అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికకు శ్రీకారం
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష
మంచిర్యాలఅగ్రికల్చర్/కై లాస్నగర్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అలాగే కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా హాజరుకాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మరమ్మతులు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధించి వాటి వివరాలను శాఖలు, పనిచేయిస్తున్న ఏజెన్సీల వారీగా అందజేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు గాను లబ్ధిదారుల ఎంపిక, అమలు కోసం సాంకేతికత వినియోగించుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు. అనంతరం 25 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు మంజూరు చేశారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా నోడల్ అధికారి అగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ శాఖల వారీగా ప్రణాళిక సిద్ధం చేశామని, శుక్రవారం నుంచి పారిశుద్ధ్య ప్రక్రియ ప్రాంభించామని తెలిపారు. ఈ–ఆఫీసు ద్వారా పెండింగ్ ఫైళ్లు క్లియరెన్స్ చేస్తామని, భూభారతిలో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నామని, అమృత్ పథకం పనులు త్వరగా పూర్తి చేసేలా, ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాన్ఫరెన్స్లో డీసీపీ భాస్కర్, జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాసరావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మే యర్ సల్లా రమ్య, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.


