సిరిసిల్ల బరిలో 170 మంది
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ పోరులో ప్రచార పర్వానికి తెరలేచింది. పట్టణంలో 39 వార్డులు ఉండగా, 170 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం 64 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 32 మంది, కాంగ్రెస్ నుంచి 16, బీజేపీ నుంచి ఏడుగురు, ఇండిపెండెంట్లు 8 మంది, ఏఐఎఫ్బీ నుంచి ఒక్కరు విత్డ్రా చేసుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు విషణ్ణవదనాలతో, ఆవేదనతో మున్సిపల్ ఆఫీస్ నుంచి బయటికి రావడం కనిపించింది. బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు, ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులను అధికారులు కేటాయించారు. బీఆర్ఎస్ ఇన్చార్జి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, విండో మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్రెడ్డి పార్టీ అభ్యర్థుల బీ ఫామ్స్ను కమిషనర్కు అందించారు.
14 వార్డుల్లో త్రిముఖ, 10 వార్డుల్లో చతుర్ముఖ పోటీ
సిరిసిల్లలో 39 వార్డులు ఉండగా, 14 వార్డుల్లో ముగ్గురి మధ్య పోటీ, 10 వార్డుల్లో నలుగురి మధ్య పోటీ ఉంది. 9 వార్డుల్లో ఐదుగురి మధ్య, ఒక్క వార్డులో ఆరుగురు, మూడు వార్డుల్లో ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉండగా.. 15వ వార్డు, 34వ వార్డుల్లో మాత్రం ఎనిమిది మంది చొప్పున పోటీలో ఉన్నారు. పట్టణంలోని పది వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. బుధవారం నుంచి అభ్యర్థులు ప్రచారానికి తెర లేపనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ
పరిశీలన
సిరిసిల్ల మున్సిపల్లో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణను ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు వేర్వేరుగా పరిశీలించారు. కమిషనర్ ఖదీర్పాషా ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నోడల్ అధికారి భారతి, తహసీల్దార్ మహేశ్కుమార్, స్పోక్స్ పర్సన్ పాతూరి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
వేములవాడ మున్సిపల్లో..
వేములవాడ: వేములవాడ బల్దియాలో మొత్తం 150 మంది అభ్యర్థులకు మంగళవారం 37 మంది నామినేషన్ ఉపసంహరించుకోగా, 113 మంది బ రిలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు బుధవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్లో స మావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఎలక్షన్ ఏజెంట్ల పాస్పోర్టు సైజ్ ఫొటో, పూర్తి వివరాలతో హాజరు కావాలని కోరారు.
సిరిసిల్ల బరిలో 170 మంది


