నిరసనలు.. రాజీనామాలు
సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో ముసలం పెట్టాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పలువురు అభ్యర్థులు పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ, పార్టీకి రాజీనామాలు చేశారు. సిరిసిల్ల 10వ వార్డు బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ బొల్గం నాగరాజు సతీమణికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్థాణిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద పార్టీ కండువాలను వదిలేస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు అంబేడ్కర్ విగ్రహానికి అందించారు. అదే వార్డుకు చెందిన ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు బండారు శ్యాం టికెట్ రాలేదని ఆ పార్టీకి రాజీనామా చేశాడు. కాంగ్రెస్కు చెందిన పిట్టల శ్రీకాంత్ 38 వార్డులో తమ అభ్యర్థి పిట్టల తేజస్వినికి టికెట్ రాలేదని పార్టీ ఆఫీస్లోనే గొడవకు దిగారు. ఇలా అన్ని పార్టీల్లోనూ నిరసనలు, రాజీనామాలు జరిగాయి.
పది వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు
సిరిసిల్లలోని 10 వార్డుల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. పార్టీ టికెట్ రాని వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఇతర గుర్తులపై పోటీ చేశారు. రెబల్స్ బెడద అన్ని పార్టీల్లోనూ ఉండడం గమనార్హం. ఆయా పార్టీ ముఖ్యనేతలంతా అలకబూనిన అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. నామినేషన్ల ఉపసంహరణకు చేసిన రాజీ ప్రయత్నాలు కొన్ని చోట్ల కొలిక్కి వచ్చినా.. రెబల్స్ బెడద అన్ని పార్టీలకు ఉంది.


