breaking news
Rajanna Sircilla District News
-
మహాజాతరను విజయవంతం చేయాలి
● జాతర ఏర్పాట్లపై సమీక్ష వేములవాడ: రాజన్న క్షేత్రంలో ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. జాతర మహోత్సవాలపై ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ రుత్విక్సాయి, ఈఈ రాజేశ్ బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, పార్కింగ్ స్థలాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఇతర అధికారులు ఉన్నారు. -
యూరియా ఏదయా
● అవసరాన అన్నదాతకు ఇదేం అవస్థ ● యాప్లో జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వ సున్నా ● ఏవోల నిర్లక్ష్యం.. పడకేసిన పర్యవేక్షణకరీంనగర్ అర్బన్: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. యూరియా అక్రమ రవాణాకు చెక్ పెడుతూ ప్రభుత్వం యాప్ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1నుంచి సదరు విధానం అమలవుతుండగా తదనుగుణ పర్యవేక్షణ లేమి రైతులకు గుదిబండగా మారింది. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని చెబుతున్నా వ్యవసాయ శాఖ అసలు యూరియా నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత అవసరమనే కోణంలో ప్రణాళిక లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అత్యవసర వేళ ఇదేం కొరత యాసంగి సీజన్కు గానూ జిల్లాలో 2,59,065 ఎకరాల్లో వరి సాగవగా, 29,396 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అన్ని పంటలు కలిపి 2,89,017 ఎకరాలు సాగులో ఉంది. ఈ సమయంలో వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ రైతులు మాత్రం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరగడం, పడిగాపులు కాయడం ఆందోళనకర పరిణామం. ఆయా పంటలకు మూడు దశల్లో అంటే విడతల వారీగా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఎకరానికి ఒక బస్తా మాత్రమే బుక్ కానుంది. జిల్లావ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రంతో పాటు 16 మండలాలుండగా ఎక్కడా కూడా యూరియా బస్తా ఒక్కటి లేదని యాప్ స్పష్టం చేస్తోంది. అవసరమైన సమయంలో యూరియా వేస్తేనే పంటకు బలం కాగా దిగుబడి రానుంది. ఎన్నికల విధుల్లో ఏవోలు.. ఇండెంట్ పెట్టేదెవరు వాస్తవానికి యూరియా నిల్వలను అనుసరించి ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టడం మండల వ్యవసాయ అధికారుల విధి. జిల్లాలో మాత్రం ఏ ఒక్క ఏవో కూడ తదనుగుణంగా విధులు నిర్వహించడం లేదనడానికి యాపే తార్కాణం. పలువురు ఏవోలు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తుండగా విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు పుష్కలం. మున్సిపల్ ఎన్నికల్లో విధులు కేటాయించగా యూరియా నిల్వలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు షరామామూలే. యూరియా పక్కదారి? యూరియా పక్కదారి పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ సర్వే నంబర్లో ఏ పంట సాగు చేశారనేది యాప్లో నమోదు కాలేదు. క్రాప్ బుకింగ్ వివరాలు నమోదుకాకపోవడంతో అక్రమార్కులు సాగులో లేని భూముల వివరాలతో యూరియా బుక్ చేస్తూ వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది. సాగులో లేని భూములు వేల ఎకరాలుండగా భవనాలు, రోడ్లు, ప్లాట్లు, దేవాలయాలు ఇతర నిర్మాణాలు ఉన్నా భూములూ ఉండగా యాప్పై అవగాహన ఉన్న అక్రమార్కులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
కంటిపాపను కాపాడండి
కరీంనగర్: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ వచ్చిందని సంబురపడ్డారు. కూలి చేస్తేనే కడుపునిండే కుటుంబం అయినా తమ కూతురు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ అంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. వెంటనే వైద్యం అందిస్తేనే బతికే పరిస్థితులు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు కావడంతో తమ కూతురు వైద్యానికి దాతలు సాయం చేసి ఆదుకోవాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన రౌతు సంపత్–రాజేశ్వరీ దంపతులకు శ్రేయన్షి సంతానం. ఏడాదిన్నర వయస్సున్న శ్రేయన్షి తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితికి చేరింది. హార్ట్ సమస్యతోపాటు బ్లడ్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కు సోకడంతో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి చికిత్సకు రూ.5లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. కూలి పని చేసే కుటుంబం కావడంతో ఇంత భారీ మొత్తాన్ని భరించే స్థోమత లేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే బంధువులు, పరిచయస్తుల వద్ద రూ.లక్ష వరకు అప్పు తెచ్చి చికిత్స అందిస్తున్నారు. మిగతా డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దాతలు చేసే సహాయం తమ కూతురి ప్రాణానిన నిలబెడుతుందని ఆ నిరుపేద తల్లిదండ్రులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు ఫోన్పే లేదా గూగుల్పే 91603 89464, 99120 20718లో ఆర్థిక సహాయం చేయాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆదుకోవాలని తల్లిదండ్రుల విన్నపం ప్రాణాపాయ స్థితిలో చిన్నారి -
నా కొడుకును స్వగ్రామానికి రప్పించండి
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధి కోసం సౌదీఅరేబియాకు వెళ్లి ఏజెంట్ మోసంతో అక్కడి జైలులో మగ్గుతున్న తన కొడుకు కమటం వెంకటేశంను విడిపించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లికి చెందిన కాంతవ్వ ఎస్పీ మహేశ్ బీ గీతేను కోరింది. బూర్గుపల్లికి చెందిన వెంకటేశ్కు ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ నమ్మబలికి సౌదీఅరేబియాకు పంపాడని తెలిపింది. పక్కా పని చూపకుండా రహస్యంగా చేసే పని చూపడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేశారని కాంతవ్వ వాపోయింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్తోపాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందించినట్లు తెలిపింది. ఈక్రమంలో బక్కి వెంకటయ్య రాసిన లేఖను ఎస్పీకి అందచేశామంది. ఏజెంట్ శేఖర్తోపాటు అతనికి సహకరిస్తున్న పెద్ద మనుషులపై చర్యలు తీసుకోవాలని కాంతవ్వ కోరింది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తడగొండ సత్యరాజ్వర్మ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు తడగొండ నర్సింగ్బాబు ఉన్నారు. -
చిన్నారి ప్రాణాలతో చెలగాటం
● ఊపిరాడకుండ గుడ్డపేగులో చుట్టి యాచన ● వేములవాడలో పట్టుకున్న అధికారులు ● పోలీసులకు ఫిర్యాదు వేములవాడ: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో మూడు నెలల పసికందును గుడ్డలో చుట్టి భక్తుల వద్ద డబ్బులు యాచిస్తున్న ఓ మహిళను వేములవాడలో అధికారులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత వృద్ధులను సంక్షేమ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళ తన భుజాన ఓ గుడ్డను వేసుకొని యాచిస్తుండడం గమనించారు. ఆమె వద్దకు వెళ్లి చూడగా ఆ గడ్డులో చిన్నారి ఉండడంతో అవాక్కయ్యారు. వేములవాడ శివారులోని తిప్పాపూర్ ఎల్ల మ్మగుడి వద్ద గుడారాలు వేసుకొని ఉన్న సారవ్వ అనే మహిళ మూడు నెలల క్రితం ఆడ కూతురికి జన్మనిచ్చింది. ఆ మూడు నెలల పాపను పట్టుకొని రాజన్న ఆలయ పరిసరాల్లో భక్తుల వద్ద యాచిస్తోంది. గుడ్డ పేగులో పసిపాపను చుట్టి యాచిస్తున్న తీరు గమనించిన అధికారులు ఆమెను విచారించారు. మూడు నెలల పాపను ఊపిరి ఆడకుండా గుడ్డలో చుట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమైపె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఇలాంటి వారు అనేక మంది అడుక్కోవడమే వృత్తిగా బతుకుతున్నారు. ఇప్పటికే చాలా మందిలో మార్పు తీసుకొచ్చిన అధికారులకు వీరిలో మార్పు తీసుకురావడం సాధ్యం కావడం లేదు. గుడికి కాపలా..ఇల్లంతకుంట: అవును మీరు చదివింది నిజమే. ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలో ముది రాజ్ కులస్తులు తమ కులదైవం పెద్దమ్మ ఆలయం వద్ద మంగళవారం రాత్రి కాపలా కాశారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లోని పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుండడంతో కులస్తులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. -
శోకసంద్రం మధ్య ముగ్గురు కూలీల అంత్యక్రియలు
బోరున విలపిస్తున్న మంగళారపు లలిత భర్త, కూతుళ్లు, కుమారుడు విలపిస్తున్న రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటలో ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందిన మంగళారపు లలిత, పెద్దిరెడ్డి గంగు, సంపంగి సాయమ్మ, రొడ్డ వైష్ణవికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మంగళారపు లలిత మృతదేహం వద్ద భర్త ధర్మరాజు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు బోరున విలపించారు. పిల్లలకు అమ్మ లేని లోటును ఎలా తీర్చాలి అంటూ.. ధర్మరాజు కన్నీటి పర్యంతమయ్యారు. గంగు మృతదేహం వద్ద కొడుకు, కూతుళ్లు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రొడ్డ వైష్ణవి తల్లిదండ్రులు పోశయ్య, అనిత, అక్కాచెల్లెల్లు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అశ్రునయనాల మధ్య ఈ ముగ్గురికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సంపంగి సాయమ్మ భర్త ఎల్లయ్య దుబాయ్ నుంచి బయల్దేరాడు. ఆయన రాగానే ఆమెకు అంత్యక్రియలు చేయనున్నట్లు సమాచారం. నిందితుడిపై కేసు నమోదు ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడిపి నలుగురు కూలీల మృతికి కారణమైన డ్రైవర్ ఎర్రంశెట్టి గంగాధర్పై సంపంగి లక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి సీఐ అనిల్కుమార్ తెలిపారు. దుబాయ్ నుంచి బయలుదేరిన సంపంగి సాయమ్మ భర్త ఆయన వచ్చాకే అంత్యక్రియలు చేసే అవకాశం -
పాఠశాలలో మద్యం కలకలం
● జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘటన చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఓ జిల్లాపరిషత్ పాఠశాలలో కొందరు విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగిన సంఘటన చర్చనీయాంశమైంది. 8వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఈనెల 3న భోజన విరామ సమయంలో బయటకు వెళ్లి ఒక మద్యం బాటిల్, కూల్డ్రింక్ తెచ్చుకుని పాఠశాలలోనే సేవించినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాల హెచ్ఎం బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జరిగిన సంఘటనపై చర్చించారు. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయులు వారి కదలికలను ఎందుకు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేయాలని సర్పంచ్ సూచించారు. పాఠశాల సమీపంలోనే కొందరు బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారని, వాటిని మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై హెచ్ఎంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. వరకట్నం వేధింపులకు వివాహిత బలిబోయినపల్లి(చొప్పదండి): ఇద్దరు కుమారులు పుట్టాక భర్త పెట్టే అదనపు కట్నం వేధింపులు భరించలేక బోయినపల్లికి చెందిన దొంతరవేణి నర్మద(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎన్.రమాకాంత్ తెలి పారు. బోయినపల్లికి చెందిన నర్మదకు ఐదేళ్ల క్రితం మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన దొంతరవేణి నరేశ్తో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లయిన ఏడాది తర్వాత అదనంగా రూ.2లక్షలు కట్నం తీసుకురావాలని నర్మదను భర్త వేధించేవాడు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని భార్య పిల్లలను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్తానంటే నరేశ్ మామ ఊరుమడ్ల రాజయ్య డబ్బులు వెచ్చించి పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సైతం నరేశ్ వైఖరిలో మార్పు రాకపోగా.. ఫోన్లో భార్యను కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. తీవ్ర మానసిక వేదనకు గురైన నర్మద మంగళవారం బోయినపల్లిలోని తన తల్లిగారింట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నర్మద తండ్రి ఊరుమడ్ల రాజయ్య ఫిర్యాదుతో దొంతరవేణి నరేశ్పై కేసు నమోదు చేశారు. దరఖాస్తులు ఆహ్వానంవిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు డిప్లొమా అప్రెంటిషిప్ కోసం అర్హతున్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ రీజియన్ మేనేజర్ బి.రాజు తెలిపారు. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్ధులు ఈనెల 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పరిహారం కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
మల్లాపూర్ : కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా.. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో మృత్యువాత పడిన నలుగురి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ మండలంలోని మొగిలిపేటలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మెట్పల్లి –ఖానాపూర్ రహదారిపై ధర్నా చేశారు. పసుపు ఏరడానికి కూలీలను తీసుకెళ్లిన ఎర్రంశెట్టి గంగా ధర్ నిర్లక్ష్యంతోనే ట్రాక్టర్ అదుపుతప్పిందన్నారు. లలిత, గంగు, సాయమ్మ, వైష్ణవి కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల ఎస్సైలు అనిల్, కిరణ్, చిరంజీవి మొగిలిపేటకు చేరుకొని పోలీసులు గంగాధర్ కుటుంబసభ్యులతో మాట్లాడి మృతుల కుటుంబాకు రూ.6.50లక్షల చొప్పున పరిహారంతోపాటు రూ.15వేల చొప్పున దహనసంస్కారాలకు ఇచ్చేందుకు ఒప్పించారు. తక్షణ పరిహారంగా రూ.50వేలు అందించడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మద్యం తాగొద్దని తల్లి హితవు చెప్పినా వినకుండా పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీ రాజీవ్ నగర్ తండాకు చెందిన గుగులోతు రవి నాయక్(28) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రవినాయక్ తండ్రి అనారోగ్యంతో ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లితో కలిసి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతున్నాడు. అయితే, మద్యం తాగద్దని తల్లి చేప్పినా వినలేదు. మద్యం తాగినప్పుడు మతిస్థిమితం కోల్పోయినట్లు వ్యవహరించేవాడు. ఈక్రమంలో ఈనెల 3న మద్యం తాగివచ్చి తల్లితో గొడవపడ్డాడు. ఆ తర్వాత తల్లి తనకూతురు ఇంటికి వెళ్లగా.. మనస్తాపం చెందిన రవినాయక్ ఇంట్లోని ఇనుపరాడ్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు సీఐ ప్రసాద్రావు తెలిపారు. ● కల్వచర్లలో యువకుడి ఆత్మహత్య రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పంచాయతీ పరిధి గోకుల్నగర్కు చెందిన బాదం రవికిరణ్(21) గడ్డిమందు తాగి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. రవికిరణ్ కొద్దిరోజులుగా ఉపాధి లేదని బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపం చెంది మంగళవారం గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్కు ఆ తర్వాత హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన శనిగారపు బుచ్చిరాజు (60) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డినట్లు పోలీసులు తెలి పారు. వారి కథనం ప్రకారం.. బుచ్చిరాజుకు కొన్నాళ్లుగా మతిస్థిమితం సరిగా ఉడడం లేదు. కుటుంబసభ్యులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుచ్చిరాజు భర్త లింగన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. కోదండ రామాలయంలో చోరీజగిత్యాలరూరల్: జగిత్యాల శివారు ధరూర్ క్యాంప్లో.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీకోదండరామాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎప్పటిలాగే పురోహితులు గుడికి తాళం వేసి వెళ్లారు. ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాతోపాటు, దేవతలపై ఉన్న పావుకిలో వెండి ఆభరణాలు, 10 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ పూజారి జగన్మోహనాచారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
జల్సాల కోసం దొంగతనాలు
పాలకుర్తి(రామగుండం): జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడు. బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో ఇటీవల జరిగిన చోరీకేసులో అరెస్ట్ చేయడంతో నిందితుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ బసంత్నగర్ ఠాణాలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ రాంనగర్లో నివాసం ఉండే సాయి జల్సాలకు అలవాటుపడ్డాడు. దొంగతనాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఇనుపరాడు సాయంతో తాళాలు పగులగొట్టడంలో నేర్పరి. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు చేస్తున్నాడు. పదేళ్లలో పలు చోరీలు చేయగా 13కుపైగా కేసులు నమోదయ్యాయి. గతనెల 28న రాత్రి బసంత్నగర్ శ్రీకోదండ రామాలయంలో వెండి కిరీటాలు, వెండి హస్తాలు, వెండి కళ్లు, నామాలతో కూడిన సీతమ్మ పుస్తెలు చోరీకి గురయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్రీధర్.. క్లూస్టీం సాయంతో వేలిముద్రలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. పాత నేరస్తుడు సాయిపై నిఘా ఉంచారు. తాను చోరీచేసిన వస్తువులు విక్రయించేందుకు వెళ్తున్నాడనే పక్కా సమాచారంతో ధర్మారం క్రాస్రోడ్డు వద్ద నిఘావేసి అదుపులోకి తీసుకున్నారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం రిమాండ్కు తరలించనున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై శ్రీధర్తోపాటు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శరత్, క్లూస్టీం కానిస్టేబుల్ రాజేశ్ను ఏసీపీ అభినందించారు. నగదు పారితోషికం అందజేశారు. తాళం వేసిన ఇళ్లు, ఆలయాలు లక్ష్యంగా చోరీలు నిందితుడిని అరెస్ట్ చేసిన బసంత్నగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ -
మున్సిపాలిటీలు అప్పగిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా
సిరిసిల్ల/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో బుధవారం నిర్వహించిన స్ట్రీట్కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. కేసీఆర్ కొడుకు మాకు భయపడి సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10వేలు ఇస్తున్నాడట.. ఆ డబ్బులు తీసుకొని.. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని కోరారు. మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్కు అప్పగిస్తే వానొస్తే గల్లీలు మునిగిపోతున్నాయన్నారు. కలెక్టరేట్కు పడవలు, ట్రాక్టర్లలో పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వస్త్రపరిశ్రమ సిరిసిల్లలో ఉంటే.. యారన్ డిపో అక్కడెందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు ప్రతీ కిలోపై కమీషన్లు దొబ్బుతున్నారని ఆరోపించారు. మురికినీటి శుద్ధిప్లాంట్ను పద్మనగర్లో నిర్మించి ఊరిని మురికినీటితో ముంచారని ఆరోపించారు. సుందరీకరణ పేరిట సిరిసిల్ల కొత్త చెరువులో చేపట్టిన పనులతో కొద్దిపాటి వర్షానికి నీళ్లు ఊరిలోకి వస్తున్నాయన్నారు. టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలు మూత పడుతున్నాయని, అపెరల్పార్క్లో షెడ్లు నిర్మించి వదిలేశారన్నారు. సిరిసిల్లలో ఏడు గ్రామాలను విలీనం చేసి ఉపాధిహామీని దూరం చేశారన్నారు. సిరిసిల్లకు 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.29 కోట్లు మంజూరు చేశామని, అమృత్ పథకంలో రూ.50 కోట్లు ఇచ్చామని వివరించారు. పట్టణంలోని చిరువ్యాపారులకు రూ.21.52కోట్ల రుణాలు, స్వచ్ఛ భారత్లో రూ.44 కోట్లు ఇచ్చామని వివరించారు. వేములవాడ ఎమ్మెల్యే అడ్డగోలు వ్యవహారం ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే, వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఉరుకునేది లేదన్నారు. డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాతితో కట్టాల్సిన ఆలయాన్ని సిమెంట్ కాంక్రిట్తో కడుతున్నారన్నారు. గుడి పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎములాడ రాజన్నకే శఠగోపం పెట్టిండని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ సిరిసిల్ల ఇన్చార్జి మీసాల చంద్రయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్రావు, నాయకులు ఆడెపు రవీందర్, మట్ట వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
వరద కష్టాలు తీర్చాలి
ఏటా వర్షాకాలంలో మేము వరదలతో ఇబ్బంది పడుతున్నాం. పై భాగంలోని నీళ్ళు వచ్చి ఇక్కడ నిలుస్తున్నాయి. ఇండ్ల బేస్మెంట్ భాగం పాడవుతున్నాయి. గోడలు పర్రెలు వస్తున్నవి. దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి. వరదలు రాకుండా తాత్కాలికంగా కచ్చా నాలా తవ్వి వదిలేశారు. శాశ్వత పరిష్కారం చూపాలి. – కందాళ నవీన్కుమార్, 2వ వార్డు వార్డులో సీసీ కెమెరాలు పెట్టించాలి. కొన్ని ఏరియాల్లో వీధిలైట్లు లేవు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో వసతులు కల్పించాలి. పాడైన పాతరోడ్ల స్థానంలో కొత్తగా నిర్మించాలి. మిషన్ భగీరథ నీరును అందరికీ సరిపడా సరఫరా చేయాలి. గీతానగర్ చౌరస్తా నుంచి పాతపోచమ్మ వరకు రోడ్డు వేయాలి. – గండ్ర పృథ్వీథర్రావు, 3వ వార్డు వార్డులో చిన్న మోరీలతో మురికినీరు సరిగా పోతలేదు. పెద్దమోరీలు కట్టించాలి. పాడైన రోడ్లను మరమ్మతు చేపట్టాలి. కొన్ని వాడల్లో లైట్లు వెలుగుతలేవు. ప్రతి రోజు మోరీలు శుభ్రం చేయించాలి. రోజు నల్లానీళ్లు ఎక్కువ సేపు ఇవ్వాలి. సీసీ కెమెరాలు పెట్టించి వార్డులో దొంగతనాలు జరక్కుండా చూడాలి. – గున్నాల మల్లమ్మ, 4వ వార్డు -
పవర్బోర్లు వేయించాలి
సుభాష్నగర్ వాటర్ట్యాంక్ ఏరియాలో పాడైన హ్యాండ్బోర్లను పవర్బోర్లుగా మార్చాలి. మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీరు రాని రోజు గోస పడుతున్నాం. మోరీలు సరిగా తీయక దోమలు పెరిగిపోతున్నాయి. రోడ్లను మంచిగా చేయించాలి. – దూస రజిత, 5వ వార్డు వార్డులో నలభై ఏళ్ల కింద నిర్మించిన రోడ్డు శిథిలమయ్యాయి. కొత్తగా రోడ్లు వేయాలి. అవసరం ఉన్న చోట్ల వీధిలైట్లు పెట్టించాలి. వార్డులో ప్రవహించే ప్రధాన డ్రైనేజీ సిల్టుతో నిండిపోయింది. పనిచేయని బోర్లను రిపేరు చేయిస్తే నళ్లాలు రాని సమయంలో నీళ్ల కష్టాలు ఉండవు. – గజ్జెల్లి మహేశ్, 6వ వార్డు 7వ వార్డులోని ఆదర్శనగర్లో కనుచూపు మేరలో రోడ్లు, మోరీలు కనిపించవు. కొత్తగా వెలుస్తున్న కాలనీల్లో కచ్చా డ్రైనేజీలతో ఇబ్బంది పడుతున్నాం. మిషన్ భగీరథ పైపులైన్లు పటిష్ట పర్చాలి. వైకుంఠథామంలో వసతులు కల్పించాలి. మహిళా కమ్యూనిటీ భవనం కట్టించాలి. నూరుశాతం వసతులు అందించాలి. – ఒగ్గు రాజు, 7వ వార్డు -
ఆమెకు అందలం
● సిరిసిల్లలో ఆరుసార్లు చైర్పర్సన్లు ● వేములవాడలో మూడోసారి నారీ ● అతివలకే పుర‘పాలనా’ పగ్గాలు ● ఈసారి అతివకే పట్టాభిషేకంసిరిసిల్ల: జిల్లాలో మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ఓటర్లుగానే కాదు నేతలుగా ఎదుగుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పగ్గాలు కొన్నేళ్లుగా అతివల చేతుల్లోనే ఉంటున్నాయి. ఈసారి ఎన్నికల్లోనూ మహిళలే చైర్పర్సన్లు కానున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 119 గ్రామాల్లో మహిళలే సర్పంచులుగా పాలనా పగ్గాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 976 మంది మహిళా వార్డుసభ్యులు పాలకవర్గంలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ‘ఆమె’ ప్రజాసేవలో ముందుండనున్నారు. గతంలోనూ అతివలే.. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో గతంలోనూ మహిళల పాలన కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్గా తుల ఉమ, జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే తొలిసారి సింగిల్విండో చైర్పర్సన్ బర్కం లక్ష్మీనవీన్యాదవ్ పాలన సాగించారు. ఓటర్లుగానూ ప్రభావం సిరిసిల్ల పట్టణంలో 81,959 మంది ఓటర్లు ఉండగా మహిళలు 42,011, పురుషులు 39,942, థర్డ్ జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడలో 40,877 మంది ఓటర్లు ఉండగా మహిళలు 21,279, పురుషులు 19,580, థర్డ్ జెండర్లు 18 మంది ఉన్నారు. మహిళ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెండు మున్సిపాలిటీల్లోను చైర్పర్సన్గా మహిళలకు కేటాయించారు. అఽధిష్టాన నిర్ణయమే ఫైనల్ సిరిసిల్ల, వేములవాడల్లో చైర్పర్సన్ సీటుపై గురిపెట్టిన నేతలు ఆయా పార్టీల అధిష్టానం హామీ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ సీటు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కొత్తవాళ్లు తెరపైకి రావడంతో అధిష్ఠా నం సైతం ముందుగా కౌన్సిలర్గా గెలవాలని స్పష్టం చేస్తుంది. ఏ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించిన అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఆ మేరకు చైర్పర్సన్ ఎన్నిక సాధ్యమవుతుంది. మొత్తంగా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ మరోసారి మహిళ శకానికి బాటలు పడుతున్నాయి. పాలన పగ్గాలను అతివలు చేపట్టనున్నారు. భర్త చాటు భార్యలుగా కాకుండా సొంత నిర్ణయాలతో పాలన సాగిస్తే.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అర్థముంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మహిళలకు కేటాయించిన వార్డులపై ముఖ్యనాయకులు దృష్టి సారించారు. చైర్పర్సన్ స్థానంపై గురిపెట్టిన నాయకులు ముందుగా తమ సతులను కౌన్సిలర్గా గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. సిరిసిల్ల పట్టణంలో మహిళలకు 3, 4, 5, 8, 9, 10, 15, 18, 23, 27, 28, 29, 30, 31, 36, 37, 38, 39వ వార్డు కేటాయించారు. మరోవైపు జనరల్ స్థానాల్లోనూ పురుషులకు పోటీకి అవకాశం ఉన్నా మహిళను పోటీలో ఉంచి మున్సిపల్ చైర్పర్సన్ స్థానంపై గురిపెట్టారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళ కావడంతో అన్ని సామాజిక వర్గాలకు ఈసారి అవకావం లభించింది. వేములవాడలో 28 వార్డులు ఉండగా.. 14 వార్డులకు మహిళలకు కేటాయించారు. ఈసారి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు చైర్పర్సన్ స్థానంపై గురిపెట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యనాయకుల సతీమణులు చైర్పర్సన్ స్థానం కోసం జనరల్ వార్డుల్లోనూ మహిళలు పోటీలో ఉంచి గెలిపించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేములవాడలో మహిళలకు కేటాయి ంచిన వార్డులు 1, 2, 5, 9, 10, 11, 19, 22, 23, 26, 27, 28వ వార్డులపై దృష్టిసారించారు.మున్సిపల్లోనూ... సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్లుగా రుద్ర సత్తమ్మ, గుండ్లపల్లి సరోజన, గుడ్ల మంజుల, సామల పావని, జిందం కళాచక్రపాణి పనిచేశారు. మరోసారి మహిళా చైర్పర్సన్కు ఈసారి అవకాశం వచ్చింది. ఆరు పర్యాయాలు మహిళలు మున్సిపాల్ పాలనాపగ్గాలు చేపట్టినట్లు అవుతుంది. వేములవాడలో నామాల ఉమ, రామతీర్థపు మాధవి తాజా మాజీ చైర్పర్సన్గా ఉన్నారు. వీరంతా ఐదేళ్లపాటు పాలన సాగించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు మహిళలకు మరోసారి చైర్పర్సన్ స్థానాలు దక్కాయి. -
మత్తుకు బానిస కావద్దు
● సైకాలజిస్ట్ పున్నంచందర్ తంగళ్లపల్లి(సిరిసిల్ల): యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ కోరారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, కళాశాలలోని విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. పున్నంచందర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లు మానసిక కృంగుబాటుకు, ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తాయన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు మత్తును ఆశ్రయించడం పరిష్కారం కాదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తల్లిదండ్రులు, నిపుణులతో పంచుకోవాలని సూచించారు. పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజనీ, వైస్ప్రిన్సిపాల్ శ్రీవిద్య, ఉపాధ్యాయులు షాలిని, సవిత, శ్వేత, విజయశ్రీ పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామం మీదుగా బస్సులను పునరుద్ధరించాలని కోరుతూ మండలంలోని వెంకట్రావుపల్లి సర్పంచ్ చల్ల నవీన్రెడ్డి గ్రామస్తులతో కలిసి బుధవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందించారు. గతంలో సిద్దిపేట, కరీంనగర్ల నుంచి నడిచిన బస్సులను నాలుగేళ్ల క్రితం రద్దు చేశారన్నారు. ఆ రెండు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. నాయకులు మామిండ్ల కనకరాజు, మంద రాజు, సంపత్రెడ్డి, బత్తిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల అర్బన్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేశ్కుమార్, మండల విద్యాధికారి దూస రఘుపతి తిలకించారు. వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. నియోజకవర్గస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జిల్లాస్థాయికి ఎంపికవుతారని తెలిపారు. ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని మతిస్థిమితం లేని ఓ మహిళను సఖీ కేంద్రం నిర్వాహకులు బుధవారం సిరిసిల్లకు తరలించారు. నెల రోజులుగా సంచరిస్తున్న సదరు మహిళ పరిస్థితిని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల విన్నపంతో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం స్పందించారు. సఖీ కేంద్రం బాలిక సంరక్షణ అధికారి కవిత ప్రత్యేక అంబులెన్స్తో ముస్తాబాద్కు వచ్చి, మతిస్థిమితం లేని మహిళతో మాట్లాడారు. ఆమె ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో, అంబులెన్స్లో సిరిసిల్లకు తీసుకెళ్లారు. అక్కడి వృద్ధాశ్రమంలో చేర్చినట్లు డీసీపీవో కవిత తెలిపారు. -
● రైల్వేలైన్కు భూసేకరణ వేగవంతం ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ హైస్కూల్ను జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి బుధవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం, సీసీ కెమెరాల, మీడియా సెంటర్ ఏర్పాటు, వాహనాల పార్కింగ్ అంశాలపై అధికారులతో చర్చించారు. రైల్వేలైన్ భూసేకరణ వేగవంతం కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణను వేగంగా పూర్తి చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి క్యాబినెట్ సెక్రటరీ (కోఆర్డినేషన్) సెంట్రల్ సెక్రటేరియట్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. అటెండర్ నుంచి అన్ని స్థాయిల అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో చేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. వంద శాతం ఫలితాలు సాధించాలి పదో తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్థిపై దృష్టి సారించి, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ గరీ మా అగ్రవాల్ కోరారు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. డీఈవో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 4,405 మంది చదువుతున్నారని, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులతో స్కాలర్షిప్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని తెలిపారు. -
పునాదుల్లోనే పద్మశాలీ భవనం
● ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిన పనులు సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పద్మశాలీ సంఘ భవనం పునాదుల్లో ఆగిపోయింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్రోడ్డులో ఐదెకరాల స్థలం, రూ.5కోట్లు మంజూరు చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పునాదుల్లోనే ఆపివేశాడు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పద్మశాలీ సంఘం భవన నిర్మాణం ప్రచారాస్త్రంగా మారింది. సిరిసిల్ల పద్మశాలి సంఘం పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కలిసి భవన నిర్మాణంపై చర్చించారు. భవన నిర్మాణం రూ.కోటి వరకు పూర్తి కాగా.. ఒక్క పైసా కాంట్రాక్టర్కు రాలేదు. దీంతో పనులు ఆగాయని వివరించారు. అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్ను హైదరాబాద్ పిలిపించి భవనం పనులు చేయాలని, బిల్లులు ఇప్పిస్తామని చెప్పడంతో మళ్లీ రూ.1.45కోట్ల పనులు చేశారు. కానీ ఇప్పటి వరకు రూ.2.45 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆఘమేఘాలపై మళ్లీ పనులు ప్రారంభించి మొరం పోయిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సిరిసిల్ల పద్మశాలీ సంఘ భవనం నిర్మాణం ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారడం చర్చనీయాంశమైంది. -
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మున్సిపల్ పరిధిలోని 1, 7, 8, 9, 23, 28 వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అభివృద్ది కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. తిప్పాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో తిప్పాపూర్ బస్స్టాండ్ను తరలిస్తామంటే తానే మొదట అడ్డుకున్నానన్నారు. ఇటీవల తిప్పాపూర్లో రూ.కోటితో జంక్షన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని.. తాము నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు రేషన్కార్డులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో తెలంగాణలోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. -
అసంతృప్తుల జ్వాలలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన ఆశావహులకు నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్న అభ్యర్థులు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆశావహులు రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ముందు ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పలువురు ఆశావహులు పార్టీ పెద్దల ఇళ్లముందు ఆందోళన చేపట్టారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. ఒకే డివిజన్కు రెండు బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. పీసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా స్థానిక నాయకులు బీఫామ్లు అందించడం కలకలం రేపింది. తొలుత 50వ డివిజన్ అభ్యర్థిగా కొత్త అనిల్ను హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్ ఇన్చార్జి వైద్యుల అంజన్కుమార్ బీఫామ్ను చక్రధర్రావుకు అందించారు. ఈ విషయం తెలిసి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అవాక్కయ్యారు. అనిల్కు కాదని బీఫామ్ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్ అప్పటికే 57వ డివిజన్ పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అన్నా, చెల్లెలి సవాల్సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు రక్తసంబంధీకుల మధ్య పోటీని నెలకొల్పాయి. సిరిసిల్ల పట్టణంలోని 16వ వార్డులో బీఆర్ఎస్ టికెట్పై సిట్టింగ్ కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్ పోటీ చేయగా, ఆయనకు స్వయానా చెల్లెలు గుజ్జె తార కాంగ్రెస్ టికెట్పై బరిలో ఉన్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లోనూ వీరిద్దరు పోటీ పడ్డారు. అప్పటి ఎన్నికల్లో గుజ్జె తార బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేయగా, గుడ్ల శ్రీనివాస్ ఇండిపెండెంట్గా పోటీ చేసి చెల్లెలుపై విజయం సాధించారు. మరోసారి అన్నా, చెల్లెలు సిరిసిల్లలో సవాల్ చేయడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ 53వ డివిజన్కు చెందిన తాజీ మాజీ కార్పొరేటర్ మెండి శ్రీలతచ ంద్రశేఖర్కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో దళిత మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ముందు ఆందోళన చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీలత, చంద్రశేఖర్ కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలోని 2వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ దాసరి సాగర్ నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. తాను బీఆర్ఎస్ అభ్యర్థి అని ముద్రించుకున్న కరపత్రాలు, పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకుడు బేతి మహేందర్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, రెబల్గా బరిలో నిలిచాడు. జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది. టికెట్లు దక్కని నేతలు రెబల్స్గా బరిలోకి దిగారు. రాయికల్ మున్సిపాలిటీలో ఐదుగురు రెబల్స్ పోటీలో ఉన్నారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లిలోనూ కాంగ్రెస్కు రెబల్స్ బెడద తప్పడం లేదు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలలో రెబల్స్ బెడద ఉంది. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో అన్ని పార్టీలకు రెబల్స్ బెడద ఉంది. వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు 3 డివిజన్లలో, బీఆర్ఎస్కు రెండు డివిజన్లలో రెబల్స్ బరిలో నిలిచి గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. -
నిరసనలు.. రాజీనామాలు
సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో ముసలం పెట్టాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పలువురు అభ్యర్థులు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ, పార్టీకి రాజీనామాలు చేశారు. సిరిసిల్ల 10వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ బొల్గం నాగరాజు సతీమణికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్థాణిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద పార్టీ కండువాలను వదిలేస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు అంబేడ్కర్ విగ్రహానికి అందించారు. అదే వార్డుకు చెందిన ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు బండారు శ్యాం టికెట్ రాలేదని ఆ పార్టీకి రాజీనామా చేశాడు. కాంగ్రెస్కు చెందిన పిట్టల శ్రీకాంత్ 38 వార్డులో తమ అభ్యర్థి పిట్టల తేజస్వినికి టికెట్ రాలేదని పార్టీ ఆఫీస్లోనే గొడవకు దిగారు. ఇలా అన్ని పార్టీల్లోనూ నిరసనలు, రాజీనామాలు జరిగాయి. పది వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు సిరిసిల్లలోని 10 వార్డుల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. పార్టీ టికెట్ రాని వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇతర గుర్తులపై పోటీ చేశారు. రెబల్స్ బెడద అన్ని పార్టీల్లోనూ ఉండడం గమనార్హం. ఆయా పార్టీ ముఖ్యనేతలంతా అలకబూనిన అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నామినేషన్ల ఉపసంహరణకు చేసిన రాజీ ప్రయత్నాలు కొన్ని చోట్ల కొలిక్కి వచ్చినా.. రెబల్స్ బెడద అన్ని పార్టీలకు ఉంది. -
బుకింగ్ గుబులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉదయం లేవగానే పొలంగట్ల వెంట పోయి పంటచేలను చూస్తే మనసు నిమ్మలం అయ్యే రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా అంటే ఫర్టిలైజర్షాప్నకు వెళ్లాలని అనుభవం ఉన్న అన్నదాతలు.. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ గురించి అవగాహన లేక యూరియా బస్తాలు ఎలా తెచ్చుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పంటలకు యూరియా అందక రంగుమారుతుంటే ఆవేదన చెందుతున్నారు. అవగాహన కరువు వ్యవసాయ పనులు చేస్తున్న రైతులకు 70 శాతానికి పైగా అక్షరజ్ఞానం లేదు. వాళ్లకు స్మార్ట్ఫోన్లను ఎలా వాడాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్యాప్ను వినియోగించుకోవడం తెలియక చదువు వచ్చిన రైతుల వద్దకు వెళ్లి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈక్రమంలో యూరియా అందడం ఆలస్యమై పంటలు ఎదగడం లేదు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే.. ఇన్నాళ్లు బడారైతులు ఎక్కువ యూరియా బస్తాలు తీసుకెళ్లే అవకాశం ఉండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఎరువుల బస్తాలు అందడం లేదు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న రైతులకే ఎరువుల బస్తాలు సరిపడేలా అందేవి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్ట్టేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్యాప్ను తీసుకొచ్చింది. దీని ద్వారా పట్టాపాసుపుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బట్టి ఎరువుల బస్తాలను దశలవారీగా ఇస్తున్నారు. అయితే రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉండడంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం తెలియక.. ఒక వేళ డౌన్లోడ్ చేసుకున్న ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలాంటి సమస్యలపై వ్యవసాయాధికారులు దృష్టి పెట్టి అవగాహన కల్పిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రచార ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి
సిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల వ్యయాలపై పక్కాగా పర్యవేక్షణ చేపట్టాలని వ్యయ పరిశీలకులు రాజ్కుమార్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడ బల్దియాలను సందర్శించి, ఎన్నికల అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఖర్చును నిబంధనల ప్రకారం నమోదు చేసి, వ్యయ రిజిస్టర్లు రోజువారీగా అప్డేట్ చేయాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ సమన్వయంతో పనిచేసి అక్రమ ఖర్చులు, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలన్నారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారు సమయానికి ఖర్చుల వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోడల్ అధికారులు నవీన్కుమార్, భారతి పాల్గొన్నారు. -
గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను గడువులోగా అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం రైస్ మిల్లర్లతో సీఎంఆర్పై సమీక్షించారు. 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లకు మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం, డెలివరీ చేయకుండా పెండింగ్లో ఉన్న ధాన్యం వివరాలపై చర్చించారు. మిల్లుల వారీగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా గడువులోగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఖరీఫ్ బియ్యం ఈనెల 16, రబీ బియ్యం 28లోగా అందించాలన్నారు. సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయడం మిల్లర్లు బాధ్యతగా భావించాలని సూచించారు. గత అనుభాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్లో లక్ష్యాన్ని సమర్థవంతంగా చేరుకునేలా ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఇన్చార్జి డీసీఎస్వో, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజిత, రైస్ మిల్లర్ల ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు, గరిపెల్లి ప్రభాకర్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పాం సాగుతో అధిక ఆదాయం ఇల్లంతకుంట(మానకొండూర్): ఆయిల్పాం సాగుతో రైతులు అధిక దిగుబడి, దీర్ఘకాలం పాటు ఆదాయం పొందవచ్చని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం మండలంలోని వల్లంపట్లలో ఆయిల్పాం మెగా ప్లాంటేషన్లో పాల్గొని మాట్లాడారు. పంట సాగుకు సబ్సిడీ, మార్కెటింగ్, సదుపాయాల గురించి రైతులకు వివరించారు. ఆయిల్పాం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పేర్కొన్నారు. జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు పీఏసీఎస్, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులకు లక్ష్యం కేటాయించామన్నారు. పంట విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవని, సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్పాం ఫ్యాక్టరీ ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో డీఏవో అఫ్జల్ బేగం, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, అధికారులు సందీప్, గోవర్ధన్, సర్పంచ్ నేరెళ్ల విజయ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సిరిసిల్ల బరిలో 170 మంది
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ పోరులో ప్రచార పర్వానికి తెరలేచింది. పట్టణంలో 39 వార్డులు ఉండగా, 170 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం 64 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 32 మంది, కాంగ్రెస్ నుంచి 16, బీజేపీ నుంచి ఏడుగురు, ఇండిపెండెంట్లు 8 మంది, ఏఐఎఫ్బీ నుంచి ఒక్కరు విత్డ్రా చేసుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు విషణ్ణవదనాలతో, ఆవేదనతో మున్సిపల్ ఆఫీస్ నుంచి బయటికి రావడం కనిపించింది. బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు, ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులను అధికారులు కేటాయించారు. బీఆర్ఎస్ ఇన్చార్జి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, విండో మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్రెడ్డి పార్టీ అభ్యర్థుల బీ ఫామ్స్ను కమిషనర్కు అందించారు. 14 వార్డుల్లో త్రిముఖ, 10 వార్డుల్లో చతుర్ముఖ పోటీ సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా, 14 వార్డుల్లో ముగ్గురి మధ్య పోటీ, 10 వార్డుల్లో నలుగురి మధ్య పోటీ ఉంది. 9 వార్డుల్లో ఐదుగురి మధ్య, ఒక్క వార్డులో ఆరుగురు, మూడు వార్డుల్లో ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉండగా.. 15వ వార్డు, 34వ వార్డుల్లో మాత్రం ఎనిమిది మంది చొప్పున పోటీలో ఉన్నారు. పట్టణంలోని పది వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. బుధవారం నుంచి అభ్యర్థులు ప్రచారానికి తెర లేపనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పరిశీలన సిరిసిల్ల మున్సిపల్లో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణను ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు వేర్వేరుగా పరిశీలించారు. కమిషనర్ ఖదీర్పాషా ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నోడల్ అధికారి భారతి, తహసీల్దార్ మహేశ్కుమార్, స్పోక్స్ పర్సన్ పాతూరి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్లో.. వేములవాడ: వేములవాడ బల్దియాలో మొత్తం 150 మంది అభ్యర్థులకు మంగళవారం 37 మంది నామినేషన్ ఉపసంహరించుకోగా, 113 మంది బ రిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్లో స మావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఎలక్షన్ ఏజెంట్ల పాస్పోర్టు సైజ్ ఫొటో, పూర్తి వివరాలతో హాజరు కావాలని కోరారు. -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
వేములవాడ: రాజన్న సన్నిధిలో ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి జాతర పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. భీమేశ్వర ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసే ర్యాంపు, లడ్డూ కౌంటర్, పార్కింగ్ తదితర ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్అండ్బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మహిపాల్రెడ్డి, ఏఈవోలు జయకుమారి, శ్రావణ్కుమార్, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లి–వట్టిమల్ల గ్రామాల గీతకార్మిక సంఘాల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్ సీఐ మిట్టపెల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రెండు గ్రామాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈత, తాటి చెట్లను గీస్తూ నిమ్మపల్లికి చెందిన గౌడ సంఘం సభ్యులు కొన్నేళ్లుగా ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ వనాలు తమ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయని, ఇవి తమకే చెందుతాయని వట్టిమల్లకు చెందిన గీతకార్మిక సంఘం ఆరోపిస్తోంది. ఈ విషయమై ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వట్టిమల్ల గీత కార్మికుల ఫిర్యాదు మేరకు ఎకై ్సజ్ సీఐ సిబ్బందితో చేరుకుని రెండు గ్రామాల గీత కార్మికులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని, అప్పటి వరకు ఎవరూ గొడవలు పెట్టుకోవద్దని సూచించారు. బీఆర్ఎస్ది సంక్షేమ పాలన.. కాంగ్రెస్ సంక్షోభ పాలనసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పాలన సంక్షేమాన్ని అందించిందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలన సంక్షోభాన్ని చూపిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఉద్యమ పార్టీగా సిరిసిల్ల అభివృద్ధికి బీఆర్ఎస్ బాటలు వేసిందని, అప్పటి సీఎం కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. మున్సిపాలిటీలో 39 వార్డులకు అభ్యర్థులను ముందే ప్రకటించి బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని, అధికార కాంగ్రెస్, బీజేపీలు అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలుపలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. సిరిసిల్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నేతన్నలకు ఉపాధి చూపింది, అభివృద్ధికి బాటలు వేసింది బీఆర్ఎస్ అని ప్రజలు గుర్తించారని, అందుకే తమ పార్టీ టికెట్ల కోసం ఎన్నడూ లేనంత పోటీ నెలకొందన్నారు. గత పాలన, నేటి పాలనను పోల్చుకుంటూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. నాయకులు కొండూరి రవీందర్రావు, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, సామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గడువు పొడిగింపుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఎస్సీడీవో డాక్టర్ రవీందర్రెడ్డి తెలిపారు. 2025–26 సంవత్సరానికి ఫౌండేషన్ కోర్సులకు (రాష్ట్రస్థాయి అన్ని పోటీ పరీక్షలతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఇతర పోటీ పరీక్షలు) శిక్షణ ఇస్తామన్నారు. భోజన వసతితో పాటు స్టడీ మెటీరియల్స్ అందించే శిక్షణ కార్యక్రమానికి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులైన యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరారు. ఇతర వివరాలకు 83413 87700 నంబర్లో సంప్రదించాలన్నారు. -
చిక్కరు.. దొరకరు!
సిరిసిల్ల: మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసిన స్వ తంత్ర, రెబల్ అభ్యర్థులు ప్రధాన పార్టీల వారికి చి క్కకుండా.. దొరకకుండా తిరుగుతున్నారు. కొంద రు స్వతంత్రులు నామినేషన్ వేసిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుండగా.. రెబల్స్, స్వతంత్రులను తప్పించేందుకు పార్టీల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉపసంహరణ గడువు ముగిసేదాకా చిక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఏకగ్రీవాలకు ఎత్తులు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏకగీవ్రం కోసం పావులు కదుపుతున్నారు. పోటీలో ఉన్న ప్రత్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో వార్డులో ఒకే పార్టీకి చెందిన వారు ఒకటికి మించి నామినేషన్లు వేశారు. 2020లో మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్లలో నాలుగు వార్డులు, వేములవాడలో ఒక్క వార్డు ఏకగ్రీవమైంది. బీ–ఫామ్ ఇస్తేనే పార్టీ గుర్తులు అభ్యర్థులు మంగళవారం సాయంత్రంలోగా పార్టీ బీఫామ్స్ అందించాల్సి ఉంటుంది. బీ–ఫామ్ రాని వారు రెబల్గా బరిలో మిగిలిపోతారు. వీరికి ఇతర గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. బరిలో నిలిచిన వారు.. వారికి వచ్చిన గుర్తులతో బుధవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మాట వినకుంటే వేటే ! తిరుగుబాటు అభ్యర్థులు పార్టీకి తలనొప్పిగా మారారని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రధాన పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగి రెబల్స్కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మాట వినకుంటే పార్టీ నుంచి బహిష్కరించాలనే నిర్ణయంతో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈక్రమంలో సొంత పార్టీ నేతలే నష్టం చేస్తే బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు.మున్సిపాలిటీ వార్డులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిరిసిల్ల 39 129 117 97 వేములవాడ 28 40 50 38 -
నిత్య సాధనతోనే విజయం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ‘పది’ విద్యార్థులకు ప్రేరణ తరగతులు ప్రారంభంసిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై నిత్యం సాధన చేస్తేనే విజయం సాధిస్తారని కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ‘ప్రేరణ’ అవగాహన తరగతులకు సోమవారం శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రేరణను ప్రారంభించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమన్నారు. ఇప్పుడు వచ్చిన మార్కులు భవిష్యత్ చదువులకు ఉపయోగపడతాయన్నారు. పరీక్షల టైమ్టేబుల్ సిద్ధం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా చదవడం, రాయడం పూర్తి చేయాలని సూచించారు. అందరూ విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్, ఏఎస్డబ్ల్యూవో విజయలక్ష్మి పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సర్వీస్, పీడీ ఓటర్లు, ఎన్నికల సిబ్బంది ఓటుహక్కును వినియోగించుకోవడానికి సిరిసిల్ల, వేములవాడల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్పై అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ అఽధికారులు, సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, లక్ష్మీరాజం, జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. -
సాంఘికశాస్త్రం.. సమాజాన్ని మలిచే విజ్ఞానం
● డీఈవో బి.జగన్మోహన్రెడ్డి సిరిసిల్లటౌన్: సాంఘికశాస్త్ర పరిజ్ఞానం విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేస్తుందని జిల్లా విద్యాధికారి బి.జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ను గీతానగర్ హైస్కూల్లో నిర్వహించారు. ఈసందర్బంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల దశలోనే జీవిత గమ్యాన్ని నిర్ధేషించుకోవాలని సూచించారు. ఈ పోటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 72 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు నగదుతోపాటు ప్రశంసాపత్రాలు అందించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు ప్రతిభ చూపి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. రాష్ట్రస్థాయికి ఇంగ్లీష్ మీడియం నుంచి.. టి.ఐశ్వర్య(జెడ్పీహెచ్ఎస్ మూడపల్లి), బి.ప్రణవి(జెడ్పీహెచ్ఎస్ నామాపూర్), ఎ.లిఖిత్కుమార్(నెహ్రూనగర్), తెలుగు మీడియం నుంచి.. ఎ.రమ్య(బాలికల హైస్కూల్ వేములవాడ), ఎండీ.అంజద్(బాలికల హైస్కూల్ వేములవాడ), ఎన్.గాయత్రి(హైస్కూల్ వేములవాడ) ఎంపికయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి.. ఎన్.మహిత, ఎం.హర్షిణి, జి.అఖిల(రహీంఖాన్పేట) ఎంపికయ్యారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి, గీతానగర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం లోకిని శారద, జిల్లా సోషల్ ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి రవి, కె.రాజ్కుమార్ పాల్గొన్నారు. సిరిసిల్లఅర్బన్/సిరిసిల్ల ఎడ్యుకేషన్/ఇల్లంతకుంట: ఈనెల 4 నుంచి 6 వరకు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సీఎం క్రీడా పోటీలు సిరిసిల్ల మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎంఈవో రఘుపతి తెలిపారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి, గంభీరావుపేట, మండలాలతో కలిపి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మానకొండూర్ నియోజకవర్గస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు గాలిపెల్లి హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వై.శశికళ తెలిపారు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకున్న క్రీడాకారులు హాజరుకావాలని తెలిపారు. వేములవాడ: రాజన్న, భీమన్నలను దర్శించుకుని స్వామి వారి హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను లెక్కించేందుకు ఆలయ అధికారులు ఈనెల 5న భీమేశ్వర సదన్లోని పార్కింగ్ స్థలంలో ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని ఈవో రమాదేవి కోరారు. సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం పార్టీలు, నేతలు అందించే డబ్బు, మద్యం పంపిణీని ప్రజలు తిరస్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్బాబు కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్లో సోమవారం పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ అందించి మాట్లాడారు. ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, నాయకులు జవ్వాజి విమల, కోడం రమణ, రాపల్లి రమేశ్, ఎలిగేటి రాజశేఖర్, సూరం పద్మ, గురిజాల శ్రీధర్, శ్రీరాముల రమేశ్చంద్ర పాల్గొన్నారు. జాతీయస్థాయిలో మెరిసిన అశోక్సిరిసిల్లటౌన్: జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో జిల్లా వాసి మూడు కాంస్య పతకాలు సాధించారు. ఈనెల 2న రాజస్థాన్లోని అజ్మీర్లో నిర్వహించిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్మీట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన కడారి అశోక్ 10 కిలోమీటర్లు, హైజంప్, లాంగ్జంప్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సురేశ్కుమార్శర్మ, మాజీ డీఐజీ రాకేశ్జోషి చేతులమీదుగా పతకాలు అందుకున్నారు. -
శాశ్వత పరిష్కారం చూపాలి
మా కాలనీలో డ్రెయినేజీలు లేవు. మేమే కచ్చ డ్రెయినేజీలు నిర్మించుకున్నాం. చెత్త పేరుకుపోతే మేమే తొలగించుకుంటున్నాం. రోడ్లు సరిగ్గా లేవు. వర్షకాలం వచ్చిందంటే కాలనీ మొత్తం బురదమయం అవుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. – శ్రీనివాస్రెడ్డి, చంద్రంపేట, జ్యోతినగర్ అభివృద్ధికి దూరంగా.. సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి సరఫరాలో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. – సందవేణి శ్రీనివాస్యాదవ్, రగుడు ఉపాధి అవకాశాలు కల్పించాలి గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఉపాధిహామీ పనులు ఉండేవి. ఎప్పుడైతే మున్సిపాలిటీలో విలీనం చేశారో అప్పటి నుంచి ఉపాధిహామీ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. – సలేంద్రి బాలరాజు, పెద్దూరు -
పట్టణంలో చిక్కిన పల్లెలు
● కనిపించని అభివృద్ధి ● కనీస వసతులు కరువు ● పట్టించుకోని పాలకులుసిరిసిల్ల అర్బన్: మున్సిపాలిటీలో విలీనమైతే వసతులు దరిచేరుతాయని ఆశపడ్డారు. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశించారు. కానీ స్థానికుల ఆశలు అడియాసలయ్యాయి. ఉన్న ఉపాధిహామీ పథకం మూలకుపడింది. వసతుల మాట పాలకులు ఎత్తనే లేదు. మున్సిపాలిటీలో విలీనం కాక ముందు గ్రామపంచాయతీలుగా ఉన్న రోజుల్లోనే తమ కాలనీల్లో పరిస్థితులు బాగుండేవని స్థానికులు పేర్కొంటున్నారు. ఏడేళ్ల క్రితం సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్ధాపూర్ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విలీన గ్రామాల్లోని పరిస్థితులపై సాక్షి ఫోకస్. పడకేసిన పారిశుధ్యం పనులు విలీన గ్రామాల్లో డ్రెయినేజీలు సరిగా లేవు. చెత్తసేకరణ సరిగ్గా చేపట్టకపోవడంతో శివారుకాలనీలతో పాటు విలీన గ్రామాల్లో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానంగా విలీన గ్రామాలైన చంద్రంపేట, జ్యోతినగర్, రగుడు, రాజీవ్నగర్, బోనాల, పెద్దూరు, బాబాజీకాలనీలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. డ్రెయినేజీలు, బీటీ, సీసీ రోడ్లు అసలే లేవు. మట్టిరోడ్లు.. వాటిపై పారుతున్న మురుగునీటితో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయని విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చంద్రంపేటలో మట్టిరోడ్డు, పక్కనే మురికికూపంపిచ్చిమొక్కలతో జ్యోతినగర్లోని అంతర్గతరోడ్డు -
స్వతంత్రులకు గుర్తుల గుబులు !
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే ఇండిపెండెంట్స్(స్వతంత్రులు) అభ్యర్థులకు కేటాయించే గుర్తులు తికమకపెట్టనున్నాయి. స్వతంత్రులకు కే టాయించే 75 గుర్తులతో కూడిన జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్లబుట్ట, బ్యాట్, బాటరీ టార్చి, బైనాక్యులర్స్, సీసా, బ్రెడ్, బకెట్, కెమెరా, క్యారమ్బోర్డు, చెయిన్, కుర్చీ, చపాతి రోలర్, కోటు, కొ బ్బరితోట, మంచం, కప్పుసాసర్, కటింగ్ ప్లేయర్ వంటి గుర్తులతో పాటు ఎవరూ గుర్తుపట్టని విధంగా కవరు, పిల్లనగ్రోవి, డంబెల్స్, ద్రాక్షపండ్లు, పచ్చిమిర్చి, అగ్గిపెట్టె, పెన్డ్రైవ్, ఊలు, సూది, టూత్పేస్ట్, వాల్నట్ వంటి గుర్తులను ఇచ్చారు. 75 గుర్తుల్లో చాలామటుకు ఒక్కటిని పోలినట్లు మరొకటి ఉండడం విశేషం. బ్యాట్, బాటరీ టార్చ్ ఒకేలా కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాలెట్ పత్రాలు కావడంతో ఈ గుర్తులను గుర్తించడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సింహం ధైర్యం..!
ఏనుగు బలం..సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో టికెట్లు దక్కని ఆశావహులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఏఐఎఫ్బీ (సింహం గుర్తు), బీఎస్పీ (ఏనుగు గుర్తు) పార్టీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. సింహం ధైర్యానికి, ఏనుగు బలానికి ప్రతీకగా భావించే ఈ గుర్తులు ఇప్పుడు రాజకీయంగా కూడా బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో అంతర్గత అసంతృప్తి, రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్న వార్డులు, డివిజన్లలో ఈ గుర్తులు ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇస్తున్నాయి. ముందస్తు వ్యూహాలు టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకుంటున్న నేతలు ఏఐఎఫ్బీ, బీఎస్పీ నాయకత్వాలతో చర్చలు జరిపి, అవసరమైతే తమకు ఆ పార్టీ గుర్తు కేటాయించాలంటూ మాట తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రధాన పార్టీల తరఫున నామినేషన్ దాఖలు చేస్తూనే, ప్రత్యామ్నాయంగా ఏఐఎఫ్బీ, బీఎస్పీ పార్టీల పేర్లతో కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలో ఉన్న రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషాల్లో ‘ఆపద్బాంధవ’ పార్టీలుగా ఏఐఎఫ్బీ, బీఎస్పీలు మారుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలకు సవాల్ ఏఐఎఫ్బీ, బీఎస్పీ, జనసేనతో పాటు ఇతర చిన్న పార్టీల రంగప్రవేశం కూడా ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఓటు చీలిక, రెబెల్ ప్రభావం, గుర్తుల సెంటిమెంట్స్ కలసి ప్రధాన పార్టీలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ కంటే గుర్తే బలం అన్న నమ్మకం బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సింహం, ఏనుగు గుర్తులపై పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు ప్రధాన పార్టీలను దెబ్బతీస్తారో, ఎవరి లెక్కలు ఎవరి మీద పనిచేస్తాయో తేలాల్సి ఉంది. సెంటిమెంట్ ఏఐఎఫ్బీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విస్తృతంగా పోటీ చేసి విజయాలు సాధించింది. ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 224 మంది అభ్యర్థులను బరిలో దింపగా, 102 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలను ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. చొప్పదండిలో 1, పెద్దపల్లి 1, రామగుండం 9, కరీంనగర్ 3, జగిత్యాల 1, రాయికల్లో 2 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులు బరిలో దిగారు. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కరీంనగర్ జిల్లాలో 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్లో 10 స్థానాలు, జమ్మికుంట మున్సిపాలిటీలో 4, హుజురాబాద్లో 4, చొప్పదండిలో 2 సీట్లల్లో పోటీ చేస్తుంది. మొదటిసారిగా బీఎస్పీకి స్థానిక ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసేందుకు అనుమతి లభించింది. ఈసారి సత్తా చాటుతాం. – నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడుప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తాం. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పన్నాగం రాబోయే ఎన్నికల్లో తేలిపోతుంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తుంది. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతాం – అంబటి జోజిరెడ్డి, ఏఐఎఫ్బీ రాష్ట్ర కన్వీనర్ -
యాంత్రీకరణతో రైతులకు లబ్ధి
బోయినపల్లి(చొప్పదండి): వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో 31 మంది రైతులకు రూ.6.78 లక్షల విలువైన సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సోమవారం అందించారు. ఎంఏవో ప్రణిత, ఎంపీడీవో జయశీల, ముదుగంటి సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపెల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, వినోద్, బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, పులి లక్ష్మీపతి, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్రెడ్డి, సర్పంచులు నల్ల మోహన్, ఏనుగుల కనకయ్య, జంగం అంజయ్య, డాక్టర్ వెంకటేశ్, రాజేశం, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గాలికొదిలేసిన పనులను గాడిలో పెట్టాం
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: పదేళ్ల పాలనలో గాలికి ఒదిలేసిన పనులను తాము రెండేళ్లలో గాడిలో పెట్టామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడను టెంపుల్ సిటీగా మార్చేందుకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక ఎస్ఆర్ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్లకు అవకాశం ఇస్తే అభివృద్ధిని విస్మరించారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములవాడలో చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. రూ.10కోట్లతో మూలవాగులో గుడి చెరువులో డ్రెయినేజీ నీరు కలవకుండా పనులు చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, 28 వార్డుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలను కాపాడుకుంటాం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. కేసీఆర్ సిట్ విచారణకు నిరసనగా ఆదివారం చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ సారంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత గుగ్గిళ్ల భూమలింగంగౌడ్ను పరామర్శించి మాట్లాడారు. భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య అన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, పుర్మాని రాజశేఖర్రెడ్డి, కోడి అంతయ్య, సింగిరెడ్డి రవీందర్రెడ్డి, మాట్ల మధు పాల్గొన్నారు. -
దయచూపని నిర్మలమ్మ
ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక హామీలుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రప్రభుత్వం ఆదివా రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో ఉమ్మడి జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు కేటాయింపులపై ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు రానప్పటికీ.. నేడో, రేపో వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దది. అలాంటి ప్రాజెక్టుకు కేటాయింపులపై ప్రకటన రాలేదు. అదే సమయంలో ప్రతిష్టాత్మక రాఘవాపురం–మణుగూరు, హసన్పర్తి – కరీంనగర్, నిజామాబాద్ – కరీంనగర్ – పెద్దపల్లి డబ్లింగ్, పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ వర్క్స్ కేటాయింపులపై ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. పింక్ బుక్ విడుదల ఈసారి లేకపోవడంతో నిధుల కేటాయింపుపై ఇప్పటివరకు తమకు సమాచారం లేదని, తాము కూడా కేంద్ర రైల్వేమంత్రి విలేకరుల సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని వివరించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జోన్ల వారీగా నిధుల కేటాయింపులపై వివరాలు త్వరలోనే విడుదలవుతాయని పేర్కొన్నారు. గతేడాది ఉమ్మడి జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎంత అనేది ఆసక్తిగా మారింది. -
సంక్షేమం, అభివృద్ధి
కరీంనగర్: ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించే బడ్జెట్. ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర వహిస్తుంది. వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్ నిధులు పెంచాం. ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్ లక్ష్యం. – బండి సంజయ్కుమార్, కేంద్ర సహాయమంత్రి -
మున్సిపల్పై కాషాయజెండా ఎగురవేద్దాం
● మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో కాషాయజెండా ఎగురవేయాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కోరారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాషాయజెండా ఎగురవేయడానికి అనుకూలంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాజన్న దర్శనం చేసుకున్న క్షేత్రం కాబట్టి పట్టణ ప్రజలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయి న గోపి, జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్, నాయకులు శంకర్, సిరికొండ శ్రీనివాస్, బండ మల్లేశం, గోపు బాలరాజు, కృష్ణస్వామి, సత్తయ్య పాల్గొన్నారు. -
ఎగసిన నిరసన జ్వాలలు
సిరిసిల్లటౌన్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై సిరిసిల్లలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం కార్మికక్షేత్రంలోని అన్ని వాడలలో నిరసన ర్యాలీలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేపట్టారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో బైక్ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ ఆధ్వర్యంలో రగుడు చౌరస్తాలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ తగులపెట్టారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, రాష్ట్ర నాయకులు బొల్లి రామ్మోహన్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గొర్రె తలకాయతో వినూత్న నిరసనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంపై ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామ కూడలిలో గొర్రెతలకాయతో కూడిన సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13 మందిపై కేసు రాచర్లబొప్పాపూర్లో గొర్రె తలకాయను సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు పెట్టి దహనం చేసిన ఘటనపై 13 మందిపై కేసు పెట్టినట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వరుస కృష్ణహరితోపాటు మరో 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు మండే శ్రీను ఆధ్వర్యంలో యాదవ కులస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కల్యాణం.. కమనీయం
సనుగులలో కల్యాణ వేడుకకు హాజరైన భక్తులుముస్తాబాద్లో కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు, సనుగులలో హాజరైన భక్తులుచందుర్తి/ముస్తాబాద్: చందుర్తి మండలం సనుగుల శ్రీగోవిందరాజుల కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాత, శాశ్వత చైర్మన్ ఉప్పుగంటి శోభలత–గోవిందరావు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు అందజేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు హైదరాబాద్, కరీంనగర్లో స్థిరపడ్డ ఈ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, సర్పంచ్ బొడిగే లావణ్య, ఉపసర్పంచ్ శనిగరపు స్వామి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, సనుగులు సింగిల్ విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి దర్శించుకున్నారు. ముస్తాబాద్లో.. బందనకల్ వాసుదేవ ఆశ్రమం వార్షికోత్సవం సందర్భంగా రుక్మిణి, వేణుగోపాలస్వామి కల్యాణం నిర్వహించారు. అర్చకులు రామశర్మ, రాజేందర్శర్మ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించారు. సర్పంచులు చిగురు నరేశ్, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి, కార్తీక్రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రానికి మొండిచేయి
వేములవాడ: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేకసార్లు ప్రధానిని కలిసి విన్నవించినా రాష్ట్రాన్ని విస్మరించారు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించారు. క్రీడారంగంలోనూ తెలంగాణకు కేటాయింపులు లేవు. రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా నిధులు సాధించలేకపోవడం బాధాకరం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ -
నేటి ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి ఉండదని స్పష్టం చేశారు. అందుబాటులోకి ఫర్టిలైజర్ యాప్ సేవలు సిరిసిల్ల: రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం ఆదివారం కోరారు. ఈ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఫర్టిలైజర్ యాప్ను రైతులు డౌన్లోడ్ చేసుకొని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆలయ కమిటీకి సన్మానం తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి సమ్మక్క–సారలమ్మ ఆలయ కమిటీని ఆదివారం శ్రీమల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్ గదగోని సాగర్, ఆలయ కమిటీ చైర్మన్ కడారి రాంరెడ్డి, సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ‘యాదవుల మనోభావాలు పట్టించుకోరా?’ సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ నేతలు గొర్రె తలకాయను రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు తగిలించి నిరసన చేపట్టడం సరికాదని.. ఇది యాదవుల మనోభావాలు దెబ్బతీయడమేనని యాదవ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ మాట్లాడారు. యాదవుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్లను కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జడల రవీందర్, వాసం మల్లేశం, మాసం భాస్కర్, జడల అరవింద్, అన్నబోయిన మల్లికార్జున్, తాడెం శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాజాతర పనులు వేగవంతం చేయండివేములవాడ: మహాశివరాత్రి జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఈవో రమాదేవి సూచించారు. తన చాంబర్లో ఆదివారం సమావేశమయ్యారు. సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఆలయ ఉద్యోగులు సమన్వయంతో విధులు నిర్వహించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూశారని అభినందించారు. ఈ అనుభవంతో మహాశివరాత్రి జాతరను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. కార్మికులను బానిసలుగా మారుస్తున్నారు తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నీరుగార్చి, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు విమర్శించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఆదివారం నిర్వహించిన సుతారి సంఘం సమావేశంలో మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. తోట కనకయ్య, సుతారి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఖజానా గలగల
● సిరిసిల్లలో రూ.31.02 లక్షలు ● వేములవాడలో రూ.6.15 లక్షలు వసూలుసిరిసిల్ల: ఆస్తిపన్ను.. నల్లా పన్నులు చెల్లించాలని మున్సిపల్ సిబ్బంది ఇంటి చుట్టూ తిరిగినా వసూలు కాని రోజులు చూశాం. కానీ మున్సిపల్ ఎన్నికలు రావడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో బకాయి పన్నులు వసూళ్లు అయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి నామినేషన్ను ప్రతిపాదించే వ్యక్తులకు సంబంధించిన పన్నులు బకాయి ఉండొద్దనే నిబంధనలు ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా మున్సిపల్ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీలోని 39 వార్డులకు నామినేషన్లు వేసిన 240 మంది అభ్యర్థులు మరో 240 మంది ప్రతిపాదించే వ్యక్తులు 880 మంది ఇంటి పన్నులను, నల్లా పన్నులను చెల్లించారు. దీంతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఆస్తిపన్నులు రూ.14 లక్షలు, నల్లాపన్నులు రూ.16లక్షలు, ఇతర పన్నులు రూ.లక్ష వసూలైంది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో నామినేషన్ వేసిన 150 మంది అభ్యర్థులతోపాటు మరో 150 మంది ప్రతిపాదించే వ్యక్తులు మొత్తం 300 మంది తమ ఇంటి పన్నులను చెల్లించారు. ఇంటి పన్నుల రూపంలో రూ.3.83 లక్షలు వసూలు కాగా.. నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీకి రూ.2.32 లక్షలు వసూలయ్యాయి. వేములవాడ మున్సిపల్ పరిధిలో రూ.6.15 లక్షల మేరకు పన్నులు చెల్లించారు. వేములవాడ మున్సిపాలిటీలో నల్లా పన్నులను వసూలు చేయలేదు. ఫలితంగా కొంత మేరకు తక్కువ పన్నులు వసూలయ్యాయి. వాస్తవానికి ఎన్నికల నిబంధనల్లో నల్లా పన్నులు చెల్లించాలనే నిబంధన లేదు. కానీ సిరిసిల్ల మున్సిపల్ అధికారులు నో డ్యూస్ ఇచ్చేందుకు నల్లా బకాయిలు చెల్లించాలనే నిబంధనను విధించడంతో నల్లాల బకాయిలకు మోక్షం లభించింది. వేములవాడలో నిబంధనల మేరకు ఆస్తి పన్నులను మాత్రమే వసూలు చేశారు. ఎన్నికలు లేకుంటే 2026 మార్చి నెలాఖరులోగా ఇంటి చుట్టూ బిల్ కలెక్టర్లు తిరిగితే చెల్లించే పన్నులు ఎన్నికల పుణ్యమానీ ముందే వసూలు కావడం విశేషం. -
ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్య
● డీఐఈవో శరత్కుమార్ సిరిసిల్లటౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రైవేటుకు ధీటుగా మెరుగైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీహెచ్.శరత్కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. డిగ్రీ కళాశాల అడ్మిషన్ ఇన్చార్జి జి.శ్రీధర్రావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు నర్సయ్య పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లాలోని ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎస్సీడీవో రవీందర్రెడ్డి శనివారం కోరారు. 2026 విద్యాసంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న శ్రీఅంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ ద్వారా ఎస్సీ విద్యార్థులకు రూ.20లక్షలు స్కాలర్షిప్ అందిస్తారని తెలిపారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ దేశాల్లోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో చదువాలనుకునే ఎస్సీ విద్యార్థులు మార్చి 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 79893 84801లో సంప్రదించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్ రామాలయం అర్చకుడు వేణుగోపాలాచారి శనివారం జాతీయ కామధేను పురస్కారం అందుకున్నారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో కేవీ రమణాచారి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. తెలంగాణ నుంచి భద్రాచలం అర్చకులతోపాటు ఎల్లారెడ్డిపేటకు చెందిన వేణుగోపాలాచారికి ఈ పురస్కారం దక్కింది. సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: మేరా యువభారత్ బీసీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నర్సింగ్ కళాశాలలో శని వారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మై భారత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెంకట రాంబాబు మాట్లాడారు. 18 ఏళ్లు దా టిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, గంగిపల్లి స్వామి, పూసాల సంతోష్, నెల్లిమెల రజనీకాంత్, ధనుష్ పాల్గొన్నారు. మైనర్లు వాహనాలు నడపొద్దువేములవాడ: మైనర్లు బైక్లు నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని.. ఇందుకు తల్లిదండ్రులు బాధ్యతవహించాల్సి వస్తుందని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ నిబంధన పాటించకుండా ప్రమాదకరంగా వాహనాలు నడిపిన వారికి శనివారం స్థానిక ఠాణాలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒకే బైక్పై ఐదుగురు మైనర్లు అతివేగంగా తిరగడాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రాణాలకే ముప్పు అన్నారు. మైనర్లు వాహనాలు నడపడం మోటారు వాహన చట్టం ప్రకారం నేరమన్నారు. ట్రాఫిక్ ఎస్సై సముద్రాల రాజు, పేరెంట్స్ ఉన్నారు. -
రాయబేరాలు
బుజ్జగింపులు...సిరిసిల్ల: బుజ్జగింపుల పర్వం మొదలైంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు రాయబేరాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించేందుకు వారి సన్నిహితులతో పావులు కదుపుతున్నారు. సిరిసిల్లలో 429, వేములవాడలో 260 నామినేషన్లు వేశారు. వేములవాడలో 29, సిరిసిల్లలో 59 మంది స్వతంత్రులు నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పోటీ నుంచి తప్పించే ప్రయత్నిస్తున్నారు. బరిలో దిగాలా... బందుకు జరగాలా ! కౌన్సిలర్లుగా పోటీ చేసి రాజకీయంగా ఎదగాలనే ఆశతో చాలా మంది నామినేషన్లు వేశారు. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రత్యర్థులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రత్యర్థులకు భారీ నజరానాలు ఆఫర్ చేస్తున్నారు. ఎన్నికల ఖర్చు భరించడం ఇబ్బంది అవుతుందని బరిలో ఉండాలా? వద్దా? అనే ఆలోచనలో కొందరు పడ్డారు. ఎదుటి వారు ఇచ్చే ఆఫర్లు తీసుకొని పక్కకు జరగాలనే ఆలోచనలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. రంగంలోకి ముఖ్యనాయకులు అభ్యర్థుల జాబితా ఆధారంగా ముఖ్యనాయకులు బుజ్జగింపులకు రంగంలోకి దిగారు. సాధ్యమైనన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో ముగించాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, వేములవాడలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో సిరిసిల్లలో మూడు కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈసారి కూడా అదే పట్టుదలతో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్రులు కూడా ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రత్యర్థులపై ప్రలోభాల వల విసురుతున్నారు. తప్పుకుంటే భవిష్యత్లో పదవులు ఇస్తామని, కాంట్రాక్టు పనులు అప్పజెప్పుతామని, పార్టీలో ప్రాధన్యమైన పదవులు అందిస్తామని ఆఫర్లతో చర్చలు సాగిస్తున్నారు.‘అన్నా.. నువ్వు గెల్సుడు గ్యారంటీ. మొన్నటిసారి మన వార్డుల గంత కష్టపడినం. కొద్దిల మిస్సయింది. ఈసారి మాత్రం గెలుపు మనదే. పోటీల ఉండుడే. నువ్వు గెల్వకుంటే మేం గుండు గీయించుకుంటం. మావోడైతే మీసాలే గీయించుకుంటానని చెప్తుండు’... నామినేషన్లు వేసిన అభ్యర్థుల వద్ద అనుచరులు చెబుతున్న మాటలు. నమ్మినబంటుగా ఉండే ద్వితీయశ్రేణి నేతలు వీధులవారీగా వార్డుల్లో ఓట్లు అంచనా వేస్తూ భారీ మెజార్టీ కళ్లముందు ఉంచుతున్నారు. సన్నిహితుల మాటలకు ఒకింత సంబరంగా ఉన్నా.. లోలోన మాత్రం తెలియని భయం అభ్యర్థిని వెంటాడుతోంది. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుందంటూ అనుచరులను ఆరా తీస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో అభ్యర్థుల వద్ద వారి అనుచరులు గొప్పలు చెబుతున్నారు. అన్నో నిన్నే నమ్ముకుని పది రోజులుగా పనిచేస్తున్నం. ఇప్పుడు నువ్వు తప్పుకుంటే మా గతి అటు.. ఇటు కాకుండా పోతది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుచరుల మాటలను అంచనా వేస్తూ ఎన్నికల్లో అయ్యే ఖర్చులను లెక్కిస్తూ అభ్యర్థులు డైలమాలో ఉన్నారు. అనుచరులు మాత్రం అభ్యర్థుల్లో నమ్మకం కలిగిస్తూ మందు, విందులు చేసుకుంటున్నారు. -
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
సిరిసిల్ల: రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా 2వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్ పిల్లలపైనే ఉందన్నారు. రాబోయే తరంలో రోడ్డు ప్రమాదాలు లేని సమాజాన్ని స్థాపించాలన్నారు. రోడ్డు మాది.. భవిష్యత్ మీది.. వేగంగా వెళ్లవద్దని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. బతుకమ్మ ఘాట్ నుంచి పాతబస్టాండ్ మీదుగా అంబేడ్కర్చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ కె.కృష్ణ, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి రజనీ, పృథ్వీరాజ్వర్మ, ఆర్టీఏ సిబ్బంది రమ్య, సౌమ్య, ప్రశాంత్, యెల్లెశ్ పాల్గొన్నారు. -
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
రెండో విడత ర్యాండమైజేషన్సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్, మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి పర్యవేక్షణలో కలెక్టరేట్లో రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఎన్నికల విధుల నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, జగన్మోహన్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, భారతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ రెండో జాబితా
● పొద్దంతా సమీక్షించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటీ చేసే పది మందితో రెండో జాబితాను బీఆర్ఎస్ గురువారం రాత్రి ప్రకటించింది. తొలి విడతలో బుధవారం 18 మంది పేర్లు ప్రకటించగా.. రెండో విడతగా మరో 10 మంది పేర్లను ప్రకటించారు. 1వ వార్డులో బూర బాలు, 2లో వేముల రాములు, 4లో అడ్డగట్ల మాధవి బాలకిషన్, 6లో దూడం రజని శ్రీనివాస్, 14లో అడ్డగట్ల మాధవి మురళి, 19లో అన్నారం శ్రీనివాస్, 22లో కత్తెర వరుణ్, 33లో దార్ల అశోక్, 34లో దార్ల సందీప్, 38లో రిక్కుమల్ల రజిత సంపత్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించారు. పొద్దంతా కేటీఆర్ సమీక్ష పట్టణ బీఆర్ఎస్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొద్దంతా సమీక్షించారు. వార్డుల్లో పోటీ నెలకొనడంతో సయోధ్య కుదిర్చారు. పలువార్డుల నాయకులు పార్టీ టిక్కెట్లు ఆశిస్తూ జనంతో తెలంగాణ భవన్కు బలప్రదర్శనకు రావడం విశేషం. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా.. ఇప్పటికే 28 మందిని ప్రకటించారు. ఇంకా 11 వార్డుల జాబితా పెండింగ్లో ఉంది. బీఆర్ఎస్లో చేరి టిక్కెట్ పొంది 1వ వార్డు రగుడుకు చెందిన బూర బాలు బీఆర్ఎస్లో చేరి టిక్కెట్ సాధించారు. 6వ వార్డు టిక్కెట్ను దూడం రజనీ, శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి బీ ఆర్ఎస్లో చేరారు. మున్సిపల్ ఇన్చార్జి తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, కేడీసీసీబీ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిందం చక్రపాణి, చీటి నర్సింగరావు, రామ్మోహన్, వేణు పాల్గొన్నారు. -
● జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, హెల్ప్ డెస్క్, అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషాకు సూచించారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, మెప్మా అధికారి మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేశ్కుమార్, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ, మాస్టర్ ట్రైనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. ‘లింగ నిర్ధారణ’ చేస్తే కఠిన చర్యలు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లు, కొత్త ప్రైవేట్ దవాఖానాలకు అనుమతులు, నవజాత శిశు మరణాలపై వైద్య, ఆరోగ్య, సంక్షేమ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. భ్రూణ హత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ శోభారాణి, ఎన్జీవో ప్రతినిధి భాస్కర్ పాల్గొన్నారు. -
పైసలే ఫైనల్
● అభ్యర్థి ఆర్థిక బలాబలాలపై ఆరా వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలు లెక్కించే క్రమంలో పార్టీ అధినేతలు ఆర్థిక బలాన్నే ప్రధానం చూస్తున్నారు. అ భ్యర్థికి ఏపాటి పేరుందో కాదు.. ఏమాత్రం పైసలు ఖర్చు చేయగలడో ఆరా తీస్తున్నారు. వే ములవాడ మున్సి పల్ పరిధిలో అన్ని పార్టీలు ఇదే మంత్రాన్ని జపిస్తున్నట్లు సమాచారం. ఈసారి టికెట్లు కన్ఫమ్ కావడంలో ప్రజలకు చేసిన సేవ కంటే ఎంత ఖర్చు పెట్టగలడనే లె క్కలు వేస్తున్నారు. సీనియర్ నాయకులు, స్థా నికంగా పేరు ఉన్నవారు టికెట్ కోసం ఎదురుచూస్తుంటే.. పార్టీ పెద్దలు మాత్రం ఏమాత్రం ఖర్చు పెడతారనే చూస్తున్నారని చర్చ సాగుతోంది. దీంతో కొందరు ఆశావహులు పార్టీలు మా రేందుకు అడుగులు వేస్తుండడం రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ పని చేస్తాం.. ఆ పని చేస్తామంటూ ఒకప్పుడు అభ్యర్థులు ప్రచారం చేసే వారు. కానీ నేడు వారు ఎంత ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం మాకే వేయండంటూ అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతుండడం ఎన్నికల్లో పైసలు ఎంత ప్రధానంగా మారాయో అర్థమవుతుంది.వేములవాడ: పట్టణాభివృద్ధికి బీజేపీతో కలసి రావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన డాక్టర్ నరేశ్, పల్లపు లక్ష్మణ్, వానిక సంపత్, మెరుగు లక్ష్మణ్, గంగరాజు, నర్సయ్య, బాబులకు పార్టీ కండువా కప్పారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, పట్టణశాఖ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షులు శంకర్, వివేక్రెడ్డి పాల్గొన్నారు. వేములవాడఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ మండలం సంకెపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజుకుమార్ గురువారం తనిఖీ చేశారు. చెక్పోస్ట్ వద్ద రిజిస్టర్ను పరిశీలించారు. నోడల్ అధికారి గీత, నవీన్కుమార్, భారతి ఉన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రానున్న వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ డీఈఈలు పావని, రాము పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్లో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతీ గ్రామపంచాయతీలో ఎంపీవో, మిషన్ భగీరథ సహాయ ఇంజినీర్లు, పంచా యతీ కార్యదర్శులు, పంపు డ్రైవర్ కమిటీ సభ్యులతో కలిసి నీటి ఎద్దడిని గుర్తించి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎంపీడీవో సత్తయ్య, మండల పంచాయతీ అధికారి జోగం రాజు, మిషన్ భగీరథ సహాయక ఇంజినీర్ సంతోష్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ పంపు డ్రైవర్లు పాల్గొన్నారు. వేములవాడ: స్టేట్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణకు వేములవాడ బార్ అసో సియేషన్ రూమ్లో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారి పొత్తూరి అనిల్కుమార్, జడ్జి జ్యోతి ర్మయి, సూపరింటెండెంట్ ఆంజనేయులు, అడ్వకేట్ నక్క దివాకర్ గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. 203 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 23 మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యత ఓటు హక్కును ఇంగ్లిష్లో క్యాపిటల్ లెటర్స్తో వన్, టూ, త్రీ, ఫోర్ ఇలా వేయాలని అనిల్కుమార్ తెలిపారు. -
● సిరిసిల్లలో 134.. ● వేములవాడలో 90 దరఖాస్తులు
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్/వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు గురువారం నామినేషన్ల జోరు కొనసాగింది. సిరిసిల్లలో 134 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీఆర్ఎస్ 40, కాంగ్రెస్ 36, బీజేపీ 31, సీపీఎం 3, జనసేన 3, ఏఐఎఫ్బీ 1, సీపీఐ 1, ఇండిపెండెంట్లు 18 చొప్పున నామినేషన్లను సమర్పించారు. రెండు రోజుల్లో 154 నామినేషన్లు దాఖలైనట్లు మున్సి పల్ కమిషనర్ ఖదీర్పాషా తెలిపారు. 13 కౌంటర్ల ద్వారా 30 మంది ఆర్వో, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్ సీఐ కృష్ణ, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. వేములవాడలో.. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజ్కుమార్ పరిశీలించారు. ఆర్డీవో రాధాభాయ్, నోడల్ అధికారులు గీత, నవీన్కుమార్, భారతి, కమిషనర్ సంపత్కుమార్, టీపీవో అన్సార్ ఉన్నారు. రెండో రోజు 90 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 28, బీజేపీ 24, బీఆర్ఎస్ 21, జనసేన 5, సీపీఐ 2, బీఎస్పీ 1, ఇండిపెండెంట్ 9 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లకు నేడు చివరి రోజు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో నామినేషన్ దాఖలుకు శుక్రవారం చివరి రోజు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. గతంలో పలువురు ఆలస్యంగా నామినేషన్ కేంద్రానికి చేరుకొని పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. సిరిసిల్లలో 39 వార్డులకు 13 నామినేషన్ కేంద్రాలు, వేములవాడలో 28 వార్డులకు 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని హెల్ప్లైన్కు పెద్దగా ఫిర్యాదులు రా వడం లేదు. సిరిసిల్లకు చెందిన వేముల మార్కండేయులు తన ఓటు హక్కు మిస్ అయిందని ఫిర్యాదు చేయగా.. మరో వార్డులో ఉన్నట్లు ఆధార్కార్డు నంబరుతో గుర్తించారు. నామినేషన్ పత్రాల దాఖలు అంశంపై వంగరి అనిల్ ఫిర్యాదు చేశారు. -
వస్త్రోత్పత్తి ఖిల్లా
● నాలుగు దశాబ్దాల కిందటే మున్సిపాలిటీగా.. ● 39 వార్డులతో విస్తరించిన సిరిసిల్ల సిరిసిల్ల: కార్మిక క్షేత్రం.. వామపక్ష ఉద్యమాలకు, తెలంగాణ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ. వస్త్రోత్పత్తి ఖిల్లాగా సిరిసిల్ల ఖ్యాతిగాంచింది. ప్రస్తుతం ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రంగా అవతరించింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సిరిసిల్ల రాజకీయ ఉద్దండులకు వేదికై ంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా మరమగ్గాలు(పవర్లూమ్స్) ఉన్న పట్టణంగా భాసిల్లుతోంది. సిరిసిల్ల ‘పుర’ ప్రస్థానంపై కథనం. టౌన్ మున్సిపాలిటీగా.. 1953లో తొలిసారిగా టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అప్పట్లో పట్టణ జనాభా 12 వేలు ఉండేది. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, రెడ్డివాడ, సుభాష్నగర్, గాంధీనగర్, అంబేడ్కర్నగర్, పాతబస్టాండు ప్రాంతాలతో కలిసి చిన్న పట్టణంగా ఉండేది. కాలక్రమంలో వెంకంపేట, శాంతినగర్, గోపాల్నగర్, పద్మనగర్, కొత్తబస్టాండు, రాయినిచెరువు ప్రాంతాలు కలిసిపోవడంతో బీవై నగర్, పీఎస్ నగర్, ఇందిరానగర్, తారకరామానగర్, గణేశ్నగర్, వంశీకృష్ణకాలనీ, రాజీవ్నగర్, భూపతినగర్లతో పట్టణం విస్తరించింది. ఏడేళ్ల క్రితం సిరిసిల్ల శివారులోని పెద్దూరు, సర్ధాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, ముష్టిపల్లి, చంద్రంపేట, రగుడు గ్రామాల విలీనంతో లక్షకు పైగా జనాభాతో 39 వార్డులతో పట్టణ రూపురేఖలు విశాలమయ్యాయి. దేశంలోనే తొలి నేతన్న కాంస్య విగ్రహం ఉంది. తొలి చైర్మన్ మడుపు మల్లారెడ్డి సిరిసిల్ల టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించాక 1953లో తొలి చైర్మన్గా మడుపు మల్లారెడ్డి ఎన్నికై .. 1962 వరకు కొనసాగారు. 1962లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుజ్జె రాజయ్య ఎన్నికయ్యారు. 1964లో సిరిసిల్ల మున్సిపాలిటీని ప్రభుత్వం గ్రామపంచాయతీగా మార్చింది. అప్పటికే మున్సిపల్ చైర్మన్గా ఉన్న గుజ్జె రాజయ్య పాలకవర్గాన్ని 1970 వరకు గ్రామపంచాయతీ పాలకవర్గంగానే కొనసాగించింది. 1971లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రుద్ర శంకరయ్య సర్పంచ్గా గెలుపొందారు. పదేళ్లపాటు శంకరయ్య సర్పంచుగా కొనసాగారు. 1981లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గుండ్లపల్లి భూమయ్య సర్పంచ్గా ఎన్నికై .. 1987 వరకు కొనసాగారు. మళ్లీ ‘పుర’పాలన గ్రామపంచాయతీగా ఉన్న సిరిసిల్ల పట్టణాన్ని 1987లో ప్రభుత్వం తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 1988లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ రుద్ర శంకరయ్య సతీమణి రుద్ర సత్తమ్మ మున్సిపల్ తొలి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 1995లో జరిగిన ఎన్నికల్లో మాజీ సర్పంచ్ గుండ్లపల్లి భూమయ్య సతీమణి గుండ్లపల్లి సరోజన చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2000లో ఆడెపు రవీందర్ను చైర్మన్గా నేరుగా పట్టణ ఓటర్లు ఎన్నుకున్నారు. పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ ఎన్నికలు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈమేరకు 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుడ్ల మంజులను చైర్పర్సన్గా మెజార్టీ కౌన్సిలర్లు పరోక్ష పద్ధతిలో ఎన్నుకున్నారు. 2010 నుంచి 2014 వరకు ప్రత్యేకాధికారి పాలన సాగింది. 2014లో మరోసారి సిరిసిల్ల చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సామల పావని ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2019 జూలై 2వ తేదీతో ముగిసింది. 2020 జనవరిలో జరిగిన ఎన్నికల్లో చైర్పర్సన్గా జిందం కళాచక్రపాణి ఎన్నికై.. 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం ప్రత్యేకాధికారుల పాలన సాగింది. విస్తరించిన పట్టణం సిరిసిల్ల కాలక్రమంగా విస్తరిస్తోంది. 2005లో 29 వార్డులు ఉండగా.. 2014 నాటికి 33 వార్డులు అయ్యాయి. ద్వితీయశ్రేణి మున్సిపాలిటీగా ఉన్న సిరిసిల్ల ఇప్పుడు ఏడు గ్రామాల విలీనంతో ప్రథమశ్రేణి మున్సిపాలిటీగా అవతరించింది. జిల్లా కేంద్రంగా భాసిల్లుతోంది.జనాభా: 1,12,002, ఓటర్లు: 81,959 పురుషులు: 39,942, మహిళలు: 42,011 థర్డ్ జెండర్ : 06, వార్డులు: 39 పోలింగ్ కేంద్రాలు: 117 పట్టణ విస్తీర్ణం : 51.93 చదరపు కిలోమీటర్లు గృహాలు: 24,721, అక్షరాస్యత శాతం: 73.7 -
ఉడ్తి పతంగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మజ్లిస్ –ఎ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) సత్తా చా టేందుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పలుమార్లు సత్తా చాటుకున్న ప తంగ్ పార్టీ మరోసారి విజయబావుటా ఎగరేసేందుకు సన్నద్ధమవుతోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తగినన్ని సీట్లు సంపాదించి కింగ్మేకర్ కావాలని ప్రణా ళికలు రచిస్తోంది. తన సుదీర్ఘ రాజకీయ మిత్రపార్టీ అయిన కాంగ్రెస్తో మరోసారి జట్టు కట్టేందుకు లేదా అవగాహనతో ముందుకు వెళ్లేందుకు పావులు కదుపుతోంది. రెండు దశాబ్దాలుగా కరీంనగర్ కా ర్పొరేషన్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో ఉనికి చాటుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అసెంబ్లీ, బల్దియా ఎన్నికల్లో వీరి పొత్తు అనివార్యం అయ్యేలా చక్రం తిప్పడం ఆ పార్టీకే చెల్లింది. కరీంనగర్లో కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎంఐఎం పార్టీ 2005లో తొమ్మిది కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది. 2014లో రెండు కార్పొరేటర్లకు పరిమితమైంది. 2020లో పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో 10 సీట్లకు పోటీచేసి ఏడు సీట్లు గెలుచుకుంది. ఒక కో–ఆప్షన్ను బీఆర్ఎస్తో పొత్తులో భాగంగా కైవ సం చేసుకుంది. ఒకప్పటిలా ముస్లిం మైనార్టీలకే పరిమితం కాలేదు. హిందువులు మెజారిటీ ఉన్న చోట్ల వారినే నిలబెట్టి గెలిపించుకునేలా వ్యూహాలు రచించడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. హైదరాబాద్లో విజయవంతమైన ఈ ఫార్ములా రాష్ట్రంలో అన్ని చోట్లా అమలు పరుస్తోంది. కరీంనగర్లో 40 డివి జన్లలో కమిటీలు ఏర్పాటు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని ఈసారి 20 చోట్ల పోటీ చే స్తోంది. ఇందులో కనీసం 15 స్థానాలు గెలుచుకొని కరీంనగర్ కార్పొరేషన్లో కింగ్మేకర్ పాత్రను పోషి స్తూ.. మూడు లేదా నాలుగు కోఆప్షన్లును కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. మొన్న బిహార్ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం నిన్న మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 125 మంది కార్పొరేటర్లను గెలుచుకొని సత్తా చాటింది. అదే ఊపుతో తెలంగాణలోని నిజా మాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, బోధన్లో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో 2020లో జగిత్యాలలో రెండు, కోరుట్లలో రెండు చొ ప్పున కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. మెట్పల్లిలో ఒకటి, పెద్దపల్లిలో రెండు కౌన్సిలర్ సీట్లను కైవస చేసుకుంది. రామగుండంలో ఎంఐఎం మద్దతుతో పలువురు విజయం సాధించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరిద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లకు అవినీతి బంధుప్రీతి పార్టీ నియమావళి ఉల్లంఘన తదితర కారణాలతో టికెట్లు ఖరారు చే యలేదని సమాచారం. ఒకప్పుడు ఎంఐఎం టికెట్ కోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం రాజకీయ వలసలు, ముస్లిం దళిత సామాజిక వర్గాల్లో వచ్చిన స్పందనతో డిమాండ్ పెరిగిపోయింది. ఎంఐఎం అధినేత ఎంపీ అసద్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్లలో మూడు రకాల సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి ఎలాగైనా 15 స్థానాల్లో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది. -
‘చింతలఠాణా’ చిక్కుముడి వీడేదెన్నడో!
● ‘చితి’కిపోయిన వ్యక్తి సర్పంచ్గా ఎన్నిక ● ఉపసర్పంచ్కు రాని చెక్పవర్ ● గ్రామంలో పేరుకుపోతున్న సమస్యలు ● కలెక్టర్ను ఆశ్రయించిన పాలకవర్గంసిరిసిల్ల: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణా సర్పంచ్గా మరణించిన వ్యక్తి గెలుపొందాడు. ఎన్నికల ప్రచార సమయంలో సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి డిసెంబర్ 3న గుండెపోటుతో చనిపోయాడు. డిసెంబర్ 11న జరిగిన ఎన్నికల్లో గ్రామస్తులు అతని గుర్తు కత్తెరకే ఓటు వేసి గెలిపించారు. గ్రామంలో ఐదుగురు బరిలో నిలవగా.. కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745, బడుగు శ్రీనివాస్కు 40, మంత్రి రాజలింగంకు 160, సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు. పల్లెల్లో పాలన మొదలై నెలదాటింది అన్ని గ్రామాల్లో నూతన పాలకవర్గాల పాలన డిసెంబరు 22, 2025న ప్రారంభమైంది. కానీ చింతలఠాణాలో ఉపసర్పంచ్గా గొట్ల కుమార్, వార్డు మెంబర్లు మరో తొమ్మిది మంది అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఉపసర్పంచ్తో పాటు పాలకవర్గానికి ఎలాంటి బాధ్యతలను అధికారులు అప్పగించలేదు. దీనిపై జిల్లా అధికార అధికారులు ప్రభుత్వానికి నివేదించి వదిలేశారు. ఫలితంగా స్థానిక పాలన లేక చింతలఠాణాలో ప్రజాసమస్యలకు మోక్షం లభించడం లేదు. కలెక్టర్ను ఆశ్రయించిన పాలకవర్గం కలెక్టర్ గరీమా అగ్రవాల్ను చింతలఠాణా ఉపసర్పంచ్ గొట్ల కుమార్, వార్డు సభ్యులు నాయిని రవి, పొత్తూరి దేవరాజు, మంత్రి రాజేశం గురువారం ఆశ్రయించారు. 37 రోజులుగా స్థానిక పాలన లేక గ్రామపంచాయతీ పనులు కుంటుపడుతున్నాయని, స్థానిక మండల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నిక జరిగే వరకు ఉపసర్పంచ్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి చెక్పవర్ ఇవ్వాలని వారు కోరారు. అధికారికంగా స్పష్టత ఇచ్చి చింతలఠాణాలో స్థానిక పాలనకు శ్రీకారం చుట్టాలని కోరారు.ఓట్లు: 2,319, పోలైన ఓట్లు: 1,719, వార్డులు: 10 -
సందడి లేని ‘సంగీత’ నిలయం
వేములవాడరూరల్: వేములవాడ ప్రాంతంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా... ‘సంగీత’ నిలయం సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ సందడి కనుమరుగైంది. 2004 లో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు తన తండ్రి చెన్నమనేని రాజేశ్వర్రావు గెలుపు కోసం పాటుపడ్డారు. అప్పటి నుంచి సంగీత నిలయం వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో నాటి ఎన్న్ఙికళ్ఙ కళ వేములవాడలోని సంగీత నిలయంలో ప్రస్తుతం లేదు. మరోవైపు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద మాత్రం రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరగడంతో సందడి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న ఈ సందడి రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రత్యేక కథనం. వేములవాడ నియోజకవర్గం అంటేనే చెన్నమనేనికి పెట్టింది పేరుగా ఉన్నది. నాడు చెన్నమనేని రాజేశ్వర్రావు తదుపరి ఆయన తనయుడు రమేష్బాబు ఈ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పాలన సాగించారు. ఏ ఎన్నికలు వచ్చినా వేములవాడ సంగీత నిలయంలో కార్యకర్తలు, అభిమానులతో కళకళలాడేది. అలాంటి ఆ సంగీత నిలయం ప్రస్తుతం జన ఆకర్షణ లేకుండా నెలకొన్నది. వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి వద్ద అభిమానులు, కౌన్సిలర్ టికెట్ ఆశించే అభ్యర్థుల రద్దీ నెలకొంది. గతంలో ఎప్పుడూ రద్దీగా ఉండే సంగీత నిలయం ప్రస్తుతం వెలవెలబోతోంది. నాడు మాజీ ఎమ్మెల్యే దివంగత రాజేశ్వర్రావు ఉన్న సమయంలో ప్రతీ ఎన్నికల సమయంలో ప్రజలు క్యూ కట్టేరోజులు కనబడ్డాయి. కానీ.. మాజీ ఎమ్మెల్యే రమేశ్బాబుకు టికెట్ రాకపోవడంతో ఆయన ప్రస్తుతం జర్మనీలోనే ఉంటున్నారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు టికెట్ ఇవ్వడంతో గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎలాగైనా వేములవాడ మున్సిపాలిటీలపై తమ జెండా ఎగురవేయాలని ఇప్పటికే పలు సమావేశాల్లో ప్రకటించారు. అభ్యర్థుల వేటలో పార్టీలు.... ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మున్సిపాలిటీ కౌన్సిలర్లు పలువురు పోటీ పడుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఆశిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ తరరపున తమ అభ్యర్థులను గెలిపించేందుకు బలమైన అభ్యర్థుల వేటలో ఆ రెండు పార్టీల నాయకులు అన్వేషిస్తున్నారు. ప్రధానంగా వేములవాడ మున్సిపాలిటీపై ఎలాగైనా తమ పార్టీ జెండా ఎగురవేయాలని ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీల ప్రధాన నాయకులు సమావేశాలు నిర్వహించారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు కలవు. ఇందులో ప్రధానంగా తమ బలమైన అభ్యర్థులను అధికార పార్టీకి దీటుగా పోటీలో ఉంచి మున్సిపల్పై తమ జెండా ఎగరవేయాలని ఆ రెండు పార్టీల అభ్యర్థులు దృష్టిపెట్టారు. ప్రధానంగా అధికార పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు తమ బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచి మున్సిపల్ జెండా కై వసం చేసుకునేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే ఆ ప్రధాన పార్టీల నాయకులు వేములవాడ పట్టణంలో సర్వేలు నిర్వహించి అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నారు. బుధవారం ప్రధాన పార్టీల నాయకులు ముఖ్య నాయకులతో తమ కార్యాలయంలోకి కొంత మంది సంఘం పెద్ద మనుషులు, పార్టీ సీనియర్ నాయకులతో పిలిపించుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనప్పటికీ వేములవాడలో ప్రధాన రాజన్న ఆలయం ఉండడంతో ఇక్కడ మూడు పార్టీల అభ్యర్థులు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల క్రైం: ఆర్థిక ఇబ్బందులతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పవర్లూమ్ కార్మికుడు నర్సయ్య(50) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. నర్సయ్య పవర్లూమ్ కార్మికుడిగా జీవనోపాధి పొందుతున్నాడు. పెద్ద కూతురుకు ఐదేళ్ల క్రితం వివాహం చేశాడు. మరో కూతురుకి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కుటుంబ అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో కూతురు పెళ్లి ఎలా చేయడమంటూ పలుమార్లు కుటుంబ సభ్యులతో మదనపడ్డాడు. బుధవారం పనికి వెళ్తున్నాని ఇంటి నుంచి వెళ్లి తను పనిచేస్తున్న ఖార్కానాలో ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో తపాలా ఉద్యోగి మృతిమేడిపల్లి: మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన తూం ఆనంద్ కుమార్ (42) గుండెపోటుకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఆనంద్ భీమారం మండలంలోని మన్నెగూడెంలో బ్రాంచ్ పోస్ట్మాస్టర్. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతిపై తోటి ఉద్యోగులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తప్పిపోయిన వృద్ధుడువేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్కు చెందిన గడప చేరాలు(60) ఈనెల 26న తప్పిపోయినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డయల్ 100కు, 83749 25039లో సమాచారం ఇవ్వాలని కోరారు. హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు 69వ ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ బైకని కొమురయ్య తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అఖిల, శ్రీజ ఇటీవల మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చారన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదోతేదీ వరకు హిమాచల్ప్రదేశ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్కుమా ర్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవ్రావు అభినందించారు. -
టూ వీలర్.. దండిగా
మళ్లీ రావడం ఎందుకు అని అనుకున్నాడో? లేక.. ఆటోలో తీసుకెళ్తే చార్జి అధికం అవుతుందనే తెలియదు కానీ.. ఓ వ్యక్తి టూవీలర్పై ఒకేసారి ఎనిమిది డ్రమ్ములు తీసుకెళ్తూ ఇలా కనిపించాడు. చూసేవారు ఖాళీ డ్రమ్ములే కదా? ఏం కాదులే అని చమత్కరిస్తుంటే.. మరికొందరు వచ్చిపోయే వారికి సైడ్కూడా ఇవ్వకుండా ఇంత ప్రమాదకరంగా ప్రయాణించడం అవసరమా? అని విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి చౌరస్తా నుంచి వెళ్తూ డ్రమ్ముల టూవీలర్ శ్రీసాక్షిశ్రీకి ఇలా కనిపించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్; పెద్దపల్లి -
నాలుగు కార్లు ఢీ
● పలువురికి స్వల్పగాయాలు జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రం శివారు ధరూర్ బ్రిడ్జి వద్ద స్పీడ్బ్రేకర్ల ఏర్పాటుతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం వేగంగా వచ్చిన కార్లు స్పీడ్ బ్రేకర్ల వద్ద అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో స్పీడ్బ్రేకర్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కొండగట్టు ఆలయ అర్చకులకు మెమోలుమల్యాల: కొండగట్టు ఆలయ ఈవోకు వ్యతిరేకంగా ఈనెల 23న ధర్నాకు దిగిన అర్చకులకు ఈఓ మోమోలు జారీ చేసినట్లు తెల్సింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ జన్మదినం సందర్భంగా కొండగట్టులో పూజలు చేసేందుకు టీడీపీ నాయకులు రాగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారని, దుర్భాషలాడారని అర్చకులు ఈవోకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేశారంటూ ఈఓ అర్చకులకు బుధవారం మెమోలు జారీ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఏడుగురు ఉమ్మడి జిల్లావాసులుజగిత్యాలజోన్: ఈనెల 30న జరిగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 203 మంది పోటీ చేస్తుండగా.. వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఏడుగురు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్న కాసుగంటి లక్ష్మణ్కుమార్, సీహెచ్.ప్రదీప్కుమార్ రాజు, కె.సంజీవరెడ్డి, ఐ.సత్యనారాయణ, బాలసాని సురేశ్గౌడ్, పోలు వెంకటరాజ్కుమార్, కె.వేణుగోపాల్ ఉన్నారు. వీరితోపాటు మరో ఐదారుగురు ఉమ్మడి జిల్లాకు చెందినవారు ఉన్నప్పటికీ వారంతా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ధ్వంసమైన కార్లు -
బిర్యానీ సెంటర్లో అగ్నిప్రమాదం
ధర్మపురి: చికెన్ బిర్యానీ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి రూ.20లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. యజమాని ఎండీ.అనాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అనాస్ తండ్రి సాబీర్ మూడేళ్లుగా చికెన్ బిర్యానీ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. సాబీర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అనాస్ సెంటర్ నడిపిస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 11.30గంటల సమయంలో సెంటర్ మూసి ఇంటికి వెళ్లారు. బుధవారం వేకువజామున పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా ఫైరింజన్ సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో రూ.20లక్షలకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. రెవెన్యూ సిబ్బంది పంచనామా చేపట్టారు. మంటలు ఆర్పిన ఫైరింజన్ రూ.20 లక్షలకు పైగా ఆస్తి నష్టం -
అమ్మలేదు.. ఆదుకునే నాన్నలేడు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గోరుముద్దలు తినిపించే అమ్మలేదు.. ఆటాపాటలతో సంతోషాన్నిచ్చే నాన్నలేడు.. అనారోగ్యం రూపంలో వచ్చిన మృత్యువు దంపతులిద్దరినీ కబళించడంతో వారి ఇద్దరు కూతుళ్లు ఏ దిక్కూలేక అనాథలయ్యారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామంలో ఈ దయనీమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అక్కల సదయ్య(35)– శ్యామల దంపతులు. వీరిది పేదకుటుంబం. సదయ్య ఊరులో పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. ఉన్నంతలో తమ ముగ్గురు కూతుళ్లను పోషించుకుంటున్నారు. కొంతకాలం క్రితం పెద్దకూతురు వివాహం జరిపించి అత్తారింటికి పంపించారు. విధివక్రీకరించింది.. అనారోగ్యానికి గురైన శ్యామల రెండేళ్ల క్రితం మృతి చెందింది. అయినా, తన ఇద్దరు కూతుళ్లు అక్షయ, అక్షితను పోషించుకుంటున్న సదయ్య.. అకస్మాత్తుగా ఆయన కూడా అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలోనే బుధవారం చనిపోయాడు. తండ్రి శవం వద్ద బిక్కుబిక్కుమంటున్న కూర్చున్నారు వారి చిన్నకూతుళ్లు అక్షయ, అక్షిత. ఏం చేయాలో కూడా తెలియని స్థితివారిది. బాలికలను చూసిన గ్రామస్తులు అయ్యా పాపం అంటూ చలించిపోయారు. అంత్యక్రియల ఎలా జరపాలని ఊరోళ్లే ఆలోచన చేశారు. ఊరంతా తలోకొంత డబ్బుపోగు చేసుకున్నారు. సదయ్య అంత్యక్రియలు పూర్తిచేసి మానత్వం చాటుకున్నారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాడు తల్లి, నేడు తండ్రి మృతి అనాథలైన చిన్నారులు దయనీయ స్థితిలో బాలికలు చందాలు వేసుకుని అంత్యక్రియలు మానవత్వం చూపిన ఇదులాపూర్ గ్రామస్తులు -
నీ మద్దతు నాకుండాలే..!
● మనోళ్ల ఓట్లు పోనియ్యద్దు ● ఈసారి ఎవరున్నా నేను పోటీలుంటా ● మున్సిపాలిటీల్లో ఎటూ చూసినా ఇవే ముచ్చట్లు యువకుడు : అన్నా ఎన్నికలట.. నువ్వు పోటీ చేస్తున్నావే.. ఆశావహుడు : అవునే.. నా వయసు యాబై.. ఇక నాకెప్పుడు గుర్తింపు చెప్పు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొత్తయా.. ఎప్పుడు పోటీచేయాలా! అని ఎదురుచూస్తున్నా. రెండు నెలల కిందటే ఎన్నికల్లో పోటీ చేయాలని వార్డులున్న వాళ్లందరినీ కలిసిన. కానీ ఎన్ని కలే పెట్టకపోయిరి. ఈసారి పోటీచేసుడే అన్న. యువకుడు : మరీ మీ అన్న ఉన్నడు కదే ! నిజమే.. కానీ అన్నా అని చూస్తే నా వయసు అయిపోతుంది. మల్లా రిజర్వేషన్ కల్సి వత్తదో.. లేదో.. మా అన్న ఒక్కసారి కౌన్సిలర్గా చేసిండు సాలదా.. మళ్లీ మళ్లీ ఆయనే పోటీచేత్తే నా సంగతేంది. ఎన్నికల్లో అన్న లేదు.. తమ్ముడు లేదు. పోటీ చేసుడు. వాడకట్టుల అందర్నీ కూసోవెట్టి మాట్లాడుతం. ఎవ్వరికి మద్దతుంటే వాళ్లే పోటీచేయాలే.. యువకుడు : అంతేగదనే అన్న. ఈసారి బాగానే ఖర్సు అయితది. ఆశావహుడు : అరె తమ్మీ ఖర్సుకు భయపడ. దేనికీ ఎన్కకు బోను. ఎన్నికల్ల దిగినంక అన్నింటికీ సిద్ధమే. యువకుడు : అయితే ఓకే అన్నా.. నాకు కొద్దిగా పనుంది. నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో!ఇవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. రియల్ ఎస్టేట్ దందాలో సంపాదించిన వాళ్లంతా ఈసారి ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా రాణించాలని చూస్తున్నారు. అందుకే ఏదో ఒక్క పార్టీలో చేరి టిక్కెట్ సంపాదించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నారు. – సిరిసిల్లయువకుడు : శ్రీనన్న మున్సిపల్ ఎన్నికలట.. మల్లా పోటీ చేస్తవా లేదా..? నాయకుడు : అరె నాకెందుకురా భయ్ గీ రాజకీయాలు. నేను చేసింది చాలదా! నువ్వే పోటీచెయ్. నీ ఎన్క నేనున్న గదా తమ్మీ. యువకుడు : అన్నా నీ మద్దతు నాకుండాలే. ఖర్సయినా సరే.. కౌన్సిలర్గా మన గల్లీల నిలవడ్త. పోయినసారి నీకై తే నేను పనిచేసిన. నీకు తెల్సు. ఈసారి నాకు మద్దతు ఇయ్యి అన్న కౌన్సిలర్ గావాలంతే.. నాయకుడు : అరే తమ్మీ నా మద్దతు నీకే. కానీ పార్టీ టికెట్ వస్తుందా? యువకుడు : అరే అన్నా నువ్వు లేవాయే.. నాకు టికెట్ ఇప్పియ్యాలే. నాయకుడు : సరే.. తమ్మీ చూద్దాం లే. -
స్వగ్రామానికి చేరిన వలసజీవి మృతదేహం
బోయినపల్లి(చొప్పదండి): సంక్రాంతి పండుగ పూట వలస జీవి మరణ వార్త తెలిసింది.. సమ్మక్క జాతరకు మృతదేహం ఇంటికి చేరింది.. ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా మృతదేహం రాకకోసం 17 రోజులు ఎదురుచూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన ప్రవీణ్ రూ.10 లక్షల వరకు అప్పు చేసి 9 నెలల క్రితం ఆర్మేనియా దేశం వెళ్లాడు. అక్కడ కారు డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందేవాడు. ఈనెల 11న రోడ్డు పక్కన ఉండగా ఓ వాహనం వచ్చి ప్రవీణ్ను ఢీకొట్టడంతో మృతిచెందాడు. 17 రోజుల అనంతరం ప్రవీణ్ మృతదేహం బుధవారం బోయినపల్లికి చేరింది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. యూరప్లో ఈనెల 11న ప్రవీణ్ మృతి -
నో డ్యూ.. నో సిస్టం
కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియా కార్యాలయం బుధవారం ఆశావహులతో కిటకిటలాడుతోంది. కార్పొరేటర్గా పోటీ చేసేందుకు నోడ్యూ సర్టిఫికెట్ దాఖలు చేయాల్సి ఉంది. దీనికి ఆస్తిపన్ను, కుళాయి బిల్లులు తదితర బకాయిలు చెల్లించేందుకు ఆశావహులు, అభ్యర్థులు, ప్రతిపాదించేవారు భారీగా బల్దియా కార్యాలయానికి తరలివచ్చారు. జనం ఒక్కసారిగా వెల్లువెత్తడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగంలోకి దిగినా, ఒకదశలో తోపులాట చోటుచేసుకుంది. కార్యాలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆన్లైన్లో బకాయిలు.. గతంలోనే కుళాయి బిల్లులు చెల్లించినా.. ఆన్లైన్ రికార్డుల్లో బకాయిలు ఉన్నట్లు చూపించడంతో ఆశావహులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రషీదులు చూపిస్తున్నా నో డ్యూ ఇవ్వడంలేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రం కావడంతో అధికారులు రికార్డులు పరిశీలించి బకాయిలను క్లియర్ చేశారు. అయినా.. అధిక సమయం తీసుకోవడంతో ఆశావహులు గంటల తరబడి నిరీక్షించారు. అయితే, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలున్నాయి. మరోవైపు.. ఒక్కో నో డ్యూ సర్టిఫికెట్ కోసం కొందరు అధికారులు రూ.3,000, ప్రతిపాదించే వ్యక్తి నుంచి మరో రూ.3,000 చొప్పున ఫీజు వసూలు చేయడంపై అసహనం వ్యక్తమమైంది. ఈ విషయంపై కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ వివరణ ఇస్తూ.. కౌన్సిల్ ఆమోదంతోనే ఫీజులు వసూలు చేస్తున్నామన్నారు. -
రాజన్న సిరిసిల్ల
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 20267సిరిసిల్ల: సిరిసిల్లలోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి.చందుర్తి: ఆశిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్రను నాటకం ద్వారా ప్రదర్శించారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
సిరిసిల్ల: మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్, సిరిసిల్ల మున్సిపల్ ఇన్చార్జి తుల ఉమ కోరారు. తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, సిద్ధం వేణు, సత్తార్ పాల్గొన్నారు. 11 మంది సిట్టింగ్లతోనే.. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు ఉండగా..18 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. గత కౌన్సిల్లో చైర్పర్సన్గా ఉన్న జిందం కళాచక్రపాణి, వైస్చైర్మన్గా ఉన్న మంచె శ్రీనివాస్ సతీమణి రేణుకతోపాటు మరో తొమ్మిది మంది సిట్టింగ్ కౌన్సిలర్లకు అవకాశం కల్పిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో స్వల్పఓట్లతో ఓడిపోయిన మరో ఐదుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్థులు ఇద్దరికి టిక్కెట్లను ప్రకటించారు. 3వ వార్డులో జిందం కళాచక్రపాణి, 5లో దార్నం అరుణలక్ష్మీనారాయణ, 8లో లింగంపల్లి భాగ్యలక్ష్మిసత్యనారాయణ, 9లో దొంతునేని కల్యాణిఅశోక్రావు, 12లో మొగిలి నాగరాజు, 13లో బుర్రనారాయణ, రాజు, 16లో గుడ్ల శ్రీనివాస్, 17లో గుండ్లపల్లి నీరజపూర్ణచందర్, 21లో ఎలుక వెంకటేశం, 24లో బుర్ర మల్లికార్జున్, 27లో కాసర్ల పద్మ, 28లో అడిచెర్ల రూపాసాయికృష్ణ, 29లో గెంట్యాల శ్యామలశ్రీనివాస్, 30లో మంచె రేణుకశ్రీనివాస్, 32లో సయ్యద్ అక్రమ్, 35లో బత్తుల రమేశ్, 36లో కల్లూరి రేణుకారాజు, 39వ వార్డులో ఆకుల స్వప్నకృష్ణ(చిన్న)ల పేర్లను ప్రకటించారు. -
సిరిసిల్లలో 20.. వేములవాడలో 16
సిరిసిల్లటౌన్: బల్దియా ఎన్నికలలో భాగంగా బుధవారం నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ ఆవరణలో కమిషనర్ ఖదీర్పాషా నేతృత్వంలో 39 వార్డులకు 13 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 15 మంది ఆర్వో, 15 మంది ఏఆర్వోలకు విధులు కేటాయించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి నలుగురు అధికారులతో ‘హెల్ప్డెస్క్’ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ పర్యవేక్షించారు. నామినేషన్ సెంటర్కు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ను అమలు చేశారు. సిరిసిల్లలో 20 మంది 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 3వ వార్డు నుంచి తాజా మాజీ చైర్పర్సన్ జిందం కళ(బీఆర్ఎస్), 12వ వార్డు నుంచి సూర నిర్మల(కాంగ్రెస్), 30వ వార్డు నుంచి నాగుల రూప(బీజేపీ) తదితరులు నామినేషన్లను అఽధికారులకు అందజేశారు. బీఆర్ఎస్ నుంచి 11, కాంగ్రెస్ 4, బీజేపీ ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్లు పొందడానికి అధికారుల నుంచి స్పందన కరువైందని వారు వాపోయారు. రాత్రి వరకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు గుప్పించారు. నో డ్యూ సర్టిఫికెట్లు లేక పలువురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలును ఒక రోజు వాయిదా వేసుకున్నారు. వేములవాడలో 16 నామినేషన్లు వేములవాడ: వేములవాడలో మొదటి రోజు 16 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ సంపత్కుమార్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి 8, బీఆర్ఎస్ నుంచి 5, బీజేపీ నుంచి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. -
నామినేషన్ల సందడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించడంతో సమయం లేక అభ్యర్థులు, పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొదటి రోజు కొంతమంది నామినేషన్లు దాఖలు చేసి, టికెట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల్లోని నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే గెలుపు పక్కా అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఒక్కో వార్డు/డివిజన్లో పార్టీ టికెట్లు ఆశించే వారు 3 నుంచి నలుగురు ఉండడంతో నేతలకు తలనొప్పిగా మారింది. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పలువురు ఆశావహులు గాడ్ ఫాదర్లను నమ్ముకొని, టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఒక్కోవార్డు/డివిజన్లో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో పార్టీలన్నీ సర్వే నిర్వహించాయి. షెడ్యూల్ ఖరారు కాగానే కొత్తవారు తెరపైకి రావడంతో సర్వే ఆధారంగా గెలిచే అవకాశం ఎవరికున్నదనే ప్రాతిపదికన టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల్లోని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థుల గుణగణాలు, ప్రజల్లో ఆదరణ, పార్టీకి అందిస్తున్న సేవలు తది తర అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల కేటా యింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, నియోజవర్గ ఇన్చార్జ్జీలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలను కై వసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ నేత వొడితెల ప్రణవ్ వ్యూహరచన చేస్తున్నారు. ● బీఆర్ఎస్ విషయానికొస్తే కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, చక్రం తిప్పుతున్నారు. బీజేపీలో మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అన్ని తానై నడిపిస్తున్నారు. ● పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సి పాలిటీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్లో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు విజయరమణా రావు, ఎంఎస్ రాజ్ఠాకూర్ టికెట్ల కేటాయింపులపై దృష్టి సారించారు. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, పుట్టమధు, బీజేపీ పార్టీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, సునీల్రెడ్డి, కందుల సంధ్యారాణి టికెట్ల వ్యవహారాన్ని చూస్తున్నారు. ● సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్లు అభ్యర్థులపై దృష్టిసారించారు. బీఆర్ఎస్లో మాజీ మంత్రి కె.తారకరామారావు, చల్మెడ లక్ష్మి నరసింహరావులు, బీజేపీలో యథావిధిగా బండి సంజయ్కుమారే టికెట్ల వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. ● జగిత్యాల జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పరిశీలిస్తుండగా, బీఆర్ఎస్లో డాక్టర్ సంజయ్ టికెట్ల వ్యవహారాన్ని చూస్తున్నారు. బీజేపీలో ఎంపీ అరవింద్ అభ్యర్థుల ఖరారులో చురుకుగా వ్యవహరిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు అన్నిపార్టీలు రేపు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. అదే రోజు బీ–ఫారాలు అప్పగిస్తే వారంతా పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల అధికారులకు దాఖలు చేస్తారు. అయితే మేయర్/చైర్మన్ అభ్యర్థుల ఖరారు మాత్రం పార్టీలకు సంకటంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా మేయర్/చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో రిజర్వేషన్ అనుకూలించే ప్రతీ సీనియర్ నేత పోటీకి దిగుతున్నారు. పోటీకి సిద్ధమైనవారు ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్తాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల విధులపై జోనల్ ఆఫీసర్స్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీంలకు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి బుధవారం శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణీని గుర్తించి రిపోర్ట్ చేయాలన్నారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, నోడల్ అధికారులు గీత, శ్రీనివాసాచారి, నవీన్, ట్రైనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు. హెల్ప్లైన్ సెంటర్, కంట్రోల్ రూం ప్రారంభం కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికల హెల్ఫ్లైన్ సెంటర్, కంట్రోల్ రూం, మీడియా సెంటర్ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రారంభించారు. ఎన్నికల ఫిర్యాదులను 1800 233 1495కు కాల్ చేయాలని కోరారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశమయ్యారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల్లో పార్టీలు అనుసరించాల్సిన విధి, విధానాలను, నిబంధనలను వివరించారు. అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు వేములవాడ: ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఓటర్ జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈనెల 28 నుంచి 30 వరకు ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. వేములవాడలో 28 వార్డులకు 10 మంది ఆర్వోలు, 10 మంది ఏఆర్వోలను నియమించినట్లు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, తహసీల్దార్ జయంత్కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ పాల్గొన్నారు. -
నీళ్లు లేవు.. నీడ లేదు
హెల్ప్డెస్క్ వద్ద రోడ్డుపైనే క్యూలైన్లో అభ్యర్థులుగాంధీచౌక్లో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్లు అభాసుపాలవుతున్నాయి. మున్సిపల్ ఆఫీస్ గేట్లను మూసివేసి గేటు వద్దనే హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల కోసం వచ్చిన అభ్యర్థులకు నీడ కరువైంది. రోడ్డుపైనే క్యూలో నిల్చొని నామినేషన్ పత్రాలు స్వీకరించారు. గేటు వద్దనే హెల్ప్డెస్క్ అని బోర్డు పెట్టి, కనీసం టెంట్ కూడా వేయలేదు. నీళ్లు లేవు.. నిలబడేందుకు నీడ లేదు. నామినేషన్ల స్వీకరణకు కనీస ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా ఏర్పాట్లను సమీక్షించి మెరుగైన వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. రోడ్లపై పోలీసులు ఆంక్షలు పట్టణ ప్రజల సహనానికి పోలీసులు పరీక్ష పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ సాగుతుండగా పోలీసులు పట్టణంలోని ప్రధాన రహదారిని మూసివేశారు. గాంధీచౌక్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఒక్క వైపు రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. దీంతో ఒకే వైపు నుంచి వాహనాలు వెళ్లడంతో రద్దీగా మారింది. మున్సిపల్ ముందు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, పట్టణ సీఐ కె.కృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, గణేశ్, అశోక్కుమార్, ముళీధర్గౌడ్, ట్రాఫిక్ ఎస్సై దిలీప్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని జిల్లా గార్డు కానిస్టేబుళ్లు కాపాడారు. మండల కేంద్రానికి చెందిన సూర నవీన్(27) బుధవారం మానేరు బ్రిడ్జి పైనుంచి వాగులోకి దూకాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న డిస్ట్రిక్ట్ గార్డ్ కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్ వెంటనే వాగులోకి దూకి నవీన్ను ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి సంఘటన స్థలానికి చే రుకుని యువకుడికి కౌ న్సెలింగ్ ఇచ్చారు. వాగులోకి దూకి యువకుడిని కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్ను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. -
గద్దెలకు చేరిన సారలమ్మ
తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఓబులాపూర్ గ్రామాల్లో సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది. మండెపల్లిలో ఉదయం పెద్దభోనం, సాయంత్రం సారలమ్మ, గోవిందరాజు, పగడిద్ద రాజు గద్దెలకు చేరుకోగా.. ఓబులాపూర్లో సమ్మక్క, సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. ముస్తాబాద్లో సమ్మక్క, సారలమ్మలు గద్దెలకు చేరారు. గురువారం అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. మండల కేంద్రంలో 26 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎస్సై ఉపేంద్రచారి బందోబస్తును పరిశీలించారు. సర్పంచులు గదగోని సాగర్, కొమ్మెట పర్శయ్య, ఆలయ కమిటీ చైర్మన్లు కడారి రాంరెడ్డి, తన్నీరు వెంకట్రావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బొప్పాపూర్లో బోనం ఊరేగింపు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో సమ్మక్క–సారలమ్మలకు బోనం తీశారు. పూజారుల నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో తరలివచ్చారు. సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, ఉపసర్పంచ్ సుధాకర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని కందికట్కూర్, వంతడుపుల, ఇల్లంతకుంట గ్రామాల్లో బుధవారం రాత్రి సారలమ్మను డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య గద్దెకు చేర్చారు. ఇల్లంతకుంటలో కోయదొరలు పూజలు చేశారు. గొడుగు హరికుమార్, ఈదుల రమేశ్, రవీందర్రెడ్డి, రాజిరెడ్డి, మల్లేశం, శంకర్, దత్తు పాల్గొన్నారు. ఎత్తుబంగారం మొక్కు సమ్మక్క–సారలమ్మకు ఎత్తు బంగారం మొక్కులు ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల చెల్లించుకుంటున్నారు. బుధ, గురు, శుక్రవారాలలో ఇల్లంతకుంట, కందికట్కూర్, వంతడుపుల గ్రామాల్లో జాతరలు జరగునున్నాయి. దుకాణాలు ఎత్తు బంగారం తూకాలతో కిటకిటలాడుతున్నాయి. -
ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా డాక్టర్ శ్రీనివాస్రెడ్డి
సిరిసిల్ల: తెలంగాణ రెరా సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమితులయ్యారు. బుధవారంజిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులుంటే నేరుగా తనను సంప్రదించవచ్చని శ్రీనివాస్రెడ్డి సూచించారు. వేములవాడరూరల్: మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు సమావేశాలకు హాజరయ్యారు. వేములవాడ రూరల్ మండలంలో బుధవారం నీటి ఎద్దడిపై మండలంలోని సర్పంచులతో సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో మండల పరిషత్లో నిర్వహించిన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి పలు గ్రామాల మహిళా సర్పంచుల స్థానాల్లో వారి భర్తలకు హాజరయ్యారు. ఈ విషయంపై ఎంపీవోను వివరణ కోరగా తనకేమి తెలియదని దాటవేశారు. ఇల్లంతకుంట(మానకొండూర్): ముదిరాజు లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము కోరారు. మండల కేంద్రంలో బుధవారం ముదిరాజ్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చొక్కాల రాము మాట్లాడుతూ ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయాలలో సత్తా చాటాలని కోరారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలని కోరారు. జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు ఎలవేణి రమేశ్, ప్రధాన కార్యదర్శి సరుగు నరేశ్, గౌరవ అధ్యక్షుడు కె.ప్రభాకర్, కనకయ్య, బీసీ మహా అధ్యక్షుడు బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి కొమ్ముల నర్సింహం, పల్లె రాజశేఖర్, పరుశరాములు, నాగరాజు, ఎండ్ర చందన్ పాల్గొన్నారు. సిరిసిల్ల ఎడ్యుకేషన్: హిమాచల్ప్రదేశ్లోని గుమర్విన్ పట్టణంలో నిర్వహించే 69వ ఎస్జీఎఫ్ అండర్–19 జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలికల జట్టుకు హెడ్ ఆఫ్ ది డెలిగేషన్గా సిరిసిల్ల ప్రభుత్వ హైస్కూల్ పీడీ డేవిడ్సన్ వ్యవహరించనున్నారు. ఈమేరకు తెలంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి, సిరిసిల్ల సెక్రటరీ నర్ర శ్రీనివాస్రెడ్డి వివరాలు వెల్లడించారు. క్షయవ్యాధిని కట్టడి చేద్దాంసిరిసిల్ల: జిల్లాలో క్షయవ్యాధిని కట్టడిచేద్దామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో బుధవారం జిల్లా వైద్యాధికారులతో సమావేశమయ్యారు. డీఎంహెచ్వో రజిత మాట్లాడు తూ క్షయవ్యాధిగ్రస్తులకు మంచి పౌష్టికాహారం, మందులు అందిస్తూ వ్యాధి నుంచి విముక్తి లభించేలా సేవలందించాలన్నారు. జి ల్లాలో ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, నయీమా జహా పాల్గొన్నారు. -
హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలి
● వరంగల్– కరీంనగర్ ప్రధాన రహదారిపై నిరసన హుజూరాబాద్: హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించాలనే ఉద్యమం మళ్లీ రాజుకుంది. జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సు డిపో చౌరస్తాలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుంచి భారీ ర్యాలీ తీశారు. శ్రీహుజూరాబాద్ జిల్లా– మన హక్కుశ్రీ అంటూ నినదించారు. అనంతరం కరీంనగర్– వరంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోద్ సదానందం మాట్లాడుతూ అన్ని అర్హతలున్న హుజూరాబాద్ను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్షాళన చేపట్టనున్న నేపథ్యంలో హుజురాబాద్ను జిల్లాగా ప్రకటించాలని, పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు రహదారిపై ఆందోళన నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టౌన్ సీఐ కరుణాకర్ ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. -
దుబాయిలో గుండెపోటుతో సిరికొండ వాసి మృతి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన ముంజ స్కైలాబ్గౌడ్(45) అనే వ్యక్తి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్కైలాబ్గౌడ్ గత పదేళ్లుగా దుబాయిలోని అబుదాబి ఏరియాలో ముసాయిదా క్యాంపులో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 26న తాను ఉంటున్న క్యాంపులోనే గుండెపోటు రావడంతో తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..జగిత్యాలక్రైం: గొల్లపల్లి మండలం వెంగళాపూర్ గ్రామానికి చెందిన బొంకంటి గంగాధర్ (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. గంగాధర్ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీకి వచ్చేందుకు ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వస్తుండగా లక్ష్మీపూర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సమీపంలో ఆకస్మాత్తుగా బర్రె అడ్డు వచ్చి గంగాధర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో గంగాధర్ కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు బొంకంటి నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యచిగురుమామిడి: చిగురుమామిడి మండలం నవాబుపేట్కు చెందిన కక్కెర్ల వివేక్ అనే డిగ్రీ విద్యార్థి కాకతీయ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పృథ్వీధర్గౌడ్ కథనం ప్రకారం.. వివేక్ కరీంనగర్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 24న హాల్ టికెట్ తెచ్చుకునేందుకు కరీంనగర్ వెళ్తున్నానని తల్లి సబితతో చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం సైదాపూర్ మండలం సోమారం కాకతీయ కెనాల్ వద్ద వివేక్ మృతదేహాన్ని గుర్తించారు. తన కొడుకు డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ఫీ వీడియో తీసుకుని.. పురుగుల మందు తాగి..● కుటుంబ సభ్యుల వేధింపులతో యువకుడి బలవన్మరణం చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రా మానికి చెందిన నాగెల్లి వెంకట్రెడ్డి కుటుంబ కలహాలతో సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, ఎల్ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రెడ్డి చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్లో సూపర్మార్కెట్ నిర్వహిస్తున్నాడు. గతేడాది నవంబర్ 7వ తేదీన కరీంనగర్కు చెందిన మనీషాతో వివాహమైంది. సూపర్ మార్కెట్ విషయమై తమ్ముళ్లు శేఖర్రెడ్డి, మహిపాల్రెడ్డి, తల్లిదండ్రులు రాజిరెడ్డి,అనసూర్యతో గొడవలు జరుగుతున్నాయి. తీవ్ర మనస్తాపానికి గురై తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శ్మశానవాటికలో క్రిమిసంహారక మందు తాగుతున్నట్లు భార్య, తన బావలకు ఫోన్చేశాడు. సమాచారం అందుకున్న వారు వెంకట్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున చనిపోయాడు. మనీషా ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిరిసిల్లక్రైం: చోరీ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.3వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎ.ప్రవీణ్ మంగళవారం తీర్పు చెప్పారు. పట్టణ సీఐ తెలిపిన వివరాలు.. శివనగర్కు చెందిన కొండా రంజిత్ 2020 అక్టోబర్లో చంద్రంపేటకు చెందిన అనగందుల గోపి ఇంట్లో రూ.38 వేల విలువగల కెమెరాను చోరీ చేశాడు. అప్పటి ఎస్సై నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి జైలు, జరిమానా విధించారు. -
నన్ను ఏకాకి చేశావా చెల్లె..
చందుర్తి(వేములవాడ): ‘ఇన్నాళ్లు మనకు ఎవరూ లేకున్నా.. ఒకరికొకరం తోడునీడగా ఉన్నాం.. కష్టసుఖాలను పంచుకున్నాం.. ఇప్పుడు నన్ను ఏకాకి చేసి వెళ్లిపోయావా చెల్లె.. నేను ఎవరి కోసం బతకాలె..’ అంటూ చెల్లె మృతదేహం వద్ద అక్క రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బండపల్లికి చెందిన తోకల బుచ్చవ్వ– మల్లయ్య దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. పెద్ద కూతురు లచ్చవ్వ, రెండో కూతురు మల్లవ్వ(53)కు గతంలోనే పలువురితో పెళ్లి కాగా, విడాకులు తీసుకుని తల్లిగారింట్లో ఉంటుండగా, మరో ముగ్గురు వారివారి అత్తవారిళ్లలో ఉంటున్నారు. పెద్ద కూతురు, రెండో కూతురు కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేవారు. తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే మృతిచెందగా, లచ్చవ్వ, మల్లవ్వ ఒకరికొకరు తోడునీడగా జీవనం సాగిస్తున్నారు. వీరికి వారసులు లేరు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సోమవారం వరినాటు వేసి వచ్చిన మల్లవ్వ మంగళవారం వేకువజామున అస్వస్థతకు గురై అకస్మాత్తుగా మృతిచెందింది. చెల్లె మరణాన్ని తట్టుకోలేని అక్క గుండెలవిసేలా రోదించింది. అన్నీతానై కుటుంబాన్ని పోషించిన లచ్చవ్వ చివరకు చెల్లెకు తలకొరివి పెట్టేందుకు ఓ చేతిలో కుండ, మరో చేతిలో అగ్గి పట్టుకుని ముందు నడవడం చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టారు. బాధితులది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు విరాళాలు అందించారు. సర్పంచ్ కటకం మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ గడ్డం శ్రీనివాస్రెడ్డి పాడే మోసి ప్రగాడ సంతాపం తెలిపారు. ఇన్నాళ్లు ఒకరికొకరు తోడునీడగా ఉన్న అక్కాచెల్లెలు అకస్మాత్తుగా చెల్లె మృతి చితికి నిప్పు పెట్టిన అక్క అంత్యక్రియలకు గ్రామస్తుల విరాళం బండపల్లిలో విషాదం -
జన జాతరకు వేళాయె
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/కోనరావుపేట: జిల్లాలో నేటి నుంచి జరిగే సమ్మక్క– సారలమ్మ మహా జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారల గద్దెలను ముస్తాబు చేశారు. బుధవారం నుంచి ఈనెల 31వరకు నాలుగు రోజులపాటు వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 28, 29న గద్దెలపైకి అమ్మవార్లు రానుండగా మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి వన దేవతలకు ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ శివారు అటవీప్రాంతంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశారు. సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, పాలకవర్గం ఆధ్వర్యంలో జాతర కోసం తల్లుల గద్దెలను ముస్తాబు చేశారు. 20 ఏళ్లుగా ఇక్కడ వన దేవతల జాతర జరుగుతోంది. ఏర్పాట్లను మంగళవారం ఎస్సై రాహుల్రెడ్డి పరిశీలించారు. జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. భక్తులు పార్కింగ్ స్థలంలోనే వాహనాలు నిలిపేలా పంచాయతీ అధికారులు, పాలకవర్గం పోలీసులకు సహకరించాలని కోరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువుతండా, శాంతినగర్లో సమ్మక్క, సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. కోనరావుపేట మండలం శివంగాలపల్లిలో వనదేవతల జాతరకు ఏర్పాట్లు పూర్తయినట్లు సర్పంచ్ అంబటి చైతన్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు శేఖర్ తెలిపారు. -
ప్రమాదవశాత్తు కాలువలో పడి ఒకరు మృతి
ఇబ్రహీంపట్నం: అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. మండలకేంద్రానికి చెందిన జింక గంగాధర్(48) సోమవారం తమ కులానికి చెందిన ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లి పక్కనే ఉన్న కాకతీయ కాలువలో నీళ్లు చల్లుకునేందుకు మెట్లు దిగడంతో ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. గ్రామశివారులో మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికింది. మృతుడి సోదరుడు జింక శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై నవీన్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు..జగిత్యాలక్రైం: బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన దుంపెట వినోద్ (29) అనే యువకుడు మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వినోద్ మంగళవారం ట్రాక్టర్తో పొలం దున్నేందుకు వెళ్లాడు. దున్ని తిరిగి వస్తుండగా సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో బోల్తాపడగా వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బీర్పూర్ ఎస్సై రాజు తెలిపారు. స్వగ్రామానికి మృతదేహంరాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన పడాల గంగారెడ్డి (47) అనే గల్ఫ్ కార్మికుడు ఈనెల 6న సౌదీలో గుండెపోటుతో మృతిచెందగా, మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరింది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. గల్ఫ్ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. -
ఉత్పత్తిలో వెనక !
నూలు లేక..ఇదీ.. వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులోని నూలుడిపో. సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు అవసరమైన నూలును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లతో ఏర్పాటు చేసింది. పది శాతం డబ్బులు చెల్లించిన మధ్యతరగతి వస్త్రోత్పత్తిదారులకు నూలు ఇవ్వాలి. కానీ మూడు నెలలుగా నూలు లేక నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చిన ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తిలో మధ్యతరగతి ఆసాములు వెనకబడ్డారు. ఒక్క జరీ నూలు మాత్రమే ఈ డిపోలో అందుబాటులో ఉంది. చీరల బట్ట ఉత్పత్తికి అవసరమైన వెప్ట్(అడ్డం పోగులు), వార్ప్(నిలువు పోగులు) నూలు అందుబాటులో లేదు. దీంతో చీరల ఉత్పత్తి ముందుకుసాగడం లేదు. ఆర్డర్లు : 1.71 కోట్ల మీటర్లు ఆర్డర్ల విలువ : రూ.60కోట్లు ఆర్డర్లు పొందిన మ్యాక్స్లు : 130 ఉత్పత్తి ప్రారంభించిన మ్యాక్స్లు : 15 సిరిసిల్లలోని సాంచాలు : 24,560 ఉత్పత్తి చేస్తున్న సాంచాలు : 6,950 ఇప్పటికే ఉత్పత్తి అయిన చీరల బట్ట : 25 లక్షల మీటర్లు చీరల బట్ట ఉత్పత్తి గడువు : 2026, జనవరి 31 -
పోలీసు శాఖలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
జ్యోతినగర్(రామగుండం): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఎస్సీ రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు విభాగం సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎస్సీల హక్కులు, రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు. నియామకాలు, పదోన్నతులు, సేవా వ్యవహారాల్లో వివక్షత చూపొద్దని పోలీసు అధికారులకు సూచించారు. బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అన్నారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సిఫారసు చేయడం ద్వారా ప్రమోషన్లలో కొంత ఉపషమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్బాబు, రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ, ఏజీపీ(లా అండ్ ఆర్డర్) రమణ, లీగల్ సెల్ అదనపు ఎస్పీ సతీశ్, సీఐడీ ఎస్పీ అనన్య, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. నేను దళిత మహిళను. కుమారస్వామి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. ఇప్పుడు ఇబ్బందులకు గురిచేసిండు. అన్యాయంగా నా ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకుని జైలుకు పంపించిండు. అప్పటి ఎస్సై ఉపేందర్ ఆయనకు సహకరించారు. కుమారస్వామి, ఎస్సై ఉపేందర్తోపాటు మరికొందరిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. –స్వరూప, నస్పూర్, మంచిర్యాల జిల్లా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ ఎన్టీపీసీలో పోలీసు అధికారులతో రాష్ట్రస్థాయి సమీక్ష -
అదుపు తప్పిన కారు
● ఒకరు మృతి, నలుగురికి గాయాలు తిమ్మాపూర్: మండలంలో ఎల్ఎండీ కాలనీలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదు నిమిషాల్లో బందువుల ఇంటికి చేరతామనగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్కు చెందిన కుటుంబం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. సోమవారం సాయంత్రం కారులో ఇంటి నుంచి తిమ్మాపూర్లోని వారి బంధువుల ఇంటికి బయల్దేరారు. ఎల్ఎండీ కాలనీ వద్దకు రాగానే లారీని తప్పించే ప్రయత్నంలో కారు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న కనకమెడల అరుణకుమారి (80) అక్కడికక్కడే మరణించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, తీవ్ర గాయపడిన నలుగురిని సమీప ఆసుపత్రికి తరలించారు. తిమ్మాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి బోయినపల్లి: మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పెంటి రాంప్రసాద్ (49) అనే ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం ఇంటివద్దే ఒక్కసారి కుప్పకూలినట్లు తెలిపారు. రాంప్రసాద్ మృతదేహాన్ని మంగళవారం ఏపీడీ నర్సింహులు, ఎంపీడీవో భీమ జయశీల, ఈజీఎస్ ఏపీవో సబిత, కార్యదర్శి శేఖర్ తదితరులు సందర్శంచి నివాళి అర్పించారు. కుటంబీకులను ఓదార్చి రూ.20 వేలు ఆర్థికసాయంగా అందించారు. మృతుడికి భార్య శ్రీవాణి, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. బాధిత కుటంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. పోలీసుల అదుపులో గంజాయి విక్రేతజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో హస్నాబాద్ గ్రామ శివారులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. సిరిసిల్లక్రైం: నమ్మకంగా కిరాణాషాపు నడుపుతూ పలువురి వద్ద రూ.2కోట్లు అప్పుగా తీసుకొని రెండునెలల క్రితం ఉడాయించిన వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితులు తమ డబ్బును ఎలాగోలా రాబట్టుకునేందుకు సిరిసిల్లటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. వ్యాపారికి బాధితులకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓ జాతీయ పార్టీ నాయకుడు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సిరిసిల్ల టౌన్ పోలీసులను వివరణ కోరగా, వ్యాపారిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
● నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ● అంచెలంచెలుగా ఎదిగిన ఎములాడ
వేములవాడ: నిత్యం రాజన్న సన్నిధికి వేలాది మంది వచ్చి వెళ్లే వేములవాడ 1962కు పూర్వమే మున్సిపాలిటీగా ఉండేది. 1963లో గ్రామపంచాయతీగా అవతరించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలలో ఒకటిగా నిలిచింది. ఈక్రమంలో 2013లో నగరపంచాయతీగా, 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం వేములవాడ పట్టణంతోపాటు శివారులోని కోనాయపల్లి, శాత్రాజుపల్లి, అయ్యోర్పల్లి, తిప్పాపూర్ నాంపల్లి గ్రామాలను కలుపుకుని 28 వార్డులుగా అధికారులు విభజించారు. మొత్తం ఓటర్లు 40,877 ఉండగా, ఇందులో మహిళలు 21,279, పురుషులు 19,580, థర్డ్ జెండర్స్ 18 మంది ఉన్నారు. 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. మున్సిపల్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు మున్సిపల్ నామినేషన్ పర్వం బుధవారం నుంచి ప్రారంభం అవుతుండటంతో కమిషనర్ సంపత్కుమార్ కార్యాలయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఆవరణలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. -
బల్దియా నగారా!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన దరిమిలా కోడ్ అమల్లోకి వచ్చింది. 28వ తేదీ (నేటి) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగనుంది. 31న పరిశీలన, 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, అదే తేదీన తుదిజాబితా ఖరారు కానుంది. ఫిబ్రవరి 11న ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. 12వ తేదీని రీపోలింగ్ కోసం ముందుజాగ్రత్తగా రిజర్వుచేసి ఉంచారు. ఇప్పటికే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వార్డుల పునర్విభజన, ఓటరు తుదిజాబితా, పోలింగ్ కేంద్రాలు, ఉద్యోగులకు శిక్షణ, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పూర్తిచేశారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొత్తం 17 రోజులపాటు ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది. నామినేషన్ కేంద్రాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలోని 15 పురపాలికల్లో 5 చోట్ల బీసీలు, 4 చోట్ల ఎస్సీలు, 6 చోట్ల అన్రిజర్వ్డ్ (ఓసీ) వర్గాలకు అవకాశం కల్పించారు. కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్కు కేటాయించారు. కరీంనగర్లో జమ్మికుంట ఎస్సీ జనరల్కు, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలను ఎస్సీ మహిళలకు కేటాయించారు. జగిత్యాలలో అత్యధికంగా ఓసీలకు అవకాశం కల్పించారు. జగిత్యాల మున్సిపాలిటీ బీసీ (మహిళ)లకు కేటాయించగా, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలు ఓసీ (మహిళ)లగా నిర్ణయించారు. ఇక రాయికల్, మెట్పల్లి మున్సిపాలిటీలు పూర్తి అన్రిజర్వ్డ్గా ప్రకటించారు. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ జనరల్ (మహిళ)కు కేటాయించగా, వేములవాడ మాత్రం బీసీ (జనరల్) అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీలు బీసీ (జనలర్)లకు కేటాయించగా, సుల్తానాబాద్ పూర్తిస్థాయిలో అన్రిజర్వ్డ్గా డిక్లేర్ చేశారు. కోర్టు దావాలపై ఉత్కంఠ.. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన దావాలపై ఉత్కంఠ నెలకొంది. పలు సామాజికవర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ఆయా పిటిషన్లపై న్యాయస్థానాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది. తనిఖీలు ముమ్మరం... కోడ్ అమల్లోకి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ల సీపీలు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు తనిఖీలు ప్రారంభించారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని స్పష్టంచేస్తున్నారు. ఇటు మేడారం బందోబస్తు, అటు మున్సిపల్ ఎన్నికలను సమన్వయం చేసుకునేందుకు ఆయా జిల్లా పోలీసులు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. ఉదయం నుంచే అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కౌంటర్లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. వార్డులు : 28. నామినేషన్ కేంద్రాల సంఖ్య : 01 సెంటర్ ( 10 కౌంటర్లు) చైర్మన్ రిజర్వేషన్ : బీసీ జనరల్వార్డులు: 39 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు: 01 (కౌంటర్లు 13) చైర్ పర్సన్ రిజర్వేషన్: జనరల్ మహిళ (అన్ రిజర్వుడ్ ఉమెన్) -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ను సందర్శించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ కౌంటర్లు, సౌకర్యాలపై మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషాను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా సూచిక బోర్డులు, ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలు చేయాలి రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, చిత్రపటాలు, శిలాఫలకాలు మూసివేయాలని సూచించారు. నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం ఉదయం విడుదల చేయాలని కలెక్టర్ కోరారు. ఉదయం 10.30 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికీ అనుమతి ఉంటుందని వెల్లడించారు. విధులపై పూర్తి అవగాహన ఉండాలి మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర గరీమా అగ్రవాల్ అదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర గడ్డం నగేశ్తో కలిసి నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల నిబంధనలు సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, నోడల్ అధికారులు గీత, లక్ష్మణ్, శ్రీనివాసాచారి, జగన్మోహన్రెడ్డి, నవీన్, ప్రవీణ్, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్, శ్రీనివాస్, భారతి, మల్లికార్జునరావు, షరీఫోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్ల: జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా వైద్యశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్కుమార్ పాల్గొన్నారు. సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఫిబ్రవరిలో సదరం శిబిరాలు నిర్వహించే తేదీలను ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్కుమార్ మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 5న ఆర్థో (ఎముకల), మానసిక వైద్యపరీక్షలు, 6న ఆర్థో(ఎముకల) పరీక్షలు నిర్వహిస్తారు. 9న కంటిచూపు, 12న జనరల్, వినికిడి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయా తేదీల్లో శిబిరాలకు వచ్చే దివ్యాంగులు సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లతో ఎక్స్రే, యూడీఐడీ అప్లికేషన్ ఫాం, ఆధార్కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోలు, ఫోన్ నంబరుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
● విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, ప్రజాపాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పాలిస్టర్ అసోసియేషన్ భవన్, ఎస్ కన్వెన్షన్లో మంగళవారం పలువురు వస్త్రవ్యాపారులు, పద్మశాలీ సంఘం ప్రతినిధులు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ప్రభుత్వం ద్వారా వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందిస్తున్నామని, గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ.200 కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. రూ.50కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేసి నూలును అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్లోనూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, మాజీ కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్, దూస వినయ్, గౌడ రాజు కాంగ్రెస్లో చేరారు. గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపా తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి ఆంకాలపు రవి తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్రాజెక్ట్.. గ్రిడ్కు అనుసంధానం
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నాగారంలో 2 మెగావాట్ల పీఎం– కుసుమ్ సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొని మర్తనపేటలోని 33/11 కేవీ సబ్స్టేషన్ వద్ద మంగళవారం ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు గ్రిడ్కు విజయవంతంగా అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎస్ఈ రమేశ్బాబు మాట్లాడుతూ, రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం–కుసుమ్ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెడ్కో జిల్లా మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 95 మంది రైతులు 125.9 మె గావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఎన్పీడీసీఎల్తో 25 ఏళ్ల వరకు అగ్రిమెంట్లు చేసుకున్నారని, ప్రతీ యూని ట్కు రూ.3.13 చొప్పున డిస్కం చెల్లిస్తుందని తెలిపారు. డిస్కం డీఈలు రాజం, చంద్రమౌళి, ఏడీఈలు సుధీర్, శ్రీనివాస్, ఏఈలు రవీందర్, రమేశ్, రెడ్కో డీవో మునీందర్ తదితరులుపాల్గొన్నారు. -
మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
● రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీగంభీరావుపేట(సిరిసిల్ల): మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల మహిళలలకు మంజూరైన దాదాపు 100 కుట్టు మిషన్లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ మైనార్టీ మహిళాశక్తి రేవంతన్నక భరోసా’ కార్యక్రమం చేపట్టిందన్నారు. ముస్లిం మహిళలు కుట్టుమిషన్ల ద్వారా ఇంట్లోనే ఉపాధిపొందే అవకాశం ఉందన్నారు. త్వరలో మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, గంభీరావుపేటలో మైనార్టీల కోసం కమర్షియల్ కాంప్లెక్స్, మజీద్ అభివృద్ధి, అత్యాధునిక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి కులమత, రాజకీయాలకతీతంగా సేవలందిస్తానన్నారు. సమష్టిగా పనిచేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకుందామన్నారు. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై పెద్దమ్మ బస్స్టేజీని ఎక్స్ప్రెస్ స్టాప్గా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగిందని, త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి భారతి, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ కమలాకర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్, మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్ పాల్గొన్నారు. -
మహా యాగానికి రండి
ఐదురోజుల పని దినాలు అమలు చేయాలిసిరిసిల్ల/సిరిసిల్లటౌన్: వారంలో ఐదురోజుల పనిదినాలు అమలు చేయాలని జిల్లాలో బ్యాంకర్లు ఒక్క రోజు సమ్మెకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) పిలుపు మేరకు సిరిసిల్ల ఎస్బీఐ ఎదుట, గాంధీచౌక్లో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆర్బీఐ, ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్సూరెన్స్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ తదితర ఆర్థిక నియంత్రణ సంస్థలు ఇప్పటికే ఐదురోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. 2024 మార్చి 8న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) వారానికి ఐదురోజుల పని విధానం సిఫార్సు చేస్తూ, అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించా లని సూచించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒప్పందం అమలుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు యూ నియన్ ప్రతినిధులు మనోహర్, శ్రీధర్, బాబు రాజ్, పవన్కల్యాణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన సిరిసిల్ల: సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిసస్కిటేషన్)పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అడిషనల్ డీఎంఈ డాక్టర్ రాజేశ్వరి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మంగళవారం సీపీఆర్పై అవగాహన కల్పించారు. ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించారు. మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నాగార్జున చక్రవర్తి, అసిస్టెంట్ డైరెక్టర్లు అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: మున్సిపల్ బరిలో నిలిచేందుకు తన ఉద్యోగానికి బల్దియా శానిటేషన్ వర్కర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన గడ్డం విజయ చాలా ఏళ్లుగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో శానిటేషన్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మంగళవారం తన ఉద్యోగానికి రాజీనామా చేసి పత్రాన్ని కమిషనర్ ఎంఏ ఖాదీర్పాషాకు అందజేశారు. సిరిసిల్ల 15వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, ఇక్కడ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆమె వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, కోడం రమణ తదితరులున్నారు. -
డీపీవోలో గణతంత్ర వేడుకలు
సిరిసిల్ల క్రైం: గణతంత్ర వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే పోలీస్పరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అ నంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నా గేంద్రచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, నటేశ్, శ్రీనివాస్, ఆర్ఐలు యాదగిరి, రమేశ్, సురేష్ హాజరయ్యారు. సిరిసిల్లటౌన్: జాతీయ కబడ్డీ పోటీల పరిశీలకుడిగా సిరిసిల్లకు చెందిన పీఈటీ మదన్ ఎంపికయ్యారు. త్వరలోనే అమీచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సారథ్యంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలకు పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ఈనెల 27 నుండి 30 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగనున్నాయి. సిద్దార్థ హైస్కూల్ పీఈటీ మదన్ను కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్రావు, జిల్లా అధ్యక్షుడు ముసుకు మల్లారెడ్డి, సెక్రెటరీ సింగారపు తిరుపతి, కోశాధికారి దేవత ప్రభాకర్, కరస్పాండెంట్ నాగుల సంతోష్గౌడ్ అభినందించారు. వేములవాడ: క్రీడలు జీవితంలో భాగం కావాలని సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. జడ్జి మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటములు సహజమన్నారు. అధ్యక్షుడు గుడిసె సదానందం, కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, క్రీడల కార్యదర్శి గుజ్జ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి(చొప్పదండి): ఆడపిల్ల జన్మిస్తే రూ.5వేలు పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని దేశాయిపల్లి సర్పంచ్ నిమ్మ భాగ్యలక్ష్మి ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఇటీవల ఆడపిల్ల జన్మించిన కళ్యాణం వెంకటేశ్ కూతురు పేరిట రూ.5వేలు ఫిక్స్డ్ చేస్తామని తెలిపారు. నిమ్మ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఉపసర్పంచ్ మనోహర్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. వేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లి సర్పంచ్ రెడ్డవేణి పర్శరాములు ప్రభుత్వ పాఠశాలకు ప్యూరిఫైడ్ వాటర్మిషన్ అందజేశారు. గ్రామంలో ఇటీవల జింక అనూష–దుర్గేశ్లకు ఆడపిల్ల పుట్టడంతో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా వారికి పోస్టాఫీసులో ఖాతా తీసి మొదటి రూ.వెయ్యి అందజేశారు. గ్రామంలో ఇటీవల నిర్మించిన మూడు చిహ్నాల జెండా గద్దెను ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పోచంపల్లి అనిల్ కుటుంబానికి పాలకవర్గం రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఉపసర్పంచ్ శంకరయ్య, వార్డుసభ్యులు నాంపల్లి నాగరాజు, మారవేణి కృష్ణవేణి, జెట్టి రాధ, చింతపల్లి మోహన్రావు, ఎండీ అజీజ్, నాగుల మమత, రెడ్డవేణి రాజు, జింక రామలక్ష్మి తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి.. సంక్షేమం
● రైతులకు అండ.. ప్రజారోగ్యానికి భరోసా ● ప్రజావాణికి పెద్దపీట ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఘనంగా గణతంత్ర వేడుకలుసిరిసిల్ల: జిల్లాలో అభివృద్ధి.. సంక్షేమం నిరంతరంగా కొనసాగుతోందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం జాతీయజెండాను ఆవిష్కరించి, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రసంగించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. రైతులకు అండగా.. రైతుభరోసాలో జిల్లాలోని 1,26,278 మంది రైతులకు రూ.149.27 కోట్లు అందించాం. 46,492 రైతులకు రూ.370.75 కోట్ల రుణమాఫీ అందింది. ఈ ఖరీఫ్లో 49,008 రైతుల నుంచి 2.70లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.645కోట్లు వారి ఖాతాలలో జమచేశాం. సన్నవడ్లకు రూ.500 చొప్పున రూ.3.59 కోట్లు 1,541 మందికి బోనస్ చెల్లించాం. 1,94,415 రేషన్కార్డులు ఉండగా.. 5,71,958 మందికి ప్రతీ నెల 665 టన్నుల సన్నబియ్యం అందిస్తున్నాం. 22,068 కొత్త రేషన్కార్డులు ఇచ్చాం. మహాలక్ష్మిలో 3.59 కోట్ల జీరో టికెట్లపై మహిళలు ఉచితంగా ప్రయాణించారు. 93,104 కుటుంబాలు రూ.500లకే సిలిండర్ పొందుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో మెప్మా ద్వారా రూ.2.10కోట్లతో 102 ఉపాధి యూనిట్లు ఏర్పా టు చేశాం. తొమ్మిది మండలాల సమాఖ్యల ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చాం. 2,837 మహిళా సంఘాలకు రూ.382.97 కోట్లు రుణాలు అందించాం. మైనారిటీ మహిళలకు మొదటి విడతగా 495 కుట్టుమిషన్లు పంపిణీ చేశాం. గృహజ్యోతిలో 21.65 లక్షల జీరో బిల్లులు జారీచేసి రూ.84.32కోట్లు చెల్లించాము. 185 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి జిల్లాలో 7,408 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా 185 పూర్తి చేశాం. రెండు పీహెచ్సీ భవనాలు పూర్తి చేశాం. 17 ఆరోగ్య సబ్సెంటర్ల భవనాలు ప్రగతిలో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఏడాది 51 శాతం ప్రసవాలు జరిగాయి. జిల్లాలో 24 గంటలూ అత్యవసర వైద్యసేవల కోసం 12 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 90 రకాల రక్తపరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్లను 1,050 మంది గీతకార్మికులకు ఉచితంగా అందించాం. రూ.291కోట్లతో ఆలయ అభివృద్ధి రూ.291కోట్లతో శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రధాన ఆలయ విస్తరణ, బద్దిపోచమ్మ గుడి అభివృద్ధి, రోడ్ల విస్తరణ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ సహకారంతో నాంపల్లిగుట్టపై యుద్ధ విమానం ఏర్పాటు పనులు చేస్తున్నాం. మరిన్ని పనుల కోసం రూ.980 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నేతన్న పొదుపు, నేతన్న భరో సా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో రూ.50కోట్ల కార్పస్ ఫండ్తో నూలు బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లతో నేతకా ర్మికులకు నిరంతరం ఉపాధి అందుతుంది. అపెరల్పార్క్లో రూ.9కోట్లతో రెండు ప్రైవేటు కంపెనీలు ప్రారంభం కాగా.. 1,900 మందికి ఉపాధి లభిస్తుంది. 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైంది. విద్యతో వికాసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంలో భాగంగా వేములవాడ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. 13 కేజీబీవీల్లో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సు, ఎంసెట్ ఇతర పోటీపరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. 486 పాఠశాలలో ఐసీటీ ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఎఫ్ఎల్పీల ద్వారా 38 వేల మంది విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నాం. 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతులకు రూ.1.81కోట్లు, ప్రయోగశాలలకు ఒక్కో కాలేజీ రూ.50వేలు మంజూరయ్యాయి. తాగునీటి సరఫరాలో.. వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా ముందుస్తు ప్రణాళికతో వెళ్తున్నాం. 348 చెరువుల్లో 1.36 కోట్ల చేప పిల్లలను నీటివనరుల్లో వదిలాం. మరో ఐదు చెరువులలో 29.80 లక్షల మేలు రకాలైన రొయ్యపిల్లలు విడుదల చేస్తాం. 1,16,612 మందికి ప్రతీ నెల రూ.25.60కోట్ల చేయూత పెన్షన్లు అందిస్తున్నాం. మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమానికి.. వృద్ధుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసి 41 మందికి సేవలు అందిస్తున్నాం. 25 మంది ట్రాన్స్జెండర్స్కు గుర్తింపుకార్డులు ఇచ్చాం. సఖీ ద్వారా 1,364 కేసులు పరిష్కరించాం. దివ్యాంగ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందిస్తున్నాం. దివ్యాంగులకు పెట్రోల్పంపు ఏర్పాటు చేశాం. 104 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధికి రూ.96.89 లక్షల సబ్సిడీ అందించాం. మిషన్ వాత్సల్యలో 112 మంది అనాథ పిల్లలకు నెలకు రూ.4వేల చొప్పున అందిస్తున్నాం. అంగన్వాడీల్లో 18,838 మందికి ఆరు నెలలుగా నెలకు 2.5 కిలోల బాలామృత ప్యాకెట్లు, 16 గుడ్లు అందిస్తున్నాం. 8 నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించాం. వేములవాడలో నూతన ఐసీడీఎస్ భవనం ప్రారంభించాం. ప్రజావాణికి పెద్దపీట ప్రజావాణి ద్వారా 3,074 దరఖాస్తులు పరిష్కరించాం. భూ భారతి అమలులో భాగంగా 66 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాం. గ్రామపంచాయతీలలో పారిశుధ్య నిర్వహణ కోసం 1,203 మంది మల్టీపర్పస్ వర్కర్లను నియమించి, ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం అందజేస్తున్నాం. జిల్లాలో 9 కొత్త జీపీ భవనాలు నిర్మించాం. సిరిసిల్ల, వేములవాడల్లో జంక్షన్ల సుందరీకరణ, డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులు చేపట్టాం. గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఎస్పీ నాగేంద్రచారి, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ భర్త, కొడుకు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు నర్సింగ్ కాలేజీ, కేజీబీవీ, మైనార్టీ గురుకుల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంచే పాటలకు నృత్యాలు చేశారు. వివిధ శాఖల శకటాల ప్రదర్శన చేపట్టారు. మత్స్యశాఖ, చేనేత జౌళిశాఖ, వ్యవసాయ శాఖల శకటాలు ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్, ఎస్పీలు స్టాల్స్ను పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్లో, కలెక్టర్ క్యాంపు ఆఫీస్లో కలెక్టర్ గరీమా అగ్రవాల్ జాతీయజెండాను ఆవిష్కరించారు. -
జూకీ శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
సిరిసిల్ల: ఇన్నాళ్లు రెక్కలు ముక్కలు చేసుకున్నా నెలకు ఆదాయం రూ.2వేలు దాటలేదు. అదే నైపుణ్యం ఉన్న జూకీ శిక్షణతో మహిళలకు ఉపాధి పక్కాగా లభిస్తుంది. శిక్షణ ఇవ్వడంతోపాటు స్థానికంగా ఉన్న అపెరల్పార్క్లోని పలు గార్మెంట్స్ కంపె నీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 4,001 మంది తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లో చేనేత, జౌళిశాఖ ఏర్పాటు చేసిన కేంద్రంలో శిక్షణ పొందారు. వీరిలో 1,654 మంది అపెరల్ పార్క్లోని గోకుల్దాస్, టెక్స్పోర్టు గార్మెంట్ యూనిట్లలో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గతంలో బీడీలు చుట్టి.. రెక్కలు ముక్కలు చేసుకున్న వారే. మెరుగైన ఉపాధితో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. స్వల్ప శిక్షణ.. దీర్ఘకాలిక భద్రత శిక్షణ కాలం పది రోజులైనా.. నమ్మకమైన ఉపాధికి బాటలు పడుతున్నాయి. టెక్స్టైల్ పార్క్లో 35 జూకీ మిషన్లపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలానికి రూ.వెయ్యి ఉపకార వేతనం అందిస్తున్నారు. పని నేర్చుకోవడంతోపాటు పది రోజులకు రోజుకు రూ.100 చొప్పున ఉపకార వేతనం రావడంతో శిక్షణపై అతివలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో బ్యాచ్కు 30 నుంచి 35 మందికి శిక్షణ ఇస్తున్నారు. కుట్టుపై అవగాహన లేని వారికి ప్రత్యేకంగా 25 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. నిత్యం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. మధ్యలో భోజన విరామం 45 నిమిషాలు ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి చేనేత, జౌళిశాఖ ద్వారా సర్టిఫికెట్ అందిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్లో శిక్షణ.. అపెరల్ పార్క్లో ప్లేస్మెంట్సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు వద్ద 60 ఎకరాల్లో రెడీమేడ్ దుస్తుల తయారీ కేంద్రం అపెరల్ పార్క్ను ఏర్పాటు చేశారు. అపెరల్ పార్క్లో రెండు యూనిట్లు ప్రారంభమయ్యాయి. టెక్స్టైల్పార్క్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అపెరల్పార్క్లో వెంటనే ఉపాధికి ప్లేస్మెంట్ లభిస్తుంది. గార్మెంట్ రంగంలో రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ప్రతీ నెల నమ్మకమైన ఉపాధి లభిస్తుంది. గతంలో ఇతర పనులు చేసిన మహిళలకు మెరుగైన జీతాలు రావడంతో ఆసక్తిగా అపెరల్పార్క్కు వెళ్తున్నారు. సిరిసిల్ల, జిల్లెల్ల, ఎల్లారెడ్డిపేట మార్గాల్లో కంపెనీ బస్సుల ద్వారా ఉచితంగా రవాణా వసతి కల్పించారు. అపెరల్ పార్క్కు వెళ్లలేని వారు శిక్షణ పూర్తి చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. -
పేదల కళ్లలో ఆనందం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడరూరల్/సిరిసిల్లటౌన్: సొంతింటి కల నిజం కావడంతో పేదల కళ్లలో ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ నియోజకవర్గంలో చాలా వరకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై, వారికి నూతన వస్త్రాలు అందజేశారు. సంగ స్వామి, లింగంపల్లి కిరణ్ పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్దేనని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం 95 శాతం గ్రామాల్లో విద్యుత్ సదుపాయం లేదన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా గరీభీ హటావో నినాదంతో దేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలబెట్టిందన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప–తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపిక
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన గండికోట రాజు ఎంపికయ్యాడు. శాతావాహన యూనివర్సిటీలో ఎంకాం సెకండియర్ చదువుతున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం తరఫున నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటాడు. మైసూర్లో జరిగే సౌత్జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఆరు విద్యుత్ మోటార్లు చోరీజగిత్యాలరూరల్: జగిత్యాలఅర్బన్ మండలం తిప్పన్నపేట, గోపాల్రావుపేటలో ఆరుగురు రైతుల వ్యవసాయ మోటార్లు, ఓ రైతు ట్రాక్టర్ బ్యాటరీని ఆదివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. తిప్పన్నపేట, గోపాల్రావుపేటకు చెందిన దావ శంకర్, కొల్లూరి రవి, అత్తినేని గంగాధర్, పున్నం ప్రసాద్ విద్యుత్ మోటార్లు, కొల్లూరి రాజేశ్కు చెందిన ట్రాక్టర్ బ్యాటరీని అపహరించారు. బాధితులు సోమవారం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. -
నర్సింహునిపేటలో ఇసుక డంపు సీజ్
పెగడపల్లి: మండలంలోని నర్సింహునిపేట శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ను ఆర్ఐ శ్రీనివాస్ సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు 8 ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇసుకను తరలించడానికి ప్రయత్నిస్తే వారిపై పీడీ యాక్ట్, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట రామడుగు మండలం కోరుటపల్లి, మోతె, రామడుగు వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు. -
దివ్యాంగులకు స్కూటీలు
సిరిసిల్ల అర్బన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు. స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఆయుధాలు, పనిముట్ల పనితీరు తెలుసుకున్నారు. పోలీస్శాఖ, చేనేత జౌళిశాఖ, జిల్లా సంక్షేమశాఖ, అగ్నిమాపకశాఖ, ఎస్డీఆర్ఎఫ్, వ్యవసాయశాఖ స్టాల్స్ ఆకట్టుకున్నాయి. అంతకుముందు దివ్యాంగులకు స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, 5జీ స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. -
పార్టీ ఆఫీస్లలో మువ్వన్నెల రెపరెపలు
బీజేపీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ నాయకులు డీసీసీ ఆఫీసులో జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం త్రివర్ణశోభితమైంది. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. గాంధీచౌక్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్లో చైర్పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి, వెంకటేశ్వర ఆలయంలో ఈవో మారుతిరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గాంధీచౌక్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, తెలంగాణ భవన్లో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీజేపీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, గీతానగర్ పాఠశాలలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జింద కళ, కార్మికభవనంలో జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సీపీఎం కార్యదర్శి మూషం రమేశ్, సిరిసిల్ల ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు ఆకుల జయంత్కుమార్, బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు పోరండ్ల రమేశ్, సిరిసిల్ల రచయితల సంఘం అధ్యక్షుడు ఎలగొండ రవి, భవన కార్మిక సంఘం అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, 15వ వార్డులో మాజీ కౌన్సిలర్ ఆకునూరి విజయనిర్మల, నేతన్నచౌక్లో సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు మోర శ్రీనివాస్ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. -
‘కందేపి’ సృజన
సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్ రచనలు చేయడమే కాదు కళాత్మక సందేశాలు ఇచ్చే చిత్రాలు వేస్తుంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం మందుగోలీల డబ్బాల మూతలతో జాతీయ జెండాను, దేశ అభివృద్ధి చెందుతున్న రంగాలను వర్ణిస్తూ చిత్రాలను సృష్టించారు. జాతీయ పతాకాలు, దేశ చిత్రపటాలు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు దాదాపు వంద వరకు ప్రదర్శించారు. చింతగింజలు, కందిపప్పు, వేరుశనగ, అలచంద వంటి పప్పు దినుసులతోనూ ఖళాఖండాలను తయారు చేశారు. రాజన్న ఆలయ గోదాంలో పామువేములవాడఅర్బన్: రాజన్న ఆలయ లడ్డూ గోదాములో ఆదివారం నాగుపాము రావడంతో స్నేక్క్యాచర్ జగదీశ్ వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న పామును అడవిలో వదలిపెట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికునికి గాయాలుకోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బుర్ర నందయ్యగౌడ్(60) తాటిచెట్టు పైనుంచి పడి గాయపడ్డాడు. నందయ్య కనగర్తిలో తాటిచెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. కాలు విరగడంతోపాటు తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. బస్సు నుంచి జారిపడి తీవ్ర గాయాలువేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన రుక్కవ్వ ఆర్టీసీ బస్సు దిగే క్రమంలో కాలు జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో చోరీఇల్లంతకుంట(మానకొండూర్): రహీంఖాన్పేట అనుబంధ గ్రామం ఎర్రనర్సుపల్లి పెద్దమ్మగుడిలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి పుస్తెమెట్టెలు రెండు జతలు ఎత్తుకెళ్లారని, హుండీ పగులగొట్టారని ముదిరాజ్ సంఘం గ్రామాధ్యక్షుడు రాగుల మహేందర్ తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ గుడి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. -
అమ్మ.. ఇప్పుడే వస్తా..
‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మరో యువకుడి తల్లిదండ్రులు సైతం చేతికందిన కొడుకు ఇక లేడని గుండెలవిసేలా రోదించారు. కరీంనగర్క్రైం/వీణవంక: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డుకాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందగా, వారి తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రా మానికి చెందిన మ్యాకల గణేశ్(22), అదే గ్రామానికి చెందిన మిరియాల సందీప్రెడ్డి(20)తో పాటు మరో స్నేహితుడు వేర్వేరు బైక్లపై గణేశ్ బైక్ స్పేర్ పార్ట్స్ కోసం మధ్యాహ్నం కరీంనగర్ వచ్చారు. అనంతరం గణేశ్, సందీప్రెడ్డి బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో హౌసింగ్బోర్డుకాలనీలో రోడ్డు క్రాస్ చేస్తున్న ప్రైవేట్ సూ్క్ల్ బస్సును ఢీకొని బైక్పై నుంచి ఎగిరిపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే క్రమంలో ఇద్దరూ మృతిచెందారు. మృతుడు గణేశ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.తిరుమల్ తెలిపారు. మామిడాలపల్లిలో విషాదం కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో స్వగ్రామం వీణవంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మ్యాకల కొమురయ్య–పద్మ దంపతులకు గణేశ్తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్ ఇంటర్లోనే చదువు మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మిరియాల శ్రీనివాస్రెడ్డి–మమత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సందీప్రెడ్డి. ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఒక్కడే కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. గణేశ్ (ఫైల్) సందీప్రెడ్డి (ఫైల్) స్కూల్ బస్సును ఢీకొట్టిన బైక్ ఇద్దరు స్నేహితుల దుర్మరణం బైక్ పార్ట్స్ కోసం వచ్చి.. కడుపుకోతను మిగిల్చి.. చేతికందిన కొడుకులను కోల్పోయి తల్ల్లడిల్లుతున్న తల్లిదండ్రులు -
మేడారం జాతరలో క్యూఆర్ కోడ్ బ్యాండ్స్
జ్యోతినగర్(రామగుండం): మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో తప్పిపోయిన చిన్నారులను సులభంగా గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక క్యూర్కోడ్ ఉన్న బ్యాండ్స్ రూపొందించింది. వీటిని చిన్నారుల చేతికి కట్టేలా ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేసింది. వివరాలిలు.. మేడారం మహాజాతర (జనవరి 28–31, 2026) సందర్భంగా చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ట్రాకింగ్ బ్యాండ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఎలా పనిచేస్తుందంటే.. పిల్లలు.. ప్రధానంగా 0–8 ఏళ్ల వయసు, వృద్ధుల కోసం పోలీస్ శాఖ క్యూఆర్ కోడ్లతో కూడిన రిస్ట్ బ్యాండ్లు అందిస్తోంది. ఈ క్యూఆర్ కోడ్లో ఆ వ్యక్తి లేదా తల్లిదండ్రులు/సంరక్షకులు వినియోగిస్తున్న మొబైల్ నంబర్, పేరు వంటి ముఖ్య సమాచారాన్ని ముందే నమోదు చేస్తారు. బ్యాండ్ ఎక్కడ పొందాలంటే.. క్యూఆర్ కోడ్ బ్యాండ్లను మేడారం జాతరలోని ప్రధాన ప్రవేశ మార్గాలు, బస్స్టాండ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందజేస్తుంది. ట్రాకింగ్ విధానం.. చిన్నారులు, వృద్ధులు తప్పిపోతే తల్లితండ్రులు లేదా సంరక్షకులు సెంటర్ పాయింట్కు వెళ్లడం ద్వారా పోలీస్లు ఆ డివైస్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. స్కాన్ అయిన వెంటనే పూర్తినమోదు వివరాలు(పేర్లు, ఫోన్ నంబరు మొదలైనవి) స్క్రీన్పై కనిపిస్తాయి. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని/పిల్లలను గుర్తించి కుటుంబానికి అప్పగిస్తారు. తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కోసం పోలీస్ శాఖ యత్నం -
ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
● డీసీసీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం చట్టం పునరుద్ధరించాలని, వీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, రాచర్లగొల్లపల్లి, గంభీరావుపేట, సముద్రలింగాపూర్లలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులు, నిరుపేదలు ఇతర ప్రాంతాలకు వలస పోకుండా నిరోధించడానికి యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆ పథకాన్ని రద్దు చేసేందుకే పేరు మార్చిందన్నారు. కాంట్రాక్టర్లకు లాభం చేసేందుకే వీబీజీ రామ్జీ చట్టాన్ని తెచ్చిందని విమర్శించారు. పార్టీ మండలాల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, హమీద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాబేరబేగం, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాహెబ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్రెడ్డి, షేక్ గౌస్, కొమిరిశెట్టి తిరుపతి, పర్శ హన్మండ్లు, ఎర్ర నర్సయ్య, బాలయ్య, తిరుపతిగౌడ్, భూదయ్య, మహేశ్యాదవ్, భాస్కర్నాయక్ పాల్గొన్నారు. -
వనదేవతలు.. జనజాతరలు
సిరిసిల్ల: వనదేవతల జాతరకు వేళైంది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గద్దెలు ముస్తాబవుతున్నాయి. వేడుకల నిర్వహణకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా స్థానికసంస్థలు, ఆలయ కమిటీలు విరాళాలు సేకరిస్తున్నాయి. ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ తరహాలోనే జిల్లాలోనూ మూడు దశాబ్దాలుగా జాతర వేడుకలు సాగుతున్నాయి. ముచ్చటైన నాలుగు రోజుల పండగను జనవరి 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. జిల్లాలో అమ్మవార్ల గద్దెలపై ప్రత్యేక కథనం. శాంతినగర్లో 50 ఏళ్లుగా.. వీర్నపల్లి మండలం వన్పల్లి శివారులోని శాంతినగర్ బానోత్ గిరిజనతండాలో 50 ఏళ్లుగా సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతోంది. అడవి ఒడిలో సాగే ఈ జాతర శ్రీగిరిశ్రీపుత్రులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. పొరుగునే ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి గిరిజనులు ఎక్కువగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి మీదుగా 36 కిలోమీటర్లు ప్రయాణిస్తే శాంతినగర్ తండా చేరుకోవచ్చు. వేములవాడ నుంచి వట్టిమల్ల, మరిమడ్ల, తాటిపల్లి మీదుగా సమ్మక్క గద్దెల వద్దకు చేరుకోవచ్చు. బస్సు, ఆటో సౌకర్యం ఉంటుంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, బాబాయి తండా, ఇల్లంతకుంట మండల కేంద్రం, కోనరావుపేట మండలం శివంగాళపల్లి గ్రామాల్లోనూ సమ్మక్క–సారలమ్మ జాతర సాగుతుంది. మౌలిక వసతులే సమస్య జాతర జరిగే ప్రాంతాల్లో వసతులు సమస్యగా మా రింది. ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేయకపోవడంతో తాగునీటి వసతి, పారిశుధ్యం, టాయిలెట్లు, వీధిదీపాలు వంటివి ఏర్పాటు చేయడం నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. నిధులు అందుబాటులో లేక వసతులకు ఇబ్బందిగా ఉంది. 28న గద్దెలపైకి అమ్మవార్లు ఈనెల 28న సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెకు చేరుకుంటారు. 29న కుంకుమ భరిణే రూపంలో సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోవడంతో జాతర ప్రారంభమవుతుంది. 30న భక్తులు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించడం, బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 31న అమ్మవార్లు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మినీమేడారం ఓబులాపూర్ తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ నాలుగు రోజులపాటు జనసంద్రమవుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని ముంబయి, భీవండి, షోలాపూర్, హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి వేలాది మంది భక్తులు ఓబులాపూర్ సమ్మక్క గద్దెలకు చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఓబులాపూర్ శివారులో విడిది పొంది అమ్మలకు పూజలు చేస్తారు. 44 ఏళ్లుగా ప్రతీ రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా సమ్మక్క, సారలమ్మ జాతర సాగుతుంది. గతంలో అప్పటి రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో ఆలయ అభివృద్ధికి గిరిజనశాఖ నుంచి రూ.9.50 లక్షలు మంజూరు చేయగా అమ్మవారి గద్దెలు నిర్మించారు. అనంతరం ఎలాంటి నిధులు మంజూరుకాలేదు. -
పేదలకు అండగా ప్రభుత్వం
వేములవాడఅర్బన్: పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మూలవాగు బ్రిడ్జి పనులను, తిప్పాపూర్లోని ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం వేములవాడలోని పలు సంఘాల కమ్యూనిటీహాల్ నిర్మాణం మంజూరుపత్రాలు అందజేశారు. భగవంతరావునగర్లోని రూ.10లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
నిత్యావసరాలు ఇస్తామంటూ నిండా ముంచారు
● గ్రామ ఫౌండేషన్ పేరుతో కొత్త స్కామ్ ● బస్వాపూర్కు చెందిన మహిళే పాత్రదారితంగళ్లపల్లి(సిరిసిల్ల): చైన్ సిస్టమ్ స్కీములతో ఇప్పటికే ఎందరో మోసాపోతున్నా.. కొత్తరకం స్కామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని జనాలు నమ్మి నిండా మునుగుతూనే ఉన్నారు. గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రతీ నెల నిత్యావసర సరుకులు అందిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో వెలుగుచూసింది. బాధిత మహిళలు ఆదివారం బస్వాపూర్కు వచ్చి గ్రామపంచాయతీ వద్ద బైఠాయించారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బస్వాపూర్కు చెందిన ఓ మహిళ వివిధ గ్రామాలకు వెళ్లి శ్రీగ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్శ్రీలో రూ.2,750 కడితే 8 నెలలపాటు ప్రతీ నెల నిత్యావసర సరుకులు, నెలకు రూ.వెయ్యి పింఛన్ వస్తుందని నమ్మించింది. అంతేకాకుండా కొత్తవారిని చేర్పిస్తే ఒక్కొక్కరికి రూ.300 చొప్పున కమీషన్ సైతం అందుతుందని తెలిపింది. దీంతో ఆశపడి నమ్మిన మహిళలు ఒక్కొక్కరు రూ.2,750 చొప్పున వందల సంఖ్యలో మహిళలు నగదు చెల్లించారు. కాగా ఒక నెల కొందరికి మాత్రమే సరుకులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. దీంతో మోసపోయినట్లు గ్రహించిన మహిళలు బస్వాపూర్కు చేరుకుని సదురు మహిళను నిలదీశారు. తాను కూడా ఈ స్కీమ్తో మోసపోయానని తన బంధువులు కూడా ఇందులో చేరారని సదరు మహిళలు తమగోడు వెళ్లబోసుకుందని బాధితులు తెలిపారు. 10 రోజుల్లో మీ అందరి డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో పోలీస్స్టేషన్లో కేసు పెట్టకుండా బాధిత మహిళలు వెనుదిరిగారు. పది రోజుల్లో తాము చెల్లించినా డబ్బు వాపస్ ఇవ్వకుంటే ఆందోళన చేపడతామని తెలిపారు. గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చాపకింద నీరులా సాగుతున్న ఇలాంటి చైన్ లింక్ స్కీముల స్కాములపై పోలీస్శాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
అభివృద్ధిని చూసి చేరికలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రుద్రంగి(వేములవాడ): కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండలం రూప్లానాయక్తండా, చింతామణితండా, బడితండా ఉపసర్పంచులు గుగులోతు తిరుపతి, గుగులోతు బలరాం, గుగులోతు వినోద్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తూం జలపతి తదితరులు ఉన్నారు. అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేరాఫ్ అని బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య విమర్శించారు. సిరి సిల్లలోని బీజేపీ ఆఫీస్లో ఆదివారం బీవీజీ రాంజీ చట్టంపై నిర్వహించిన వర్క్షాప్లో మాట్లాడారు. డిజిటల్ హాజరు, జియో ట్యాగింగ్తో కూలీల సొమ్ము నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుందన్నారు. పని దినాలను 125 రోజులకు పెంచడమే కాకుండా, పని కల్పించలేకపోతే నష్టపరిహారం చెల్లించాలనే నిబంధన కూలీలకు వరమన్నారు. రఫెల్ నుంచి రామమందిరం వరకు ఏ మంచి జరిగినా అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న ఇండియన్ నేషన్ కాంగ్రెస్ ప్రజల దృష్టిలో యాంటీ నేషనల్ కాంగ్రెస్గా ముద్ర పడిందని ఽఎద్దేవా చేశారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శంకర్, మట్ట వెంకటేశ్వరరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉ పాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, లక్ష్మి, కిషన్ పాల్గొన్నారు. జాతీయ స్థాయికి ఎంపిక గంభీరావుపేట(సిరిసిల్ల): ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సైన్స్ పోటీల్లో దమ్మన్నపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో 512 జట్లు పాల్గొనగా.. అత్యుత్తమమైన 44 ఆవిష్కరణలను రెండో దశకు ఎంపిక చేశారు. ఇందులో దమ్మన్నపేట పాఠశాల నుంచి 4 ఆవిష్కరణలకు చోటు దక్కింది. 8వ తరగతి విద్యార్థినులు పొన్నాల నిహారిక, అన్నం రుతికలు గైడ్ టీచర్ సంపత్కుమార్ మార్గదర్శనంలో రూపొందించిన ‘జంతు మృతదేహాలను తొలగించే ట్రాలీ’ ఆవిష్కరణ జాతీయస్థాయికి ఎంిపికై ంది. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగే ఎగ్జిబిషన్లో పాల్గొననున్నారు. 7వ తరగతి విద్యార్థులు సాయికుమార్, అభిరామ్ రూపొందించిన ‘మహిళ వంట మిత్ర’ ఆవిష్కరణకు ప్రోత్సాహక బహుమతి లభించింది. నీట్ సూపర్ స్పెషాలిటీలో 3వ ర్యాంకువేములవాడ: నీట్ సూపర్ స్పెషాలిటీ–2025 డీఎం రెస్పిరేటరీ మెడిసిన్ గ్రూప్లో వేములవాడకు చెందిన ఉడుతల లలిత ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. లలిత వేములవాడలోని సిద్ధార్థ హైస్కూల్లో 10వ తరగతి, హైదరాబాద్లోని శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ చదివారు. ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లు చెప్పారు. తమ కూతురు రెస్పిరేటరీ మెడిసిన్లో 3వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని ఆమె తల్లిదండ్రులు ఉడుతల వెంకన్న–విజయ తెలిపారు. ఈ మహాత్మునికి 72 ఏళ్లు !గంభీరావుపేట: మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి 72 ఏళ్ల చరిత్ర ఉంది. సత్యం, అహింస, శాంతి సందేశాలను తరతరాలకు అందిస్తూ చారిత్రక గుర్తుగా నిలిచాడు గాంధీజీ. గంభీరావుపేటలో 1954 ఆగస్టు 15న గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి గాంధీ జ యంతి, వర్ధంతి, పంద్రాగస్టు, గణతంత్ర దినో త్సవం రోజున గ్రామస్తులు పూలమాలలు వేస్తారు. ఇటీవల కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గం గాంధీ విగ్రహానికి రంగులు వేయించారు. -
ముస్కానిపేటలో పట్టపగలే చోరీ
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని ముస్కాన్పేటలో శనివారం పట్టపగలే ఓ ఇంటిలో చోరీ జరిగింది. చోరీ జరిగిన ఇంటి కుటుంబ సభ్యులు, ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలోని దాసరి రాజయ్య భార్య రాజేశ్వరీ శనివారం ఇంటికి తాళం వేసి కూలి పనికి వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఇంటికొచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో పెట్టిన రెండు తులాల నెక్లెస్, ఒక తులం బంగారం చైన్, రూ.50వేలు నగదు, రెండు తులాల వెండి, దొంగలు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం, డాగ్స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. -
విషజ్వరంతో వ్యక్తి మృతి
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బోయిని రాములు(34) వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాలు. రాములు వారం రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ స్థానికంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందాడు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ప్లేట్లెట్స్ 25వేలకు పడిపోయినట్లు తెలిసింది. వారం రోజులుగా జ్వరం తగ్గక వ్యక్తి ప్రాణాలు పోవడంతో గ్రామస్తులు డెంగీ జ్వరం కావచ్చని భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై డీఐవో సంపత్కుమార్ను వివరణ కోరగా రుద్రంగిలో వ్యక్తి మృతికి గల కారణాలను తెలుసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశిస్తామన్నారు. ఉరేసుకుని యువకుని ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధ భరించలేక.. ఇంట్లో జరుగుతున్న గొడవలకు మనస్తాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన ఎక్కల్దేవి కుమార్(32) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లివచ్చిన కుమార్ తండ్రి దేవయ్యతో కలిసి వ్యవసాయం పనులు చేస్తున్నాడు. ఇటీవల కొత్తింటిని నిర్మించేందుకు అప్పులు చేశారు. దీంతో కుమార్కు భార్య కావ్యకు మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్దరి మధ్య గొడవలు జరగగా, ఆగ్రహానికి గురైన కుమార్ భార్య కావ్యపై చేయిచేసుకున్నాడు. అప్పుల బాధలు, భార్యను కొట్టిన అనే మనస్తాపానికి గురైన కుమార్ ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్ ఆత్మహత్యతో భార్య, కుమారుడు, కూతురు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి దేవయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. జిలెటిన్ స్టిక్స్ పట్టివేతవేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లిలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 1200 జిలిటెన్ స్టిక్స్లను పోలీసులు పట్టుకున్నారు. వేములవాడ నుంచి ఆటోలో తరలిస్తున్న జిలిటెన్ స్టిక్స్లను పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాయి. ఈ జిలిటెన్ స్టిక్స్లను వేములవాడ పరిధిలోని నాంపల్లి వార్డుకు చెందిన ఒక వ్యక్తి తరలిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. -
దేశం నిండా.. సిరిసిల్ల జెండా
సిరిసిల్ల: కార్మికక్షేత్రంలో తయారయ్యే మూడు రంగుల జెండాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఆ జెండాలు సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలుస్తున్నాయి. ఆగస్టు 15, జనవరి 26వ తేదీకి ముందుగానే జెండాల తయారీ, విక్రయాలు జరిగిపోతాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడురంగుల్లో ప్రింటింగ్ చేయిస్తారు. ఆ బట్టను జెండాల సైజును బట్టి మిషన్పై మహిళలు కుడుతారు. ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్న జెండాలను ఎగుమతి చేస్తారు. దశాబ్దాలుగా ఉపాధి సిరిసిల్లలో దశాబ్దాలుగా నేతన్నలకు జెండాల తయారీతో ఉపాధి లభిస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మహానీయుల త్యాగాలు నేటి తరానికి తెలిసేలా ప్రతీ ఇంటిపైన జాతీయ జెండాలు ఎగురవేయాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునివ్వడంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికింది. జనవరి 26, ఆగస్టు 15వ తేదీలకు రెండు నెలల ముందే ఆర్డర్డు రావడంతో ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోని అన్ని రాష్టాలకు సిరిసిల్ల జెండాలు ఎగుమతి అవుతున్నాయి. లక్షలాది జాతీయ జెండాలను సిరిసిల్ల నేతన్నలు సరఫరా చేశారు. సిరిసిల్ల బట్టకు, జెండాల తయారీదారులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో జెండాను సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు అమ్ముతారు. మహిళలు జెండాలు కుడుతూ.. కట్ చేస్తూ.. ప్యాకింగ్ చేస్తూ.. ఉపాధి పొందుతున్నారు. -
భీమన్నకు సమ్మక్క మొక్కులు
వేములవాడ: సమ్మక్క జాతర సమీపిస్తండడంతో వేములవాడకు భక్తుల రాక పెరిగింది. షవర్ల వద్ద పుణ్య స్నానాలు చేసిన భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రచారరథం వద్ద రాజన్నను, భీమేశ్వరాలయంలో భీమన్నను దర్శించుకొని కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.80లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.అన్నదాన సత్రానికి విరాళాలురాజన్న అన్నదాన సత్రానికి హన్మకొండకు చెందిన చింతల క్రాంతికుమార్–శ్రీలక్ష్మి దంపతులు రూ.లక్ష, హైదరాబాద్కు చెందిన మారం సాయిశ్రీతారెడ్డి, గురజాల విభావరిరెడ్డి, కణతాలా అతిరత్రెడ్డి కుటుంబం రూ.1.60 లక్షలు, వెన్నెల నవీన్ కృష్ణ రూ.30 వేల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.రాజన్న సేవలో ఐఏఎస్ అధికారికన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి శ్యాంప్రసాద్లాల్ భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈవో రమాదేవి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదోక్త ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. భీమేశ్వరస్వామిని రాష్ట్ర సమాచార కమిషన్ శ్రీనివాస్రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, ప్రసాదాలు అందించారు. -
వన్యప్రాణుల గణన
● అటవీబాట పట్టిన ఫారెస్ట్ అధికారులు ● దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తున్న కేంద్రం ● నాలుగేళ్లకోసారి వివరాలు సేకరణ ● ఏఐటీఈలో భాగంగా సర్వే ● సర్వేకు ఆటంకంగా ఖాళీలుఅడవి విస్తీర్ణం : 39,006 హెక్టార్లు సెక్షన్లు : 13, బీట్లు : 41 బీట్ అధికారి పోస్టుల ఖాళీలు : 22 సెక్షన్ అధికారి పోస్టు ఖాళీ : 01ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెద్దపులి.. చిరుతలు.. ఎలుగుబంటి.. దుప్పులు.. కొండగొర్రెలు.. కుందేళ్ల లెక్కలు తేలనున్నాయి. అడవినే ఆవాసంగా చేసుకున్న వన్యప్రాణుల లెక్కలు తీసేందుకు ఫారెస్ట్ అధికారులు అడవిబాట పట్టారు. ఏటా నాలుగేళ్లకోసారి దేశవ్యాప్తంగా చేపట్టే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్(ఏఐటీఈ) సర్వే జిల్లాలో ఇప్పటికే మొదలైంది. ఇక నుంచి జిల్లాలోని అడవిలో ఏయే జంతువులు ఎంత మొత్తంలో ఉన్నాయో తేలనుంది. ఆరు రోజులు.. 4 కిలోమీటర్లు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 39,006 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వన్యప్రాణుల లెక్క తేల్చేందుకు ఫారెస్ట్ అధికారులు ఆరు రోజు లు వివరాలు సేకరించారు. నిత్యం నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఏయే జంతువులు సంచరిస్తున్నాయో వివరాలను యాప్లో నమోదు చేశారు. మొదటి మూడు రోజులు మాంసాహార జంతువులు, మిగతా మూడు రోజుల్లో శాఖాహార జంతువుల లెక్కలు తీశారు. ఇప్పటికే జిల్లాలో ఆరు రోజులు అడవిలో తిరిగి జంతువుల వివరాలు సేకరించారు. ఇందుకు ఒక్కో బీట్కు ఒక్కో టీమ్ సర్వే చేసింది. సిరిసిల్ల పరిధిలో 20 బీట్లలో 20 బృందాలు, వేములవాడ పరిధిలోని 21 బీట్లలో 21 బృందాలు జంతువుల వివరాలు సేకరించాయి. వీరంతా ఉదయం 5 గంటలకే అడవిలోకి వెళ్లి ఉదయం 10 గంటల వరకు వన్యప్రాణుల ఆనవాళ్లు సేకరించారు. ఇలా సేకరించిన వివరాలను కేంద్రం తయారు చేసిన యాప్లో అప్లోడ్ చేశారు. ఖాళీలతో ఇబ్బందులు జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ రేంజ్ల పరిధిలో 22 బీట్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి భర్తీ చేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తులకు శిక్షణ ఇచ్చినప్పటికీ వాలంటీర్లుగా పనిచేయాల్సి రావడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా తెల్లవారుజామునే అటవీ బాట పట్టాల్సి రావడం.. వన్యప్రాణుల నుంచి ముప్పు ఉంటుందని భయపడి స్వచ్ఛందంగా జంతుగణనకు ఎవరూ ముందుకురావడం లేదు. ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి సర్వేలతోపాటు వన్యప్రాణుల రక్షణ, అటవిసంపదను కాపాడేచర్యల్లో అరకొరగా ఉండే ఫారెస్ట్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. -
కలెక్టర్కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
సిరిసిల్ల: ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేషంగా కృషి చేసినందుకు కలెక్టర్ గరీమా అగ్రవాల్కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ఆదివారం అందించారు. గతంలో గరీమా అగ్రవాల్ సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)గా పనిచేసిన సమయంలో.. ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు కృషి చేసినందుకు రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘మై ఇండియా.. మై ఓట్’ అనే థీమ్తో హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన జిల్లా కలెక్టర్లు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్ఓ)లకు అవార్డులు అందజేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఈవో సుదర్శన్రెడ్డి చేతులు మీదుగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్నారు. సిరిసిల్ల ఆర్డీవోకు అవార్డు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)గా సేవలు అందించిన ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం సీఈవో సుదర్శన్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ బీఎల్వోగా రేణుకముస్తాబాద్(సిరిసిల్ల): రాష్ట్రంలో ఉత్తమ బూత్ లెవెల్ ఆఫీసర్గా ముస్తాబాద్ మండలం గూడెం అంగన్వాడీ టీచర్ కొమ్మెట రేణుక అవార్డును అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పది మందిని ఎంపిక చేయగా.. జిల్లా నుంచి రేణుక ఎంపికయ్యారు. -
ఎస్సారెస్పీ కాలువలో యువకుడి గల్లంతు
శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో ఆదివారం ఎస్సారెస్పీ కాలువలో సాదుల అనిల్(21) గల్లంతయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కరీంపేటకు చెందిన సాదుల రాజయ్య–స్వరూప దంపతులకు అనిల్ ఒక్కడే కుమారుడు. కేశవపట్నంలో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. తమకున్న కొద్దిపాటి పొలంలో మహారాష్ట్రకు చెందిన కూలీలతో ఆదివారం వరినాటు వేయించాడు. దుక్కిలో ఎరువు చల్లిన అనిల్ గ్రామంలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు మెట్లపై నుంచి కాలువలోకి దిగాడు. నీరు ఉధృతంగా ప్రవహించడంతో నీటిలో గల్లంతయ్యాడు. కాలువ వెంట గ్రామస్తులు గాలింపు చేపట్టారు. ఒక్కగానొక్క కొడుకు కాలువలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై శేఖర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్తో కిరాణంషాపులో మంటలుమల్యాల: మండలంలోని నూకపల్లి డబుల్బెడ్రూం కాలనీలోని కిరాణ దుకాణంలో షార్ట్ సర్క్యూట్లో మంటలు చెలరేగి సామగ్రి దగ్ధమైంది. కాలనీలోని పాలిక కమలాకర్ తన షాపును శనివారం రాత్రి మూసి ఇంటికెళ్లాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి కమలాకర్కు సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల విలువైన కిరాణ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. -
గణతంత్రం..ప్రత్యేకం
● నాణేలు.. స్టాంపుల సేకరణ ● ఆదర్శం కొత్వాల సాయిరాం సిరిసిల్లటౌన్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముద్రించిన అరుదైన నాణేలు, స్టాంపులను సిరిసిల్లకు చెందిన కొత్వాల సాయిరాం సేకరించారు. స్వాతంత్య్ర ఉద్యమం, భారత రాజ్యాంగం అమలు స్ఫూర్తిని ఇష్టంగా మలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచే దేశ స్వాంతంత్య్రోద్యమ పోరాటం కథలు, కథనాలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి సేకరించడం అలవాటుంది. ప్రతీ ఏడాది పంద్రాగష్టు, జనవరి 26, అక్టోబర్ 2 తేదీల్లో వాటిని ప్రదర్శిస్తున్నాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా తాను చిన్నప్పటి నుంచి సేకరించిన నాణేలు, పోస్టల్ స్టాంపులను మీడియా ముందు ప్రదర్శించారు. 1950లో భారత రాజ్యాంగం అమలైన సందర్భంగా ముద్రించిన రూపాయి నాణెం, వివిధ దశల్లో రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ, ఇతర దేశ నాయకులు ఫొటోలను వివిధ దశల్లో ముద్రించగా..వాటిని భద్రపరిచిన సాయిరాంను పలువురు అభినందిస్తున్నారు. -
గణతంత్ర వేడుకలకు సిద్ధం
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సోమవారం గణతంత్ర వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి 9.05 నుంచి 9.10 గంటల వరకు పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.10 గంటలకు కలెక్టర్ సందేశం, 9.25 నుంచి 9.55 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.55 నుంచి 10.15 గంటల వరకు శకటాల ప్రదర్శన, 10.15 నుంచి 10.45 గంటల వరకు విధులలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు పంపిణీ, 10.45 నుంచి 11 గంటల వరకు స్టాల్స్ సందర్శన ఉంటుంది. ఈమేరకు కలెక్టరేట్, పోలీస్ పరేడ్గ్రౌండ్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఓటే.. మన వజ్రాయుధం
కరీంనగర్ అర్బన్/సిరిసిల్ల కల్చరల్: ఓటు.. బ్రహ్మాస్త్రం.. ప్రభుత్వాలను కూల్చాలన్నా.. నియంతృత్వ విధానాలకు చరమగీతం పాడాలన్నా మీట నొక్కి వ్యవస్థను మార్చొచ్చు. ఏక్ దిన్కా సుల్తాన్ అన్నట్లు ఎన్నికల్లో ‘ఓటు’కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇంతటి మహత్తర శక్తిని పొందడంలో యువత ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు ఉన్న శక్తి ఏపాటిదో స్పష్టౖమైన విషయం విదితమే. ఒక్క ఓటుతో గెలిచినవారుండగా సమాన ఓట్లతో టై కాగా టాస్తో విజేతను నిర్ణయించారు. అందుకే ప్రతి ఓటు విలువైనదే.. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కథనం.. – వివరాలు 8లో..మల్యాల: ఈమె మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన బండారి దుబ్బరాజవ్వ(102). శతాధిక వృద్ధురాలైనా.. కళ్లు కనపడకపోయినా, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ‘ఎన్నిసార్లు ఓటు వేసిన్నో నాకు గుర్తు లేదు. బుద్ధి తెలిసినప్పటి నుంచి ఓటు ఏసేందుకు పని ఇడిసిపెట్టుకొని, పోయిన. మొన్నటి సర్పంచ్ ఓట్లలోనూ నాకు నడువరాకపోయినా ఓటు వేసిన. ఓటు వేయకపోతే జనాభా లెక్కలళ్ల మనం లేనట్టేని మావోళ్లు చెప్పిండ్రు’. అని దుబ్బరాజవ్వ ఓటు ప్రాముఖ్యతను చెప్పి.. నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.జిల్లా మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు కరీంనగర్ 10,64,129 5,23,898 5,40,175 56 రాజన్న సిరిసిల్ల 4,76,187 2,30,294 2,45,849 44 పెద్దపల్లి 7,24,608 3,56,740 3,67,815 53 జగిత్యాల 7,30,959 3,50,778 3,80,143 38 -
టుడే న్యూస్ పేపర్.. టుమారో బెస్ట్ పేపర్!
నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ అంటారు.. కానీ, జగిత్యాలలోని గోవిందపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెద్ది శ్రీనివాస్ న్యూస్ పేపర్ కూడా టీచింగ్ టూల్ అని గట్టిగా నమ్ముతారు. జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో పనిచేస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చే విజ్ఞానదాయకమైన సమాచారం, శీర్షికలను కత్తిరించి ల్యామినేషన్ చేసి పుస్తకాలుగా మలచి గ్రంథాలయంలో భద్రపరుస్తున్నారు. వాటిలోని అంశాలను విద్యార్థులకు బోధించి విజ్ఞానం పెంపొందింపజేస్తున్నారు. పాఠ్యపుస్తకాలకు తాజా సమాచారాన్ని జోడించి పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచేలా కృషి చేస్తున్నారు. – సాక్షి,కరీంనగర్ డెస్క్ 8లోu -
రన్ ఫర్ రోడ్ సేఫ్టీ
సిరిసిల్ల/వేములవాడ: ట్రాఫిక్రూల్స్ పాటించడం సామాజిక బాధ్యత అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో అరైవ్.. అలైవ్.. అలెర్ట్.. రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2కే వాకథాన్ నిర్వహించారు. నో హెల్మెట్.. నో పెట్రోల్ కార్యక్రమం అమలును విప్ అభినందించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్సాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ పాల్గొన్నారు. సిరిసిల్లలో.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన అరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ వాహనదారులు సామాజిక బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ఈ సందర్భంగా పలు వాహనాలకు రోడ్ సేఫ్టీ అవగాహన పోస్టర్లు అతికించారు. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, సిరిసిల్ల టౌన్ సీఐ కె.కృష్ణ, ఆర్ఎస్సై సురేశ్, ట్రాఫిక్ ఆర్ఎస్సై దిలీప్, నేతాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫోన్ట్యాపింగ్పై కేటీఆర్ నాటకం ఆడుతున్నారు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం వేములవాడ: ఫోన్ట్యాపింగ్ కేసుపై రాష్ట్రమంతా కోడై కూస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నాటకం ఆడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మండిపడ్డారు. వేములవాడలో శనివారం విలేకరులతో మాట్లాడారు. సినీతారలు, జడ్జీలు, వ్యాపారులు, నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఫోన్ను ట్యాపింగ్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారన్నారు. డ్రోన్ సంబంధిత విషయంలో 14 రోజులు ఉగ్రవాదులు ఉండే బ్యారక్లో వేసి మానసికంగా ఆనందం పొందారని మండిపడ్డారు. ట్యాపింగ్ జరగలేదనడం నిజమైతే.. తన భర్త ఫోన్ను ట్యాపింగ్ చేశారన్న కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కోరారు. హరీశ్రావు, కేటీఆర్ కళ్లల్లో భయం కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం, గొర్లస్కాం, టెలిఫోన్, కరెంట్ కొనుగోళ్లలో అవినీతి చేశారని ఆరోపించారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసిన రేవంత్రెడ్డి సర్కార్ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామికి వెండి కిరీటం బహూకరణచందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామికి కరీంనగర్కు చెందిన ముప్పిడి వీణ–హరికృష్ణ దంపతులు కిలో వెండి కిరీటాన్ని బహూకరించారు. ఆలయ అర్చకులు శ్రీకాంతాచార్యులకు శనివారం అప్పగించారు. సర్పంచ్ మల్లేశం, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్గౌడ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు చంద్రయ్య, ఆలయ కమిటీ కోశాధికారి, మాజీ ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఇంటింటికీ సంక్షేమం
సిరిసిల్ల: ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్కార్డులు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. నేతన్నలకు అరువుపై నూలు అందిస్తూ ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చామన్నారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, ఏసీఎం చైర్పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మడుపు శ్రీదేవి, సూర దేవరాజు, గోనె ఎల్లప్ప, ఆడెపు చంద్రకళ, కాముని వనిత పాల్గొన్నారు. ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రజాస్వామ్యం.. అసెంబ్లీ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మండలంలోని బందనకల్ హైస్కూల్లో శనివారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. స్పీకర్, సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు ఇలా ప్రతీ పాత్రలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఎన్నికలు, ఎమ్మెల్యేలు, బిల్లులు, చట్టం వంటి వాటిపై అవగాహన కల్పించినట్లు హెచ్ఎం రాజ్కుమార్ తెలిపారు. సర్పంచ్ చిగురు నరేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు. ఈమేరకు కలెక్టరేట్లో శనివారం సమ్మె నోటీసులు అందజేసి మాట్లాడారు. కేంద్రం గత నవంబర్లో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. దీనిపై నిరసనగానే దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నాయకులు గురిజలా శ్రీధర్, బూర శ్రీనివాస్గౌడ్, రామంచ అశోక్ పాల్గొన్నారు. సిరిసిల్లటౌన్: ఉపాధిహామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుంటి వేణు కోరారు. స్థానిక కార్మికభవనంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇరువై ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు పని చూపుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వీరికి పేస్కేల్ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. నాయకులు సోమ నాగరాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అందాల వల!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: చూసేందుకు అందంగా ఉంటారు. చక్కగా రెడీ అయ్యి ఫేస్బుక్, ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతారు. లైక్ కొట్టి.. కామెంట్ పెట్టినవారిలో ప్రొఫైల్స్ ఆధారంగా ప్రముఖులు, వ్యాపారులను ఎంచుకుంటారు. తియ్యగా మాట్లాడి స్నేహం చేస్తారు. తెలివిగా తామున్న చోటికి రప్పించుకుంటారు. సన్నిహితంగా మెదిలి, రహస్యంగా కెమెరాల్లో చిత్రీకరిస్తారు. తరువాత స్నేహం ముసుగు తీసి, డబ్బులివ్వాలని బ్లాక్మెయిల్కు దిగుతారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే వీడియోలు బహిర్గతం చేసి పరువు తీస్తామని బెదిరిస్తారు. కొందరు పరువు పోతుందన్న భయంతో అడిగినంత ఇచ్చుకుని సైలెంట్గా తప్పుకుంటుండగా.. మరికొందరు మళ్లీమళ్లీ వారి వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూస్తున్న హనీట్రాప్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కష్టపడకుండా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు ముఠాగా ఏర్పడి ఇలాంటి పనులు చేస్తున్నారు. అందమైన మహిళలతో సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు క్రియేట్ చేసి ఆకర్షిస్తారు. వీరి వీడియోలకు కామెంట్లు పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఒరిజినల్ ఖాతాల నుంచి కామెంట్లు పెట్టిన వారి నేపథ్యాన్ని వెరిఫై చేసుకుంటారు. డబ్బున్న వారైతే డైరెక్ట్ మెసేజ్ చేసి స్నేహం పేరిట ఎరవేస్తారు. కలుద్దామంటూ ఇంటికి ఆహ్వానిస్తారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బెదిరింపులకు దిగి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. డేటింగ్యాప్స్తో జాగ్రత్త సోషల్ మీడియాతోపాటు డేటింగ్ యాప్స్తో చాలా దారుణాలు జరుగుతున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలే లక్ష్యంగా ఈ యాప్స్లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని త్వరగా బ్లాక్మెయిల్ చేయవచ్చు. స్నేహం చేయడం, కలవడం సులువు. యాప్లో చిక్కిన వారిని వీడియోలు తీసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఇవ్వకపోతే ఏకంగా రేప్ కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడి కొందరు, పరువుకు భయపడి మరికొందరు అడిగినంత చెల్లించుకుని అక్కడ నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి పద్మవ్యూహాల్లో చిక్కడమే బాధితుల చేతిలో ఉంటుంది. వారిని వదలాలా? వద్దా? అన్నది మాత్రం ముఠా చేతిలోనే ఉంటుంది. -
డ్రగ్స్ను నియంత్రిద్దాం
● అదనపు కలెక్టర్ నగేశ్ సిరిసిల్ల: జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం శనివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు. ఫారెస్ట్ భూముల్లో గంజాయి సాగు కనిపిస్తే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. డ్రగ్స్, గంజాయితో కలిగే ఇబ్బందులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. వేములవాడ ఆర్డీవో రాధాభాయి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్పాషా, జిల్లా వైద్యాధికారి రజిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, కార్మికశాఖ అధికారి నజీర్ అహ్మద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటుహక్కు అందరి బాధ్యత
● అమ్మాయిలు ఆకాశమే హద్దుగా ఎదగాలి ● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ‘మై ఇండియా.. మై ఓట్’ అనే థీమ్తో 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ నమోదు, ఎథికల్ ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లకు సన్మానం చేశారు. నూతనంగా ఓటుహక్కు వచ్చిన యువ ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, సీపీవో శ్రీనివాసాచారి పాల్గొన్నారు. ఉన్నతంగా ఎదగాలి బాలికలు అన్ని రంగాల్లో రాణించి, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. ఫ్లెక్సీపై బాలికలను ఉద్దేశించి ‘స్కై ఈజ్ ద లిమిట్’ అని రాశారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్, ఉపన్యాస పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు. మారుమూల ప్రాంతాల్లో పుట్టిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, మేరికోమ్ కష్టాలను అధిగమించి ఎలా ఉన్నతస్థానాలకు చేరుకున్నారో చెప్పి వారిలో స్ఫూర్తి నింపారు. ఇరా సింఘాల్ 62 శాతం వైకల్యం ఉన్నా 2014 యూపీఎస్సీ పరీక్షల్లో ఆలిండియా ర్యాంక్ సాధించి,..ఐఏఎస్గా సేవలు అందిస్తున్న విషయాన్ని విద్యార్థినులకు తెలిపారు. ప్రణాళిక ప్రకారం చదివి.. ఉన్నత స్థానాలకు ఎదగాలని హితబోధ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు. ఓటు వజ్రాయుధం సిరిసిల్లక్రైం: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, ప్రతీ పౌరుడు తన ఓటుహక్కును వినియోగించుకోవడం బాధ్యత అని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీసు ఆఫీస్లో ప్రతిజ్ఞ చేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు రవి, నాగేశ్వరరావు, ఆర్ఐలు మధుకర్, యాదగిరి పాల్గొన్నారు. -
దోపిడీ చేసేందుకు ఉపాధిహామీపై కుట్ర
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): కార్పొరేట్ సంస్థలకు కూలీలుగా మార్చి, నిరుపేదలను దోపిడీ చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై కుట్ర చేస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో శుక్రవారం జీరామ్జీపై నిరసన తెలిపారు. సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ ఉపాధిహమీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తీసేసిన కేంద్రాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు యెల్ల బాల్రెడ్డి, ప్రవీణ్ జే టోనీ, పార్లమెంట్ కోకన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కొండం రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, నేరెళ్ల నర్సింగంగౌడ్, వైద్య శివప్రసాద్, లింగాల భూపతి, సత్తు శ్రీనివాస్రెడ్డి, చుక్క రాజశేఖర్, మునిగెల రాజు, మధుకర్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక సేవలో అయ్యప్పక్షేత్రం
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆధ్యాత్మిక సేవలో అయ్యప్ప క్షేత్రం నిలుస్తోందని రాజుగురుస్వామి పేర్కొన్నా రు. ముస్తాబాద్లో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు స్వయంగా రూ.40లక్షలు వెచ్చించి నిర్మించిన స్వాముల సేవాకేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించా రు. రాజుగురుస్వామి మాట్లాడుతూ ముస్తాబాద్లో గత 25 ఏళ్లుగా మాలధారులకు అయ్యప్పక్షేత్రం కేంద్రంగా మారిందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్రావు, గురుస్వాములు కనమేని చక్రధర్రెడ్డి, ఆరుట్ల రాజిరెడ్డి, అక్కరాజు శ్రీనివాస్, అంజా గౌడ్, విజయరామారావు, తిరుపతిరావు, యాదగిరిగౌడ్, పండరి, బాలాజీ, మహేశ్రెడ్డి, ఎల్లం, శ్రీనివాస్గౌడ్, రాజిరెడ్డి, మల్లేశ్, నందు ఉన్నారు. -
ఒళ్లు హూనమే..
● ఆదమరిస్తే ఆపదే.. ● ప్రమాదకరంగా సిరిసిల్ల–కామారెడ్డి మార్గం ● ఇల్లంతకుంట మండలంలో అధ్వానంగా రహదారులు ● హెచ్చరికబోర్డులతోనే సరిపెడుతున్న అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)/ఇల్లంతకుంట(మానకొండూర్): అడుగుకో గుంత.. కనుచూపు మేరలో కనిపించని తారు.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న పొంచి ఉన్న ప్రమాదం.. ఇదీ రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు రహదారుల దుస్థితి. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారితోపాటు లింక్ రోడ్లు అధ్వానంగా మారాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఏళ్లుగా పట్టించుకునే వారు లేక ప్రమాదాలకు నిలయంగా నిలుస్తున్నాయి. ఇలాంటి రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. వరుస ప్రమాదాలు ● సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. వేములవాడ నందికమాన్ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనాలు ఢీకొట్టుకుంటున్నాయి. ● సిరిసిల్ల శివారులోని చంద్రంపేట వద్ద ఇటీవల ఓ లారీ ఆలయాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. ● సర్దాపూర్, వెంకటాపూర్ మధ్య ఏడాది కాలంలో నాలుగుకు పైగా ప్రమాదాలు జరిగాయి. ● రాగట్లపల్లి శివారులోని మూలమలుపు వద్ద వా హనాలు అదుపుతప్పి పలువురు గాయపడ్డారు. ● రాచర్లగొల్లపల్లి శివారు, సత్తెపీరిల దర్గా వద్ద గత వారం రోజుల్లో పదికి పైగా ప్రమాదాలు జరుగగా, ఇద్దరు చనిపోయారు. ● రాగట్లపల్లి నుంచి నారాయణపూర్ మార్గంలోని లింక్రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో రోజూ వాహనాలు అదుపుతప్పుతున్నాయి. రెండు నెలల క్రితం వారం రోజుల్లోనే పది మంది గాయపడ్డారు. గుంతలమయం ఇల్లంతకుంట మండలంలోని రోడ్లుపై ప్రయాణిస్తే ఒళ్లు హూనం కావాల్సిందే. ఇల్లంతకుంటకు వెళ్దామంటే... నేను రాను బిడ్డో అనే పరిస్థితులు వచ్చాయి. ఇల్లంతకుంట నుంచి వంతడుపుల మీదుగా కరీంనగర్ వెళ్లే రోడ్డు తప్ప మండలంలో మిగతా రోడ్లు అన్ని సింగిల్ రహదారులే. రహీంఖాన్పేట నుంచి వెల్జీపురం వరకు అడుగడుగున గుంతలు దర్శనమిస్తాయి. వెల్జీపురం సమీపంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో టూ వీలర్స్ స్కిడ్ అవుతున్నాయి. రహీంఖాన్పేట నుంచి తంగళ్లపల్లి వరకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద 15.587 కిలోమీటర్లు డబుల్ రోడ్డుగా నిర్మించేందుకు 2021 ఆగస్టులో రూ.984 లక్షలు మంజూరు చేశారు. వెల్జీపురం నుంచి తంగళ్లపల్లి వైపు దాదాపు 9 కిలోమీటర్లు డబుల్ రోడ్డుగా చేసి కాంట్రాక్టర్ మిగతా రోడ్డు పనులు నిలిపివేశాడు. దీంతో రహీంఖాన్పేట నుంచి వెల్జీపూర్ వరకు, తెనుగుపల్లి నుంచి లక్ష్మీపూర్ వరకు భారీ గుంతలు పడ్డాయి. ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్లే దగ్గర దారికావడంతో చాలా మంది ఈ మార్గంలోనే ప్రయాణిస్తారు. ఇల్లంతకుంట నుంచి అనంతారం మీదుగా సిరిసిల్ల వెళ్లే ప్రధానమైన రోడ్డు జిల్లెల్ల వరకు అధ్వానంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు కోతకు గురైంది. అనంతగిరి పోచమ్మ దేవస్థానం, అన్నపూర్ణ ప్రాజెక్టులకు వెళ్లే దారి పెద్దలింగాపురం నుంచి అనంతగిరి వరకు అధ్వానంగా మారింది. సిరికొండ రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది. ఇల్లంతకుంట నుండి ముస్కానిపేట మీదుగా సిద్దిపేటకు వెళ్లే రోడ్డు మండలం శివారు వరకు అధ్వానంగా ఉంది. అనంతారం నుంచి రహీంఖాన్పేట వెళ్లే రోడ్డుపై బీటీ లేచిపోయింది. -
ఆలోచన.. అవగాహన
వేములవాడరూరల్: గ్రామాభివృద్ధికి చేయాల్సిన పనులు.. గ్రామంలోని సమస్యలను గుర్తించే తీరు.. సమస్యలకు పరిష్కారం చేపే మార్గాలు.. అభివృద్ధి పనులను అధికారుల దృష్టికి తెచ్చే విధానంపై నూతన సర్పంచులకు జిల్లా అధికారులు అవగాహన కల్పించారు. వేములవాడలో ఐదు రోజులు నిర్వహించిన అవగాహన సదస్సుతో తమకు పాలనపై అవగాహన.. సమస్యలపై పట్టు కోసం చేయాల్సిన కృషి గురించి తెలిసిందని నూతనంగా ఎన్నికై న సర్పంచులు తెలిపారు. ఐదు రోజుల శిక్షణతో ఐదేళ్లకు అవసరమైన విషయాలు నేర్చుకున్నామంటున్నారు. ఈనెల 19న ప్రారంభమైన ఈ శిక్షణ 23వ తేదీతో ముగిసింది. మొదటి విడతగా వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 130 మంది సర్పంచులు హాజరయ్యారు. ఇందులో చాలా మంది నూతనంగా ఎన్నికై నవారే ఉన్నారు. ఐదు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీఎల్పీవో ఆధ్వర్యంలో నిధులు, విధులు, గ్రామంలో చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధికి పాటుపడండి – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల వరకే రాజకీయాలు అని.. ఇక గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. సర్పంచుల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం ముఖ్య అతిథిగా వచ్చిన విప్ వారికి పలు విషయాలపై అవగాహన కల్పించారు. సౌకర్యాలు కల్పించి, గ్రామస్తుల మన్ననలు పొందాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులు వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించినప్పుడే గ్రామాల్లో ప్రజలు ఆదరిస్తారన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు విప్కు పలు విన్నపాలు చేశారు. గ్రామాభివృద్ధికి నిధులు విడుదల చేయించాలని కోరారు. ఉపసర్పంచ్లతో ఉన్న జాయింట్ చెక్పవర్ను తొలగించి అధికారికి ఇవ్వాలని కోరారు.సర్పంచ్, ఉపసర్పంచ్ల మధ్య జాయింట్ చెక్పవర్తో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్నారు. డీపీవో షరీఫొద్దీన్, డీఎల్పీవో వీరభద్రయ్య, ఎంపీడీవోలు లచ్చాలు, నటరాజు, జయశీల, ఎంపీవోలు రమేశ్, ప్రదీప్, ఈజీఎస్ సిబ్బంది శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న సిరిసిల్ల
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026Iఇల్లంతకుంట: కందికట్కూర్ హైస్కూల్లో జిల్లా ఎడ్యుకేషన్ పానెల్ టీం సభ్యులు శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సీసీఈ మార్క్స్తోపాటు వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.ఇల్లంతకుంట: తాము సర్పంచులుగా చేసిన పనుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మంత్రి ధనసరి సీతక్క ఓఎస్డీకి మండల మాజీ సర్పంచులు వినతిపత్రం అందించారు.జిల్లాలో వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. -
సౌతిండియా స్థాయిలో ద్వితీయస్థానం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రానికి చెందిన హైస్కూల్ విద్యార్థులు వడ్నాల రేష్మ, పండుగ సహస్ర రూపొందించిన ప్రాజెక్టు స్మార్ట్ గ్లౌజ్కు సౌతిండియా స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హైదరాబాద్లో ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించిన సౌతిండియన్ సైన్స్ఫెయిర్లో ద్వితీయ బహుమతి గెలుపొందారు. ఎవరైతే పక్షపాతానికి గురై మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. గైడ్ టీచరుగా హై స్కూల్ బయోలజీ టీచర్ మహేశ్ వ్యవహరించారు. వీరిని ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, హెచ్ఎం ప్రేమలత అభినందించారు. వేములవాడఅర్బన్: అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫస్టియర్ విద్యార్థి ముద్రకోల శశికుమార్ శాతవాహన యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల శాతవాహన యూనివర్సిటీలో జరిగిన క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 27 నుంచి జరిగే క్రికెట్ పోటీల్లో యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. 17వ బెటాలియన్లో ట్రాఫిక్ అవేర్నెస్సిరిసిల్లటౌన్: పెద్దూరులోని 17వ బెటాలియన్లో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాఫిక్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ సురేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడారు. ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చూడాలని కోరారు. బెటాలియన్ సిబ్బంది, అధికారులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు సురక్షిత విధానాలపై అవగాహన కల్పించారు. ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ రజనీ, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లో నమోదు చేసుకోండిసిరిసిల్లకల్చరల్: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అన్వేషణలో మార్గం చూపించేలా రూపొందించిన డిజిట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) పేరుతో మొబైల్యాప్, వెబ్పోర్టల్ను ప్రారంభించినట్లు జిల్లా మైనార్టీ అభివృద్ధి శాఖ అధికారి భారతి తెలిపారు. ఉపాధి, ఉద్యోగావకాశాలతో నిరుద్యోగులను అనుసంధానించడం, కృత్రిమ మేధ సాంకేతికతతో మొబైల్యాప్ రూపొందిందన్నారు. జిల్లాలోని మైనారిటీ నిరుద్యోగులు ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్హతల్లో ఎలాంటి పరిమితులు లేకుండా ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా అర్హతకు తగిన ఉపాధి అవకాశాలను తెలుసుకునే వీలుందని పేర్కొన్నారు. ప్లేస్టోర్ నుంచి డీఈఈటీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉద్యోగార్థిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూ వాయిదాసిరిసిల్ల: జిల్లా సంక్షేమ శాఖ పరిధిలో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం శుక్రవారం తెలిపారు. మిషన్ వాత్సల్య ఐసీపీఎస్లో కాంట్రాక్ట్ పద్ధతిలో మూడు పోస్టుల భర్తీకి, చైల్డ్ హెల్ప్లైన్లో రెండు పోస్టులు, సఖీలో ఒక్క లాయర్ పోస్టు, ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక్క అకౌంటెంట్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి దరఖాస్తులు స్వీకరించామని వివరించారు. పూర్తి స్థాయిలో దరఖాస్తులను పరిశీలించేందుకు సమయం లేనందున కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలతో ఇంటర్వ్యూలను వాయిదా వేశామని తెలిపారు. ఇంటర్వ్యూల తేదీలను, నియామక విధానాల వివరాలను జిల్లా వెబ్సైట్లో ప్రకటిస్తామని లక్ష్మీరాజం ప్రకటించారు. -
నిత్యం పోషకాహారం తీసుకోవాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్సిరిసిల్ల: టీబీ పేషెంట్లు నిత్యం పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మందులు వాడుతూ.. పోషకాహారం తీసుకోవాలని సూచించారు. టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 353 మందికి పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. డీఎంహెచ్వో రజిత, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు శోభా రాణి, సీనియర్ గైనకాలజిస్ట్ లీలాశిరీష ఉన్నారు. గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్లో డయాస్ను రెవెన్యూ అధికారులు పూలతో అలంకరించాలన్నారు. ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు ఆహ్వానం పంపలని తెలిపారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని సీపీవోకు సూచించారు. వేడుకలకు వచ్చే వారికి మంచినీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను ప్రతిపాదించాలని ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పరిశీలన పోలీస్ పరేడ్గ్రౌండ్ను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పరిశీలించారు. గ్రౌండ్లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, ఏవో రాంరెడ్డి, తహసీల్దార్ మహేశ్కుమార్ తదితరులు ఉన్నారు. -
నవోదయలో రోబోటిక్ ఎక్స్పో
చొప్పదండి: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో గురువారం విద్యార్థులు రోబోటిక్ ఎక్స్పో ప్రదర్శనను నిర్వహించారు. ఎంఈవో మోహన్ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శనను జగిత్యాల జిల్లా నవోదయ విద్యార్థులతో పాటు, చొప్పదండిలోని బాలుర ఉన్నత పాఠశాల, కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు తిలకించారు. మారిన పరిస్థితుల్లో సెన్సార్ సాంకేతికతతో ట్రాఫిక్ నియంత్రణ ద్వారా ప్రమాదాలను అరికట్టడంపై ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. స్మార్ట్ హోం విధానం, స్మార్ట్ ఇరిగేషన్ విధానం, ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడం వంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీశాయి. ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి, హెచ్ఎం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘టెస్టీ’ అనారోగ్యం
వీకెండ్ వస్తే... బయట బిర్యానీ ఆర్డర్ పెట్టాలి. ఇంటిలో పిల్లాడికి తినాలనిపిస్తే ఏ పిజ్జానో, ఫ్రెంచ్ ఫ్రైసో తీసుకురావాలి. కుటుంబమంతా బయటకు వెళ్తే దర్జాగా హోటల్లో కూర్చుని రంగురంగుల పదార్థాలు రుచి చూడాలి. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనాల వరకు బయట రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలపై ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. కానీ ఆహార ప్రియులను మరింత ఆకర్షించేందుకు విచ్చలవిడిగా వివిధ రకాల రంగులు, టేస్టింగ్ సాల్ట్ను వినియోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆరోగ్యాలను తినేస్తోంది. రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ దుకాణాల విషయం పక్కన పెడితే.. ఇళ్లల్లో సొంతంగా చేసుకునే శుభకార్యాలల్లోని భోజనాల్లో సైతం ఈ విషపూరితమైన రంగులు, టెస్టింగ్ సాల్ట్స్ వినియోగం అధికమవుతోంది. టేస్టింగ్సాల్ట్... ఫుడ్కలర్లతో ప్రమాదం ఆహార పదార్థాల్లో ఎరుపు, పచ్చ, ఆరెంజ్, పసుపు రంగుల్లో టైటానియం సిలికాన్ డయాకై ్సడ్, మెటల్ ఆకై ్సడ్, నానోపార్టికల్స్ రసాయనాలు ఉంటాయి. వీటి వినియోగం వల్ల జీర్ణ కోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. బీపీ, షుగర్ పెరిగి కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ ఎల్లో కలర్లలో ఉండే కార్మోసిన్ అనే రసాయనం కిడ్నీలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా చిన్నవయస్సులో కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటుతో సహా అనేక సమస్యలకు దారితీస్తాయి. అజినోమోటో అని పిలిచే టేస్టింగ్ సాల్ట్తో చేసిన వంటకాలను తింటే నాడీ వ్యవస్థ బలహీనపడి పార్కిన్సన్స్, ఆల్జీమర్స్ వ్యాధులకు ప్రధాన కారణమవుతుంది. టేస్టింగ్ సాల్ట్ తీసుకునే వ్యక్తులు త్వరగా చిరాకు పడటంతో పాటు వాంతులు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, ఛాతీపై ఒత్తిడి, గొంతులో, చేతుల్లో లేదా అరికాళ్లలో మంటలు, ఊబకాయం, గుండె ఇతర సమస్యల బారిన పడతారు. చిన్న పిల్లల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్న జంక్ఫుడ్, పొటాటో చిప్స్, ఫ్రైడ్ చికెన్లో పరిమితికి మించి టేస్టింగ్సాల్ట్ను వాడడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్, టిఫిన్సెంటర్లలో టెస్టింగ్ సాల్ట్ రుచుల కోసం విచ్చలవిడిగా వినియోగం ఆహార పదార్థాల్లో మితిమీరుతున్న రంగుల వాడకాలు అమితంగా తినేవారిపై తీవ్ర ప్రభావం అంటున్న వైద్యులు కరీంనగర్: బిర్యానీలో ముక్కలు ఎర్రగా లేకుంటే కుదరదు. నూడిల్స్ ఏమాత్రం కలర్ తగ్గినా తినడానికి మనసు ఒప్పుకోదు. ఫ్రైడ్ రైస్ మెరుస్తూనే కనిపించాలి. ఫాస్ట్ఫుడ్ కల్చర్ పెరిగాక జనం ఓ రకమైన ఆహారానికి అలవాటు పడిపోతున్నారు. ఇది ఆరోగ్యాలను దారుణంగా దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్ వినియోగం విషయంలో హోటళ్లు ఎక్కడా తగ్గకపోవడం.. వాటి దుష్పరిణామాలపై సామాన్యులకు అవగాహన లేకపోవడంతో.. ఆ విషాన్ని ఇష్టంగా తినేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ తరహా ఆహారానికి అలవాటు పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆహారంలో రంగులు, టేస్టి ంగ్ సాల్డ్ వినియోగం వల్ల కడుపులో కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మితిమీరిన రంగుల వినియోగం.. రుచుల కోసం వివిధ రకాల టెస్టింగ్ సాల్ట్ వినియోగం తగ్గించాలి. జీర్ణకోశ సమస్యలతో పాటు రోగ నిరోధక శక్తిని హరిస్తాయి. జంక్ ఫుడ్లో వినియోగించే టేస్టింగ్ సాల్ట్ మరింత ప్రమాదకరం. – డాక్టర్ దిలీప్రెడ్డి, సర్జికల్గ్యాస్ట్రో, మెడికవర్ -
తప్పు ఒకరిది.. జరిమానా వేరొకరికి
పెద్దపల్లిరూరల్: తప్పు చేసిన వారు కడతరు తాళ్లపన్ను.. అన్నది పాత సామెత. కానీ తప్పుచేసినోడు తప్పించుకుని.. అందుకు జరిమానాను వేరొకరికి విధించేలా మాయ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ట్రాఫిక్ పోలీసుల కళ్లు కప్పి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. తమ వాహనాల నంబరుప్లేట్ల చివరను వంచడమో, నంబరుకు తెల్లరంగు రుద్ది వేరే నంబరుగా భ్రమింపజేయడమో చేస్తూ తప్పించుకుపోతున్నారు. వివరాలు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ అలీ తన బైక్ (నంబరు టీఎస్ 26ఎఫ్ 9724)పై హనుమకొండ వైపు వెళ్లకపోయినా 2025 అక్టోబర్ 18న సిగ్నల్జంప్ చేశావంటూ అక్కడి ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. తన మొబైల్కు సమాచారం రావడంతో వెంటనే స్పందించిన మహబూబ్ అలీ ఈ విషయమై అక్కడి ట్రాఫిక్ పోలీసు అధికారులకు సమాచారం అందించాడు. అది తన బైక్ కాదని, వేరొకరు ఇదే నంబరు బైక్పై తిరుగుతున్నారేమో అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. తర్వాత అక్కడి పోలీసులు సిగ్నల్ జంప్ చేసిన బైక్ నంబరు (టిఎస్26 ఎఫ్ 9722) అని నిర్ధారించుకున్నామని, జరిగిన పొరపాటును సవరిస్తామంటున్నారే తప్ప.. ఇప్పటికీ తన పేరిట చలాన్ అలాగే ఉందని బాధితుడు వాపోతున్నాడు. ఇప్పటికై నా ట్రాఫిక్ పోలీసులు తన పేరిట ఉన్న చలాన్ను తొలగించాలని కోరుతున్నాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా సవరించని వైనం -
మొక్కులు చెల్లించి వస్తుండగా..
రామగుండం: పెద్దంపేట గ్రామంలో ముగ్గురు మహిళలు పోచమ్మ మొక్కులు తీర్చుకొని అంతర్గాంకు ఆటోలో వెళుతున్న క్రమంలో గురువారం మధ్యాహ్నం పెద్ద బావి మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అంతర్గాంకు చెందిన నేరెళ్ళ పద్మ, అమృతమ్మ తీవ్రంగా గాయపడగా, కుందనపల్లికి చెందిన దొంగల మల్లమ్మ, ఆటోడ్రైవర్ ఆంజనేయులుకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే సమయంలో పెద్దంపేట వైపు టీటీఎస్ గ్రామ సర్పంచ్ అంబోతు రవికుమార్, పోలీసు జీపులో ఎస్సై వెంకటస్వామి వస్తుండడంతో క్షతగాత్రులను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. కాగా విధి నిర్వహణలో వెళ్తున్న ఎస్సై క్షతగాత్రులను గుర్తించి చికిత్స నిమిత్తం పోలీస్ వాహణంలో తరలించడంపై స్థానికులు అభినందించారు. అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి గాయాలు -
స్పెల్–బీ ఫైనల్కు విద్యార్థిని ఎంపిక
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ మానేరు హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని జి.ప్రణవిరెడ్డి ఇటీవల సాక్షి మీడియా గ్రూప్స్ ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించిన స్పెల్–బీ సెమీఫైనల్లో రాణించి ఫైనల్కు ఎంపికై ంది. హైదరాబాద్లో ఈనెల 24న జరగనున్న ఫైనల్ రౌండ్లో పాల్గొంటారు. ప్రణవిరెడ్డిని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, హగ్స్ అండ్ హర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన కురుకుంట్ల అనంతయ్య (68) ఆర్టీసీ బస్సు ఢీకొని మృతిచెందాడు. అనంతయ్య, భార్య మల్లవ్వతో కలిసి మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షన్ హాల్లో పనిచేస్తూ.. అక్కడే ఉంటున్నారు. మండల కేంద్రంలోని రెండో బైపాస్లో ఉంటున్న తన బంధువుల ఇంటికి గురువారం తన ద్విచక్రవాహనంపై వెళ్లి.. తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో సిరిసిల్ల –కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వస్తుండగా కామారెడ్డి నుంచి కరీంనగర్కు వెళ్తున్న ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూరంగా ఎగిరిపడ్డ అనంతయ్య తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లాడు. వెంటనే స్థానికులు ప్రథమ చికిత్స అనంతరం సిరిసిల్ల కు తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య మల్లవ్వ, కుమారుడు ప్రసాద్ ఉన్నారు. బస్సును పోలీస్స్టేషన్ వద్ద ఉంచి డ్రైవర్ పరారయ్యాడు. మృతుడి కుటుంబానికి ఆర్టీసీ ద్వారా నష్టపరిహారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్రెడ్డి డిమాండ్ చేశారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. యువకుడిపై కత్తితో దాడిగంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దుంపల వినీత్పై అదే గ్రామానికి చెందిన అమన్ఖాన్ కత్తితో దాడిచేసి గాయపర్చాడు. ఈమేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు. అమన్ఖాన్ గురువారం వినీత్ ఇంటికి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. తాను ప్రేమించిన యువతిని ఎలా పెళ్లి చేసుకోబోతున్నావని గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో వినీత్పై దాడి చేశాడు. ఈ దాడిలో వినీత్ మెడ, చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో అమన్ఖాన్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన బైక్ మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్ శివారులో ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ద్విచక్రవాహనదారుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మనగర్కు చెందిన పొట్టవత్తిని భూమేశ్వర్ ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం బైక్పై డ్యూటీకి బయల్దేరాడు. జగ్గాసాగర్ శివారు దొంగలమర్రి సమీపంలోకి రాగానే అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. బైక్తోపాటు భూమేశ్వర్ బావిలో పడ్డాడు. స్థానికులు గమనించి బైక్తోపాటు భూమేశ్వర్ను బయటకు తీశారు. ఈ ఘటనలో భూమేశ్వర్కు స్వల్ప గాయాలయ్యాయి. దొంగల రిమాండ్ ● 50 గ్రాముల గంజాయి, 11 గ్రాముల బంగారం.. ● 160 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం వేములవాడరూరల్: దొంగతనం కేసులో ఇద్దరు యువకులను రిమాండ్కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి తెలిపారు. వేములవాడరూరల్ పోలీస్స్టేషన్లో గురువారం వివరాలు వెల్లడించారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంల, ఫాజుల్నగర్లలో ఈనెల 17న జరిగిన దొంగతనంలో నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు. వట్టెంలకు చెందిన ఎగుర్ల హరిణి, ఫాజుల్నగర్కు చెందిన ఏడుమ్యాకల లాస్యశ్రీ, చిన్నలచ్చయ్యలకు చెందిన ఇళ్లల్లో దొంగతనం జరిగింది. వేములవాడ సాయినగర్, ఇస్లాంనగర్లోనూ తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనం జరిగింది. ఈమేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సిరిసిల్ల బీవైనగర్కు చెందిన ఆడెపు రవికుమార్, జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన ఎనుగందుల పవన్చందును అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం, వెండి వస్తువులతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరొకరు సిరిసిల్లకు చెందిన వంశీకృష్ణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కానిస్టేబుళ్లు తిరుపతి, సతీశ్లను ఏఎస్పీ అభినందించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకట్రాజం ఉన్నారు. -
కిసాన్ ధన్ సెంటర్లో నాణ్యమైన ఎరువులు
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): నేషనల్ ఫెర్టిలైజర్స్ నుంచి రైతులకు ఎరువులను నేరుగా విక్రయించడానికి ఎన్ఎఫ్ఎల్ కిసాన్ ధన్ సెంటర్ను గురువారం పెద్దపల్లి, చెన్నూరు కేంద్రాల్లో ప్రారంభించామని ఆర్ఎఫ్సీఎల్ జీఎం, సైట్ ఇన్చార్జి రమేశ్ఠాకూర్ తెలిపారు. ఎరువుల విక్రయానికి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతులకు విక్రయించేందుకు ఎన్ఎఫ్ఎల్ కిసాన్ ధన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ఎరువులను ప్రభుత్వ సబ్సిడీ ధరలలో కిసాన్ ధన్ సెంటర్లో రైతులకు అందిస్తామని ఎన్ఎఫ్ఎల్ స్టేట్ మేనేజర్ రాజేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ వినోద్కుమార్, ఎన్ఎఫ్ఎల్ ఏరియా మేనేజర్ వంశీకృష్ణరాజు, జిల్లా కోఆర్డినేటర్ తిరుమల ఉన్నారు. -
ద్విచక్రవాహనం చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని ఉస్మాన్పురలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. ఉదయం లేచి చూసేసరికి వాహనం లేకపోవడంతో సమీప ప్రాంతాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించగా.. ఓ దొంగ ద్విచక్రవాహనాన్ని దొంగిలించిన దృశ్యాలు పుటేజీలో రికార్డయ్యాయి. దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆలయంలో చోరీతంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలో భద్రపరచిన గరుడ వాహనాన్ని ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. బుధవారం అర్ధరాత్రి ఆలయ తలుపులు పగులగొట్టిన దొంగలు.. రూ.60వేల విలువ చేసే గరుడ వాహనాన్ని అపహరించారు. ఉదయం అర్చకులు తలుపులు తెరిచి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఉపేంద్రచారి క్లూస్టీమ్తో పరిశీలించారు. ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నకిలీ సుంకరి అరెస్ట్తంగళ్లపల్లి(సిరిసిల్ల): అసైన్డ్ భూమిని ఆన్లైన్ చేయిస్తానని నమ్మించి రూ.లక్షలు వసూలు చేసిన వ్యక్తిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు. మండలంలోని గోపాల్రావుపల్లికి చెందిన పురుషాని నాగరాజు తాను తహసీల్ ఆఫీస్లో సుంకరిగా పనిచేస్తున్నానని నమ్మించి సిరిసిల్లకు చెందిన నడిగట్ల శ్రీనివాస్ వద్ద 2022లో రూ.3.72 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లు గడిచినా పని పూర్తి చేయకపోగా డబ్బులు అడిగితే కులం పేరుతో కేసు పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు నాగరాజును గురువారం రిమాండ్కు తరలించారు. ఎస్సై ఉపేంద్రాచారి మాట్లాడుతూ నాగరాజు బాధితులు ఉంటే తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. చికిత్స పొందుతూ ఒకరి మృతికొత్తపల్లి: చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు గురువారం మృతిచెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్ కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన ఎలగందుల శ్రీకాంత్ (32) మిషన్ భగీరథ లైన్ మెన్గా పనిచేస్తున్నాడు. స్నేహితుడు సాయిచరణ్ తో కలిసి బుధవారం ద్విచక్రవాహనంపై కరీంనగర్ వెళ్తుండగా, వెనుకనుంచి బొలేరో వాహనం అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెనక కూర్చున్న సాయిచరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ గురువారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ వివరించారు. పోక్సో కేసు నమోదుజగిత్యాలక్రైం:జిల్లాకేంద్రంలోని ఉస్మాన్పుర ప్రాంతానికి చెందిన బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. బాలిక కిరాణదుకాణానికి వెళ్తుండగా లతీఫ్ అనే వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు లతీఫ్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మోసగాళ్లు రిమాండ్
కోనరావుపేట(వేములవాడ): ఇళ్లు నిర్మించుకునేవారికి ఇటుక, బేస్మెంట్ రాయి సరఫరా చేస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తులను గురువారం రిమాండ్కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి తెలిపారు. కోనరావుపేట ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన శివరాత్రి సదయ్య, పెద్దపల్లి మండలం తురకల మద్దికుంటకు చెందిన గాదాసు రాజయ్య ఇటుక, బేస్మెంట్ రాయి సరఫరా చేస్తామని నమ్మించి డబ్బులు తీసుకొని పరారవుతున్నారు. ఇలా వీరిద్దరు కోనరావుపేట, చందుర్తి, కథలాపూర్ మండలాల్లో ఐదుగురిని మోసం చేశారు. బాధితులు కొండాపూర్కు చెందిన పెద్దపల్లి స్వామి, పల్లిమక్తకు చెందిన చిద్రవేణి ప్రభాకర్, నిమ్మపల్లికి చెందిన గన్నారపు పద్మ, తిమ్మాపూర్కు చెందిన గాలిపెల్లి లస్మవ్వ, సిరికొండకు చెందిన మ్యాదరి వనితల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం కోనరావుపేట మండలం నిజామాబాద్ కమాన్ వద్ద వాహనంపై వెళ్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.14వేలు నగదు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లు కస్తూరి విశాల్రాజు, బి.నాగరాజులను అభినందించారు. సమావేశంలో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్రెడ్డి ఉన్నారు.● ఇటుక, రాయి సరఫరా చేస్తామని డబ్బు వసూలు ● బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు -
వివాహేతర సంబంధంతోనే సతీశ్ హత్య
● ఏఎస్పీ రుత్విక్సాయి ● నలుగురి రిమాండ్ వేములవాడ: వివాహేతర సంబంధమే సతీశ్ హత్యకు కారణమైందని ఏఎస్పీ రుత్విక్సాయి తెలిపారు. హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం వివరాలు వెల్ల డించారు. ఈనెల 13న కోలకాని సతీశ్ తీవ్ర గాయాలతో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తే.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ప్రణాళిక ప్రకారం నలుగురు కలిసి సతీశ్పై దాడి చేసినట్లు తేలిందన్నారు. తిప్పయ్యపల్లికి చెందిన ఉమ్మారెడ్డి విష్ణు, ఉమ్మారెడ్డి కృష్ణ, పెంట సుదర్శన్, మ్యాకల వేణు మద్యం సేవించి సతీశ్ను కర్రలు, ప్లాస్టిక్ పైపులతో కొట్టారు. అనంతరం ప్రమాదం జరిగినట్లు నటిస్తూ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సతీశ్ చనిపోవడంతో ఆ నలుగురు పరారయ్యారు. కాల్డేటా ఆధారంగా వారి కదలికలను గుర్తించి స్థానిక బైపాస్రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సై రాంమోహన్, పోలీసులు ఉన్నారు. -
బడి వేళకు బస్సు రాదాయే..
కోనరావుపేట(వేములవాడ): ఈ చిత్రం.. కోనరావుపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వస్తున్న విద్యార్థులు. స్కూల్ సమయానికి ఒకే బస్సు నడుస్తుండడంతో అందరూ అందులోనే ఎక్కి వస్తున్నారు. కోనరావుపేట మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూల్కు సుద్దాల, కనగర్తి, నిజామాబాద్, వెంకట్రావుపేట, కొండాపూర్, నిమ్మపల్లి గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుద్దాల నుంచి కనగర్తి, నిజామాబాద్ మీదుగా కోనరావుపేటకు వస్తుంది. వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రామాల నుంచి కోనరావుపేట కళాశాలకు, మోడల్ స్కూల్కు విద్యార్థులు వస్తున్నారు. ఈ గ్రామాలకు రెండు, మూడు రోజులుగా బస్సులు రాకపోవడంతో విద్యార్థులు ఆటోలో వస్తున్నారు. బడి కోసం ప్రత్యేక బస్సులు : 11పల్లెవెలుగు బస్సులు 59బస్సులు 142ఇల్లంతకుంట(మానకొండూర్): ఇలా.. ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీరు ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్ స్కూల్కు వెళ్తున్న విద్యార్థులు. రహీంఖాన్పేట మోడల్స్కూల్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో మండలంలోని 35 గ్రామాల నుంచి విద్యార్థులు ఆటోలలో వస్తున్నారు. పాఠశాలలో 672 మంది విద్యార్థులు 36 ఆటోలలో ఇలా ప్రమాదకరంగా ప్రయాణించి వస్తున్నారు. ఒక్క ఆటోలో 17 మంది వరకు కిక్కిరిసి వస్తున్నారు.సిరిసిల్లటౌన్: విద్యార్థులకు బస్సు కష్టాలు తప్పడం లేదు. విద్యాసంస్థల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు రాక కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు గంటలకొద్దీ రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు. అసలే మారుమూల ప్రాంతాలు కావడం.. సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. ఇలా నిత్యం ఆలస్యం అవుతుండడంతో పలువురు విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడివేళల్లో బస్సులు రాక విద్యార్థుల ప్రయాణ కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్రిపోర్టు. జిల్లాలో 142 బస్సులు జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ, కార్మికక్షేత్రం సిరిసిల్లలో రెండు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను 142 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గ్రామీణ రూట్లలో 59 బస్సులు షెడ్యూల్ ప్రకారం తిరుగుతున్నాయి. బడి, కళాశాలలకు వెళ్లే పిల్లల కోసమే 11 పల్లెవెలుగు బస్సులను తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే సమయానికి బస్సులు రాక క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఒక రూట్లో ఒకే బస్సు వెళ్తుండడం.. విద్యార్థులు ఎక్కువగా ఉంటుండడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తుంది. అంతేకాకుండా పలు స్టేజీలపై విద్యార్థులను చూస్తేనే బస్సులు ఆపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక సాయంత్రం వేళ బస్సుల కోసం గంటలతరబడి ఎదురుచూపులు తప్పడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. జాతర్లతో మరిన్ని కష్టాలు ఈనెలలోనే మేడారం జాతర మొదలు కాగా.. తర్వాత వేములవాడ శివరాత్రి జాతర రాబోతుంది. ఈజాతర్లకు సిరిసిల్ల, వేములవాడ డిపోల నంచి 70 బస్సులకు పైగా నడిపించనున్నారు. బడివేళల్లో బస్సుల కోసం విద్యార్థులు మరిన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితులు రానున్నాయి.మేడారం, వేములవాడ జాతర్లకు ప్రత్యేకంగా బస్సులు నడపాల్సి వస్తుంది. ఆ సమయంలో డిపోలో ఉన్న వాటితో విద్యాసంస్థల సమయాలకు బస్సులను రీషెడ్యూల్ చేస్తాం. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. బడి వేళల్లో రెండు డిపోల్లో బస్సులు నడుపుతూ పిల్లలను సమయానికి చేరవేసేలా సిబ్బందికి సూచనలు చేస్తున్నాం. విద్యార్థులను చూసి బస్సులు ఆపకుండా ఉండని పరిస్థిలు లేవు. – ప్రకాశ్రావు(సిరిసిల్ల), శ్రీనివాస్(వేములవాడ), డిపో మేనేజర్లు -
బాధితులకు భరోసా కల్పించాలి
● విలేజ్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలి ● ఎస్పీ మహేశ్ బీ గీతేముస్తాబాద్(సిరిసిల్ల): ఠాణాకు వచ్చే బాధితులకు భరోసా కల్పించి, న్యాయం జరిగేలా పనిచేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ముస్తాబాద్ పోలీస్స్టేషన్ను గురువారం పరిశీలించారు. పోలీస్స్టేషన్ ఆవరణను, ఫైలింగ్, పట్టుబడ్డ వాహనాలను, కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ, కోర్టు కేసులపై సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ఎవరికి ఆపద వచ్చిన ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే అన్నారు. వివిధ సమస్యలపై ఠాణాకు వచ్చే వారికి అండగా నిలిచి వారికి భరోసా కల్పించాలని సూచించారు. ఓపెన్, డ్రంకెన్డ్రైవ్లపై దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. గంజాయి, సారాయి వంటి వాటిని అరికట్టి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యవంతం చేసి, నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ నేరాలను నియంత్రించాలన్నారు. ఎస్పీ మొక్కలు నాటారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ ఉన్నారు. -
ఆహ్లాదం సరే.. సౌకర్యాలు ఏవి?
వేములవాడరూరల్: పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు వేములవాడ మండల పరిషత్ పరిసరాల్లో రూ.2కోట్లతో పార్క్ను ఏర్పాటు చేశారు. అయితే సందర్శకులకు సౌకర్యాలు కల్పించలేదు. మండల పరిషత్లో అర్బన్, రూరల్ మండలాల అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. వివిధ పనుల కోసం పట్టణ ప్రజలతోపాటు గ్రామీణులు నిత్యం వస్తుంటారు. సందర్శకుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పార్క్ను ఏర్పాటు చేశారు. కానీ తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించలేదు. దీంతో వివిధ పనులపై వచ్చే జనం అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 20267సిరిసిల్లటౌన్: ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ కాంపిటీషన్లో సిరిసిల్లకు చెందిన విద్యార్థి పల్లె రిశాంత్ ప్రతిభ కనబరిచాడు. మున్సిపల్ కమిషనర్ ఖాదర్పాషా తదితరులు అభినందించారు.ఇల్లంతకుంట: అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి మెయిన్ కెనాల్ ద్వారా 62 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3.24 టీఎంసీల నీటి లభ్యత ఉంది.వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి ఈదురుగాలులు వీస్తాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. -
భద్రంగా.. బాధ్యతతో నడపాలి
వేములవాడఅర్బన్: వాహనదారులు బాధ్యతగా, భద్రంగా వాహనాలు నడపాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల(సడక్ సురక్ష అభియాన్)ను తిప్పాపూర్లో గురువారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే హాజరయ్యారు. బెలూన్లను వదిలారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు జాగ్రతగా నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ మొబైల్ చూస్తూ వాహనాలు నడపవద్దన్నారు. నో హెల్మెట్.. నో పెట్రోల్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ హై స్పీడ్, డ్రంకెన్డ్రైవ్తోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఏఎస్పీ రుత్విక్సాయి, ఆర్డీవో రాధాభాయి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేశ్, డిపో మేనేజర్లు ప్రకాశ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వైద్యం అందించాలి రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, అత్యవసర విభాగం, డీఈఐసీ(డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్)తోపాటు ఇతర విభాగాలను సందర్శించారు. ఆస్పత్రికి రోజూ వచ్చే పేషెంట్ల సంఖ్య, అత్యవసర సేవల నిర్వహణ, డెలివరీల వివరాలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్, సివిల్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య ఉన్నారు. అభివృద్ధికే పట్టం కట్టండి వేములవాడరూరల్: పట్టణంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు చేస్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన 1, 2వ వార్డుల్లో పలు కుల సంఘాల కమిటీ హాళ్లకు మంజూరుపత్రాలు అందజేశారు. నాయకులు సంఘ స్వామి, కుల సంఘాల పెద్దలు, వార్డు ప్రజలు ఉన్నారు. -
నాలుగు కిలోమీటర్లు నడుస్తాం
ఉదయం బడికి వెళ్లే సమయంలో బస్సులు వస్తున్నాయి. కానీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బస్సులు కిక్కిరిసి వస్తుండడంతో మా స్కూల్ నుంచి తంగళ్లపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తాం. సాయంత్రం వేళ ప్రత్యేకంగా బస్సు నడిపించాలి. – కన్న శేషేంద్ర, మండెపల్లి మోడల్స్కూల్ మేడారం, వేములవాడ జాతర్ల సమయంలో మాకు సమయానికి బస్సులు ఉండకుంటే కష్టమే. అధికారులు మా పరిస్థితిపై ఫోకస్ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సాయంత్రం ఇంటికి రావడానికి సరైన సమయంలో బ స్సులు దొరక్క రాత్రి అవుతుంది. విద్యాసంస్థల వేళల్లో ప్రత్యేకంగా బస్సులు నడపాలి. – ఎలగొండ బన్సీ, మోడల్ కాలేజ్ రహీంఖాన్పేట మోడల్స్కూల్ వరకు ఆర్టీసీ బస్సులు రావడం లేదు. పాఠశాలకు ఇల్లంతకుంట మండలంలోని 35 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. బస్సు సౌకర్యం లేక అందరూ ఆటోలలో వస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి. – గంగాధర్, రహీంఖాన్పేట మోడల్స్కూల్, ప్రిన్సిపాల్ -
గులాబీ జెండా ఎగరడం ఖాయం
● ప్రజల కళ్ల ముందే అభివృద్ధి ● జిల్లాలను ఎత్తివేయాలని కుట్ర పన్నుతున్నారు ● ‘సెస్’ను రద్దు చేస్తారేమో.. ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గులాబీ జెండానే ఎగరబోతుందని, మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో గురువారం మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇన్చార్జీలతో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. మన పని మనమే చెప్పుకోవాల్సిందే.. వేరే వాళ్లు ఎవరు చెప్పరు అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయన్నారు. జిల్లాలను ఎత్తివేస్తామని గందరగోళం కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారని, ఈ అంశం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లాలను ఎత్తివేయడానికి సిద్ధమైన ప్రభుత్వం.. రేపు ‘సెస్’ను కూడా ఎత్తివేసినా ఆశ్చర్యం లేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనను తుగ్లక్ తరహా పాలనగా అభివర్ణించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతోందని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల గత 35 ఏళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉందని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పేర్కొన్నారు. చేసింది చెప్పుకోవాలి బీఆర్ఎస్ చేసింది ప్రతీ ఇంటికి చెప్పాలని, కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతీ గడపకు తీసుకెళ్లాలన్నారు. సంక్రాంతి దాటినా రైతుబంధు రాలేదని, చీరల ఆర్డర్లు ఇవ్వలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కూడా దిక్కులేని పరిస్థితి ఉందని విమర్శించారు. నేతన్నలకు నిజమైన అండగా నిలిచింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఫీవర్ పట్టుకుందని, సిరిసిల్ల ప్రజలంతా గులాబీ జెండా వైపే ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు చీటి నర్సింగరావు, అక్కరాజు శ్రీనివాస్, కల్వకుంట్ల గోపాల్రావు, బొడ్డు నారాయణ, సిద్ధం వేణు, పబ్బతి విజయేందర్రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
సిరిసిల్లకల్చరల్: క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో న్యాయవాదుల సంఘం నిర్వహిస్తున్న క్రీడా పోటీలను గురువారం ఫస్ట్ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి బి.పుష్పలతతో కలిసి ప్రారంభించారు. సంఘం అధ్యక్షుడు జూ పెల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు వసం తం, రవీందర్రావు, గోవిందు భాస్కర్, సుజీ వన్, వెంకటయ్య, కల్యాణి, జ్యోతి, అనూష, తిరుపతి, బాలయ్య, భరత్, పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కోతులతో పడుతున్న ఇబ్బందులను తొలగించాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. పంచాయతీ ఆఫీస్లో సర్పంచ్ ఎలగందుల నర్సింలు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి రూ.250 చొప్పున వసూలు చేసి కోతులను పట్టివ్వాలని నిర్ణయించారు. కోతులను పట్టించేందుకు సుమారు రూ. 5లక్షల ఖర్చు అవుతుందని అంచనాతో ఈమేరకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు డబ్బులు జమచేసి మొదటి వారంలో కోతులను తరలించే కార్యక్రమం చేపట్టనున్నారు. కోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారం ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 47 మందికి ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ను ఎంఈవో మురళీనాయక్, న్యాయవాధి జవ్వాజి ప్రసాద్గౌడ్ గురువారం ఉచితంగా అందజేశారు. వారు మాట్లాడుతూ సాక్షి దినపత్రికలో వచ్చే స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సింగిల్విండో మాజీ డైరెక్టర్ జవ్వాజి దేవయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేములవాడరూరల్: మర్రిపల్లి ప్రాజెక్టు నుంచి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు గురువారం అడ్డుకున్నా రు. అనుమతులు లేకున్నా నిత్యం మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం అభివృద్ది పనుల పేరుతో ప్రతిరోజు మట్టిని తరలిస్తున్నారన్నారు. మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవాలిసిరిసిల్ల: జిల్లాలోని మత్స్యకారులు తమ లైసెన్స్ల రెన్యూవల్, కొత్త లైసెన్స్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య గురువారం కోరారు. 2025–2026 సంవత్సరానికి మత్స్యకారులకు లైసెన్సులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఎగువ మానేరులో 900 మందికి, మధ్యమానేరులో 2వేల మందికి, అన్నపూర్ణలో 500 మందికి లైసెన్స్లు జారీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. లైసెన్సు లేకుండా చేపల వేటకు వెళ్లి ప్రమాదాలకు గురైతే ప్రమాదబీమాను పొందే అర్హత ఉండదని స్పష్టం చేశారు. అర్హులకు సెప్టెంబర్ 1 నుంచి లైసెన్స్లు జారీ చేస్తామని తెలిపారు. లైసెన్స్లు ఉంటే జీవనోపాధిని బలోపేతమవుతుందన్నారు. లైసెన్స్ పొందేందుకు నిర్ణీత రుసుం, రెండు పాస్పార్టు సైజ్ ఫొటోలు, కులధ్రువీకరణ పత్రం, గతంలో జారీ అయిన లైసెన్స్ పత్రాన్ని కలెక్టరేట్లోని మత్స్యశాఖ ఆఫీస్లో సమర్పించాలని కోరారు. -
మార్పు మంచిదే..
సిరిసిల్ల: సామాజిక బాధ్యతగా చేసే మార్పు ఏదైనా మంచిదే. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని ని వారించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు వినూత్నంగా ముందుకెళ్తున్నారు. రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో నూతన మార్పునకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ఆలోచన.. ఎస్పీ ఆచరణతో జిల్లాలోని పెట్రోల్బంక్ల్లో ‘నో హెల్మెట్– నో పెట్రోల్’ ఫ్లెక్సీలను రెండు చొప్పున దర్శనమిస్తున్నాయి. అన్ని ఠాణాల ఎస్సైలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని పెట్రోల్బంకుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫొటోలను జిల్లా పోలీస్బాస్కు పంపించారు. క్షేత్రస్థాయిలో మరోసారి పెట్రోల్బంక్ యజమానులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయొద్దని స్పష్టం చేస్తున్నారు. పోలీసుల చర్యలతో స్వీయరక్షణకు బాటలు పడుతున్నాయి. రవాణాశాఖ అధికారుల భాగస్వామ్యం జిల్లాలో రవాణా శాఖ అధికారులు భాగస్వాములు అవుతూ.. కొత్తగా ద్విచక్రవాహనం కొనుగోలు చేసిన వారు విధిగా హెల్మెట్ కొనుగోలు చేయాలని, వాటిని వినియోగించాలని సూచిస్తున్నారు. హెల్మెట్ ఉంటేనే వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎవరైనా వస్తే.. విధిగా హెల్మెట్ కొనాలనే నిబంధనను రవాణాశాఖ అధికారులు విధించారు. వాహనాలకు రిజిస్ట్రేషన్ లేకుండా డ్రైవింగ్లైసెన్స్ లేకుండా పట్టుబడితే.. జరిమానా విధించడంతోపాటు తప్పనిసరిగా హెల్మెట్ను కొనిపించాలని భావిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెట్రోల్బంకుల్లో ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ నినాదాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తేవాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు.వేములవాడరూరల్ మండలంలోని బంక్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ నారాయణపూర్ శివారులోని పెట్రోల్బంక్ వద్ద పోలీసులు ఏర్పాటు చేయించిన ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ ఫ్లెక్సీ‘జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. జిల్లాలో గతేడాది 290 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రతీ పెట్రోల్బంక్ యజమాని విధిగా ‘నో హెల్మెట్– నో పెట్రోల్’ ఫ్లెక్సీలు రెండు ఏర్పాటు చేయాలి. వాహనదారులను చైతన్యవంతులను చేస్తూ హెల్మెట్ ధరించేలా చూడాలి. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయకూడదు...’ ఇది జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే ఈనెల 12న కలెక్టరేట్లో చెప్పిన మాటలు. -
సొమ్మొకరిది.. సోకొకరిది
● ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉంది ● పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిసిరిసిల్లటౌన్: సొమ్కొకరిదైతే.. సోకొకరిది అన్నట్లు కాంగ్రెస్ సర్కారు తీరుందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు రెడ్డబోయిన గోపి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్ మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.15కోట్లు ఇస్తే.. వా టికి అదనంగా రూ.3కోట్లు కలిపి మొత్తం తామే ఇచ్చినట్లు వాటిని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్ర భుత్వం సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. పట్టణ ప్రగతి కింద వచ్చిన రూ.30 లక్షలను సిబ్బంది వేతనాలకు వాడుతున్నారన్నారు. అమృత్ స్కీం కింద సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.104 కోట్లు మంజూరు చేస్తే.. రేవంత్రెడ్డి బామ్మర్ది కంపెనీకి టెండర్ వచ్చేలా చేసినట్లు ఆరోపించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, శీలం రాజు, మ్యాన రాంప్రసాద్ పాల్గొన్నారు. -
పేదలకు విద్య అందించడమే లక్ష్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రతి పేదవాడికి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాజన్నపేటలో అంగన్వాడీ భవనం, మురుగుకాలువ నిర్మాణాలకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటికే 18 అంగన్వాడీ భవనాలు మంజూరు చేశామన్నారు. రాజన్నపేటలో ఉపాధిహామీ కింద రెండు అంగన్వాడీ భవనాలు మంజూరు చేశామని, ఎస్సీ కాలనీలో మురుగుకాలువ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. విదేశాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాబేరాబేగం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, సర్పంచ్ కల్లూరి బాపురెడ్డి, ఉప సర్పంచ్ యాదగిరి మాజీసర్పంచ్ ముక్క శంకర్, నాయకులు గౌస్, గుర్రాల రాజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బండారి బాల్రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడరూరల్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గత పదేళ్లలో ఏ గ్రామానికి ఇండ్లు మంజూరు చేయలేదన్నారు. వేములవాడ మండల పరిషత్లో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. వేములవాడ రూరల్ మండల పరిధిలోని 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే తాము ఓట్లు అడగబోమని.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు తాము చూపిస్తామని.. మీరు ఓట్లు అడగొద్దని సవాల్ విసిరారు. వేములవాడను టెంపుల్సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేశామని, పనులు వేగవంతం జరుగుతున్నాయన్నారు. తిప్పాపూర్ జంక్షన్కు రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, తహసీల్దార్ అబూబాకర్, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీలో ఎడతెగని హాజరు వివాదం
శాతవాహనవర్సిటీసాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థుల హాజరువివాదం రోజురోజుకూ ముదురుతోంది. హాజరు విషయంలో వర్సిటీ వీసీ ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలకు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆందోళన చెందుతున్నా రు. హాజరు విషయంలో తమకు కాస్త మినహాయింపు ఇవ్వాలని, లైబ్రరీని 24 గంటల అందుబాటు విషయంలో వీసీ తమ వినతిని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బుధవారం మరోసారి విద్యార్థులు హాజరు శాతం విషయంలో తమకు మినహాయింపు కల్పించాలని కోరుతూ రోడ్డెక్కారు. ఇటీవల న్యాయ విద్యార్థుల హాజరు విషయంలో వీసీ ఆదేశాలు అమలు చేయడంతో ప లువురు ఇంటర్నల్స్ రాసే అవకాశం కోల్పోయారు. దీనిపై వందలాది మంది విద్యార్థులు వర్సిటీలో భారీ ఎత్తున ధర్నా చేసిన విషయం విదితమే. తాజాగా సెమిస్టర్ పరీక్షలకు తమను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ నిరసనకు దిగారు. నిబంధనల పేరిట కఠినం వర్సిటీలో చదువుతున్న విద్యార్థుల్లో అధికశాతం బీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారే. అందులోనూ ఆయా కుటుంబాల్లో యూనివర్సిటీ స్థాయి ఉన్నత విద్యనభ్యసిస్తున్న తొలితరం వారే కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులపై నిబంధనల పేరుతో మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్పుపై ఆధారపడి చదువుతున్న వారే. వీరంతా తిరిగి పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. తమను హాజరుశాతం పేరుతో ఇంటర్నల్స్, సెమిస్టర్స్ రాసే అవకాశం కోల్పోయేలా వీసీ తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పరిధిలో అనేక డిగ్రీ, పీజీ, ఎంబీఏ కాలేజీలున్నాయి. వీటిలో ఎక్కడా సరిగా తరగతులు జరగడం లేదు. ప్రైవేటు కాలేజీలకు వర్తించని నిబంధనలు పేద విద్యార్థులమైన తమకు మాత్రం ఎందుకు వర్తింప జేస్తున్నారని వర్సిటీ అధికారులను నిలదీస్తున్నారు. అదే సమయంలో వర్సిటీలో పోలీసుల జోక్యం కొంతకాలంగా పెరిగిపోయిందని వాపోతున్నారు. ప్రతిరోజూ వీసీ పోలీసు బలగాలను పిలిపించి వర్సిటీ ప్రాంగణంలో మోహరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ విషయంలో వెనక్కి తగ్గిన వీసీ వర్సిటీలో జరుగుతున్న ఉద్యమాల విషయంలో ఓ మహిళా ప్రొఫెసర్పై వీసీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం నెల రోజుల్లోనే ఆమెను నాలుగు బాధ్యతల నుంచి తప్పించడం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. బాధ్యతల నుంచి తప్పించే క్రమంలో రెండుసార్లు ఆర్డర్లు సెలవు దినాల్లో వెలువడటం గమనార్హం. తనపై వరుసగా వెలువడుతున్న ఈ ఆర్డర్ల విషయంపై తీవ్రంగా కలత చెందిన మహిళా ప్రొఫెసర్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపు విషయం తెలుసుకున్న ఉమ్మడిజిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీకి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందునే ఆమెను తప్పించాల్సి వచ్చిందని వీసీ వివరణ ఇచ్చుకున్నారు. వర్సిటీలో కక్ష సాధింపు చర్యలు తగవని మంత్రి హితవు పలకడంతో మహిళా ప్రొఫెసర్ విషయంలో వీసీ వెనక్కి తగ్గి నాలుగోసారి వెలువరించిన ఆర్డర్ను బుధవారం అమలు కాకుండా నిలుపుదల చేశారు. ఈ విషయమై వీసీ ఉమేశ్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని, ప్రచారం సత్యదూరమని ఖండించారు. విద్యార్థుల హాజరు విషయంలో 40 శాతం కన్నా తక్కువ ఉన్న వారిని మాత్రమే అనుమతించలేదు అని స్పష్టం చేశారు.


