మంచిర్యాలఅర్బన్/బెల్లంపల్లి: విద్యార్థులు ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్నికోలస్, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా అన్నారు. సోమవారం విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు బెల్లంపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం టీ–శాట్ చానల్ ద్వారా మోటివేషన్, గైడెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఎఫ్పీ స్క్రీన్ ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి నిపుణుల సూచనలు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలపై భయాన్ని విద్యార్థులు విడనాడాలని తెలిపారు. స్వేచ్ఛగా పరీక్ష రాయాలని, పరీక్షల మధ్య ఉన్న విరామ సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు. పునశ్చరణకు వినియోగించుకోవడం వల్ల ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రశాంతమైన మనస్సుతో విద్యార్థులు పరీక్ష రాయడం వల్ల ఉత్తమ మార్కులు సాధించడానికి వీలవుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బెల్లంపల్లిలో మండల విద్యాధికారి జాడి పోచయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


