మీడియం మీడియం మీడియం
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14నుంచి నిర్వహించనున్నారు. జిల్లా నుంచి 9,703 మంది విద్యార్థులు హాజరు కానుండగా.. వీరిలో అత్యధిక శాతం మంది ఇంగ్లిషు మీడియం వారే ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు 91.6శాతం కాగా, తెలుగు మీడియం 8.0శాతం, ఉర్దూ మీడియం 0.5శాతం మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన దాదాపు పది మందిలో తొమ్మిది మంది ఇంగ్లిషు మీడియం ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఉన్నత విద్య ఇంజినీరింగ్, మెడిసిన్, టెక్నాలజీ ఎక్కువగా ఇంగ్లిషు మీడియంలో ఉండడం, ఉద్యోగ అవకాశాల్లోనూ ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత పెరగడం, సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇంగ్లిషు భాష ప్రాధాన్యం పెరుగుతున్నందున మార్పు కనిపిస్తోంది.
జిల్లాలో..
జిల్లాలో 372 ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో 9,703 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 4,896 మంది బాలురు, 4,807 మంది బాలికలు పరీక్షకు హాజరు కానున్నారు. ప్రభుత్వ, లోకల్బాడీ, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో 6,296మంది విద్యార్థులు ఉండగా, ప్రైవేటు విద్యార్థులు 3,407మంది ఉన్నారు.
మాధ్యమాల వారీగా..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యార్థులు 8,884మంది, తెలుగు మీడియం 772మంది, ఉర్దూ మీడియం 47మంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 3,385మంది, సర్కారు పాఠశాలలు, కేజీబీవీ, మోడల్స్కూల్, గురుకులాల్లో 5,499 మంది ఇంగ్లిషు మీడియం, చదువుతున్నారు. తెలుగు మీడియం ప్రైవేటులో ముగ్గురు, ప్రభుత్వ స్కూళ్లలో 769మంది ఉన్నారు. ఉర్దూ మీడియం ప్రైవేటు 20మంది, సర్కారు బడుల్లో 27మంది ఉన్నారు.
సర్కారు బడుల్లో ఇలా..
సర్కారు బడుల్లో తెలుగు మీడియం కంటే ఆంగ్ల బోధన అమలుతో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 9,703 మంది విద్యార్థుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 2,556 మంది ఉన్నారు. తెలుగు మీడియంలో 716మంది, ఉర్దూ మీడియంలో 24మంది పరీక్ష రాయనున్నారు. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా విద్యార్థులు బడిబాట పడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, ఏఐ పాఠాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాణ్యమైన విద్య, ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, పౌష్టికాహరం, ప్రైవేటులో ఫీజులు భారంగా మారడం, ఆంగ్ల బోధనతో సర్కారు బడుల్లో చేరారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు
తెలుగు ఇంగ్లిష్ ఉర్దూ మొత్తం
బాలురు 407 4479 11 4897
బాలికలు 305 4405 36 4806
మొత్తం 772 8884 47 9703


