఇంత పెద్దది కావటమైతే, మరొక కారణం జపాన్ అభివృద్ధి వేగం మందగించటం. దీని అర్థం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పెనవేసుకుపోయిన స్థితిలో ఒంటరితనంగా ఎదగాలని కాదు. అది అసాధ్యం, అవాంఛ నీయం కూడా. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పునర్నవీకరణ జరుగుతూనే, మౌలిక స్థాయిలో స్వదేశీ, స్వావలంబనలను పునాదులుగా నిలబెట్టుకోవచ్చు. ఇతరులపై ఆధారపడటం తగ్గుతూ, వారి ఒత్తిడులకు భయపడే స్థితిని పోగొట్టు కోవచ్చు. ఇది ప్రభుత్వపరంగా జరగవలసినది కాగా, సమాజాన్ని కూడా అదే స్ఫూర్తితో ఆ ప్రణాళికలో భాగస్వామిని చేయటం అసాధ్యం కాదు. అమెరికా ట్యారిఫ్లు వాణిజ్య ఒప్పంద ఒత్తిడుల స్థితిలో ఇపుడీ మాటను ప్రధాని మోదీ తనకు తాను పదేపదే గుర్తు చేసుకుంటూ దేశ ప్రజలకు గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికీ మూలంలో అసలు ప్రస్తావనకు రాని కీలకమైన విషయం ఒకటున్నది. భారతదేశానికి గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ప్రజలకు గొప్ప దేశభక్తి, జాతీయతా భావాలున్నాయి. ఏ దేశానికైనా, జాతికైనా ఈ నాలుగు అంశాలు కలిసి ఎనలేని శక్తిని ఇవ్వగలవు. వాటిని ఒక దార్శనికత, ప్రణాళిక, పట్టుదల, నిజాయితీ అనే నాలుగు అంశాలతో సమన్వయం చేసి ఆచరణలోకి తేగల నాయకత్వం ఉన్నట్లయితే ఆశించిన ఫలితాలను సాధించగలరు. అది జరిగినందువల్లనే స్వదేశీ నినాదం స్వాతంత్య్రోద్యమ కాలంలో విజయవంతమైంది. స్వాతంత్య్రానంతరం ఎవరు పాలించినా ఆ పని చేయలేక పోతున్నారు. స్వదేశీ నినాదాల అమలుకు మౌలికమైన అడ్డంకిగా నిలుస్తున్న లోపం అదే.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
వంద సంవత్సరాల దేశసేవ
ఓ శతాబ్దం కిందట విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించింది. అయితే, ఇది కొత్తగా సృష్టించినదేమీ కాదు... ప్రాచీన సంప్రదాయానికి నవ్య వ్యక్తీకరణ మాత్రమే. భారత నిరంతర జాతీయ చైతన్యం కాలానుగుణంగా భిన్న రూపాల్లో, విభిన్న సవా ళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది. ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి మన కాలపు ప్రతిరూపమే ఈ సంఘ్. ఇటువంటి సంఘ్ శతాబ్ది వేడు కలలో భాగస్వాములం కావడం మన తరం స్వయంసేవకుల అదృష్టం. దేశానికి, ప్రజలకు సేవ దిశగా ప్రతినబూని, అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్షలు. సంఘ్ స్థాపకుడు, మనందరి మార్గదర్శకుడు అయిన డాక్టర్ హెడ్గేవార్జీకి నా సగౌరవ ప్రణామాలు అర్పిస్తున్నాను. వందేళ్ల ఈ అద్భుత పురోగమనాన్ని స్మరించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లతో పాటు స్మారక నాణాన్ని కూడా ఆవిష్కరించింది.వ్యక్తి వికాసం.. దేశ పురోగమనంమానవ నాగరికతలన్నీ గొప్ప నదీ తీరాల్లోనే పరిఢవిల్లాయి. అదే తరహాలో సంఘ్ ప్రభావంతో లెక్కలేనన్ని జీవితాలు చరితార్థ మయ్యాయి. ఒక నది తాను తడిపిన ప్రతి అంగుళం నేలనూ సుసంపన్నం చేస్తుంది. అదే విధంగా సంఘ్ కూడా దేశంలోని ప్రతి మూలనూ, సమాజంలో ప్రతి రంగాన్నీ పెంచి పోషించింది. ఒక నదీ ప్రవాహం పలు విధాలుగా చీలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరింపజేస్తుంది. సంఘ్ ప్రయాణం కూడా ఇలాంటిదే. వివిధ అనుబంధ సంస్థల ద్వారా విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత సహా జీవితంలోని అనేక రంగాల్లో సంఘ్ తన సేవానిరతిని రుజువు చేసుకుంది. ‘‘వ్యక్తి వికాసం నుంచి దేశ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణంతో దేశ పురోగమనం’’... ఇదీ సంఘ్ అనుసరించిన పంథా! దేశభక్తికి మారుపేరుఆవిర్భవించిన మరుక్షణం నుంచే దేశ ప్రాధాన్యాన్నే తన ప్రాథమ్యంగా సంఘ్ పరిగణించింది. డాక్టర్ హెడ్గేవార్ సహా అనేకమంది స్వయంసేవకులు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా అనేకసార్లు జైలుకు వెళ్లారు. పలువురు స్వాతంత్య్ర సమరయోధులకు సంఘ్ మద్దతునిస్తూ రక్షణగానూ నిలిచింది. స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం కోసం తన వంతు కృషిని కొనసాగించింది. దేశభక్తికి, సేవకు మారుపేరుగా ‘సంఘ్’ నిలిచింది. దేశ విభజన సమయంలో లక్షలాది కుటుంబాలు ఆశ్రయం కోల్పోయిన వేళ... స్వయంసేవ కులు ముందుకొచ్చి శరణార్థులకు సేవలందించారు. పరిమిత వనరులే ఉన్నప్పటికీ... ప్రతి విపత్తు సమయంలోనూ ఆపన్న హస్తం అందించే వారిలో స్వయంసేవకులు ముందుంటారు. వారి దృష్టిలో ఇవి ఉపశమన చర్యలు మాత్రమే కాదు... దేశ చేతనను బలోపేతం చేయడం కూడా! వివక్షకు వ్యతిరేకంగా పోరాటంశతాబ్ద కాలపు ప్రయాణంలో సమాజంలోని వివిధ వర్గాల్లో స్వచేతననూ, ఆత్మవిశ్వాసాన్నీ సంఘ్ జాగృతం చేసింది. దశాబ్దా లుగా గిరిజన వర్గాల సంప్రదాయాలు, ఆచారాలు, విలువలను పరిరక్షించి, పెంపొందించడానికి అంకితమైంది. నేడు సేవా భారతి, విద్యా భారతి, ఏకల్ విద్యాలయాలు, వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థలు గిరిజన వర్గాల సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు శతాబ్దాలుగా హిందూ సమాజానికి సవాళ్లుగా ఉన్నాయి. డాక్టర్ హెడ్గేవార్జీ కాలం నుంచి నేటి వరకు.. ప్రతీ స్వయం సేవక్, ప్రతీ సర్ సంఘ్ చాలక్ ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘‘అంట రానితనం తప్పు కాకపోతే, ప్రపంచంలో మరేదీ తప్పు కాదు’’ అని పూజ్య బాలసాహెబ్ దేవరస్జీ ప్రకటించారు. అనంతరం పూజ్య రజ్జు భయ్యాజీ, పూజ్య సుదర్శన్జీ కూడా ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ‘అందరికీ ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానవాటిక’ ఉండాలంటూ ప్రస్తుత సర్ సంఘ్చాలక్ గౌరవ మోహన్ భాగవత్జీ ఐక్యత దిశగా స్పష్టంగా పిలుపునిచ్చారు. శతాబ్దం కిందట సంఘ్ ఏర్పడిన వేళ నాటి అవసరాలు, సవాళ్లు నేటి కాలానికి భిన్నంగా ఉన్నాయి. నేడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మన ఐక్యతను భగ్నం చేసే కుట్రలు, చొరబాట్లు, ఇంకా ఎన్నింటినో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఆర్ఎస్ఎస్ కూడా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడం సంతోషదాయకం.తదుపరి శతాబ్దికి సమాయత్తంసంఘ్ ప్రవచిస్తున్న ‘పంచ పరివర్తన్’... నేటి సవాళ్లను అధిగమించే మార్గాన్ని ప్రతి స్వయం సేవకుడికీ నిర్దేశిస్తుంది.అవి: 1. స్వబోధ: వలసవాద మనస్తత్వం నుంచి విముక్తుల మయ్యేలా, మన వారసత్వ ఘనతను గర్వంగా ప్రకటించు కునేలా, స్వదేశీ సూత్రాన్ని పురోగమింపజేసేలా ఈ ‘స్వీయ అవగాహన’ దోహదపడుతుంది. 2. సామాజిక సామరస్యం: అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయంపై భరోసా కల్పించడం ద్వారా సామాజిక సామరస్యం సాకార మవుతుంది. మన సామాజిక సామరస్యానికి పెనుసవాలుగా పరిణమించిన చొరబాట్ల సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నత స్థాయి జనాభా మిషన్ (హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్)ను ప్రభుత్వం ప్రకటించింది. 3. కుటుంబ ప్రబోధన్: మన సంస్కృతికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను కుటుంబ విలువలు బలోపేతం చేస్తాయి. 4. నాగరిక్ శిష్టాచార్: సామా జిక స్పృహ, బాధ్యతా భావం ప్రతి పౌరుడి లోనూ జాగృతం కావాలి. 5. పర్యావరణ్: రాబోయే తరాల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణ సంరక్షణ అత్యంత ముఖ్యమైనది. ఈ ఐదు సంకల్పాల నిర్దేశంలో... తదుపరి శతాబ్ది లోకి ప్రయాణాన్ని ‘సంఘ్’ నేడు ప్రారంభించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో సంఘ్ కృషి కీలకం. మరోసారి ప్రతి స్వయంసేవకుడికీ నా శుభాకాంక్షలు. నరేంద్ర మోదీభారత ప్రధాని -
చేటు తెచ్చిన అనుభవ రాహిత్యం
తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఓ కూడలి వద్ద సెప్టెంబర్ 27 రాత్రి సంభవించిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయ పడిన జనం పదుల సంఖ్యలో ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు అయిన విజయ్ ర్యాలీకి 27,000 మందికి పైగా హాజరైనపుడు ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయన రాక ఏడు గంటలు ఆలస్యమై, సభ రాత్రి 7.30 గంటలకు మొదలైంది. అప్పటి వరకు విజయ్ కోసం ఉత్సుకతతో వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామక్కల్లో సభ ముగించుకుని కరూర్ వచ్చేందుకు విజయ్కి అన్ని గంటల సమయం ఎందుకు పట్టిందని కొందరు అంటున్నారు.పోలీసులు కేటాయించిన స్థలమే!విజయ్ కరూర్ సభకు ఎంతమంది తరలిరాగలరో అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారా... అన్నది సహజంగానే ఇక్కడ తలెత్తే ప్రశ్న. రాజకీయంగా తనను ఎదగనీయకుండా చేసేందుకు పోలీసులు అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయ్ చేస్తున్న ఆరోపణలతో తమిళనాడు పోలీసులు గత కొద్ది నెలలుగా ఆత్మరక్షణ ధోరణిని అనుసరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం తిరుచిరాపల్లిలో విజయ్ రోడ్ షో నిర్వహించినపుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో సభా నిర్వహణ కోసం కరూర్లో విజయ్ ఎంచుకున్న రెండు ప్రదేశాలకు పోలీసులు అను మతి నిరాకరించారు. అవి జన సమ్మర్ధంతో కిటకిటలాడే వాణిజ్య స్థలాలు కావడమే అందుకు కారణం. అందుకే ఆ రెండూ కాకుండా, కొద్ది రోజుల క్రితం అన్నా డి.ఎం.కె నాయకుడు ఎళప్పాడి పళని స్వామి సభ నిర్వహించిన కరూర్లోని మరో ప్రదేశాన్ని పోలీసులు విజయ్ సభకు కేటాయించారు. టీవీకే మొదట ఎంచుకున్న ఆ సభా ప్రాంతాలు రెండింటికీ ఇది కూడా దగ్గరలోదే కావడంతో పార్టీ అందుకు వెంటనే అంగీకరించింది. ఏర్పాట్లలో తడబడుతున్న టీవీకేకాగా, తాజా ఘటన రాజకీయంగా, సంస్థాగతంగా టీవీకేకు కొరవడిన సామర్థ్యాన్ని బహిర్గతం చేసింది. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్. ఆనంద్ ఒక్కరే టీవీకేలో రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన గతంలో వివిధ కాంగ్రెస్ చీలిక వర్గాలలో పనిచేశారు. ఇటువంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా జిల్లా కార్యదర్శులు ముఖ్యపాత్ర వహిస్తారు. వారు సాధారణంగా అట్ట డుగు స్థాయి సంబంధాలు కలిగినవారై ఉంటారు. అయితే టీవీకేలో విజయ్ అభిమాన సంఘాలలోని ప్రీతిపాత్రులే ఆ భూమిక నిర్వ హిస్తున్నారు. సభలకు తగిన ఏర్పాట్లు చేయడంలో వారు తడబడు తున్నారు. తమ సభలకు సుమారు పది వేల మంది హాజరు కావచ్చని అంచనా వేస్తున్నట్లు వారు పోలీసులకు చెబుతున్న సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఇలాంటి సభలప్పుడు సాధారణంగా పార్టీలు కొద్దిమంది కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసి ఆహారం, నీరు సమకూర్చే ఏర్పాట్లు చేస్తూంటాయి. కాగా, సభలకు హాజరైన జనాన్ని అదుపులో ఉంచి, నియంత్రించవలసిన అవస రాన్ని ఇప్పటికే అనేక తమిళ పార్టీలు గుర్తించాయి కూడా! రాజీవ్ గాంధీ హత్యోదంతంతో తమిళనాడు ఈ చేదు పాఠాన్ని నేర్చు కోవాల్సి వచ్చింది. టీవీకే తన తరహాలో నిర్వహిస్తున్న రోడ్ షోల లాంటివి మాత్రం తమిళనాడు రాజకీయాలకు కొత్త. అప్పటి ‘సినీ–నాయకులు’ వేరు!గతంలో జయలలిత, కరుణానిధి కూడా వాహనాలలో రాష్ట్ర హైవేలలో ప్రయాణించినా ముందుగా నిర్ణయించిన చోట్ల మాత్రమే వారు వాహనాలను ఆపి ప్రసంగించేవారు. కొద్ది వేల మందిని ఉద్దే శించి ప్రసంగించి మరో చోటుకు బయలుదేరేవారు. పైగా, వారు జనాలు వేచి చూసేటట్లు చేసేవారు కాదు. నిర్హేతుకమైన జాప్యాలకు అవకాశమిచ్చేవారు కాదు. మొన్నటి ఘటనలో అంబులెన్సుల రాకకు సంబంధించిన శబ్దాలు వినిపిస్తున్నా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా ఆయన రాజకీయ అనుభవ రాహి త్యాన్ని సూచించింది. ఏం జరుగుతోందో ఎవరూ ఆయన చెవిన వేసినట్లు లేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరుచిరాపల్లిలో ప్రైవేటు విమానం ఎక్కి, రెండు గంటల్లోపల చెన్నైకి చేరుకున్నారు. ఆయనతో పాటే టీవీకే సభ్యులు కూడా సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. పోలీసుల ఎఫ్.ఐ.ఆర్కు ఎక్కిన కొందరు పరారీలో ఉన్నారు. ‘‘కక్ష ఉంటే నాపై తీర్చుకోండి!’’ఈ అవకాశాన్ని అధికార డి.ఎం.కె పార్టీ సద్వినియోగం చేసుకు న్నట్లే కనిపిస్తోంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన సెంథిల్ బాలాజీ ఆ సమయంలో నియోజకవర్గంలోనే ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. అయితే సెంథిల్ బాలాజీ ఆస్పత్రికి చేరుకోక ముందే, కరూర్ మాజీ ఎమ్మెల్యే అన్నా డి.ఎం.కె నాయకుడు ఎం.ఆర్. విజయ్ భాస్కర్ బాధితులను పరామర్శించటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా శనివారం అర్ధరాత్రికల్లా కరూర్ చేరు కున్నారు. స్టాలిన్ కుమారుడు, ఆయన వారసత్వాన్ని అందుకుంటాడని భావిస్తున్న ఉదయనిధి కూడా ఆదివారం ఉదయానికల్లా కరూర్లో వాలారు. అయితే విజయ్కి మాత్రం ఈ ఘటనపై క్షమా పణ కోరుతూ బహిరంగ ప్రకటన చేయడానికి 12 గంటలకు పైగా పట్టింది. ఇక, తాజాగా నిన్న (సెప్టెంబరు 30) విడుదల చేసిన ఒక వీడియోలో, ‘‘నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించ లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైపోయింది. మాటలు రావటం లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి. నా అభిమా నులపై కాదు’’ అని కూడా విజయ్ ఆ వీడియోలో అన్నారు. వచ్చే ఏడాది (2026) ఎన్నికలకు సమాయత్తమవుతున్న విజయ్కి ఈ సంఘటన పెను విఘాతమేనని చెప్పాలి. ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో ఏకసభ్య విచారణ సంఘాన్ని నియమించ డాన్ని టీవీకే, అన్నా డి.ఎం.కెలు తోసిపుచ్చాయి. సి.బి.ఐతో దర్యాప్తు జరిపించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.హీరో... నాయకుడిగా మారాలిఎం.జి. రామచంద్రన్, జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే అయినా, ఎమ్జీఆర్కు ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. జయలలిత చాలా ఆటుపోట్లను తట్టుకుని ఎంజీఆర్ చెంత రాజకీయంగా సుశిక్షితురాలిగా మారారు. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయనకు లక్షల మంది అభిమానులున్నమాట నిజమే. అయితే ప్రజలు ఓటు వేయాలని కోరుకునే రాజకీయ నాయకునిగా ఆయన రూపాంతరం చెందాల్సి ఉంది. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి తిరిగి ఎప్పుడు బయలుదేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భవిష్యత్ పరిణామాలు వెండితెరపై కాక, రాజకీయ యవనికపైనే ఆవిష్కృతం కానున్నాయి. నిరుపమా సుబ్రమణియన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
'పోరాటస్ఫూర్తి'ని కోల్పోవద్దు!
యూనివర్సిటీ నుంచి మీరు బయటకు అడుగుపెట్టబోతు న్నారు. జీవితంలో కొన్ని అవరోధాలు, వైఫల్యాలు, అసంతృప్తులు ఎదురవడం సహజం. వాటిని తట్టుకుంటూ ముందుకు సాగడంలో, విజయాన్ని అందుకోవడంలో మీకు సహాయపడగలిగినవి, నాకు తోచిన జీవిత పాఠాలు కొన్ని చెబుతాను.మీపై మీరు నమ్మకం ఉంచండిటెలివిజన్, టెలిఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్లు లేని రోజుల్లో పెరిగి పెద్దవాడినవటం వల్ల నేనొక రకంగా అదృష్టవంతుడినే. నాతో నేను ఎక్కువ సమయం గడపగలిగే వాడిని. దేన్ని నేను నిజంగా ఇష్టపడుతున్నానో నిర్ణయించుకోగలిగే వాడిని. అలా ఆస్ట్రియాలోని మా కుగ్రామం నుంచి – బాడీబిల్డింగ్ ఛాంపియన్ అవడం ద్వారా అమెరికాలో కాలుమోపాలని అనుకున్నా. నేను ఆరాధించే ‘మిస్టర్ యూనివర్స్’... రెగ్ పార్క్’. ఆయనలా బాడీబిల్డింగ్ చాంపియన్ అనిపించుకోవడం, సినిమాల్లో ప్రవేశించడం, కోట్లాది డాలర్లు సంపాదించడం నా లక్ష్యం. మిగిలినవారు ఏమనుకుంటున్నా పట్టించుకోకుండా, నా మీద నమ్మకంతో నేను ఏర్పరచుకున్న లక్ష్యం అది. సూత్రాలను పక్కన పెట్టండి!మా ఆవిడ వేసుకొనే ఒక టీషర్ట్పై ‘నియమానుసారంగా నడ చుకొనే మహిళలు చరిత్రను సృష్టించటం అరుదు’ అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ అది వర్తిస్తుంది. మరీ సూత్రానుసారంగా ఉంటే, మీ లక్ష్య సాధనకు ‘పిచ్చి పట్టినట్లుగా’ ప్రయత్నించలేరు. నాకు ఎక్కడైనా ఏదైనా లభించిందీ అంటే, అది ఈ సూత్రాలలో కొన్నింటిని పక్కన పెట్టినందువల్లనే సాధ్యమైంది. బాడీబిల్డింగ్కు శ్రమించినట్లుగానే, సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డాను.అందుకోసం ఇంగ్లీషు క్లాసులకు వెళ్లాను. ఫలితం దక్కింది. మొదట టెలివిజన్లో, తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. విజయవంతమైన నటుడిని అయ్యాను. తర్వాత గవర్నర్ని కూడా అయ్యాను. వైఫల్యానికి భయపడకండి!నేను ఏది ప్రయత్నించినపుడైనా, విఫలమవడానికి కూడా సుముఖంగా ఉండేవాడిని. ‘రెడ్ సోంజా’, ‘హెర్క్యులిస్ ఇన్ న్యూయార్క్’, ‘లాస్ట్ యాక్షన్ హీరో’ వంటి నా సినిమాలు కొన్ని బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ‘టెర్మినేటర్’, ‘క్యానన్’, ట్రూ లైస్’, ‘ప్రిడేటర్’, ‘ట్విన్స్’ వంటి చిత్రాలు ఊహించనంత విజయం సాధించాయి. కనుక, మనం అన్నిసార్లూ సఫలం కాలేకపోవచ్చు. కానీ, నిర్ణయాలు తీసుకునేందుకు భయపడకూడదు. విఫలమవు తామనే భయంతో నిర్వీర్యం కాకూడదు. మీపై మీకు నమ్మకం ఉంది కనుక, ఏది చేస్తున్నారో అదే సరైన పని అనిపించుకుంటుందని భావిస్తున్నారు కనుక ధైర్యంగా ముందుకు సాగండి. మాటలకు ప్రభావితం కాకండి!మా అత్తగారు యూనస్ కెనడీ ష్రైవర్ 1968లో స్పెషల్ ఒలింపిక్స్కు శ్రీకారం చుట్టినపుడు చాలామంది ఆమెను నివారించే ప్రయత్నం చేశారు. అదెలా సాధ్యపడుతుంది అన్నారు. ‘‘కుదరని పని. సంస్థల నుంచి పోటీదారులను బయటకు తీసుకురావడం కష్టం. వారు జంపింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడల్లో పాల్గొనేటట్లు మీరు చేయలేరు. ఒకవేళ పాల్గొన్నా, వారు గాయపడవచ్చు. ఒకరి నొకరు గాయపరచుకోవచ్చు. ఈతకొలనులో మునిగిపోతారు’’ అని నిరుత్సాహపరచారు. 40 ఏళ్ల తర్వాత, గొప్ప సంస్థలలో స్పెషల్ ఒలింపిక్స్ ఒకటిగా ఉంది. ఈరోజు మానసిక వైకల్యంతో బాధపడు తున్నవారికి 164 దేశాలలో అంకిత భావంతో పని చేస్తోంది. జనం మాటలకు ఆమె నీరుగారిపోయి తన ప్రయత్నం ఆపేసి ఉంటే, ఇది సాధ్యమయ్యేదా? అంతరాత్మ ‘‘నీకు సాధ్యమే’’ అని చెబుతుంటే ఇక ఎవరి మాటా వినకండి!శ్రమిస్తేనే విజేతలు కాగలరు!తగినంత కృషి చేయకుండానే విఫలం అవకూడదు. అంటే, ప్రయత్న లోపం ఉండకూడదన్నది నా ఉద్దేశం. గట్టిగా ప్రయత్నించిన తర్వాత విఫలమైనా ఫరవాలేదు. అంతేకానీ, కష్టపడి సాధన చేయకుండా, పోటీలో లేదా ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని నేను ఇష్ట పడను. లక్ష్య సాధనకు సర్వశక్తులూ ఒడ్డాలన్నదే నా అభిమతం. మధ్య మధ్యలో విరామం తీసుకోవడం కూడా ముఖ్యమే. కాదనను. కానీ, మనం సేదదీరుతున్న సమయంలో మరెవరో శ్రమించి పని చేస్తూ ఉంటారని గుర్తుంచుకోవాలి. వారూ విజేతలుగా నిలవొచ్చు. అంతమాత్రాన, ఏదో చేజారిపోయింది అని మనం అనుకోకూడదు. రోజుకు 6 గంటలు నిద్రిస్తే చాలు. మిగిలిన 18 గంటలూ పనిచేస్తూ ఉండాలి. సమయాన్ని సమర్థంగా నిర్వహించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలి. ఆకాంక్షలను నెరవేర్చుకు నేందుకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి.చురుగ్గా చేజిక్కించుకోవాలిరెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని నిచ్చెన ఎక్కగలం అని మాత్రం అనుకోకండి. కార్యాచరణకు దిగకుండా ‘విజయానికి సూత్రాల’ను నెమరువేయడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ, అవకాశాలను చేజిక్కించు కోవాలి. కలలను సాకారం చేసుకునేందుకు సోమరితనం వదిలించుకుని, చురుకుగా పనిచేయాలి. ఇవన్నీ మీకు తెలియనివి ఏమీ కావు. శ్రద్ధాసక్తులతో చదువుకోకపోతే మీరీ రోజు ఇక్కడ కూర్చో గలిగేవారే కాదు. ఇక మీరు ఏ రంగంలో ఉన్నా సరే, సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధపడాలి. అందుకు తగిన వ్యవధిని చిక్కించుకోవాలి. సమాజానికి, మీ రాష్ట్రానికి, లేదా మీ దేశానికి తిరిగి ఇవ్వడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. మా మామగారు సార్జంట్ ష్రైవర్ గొప్ప అమెరికన్. ఆయన పేదలకు న్యాయ సహాయం లాంటి పనులు నిర్వహించారు. ‘‘అదే పనిగా అద్దంలో మీ ముఖం మీరే చూసుకోకండి. కాసేపు అద్దాన్ని పక్కన పెట్టండి. అప్పుడే చేయూత అవసరమైన లక్షలాది మందిని మీరు మీ చుట్టుపక్కల చూడ గలుగు తారు’’ అని ఆయన ఒకసారి యేల్ పట్టభద్రుల స్నాతకోత్సవంలో చెప్పారు. ఇతరులకు సహాయపడడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదని మాత్రం నేను మీకు చెప్పగలను.ఎన్నింటిని దాటుకుని వచ్చాం!చివరగా ఇంకొక్క సంగతి చెబుతా! ఈ విశ్వవిద్యాలయాన్ని 1880లో నెలకొల్పారు. అప్పట్లో లాస్ ఏంజలెస్ చిన్న పొలిమేర పట్టణం. మీకన్నా ముందు 125 పట్టభద్రుల బృందాలు తయారై ఉంటాయి. వారు మంచి రోజులను, గడ్డు రోజులను, యుద్ధాలను, శాంతియుత పరిస్థితులను, ఆశలు రేకెత్తించిన కాలాన్ని, మహా అస్థి రమైన కాలాన్ని కూడా చూసి ఉంటారు. వాటన్నింటినీ దాటుకుని ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ యూనివర్సిటీ దృఢంగా నిలిచాయి. ఇపుడు మనం తిరిగి గడ్డు రోజులను, ప్రపంచంలో చాలా అస్థిరతను చూస్తున్నాం. ఒకటి మాత్రం ఖాయం. మనం వాటిని తట్టుకుని నిలబడగలం. మునుపటికన్నా పటిష్ఠంగా, సంపన్నమైనదిగా దేశం పునరుత్తేజం పొందుతుంది. ఆశావాదాన్నీ, పోరాట స్ఫూర్తినీ కోల్పో వద్దు. మీ అందరికీ అభినందనలు. ఆ కరుణామయుడి చల్లని చూపులు మీపై ప్రసరించాలి. -
మనసులను వేరు చేసి చూడలేం!
నిజాయతీపరుడైన, ఉన్నతమైన భారతీయుడు ఎవరూ పాకిస్తాన్ను సొంత ఇంటిగా భావించడం ఇక ఎంత మాత్రం అంగీకార యోగ్యమైన విషయం కాదా? మనలో కోట్లాది మంది నేడు పాకిస్తాన్గా భావిస్తున్న రాష్ట్రాలలో పుట్టినవాళ్లమే. ఆ రోజుల్లో, మాకు తెలిసిన సొంత ప్రాంతం అదే. నా తల్లితండ్రులు, సోదరీమణులు, నా దగ్గరి బంధువులలో చాలా మంది అక్కడే జన్మించారు. మా అమ్మ తొంభై ఏళ్ల వయసులో సొంతూరు వెళ్లాలని కోరుకున్నప్పుడు లాహోర్ పేరు చెప్పింది కానీ, జీవించిన ఛతర్పుర్ కాదు. ఛతర్పుర్లో పొలాలు గట్రా ఉన్నా ఆమెకు ఠక్కున లాహోర్ గుర్తుకొచ్చింది. పిట్రోడా మాటలపై వివాదంపాకిస్తాన్లో ఉండగా తనకు సొంత ఇంటిలోనే ఉన్నట్లు అని పించిందని శామ్ పిట్రోడా ఇటీవల మనసులో మాట చెప్పేసి నప్పుడు, పిట్రోడాకు దేశభక్తి లేదంటూ ఎన్డీటీవీ ఆయనపై విమర్శ లతో ఊదరగొట్టేసింది. ‘‘నేను ఈమధ్య పాకిస్తాన్ వెళ్లొచ్చాను. నాకు అక్కడ నా సొంత ప్రాంతంలో ఉన్నట్లు అనిపించిందని నేను మీకు చెప్పి తీరాలి’’ అని ఆయన అన్నారు. ‘‘నేను బంగ్లాదేశ్ వెళ్లాను. నేపాల్ కూడా వెళ్లొచ్చాను. రెండు చోట్లా సొంత ప్రదేశంలో ఉన్నట్లే అనిపించింది’’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ టీవీ ఛానల్లో ప్రసారమైన ఇరవై ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్లో పదిహేను నిమిషాలకు పైగా సమయాన్ని హానికరం కాని, భంగ కరంకాని ఆ వ్యాఖ్యను తూర్పారబట్టడానికే కేటాయించారు. బి.జె.పి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆయనను పరుషమైన పదజాలంతో నిందించారు. నేపాల్, బంగ్లాదేశ్లలో కూడా సొంతూ రులో ఉన్నట్లుగానే ఉందన్న శామ్ పిట్రోడా మాటలను పూనావాలా సమయానుకూలంగా విస్మరించారు. మనసులను తాకిన అద్వానీ వాస్తవం ఏమిటంటే, ఎల్.కె. అద్వానీ సొంత ప్రాంతం కూడా పాకిస్తానే! ఆయన పుట్టింది, చదువుకుంది కరాచీలోనే! పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా 2005లో ఖుర్షీద్ కసూరీ ఉన్నపుడు పాకిస్తాన్ సందర్శనకు రావాల్సిందిగా అద్వానీని ఆహ్వానించారు. అద్వానీకిఆ ఆహ్వానం సంగతి చెప్పి, ఆయన స్పందన ఏమిటో తెలుసుకుని చెప్పవలసిందిగా నన్ను కోరారు. ‘‘దానిదేముంది? సంతోషంగా వెళ్లి రావచ్చు. నాకు నా కుటుంబ సభ్యులను కూడా వెంట బెట్టుకుని వెళ్లాలని ఉంది’’ అని అద్వానీ అన్నారు. అలాగే, అద్వానీ వెంట ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. పాకిస్తాన్కు బయలు దేరేటపుడు అద్వానీ చేసిన ప్రకటన, తాను జరపబోయే ఆ పర్యటన తనకు ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా వెల్లడించింది. ‘‘వ్యక్తిగత స్థాయిలో ఈ పర్యటన నాకు ప్రగాఢమైన ప్రాధాన్యం కలిగినది. కరాచీలో పుట్టి పెరిగినవాడిని కనుక, ఈ సందర్శన, నాకు మూలా లకు తిరిగి వెళ్లటం లాంటిది. ఈ రెండు దేశాలు సుస్థిరమైన శాంతితో సాగే మార్గాన్ని ఆ పరమాత్మ చూపాలని నేను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. అయితే, లాహోర్లో అద్వానీ అన్న మాటలను నేను ఎన్నటికీ మరచిపోను. ‘‘ప్రతి భారతీ యుడి మనసులో కొద్దిపాటి పాకిస్తాన్, ప్రతి పాకిస్తానీ హృదయంలో కొద్దిపాటి ఇండియా ఉంటాయని నేను ఎప్పుడూ విశ్వసి స్తాను’’ అని ఆయన అన్నారు. అది మనసును తాకే వాస్తవం. ముఖ్యంగా పంజాబీలు, బెంగాలీలకు సంబంధించినంత వరకు కాదనలేనిది. ఈరోజుల్లో అయితే, ఎన్డీటీవీ, అద్వానీని కూడా ఏకి పారేసి ఉండేది. దాని జాతీయతావాద చెవులకు ఆ మాటలు దేశ ద్రోహంతో సమానంలా అనిపించేవి. అదృష్టవశాత్తూ, ప్రణయ్ రాయ్ ఆధ్వర్యంలో 2006లో అది చాలా భిన్నమైన ఛానల్లా ఉండేది. ఒకేలా అనిపించటం సహజమే!నా సంగతి కూడా చెప్పనివ్వండి. నేను 1980లో మొదటిసారి పాకిస్తాన్ సందర్శించాను. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లివచ్చాను. వెళ్లిన ప్రతిసారీ నాకు పూర్తిగా సొంత ఇంటిలోనే ఉన్నట్లే అని పించింది. వారి పంజాబ్లో భాష, ఆహారం, సంప్రదాయాలు, ఆచారాలు, ఇళ్లు, ప్రజా జీవనవిధానానికి మనకు తేడా ఏమీ లేదు. రెండింటినీ వేరు చేసి చూడలేం. అవే రకమైన మాటలతో శపిస్తాం లేదా అక్కున చేర్చుకుంటాం. అదే వైచిత్రి. తమిళులు, మలయాళీలు లేదా కన్నడిగులు సగటు పాకిస్తానీయులకు అపరిచితులుగా కనిపించవచ్చు. ఢిల్లీ, శ్రీనగర్లలో ఉన్నవారు కూడా అలానే అనిపించ వచ్చు. కానీ, అమృత్సర్, లూధియానాలలో ఉన్నవారు మాత్రం కాదు. పాకిస్తాన్ గురించి భారతీయుల తలపులు కూడా కొంత వరకు అదే రకంగా ఉంటాయని చెప్పవచ్చు. వారు మన దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. ఇటానగర్లో ఉండేవారికి కనిపించే సారూప్యం చాలా తక్కువ. అలీగఢ్లో ఉండేవారికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. అర్థం చేసుకోవచ్చు... కానీ!ఇటీవల దుబాయ్లో భారతీయ క్రికెట్ జట్టు ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా, క్రీడా స్ఫూర్తి కొరవడినదిగా కనిపించింది. ముఖ్యంగా నన్ను వేదనకు గురి చేసింది. పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేసేందుకు వారు తిరస్కరించడం క్రికెట్ అనిపించుకోదు. కరచాలనం అనే బ్రిటిష్ పదబంధానికి అర్థం ఏమైనా ఉందీ అంటే, తప్పకుండా దానిలోకి, రీతి రివాజులకు సంబంధించిన తేలికపాటి మర్యాదలు, సత్ప్రవర్తన కూడా రాకుండా ఉంటాయా? తప్పక పాటించవలసిన చక్కని నడవడికను పక్కన పెట్టాలని భారత జట్టు తీసుకున్న నిర్ణయంతో మన విజేతలు చిన్నవాళ్లుగా కనిపించారు. పహల్గావ్ు ఉగ్రదాడి అనంతరం పాకి స్తాన్తో ఆడకూడదని కోరుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. మైదానంలో అవతలి జట్టు ఎదురుగా నిలవడం ఇష్టం లేక ఒక ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి భారత్ తిరస్కరించడం ఇది మొదటిసారేమీ కాదు. దక్షిణాఫ్రికాతో ఆడడం ఇష్టం లేక 1974లో డేవిస్ కప్లో ఏకంగా ఫైనల్స్నే త్యజించడం ఇందుకు కలకాలం గుర్తుండే ఉదాహరణ. కానీ, ఒకసారి ఆడడానికి అంగీకరించిన తర్వాత, ప్రత్యర్థులతో కరచాలనం చేయడం ఆచారమే కాదు, నాగరికత అని కూడా అనిపించుకుంటుంది. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెబుతున్నా, ఆ అంశంపై ఎవరూ దృష్టి సారించకపోవడం నన్ను ఆశ్చర్యపరచింది. అలాగే, పాక్లో ఉన్నపుడు సొంత ఇంటిలోనే ఉన్నట్లుగా అనిపించిందని శామ్ పిట్రోడా అన్నందుకు, ఆయనని ఏకిపారేయడం కూడా నన్ను అంతే ఆశ్చర్యపరచింది. నిజం చెప్పాలంటే, నా దేశస్థుల గురించి నేను తెలుసుకుంటున్న కొద్దీ నాలో ఆశ్చర్యం పాలు ఎక్కువ అవుతోంది!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
శశి థరూర్, (కాంగ్రెస్ ఎంపీ) రాయని డైరీ
ఆటలో– ‘పడని’వాళ్లు ఉండరు. తలపడవలసిన వాళ్లు మాత్రమే ఉంటారు. రాజకీయాలైనా అంతే. గెలుపు కోసం ఆటలోకి దిగినవాడు యోధుడైతే, ఓడించటానికే ఆడేవాడు మహాయోధుడు! శ్రీ మోదీజీ నాకెప్పుడూ యోధుడిలా అనిపించరు. అన్నీ బయటికే అనలేం. కొన్ని అనకుండానూ ఉండలేం. నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కనుక, మా వైపూ యోధానుయోధులు ఉండే ఉంటారు కనుక, మోదీజీని నేను ‘మహాయోధుడు’ అనకూడదు. అనకూడదు కానీ, అనకుండా ఉండలేక పోతున్నాను కనుక, మోదీజీ యోధుడు కాదు అని మాత్రమే అనవలసి వస్తోంది.జట్టులో కెప్టెన్ అంటూ ఒకరు లేరంటే, జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్కు సమానమైన వాళ్లేనని! ఇది బీజేపీ స్టయిల్. జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్కు సమానమైన వాళ్లే అయినప్పటికీ, కెప్టెన్ ఎవరో తేల్చుకోలేక పోతున్నారంటే జట్టులో ఎవరి ఆట వారిదేనని! ఇది కాంగ్రెస్ ట్రెడిషన్! ఎప్పటిలా ఆటకు ముందే, తన ఆట మొదలు పెట్టేశారు మోదీజీ! నవంబరులో బిహార్ ఎన్నికలు. మార్చిలో బెంగాల్ ఎన్నికలు. ఏప్రిల్లో తమిళనాడు ఎన్నికలు. బిహార్ క్యాంపెయిన్కు ధర్మేంద్ర ప్రధాన్ని, సి.ఆర్. పాటిల్ని, కేశవ్ ప్రసాద్ మౌర్యని; పశ్చిమ బెంగాల్ క్యాంపెయిన్కు భూపేందర్ యాదవ్ని, విప్లవ్ కుమార్ దేవ్ని; తమిళనాడు క్యాంపెయిన్కు వైజయంత్ పాండాను, మురళీధర్ మొహల్ను పంపిస్తున్నారు మోదీజీ!‘పర్ఫెక్ట్ కాంబినేషన్‘, ‘పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‘ అని ప్రత్యర్థి జట్టు చేత కూడా అనిపించుకోగలరు ఆయన.బిహార్ వెళ్లే ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్. సి.ఆర్. పాటిల్ యూనియన్ మినిస్టర్–కమ్–గుజరాత్ బీజేపీ చీఫ్. కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.పశ్చిమ బెంగాల్కు వెళ్లే భూపేందర్ యాదవ్ యూనియన్ మినిస్టర్. విప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి.తమిళనాడుకు వెళ్లే వైజయంత్ పాండా పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మురళీధర్ మొహల్ యూనియన్ మినిస్టర్.ప్రధాన్, యాదవ్... ఓబీసీ ఓట్ల స్ట్రాటజిస్టులు. హర్యానాలో బీజేపీ ప్రధాన్ వల్ల గెలిచింది. మహారాష్ట్రలో యాదవ్ వల్లగెలిచింది. ఇక మౌర్య, దేవ్, పాండా, మొహల్ సముద్రపు గాలుల్నే మలుపు తిప్పగలిగిన నావికులు! కాంగ్రెస్ ఇంకా గంగా నది ఒడ్డునే ఉంది! పట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్లో బిహార్ ఎన్నికల గురించి ఒక వ్యూహం లేదు.బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఊసే లేదు.‘‘85 ఏళ్ల క్రితం ఇక్కడే ఈ సదాఖత్ ఆశ్రమంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది’’ అనుకున్నారు. ‘‘మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడే సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది...’’ అన్నారు. ‘‘85 ఏళ్ల క్రితం అప్పటి ఆ సీడబ్ల్యూసీ మీటింగ్కు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారు’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు ఈ మీటింగ్కు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు’’ అన్నారు. ‘‘85 ఏళ్లకు ముందు ఈ ఆశ్రమంలో గాంధీ, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు సమావేశం అయ్యేవారు...’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు రాహుల్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వంటివారు హాజరయ్యారు’’ అన్నారు.అన్నీ అనుకున్నాక, అన్నీ అన్నాక – ‘‘అది స్వాతంత్య్ర పోరాటం అయితే, ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’’ అని తీర్మానించి ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు! రెండో స్వాతంత్య్ర పోరాటం, మూడో స్వాతంత్య్ర పోరాటం... అవసరం అయితే ఎన్ని స్వాతంత్య్ర పోరాటాలైనా చేయవలసిందే! కానీ కాంగ్రెస్... గెలిచే పోరాటం చేయటం లేదు, ఓడించే పోరాటమూ చేయటం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కబడ్డీ జట్టుతో ఆటకు బిలియర్డ్స్ ప్లేయర్స్ని దింపుతూ ఉంటుంది!! -
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ఎలా?
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత న్యాయ వ్యవస్థలోని పలు కీలక అంశాలను స్పృశించారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ–సవాళ్లు, పౌరుల స్వేచ్ఛ మొదలు – రాజకీయాలతో ముడిపడిన కేసుల విచారణ సమయంలో, ప్రత్యేకించి ఈ సోషల్ మీడియా యుగంలో న్యాయమూర్తులు ఎదుర్కొనే సంఘ ర్షణ వరకు వివిధ సున్నిత అంశాలపై లోతైన దృష్టి కోణాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఆవిష్కరించారు. తాను రచించిన ‘వై ది కాన్ స్టిట్యూషన్ మేటర్స్’ అనే కొత్త పుస్తకంలోని విశేషాంశాల ఆధారంగాసాగిన ఈ ఇంటర్వ్యూలో న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతనుజస్టిస్ చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ఆ సుదీర్ఘఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.భిన్నాభిప్రాయాలపై ఫిర్యాదులు ఓ భయంకర ధోరణి!మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అభిప్రాయ వ్యక్తీకరణకు సోషల్ మీడియా స్వేచ్ఛా వేదిక. అలాంట ప్పుడు భిన్నాభిప్రాయాలు తప్పవు. కానీ, ఏం మాట్లాడితే కేసు పెడతారోనని సంకోచించే పరిస్థితులు ఉన్నప్పుడు అవి అభిప్రాయ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతాయి. తద్వారా మాట్లాడే హక్కుకు భంగం కలుగుతుంది. మన అభిప్రాయం వ్యతిరేకంగా ఉందని, లేదా అనుకూలంగా లేదని ప్రత్యర్థులో, ప్రభుత్వమో భావిస్తే పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఇలాంటి భయాలు, సంకోచాలు ఇండియాకు మాత్రమే ప్రత్యేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యే! మరో వైపు ప్రజా క్షేత్రంలో సైతం అసహనశీలత ఎక్కువైంది. సాధారణంగా ఎవరైనా తమకు నచ్చిందే వినాలనుకుంటారు. ఎవరో కార్టూన్ వేస్తేనో, లేక మరెవరో ప్రకటన జారీ చేస్తేనో, లేదంటే ప్రసంగిస్తేనో... అది ఎవరికో నచ్చకపోతేనో వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు, దేశంలోని ఏ ప్రాంతంలోని వారైనా ఫిర్యాదు చేయవచ్చు. ఏకకాలంలో పది వేర్వేరు ప్రాంతాల నుండీ కేసులు నమోదు కావచ్చు. ఇది నిజంగా చాలా భయంకరమైన ధోరణి. మాట్లాడితే మిమ్మల్ని శిక్షించవచ్చు అనే భయం చాలా ఆందోళన కలిగించే విషయం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. విమర్శలను తప్పు పట్టలేం!అభిప్రాయాలు వ్యక్తం చేసేవారికి కూడా బాధ్యత అవసరం. ముఖ్యంగా – సోషల్ మీడియా ద్వారా ద్వేషం, అసహనం వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున మాటలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సామాజిక స్పృహను కలిగి ఉండాలి. మన సమాజం బహుళ మతాలు, సంస్కృతుల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛా హక్కు ఉన్నా, మత భావాలను దెబ్బతీయకుండా మాట్లాడాలి. లేకపోతే చట్టపరమైన పరిణామాలు తప్పవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ఇందుకు ఉన్న సహేతుకమైన పరిమితులను వివరిస్తుంది. అయితే ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడాన్ని మాత్రం తప్పు పట్టలేం. ఇది సానుకూల ఫలితాలకే దోహదం చేస్తుంది.చట్టాల పునఃసమీక్ష అవసరంబ్రిటిష్ ప్రభుత్వం ఇండియాను పాలిస్తున్నప్పుడు చేసిన ‘దేశద్రోహం’ వంటి చట్టాలను నేడు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ‘భారత్ ఒక దేశంగా నిలవగలదా?’ అని స్వాతంత్య్రానికి ఆరంభంలో సందేహాలు ఉండేవి. కానీ రాజ్యాంగ నిర్మాణం దేశాన్ని అత్యంత పటిష్ఠంగా ఉంచేలా జరిగింది. ఈ ఏడున్నర దశాబ్దాలలో భారత్ ఒక బలమైన, స్థిరమైన రాజకీయ వ్యవస్థగా అభివృద్ధిచెందింది. కాబట్టి అప్పటి చట్టాలను సమీక్షించాలి. అలాగే ‘పరువు నష్టాన్ని’ క్రైమ్ పరిధి నుంచి తప్పించాలి. ఎందుకంటే, క్రిమినల్ డిఫమేషన్ గురించి కొత్త దృష్టికోణంతో పరిశీలించడం అవసర మనిపిస్తోంది. ఒకవేళ డిఫమేషన్ను క్రిమినల్ చర్యగా కొనసాగించాలంటే కొన్ని పరిమితులను తప్పక ఏర్పరచుకోవాలి. నేర స్వరూ పాన్ని కొత్తగా నిర్వచించాలి. మొత్తం ఈ చట్టాన్ని పార్లమెంట్ తిరిగి పరిశీలించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను.ప్రజలూ రాజ్యాంగ పరిరక్షకులే!భారత రాజ్యాంగం 75 ఏళ్లుగా దృఢంగా నిలిచి ఉండటం గర్వకారణం. రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదు. ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడింది. ప్రధాన పీఠికకు ఎటువంటి భంగం కలుగకుండా పార్లమెంట్ ఎటూ సవరణలు చేస్తుంటుంది. కాలానికి తగ్గట్లు కోర్టులూ సూచనలు చేస్తుంటాయి. అందుకే రాజ్యాంగం సాధారణ చట్టం తరహాలో కాకుండా తరతరాల శాశ్వత విలువలను ప్రతిబింబిస్తుంది. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లు, రాజ్యాంగ ఫలితం దానిని అమలు చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కేవలం న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలకూ రాజ్యాంగ పరిరక్షణలో బాధ్యత ఉంది.గత తీర్పుల సమీక్ష సహజం!మన పాలనలో లోపాలున్నప్పటికీ ఆ పాలనను పూర్తిగా తిర స్కరించాలనడం సరికాదు. విధానాల్లో అపసవ్యతలు ఉన్నప్పటికీ మన దేశం సాధించిన ఎన్నో విజయాలను కూడా గుర్తించాలి. హక్కుల సాధనలో మనం గొప్ప ముందడుగు వేశాం. ఇది మనం అంగీకరించవలసిన అంశం. అవసరాలకు అనుగుణంగా గత తీర్పుల సమీక్షలు ఎలాగూ జరుగుతుంటాయి. ఉదాహరణకు అత్యవసర పరిస్థితుల్లో ‘జీవించే హక్కు’ను తాత్కాలికంగా నిలిపే యవచ్చు’ అని ఏడీఎం జబల్పూర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఆ తర్వాత ఉపసంహరించుకోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఏ సమాజ చరిత్రలోనైనా ఉంటుంది. జైలు కాదు... బెయిల్ ముఖ్యం!ఉపా (ఉగ్రవాద కార్యకలాపాలు), పీఎంఎల్ఏ (మనీ ల్యాండ రింగ్) వంటి కొన్ని నిరోధక చట్టాల విషయంలో బెయిళ్లకు చాలా కఠినమైన నియమాలు అమలవుతున్నాయి. ఇది ఒక సమస్యే. న్యాయవ్యవస్థలోని అసలు సూత్రం ఏమిటంటే.. ‘ఆరోపణ నిరూ పణ అయ్యేంతవరకు ఒక వ్యక్తి నిర్దోషే’నన్నది. జస్టిస్ కృష్ణ చెప్పి నట్లు.. ‘బెయిలు నియమం కావాలి, జైలు మినహాయింపు అవాలి.’ (బెయిల్ మస్ట్ బి ది రూల్.. జైల్ మస్ట్ బి ఎక్సెప్షన్ ). ఏదైనా కేసులో అరెస్టయిన వ్యక్తి ప్రతి వాయిదాకు, అవసరమైనప్పుడూ, కోర్టు ముందుకు హాజరయ్యే హామీ ఇస్తే బెయిల్ ద్వారా ఆ వ్యక్తిని తాత్కా లికంగా విడుదల చేయవచ్చు. కోర్టులు వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలి!జస్టిస్ సూర్యకాంత్ ఒక ప్రతిష్ఠాత్మకమైన తీర్పు ఇచ్చారు. నిర్దిష్ట సమయంలో విచారణ ముగియకపోతే కఠిన చట్టాలు ఉన్నా బెయిల్ను మంజూరు చేయవచ్చు. ఉదాహ రణకు ఒక కేసులో 100 మంది సాక్షులు ఉన్నారు. వారందరి విచారణకు 5–7 సంవ త్సరాలు పడుతుంది. ఈ కేసులో నింది తుడు చివరకు నిర్దోషిగా తేలితే అప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు జైల్లో ఉండటం అన్యాయం. అందుకే ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు సంరక్షించాల్సిన అవసరం ఉంది. సాక్షులను ప్రభా వితం చేసే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడం జిల్లా కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు అన్నిటి బాధ్యత.బెయిల్పై భిన్నమైన తీర్పులు తగ్గాలి!బెయిల్ మంజూరు విషయంలో భిన్నత్వం నిజమే. కానీ సుప్రీంకోర్టులో ప్రతి సంవత్సరం 70 నుంచి 80 వేల కేసులు దాఖలవుతున్నాయి. 34 మంది జడ్జీలు ఒకే సారి ఒకే కేసును విచారించలేరు కనుక ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులున్న బెంచ్లుగా విభజించడం జరుగు తుంది. ఫలితంగా వ్యక్తిగత న్యాయమూర్తుల ఆలోచనల వల్ల తీర్పుల్లో భిన్నాభిప్రాయాలు వస్తాయి. అందువల్ల బెయిల్స్ విష యంలో భిన్నమైన తీర్పులు వెలువడవచ్చు. ఈ భిన్నత్వాన్ని తగ్గించ వచ్చు కానీ పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ విషయంలో మాత్రం ఏ బెంచ్కైనా ఒకే విధమైన ప్రాధాన్యత ఉండాలి. సుప్రీంకోర్టు నుండి హైకోర్టు లకు, అక్కడి నుండి జిల్లా కోర్టులకు ఈ సందేశం చేరాలి.వెనకాడుతున్న జిల్లా కోర్టులు!మన జిల్లా కోర్టులు బెయిల్ ఇవ్వాల్సిన కేసులలో కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా ఏమవుతోందంటే... జిల్లా కోర్టు ద్వారా బెయిల్ సాధ్యమయ్యే కేసులు కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్తాయి. ఇందులో పలు ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. మొదటిది ఆలస్యం. జిల్లా కోర్టు నుండి హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు వరకు కేసును తీసుకెళ్లేటప్పుడు తీవ్ర జాప్యం జరుగుతుంది.రెండవది వనరులు. ప్రతి ఒక్కరికీ సుప్రీంకోర్టు వరకు వెళ్లే వనరులు ఉండవు. వనరులు లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లలేకపోవచ్చు. మూడవది ఇలాంటి వ్యవస్థ సుప్రీంకోర్టుపై అనవసర పనిభారాన్ని మోపుతుంది. ఇది భారతదేశంలోని సంక్లిష్టత, వైవిధ్యం, కేసుల పరిమాణాన్ని సూచిస్తుంది. న్యాయమూర్తుల సంఖ్య పెంచడంకంటే సుప్రీంకోర్టుకు వచ్చే కేసులను పరిమితం చేయడం అవసరం. ప్రభుత్వం అతి పెద్ద కక్షిదారు కావడం వల్ల కేసుల భారమూ అధిక మవుతోంది. కాబట్టి సంస్థాగత సమీక్ష అవసరం. పదవీ విరమణ వయసు పెంచాలి!న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసు ఉండాల్సిందే. అయితే ఆ వయఃపరిమితిని పెంచవలసిన అవసరం కూడా ఉంది. అలాగని అమెరికా సుప్రీంకోర్టు తరహాలో న్యాయమూర్తులు ఎప్ప టికీ పదవిలో కొనసాగడమనే పరిస్థితి ఉండకూడదు. కొత్త తరానికి అవకాశం రావాలి. ఇండియాలో ప్రస్తుత పదవీ విరమణ వయసు (జిల్లా జడ్జిలు 60, హైకోర్టు జడ్జిలు 62, సుప్రీంకోర్టు జడ్జిలు 65) తక్కువనే చెప్పాలి. సగటు జీవన ప్రమాణం పెరిగినందు వల్ల విరమణ వయసులనూ పెంచాలి. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వేర్వేరు వయసులు ఉండకూడదు. అందరికీ సమానంగా 68 చేయాలి. దాని వల్ల సుప్రీంకోర్టుపై కేసుల ఒత్తిడి తగ్గుతుంది. -
ఒప్పందమా? వ్యూహాత్మకమా!
పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య అనూహ్యమైన రీతిలో ఈనెల 17న జరిగిన రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు దేశాల రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నవే. సౌదీ రాజు ఫైజల్, పాక్ అప్పటి ప్రధాని అయూబ్ ఖాన్ల మధ్య 1967 లోనూ ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి పరిస్థితులు, అవసరాలు సాధారణ స్థాయివి. అప్పటికి పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కూడా కాదు. నాటి నుంచి 58 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అన్నీ మారాయి. అరబ్ దేశాలు, ముస్లిం దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో సంక్లిష్టంగా కూడా అయ్యాయి. అందువల్లనే ప్రస్తుత ఒప్పందం గమనార్హమైనది అవుతున్నది.దాడి తర్వాతే కుదిరిన ఒప్పందం! ఒప్పందం జరిగిన తక్షణ పరిణామాలు కూడా ప్రాముఖ్యం కలిగినవి. ఈ నెల 9న గల్ఫ్ దేశమైన ఖతార్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో వ్యూహా త్మక సంబంధం గల అరబ్ దేశాలు, తమ ప్రాంతంలో అర డజను అమెరికన్ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నవి అయినప్పటికీ ఈ దాడి జరగటం ఒకటైతే, మళ్లీ దాడులకు వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అది చాలదన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో స్వయంగా టెల్ అవీవ్కు వెళ్లి ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించటం సౌదీతో పాటుగా సహ గల్ఫ్ దేశాలన్నింటిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధోక్తులు వాటికి తోడయ్యాయి. ఈ తక్షణ నేపథ్యంలో జరి గిందే పాకిస్తాన్తో సౌదీ రక్షణ ఒప్పందం.అక్కరకు రాని అగ్రరాజ్యంఒప్పందం అనంతరం మీడియా ప్రశ్నలకు సౌదీ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన ఒక సమాధానం ఇదే స్థితిని ధ్రువీకరిస్తున్నది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉండి, 1967 నాటి ఒప్పందం కూడా ఒకటి ఉన్నప్పుడు తిరిగి ఈ ఒప్పందం ఎందుకన్న ప్రశ్నకు ఆ ప్రతినిధి ఇచ్చిన సమాధానం – ‘అనిశ్చితంగా మారిన భవిష్యత్ అవసరాల కోసం’ అని! పైన ప్రస్తావించిన పరి ణామాల కారణంగా భవిష్యత్తు ఎందుకు అనిశ్చితంగా మారిందో వేరే వివరణ అవసరం లేదు. ఇక్కడ గుర్తించవలసిన మరొక విషయం ఏమంటే, అటువంటి అనిశ్చిత పరిస్థితులలో ఒక అణ్వస్త్ర దేశంతో సౌదీకి ఒప్పందం అవసరమైంది. సాటి గల్ఫ్ దేశం అయిన ఖతార్పై ఇజ్రాయెల్ అనే ఒక అణ్వస్త్ర దేశం దాడి జరిపినప్పుడు మరొక అణ్వస్త్ర దేశమైన అమెరికాతో తమకు గల వ్యూహాత్మక సంబంధం సౌదీకి కొరగానిది అయింది. దాంతో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్తో పరస్పర రక్షణ ఒప్పందం అనివార్యం అయినట్లుగా కనిపిస్తోంది. మిగతా దేశాలూ చేరుతాయా?!ఒప్పంద పాఠం వెల్లడి కాలేదు గానీ, వారు అధికారికంగా ఒక ప్రకటనలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ‘రెండి టిలో ఏ దేశం పైన బయటి నుండి ఎవరు దాడి జరిపినా రెండవ దేశంపై కూడా జరిపినట్లే పరిగణించి, దాడికి గురైన దేశానికి తోడుగా నిలుస్తారు. ఉభయుల రక్షణకు అవసరమైన పరస్పర సహ కార చర్యలు ఇప్పటికన్నా మరింతగా తీసుకుంటారు’. ఈ ఒప్పందం పరిధిలోకి పాకిస్తాన్ అణ్వస్త్రాలు కూడా వస్తాయా అన్న సూటి ప్రశ్నకు రెండు దేశాల ప్రతినిధులు కూడా... పాకిస్తాన్కు గల ఆయుధశక్తి మొత్తం వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణు దేశమే గాక ముస్లిం ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇతర గల్ఫ్ దేశాలు సైతం ఈ ఒప్పందంలో చేరవచ్చునా అన్న ప్రశ్నకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, తమ ద్వారాలు ఎవరికీ మూసుకుపోలేదన్నారు. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి 9న; అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం 15న జరిగిన తర్వాత, 17న ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి వారం రోజులలో ఆ సమావేశ దేశాలు గాని; ఇజ్రాయెల్, అమెరికా, యూరప్లు గాని స్పందించలేదు. భారత ప్రభుత్వ ప్రతినిధి మాత్రం, ‘మా మనోభావాలను సౌదీ నాయకత్వం మన్నించగలదని ఆశిస్తున్నా’మన్నది. అయితే, వెంటనే తలెత్తుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ సౌదీపై ఇజ్రాయెల్ దాడి జరిపితే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటుందా? పాల్గొంటే అమెరికా ఏం చేయవచ్చు? అదే విధంగా ఇండియా–పాక్ల మధ్య సాయుధ ఘర్షణ, లేదా యుద్ధం జరిగితే సౌదీ ప్రభుత్వం తన అపారమైన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్కు సమకూర్చుతుందా... అన్నవి ఆ ప్రశ్నలు. ఇక్కడ పాక్ రక్షణ మంత్రి 20వ తేదీన చెప్పిన మాటను గమనించాలి. తమ ఒప్పందం ఇరువురి ఆత్మరక్షణకే తప్ప ఇత రులపై దాడి చేసేందుకు కాదని, ఒకవేళ తమపై భారతదేశం దాడి జరిపితే మాత్రం సౌదీ అరేబియా తప్పక రంగంలోకి వస్తుందని, ఆ విషయమై ఎంత మాత్రం సందేహం అక్కర లేదని అన్నారాయన. ఊహకందని పర్యవసానాలుభారత ప్రభుత్వం ఈ అసాధారణ పరిణామాన్ని అనివార్యంగా గమనికలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాగల రోజులలో మరిన్ని అరబ్, ముస్లిం దేశాలు ఈ ఒప్పందంలో చేరితే పరిస్థితి తీవ్రత ఆ మేరకు పెరుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా తీరును బట్టి అది జరగవచ్చు కూడా! ఒప్పందానికి ఇది ఒక కోణం కాగా, ఇజ్రాయెల్ వైఖరిలో గమనించవలసిన మరొక కోణం ఉంది. వారి దాడులు ఖతార్తో ఆగుతాయా లేక ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే అవకాశం ఉందా? ఈ దేశాలకు అమెరికాతో గల వ్యూహాత్మక సంబంధాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుత ఒప్పందాన్ని ప్రభావితం చేసి నిరుపయోగంగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుందా? ఇటువంటి ఒప్పందం మూలంగా రాజకీయంగా పాకిస్తాన్ పాత్ర బలోపేతంగా మారే అవకాశం ఉంది గనుక ఆ ప్రభావం భారత్పై ఏ విధంగా ఉండవచ్చు?... అన్నీ ప్రశ్నలే. మున్ముందు అనేక మలుపులుఏమైనా... ఖతార్పై దాడి, అమెరికా మౌనం, దోహా శిఖరాగ్ర సమావేశం, సౌదీ–పాక్ ఒప్పందం అనే నాలుగు పరిణామాలు మాత్రం అసాధారణమైనవి. కేవలం 9 రోజుల పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాల అర్థం మున్ముందు అనేక రూపాలలో ఉంటుంది. ఈ పరిణామ పరంపరకంతా మూలకారణమైన పాలస్తీనా సమస్య ఏమి కానున్నదనేది అన్నింటికీ మించిన ప్రశ్న. వాస్త వానికి ఆ సమస్య కొనసాగటంలో ఇజ్రాయెల్, అమెరికాల బాధ్యత ఎంతున్నా, పరిష్కారం కోసం కచ్చితమైన వైఖరితో పట్టుదలగా ప్రయత్నించని దోషం మాత్రం అరబ్ దేశాలదే! వారు ఇప్పటికైనా ఆ పని చేయనట్లయితే, అన్ని దాడులు, పాలస్తీనా హత్యాకాండల దోషం వారిదే అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమృత కలశంలో అభాండాల విషం
ప్రజలకు నిశ్శబ్దంగా సేవ చేసేవారు ఒకరు. సేవ చేస్తున్నాము అని పెద్దగా అరుస్తూ ప్రకటించుకునేవారు మరొకరు. కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోని సంస్కారం ఒకరిది. గోరంత కూడా చేయకుండానే కొండంత చేశామని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రక టనలు ఇచ్చుకునే దగాకోరు సంస్కారం మరొకరిది. మొదటి వారు మాజీ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, మరొకరు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అయినప్పటికీ – అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల ఆరంభ సందర్భంలో పలు వాస్తవాలను మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను.బాబుది అదే నీతి, అదే రీతి!తన అయిదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మానికి, హైందవ ధర్మ ప్రచారానికి, ధర్మ రక్షణకు జగన్మోహన్రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. కాని ఆయన ప్రచారం కోరుకోలేదు. కరోనా కాలంలో ప్రపంచంలోని ప్రతి వ్యవస్థా స్తంభించి పోయింది కాని, రాష్ట్రంలో ఏ హిందూ దేవాలయంలోనూ పూజలు ఆగలేదు, జగన్ ఆగనివ్వలేదు. అధికారంలో ఉన్నపుడు వందల ఆలయాలు కూల్చిన చంద్రబాబు, దైవ పూజను కాలికి బూట్లు తీయకుండానే చేసే చంద్రబాబు; సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టి, శాలువా కప్పుకుని మైకు ముందు ఊగితే చాలు అనుకునే ‘పవన’స్వామి... జగన్ పాలనలో హైందవ ధర్మానికి ఏదో అన్యాయం జరిగిందని అరుస్తున్నారు. మల మూత్రాలు, మద్యమాంసాల మధ్య సాక్షాత్తు మహావిష్ణువు విగ్రహం పడి ఉందయ్యా అంటే, ఆ తప్పును గుర్తించి సరిచేసుకోక, చెప్పిన వాడిది తప్పు. వెంటనే జైల్లో పెట్టండి అని పోలీసులను పురమాయిస్తున్నారు. అబద్ధాలు చెప్పే వాడికి అందలాలు, నిజం చెప్పే వాడికి అరదండాలు వేయడం అన్నది ఆది నుంచీ చంద్రబాబు నీతి, రీతి!హైందవ ధర్మానికి స్వర్ణయుగంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలం వేద సంస్కృతికీ, హైందవ ధర్మానికీ స్వర్ణయుగం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలన, జగన్ మోహన్రెడ్డి పాలన చిరస్మరణీయం అన్నది ప్రజావాక్కు. గత అయి దేళ్లు ప్రతి పక్షంలోనూ, ఇపుడు ప్రభుత్వంలోనూ చంద్రబాబు చేస్తున్న ఒకే ఒక్క పని... జగన్ను తిట్టడం! జగన్ చేసిన మంచి పనుల మీద బకెట్లతో కాక ఓ నదీ ప్రవాహంలా విషాన్ని చల్లడం! హిందూధర్మం మరింత వెలిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం దేదీప్యమానమైందీ నిస్సందేహంగా జగన్ వల్లనే, ఆయన పరిపాలనా కాలంలోనే! తిరుమలలో ‘శ్రీవాణి ట్రస్టు’ ద్వారా స్వామి వారి దర్శనానికి అంకురార్పణ చేసింది జగనే. తద్వారా శ్రీవారి శీఘ్ర దర్శనం, దేశవ్యాప్తంగా శి«థిలమై ఉన్న హైందవ దేవాలయాల పున రుద్ధరణ జరిగింది. బాబుకు అది అర్థం కాక ‘శ్రీవాణి ట్రస్టు’పై అనేక ఆరోపణలు చేశారు. చేయించారు. తాను అధికారంలోకి వస్తే శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తామని ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు రద్దు మాటఅటుంచి, మరిన్ని ఎక్కువ టికె ట్లను అమ్ముతున్నారు. ఆలయాలలో దీపాలు వెలిగించి ఆరాధించిన వారు జగన్. విస్తరణ పనుల పేరుతో వందల ఆలయాలను కూల్చిన మనిషి చంద్రబాబు. ఎవరు నిజమైన హైందవ ధర్మ రక్షకులు? ఇప్పుడేదీ గో సంరక్షణ?!జగన్ హయాంలో దేవస్థానం గోశాల సంరక్షణ జరిగింది. గోవులు ఆరోగ్యంగాను, ఆనందంగాను ఉన్నదీ అప్పుడే. గో సంత తిని మరింత అభివృద్ధి చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాల కింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు,ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకురావడం జరిగింది. వాటి సంరక్షణకు, సంతతికి వృద్ధికి పక్కా ప్రణాళికలు తయారుచేసి అమలు చేయడం మొదటిసారి జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ గోశాలలను గుర్తించి అనేక గోశాలలకు మేత, నిర్వహణ వ్యయం అందించింది జగనే. ఈ కూటమి ప్రభు త్వంలో, ఈ ధార్మిక మండలి పాలనలో దేవస్థానం గోశాలలో ఎన్ని గోవులు ఆకలితో, అనారోగ్యంతో మరణించాయో అందరికీ తెలుసు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు నవనీత ప్రియుడు. అందుకే నిత్యం ఆయనకు నవనీత సేవ జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ అత్యంత యాంత్రికంగా జరిపేవారు. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. ప్రతినిత్యం శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగ చిలికించి, వెన్న తీసి అప్పుడే తీసిన నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించడం ఎంత ధార్మిక కార్యం!వేదంలా ఘోషించిన అలిపిరితిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించాం. వేద వ్యాప్తికి, రక్షణకు, హైందవ ధర్మ పరిరక్షణకు అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం చేయదగ్గ కార్యక్రమాలు ఎన్నో వారు వివరించారు. ఈ ఘనత జగన్ది కాదా? వేదమూర్తి, వేద స్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేదఘోష వినిపించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హెూమం ప్రారంభించాం. యువత వక్రమార్గం పట్టకుండా సక్రమ మార్గంలో సరైన హిందువుగా జీవించాలని శ్రీవారి గోవింద కోటి రాసినవారికి శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాం. గోవిందనామ కోటి రాసి ఆలయ సంబంధిత అధికారికి అందజేస్తే వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా శ్రీవారి బ్రేక్ దర్శనం లభించేలా చేశాం. వంద కీర్తనలకు బాణీలువేదాలు, పురాణాలు అందరికీ అర్థం అయ్యే భాషలో ముద్రించ డానికి ప్రత్యేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. గతంలో నేను దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వ్యాఖ్యానంతో, ప్రతి పదార్థంతో కూడిన భారతాన్ని, భాగవతాన్ని ముద్రించాం. దేవ స్థానం గ్రంథాలలో అత్యంత అధికంగా అమ్ముడు పోతున్నవి అవే. సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేల సంకీర్తనలు రచించారు. అందులో కేవలం పదివేల కీర్తనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎస్.వి. భక్తి ఛానల్, ఇతర పండి తులు, సంగీతకారుల సహాయంతో నూతనంగా దాదాపు 100 కీర్తన లకు బాణీలు కట్టించి వెలుగులోనికి తెచ్చాం. ఆంజనేయస్వామి జన్మస్థలం మీద ప్రజలలో అనేక వాదాలు, అపోహలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని పండిత పరిషతు ఏర్పాటు చేశాం. వారు వేలాది గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు, భౌగోళిక అంశాలు పరిశీలించారు. ఆంజనేయుని జన్మ స్థలం తిరుమలలోని అంజనాద్రి అని నిర్ధారించారు. ఆ ప్రాంతంలో బాల ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. జీవన భృతికి పారాయణంరాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, గిరిజన తండాలకు చెందిన వారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలలోను, వైకుంఠ ఏకాదశి సందర్భంగాను ఉచిత దర్శనం కల్పించాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వేదం వినిపించాలనే, బ్రాహ్మణ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే మహత్తర సంకల్పంతో 700 మందికి పైగా వేద పారాయణ దారులను నియమించాలని సంకల్పించాం. దాని ద్వారా 700 పేద బ్రాహ్మణ కుటుంబాలకు జీవన భృతి ఏర్పడుతుంది. గ్రామ గ్రామాన వేదం వర్ధిల్లి, ధర్మరక్షణ జరుగుతుంది. కాని ఈ కూటమి ప్రభుత్వం, ఈ ధర్మకర్తల మండలి ఈ నియామకాలకు అడ్డుపుల్ల వేసింది. సనాతన ధర్మరక్షణ కంకణాబద్ధుడైన ‘పవనానందుడు’ దీనిపై మాట్లాడకపోవడం, 700 మంది పేద బ్రాహ్మణ కుటుంబాల నోరు కొట్టడం ఏ ధర్మరక్షణో ఆయనే చెప్పాలి.కూటమి వచ్చాక నత్తనడకతిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగులకు సైతం ఇంటిస్థలాలు ఇచ్చి తీరాలన్నది జగన్ సంకల్పం. నేను రెండవసారి అధ్యక్షుడిగా ఉండగా ప్రభుత్వం నుంచి దాదాపు 1200 ఎకరాల స్థలం తీసుకొని తి.తి.దే విశ్రాంత ఉద్యో గులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాం. తి.తి.దే.లోని కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల జీతం 5 వేల నుంచి 20 వేల వరకు పెంచి వారి కుటుంబాలకు ఆనందం పంచాం. 2021లో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల నిమిత్తం రూ. 320 కోట్లతో పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టాం. అత్యవసరంగా పూర్తి చేయవలసిన ఆ పను లను ఈ కూటమి ప్రభుత్వం నత్తనడక నడిపిస్తోంది. రాయలసీమ ప్రజలందరికి అందుబాటులో ఉన్న అత్యా ధునిక వైద్యశాల ‘స్విమ్స్’ ఆధునికీకరణకు గాను రూ. 200 కోట్లు మంజూరు చేశాము. న్యూరాలజీ, కార్డియాలజీ విభా గాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం ప్రారంభించాం. మాట తప్పని మనిషి జగన్జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలోని స్థానికులు గుండె మీద చేయి వేసు కుని హాయిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ప్రతీది సమస్యే. వారిపై ప్రతి ఒక్కరూ ఆధిపత్యం చలాయించేవారే. మొదటిసారి కరోనా వచ్చినపుడు తిరుపతి వీధుల్లో వేలమంది కూలీలు, అనాధలు, చిరు వ్యాపారులు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారు ఆకలికి అల్లాడుతూ రోడ్డుమీద మిగిలి పోయారు. జగన్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిత్యం రెండు పూటలా దాదాపు 50 వేల ఆహార పొట్లాలు అందించి వారిని ఆదుకున్నాం. ఆకలి విలువ తెలిసిన, మాట తప్పని మనీషి జగన్. వాలంటీర్లకు జీతం రెట్టింపు చేస్తా అని వాగ్దానం చేసి, గెలిచాక మొండిచేయి చూపిన మోసపూరిత స్వభావి చంద్రబాబు. మనసున్న మనిషిగా, హైందవ ధర్మరక్షణ కార్యకర్తగా జగన్ చేసిన వేలాది కార్యక్రమాలు ఆయన చెప్పుకోలేదు. కానీ జనం మరచి పోలేదు. ఏమి చేయకుండానే ఎగిరెగిరి పడడం, అవతలి వారు చేసిన మంచికి మసి పూయడం చంద్రబాబు లక్షణం. అసత్య ప్రచారాలకు మీడియాను వాడుకోవడానికి హైందవ ధర్మక్షేత్రానికి ‘అసభ్యభాషా పద పండిత పంచ శస్త్రుడిని‘ అధిపతిని చేశారు. చివరికి దేవుడినీ, దేవుడి ప్రసాదాన్నీ తన అసత్యాలకు బాసట చేయాలనుకున్నారు. న్యాయస్థానం అక్షింతలు వేసినా దులుపుకుపోతున్నారు.గారడీని నిజమనుకుని, మాటల వలకు చిక్కి, సనాతన ధర్మరక్ష కుడి ఊపుల నటనకు ఊతం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కాదనుకు న్నామని ఈ రోజు రాష్ట్ర ప్రజలు రోదిస్తున్న మాట సత్యం. ఈ సంద ర్భంగా మహాకవి దాశరథి వాక్యాలు మరోసారి స్మరించుకుందాం.‘‘మంచితనము కలకాలం నిలచి యుండును వంచన ఏనాటికి నశించి తీరును’’భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
నేపాల్ సంధిస్తున్న శేషప్రశ్నలు
కొన్ని దశాబ్దాలు అసలేమీ జరగదు, కానీ కొన్ని రోజుల్లోనే దశాబ్దాలు జరిగిపోతాయి. లెనిన్ అన్న ఈ మాటలు నేపాల్ విషయంలో అక్షర సత్యాలయ్యాయి. నేపాల్లో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకుంది. వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు పరస్పర ప్రయోజనా లందుకుంటూ చెట్టపట్టాలేసుకుని తిరిగాయి. అకస్మాత్తుగా ఎగసిన నిరసన ప్రదర్శనల వేడిని వారు ఇప్పుడు చవి చూశారు.ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీ మొగ్గ తొడిగిన (1997–2012) కాలంలో పుట్టిపెరిగిన తరాన్ని ‘జెన్ జెడ్’గా పిలుస్తున్నారు. ఈ ‘జెన్ జెడ్’ నేపాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ యువతరం తెచ్చిన విప్లవం బహుశా స్వల్పకాలమైనదే కావచ్చు. కానీ, అది చూపిన ప్రభావం పెద్దది. నిరసనలు మొదలైన తెల్లారే మూడు పార్టీల ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని కేపీ శర్మ ఓలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిరసనలకు ఐదు రోజుల ముందు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్తో సహా 26 సామాజిక మాధ్యమ వేదికల మూసివేతకు ఆయన ఆదేశించారు. అప్పటి కాయన ప్రజాభిమతాన్ని ప్రతిఘటించే వ్యక్తిగానే కనిపించారు. తీరా, ప్రధాని అధికారిక నివాసమైన బాలూవతార్ నుంచి ఉడాయించ వలసి వచ్చింది. ప్రధాని సింహాసనాన్ని అధిష్ఠించేందుకు వేచి ఉన్న షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య అర్జూ దేవ్బా (ఈమె విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు)లపై వారి నివాసంలోనే దాడి జరి గింది. దేశవ్యాప్తంగా యువత ధ్వంసం చేస్తూ వచ్చిన రాజకీయ పార్టీల ఆస్తులు, బడా నాయకుల ప్రైవేటు నివాసాలకు లెక్కలేదు. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ప్రభుత్వం కొలువుదీరే సింఘ దర్బార్ కూడా వారి ఆగ్రహ ‘జ్వాలల’ నుంచి తప్పించుకోలేక పోయాయి. జన్ జెడ్ తొలి ఉద్యమంనిరసనకారుల్లో అనేక మంది స్కూలు యూనిఫారంలలో ఉన్నప్పటికీ, పోలీసులు వారిపై దమన నీతిని ప్రదర్శించారు. దమనకాండలో స్కూలు, కాలేజీ విద్యార్థులు పందొమ్మిది మంది (వారిలో 17 మంది ఖాట్మాండులోనే) హతులయ్యారు. దాంతో దేశ మంతా ఏకమైంది. 1990లో, తర్వాత 2006లో సామూహిక ప్రజా ఉద్యమా లప్పుడు కూడా ఇలాగే జాతీయ స్థాయిలో అతిశయం వ్యక్తమైంది కానీ, అవినీతిమయ రాజకీయ నాయకులతో వారి ఆశలన్నీ అడియా సలయ్యాయి. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ –యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) ప్రజాభిమతానికి అనుగుణంగా నడచుకోలేక పోయాయి. ఆ రెండు ఉద్యమాలలో ‘జెన్ జెడ్’ పాత్ర నామ మాత్రమే. ఇప్పుడు నేపాల్ రికార్డు స్థాయిలో వలసలను చూస్తున్న సమయంలో, యువతలో కోపం కట్టలు తెంచుకుంది. నేపాల్ అపసవ్య కారణాలతోనే ప్రపంచంలో వార్తలకెక్కడాన్ని చూసి వారు విసుగెత్తిపోయారు. అవినీతి సూచిలో ఏయేటికాయేడు నేపాల్ ఎగబాకుతూ వస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మినుకు మినుకు అంటూ అయినా ఉందంటే, దానికి, వర్తక వ్యాపారాలో, విదేశీ సాయమో కారణం కాదు. రాజకీయ పార్టీల చేయూత అంతకన్నా లేదు. విదేశాలలో పని చేస్తున్న నేపాలీయులు స్వదేశానికి పంపిస్తున్న జమలతోనే స్థాని కులు చాలా వరకు రోజులు వెళ్ళదీస్తూ వస్తున్నారు. పశ్చిమాసియా నుంచి మలేషియా వరకు, నార్వే నుంచి న్యూజిలాండ్ వరకు నేపా లీయులు కష్టపడి పనిచేస్తూ గడిస్తున్న నాలుగు రాళ్ళలో కొంత మొత్తాన్ని స్వదేశంలోని కుటుంబ సభ్యులకు పంపుతున్నారు. అలాచూస్తే, మారుమూల గ్రామాలలోని వారితో సహా, కుటుంబాల విడి ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. అంతమాత్రాన నేపాలీ యులు ధనికులుగా మారింది ఎన్నడూ లేదు.ఇప్పుడేం జరగొచ్చు?ఈ మార్పులన్నింటి మధ్య కొన్ని భయ సందేహాలు మిగిలే ఉన్నాయి. ప్రాబల్యం వహించిన పాత మూడు పార్టీలలోని నాయకులందరూ అపఖ్యాతి పాలైనవారు కాదు. వారిలో కొందరికి వారి నియోజకవర్గాలతో ఇప్పటికీ పటిష్ఠమైన సంబంధాలే ఉన్నాయి. వారు కౌంటర్ విప్లవానికి తెర లేపుతారా? అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పాత పార్టీలన్నీ విలీనమవుతాయా? లేక నాల్గవ పెద్ద పార్టీ అయిన రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీ (ఆర్.ఎస్.పి.)లోకి ఫిరాయింపులకు ఇది దారితీస్తుందా? ఈ పార్టీలోనే యువ టెక్నోక్రాట్లు పెద్ద వర్గంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద, 2022 సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే రిజిస్టరైన ఆర్.ఎస్.పి. త్వరితగతిన జాతీయ పార్టీగా పరిణమిస్తుందా? ఖాట్మండులో ప్రజాదరణ కలిగిన యువ మేయర్ బాలెన్ షా వీరితో చేతులు కలుపుతారా? రాజధానికి బయట పార్టీని విస్తరించడానికి ఎన్నడూ ఉత్సాహం చూపని షా, యువతతో కొత్త పార్టీని పెట్టి దానికి నాయకత్వం వహిస్తారా?ఈ పరిస్థితులన్నింటి మధ్య ‘జెన్ జెడ్’ స్థానం ఏమిటి? ఈ యువతకు గొంతుకగా సూదన్ గురుంగ్ ఉన్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి, నేపాల్ తొలి మహిళా ప్రధాని సుశీలా కర్కీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సూదన్ ఆమె పట్ల గౌరవ ప్రపత్తులను ప్రదర్శించారు. కానీ పట్టుమని వారం కూడా గడవక ముందే, అదీ సూదన్ సమక్షంలోనే, ఆపద్ధర్మ ప్రధాని కర్కీ రాజీనామా చేయాలని ‘జెన్ జెడ్’ నిరసనకారులు డిమాండ్ చేశారు. మంత్రివర్గాన్ని విస్తరించే ముందు ఆమె తమతో సంప్రదించలేదని అన్నారు. బాలెన్ షా న్యాయ సలహాదారు ఓమ్ ప్రకాశ్ ఆర్యల్ను హోమ్ మంత్రిగా నియమించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సైన్యం పాత్ర ఏమిటి?నేపాల్ సైన్యం ఏం చేయబోతోందనేది కూడా ముఖ్యమైనఅంశం. సార్వభౌమాధికారం 1990లో ప్రజల చేతికి వచ్చి, పార్లమెంట్ 2008లో రాచరికాన్ని రద్దు చేసేంత వరకు, రాచరికం పట్లనే సైన్యం విధేయత చూపుతూ వచ్చింది. తిరిగి అది ఇప్పుడు మళ్ళీ రాచరికం వైపే మొగ్గు చూపుతుందా? క్షేత్రస్థాయిలో నేపాలీయుల మధ్య సాంస్కృతిక పునరుజ్జీవనం కనిపిస్తోంది. హిందూ మతానికి చెందిన వివిధ వ్యక్తీకరణల్లో అది కేంద్రీకృతమవుతోంది. కానీ, నేపా లీయులు రాజకీయ హిందూయిజానికి ఎన్నడూ ఓటు వేయలేదు. వచ్చే ఏడాది (2026) మార్చి 5న నిర్వహిస్తారని చెబుతున్న ఎన్ని కలు చరిత్రను మలుపు తిప్పుతాయా? నూతన ప్రభుత్వం ఈ పరి ణామ క్రమాన్ని ఎలా నిర్వహిస్తుందనేది ప్రశ్న. నేపాలీ ప్రజలు ఆరు నెలల (రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కిందనే లెక్క) తర్వాత, రాజ కీయ తీర్పును వెలువరించేంత వరకు ఈ భయాందోళనలు కొన సాగుతూనే ఉంటాయి.అఖిలేశ్ ఉపాధ్యాయ్వ్యాసకర్త ఖాట్మండులోని ఐ.ఐ.డి.ఎస్.లో సీనియర్ రీసెర్చ్ ఫెలో (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా?
‘నువ్వు చెప్పే దానితో నేను ఏకీభవించకపోవచ్చు కానీ చెప్పడానికి నీకున్న ఆ హక్కును నా ప్రాణమిచ్చి అయినా కాపాడుతాను’ అన్న ప్రముఖ ఫ్రెంచ్ రచయిత వోల్టేర్ మాటలు గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ (Democracy) అనుకుంటున్న మన దేశంలో నీటి మూటలే! దేశంలో పాత్రికేయులకు రచయితలకు గడ్డుకాలం దాపురించింది. అకారణమైన అరెస్టులు, అక్రమ కేసులు వారి చుట్టూ బిగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు.పత్రికా సంపాదకుల మీద, పాత్రికేయుల మీద నిర్బంధకాండ యథేచ్చగా కొనసాగుతున్నది. ప్రభుత్వాలు తమకు వ్యతి రేకంగా రాసే పత్రికా సంపాదకులనూ, పాత్రికేయులనూ, సోషల్ మీడియా (Social Media) జర్నలిస్టులనూ, యూట్యూబర్లనూ ఒక్కరనేమిటి... ఎవరినీ వదలడం లేదు. కేసులతో వారిని వేధిస్తున్నారు. ఇళ్లపై అర్ధరాత్రి దాడులు నిర్వహించి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. తప్పును తప్పుగా చెప్పడం తప్పుగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు. మార్గదర్శకాలను ఉల్లంఘించినా, నియంత్రణ రేఖలను అధిగమించినా ప్రభుత్వాలు వారిపై చర్య తీసుకోవడం సబబు, సమర్థనీయం. కానీ తమ పని విధానాన్ని, విధి విధానాలను వ్యతిరేకించినా లేక సమర్థించకపోయినా; ప్రభుత్వ పాలసీలను, పథకాలలో ఉన్న లొసుగులను ఎత్తిచూపినా ప్రభుత్వాలు అది చాలా క్షమించరాని నేరంగా భావిస్తున్నాయి. పత్రికలు ఏదైనా రాసినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా నమ్ముతారా? అందులో నిజానిజాలు బేరీజు వేసుకోరనుకోవడం తప్పు. ప్రజలకు ఉన్న వివేచనను, విచక్షణను ప్రభుత్వాలు తక్కువగా అంచనా వేయకూడదు.పత్రికలు ఈ పోటీ ప్రపంచంలో పాత్రికేయ విలువలూ, సామాజిక బాధ్యతలూ రెండింటినీ రెండు భుజాలపై మోస్తూ ఈ వృత్తికి న్యాయం చేయాలి. ఒక రాజకీయ పార్టీవారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పనిని... వారు అధికారంలోనికి రాగానే ప్రతి పక్షాలు అదే పని చేస్తే సహించే పరిస్థితి నేడు లేదు. అంటే అధికారంతో, హోదాతో విలువలు మారుతాయన్న మాట! రాజ్యాంగం ఎన్నో విలువలతో పకడ్బందీ చట్టాలతో ప్రజల హక్కులను కాపాడుతూ తయారైన ఒక పవిత్ర, ప్రామాణిక గ్రంథం. దేశానికి దిశా నిర్దేశం చేసే గ్రంథం అది. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే ఏ రకమైన చర్యలైనా ప్రజలు సహించరు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే తగిన సమయంలో తగు తీర్పునిస్తారు.పత్రికా సంపాదకులను, పాత్రికేయులను వేధించిన ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ప్రజామోదం ఉండదు. విమర్శను ఆహ్వానించాలి. విచక్షణతో అందులోని సహేతుకతను అర్థం చేసుకొని ఆలోచించాలి. అంతేకానీ విమర్శలోని విషయాలను విషంగా పరిగణిస్తే పరిణామాలు విషమంగానే ఉంటాయి. విధాన నిర్ణయాలపై విమర్శలు వస్తే విశ్లేషించుకుని సవరించుకోవాలి. అందుకు విరుద్ధంగా విమర్శకులపై విచ్చలవిడిగా కేసులు బనాయించి విశృంఖలంగా అరెస్టు చేస్తూ వారికున్న హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తే న్యాయస్థానాలు మౌనంగా ఉండవు.చదవండి: భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?మీడియా స్వేచ్ఛ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో భారత్ 151 స్థానాన్ని పొందింది. ఇక్కడే భావ ప్రకటన స్వేచ్ఛ (Freedom of Expression) దేశంలో ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మీడియాపై ఎక్కుపెట్టిన ఆంక్షలను, కేసులను ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ, ఎడిటర్స్ గిల్డ్ లాంటి సంస్థలు ఖండించాయి. పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని ఘనంగా చెప్పుకుంటున్నాం. దాని విలువను, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పాలకులదే!– శ్రీశ్రీ కుమార్ కవి–రచయిత -
ఐరాస అవసరం తీరిపోలేదు!
అమెరికాలో చార్లీ కిర్క్ హత్యోదంతంపై రేగుతున్న ప్రజాగ్రహం, పోలెండ్ను బెదిరిస్తున్న రష్యన్ డ్రోన్లు, ఇజ్రాయెల్ ఇపుడు బాహాటంగానే చెబుతున్న గాజాలోని జాతి నిర్మూలన, గాజా పొరుగు దేశాలపై ఇజ్రాయెల్ దాడులు... వీటన్నిటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) 80వ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా? కానీ, సహజ జ్ఞానానికి విరుద్ధంగా, ఇటువంటి సందర్భానికి ఇదే సరైన సమయమేమో అని కూడా అనిపిస్తోంది. సమస్యలను విడి విడిగా చూడాలని, చర్చలు జరపాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలనటం, శాంతియుతంగా చర్చలు జరపాలని పిలుపు నివ్వడంలో ఆ విజ్ఞప్తులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎనభై అన్నది కీలక ఘట్టంఅంతర్జాతీయ శాంతి, భద్రతలను సాధించడంలో – ఐరాస వైఫల్యాలు; నాగరికంగా చర్చలు జరుపుకొనే పద్ధతిని పెంపొందించడంలో, అందరికీ పూర్తి మానవ హక్కులను కాపాడడంలో – అమెరికా అంతర్గత బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్న దశ ఇది. మహా అయితే, ఐరాస 80వ వార్షికోత్సవం... గతి తప్పిన జాతీయ తావాదం, మిగిలిన వర్గాలను పట్టించుకోకుండా స్వీయ వర్గానికే వీర విధేయత చూపడం, విశృంఖల హింస వంటి వాటికి అతీతంగా కొన్ని విలువలున్నాయని గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది. నానాజాతి సమితి 26 ఏళ్ళే మనగలిగింది. దానిని మించి మనుగడ సాగిస్తున్నందుకు ఐరాస గర్వపడవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో 80వ పడిలో పడడం కీలక ఘట్టం. ఆయుర్దాయాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాల్సి ఉంటుంది. అలాగే, ఐరాస తన ప్రాధా న్యాన్ని కొనసాగించుకునేందుకు ఈ వార్షికోత్సవం కూడా ముఖ్యమైంది. ఏడేళ్లుగా నిధుల సంక్షోభం!ఐరాసలో తిరిగి జవజీవాలు నింపేందుకు ‘యూఎన్ 80 ఇనీషి యేటివ్’ పేరుతో 2025 మొదట్లో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లుగా కనిపిస్తున్న సంస్థను ప్రక్షాళన చేసే బదులుగా అది... వెలాతెలా బోతున్న సంస్థ వేడుకగా మారినట్లు కనిపిస్తోంది. ఐరాస ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరుగు తోంది. ‘‘సభ్య దేశాలన్నీ తమ చందా మొత్తాలను పూర్తిగా చెల్లించక పోవడం, చాలా దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కనీసం గత ఏడేళ్లుగా ఐరాస ద్రవ్యత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని ఐరాస ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 11 నాటికి ‘‘మొత్తం 193 దేశాలలో 75 దేశాలే వాటి వంతు మొత్తాలను పూర్తిగా చెల్లించాయి. సంస్థ 2025 సంవత్సరపు బడ్జెట్ 3.72 బిలియన్ డాలర్లుగా ఉంది’’ అని ఆ ప్రకటనలో తెలి పారు. నిధుల లోటును; మధ్య ప్రాచ్యంలోను, ఉక్రెయిన్లోను శాంతిని నెలకొల్పడమనే ప్రాథమిక విధి లోని వైఫల్యాలను చూస్తుంటే ఐరాస కూడా నానాజాతి సమితి బాట పడుతుందా? అనే ప్రశ్న రావటం సహజమే. ‘శాంతి కోసం సమైక్యత’అయితే, సమితి గురించి ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ ప్రొఫెసర్, జడ్జి, గుటెరస్కు సన్నిహితుడు అయిన జార్జ్ అబీ సాబ్ ఒక ఇంటర్వ్యూలో మూడు ఆశావహమైన సంగతులను చెప్పారు. మొదటిది: అంతర్జాతీయ సమాజం తన సమష్టి అభిమతాన్ని వ్యక్తీక రించేందుకు, ఆ సమాజాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ వేదిక ఇప్పుడు ఐరాస మాత్రమే. ఖతార్ రాజధాని దోహాపై ఇటీవలి దాడిని (ఇజ్రాయెల్ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ) భద్రతా మండలి ఖండించింది. ‘శాంతి కోసం సమైక్యత’ పేరుతో ఐరాస సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం ప్రకారం, ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సేనలను ఇప్పటికే సెప్టెంబర్ 18 నాటికి ఉపహరించుకుని ఉండాలి. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం సలహా పూర్వకంగా వెలిబుచ్చిన అభి ప్రాయం. దాన్ని పాటించని ఇజ్రాయెల్పై సర్వ ప్రతినిధి సభ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని నియోగించవచ్చు. చెప్పుకోదగిన విజయాలురెండు: శాంతి, భద్రతలను పక్కనపెడితే ఐరాస చెప్పుకోతగిన విజయాలు కొన్ని ఉన్నాయి. వివిధ ఐరాస సంస్థలు పర్యావరణం వంటి రంగాల్లో ప్రత్యేక సేవలందిస్తున్నాయి. పర్యావరణానికి హానికరమైన చేపల వేటకు పాల్పడేవారికి సబ్సిడీలను నిరాకరించే వాణిజ్య ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కట్టుబడ వలసి వచ్చింది. మూడు: బహుళ పక్షానికి (మల్టీలేటరలిజం) వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించడం. ఏవో ఒకటి రెండు దేశాలు పెత్తనం చలాయించకుండా, ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దటంలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించడానికి ఐరాస ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు సాగుతున్నాయి.షాంఘై సహకార సంస్థ ఐరాసకు ప్రత్యామ్నాయం వంటి బహుళ పక్ష వ్యవస్థ కాకపోవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను ప్రతిఘటించే విధంగా వివిధ దేశాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా–ఐరాస పోలికలుఅంతర్జాతీయ సహకారానికి అడ్డుపడుతున్న అంశాలకూ, అమెరికాలో రాజకీయ పోలరైజేషన్కూ మధ్యనున్న సారూప్యాలను గమనించకుండా ఉండడం కష్టం. భీకర అమెరికన్ అంతర్యుద్ధాలలో ఒకదాన్ని చవి చూసిన తర్వాత పెన్సిల్వేనియాలోని గెట్టీస్ బర్గ్లో 1863లో చేసిన ప్రసంగంలో అమెరికా పురుద్ధరణను అధ్యక్షుడు అబ్రహాం లింకన్ దర్శింపజేశారు. అమెరికా ఏర్పడిన 87 ఏళ్ల తర్వాత లింకన్ ‘‘ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజా ప్రభుత్వం’ అన్న భావనను పునశ్చరణ చేశారు. ఐరాస ప్రణాళిక ఉపోద్ఘాతం కూడా ‘‘ఐక్యరాజ్య సమితి ప్రజలమైన మేము’’ అనే మొదలవుతుంది. అమెరికాను ఆ దేశ సంస్థాపక పితామహులు ముందుకు తెచ్చిన సుమారు 80 ఏళ్ల తర్వాత, లింకన్ ‘స్వాతంత్య్ర నూతన జననం’ గురించి మాట్లాడారు. ఇప్పుడు ‘యూఎన్ 80 ఇనీషియేటివ్’ అదే రకమైన నూతన ఆవిర్భావం గురించి ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ప్రభుత్వాల మధ్య వారధిగా పని చేస్తున్న సంస్థ ఐరాస ఒక్కటే! కనుక సమితి తన జీవిత కాలాన్ని, ప్రాధాన్యాన్ని, 80 ఏళ్లకు మించి పొడిగించుకోగలుగుతుందా అన్నసందేహం అక్కర్లేదు. డేనియల్ వార్నర్వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు – రచయిత -
వాటా పెంచాలి!
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఇటీవలి 56వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చారిత్రకమైనవి. జీఎస్టీ రెండవ అధ్యాయానికి అంకు రార్పణగా దాన్ని అభివర్ణించినా తప్పు లేదు. జీఎస్టీని అమలులోకి తెచ్చిన ఏడేళ్ళ తర్వాత, వినియోగంపై వేసిన ఈ లెవీని సంస్కరించేందుకు పెద్ద ప్రక్షాళననే చేపట్టారు. ఇంతవరకు ఉన్న నాలుగు ప్రధాన పన్ను శ్లాబులు సెప్టెంబర్ 22 నుంచి రెండు శ్లాబులు కానున్నాయి. అధిక విలాస వస్తువులు, పొగాకు వంటి ‘వ్యసనాల’ వస్తువులపై కొత్త శ్లాబు రేటు ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందున్న పన్నుల రేట్లు, ‘సక్రమమైన, సరళమైన’ పన్నుగా జీఎస్టీకున్న స్ఫూర్తిని దెబ్బతీశాయి. కనుక, రెండు రేట్ల పద్ధతికి మారడం స్వాగతించదగిన పరిణామం. గతంలోని 12%–28% రేట్లను రద్దు చేసి 5%–18% రేట్లను అట్టేపెట్టారు. మొత్తం జీఎస్టీ రాబడిలో మూడింట రెండొంతుల భాగాన్ని 18% రేటు ఇప్పటికే తెచ్చిపెడుతోంది. ఆదాయంలో 7% భాగం 5% శ్లాబు ద్వారా లభిస్తోంది. అలాగే 12% శ్లాబు 5% ఆదాయానికి, 28% శ్లాబు 11% ఆదాయానికి కారణమవుతున్నాయి. ఇపుడు 18% శ్లాబు జీఎస్టీ రాబడిలో మరింత ఎక్కువ భాగాన్ని తెచ్చిపెట్టబోతోంది. అయితే, రెండు రేట్లుగా సరళీకరించిన పద్ధతి సమమితిగా సాగలేదు. ఏం చేశారంటే 12% కేటగిరీలోని చాలా వస్తువులను 5% లోకి, 28% వర్గంలోని చాలా వాటిని 18% వర్గంలోకి తెచ్చారు. అధిక పన్ను రేటులోకి చాలా తక్కువ వస్తువులే వెళ్ళాయి. మొత్తం మీద పన్ను భారం లేదా ఈ లెవీకి సంబంధించిన ప్రభావశీల పన్ను రేటు తగ్గింది. ఇది వినిమయ వ్యయాన్ని పెంపొందించే ద్రవ్య ఉద్దీపనగా ఉపకరించవచ్చు. చాలా భాగం వస్తువులు తక్కువ పన్ను రేట్లకి తరలిపోవడం వినియోగదారుల కోణం నుంచి ద్రవ్య ఉద్దీపన కావచ్చుకానీ, ప్రభు త్వానికి మాత్రం రాబడిలో లోటు ఏర్పడుతుంది. అయితే, దానివల్ల ఏర్పడే లోటు కన్నా, వినియోగదారుల అధిక వ్యయం వల్ల ఒనగూడగల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆర్థిక శాస్త్ర పరిభాషలో ‘ల్యాఫర్ కర్వ్ ఎఫెక్ట్’ అంటారు. సూటిగా చెప్పాలంటే, పన్ను రేటు తగ్గింపు పన్ను వసూళ్ళ పెరుగుదలకు దారితీస్తుంది. కానీ, భారతదేశం విషయంలో దీన్ని సిద్ధాంతపరంగా అన్వయించి చూడలేం. అనుభవంలో మాత్రమే అసలు విషయం తెలుస్తుంది. రెండు ఇబ్బందులుజీఎస్టీ వ్యవస్థలోని రెండు అంశాలు ఇప్ప టికీ వేధిస్తూనే ఉన్నాయి. ఇది పరోక్ష పన్ను. తిరోగమనదాయకమైనది కావడం వల్ల ధని కుల కన్నా పేదలను ఎక్కువ కుంగదీస్తుంది. పాటించవలసిన నియమ నిబంధనల భారం అధికంగా ఉండటం వల్ల, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇది తలనొప్పి తెచ్చిపెట్టే అంశం. రాష్ట్రాలపై ప్రభావం రెండవ అంశం. రేటులో కోత, హేతుబద్ధీకరణ వల్ల ఏర్పడగల స్థూల నష్టం రూ. 1.5 ట్రిలియనా లేక రూ. 1 ట్రిలియన్ కన్నా తక్కువే ఉంటుందా అన్నది చూడవలసి ఉంది. కానీ, దానిలో సగం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే మోయవలసి ఉంది. తొలుతటి జీఎస్టీ చట్టంలో చేసిన రీయింబర్స్మెంట్ వాగ్దానానికి 2022లో కాలం చెల్లింది. పరిహారం సెస్సునకు కూడా గడువు తీరబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో పేర్కొన్న వ్యయాలను ఎలా నిర్వహించగలుగుతాయి? భారతదేశంలో మాత్రమే కనిపించే ‘మూడింట రెండు వంతులు/ మూడింట ఒకటో వంతు’ సమస్య దాని సమాఖ్య ఏర్పాటులోనే ఉంది. మూడింట రెండొంతుల వ్యయ కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వాలు, స్థానిక సంస్థలపైనే ఉంది. కానీ, రెవిన్యూ స్వయం ప్రతిపత్తిలో వాటికున్నది మూడింట ఒకటో వంతు మాత్రమే! పెట్రోలు, డీజిలు, విద్యుచ్ఛక్తి జీఎస్టీ పరిధిలోకి రాకుండా బయటే ఉండిపోవడానికి అది కూడా ఒక కారణం. అటువంటి ఆందోళనలపై స్పందిస్తూ ఆర్థిక మంత్రి రాష్ట్రాల కోశ సుస్థిరత, ఆర్థిక యోగక్షేమాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని రాష్ట్రాలకూ హామీ ఇచ్చారు. ‘‘సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తిని ఆలంబన చేసుకునే మా చర్చలు సాగాయి’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు ఆదాయం పెరిగేలా...ఈ నేపథ్యంలో, జీఎస్టీ విధానంలో ఒక సంస్కరణ రూపుదిద్దుకునేటట్లు చేయవచ్చు. ప్రస్తుతం 50:50గా ఉన్న పంపకం సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా 60:40గా మార్చవచ్చు. ఏదేమైనా, మొత్తం ప్రభుత్వ వ్యయాలన్నింటిలోనూ మూడింట రెండొంతుల భారాన్ని రాష్ట్రాలే భరిస్తున్నాయి కనుక, జీఎస్టీ ఆదాయంలో వాటికి 60 శాతం భాగం ఇస్తే, వాటి బడ్జెటరీ ఖర్చులకు తగ్గట్లుగా ఉంటుంది. వసూలు చేస్తున్న జీఎస్టీని సమీకృత మొత్తంగానే చూస్తున్నారు. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున (సగం, సగం) సమ భాగాలుగా వసూలు చేస్తున్నట్లు లెక్క. కేంద్రానికి సెస్సులు, దేశ రుణం, విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడం వంటి ఇతర వనరులు అందుబాటులో ఉన్నాయి. పంపకాల సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా కొద్దిగా మొగ్గేటట్లు చేసినా, వాటి గాబరా కొంత ఉపశ మిస్తుంది. సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తి మరింత బలపడుతుంది. అజిత్ రనడేవ్యాసకర్త పుణె ఇంటర్నేషనల్ సెంటర్లో సీనియర్ ఫెలో -
ఆత్మ నిర్భర జీఎస్టీ?
సెప్టెంబర్ మాసం శుభాలను మోసుకొస్తుందని ఓ నానుడి. దానిని నిజం చేస్తూ దేశ ప్రజలకు మేలు చేసే రెండు తీపి పరిణామాలు జరిగాయి ఈ మాసంలో! ఒకటి – ఎంతో కాలంగా దేశ ప్రజలు కోరుతున్న జీఎస్టీ సంస్కరణలు. రెండు – భారత్–చైనాల మధ్య చిగురించిన మైత్రీ బంధం. వీటిని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అందిస్తున్న దీపావళి బహుమతులుగా చెప్పడం గమనార్హం!అమెరికా విధించిన అదనపు సుంకాల పుణ్యమా అని దేశంలో విని యోగ సంస్కృతిని... అది కూడా దేశీయ వస్తువుల వినియోగం పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణను తీసుకువచ్చింది. నాలుగు శ్లాబుల్లో ఉన్న వస్తువులను సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ 2.0లో మూడు శ్లాబ్లకు కుదించారు. 5 శాతం, 18 శాతం శ్లాబ్లలోకి దాదాపుగా అన్ని వస్తువులు వస్తాయి. సిన్ గూడ్స్ (పాపవు వస్తువులు)గా పేర్కొంటున్న సిగరెట్లు, గుట్కా వంటి ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం కోసం అత్యధికంగా 40 శాతం పన్ను విధిస్తారు. కార్లు, ఫ్రిజ్లు, ఏసీల వంటి లగ్జరీ గూడ్స్ కారుచౌకగా లభిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటు న్నాయి. భారీ వాహనాల మీద జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారుడికి రెండు విధాల ప్రయోజనం కలుగుతుంది. ఒకటి – వాహనం ధర తగ్గుతుంది. రెండోది – వాహనం ధర ఆధారంగా రిజిస్ట్రేషన్,బీమా (ఇన్సూరెన్స్) చార్జీలు ఉంటాయి కనుక వాహనం ధర తగ్గితే... ఆ దామాషాలో వాటి ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఇక, దేశంలో అత్యధిక శాతంగా ఉన్న మధ్యతరగతి వర్గానికి, పేదలకు ఊరట కలి గించే అంశం... నిత్యావసరాల ధరలు తగ్గడం. బియ్యం, గోధుమలు, పప్పులపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీ 18 శాతం కాగా, ప్యాకేజీలో ఉండేవి కాకుండా విడిగా లభించే ఈ వస్తువు లను కొంటే అవి 5 శాతం పరిధిలోకి వస్తా యని అంచనా వేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే జీఎస్టీ 2.0ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారనీ, ఇది బీజేపీ గెలుపునకు బ్రçహ్మాస్త్రంగా పనికొస్తుందనీ ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు.రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందా?జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ 2.0పై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్ప టికీ... 4 రాష్ట్రాలు తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. తమకు నష్టపరిహారం చెల్లించాలని బెంగాల్, కేరళ,పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టాయి. కానీ మంత్రి ఆ రాష్ట్రాలకు సర్దిచెప్పారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల వస్తు వినియోగం పెరుగుతుందనీ, దాని వల్ల రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందనీ వివరించారు. రాష్ట్రాలకు ఆదాయం చేకూరు స్తున్న రంగాలలో సిమెంటు, ఆటోమొబైల్, గ్రానైట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటివి ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై అత్యధికంగా 18 నుంచి 28 శాతం జీఎస్టీ ఉంది. తాజాగా సవరించిన రేట్ల వల్ల ఈ రంగాల్లో రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో సుమారు 10 శాతం కోత పడనుంది. చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నట్లుగా... పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ 2.0 పరిధిలోకి తీసుకు రాకపోవడం సామాన్యుల్ని నిరాశపర్చేదే! పెట్రోల్, డీజిల్, విమానాల ఇంధనంగా వాడే టర్బైన్ ఫ్యూయెల్, సహజ వాయువులపై వివిధ రాష్ట్రాలు అత్యధికంగా 18 నుంచి 34 శాతం వరకు విలువ ఆధారిత పన్ను విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే అదనంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై రూపాయినుండి రెండు రూపాయల మేర సెస్సు విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా, అధిక మోతాదు చక్కెరతో తయారు చేసే చాక్లెట్లు, కేకులు, మిఠాయిలపై జీఎస్టీ తగ్గించటం పట్ల ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో అగ్రస్థానంలో కొనసాగుతున్న దశలో, చక్కెర పదార్థాల ధరలు తగ్గే చర్యల వల్ల వాటి వినియోగం పెరిగి పిల్లల్లో చక్కెరస్థాయి నిల్వలు పెరుగుతాయని హెచ్చరి స్తున్నారు. ఇంకోవైపు బీడీ కార్మికులకు మేలు చేసే నెపంతో బీడీలపై జీఎస్టీ తగ్గింపు సరికాదంటున్నారు.చైనాతో దోస్తీ... సానుకూలం!అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక మార్గం మూసుకుపోయి నప్పుడు, మరో మార్గాన్ని ఏర్పరచుకోవాలన్నట్లుగా ప్రధాని నరేంద్రమోదీ జీఎస్టీ 2.0తో పాటు చైనాతో వాణిజ్య బంధాన్ని మెరుగుపర్చుకోవడం గొప్ప ఊరటనిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’ అన్నట్టుగా భారత్కు అమెరికాతో ఏర్పడిన సంక్షోభతో ప్రత్నామ్నాయ అవకాశాలు లభిస్తున్నాయి. జీఎస్టీ సరళీకరణ వల్ల దేశీయ ఉత్పత్తుల వినియోగం తప్పనిసరిగా పెరుగుతుంది. అదేవిధంగా చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం కారణంగా చైనా పెట్టు బడులు, సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలను సద్వినియోగం చేసుకొని భారతదేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా వడివడిగా అడుగులు వేయించాల్సిన బాధ్యత ప్రధానిదే!డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త మాజీ కేంద్రమంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు


