నేటి ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి ఉండదని స్పష్టం చేశారు.
అందుబాటులోకి ఫర్టిలైజర్ యాప్ సేవలు
సిరిసిల్ల: రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం ఆదివారం కోరారు. ఈ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఫర్టిలైజర్ యాప్ను రైతులు డౌన్లోడ్ చేసుకొని, దాని ద్వారానే ఎరువులు బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆలయ కమిటీకి సన్మానం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి సమ్మక్క–సారలమ్మ ఆలయ కమిటీని ఆదివారం శ్రీమల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్ గదగోని సాగర్, ఆలయ కమిటీ చైర్మన్ కడారి రాంరెడ్డి, సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు.
‘యాదవుల మనోభావాలు పట్టించుకోరా?’
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ నేతలు గొర్రె తలకాయను రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు తగిలించి నిరసన చేపట్టడం సరికాదని.. ఇది యాదవుల మనోభావాలు దెబ్బతీయడమేనని యాదవ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ మాట్లాడారు. యాదవుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్లను కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జడల రవీందర్, వాసం మల్లేశం, మాసం భాస్కర్, జడల అరవింద్, అన్నబోయిన మల్లికార్జున్, తాడెం శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహాజాతర పనులు వేగవంతం చేయండి
వేములవాడ: మహాశివరాత్రి జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఈవో రమాదేవి సూచించారు. తన చాంబర్లో ఆదివారం సమావేశమయ్యారు. సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఆలయ ఉద్యోగులు సమన్వయంతో విధులు నిర్వహించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూశారని అభినందించారు. ఈ అనుభవంతో మహాశివరాత్రి జాతరను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
కార్మికులను బానిసలుగా మారుస్తున్నారు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను నీరుగార్చి, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు విమర్శించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో ఆదివారం నిర్వహించిన సుతారి సంఘం సమావేశంలో మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. తోట కనకయ్య, సుతారి సంఘం నాయకులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు


