బాసర: ఆర్జీయూకేటీ బాసర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని బుధవారం ‘లైఫ్ అండ్ కెరియర్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అమెరికా, యూకేలోని ప్రముఖ కంపెనీల మాజీ సీఈవో హెచ్.టి.చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ వైపు మళ్లాలని, కేవలం సీనియర్ల నుంచి మాత్రమే కాకుండా జూనియర్లు, స్నేహితుల నుంచి కూడా నేర్చుకోవాలని సూచించారు. ప్రతీ విద్యార్థి డైరీ రాసే అలవాటు చేసుకోవాలన్నారు. డ్రగ్స్, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండి, కేవలం చదువు, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలన్నారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. అన్నింటికంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీ దర్శన్, డాక్టర్ టి.నాగ సాయికుమార్, అసోసియేట్ డీన్ (ఇంజనీరింగ్) మహేశ్, విఠల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


