నిత్యావసరాలు ఇస్తామంటూ నిండా ముంచారు
● గ్రామ ఫౌండేషన్ పేరుతో కొత్త స్కామ్ ● బస్వాపూర్కు చెందిన మహిళే పాత్రదారి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): చైన్ సిస్టమ్ స్కీములతో ఇప్పటికే ఎందరో మోసాపోతున్నా.. కొత్తరకం స్కామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిని జనాలు నమ్మి నిండా మునుగుతూనే ఉన్నారు. గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రతీ నెల నిత్యావసర సరుకులు అందిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో వెలుగుచూసింది. బాధిత మహిళలు ఆదివారం బస్వాపూర్కు వచ్చి గ్రామపంచాయతీ వద్ద బైఠాయించారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బస్వాపూర్కు చెందిన ఓ మహిళ వివిధ గ్రామాలకు వెళ్లి శ్రీగ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్శ్రీలో రూ.2,750 కడితే 8 నెలలపాటు ప్రతీ నెల నిత్యావసర సరుకులు, నెలకు రూ.వెయ్యి పింఛన్ వస్తుందని నమ్మించింది. అంతేకాకుండా కొత్తవారిని చేర్పిస్తే ఒక్కొక్కరికి రూ.300 చొప్పున కమీషన్ సైతం అందుతుందని తెలిపింది. దీంతో ఆశపడి నమ్మిన మహిళలు ఒక్కొక్కరు రూ.2,750 చొప్పున వందల సంఖ్యలో మహిళలు నగదు చెల్లించారు. కాగా ఒక నెల కొందరికి మాత్రమే సరుకులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. దీంతో మోసపోయినట్లు గ్రహించిన మహిళలు బస్వాపూర్కు చేరుకుని సదురు మహిళను నిలదీశారు. తాను కూడా ఈ స్కీమ్తో మోసపోయానని తన బంధువులు కూడా ఇందులో చేరారని సదరు మహిళలు తమగోడు వెళ్లబోసుకుందని బాధితులు తెలిపారు. 10 రోజుల్లో మీ అందరి డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో పోలీస్స్టేషన్లో కేసు పెట్టకుండా బాధిత మహిళలు వెనుదిరిగారు. పది రోజుల్లో తాము చెల్లించినా డబ్బు వాపస్ ఇవ్వకుంటే ఆందోళన చేపడతామని తెలిపారు. గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చాపకింద నీరులా సాగుతున్న ఇలాంటి చైన్ లింక్ స్కీముల స్కాములపై పోలీస్శాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.


