మంచిర్యాలఅర్బన్: స్వల్పకాలిక కోర్సులు నైపుణ్యాలను అందించి మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశాలను పెంచుతాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ(ఐటీఐ, ఏటీసీ)లో ఏర్పాటు చేసి షార్ట్ టర్మ్ కోర్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు విద్యార్థులతో మాట్లాడుతూ విద్యతోపాటు వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నూతన భవనం నిర్మాణానికి చర్యలు చేపడుతామని అన్నారు. రాపల్లి ప్రాంతంలో రూ.6కోట్లతో అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్ అభ్యర్థుల కోసం కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 100 మంది అభ్యర్థులకు వసతి కల్పించి మూడు నెలల కోర్సు అందిస్తామని తెలిపారు. మంచిర్యాల ప్రాంతంలో ఐటీ పార్క్ మంజూరైందని, పనులు వేగవంతం చేసి స్థానిక నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ పాల్గొన్నారు.


