లక్సెట్టిపేట: పోటీ పరీక్షలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ సెకండరీ బాలికల పాఠశాలలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టు పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ప్రతిభను పెంపొందించుకోవాలని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి పరీక్షల్లో పాల్గొనడం ద్వారా జ్ఞానం పెరుగుతుందన్నారు. ఈ టాలెంట్ టెస్ట్లో మండలంలోని తొమ్మిది పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రథమ బహుమతి ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన రిషిక, రెండో బహుమతి ట్రినిటి హైస్కూల్ లక్ష్మీప్రసన్న, మూడో బహుమతి ఆర్కేస్ ప్రైవేట్ పాఠశాల దీర తీరి అందుకున్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, కారుకురి సురేందర్, చెల్ల గణేష్, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సిబ్బంది, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


