‘విరుగుడు లేని విషం’పై రాష్ట్ర సర్కారు ఆంక్షలు ఏఈవో రాసిస్తేనే ‘పారాక్వాట్’ కొనుగోలుకు అనుమతి గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్న జిల్లా వైద్యులు ఆత్మహత్య ఘటనల్లో చికిత్సకు లొంగని మందు నిషేధానికి డిమాండ్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత రెండేళ్లుగా ప్రా ణాంతక గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్పై జిల్లా వైద్యులు చేస్తున్న పోరాటానికి తొలి ఫలితం దక్కింది. ఆత్మహత్య ఘటనల్లో మరణానికి కారణమవుతున్న విరుగుడు లేని, చికిత్సకు లొంగని విషం కలుపు మందుపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక నుంచి విరివిగా కొనుగోళ్లు లేకుండా.. అవసరమైతేనే కొనుగోలు చేసేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు ఎవరికై నా గడ్డి మందు అవసరమైతే కచ్చితంగా స్థానిక వ్యవసాయ అధికారి ఆ రైతు పంటను సందర్శించాలి. పిచికారీ చేయాలని అవసరమని భావించి ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మందుల దుకాణాల్లో కొనుగోలు చేసే వీలుంటుంది. విక్రయదారులు సైతం ఏఈవో ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గడ్డి మందు విక్రయించినప్పుడు ఎవరు కొన్నారో వారి వివరాలు సైతం పొందుపర్చాల్సి ఉంటుంది.
కలుపు కంటే ఆత్మహత్యలతో ప్రాణనష్టం
గడ్డి మందు పత్తి చేన్లు, పొలం గట్లు, ఇతర చోట్ల కలుపు మొక్కల నివారణకు ఇబ్బడిముబ్బడిగా వాడుతున్నారు. సాగునీరు లేక అధికంగా వర్షాధార పత్తి సాగు చేస్తున్నారు. చేను మొలక దశలో ఉన్నప్పుడు కూలీల కొరత తీరుతుందని నేరుగా గడ్డిపై పిచికారీ చేస్తే మాడిపోయి ఎండిపోతుంది. అయితే ఆత్మహత్య ఘటనల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్షణికావేశంతో ఈ గడ్డిమందు తాగిన వారు ఉంటున్నారు. కొద్దిమొత్తంలో తాగినా పెదవుల నుంచి గొంతు, శ్వాస, జీర్ణవ్యవస్థ, కిడ్నీలు దెబ్బతిని రోజుల వ్యవధిలోనే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అత్యవసర సేవల్లో సైతం విరుగుడు లేని విషంగా వైద్యుల చికిత్సకు లొంగకుండా పోతోంది. వీటిని ప్రత్యక్షంగా చూసి చలించిన మంచిర్యాలకు చెందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ రాకేశ్ చెన్న, ఖమ్మంకు చెందిన ఎమర్జెన్సీ కేర్ డాక్టర్ సతీశ్, కరీంనగర్కు చెందిన మత్తు డాక్టర్ సతీశ్తోపాటు పలువురు వైద్యులు గడ్డిమందుపై నిషేధం విధించాలని పోరాటం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి విన్నవించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్బాబు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. పారాక్వాట్కు వ్యతిరేకంగా వైద్యులతో ఓ సంఘాన్ని రిజిష్టర్ చేసి విస్తృతంగా పోరాటం చేస్తున్నారు.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పారాక్వాట్ కేసుల వివరాలు
తగ్గనున్న మరణాలు
ఆత్మహత్య కేసుల్లో గడ్డి మందు కారణంగానే మ రణాలు అధికంగా సంభవిస్తున్నాయి. గత మూ డేళ్లలో మంచిర్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రికి 83 మంది గడ్డిమందు తాగి అత్యవసర చికిత్సకు రాగా వీరిలో 27మంది చనిపోయారు. ఇంకా మె రుగైన వైద్యం కోసం 56మందిని ఇతర ప్రాంతా లకు తరలించారు. ఇంకా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది. ఇ దంతా రికార్డుల్లో నమోదు కావడం లేదు. ప్రైవేటులోనూ చాలామంది గడ్డిమందు తాగి చనిపోతున్నారు. వీరిలో 40ఏళ్లలోపు వారే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేటు వైద్యులు మొదలుపెట్టిన ఈ పోరాటంతో చాలావరకు మరణాలు తగ్గే అవకాశం ఉంది. కలుపు మందు వాడకం ఆగితే లభ్యత తగ్గి ఆత్మహత్యలు నియంత్రణ కానున్నాయి.


