వేమనపల్లి: మండలంలోని సుంపుటం, జాజులపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి వేమనపల్లి ప్రాణహిత తీరంతో పాటు అటవీ ప్రాంతంలో తోడేళ్ల సంచారం పెరిగింది. దీంతో గొల్ల కుర్మలు మేకలు, గొర్రెలు మేపేందుకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే 6 మేకలపై తోడేళ్లు దాడి చేసి హతమార్చాయి. మండలంలోని రాజారం, ఒడ్డుగూడెం, దస్నాపూర్ అటవీ శివారు ప్రాంతం వెంట తోడేళ్ల మంద తిరుగుతూ మేతకు వెళ్లిన మూగజీవాలను చంపేస్తున్నాయి. నాలుగు తోడేళ్లు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాణహితనది దాటి పత్తి చేలల్లోకి వచ్చినట్లు రైతులు, గొల్ల కుర్మలు పేర్కొంటున్నారు. చల్ల గట్టు, చంద్రయ్యకు చెందిన మేకలను పత్తి చేలల్లోనే చంపేశాయి. సబ్ స్టేషన్ సమీపంలో మేకపై దాడి చేసి కళేబరాన్ని చెట్టు కొమ్మల్లో దాచాయి. తోడేళ్ళు చెట్టు ఎక్కలేవు.. కానీ చెట్టుపై మాంసం అవశేషాలు పెట్టింది చిరుతపులా? లేక ఎవరైనా కావాలని దాచారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వన్య మృగాల దాడిలో మృత్యువాత పడుతున్న మేకలు, గొర్రెలకు పరిహారం ఇప్పించాలని గొల్లకుర్మలు కోరుతున్నారు.


