ఒళ్లు హూనమే..
● ఆదమరిస్తే ఆపదే.. ● ప్రమాదకరంగా సిరిసిల్ల–కామారెడ్డి మార్గం ● ఇల్లంతకుంట మండలంలో అధ్వానంగా రహదారులు ● హెచ్చరికబోర్డులతోనే సరిపెడుతున్న అధికారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)/ఇల్లంతకుంట(మానకొండూర్): అడుగుకో గుంత.. కనుచూపు మేరలో కనిపించని తారు.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న పొంచి ఉన్న ప్రమాదం.. ఇదీ రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు రహదారుల దుస్థితి. సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారితోపాటు లింక్ రోడ్లు అధ్వానంగా మారాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఏళ్లుగా పట్టించుకునే వారు లేక ప్రమాదాలకు నిలయంగా నిలుస్తున్నాయి. ఇలాంటి రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు.
వరుస ప్రమాదాలు
● సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. వేములవాడ నందికమాన్ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా మారడంతో వాహనాలు ఢీకొట్టుకుంటున్నాయి.
● సిరిసిల్ల శివారులోని చంద్రంపేట వద్ద ఇటీవల ఓ లారీ ఆలయాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు గాయపడ్డాడు.
● సర్దాపూర్, వెంకటాపూర్ మధ్య ఏడాది కాలంలో నాలుగుకు పైగా ప్రమాదాలు జరిగాయి.
● రాగట్లపల్లి శివారులోని మూలమలుపు వద్ద వా హనాలు అదుపుతప్పి పలువురు గాయపడ్డారు.
● రాచర్లగొల్లపల్లి శివారు, సత్తెపీరిల దర్గా వద్ద గత వారం రోజుల్లో పదికి పైగా ప్రమాదాలు జరుగగా, ఇద్దరు చనిపోయారు.
● రాగట్లపల్లి నుంచి నారాయణపూర్ మార్గంలోని లింక్రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో రోజూ వాహనాలు అదుపుతప్పుతున్నాయి. రెండు నెలల క్రితం వారం రోజుల్లోనే పది మంది గాయపడ్డారు.
గుంతలమయం
ఇల్లంతకుంట మండలంలోని రోడ్లుపై ప్రయాణిస్తే ఒళ్లు హూనం కావాల్సిందే. ఇల్లంతకుంటకు వెళ్దామంటే... నేను రాను బిడ్డో అనే పరిస్థితులు వచ్చాయి. ఇల్లంతకుంట నుంచి వంతడుపుల మీదుగా కరీంనగర్ వెళ్లే రోడ్డు తప్ప మండలంలో మిగతా రోడ్లు అన్ని సింగిల్ రహదారులే. రహీంఖాన్పేట నుంచి వెల్జీపురం వరకు అడుగడుగున గుంతలు దర్శనమిస్తాయి. వెల్జీపురం సమీపంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో టూ వీలర్స్ స్కిడ్ అవుతున్నాయి. రహీంఖాన్పేట నుంచి తంగళ్లపల్లి వరకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద 15.587 కిలోమీటర్లు డబుల్ రోడ్డుగా నిర్మించేందుకు 2021 ఆగస్టులో రూ.984 లక్షలు మంజూరు చేశారు. వెల్జీపురం నుంచి తంగళ్లపల్లి వైపు దాదాపు 9 కిలోమీటర్లు డబుల్ రోడ్డుగా చేసి కాంట్రాక్టర్ మిగతా రోడ్డు పనులు నిలిపివేశాడు. దీంతో రహీంఖాన్పేట నుంచి వెల్జీపూర్ వరకు, తెనుగుపల్లి నుంచి లక్ష్మీపూర్ వరకు భారీ గుంతలు పడ్డాయి. ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్లే దగ్గర దారికావడంతో చాలా మంది ఈ మార్గంలోనే ప్రయాణిస్తారు. ఇల్లంతకుంట నుంచి అనంతారం మీదుగా సిరిసిల్ల వెళ్లే ప్రధానమైన రోడ్డు జిల్లెల్ల వరకు అధ్వానంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణంతో భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు కోతకు గురైంది. అనంతగిరి పోచమ్మ దేవస్థానం, అన్నపూర్ణ ప్రాజెక్టులకు వెళ్లే దారి పెద్దలింగాపురం నుంచి అనంతగిరి వరకు అధ్వానంగా మారింది. సిరికొండ రోడ్డు ఇరువైపులా కోతకు గురైంది. ఇల్లంతకుంట నుండి ముస్కానిపేట మీదుగా సిద్దిపేటకు వెళ్లే రోడ్డు మండలం శివారు వరకు అధ్వానంగా ఉంది. అనంతారం నుంచి రహీంఖాన్పేట వెళ్లే రోడ్డుపై బీటీ లేచిపోయింది.
ఒళ్లు హూనమే..


