సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాణహిత, గోదావరి నదుల పరీవాహకంలో భవిష్యత్లో కోల్బెడ్ మీథేన్ వెలికితీతకు సన్నాహాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 33 బ్లాక్ల్లో మీథేన్ వాయువు ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధం అవుతుండగా.. రాష్ట్రంలో బొగ్గు లభ్యత ఉన్న ప్రాణహిత, గోదావరి నదుల పరీవాహకంలో వెలికితీతకు రంగం సిద్ధమవుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించిన ప్రాణహిత, గోదావరి నదుల తీరాల్లోని భూ పొరల్లో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. ఇక్కడి భూమి పొరల్లో బొగ్గు నిక్షేపాలతోపాటు పలు వాయువుల మిశ్రమం ఉన్నాయి. వీటిలో వాణిజ్యపరంగా వినియోగించే మీథేన్ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా బిడ్ల్లో పాల్గొనాలని కోరింది. ఇప్పటికే దామోదర్ లోయ జార్ఖండ్, పశ్చిమబెంగాల్లో ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ పరిధిలో సింగరేణి కంపెనీని బిడ్లో పాల్గొనాలంటూ ఆహ్వానించింది. దీంతో సింగరేణి కంపెనీ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. 130 ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తిలో అపార అనుభవం ఉన్న సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణా, థర్మల్, సౌర విద్యుత్ ఉత్పత్తిలో రంగాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో సహజ వాయువును వెలికి తీసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. గత నెలలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అధికారులతో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్జ్యోతి సమావేశమై చర్చించారు. ఈ మేరకు మూడు బ్లాక్ల్లో మీథేన్ను వెలికి తీసే ప్రక్రియలో పాల్గొనేందుకు సింగరేణి కంపెనీ ఆసక్తి ఉన్నట్లు వెల్లడించారు.
కోల్బెడ్ రూపంలో..
కార్బన్, హైడ్రోజన్ అణువులతో ఏర్పడిన మీథేన్ గాలికంటే తేలికై న వాయువు. భూమి పొరల్లో కోల్బెడ్ మీథేన్(సీబీఎం) స్థితిలో అంటే బొగ్గు పొరల్లోనే మీథేన్ వాయువు నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో మొత్తం 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో కొత్తగూడెం ఏరియాలో 2 బిలియన్ క్యూబిక్ మీటర్లు, ములుగు జిల్లాల్లో కలిపి మొత్తం 12 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి బ్లాక్ పరిధిలోనే 5 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు అంచనా. గుర్తించిన చోట్ల భూమి లోపలి వరకు రంధ్రాలు చేసి నీటిని పంపిస్తూ బయటకు మీథేన్ వచ్చేలా డీ వాటరింగ్ ప్రక్రియతో చేస్తారు. బయటకు వెలువడిన ఆ వాయువును అవసరమైన పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సీఎన్జీ(కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్) కేంద్రాలకు అనుసంధానిస్తూ వాడకంలోకి తెస్తారు. సహజ వాయువుగా పిలిచే మీథేన్ను దేశ అవసరాల్లో వినియోగం పెంచాలనే లక్ష్యంగా ఉంది. దేశంలో పలు పరిశ్రమల్లో అమ్మోనియా వంటి రసాయనాల తయారీలో మీథేన్ ముడిసరుకుగా వాడుతున్నారు. ఇంధనం గానూ, విద్యుత్ ఉత్పత్తిలోనూ ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం సింగరేణిలో కొత్తగా బొగ్గు గనులు లేక కంపెనీ ప్రాభవం కోల్పోతున్న తరుణంలో సహజ వాయువు ఉత్పత్తితో సంస్థ మనుగడ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. కొత్తగా మీథేన్ వాయువు వెలికితీత మొదలైతే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. సింగరేణి ఆధ్వర్యంలో మీథేన్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు విజయవంతమైతే స్థానికంగా కంపెనీ పురోగతి చెందనుంది.
విజయవంతమైతే
ఉపాధిపై ఆశలు
బొగ్గు గనిలో కార్మికులు(ఫైల్)


