breaking news
Mancherial District Latest News
-
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
బాసర: విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని, వాటి సాధన కోసం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి, సమయపాలన, నైతిక విలువలతో ముందుకుసాగాలని ప్రొఫెసర్ సాయికుమార్ పేర్కొన్నారు. గురువారం ఆర్జీయూకేటీ, బాసరలో నిర్వహిస్తున్న పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026లో ఆయన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీలోని నాణ్యమైన విద్య, ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక వనరులు, పరిశోధనా అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం అకాడమిక్ మార్కులకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీసీ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రతిభను ప్రపంచ స్థాయి నైపుణ్యంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఆర్జీయూకేటీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ, అకాడమిక్స్తో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, వారి కలల సాకారానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందన్నారు. పీయూసీఐ ఓరియంటేషన్ కార్యక్రమం 2026 సమన్వయకర్త డా. గుజ్జరి శంకర్ ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్యాంపస్ సౌకర్యాలు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, క్లబ్లు, సాంకేతిక, వ్యక్తిత్వ వికాస అవకాశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
బడుల సెలవుపై గందరగోళం!
మంచిర్యాలఅర్బన్: ‘భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు వర్తిస్తుంది.. సెలవుకు బదులుగా ఆగస్టు నెల రెండో శనివారం పాఠశాల పనిదినంగా నిర్వహించాలి.. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలు ఎలాంటి మార్పులేకుండా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి..’అని గురువారం కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఇంచుమించుగా ఉదయం 9గంటల 8 నిమిషాలకు జిల్లా విద్యాశాఖ పంపిన సందేశం ఇది.. జరిగిందేమిటి? వర్షాల నేపథ్యంలో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో జారీచేసిన ఆదేశాలు గందరగోళానికి దారితీశాయి. విద్యాశాఖ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసినప్పటికీ నిబంధనలు బేఖాతారు చేస్తూ క్షేత్రస్థాయిలో బడులు నడిపారు. జిల్లాలో 704 పాఠశాలలుంటే కేవలం 40 లోపు పాఠశాలలు మాత్రమే సెలవులు పాటించగా మిగిలిన బడులు నడిపినట్లు తెలుస్తోంది. సెలవుపై సందేశం ఆలస్యంగా వచ్చిందన్న సాకుతో విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి మధ్యాహ్నం వరకు పాఠశాలలు నడిపారు. చివరకు సెలవు పాటించకుంటే చర్యలు తప్పవని అధికారుల సందేశాలతో దిగివచ్చి మధ్యాహ్నం తర్వాత కొన్ని మండలాల్లో సెలవులు ప్రకటించగా మరికొన్నింట్లో సాయంత్రం వరకు నడిపారంటే అధికారుల ఆదేశాలు ఏమేర పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టీచర్లు, సంఘాల అభ్యంతరం.. ఉపాధ్యాయులు ఇప్పటికే పాఠశాలలకు చేరుకుని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పూర్తి చేసినందువల్ల సెలవు అవసరం లేదని టీచర్లు అభిప్రాయపడ్డారు. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో సెల్ సందేశం ఆలస్యంగా వచ్చేసరికి మెజారిటీ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పూర్తయింది. వర్షంలో వచ్చిన పిల్లలను వెంటనే వెనక్కి పంపించడం సురక్షితం కాదని పేర్కొన్నారు.రెండో శనివారం బడి నడపడమే కారణమా? డీఈవో ఉత్తర్వుల ప్రకారం గురువారం ఇచ్చిన సెలవు భర్తీ చేసేందుకు ఆగస్టు నెల రెండో శనివారం పనిదినంగా ప్రకటించారు. ఆరోజు సెలవు కోల్పోవడం ఇష్టంలేని కొందరు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు డీఈవో ఆదేశాలను పట్టించుకోకుండా ఉదయమంతా బడి నడిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జలపాతాల పరవళ్లు
బజార్హత్నూర్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల కనకాయి జలపాతం, బండ్రేవ్ జలపాతాలు వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేరడిగొండ: మండలంలోని కుంటాల, కొర్టికల్ జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండకోనల మధ్య నుంచి పాలధారల వలే జాలువారుతున్న జలపాతాల అందాలు పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. నార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పారాఖప్పి జలపాతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. కొండల మధ్య నుంచి తెల్లని నురగలు చిమ్ముకుంటూ ఉధృతంగా కిందికి దూకుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. జలపాతం వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రజలు, యువకులు జలపాతం సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
లోలెవల్ బ్రిడ్జిని పరిశీలించిన సీపీ
బెల్లంపల్లి: పట్టణంలోని రాంనగర్ లోలెవల్ బ్రిడ్జిని రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా, సబ్ కలెక్టర్ మనోజ్, డీసీపీ భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, కమిషనర్ రమేశ్, సీఐలు కె.శ్రీనివాసరావు, హనోక్ పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదకరంగా మారిన జాతికుంట చెరువు కట్టను మున్సిపల్ చైర్పర్సన్ సందర్శించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 వార్డు కాంట్రాక్టర్ బస్తీలో మూడిళ్లు నేలమట్టమయ్యాయి. 13 వార్డులోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పోశమ్మ చెరువు నిండి చంద్రవెళ్లికి వెళ్లే ప్రధాన రోడ్డుపై నుంచి వరద నీరు పోటెత్తడంతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలిమంచిర్యాలక్రైం: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే 100కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లతో ప్రమాదం పొంచి ఉందని, అలాంటి ఇళ్లలో ఉంటున్న వారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసుల హెచ్చరికలను పాటించాలన్నారు.మంచిర్యాలఅగ్రికల్చర్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జిల్లా జలమయం అయ్యింది. రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే 102.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, నస్పూర్, మంచిర్యాల, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో 100 నుంచి 160 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో దిగువ ప్రాంతాల్లోని రోడ్లు, తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. కల్వర్టుల పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండడంతో పలుచోట్ల జనజీవనం స్తంభించింది. వాగులు ఒర్రెలు ఉప్పొంగడంతో 39 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి, కంది పంట చేలను వరద నీరు ముంచెత్తింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ర్యాలీవాగు, నీల్వాయి ప్రాజెక్టులు మత్తడి దుకుతున్నాయి. ప్రాణహిత వరద ప్రవాహం పెరిగింది. లోటు నుంచి అధికం జిల్లా సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు 467.3 మిల్లిమీటర్లు కాగా 512.2 మిల్లిమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 11 శాతం అధికంగా వర్షం కురిసింది. రెండు రోజుల్లో లోటు నుంచి అధికానికి చేరింది. ఒక్క దండేపల్లి మండలంలో 42 శాతం లోటు నెలకొనగా బెల్లంపల్లి మండలంలో 69 శాతం అత్యధికంగా, కాసిపేట, మందమర్రి, మంచిర్యాల, తాండూర్ మండలాల్లో 30 నుంచి 43 శాతం అధికంగా, మిగితా 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అధికారులు అప్రమత్తం జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వాగులు, వంకలు దాటేందుకు సాహసించవద్దని సూచిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి గోదావరిలోకి నీటి విడుదలతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఆదేశిస్తున్నారు. మత్తడి దూకిన నీల్వాయి ప్రాజెక్ట్ వేమనపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీల్వాయి ప్రాజెక్ట్ మత్తడి దూకి ప్రవహిస్తోంది. చామనపల్లి పెద్దవాగు, మామాడ ఒర్రె ప్రమాదకరంగా ప్రవహించాయి. ఎంపీడీవో కుమారస్వామి, సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, తహసీల్దార్ సాయికృష్ణ, ఒర్రెవద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల్లోని పంటచేలు చెరువులను తలపించాయి. -
భారీ వర్షాలకు కూలిన పశువుల పాకలు
నేరడిగొండ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని కుంటాల(కె) గ్రామంలో రైతు రాథోడ్ సచిన్ కుమార్కు చెందిన పశువుల పాక కుప్పకూలింది. ఈ ఘటనలో పాకలో ఉన్న ఓ ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పశువైద్యాధికారి రాథోడ్ జీవన్కు సమాచారం అందించగా గురువారం గాయపడిన ఎద్దుకు చికిత్స అందించారు. భారీ వర్షాల సమయంలో పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని రైతులకు సూచించారు. పశువుల కొట్టం కూలి మూగజీవాలు మృతినార్నూర్: గాదిగూడ మండలం పిప్రి గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో గురువారం కురిసిన భారీ వర్షాలకు పశువుల కొట్టం కూలిపోయింది. కొట్టంలో కట్టి ఉంచిన ఆవు, దూడ, మేక శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొడప మారు కుటుంబం జీవనోపాధికి ఆధారంగా ఉన్న పశువులను కొట్టంలో కట్టి ఉంచగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పశువుల కొట్టం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది. -
వైష్ణవ్జీ.. రైలు వేయండి
నిర్మల్: జిల్లావాసుల రైలు కల సాకారమయ్యే దిశగా పట్టాలు పడుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇంకెన్ని దశాబ్ధాలు మొర పెట్టుకోవాలంటూ ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ శీర్షికన ఈనెల 13న ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీవైష్ణవ్ను కలిశారు. ఉత్తర తెలంగాణ ప్రజలు, ప్రధానంగా రైల్వేలైన్ లేని నిర్మల్వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కలిసి వెళ్లి.. సుదీర్ఘంగా వివరించి.. జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ నగేశ్, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావుపటేల్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలా కలిసిన ప్రతిసారీ రైల్వేమంత్రి ఏదో నామమాత్రంగా సమాధానమిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పక్కాగా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సారథ్యంలో నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్నగర్ ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్లు బృందంగా కలిసి వెళ్లారు. మంత్రి కార్యాలయంలోనే భేటీ అయ్యారు. ఈ రైల్వేలైన్ నిర్మాణ ఆవశ్యకతపై సుదీర్ఘంగా అశ్వినీవైష్ణవ్కు వివరించారు. ఈ ప్రాంతంలో వరుసగా బీజేపీ ఎంపీని గెలిపించడంతో పాటు ఈ లైన్ నిర్మాణం చేపట్టాల్సిన నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించారన్న విషయాన్నీ మంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అశ్వినీవైష్ణవ్ గ్రీన్సిగ్నల్..! రైల్వేలైన్ కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా వచ్చి చేసిన ప్రతిపాదనపై కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు పురోగతిపై అనుకూలంగా ఆయన సంకేతాలు ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కదిలించిన ‘సాక్షి’ కథనాలు.. దేశంలోని ఉత్తర –దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న గ్రాండ్ట్రంక్ రైల్వేలైన్కు ప్రత్యామ్నాయంగానూ ఆర్మూర్ –నిర్మల్ –ఆదిలాబాద్ రైల్వేలైన్ ఉపయోగపడుతుందని, దాదాపు 7లక్షల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని చాలా సందర్భాల్లో ‘సాక్షి’ వి భిన్న కథనాలు ప్రచురించింది. కొన్నేళ్లుగా పదేపదే కేంద్రానికి వినతులు ఇవ్వడంపై ఈనెల 13న ప్రచురితమైన ‘విన్నపాలు.. ఎన్నిసార్లు..’ కథనం ప్రజా ప్రతినిధులను కదిలించింది. ఈమేరకు కలిసికట్టుగా బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం నేరుగా కేంద్ర రైల్వేమంత్రిని కలిసి ప్రాజెక్టుకు ఆమోదం కోరడంలో కీలకమైంది. సానుకూలంగా స్పందించారు.. రైల్వేలైన్ నిర్మాణం కోసం బీజేపీ ప్రజాప్రతినిధులంతా మంత్రి అశ్వినీవైష్ణవ్ను ఢిల్లీలో కలిశాం. ఈ ప్రాంత ప్రజల కోరికతో పాటు రైల్వేలైన్ ఆవశ్యకత వివరించాం. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చెన్నూర్/చెన్నూర్ రూరల్: జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. చెన్నూర్ మండలంలోని అక్కెపల్లి వాగుపై ఉన్న లోలెవల్ కాజ్వే వద్ద వాగు ఉధృతిని ఆయన పరిశీలించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అఽధికారులపై మంత్రి ఆగ్రహం.. భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న మున్సిపాలిటీలోని 7 వార్డులో గల ఒడ్డెపల్లి కాల్వను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి కాల్వపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్తే ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయల నగర పంచాయతీ నిధులతో వంతెన నిర్మాణం చేపడుతానని మంత్రి హామీ ఇచ్చారు. కూలిన ఇళ్ల గోడలు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని సుందరసాలలో గుండ భాస్కర్రెడ్డి, నర్సక్కపేటలో నగరం బుచ్చయ్య, వేముల రాజయ్య, పాగెపల్లిలో పాగె దాదయ్య ఇంటిగోడలు కూలి పోయాయి. -
ఇంటర్లోనే ఉపాధికి బాట
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 47 ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు ఉండగా వీటిలో సుమారు 13వేలకు పైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యార్థులకు నాణ్యమైన కెరీర్ మార్గదర్శనం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఉపాధి అవకాశాలకు వారధిలా.. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి, ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు దక్కేలా కళాశాలలో ఒక అధ్యాపకుడికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న అధ్యాపకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే జిల్లాస్థాయి కోఆర్డినేటర్లు వారికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేస్తారు. కోఆర్డినేటర్లు తమ ప్రాంతంలోని పరిశ్రమల ప్రతినిధులతో సంబంధాలు కొనసాగించడం, నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం, విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందేలా చూడటం తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారు ఆయా కళాశాలల్లో విద్యార్థుల వివరాలు, వారి ఆసక్తులు, ఉన్నత విద్య లక్ష్యాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటాబేస్ రూపొందిస్తారు. విద్యార్థులకు కెరీర్ ప్రణాళికపై నిరంతర మార్గదర్శనం అందించే బాధ్యత కూడా వారిదే. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన ప్లేస్మెంట్ విభాగాల ద్వారా ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పారామెడికల్, వ్యవసాయం, పాలిటెక్నిక్, స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాలపై నిపుణులతో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఫార్మా వంటి కంపెనీల సమన్వయంతో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయనున్నారు. విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంటర్వ్యూ పద్ధతులు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వివరాలు..ప్రయోజనం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధికంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఉన్నత విద్య, స్కాలర్షిప్లు, ఉద్యోగ అవకాశాలపై సరైన సమాచారం అందుబాటులో ఉండదు. ప్లేస్మెంట్ విభాగాలు ఏర్పాటు ద్వారా అలాంటి విద్యార్థులకు సరైన దిశానిర్దేశం లభించడంతో పాటు భవిష్యత్ కెరీర్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశం కలగనుంది.గ్రామీణ విద్యార్థులకు -
అభ్యసన సామర్థ్యం మెరుగుపర్చాలి
ఉట్నూర్రూరల్: విద్యాజ్యోతి సమగ్ర ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్లోని స్థానిక బీఈడీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుల సామర్థ్య పెంపు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం మెరుగుపరచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఆధునిక బోధనా విధానాలు, సృజనాత్మక కార్యకలాపాలు, సమర్థవంతమైన తరగతి నిర్వహణ, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మార్గాలు అనుసరించాలన్నారు. క్యాంప్ అధికారి, స్థానిక బీ.ఎడ్. కళాశాల ప్రిన్సిపాల్ రాథోడ్ మాణిక్ రావు, సహాయ క్యాంప్ అధికారి జాదవ్ విఠల్, ఏసీఎంవో జగన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. భారీ వర్షాలు కురుస్తున్నందున ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. కంట్రోల్ సెంటర్ సిబ్బంది, వైద్య బృందాలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని, సర్పంచ్లు, పటేళ్లు, ఎంపీడీవోలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అన్ని సమాచార మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. అలాగే పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5226 లేదా 08731 –275226 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
కాంపౌండ్ వాల్ను ఢీకొని ఒకరు మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలివాడకు చెందిన నిమ్మల విజయ్కుమార్ (39) బైక్పై వెళ్తూ స్కూల్ కాంపౌండ్ వాల్ను ఢీకొట్టి మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విజయ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. హమాలివాడలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి స్కూల్ కాంపౌండ్ వాల్ను ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయ్కుమార్కు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
గేట్లు ఎత్తి.. దిగువకు నీటి విడుదల
మామడ: మండలంలోని పొన్కల్ గోదావరి వద్ద ఉన్న సదర్మాట్ బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది. గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ రెండు గేట్లు ఎత్తి గోదావరి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 1.580 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 9300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అడ 6, వట్టివాగు 4 గేట్లు.. ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ప్రాజెక్టుల్లో చేరుతోంది. కుమురం భీం (అడ) ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం సామర్థ్యం 10.393 టీఎంసీలు (238 మీటర్లు) కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 6.001 టీఎంసీలు వాటర్ లెవల్ 237.70 మీటర్లు ఉంది. వరద నీరు రావడంతో ఇన్ఫ్లో 30,423 క్యూసెక్కులు కాగా ఆరు గేట్లు 2 మీటర్లు ఎత్తి 40,238 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.890 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 2.480 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 36,000 క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 43,333 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు మరింత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మత్తడి వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు.. తలమడుగు: తాంసి, తలమడుగు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మత్తడివాగు ప్రాజెక్టు ఐదు గేట్లు ఉండగా అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మత్తడి వాగు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 0.571 టీఎంసీలు కాగా ఇన్ఫ్లో 38,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు అవుట్ఫ్లో 38,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి డీజీపీ సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 24/7 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. శిథిల భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టామన్నారు. వాగులు, నదులు, కల్వర్టుల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. డీసీపీ ఎ.భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
కౌటాల: జిల్లాతోపాటు మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదనీటితో పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. తాటిపెల్లి వద్ద వార్దా, గుండాయిపేట గ్రామానికి సరిహద్దులోని పెన్గంగ నది సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లను తాకుతోంది. వరద పెరగడంతో గంగపుత్రులు చేపల వేట నిలిపివేశారు. వార్దా, పెన్గంగ నదులు ఉప్పొంగడంతో మహారాష్ట్రకు నాటు పడవల రాకపోకలు నిలిచిపోయాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌటాల సీఐ బి.సంతోష్కుమార్ సూచించారు. -
జ్వరం.. దగ్గు.. జలుబు
మంచిర్యాలటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. డయేరియా, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య 500 వరకు ఉండగా, ఈ నెల 20 నుంచి భారీగా పెరుగుతోంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో ఒకరికి వైరల్ జ్వరం వస్తే ఒకరి నుంచి మరొకరికి వస్తుండడంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని గ్రామాలు, పట్టణా ల్లో డ్రెయినేజీలు నిండిపోవడం, రోడ్ల పక్కన చెత్త వేసి రోజుల తరబడి ఉంచడం, వర్షపు నీరు లోత ట్టు ప్రాంతాల్లో నిలిచి ఉండడం వల్ల వ్యాధులకు కారణం అవుతున్నాయి. వర్షాలతో నీరు కలుషితం కావడం కూడా ఒక కారణంగా వైద్యులు చెబుతున్నారు. కొత్తనీరు విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని, వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలని, ఈగలు వాలకుండా చూడడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్లనే జ్వరాలు వస్తుండగా, కలుషిత నీరు, ఆహారంతో డయేరియా బారిన పడుతున్నారు. తేదీ రోగులు 20 1,180 21 778 22 1,027 23 1,060 24 956 25 747 27 1,302 28 951 29 730 -
డీసీసీబీ సీఈవోగా విశ్వేశ్వరరావు
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన సీఈవోగా చండా విశ్వేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు పని చేసిన శ్రీధర్రెడ్డి గతేడాది సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలువురు ఇన్చార్జీలతో పాలన సాగింది. రెగ్యులర్ నియామకం కోసం ఇటీవల ప్రక్రియ నిర్వహించగా ఆరుగురు అధికారులు హాజరయ్యారు. వారిలో మెదక్ జిల్లా సహకార బ్యాంక్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వేశ్వర్ను నియమిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్చార్జి సీఈవో రవి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు..
జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీటర్లలో)మండలం వర్షపాతం కాసిపేట 123.5 హాజీపూర్ 107.4 చెన్నూర్ 105 మందమర్రి 104.4 మంచిర్యాల 103.1 బెల్లంపల్లి 96.5 నస్పూర్ 94.2 లక్సెట్టిపేట 93.7 జన్నారం 92.8 జైపూర్ 91.8 భీమారం 85.5 వేమనపల్లి 76.4 కోటపల్లి 72.2 దండేపల్లి 53.1 తాండూర్ 51 నెన్నెల 36.4 భీమిని 32.7 కన్నెపల్లి 31.3ఎల్లంపల్లి జలాశయంమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి ధాటికి దిగువ ప్రాంతాల్లోని రోడ్లు, తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. కాజ్వే, కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో వివిధ గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలో 80.6మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాసిపేట, హాజీపూర్, మందమర్రి, మంచిర్యాల, చెన్నూర్ మండలాల్లో వంద మిల్లీమీటర్లకు పైబడి వర్షం కురిసింది. బుధవారం రోజంతా కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతం వేమనపల్లి, కోటపల్లి అర్జునగుట్ట వద్ద ప్రాణహిత వరద ప్రవాహం పెరిగింది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. నెన్నెల, వేమనపల్లి, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం, వరద తీవ్రతతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేరులోకి నీరు చేరడంతో పత్తి మొలకలు నీట మునిగాయి. కోటపల్లి మండలం ఆలుగా మ గ్రామంలో ఇంటి పైకప్పు కూలి నలుగురు గాయపడ్డారు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్టుల్లోకి వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లింది. అన్నదాతల్లో హర్షం గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా భారీ వర్షాలు లేక పంటల సాగు సమయం ఎత్తిపోతుండడంతో ఆందోళనకు గురయ్యారు. వరి పొలాలు బీడుగా వదిలేశారు. ఆలస్యమైనా వర్షం పడుతుండడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఇదే అత్యధిక వర్షం కావడం గమనార్హం. జలాశయాల్లోకి నీరు చేరుతుండడంతో వరినాట్లకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు జిల్లా సగటు 26శాతం లోటు నెలకొనగా ప్రస్తుతం 10శాతం లోటుతో సాధారణ స్థాయికి చేరింది. తాండూర్, బెల్లంపల్లిలో 22 నుంచి 36శాతం అధికంగా, ఐదు మండలాల్లో 20 నుంచి 56శాతం లోటు, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.మత్తడి దూకుతున్న ర్యాలీవాగు ‘ఎల్లంపల్లి’కి భారీగా వరదమంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మొన్నటి వరకు 8టీఎంసీల నీటిమట్టంతో ఉండగా.. గత మూడు రోజుల్లో ఏకంగా రోజుకో టీఎంసీ చొప్పున మూడు టీఎంసీల నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.500టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 76 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్లోకి చేరుతోంది. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ సుజల స్రవంతి పథకానికి 275 క్యూసెక్కులు, నంది పంప్హౌస్కు 12,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. జిల్లాలోని నీల్వాయి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 0.836 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.732 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 1630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గొల్ల వాగు 155.50 మీటర్లు కాగా ప్రస్తుతం 140.6 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 1125 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ర్యాలీవాగు పూర్తి స్థాయి నీటిమట్టం 151.5 మీటర్లు కాగా ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో 151.7 మీటర్లు చేరి మత్తడి దూకుతోంది. ఇన్ఫ్లో 900 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.కుంగిన ఏసీసీ క్వారీ బ్రిడ్జి మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని ఎంసీసీ(ఏసీసీ) నుంచి గఢ్పూర్కు వెళ్లే దారిలో ఉషోదయ స్కూల్ దాటిన తరువాత రాళ్లవాగుపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోతోంది. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జి కోతకు గురవుతూ ఒకవైపు కూలుతోంది. దీంతో అప్రమత్తమైన మంచిర్యాల సీఐ ప్రమోద్ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఆండాళమ్మ కాలనీ నుంచి రంగంపేట్ మీదుగా మంచిర్యాలకు రావడం, మంచిర్యాల నుంచి అదే రోడ్డులో గఢ్పూర్కు వెళ్లాలని ప్రజలకు సూచించారు. పాతకాలం నాటి బ్రిడ్జి కావడంతో వరద ఉధృతి పెరిగితే కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలిమంచిర్యాలక్రైం: మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలను స్థానిక డీసీపీ ఎగ్గడి భాస్కర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాళ్లవాగు కాజ్వేపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాళ్లవాగు నుంచి పాత మంచిర్యాల, రాళ్లపేటకు రాకపోకలు నిలిపివేశారు. నీల్వాయి, కోటపల్లి ప్రాంతాల వైపు ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, కమిషనరేట్ పరిధిలో 30 మంది ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే 100 డయల్కు సమాచారం అందించాలని అన్నారు. పోలీస్ సిబ్బంది 24గంటలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు, తహసీల్దార్ రైమతుల్ల హుస్సేన్ పాల్గొన్నారు. -
ఇదేం ఆస్పత్రి.. ఇలాగేనా ఉండేది..!
● కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం కోటపల్లి: ‘ఇదేం ఆసుపత్రి.. ఇలాగేనా ఉండేది. ఇలా ఉంటే రోగులు ఎవరు వస్తారు. ఆస్పత్రిలో ప్రసవాలు ఎందుకు కావడం లేదు. సిబ్బంది ఏం చేస్తున్నారు..’ అంటూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోటపల్లి ఆసుపత్రి నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నీరు నిల్వ ఉండడంతోపాటు సరైన సౌకర్యాలు కనిపించపోవడంతో సిబ్బందిని ప్రశించారు. బోర్డులో ప్రసవాల సంఖ్య, గర్భిణుల వివరాలు నమోదు చేయకపోవడంపై ప్రశ్నించారు. సరైన సమాచారం లేకుండా ఎలా పని చేస్తున్నారని నిలదీశారు. స్లాబ్ నుంచి నీరు లీక్ కావడంపై కాంట్రాక్టర్ ఎవరని ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు. మండలంలోని అర్జునగుట్ట సమీపంలో ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం, సమీప పరిస్థితులు తెలుసుకున్నారు. వర్షాలతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. నదిలో నీటి ప్రవాహ తీవ్రతను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, సీఐ కృష్ణ, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత పాల్గొన్నారు. -
కమిషనర్ వర్సెస్ చైర్పర్సన్
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల సమయంలోనే వివాదాలకు కేంద్ర బిందువైన క్యాతనపల్లి మున్సిపాల్టీలో మరోసారి రాజకీయ, పాలనపరమైన వివాదం తెరపైకి వచ్చింది. కమిషనర్, చైర్పర్సన్ వర్గం మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగి పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. కమిషనర్, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడం, నాలాలు పొంగిపొర్లడంతో కమిషనర్ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం ఆయా వార్డుల్లో పర్యటించి పరిశీలించారు. ఈ పర్యటనపై చైర్పర్సన్కు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి భర్త, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజరమేష్ కమిషనర్ను ఫోన్లో ప్రశ్నించారు. సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. అనంతరం మొదటి వార్డులో ఓ ఇంటిని కమిషనర్ పరిశీలిస్తుండగా.. రాజరమేష్, రామిడికుమార్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అక్కడికి వెళ్లారు. తమ వార్డుల్లో పర్యటిస్తున్న సందర్భంలో సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్పర్సన్ దళితురాలు కావడం వల్లే చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో కమిషనర్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటమాట పెరిగి పరస్పర దూషణల వరకు వెళ్లింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు తనను రాజరమేష్, నాయకులు రామిడికుమార్, మరికొందరు అనుచిత పదజాలంతో దుర్భాషాలాడారని, విధులకు ఆటంకం కలిగించారని కమిషనర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ దళితురాలు కావడం వల్లే సమాచారం ఇవ్వకుండా కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని, బీఆర్ఎస్ కౌన్సిలర్లను పట్టించుకోకుండా అనుచితంగా మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులూ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుల కౌంటర్.. కమిషనర్ ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటే చైర్పర్సన్ భర్త, బీఆర్ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించడమేమిటని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, పల్లె రాజు, యాకూబ్అలీ, గోపురాజం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. కాగా, కమిషనర్ ఫిర్యాదు మేరకు విధులకు ఆటంకం కలిగించిన బీఆర్ఎస్ నాయకులు రాజరమేష్, రామిడికుమార్పై కేసు నమోదు చేసినట్లు మందమర్రి సీఐ పర్స రమేష్ తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుపై విచారణ చేపడుతామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కమిషనర్ వైఖరిని నిరసిస్తూ చైర్పర్సన్తోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. చైర్పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ కమిషనర్ చెన్నూర్లో అక్రమాలకు పాల్పడడంతో ఇల్లందుకు బదిలీ చేస్తే పైరవీలు చేసుకుని మళ్లీ క్యాతనపల్లికి వచ్చారని అన్నారు. చెన్నూర్లో ఆయనను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ క్యాతనపల్లికి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ప్రతీ విషయంలో పాలకవర్గాన్ని, సిబ్బందిని కమిషనర్ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ వైఖరిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
కాపర్ వైర్ చోరీ నిందితుడు అరెస్ట్
భైంసా: పట్టణంలో కాపర్ వైర్ చోరీ కేసును పోలీసులు ఛేదించి ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నారు. భైంసారూరల్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా శివాజీచౌక్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీరాం జనార్ధన్ ఈ నెల 27న తన ఇంటికి తాళం వేసి వెళ్లి, 28న తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక భాగంలోని గోడ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న కరెంట్ వైరింగ్ను కత్తిరించి సుమారు 10 కిలోల కాపర్ వైర్ చోరీ చేశారు. దీంతో బాధితుడు భైంసా టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాల సహాయంతో భైంసా పట్టణానికి చెందిన స్క్రాప్ వ్యాపారి షేక్ నజీర్ను అరెస్ట్ చేశారు. కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు బాలలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఫిర్యాదుదారుడి ఇంటి నుంచి చోరీ చేసిన 7 కిలోల కాపర్ వైర్, కరిగించి తయారు చేసిన 30 కిలోల కాపర్ వైర్, 7.2 కిలోల కాపర్ వైర్ బండిల్స్, మరో బాలుడి వద్ద ఉన్న 4 కిలోల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ అభినందించారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలులక్ష్మణచాంద: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన నిత్యానంద రెడ్డి(24) అంత్యక్రియలు బుధవారం మండలంలోని నర్సాపూర్(డబ్ల్యూ) గ్రామంలో కుటుంబ స భ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన గన్ను శ్రీనివాస్ రెడ్డి –విశ్వరూప దంపతుల కుమారుడు నిత్యానంద రెడ్డి మూడేళ్ల క్రితం అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 18న బైక్ పై వెళ్లే సమయంలో బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 23న మృతి చెందాడు. బుధవారం మృతదేహం స్వగ్రామం చేరడంతో గ్రామంలో విషాధచాయలు అలు ముకున్నాయి. అంత్యక్రియల్లో నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావుతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రు నరేశ్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల్లోకి చేరుతున్న నీరు
జలపాతాలు.. పరవళ్లు తిర్యాణి/ బోథ్: ఉమ్మడి జిల్లాలో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతలమాదర, గుండాల(బాహుబలి), ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతాలు వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటిధారలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండి భద్రతా నియమాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. గుండాల జలపాతంలో వరద ఉధృతి పెరగడంతో పర్యాటకుల సందర్శనకు అనుమతి లేదని ఫారెస్టు రేంజ్ అధికారి రమాదేవి తెలిపారు. పొచ్చెర జలపాతంచింతలమాదర జలపాతంగుండాల జలపాతంభైంసా: జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ఎస్పీ)కి వరదనీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువల్లో నీటి ప్రవాహం కనిపించింది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరు క్రమంగా ప్రాజెక్టులోకి చేరుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎస్సార్ఎస్పీలో నీటి మట్టం 1065.40 అడుగులు నమోదు కాగా, నీటి నిల్వ 16.545 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి సెకనుకు 3,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 751 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఈరోజుతో పోలిస్తే ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది జూలై 29న ఎస్సార్ఎస్పీ నీటి మట్టం 1075.00 అడుగులు, నీటి నిల్వ 32.897 టీఎంసీలుగా ఉంది. సదర్మాట్ ఆనకట్టకు జలకళ ఖానాపూర్: మండలంలోని మేడంపల్లి గ్రామ శివారులో ఉన్న సదర్మాట్ ఆనకట్టకు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు భారీగా చేరుతోంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండిపోవడంతో అదనపు నీరు మత్తడి పైనుంచి ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది. స్వర్ణ ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన ఇన్ఫ్లో సారంగపూర్: వుండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారి వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా నిన్నటి వరకు 1170 అడుగులు ఉంది. అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన ఒక మోస్తారు వర్షానికి వరదనీరు వచ్చి చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 3అడుగులు పెరిగి ప్రస్తుతం 1173.8 అడుగులకు చేరుకున్నట్లు ఏఈ వేణుగోపాల్ తెలిపారు. కడెం ప్రాజెక్ట్కు వరదకడెం: ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్కు వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం ప్రాజెక్ట్కు 22,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700(3.495టీఎంసీలు) అడుగులు కాగ, ప్రస్తుతం 689.150 (1.484టీఎంసీలు) అడుగుల నీటిమట్టం ఉంది. వరదల నేషథ్యంలో సీఈ జగదీశ్ ప్రాజెక్ట్ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరిగితే వరద గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందును నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ ప్రవీణ్, డీఈ వీరన్న, ఏఈఈ మురళీ తదితరులు ఉన్నారు. -
ఆరు గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదన
ఆదిలాబాద్టౌన్/తలమడుగు: కిడ్నాప్నకు గురైన నాలుగేళ్ల చిన్నారిని కేవలం ఆరు గంటల్లోనే గుర్తించి జిల్లా పోలీసులు మరోసారి తమ సమర్థత చాటుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ చిన్నారిని బుధవారం పోలీసు కార్యాలయంలో తల్లిదండ్రులకు అప్పగించి వివరాలు వెల్లడించారు. తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన ఆత్రం కప్లీబాయి –జంగుల నాలుగేళ్ల చిన్నారి గంగామణిని ఈనెల 28న అదే గ్రామానికి చెందిన నైతం నాగుబాయి ఆదిలాబాద్ పట్టణానికి తీసుకొచ్చి, బస్టాండ్ ప్రాంతంలో తనకు పరిచయమున్న గుమ్మడివార్ భారతికి అప్పగించింది. బిడ్డ కనిపించకపోవడంతో తల్లి ఆత్రం కప్లీబాయి తలమడుగు పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఫిర్యాదు చేయగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ రహీం పాషా, రూరల్ ఎస్సై విష్ణువర్ధన్, తలమడుగు ఎస్సై రాధికతో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు ఆదిలాబాద్, తాంసి తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి సాంకేతిక ఆధారాలతో అదేరోజు రాత్రి ఆదిలాబాద్లోని మహాలక్ష్మివాడలో చిన్నారిని గుర్తించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన నైతం నాగుబాయి, అలాగే చట్టవిరుద్ధంగా చిన్నారిని తన వద్ద ఉంచుకున్న గుమ్మడివార్ భారతిని అరెస్టు చేశారు. చిన్నారిని సురక్షితంగా రక్షించడంలో కీలకంగా పనిచేసిన రూరల్ సీఐ రహీం పాషా, ఎస్సైలు రాధిక, విష్ణువర్ధన్తో పాటు గాలింపు బృందంలోని పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కుమార్తె క్షేమంగా తిరిగి రావడంతో చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
గల్ఫ్ మోసాలపై అప్రమత్తత అవసరం
నిర్మల్ఖిల్లా: ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిక్రూట్మెంట్ మోసాలు, వేతన దోపిడీ, చట్టపరమైన పరిష్కార మార్గాలపై హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన భాగస్వామ్య వర్క్షాప్లో సమగ్రంగా చర్చించారు. సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రెంట్ స్టడీస్ (సీఐఎంఎస్), మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఆసియా (ఎంఎఫ్ఏ) సంయుక్త ఆధ్వర్యంలో రాయల్ రేవ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ రిక్రూట్మెంట్ సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, సౌదీ కేస్ హ్యాండ్లర్లు, వలస కార్మికుల సంక్షేమ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా నుంచి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల, కెనడా ఎంబసీ మాజీ సలహాదారు సంపత్ కుమార్ హాజరై సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు కేస్స్టడీలను విశ్లేషించారు. ఉమ్మడిజిల్లా ఘటనలపై నివేదన.. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న పలువురు కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం, అక్కడికి చేరుకున్న తర్వాత ఉద్యోగ ఒప్పందంలోని నిబంధనలను ఏకపక్షంగా మార్చివేయడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాధిత కార్మికుల్లో 90 శాతం మందికి ఉద్యోగ ఒప్పంద ప్రతులు, నెలవారీ వేతన స్లిప్లు లేకపోవడం వల్ల కోర్టులు, ట్రిబ్యునళ్లలో తమ హక్కులను నిరూపించుకోవడం కష్టంగా మారుతోందని వివరించారు. జిల్లానుంచి విజిట్ వీసాలపై ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం వల్ల చట్టపరమైన రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని, నర్సింగ్, వైద్య రంగానికి చెందిన నైపుణ్య కార్మికులు ముందస్తు ధ్రువీకరణ లేకుండా వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వలస కార్మికులకు సమస్యలు తలెత్తిన తర్వాత మాత్రమే కాకుండా, ముందస్తు అవగాహన కల్పించి మోసాలు జరగకుండా నిరోధించే వ్యవస్థను బలోపేతం చేయాలని వర్క్షాప్లో నిర్ణయించారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ఉద్యోగ ఒప్పందాలు, వేతన రికార్డులు, ఇతర కీలక పత్రాలను తప్పనిసరిగా భద్రపరుచుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. -
డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు హత్య
భైంసా: కుంటాల పోలీస్స్టేషన్ పరిధిలోని దౌనెల్లి గ్రామానికి చెందిన పున్న మహేందర్(26) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మోసపూరితంగా బ్యాంకు ఖాతా నుంచి బదిలీ చేసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకొని హత్య చేసిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 18, 2026న దౌనెల్లి గ్రామ శివారులోని బావి వద్ద మహేందర్ను మైనర్ వెనుక నుంచి తోసివేయడంతో అతను బావిలో పడి మృతి చెందాడు. ఏప్రిల్ 23న బావిలో మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేందర్ తల్లి ఎస్పీని కలిసి తన కుమారుడి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరడంతో, ఎస్పీ ఆదేశాల మేరకు కేసును ప్రత్యేక దృష్టితో పునఃపరిశీలించారు. ఈ క్రమంలో అనుమానితుల కదలికలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి విచారణ చేపట్టారు. దర్యాప్తులో మహేందర్ బ్యాంకు ఖాతా నుంచి మైనర్ బాలుడు మోసపూరితంగా కొంత మొత్తాన్ని తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న మహేందర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న మైనర్ బాలుడు మహేందర్ను బావి వద్దకు తీసుకెళ్లి వెనుక నుంచి తోసివేయడంతో మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. జూలై 29న మైనర్ను అదుపులోకి తీసుకొని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ బుధవారం తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుంటాల ఎస్సై నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ సాయి కిరణ్ అభినందించారు. -
ముగిసిన వ్యాస పౌర్ణమి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో మూడు రోజులుగా నిర్వహించిన వ్యాస పౌర్ణమి (గురుపూజ) ఉత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వ్యాస మహర్షికి మహాభిషేకం, రుద్రాభిషేకం, బలిప్రదానం నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. గురు పరంపరను కొనసాగిస్తున్న మఠాధిపతులు, వేద పండితులను ఆలయ ఈవో అంజనీదేవి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్లు శాలువాలు, ఫలపుష్పాలతో ఘనంగా సత్కరించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రవచనకర్త శశికాంత్ జోషి వ్యాస పౌర్ణమి వైభవం, బాసర క్షేత్ర విశిష్టతపై భక్తులకు ప్రవచనం అందించారు. అనంతరం శశికాంత్ జోషిని ఆలయ అధికారులు సత్కరించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు.. వ్యాస పౌర్ణమి ఉత్సవాలకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ చారి, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ దత్తాత్రేయ ఆలయాన్ని, శిశు మందిర్ పాఠశాలను సందర్శించారు. అనంతరం బాలాలయంలో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు కలిసి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి, ఆశీర్వచనం అందజేశారు. -
సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్గా పొట్టపల్లి మహిళ
లక్ష్మణచాంద: రాష్ట్ర స్థాయిలో సీ్త్రనిధి డైరెక్టర్గా మండలంలోని పొట్టపల్లి గ్రామానికి చెందిన గంగామణి ఎంపికయ్యారు. రాష్ట్ర సీ్త్రనిధి సహకార పరిమితి సొసైటీ మహిళా బ్యాంకు 5 డైరెక్టర్ల స్థానాలకు మంగళవారం హైదరాబాద్లోని సెర్ప్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలను బుధవారం ప్రకటించారు. ఎన్నికల్లో ఒక డైరెక్టర్గా మండలంలోని పార్పెల్లి గ్రామానికి అనుబంధ గ్రామం పొట్టపల్లి గ్రామవాసి, నిర్మల్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి ఎంపికయ్యారు. వీరిని రాష్ట్ర మంత్రి సీతక్క అభినందించారు. -
జలపాతాల వద్ద జాగ్రత్త..!
నార్నూర్: జలపాతాల వద్ద ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండటంతో మండలంలోని గుండాల గ్రామ శివారులోని కుండాయి జలపాతం వద్ద బుధవారం నార్నూర్ ఎస్సై శ్రీసాయి ఆధ్వర్యంలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతం వద్ద నీటి ప్రవాహం పెరగడంతో పర్యాటకులు, యువత ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సూచిక ఏర్పాటు చేశారు. జలపాతాన్ని సందర్శించే వారు రాళ్లపైకి ఎక్కడం, లోతైన నీటిలోకి దిగడం, సెల్ఫీల కోసం అంచుల వరకు వెళ్లడం, మద్యం సేవించి జలపాతం పరిసరాల్లో సంచరించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. స్థానికులు కూడా సందర్శకులకు భద్రతా సూచనలు తెలియజేస్తూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ కళాశాలలో పాముకాటు కలకలం
నస్పూర్: సీసీసీ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులను పాముకాటు వేసిన ఘటన కలకలం రేపింది. కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకునే మెకానికల్ మొదటి సంవత్సరం విద్యార్థి ఎండీ రెహన్, సివిల్ మొదటి సంవత్సరం విద్యార్థి యశ్వంత్లు బుధవారం ఉదయం టిఫిన్ చేయడానికి మెస్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో యశ్వంత్ ఓ పాము తన కాలుపై నుంచి వెళ్లిందని అరిచాడు. పక్కనే ఉన్న ఎండీ రెహన్ పామును తరిమే ప్రయత్నం చేయగా పాము అతడిని తాకుతూ వెళ్లింది. విద్యార్థులను పాము కాటు వేసిందనే అనుమానంతో తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వెంటనే 108లో విద్యార్థులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు తెలిపారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్, మైనింగ్ హెచ్ఓడీలు విద్యార్థుల వెంట ఎంజీఎంలో ఉన్నారని తెలిపారు. -
ఆధ్యాత్మికతకు ప్రతీక బాసర క్షేత్రం
బాసర: జ్ఞానం, విద్య, ఆధ్యాత్మికతకు ప్రతీకగా విరాజిల్లుతున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం ఎంతో విశిష్టమైనదని వేద పండితుడు శశికాంత్ జోషి అన్నారు. గురుపౌర్ణమి (వ్యాస పౌర్ణమి) ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం బాసర క్షేత్ర వైభవంపై ఆయన ప్రవచనం చేశారు. క్షేత్రంలోని విశిష్టతలు, ఉప ఆలయాల ప్రాశస్త్యం, గోదావరి నది పవిత్రత, అమ్మవారి ఆరాధనతో కలిగే ఆధ్యాత్మిక ఫలితాలను భక్తులకు వివరించారు. దుర్బుద్ధి తొలగి మంచి గుణాలు అలవడాలంటే జ్ఞానం అవసరమని, ఆ జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అమ్మవారి సన్నిధి బాసరలో ఉండటం క్షేత్రం ప్రత్యేకత అన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్యాభివృద్ధి, జ్ఞానసంపద కలుగుతుందన్నారు. ఆలయ సమీపంలోని బొర్రా గణేశుడిని ప్రార్థిస్తే సకల విద్యల్లో ప్రావీణ్యం కలుగుతుందన్నారు. పూర్వకాలంలో పుష్కర జలాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసేవారన్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో స్థాపిత దేవతా పూజ, మూలమంత్ర హోమం, వేద పారాయణం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
తాండూర్/కాసిపేట: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం తాండూర్ మండలం కొత్తపల్లి, మండల కేంద్రమైన కాసిపేటలోని రైతువేదికల్లో విత్తన మేళాలను ఆయన సందర్శించారు. రాయితీ విత్తనాలు, ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగు చేయాలని, పప్పు దినుసుల పంటలు సాగు చేస్తే అధిక లబ్ధి పొందడమే కాక భూసారం కూడా పెంపొందుతుందని తెలిపారు. కాసిపేట కేజీబీవీ లో అదనపు తరగతి గదుల నిర్మాణం, భోజనశాల పనులు పూర్తి చేయాలని సూచించారు. తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామంలో సమగ్ర భూసర్వే అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో సబ్ కలెక్టర్ మనోజ్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి సుష్మ, కాసిపేట ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్, ఏఈఓ సాగర్ పాల్గొన్నారు. -
సిబ్బందే వైద్యులు!
దండేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు రెగ్యులర్ వైద్యులు ఉండగా.. ఒకరు ఉన్నత చదువులు, మరొకరు డిప్యూటేషన్పై వెళ్లారు. దీంతో రెండు పోస్టులూ ఖాళీ ఏర్పడ్డాయి. అటెండర్, డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులూ ఖాళీ ఉన్నాయి. ఓ కాంట్రాక్టు వైద్యురాలిని నియమించగా.. ఆమె రానప్పుడు సిబ్బందే వైద్యసేవలు అందించాల్సి వస్తోంది. 24గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. వైద్యులు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కో రోజు పల్లె దవాఖానాల్లోని ఎంఎల్హెచ్పీలను అందుబాటులో ఉంచుతున్నారు. కాంట్రాక్టు వైద్యురాలు మంగళవారం కలెక్టరేట్లో సమావేశానికి వెళ్లగా.. రోగులకు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అటెండర్ లేకపోవడంతో స్వీపర్ దాయమ్మ గాయాలతో వచ్చిన వారికి డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టి పంపించింది. పీహెచ్సీ ఇంచార్జి డీడీవో తాళ్లపేట పీహెచ్సీ డాక్టర్ స్నేహితను సంప్రదించగా, సమావేశానికి వెళ్లడంతో అందుబాటులో లేరని తెలిపారు. కాలి గాయానికి డ్రెస్సింగ్ చేస్తున్న స్వీపర్వైద్య పరీక్షలు చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ -
ఉద్యోగాల పేరుతో రూ.70 లక్షల టోకరా
నార్నూర్: ప్రభుత్వ ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని నమ్మించి అమాయక నిరుద్యోగుల వద్ద నుంచి సుమారు రూ.70 లక్షలు వసూలు చేసిన నలుగురు నిందితులను నార్నూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తొడసం గజానంద్ వద్ద రూ.4 లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రం ఇచ్చినట్లు రెండు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో నార్నూర్కు చెందిన చహకాటి లింబారావు, ఉట్నూర్కు చెందిన జాడి ప్రవీణ్ కుమార్, కెరమెరికి చెందిన రామ్టెకి ఉదయ్ కిరణ్, జైనూర్కు చెందిన జాడి రవీందర్ ప్రభుత్వ ఉద్యోగాలు, రుణాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జన్నారం ప్రాంతానికి చెందిన ముగ్గురు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరితో పాటు మొత్తం సుమారు 25 మంది నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఇంకా బాధితులు ఉంటే ముందుకు వచ్చి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. -
ఓవర్ టు పైలట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టుతో పాటు ఇండియన్ ఎయిర్పోర్స్కు చెందిన శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించాయి. ప్రైవేట్ పైలట్ శిక్షణ సంస్థలు రెండు ఆదిలాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నాయి. అలాగే ఆరు ఎంఆర్ఓ (నిర్వహణ), రిపేర్(మరమ్మతు), ఓవర్హాల్ (సమగ్ర తనిఖీ) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. – సాక్షి, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనుండగా, ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రంతోపాటు ఎంఆర్వో ఇతరత్రా సదుపాయాలతో ఏర్పాటు కానుంది. ఇందుకోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూసేకరణకు రూ.2278 కోట్లు మంజూరు చేస్తూ ఈ నెల 25న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. భూసేకరణ, ప్రతి పాదిత ప్రాజెక్ట్ నిర్మాణంలో అడ్డంకులు తొలగించేందుకు వివిధ పనుల కోసం నిధులు వెచ్చిస్తారు. ప్రైవేట్ అకాడమీల దృష్టి..ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుతో పాటు వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుండగా ఇక్కడ ప్రైవేట్ అకాడమీలు కూడా శిక్షణకు ముందుకు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివిధ ప్రైవేట్ అకాడమీలను సంప్రదించగా వారు ఈ ప్రాంతంలో ఏర్పాటుకు ఆసక్తి కనబర్చుతూ తమ దరఖాస్తులు అందజేశారు. తాజాగా ఎమ్మెల్యే ద్వారా వాటిని కేంద్ర రక్షణ శాఖకు అందజేశారు. అకాడమీలు ఇలా..పైలట్ శిక్షణ ఆసక్తి కనబర్చే వారికి విమానం నడపడం నేర్పిస్తారు. దాంతో పాటు పైలట్ లైసెన్సులు, రేటింగ్ల కోసం శిక్షణ ఇవ్వడానికి విమానయాన అధికార సంస్థ (డీజీసీఏ, ఈఏఎస్ఏ) నుంచి అధికారిక ఆమోదం పొంది ఉండాలి. అలాంటి సంస్థలే శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. -
జన్నారం డివిజన్లో పీసీసీఎఫ్ పర్యటన
జన్నారం: రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి(పీసీసీఎఫ్) వినయ్కుమార్ మంగళవారం జన్నారం అటవీ డివిజన్లో ప ర్యటించారు. ఇందన్పల్లి రేంజ్లోని భర్తన్పే ట్ వాచ్టవర్ వద్దకు వెళ్లి అడవులను పరిశీ లించారు. జన్నారం పర్యావరణ అధ్యయన కేంద్రం సందర్శించి అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. అడవుల రక్షణ, వన్యప్రాణులు, పర్యాటక అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. టైగర్ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతరాం, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీవో రామ్మోహన్, రేంజ్ అధికారులు ఖాదర్వలీ, లక్ష్మీనారాయణ, వికాస్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2026–27 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన పీయూసీ 1 విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం మంగళవారం రెండో రోజు కొనసాగింది. క్యాంపస్లోని ఎస్ఏసీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యా విధానం, క్రమశిక్షణ, పరీక్షల నిర్వహణ, క్యాంపస్ జీవనం, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ కే.గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగిన నిపుణులుగా తీర్చిదిద్దడమే ఆర్జీయూకేటీ లక్ష్యమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఇక్కడ లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. -
‘సాయ్’ హాకీ అకాడమీకి ఎంపిక
ఉట్నూర్రూరల్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాకీ అకాడమీకి ఉట్నూర్ గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులు 9 మంది ఎంపికై నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంపికై న పెందుర్ ధనరాజ్, ఉర్వెత జంగు, బుక్య కిరణ్, ఆత్రం శంభు, రాథోడ్ ధనరాజ్, జాదవ్ సాయి ప్రసాద్, చౌహాన్ సాయిరామ్, ఆత్రం జగ్జీవన్, కోట్నాక్ అజయ్కుమార్ను మంగళవారం ఐటీడీఏ పీవో మంద మకరందు అభినందించారు. ఐటీడీఏ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో గోడం చందన్, ఏపీవో పీవీటీజీ భాస్కర్, ఏసీఎంవో జగన్, ఎస్వో పార్థసారథి, హెచ్ఎం ఉత్తం, తదితరులు పాల్గొన్నారు. -
పూజల పేరిట చోరీ.. ఇద్దరు మహిళల అరెస్టు
భైంసారూరల్: మండలంలోని కోతల్గాంలో పూజల పేరిట ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు భైంసారూరల్ సీఐ ప్రవీణ్ తెలిపారు. గ్రామానికి చెందిన చందుల్వార్ దత్తాత్రి సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం పంటచేలకు వెళ్లాడు. భిక్షాటనకు వచ్చిన భైంసాకు చెందిన ముద్దేవార్ శాంతాబాయి, సాయవ్వ ఇద్దరూ కలిసి దత్తాత్రి ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగా ఉండడంలేదని, పూజలు చేస్తే సమస్య తొలగిపోతుందని అతని భార్య కవితను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించారు. దేవుడి గదిలో దీపం వెలిగించి పూజలు చేస్తుండగా ఇంటికి వచ్చిన దత్తాత్రి తమకు ఎలాంటి పూజలు అవసరం లేదని వారిని మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వా త దేవుడి గదిని పరిశీలించగా అక్కడ ఉన్న రూ.15 వేల విలువైన ఐదు తులాల రెండు వెండి కడియాలు కనిపించలేదు. బాధితుడు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సై సుప్రియ పాల్గొన్నారు. -
దాడి కేసులో ఇద్దరి రిమాండ్
తాండూర్: భూ తగాదాలో మండలంలోని బోయపల్లికి చెందిన మాసాడి భాస్కర్పై దాడి చేసిన ఘటనలో ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రసాద్రావు తెలిపారు. ఈ నెల 12న భాస్కర్పై కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. దాడి చేసిన పూసాల ప్రశాంత్, సిద్ధం శివగణేశ్ను అరెస్ట్ చేసి మంగళవారం బెల్లంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆసిఫాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
బాలిక అదృశ్యం
తలమడుగు: మండలంలోని రూయ్యాడి గ్రామానికి చెందిన బాలిక ఆత్రం గంగామణి (4) ఈనెల 27న అదృశ్యమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు. దర్యాప్తులో రుయ్యాడి గ్రామానికి చెందిన నైతం నాగుబాయి బాలికను ఆదిలాబాద్ బస్టాండ్కు తీసుకువచ్చి ఓ మహిళకు అప్పగించినట్లు సీసీ కెమెరాలో రికార్డయినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో ఒకరు..ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని శాంతినగర్కు చెందిన దేశెట్టి వెంకటేష్ (47) అదృశ్యమయ్యాడు. పట్టణంలోని సైకిల్షాప్లో పనిచేస్తున్న ఆయన రోజులాగే సోమవారం షాప్కు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. చుట్టుపక్కలా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో అతని కుమారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. ఖైరిగూర ఓసీకి ప్రథమ బహుమతిరెబ్బెన: రక్షణ పక్షోత్సవాల్లో బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ విశేష ప్రతిభ కనబర్చి మూడు ప్రథమ బహుమతులతో పాటు ఒక విభాగంలో ద్వితీయ బహుమతిని సాధించింది. బహుమతి ప్రదానోత్సవాన్ని సోమవారం రాత్రి ఆర్జీ–1 ఏరియాలో నిర్వహించగా ఖైరిగూర ఓసీపీ రక్షణ, ప్రథమ చికిత్స, ట్రస్ట్ ఏరియా మైన్స్ విభాగాల్లో ప్రథమస్థానంలో నిలవగా, పర్యావరణం విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. సింగరేణి డైరెక్టర్లు సూర్య నారాయణ, వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చేతుల మీదుగా ఏరియా జీఎం శ్రీరమేష్, ఖైరిగూర ఓసీపీ ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్. తిరుపతి, ప్రాజెక్టు ఇంజినీరు వీరన్న, మేనేజర్ శంకర్, పిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి..‘దారేది’!
చెన్నూర్: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు కావస్తున్నా నేటికీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు లేక ఆయా గ్రామాల ప్రజలు దుర్భర జీవనం సాగిస్తున్నారు. 1980లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం గ్రామీణ రోడ్లకు శాపంగా మారింది. ఈ చట్టంలో పొందుపర్చిన పర్యావరణ అనుమతులు రోడ్ల నిర్మాణాలకు గుదిబండగా మారాయి. ఈ చట్టం ఏర్పాటుకు ముందే నిర్మించిన రోడ్లు తప్ప నేటికీ కొత్త దారుల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. కొన్ని రోడ్లకు నిధులు మంజూరైనా అటవీశాఖ అనుమతి లభించక నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో మెరుగైన వైద్యం, విద్య సౌకర్యాలు అందక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షాకాలంలో అవస్థలు వర్ణణాతీతం. ముందుకు సాగని నిర్మాణాలు... మల్లంపేట నుంచి నక్కలపల్లి వరకు బీటీ రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం. నక్కలపల్లి వెళ్లే దారిలో రోడ్డు డ్యాం లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని సవరించే విధంగా ఎంపీలు కృషి చేయాలి. గ్రామీణ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలి. – తొట అశోక్, నక్కలపల్లి మినహాయింపు ఇవ్వాలి.. గ్రామీణ రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వాటా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని పరిస్థితి ఉంది. పార్లమెంటు సభ్యులు సమావేశాల్లో ఈ క్లాజును సవరించి గ్రామీణ రోడ్లకు మినహాయింపు ఇవ్వాలి. మెరుగైన రోడ్డు, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగు పర్చాలి. –పోటు రాంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, కోటపల్లి -
రుషభనాథుని శిథిల శిల్పం గుర్తింపు
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్రూరల్ మండలంలోని చాందా (టి)శివారులో 9వ శతాబ్దం నాటి తొలి జైన తీర్థంకరుడు రుషభనాథుని శిథిల శిల్పాన్ని తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు రొడ్డవార్ పృథ్విరాజ్ మంగళవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జైన మతానికి సంబంధించిన అనేక పురాతన విగ్రహాలు ఒక్కొక్కటిగా లభ్యం అవుతున్నాయన్నారు. ఇప్పటి కే ఇక్కడ 17వ తీర్థంకర కుంతనాథ, పార్శ్వనాథ వి గ్రహాలు లభించాయన్నారు. వీటితో పాటు జైన మ తానికి సంబంధించిన సుమారు 50 వరకు శిథిల వి గ్రహాలు లభించడం ప్రత్యేకమన్నారు. ఆయన వెంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అక్షయ, షె రిల్, సాయిరాజ్ కాంబ్లే, శ్రేయ, మమత ఉన్నారు. రుషభనాథుని శిథిల శిల్పం -
విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం కావాలి
ఉట్నూర్రూరల్: విద్యార్థుల సమగ్ర వికాసమే ఉపాధ్యాయుల ఏకై క లక్ష్యం కావాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘విద్యాజ్యోతి–సామర్థ్యాభివృద్ధి–సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తరగతి గదిలో కార్యకలాపాల ఆధారిత బోధన, ఉత్తమ బోధనా పద్ధతులు, వాస్తవ జీవిత ఉదాహరణలను ఉపయోగించి పాఠ్యాంశాన్ని దృశ్య రూపంలో అర్థమయ్యేలా బోధించాలన్నారు. విద్యార్థుల్లో లక్ష్య నిర్దేశం పెంపొందించి, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం , సమగ్ర వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా కృషి చేయాలన్నారు. ఐదు రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో చందన్, ఏపీవో పీవీటీజీ భాస్కర్, డీటీడీవో నిర్మల్ నిహారిక, ఏసీఎంవో జగన్, ఎస్వో పార్థసారథి, జీసీడీవో ఛాయ, బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ మానిక్రావు, రిసోర్స్ సభ్యులు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన తెలుగు, ఆంగ్లం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కలెక్టర్ చొరవతో పాఠశాలలో చేరిన విద్యార్థులు
ఇంద్రవెల్లి: కలెక్టర్ రాజర్షిషా చొరవతో బడీడు పిల్ల లు పాఠశాలలో చేరారు. మంగళవారం ఉట్నూర్ పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి వద్ద తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తున్న పిల్లలను చూసిన కలెక్టర్ జిల్లా విద్యాధికారి మిల్కాకు ఫోన్ చేసి బాలకార్మికులను వెంటనే పాఠశాలలో చేర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన డీఈవో మండల అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్రెడ్డి, ఐసీడీఎస్ కోఆర్డినేటర్ పురుసోత్తం సాయినగర్కు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం సునీతను ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరోతరగతిలో సునీల్ను ఎంపీపీఎస్లో 5వ తరగతిలో చేర్పించారు. -
ఏజెన్సీలో కేటుగాళ్లు!
ఉట్నూర్రూరల్: ఒక రోజు ఉట్నూర్.. మరుసటి రోజు ఇంద్రవెల్లి.. మరొక రోజు ఇచ్చోడ.. ఇంకోరోజు గుడిహత్నూర్.. ఇలా ఏజెన్సీలో ఏ ప్రాంతాన్ని వదలకుండా రోజుకో కొత్త మోసానికి పాల్ప డుతున్నారు. ఏజెన్సీ ప్రాంత అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు పన్నుతున్న మాయాజాలంలో చిక్కి నిరుద్యోగులు, సామాన్యులు నిలువునా మునిగిపోతున్నారు. ఎన్ఆర్ఐ పేరుతో కృష్ణ మోసాల నుంచి మొదలుకొని, ఇంద్రవెల్లిలో విదేశాలకు పంపిస్తామంటూ చేసిన మోసం వరకు అంతా మోసాల దందాగా సాగుతోంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసులు ఛేదించినప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా ఒకరిని మించి ఒకరు వినూత్న రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదులతో స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకుని జైలు పాలు చేస్తున్నప్పటికీ, కొత్త మోసగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. బయటపడిన సంఘటనలు కొన్ని మాత్రమే కాగా, పరువు పోతుందనో, భయంతోనో పోలీసుల వరకు వెళ్లని బాధితుల కథలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు -
బోనాలు.. ఉపాధి జాతర
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో బోనాల సందడి కొనసాగుతోంది. ఆషాఢ మాసం నెల రోజులపాటు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, కళాకారులు ఆటపాటలు, డీజే హోరు వాడవాడలా మార్మోగుతుంది. బోనాల జాతర సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా చిన్న తరహా వ్యాపారులు, కళాకారులు, చేతివృత్తుల కుటుంబాలకు నెల రోజులపాటు ఆశాజనకమైన ఆదాయం అందిస్తోంది. ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా జాతర అనేక రకాల వృత్తుల వారికి ఆర్థికంగా ఊరటనిస్తూ వ్యాపార రంగానికి సరికొత్త వెలుగునిస్తోంది. ఆఫర్ల ధమాకా ఆషాఢ మాసంలో బట్టల వ్యాపారం జోరుగా సాగుతోంది. సాధారణంగా ఈ మాసంలో శుభకార్యాలు లేక వ్యాపారాలు మందగిస్తాయి. ఇందుకు భిన్నంగా ప్రముఖ షాపింగ్ మాల్స్, వస్త్ర వ్యాపారులు ఆ షాఢం ఆఫర్ల విక్రయాలతో మార్కెట్ కిటకిటలాడుతోంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం, 50నుంచి 80 శాతం రాయితీ ఇస్తుండడంతో జనం విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. బోనాల పండుగ, రాబోయే శ్రావణ మాస పూజలు, పేరంటాల కోసం మహిళలు ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. దారిపోచమ్మకు మొక్కులు..బస్తీల్లో పోచమ్మ తల్లి ఉత్సవాల నేపథ్యంలో మేకలు, కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆపదలు తొలగి ఊరంతా ఆయురారోగ్యాలతో సల్లంగా ఉండేలా చూడు పోచమ్మ తల్లి అంటూ ప్రార్థిస్తూ వివిధ బస్తీల్లో భక్తులు, ప్రమాదాల నివారణకు రహదారి వెంట వెలిసిన దారి పోచమ్మకు వాహనదారులు కోళ్లు, మేకలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో మేకలు, కోళ్ల వ్యాపారం జోరుగా సాగుతోందని వ్యాపారులు తెలిపారు. -
పశువులను రోడ్లపై వదిలితే కఠిన చర్యలు
ఆదిలాబాద్టౌన్: పశువులను రోడ్లపై వదిలిపెడితే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసు శాఖ, మున్సిపల్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ, వాహనదారులకు ప్రమాదకరంగా మారిన 22 పశువులను గుర్తించి ఇచ్చోడ గోశాలకు తరలించారు. గోశాలలో పశువులు ఉన్నన్ని రోజుల నిర్వహణ ఖర్చును సంబంధిత య జమానులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా పశువులను రోడ్లపై వదిలిపెట్టిన దుర్గానగర్కు చెందిన కై లాష్, ఖానాపూర్కు చెందిన అహ్మద్ ఖాన్, సాజిత్ ఖాన్తో పాటు మరికొందరు యజమానులపై ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో రోడ్లపై సంచరించే పశువుల కారణంగా చిరు వ్యాపారులు, కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక ఘటనలో కూరగాయల వ్యాపారి కొట్టడంతో ఆవు మృతి చెందగా, ఆ ఘటన శాంతిభద్రతల సమస్యలకు దారితీసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి తగ్గింపునకు ప్రతిపాదనలు
జన్నారం: టైగర్జోన్ పరిధి నుంచి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి ప్రస్తుతం పది కిలోమీటర్ల దూరం ఉందని, దీన్ని ఒక కిలోమీటరులోపు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదించినట్లు జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ వో) రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన జన్నారంలో విలేకరులతో మాట్లాడారు. ఎకో సెన్సిటివ్జోన్ నిబంధనతో పరిసర ప్రాంతాల నుంచి ఇసుక తోడడం నిషేధించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక కిలోమీటరుకు కుదిస్తే గోదావ రి నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయదని అన్నారు. అట వీశాఖ నిబంధనల ప్రకారమే నడుచుకోవా ల్సి ఉంటుందని, స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎఫ్డీఓ రామ్మోహన్, రేంజ్ అధికారులు పాల్గొన్నారు. -
దొంగను పట్టిచ్చిన సీసీ కెమెరా
మంచిర్యాలక్రైం: ఇంటర్నెట్ సెంటర్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా దొంగను పట్టిచ్చింది. మంచిర్యాల సీఐ ప్రమోద్రావు సోమవారం తన చాంబర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక రాజీవ్నగర్కు చెందిన మహ్మద్ మొయిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ నెల 25న దొంగతనం జరిగింది. కంప్యూటర్, మానిటర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్నెట్ సెంటర్లోని సీసీ కెమెరా ఆధారంగా దొంగను బెల్లంపల్లికి చెందిన మహ్మద్ మద్గుంగా గుర్తించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు యజమానిని శాలువాతో సన్మానించారు. -
చోరీకి పాల్పడ్డ నిందితుడి అరెస్ట్
బోథ్: ఇంటి తాళం పగులగొట్టి నగదు చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై వి. పురుషోత్తం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న పట్టణంలోని న్యూ కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటికి తాళం వేసి పనికి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని పెట్టేలో దాచుకున్న రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 26న బోథ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన కృష్ణకాంత్ జాదవ్గా గుర్తించారు. కూలీ పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో బాధితురాలి ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.5వేలు స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
చిన్నారి నోట్లో ఇరుక్కున్న టూత్ బ్రష్
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సతీష్ కూతురు అమన్వితశ్రీ(2) నోట్లో దవడలకు టూత్ బ్రష్ చిక్కుకోవడంతో నరకయాతన అనుభవించింది. సోమవారం సాయంత్రం నోట్లో బ్రష్ వేసుకుని ఆడుకుంటున్న సమయంలో కిందపడడంతో చర్మాన్ని చీల్చుకుంటూ దవడలో ఇరుక్కుపోయింది. కాసిపేట పీహెచ్సీకి అక్కడి నుంచి 108 అంబులెన్స్లో మంచిర్యాల మాతాశిశు కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వరంగల్ ఏంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించగా.. బ్రష్ను తొలగించారు. బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానాఇచ్చోడ: బైండోవర్ నిబంధనలు ఉల్లఘించిన నైతం సంజీవ్కుమార్ అనే వ్యక్తికి రూ.25 వేల జరిమానా విధించినట్లు ఇచ్చోడ ఎస్హెచ్వో నరేశ్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముఖరా బి గ్రామానికి చెందిన నిందితుడు నైతం సంజీవ్కుమార్ గతంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నందున కేసు నమోదు చేసి బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మద్యం విక్రయిస్తుండడంతో తహసీల్దార్కు నివేదిక అందజేయగా తహసీల్దార్ ఇమ్రాన్ సోమవారం ఆయనకు జరిమానా విధించినట్లు తెలిపారు. పాము కాటుతో మహిళ మృతిఆదిలాబాద్రూరల్: పాముకాటుతో మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన గజ్జల దేవ్బాయ్ (65) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవ్బాయ్ కుమారునితో కలిసి కొత్తగూడ గ్రామంలో నివాసం ఉంటుంది. ఆదివారం సాయంత్రం ఆమెను పాము కాటు వేసింది. రక్తస్రావం జరగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి కేసులో తొమ్మిది మంది అరెస్టుఆసిఫాబాద్: పోలీసుల పెట్రోలింగ్లో భాగంగా తిర్యాణి మండలంలో 170 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశామని డీఎస్పీ అశోక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం వివరాలు వెల్లడించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన మిడిదొడ్డి కృష్ణ, దుర్గం ప్రశాంత్, ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన ముంజం భరత్ గంజాయి సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీరి ద్వారా సుంగాపూర్కు చెందిన మల్కాడి కృష్ణ, ముంజం శ్రీరామ్, బొర్లకుంట కృష్ణంరాజు, దుర్గం జీవన్, వైరాగడే పుష్పరాజ్, చునార్కర్ నితిన్, బొర్లకుంట సాయికుమార్ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. గంజాయి వినియోగం, రవాణా నేరమని అన్నారు. ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. -
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్(35) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ ఇటీవల వ్యాన్ కొనుగోలు చేసి నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాన్ నెల వాయిదా డబ్బులు చెల్లించేందుకు ఇతరుల వద్ద అప్పులు చేశాడు. వ్యాన్ కుదువ పెట్టి రూ.3లక్షలు అప్పులు చేశాడు. అయినా అప్పులు తీరకపోవడం, వ్యాన్ లేకపోవడం, భార్య అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి భార్య వనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై వృద్ధుడు.. లక్సెట్టిపేట: పట్టణంలోని బోయవాడకు చెందిన లింగయ్య(67) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగయ్యకు ఆరుగురు అన్మదమ్ములు ఉండేవారు. గతంలో ఇద్దరు చనిపోగా ఇటీవల మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తాను కూడా చనిపోతే బాగుండు అని అంటూ ఉండేవాడు. ఆదివారం సాయంత్రం మద్యంమత్తులో గోదావరి రోడ్లోని తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. వృద్ధుడి ఆత్మహత్య లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన రాందేని మల్లేశం(73) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఏఎస్సై అన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశం గత కొద్ది రోజులుగా మోకాళ్ల నొప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. మృతుడి భార్య గురులక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. -
బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస (గురు)పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం గురు ప్రార్థన, వ్యాసపౌర్ణమి ఉత్సవ సంకల్పం, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, నాందీముఖం నిర్వహించారు. అనంతరం నవగ్రహ, యోగిని, వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండల స్థాపన, ప్రధాన కలశస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవతా పూజలు, హోమాది వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు మురళీశర్మ, దీక్షిత్, వేద పండితులు అంకుశర్మ, నవీన్ శర్మ, శ్రీనివాస్ శర్మ, ఈవో అంజనాదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
వార్డెన్ను బెదిరించి వసూళ్లు
ఉట్నూర్రూరల్: సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు కొడుకుకు చెప్పి సన్మార్గంలో పెట్టాల్సిన తండ్రే, కొడుకును వెంట బెట్టుకుని బెదిరింపులు, వసూళ్లకు పాల్పడిన ఘటన ఉట్నూర్ పట్టణంలో వెలుగుచూసింది. సీఐ ఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పాత ఉట్నూర్కు చెందిన నేతావత్ రాందాస్, నేతావత్ జైల్సింగ్ అనే తండ్రీకొడుకులు గత కొద్ది రోజులుగా ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్కు ఫోన్ కాల్స్ చేసి ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 26న హాస్టల్కు వెళ్లిన నిందితులు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని బెదిరించారు. గత ఆరు నెలల్లో రెండు సార్లు రూ.3వేల చొప్పున రూ.6వేలు వసూలు చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. బెదిరింపులు, బలవంతపు వసూళ్ల వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై విజయ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
తండ్రి చితికి నిప్పుపెట్టిన కూతురు
తాండూర్: తండ్రి చితికి నిప్పంటించి కొడుకులు లేరనే లోటును తీర్చింది. పుట్టెడు దుఃఖంలోనూ దహనసంస్కారాలు నిర్వహించింది. మండలంలోని బోయపల్లి గ్రామానికి చెందిన ఇప్ప కమలాకర్(40) ఆదివారం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన మొదటి భార్య శోభ కూడా మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. వీరికి కూతురు కీర్తన ఉంది. ఆ తర్వాత కమలాకర్ మరో వివాహం చేసుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలాకర్ తుది శ్వాస విడిచాడు. సోమవారం కమలాకర్ స్థానికులు దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు లేకపోవడంతో కూతురు కీర్తన ఆ బాధ్యతను తీసుకొని తండ్రికి తలకొరివి పెట్టింది. కూతురే అన్నీ తానై అంతిమ సంస్కారాలు నిర్వహించడం అక్కడున్న వారిని కలిచివేసింది. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
మందమర్రిరూరల్: దేశంలో గోహత్యను పూర్తిగా నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ జిల్లా సేవకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కామాఖ్యపురం వారాహిదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గోమాత సంరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మందమర్రి పట్టణంలో 60 వేల సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన సంతకాల ప్రతులను రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లకు అందజేస్తామని తెలిపారు. సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మంథిని సతీష్, భవానీ, గోరక్షకులు సూరిబాబు, వెంకటేశం, నర్సయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థే కేంద్రంగా ఆర్జీయూకేటీ అభివృద్ధి
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడమే లక్ష్యంగా బాసర ఆర్జీయూకేటీని ముందుకు తీసుకెళ్తున్నామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. క్యాంపస్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పరిశోధన, స్టార్టప్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వీసీగా బాధ్యతలు స్వీకరించాక మీ ముందున్న సవాళ్లు ఏమిటి? ఎలా అధిగమించారు?వీసీ: విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది మధ్య పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం. కార్యాలయాలకే పరిమితమై నిర్ణయాలు తీసుకోకుండా.. నేరుగా విద్యార్థుల వద్దకే వెళ్లి వారి సమస్యలను ఆలకించడం, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడటం, అధ్యాపకులతో సమగ్రంగా చర్చించడం అనే నూతన శైలిని ఆచరణలోకి తెచ్చా. రాత్రివేళల్లో హాస్టళ్లను సందర్శించాలనే ఆలోచన ఎందుకొచ్చింది?వీసీ: రాత్రివేళల్లో నేరుగా పర్యటించడం వల్ల వారి భద్రత, ఆరోగ్యం, మెస్ భోజన వసతి, పరిశుభ్రత, వారి మానసిక స్థితిగతులను క్షేత్రస్థాయిలోనే తెలుసుకునే వీలుంటుంది. ఒక విద్యార్థి మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చా? వీసీ: విద్యార్థుల ఫిర్యాదులు, సమస్యలు పక్కా వ్యవస్థ ద్వారా పరిష్కారం కావడమే సరైన పద్ధతి. అత్యవసర సందర్భాల్లో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా నా దృష్టికి తెచ్చేలా సులువైన సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తెస్తున్నాం. తల్లిదండ్రుల విశ్వాసాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?వీసీ: క్యాంపస్ విద్యా పురోగతిపై వారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, పారదర్శకమైన నిర్వహణ, విద్యార్థుల క్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత వారిలో నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యక్షంగా వారితో మాట్లాడి భరోసా ఇస్తున్నాం. ఆర్జీయూకేటీకి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు మీ ప్రణాళిక ఏమిటి?వీసీ : నాణ్యమైన విద్యాబోధన, పరిశోధన పరిశ్రమల అనుసంధానం, నవకల్పనలు (స్టార్టప్ సంస్కృతి), డిజిటల్ పరిపాలన, సామాజిక బాధ్యత ఆధారంగా క్యాంపస్ను ముందుకు తీసుకెళ్తున్నాం. గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దడమే మా ప్రధాన ధ్యేయం. ఆవిష్కరణలు, స్టార్టప్లకు ట్రిపుల్ ఐటీని వేదికగా మార్చే ఆలోచన ఉందా? వీసీ: కచ్చితంగా ఉంది. విద్యార్థులు ఉద్యోగాలు వెతుక్కునే వారీగా మాత్రమే కాక, నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థాపకులుగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ఫండింగ్ మద్దతు, ఇండస్ట్రీ కనెక్టివిటీ, పరిశోధనా వాతావరణాన్ని విస్తృతంగా పెంచుతున్నాం. ‘ఓపెన్ డోర్ పాలసీ’ అమలు చేస్తున్నారా? వీసీ: విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తమ సమస్యలను, విలువైన సూచనలను ఎటువంటి భయాందోళనలు లేకుండా వ్యక్తం చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం. ‘సంభాషణే ఏ సమస్యకై నా తొలి పరిష్కారం’అనే సూత్రంతో అందరికీ నిరంతరం అందుబాటులో ఉండే సుపరిపాలనగా తీర్చిదిద్దుతున్నాం. -
గ్రీవెన్స్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: గ్రీవెన్స్లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉట్నూర్ మండలం సాలెవాడ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి అంగన్వాడీ మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం చిత్రు తనకు భూ పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం మాణిక్గూడ గ్రామానికి చెందిన భీము తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఐటీడీఏ పీవో నిత్యం బిజీగా ఉంటూ గిరిజన ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిమగ్నమయ్యే ఐటీడీఏ పీవో మంద మకరందు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దీక్ష స్వీకరించారు. -
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
భీమిని: శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం కన్నెపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులు పరిశీలించి, రిసెప్షన్ సెంటర్లోని సిబ్బందితో మాట్లాడారు. కేసుల వివరాలను ఎస్సై విక్రమ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు. -
సోలార్ ప్రాజెక్టు గ్రిడ్కు అనుసంధానం
ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి, కిష్టారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం రెండు మెగావాట్ల పీఎం కుసుం సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఎస్ఈ జే.సుభాష్, డీడీఈ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్స్టేషన్ వద్ద గ్రిడ్కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్కుమార్, విష్ణు, శ్రీకాంత్, టి.మధుసూదన్రావు, ప్రదీప్కుమార్రెడ్డి, డీపీ వర్మ, సునీల్, పి.విక్రంపాటిల్, పి.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బాసర: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్థన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నూతనంగా చేరిన పీయూసీఐ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ విద్యావిధానం, క్రమశిక్షణ, పరీక్ష సరళి, క్యాంపస్ వసతులు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓరియెంటేషన్ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గుజ్జరి శంకర్, ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, అసోసియేట్ డీన్ శేఖర్ శీలం, ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాంటు పనులు గడువులోగా పూర్తి చేయాలి
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా చేపట్టిన మూడో యూనిట్ 800మెగావాట్ల పవర్ ప్లాంటు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు ఆదేశించారు. సోమవారం పవర్ ప్లాంటును సందర్శించిన ఆయన మూడో యూనిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాయిలర్, ట్రాక్హాపర్తోపాటు నిర్మాణ దశలో ఉన్న పనులు పరిశీలించి పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజివి, జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్, సీఎంవోఏఐ బ్రాంచ్ అధ్యక్షుడు పంతులా, ఏజీఎం సూర్యనారాయణరాజు, కొత్త ప్లాంటు కోఆర్డినేటర్ వేణుగోపాల్రావు, పర్సనల్ మేనేజర్ రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
కేకే–ఓసీని సందర్శించిన డైరెక్టర్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీని సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. ఏరియాలోని ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతపై ఏరియా జీఎం రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ త్రైమాసిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఉత్పత్తి వేగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం కేకే–ఓసీ సమీపంలో స్టౌవింగ్, సైడింగ్ పనులను తనిఖీ చేశారు. ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, ఏజీఎం(ఈఅండ్ఎం) బాలాజీ భగవతీ ఝా, డీజీఎం(సర్వే) బుక్య దేశాయి, డీజీఎం(సివిల్)మదీనా బాష, క్వాలిటీ ఆఫీసర్ ప్రదీప్ పాల్గొన్నారు. -
వడ్ల పైసలు రాలే..
జూన్లో ీతొర్రెం రాజక్క, పుప్పిరెడ్డి పార్వతి, ఏ చిన్నన్న కలిసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 1053 బస్తాల వడ్లు అమ్ముకున్నాం. ఇంతవరకు పైసలు రాలేదు. కొనుగోలు సమయంలో బస్తాకు నాలుగు కిలోల అదనంగా తూకం వేశారు, వేయి బస్తాలకు పైసలు రావాల్సి ఉంది. తూకం వేసిన నగదు ఇవ్వాలంటే ట్యాబ్ ఎంట్రీ చేయడం లేదు. సైట్ బంద్ అయ్యిందని, అమ్మిన వడ్ల పైసలు చెల్లించడం లేదు. ఇప్పటికి రెండు సార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – బాధిత రైతులు, గ్రామం: మంగనపల్లి, మం: వేమనపల్లి -
రెండో ఠాణాకు మోక్షమెప్పుడో..!
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రమైన మంచిర్యాల నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. మున్సిపాల్టీ నుంచి నగర కార్పొరేషన్గా మారింది. సుమారు లక్షా యాభై వేల జనాభా నివాసం ఉంటోంది. నేరాలు, కేసుల సంఖ్య పెరుగుతోంది. టూటౌన్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలంగా ప్రతిపాదిస్తున్నా మోక్షం కలుగడం లేదు. మంచిర్యాల సబ్ డివిజన్లోని సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఏడు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. కానీ పోలీసుస్టేషన్ల పరిధి మాత్రం ఎక్కడికక్కడే పాత పద్ధతిలోనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒకే పోలీస్స్టేషన్ ఉంది. నగరంలోని 60 డివిజన్లు మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో విస్తరించి ఉన్నా యి. హాజీపూర్ ఠాణాలో 8, మంచిర్యాల ఠాణాలో 28, నాలుగు గ్రామ పంచాయతీలు, సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో 18, శ్రీరాంపూర్ స్టేషన్ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి. హాజీపూర్, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్ ఠాణాల్లో ఏడాదికి సగటున 200 నుంచి 400 వరకు కేసులు నమెదవుతున్నాయి. ఒక్క మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలో సగటున 1000 కేసులు నమోదవుతున్నాయి. ప్రతిపాదనలకే పరిమితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలా బాద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండేసి పోలీస్ేస్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాలతో పోల్చి చూస్తే నిర్మల్, బెల్లంపల్లి, ఆదిలాబాద్లో నేరాల శాతం తక్కువే ఉంటుంది. అయినా మంచిర్యాలలో ఒకే ఠాణా ఉండడం, సిబ్బంది కొరతతో నెట్టుకొస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు కావడంతోపాటు రైలుమార్గం ఉన్నందున నేరాలు అధికంగా జరిగేందుకు ఆస్కారం ఉంది. దీంతో నేరాల శాతం పెరుగుతోంది. మంచిర్యాలలో మరో పోలీసుస్టేషన్(టూటౌన్) అనివార్యమని దశాబ్దాల కాలంగా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. టౌటౌన్ ఏర్పాటుతోపాటు సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో పోస్టును సీఐ స్థాయి అధికారికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్టేషన్ పరిధిలో కలెక్టరేట్, జిల్లా కోర్టు భవనం, సింగరేణి ప్రాంతం ఉన్నాయి. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, వీఐపీల తాకిడి, బందోబస్తు విధులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. -
విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చాలి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చేందుకు వినూత్న బోధన పద్ధతులు, ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానం, కార్యాచరణ ఆధారిత బోధన అంశాలపై ప్రత్యేక దృషి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణను 2026–27 విద్యాసంవత్సరంలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పీజీఐ సూచికల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. హాజీపూర్ ఎంఈవో తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎంఓ జంబోజు సత్తయ్య, హాజీపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని వైద్యులు, సిబ్బంది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్రాథోడ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వైద్యాధికారులతో వైద్య, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మాతాశిశు సంరక్షణ వందశాతం నమోదు, గర్భిణులకు పరీక్షలు, హైరిస్క్ గర్భిణులను గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని తెలిపారు. జాతీయ క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, పోర్టబుల్ ఎక్స్రే ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మానసిక ఆరోగ్యంపై పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్నాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుణశ్రీ, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్వో కాకిరాల వెంకటేశ్వర్లు, డీడీఎం ప్రవళిక పాల్గొన్నారు. -
వన్యప్రాణులకు సహజసిద్ధమైన గడ్డి
జన్నారం: కవ్వాల్ అడవుల్లో జీవ వైవిధ్యం, శాఖాహార జంతువుల మనుగడకు అత్యంత కీలకమైన సహజసిద్ధమైన గడ్డి భూముల రక్షణకు అటవీ శాఖ ప్రాధాన్యతనిస్తోంది. 2018 నుంచి జన్నారం అడవుల్లో గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేస్తోంది. గడ్డి క్షేత్రాల నిపుణుడు మురద్కర్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇన్ని సంవత్సరాలు విత్తనాల ద్వారా గడ్డిని పెంచిన అధికారులు ఈసారి సహాజ సిద్ధమైన గడ్డిని అందించేందుకు చర్యలు చేపట్టారు. అటవీ ఆవాసాల్లో లభ్యమయ్యే పచ్చిక బయళ్లు తరించిపోకుండా, వాటిని ఆక్రమిస్తున్న కలుపు మొక్కలు తొలగించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వన్యప్రాణులు ఇష్టపడే సహజసిద్ధంగా మొలచిన గడ్డిని పెంపొందించి పిచ్చిమొక్కల తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్లో 599 హెక్టర్లు జన్నారం అటవీ డివిజన్లోని 40 అటవీ బీట్లలో 599 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ప్రతీ సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి గడ్డి విత్తనాలు తీసుకొచ్చి అడవుల్లో చల్లడం, గరక వంటి గడ్డిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి కుంటల కట్టలు, వన్యప్రాణులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో నాటేవారు. కానీ ఈ సంవత్సరం సహజంగా పెరిగే గడ్డిని వన్యప్రాణులకు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డివిజన్లోని 599 హెక్టర్లలో వ్యాపించిన గడ్డి క్షేత్రాల ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు తొలగించి నాణ్యమైన గడ్డిని అందించేందుకు పనులు ప్రారంభించారు. ఈ ఏడాది మరో 72 హెక్టార్లలో గడ్డి మైదానాలు పెంచనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గడ్డి క్షేత్రాల వైపు పశువులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బేస్క్యాంపు వాచర్లు, బీట్ అధికారులు వీటి సంరక్షణకు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అటవీ ప్రాంతాల్లో లాంటానా, పార్థీనియం, లాంటానా ఫిల్టర్ వంటి కలుపు మొక్కలు తీవ్రంగా విస్తరిస్తున్నాయి. ఇవి సహజ సిద్ధమైన గడ్డి పెరగకుండా అడ్డుకోవడమే కాకుండా, భూమిలోని తేమ, పోషకాలను వేగంగా పీల్చుకునే అవకాశం ఉన్నందున అటవీశాఖ అధికారులు కలుపు మొక్కలను ఏరివేసే పనిలో ఉన్నారు. జీవ వైవిధ్యానికి ఊపిరి సహజ పచ్చిక బయళ్లు అభివృద్ధి చెందడం వల్ల శాఖాహార జంతువులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. శాఖాహార జంతువుల సంఖ్య పెరిగితే, మాంసాహార జంతువులైన పులులు, చిరుతపులులకు కూడా ఆహార చక్రంలో సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణలు తగ్గుముఖం పడతాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అభివృద్ధికి తోడ్పాటుఅడవిలో సహజమైన పర్యావరణ వ్యవస్థ నిలబడాలంటే గడ్డి భూములు ఎంతో అవసరం. పిచ్చిమొక్కలను తొలగించి, వన్యప్రాణులకు నిరంతరం ఆహారం దొరికేలా చేయడమే అటవీ శాఖ ప్రధాన లక్ష్యం. గడ్డి మైదానాలు శాఖాహార జంతువుల అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. శాఖాహార జంతువులు అభివృద్ధి చెందితే పులులు ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. – లక్ష్మీనారాయణ, ఎఫ్ఆర్వో, ఇందన్పల్లి -
అప్పుడు ఆబ్సెంట్.. విచారణలో ప్రజెంట్
దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన సిద్ది అంజమ్మ 2025–26 విద్యాసంవత్సరంలో దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో గణితం, సామాన్యశాస్త్రం పరీక్షలు ఫెయిలైంది. హెచ్ఎం రాజేశ్వర్రావు ప్రత్యేక చొరవతో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించారు. జూన్లో మంచిర్యాలలోని బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాసింది. ఫలితాల్లో మాత్రం గణితం పరీక్షకు గైర్హాజరైనట్లు చూపింది. పరీక్ష రాసినా రాయనట్టు చూపడంతో న్యాయం చేయాలని అంజమ్మ తన తల్లి మల్లీశ్వరితోపాటు విద్యార్థిసంఘాల నాయకులు జిల్లా కలెక్టర్, డీఈవో, రామగుండం సీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె పరీక్షకు హాజరు కాలేదని అప్పట్లో డీఈవో ప్రకటించారు. అంజమ్మ హైదరాబాద్లోని ఎసెస్సీ బోర్డు కార్యాలయానికి వెళ్లి తన గోడు వెల్లబోసుకుంది. విచారణ చేయగా ఆమెకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో కూర్చుని పరీక్ష రాసినట్లు తేలింది. ఫలితాలను పరిశీలించగా ఉత్తీర్ణత సాధించినట్లు తేల్చారు. ఈ విషయమై జిల్లా ఏసీజీఈ మల్లేష్ను సంప్రదించగా, అంజమ్మకు కేటాయించిన గదిలో కాకుండా మరో గదిలో కూర్చోవడంతో హాజరు నమోదు కాకపోవడంతో ఫలితం తారుమారైందని తెలిపారు. -
వాహన దొంగల ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్టౌన్: గత కొద్ది నెలలుగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠా గుట్టును రట్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొత్తం 16 మంది నిందితులపై కేసు నమోదు చేసి, పది మందిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 21న రిమ్స్ ఎదురుగా పలువురు ఆటో దొంగతనానికి యత్నించిన అనంతరం ప్రత్యే క నిఘా ఏర్పాటు చేశామన్నారు. 24న కుప్టి ఘాట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులు పోలీసులపై కత్తితో బెదిరింపులకు పాల్పడి కారులో పరారయ్యారు. 25న వాంకిడి చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అదే కారును గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితులు యాసర్ అహ్మద్, సోహైల్ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ దొంగతనానికి అనువైన వాహనాలను గుర్తించి ముఠా సభ్యులకు సమాచారం అందించేవారు. అనంతరం సభ్యులు కారు ను అద్దెకు తీసుకుని పార్కింగ్లో ఉన్న వాహనాల ను దొంగిలించి ఇఫ్తేఖార్, షేక్ అబూతలాహాకు విక్రయించేవారు. అరెస్టు చేసిన పది మంది నిందితుల వద్ద నుంచి 7 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు, 8 మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.నిందితుల వివరాలు..నిర్మల్లోని రామ్నగర్కు చెందిన యాసర్ అహ్మద్, సోఫీనగర్కు చెందిన అక్బర్ఖాన్, మహ్మద్ అద్నాన్, ఆజామ్ ఖాన్, ఉమర్ ఖాన్, గుల్జార్ మార్కెట్కు చెందిన అబ్దుల్ ఫారూక్, బుధవార్పేట్కు చెందిన అర్బాస్ ఖాన్, ఆదర్శ్నగర్కు చెందిన నాసిర్ బిన్ జావీద్, షేక్ అబూతలాహా, మదీనా కాలనీకి చెందిన షేక్ ఇఫ్తేఖార్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిర్మల్కు చెందిన ఇమ్రాన్, నిజామాబాద్కు చెందిన జైన్, ఆదర్శ్నగర్కు చెందిన జునైద్, బుధవార్పేట్కు చెందిన సోఫియాన్, ఫర్దీన్, అద్నాన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
వాహన తనిఖీలు.. కేసులు నమోదు
నర్సాపూర్(జి): మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ముగ్గురు మైనర్లు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఇ ద్దరు, వాహనం నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడుతున్న ఇద్దరు, తప్పుడు నంబర్ ప్లేట్తో వాహనం నడిపిన నలుగురితో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలి పారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురికి జరిమానాలు విధించామన్నారు. ఏఎస్సై శంకర్, హెడ్ కానిస్టేబుల్ చిన్నయ్య, కాని స్టేబు ళ్లు మోహన్, శంకర్, మొయిజ్ పాల్గొన్నారు. -
బ్రిడ్జి పైనుంచి దూకి వ్యక్తి బలవన్మరణం
వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన పల్లపు భూమన్న (35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మానసిక స్థితి కూడా సరిగా ఉండడం లేదు. కుటుంబ సభ్యులతో గొడవపడుతుండేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన భూమన్న వెల్గటూర్ శివారులోని పెద్దవాగు బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకాడు. ఆదివారం ఉదయం మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని బయటకు తీయించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేకనే బలవన్మరణానికి పాల్పడ్డాడని భూమన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. మనస్తాపంతో ఒకరు.. లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్ కాలనీకి చెందిన అజ్మీరా శ్రీను (42) అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఎస్సై గోపతి సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీను గత కొద్ది రోజుల నుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినడంలేదు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగొద్దని మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీను భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని వృద్ధుడు.. లక్సెట్టిపేట: మండలంలోని గోదావరి రోడ్లో చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడు ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు పదకొండో వార్డుకు చెందిన లింగయ్య(60)గా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు ఉట్నూర్రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ఉట్నూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్సెట్టిపేట గ్రామానికి చెందిన అర్కా ప్రభు ఇంద్రవెల్లి వైపు నుంచి ఉట్నూర్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా మండలంలోని పులిమడుగు గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం అతడి బైక్ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో అర్కా ప్రభు తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించగా పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిడుగుపాటుతో మహిళ మృతి ముధోల్: పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని గన్నో గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అప్పాల నర్మద(45), రక్మ అనే ఇద్దరు మహిళలు పత్తి చేనులో కలుపు తీస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో చెట్టు కిందకు వెళ్లగా పిడుగు పడడంతో అప్పాల నర్మద అక్కడికక్కడే మృతి చెందింది. రుక్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో రుక్మను భైంసా ఏరియాసుపత్రికి తరలించారు. కాగా నర్మద భర్త సాయారెడ్డి ఏడేళ్ల క్రితం మృతి చెందగా ఆమె ఇద్దరు కుమారుల్లో ఒకరు ట్రిపుల్ఐటీలో పని చేస్తున్నారు. మరొకరు టీచర్గా ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. చికిత్స పొందుతూ యువకుడు.. మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని అందుగుల పేట వద్ద నయార పెట్రోల్ బంకు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర వంశీ(20) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం బైక్పై బొక్కలగుంట నుంచి మందమర్రి వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో సూర వంశీ మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. -
అద్దె భవనాల్లో అవస్థలు
ఆదిలాబాద్రూరల్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో వీటిని ప్రారంభించింది. అప్పటి నుంచి చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆదరణ ఉండడంతో పాఠశాలలను కళాశాలలుగా కూడా ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తున్నా సొంత భవనాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. పట్టించుకోని ప్రభుత్వంజిల్లాలో గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అంతంత మాత్రంగానే అద్దె చెల్లిస్తుండడంతో విద్యార్థులకు సరిపడా భవనాలు లభ్యం కావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దెతో ఇరుకై న భవనాలు అద్దెకు తీసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల శంఖుస్థాపనలు చేసిన వాటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. ప్రహరీ కరువు..జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకొని 2016లో మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం 800 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. కానీ ప్రహరీ నిర్మాణం చేపట్టలేదు. దీంతో బాలికలకు భద్రత లేకుండా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.బాలురు 13మొత్తం విద్యార్థులు 16,800ఇదీ పరిస్థితి..ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతిబాపూలే గు రుకుల పాఠశాలలు, కళాశాలలు 26 ఉన్నా యి. ఇందులో ఐదో తరగతి నుంచి ఇంటర్మీ డియెట్ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నా రు. ఆదిలాబాద్ (బాలికలు), జైనథ్ బాలు రు, లక్సెట్టిపేట బాలుర పాఠశాల, కళాశాల కు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మి గతావి అద్దె భవనాల్లో కొనసాగుతుండగా వీ టిల్లో కొన్ని అరకొర వసతులతో ప్రభుత్వ కా ర్యాలయ భవనాల్లో కొనసాగుతున్నాయి. వి ద్యార్థులు ఇరుకు గదుల్లో ఉంటూ విద్య అభ్యసిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల నూతన భవనాలకు శంకుస్థాపనలు చేసినా నిర్మాణాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 26 మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలల్లో మూడింటికే సొంత భవనాలు ఉన్నాయి. కొన్ని అద్దె భవనాలలో కొనసాగుతుండగా, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – శ్రీధర్, ఆర్సీవో, మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలు ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలు -
దీపం అంటుకుని ఇల్లు దగ్ధం
తాంసి: భీంపూర్ మండలం టేకిడి రాంపూర్ గ్రా మానికి చెందిన ఆత్రం ధాంజీకి చెందిన ఇల్లు శని వారం రాత్రి దీపం మంటలు అంటుకొని దగ్ధమైంది. వివరా ల్లోకి వెళ్తే.. కు టుంబ సభ్యులు శనివారం సాయంత్రం దేవుని గది వద్ద దీపం వెలిగించి పూజలు చేశారు. అనంతరం దీపం అలాగే ఉంచి రాత్రి పక్కనున్న గదిలో నిద్రిస్తుండగా 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పూజ గదిలో మంటలు చెలరేగాయి. మంటలు ఇంట్లోని సామగ్రికి వ్యాపించగా చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. నీళ్లు చల్లి మంట లు ఆర్పివేశారు. మంటల్లో ఇంట్లో ఉన్న రూ.3వేల నగదుతో పాటు పిల్లల సర్టిఫికెట్స్, బట్టలు, వంట సామగ్రి కాలిపోయాయి. దాదాపు రూ.లక్ష ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. గ్రామ సర్పంచ్ సిడాం కేశవ్, గ్రామ పెద్దలతో కలిసి కాలిపోయిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబానికి నిత్యావసర సామగ్రి అందజేశారు. -
హిట్ అండ్ రన్ కేసు నమోదు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ నెల 23న రోడ్డు ప్రమాదానికి సంబంధించి హిట్ అండ్ రన్ కేసు నమోదైనట్లు ఎస్సై మధుసూధన్ ఆదివారం తెలిపారు. తిర్యాణి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన మల్యాల మొగిళి(50) మంచిర్యాలలో దోభి(చాకలి) పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈక్రమంలో ఈ నెల 23న ఉదయం పని నిమిత్తం సైకిల్పై బస్టాండ్ వైపు నుంచి బెల్లంపల్లి చౌరస్తా వైపు వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు మొగిళిని ఢీ కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి కారులో నుంచి దిగి క్షతగాత్రుడిని చూసి అక్కడే వదిలేసి పారిపోయారు. అనంతరం స్థానికులు మొగిళిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్కు తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. మొగిళికి భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
ముధోల్: మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సీఐ రవీందర్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని తానూర్ బైపాస్ రోడ్డు, హనుమాన్ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న దత్తాత్రి –కళావతి దంపతులు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. శనివారం రోజుమాదిరిగానే తమ ఇంటికి, గేటుకు తాళం వేసి ఉదయం కూలీకి వెళ్లారు. సాయంత్రం వచ్చి గేటు తాళం తీసి లోపలికి వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండడంతో పాటు బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించగా సీఐ రవీందర్ నాయక్ అక్కడికి చేరుకొని పరి శీలించారు. దొంగలు గేటుపై నుంచి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి ఉంటారన్నారు. బీరువాలోని 4 మాసాల బంగారు కమ్మలను దొంగిలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఓ పత్రికలో 6 తులాల బంగారం చోరీ జరిగినట్లు వచ్చిన వార్తలో నిజం లేదన్నారు. -
ఆరున్నరేళ్లుగా జిల్లాలో జరిగిన ప్రసవాల వివరాలు
ఏడాది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు సాధారణ సిజేరియన్ సాధారణ సిజేరియన్ 2020 2,486 2,331 376 5,064 2021 2,539 2,169 322 5,235 2022 3,106 2,645 438 4,132 2023 3,787 2,752 419 3,575 2024 3,146 2,688 361 3,535 2025 3,385 2,347 559 3,090 2026 1,354 1,052 195 1,652 (జూన్ వరకు) మొత్తం 19,803 15,984 2,670 26,283 -
సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం జరిగే వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేస్తుండగా హైరిస్క్ కేసులు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నాయి. సాధారణ ప్రసవం కాని పక్షంలోనే సిజేరియన్ చేస్తున్నారు. ప్రైవేటులో జరిగే ప్రసవాలపై సమీక్ష నిర్వహించి, సిజేరియన్లను చేయడంపై ఎప్పటికప్పుడు రిపోర్టు తీసుకుని విచారణ చేస్తున్నాం. సాధారణ ప్రసవాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యూత్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.సాంబమూర్తి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో యువతకు భవిష్యత్ ఉంటుందన్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఆగస్టు 7, 8 తేదీల్లో హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎం.బాబురావు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంచిర్యాలటౌన్: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతన పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కమిటీ చైర్మన్గా రామగిరి బానేష్, వైస్ చైర్మన్గా జాలే రాయలింగు, డైరెక్టర్లుగా బండి తులశేఖర్ గౌడ్, బద్రి ప్రకాశ్, దోమల రమేశ్, పురెల్ల పోచమల్లు, బొల్లం సత్యనారాయణ, లగిశెట్టి మనోజ్, కొడప కమల, మారు మల్లయ్య, మహ్మద్ ఇర్ఫాన్, ముడిమడుగుల శ్రీనివాస్, అశోక్ కుమార్ లడ్డ, రావుల మహేశ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సల్ల మహేశ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, తదితరులు పాల్గొన్నారు. సైనికుల త్యాగం ఎనలేనిదిమంచిర్యాలటౌన్: కార్గిల్ పోరాటంలో భారత సైనికులు చేసిన త్యాగం ఎనలేనిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి చౌరస్తాలో భారత సైనికులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి కార్గిల్ వీరులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు. -
జల సంరక్షణ.. మన సంరక్షణ
పాతమంచిర్యాల: భవిష్యత్ తరాలకు నీటి భద్రత, నీటి కొరతను తీర్చడానికి భూగర్భ జలాల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా నీటి నిలువ కార్యక్రమాలు చేపడుతోంది. వర్షపు నీరు వృధాకాకుండా వ్యవసాయానికి పనికి వచ్చేలా రైతుల పంట పొలాల్లో ఫారంపాండ్లు, ఊటకుంటలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ఇంటింటా ఇంకుడు గుంత, ప్రతీ పొలానికి పంటకుంట, ప్రతీ ఊరికి చెక్డ్యాం’ అనే నినాదంతో ప్రతీ గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. డిసెంబర్లోగా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో ప్రతీ జీపీకి 200 ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడుగుంత 1, ప్రతీ మండలానికి రెండు సేద్యపు బావులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బావి నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చుకాగా బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు జీపీకి ఒకటి, ఫారం పాండ్లు జీపీకి 4 ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఫారం పాండ్ నిర్మాణానికి రూ.2 లక్షలు వ్యయం చేయనున్నారు. రూఫ్టాప్ హార్వెస్టింగ్ వర్షపు నీరు వృధా కాకుండా రూ.35 వేల వ్యయంతో ఇంకుడు గుంతలు నిర్మించనున్నారు. వీటితో పాటు రాతి కట్టడాలు, ఖండిత కందకాలు, నిరవధిక సమతల కందకాలు, నీటి శోషణ కందకాల నిర్మాణాలు చేపట్టనున్నారు. జిల్లాలోని 16 మండలాలు, 306 గ్రామ పంచాయతీల్లో 1,408 ఫారంపాండ్లు, 306 ఊట కుంటలు, 61,200 ఇంకుడు గుంతలు, 306 సామూహిక ఇంకుడు గుంతలు, 306 బోర్వెల్ రిచార్జ్ స్ట్రక్చర్లు, 32 సేద్యపు బావుల నిర్మాణాలు చేపట్టనున్నారు. జలసిరి ద్వారా నీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపర్చడానికి జల సంరక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడతుందని అధికారులు తెలిపారు. వీబీజీ రాంజీ, ప్రధాన మంత్రి కృషి సంచాయ్యోజన, నాబార్డు, ఎన్జీవో, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు (సీఎస్సార్) రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంస్థల నిధులతో పనులు చేపట్టనున్నారు. -
ఫ్లైఓవర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ నుంచి రాజీవ్నగర్కు వెళ్లే వందఫీట్ల రోడ్డుపై వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సెంట్రల్ జోన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఎన్నికల్లో గెలిచిన నెలరోజుల్లోనే బ్రిడ్జీ నిర్మిస్తానని హామీ ఇచ్చారని, రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదన్నారు. దీంతో టూటౌన్ ప్రాంత ప్రజలు నిత్యం రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గాజుల నాయకులు ముఖేశ్ గౌడ్, రంగ శ్రీశైలం, గోపతి రాజయ్య, బొట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్రావు, వైద్య శ్రీధర్, బోయిని హరికృష్ణ, బెల్లంకొండ మురళి, తరుణ్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్పీని సందర్శించిన కేంద్ర రైల్వేశాఖ ఈడీ
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సీహెచ్పీ రైల్వే కోల్ సైడింగ్ను కేంద్ర రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ట్రాఫిక్, ట్రాన్స్పోర్టేషన్, కోల్) సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఆదివారం సందర్శించారు. బెల్లంపల్లి రీజియన్ పర్యటనలో భాగంగా ఇక్కడి రైల్వే సైడింగ్ను తనిఖీ చే శారు. బొగ్గు రేకుల లోడింగ్ వేగవంతం చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ బొ గ్గు రవాణా, రేకుల లోడింగ్కు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ, రక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం కృష్ణ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ సురేష్, సీహెచ్పీ ఇన్చార్జి చంద్రలింగం, డీజీఎం(సివిల్) ఆనంద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
శుభ్రతతో కూడిన ఆహారం వడ్డించాలి
బెల్లంపల్లి: విద్యార్థులకు శుభ్రతతో కూడిన ఆహారం వడ్డించాలని బెల్లంపల్లి సివిల్ కోర్టు జడ్జి శాంతిసోని అన్నారు. ఆదివారం పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈనెల 22న గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 23 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి కిచెన్, స్టోర్ రూమ్, కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాలు, విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఫుడ్ ఫాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, న్యాయవాదులు టి.గోపి కిషన్సింగ్, సీహెచ్.మనోహర్, ఎల్.రాము, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘ముఖ్యమంత్రితో ముఖాముఖి’కి ఆహ్వానం
జన్నారం: విదేశీ విద్య అధ్యయనానికి ఇటీవల ఫిన్లాండ్ వెళ్లివచ్చిన ఉపాధ్యాయులతో ఈ నెల 28న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారంలోని ఇద్దరు ఉపాధ్యాయులకు ఆహ్వానం అందింది. కిష్టాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ దాముక కమలాకర్, అక్కపెల్లిగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్కు ఆదివారం ఆహ్వానం అందినట్లు పేర్కొన్నారు. మండల విద్యాధికారి బానవత్ రాజేందర్, కిష్టాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న, జన్నారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విజయకుమార్ అభినందనలు తెలిపారు. -
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఉన్న బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మంద నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్లోని ఆ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి పర్యటనలు చేయడంతో సంస్థకు ఒరిగేదేం లేదని, ప్రస్తుత పరిస్థితిలో కంపెనీకి రావాల్సిన రూ.53వేల కోట్లను వెంటనే చెల్లిస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. కొత్త గనుల అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రతీనెల మెడికల్ బోర్డు నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యం చేస్తున్నారన్నారు. ఇటీవల మెడికల్ బోర్డు నిర్వహించినా అందులో అర్హులకు న్యాయం జరగలేదన్నారు. సింగరేణిలో కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను అధికారుల చేతనే ఇప్పించాలని ప్రజాప్రతినిధుల జోక్యాన్ని రూపుమాపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు నరెడ్ల వెంకటరెడ్డి, పెరిక సదానందం, తదితరులు పాల్గొన్నారు. -
● సిజేరియన్లకే మొగ్గు చూపుతున్న యాజమాన్యాలు, డాక్టర్లు ● ప్రభుత్వం చెబుతున్నా సాధారణ ప్రసవాలకు ‘నో’ ● ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నార్మల్ డెలివరీలు
మంచిర్యాల మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వార్డులో బాలింతలుమంచిర్యాలటౌన్: సాధారణ ప్రసవాలు మాత్రమే చేయాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారు. సాధారణ ప్రసవాలు అంటే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం అనే భావన కల్పించేలా ఆరేళ్లుగా జిల్లాలో జరిగిన ప్రసవాల గణాంకాలను చూస్తే అర్థం అవుతోంది. ప్రభుత్వం సాధారణ ప్రసవాలను మాత్రమే చేయాలని, సిజేరియన్ ప్రసవాలను చేపట్టవద్దన్న ఆదేశాలను ప్రైవే టు ఆస్పత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా, ప్రసవాలు అత్యధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హైరిస్క్ కేసులకు మాత్రమే సిజేరియన్ల ద్వారా ప్రసవాలు చేస్తుండగా, ప్రైవేటులో మాత్రం సిజేరియన్ల ద్వారా ప్రసవాలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రసవం చేయలేనివి, హైరిస్క్ ఉన్న గర్భిణులను మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి రెఫర్ చేయడంతో అత్యవసర పరిస్థితుల్లో చేసే సిజేరియన్లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నా, హైరిస్క్ కేసులతో సిజేరియన్ ప్రసవాలు కూడా జరుగుతున్నాయి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కొందరు గర్భిణులు తమకు సాధారణ ప్రసవం వద్దని, పురిటి నొప్పులను భరించలేమని చెబుతుండగా, మరికొందరు మంచి రోజులు చూసుకుని, వారు చెప్పిన తేదీ, సమయానికి సిజేరియన్ చేయాలని కోరుతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరున్నరేళ్లలో సాధారణ ప్రసవాలు పది శాతంలోపే (9.22 శాతం) జరిగాయి. అంతేకాకుండా సాధారణ ప్రసవాల కంటే, సిజేరియన్ చేయడం వల్ల ఎక్కువ ఫీజు వస్తుండడంతో వైద్యులు ఆపరేషన్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సమీక్షలతోనే సరిపెడుతున్నారా? ప్రసవాల్లో కడుపు కోతలను తగ్గించి, సాధారణ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వడం బాలింతలకు ఆరోగ్యకరమని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే పాటించాలని, తమకేం సంబంధం లేదన్నట్లుగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అవసరం ఉన్నా, లేకపోయినా సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తుండడంతో, 10 శాతం లోపు మాత్రమే సాధారణ ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్నా కనీస చర్యలు లేవు. మూడేళ్లుగా ప్రభుత్వం సాధారణ ప్రసవాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. నిత్యం ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. వారికి తగిన సూచనలు ఇస్తూనే సాధారణ ప్రసవాలు పెంచని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్న ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోకపోవడం వల్లే సాధారణ ప్రసవాలు చేసేందుకు ముందుకు రావడంలేదని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. -
ఆ ఊరే కుటుంబమైంది
నేరడిగొండ: నిజమైన బంధం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు.. ఒకరి కష్టాన్ని చూసి కదిలిపోయే గుణమని వెంకటాపూర్ గ్రామస్తులు నిరూపించారు. దయనీయ స్థితిలో ఉన్న ని రుపేద కుటుంబానికి ఆ ఊరి ఉద్యోగులు, ప్ర జలు కొండంత అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు. మండలంలోని వెంకటాపూర్లో అడెల్లి అనే వృద్ధురాలు ఈనెల 21న మృతిచెందింది. ఆమె మరణం ఆ ఇంటా తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసింది. అంత్యక్రియల ని ర్వహణకు, ఇతర ఖర్చులకు పైసా లేక ఆమె కోడలు వసంత దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆమె ఆవేదనకు చలించిన గ్రామస్తులు, ఉద్యోగులు, యువకులు, పెద్దలు అంతా కలిసి రూ. 25వేల నగదు సేకరించారు. ఆ మొత్తాన్ని మృతురాలి కోడలు వసంతకు శనివారం అందజేశారు. నగదు అందజేస్తున్న గ్రామస్తులు -
జిల్లాకు చేరిన ‘జనజాగరణ యాత్ర’
మంచిర్యాలటౌన్: సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ పునరుద్ధరనే ధ్యేయంగా చేపట్టిన జన జాగరణ యాత్ర బైక్ ర్యాలీ శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) నాయకులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును కలిసి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి మౌనదీక్ష చేపట్టారు. టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆగస్టు 23 న హైదరాబాద్లో నిర్వహించనున్న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు అల్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి కల్వ ల శ్రీకాంత్, నాయకులు గడ్డం వెంకటేశ్, చంద్రకాంత్, సత్యనారాయణ, అంజన్న పాల్గొన్నారు. -
‘తొలి’పూజలు
దండేపల్లి: గూడెంలో సత్యదేవున్ని దర్శించుకుంటున్న భక్తులువిశ్వనాథస్వామి ఆలయంలో అదనపు కలెక్టర్ దంపతులుదండేపల్లి: మార్కండేయ ఆలయంలో..తొలి ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంచిర్యాలలోని విశ్వనాథస్వామి ఆలయానికి వేకువ జామునుంచే భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో ఓపికగా వేచి ఉండి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ చంద్రయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీహరి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు సత్యదేవున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నూర్లోని శివాలయంలో అఖండ అభిషేక పూజలు నిర్వహించారు. – మంచిర్యాలఅర్బన్ -
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు
ఆదిలాబాద్టౌన్: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్ర యత్నం చేసిన ఇద్దరితోపాటు ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్పై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. శనివారం ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ టైమ్స్ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులో అభ్యంతరకర పోస్టులు చేసిన బండారి సంతోష్, రాథోడ్ గజానన్, గ్రూప్ అడ్మిన్ వేణుగోపాల్ యాదవ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోష ల్ మీడియా గ్రూప్ అ డ్మిన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించా లని, రెచ్చగొట్టే లేదా విద్వేషాలు రేకెత్తించే పోస్టులను వెంటనే తొ లగించాలని సూచించారు. ప్రజల్లో భ యాందోళనలు సృష్టించే పోస్టులు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
గొల్లవాగు..ఖాళీ!
భీమారం: భీమారం సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్ట్లో నీరు లేక వెలవెలబోయింది. ఎల్నినో తీవ్ర ప్ర భావం, వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు బోసిపోయింది. నీటిమట్టం అడుగుభాగాలకు చేరింది. ఖరీ ఫ్ సీజన్లో ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భీమారం, చెన్నూరు మండలాల్లోని 9500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం గొల్లవాగు ప్రాజెక్టును నిర్మించింది. దీని ద్వారా సాగునీరందించడంతోనే రైతులు పంటలు పండించేవారు. వేసవిలో నీరు లేకపోవడం, ప్రస్తుతం ఎల్నినో కారణంగా ఇప్పటికి అదే పరిస్థితి ఉంది. అయితే భీమారం మండలం ఆర్కెపల్లి, అంకూసాపూర్, ఎలకేశ్వరం, కొత్తపల్లి, మద్దికల్ శివారుల్లో రైతులు కాలువ ఆధారంతో వరిసాగు చేస్తున్నారు. భూములు..బీళ్లుగానేప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే అవకాశం లేకపోవడంతో రైతుల ఇప్పటికి దుక్కులు దున్నించకుండా బీడుగానే ఉంచారు. ఏటా ఇప్పటికే జూలైలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్ట్ జలకళ సంతరించుకునేది. ప్రసుత్తం వర్షం ఎప్పుడు వస్తుందోనని ఆకాశం వైపు ఎదురుచూసే పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్లో నీరు లేకపోవడంతో పశువులు మేతకోసం వెళ్తున్నాయి. అయితే వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వస్తే ఆలస్యమైన వరి సాగు చేయవచ్చునని రైతులు అంటున్నారు. -
బందోబస్తు మధ్య మొక్కలు నాటి..
ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ టైగర్జోన్ చెలుకగూడ అటవీప్రాతంలో శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య మొక్కలు నాటారు. టైగర్జోన్ అటవీశాఖ ఆధ్వర్యంలో 10 హెక్టార్లలో 12వేల మొక్కలు నాటారు. గతంలో ముల్తానీలు సాగు చేస్తున్న భూములను అటవీశాఖ భూములుగా గుర్తించి ఆ శాఖ ఆధ్వర్యంలో మూడేళ్లుగా అందులో మొక్కలు నాటుతున్నారు. అయితే గతేడాది జూలైలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులను అక్కడి ముల్తానీలు అడ్డుకొని పోలీసు వాహనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసారి పోలీసు బందోబస్తు మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బీర్సాయిపేట్, ఉట్నూర్, నేరడిగొండ రేంజ్ అధికారులు 80 మందితోపాటు 50 మంది బేస్క్యాంప్ సిబ్బంది, 180 మంది పోలీసులు పాల్గొన్నారు. మొక్కలు నాటే ప్రాంతాన్ని ఎస్పీ అఖిల్మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్సాయి, ఉట్నూర్ టైగర్జోన్ ఎఫ్డీవో అరవింద్ సందర్శించారు. -
అట్టహాసంగా కబడ్డీ, ఖోఖో పోటీలు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా శనివారం సీబీఎస్ఈ క్లస్టర్–7 బాల,బాలికల కబడ్డీ టోర్నమెంట్–2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీబీఎస్ఈ పాఠశాలల నుంచి 160 జట్లు సుమారు 1,400 మంది క్రీడాకారులు విద్యార్థులు (700 మంది బాలురు, 700 మంది బాలికలు) పాల్గొంటున్నారు. సీబీఎస్ఈ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ–రీజినల్ ఆఫీసర్ జంగం సునీల్కుమార్తో కలిసి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారని, కబడ్డీ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప క్రీడ అని తెలిపారు. విజేత, రన్నరప్ జట్లను ప్రోత్సహించేందుకు రూ.లక్ష నగదు పారితోషికం అందజేస్తానని ప్రకటించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డా. చెన్నాడి అమిత్ కుమార్, ఉపాధ్యక్షుడు చి. సంపత్రావు, కార్యదర్శి బి. మల్లేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు, మానేరు స్కూల్ చైర్మన్ కె.అనంత రెడ్డి, కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, గుమ్మడి రాజకుమార్, గండ్ర లక్ష్మణ్ రావు, వివేకానంద స్కూల్ అకాడెమిక్స్ డైరెక్టర్ డా. టి.లలితా కుమారి, ప్రిన్సిపాల్ డా.ఆర్. రితీష్, ఉపాధ్యాయులు, కోచ్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో ఖోఖో పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్–7 ఖోఖో పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన పోటీలను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. పలు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఖోఖో సంఘం భాద్యులు వంగపల్లి సూర్యప్రకాశ్, రవీందర్, మోయినోద్దీన్, క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పోటీలు..సీబీఎస్ఈ క్లస్టర్– 7 బాల, బాలికల కబడ్డీ టో ర్నమెంట్–2026 మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ టోర్నమెంట్లో తె లంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీ బీఎస్ఈ పాఠశాలల నుంచి 160 జట్లు, సుమారు 1400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. -
మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
జైపూర్: మండలంలోని పెగడపల్లి ఽశివారులో ఓ చెరువు నుంచి శనివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నా రు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తుండగా మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకున్నారు. జేసీబీని పోలీస్ స్టేషన్ తరలించగా ట్రాక్టర్లను డ్రైవర్లు వదిలిపెట్టి పరారైనట్లు తెలిసింది. పట్టపగలే చోరీ బాసర: మండల కేంద్రంలోని శారదానగర్ కాలనీలో శనివారం ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. షేక్ రావుఫ్ వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఉదయం ధర్మాబాద్కు వెళ్లారు. దుండగులు ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి చొరబడ్డారు. బీరువాలో సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు, 19 తులాల వెండి, రూ.5 వేల నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బాసర సీఐ దీపక్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. షేక్ రావుఫ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని అందుగులపేట వద్ద నయార పె ట్రోల్ బంకు సమీపంలో శనివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై నరేశ్ తెలిపిన వివరా ల ప్రకారం.. పట్టణానికి చెందిన సూర వంశీ, మిరియాల రాజ్కుమార్, రామంచ సందీప్ బొక్కలగుంట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద విందు చేసుకున్నారు. బైక్పై మందమర్రికి వస్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నా రు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు ఆటోలు ఢీ.. బోథ్: మండలంలోని ధన్నూర్(బి) సమీపంలో శనివారం ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఓ ఆటో కూరగాయలతో ఉండగా, మరో ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన సుమను మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. -
శివ్వారంలో పైపులైన్ వేలంపై విచారణ
జైపూర్: మండలంలోని శివ్వారంలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గ్రామంలో గోదావరి నది నుంచి ప్రజలకు తాగునీటికోసం నిర్మించిన మిషన్ భగీరథ పైపులైన్ను అక్రమంగా సాగునీటికోసం వేలం వేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు శనివారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటేశ్వర్, డిప్యూటీ ఈఈ కిరణ్, ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. మిషన్ భగీరథ పైపులైన్ పరిశీలించారు. ప్రజలకు తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన పైపులైన్ను సాగునీటికోసం వేలం పాట నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీపతి బాపురావు, ఏఈ రాజమల్లయ్య, సర్పంచ్ అంజన్గౌడ్, పంచాయతీ కార్యదర్శి సృజన, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చర్యలు తీసుకుంటాం
ఇటీవల ప్లాస్టిక్ విని యోగంపై తనిఖీలు చేపట్టి, పలువురికి జరిమానా విధించాం. ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించి, వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజల్లో సరైన అవగాహన లేక ప్లాస్టిక్ వినియోగం పెరుగుతోంది. ఇకపై ప్రతినెలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టి కార్పొరేషన్ పరిధిలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – అన్వేష్, కమిషనర్, మంచిర్యాల కార్పొరేషన్ -
నాడు తండ్రి, నేడు తల్లి తిరిగిరానిలోకాలకు
నార్నూర్: మూడు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధి చిత్తగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీడంపూర్ సోనుబాయి (28), తిరుపతి దంపతులు. మూడు నెలల క్రితం మద్యానికి బానిసై తిరుపతి మూడునెలల క్రితం ఇంద్రవెల్లి మండలం ముత్నూర్లో ఉరేసుకున్నాడు. అప్పటి నుంచి సోనుబాయి తన ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి గంటేవార్ సాదవ్ ఇంట్లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. భర్త మృతితో మానసిక వేదనకు గురైన సోనుబాయి, ఇద్దరు చిన్నారుల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉండేది. శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆమె మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాడు తండ్రి, నేడు తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం గ్రామస్తులను కలచివేసింది. మృతురాలి తల్లి రంజానబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీసాయి తెలిపారు. చిన్నారుల సంరక్షణ, భవిష్యత్కు ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. -
● విద్యార్థుల నమోదులో మంచిర్యాల ఫస్ట్ ● ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడిలో చేరిన వారి సంఖ్య 3,315 ● ప్రైవేట్కు వెళ్లిన వారు 301 మంది
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం నిర్దేశించిన 10 శాతం అదనపు విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు, డిజిటల్ బోధనతో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. శనివారం యుడైస్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నివేదికను కలెక్టర్ కుమార్దీపక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారితో కలిసి వెల్లడించారు. ఎన్రోల్మెంట్ ఇలా.. గతేడాది 43,072 విద్యార్థుల సంఖ్యకు 10 శాతం అదనంగా 4,307 కలిపి మొత్తం 47,379 మందిని చేర్పించాలని లక్ష్యాన్ని విధించింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,350కు చేరింది. ఇప్పటి వరకు 2,778 మంది కొత్తగా చేరారు. ఈలెక్కన 95.72 శాతం నిర్దేశిత లక్ష్యం సాధించి జిల్లా తొలిస్థానాన్ని దక్కించుకుంది. మందమర్రి, జైపూర్ మండలాలు 100 శాతం, హాజీపూర్ 99.91, నస్పూర్ 99.76, భీమారం, 98.24, నెన్నెల 98 శాతం సాధించి ముందు వరుసలో నిలిచాయి. 18 మండలాలకు 10 మండలాలు 96 శాతం నుంచి 100 శాతం ప్రగతి సాధించాయి. ప్రైవేట్ నుంచి సర్కారు బడికి.. ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూకట్టారు. ఫీజుల భారం లేకపోవడం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం, ఇతరత్రా సౌకర్యాలతో సర్కారు బడిబాట పట్టారు. ఈవిద్యాసంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన వారు 91.67 శాతం కాగా సర్కారు బడుల నుంచి ప్రైవేట్కు వెళ్లిన వారి సంఖ్య 8.33 శాతం ఉంది. ప్రభుత్వ బడుల్లో 3,315 మంది చేరగా తిరిగి వెళ్లిన విద్యార్థులు 301 మంది ఉన్నారు. మంచిర్యాల మండలం నుంచి అత్యధికంగా 514 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జన్నారంలో 391, మందమర్రిలో 371, బెల్లంపల్లిలో 305 మంది సర్కారు బడికి జైకొట్టారు. -
బైక్లు ఎత్తుకెళ్లిన ఐదుగురు బైండోవర్
జన్నారం: అటవీ అధికారులు సీజ్ చేసిన బైక్లను చోరీచేయడమే కాకుండా అడ్డువెళ్లిన సి బ్బందిపై దాడి చేసిన ఐదుగురిని శనివారం తహసీల్దార్ బక్కయ్య ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 21న అటవీ అధికారులు కవ్వాల్ ఫారెస్ట్ క్వార్టర్లో రెండు బైక్లను సీజ్ చేసి ఉంచారు. దేవునిగూడకు చెందిన లాకవత్ ఉపేందర్, గవ్వల మురళీకృష్ణ, బుక్య సాయి, లాకవత్ విక్రం, లాకవత్ రాహూల్నాయక్ కలిసి శుక్రవారం రాత్రి సమయంలో క్వార్టర్లోకి చొరబడ్డారు. బేస్క్యాంపు వాచర్లపై దాడి చేసి, బైక్లను ఎత్తుకెళ్లారని అటవీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గురుకులాల తనిఖీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయం, గుడిపేటలోని ఎంజేపీ పీఎంశ్రీ బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, నంనూర్లోని అర్బన్ గురుకుల బాలుర పాఠశాలలను శనివారం హాజీపూర్ మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో కిషన్ తనిఖీ చేశా రు. తరగతి, వసతి, వంట గదులు, భోజన శాలలు, మరుగుదొడ్లు, పాఠశాలల పరిశీలించి పలు సూచనలు చేశారు. పరిశుభ్రమైన వాతా వరణాన్ని కలిపిస్తూ విద్యార్థులకు చక్కని బోధ న అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సాయివెంకటరెడ్డి, ఏఈవో తిరుపతిరెడ్డి, ఆయా ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఎంపీ వ్యాఖ్యలపై నిరసన
మంచిర్యాలటౌన్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు శనివారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో అనుభవం లేని వారు కూడా తమ నేత గురించి ఇష్టారీతిన మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు గాదె సత్యం, గోగుల రవీందర్రెడ్డి, తోట తిరుపతి, దగ్గుల మధు, పడాల రవీందర్, పెంట నవీన్, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి చెన్నూర్: కేటీఆర్పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ చౌక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూర్, కోటపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంపీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాపు, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి విద్యాసాగర్, నాయకులు తిరుపతి, మహేశ్, శ్రీనివాస్, నాయబ్, సురేశ్రెడ్డి, రమేశ్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు. -
1098కి స్పందించి..చిన్నారిని బాలసదన్లో చేర్పించి..
భీమిని: దత్తత పేరుతో బాలుడిని తీసుకువచ్చారనే 1098 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదుకు స్పందించిన అధికారులు శుక్రవారం రాత్రి బాలసదన్కు చేర్చారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నెపల్లి మండలం గొల్లగట్టు గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు దత్తత పేరుతో వారం క్రితం ఆరునెలల చిన్నారి(మగ) తీసుకువచ్చారు. ఈ విషయమై గ్రామస్తులు 1098 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. స్పందించిన ఐసీడీఎస్ అధికారులు పోలీసులతో కలసి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. దత్తతకు సంబంధించిన ఆధారాలు ఏమి లేకపోవడంతో కుటుంబసభ్యులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కన్నెపల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూచనతో చిన్నారిని ఆదిలాబాద్ పిల్లల సంరక్షణ (బాలసదన్) కేంద్రానికి తరలించారు. -
‘సర్కారు’పై ప్రజలకు విశ్వాసం
విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రఽథమస్థానం సాధించింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనం. మౌలిక వసతుల కల్పన, అత్యున్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులతో డిజిటల్ బోధన జరుగుతోంది. 8 అకాడమిక్ పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. – కుమార్దీపక్, జిల్లా కలెక్టర్ నాణ్యమైన విద్యఇంటిరాక్టివ్ ప్లాట్ ప్యానెల్, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ బోధన అందించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్లు తగ్గించేందుకు 5,7,8 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో, పదో తరగతి పూర్తి చేసిన బాలికలను కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చేర్పించేలా ఆదేశాలు ఇచ్చాం. – చంద్రయ్య, అదనపు కలెక్టర్, డీఈవో -
‘విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడొద్దు’
మంచిర్యాలటౌన్: విద్యార్థులకు అన్నివేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరా ల సురేఖ, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయ ర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొన్నారు. పేదల అభివృద్ధికి కృషి లక్సెట్టిపేట: పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నా రు. మండల కేంద్రంలోని ఎస్ పీఆర్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారో త్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్గా అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా చాతరాజు రాజేశ్, డైరెక్టర్లుగా మల్లేశ్, చందు, శ్రీనివాస్, లచ్చన్న, శర త్, భారతమ్మ, నవాబ్ఖాన్, తిరుమలరావు, బొజ్జురావు, కట్ల శ్రీనివాస్ చేత మార్కెట్ అధికారి షాబొద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆర్టీయే మెంబర్ శ్రీనివాస్, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి, వైస్ చైర్మన్ రాజేశ్వరి పాల్గొన్నారు. -
తెల్లమద్ది @150 ఏళ్లు!
దండేపల్లి: తాళ్లపేట రేంజ్ పరిధి దండేపల్లి అటవీ బీట్లో సుమారు 150 ఏళ్ల భారీ వృక్షాలు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. సూదులొద్దీ అటవీ ప్రాంతంలో సుమారు 450 సెం.మీటర్ల చుట్టుకొలత ఉన్న భారీ తెల్లమద్ది(టెర్మినాలియా అర్జున) వృక్షాలు ఉన్నాయి. వీటిని ఏరుమద్ది అని పిలుస్తారని జన్నారం అటవీ డివిజన్ అధికారి రాంమ్మోన్ తెలిపారు. ఇవి ఎక్కువగా సెలయేరు ప్రాంతాల్లో పెరగడం వల్ల ఏరుమద్ది అని, తొడుగు తెల్లరంగులో ఉండటంతో తెల్లమద్ది అంటారని పేర్కొన్నారు. దీనికి నీటి ప్రవాహాన్ని, నీటి నిల్వలను తట్టుకుంటుందని తెలిపారు. నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో పెంచుతారని చెప్పారు. చెట్టు చుట్టూకొలతను బట్టి దాని వయస్సును చెప్పవచ్చని పేర్కొన్నారు. పేకాడుతున్న 8 మంది అరెస్టు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో జోరుగా పేకా ట సాగుతుందని సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ‘ఆపరేషన్ పేకాట’నిర్వహించారు. శనివారం సాయంత్రం గాంధీనగర్ శివారులోని పేకాటస్థావరం టాస్క్ఫోర్స్ ఎస్సై డీకొండ రమేశ్ బృందం, స్థానిక ఎస్సై రమేష్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.లక్ష రెండు వేలు నగదు, ఆరు సెల్ఫోన్లు, నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో సీఐ ప్రమోద్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాస్టిక్పై నియంత్రణేది?
మంచిర్యాలటౌన్: పర్యావరణానికి, ప్రజలకు, ఇతర ప్రాణుల ఆరోగ్యానికి నష్టదాయకమనే కారణంతో పాలిథిన్తో తయారయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం నిషేధించాలన్న జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపాలిటీల్లో అమల్లోకి తెచ్చినా, పూర్తిస్థాయిలో అరికట్టలేక పోతున్నారు. పాలిథిన్ సంచులు, నీటిసీసాలు, ఆహారం ప్యాక్ చేసే కవర్లు, ప్లాస్టిక్ విస్తర్లు తదితర వస్తువులు క్షేమదాయకం కాదని తెలిసినా.. పరిస్థితుల కారణంగా ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ప్రత్యామ్నయం లేకపోవడంతో పాటు, ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపట్టక పోవడంతోనే ఆశించిన ఫలితాలు అంతగా కనిపించడం లేదు. గతంలో ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపాలిటీల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం, జరిమానా విధించడంతో కొంత వరకు ప్లాస్టిక్ వినియోగం తగ్గింది. కొంత కాలంగా ప్లాస్టిక్ నిషేధంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విక్రయాలు మాత్రం యథేచ్చగా సాగిపోతున్నాయి. వీటి వినియోగం ఎక్కువ కావడంతో మంచిర్యాల కార్పొరేషన్తో పాటు, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతన్పల్లి, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లోని వీధుల్లో వేస్తున్న చెత్తకుప్పల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. పశువులు ప్లాస్టిక్ కవర్లను తిని మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ కవర్లు కారణమవుతున్నాయి. కనీస తనిఖీలు చేపట్టక పోవడం, జరిమానా విధించక పోవడం, వ్యాపారుల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోవడం, ప్రత్యామ్నాయం చూపకపోవడంతో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం యథేచ్చగా సాగుతోంది. తనిఖీలు, జరిమానాలతోనే .. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్ను పూర్తిగా నిషేధించారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ (1986) ప్రకారం సీడీఎంఏ హైదరాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సామగ్రి జప్తు, రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా, లైసెన్సు రద్దుతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వ్యాపారులు, ప్రజల్లోనూ మార్పు వచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలి. చేతి సంచితోనే కూరగాయల మార్కెట్కు రావాలని, ఎవరూ ప్లాస్టిక్ను వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించాలి. ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు చేపట్టి వదిలేస్తున్నారు. ఇటీవల మంచిర్యాల కార్పొరేషన్లోనూ ప్లాస్టిక్ను విక్రయిస్తున్న పలు దుకాణాలను తనిఖీ చేసి జరిమానా విధించారు. ఆ తర్వాత తనిఖీలు చేపట్టకుండా వదిలేయడంతో మళ్లీ ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో వేసే చెత్త కుప్పల్లో సగం ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. ప్రతీరోజు దాదాపు 150 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడితే అందులో నాలుగోవంతు ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇళ్లల్లో నుంచి వెలువడే చెత్తలో తడి, పొడి చెత్త వేర్వేరుగా ప్లాస్టిక్ కవర్లలోనే వేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అందిస్తున్నారు. దుకాణాల నుంచి బ యటపడేసే చెత్తలోనూ ప్లాస్టిక్ కవర్లు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. వాటిని బయట పడేయడంతో చెత్తతో పాటే ప్లాస్టిక్ కూడా కలుస్తుంది. జిల్లాలో దా దాపు 95 వేలకు పైగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని అంచనా. పశువులు రోడ్డు పక్కన ఉండే చెత్త, అందులోని ప్లాస్టిక్ కవర్లను తినడంతో జీర్ణం చేసుకోలేక అనారోగ్యం బారిన పడుతున్నాయి.జిల్లాలోని మున్సిపాలిటీల్లో సేకరిస్తున్న చెత్తలో మూడోవంతు ప్లాస్టిక్దేమున్సిపాలిటీ సేకరించే చెత్త (మె.ట) మంచిర్యాల కార్పొరేషన్ 60 మందమర్రి 18 బెల్లంపల్లి 20 క్యాతన్పల్లి 15 చెన్నూర్ 18 లక్సెట్టిపేట 17 -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్లొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు. -
భక్తి శ్రద్ధలతో చండీహోమం
నస్పూర్: నస్పూర్ కాలనీలోని శ్రీలక్ష్మి గణపతి శివ మార్కండేయ మహాదుర్గా దేవాలయంలో శాకంబరి యుక్త వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శుక్రవారం చండీహోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 15 నుంచి 23వరకు ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నవరాత్రులు తొమ్మిది రకాల కుంకుమలతో నిత్యం లలిత సహస్రనామ పారాయణంతో కుంకుమార్ఛన, మహా కుంకుమాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల ఆనందశర్మ, శ్రీరాంభట్ల సాత్విక్శర్మ, శ్రీరాంభట్ల ఆకాష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి
బెల్లంపల్లి/మంచిర్యాలఅర్బన్: రైల్వే పెండింగ్ పనులు ఏమాత్రం జాప్యం చేయకుండా సత్వరంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ సూచించారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించారు. బెల్లంపల్లి మూడో ఫ్లాట్ఫామ్, మూడోలైన్ పనులు, ఆర్వోహెచ్ షెడ్, సిక్ లైన్ ఎక్స్టెన్షన్ తదితర పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. మంచిర్యాలలో అమృత్ భారత్ పథకం కింద రూ.26.49 కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. టికెట్ కౌంటర్లు, పార్కింగ్ ఏరియా, గార్డెనింగ్ పనులు, ఫుట్ ఓవర్బ్రిడ్జి, లిప్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్హాల్ పనులు పరిశీలన చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డీవోఎం నరేందర్శర్మ, మంచిర్యాల స్టేషన్ మేనేజర్ రవికుమార్, రామగుండం ఏడీఎంఏ, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నత్తనడకన రైతుల నమోదు
దండేపల్లి: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రి(రైతు నమోదు) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 74శాతం మాత్రమే పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్, రైతుభరోసా, బోనస్, రాయితీ పరికరాలు, ఎరువులు, పంటల బీమా, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. రైతులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. కొందరు రైతులకు అవగాహన లేకపోవడం, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉండడం వంటి కారణాలతో ఫార్మర్ రిజిస్ట్రి నిదానంగా సాగుతోంది. సాగుభూమి ఉన్న ప్రతీ రైతుకు.. రైతు నమోదు ప్రక్రియ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏడాది కొనసాగుతోంది. ఏఈవోలు రైతువేదికలతోపాటు వ్యవసాయ కార్యాలయాల్లో, కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి రైతు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. సాగుభూమి ఉన్న ప్రతీ రైతుకు 11అంకెల రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య రూపొందిస్తారు. ఈ ఐడీలో ఆధార్, ఫోన్నంబర్లు, రైతు పేరు, పట్టాదారు పాస్పుస్తకం వివరాలు, పొలం సర్వే నంబర్లు, సాగు వివరాలు, భూమి రకం, రైతులు పొందే రాయితీ, రుణాలు, పంటల బీమా వివరాలు పొందుపరుస్తారు. ఈ ప్రక్రియ మీ సేవ కేంద్రాల్లో కూడా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. తప్పనిసరిగా చేసుకోవాలి..ఫార్మర్ రిజిస్ట్రి ఇప్పటికీ చేయించుకోవాని వారుంటే తప్పనిసరిగా చేసుకోవాలి. వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి చేయించుకోవాలి. లేదంటే మీసేవా కేంద్రాల్లోనూ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రి చేయించుకుంటే భవిష్యత్లో మంచి ఉపయోగం ఉంటుంది. – సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారిజిల్లాలోని మండలాల వారీగా రిజిస్ట్రి వివరాలు మండలం రైతులు పూర్తయిన చేయించు వారు కోనివారు దండేపల్లి 17,439 14,536 2,903 లక్సెట్టిపేట 14,325 11,563 2,762 జన్నారం 15,544 12,501 3,043 భీమిని 8,081 6,351 1,730 మంచిర్యాల 1,096 847 249 కన్నెపల్లి 8,958 6,887 2,071 కాసిపేట 5,710 4,345 1,365 నెన్నెల 9,192 6,753 2,439 హాజీపూర్ 9,975 7,248 2,727 బెల్లంపల్లి 6,212 4,505 1,707 కోటపల్లి 13,375 9,583 3,792 భీమారం 5,691 4,033 1,658 చెన్నూర్ 1,6315 11,551 4,764 తాండూర్ 8,282 5,855 2,427 మందమర్రి 6,318 4,318 2,000 వేమనపల్లి 7,301 4,955 2,346 జైపూర్ 16,693 10,627 6,066 మొత్తం 1,70,507 1,26,458 44,049 -
అక్కడా.. ఇక్కడా పర్యవేక్షణెలా!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఇన్చార్జీల నియామకం, బాధ్యతల(సర్దుబాటు) అప్పగింత వివాదాస్పదంగా మా రింది. అధికారులు నిబంధనలు పక్కనబెట్టి వ్యవహరిస్తుండడంతో గందరగోళం నెలకొంది. ఒక్కొక్కరికి ఏకంగా మూడే వసతిగృహాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కిలోమీటర్ల దూరంలో ఉన్న వసతిగృహాలకు కూడా ఒక్కరినే ఇన్చార్జీగా నియమించడంతో ఏ ఒక్క హాస్టల్ను సరిగ్గా పర్యవేక్షించలేని పరిస్థితి ఏర్పడింది. వార్డెన్ ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లోని హాస్టళ్లల్లో అందుబాటులో ఉండకపోవడంతో విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యత, వసతుల పర్యవేక్షణ దెబ్బతింటోంది. అత్యవసర సమయాలు, తనిఖీ వేళ వార్డెన్ ఎప్పుడు, ఏ హాస్టల్లో ఉంటారో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరం పరిశీలించే వార్డెన్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ లోపిస్తోంది. ఎస్టీ హాస్టళ్లలో గందరగోళం ఎస్టీ హాస్టళ్లలో సర్దుబాట్ల పర్వం కొనసాగుతోంది. అధికారుల తప్పిదంతో ఒక హాస్టల్కు నియమించిన రెగ్యులర్ వార్డెన్లకు తగిన స్థానం ఇవ్వకుండా దూర ప్రాంతాల హాస్టళ్లకు డిప్యూటేషన్లు, ఇన్చార్జీ లుగా నియమించడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 2024లో మంచిర్యాల పీఎంహెచ్(గర్ల్స్) వార్డెన్ లక్సెట్టిపేటకు బదిలీ అయ్యారు. అప్పట్లో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లడంతో తిరిగి అధికారులు ఆమెను సర్దుబాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ పోస్టు ఖాళీగా ఉండడం వల్ల కౌన్సెలింగ్ ద్వారా కొత్తగా వచ్చిన మరో రెగ్యులర్ వార్డెన్కు భీమారం డిప్యూటేషన్ ఇచ్చారు. కొంతకాలానికి అక్కడ పని చేసిన ఏటీడబ్ల్యూవో ఇన్చార్జి తిరిగి సొంత హాస్టల్కు రావడంతో లక్సెట్టిపేట పోస్టుమెట్రిక్(గర్ల్స్) హాస్టల్కు బదిలీ చేశారు. ఈ ఏడాది జరిగిన బదిలీల్లో మంచిర్యాల పోస్టుమెట్రిక్ హాస్టల్(బాయ్స్) వార్డెన్ను లక్సెట్టిపేట(గర్ల్స్)కు కేటాయించారు. అప్పటికే అక్కడ పని చేస్తున్న మంచిర్యాల పీఎంహెచ్(రెగ్యులర్ వార్డెన్)ను ఎక్కడికి పంపించాలో అధికారులకు తెలియకుండా పోయింది. ఇదివరకు మంచిర్యాల బీసీ ఇంటిగ్రేటేడ్లో రెగ్యులర్ ఎస్టీ వార్డెన్ను జన్నారానికి డిప్యూటేషన్ చేశారు. లక్సెట్టిపేటకు రెగ్యులర్ వార్డెన్గా బదిలీపై వెళ్లిన అతన్ని ఇక్కడికి సర్దుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒకరి కోసం మరొకరిని రెగ్యులర్ వార్డెన్లను ఇబ్బందులకు గురి చేశారు. బీసీ ఒక్కొక్కరికి మూడేసి.. బీసీ వసతిగృహాల్లో ఒకే వార్డెన్కు హాస్టళ్ల అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల పర్యవేక్షణ లోపిస్తోంది. దండేపల్లిలో విధులు నిర్వర్తించే వార్డెన్కు జన్నారం, బెల్లంపల్లిలో రెగ్యులర్ వార్డెన్కు లక్సెట్టిపేట పోస్టుమెట్రిక్ హాస్టల్, మంచిర్యాల బీసీ బాలుర కళాశాల వసతిగృహం వార్డెన్కు లక్సెట్టిపేట ప్రీమెట్రిక్, మంచిర్యాల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అదనపు బాధ్యతలు ఇచ్చారు. జైపూర్ ప్రీమెట్రిక్(గర్ల్స్) వసతిగృహ నిర్వహణాధికారికి చెన్నూర్ గర్ల్స్, వేరే డిపార్ట్మెంట్ ఎస్సీ ప్రీమెట్రిక్ వసతిగృహ ఇన్చార్జీగా నియమించడం కొసమెరుపు. ఎస్సీ వసతిగృహంలో మరోలా.. వసతిగృహాల్లో ఖాళీలు ఉంటే పక్కపక్కనే ఉండే మండలాల వార్డెన్లకు ఇంచార్జీలుగా నియమిస్తారు. ఎస్సీ వసతిగృహంలో వార్డెన్కు ఆరు, ఏడు మండలాలు దాటి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. 96 కిలోమీటర్ల దూరంలోని జన్నారం మండలం చింతగూడకు చెందిన రెగ్యులర్ వార్డెన్కు నెన్నెల వార్డెన్ ఇంచార్జీగా ఇచ్చారు. పోన్నారం వసతిగృహం ఓపెన్ చేయకముందే ఆ హాస్టల్ ఇంచార్జీగా నియమించడం చర్చానీయంశంగా మారింది. -
జాతీయ రహదారి నిర్మాణం చేపట్టండి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల– హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారిపై అధిక ట్రాఫిక్ వల్ల నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, మంచిర్యాల–కరీంనగర్–హైదరాబాద్ మధ్య నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. నాగ్పూర్–హైదరాబాద్ నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మంచిర్యాల మీదుగా నిర్మాణం చేపడితే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రస్తుతం ఐదు గంటలు పడుతుండగా, మూడు గంటల్లోనే హైదరాబాద్కు చేరుకోవచ్చని తెలిపారు. మంచిర్యాల నుంచి నిత్యం వేలాది వాహనదారులు విద్య, వైద్యం, వివిధ రకాల పనుల నిమిత్తం కరీంనగర్, హైదరాబాద్ వెళ్తుంటారని, వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జాతీయ రహదారి మంజూరు చేయాలని కోరారు. -
రోడ్లపై పశువులు సంచరిస్తే గోశాలకే
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై రాత్రి, పగలు అనే తేడా లేకుండా పశువులు సంచరిస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపైకి పశువులను వదలకుండా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని పశువుల యజమానులు వారికి చెందిన ఆవులు, గేదెలను నగరంలో విచ్ఛలవిడిగా వదిలివేయవద్దని, ఇందుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని నగర కమిషన్ జి.అన్వేష్ తెలిపారు. పశువులను ఇంటి ఆవరణలో కానీ తగిన సురక్షిత ప్రదేశంలో కానీ కట్టేసుకోవాలని పేర్కొన్నారు. వారం తరువాత పశువులను రోడ్ల మీదకు వదిలేస్తే వాటిని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పట్టుకుని, గోశాలలకు తరలిస్తామన్నారు. అనేక తిప్పలు..జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై రాత్రి, పగలు అనే తేడా లేకుండా పశువులు సంచరించడంతో పాటు రోడ్లపైనే పడుకుంటున్నాయి. దీంతో వాహనదారులు, రోడ్డుపై వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని తోళ్లవాగు నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు పశువులు నిత్యం రోడ్లపైనే మకాం వేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఐబీచౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తా, పాతమంచిర్యాల, సీసీసీ నస్పూర్ చౌరస్తాలో ట్రాఫిక్కు తరుచూ అంతరాయం కలిగిస్తున్నాయి. ఇటీవల రోడ్డుపై ఉన్న పశువులను వాహనదారులు ఢీకొట్టి గాయపడిన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈనేపథ్యంలో పశువుల బెడద నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
ఓవర్మెన్ వైఖరిపై కార్మికుల ఆందోళన
శ్రీరాంపూర్: ఎస్ఆర్పీ 3 గనిలో మోసిన్ అనే ఓవర్మెన్ వైఖరిపై కార్మికులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం షిఫ్ట్లో కార్మికులు గనిపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మోసిన్ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పని స్థలాల వద్ద అకారణంగా దుర్భాషలాడుతున్నారని, ఇదేమని ప్రశిస్తే దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నారని కార్మికులు వాపోయారు. కార్మికులంతా కలిసి ఆందోళన చేయడంతో గని మేనేజర్, ఇతర అధికారులు వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కార్మికులు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. మోసిన్ కార్మికుల ముందుకు వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి మేనేజర్ రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్మికుల ఆందోళనలకు ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ సెక్రెటరీ షేక్బాజీసైదా, ఫిట్ సెక్రెటరీ మురళీ చౌదరీ, నాయకులు మల్లేశ్, నగేశ్, సాగర్, మహేశ్, రమేశ్, రాజయ్య, గోపి, రాజయ్య పాల్గొన్నారు. -
తొలి తెలుగు పండుగ.. ఏకాదశి
చెన్నూర్: ిహిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశికి అత్యంత ప్రముఖ్యత ఉంది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నుంచే కొత్త తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సర కాలం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి చొప్పున వస్తాయి. శనివారం తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్ల పక్షం నుంచి కార్తీక శుక్ల పక్షం వరకు చాతుర్మాస్య దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ద ఏకాదశి రోజున మహావిష్ణు మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని హిందువులు పవిత్ర నెలలుగా భావించి చాతుర్మాస్య దీక్షలు చేస్తారు. పండుగలు ప్రారంభం.. తొలి ఏకాదశి నుంచే తెలుగు పండుగలు ప్రారంభమవుతాయి. ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతాలు ఆచరిస్తారు. శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి శ్రీహరిని పూజిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి. – దామెర మోహనాచార్యులు, అర్చకులు, జగన్నాథాలయం, చెన్నూర్ ఆలయాల్లో పూజలు..తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు సూర్యోదయానికి ముందే గోదావరిలో స్నానాలు ఆచరించి మహావిష్ణువు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. చాతుర్మాసం ప్రారంభం కానుండడంతో శ్రీ మహావిష్ణువు ఆలయాలు కిటకిటలాడుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మరునాడు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్ష విరమిస్తారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వన్టౌన్లో వివరాలు వెల్లడించారు. ఈనెల 22న భుక్తాపూర్లోని శివం ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి దుకాణ యజమాని నుంచి స్కూటీ తీసుకుని పరారయ్యాడు. అదే సమయంలో తనతో వచ్చిన ఆటో డ్రైవర్ను కూడా నమ్మించి అతని మొబైల్ ఫోన్ను అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీతో నిందితులను గుర్తించారు. ఎన్టీఆర్ చౌక్ వద్ద వాహన తనిఖీల్లో హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన ప్రధాన నిందితుడు అంతరం రమేశ్, కూకట్పల్లికి చెందిన ముంగి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు దొంగిలించిన మొబైల్ఫోన్లను కొనుగోలు చేసిన గుడిహత్నూర్కు చెందిన షేక్ అల్లావుద్దీన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఇద్దరు నిందితులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు తేలింది. రమేశ్పై ఇది వరకే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నాయి. కాగా దొంగిలించిన మొబైల్ ఫోన్లలోని ఫోన్పేల ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని 48 గంటల్లో ఛేదించిన ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, పోలీసు సిబ్బంది నరేశ్ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించినట్లు పేర్కొన్నారు. -
రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
నెన్నెల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న రీ సర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిన్నవెంకటాపూర్లో రీ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సమక్షంలోనే అభ్యంతరాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తరగతి గదులు పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ యజాస్, సర్పంచ్ భాస్కర్ పాల్గొన్నారు. కాగా, చిన్నవెంకటాపూర్ దారి బురదగా మారి వాహనం వెళ్లలేకపోవడంతో కలెక్టర్ స్థానికుల సాయంతో మోటార్సైకిల్పై చేరుకున్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు మంచిర్యాలఅగ్రికల్చర్: యువ పారిశ్రామికవేత్తల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల ఫార్మలైజేషన్ పథకం కింద పెండింగ్లో ఉన్న బ్యాంకు దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పీఎంఎఫ్ఎంఈ సింగిల్ విండో డ్రైవ్ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. బ్యాంకుల వారీగా జిల్లా స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, ఎల్డీఎం తిరుపతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, అధికారులు అంజయ్య, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారులు పాల్గొన్నారు. -
మినీ గార్డెన్ కూల్చివేత
భైంసాటౌన్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన మినీ గార్డెన్ను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. దీంతో విష యం తెలుసుకున్న ఎంఐఎం కౌన్సిలర్లు సాయంత్రం అక్కడకు చేరుకుని కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. వాస్తు పేరిట ఎలాంటి అనుమతులు లేకుండా పాలకవర్గ సభ్యులు ఇష్టారీతిన కార్యాలయ ఆస్తులు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఆవరణలోని మినీ గార్డెన్ కూల్చివేయడంతోపాటు అద్దె దుకాణాలను ఖాళీ చే యించి, వాటిని సైతం కూల్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలోనే బైఠాయించి నిరసన తెలిపారు. మినీ గార్డెన్ కూల్చివేత విషయమై చైర్మన్ తూముల దత్తాత్రిని వివరణ కోరగా, కార్యాలయ ఆవరణలో మినీ గార్డెన్ కారణంగా చెత్త సేకరణ వాహనాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల వాహనాలతోపాటు, కార్యాలయానికి వచ్చే ప్రజలు వాహనాలు నిలిపేందుకు సమస్య తలెత్తుతోందన్నారు. ఈ కారణంగానే మినీ గార్డెన్ కూల్చివేసినట్లు తెలిపారు. వాస్తు పేరిట ఎలాంటి ఆస్తినష్టం కలిగించే చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. -
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్లు
నిర్మల్టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును గుర్తించడంతో పాటు తిరిగి అప్పగించి డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తుండగా జగిత్యాల జిల్లా కలికోట గ్రామానికి చెందిన దూలం గంగాధర్ జగిత్యాలలో బస్సు ఎక్కి విజయవాడలో దిగారు. ఈ క్రమంలో నిద్రలో ఆయన మెడలోని సుమారు 10 గ్రాముల బంగారు గొలుసు జారిపడిపోయింది. బస్సు ఒంగోలు చేరుకున్న తర్వాత డ్రైవర్లు జి. రమేశ్, పెంబి జమీల్లు తనిఖీ చేయగా బస్సులో ప్రయాణికుడు పడుకున్న బెర్త్ సీటులో బంగారు గొలుసు కనిపించింది. వెంటనే రిజర్వేషన్ సమయంలో నమోదైన ఫోన్ నంబర్ ఆధారంగా ప్రయాణికుడిని సంప్రదించారు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం విజయవాడ బస్టాండ్లో స్టేషన్ మేనేజర్ ఆధ్వర్యంలో బంగారు గొలుసును బాధితుడికి అప్పగించారు. ప్రయాణికుడి విలువైన వస్తువును భద్రంగా తిరిగి అప్పగించిన డ్రైవర్లను నిర్మల్ డిపో మేనేజర్ కే. పండరి అభినందించారు. -
మిస్సింగ్ కేసు నమోదు
కాసిపేట: మండలంలోని దేవాపూర్ పోలీ స్స్టేషన్ పరిధిలోని దేవాపూర్ బుచ్చన్నవాడకు చెందిన గాజు ల రమేశ్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారాం శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కూలీ పని చేసుకునే రమేశ్ ఈనెల 22న ఉదయం 9గంటలకు లచ్చిరెడ్డి గూడెంలో మిషన్ పని ఉందని ఇంట్లో భార్యతో చెప్పి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. కాగజ్నగర్లోని రమేశ్ తల్లిదండ్రులకు, తెలిసిన ఇతరులకు ఫోన్ చేసినా ఆచూకీ దొరకలేదు. దీంతో భార్య గాజుల కల్యాణి ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి గ్రే కలర్ షర్ట్, తెలుపు కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
పాతమంచిర్యాల: ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఉద్యమాలు చేస్తూ యువత లేవనెత్తిన న్యాయమైన డిమాండ్లను కేంద్రం ఆమోదించాలని పౌరసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఢిల్లీ లోని యువత ఉద్యమానికి మద్దతుగా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. 22 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్రేంద్ర ప్రధాన్ తక్షణం పదవి నుంచి వైదొలగా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరస్పందన వేదిక కన్వీనర్ క్యాతం రవికుమార్, టీజేఎఫ్ నాయకులు జైపాల్సింగ్, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, జై భారత్ రాష్ట్ర నాయకులు జీవన్ జోయల్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బింగి సుధాకర్, అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యదర్శి అడెపు సమ్మయ్య, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుట్ల మల్లయ్య, కేవీపీఎస్ జిల్లా జిల్లా కార్యదర్శిఽ డి.మోహన్, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు గంజి రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
పన్నుల చెల్లింపు ఇక సులభం
భైంసా: రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ప్రజలకు వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏకీకృత పన్ను విధానానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో పన్నుల చెల్లింపు సులభతరం చేసేందుకు బిల్ –1 ప్రక్రియ ప్రారంభించింది. ఇటీవలే హైదరాబాద్లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి ఈ సేవలను ప్రారంభించారు. త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లో ఈ విధానం అమలులోకి తీసుకురానున్నారు. ఆస్తి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజులు కలిపి ఒకేసారి చెల్లించే వీలు కలగనుంది. ఒకే కౌంటర్పై..బిల్ –1 ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు వేర్వేరు కౌంటర్లలో, వేర్వేరు విభాగాల్లో పొందాల్సిన సేవలను ఒకే వేదికపై అందించే అవకాశం కలగనుంది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే చోట దరఖాస్తులు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, ధ్రువపత్రాలు పొందడం వంటి సేవలను వేగంగా పూర్తి చేసుకునే వీలుంటుంది. దీంతో సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు అవినీతి, జాప్యాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒకే పోర్టల్లో అన్ని బిల్లులు..మున్సిపల్ శాఖ వెబ్సైట్లో బిల్ –1 ఆప్షన్ను క్లిక్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్)ను, అసిస్మెంట్కు రిజిస్టర్ అయిన సెల్ఫోన్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయగానే సంబంధిత ఆస్తిపై ఉన్న ఇంటి పన్ను, నల్లా పన్ను, ఆస్తిని వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తే అందుకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సు ఫీజు ఎంత మేర చెల్లించాలో బకాయిలతో సహా చూపిస్తుంది. ఈవిధానంతో బిల్లుల వసూలుకు మున్సిపల్ సిబ్బంది మూడుసార్లు తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంటి యజమాని సైతం మూడు సార్లు చెల్లించాల్సిన పని ఉండదు. ఒకేసారి అన్ని బిల్లులు చెల్లించవచ్చు. ఉమ్మడి జిల్లాలో..పన్నులు చెల్లిస్తున్న ప్రజలు (ఫైల్) ఉమ్మడి జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో కూడా త్వరలో బిల్ –1 సేవలు అందుబాటులోకి రానున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయిన వెంటనే ప్రజలకు ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్నగర్, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, క్యాతన్పల్లి, నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం ఒక కార్పొరేషన్, 11 మున్సిపాలిటీల్లో ఈ సేవలను అమలు చేసేందుకు పురపాలక శాఖ చర్యలు చేపడుతోంది. అవసరమైన కంప్యూటర్ వ్యవస్థలు, సాఫ్ట్వేర్ ఏర్పాటు, డేటా సమీకరణ, టిమ్లో సాఫ్ట్వేర్ అప్డేట్, సిబ్బందికి శిక్షణ వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని లక్షలాది పట్టణ ప్రజలు ఆధునిక, వేగవంతమైన పురపాలక సేవలను సులభంగా పొందే అవకాశం కలగనుంది. -
మైదానమే మందుబాబుల అడ్డా
మంచిర్యాలక్రైం: మంచిర్యాల నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి పది గంటలు దాటిందంటే చాలు బహిరంగ బార్ను తలపిస్తుంది. హెలిప్యాడ్ స్థలంలో కూర్చుని మద్యం సేవించి అల్లరి చేస్తుంటారు. అక్కడే బీరు సీసాలు పగులగొట్టి పడేస్తుంటారు. మద్యంమత్తులో డిగ్రీ కళాశాల గదుల్లోకి రాళ్లు విసరడం, కిటికీల అద్దాలు పగులగొట్టిన దాఖలాలు ఉన్నాయి. ఎవరైనా మైదానికి వెళ్తే వారితో గొడవకు దిగుతున్నారు. స్థానికులు డయల్ 100కు కాల్ చేస్తే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ పోలీసులు వచ్చేసరికి మందుబాబులు అక్కడి నుంచి పారిపోవడం, పోలీసులను మేనేజ్ చేయడం చేస్తున్నారనే ఆరోపణలున్నా యి. నగరంలోని కాలేజీ రోడ్, గోదావరి సమీపంలో, గ్రీన్సిటీ అండాలమ్మ కాలనీ, కలెక్టరేట్ సమీపంలో, హైటెక్ సిటీ, ఏసీసీ క్వారీ రోడ్, బైపాస్ రోడ్డు ప్రాంతాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. ప్రతీ నెల పోలీసు కమిషనర్ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, డ్రోన్, డీజేల వినియోగంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ప్రకటన చేస్తుంటారు. కానీ అవేవీ నగరంలో అమలుకు నో చుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై పో లీసులు లాఠీ ఝళిపిస్తున్నారు. అయిన మందుబా బుల్లో మార్పు రావడం లేదు. మద్యం సేవిస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న వారిపై కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. పక్కనే బాలికల వసతిగృహం డిగ్రీ కళాశాల మైదానాన్ని ఆనుకుని బాలికల వసతి గృహం ఉంది. మైదానానికి, వసతిగృహానికి మధ్య ఎలాంటి ప్రహరీ లేదు. మందుబాబులు హాస్టల్కు అతి సమీపంలో అర్ధరాత్రి వరకు మద్యం సేవించి మత్తులో అరుపులు, కేకలు వేస్తుండడంతో బాలికలు భయపడుతున్నారని హాస్టల్ నిర్వాహకులు పలుమార్లు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. డిగ్రీ కళాశాల మైదానం అన్ని విధాలా అనుకూలంగా ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు, మహిళలు, వృద్ధులు వాకింగ్, జాగింగ్, క్రీడాకారులు, కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులు సాధన కోసం వస్తుంటారు. మందుబాబుల చేష్టల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పగిలిపోయిన సీస ముక్కలను ఏరివేస్తుంటామని వాకర్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.ప్రజలకు ఇబ్బంది..డిగ్రీ కాలేజీ గ్రౌండ్ను ఆనుకుని గౌతమేశ్వర కాలనీ ఉంటుంది. గౌతమేశ్వర కాలనీ నుంచే గ్రౌండ్లోకి వెళ్లాలి. మద్యం సేవించిన వారు అర్ధరాత్రి వరకు రోడ్డు నుంచే వెళ్తూ అల్లరి చేస్తుంటారు. మద్యంమత్తులో గొడవకు దిగుతున్నారు. రాత్రి 10గంటలు దాటిందంటే గ్రౌండ్ మందుబాబులదే. ప్రజలు గ్రౌండ్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. – రాంరెడ్డి, గౌతమేశ్వరకాలని, వాకర్స్, మంచిర్యాలఒక్క కాల్ చేయండి..రాత్రివేళ గ్రౌండ్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా మద్యం సేవించే వారిపై 100 డయల్కు కాల్ చేయండి ఐదు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుంటారు. జిల్లా కేంద్రంలో 24గంటలు బ్లూ కోల్ట్స్ మూడు టీములు, ఒక పెట్రో కార్ సిబ్బంది తిరుగుతున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు. – ప్రమోద్రావు, సీఐ, మంచిర్యాల -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ధర్నా
పాతమంచిర్యాల: బీఎస్ఎన్ఎల్ సంస్థను బలోపేతం చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు గురువారం స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్, ఆల్ ఇండియా బీఎన్ఎన్ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్, బీఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్, సెంట్రల్ హెడ్క్వార్టర్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ 4జీ, 5జీ సేవల విస్తరణకు అవసరమైన పెట్టుబడులు పెట్టి సంస్థను బలోపేతం చేసి వినియోగదారులకు నాణ్య మైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ట్రెజరీ వెంకటేశ్వర్లు, బ్రాంచ్ సెక్రెటరీ లింగయ్య, నాయకులు దిలీప్కుమార్, తౌపిక్ అహ్మద్, విద్యాసాగర్, సుచిత్ర, లక్ష్మీనారాయణ, లింగమూర్తి, జే.సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఒకేసారి మూన్నెల్ల రేషన్
మంచిర్యాలఅగ్రికల్చర్: వర్షాకాలం నేపథ్యంలో రేషన్కార్డుదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఆగస్టు ఒకటి నుంచి నెల రోజులపాటు లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా చేపట్టింది. ఆగస్టు నెల కోటాతోపాటు సెప్టెంబర్, అక్టోబర్ నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. ఒక్కొక్కరికి 18కిలోలు జిల్లాలో 423 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆహా రభద్రత కార్డులు 2,57,357 ఉండగా 7,60,912 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందజేస్తున్నారు. 4,806 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తుంటారు. ఈ లెక్కన మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనుండగా.. 14,500 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందే అవకాశం ఉంది. రేషన్ దుకాణాల్లో నిల్వ సమస్యగా మారనుంది. గత ఏడాది మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వ లు ఉన్నాయి. వాటితోనే ఇబ్బందులు పడుతుండగా.. గత ఎండాకాలం నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఒకేసారి పంపిణీ చేశారు. డీలర్లకు రవాణా ఖర్చులు, హమా లీ భారం తగ్గడం వంటి ప్రతికూలతలు ఉన్నా నిల్వలు భద్రపర్చడం సమస్యగా మారుతోంది. పంపిణీ చేసినకొద్దీ బియ్యం తెచ్చుకోవాలంటే హమాలీ చార్జీలు, ఇతర అదనపు ఖర్చులు భరించలేమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనున్న తిప్పలు.. వానాకాలం నేపథ్యంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలకు బియ్యం తీసుకెళ్తుండగా గతంలో వాహనాలు బురదలో కూరుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. పలు గ్రామాలు, తండాల నుంచి రేషన్ దుకాణాలకు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకేసారి పంపిణీ చేస్తే ఆటోలు, ఎడ్లబండ్లలో తీసుకెళ్లనుండగా తిప్పలు తప్పనున్నాయి. అయితే.. బయోమెట్రిక్ విధానంలో మూడు నెలల కోటా ఒకేసారి తీసుకోవాలంటే లబ్ధి దారులు ఈ–పాస్ యంత్రంపై మూడు సార్లు వేలిముద్రలు వేయాలి. ఒక్కో కార్డు పూర్తి కావడానికి పది నిమిషాల సమయం పడుతుంది. బియ్యం పంపిణీకి ఆగస్టు నెలాఖరు వరకు సమయం ఉంది. గత నాలుగు రోజులుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం రేషన్ దుకాణాలకు చేరవేస్తున్నారు. 14,500 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 470 మెట్రిక్ టన్నుల బియ్యం చేరవేశారు. మరో వారం రోజుల్లో మూడు నెల కోటా పూర్తి స్థాయిలో చేరుతుందని అధికారులు తెలిపారు.దుకాణాలు బంద్ ఉన్నాయిఈ–కేవైసీ చేసుకునేందుకు ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుంది అంటున్నారు. రేషన్ దుకాణాలకు వెళ్తున్నా గత ఐదు రోజులుగా బంద్ ఉంటున్నాయి. ఎక్కడ చేసుకోవడమో అర్థమైతలేదు. రేషన్ దుకాణాలు ఓపెన్ చేయాలి. – రజిత, మంచిర్యాలనెలాఖరులోగా చేసుకోవాలి ఈ–కేవైసీ చేసుకోని రేషన్ లబ్ధిదారులు నెలాఖరులోగా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచడం జరిగింది. రేషన్బియ్యం పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ అవకాశాన్ని రేషన్కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలి. – బ్రహ్మరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిఈ కేవైసీ 79.47 శాతం పూర్తిజిల్లాలో గతంలో ఉన్న కార్డులతోపాటు కొత్తగా అందజేసిన కార్డులతో కలిపి 2,57,357 ఉన్నాయి. 7,60,912 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటివరకు 79.49శాతం ఈ–కేవైసీ పూర్తయింది. వంద శాతం పూర్తి కాకపోవడంతో నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ప్రస్తుతం దుకాణాలు బంద్ ఉండడంతో ఈ కేవైసీ చేసుకునేందుకు అవకాశం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. త్వరలో స్మార్ట్కార్డులురాష్ట్రంలో 2005 తర్వాత నూతన రేషన్కార్డులు ముద్రించి ఇవ్వకపోవడంతో ఇప్పటివరకు ఆన్లైన్ కార్డులను వినియోగిస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల అడ్డుకట్టకు రేషన్కార్డుల స్థానంలో ప్రభుత్వం త్వరలో స్మార్ట్కార్డులు పంపిణీ చేయనుంది. 2,56,178 స్మార్ట్కార్డులు జిల్లాకు పంపిణీ చేశారు. వచ్చే నెలలో అధికారికంగా స్మార్ట్కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహుళ ప్రయోజనాలు, పూర్తి భద్రత, క్యూఆర్ కోడ్తో కూడిన కార్డులు అందజేస్తారు. కార్డు ముందు భాగంలో కుటుంబ యజమాని ఫొటో, రేషన్కార్డు నంబర్, దుకాణం నంబర్ ముద్రిస్తారు. వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచారు. ఆహార భద్రత కార్డు లబ్ధిదారులందరికీ పీవీసీ స్మార్ట్కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డుతో రాష్ట్రంలోని ఏ రేషన్ దుకాణంలోనైనా సరకులు తీసుకునేందుకు సులువుగా మారనుంది. -
‘ఎల్లంపల్లి’లో తగ్గుతున్న నీటిమట్టం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆశించిన వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం లేక ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో నీటినిల్వ తగ్గిపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి 10 టీఎంసీలు నీరు ఉండగా.. ప్రస్తుతం 7 టీఎంసీల నీరుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు 7.954 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. ఇన్ఫ్లో కింద 1,799 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 268, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు. జిల్లాలో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జన్నారం మండలంలో 11.4 మిల్లీమీటర్లు, దండేపల్లిలో 7.3, లక్సెట్టిపేటలో 3.8, హాజీపూర్లో 7.9, కాసిపేటలో 10.1, తాండూర్లో 11.8, భీమినిలో 10.6, కన్నెపల్లిలో 9, వేమనపల్లిలో 5.8, నెన్నెలలో 7.6, నస్పూర్లో 13.2, జైపూర్లో 11.3, భీమారంలో 12.2, చెన్నూర్లో 4.7, కోటపల్లిలో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 394.6 మిల్లీమీటర్లు కాగా 314 మిల్లీమీటర్లు కురిసింది. జిల్లా సగటున 20శాతం లోటు నెలకొంది. తాండూర్ అధికం, దండేపల్లిలో అత్యధిక లోటు, 4 మండలాలు సాధారణం, 12 మండలాలు 20 నుంచి 35 శాతం లోటు నెలకొంది. -
నాట్లు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి
నెన్నెల: వరినాట్లు వేసే సమయంలో రైతులు శాసీ్త్రయ పద్ధతులు అనుసరిస్తూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. గురువారం మండలంలోని గుండ్లసోమారం, మెట్పల్లి, నార్వాయిపేట, చిత్తాపూర్ గ్రామాల్లో వేస్తున్న వరినాట్లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. రైతులకు సలహాలు, సూచనలు చేశారు. శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతోపాటు అధిక దిగుబడులు, మెరుగైన నాణ్యత కలిగిన వరిపంటను పొందవచ్చని అన్నారు. నాట్లు వేసే సమయంలో నారు కొనలను తుంచివేయాలని సూచించారు. ముదురు నారు వేయకుండా 20–25 రోజుల వయస్సు కలిగిన నారును మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా కందులు, పెసళ్లు, మినుములు, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సృజన, ఏఈఓలు పాల్గొన్నారు. -
హుండీ చోరీ చేసిన యువకుడి అరెస్టు
నర్సాపూర్(జి): మండలంలోని గొల్లమాడ గ్రామంలో మహాలక్ష్మి ఆలయ హుండీ చోరీ చేసిన యువకుడిని అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుస్టేషన్ గురువారం డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి హుండీని పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పో లీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నర్సాపూర్ (జి) ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు పరిశీలించారు. గు రువారం గుండంపల్లి ఎక్స్రోడ్డు వద్ద నిందితుడు, వనపర్తి జిల్లా వీరయ్యపల్లికి చెందిన భరత్ (20) అదుపులో తీసుకున్నారు. అతడి నుంచి రూ.1.15 లక్షలు, 20 తులాల వెండి, 4 గ్రాముల బంగారు ఆ భరణాలు, చోరీకి ఉపయోగించిన ఇనుప క్రోబార్, ఒక బ్యాగు, చేతి గడియారం, బ్లూటూత్ స్పీకర్ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. కాగా, భరత్పై గతంలో వనపర్తి జిల్లా పద్ద మందడి పోలీస్స్టేషన్ పరిధిలో మరో చోరీ కేసులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. చోరీ కేసు ఛేదించిన ఎస్సై, ప్రత్యేక బృందాన్ని ఎస్పీ జానకీషర్మిల అభినందించారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచనకు పదును..ఆవిష్కరణ వైపు
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచన, సృజనాత్మకత.. సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపునకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వశాఖ (డీఎస్టీ)ఆధ్వర్యంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ) పోటీలు నిర్వహిస్తోంది. అన్ని పాఠశాలల యాజమాన్యాలకు చెందిన ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించింది. ఈ ఏడాది థీమ్ను ఐదు ఉప అంశాలుగా విభజించింది. యంగ్ మైండ్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్–సస్టైనబుల్ ప్యూచర్ అనే నినాదంతో కార్యక్రమాలు సాగనున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ బృందంలో ఇద్దరు సభ్యులు, ఒక గైడ్ టీచర్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి దోహదం చేసే పోటీలకు ఈనెల 30లోపు రిజిస్ట్రేషన్కు తుది గడువు ఉంది. అంశాలు ఇవి.. ఆహారం–వ్యవసాయం–ఆరోగ్యం, భారతీయ జ్ఞా న వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించాలి. చెత్త నిర్వహణ, శక్తి, ఇంధనం, నీటి సంరక్షణ వంటి అంశాలున్నా యి. చెత్త నిర్వహణ (ఆర్–5 వెస్ట్ మేనేజ్మెంట్) ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపు, తడి–పొడిచెత్త రీసైక్లింగ్, ఇ–వేస్ట్ నిర్వహణ, వ్యర్థాల నుంచి కంపోస్ట్ ఎరువు ల తయారీ, సౌర, పవనశక్తి వినియోగం, విద్యుత్ ఆదా చేసే పద్ధతులు, వర్షపు నీటి నిల్వ, ఉపయోగించిన నీటి పునర్వినియోగం, నీటి వనరుల ప్రక్షాళన, డ్రిప్ ఇరిగేషన్ సాంకేతికత, సేంద్రియ సాగు, చిరుధాన్యాల ప్రాముఖ్యత, పోషకాహార లోపాల నివారణ, క్రిమిసంహారక వినియోగం తగ్గించడం వంటి ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఆయురేద్వ, మూలికా వైద్య పద్ధతులు, పురాతన నీటి యాజమాన్య వ్యవస్థలు, సంప్రదాయ సాగు పద్ధతులపై ఆలోచనలకు పదును పెట్టాలి. సృజనాత్మక ఆలోచనకు అవకాశం విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించే చక్కటి అవకాశం. ప్రాజెక్టులు ముఖ్యంగా స్థానిక సమస్యలపై సర్వే, పరిశీలన, ప్రశ్నావళికే స్టడీ శాసీ్త్రయ విశ్లేషణల ఆధారంగా రూపొందించాలి. పూర్తి వివరాలకు జిల్లా అకాడమిక్ ఆఫీసర్ శ్రీమూర్తిని సంప్రదించాలి. – రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి, మంచిర్యాల ప్రాజెక్టులు రూపొందించడం ఇలా..చుట్టూపక్కల, సమాజంలో ఉన్న సమస్యను ఎంచుకోవాల్సి ఉంటుంది. సర్వే ఇంటర్వ్యూ లు, ప్రయోగాల ద్వారా సమాచారం సేకరించాలి. సేకరించినవి చార్టులు, గ్రాఫ్ రూపంలో విశ్లేషించాలి. సమస్యకు సైన్స్ ఆధారిత పరిష్కారాన్ని సూచించాల్సి ఉంటుంది. ప్రా జెక్టు పనితీరు తెలిపే లాగ్బుక్, నివేదిక త యారు చేయాలి. మొదట జిల్లా స్థాయిలో ప్రె జెంటేషన్ ఉంటుంది. ఎంపికై న ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి వెళ్తాయి. రాష్ట్రం నుంచి ఎంపికై నవి జాతీయస్థాయిలో ప్రదర్శించాల్సి ఉంటుంది. -
నాటుసారా పారబోత
పెంబి: ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు పెంబి మండలం పెంబితండా, ఇటిక్యాల్ తండా గ్రామాల్లో గురువారం ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 లీటర్ల నాటుసారా, 1100 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎన్పోర్స్మెంట్ సీఐ గంగారెడ్డి తెలి పారు. నిషేధిత గుడుంబా తయారు చేసిన విక్రయించిన చట్టపరమైన కేసులు తప్పవని హెచ్చరించారు. ఎకై ్సజ్ సీఐ నాజీర్ హుస్సేన్ భైంసా స్టేషన్, ఎస్సైలు వసంతరావు, సింధు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆకాడి సంబురం వేళ.. రైతుకు విషాదం
నార్నూర్: ఓ వైపు గ్రామస్తులంతా ఆకాడి పండుగ సంబరాల్లో మునిగితేలుతుండగా, మరోవైపు ఓ రైతు ఇంటా విషాదం నెలకొంది. సాగు పనుల్లో ఉన్న ఎద్దును పాముకాటేయడంతో మృతిచెందింది. గాదిగూడ మండలం దాబా (కే) గ్రామంలో గు రువారం ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాదిగూడ మండలం దాబా (కే) గ్రామానికి చెందిన రైతు సోయం మోతిరామ్ పొలంలో ఉన్న ఎద్దును పాముకాటేసింది. చికిత్స అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాసేపటికే మృతిచెందింది. వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్న సుమారు రూ.80 వేల విలువైన ఎద్దు మృతితో రైతుకు తీరని నష్టం మిగిల్చింది. ఆకాడి పండుగ రోజే ఈ ఘటన జరగడం గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత రైతుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆర్టీసీకి ‘స్టాఫ్’ బ్రేకులు..!
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ డిపోలో సిబ్బంది కొరత రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది. గత కొన్నేళ్లుగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టకపోవడంతో విధుల్లో ఉన్న సిబ్బందిపై పని భారం పెరుగుతోంది. కొత్త నియామకాలు లేక స ర్వీస్ అడ్జస్ట్మెంట్లు(ఓడీ) ద్వారా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. నిత్యం సిబ్బంది డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. ఉద్యోగులకు అత్యవసర వేళల్లో కూడా సెలవులు దొరకడం గగనంగా మారింది. వరుస డ్యూటీలు, నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరతతో కొన్నిసార్లు పల్లె ప్రాంతాలకు బస్సులు రద్దు చేయాల్సి వస్తుండడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. నియామకాలెప్పుడో..? మంచిర్యాల డిపోలో 148 బస్సులు ఉండగా.. అద్దె బస్సులు 69 ఉన్నాయి. బస్సులను రోజుకు 60వేల కిలోమీటర్లు తిప్పడం ద్వారా 62వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు 185మంది డ్రైవర్లు, 215మంది కండక్టర్లు విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం 208 మంది కండక్టర్లకు గాను 194 మంది ఉన్నారని, 14 మాత్రమే ఖాళీలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రెగ్యులర్ డ్రైవర్లు 151 మంది, 38మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే 21మంది కండక్టర్లు, 47మంది డ్రైవర్లు కొరత ఉన్నట్లు తెలుస్తోంది. అవుట్సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్ల నియామకాలు చేపట్టినా కండక్టర్ల ఊసే లేకుండా పోయింది. 79 ఆర్టీసీ బస్సులకు 138 మంది ఉండగా.. అద్దె బస్సులతో కలిపి 148 ఉంటే 194మంది కండక్టర్లు ఏ విధంగా సరిపోతారో అధికారులకే తెలియాలి. పదోన్నతుల లేమి.. పెరుగుతున్న ఖాళీలు గత కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్ల ఖాళీలు పెరుగుతున్నాయి. ఉద్యోగ విరమణ పొందుతున్న ఏడీసీ పోస్టుల ఖాళీలు భర్తీ చేయడం లేదు. నెల రోజుల్లో దాదాపు మరో నలుగురు ఏడీసీలు ఉద్యోగ విరమణ పొందనుండగా ఖాళీలు ఏర్పడనున్నాయి. డిపోలో విధులు నిర్వర్తించే కండక్టర్లతో సర్దుబాటు చేస్తున్నారు. కండక్టర్లను ఓడీ కింద ఉపయోగిస్తుండడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. పల్లెలకు రాకపోకలు ఆటంకం జిల్లాలో 18 మండలాల్లో 53 రూట్లలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. 148 బస్సుల్లో 69 అద్దె బస్సులు ప్రధాన రూట్లలోనే నడుస్తుంటాయి. కొన్నిసార్లు సిబ్బంది కొరతతో నిలిపి వేయాల్సి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రద్దు చేస్తున్నారు. ఉద్యోగుల సెలవు, అనారోగ్యం, ఓడీలు ఇతర కారణాలతో సిబ్బంది లేకపోవడం వల్ల పల్లె ప్రాంతాల బస్సులు రద్దవుతుంటాయి. ఆదాయం తక్కువగా ఉన్న రూట్లలోనూ తరచూ రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామీణ ప్రజల రవాణాకు అసౌకర్యం కలుగుతోంది.ఓటీతో ఇబ్బందులు..మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సు నడిపే ప్రతీ ఆర్టీసీ డ్రైవర్కు గంట తర్వాత 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఎన్ని గంటలు నడిపితే అన్ని 15నిమిషాల లెక్కన గమ్యం చేరాక విశ్రాంతి ఉండాలని చట్టం చెబుతోంది. కానీ కనీస సమయం విశ్రాంతి ఇవ్వడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఒక రోజు విధులు నిర్వర్తిస్తే మరుసటి రోజు సెలవు ఇవాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అద్దె బస్సు డ్రైవర్లకు రోజు విడిచి రోజు డ్యూటీలకు రావాలని సూచిస్తున్న ఆర్టీసీ అధికారులు సంస్థలోని వారికి మాత్రం ఓటీ డ్యూటీ చేయాలని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. డ్రైవర్ సీట్లు కూడా అనువుగా లేకపోవడంతోనూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఖాళీల భర్తీ, పదోన్నతులు కల్పించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గడువులోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 90శాతం వరకు పూర్తయిందని తెలిపారు. డిజిటలైజేషన్ తర్వాత సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని, అందులో పేర్కొన్న ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. డిజిటలైజేషన్ తర్వాత పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేస్తామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 23మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం బాలికలు బగారా రైస్, ఆలుగడ్డ కూర, సాయంత్రం సోరకాయ కూరతో భోజనం చేశారు. రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, కొందరు కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. 10గంటల ప్రాంతంలో 15మంది బాలికలను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించారు. వీరిలో 13మంది గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగా, మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మరో ఎనిమిది మంది బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గోప్యంగా ఉంచారు. సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డీఎంహెచ్వో నరేందర్రాథోడ్ వేర్వేరుగా ఆస్పత్రికి వచ్చి బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ను తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆహారంలో పురుగులు..! గత కొద్ది రోజులుగా భోజనం నాణ్యతగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రుచి, శుచి లేకుండా వడిస్తున్నట్లు తెలుస్తోంది. భోజనం నాణ్యత లేదని, పురుగులు, రాళ్లు వచ్చాయని విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఫుడ్ ఫాయిజన్ జరిగినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆహారంలో నాణ్యత లోపించిందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ డిమాండ్ చేశారు. -
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
ఇంద్రవెల్లి: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో గురువారం ఎస్సై వివరాలు వెల్లడించారు. ఇంద్రవెల్లి మండలం లాల్టెకిడి గ్రామానికి చెందిన జాదవ్ సురేందర్ విదేశాల్లో వెళ్లి ఉద్యోగం కోసం జగిత్యాల జిల్లా వాల్గొండకు చెందిన ఏజెంట్ శ్రీనివాస్గౌడ్ను సంప్రదించాడు. రూ.4.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పి అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ ప్రభాకర్ను పరిచయం చేశాడు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని సురేందర్ను నమ్మించారు. గతేడాది జూన్ 11 నుంచి విడతల వారీగా ఇద్దరికి ఫోన్ పే ద్వారా రూ.4,31,800 వేలు పంపించాడు. వేర్వేరు కారణాలు చెప్పడంతో మళ్లీ ఫోన్ పే ద్వారా రూ.2.20 లక్షలతో మొత్తం రూ.6,51,800లు చెల్లించాడు. డబ్బులు తీసుకుని విదేశాలకు పంపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని జాదవ్ సురేందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏజెంట్ శ్రీనివాస్గౌడ్, ఇస్లావత్ ప్రభాకర్ను అరెస్ట్ చేశారు. ఉట్నూర్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
సీఎంఆర్ త్వరగా పూర్తిచేయాలి
దండేపల్లి/జన్నారం: వానాకాలం, యాసంగి 2025–26కు సంబంధించిన సీఎంఆర్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వడాల రాములు రైస్మిల్ యజమానులకు సూచించారు. దండేపల్లి మండలం కన్నెపల్లి, పెద్దపేట, లింగాపూర్, జన్నారం మండలం మొర్రిగూడ గ్రామాల్లోని రైస్మిల్లను గురువారం ఆయన తనిఖీ చేశారు. మిల్లింగ్ తీరును పరిశీలించారు. దండేపల్లి, జన్నారం తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి సాదాబైనామా, భూభారతి దరఖాస్తులు, సర్ ప్రక్రియపై సమీక్షించారు. తహసీల్దార్లు రోహిత్దేశ్పాండే, బక్కయ్య, ఆర్ఐలు భూమన్న, వెంకటేష్ పాల్గొన్నారు. -
దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: జువెల్లరి దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో జువెల్లరి దుకాణాలు, మార్కెట్ ఏరియాలో భారీ బందోబస్తు మధ్య ప్రధాన చౌరస్తాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ వాహనం, బైక్లు, ప్యాసింజర్ ఆటోల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. జువెల్లరి, బంగారం దుకాణాలు, షాపింగ్మాల్స్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని, ప్రజల భద్రతలో పోలీసులు 24గంటలు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్రావు, సత్యనారాయణ, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థి ప్రతిభకు.. విజ్ఞాన మంథన్
నిర్మల్చైన్గేట్: విద్యార్థుల్లో ప్రతిభ, కొత్త ఆలోచన, ఆవిష్కరణ వెలికితీతకు కేంద్రప్రభుత్వం విజ్ఞాన మంథన్(వీవీఎం) పేరిట జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపినవారికి నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్డీ, బార్క్, డీఆర్డీఓ ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ వీవీఎంపై విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. వంద మార్కులకు పరీక్ష సెప్టెంబర్ 1 నుంచి మాక్ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఉంటుంది. ఉత్తీర్ణులకు సెకండ్ లెవెల్(ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్లైన్లో ప్రోక్టరింగ్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19న ఉంటుంది. పరీక్ష విధానంగుర్తింపు పొందిన పాఠశాలలో 6 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులంతా అర్హులే. సెప్టెంబరు 30వ తేదీలోపు హెచ్టీటీపీఎస్://వీవీఎం.ఓఆర్జీ.ఇన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా రూ.200, పాఠశాల నుంచి అయితే రూ. 170 ఫీజు చెల్లించాలి. 6, 7 తరగతుల విద్యార్థులు నవంబరు 16న, 8, 9 తరగతులకు 17న, 10, 11 చదివే వారికి 18న ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతీ విద్యార్థి తన తరగతికి కేటాయించిన రెండు తేదీల్లో ఏదో ఒకరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు ఎప్పుడైనా పరీక్ష రాయవచ్చు. తొమ్మిది ప్రాంతీయ భాషల్లో ఆసక్తిని బట్టి ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు. అవగాహన కల్పిస్తున్నాం విజ్ఞాన్ మంథన్పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వారితో దరఖాస్తు చేయించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలి. పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. – వినోద్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి, నిర్మల్ దరఖాస్తు విధానం..https://vvm.org.in వెబ్సైట్లో పాఠశాలల నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో జ రిగే ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీతో కలి పి 14 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. సె ప్టెంబర్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ, అక్టోబర్ 1న లెవల్–1 పరీక్ష ఉంటుంది. నాలుగు దశల్లో పరీక్ష1వ దశ (పాఠశాల స్థాయి): ప్రతీ అభ్యర్థికి వీవీఎం ప్రశంసాపత్రం అందిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఆన్లైన్ మెరిట్ సర్టిఫికెట్ అందజేస్తారు. 2వ దశ (జిల్లాస్థాయి): జిల్లాస్థాయిలో 6వ తరగతి–11వ తరగతి వరకు ప్రతీ తరగతి నుంచి ముగ్గురిని మొత్తం 18 మందిని ఎంపిక చేస్తారు. వారికి ఆన్లైన్ మెరిట్ సర్టిఫికెట్ అందిస్తారు. 3వ దశ (రాష్ట్రస్థాయి): జిల్లా స్థాయిలో ప్రతిభచాటిన వారికి పరీక్ష నిర్వహించి 25 మంది విద్యార్థులకు రాష్ట్రస్థాయి సర్టిఫికెట్ అందిస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. 4వ దశ (జాతీయ స్థాయి): రాష్ట్రస్థాయికి ఎంపికై నవారికి పరీక్ష నిర్వహించి ఇద్దరిని జాతీయ స్థా యికి ఎంపికచేస్తారు. తొలి మూడుస్థానాల్లో నిలి చిన విద్యార్థులకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున నగదు బహుమతితోపాటు నేషనల్ అవార్డు అందజేస్తారు. జాతీయస్థాయిలో నిలిచిన ఇద్దరికి ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున భాస్కరా స్కాలర్షిప్ అందజేస్తారు. -
జనజాగరణ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: సీపీఎస్ రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన జనజాగరణ యాత్ర పోస్టర్లను ఆ సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఆవిష్కరించారు. టీఎస్పీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల రాజేందర్ మాట్లాడుతూ జనజాగరణ యాత్ర ఈ నెల 25న మంచిర్యాల జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్కుమార్, మంచిర్యాల ఏరియా అధ్యక్షులు గోపాల్, ప్రధాన కార్యదర్శి అజయ్ ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్కుమార్, తిరుపతి, రాజేందర్, మహిళా కార్యదర్శి సునీత పాల్గొన్నారు. -
ఆలయ భూమి కేసులో ఇద్దరి అరెస్ట్
చెన్నూర్: చెన్నూర్ జగన్నాథాలయ ఆలయ భూమి కేసులో గురువారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. ఆలయ భూమిని ఆక్రమించి అందులో నాటిన మామిడి మొక్కలను తొలగిస్తున్న అధికారులపై దాడి చేసిన నూకల సతీశ్, కనుకుంట్ల వెంకటరాజంను కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. పోక్సోకేసులో ఆటోడ్రైవర్ రిమాండ్ భైంసారూరల్: భైంసారూరల్ పో లీసుస్టేషన్ పరిధి లో నమోదైన పో క్సో కేసులో ఆటోడ్రైవర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు త రలించినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. పోలీసుస్టేషన్లో గురువారం సీఐ వివరాలు వెల్లడించారు. ముధోల్ మండలం రాంటేక్ గ్రామానికి చెందిన రత్నాకర్ (26) ఆటోడ్రైవర్ భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి, లైంగికంగా వేధించాడని బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు బుధవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. నిందితుడి నుంచి సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గొర్రె చోరీ కేసులో నలుగురి అరెస్టు బెల్లంపల్లి: గొర్రె చోరీ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి వన్టౌన్ ఎస్హెచ్ఓ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. బెల్లంపల్లి బూడిదగడ్డబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ అబ్దుల్లా గొర్రెల పెంపకం చేస్తున్నాడు. అతనికి 10 మేకలు, 4 గొర్రెలు ఉన్నా యి. ఎప్పటి మాదిరిగా అబ్దుల్లా తండ్రి జానీ ఈనెల 20న సింగరేణి ఫంక్షన్హాల్ పరిసరాల్లో మేతకు మేకలు, గొర్రెలను తీసుకువెళ్లాడు. అందులో రూ.10 వేలు విలువ గల ఒక గొర్రె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కనిపించకపోవడంతో ఈనెల 21న ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్హెచ్వో.. నలుగురు ఆటోడ్రైవర్లు మంచర్ల రమేశ్, గుజ్జ తిరుపతి (చంద్రవెళ్లి), కొట్ల వినోద్కుమార్ (చాకేపల్లి), ఇడిగిరాల శంకర్ (మాల గురిజాల)ను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి గొర్రెతోపాటు మూడు ఆటోలను ఎస్హెచ్ఓ రికవరీ చేశారు. బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానా ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన సురేందర్గౌడ్ బైండోవర్ ఉల్లఘించినందుకు రూ.50 వేల జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో నరేశ్కుమార్ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సురేందర్గౌడ్ గతంలో అక్రమ మద్యం విక్రయిస్తుండగా బైండోవర్ చేయగా రెండు రోజుల కిత్రం సిరిచెల్మలో నిర్వహించిన కార్డన్సెర్చ్లో కల్తీకల్లు విక్రయిస్తుండగా మళ్లీ పట్టుబడ్డాడు. అదే తరహా నేరానికి పాల్పడిన బైండోవర్ ఉల్లంఘించినందుకు తహశీల్దార్ కార్యాలయానికి నివేదించారు. విచారణ అనంతరం సురేందర్ గౌడ్కు రూ.50 వేల జరిమానా విధించారు. అడవిపంది దాడిలో పశువుల కాపరికి గాయాలు ముధోల్: అడవిపంది దాడిలో పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కారేగాం గ్రామానికి చెందిన కోనెల ఎర్రన్న రోజుమాదిరిగా గురువారం పశువులను మేపుతూ పొలం వెళ్లాడు. మధ్యాహ్నం అడవిపంది వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా దాడి చేయగా ఎర్రన్న వీపు, కుడి తొడకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన రైతులు అందించిన సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది భీమ్రావు, శేఖర్ అక్కడికి చేరుకుని ప్రథమచికిత్స నిర్వహించారు. అనంతరం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులు
లక్ష్మణచాంద: పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్యాబోధన, మౌలిక వసతులు, నిర్వహణకు ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి. 2026–27 విద్యాసంవత్సరం సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఎంపికై న 87 సర్కారు బడులకు మొదటిదశలో 50 శాతం రూ.39,750,00 నిధులు మంజూరయ్యాయి. ఐడీ కార్డుల తయారీ, గణితం, సైన్స్ ఎక్స్టెన్సన్ తరగతుల నిర్వహణ, విహారయాత్రకు తీసుకెళ్లడం, యోగా, ఆర్ట్ అండ్ క్రాప్ట్ పార్ట్టైం టీచర్ల నియామకం, బతుకమ్మ సంబరాలు, కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ తరగతులు, కంప్యూటర్ ఇన్స్స్ట్రక్టర్ల నియామకం వంటి కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. నిధుల మంజూరుపై పాఠశాలల హెచ్ఎంలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి..పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు కేటాయించారు. 200లో పు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఏడాదికి రూ.75 వేలు, 200 కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్నత పాఠశాలకు ఏడాదికి రూ.లక్ష అందజేస్తారు. ప్రస్తుతం 50 శాతం నిధులు మంజూరయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి పీఎం శ్రీ పాఠశాలలు నిర్వహణ నిధులు 50 శాతం విడుదలయ్యాయి. నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి. ఖర్చు చేసిన ప్రతి దానికి వోచర్లు తీసుకుని ఆడిట్లో సమర్పించాలి. హెచ్ఎంలు విద్యార్థుల కోసం ఖర్చు చేసి ఇబ్బంది లేకుండా చూడాలి. – భోజన్న, డీఈవో, నిర్మల్ ఉమ్మడి జిల్లా సమాచారం జిల్లాలు పాఠశాలలు మంజూరైన 50శాతం నిధులు(రూ.లో) నిర్మల్ 20 9,25,000 ఆదిలాబాద్ 24 12,00000 మంచిర్యాల 25 10,75,000 కుమురంభీమ్ 18 7,75,000 మొత్తం 87 39,750,00 -
ప్రజాస్వామ్యంపై గౌరవం లేదా..!
మంచిర్యాలటౌన్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిన రాహుల్గాంధీకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ ప్రశ్నించారు. ప్రధాని ఇంటి ముందు ధర్నాకు నిరసనగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ చిత్రపటాన్ని దహనం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం పిరికిపంద చర్యని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానిని విమర్శించడంతో ఎంపీకి రాజకీయ పరిణతి లేదన్న విషయం తేటతెల్లమైందని తెలిపారు. గతంలో బీజేపీలో ఐదేళ్లు ఉన్నప్పుడు మోదీ విధ్వంసం కనిపించలేదా అని ప్రశ్నించారు. పార్టీ మండల అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్కుమార్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, పట్టి వెంకటకృష్ణ, పచ్చ స్వప్నరాణి, మోతె సుజాత, ప్రేమ్సింగ్, పానుగంటి మధు, వైద్య శ్రీధర్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ క్రీడాకారుడు మృతి
తాండూర్: పాము కాటు కు గురైన మండలంలోని కిష్టంపేటకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీ డాకారుడు బండి సాగర్ (30) హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వారం రోజుల క్రితం సాగర్ పాము కాటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య సాయిశ్రీ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రైలు నుంచి కిందపడి ఒకరు..మందమర్రిరూరల్: మందమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలులో నుంచి కిందపడి బిహార్కు చెందిన మణిభూషన్కుమార్ (22) మృతి చెందినట్లు రైల్వేహెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. సాగర్ రైలులో కేరళకు వెళ్తున్న మణిభూషన్కుమార్ ప్రమాదవశాత్తు కిందపడిపోగా తీవ్రగాయాలు కా వడ ంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పే ర్కొన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్ర భుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. బైండోవర్ ఉల్లంఘించిన ఒకరికి జరిమానాఆదిలాబాద్టౌన్: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ మట్కా నిర్వహిస్తూ పట్టుబడిన వ్యక్తికి రూ.15 వేల జరిమానా విధించినట్లు ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాయి సునీల్ కుమార్ గతంలో మట్కా కేసులో నిందితుడిగా ఉండటంతో బైండోవర్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ అదే తరహా నేరానికి పాల్పడినట్లు గుర్తించి అతనిపై చర్యలు చేపట్టి, నివేదికను ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. విచారణ అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ నిందితుడికి రూ.15వేల జరిమానా విధించగా, ఆ మొత్తాన్ని చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీఐ మాట్లాడుతూ బైండోవర్లో ఉన్న వ్యక్తులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాటిని ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్
నిర్మల్ఖిల్లా: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలు, ఇతర కేటగిరీల టీచర్లకు ఉపశమనం కలిగింది. చాలామంది ఇప్పటికే పరీక్షకు సిద్ధమవుతూ పుస్తకాల కొనుగోలు, శిక్షణ, స్వీయ అధ్యయనంపై దృష్టి సారించారు. ప్రత్యేక టెట్ నిర్వహించనున్నా అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. సాధారణ టెట్కు వర్తించే కనీస అర్హత మార్కులనే దీనికి వర్తింపజేస్తారు. దీంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధనకు ఉపాధ్యాయులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రత్యేక టెట్ కాబట్టి అర్హత మార్కులను కొంత సడలిస్తారని ఆశించిన కొందరు ఉపాధ్యాయులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 11 వేలకు పైగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుండగా 4 వేల మందికి పైగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. మరోవైపు పదోన్నతి కోసం కూడా పేపర్–2 పరీక్ష అర్హత సాధించాల్సి ఉంటుంది. 150 మార్కుల ప్రశ్నపత్రంలో జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాలి. పదోన్నతులకు కీలకం భవిష్యత్లో చేపట్టే పదోన్నతులు, స్కూల్ అసిస్టెంట్, తదితర ఉన్నత పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకాశం లభించనుండడంతో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. అందుకే జిల్లాలోని ఉపాధ్యాయులు దీనిని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. పేపర్–2 అర్హత సాధించడం ద్వారా ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధ్యాయుని కేడర్ను బట్టి కూడా ఈ అర్హత తప్పనిసరి చేసింది. పరీక్షల షెడ్యూల్ ఇలా.. దరఖాస్తుల స్వీకరణ: ఈనెల 22 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా సీబీటీ పరీక్షలు: సెప్టెంబర్ 7 నుంచి 11వరకు ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 28 నుంచి 30 తేదీలలో.. -
నాణ్యమైన విద్యకు కృషి
నస్పూర్: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్లోని కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపా రు. అభివృద్ధి పనులు త్వరగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, తహసిల్దార్ సంతోష్, డిప్యూటీ తహసీల్దార్ హరిత పాల్గొన్నారు. ఓసీ ప్రతిపాదిత స్థలాల పరిశీలన తాండూర్/కాసిపేట: బెల్లంపల్లి ఏరియా పరిధిలోని ప్రతిపాదిత మహావీర్ఖని ఓపెన్కాస్ట్ ప్రభావిత ప్రాంతం, కాసిపేట మండలం పెద్దనపల్లి పంచాయతీలో కేకే ఓసీ నాన్ఫారెస్ట్ ల్యాండ్ భూసేకరణ ప్రతిపాదిత ప్రాంతాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం పరిశీలించారు. ఎంవీకే–1 పాత చెక్పోస్టు నుంచి ఎంవీకే–3 గ్రామ శివారు వరకు ఉన్న ఓపెన్కాస్ట్ ప్రభావిత ప్రాంత వివరాలను సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్కుమార్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీరాంరమేష్, ప్రాజెక్టు మేనేజర్ మహేష్, మండల సర్వేయర్ రామకృష్ణ, మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, కేకే ఓసీ పీఓ రాంబాబు పాల్గొన్నారు. -
బాసరలో వరుణ యాగం
బాసర: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం వైదిక సంప్రదాయం ప్రకారం వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య గణపతి పూజతో మొదలై వరుణ జపం, హోదాది క్రతువులు, పూర్ణాహుతి, మహాశీర్వచనంతో యాగం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఆలయ ఈవో అంజనిదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, అర్చకులు శృతి మురళిశర్మ, అంకుష్శర్మ, నవీన్శర్మ, వేద పండితులు గోవింద్ శర్మ, కిషోర్ పాఠక్, శ్రీనివాస్ శర్మ, కళాధర్ శర్మ పాల్గొన్నారు. -
‘గ్రూపు రాజకీయాలు సరికాదు’
దండేపల్లి: పెద్దపల్లి ఎంపీ వంశీక్రిష్ణ మంచిర్యాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. మండలంలోని ముత్యంపేట దుర్గ గార్డెన్లో బుధవారం విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. గూడెం ఉన్నత పాఠశాలలో స్కూల్ బ్యాగుల పంపిణీపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా, ఎమ్మెల్యే దూరం పెట్టిన నాయకులను, దళిత సంఘాల్లో కొందరిని మాత్రమే కలుపుకొని కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేతోపాటు తామంతా గెలుపు కోసం పని చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు బాపు, లక్సెట్టిపేట మండల అధ్యక్షుడు రాందాస్, మాజీ మండల అధ్యక్షుడు దొంత నర్సయ్య, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల సర్పంచ్లు రాజేశ్వర్, సత్యనారాయణ, శంకరమ్మ, బానేష్, రాందాస్, రాజేష్, నాయకులు నవీన్, వెంకటేష్, రాకేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
అడవిపందిని హతమార్చిన 32 మందిపై కేసు
బెల్లంపల్లి/భీమిని: అడవి పందిని హతమార్చిన 32 మందిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి అటవీరేంజ్ అధికారి(ఎఫ్ఆర్ఓ) పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఈనెల 20న భీమిని మండలంలోని ఖర్జీ భీంపూర్లో డీఆర్వో గౌరి శంకర్, టి.గోపికృష్ణ, ఫారెస్టు బీట్ అధికారి గ్రామానికి వెళ్లి నగేష్ ఇంట్లో సోదా చేసినట్లు విచారించారు. కుక్కలు హతమార్చిన అడవిపంది మాంసాన్ని నగేష్తో పాటు గ్రామంలోని మరో 8 మంది, నార్లపూర్కు చెందిన 14 మంది, రాజారాంకు చెందిన ఆరుగురు, పైకాజీగూడకు చెందిన ముగ్గురు పోగులు వేసుకున్నారు. బుధవారం 32 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని చాలా కాలంగా విద్యాశాఖకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఫలితంగా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వంటి వివిధ కేడర్లలోని వారంతా అర్హత సాధించాల్సి ఉంటుంది. పదోన్నతులకోసం కూడా టెట్ ఉపయోగపడుతుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్ -
రైల్వే రన్నింగ్స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి
బెల్లంపల్లి: రైల్వేలో పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రెటరీ జి.సాంబశివుడు, చైర్మన్ ఎస్.నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో రన్నింగ్స్టాఫ్, ఇతర విభాగాల రైల్వే కార్మికులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే రన్నింగ్ స్టాఫ్ శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కనీసం 120 కిలోమీటర్ మైలేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సైన్ ఆన్ టు సైన్ ఆఫ్ చేసిన వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే కోశాధికారి షోకిన్ మీనా, అసిస్టెంట్ సెక్రెటరీ వివేక్కుమార్, కమిటీ సభ్యుడు లకలాల్ మీనా, లోకో పైలెట్లు, సంఘ సభ్యులు, రైల్వే కార్మికులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర
మంచిర్యాలటౌన్: నీట్ పేపర్ లీకేజీ విషయంలో చేపట్టిన ధర్నాలో విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, ప్రశ్నించిన రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలను అరెస్టు చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. రాహుల్, ప్రియాంకగాంధీల అరెస్టును నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ విద్యార్థులు ఢిల్లీలో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో లాఠీచార్జి చేయడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


