ఆలోచన.. అవగాహన
అభివృద్ధిపై దిశనిర్దేశం
శిక్షణ బాగుందంటున్న సర్పంచులు
ముగిసిన సర్పంచుల ఐదు రోజుల శిక్షణ
వేములవాడరూరల్: గ్రామాభివృద్ధికి చేయాల్సిన పనులు.. గ్రామంలోని సమస్యలను గుర్తించే తీరు.. సమస్యలకు పరిష్కారం చేపే మార్గాలు.. అభివృద్ధి పనులను అధికారుల దృష్టికి తెచ్చే విధానంపై నూతన సర్పంచులకు జిల్లా అధికారులు అవగాహన కల్పించారు. వేములవాడలో ఐదు రోజులు నిర్వహించిన అవగాహన సదస్సుతో తమకు పాలనపై అవగాహన.. సమస్యలపై పట్టు కోసం చేయాల్సిన కృషి గురించి తెలిసిందని నూతనంగా ఎన్నికై న సర్పంచులు తెలిపారు. ఐదు రోజుల శిక్షణతో ఐదేళ్లకు అవసరమైన విషయాలు నేర్చుకున్నామంటున్నారు. ఈనెల 19న ప్రారంభమైన ఈ శిక్షణ 23వ తేదీతో ముగిసింది. మొదటి విడతగా వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 130 మంది సర్పంచులు హాజరయ్యారు. ఇందులో చాలా మంది నూతనంగా ఎన్నికై నవారే ఉన్నారు. ఐదు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీఎల్పీవో ఆధ్వర్యంలో నిధులు, విధులు, గ్రామంలో చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు.
గ్రామాభివృద్ధికి పాటుపడండి
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఎన్నికల వరకే రాజకీయాలు అని.. ఇక గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. సర్పంచుల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం ముఖ్య అతిథిగా వచ్చిన విప్ వారికి పలు విషయాలపై అవగాహన కల్పించారు. సౌకర్యాలు కల్పించి, గ్రామస్తుల మన్ననలు పొందాలన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులు వచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించినప్పుడే గ్రామాల్లో ప్రజలు ఆదరిస్తారన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు విప్కు పలు విన్నపాలు చేశారు. గ్రామాభివృద్ధికి నిధులు విడుదల చేయించాలని కోరారు. ఉపసర్పంచ్లతో ఉన్న జాయింట్ చెక్పవర్ను తొలగించి అధికారికి ఇవ్వాలని కోరారు.సర్పంచ్, ఉపసర్పంచ్ల మధ్య జాయింట్ చెక్పవర్తో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్నారు. డీపీవో షరీఫొద్దీన్, డీఎల్పీవో వీరభద్రయ్య, ఎంపీడీవోలు లచ్చాలు, నటరాజు, జయశీల, ఎంపీవోలు రమేశ్, ప్రదీప్, ఈజీఎస్ సిబ్బంది శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలోచన.. అవగాహన


