పాక్‌ ప్రమిదకు ట్రంప్‌ చమురు | Sakshi Guest Column On Donald Trump and Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రమిదకు ట్రంప్‌ చమురు

Aug 7 2025 12:12 AM | Updated on Aug 7 2025 12:12 AM

Sakshi Guest Column On Donald Trump and Pakistan

విశ్లేషణ

పాకిస్తాన్‌–అమెరికాలు జూలై 31న ఒక నూతన వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్‌లోని చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా కృషి చేయడంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇంధనం, ఖనిజాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, క్రిప్టో కరెన్సీలలో కూడా విస్తృత సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలని రెండు దేశాలూ కోరుకున్నాయి. ఇది పాకిస్తాన్‌లోని మౌలిక సదుపాయాలపై అమెరికా పెట్టుబడులను పెంపొందించేందుకు తోడ్పడవచ్చు. ద్వైపాక్షిక మార్కెట్‌ సౌలభ్య విస్తరణకు సాయపడవచ్చు. ‘మేం ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించగల ఆయిల్‌ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. 

పాకిస్తాన్‌ చమురు సంపద మొదట్లో ఆ దేశ సెంట్రల్‌ పంజాబ్‌ లోని టూట్‌ చమురు క్షేత్రానికే పరిమితమైంది. ఆ ప్రాంతం పోటో హార్‌గా సుపరిచితం. అది ఇస్లామాబాద్‌కు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదటి చమురు బావిని 1964లో తవ్వారు. వాణి జ్యపరమైన ఉత్పాదన 1967లో మొదలైంది. సుమారు 6 కోట్ల పీపాల చమురు ఉందని భావించారు. దాని నుంచి 12–15 శాతం భాగం మాత్రమే తవ్వితీయగలమని నిర్ణయించారు. ఉత్పాదన 1986లో శిఖర స్థాయికి చేరి, రోజుకు సుమారు 2,400 పీపాల చమురు వెలికి తీశారు. పెట్రో దిగ్గజం యూనియన్‌ టెక్సాస్‌కు చెందిన పాకిస్తానీ అనుబంధ సంస్థ... సింథ్‌ దిగువన ఒక చమురు క్షేత్రాన్ని 1981లో కనుగొంది. సింథ్‌ చమురు క్షేత్రాలు 1998–1999 నాటికి టూట్‌ చమురు క్షేత్రం కంటే ఎక్కువ చమురును అందించాయి. 

టూట్‌ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్‌ జాతీయ చమురు కంపెనీ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డెవలప్‌ మెంట్‌ కంపెనీ (ఓజీడీసీ) లిమిటెడ్‌తో వాంకూవర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ సావరిన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ 2005లో ఒక అవగా హనా పత్రంపై సంతకాలు చేసింది. 

షుంబర్గర్‌  ఆయిల్‌ ఫీల్డ్‌ సర్వీసెస్‌ 2006లో అక్కడ మొదట కార్యకలాపాలు ప్రారంభించింది. టూట్‌ చమురు క్షేత్రంలోను, దాని పొరుగునున్న మిస్సా కేశ్వాల్‌ చమురు క్షేత్రంలోను పనిచేసేందుకు రెండు కెనడియన్‌ కంపెనీలు రంగంలోకి దిగాయి. వీటి స్థానాన్ని ఇపుడొక అమెరికన్‌ కంపెనీ భర్తీ చేయవచ్చు. 

పాక్‌లో ఐదు చోట్ల –చెంగియూ పీకే లిమిటెడ్‌ (బెలూచిస్తాన్‌ లోని హబ్‌ ), పాక్‌–అరబ్‌ రిఫైనరీ కంపెనీ లిమిటెడ్‌ (గుజరాత్‌లోని కస్బా), పాకిస్తాన్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (కరాచి), అటాక్‌ రిఫైనరీ లిమి టెడ్, నేషనల్‌ రిఫైనరీ లిమిటెడ్‌ (కామ్చి)–చమురు శుద్ధి కర్మాగారా లున్నాయి. వాటన్నింటి చమురు శుద్ధి సామర్థ్యం రోజుకు 4,20,000 పీపాల వరకు ఉంటుంది. గ్వాదర్‌లో మరో ఆయిల్‌ రిఫైనరీ నెల కొల్పే ఆలోచనలో ఉన్నట్లు సౌదీ ఆర్మకో 2019లో ప్రకటించింది. 

అమెరికా–పాకిస్తాన్‌ల మధ్య వాణిజ్యం 2024లో 7.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉంది. అమెరికా వస్తువుల వాణిజ్య లోటు 300 కోట్ల డాలర్ల మేరకు ఉంటుంది. పాకిస్తాన్‌ నుంచి అమెరికా లినెన్‌ ఉత్ప త్తులు, లెదర్‌ వస్తువులు, కలపతో చేసిన ఫర్నిచర్‌ వస్తువులను దిగు మతి చేసుకొంటూ, పాకిస్తాన్‌కు ముడి పత్తి, విమానాల భాగాలు,  ఇతర యంత్ర సామగ్రి పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఈ అసమతౌల్య సమస్యను పరిష్కరించేందుకు అమెరికా నుంచి వస్తువుల దిగుమతులను పెంచుకుంటామని పాక్‌ పేర్కొంది. 

పాకిస్తాన్‌లోని ఖనిజ నిక్షేపాల పట్ల అమెరికాకు కొత్తగా ఆసక్తి పుట్టుకురావడం వెనుక వేరే లావాదేవీలు ఉన్నాయని వాషింగ్టన్‌ లోని విల్సన్‌ సెంటర్‌లో సౌత్‌ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ మైకేల్‌ కుగెల్‌ మ్యాన్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ట్రంప్‌ బంధువులకి వరల్డ్‌ లిబర్టీ ఫినాన్షియల్‌ సంస్థలో షేర్లు ఉన్నాయి. ఆ సంస్థ పాక్‌లో 2025 మార్చిలో ఏర్పడిన పాకిస్తాన్‌ క్రిప్టో కౌన్సిల్‌తో ఆ వెంటనే ఏప్రిల్‌లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పాక్‌లో కొత్తగా మంత్రిగా నియమితుడైన బిలాల్‌ బిన్‌ సాకిబ్‌ ఆ కౌన్సిల్‌కి నేతృత్వం వహిస్తున్నారు. 

సాకిబ్‌ ఇటీవల బిట్‌ కాయిన్ల రంగంలోకి ప్రవేశించారు. లాస్‌ వేగాస్‌లో మే నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాకిబ్, క్రిప్టోను కాపాడిన అధ్యక్షుడిగా తాను ట్రంప్‌ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తర్వాత, వైట్‌ హౌస్‌లో అమెరికా అధికారులతో సాకిబ్‌ మంతనాలు జరిపారు. పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కి, ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆసిమ్‌ మాలిక్‌కి వైట్‌ హోస్‌లో ట్రంప్‌ విందు ఏర్పాటు చేయడానికి ఆ సమావేశమే మార్గం సుగమం చేసిందని చెబుతారు. 

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుని నాలుగేళ్ళు గడుస్తున్నా, అమెరికా–పాక్‌ సంబంధాలలో ఇప్పటికీ చాలా అనిశ్చితి ఉంది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమా నాల నిర్వహణ, మరమ్మతు పరికరాలకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో అమెరికా సైన్యం సమకూర్చిన సాయం 397 మిలియన్ల డాలర్ల మేరకు ఉంది. చైనా ఆయుధాలపై మితిమీరి లేదా దాదాపు పూర్తిగా ఆధారపడుతున్న స్థితి నుంచి పాక్‌ రక్షణ వ్యవస్థను తప్పించాలని అమెరికా కోరుకుంటూ ఉండవచ్చుకానీ, మునుపు పాక్‌తో భారీ స్థాయిలో ఉన్న ఆయుధాల సంబంధాలను పునరు ద్ధరించుకోవడంపై అమెరికా వైపు ఏకాభిప్రాయం లేదు.

ఈ నేపథ్యంలో, భారత్‌–పాక్‌ల మధ్య శాంతికి ప్రయత్నించినట్లు ట్రంప్‌ పదే పదే చెప్పుకుంటున్నా, భారత్‌తో కలసి అడుగులు వేయడంపై అమెరికా తాత్సారం చూపడం సహజ పరిణామంగానే తోస్తుంది. 

రాణా బెనర్జీ 
వ్యాసకర్త క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లో మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement