పరిహారం కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
మల్లాపూర్ : కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా.. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో మృత్యువాత పడిన నలుగురి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ మండలంలోని మొగిలిపేటలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మెట్పల్లి –ఖానాపూర్ రహదారిపై ధర్నా చేశారు. పసుపు ఏరడానికి కూలీలను తీసుకెళ్లిన ఎర్రంశెట్టి గంగా ధర్ నిర్లక్ష్యంతోనే ట్రాక్టర్ అదుపుతప్పిందన్నారు. లలిత, గంగు, సాయమ్మ, వైష్ణవి కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. మెట్పల్లి సీఐ అనిల్కుమార్, మల్లాపూర్, మెట్పల్లి, కోరుట్ల ఎస్సైలు అనిల్, కిరణ్, చిరంజీవి మొగిలిపేటకు చేరుకొని పోలీసులు గంగాధర్ కుటుంబసభ్యులతో మాట్లాడి మృతుల కుటుంబాకు రూ.6.50లక్షల చొప్పున పరిహారంతోపాటు రూ.15వేల చొప్పున దహనసంస్కారాలకు ఇచ్చేందుకు ఒప్పించారు. తక్షణ పరిహారంగా రూ.50వేలు అందించడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.


