దేశం నిండా.. సిరిసిల్ల జెండా
జాతీయ జెండా.. ఉపాధికి అండ
ఏటా లక్షల జెండాల తయారీ
నేతన్నలకు పక్కా ఉపాధి
సిరిసిల్ల: కార్మికక్షేత్రంలో తయారయ్యే మూడు రంగుల జెండాలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఆ జెండాలు సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలుస్తున్నాయి. ఆగస్టు 15, జనవరి 26వ తేదీకి ముందుగానే జెండాల తయారీ, విక్రయాలు జరిగిపోతాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడురంగుల్లో ప్రింటింగ్ చేయిస్తారు. ఆ బట్టను జెండాల సైజును బట్టి మిషన్పై మహిళలు కుడుతారు. ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్న జెండాలను ఎగుమతి చేస్తారు.
దశాబ్దాలుగా ఉపాధి
సిరిసిల్లలో దశాబ్దాలుగా నేతన్నలకు జెండాల తయారీతో ఉపాధి లభిస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా మహానీయుల త్యాగాలు నేటి తరానికి తెలిసేలా ప్రతీ ఇంటిపైన జాతీయ జెండాలు ఎగురవేయాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునివ్వడంతో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని దొరికింది. జనవరి 26, ఆగస్టు 15వ తేదీలకు రెండు నెలల ముందే ఆర్డర్డు రావడంతో ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోని అన్ని రాష్టాలకు సిరిసిల్ల జెండాలు ఎగుమతి అవుతున్నాయి. లక్షలాది జాతీయ జెండాలను సిరిసిల్ల నేతన్నలు సరఫరా చేశారు. సిరిసిల్ల బట్టకు, జెండాల తయారీదారులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో జెండాను సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు అమ్ముతారు. మహిళలు జెండాలు కుడుతూ.. కట్ చేస్తూ.. ప్యాకింగ్ చేస్తూ.. ఉపాధి పొందుతున్నారు.
దేశం నిండా.. సిరిసిల్ల జెండా


