● నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు ● అంచెలంచెలుగా
వేములవాడ: నిత్యం రాజన్న సన్నిధికి వేలాది మంది వచ్చి వెళ్లే వేములవాడ 1962కు పూర్వమే మున్సిపాలిటీగా ఉండేది. 1963లో గ్రామపంచాయతీగా అవతరించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలలో ఒకటిగా నిలిచింది. ఈక్రమంలో 2013లో నగరపంచాయతీగా, 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం వేములవాడ పట్టణంతోపాటు శివారులోని కోనాయపల్లి, శాత్రాజుపల్లి, అయ్యోర్పల్లి, తిప్పాపూర్ నాంపల్లి గ్రామాలను కలుపుకుని 28 వార్డులుగా అధికారులు విభజించారు. మొత్తం ఓటర్లు 40,877 ఉండగా, ఇందులో మహిళలు 21,279, పురుషులు 19,580, థర్డ్ జెండర్స్ 18 మంది ఉన్నారు. 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
మున్సిపల్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
మున్సిపల్ నామినేషన్ పర్వం బుధవారం నుంచి ప్రారంభం అవుతుండటంతో కమిషనర్ సంపత్కుమార్ కార్యాలయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఆవరణలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.


