భద్రంగా.. బాధ్యతతో నడపాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హాజరైన కలెక్టర్, ఎస్పీ
వేములవాడఅర్బన్: వాహనదారులు బాధ్యతగా, భద్రంగా వాహనాలు నడపాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల(సడక్ సురక్ష అభియాన్)ను తిప్పాపూర్లో గురువారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే హాజరయ్యారు. బెలూన్లను వదిలారు. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు జాగ్రతగా నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ మొబైల్ చూస్తూ వాహనాలు నడపవద్దన్నారు. నో హెల్మెట్.. నో పెట్రోల్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ హై స్పీడ్, డ్రంకెన్డ్రైవ్తోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఏఎస్పీ రుత్విక్సాయి, ఆర్డీవో రాధాభాయి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, ఎంవీఐ వంశీధర్, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేశ్, డిపో మేనేజర్లు ప్రకాశ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో వైద్యం అందించాలి
రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, అత్యవసర విభాగం, డీఈఐసీ(డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్)తోపాటు ఇతర విభాగాలను సందర్శించారు. ఆస్పత్రికి రోజూ వచ్చే పేషెంట్ల సంఖ్య, అత్యవసర సేవల నిర్వహణ, డెలివరీల వివరాలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్, సివిల్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య ఉన్నారు.
అభివృద్ధికే పట్టం కట్టండి
వేములవాడరూరల్: పట్టణంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు చేస్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన 1, 2వ వార్డుల్లో పలు కుల సంఘాల కమిటీ హాళ్లకు మంజూరుపత్రాలు అందజేశారు. నాయకులు సంఘ స్వామి, కుల సంఘాల పెద్దలు, వార్డు ప్రజలు ఉన్నారు.


