ఎగసిన నిరసన జ్వాలలు
నల్లజెండాలతో బైక్ ర్యాలీలు
రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
సిరిసిల్లటౌన్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై సిరిసిల్లలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం కార్మికక్షేత్రంలోని అన్ని వాడలలో నిరసన ర్యాలీలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేపట్టారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో బైక్ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ ఆధ్వర్యంలో రగుడు చౌరస్తాలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ తగులపెట్టారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, రాష్ట్ర నాయకులు బొల్లి రామ్మోహన్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గొర్రె తలకాయతో వినూత్న నిరసన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంపై ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామ కూడలిలో గొర్రెతలకాయతో కూడిన సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
13 మందిపై కేసు
రాచర్లబొప్పాపూర్లో గొర్రె తలకాయను సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు పెట్టి దహనం చేసిన ఘటనపై 13 మందిపై కేసు పెట్టినట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వరుస కృష్ణహరితోపాటు మరో 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు మండే శ్రీను ఆధ్వర్యంలో యాదవ కులస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎగసిన నిరసన జ్వాలలు


