మోసగాళ్లు రిమాండ్
కోనరావుపేట(వేములవాడ): ఇళ్లు నిర్మించుకునేవారికి ఇటుక, బేస్మెంట్ రాయి సరఫరా చేస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తులను గురువారం రిమాండ్కు తరలించినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్సాయి తెలిపారు. కోనరావుపేట ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన శివరాత్రి సదయ్య, పెద్దపల్లి మండలం తురకల మద్దికుంటకు చెందిన గాదాసు రాజయ్య ఇటుక, బేస్మెంట్ రాయి సరఫరా చేస్తామని నమ్మించి డబ్బులు తీసుకొని పరారవుతున్నారు. ఇలా వీరిద్దరు కోనరావుపేట, చందుర్తి, కథలాపూర్ మండలాల్లో ఐదుగురిని మోసం చేశారు. బాధితులు కొండాపూర్కు చెందిన పెద్దపల్లి స్వామి, పల్లిమక్తకు చెందిన చిద్రవేణి ప్రభాకర్, నిమ్మపల్లికి చెందిన గన్నారపు పద్మ, తిమ్మాపూర్కు చెందిన గాలిపెల్లి లస్మవ్వ, సిరికొండకు చెందిన మ్యాదరి వనితల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం కోనరావుపేట మండలం నిజామాబాద్ కమాన్ వద్ద వాహనంపై వెళ్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.14వేలు నగదు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లు కస్తూరి విశాల్రాజు, బి.నాగరాజులను అభినందించారు. సమావేశంలో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్రెడ్డి ఉన్నారు.
● ఇటుక, రాయి సరఫరా చేస్తామని డబ్బు వసూలు
● బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు


