నిత్య సాధనతోనే విజయం
● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ‘పది’ విద్యార్థులకు ప్రేరణ తరగతులు ప్రారంభం
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై నిత్యం సాధన చేస్తేనే విజయం సాధిస్తారని కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టళ్లలోని పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ‘ప్రేరణ’ అవగాహన తరగతులకు సోమవారం శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రేరణను ప్రారంభించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమన్నారు. ఇప్పుడు వచ్చిన మార్కులు భవిష్యత్ చదువులకు ఉపయోగపడతాయన్నారు. పరీక్షల టైమ్టేబుల్ సిద్ధం చేసుకోవాలని, అందుకు అనుగుణంగా చదవడం, రాయడం పూర్తి చేయాలని సూచించారు. అందరూ విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్, ఏఎస్డబ్ల్యూవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సర్వీస్, పీడీ ఓటర్లు, ఎన్నికల సిబ్బంది ఓటుహక్కును వినియోగించుకోవడానికి సిరిసిల్ల, వేములవాడల్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్పై అధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ అఽధికారులు, సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, లక్ష్మీరాజం, జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.


