మంచిర్యాలటౌన్: జిల్లాలోని చెరువుల పునరుజ్జీవ మే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాముని చెరువు, నస్పూర్లోని చెరువు పునరుజ్జీవ పనులకు ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి శంకుస్థాపన చేశా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువు, నస్పూరు పరిధిలోని చెరువుల పునరుజ్జీవ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నగరం, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతులు కల్పించేలా పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని, అధికారులు సైతం ప్రజలను సమస్యలపై అడిగి తెలుసుకుని, పరిష్కారం దిశగా పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాలలో చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్ పథకం ద్వారా రూ.3.14 కోట్లతో చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ఇప్పటికే రోడ్డువెడల్పు పనులు పూర్తి కాగా రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోనున్నాయన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి, కమిషనర్ విజయ్కుమార్, తహసీల్దార్ దిలీప్కుమార్ పాల్గొన్నారు.


