మంచిర్యాలటౌన్: దివ్యాంగులకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఉపకరణాలను పంపిణీ చేసేందుకు అర్హులైన వారి నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. శారీరక వైకల్యంతో కొందరు సొంతంగా నడవలేని వారు ట్రై సైకిళ్లపై కూర్చుని ఎక్కడికై నా ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా, చేతులు, కాళ్లు లేని వారి కోసం బ్యాటరీతో నడిచే వీల్చైర్లను అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగులు ఆర్థికంగా ఎదిగేందుకు సొంతంగా ఉపాధి పొందాలనుకునే వారికి సైతం పెట్రోలు ఖర్చు లేకుండా బ్యాటరీతో నడిచే మొబైల్ బిజినెస్ ట్రైసైకిళ్లు, మినీ ట్రేడింగ్ ఆటోలు, డిగ్రీ విద్యార్థులు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారికి అవసరమైన ల్యాప్టాప్లను దివ్యాంగుల సంక్షేమ శాఖ, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాకు చేరుతున్న ఉపకరణాలు
ఉపకరణాలకోసం ఇప్పటికే పలువురు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు 45 స్కూటీలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 మాత్రమే వచ్చాయి. మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు 18, ల్యాప్టాప్లు 14 జిల్లాకు చేరుకున్నాయి. బ్యాటరీ వీల్చైర్లు 14, హైబ్రిడ్ అటాచ్మెంట్ వీల్చైర్లు 5, రెండు 5జి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు 12 రావాల్సి ఉంది. ప్రస్తుతం వచ్చిన స్కూటీలు, ట్రైసైకిళ్లను సమీకృత కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. మిగతా ఉపకరణాలు వచ్చేంత వరకు వేచి ఉండకుండా వచ్చిన వాటిని అర్హులైన వారికి పంపిణీ చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు.
జిల్లాకు కేటాయించిన ఉపకరణాలు
స్కూటీలు 45
మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు 18
బ్యాటరీ వీల్చైర్లు 14
హైబ్రిడ్ అటాచ్మెంట్ వీల్చైర్లు 5
బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో 1
ల్యాప్టాప్ (డిగ్రీ విద్యార్థులు) 7
ల్యాప్టాప్ (హయ్యర్ టెక్నికల్ విద్య) 7
ట్యాబ్లు 12
5జీ స్మార్ట్ ఫోన్లు 2


