ప్రచార ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి
సిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల వ్యయాలపై పక్కాగా పర్యవేక్షణ చేపట్టాలని వ్యయ పరిశీలకులు రాజ్కుమార్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడ బల్దియాలను సందర్శించి, ఎన్నికల అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఖర్చును నిబంధనల ప్రకారం నమోదు చేసి, వ్యయ రిజిస్టర్లు రోజువారీగా అప్డేట్ చేయాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ సమన్వయంతో పనిచేసి అక్రమ ఖర్చులు, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలన్నారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారు సమయానికి ఖర్చుల వివరాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోడల్ అధికారులు నవీన్కుమార్, భారతి పాల్గొన్నారు.


