మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. గత నెల 25న ప్రారంభం కాగా.. శుక్రవారం చివరి పరీక్షకు హాజరయ్యారు. చివరి రోజు 5,429మందికి గాను 5,273మంది హాజరు కాగా, 156మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 4,811మందికి గాను 4,704మంది హాజరు కాగా 107మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 618 మందికి 569 మంది హాజరు కాగా 49 మంది రాలేదు. ఇంటర్ పరీక్షలు సజావుగా ముగిసినట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. 14న ఫిజికల్ సైన్స్ ఫస్టియర్, 16న ఫిజికల్ సైన్స్ సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. శుక్రవారం పరీక్షలు పూర్తి కాగానే కేంద్రాల విద్యార్థులు కేరింతలు కొట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు దిగారు. మళ్లీ ఎప్పుడు కలుస్తామోనని కాసేపు కబుర్లలో మునిగితేలారు. పరీక్షలన్నీ పూర్తి కావడంతో విద్యార్థులు హాస్టళ్ల నుంచి స్వగ్రామాలకు తరలివెళ్లారు. ఇంతకాలం కుటుంబసభ్యుల మాదిరిగా కలిసి ఉన్న హాస్టల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విడిచి వెళ్లాల్సి రావడంతో కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులతో బస్స్టేషన్లు కోలాహలంగా మారాయి.


