గులాబీ జెండా ఎగరడం ఖాయం
● ప్రజల కళ్ల ముందే అభివృద్ధి ● జిల్లాలను ఎత్తివేయాలని కుట్ర పన్నుతున్నారు ● ‘సెస్’ను రద్దు చేస్తారేమో.. ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గులాబీ జెండానే ఎగరబోతుందని, మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో గురువారం మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇన్చార్జీలతో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. మన పని మనమే చెప్పుకోవాల్సిందే.. వేరే వాళ్లు ఎవరు చెప్పరు అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయన్నారు.
జిల్లాలను ఎత్తివేస్తామని గందరగోళం
కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నారని, ఈ అంశం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లాలను ఎత్తివేయడానికి సిద్ధమైన ప్రభుత్వం.. రేపు ‘సెస్’ను కూడా ఎత్తివేసినా ఆశ్చర్యం లేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనను తుగ్లక్ తరహా పాలనగా అభివర్ణించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతోందని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల గత 35 ఏళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉందని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పేర్కొన్నారు.
చేసింది చెప్పుకోవాలి
బీఆర్ఎస్ చేసింది ప్రతీ ఇంటికి చెప్పాలని, కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతీ గడపకు తీసుకెళ్లాలన్నారు. సంక్రాంతి దాటినా రైతుబంధు రాలేదని, చీరల ఆర్డర్లు ఇవ్వలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కూడా దిక్కులేని పరిస్థితి ఉందని విమర్శించారు. నేతన్నలకు నిజమైన అండగా నిలిచింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఫీవర్ పట్టుకుందని, సిరిసిల్ల ప్రజలంతా గులాబీ జెండా వైపే ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు చీటి నర్సింగరావు, అక్కరాజు శ్రీనివాస్, కల్వకుంట్ల గోపాల్రావు, బొడ్డు నారాయణ, సిద్ధం వేణు, పబ్బతి విజయేందర్రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


