చెన్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించి క్యాతనపల్లి చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంగళవారం కేసు సందర్భంగా చెన్నూర్ కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ తల్లి, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ స్వయంగా డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. మంత్రి తీరును నిరసిస్తూ శాంతియుతంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన తమపై చెన్నూర్లో అక్రమ కేసు బనాయించారని తెలిపారు. చెన్నూర్ మున్సిపాలిటీలో 11 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే ప్రజాతీర్పును గౌరవించామని తెలిపారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ మెజార్టీ స్థానాలు గెలిచినా కాంగ్రెస్ ఎన్నికలను అడ్డుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే రాళ్ల దాడి చేసి తమపై కేసులు పెట్టించి 16 రోజులు జైల్లో ఉంచారని తెలిపారు. కేసులు తనకు కొత్త కాదని, వారసత్వపు రాజకీయాల నుంచి రాలేదని, ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో 200కు పైగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దామోదర్రెడ్డి, విద్యాసాగర్, మోతె తిరుపతి, రెవెల్లి మహేశ్, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


