ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్ల: జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా వైద్యశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్కుమార్ పాల్గొన్నారు.
సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఫిబ్రవరిలో సదరం శిబిరాలు నిర్వహించే తేదీలను ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్కుమార్ మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 5న ఆర్థో (ఎముకల), మానసిక వైద్యపరీక్షలు, 6న ఆర్థో(ఎముకల) పరీక్షలు నిర్వహిస్తారు. 9న కంటిచూపు, 12న జనరల్, వినికిడి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయా తేదీల్లో శిబిరాలకు వచ్చే దివ్యాంగులు సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లతో ఎక్స్రే, యూడీఐడీ అప్లికేషన్ ఫాం, ఆధార్కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోలు, ఫోన్ నంబరుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.


