పట్టణంలో చిక్కిన పల్లెలు
● కనిపించని అభివృద్ధి ● కనీస వసతులు కరువు ● పట్టించుకోని పాలకులు
సిరిసిల్ల అర్బన్: మున్సిపాలిటీలో విలీనమైతే వసతులు దరిచేరుతాయని ఆశపడ్డారు. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశించారు. కానీ స్థానికుల ఆశలు అడియాసలయ్యాయి. ఉన్న ఉపాధిహామీ పథకం మూలకుపడింది. వసతుల మాట పాలకులు ఎత్తనే లేదు. మున్సిపాలిటీలో విలీనం కాక ముందు గ్రామపంచాయతీలుగా ఉన్న రోజుల్లోనే తమ కాలనీల్లో పరిస్థితులు బాగుండేవని స్థానికులు పేర్కొంటున్నారు. ఏడేళ్ల క్రితం సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్ధాపూర్ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విలీన గ్రామాల్లోని పరిస్థితులపై సాక్షి ఫోకస్.
పడకేసిన పారిశుధ్యం పనులు
విలీన గ్రామాల్లో డ్రెయినేజీలు సరిగా లేవు. చెత్తసేకరణ సరిగ్గా చేపట్టకపోవడంతో శివారుకాలనీలతో పాటు విలీన గ్రామాల్లో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానంగా విలీన గ్రామాలైన చంద్రంపేట, జ్యోతినగర్, రగుడు, రాజీవ్నగర్, బోనాల, పెద్దూరు, బాబాజీకాలనీలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. డ్రెయినేజీలు, బీటీ, సీసీ రోడ్లు అసలే లేవు. మట్టిరోడ్లు.. వాటిపై పారుతున్న మురుగునీటితో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయని విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రంపేటలో మట్టిరోడ్డు, పక్కనే మురికికూపం
పిచ్చిమొక్కలతో జ్యోతినగర్లోని అంతర్గతరోడ్డు
పట్టణంలో చిక్కిన పల్లెలు


