Nagarkurnool District News
-
రైతులకు సౌర పంట
వందశాతం సబ్సిడీపై అందజేయనున్న ప్రభుత్వం ●అవగాహన కల్పిస్తాం.. అచ్చంపేట నియోజకవర్గాన్ని సీఎం రేవంత్రెడ్డి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. మొదట వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ కల్పిస్తాం. రెండో విడతలో ఇళ్లకు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సౌర విద్యుత్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. దీని వల్ల ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. వందశాతం సబ్సిడీపై ఇవ్వనుండటంతో రైతులకు ఒక్క రూపాయి ఖర్చు కాదు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట ● సొంత భూముల్లో పంపుసెట్లు, ప్లాంట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం ● వ్యవసాయ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ట్రాన్స్కో అధికారులు ● పైలెట్ ప్రాజెక్టు కింద అచ్చంపేట ఎంపిక ● రూ.1,389.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్పై ప్రత్యేక దృష్టిసారించింది. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ కల్పించేందుకు చొరవ తీసుకుంటుంది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. వందరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్కో అధికారులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. మొదట వ్యవసాయ రంగానికి, తర్వాత గృహా అవసరాలకు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. వినియోగదారుల అవసరాల తర్వాత మిగులు విద్యుత్ను తిరిగి ట్రాన్స్కో అమ్ముకోవడం ద్వారా ప్రతి కుటుంబం నెలకు రూ.3– 6 వేల వరకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి రోల్మోడల్గా చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో సౌర విద్యుత్ కల్పిస్తోంది. ఇందులో సోలార్ ప్యానల్స్, కన్వెర్టర్ కంట్రోలర్ ఇవ్వనున్నారు. కొండారెడ్డిపల్లిలో 420 ఇళ్లు.. ఇప్పటికే సీఎం స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ బోర్లు, ఇళ్లకు ఉచితంగా సోలార్ ద్వారా విద్యుత్ అందించే కార్యక్రమం నాలుగు నెలలుగా ముమ్మరంగా సాగుతుంది. గ్రామంలో 499 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 420 ఇళ్లకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించారు. మరో 79 ఇళ్లకు సంబంధించి మట్టి మిద్దెలు, రేకుల ఇళ్లు ఉండటంతో ఏర్పాటు కాలేదు. వీటికి కూడా స్టాండ్స్ మార్చి, ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 21 ఇళ్లకు 2 కిలోవాట్లు, 9 ఇళ్లకు ఒక కిలోవాట్, 390 ఇళ్లకు 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్కు తెలంగాణ పునరుత్పాదన ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ఇప్పటి వరకు సుమారు రూ.8.55 కోట్లు ఖర్చు చేసింది. దీంతో గ్రామంలో ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. అలాగే గ్రామంలో 941 వ్యవసాయ బోర్లు ఉండగా.. వీటికి సోలార్ విద్యుత్ కల్పించాల్సి ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు 5 హెచ్పీ నుంచి 7 హెచ్పీ బోరు మోటార్లు వినియోగిస్తుంటారు. వీటికి 5 లేదా 7.5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఇళ్లకు అయితే 2 నుంచి 3 కిలోవాట్ల ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్కు రూ.65 నుంచి రూ.70 వేల ఖర్చు వస్తుండగా రోజుకు 4 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 3 కిలోవాట్కు కేంద్రం రూ.78 వేలు రాయితీ ఇస్తుంది. వ్యవసాయానికి 5 కిలోవాట్ల ప్యానల్, కన్వెర్టర్ కంట్రోలర్తో కలిపి రూ.3.50 లక్షల ఖర్చు వస్తోంది. నెలకు 600 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి చేయవచ్చు. 5–7.5 కిలోవాట్ల సామర్థ్యం సొంత భూముల్లో.. ఎస్హెచ్జీలు, రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగావాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థిక స్థోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంట్లు పెట్టించవచ్చు. లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కంలు నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు 4 ఎకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్లపాటు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్కు రూ.3.13 చొప్పున రైతులకు డిస్కంలు చెల్లిస్తాయి. భవిష్యత్లో ఈఆర్సీ నిర్ణయం మేరకు ఈ ధరల్లో మార్పులుంటాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ద్వారా ఏటా సగటున 15– 16 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. తద్వారా సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి రూ.45–50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
కందనూలు: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో క్షేత్రసాయి సిబ్బందికి సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, నీళ్ల విరేచనాలు, జ్వరాలు నమోదైన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అంటువ్యాధుల నివారణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు ఇనుప జాలీలు బిగించుకోవాలని, దోమతెరలు వాడాలని, ఇంటి ఆవరణలో, పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని, పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్, గాజు సీసాలు, డిస్పోజబుల్ కప్పులు, కొబ్బరి చిప్పలు వంటివి లేకుండా చేసుకోవాలని ప్రజలకు సూచించాలన్నారు. అన్ని పీహెచ్సీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, అనుమానం ఉన్నవారి రక్త నమూనాలు టీ–డయాగ్నోస్టిక్ హబ్కు ప్రతిరోజు పంపాలని చెప్పారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా పరిశుభ్రమైన నీరు, చేతుల శుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 31 వరకు నిర్వహించే ‘నీళ్ల విరేచనాలను ఆపండి’ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు ఐదేళ్లలోపు చిన్నారుల ఇంటికి వెళ్లి ముందస్తు జాగ్రత్తగా ఓఆర్ఎస్ పాకెట్లు అందించాలని, డయేరియా కలిగిన పిల్లలకు జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ పాకెట్లు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్, ప్రోగ్రాం అధికారి రాజశేఖర్, డాక్టర్ ప్రదీప్, ఎపిడెమియాలజిస్ట్ ప్రవళిక, ఏఎంఓ శ్రీనివాసులు, డీపీఓ రేనయ్య, ఏపీఓలు విజయ్కుమార్, రాజేష్ పాల్గొన్నారు. -
పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతోపాటు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓల్డ్ హెడ్క్వార్టర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి పోలీసుల కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శాఖాపరంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని, త్వరలోనే అచ్చంపేట, కల్వకుర్తి సబ్ డివిజన్ వారీగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ క్రమంలో మెడికల్ హెల్త్ క్యాంపులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు దాదాపు 300 మంది పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు వివిధ రకాల పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, ఏఆర్ ఏఎస్పీ భరత్, డీఎస్పీ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు. -
సౌరగిరి వికాసం రైతులకు ప్రత్యేక శిక్షణ
నాగర్ర్నూల్: ఇందిరా సౌర గిరి వికాసం పథకం రైతులకు రాష్ట్రస్థాయి ఉద్యాన పరిశోధన కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని, దీనిని సద్వినియోగం చేసుకొని నల్లమలలోని గిరిజన రైతులు రాష్ట్రస్థాయి శిక్షకులుగా మారాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఉద్యాన పంటలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత రాష్ట్రస్థాయిలో వారి సేవలు అందేలా చూస్తామన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇందిరా సౌర గిరి జల వికాసం లబ్ధిదారులు రాజకుమార్, లక్ష్మి, అలివేలతో కలెక్టర్ మాట్లాడారు. పాలెం కేవీకే, నల్లగొండ మల్లేపల్లి ఉద్యాన శిక్షణ కేంద్రం, సంగారెడ్డి ఉద్యాన శిక్షణ, పరిశోధన కేంద్రాల్లో ఉద్యాన పంటలపై శిక్షణ ఇస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఆదివాసీ, గిరిజన రైతులు ఆర్థిక అభ్యున్నతి సాధించేలా కృషి చేయాలని, ఆ దిశగా శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలతోపాటు మామిడి, అవకాడ, బత్తాయి, జీడి మామిడి, కొబ్బరి, జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లె వంటి పూలు, ఆయుర్వేద, సుగంధ తైల మొక్కల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ఈ పథకం కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని చెప్పారు. అంతిమంగా ఈ సమగ్ర కృషి నల్లమల ప్రాంతాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరణ జిల్లాలో రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేయగా.. 3 లక్షల మె.ట., ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 28,705 మంది రైతుల నుంచి 1,71,694 మె.ట., ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 26,314 మంది రైతులకు రూ.335 కోట్లు ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 10 వేల మె.ట., ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, రానున్న రెండు మూడు రోజుల్లోనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. భూ సేకరణలో వేగం పెంచాలి జిల్లాలో కేఎస్ఐ, పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గత వారం నిర్దేశించిన మేరకు భూ సేకరణ పనులను ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. వచ్చేవారం వరకు మరింత పురోగతి సాధించాలని సూచించారు. -
రూ.50 వేలు అప్పు తీసుకున్నా..
నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల ● -
రైతుల అనుమతి లేని రిజర్వాయర్ వద్దు
బల్మూర్: మండల కేంద్రం సమీపంలో నిర్మించతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ను రైతుల అనుమతి లేకుండా చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శుక్రవారం రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్మూర్, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 2,601 ఎకరాల భూములను ఈ రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వేలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను మోసం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిపై తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే బదులు గొలుసు కట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్నాయక్, నాయకులు నాగరాజు, శివకుమార్, సైదులు, రాజేష్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు తీర్చండి..
ప్రభుత్వ టీచర్లు సమయపాలన పాటించేలా చూడాలిప్రశ్న: జిల్లాలో విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలుకావడం లేదు. పకడ్బందీగా అమలయ్యేలా చూడండి. – ప్రసాద్, కల్వకుర్తి డీఈఓ: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి విద్యార్థి చదువుకునేలా నిర్బంధ ఉచిత విద్యను పకడ్బందీగా అమలుచేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల్లోనూ బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా, ఫీజు రాయితీతో విద్య అందించేలా చూస్తాం. దీనిపై ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ● జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ●● ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులన నియంత్రించండి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఈఓ రమేశ్కుమార్కు వినతులు సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్ అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంబంధిత అభ్యసన కార్యక్రమాలను అందిస్తున్నామని చెప్పారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యారంగ సమస్యలపై ‘సాక్షి’ చేపట్టిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని.. జిల్లావ్యాప్తంగా విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని పలువురు డీఈఓకు ఫోన్చేసి విజ్ఙప్తి చేశారు. ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు టీచర్లు సమయపాలన పాటించడం లేదు. ప్రార్థనా సమయానికి ప్రతి ఉపాధ్యాయుడు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. – విజయ్కుమార్, నాగర్కర్నూల్ డీఈఓ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించేలా చూస్తాం. సక్రమంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు తప్పవు. ఉపాధ్యాయుల హాజరు, పనితీరు, సమయపాలనపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడతాం. ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేవు. కనీసం టాయిలెట్లు కూడా సరిగా ఉండటం లేదు. – అనిల్కుమార్, అచ్చంపేట డీఈఓ: అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎక్కడైనా లేకపోతే ప్రతిపాదనలు సిద్ధంచేసి వెంటనే నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. టాయిలెట్లతో పాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నాం. ప్రశ్న: విద్యార్థులు లేరన్న కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారు. మూసేసిన బడులను తిరిగి తెరిపించాలి. – మహేంద్ర, పెద్దాపూర్, అచ్చంపేట డీఈఓ: జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను గుర్తించి.. వాటికి సైతం ఉపాధ్యాయులను కేటాయిస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెంచి బడులను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించి విద్యార్థుల హాజరు పెరిగేలా చూస్తాం. ప్రశ్న: ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీకే రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ, గ్రౌండ్, కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదు. – ప్రవీణ్, నాగర్కర్నూల్ డీఈఓ: ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలో ఫీజులపై తీర్మానం జరగాలి. అన్ని పాఠశాలలు పేరెంట్స్ కమిటీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై మాకు ఫిర్యాదు అందితే తప్పకుండా స్పందించి చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, పారిశుధ్య సమస్య ఉంది. పరిష్కారానికి చర్యలు తీసుకోగలరు. – తిరుపతయ్య, పోతిరెడ్డిపల్లి, తిమ్మాజిపేట డీఈఓ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్లీపర్లను నియమించాం. ఈసారి కూడా వారి ద్వారానే పారిశుద్ధ్య నిర్వహణ ఉంటుంది. మిషన్ భగీరథ పథకంతో పాఠశాలల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? – తిరుపతి, గంగారం, బిజినేపల్లి డీఈఓ: గతేడాది జిల్లాలో 27 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యా బోధన ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయనున్నాం. ఇందుకోసం ప్రత్యేక సిలబస్ను ప్రభుత్వం నిర్దేశించింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏఐ విద్యా బోధన కొనసాగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుంది. అలాగే ఖాన్ ఫౌండేషన్ ద్వారా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ బడిలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయి. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు. -
పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి ఆమె హాజరై మాట్లాడారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యతగా చదివించాలని సూచించారు. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాలబాలికలు ఆటపాటలకు దూరమై పని ప్రదేశాల్లో మగ్గిపోవడం సరికాదన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎవరైనా 14ఏళ్ల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే డయల్ 1098కు సమాచారం అందించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్రావు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం లత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి.. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా వంగూరు మండల కేంద్రంలో నెలకొల్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ బడుల బలోపేతంలో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా వంగూరులోని బాలుర, బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకే చోట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1,500 నుంచి 1,800 మంది విద్యార్థులకు విద్యా బోధన కొనసాగుతుందన్నారు. అయితే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 12కోట్లు మంజూరు చేసిందన్నారు. అనంతరం 36 మందితో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, గతంలో ఉన్న స్కూల్ డెవలప్మెంట్ కమిటీని యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి కమిటీలు సమావేశమై పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. సమావేశంలో విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్, విశ్వేశ్వర్రావు, జ్యోత్స్నారెడ్డి, డీఈఓ రమేశ్కుమార్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, ఎంఈఓ మురళీ మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. వంగూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం సౌకర్యాల కల్పనకు రూ. 12కోట్లు మంజూరు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి -
573 బస్సులకు నో ఫిట్నెస్
● ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు ● నేటినుంచి స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ● ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా మొత్తం ఫిట్నెస్ పరీక్షలు బస్సులు చేసినవి చేయనివి మహబూబ్నగర్ 457 300 157 నాగర్కర్నూల్ 259 138 121 వనపర్తి 230 97 133 జోగుళాంబ గద్వాల 247 171 76 నారాయణపేట 143 57 86 -
‘భూ భారతి’ దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తాం
వంగూరు/మన్ననూర్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై సమర్పించిన ప్రతి దరఖాస్తును పరిష్కరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలపై ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. భూ భారతి చట్టంతో పరిష్కార మార్గం చూపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ● అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన రైతు పర్వతాలుకు ఉపాధిహామీ పథకంలో మంజూరైన పౌల్ట్రీ యూనిట్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా షెడ్ నిర్మాణాన్ని నెలరోజుల్లో పూర్తిచేసి.. కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలని లబ్ధిదారుకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండలానికి ఒకటి చొప్పున మంజూరు చేస్తున్న షెడ్లో వెయ్యి కోడి పిల్లలను పెంచే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు, గ్రామీణ యువతను స్వయం ఉపాధిలో ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ చిన్న ఓబులేషు, ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ లింగయ్య, ఏపీఓ రఘు, పంచాయతీ కార్యదర్శి భీముడు పాల్గొన్నారు. -
సాగు సంబురం
● జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ● దుక్కులు దున్ని.. విత్తనాలు విత్తుతున్న రైతులు అచ్చంపేట: జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రైతులు అరకలు, ట్రాక్టర్లతో పొలాలకు వెళ్లి దుక్కులు దున్నుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులు జొన్న, పత్తి, సజ్జలు, ఆముదం తదితర విత్తనాలు విత్తుతున్నారు. సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా, ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొన్నా.. గతేడాదిలాగే వర్షాలు అధికంగా కురుస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అనుకూలంగా ఉండటంతో మొలకలు ఇబ్బంది లేకుండా వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. సాగు పనుల్లో బిజీబిజీ.. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలో కురిసిన తొలకరి చినుకులకు రైతులు తమ పంట పొలాల్లో జొన్న, పత్తి, సజ్జలు, ఆముదం, కందిపంట సాగుకు శ్రీకా రం చుట్టారు. దుక్కులు దున్నడం.. విత్తనాలు విత్తడం వంటి పనులు జోరందుకున్నాయి. అయితే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఘణనీయంగా పెరగడం రైతులకు భారంగా మా రింది. విత్తనాల కొనుగోలు నుంచి మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడి, ధరలు వస్తాయో లేదోనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా ఇచ్చినా పెట్టుబడికి కొంత సా యం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 5,38,462 ఎకరాల్లో పంటసాగు.. జిల్లాలో గతేడాది వానాకాలం 4,35,692 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయగా.. ఈఏడాది 5,38,462 ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో 1,60,021 ఎకరాల్లో వరి, 2,86,471 ఎకరాల్లో పత్తి, 7,822 ఎకరాల్లో జొన్న, 72,929 ఎకరాల్లో మొక్క జొన్న, 8,909 ఎకరాల్లో కందులు, 368 ఎకరాల్లో మినుములు, 895 ఎకరాల్లో వేరుశనగ, 239 ఎకరాల్లో ఆముదం, 809 ఎకరాల్లో ఇతర పంటలు, మరో 52,603 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంరాజుపల్లిలో పత్తి విత్తనాలు నాటేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతులు అందుబాటులో విత్తనాలు, ఎరువులు వర్షాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఎరువులతో పాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వదే విత్తనాలు కొనుగోలు చేయాలి. దళారుల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. – చంద్రశేఖర్, డీఏఓ -
పక్కాగా వంద రోజుల కార్యాచరణ అమలు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో వంద రోజుల కార్యాచరణ పక్కాగా అమలుపర్చాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలో వంద రోజుల కార్యాచరణ అమలు తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. ముందుగా మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియపై మున్సిపల్ సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం డీఆర్ఏసీసీ సెంటర్లో చెత్త రీసైక్లింగ్ ప్రక్రియను పరిశీలించారు. పట్టణంలో ఎనిమల్ బర్త్ సెంటర్ (ఏబీసీ) పనులు పూర్తయినందున.. వెంటనే ప్రారంభించాలని కమిషనర్ మహమూద్ షేక్కు సూచించారు. అదే విధంగా ప్రధాన మురుగు కాల్వను పరిశీలించారు. వానాకాలంలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వార్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలో వందశాతం పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
డయేరియా నివారణకు రోటసిల్ వ్యాక్సిన్
నాగర్కర్నూల్ క్రైం: చిన్నారుల్లో డయేరియా నివారణ కోసం రెండు డోస్ల రోటసిల్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈదమ్మగుడి ఆరోగ్య ఉప కేంద్రంలో చిన్నారులకు రోటసిల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని 178 ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోటసిల్ వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో చిన్నారులకు ఒక డోస్ రోటవైరస్ వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు డోస్ల రోటసిల్ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకటదాస్, జిల్లా టీకాకరణ అధికారి డా.రవికుమార్, డా.వాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాలి
నాగర్కర్నూల్: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్తో పాటు వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రాంబాబు నాయక్, రేణికుంట్ల ప్రవీణ్తో కలిసి చైర్మన్ సమావేశమై.. అట్రాసిటీ కేసుల దర్యాప్తులో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆయన సమీక్షించారు. ముఖ్య ప్రణాళికాధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పక్కదారి పట్టవద్దన్నారు. ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, కులాంతర వివాహాలు, అంబేడ్కర్ విద్యా పథకం తదితర వాటిపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ)ని వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్షతను నిరోధించడానికి, వారి హక్కులను రక్షించడానికి జిల్లాలో పకడ్బందీగా పౌరహక్కుల దినోత్సవాన్ని విరివిగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న కలెక్టర్, విద్యాశాఖ అధికారిని చైర్మన్ అభినందించారు. ● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు వంటి వివరాలను కమిషన్ చైర్మన్కు కలెక్టర్ వివరించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలతో జిల్లా రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కోటా మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి చైర్మన్ గౌరవ వందనం స్వీకరించారు. అదే విధంగా పలువురు వివిధ సమస్యలపై చైర్మన్కు వినతిపత్రాలు సమర్పించారు. అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి నిధులు పక్కదారి పడితే సహించం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
జడ్జిని కలిసిన కలెక్టర్
నాగర్కర్నూల్ క్రైం: ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డి.రమాకాంత్ను బుధవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తికి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు కొంతసేపు సమావేశమై జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లా పరిపాలన, న్యాయ వ్యవస్థ సమన్వయం, సహకారంతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన న్యాయ సేవలు అందించేలా కృషి జరగాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు కందనూలు: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి సంబంధిత అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్, డీవైఎస్ఓ సీతారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ.. ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఎంపికై న విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఎంపికలు ఉంటాయన్నారు. 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 30వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డీవైఎస్ఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో కలశాభిషేకం బిజినేపల్లి: జ్యేష్టమాసం పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో పలువురు దంపతులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో కలశాభిషేకాలు చేశారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్రెడ్డి, కొర్త చంద్రారెడ్డి, గుబ్బ సత్యనారాయణ, కృష్ణారెడ్డి, జక్పారెడ్డి, చెన్న కృష్ణారెడ్డి, మట్పూరి నాగేశ్వర్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లు రద్దుచేసే వరకు పోరాటం కల్వకుర్తి రూరల్: కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు అన్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో కలిసి మండల విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేలా లేబర్ కోడ్లను తీసుకురావడమే కాకుండా వివిధ రంగాల కేంద్ర పథకాలకు బడ్జెట్లో కోత విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 20ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సైతం బడ్జెట్ తగ్గించడం బాధాకరమన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం జూలై 9న సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో ఆంజనేయులు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నిర్మల, లక్ష్మి, అన్నపూర్ణ, యాదమ్మ, సువర్ణ, పర్వీన్, సాయమ్మ, అలివేల పాల్గొన్నారు. -
పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో రెండో దఫా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరులోని మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 8న మరో ఇద్దరు మంత్రులతో కలిసి రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు రోజులుగా ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారం రాత్రి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. వాకిటి శ్రీహరికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు దక్కాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నుంచి మూడో వ్యక్తి.. ఉమ్మడి ఏపీలో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలిసారిగా నారాయణపేటకు చెందిన రాంచందర్ కల్యాణి మార్కెటింగ్శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి గెలుపొందగా.. ఆయనకు 1997లో మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో పర్యాయం 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ నెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు కూడా.. మక్తల్కు మూడుసార్లు దక్కిన అమాత్యగిరి -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
పెద్దకొత్తపల్లి: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో భాగంగా బుధవారం పెద్దకొత్తపల్లి మండలంలోని దేవుని తిర్మలాపూర్ నుంచి వెన్నచర్ల గుండా నక్కలపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్లలో భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు, మహనీయుల ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ చేపట్టినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, మాజీ సర్పంచులు సత్యం, రాధ, రవికుమార్, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారానికి చొరవ చూపండి
నాగర్కర్నూల్ క్రైం: జాతీయ లోక్అదాలత్లో రాజీ అయ్యే కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు చొరవ చూపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్అదాలత్లో రాజీ అయ్యే క్రిమినల్, చెక్బౌన్స్ కేసులతో పాటు పెట్టి కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని.. జాతీయ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని తెలిపారు. సమావేశంలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి ఎన్.శ్రీనిధి ఉన్నారు. -
బడికి పోదాం.. చలో చలో
సాక్షి, నాగర్కర్నూల్/కందనూలు: జిల్లాలోని పాఠశాలలు పునఃప్రారంభానికి ముస్తాబయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పాఠశాలలను సుందరంగా అలంకరించారు. విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. బుధవారం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టారు. పాఠశాలల పరిసరాలతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. తాగునీటి వసతులను పరిశీలించి, అవసరమైన వాటికి మరమ్మతు చేయించారు. పండగ వాతావరణంలో బడుల్లో విద్యాబోధన చేపట్టేందుకు వీలుగా పరిశుభ్రత, ఆహ్లాదానికి ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయులు పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. ● విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు ఇప్పటికే జిల్లాకు చేరగా.. డీఈఓ పర్యవేక్షణలో వాటిని ఆయా మండలాలకు చేరవేశారు. అక్కడి నుంచి పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు మొదటి రోజు నుంచే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేపట్టనున్నారు. అయితే అనేక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల పనులు ఇంకా పూర్తి కాలేదు. కాగా, బడిబాట కార్యక్రమంలో ఇప్పటి వరకు 2,311 మంది విద్యార్థులను చేర్పించారు. 3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం జిల్లాలో 560 ప్రాథమిక, 126 ప్రాథమికోన్నత, 153 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 54,898 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మొత్తం 3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. ప్రస్తుతం జిల్లాకు 3,65,370 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. మిగిలిన పుస్తకాలను కూడా త్వరలో జిల్లాకు తెప్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 56,733 యూనిఫామ్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడ త్వరలో సిద్ధం చేయనున్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను గ్రామాల్లో సెర్ప్, అర్బన్లో మెప్మాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈసారి సరికొత్తగా విద్యాబోధన.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో అదనపు అంశాలతో విద్యార్థులకు విద్యాబోధన కొనసాగనుంది. అధునాతన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రాథమిక స్థాయి నుంచే ఆయా సబ్జెక్టుల్లో అభ్యసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రాథమిక స్థాయిలోనే తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించడంతో పాటు వారికి ఏఐ ఆధారిత అభ్యసన కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. ఇందుకోసం ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఐదు వరకు కంప్యూటర్లను సమకూర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. జిల్లాకు చేరిన పుస్తకాలను ఇప్పటికే పాఠశాలలకు పంపించాం. మిగిలిన పుస్తకాలను కూడా త్వరలో తెప్పిస్తాం. – రమేశ్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం విద్యార్థుల రాకకోసం సర్కారు బడుల ముస్తాబు మౌలిక వసతుల కల్పనలోఅధికారుల నిమగ్నం పండుగ వాతావరణంలో విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు ఏర్పాట్లు -
రూ. 4.29కోట్లతో మరమ్మతులు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల భవనాలకు మరమ్మతు నిమిత్తం రూ. 4.29కోట్లు మంజూరు కాగా.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు కొనసాగుతున్నాయి. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, లైట్లు, బోర్డుల ఏర్పాటు, ఇతరత్రా పనులు చేపడుతున్నారు. మొత్తం 411 పాఠశాలల భవనాల మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపగా.. 110 బడుల్లో వందశాతం పనులను పూర్తిచేశారు. 162 బడుల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 139 పాఠశాలల్లో పనులు ఇంకా మొదలుకాలేదు. ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నిర్ణీత సమయానికి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 79950 87602, 88972 29929
సమయం: గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకుకందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, మూతపడిన పాఠశాలలను తెరిపించడం, విద్యార్థులను చేర్పించడం, పారి శుద్ధ్యం, ప్రైవేటు పాఠశాలల్లో వసతులు, ఇతరత్రా సమస్యలపై సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్కుమార్తో గురువారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ ద్వారా డీఈఓతో నేరుగా మాట్లా డి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నేడు డీఈఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
నాగర్కర్నూల్: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
తెలకపల్లి: రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం తెలకపల్లిలో నిర్వహించిన భూ భారతి సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు రైతుల సమస్యల పరిష్కారం కోసమే జరుగుతున్నాయని, రైతులు తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అనంతరం బడిబాట కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను బడీడు పిల్లలను నమోదు చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత వసతులు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలుపుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్రావు, ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోండి
నాగర్కర్నూల్ క్రైం: ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సంబంధించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని, జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, చెక్బౌన్స్, ట్రాఫిక్ చలానా, ఎకై ్సజ్, అన్ని రకాల సివిల్ కేసులతోపాటు కోర్టు వరకు రాకుండా ఉన్న బ్యాంకు, చిట్ఫండ్ పెండింగ్లో ఉన్న కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీలు లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడంతో ఇరువర్గాలు సంతోషంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా తదితరులు పాల్గొన్నారు. నెలాఖరు వరకు రేషన్ పంపిణీ నాగర్కర్నూల్: జిల్లాలోని రేషన్ కార్డుదారులు తమ రేషన్ తీసుకునేందుకు ఈ నెలాఖరు వరకు పొడిగించామని కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజా పంపిణీ సన్నబియ్యం ఈ నెలలోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేస్తున్నందున ఈ నెలాఖరు వరకు తమకు కేటాయించిన బియ్యం పొందవచ్చన్నారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిధిలో ఇప్పటికే 558 రేషన్ షాపులకు గాను 425 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేశామని చెప్పారు. 16న వేలం పాట బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సంవత్సరం వరకు కొబ్బరి చిప్పల సేకరణ, పూలు, పూలదండలు అమ్ముకోవడానికి హక్కుల కోసం ఈ నెల 16న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ రంగారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి వేలం పాట ఉంటుందని, వేలంలో పాల్గొనేవారు డిపాజిట్ రుసుం చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 80747 76229, 79817 07326లను సంప్రదించాలని సూచించారు. దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల స్వీకరణ నాగర్కర్నూల్: రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలో దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలను మంజూరు చేస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఈ నెల 18 వరకు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక సహాయ ఉపకరణం మాత్రమే మంజూరు చేస్తామని చెప్పారు. పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ 3వ సెమిస్టర్, ఎంసీఏ, ఎంబీఏ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 84.83శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.ప్రవీణ పేర్కొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే త్వరలో రీకౌంటింగ్కు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కోఆర్డినేటర్ డాక్టర్ అరుంధతి, డాక్టర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే చర్యలు
తిమ్మాజిపేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇళ్ల మంజూరైందని ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైన డబ్బులు ఇచ్చినట్లు తెలిసినా రద్దు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారని, ఇందులో తన సొంత మండలం కంటే తిమ్మాజిపేటకే ఎక్కువగా 510 ఇళ్లు ఇచ్చామన్నారు. మరో రెండు విడతల్లోనూ ఇళ్లు వస్తాయన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందేలా చూస్తామన్నారు. నన్ను ఆదరించి ఈ స్థానంలో నిలబెట్టారు.. మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి, నాయకులు వెంకట్రామరెడ్డి, మల్లయ్యగౌడ్, శ్రీనివాస్, వివేక్రెడ్డి, ఉస్మాన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల అప్గ్రేడ్
● జిల్లాలో కొత్తగా 9 కస్తూర్బాల్లోఇంటర్ తరగతులు ప్రారంభం ● ఈ ఏడాది నుంచే కృత్రిమ మేధ (ఏఐ) బోధన ● అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు ప్రాధాన్యం ● మెరుగైన విద్య, భోజనం, వసతి కల్పనతో పెరిగిన డిమాండ్ ● పేద, మధ్య తరగతి బాలికలకు వరంగా మారిన విద్యాలయాలు అచ్చంపేట: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించగా.. సానుకూల స్పందన వచ్చింది. దీంతో పేదరికంతో తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక, స్థానికంగా పాఠశాలలు అందుబాటులో లేక, మధ్యలో చదువు మానేసిన, బడిబయటి ఆడపిల్లలకు రెసిడెన్షియల్ విద్య అందించేందుకు కేంద్రం 2005 సంవత్సరంలో కేజీబీవీలను నెలకొల్పింది. ఈ పాఠశాలలు అనాథ, పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికలకు వరంగా మారాయి. భోజనం, వసతి కల్పించడంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తుండటంతో క్రమంగా వీటిలో ప్రవేశాలకు పోటీ పెరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న కొన్ని పాఠశాలల్లో 2018లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. తాజాగా అన్ని పాఠశాలల్లో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసేందుకు కేంద్రం అంగీకరించగా నిరుపేద విద్యార్థినులకు మేలు జరగనుంది. దీంతోపాటు కేజీబీవీలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతులు ప్రవేపెట్టాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం ఉపాధి కోర్సులు కేజీబీవీ కళాశాలలో 160 ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉండగా.. మరికొన్నింట్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించనున్న ఇంటర్మీడియట్ తరగతుల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తోపాటు అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్, ఎంపీహెచ్డబ్ల్యూ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యార్థులకు భవిష్యత్లో స్వయం ఉపాధి పొందేలా వృత్తి విద్యా కోర్సులతోపాటు కుట్లు, అల్లికలు, కరాటే వంటి వాటిలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ పాఠశాలలో చదివే వారు చదువుతోపాటు స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అప్గ్రేడ్ చేసినవి ఇవే.. అచ్చంపేట కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ, ఏఐ కోర్సులు, కోడేరులో కంప్యూటర్ సైన్స్, ఏఐ, పదరలో సీఈసీ, అకౌంటింగ్, తాడూరులో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, పెద్దకొత్తపల్లిలో కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఎంపీహెచ్డబ్ల్యూ, తిమ్మాజిపేటలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఉప్పునుంతలలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఊర్కొండలో ఎంపీహెచ్డబ్ల్యూ, ఏఐ, వంగూరులో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులతో ఇంటర్ విద్య ప్రారంభించనున్నారు. అందుబాటులో 720 సీట్లు జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా.. ఇప్పటికే 11 చోట్ల ఇంటర్ విద్య అందుబాటులో ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం మిగిలిన 9 చోట్ల కూడా ఇంటర్ విద్యకు అనుమతించింది. అన్ని కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి రాగా.. మొదటి సంవత్సరంలో చేరికకు 720 సీట్లు ఉన్నాయి. నాలుగు కేజీబీవీలో ఏఐతోపాటు కొత్తగా అకౌంటింగ్ కోర్సుల వల్ల బాలికల విద్యకు మంచి భవిష్యత్ లభిస్తుంది. – శోభారాణి, జీసీడీఓ -
నీలినీడలు
నాగర్కర్నూల్బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025● పాలమూరులోనిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి ● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం ● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టిపెట్టని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగానష్టపోతున్న మత్స్యకారులు న్యూస్రీల్ ‘మీన’మేషాలు -
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
సాక్షి, నాగర్కర్నూల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచ వ్యాప్తమైందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కూలంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని, మోదీ పాలన ఓ స్వర్ణయుగం అని వివరించారు. పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడి ఘటనను పాక్ ప్రధానే ఒప్పుకున్నా.. ఇక్కడి ప్రతిపక్ష నాయకులకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, పట్టణాధ్యక్షుడు ప్రమోద్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి, యువమోర్చ జిల్లా కార్యదర్శి నరేష్చారి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు బీజేపీ ఎంపీ రఘునందన్రావు -
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
పెద్దకొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తోందని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లిలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, మధ్యాహ్న భోజనం సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించారు. ఇంటింటి ప్రచారం బడిబాటలో బడిఈడు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల వసతుల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న శానిటేషన్ కార్మికులు పరిశుభ్రతపై ఇస్తున్న శిక్షణ తరగతులల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూత్రశాలలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. డీఈఓ వెంట ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులున్నారు. -
అమ్మమాట.. అంగన్వాడీ బాట
వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం అచ్చంపేట: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకం. వారు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకేలు నేర్పి అటపాటలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు మంగళవారం నుంచి 17వ తేదీ వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో‘అమ్మమాట–అంగన్వాడీ బాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న సామూహికంగా అక్షరభ్యాసం చేయించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా.. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై ఎలాంటి మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా సిలబస్ రూపొందించారు. అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి యూనిఫాం అందజేస్తోంది. బడిబాట పట్టేలా.. అంగన్వాడీ కేంద్రాల్లోని 3–6 ఏళ్ల పిల్లలను బడిబాట పట్టించేందుకు సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్గా భావించే వారు. చిన్నారులు పాఠశాల వాతావరణానికి అలవాటయ్యేలా.. పౌష్టికాహారం అందించి, ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టే కేంద్రాలు అని అనుకునేవారు. అయితే గతేడాది నుంచి మార్పులు తెచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం, ఆటపాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్క్బుక్కులు అందించి.. వారితో హోంవర్క్ చేయిస్తున్నారు. ఎల్కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలు రూపొందించి ఆటపాటలతో బోధించారు. ప్రస్తుతం నిపుణ్ బారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యా బోధనతో చిన్నారుల మేధస్సు వికసించనుంది. అంగన్వాడీ కేంద్రాలు: 1,131 జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు: 4 ఆరేళ్లలోపు చిన్నారుల సంఖ్య: 46,229 గర్భిణులు: 5,745 బాలింతలు: 3,772ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తాం. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు అలవాటు చేసి ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయాలు కృషి చేయాలి. – రాజేశ్వరి, డీడబ్ల్యూఓ రెండున్నరేళ్లు పైబడిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చర్పించడమే లక్ష్యం నేటి నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు -
హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు..
ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు. – రాహుల్, బెంగుళూరు ● -
పోలీస్ ప్రజావాణికి 12 ఫిర్యాదులు
నాగర్కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 12 ఫిర్యాదులు అందగా.. 6 భూ తగాదాలపై, 4 వివిధ కేసుల్లో న్యాయం చేయాలని, 2 భార్యాభర్తల గొడవలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పేదల పక్షాన నిరంతర పోరాటం తాడూరు: పేదల పక్షాన సీపీఐ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ అన్నారు. సోమవారం తాడూరు మండలం నాగదేవపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా కమ్యూనిస్టులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదల జీవన మార్పునకు నాంది పలికిన జెండా ఎర్రజెండా అని అన్నారు. దోపిడీ, అన్యాయం, అణచివేత ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భరత్, నాయకులు వార్ల వెంకటయ్య, జంగన్న ఉన్నారు. స్పాట్ కౌన్సెలింగ్ వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 15న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం ఎస్టీ బాలికలకు మాత్రమే అవకాశం ఉంటుందని.. అన్ని ధ్రువపత్రాలతో కళాశాలలో జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 94909 57315 సంప్రదించాలని సూచించారు. -
పునరావాస పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు తదితర గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్, ఎల్లూర్ గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు. -
పాఠశాలల పనితీరు మెరుగుపరుస్తాం
నాగర్కర్నూల్: ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచి.. జిల్లాలో విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, మహిళల అభ్యున్నతికి సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్ల ఏర్పాటు, స్వయం సహాయక మహిళా సంఘాల భవనాల నిర్మాణాలు, సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చడం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీనే ప్రతి విద్యార్థికి యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు అందిస్తామన్నారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తామన్నారు. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ పూర్తి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను నవంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచినట్లు వివరించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల్లో విద్యార్థులను కూర్చొబెట్టకుండా చూస్తామని కలెక్టర్ తెలిపారు. పుస్తకాలు, యూనిఫాంల పంపిణీకి సిద్ధం బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు చర్యలు కలెక్టర్ బదావత్ సంతోష్ -
పేదల సొంతింటి కల సాకారం
చారకొండ: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. చారకొండ రైతువేదికలో సోమవారం 240మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మొదటి జాబితాలో పేరు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ మాజీ వైస్చైర్మన్ బాలాజీ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, మాజీ జెడ్పీటీసీ వెంకట్గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్రాంగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్, మహేందర్, జైపాల్ పాల్గొన్నారు. -
మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మృగశిర కార్తె రావడంతో వివిధ గ్రామాల భక్తులు భారీగా సొంత వాహనాల్లో పోట్టేళ్లను తీసుకొచ్చి అమ్మవారికి బలిచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. ఈ ఒక్కరోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి : సీపీఐ పెంట్లవెల్లి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో చిన్న కుర్మయ్య అధ్యక్షతన సీపీఐ ఒకటో మహాసభ నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధే లక్ష్యంగా పోరాటాలు కొనసాగిస్తామని.. వందేళ్ల చరిత్ర గల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని తెలిపారు. చరిత్రలో పదవులున్నా.. లేకున్నా కార్మిక, కర్షక, పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ తమదని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న కొల్లాపూర్ కమ్యూనిస్ట్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న కేఎల్ఐతో అభివృద్ధి దిశగా సాగుతుందని, నియోజకవర్గంలో లభించే ముడి సరుకుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మండలంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంపై జరుగుతున్న దాడులపై సమాధానం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను త్వరలోనే ఎండగడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర కార్యదర్శి బత్తిని రాము, జిల్లా కార్యదర్శి చిన్న కుర్మయ్య, తుమ్మల శివుడు, కిరణ్కుమార్, వంక గోపాల్, దేవ సహాయం, నిరంజన్, సువర్ణ, నర్సింహ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు. కోయిల్సాగర్లో పెరుగుతున్న నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11.7 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉంది. పాత అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు కాగా.. గేట్ల స్థాయి వరకు 32.6 అడుగులు. జూరాల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు వరకు పాత అలుగుకు నీటిమట్టం చేరే అవకాశం ఉంది. -
సర్పంచ్ టు మంత్రి..
అంచెలంచెలుగా ఎదిగిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపథ్యం.. ● వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ● 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. ● 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ● 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ● 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ● 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ● 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. ● 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ● 2022 సెప్టెంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జన్మించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి అమ్మమ్మ ఇంట్లో సంబరాలు నారాయణపేట: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం, ఆదివారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో జిల్లా కేంద్రంలోని మంత్రి అమ్మమ్మ పోషల్ శివమ్మ ఇంటా సంబరాలు అంబరాన్నంటాయి. శివమ్మ కుటుంబ సభ్యులు గొడుగుగేరిలోని అంజనేయస్వామి దేవాలయం దగ్గర టపాకులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ ఆనందంగా డప్పు వాయిస్తూ కేరింతలు కొట్టారు. సత్యనారాయణ చౌరస్తాలో సైతం కుటుంబ సభ్యులందరూ మిఠాయిలను పంపిణీ చేశారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి.. కుటుంబంలో అందరూ విద్యావంతులే.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే అమాత్యగిరి గతంలో ఎల్లారెడ్డి, పి.చంద్రశేఖర్, పులి వీరన్న, చిత్తరంజన్దాస్, శ్రీనివాసరావుకు అవకాశం బీసీ వర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. -
రైతులకు ‘మద్దతు’
14 రకాల పంటల ధరలు పెంచిన కేంద్రం ●మద్దతు సరిపోదు.. ప్రస్తుతం సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎకరం పత్తి సాగుకు సుమారు రూ.45 వేలు పెట్టుబడి అవుతుండగా దిగుబడి మాత్రం 8 నుంచి 10 కింటాళ్లు వస్తుంది. కేంద్రం క్వింటాకు కేవలం రూ.589 పెంచింది. మద్దతు ధర మరింత పెంచి క్వింటాకు రూ.పది వేలు ధర చెల్లిస్తే రైతుకు మేలు జరుగుతుంది. – సూగురు లింగస్వామి, రైతు, రాయిపాకుల వానాకాలం నుంచి అమలు.. కేంద్ర ప్రభుత్వం పంటలకు పెంచిన మద్దతు ధర ఈ వానాకాలం నుంచి అమలులోకి వస్తుంది. మద్దతు ధర పెంపుతో రైతులకు కొంత మేలు జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి ● పత్తికి రూ.589.. వరికి రూ.69 మాత్రమే... ● వానాకాలం నుంచి అమలులోకి.. ● జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంటల సాగు -
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
తాడూరు/తెలకపల్లి/బిజినేపల్లి: ఇల్లు అనేది ప్రతి మనిషి కల.. ఆ కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. శనివారం తాడూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరం, తెలకపల్లి, బిజినేపల్లిలోని ఏంజేఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. తాడూరు మండలం తమకు కలిసొచ్చిందని.. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలన్నదే తమ లక్ష్యమని.. ప్రజల మద్దతుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వివరించారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తారని చెప్పారు. తాడూరు మండలానికి 500 మంజూరయ్యాయని.. లబ్ధిదారులందరూ త్వరగా నిర్మించుకోవాలని కోరారు. అలాగే తెలకపల్లిలో 619 మంది, బిజనేపల్లి మండలంలో 685 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. తాడూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, చైర్మన్ రామచంద్రారెడ్డి, పీడీ సంగప్ప, ఏఈ రాజవర్ధన్రెడ్డి, సంద రేణుక, యూత్ కాంగ్రెస్ నాయకుడు వినోద్కుమార్, తెలకపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, వైస్ చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్న జంగయ్య, ప్రకాష్, ఖుర్షిద్, బండ పర్వతాలు వెంకటయ్యగౌడ్, నిరంజన్, బిజనేపల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నసీర్, తిరుపతయ్య, మిద్దె రాములు, బంగరి పర్వతాలు, పండ్ల పాషా, ముద్ద మధుసూదన్రెడ్డి, ముక్తార్, అధికారులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ.. నాగర్కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డా. రాజేశ్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్కుమార్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏలినాటి శనిదోష నివారణకు అక్కడే స్నానాలు చేసి నల్లటి వస్త్రాలు ధరించగా వారితో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులను సమర్పింపజేశారు. అనంతరం భక్తులు పక్కనే ఉన్న శివాలయాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ● ఇంటర్మీడియట్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్కర్నూల్లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా : మంత్రి చిన్నంబావి: తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం స్వగ్రామైన పెద్దదగడలో ఆయన గ్రామస్తులతో కలిసి వీధుల్లో పర్యటించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఇంతటివాడిని చేసిన గ్రామానికి ఎంతో చేయాల్సి ఉందని.. రానున్న కొద్దిరోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ, రూ.రెండు కోట్లతో తిరుమలనాథస్వామి ఆలయ మరమ్మతు లు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంగల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గ్రామానికి 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి మట్టి మిద్దె లేని గ్రామంగా చూడాలన్నదే తన సంకల్పమని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని రైతులు అడగగా.. రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రధాన కూడలిని రూ.కోటితో పట్టణ స్థాయిలో పార్క్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా.. తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పునూరులో బీరప్ప ఆలయంలో పూజలకు హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, వెంకటేష్, నర్సింహ, రజినిబాబు, నరేష్ కుమార్, బొల్లు శ్రీనివాసులు, యుగంధర్గౌడ్, మధు గౌడ్, శంకర్ యాదవ్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం -
త్యాగానికి ప్రతీక బక్రీద్
కందనూలు: ముస్లింలు జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శనివారం ఉదయమే జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీపురం రోడ్లో ఉన్న ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా జామియా నిజామియాకు చెందిన మతపెద్దలు బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. అల్లా ముస్లింలకు ప్రసాదించిన ఐదు అంశాల్లో హజ్ కూడా ప్రధానమైందన్నారు. బక్రీద్ ప్రాముఖ్యతను గుర్తుంచుకొని ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ ఖుర్బానీ ఇవ్వాలని ఖురాన్ చెబుతోందని.. ఇబ్రహీం అలై సలాం త్యాగనీరతికి ప్రతీక అయిన బక్రీద్ నిష్టతో జరుపుకోవాలని సూచించారు. అల్లా కరుణ ఉన్నంత వరకు సమాజంలో మంచి జరుగుతుందని.. ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లుతోందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్కర్నూల్ ఎమ్యెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతానికి మూల స్తంభాలైన ఇమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ సూత్రాలను పాటిస్తూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చంపేట, కల్వకుర్తిలో ఎమ్మెల్యేలు డా. వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు -
అలంపూర్ తేనేటి విందుతో ప్రకంపనలు
ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య కొన్నాళ్లుగా అంతర్గత వైరం కొనసాగుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లురవి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి జెడ్పీ మాజీ చైర్పర్సన్న్ సరిత ఇంట్లో తేనేటి విందులో పాల్గొనడం కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్ట్టించింది. దీంతో నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సంపత్కుమార్ వర్గీయులు మల్లు రవికి వ్యతిరేకంగా గళం వినిపించారు. అలంపూర్లో సంపత్ అన్నీ తానై ఎంపీగా మల్లు రవిని గెలిపించాడని.. ఆయనేమో సంపత్ను రాజకీయంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి రప్పించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ అయి ఉండి క్రమశిక్షణ తప్పారని.. వివిధ ప్రభుత్వ, ఇతర పనుల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించడం పార్టీలో కాక రేపింది. -
నువ్వా.. నేనా!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన అనంతరం సుమారు ఆరు నెలల వరకు గద్వాల జిల్లా కాంగ్రెస్లో పెద్దగా లుకలుకలు లేవు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో వర్గ పోరు మళ్లీ తీవ్రమైంది. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, బండ్ల బీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. 2023 ఎన్నికల ముందు సరిత కాంగ్రెస్లో చేరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. బండ్ల చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. నియోజకవర్గంలో ఆమెదే పైచేయిగా నిలిచింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని మంత్రి జూప ల్లి కాంగ్రెస్లో చేర్పించారో.. అప్పటి నుంచి వర్గ పోరు మళ్లీ మొదలైంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటనలో ఎమ్మె ల్యే ఏ పార్టీలో ఉన్నారంటూ సరిత వర్గీయులు నినాదాలు చేయడం, ప్రతిగా బండ్ల వర్గం వాదనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి.. సరితకు ఎంపీ మల్లురవి అండదండలు ఉ న్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో నేతల మధ్య తారస్థాయికి ఆధిపత్య ‘పోరు’ ● ఇప్పటికే గద్వాలలో సరిత, ఎమ్మెల్యే బండ్ల మధ్య వైరం ● తాజాగా తెరపైకి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్.. ● సరిత ఇంట్లో తేనేటి విందుకు హాజరుకావడంపై దుమారం ● ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గీయుల మండిపాటు ● పలువురికి షోకాజ్ నోటీసులు.. ప్రతిగా ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు ● పోటాపోటీ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నువ్వా.. నేనా అన్నట్లు నేతల మధ్య ఆధిపత్య పోరుతో జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య వైరం ఇదివరకే పార్టీ అధిష్టానానికి సంకటంగా మారగా.. ఇటీవల అలంపూర్ సెగ్మెంట్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడి ఎపిసోడ్ మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. సరిత ఇంట్లో తేనీటి విందుకు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి.. విజయుడిని వెంటబెట్టుకుని వెళ్లడంతో వివాదం తలెత్తింది. దీంతో మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య ఉన్న వైషమ్యాలు వీధికెక్కాయి. ఈ క్రమంలో పలువురు యువజన నాయకులకు షోకాజ్ నోటీసుల జారీ.. ప్రతిగా ఎంపీ వైఖరిపై సంపత్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటి పోటాపోటీ పరిణామాలు కాంగ్రెస్ను కుదిపేస్తున్నాయి. తెరదించే ప్రయత్నం.. అంతలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఎపిసోడ్ కాంగ్రెస్లో కలకలం సృష్టించగా.. వివాదంపై ఎంపీ మల్లురవి స్పందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాధృచ్ఛికంగా సరిత ఇంట్లో తేనేటి విందుకు విజయుడితో కలిసి హాజరయ్యామని.. మా మధ్య రాజకీయ పరమైన చర్చలు జరగలేదని వీడియోను పోస్టు చేశారు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కల్పితాలేనంటూ కొట్టిపారేశారు. తాను డబ్బులు తీసుకున్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని చెప్పారు. ఎంపీ స్పందనతో వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ వర్గీయులైన యువజన కాంగ్రెస్ నాయకులు కోల నర్సింహ, వరకుంట్ల గణేష్, కేఎంఆర్ యేసు, కాశపోగు శేఖర్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం మళ్లీ మలుపు తిరిగినట్లయింది. ప్రతిగా సంపత్ తన వర్గీయులతో కలిసి మల్లు రవితో పాటు సరితపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు పలువురు నాయకులు సంతకాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులను ఇప్పించి.. వారి నుంచి 10–20 శాతం కమీషన్ వసూలు చేసినట్లు ఎంపీపై ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరడం మరింత సెగ రాజేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలతో గద్వాల జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. నడిగడ్డలో ‘హస్త’వ్యస్తం గద్వాల -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్కుమార్ చెప్పారు. శుక్రవారం ఆర్ఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పది డిపోల నుంచి ఈ బస్సు (సూపర్ లగ్జరీ, డీలక్స్)లను అవసరమైన చోటకు పంపడానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏడు రూట్లలో ఆయా ప్యాకేజీలను బట్టి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ బస్సులో సామూహికంగా ఏదైనా సంస్థ (పాఠశాలలు, కళాశాలలు) లేదా ఇతర సంఘాల తరఫున ఒకేసారి 30 నుంచి 35 మంది వరకు వెళ్లొచ్చేందుకు బుక్ చేసిన వారి పేర ఒకరికి ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అందరికీ కలిపి పది శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు మహబూబ్నగర్ డిపో మేనేజర్ (ఫోన్ నం.99592 26286)ను సంప్రదించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఈనెల 27న రాష్ట్రస్థాయిలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. అంతకంటే ముందే ఎవరైనా ఈ ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ ప్యాకేజీకి చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, డీఎం బి.సుజాత, పీఓ వి.సుజాత, ఏఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ నుంచి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఈ నెల 27వ తేదీన ప్రారంభం: ఆర్ఎం -
అప్రమత్తతే కీలకం..
సాక్షి, నాగర్కర్నూల్: రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, లైసెన్స్డ్ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ అన్నారు. విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, అందులో సంబంధిత విత్తన లాట్ నంబర్ నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతులు ఎప్పటికప్పుడు ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలని కోరారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రైతులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. విత్తనాల ఎంపిక, పంటల సాగులో మెళకువలు, నాసిరకం విత్తనాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను రైతులకు వివరించారు. ప్రశ్న : గత సీజన్లో నాసిరకం పత్తి విత్తనాలు కొని తీవ్రంగా నష్టపోయాం. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. మాకు నష్టపరిహారం అందలేదు. – జంగయ్య, వెల్గొండ, బిజినేపల్లి మండలం డీఏఓ : జిల్లాలోని ప్రభుత్వ ఆధీకృత లైసెన్స్డ్ విత్తన డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో లూస్ సేల్స్, విడి, నమ్మకం లేని విత్తనాలను కొనవద్దు. లైసెన్స్డ్ దుకాణాల్లో విత్తనాలు తీసుకున్నా తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. అందులో విత్తన లాట్ నంబర్ నమోదు చేయించుకోవాలి. అలా అయితేనే డీలర్, విత్తన కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రశ్న: కూరగాయల సాగుకు ఎలాంటి పరిస్థితులు అనుకూలం. వానాకాలం సీజన్లో ఎలాంటి సన్న రకాలు సాగు చేయాలి.? – లింగస్వామి, పెద్దకొత్తపల్లి, జోగయ్య, వెల్దండ డీఏఓ : కేవలం వర్షాధారంపై ఆధారపడి కూరగాయల సాగు చేయవద్దు. కచ్చితంగా నీటి వసతి ఉంటేనే ముందుకెళ్లాలి. మేలైన విత్తనాలు లేదా నర్సరీల్లో నార్లు దొరుకుతున్నాయి. ముందుగా తక్కువ మొత్తంలో కూరగాయలు సాగుచేసి, మార్కెట్ పరిస్థితులను బట్టి సాగు విస్తీర్ణం పెంచుకోవాలి. సన్నరకం వరి ధాన్యం విత్తనాలలో కూనారం సన్నాలు 1638 రకం మంచి దిగుబడి ఇస్తున్నాయి. ప్రశ్న: పత్తి సాగులో నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు వాడితే తెగుళ్లు ఎక్కువగా వస్తాయా..? – గోపాసు లక్ష్మణ్, గోరటి కాశన్న, కార్వంగ, తెలకపల్లి మండలం డీఏఓ : పత్తి పంటకు మొదటి దశలో స్ప్రింక్లర్లు వాడితే ఎలాంటి నష్టాలు ఉండవు. పూత వచ్చే వరకు స్ప్రింక్లర్లు వాడుకోవచ్చు. పత్తి, వేరుశనగ వంటి పంటలు ఆలస్యంగా విత్తుకుంటే చివరి దశలో తెగుళ్లు, చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. అదును జూన్ 15లోపు పత్తి విత్తుకోవాలి. మొక్కల వేరు వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు ప్రారంభంలోనే ఎరువులు వేసుకోవాలి. సింగిల్ సూపర్ పాస్పేట్ గుళికలను ఎకరాకు 4 సంచుల చొప్పున చల్లుకోవాలి. ప్రశ్న: గతంలో రైతు చైతన్య యాత్రల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందేవి. మార్కెటింగ్, సహకార, వ్యవసాయ, విద్యుత్ అధికారుల సమన్వయంతో మీటింగ్లు జరిగేవి. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. – పురుషోత్తంరెడ్డి, వెల్దండ, దేశ్యనాయక్, అచ్చంపేట డీఏఓ : ప్రస్తుతం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా నిరంతరం రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యామ్నాయంగా మినుము, పెసర తదితర పంటల సాగు గురించి వివరిస్తున్నాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా ప్రతి మంగళవారం రైతువేదికల్లో 2 గంటల పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అందిస్తున్నాం. ప్రశ్న: నకిలీ, నాసిరకం విత్తనాల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు. విత్తనాల డీలర్ల పేరుతో బినామీలు అమ్మకుండా చూడాలి. – వావిలాల రాజశేఖరశర్మ, నాగర్కర్నూల్, బాలాజీ, అచ్చంపేట డీఏఓ : నకిలీ విత్తనాల సరఫరాపై ప్రత్యేకంగా నిఘా ఉంచుతున్నాం. ఇటీవల తిమ్మాజిపేటలో ఒకరిని గుర్తించాం. పోలీసులు కేసు నమోదు చేసి, ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లైసెన్స్డ్ డీలర్ల స్థానంలో ఇతర వ్యక్తులు విక్రయాలు జరపకుండా చర్యలు చేపట్టాం. ప్రభుత్వం సర్టిఫై చేసినవారే అమ్మకాలు జరిపేలా చూస్తున్నాం. లైసెన్స్డ్ దుకాణాల్లోనే విత్తనాలు తీసుకోవాలి రసీదులో లాట్ నంబర్ నమోదు తప్పనిసరి అదునులో నాటుకుంటేనే ప్రయోజనం నీటి వసతి లేకుంటే తొందరపడవద్దు జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ ప్రశ్న : ప్రభుత్వం తరపున రైతుల పొలాల్లో భూసార పరీక్షలు చేపడితే ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాల కొరత ఉంది. – శివకుమార్, కల్వకుర్తి డీఏఓ : జిల్లాలోని పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతుల కోసం భూసార పరీక్షల కేంద్రం ఏర్పాటైంది. ఔత్సాహిక రైతులు మట్టి నమూనాలను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాలతోపాటు ఇతర విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : మా దగ్గర విత్తనాలు తీసుకుంటే రసీదు ఇవ్వడం లేదు. అడిగితే తెల్ల పేపర్పై రాసి ఇస్తున్నారు. రసీదు ఇవ్వడం అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. విత్తనాలకు ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారా..? – ప్రదీప్, వెల్దండ డీఏఓ : విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. జిల్లావ్యాప్తంగా లైసెన్స్డ్ డీలర్లు రసీదులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉద్యానవన పంటలకు మాత్రమే డ్రిప్ సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. ప్రశ్న : కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు అదనంగా తూకంతోపాటు హమాలీ చార్జీలు రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. – శ్రీనునాయక్, దేవదారికుంట, ఉప్పునుంతల మండలం డీఏఓ: కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎఫ్ఏక్యూ నిబంధనల మేరకు ధాన్యాన్ని ఎలాంటి తప్ప, తాలు లేకుండా తీసుకురావాలి. కానీ, చాలా వరకు రైతులు ధాన్యాన్ని ప్యాడీ క్లీనింగ్ చేయడం లేదు. రైతులు నిబంధనల మేరకు ధాన్యం తెచ్చి నష్టపోకుండా చూసుకోవాలి. జిల్లాలో పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ కొనసాగుతోంది. -
భూ సేకరణ ప్రక్రియ వేగిరం చేయాలి : కలెక్టర్
నాగర్కర్నూల్: జిల్లాలో కొనసాగుతున్న కేఎల్ఐ, పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 14 ప్యాకేజీల పరిధిలో 11,930.22 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 11,899.07 పూర్తయ్యిందని, మిగిలిన 31.15 ఎకరాలు వెంటనే చేపట్టాలన్నారు. అలాగే కేఎల్ఐ పరిధిలోని 28వ ప్యాకేజీకి సంబంధించి 27 ఎకరాలు, 29వ ప్యాకేజీలో 242 ఎకరాలు, 30వ ప్యాకేజీలో 256 ఎకరాలు, మార్కండేయ ఎత్తిపోతలకు సంబంధించి 104.42 ఎకరాలు ఉందని, దీనిని ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలో 244.15 ఎకరాలు, కర్నెతండా ప్రాజెక్టుకు సంబంధించి 3.28 ఎకరాల భూమిని త్వరగా సేకరించాలన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు శ్రీధర్, పార్థసారథి, మురళి, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి నాగేందర్, ఆర్డీఓలు శ్రీను, మాధవి, సురేష్, భూ సేకరణ విభాగం కలెక్టరేట్ సూపరింటెండెంట్ నారాయణ, కార్తీక్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బక్రీద్ను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ మాట్లాడుతూ పండుగను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మాదకద్రవ్యాలకు బానిస కావొద్దు నాగర్కర్నూల్ క్రైం: మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో డ్రగ్స్, గంజాయికి సంబంధించి వీడియో సాంగ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాల మండలం అప్పాయపల్లి గ్రామవాసి, రైటర్ వేముల శివరాంసాగర్, ప్రొడ్యూసర్ మహేష్ గంజాయి, మాదక ద్రవ్యాలపై వీడియో సాంగ్ చేయడంతో ఎంతో మందికి అవగాహన కలుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగుతోపాటు విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు (సెల్ నం.87126 57709) సమాచారం అందించాలన్నారు. ఏఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్యాక్లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం కల్వకుర్తి టౌన్: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 2010– 2016 మధ్యకాలంలో డిగ్రీ ఏదైనా సబ్జెక్టులో ఫెయిలైన వారు జూలైలో జరిగే పరీక్షలలో రాసే విధంగా అవకాశం యూనివర్సిటీ కల్పించిందని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శార్వాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే వారంతా ఫీజుకు అదనంగా ప్రతి సబ్జెక్టుకు రూ.3 వేలు ఈ నెల 16లోగా చదువుకున్న కళాశాలలో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షల కోఆర్డినేటర్ రాజును కలిసి తెలుసుకోవాలని కోరారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సు కందనూలు: జిల్లాకేంద్రం నుంచి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సాయంత్రం 8 గంటలకు నాగర్కర్నూల్ బస్టాండ్ నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి అరుణాచలానికి చేరుకుంటుంది. మళ్లీ బుధవారం సాయంత్రం 5 గంటలకు అరుణాచలంలో బయలుదేరి గురువారం ఉదయం నాగర్కర్నూల్కు చేరుకుంటుందని, ఈ అవకాశాన్ని అరుణాచలం వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
మూడేళ్లలో ‘పాలమూరు’ పూర్తి
అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.శుక్రవారం నవాబ్పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినా చంద్రబాబునాయుడు వద్దన్నందుకే బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా నాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలన మాదిరిగా సాగితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చేదన్నారు. అందుకే బీఆర్ఎస్ను దగ్గరికి రాకుండా దూరం పెట్టాలని ప్రజలను కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్, కథలప్ప పాల్గొన్నారు. సస్యశ్యామలం చేస్తాం నిధులు ఆవిరైనా.. నీళ్లు రాలేదని... కాంగ్రెస్ ప్రభుత్వమే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేస్తారని, అందుకు కేబినెట్ కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి రూ.70 కోట్లు, శంకరసముద్రం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.32 కోట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే చౌదర్పల్లి లిఫ్ట్కు సాధ్యమైనంత త్వరగా ఆర్థికపరమైన అనుమతులిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో దొంగలు పడ్డట్లు దోపిడీ చేశారని విమర్శించారు. లేనిది ఉన్న ట్లు.. ఉన్నది లేనట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు రూ.102 కోట్లు విడుదల తెలంగాణ రైజింగ్ను ఆపలేరు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి -
అనంతవరంలో ఉద్రిక్తత
బల్మూర్: ఉమామహేశ్వర రిజర్వాయర్ ఆనకట్ట నిర్మాణం కోసం గురువారం మండలంలోని అనంతవరం సమీపంలో నిర్వహించిన సర్వే పనులపై రైతులు నిరసన తెలిపారు. రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం ఇరిగేషన్ అధికారులు ఐదు టీంలుగా అంబగిరి, బల్మూర్, మైలారం, అనంతవరం గ్రామాల శివార్లలో రిజర్వాయర్ కట్ట కోసం బౌండరి పనుల భూసర్వేను చేపట్టగా అనంతవరం గ్రామానికి చెందిన రైతులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో డీఎస్పీ శ్రీనివాసులు ఆద్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి రైతులతో మాట్లాడి శాంతిభధ్రతల సమస్యలు, సర్వేకు అడ్డంకులు సృష్టిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి భూ నిర్వాసిత రైతులను అక్కడి నుంచి పంపించడంతో ఇరిగేషన్ అధికారులు సర్వే పనులను కొనసాగించారు. కాగా భూ సర్వే పనులను అడ్డుకునేందుకు రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తారని అనుమానించిన పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వేతో ఆయా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
భూ భారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలి
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం అమలులో భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని రైతువేదికలో లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో లైసెన్సుడ్ సర్వేయర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. మొదటి విడతలో 237 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. భూమి సరిహద్దులను గుర్తించడం, కొలతలను తీసుకోవడం, భూమి నమూనాలను తయారు చేయడం ద్వారా సర్వేయర్లు భూమిని సరిగా ఉపయోగించుకోవడానికి, ప్లాన్ చేయడానికి సహాయపడతారన్నారు. భూ భారతి చట్టంలో పొందుపర్చిన 5, 7, 8 సెక్షన్ల ప్రకారం భూముల క్రయ విక్రయాలు, సక్సేషన్ వంటి వాటిపై క్షేత్రస్థాయిలో భూముల సర్వే జరిపి మ్యాప్లను రూపొందించాలన్నారు. భవిష్యత్లో వివాదాలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ భూములకు కూడా సర్వే మ్యాప్లను జతచేయాలని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం ప్రతి భూమి పార్సిల్కు ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయించనుందని, దీనికి కూడా లైసెన్సుడ్ సర్వేయర్ల సేవలు అవసరమవుతాయన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పక్కనే ఉన్న పంట పొలాలను సందర్శించి, సర్వేయర్లకు సర్వే విధానంపై అవగాహన కల్పించేలా స్వయంగా సర్వే చేయించి పరిశీలించారు. -
భూమి బదులు భూమి ఇవ్వాలి..
మాకు అనంతవరం శివారులో ఉన్న మూడెకరాల భూమిని రిజర్వాయర్ కింద తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మేం అంగీకారం తెలపకపోయినా మా భూములు తీసుకుంటాం అంటున్నారు. మేం కోల్పోయే భూములకు బదులుగా మరో చోట భూమిని కేటాయించాలి. మా జీవనోపాధి కోల్పోకుండా చూడాలి. – సుక్కమ్మ, మహిళా రైతు, బల్మూరు కేవలం సర్వే పనులు చేపడుతున్నాం.. రిజర్వాయర్ నిర్మాణం కోసం అవసరమైన సర్వే పనులను మాత్రమే చేపట్టాం. రైతుల భూములను స్వాధీనం చేసుకోలేదు. రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతాల్లో మార్కింగ్ చేపడుతున్నాం. ప్రభుత్వం చట్టప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తుంది. – బాలస్వామి, డీఈ, నీటిపారుదల శాఖ ● -
ఫోన్ చేయాల్సిన నంబర్: 89777 51163, 88972 29929
సాక్షి, నాగర్ర్నూల్: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు సాగు పనులకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు ముమ్మరం అవుతున్నాయి. ఈ సందర్భంగా నకిలీ విత్తనాల బెడద నుంచి ఎలా తప్పించుకోవాలి.. నాణ్యమైన విత్తనాల ఎంపిక.. లాభసాటిగా ఉండే పంటలసాగు.. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్తో శుక్రవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టనుంది. రైతులు ఫోన్ ద్వారా డీఏఓతో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నేడు డీఏఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్ -
‘సర్కారు బడి’ పిలుస్తోంది
●నేటి నుంచి 19 వరకు బడిబాట ప్రాధాన్య అంశాలు.. ● ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు మాత్రమే పాఠాలు బోధిస్తారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నారు. అభ్యసన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం గత నెలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. సక్సెస్, పీఎంశ్రీ పాఠశాలల పేరిట ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగిస్తున్నారు. ● ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ విశాలమైన క్రీడా మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా పరికరాలు ఉండటంతో విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉంటుంది. ● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించేందుకు పరిశోధనల్లో పాల్గొనే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్లో జాతీయ సైన్స్ పరిశోధన అంశాలు ప్రదర్శించేందుకు ఇన్స్పైర్ అవార్డుల పథకంతో పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు రూ.5 వేల చొప్పున సాయం అందిస్తారు. విజయవంతం చేస్తాం.. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలు, అన్ని వర్గాల ప్ర జల సమన్వయంతో బడిబాట విజయవంతం చే సేందుకు కృషిచేస్తాం. బడి బయట ఉన్న పిల్లల ను వందశాతం బడిలో చేర్పించడమే లక్ష్యం. ప్రణాళిక ప్రకారం ఎక్కువ మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బడులను బలోపేతం చేస్తాం. బడిబాట విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. – రమేష్కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి● బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు ● మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ ● అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆదేశాలు ● కార్యాచరణ రూపొందించిన జిల్లా విద్యాధికారులు కందనూలు/ అచ్చంపేట: సర్కారు బడుల బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ క్రమంలో పెద్దఎత్తున విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతి ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమానికి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా, బడిబయటి పిల్లలతో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి 19 వరకు ‘బడిబాట’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ విడుదల చేసింది. ప్రైవేట్కు ధీటుగా కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి పాఠశాలల్లో చేర్పించనున్నారు. ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం పేరిట జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఇది వరకే ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగారు. మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, కెపాసిటీ బిల్లింగ్ పేరిట జిల్లాలోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు ఇటీవల మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కంటే 20 శాతం పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశం. పాఠశాలల ప్రారంభంలోపు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఉచిత దస్తులు అందించడంతోపాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. సామాజిక సేవా సంస్థలు, ఎన్జీఓలు తదితర వర్గాలను సమన్వయపరిచి బడిబాటను విజయవంతం చేయాలని సూచించారు. బడిబాట కార్యక్రమాలు ఇలా.. ● ఈ నెల 6న ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ నిర్వహిస్తారు. ● 7న ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించాలి. ● 8, 9, 10 తేదీల్లో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, బడిమానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం, ప్రత్యేకావసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించాలి. ● 11న నాలుగు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం, పిల్లలకు పాఠ్య, రాత పుస్తకాలు, ఉచిత దుస్తులు అందజేయాలి. ● 13న సామూహిక అక్షరభ్యాసం, బాలసభ ● 16న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల దినోత్సవం, తరగతి గదిలో విషయాల వారీగా అభ్యసనా సామర్థ్యాల గోడపత్రుల ప్రదర్శన, పిల్లలు రూపొందించిన చార్టులతో గదుల అలంకరణ, చదవడం, గణిత సంబంధిత వాటిపై క్విజ్ పోటీలు నిర్వహించాలి. ● 17న సమీకృత విద్య, బాలికా విద్యాదినోత్సవం నిర్వహణ, బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు ప్రతిజ్ఞ చేయాలి. ● 18న తల్లిదండ్రులు, పోషకులు, వార్డు సభ్యులను ఆహ్వానించి తరగతి గదుల్లో చేపట్టిన డిజిటలీకరణ, సౌకర్యాలు చూపించడం, మొక్కల పెంపకం ప్రాధాన్యతను పిల్లలకు వివరించాలి. ● 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించాలి. -
సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదుల నమోదు : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: ఎవరైనా తమ విలువైన సెల్ఫోన్లను పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి దరఖాస్తును సంబంధిత పోలీస్స్టేషన్లలో అందజేయాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు పోగొట్టుకున్న ఫోన్లు అందజేసి మాట్లాడారు. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఐటీసెల్ విభాగంలోని నిష్ణాతులైన పోలీసు సిబ్బందితో గుర్తించి రికవరీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు రూ.18 లక్షల విలువైన 100 ఫోన్లను గుర్తించి అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐటీకోర్ సిబ్బంది విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా?
వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే అమాయక రైతులపై కేసులు పెట్టడం తగదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇథనాల్ కంపెనీ ఘటనలో అరెస్టు చేసిన రైతులను మానవపాడు పోలీస్స్టేషన్కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ వద్దని చెబితే రైతులను తీసుకొచ్చి అక్రమంగా కేసులు నమోదు చేస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెద్ద ధన్వాడలో జరిగిన ఘటనలో రైతులకు దెబ్బలు తగిలాయని చెప్పారు. రైతులకు తగిలిన దెబ్బలను పోలీసులకు చూపుతూ...వారి నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారిందని, అందుకే రైతులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. మండలంలో 45 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 12 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా దానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
సమయం: శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కోడేరు: భూ సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం మండలంలోని తీగలపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని, దరఖాస్తు ఫారాలను ఒకరోజు ముందుగానే గ్రామంలో పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న గ్రామంలో ఒకరోజు ముందుగానే ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు టాంటాం వేయించాలన్నారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించాలని.. నోటీసులు ఇవ్వాల్సి ఉంటే వెంటనే జారీ చేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయ్కుమార్, జూనియర్ అసిస్టెంట్ సురేందర్, మహేష్ తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రం తనిఖీ.. మండలంలోని పస్పులలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజు ఎంత ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలని ఏపీఎం పార్వతమ్మను ఆదేశించారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చివరి దశలో ఉందని.. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరిస్తామని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని.. రైతులు అధైర్యపడొద్దని సూచించారు. ధాన్యం కొనుగోలులో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. దశల వారీగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని లబ్ధిదారులకు తెలిపారు. -
6 నుంచి ‘బడిబాట’
కందనూలు: ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి రమేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలు పాఠశాలలో ఉండేలా చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు వివరించడం, మన బడిలో గ్రామస్తులను భాగస్వాములను చేస్తామని సూచించారు. నాణ్యమైన విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ప్రోత్సహిస్తూ రోజుకో కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి పెద్దకొత్తపల్లి: గ్రామాల్లోని భూ సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. బుధవారం మండలంలోని ఆదిరాలలో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన తనిఖీ చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి భూ సమస్యలను రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు నాగర్కర్నూల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
మందుల కొరత లేకుండా చూడాలి
నాగర్కర్నూల్ క్రైం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా ఫార్మసీ అధికారులు చూసుకోవాలని, అవసరమైన మందుల కోసం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టాలని జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని ఫార్మసీ అధికారులకు 2 డోస్ రోటాసీల్ వ్యాక్సిన్ నిర్వహణ, కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో నీళ్ల విరేచనాల నియంత్రణకు రోటసిల్ వ్యాక్సిన్ నోటి ద్వారా ఎంత మోతాదులో ఇవ్వాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి కావాల్సిన మందులు అంచనా వేసి సెంట్రల్ మెడిసిన్ స్టోర్కు.. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులైన నిరోధ్, నోటి మాత్రలు, కాపర్–టీ, ఇంజక్షన్ తదితర మందులకు కుటుంబ నియంత్రణ పోర్టల్లో ఆన్లైన్లో ఇండెంట్ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. ఎం.వెంకటదాస్, జిల్లా టీకీకరణ అధికారి డా. రవికుమార్, జిల్లా మాతా సంరక్షణ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఫార్మసీ అధికారులకు గుర్తించడం సంతోషం.. ఫార్మసిస్ట్లను ఫార్మసీ అధికారులుగా గుర్తిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం సంతోషమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఫార్మసీ అధికారులదని జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీని ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ డీఎంహెచ్ఓకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ అధికారుల కొరత ఉన్నా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ అధికారుల సంఘం అధ్యక్షుడు బత్తిని సుదర్శన్, సభ్యులు శరత్బాబు, యాదయ్య, అశోక్, జిల్లా అధ్యక్షుడు ఎం.సురేష్ పాల్గొన్నారు. -
‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలి: సీపీఎం
కల్వకుర్తి రూరల్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు భరోసా నిధులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సాగర్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా వేసిందని.. అందులో చాలామందికి రాలేదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అప్పుడప్పుడు విలేకరులతో మాట్లాడుతూ.. తేదీలు ప్రకటిస్తున్నారనే తప్ప నిధులు మాత్రం జమ చేయడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైందని.. రైతు భరోసా నిధులు వేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కావడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిధులు లేవని.. ఏమీ చేయలేకపోతున్నామని చెప్పడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలవదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు ఆంజనేయులు, శ్రీనివాస్, దేశ్యానాయక్, పరశురాములు, బాలస్వామి, కాశన్న, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో ఇథనాల్ చిచ్చు
ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన రాజోళి/మానవపాడు: ‘12 గ్రామాలకు ఇబ్బందిగా మారిన ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు.. పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీ చిచ్చు పెట్టొద్దు.. ఈ విషయం ఎన్నో సార్లు ఫ్యాక్టరీ వారికి చెప్పాం.. శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టాం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు విన్నవించాం.. అయినా మా మాట లెక్కచేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు’ అంటూ సహనం కోల్పోయిన స్థానికులు సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. సామగ్రితో వచ్చిన కంటైనర్తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లకు నిప్పు పెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి శాంతియుతంగా కొనసాగుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక నిరసన కాస్తా.. బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గతేడాది అక్టోబర్ నుంచి రిలే దీక్షలు.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో 27.5 ఎకరాల భూమిని గాయిత్రి ఇథనాల్ ప్యూయల్స్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారనే విషయం అప్పటి వరకు ఎవరికీ తెలియదు. గతేడాది అక్టోబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గ్రామస్తులు కొన్ని రోజుల తర్వాత, ఇతర గ్రామాలతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాట్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఇబ్బంది కలుగుతుందని చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజలతో కలిసి తమ కార్యాచరణను ప్రకటించారు. అందులో భా గంగా నిరసనలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు విన తులు అందజేశారు. అనంతరం ఈ ఏడాది జనవరి 23న రిలే నిరాహార దీక్షను ప్రారంభించి ఫిబ్రవరి 11న విరమించారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫ్యాక్టరీ విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని మాట ఇచ్చి తమతో దీక్ష విరమింపచేశారని.. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇంతదాకా వచ్చిందని వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పేర్కొన్నారు. పరిశ్రమకు సంబంధించి కంటైనర్,టెంట్లు, షెడ్లకు నిప్పు..వాహనాలు ధ్వంసం పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దంటూ ఆగ్రహం రాజోళి మండలం పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత -
గ్రామస్తులకు గాయాలయ్యాయి
పనులు చేపట్టవద్దని అడగడానికి వెళితే వారు చెప్పిన సమాధానాలు, మాట్లాడిన తీరు వల్ల ఇంతటి పరిస్థితికి దారి తీసింది. ప్రైవేట్ వ్యక్తులు దాడులు చేశారు. అందులో గ్రామస్తులకు గాయాలయ్యాయి. పచ్చని పంటలను దెబ్బతీసే ఫ్యాక్టరీ వద్దని చెబుతుంటే, వారు మాపై దాడులు చేస్తే భవిష్యత్తులో మా పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. – శ్యాం ప్రసాద్, పెద్ద ధన్వాడ పికెటింగ్ ఏర్పాటు చేశాం ఫ్యాక్టరీకి సంబందించిన వారు అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా పెద్దధన్వాడలో పనులు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుకుంది. మళ్లీ గ్రామంలో అలజడి రేగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
సమస్యలు తీరేనా...?
మున్సిపాలిటీలలో గత ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని అప్పటి ప్రభుత్వ పెద్దలు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పినా అది మాత్రం కార్యాచరణలో కనపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం అదేరీతిలో వందరోజుల ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని రూపొందించినా అది అలా కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్డులలో దీర్ఘకాలికంగా సమస్యలు వేధిస్తున్నా గెలిపించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాటి పేరుతో పబ్బం గడిపారని విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా పట్టణ ప్రణాళికలో భాగంగా వార్డులలో చేపట్టే పనులను పూర్తి శ్రద్ధతో చేసి, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బందిని సమాయత్తం చేశాం పట్టణ ప్రణాళికలో భాగంగా వందరోజుల యాక్షన్ ప్లాన్కు తగ్గట్టుగా మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని సమాయత్తం చేశాం. యాక్షన్ ప్లాన్లో సూచించిన విధంగా ఒక్కో పనిని ఆయా వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది చేపట్టి, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే నోట్ చేసుకుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం, వాటి అమలుపై రోజువారీ రిపోర్టులను సైతం తయారు చేస్తాం. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి ● -
ప్రజా ప్రభుత్వంలో ఎన్నో మార్పులు
అచ్చంపేట రూరల్: ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనలో భాగంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూ భారతి అమలు చేస్తోందని, అలాగే ప్రజా ప్రభుత్వంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం మండలంలోని పులిజాలలో నిర్వహించిన భూ భారతి సదస్సును ఆయన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. భూ రతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకే ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఏడాదిలోపు భూ ప్రక్షాళన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు సర్వేయర్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. లక్షలాది సంఖ్యలో ఉన్న ధరణి సమస్యలతోపాటు ఇతర భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం భూ భారతిపై అవగాహన కల్పించడంతోపాటు పైసా ఖర్చు లేకుండా భూ సమస్యల తక్షణ పరిష్కారానికి సదస్సు వేదిక కానున్నాయన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చోటుచేసుకున్న తప్పులను సరిచేసి, భూ పరిపాలనను సదస్సుల ద్వారా ప్రజల వద్దకే తీసుకెళ్తున్నామన్నారు. భూ భారతి చట్టంతో 18 రకాలైన భూమి మ్యుటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎన్నికై అచ్చంపేటకు తొలిసారి వచ్చిన మల్లురవికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ పీవీ గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లాలో ఎంపిక చేసిన పైలెట్ ప్రాజెక్టు గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని 20 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రామ కమిటీలు గుర్తించిన వారితోపాటు ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇళ్లు మంజూరు చేయాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో యువ వికాసం ద్వారా సెంట్రింగ్, ఇటుకల తయారీ యూనిట్ల స్థాపనకు కృషి చేయాలని, తద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు యూనిట్లు నెలకొల్పే యువకులకు మంచి లాభదాయకంగా ఉంటుందన్నారు. గ్రామాల్లో ఎవరూ పూరి గుడిసెల్లో నివాసం ఉండకూడదనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఈ నెల 9లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం లబ్ధిదారులకు ఈ నెల 6 వరకు మంజూరు పత్రాలు అందజేయాలన్నారు. అంతకు ముందు వారు నాగర్కర్నూల్ మండలంలోని గగ్గలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి రూ.5 లక్షలతోనే మంచి ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, హౌసింగ్ పీడీ సంగప్ప, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులనువినియోగించుకోండి భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నాగర్కర్నూల్ మండలంలోని వెంకటాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14లోపు భూ భారతిలో వచ్చిన అన్ని అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ గ్రామాల్లో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. -
పట్టణ ప్రణాళిక ఖరారు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో మౌళిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారం, దీర్ఘకాలికంగా నెలకొన్న ప్రజా అవసరాలను తీర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నుంచి వందరోజులపాటు ఒక్కో కార్యక్రమం చేపట్టేలా తీర్మానించింది. ఇందులో ప్రజా అవసరాలు, వారి సమస్యల దృష్ట్యా ఒక్కో సమస్యను తీర్చేందుకు వాటి సామర్థ్యాన్ని బట్టి కొన్ని రోజులు అదే పనికి ప్లాన్లో రోజులను కేటాయించారు. ఇలా వందరోజుల యాక్షన్ ప్లాన్కు అనుగుణంగా ఇప్పటికే జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో వార్డు అధికారులకు బాధ్యతలు కేటాయించి, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను నోట్ చేసుకునేలా పురమాయించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో తీర్చేలా బడ్జెట్ కేటాయించి పనలు పూర్తిచేసేలా చూడనున్నారు. రోజుల వారీగా పనులు ప్రభుత్వం చేపట్టిన వందరోజుల ప్రణాళికలో 60 రోజులు, 30 రోజులు, వారం రోజులు ఇలా పనిని బట్టి రోజులను అధికారులు నిర్దేశించారు. ఇందులో వందరోజులలో ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీలో పరిశుభ్రత, వ్యర్థాలను వేరు చేయడంపై స్థానిక వార్డులలో ప్రచారం నిర్వహించాలి. సాలిడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించేలా చేయాలి. వ్యర్థాల విభజన, పరిశుభ్రత, ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరిశుభ్రత, వ్యర్థాల విభజనపై ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలి. కంపోస్టును ఉత్పత్తి చేయడానికి సేంద్రియ వ్యర్థాలను కంపోస్టు చేసేలా ప్రోత్సహించాలి. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వ్యర్థాల విభజన, ప్రజారోగ్యం గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయాలి. నూతన ఎస్హెచ్జీలను ఏర్పాటు చేయడం, అర్హత కలిగిన వారికి బ్యాంకు లింకేజీ స్కీంలను ఎస్హెచ్జీలకు అందించాలి. మున్సిపాలిటీలలో ఒకే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారికి రుణాలు అందేలా చూడాలి. రానున్న వానాకాలానికి సంబంధించి తాగునీరు కాలుష్యం కాకుండా క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలి. ● ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాలే కాకుండా ఎంపిక చేసిన రోజులలో మున్సిపాలిటీలో చెట్లు నాటడం, వాటిని సంరక్షించేలా జూలై మొదటి మా సంలో వనమహోత్సవం ఏర్పాటు చేయాలి. చిన్నపిల్లలు, యువకులకు పర్యావరణ అవగాహనతోపాటు వారిని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమా లు చేపట్టాలి. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్లో భాగంగా అన్ని వార్డులలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆర్డబ్ల్యూహెచ్ వ్యవస్థను పటిష్టపరచాలి. ఏబీసీ సెంటర్ల నిర్వహణతోపాటు వీధి కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలి. మున్సిపాలిటీల్లోని నాలాలలో చెత్త పడకుండా మెష్ను ఏర్పాటు చేయాలి. మున్సిపాలిటీలలో వందరోజులకార్యాచరణ చేపట్టనున్న అధికారులు ప్రజా సమస్యలు, వానాకాలం యాక్షన్ ప్లాన్ కలిపి అమలు ఇకనైనా పట్టణాల్లో సమస్యలు తీరేనా..? -
సీఎంఆర్ అప్పగిస్తే ధాన్యం కేటాయింపు
వనపర్తి: డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఉన్న సీఎంఆర్ అప్పగించి నిజాయతీగా ముందుకొస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ధాన్యం కేటాయింపులు చేపడతామని పౌరసరఫరాలశాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పౌరసరఫరాలశాఖ అఽధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యం మిల్లులకు అప్పగిస్తే పద్ధతి ప్రకారం నిల్వ చేయకుండా బయట గుట్టలుగా పడేసి తడిసిపోయిందని, సీఎంఆర్ ఇవ్వమని చెప్పడం క్షమార్హం కాదని, ప్రభుత్వం కేటాయించిన ధాన్యం తీసుకోకుండా ప్రైవేట్గా వడ్లు తీసుకొని మిల్లింగ్ చేసే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రెండు జిల్లాల్లో సగానికిపైగా మిల్లర్లు డిఫాల్ట్ జాబితాలో ఉండటం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్యలు ఇక్కడే ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని ప్రశ్నించారు. తాత్కాలికంగా గోదాముల్లో ధాన్యం నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం మిల్లుకు రాకపోవడంతో క్వింటాకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలే వస్తున్నాయని, తద్వారా మిల్లర్లు నష్టపోతున్నారని వివరించారు. ఎఫ్ఏక్యూ ప్రకారం ధాన్యం రావడం లేదని చెప్పడం సరికాదని, తేమ శాతం వచ్చాకే తూకం చేసి మిల్లులకు పంపిస్తున్నామన్నారు. వరి కోత యంత్రాలు 18 నుంచి 20 ఆర్పీఎం, గేర్ స్నాట్ బి–1లో ఉంచడం, బ్లోయర్ ఆన్లో పెట్టుకొని పంట కోతలు చేపట్టేలా చూడాలని, నిబంధనలు పాటించని యజమానులపై కేసులు నమోదు చేయాలని పోలీస్శాఖను ఆదేశించారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. పదేళ్లలో ఏ యాసంగిలో రానంత దిగుబడి ఈసారి జిల్లాలో పండిందని తెలిపారు. ఇప్పటి వరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.571 కోట్లు 39,145 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మరో 20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో 184 మిల్లులు ఉండగా.. డిఫాల్ట్ మిల్లులుపోను కేవలం 77 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించినట్లు వివరించారు. సమావేశంలో నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి డీఎస్ఓ కాశీవిశ్వనాథ్, డీఎంలు, ఆయా ప్రాంతాల కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రైవేట్ వడ్లు మిల్లింగ్ చేస్తే చర్యలు పౌర సరఫరాలశాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ -
వన్ టైం పరీక్ష రాసే అవకాశం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు వన్టైం పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సరాల కోర్సు, అదనంగా రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ కలిగి ఉండాలని, బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని, ఈ నెల 16వ తేదీ లోగా ఎలాంటి జరిమానా లేకుండా దరఖాస్తులు చేసుకోవాలని, 20వ తేదీ వరకు జరిమానాతో ఫీజుచెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి
మన్ననూర్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అన్నారు. అమ్రాబాద్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న తుర్కపల్లి గ్రామంలో చేపట్టిన ఇంటి నిర్మాణాలను సోమవా రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి మాత్రమే బిల్లు లు వస్తాయన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షిస్తూ.. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమో దు చేయాలని అధికారులకు సూచించారు. అర్హులై న పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ఏడాది ఇల్లు మంజూరు కాని పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన వెంట మండల అధికారులు తదితరులు ఉన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ నెలలోనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కార్యాలయాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రెండో దశలో నారాయణపేట, కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ సేవలు పరిశీలించి కొనుగోలుదారులకు దస్తావేజులు అందజేశారు. అవగాహన లేకపోవడంతో.. సోమవారం స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని కార్యాలయాల్లో సాఫీగానే సాగగా.. మరికొన్ని కార్యాలయాల్లో ప్రజలకు స్లాట్ బుకింగ్పై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అలంపూర్లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు. ఆత్మకూర్లో కేవలం 1 దస్తావేజు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది. గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 44 స్లాట్ బుకింగ్ చేసుకోగా 35 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా.. మిగతా 9 దస్తావేజుల అమ్మకపు, కొనుగోలుదారులు కార్యాలయానికే రాలేదు. సోమవారం స్లాట్ బుకింగ్ ప్రారంభమైన కార్యాలయాల్లో జడ్చర్లలో 40, వనపర్తిలో 45, గద్వాలలో 35, మక్తల్లో 7, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 7, ఆత్మకూరులో ఒక స్లాట్ బుక్ అయ్యాయి. మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు పారదర్శకంగా, మరింత వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాలకు అదనంగా సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, గద్వాల కార్యాలయాలకు ఒక్కొక్కరు చొప్పున సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం జడ్చర్లలో నూతన సబ్ రిజిస్ట్రార్ భానుప్రసాద్ బాధ్యతలు సైతం స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలోని 12 చోట్ల పూర్తిస్థాయిలో అమలు తొలిరోజు 140 స్లాట్స్ బుకింగ్ జిల్లాకు ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల కేటాయింపు -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
కందనూలు: సికింద్రాబాద్లోని జింఖాన మైదానంలో ఆదివారం నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటారు. అండర్–12 విభాగం 600 మీటర్ల పరుగు పందెంలో అభినవ్రెడ్డి, కిడ్స్ జాలిన్ త్రోలో శ్రీచైతన్య కిరణ్య సిల్వర్ మెడల్, 300 మీటర్ల పరుగు పందెంలో శివరామకృష్ణ గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సోలపోగుల స్వాములు సోమవారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం మన్ననూర్: అమ్రాబాద్ మండలం ఎల్మపల్లిలోని గిరిజన బాలికల సంక్షేమ మినీ గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఖాళీ సీట్ల భర్తీ కోసం అర్హులైన గిరిజన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జె.లింగమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30 సీట్లు, 2వ తరగతిలో 6 సీట్లు, 3వ తరగతిలో 1 సీటు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల గిరిజన బాలికలు ఈ నెల 6వ తేదీలోగా దరకాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు దరఖాస్తు పారంతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు జత చేయాలన్నారు. మరింత సమాచారం కోసం 77320 82256 నంబర్ను సంప్రదించాలని సూచించారు. పీయూలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ల నియామకం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్లను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం నియమించారు. ఈ మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మసీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఈశ్వర్కుమార్, రవీందర్రెడ్డిలను నియమిస్తూ.. ఉత్తర్వులను వారికి అందజేశారు. పోలీస్శాఖ పాత్ర కీలకం మహబూబ్నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ ఎంతో కీలకమని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జోగుళాంబ జోన్– 7 డీఐజీ కార్యాలయం ఎదుట డీఐజీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది కట్టుబడి పనిచేయాలన్నారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. పోలీసులు క్రమశిక్షణతో సేవలు అందిస్తూ ప్రజల అభి మానం గెలుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి పాల్గొన్నారు. -
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం
అచ్చంపేట రూరల్: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు సమస్యలకు నిలయంగా మారిందని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ అన్నారు. ఆదివారం అచ్చంపేటలోని టీఎన్జీఓ భవనంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమబోర్డులో సెస్ సక్రమంగా జమ కాకపోవడంతో కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదన్నారు. బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని, మెడికల్ చెకప్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. సంక్షేమబోర్డును ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని.. రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పెర్ముల గోపాల్, మల్లేష్, కృష్ణ, చంద్రం, శివరాజు, రాములు, తిరుపతయ్య, సైదమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వేడుకలకు సర్వం సిద్ధం
నాగర్కర్నూల్ క్రైం: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదివారం ముందస్తుగా కలెక్టరేట్తో పాటు రద్దీ ప్రాంతాల్లో పోలీసులు బాంబ్స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేదికకు ఎడమ వైపున వీఐపీ గ్యాలరీ, కుడివైపున ప్రజల గ్యాలరీ ఏర్పాటు చేశారు. కార్యక్రమాలు ఇలా.. ● పోలీస్ పరేడ్ మైదానానికి 9.40 గంటలకు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, 9.45కు కలెక్టర్ బదావత్ సంతోష్ చేరుకుంటారు. ● 9.50కి ముఖ్యఅతిథి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి చేరుకుని 9.52కు అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. ● 10 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 10.05కి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ● 10.15 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ, సంక్షేమ పథకాలపై ముఖ్యఅతిథి ప్రసంగిస్తారు. ● 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.30కి వందన సమర్పణతో వేడుకల ముగింపు ఉంటుంది. ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి -
నేటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–19 క్రికెట్
లీగ్ మ్యాచ్ల వివరాలు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో అండర్– 19 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి రౌండ్కు సంబంధించి సోమవారం మహబూబ్నగర్– వనపర్తి జట్లు (వేదిక– మహబూబ్నగర్), జడ్చర్ల– గద్వాల జట్లు (జడ్చర్ల), నారాయణపేట– నాగర్కర్నూల్ (నారాయణపేట) జరుగుతాయి. ● రెండో రౌండ్ మంగళవారం నాగర్కర్నూల్– మహబూబ్నగర్ జట్లు (మహబూబ్నగర్), గద్వాల– వనపర్తి (వనపర్తి), జడ్చర్ల– నారాయణపేట (జడ్చర్ల) మ్యాచ్లు ఉంటాయి. ● మూడో రౌండ్ బుధవారం మహబూబ్నగర్– గద్వాల (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– జడ్చర్ల (జడ్చర్ల), వనపర్తి– నారాయణపేట (వనపర్తి) కొనసాగుతాయి. ● నాలుగో రౌండ్ గురువారం మహబూబ్నగర్– నారాయణపేట (మహబూబ్నగర్), జడ్చర్ల– వనపర్తి (జడ్చర్ల), గద్వాల– నాగర్కర్నూల్ (గద్వాల) ఉంటాయి. ● ఐదో రౌండ్ శుక్రవారం జడ్చర్ల– మహబూబ్నగర్ (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– వనపర్తి (నాగర్కర్నూల్), గద్వాల– నారాయణపేట (గద్వాల)లో నిర్వహిస్తారు. మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో ఎండీసీఏ ఆధ్వర్యంలో మరోసారి ఇంట్రా డిస్ట్రిక్ర్ట్ టోర్నమెంట్ జరగనుంది. గత నెల 19 నుంచి 31 వరకు అండర్– 23 ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ను నిర్వహించగా మహబూబ్నగర్ జట్టు చాంపియన్షిప్గా నిలిచింది. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇప్పుడు అండర్– 19 క్రికెట్ లీగ్ను నిర్వహించనున్నారు. 2 నుంచి 6 వరకు.. ఔత్సాహిక గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ పురుషుల అండర్–19 క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లీగ్లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్లుగా విభజించారు. పూల్–ఏలో జడ్చర్ల, వనపర్తి, నాగర్కర్నూల్ జట్లు, పూల్–బీలో మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జట్లు ఉన్నాయి. ఐదు రౌండ్లలో 15 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్గా నిలుస్తుంది. ఆరు జట్లు.. 15 లీగ్ మ్యాచ్లు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో మ్యాచ్ల నిర్వహణ అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత -
ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీలు అమలు చేస్తాం
వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని పుల్గర్చర్లలో రూ.2.94 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్స్టేషన్, కల్వరాలకు నూతనంగా ఏర్పాటు చేయనున్న మిషన్ భగీరథ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు రైతులు, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు రాజీవ్ యువ వికాసం, సన్నరకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ తదితర సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖరం, పంచాయతీరాజ్శాఖ ఈఈ మల్లయ్య, నాగర్కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నర్సింహ, నాయకులు రఘునాథ్రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్, నారాయణరెడ్డి, బిచ్చయ్యసాగర్, సుదర్శన్రెడ్డి, నరేష్, బాల్రెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఉపాధ్యాయుల సర్దుబాటు సరికాదు
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.గోవర్ధన్, రామస్వామి డిమాండ్ చేశారు. పేద వర్గాల బిడ్డలకు నైపుణ్య విద్యను అందించాలనే తపన ఉంటే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి కాకుండా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, తరగతికి ఒక గది నిర్మించాలని సూచించారు. మే నెలలో ప్రతి శుక్రవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని సూచిస్తూ ప్రాథమిక స్థాయిలో 10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, 10 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని చెప్పడం అశాసీ్త్రయమైన, అసంబద్ధమైన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇది పేద ప్రజలకు నైపుణ్య విద్యను అందకుండా చేయడంలో భాగమేనని, తద్వారా విద్యారంగాన్ని ప్రైవేట్ శక్తులకు అప్పగించడం జరుగుతుందన్నారు. మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వానాకాలం సాగు సమయం, పాఠశాలలు పునః ప్రారంభం కానుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ వారం 12 వేల మందికిపైగా భక్తులు ఆలయానికి వచ్చారని.. హుండీ, టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.1.85 లక్షల ఆదా యం సమకూరిందని ఆలయ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వనపర్తి, నాగర్కర్నూల్, కొ ల్లాపూర్ డిపోల నుంచి బస్సులు నడిపించారు. ఉత్సాహంగా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్, జాకీర్ మాట్లాడుతూ.. బుధ, గురువారం ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్బాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీలో ఆయా జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్ హాజరవుతారని తెలిపారు. -
మళ్లీ ఆత్మా కమిటీలు
కార్యవర్గంలో రైతుల, అధికారులకు చోటు నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. గతంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆత్మా (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) కమిటీల ఏర్పాటును మరోమారు తెరపైకి తెచ్చింది. గతంలో ఈ కమిటీలున్నా ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఈసారి కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక సాగుపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. త్వరలో పూర్తిస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు. గతంలో ఇలా.. వ్యవసాయరంగంలో యంత్ర పరికరాల వినియోగం పెంచేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వ్యవసాయ డివిజన్ను బ్లాక్గా పరిగణించి రైతులు, అధికారులతో సలహా కమిటీని ఏర్పాటు చేశారు. యువజన సంఘాలు, మహిళా మండలి సభ్యులు, ఎరువుల దుకాణాల డీలర్లు తదితరుల భాగస్వామ్యంతో 20 నుంచి 24 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటైంది. ఇందులో ఏడీఏ కన్వీనర్గా మిగతా వారు సభ్యులుగా వ్యవహరించారు. డివిజన్ కమిటీల నుంచి ఇద్దరు, ముగ్గురిని తీసుకొని జిల్లా రైతు సలహా కమిటీని ఏర్పాటు చేశారు. రైతులకు ఆధునిక సాగు సలహాలు అందించేందుకు అవసరమయ్యే శిక్షణలు, క్షేత్రస్థాయి పర్యటనలు, విజ్ఞాన యాత్రలు నిర్వహించాల్సి ఉంది. ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపినా.. నిధులు మాత్రం అరకొరగానే మంజూరయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. 28 మంది సభ్యులతో కార్యవర్గం.. మొదట నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసి తరువాత జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. నియోజకవర్గ, జిల్లా కమిటీల్లో 28 మందికి అవకాశం ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు ప్రాధాన్యం కల్పిస్తారు. కార్యవర్గంలో వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, సెరీకల్చర్, విత్తన డీలర్లు, యువజన సంఘాల నుంచి ఒకరు, శాస్త్రవేత్తలకు చోటు కల్పించనున్నారు. కార్యవర్గాల ఏర్పాటుకుగాను ఇప్పటికే వ్యవసాయ అధికారులు ప్రక్రియ ప్రారంభించగా.. త్వరలోనే పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. జిల్లా, నియోజకవర్గస్థాయిలో ఏర్పాటుకు సన్నాహాలు ఒక్కో కమిటీలో 28 మందికి అవకాశం త్వరగా పూర్తిచేసేలా వ్యవసాయశాఖ కసరత్తు త్వరలో ఏర్పాటు చేస్తాం.. ఆత్మా కమిటీల ఏర్పాటు విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. 28 మంది సభ్యులతో మొదట నియోజకవర్గ కమిటీ, తర్వాత జిల్లా కమిటీని ఏర్పాటుచేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాం. ఈ కమిటీలు రైతులకు సాగులో మెళకువలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై సలహాలు సూచనలు ఇస్తారు. – చంద్రశేఖర్, డీఏఓ, నాగర్కర్నూల్ -
ధాన్యం తరలింపులో జాప్యం సరికాదు
పెద్దకొత్తపల్లి: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం మండలంలోని కల్వకోలులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఏమైనా సమస్యలున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని.. తేమ శాతం 17 వరకు ఉన్న ధాన్యం వెంటనే తూకం చేసి లారీల్లో తరలించాలని, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తూకం చేసే వరకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. ఆయనవెంట జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింహారావు, రాజేందర్, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏపీఎం అరుణ తదితరులు ఉన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని.. అన్నదాతలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా టార్పాలిన్లు సమకూర్చడం, ధాన్యం తూకం చేసిన వెంటనే మిల్లులకు తరలించేలా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు అవసరమైన సూచనలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 21,329 మంది రైతుల నుంచి 1,23,375 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అందులో 63,427 మె.ట. దొడ్డు రకం, 59,948 మె.ట. సన్నరకం ఉందని వివరించారు. ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు.. రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలను సోమవారం జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముఖ్యఅతిథి ప్రసంగించనున్నట్లు తెలిపారు. వేడుకల నిర్వహణ బాధ్యతలను వివిధ శాఖల అధికారులకు అప్పగించామని.. జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు.. డీపీఆర్వో సౌండ్సిస్టం, ఇతర సౌకర్యాలు, జిల్లా వైద్యాధికారి వైద్య సదుపాయాలు కల్పిస్తారని, అగ్నిమాపక, ఇతర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సరిపడా లారీలు అందుబాటులో ఉంచాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
1975లోనే పాలకేంద్రం
గద్వాల ప్రాంతంలో 1975లో ప్రభుత్వం పాలకేంద్రం స్థాపించింది. చాలా ఏళ్లపాటు రైతులు ఇక్కడ పాలు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పాల కేంద్రం మూతబడింది. కాగా 2020 ప్రాంతంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రం పునఃప్రారంభమైంది. దీనిద్వారా జిల్లావ్యాప్తంగా 25 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతిరోజు 2,500 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ పరంగా మరో పది దాక పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. -
పాలమూరు
సార్థకనామం.. నేడు ప్రపంచ పాల దినోత్సవం పాడి రైతులపై ఆర్థిక భారం ఒకప్పుడు రాష్ట్రానికి రోజువారీగా అవసరమైన పాలు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్పత్తి అయ్యేవి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం పాడి పరిశ్రమ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే పాడి రైతులు పశుపోషణ భారమై తమ ఆవులు, గేదెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా విజయ డెయిరీ ద్వారా ఇస్తున్న దాణా, మినరల్ మిక్చర్, క్యాల్షియం మందులు సబ్సిడీలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కాల్షియం మందులు, విజయ దాణా కొనుగోలు చేయాలంటే సబ్సిడీ కాకుండా పూర్తి ధర చెల్లించాల్సి వస్తుందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ పరంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి రైతులకు భరోసా కల్పించడం లేదు. ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ, పాడి రైతులకు డీబీటీ సదుపాయంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు సెంటర్లలో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
పొగాకు ఉత్పత్తులను వినియోగించొద్దు
నాగర్కర్నూల్ క్రైం: పొగాకు ఉత్పత్తుల వినియోగించి అనారోగ్యం బారినపడ కూడదని జిల్లా వైద్యాధికారి డా. స్వరాజ్యలక్ష్మి సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అందరితో పొగాకు ఉత్పత్తులు వినియోగించమని, స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు అవగాహన కలిగిస్తామని, పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీ, తంబాకు, జర్దా తదితర ఉత్పత్తులను వినియోగించడంతో శరీరంలో రక్తనాళాలు, మెదడు, గుండె, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదని, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని, పాఠశాలల పరిధిలో 100 మీటర్ల వరకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నిషేధమని తెలిపారు. పొగాకుకు బానిసలైనవారు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సైకియాట్రిస్ట్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్సీడీ కార్యక్రమ అధికారి డా. కృష్ణ్ణమోహన్, టీకా అధికారి డా. రవికుమార్, పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరో గ్య కేంద్రం వైద్యాధికారి డా. వాణి పాల్గొన్నారు. క్యాన్సర్కు దారి తీస్తుంది.. పొగాకు వినియోగిస్తే క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి, న్యాయమూర్తి వెంకట్రామ్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కోర్టు సిబ్బందితో పొగాకు ఉత్పత్తులు వినియోగించమని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. సిగరేట్లు, బీడీలు ఇతర ఉత్పత్తులు వినియోగంతో ఊపిరితిత్తులు, నోరు, అన్నవాహిక, గర్భాశయం క్యాన్సర్లకు దారి తీస్తుందన్నారు. పొగాకు వినియోగంతో ఏటా కోటి మందికి పైగా మరణిస్తున్నారని తెలిపారు. పొగాకు ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తోందన్నారు. రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీనిధి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి..
విత్తన కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులపై ప్రభావం పడుతుంది. ధరల పెంపుపై ప్రభుత్వం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేలా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి. – వాసుదేవుడు, రైతు, రామాజిపల్లి, బల్మూర్ మండలం వందశాతం చెల్లించాలి.. ప్రస్తుతం వరి విత్తనాలపై సబ్సిడీ లేదు. రైతులు వందశాతం చెల్లించి తీసుకోవాలి. ప్రభుత్వం సన్నరకం వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుంది. జీలుగ విత్తనాలకు మాత్రం 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఇవి ప్రతి మండలంలో అందుబాటులో ఉన్నాయి. అవసరమైన రైతులు వ్యవసాయాధికారుల ద్వారా పొందవచ్చు. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ● -
గర్భిణులలో రక్తహీనతను అరికట్టాలి
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని ప్రతి గర్భిణికి కచ్చితంగా వైద్యాధికారి సూచన మేరకు 12 వారాల తర్వాత ప్రసవ ప్రణాళిక తయారు చేసి అమలుపరచాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశ, నోడల్ పర్సన్లతో సమీఞా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణులలో రక్తహీనతను అరికట్టడంలో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలని సూచించారు. గర్భిణులు ప్రతిరోజు ఐరన్, ఫోలిక్, క్యాల్షియం మాత్రలు కచ్చితంగా వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టడం వల్ల ముందస్తు ప్రసవాలు, గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననాలను అరికట్టవచ్చన్నారు. హైరిస్క్ గర్భిణులు సురక్షిత మాతృత్వం పొందే వరకు వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీకాకరణ అధికారి రవికుమార్, ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, డీపీఓ రేనయ్య, డీపీహెచ్ఎన్ఓ మంగమ్మ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ శివకుమార్, ఏపీఓ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలి
నాగర్కర్నూల్ రూరల్: ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని పెట్టాలని, రోజు కూలి రూ.600, ఉపాధి పని దినాలు 200 రోజులు కల్పించాలని, ఉపాధి హామీ చట్టం రక్షణ అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని, కొత్త జాబ్ కార్డులు, కూలీలకు పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు ఆధార్ కార్డు లింక్ చేసి ఆన్లైన్ చెల్లింపులు చేయాలన్నారు. సీనియర్ మేటీలను ప్రత్యేకంగా గుర్తించాలని సంవత్సరం మొత్తం పనులు కల్పించాలని వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించాలని, ప్రమాదం జరిగితే ఉచిత వైద్యంతోపాటు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ధర్నా కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు హాజరై మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు దేశ్యానాయక్, బాల్రెడ్డి, శ్రీనివాస్, శివశంకర్, వరప్రసాద్, మధు, నాగరాజు, బాలస్వామి, సుభాష్, భాస్కర్, కాశన్న, అశోక్, అరుణ, శాంతమ్మ, వెంకటమ్మ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతువేదికలు.. సౌర కేంద్రాలు
భవనాలపై ప్యానల్స్ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం ●● ఒక్కో కేంద్రం వద్ద 5 కిలోవాట్ల సామర్థ్యం.. ● కేంద్రాల నిర్వహణకు విద్యుత్ విక్రయం ● పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లిలో విజయవంతం ● అన్ని వేదికల్లో ఏర్పాటుకుసిద్ధమవుతున్న టీజీ రెడ్కో కోస్గి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు సమకూరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయ సమీకరణకు రైతువేదిక భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసి విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. ఒక్కో వేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర పలకలు అమర్చడంతో విద్యుత్ అవసరాలు పోను ఏడాదికి సుమారు రూ.25 వేల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రూపొందించింది. పైలెట్ గ్రామాల్లో విజయవంతం.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకొని జిల్లాకు రెండు చొప్పున పైలెట్ గ్రామాల రైతువేదికలను ఎంపిక చేసి సౌర విద్యుదుత్పత్తి చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా జానంపేట, నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిని ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో విజయవంతం కావడంతో మిగిలిన రైతువేదికపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెడ్కో అధికారులు సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 467 రైతువేదికలపై సోలార్ ప్యానెల్స్ బిగించి సౌర విద్యుత్ తయారీకి చర్యలు తీసుకుంటోంది. నిర్వహణ భారం.. గత ప్రభుత్వ హయంలో రైతులను సమావేశపర్చి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాల పంపిణీ కోసం 5 వేల ఎకరాలను ఓ క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒకటి చొప్పున రైతువేదిక నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. భవనాల నిర్మాణం పూర్తయినా.. నిర్వహణకు నిధులు మంజూరుగాకపోవడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. సొంతంగా ఆదాయం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతువేదికల లక్ష్యం నీరుగారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. రైతువేదికలపై సోలార్ పలకల ఏర్పాటుతో ఆదాయం సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతువేదికల నిర్వహణకు నిధుల కొరత లేకుండా సక్రమంగా సాగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. ఆదాయ సమీకరణ ఇలా.. రెడ్కో సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఒక్కో రైతువేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ పలకలు బిగిస్తే నెలకు 600 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. సొంత అవసరాలకు 100 యూనిట్లు వినియోగించినా.. మిగిలిన 500 యూనిట్లను విక్రయించి ఆదాయం సమకూర్చుకోవచ్చు. యూనిట్ రూ.4కు అమ్మినా నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేల ఆదాయం వస్తుంది. అయితే సౌర పలకల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో వేదికకు రూ.3 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ పథకం కింద సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు. -
లాభదాయక పంటల వైపు దృష్టిసారించాలి
నాగర్కర్నూల్: రైతులు లాభదాయకమైన పంటల వైపు దృష్టిసారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం నాగర్కర్నూల్, వ్యవసాయ క్లస్టర్ పరిధిలో దేశిఇటిక్యాల గ్రామంలో రైతు రమేష్రెడ్డి తన 5 ఎకరాల పొలంలో కొనసాగుతున్న పత్తి విత్తనాలు నాటుతున్న వ్యవసాయ పనులను కలెక్టర్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల నుంచి పంట దిగుబడి, సాగుకు వినియోగిస్తున్న విత్తనాలు, మందుల కొనుగోలులో సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడి లాభదాయకంగా సాగాలంటే వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని, అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా రైతులకు తమ పంటలను లాభదాయకంగా ఎలా సాగు చేయాలనే వ్యవసాయ మెలకువలను పాటించడంతోపాటు అధికంగా పురుగు మందులు వాడకూడదన్నారు. పత్తితోపాటు లాభదాయక పంటలు, హార్టికల్చర్ పంటలను కూడా సాగు చేయాలని, ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్, ఏడీ పూర్ణచంద్రారెడ్డి, ఏఓ రాజు, రైతులు కృష్ణారెడ్డి, బాల్రెడ్డి, నిరంజన్ తదితరులున్నారు. సమన్వయంతో పనిచేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, డీఎఫ్ఓ రోహిత్ గోపిడితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ఆర్ఓఎఫ్ఆర్, ఆర్ఓఎఫ్ఆర్ కింద భూమి హక్కులు కలిగి ఉన్న గిరిజన రైతుల ఆర్థిక, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన గిరిజనుల రైతులకు ఈ పథకం ఆవశ్యకత గురించి వివరించాలన్నారు. -
మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించాలి
నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ డ్రైవర్లు మోటారు వాహన చట్టాల నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని జిల్లా రవాణా శాఖాధికారి చిన్న బాలు అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభకనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ నియమ, నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని, రోడ్డుపైన బస్సు ఎడమవైపు మాత్రమే ఆపాలన్నారు. మద్యం తాగి ఆర్టీసీ బస్సు నడపకూడదని, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడవద్దని చెప్పారు. రోడ్డుపైన వస్తున్న ప్రయాణికులను గమనించి బస్సు డ్రైవింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ బాలసరస్వతి, మెకానికల్ ఫోర్ మెన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్ణయం మేరకే..
రైతులకు అందుబాటులో ఉంటూ సాగు సలహాలు, సూచనలు, సమీక్షల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు మంజూరుకావడం లేదు. సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – తిరుపతి, ఏఈఓ, గుండుమాల్ క్లస్టర్ అన్ని వేదికలపై ఏర్పాటు.. ఉమ్మడి జిల్లాలో పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లి రైతులవేదికల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 467 రైతువేదికలపై ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని భవనాలు ఒకే నమూనాలో నిర్మించడంతో సౌర పలకల బిగింపు ఒకేసారి చేపట్టేందుకు వీలుంటుంది. సౌర విద్యుత్ తయారీ, విక్రయం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అను గుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – మనోహర్రెడ్డి, మేనేజర్, టీజీ రెడ్కో, ఉమ్మడి పాలమూరు జిల్లా ● -
‘సబ్సిడీ’కి మంగళం
అచ్చంపేట: వరి విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేయడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. అసలే మొగిపురుగు, ఇతర తెగుళ్లతో ఏటా రైతులు నష్టాలను చవిచూస్తుంటే విత్తనాలకు రాయితీ లేకపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర రకాలకు గతంలో సబ్సిడీ వర్తించేది. కానీ, సబ్సిడీ ఎత్తేయడంతో రైతులు అదనంగా రూ.300 వెచ్చించాల్సి వస్తోంది. యాసంగి సీజన్ ముగియడం.. ఈ నెల 25న రోహిణి కార్తి ప్రారంభం కావడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. దీనికితోడు ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించాయి. జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా కాగా.. 1,60,021 ఎకరాల్లో వరి సాగులోకి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. 30 కిలోల బస్తా.. జిల్లాలో 35,020 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. తెలంగాణ వరి రకం 30 కిలోల బస్తా ఇంతకు ముందు రూ.550 ధర ఉండగా ప్రస్తుతం రూ.వెయ్యికి పెరిగింది. తెలంగాణ రకాలకు కిలో రూ.10, ఆంధ్ర రకాలపై కిలోకు రూ.5 చొప్పున సబ్సిడీ ఉండేది. కానీ, ఈసారి ఆ అవకావం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. సన్నరకం (బీపీటీ) 25 కిలోల బస్తాకు గత యాసంగిలో రూ.900, దొడ్డు రకం రూ.వెయ్యి ఉండగా ఇప్పుడు మరింత పెరగనున్నాయి. జిల్లా రైతులు ఎక్కువగా సొసైటీలు, ఆగ్రోస్, డీసీఎంఎస్ల ద్వారా విత్తన బస్తాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో వాటికి డిమాండ్ పెరగనుంది. జిల్లాలో ప్రతి మండలానికి సుమారు 200 క్వింటాళ్లు అవసరంగా ఉండగా 30 నుంచి 50 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా ధర గతేడాది రూ.1,100 ఉండగా ప్రస్తుతం రూ.2,130కు పెంచారు. వీటికి 50 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తున్నారు. ధర రెండింతలు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం జీలుగ విత్తనాల ధర పెంచి సబ్సిడీ ప్రకటించడం వల్ల రైతులపై భారం పడుతోంది. వరి విత్తనాలపై రాయితీ ఎత్తేసిన ప్రభుత్వం గతంలో 30 కిలోల బస్తాకు రూ.550.. ప్రస్తుతం రూ.వెయ్యి జీలుగ విత్తనాలు సైతం అమాంతం పెంపు సన్నాలకు బోనస్ ఇస్తుండటంతో వాటికే డిమాండ్ అన్నదాతలకు తప్పని అదనపు భారం జీలుగ ధర పెంచి.. తెగుళ్లతో పరేషాన్.. మూడేళ్లుగా మొగి పురుగు విజృంభిస్తుండటంతో రైతులు ఖరీదైన రసాయన మందులు పిచికారీ చేసినా పంటను కాపాడుకోలేకపోతున్నారు. ఈ ప్రభావం ముందుస్తు వేసిన వరి నాట్లపై తీవ్రంగా ఉంటుంది. గత యాసంగిలో పంట చేతికి వచ్చ దశలో వేరుకుళ్లు వ్యాప్తి చెందడంతో ఎకరాకు 40 బస్తాల పైనే దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు 35 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వానాకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతుండగా సబ్సిడీ విత్తనాల భారం కుంగదీస్తుంది. -
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఎగువ 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, దిగువ 3 యూనిట్ల నుంచి 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ప్రాజెక్టుకు వరద పెరిగితే 11 యూనిట్ల నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడతామని.. ప్రస్తుతం 17 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. సుంకేసులకు కొనసాగుతున్న వరద.. రాజోళి: మండలంలోని సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం ఎగువ నుంచి వరద నీటి రాక కొనసాగుతోంది. 4,504 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఒక గేటు తెరిచి 4,345 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్కు 159 క్యూసెక్కులను వదులుతున్నట్లు జేఈ మహేంద్ర వివరించారు. ఏడు యూనిట్లలో 276 మెగావాట్లు 17 వేల క్యూసెక్కుల నీటి వినియోగం -
జూరాలకు వరదొచ్చింది
గద్వాల/ధరూరు/ఆత్మకూర్: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు కేవలం 3,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా వరద పెరిగింది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా.. భీమా ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ఈ సీజన్లో తొలిసారి జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12 గేట్లను ఎత్తి 83,616 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. చివరిసారిగా 2007లో మే నెలలోనే జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చిందని, మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఈ నెలలో వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల ప్రాజెక్టు చరిత్రలో మే నెలలో వరద రావడం ఇది ఐదోసారి మాత్రమే. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలశయంలో 8.571 టీఎంసీల నీరు ఉంది. ● జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమై లిఫ్టు–1 గుడ్డెందొడ్డి వద్ద రెండు పంపులను ప్రారంభించి 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి.. గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. జూలై మూడో వారంలో ప్రారంభం కావాల్సిన వరద ముందు రావడంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. గురువారం అర్ధరాత్రి ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఎస్ఈ శ్రీధర్ బృందం ప్రత్యేక పూజలను నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. అనంతరం జన్కో ఉద్యోగులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఎగువలో ఐదు యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో ఆరు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టారు. గతేడాది జూలై 17న రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. 49 రోజుల ముందే ప్రారంభం కావడంతో 610 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళాడుతున్న జూరాల ప్రాజెక్టు ●18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రవాహం 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 12 గేట్లు ఎత్తివేత అర్ధరాత్రి 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం -
భూ సేకరణ వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రాజెక్టుల భూ సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారని, అందుకు అనుగుణంగానే రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత మొదటి ప్రాధాన్యతగా భూసేకరణ పనులు జూన్ 6 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను రెండ్రోజుల్లోనే పూర్తి చేయాలని సర్వే ల్యాండ్ అధికారికి సూచించారు. మార్కండేయ ఎత్తిపోతల పథకం కింద గంగారం, శాయిన్పల్లి గ్రామంలో వెంటనే సర్వే పూర్తి చేయాలన్నారు. కేఎల్ఐలో భాగంగా ప్యాకేజీ–28, 29, 30లో తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, వంగూరు, వెల్దండ, అచ్చంపేట మండలాల్లోని ఆయా గ్రామాల వారీగా చివరి దశలో ఉన్న సేకరించాల్సిన భూముల వివరాలు ప్రస్తుత స్థాయిలను అవసరమైన చర్యలపై సమీక్షించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ, నీటి పారుదల శాఖ అధికారులు సత్యనారాయణరెడ్డి, పార్థసారథి, మురళి, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి నాగేందర్, ఆర్డీఓలు మాధవి, సురేష్, భూ సేకరణ విభాగం కలెక్టరేట్ సూపరింటెండెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, వచ్చే భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఏ గ్రామంలో ఎప్పుడు ఏ సమయానికి ఎక్కడ నిర్వహిస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ముందస్తుగా గ్రామాల వారిగా టాంటాం వేయించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చే దరఖాస్తులు అన్నింటినీ ఆగస్టు 15లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 6 నుంచి బడిబాట కార్యక్రమం జిల్లాలో వచ్చే నెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించి.. బడిబయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో డీఈఓ రమేష్కుమార్, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, సీడీపీలతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, స్వయం సహాయక బృందాలు కలిసి ఇంటింటికీ వెళ్లి విద్య ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచడం, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. -
ఫిట్లెస్ బస్సులు
ఈ నెల 16 నుంచి మొదలైన ప్రైవేట్ బస్సుల సామర్థ్య పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 1,383 బస్సులకు గాను 245 పూర్తి ● కండీషన్లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం ● ఫిట్నెస్ పరీక్షలకు రాకుండానే నడిపిస్తున్న వైనం ● విద్యార్థుల సంరక్షణ బాధ్యత యాజమాన్యాలదే ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024– 25లో దాదాపు వందకు పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొందరు యాజమాన్యాలు మరమ్మతు ఇతర కారణాలతో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. విద్యాసంస్థల బస్సులన్నీ నిబంధనల మేరకు వసతులు కల్పించి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి. బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీపత్రం సమర్పించాలి. కచ్చితంగా ఉండాల్సినవి.. ● ప్రతి స్కూల్ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ● బస్సులో తప్పకుండా యూనిఫాం ధరించిన ఒక అటెండర్ను ఉంచాలి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు, విద్యార్థి ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రదేశాలు నమోదు చేయాలి. ● బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్కి వారు కనిపించేలా మిర్రర్ ఏర్పాటు చేయాలి. ● ముఖ్యంగా బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరం ఉండాలి. ● బస్సులో సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్ ఏర్పాటు చేయాలి. ● బస్సు పాఠశాల కమిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. తయారీ సంవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు. ● ప్రతి బస్సుకు చేతి బ్రేకు, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి. ● బస్సు అద్దాలకు అనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. ● నాణ్యమైన ఇంజిన్, స్టీరింగ్, రూఫ్, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి. ● విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి. కఠినంగా వ్యవహరిస్తేనే.. -
నీరు పారేదెలా..?!
ఆధునికీకరణకు నోచుకోని కేఎల్ఐ కాల్వలు ●ఉన్నతాధికారులకు నివేదించాం.. సాగునీటి కాల్వల్లో జమ్ముగడ్డి, ముళ్లపొదల తొలగింపు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు లేవు. ఈజీఎస్ ద్వారా జమ్ము, ముళ్లపొదలు తొలగించే పనులు చేపట్టాలని గతంలో నిర్ణయించారు. కొన్నిచోట్ల ఆ పనులు జరిగాయి. సిమెంట్ లైనింగ్ నిర్మాణాల గురించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – శ్రీనివాస్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ సొంత డబ్బులు వెచ్చించి.. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి కొల్లాపూర్ మీదుగా రామాపురం వరకు ఉన్న డీ–1 కాల్వలో జమ్ముగడ్డి, ముళ్లచెట్లు పెరిగాయి. ఏటా ఒక ప్రజాప్రతినిధి సొంత డబ్బులతో మొక్కలు తొలగిస్తున్నారు. లేకపోతే రైతులమే స్వయంగా పనులు చేయించుకుంటున్నాం. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాల్వలకు సిమెంట్ లైనింగ్ చేయాలి. – ఆంజనేయులుగౌడ్, రైతు, రామాపురం, కొల్లాపూర్ మండలం ● పేరుకుపోయిన జమ్ముగడ్డి, ముళ్లపొదలు ● సాగునీరు ముందుకు పారకుండా అడ్డంకులు ● వర్షాకాలంలో కోతకు గురవుతున్న వైనం ● సిమెంట్ లైనింగ్ చేయాలని రైతుల వేడుకోలు ఆయకట్టు విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలు కేఎల్ఐ పరిధిలో రిజర్వాయర్లు 3 సాగునీటి కాల్వలు 324 కి.మీ., సింగోటం కాల్వ లైనింగ్ కోసం మంజూరు చేసిన నిధులు రూ.10 కోట్లు -
గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేయడంతో పాటు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లాలోని సిద్ధాపూర్, పదర, అమ్రాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో పట్టుబడిన గంజాయిని బుధవారం ఎస్పీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలంలోని బయో వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కంపెనీలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీసుశాఖ కృషి చేస్తోందన్నారు. 2019లో సిద్ధాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో 29.75 కిలోల గంజాయి, 2023లో పదర మండలంలో 476 గంజాయి మొక్కలు, 2024లో అమ్రాబాద్ మండలంలో 5 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్పీ వెంట జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్రావు, ఆర్ఎస్ఐ ప్రశాంత్, పీసీ అరవింద్ ఉన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించం.. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే సహించమని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. రైతులు కొనుగోలుచేసే విత్తనాలు, ఎరువులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా నకలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం
కొల్లాపూర్ రూరల్: రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం కాదని.. మహాత్మా గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్లో భాగంగా బుధవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు నుంచి నార్లాపూర్ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి జూపల్లి పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఎల్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పాదయాత్ర అనంతరం నార్లాపూర్లో గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో పేద, బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హన్మంతు నాయక్, మేకల నాగరాజు, రహీంపాషా, ఎగ్బాల్, ఇమిడిశెట్టి వెంకటస్వామి, రఘుపతిరావు, శేఖర్ రెడ్డి, రామన్గౌడ్ పాల్గొన్నారు. రాజ్యాంగం విలువలను ప్రజల్లోకితీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
‘యువవికాసం’ యూనిట్లు గ్రౌండింగ్ చేయండి
నాగర్కర్నూల్: రాజీవ్ యువవికాసం యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై బుధవారం కలెక్టరేట్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ కార్పొరేషన్ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువవికాసం పథకంతో అర్హులందరికీ దశల వారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. వచ్చేనెల 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా యువత స్వయం ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు యూనిట్లన్నీ గ్రౌండింగ్ చేసి.. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో లబ్ధిదారులకు యూనిట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై కలెక్టర్ సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ● జిల్లాలో చివరి దశలో ఉన్న వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో రెవెన్యూ, పౌరసరఫరాల, రవాణా శాఖల అధికారులు, మిల్లర్లు, లారీ అసోసియేషన్ సభ్యులతో ఆ యన సమావేశమై మాట్లాడారు. వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యా న్ని మిల్లులు లేదా గోదాములకు తరలించేందుకు అవ సరమైన లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం తరలింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోకుండా కాపాడటం ము ఖ్యమని.. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతు లకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమా వేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్ ఉన్నారు. ● వనమహోత్సవంలో శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో డీఆర్డీఓ చిన్న ఓబులేష్, ఎఫ్ఆర్ఓ రోహిత్ గోపిడిలతో కలిసి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 11వ విడత వనమహోత్సవం లక్ష్యం మేరకు జిల్లావ్యాప్తంగా 41లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ● జిల్లాలో పీవీటీజీగా గుర్తించిన చెంచులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం జన్మన్ జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా చెంచులకు మంజురైన గృహాల నిర్మాణాలపై ఐటీడీఏ పీఓ రోహిత్ గోపిడితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది మండలాల్లోని 88 ఆదివాసీ చెంచు పెంటల్లో 8,772 మంది నివసిస్తుండగా.. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా ఇప్పటికే 890 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా చెంచు పెంటల్లో మిగిలిన అర్హులను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల 2న లబ్ధిదారులకుమంజూరు పత్రాలు కలెక్టర్ బదావత్ సంతోష్ -
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య
కందనూలు: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఇంటర్ విద్య ఎంతో కీలకం. చాలా మంది విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ అభ్యసించాలనే కోరిక ఉంటుంది. కానీ కార్పొరేట్ విద్య పేదలకు అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో పదో తరగతి చదివి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్ చదివేందుకు సహకారం అందిస్తోంది. కార్పొరేట్ విద్యా పథకానికి ఎంపికై న ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ. 36వేలు చెల్లిస్తుంది. ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ పరిగణనలోకి తీసుకొని 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ కళాశాలలకు ఎంపిక చేయనుంది. దరఖాస్తు గడువు ఈ నెల 31వ తేదీ వరకు ఉంది. అర్హులు ఎవరంటే.. పదో తరగతిలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఆదర్శ, నవోదయ, గురుకుల విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్ విద్య చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. ఎంపికై న వారికి కేటాయించిన కార్పొరేట్ కళాశాలల వివరాలతో కూడిన సమాచారం పంపిస్తారు. మీ సేవ కేంద్రాల ద్వారా టీఎస్ ఈపాస్ పోర్టల్లో telanganaepass.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి పూర్తి వివరాలతో పాటు పదో తరగతిలో సాధించిన మార్కుల ధ్రువపత్రం, ఇతర పత్రాలు, పాస్ఫొటో సైజ్ ఫొటో జతచేయాలి. నాలుగు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదివిన పాఠశాలల నుంచి తీసుకున్న ధ్రువపత్రాలతో పాటు తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పత్రాన్ని దరఖాస్తుతో సమర్పించాలి. గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2లక్షలకు పైగా వార్షిక ఆదాయం మించకుండా ఉండాలి. సద్వినియోగం చేసుకోవాలి.. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్ల పాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పించబడతాయి. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. – రాంలాల్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి కార్పొరేట్ విద్యా పథకంతో అవకాశం ఎస్ఎస్సీ మెరిట్ ఆధారంగా ఎంపిక ఈ నెల 31 వరకు దరఖాస్తు గడువు -
ప్రభుత్వ స్థలాలే టార్గెట్..
కల్వకుర్తి మున్సిపాలిటీగా ఏర్పడక ముందే పలు ప్రభుత్వ స్థలాలను ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అనుచరుల మాటున కబ్జా చేసి.. అక్రమ లే అవుట్లను సృష్టించి అమ్మేశారు. మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత కౌన్సిలర్లుగా పనిచేసిన వారు సైతం అదే పనిలో బిజీగా ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ స్థలాలు, రోడ్లను తమ అనుచరులచే కబ్జా చేయించడం.. తిరిగి వారే మున్సిపాలిటీలో ఫిర్యాదు చేయడం.. వాటిని వారే పరిష్కరించినట్లుగా చిత్రీకరించి.. తిరిగి వాటి గురించి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
అచ్చంపేట రూరల్: వానాకాలంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్ ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు సూచించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో మర్చంట్ అసోసియేషన్ భవనంలో డివిజన్లోని ఫర్టిలైజర్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో డీఏఓ మాట్లాడారు. నిబంధనల మేరకు ఫర్టిలైజర్ దుకాణాలను నిర్వహించాలని అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉచితంగా పంపిణీచేసిన యంత్రాలతో ఎరువుల విక్రయ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఓలు కృష్ణయ్య, అనిల్కుమార్, నరేష్, మహేశ్ కుమార్, కోరమండల్ ఆగ్రో సమిస్ట్ శివయాదవ్ పాల్గొన్నారు. -
కేఎల్ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్కు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నాగర్కర్నూల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణంలోని విత్తనాలు, ఎరువుల స్టాక్తో పాటు రైతులకు విక్రయిస్తున్న తీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాసిరకం విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేస్తే సహించమన్నారు. ప్రతి ఫర్టిలైజర్ దుకాణంలో విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల నిల్వలు వివరాలు, నాణ్యతా ప్రమాణాలు, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. తప్పనిసరిగా ఈ–పాస్ ద్వారానే విక్రయించాలని.. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీలు నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట డీఏఓ చంద్రశేఖర్ ఉన్నారు. -
‘సహకారం’లో మార్పు!
నాగర్కర్నూల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పీఏసీఎస్ల ద్వారా రైతులకు అందించే సేవలను మరింత విస్తృతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ, రుణాల మంజూరు వంటి వాటితో పాటు ధాన్యం కొనుగోళ్లు పీఏసీఎస్లకు పెద్దఎత్తున లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సహకార సంఘాలను ఇతర వ్యాపార రంగాల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పుచేసి.. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో 16 సంఘాల ఎంపిక.. జిల్లాలో మొత్తం 23 పీఏసీఎస్లు ఉండగా.. దాదాపు 2.30లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే మొదటి విడతలో 16 సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మారనున్నాయి. అందులో నాగర్కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూర్, తెలకపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి, నర్సాయపల్లి, కొండనాగుల, అంబట్పల్లి, అమ్రాబాద్, ఉప్పునుంతల, అచ్చంపేట, రంగాపూర్, చారకొండ, కల్వకుర్తి పీఏసీఎస్లు ఉన్నాయి. కాగా, సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వేర్వేరు లక్ష్యాలతో ఉన్నప్పటికీ.. ఇవి రెండూ ఒకే రకమైన సంస్థలు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రధానంగా రైతుల ఆదాయం, ఉత్పత్తులు పెంచడం, ప్రాసెసింగ్ వంటి వాటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. అదే విధంగా వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడంతో పాటు పంట ఉత్పత్తులకు అధికంగా లాభాలు వచ్చేలా మార్కెటింగ్ చేయడం, విత్తనోత్పత్తి వంటి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను జూన్ 5వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సాంకేతికతను అందిపుచ్చుకొని ఎలాంటి వ్యాపారాలు నిర్వహించాలి.. వాటి నిర్వహణ ఎలా అనే విషయాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, శిక్షణకు సంబంధించి కేవలం సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమేనా.. లేక పాలకవర్గాలకు కూడా శిక్షణ ఇస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, సహకార శాఖకు నిర్వహణ బాధ్యత ఎంత వరకు సాధ్యమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అన్నివిధాలా మేలు.. జిల్లాలో 23 పీఏసీఎస్లు ఉండగా.. ప్రస్తుతం 16 సొసైటీలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మారనున్నాయి. రైతులకు అన్నివిధాలా మేలు చేయడమే వీటి ఉద్దేశం. సిబ్బంది శిక్షణకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. – రఘు, డీసీఓ ఇకపై రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా పీఏసీఎస్లు జిల్లాలో మొదటి విడత 16 సంఘాల ఎంపిక రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ముందుకు.. -
జలయజ్ఞం ప్రాజెక్ట్లపై నజర్
కోయిల్సాగర్: చివరి దశలో పనులు 2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి ● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల ● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు.. ● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పనులపైనా కసరత్తు ● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా ● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ప్రాజెక్ట్ -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కందనూలు: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ పరీక్షలు మంగళవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,350 మందికి గాను 2,186 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 2,179 మందికి గాను 2,036, ఒకేషనల్ విభాగంలో 171 మందికి గాను 1,50 మంది హాజరై పరీక్షలు రాశారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 656 మందికి గాను 600 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 606 మందికి గాను 556 మంది, ఒకేషనల్ విభాగంలో 50 మందికి గాను 44 మంది హాజరై పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరంలో 164 మంది, ద్వితీయ సంవత్సరంలో 56 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు ముగిసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.నల్లమలలోవిద్యాభివృద్ధికి కృషిఅచ్చంపేట: నల్లమలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం అచ్చంపేటలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో 500 పైగా మార్కులు సాఽధించిన 290 మంది విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రూ. 200కోట్లతో రాయిచోడు వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మి స్తున్నట్లు తెలిపారు. అప్ప శివ జ్యువెలర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జి.రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, మల్లేష్, గోపిశెట్టి శివ, గౌరీ శంకర్, ఎ.గోపాల్రెడ్డి, ఎం.రామనాథం, నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు.పేదల పక్షాన నిరంతర పోరాటంచారకొండ: పేదల పక్షాన సీపీఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం చారకొండ, వంగూరు మండలాల సీపీఐ మూడో మహాసభలను మండల కార్యదర్శి అశోక్గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, నియంతృత్వ పాలన సాగిస్తుందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుపెట్టేందుకు బూటకపు ఎన్కౌంటర్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి.. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వార్ల వెంకటయ్య, చిల్వేరు శ్రీనివాసులు, నూనె వెంకటేశ్, గోపాల్, మల్లేష్, తిరుపతమ్మ, పరశురాం, శ్రీను, నారాయణరెడ్డి, జంగయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.పీయూలో 4వ స్నాతకోత్సవంమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, 2022– 24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, ఫీజు దరఖాస్తు ఫారాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. టాపర్స్కు గోల్డ్ మెడల్, కన్వకేషన్ సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. జూన్ 16 వరకు నేరుగా, 30 వరకు ఫైన్తో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నాగర్కర్నూల్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను విన్నవిస్తూ ఫిర్యాదులు సమర్పించారు. కార్యక్రమం ముగిసే సమయానికి 47 ఫిర్యాదులు అందగా.. పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సాగని పనులు.. పారని నీరు
రైస్మిల్లు యజమానితో మాట్లాడుతున్న ఆర్డీఓ సురేష్●నిలిచిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు సాగునీటి సమస్య తీరనుంది.. సింగోటం రిజర్వాయర్ సమీపంలోనే మా గ్రామం ఉంది. గ్రామంలోని వీరమాయిని చెరువు కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగుకు చెరువు నీరు సరిపోక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. సింగోటం–గోపల్దిన్నె లింకు కెనాల్ ద్వారా చెరువుకు నీళ్లు మళ్లిస్తే సాగునీటి సమస్యలు తీరుతాయి. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి. – సురేందర్రావు, ఎన్మన్బెట్ల గ్రామం పాలకులు దృష్టి సారించాలి.. సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. కేఎల్ఐ నీటిని నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు అందిస్తామని పాలకులు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు నేటికీ సాగునీరు అందడం లేదు. లింక్ కెనాల్ పనులు పూర్తిచేస్తే కొంత మేర రైతులకు మేలు చేకూరుతుంది. ఆ దిశగా అధికారులు, పాలకులు దృష్టి సారించాలి. – సాయికృష్ణగౌడ్, సింగోటం ● మూడేళ్ల కిందట రూ.147.7 కోట్లు మంజూరు ● భూ సేకరణే ప్రధాన అడ్డంకి ● నిర్మాణం పూర్తయితే 34 వేల ఎకరాలకు సాగునీరు కొల్లాపూర్: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదు. భూ సేకరణ సమస్య కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ కాల్వ నిర్మాణంపై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. నిర్మాణం పూర్తయితే సాగునీటి సమస్యలు తీరుతాయని భావిస్తున్నా.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి. మూడేళ్ల కిందట టెండర్లు పూర్తి.. జూరాల ఎడమ కాల్వ చివరి ఆయకట్టు కింద కొల్లాపూర్ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల భూములున్నాయి. ఆయా ప్రాంతాల్లోని రైతులకు యాసంగి సీజన్లో సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుగాను సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించేలా పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం మూడేళ్ల కిందట రూ.147.7 కోట్లు మంజూరు చేసి టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించింది. గోపల్దిన్నె రిజర్వాయర్కు అనుసంధానంగా 5 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. తర్వాత భూ సేకరణ పేరుతో పనులు నిలిచిపోయాయి. భూ సేకరణకు చర్యలు.. వనపర్తి జిల్లా పరిధిలో 200 ఎకరాలు, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 100 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉండటంతో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గత ప్రభుత్వం పనుల పూర్తికి యత్నించినప్పటికీ పలు కారణాలతో ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి జూపల్లి కృష్ణారావు కాల్వ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి భూ సేకరణ అంశంపై చర్చించారు. పనుల పూర్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండు జిల్లాల పరిధిలో.. సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్తో వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు పాన్గల్ మండలంలోని కొంతమేర, నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని పలు గ్రామాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. లింక్ కెనాల్కు తూములు ఏర్పాటుచేసి సమీపంలోని చెరువులు, కుంటలకు నీళ్లు మళ్లించేలా డిజైన్లు రూపొందించారు. కాల్వకు నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల ఎడమ కాల్వ కింద ఉన్న 24,500 ఎకరాల ఆయకట్టుకు, రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అదేవిధంగా వేసవిలో గోపల్దిన్నె రిజర్వాయర్ కింద ఉండే పలు గ్రామాలకు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయి. ఉన్నతాధికారులకు నివేదించాం.. లింక్ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు చర్యలు చేపట్టాం. గతంలో గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించాం. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పనుల పురోగతిపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు తెలియజేశాం. కాల్వ పనులకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకుట పంపించాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ -
ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరం.. ఉమ్మడి రాష్ట్రంలో 21 మంది ముఖ్యమంత్రుల పాలనలో రూ.65 వేల కోట్ల అప్పులు చేస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ కోతలేనని ప్రచారం చేశారని.. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి చేతికిచ్చినా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామన్నారు. దేవుడి చుట్టూ దెయ్యాలంటూ కవిత లేఖ రాయడం చూస్తే దెయ్యాలకు నాయకత్వం వహించిన వారు దేవుడెలా అవుతాడని ప్రశ్నించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రానికి రెండు కళ్లలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని వివరించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు, 300 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని కోరారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని, గిరిజన, చెంచు రైతులకు భూమికి భూమి ఇచ్చి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, రాష్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమకు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం బీఆర్ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
నాగర్కర్నూల్: ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పోలీస్, వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సమీకృత కార్యాలయాల సమావేశ మందిరంలో నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్ బృందాల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారని.. ఈ ఏడాది 2.86 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేసినట్లు చెప్పారు. 2,865 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరం కాగా.. ఇప్పటికే 573 క్వింటాళ్లు సరాఫరా చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతిలేని బీజీ–3 నకిలీ పత్తి విత్తనాలు అమ్మడం, విత్తడం, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష, పీడీ యాక్టు నమోదుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బీజీ–3 పత్తి విత్తనాలు విత్తడంతో భూ సారం దెబ్బతినడమే కాకుండా వాతావరణం కలుషితమవుతుందని.. నకిలీ విత్తనాలతో పండిన పంటతో నేసిన దుస్తులు ధరిస్తే చర్మ క్యాన్సర్ వస్తుందన్నారు. మంగళవారం 24 టాస్క్ఫోర్స్ బృందాలు జిల్లాలోని 733 డీలర్ ఔట్లెట్లను తనిఖీ చేయాలని.. కాలం చెల్లిన విత్తనాలు అమ్మినా, నిల్వ ఉంచినా, అనుమతి లేని నకిలీ విత్తనాలు అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, చెక్పోస్టులో కూడా గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన బీటీ–2 పత్తి విత్తనాలను మాత్రమే లైసెన్సుడ్ ఔట్లెట్ డీలర్ల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి
తాడూరు: రైతులు సాగు చేసే పంటల్లో యూరియాతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని పాలెం కేవీకే శాస్త్రవేత్త శ్రీరాం అన్నారు. సోమవారం మండలంలోని బలాన్పల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట మార్పిడితో భూ సారం పెరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రసీదులు భద్రపర్చుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త రాజిరెడ్డి మాట్లాడుతూ.. పురుగు మందులు అవసరం ఉన్నప్పుడే మాత్రం పిచికారీ చేయాలన్నారు. నేల, తేమ సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధికారుల సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు పొందాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ సందీప్కుమార్రెడ్డి, ఏఈఓ దీపక్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులు పాల్గొన్నారు. -
నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి రాక
బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్కు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన గ్రామానికి చేరుకొని విద్యుత్ సబ్స్టేషన్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల పనులు, సభ ఏర్పాట్లను విద్యుత్శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు గ్రామానికి చేరుకుంటారన్నారు. అక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రూ.25 కోట్లతో పోల్కంపల్లి, రూ.1.82 కోట్లతో బొమ్మనపల్లి, రూ.1.73 కోట్లతో పదర, రూ.2.54 కోట్లతో గట్టుతుమ్మెన్, రూ.2.24 కోట్లతో లింగాల మండలం బాకారం, రూ.2.49 కోట్లతో ఉప్పునుంతల మండలం కంసాన్పల్లి, రూ.2.74 కోట్లతో వంగూరు మండలం ఉల్పర, రూ.1.99 కోట్ల అంచనాలతో అచ్చంపేట మండలం సింగారంలో నిర్మించనున్న సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం 12 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారని వివరించారు. కాగా ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రణాళికతో పక్కాగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ -
ఎదురుచూపులు
‘రైతు భరోసా’కు ●పెట్టుబడి సాయం అందించాలి.. వానాకాలం సమీపిస్తోంది. ఈ పాటికే పత్తి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకొని ఉంచుకోవాలి. చేతిలో డబ్బులు లేకపోవడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం అందిస్తే రైతు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ఉంటారు. – ఆదికొండ కరీం, రైతు, గట్టురాయిపాకుల (తెలకపల్లి) ఎలాంటి ఆదేశాలు రాలేదు.. రైతుభరోసా నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. రైతులు, వారి ఖాతా వివరాల సమాచా రం ప్రభుత్వం వద్దే ఉంటుంది. దాని ఆధారంగానే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. – చంద్రశేఖర్, డీఏఓ, నాగర్కర్నూల్ నాగర్కర్నూల్: రైతులు పంటల సాగుకు అప్పులు చేయకుండా పెట్టుబడి సాయం అందించి ఆదుకునేందుకు 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. రైతులు పంటలు సాగు చేసేముందు నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తే సాగుకు వినియోగించుకునేవారు. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు ఇస్తుండగా.. ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చింది. గత సీజన్లో రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయగా ఈ వానాకాలం సీజన్లో మాత్రం ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం రైతుభరోసా పేరుతో హామీనిచ్చింది. కానీ నేటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను అశ్రయించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వానాకాలం పంటల సాగుకుగాను రైతులు పొలాలు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు ప్రారంభమైతే పనులు ఊపందుకోనుండగా.. రైతుభరోసాపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిధుల జమపై అనిశ్చితి నెలకొంది. గత ప్రభుత్వం పంటల సాగుకు ముందే రైతుబంధు నిధులు ఎప్పుడు జమచేసేదో ప్రకటన చేసేది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గతేడాది రూ.247.39 కోట్లు జమ.. 2024 యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.47 లక్షల మంది రైతులకు సుమారు రూ.247.39 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కాగా అందరు రైతులకు ఒకేసారి జమ చేయకుండా ఎకరాల వారీగా ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఒక ఎకరం మొదలుకొని విడతల వారీగా ఎక్కువ పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమయ్యాయి. ● జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో గతేడాది వానాకాలంలో 4,35,692 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 5,38,462 ఎకరాల పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో వరి 1,60,021 ఎకరాలు, పత్తి 2,86,471, జొన్న 7,822, మొక్కజొన్న 72,929, కంది 8,909, మినుములు 368, వేరుశనగ 895, ఆముదం 239, ఇతర పంటలు 808 ఎకరాలుగా రూపొందించారు. ఇక పండ్లు, ఇతర పంటలు మరో 52,603 ఎకరాలుగా నిర్ధారించారు. ప్రతి ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండటంతో రైతుభరోసా జమ చేస్తే రైతులకు కొంత ఊరట కలగనుంది. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలు నేటికీ ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
బిజినేపల్లి: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్ నర్సింహ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం మండలంలోని వెల్గొండలో సీపీఐ నాయకుడు ఈర్ల గంగాధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపేందుకు యత్నిస్తోందని ఇది సరికాదని వెంటనే శాంతి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పాకిస్తాన్, భారత్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకోవడం అప్రజాస్వామ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణాజీ, ఈర్ల భూపేష్బాబు, ఈర్ల చంద్రమోళి, కృష్ణారెడ్డి, భూపేష్బాబు, పురుషోత్తం, ఈర్ల గంగాధర్, కంతం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నీటి వృథాకు అడ్డుకట్ట
పూర్తయిన జూరాల ఎడమ కాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుసుమారు 30 ఏళ్ల కిందట.. జూరాల ఎడమ కాల్వ కింద జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏడాదికి రెండుసార్లు పంటలకు సాగునీరు అందిస్తారు. సుమారు 30 ఏళ్ల కిందట బిగించిన షట్టర్లు వంగిపోయి దెబ్బతినడంతో మూసినా నీరు వృథాగా పారుతోంది. వారబందీ సమయంలో లీకేజీల కారణంగా నిత్యం 150 క్యూసెక్కులకు పైగా నీరు వృథా అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు. యాసంగిలో వారబందీ విధానంలో రామన్పాడు రిజర్వాయర్ వరకు సాగునీటిని వదిలారు. సమాంతర కాల్వకు మోక్షమెన్నడో? భీమా ఫేజ్–2 ఎత్తిపోతల కోసం సమాంతర కాల్వను ఏర్పాటు చేశారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుకు వస్తున్న నీటిని కాల్వ ద్వారా పంపింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. కాని భీమా అధికారులు కాల్వ ప్రధాన షట్టర్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం 150 క్యూసెక్కుల నీరు కాల్వలో వృథాగా పారుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ప్రధాన ఎడమకాల్వ సాధారణ షట్టర్ల మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిపివేసినా షట్టర్ల లీకేజీలతో రోజు కాల్వలో వృథాగా పారి జలాశయంలో నిల్వ నీటిమట్టం తగ్గుముఖం పట్టేది. నిత్యం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండటంతో అధికారులు మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వకు 4 సాధారణ, 4 ఎమరెన్సీ షటర్లు ఉండగా.. 4 సాధారణ షట్టర్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతుంది. దీంతో వీటి మరమ్మతుకు రూ.7.50 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వేగంగా మరమ్మతులు పూర్తిచేశారు. ఇకనుంచి యాసంగి సీజన్లో ఆయకట్టుకు వారబందీ సమయంలో సాగునీరు నిలిపివేసే సమయంలో చుక్కనీరు ముందుకు పారకుండా షట్టర్లను పక్కాగా బిగించనున్నారు. నాలుగు షట్టర్లకు రూ.7.50 లక్షల వ్యయం వారబందీ సమయంలో నీరు వృథా కాకుండా చర్యలు ఎట్టకేలకు మోక్షం -
సజావుగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. ఆదివారం గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు జరగగా.. 20 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 1,872 మంది విద్యార్థులకుగాను 1,766 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,577 మందికిగాను 1,495 మంది, ఒకేషనల్ విభాగంలో 295 మందికిగాను 271 మంది పరీక్షలు రాశారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 805 మందికిగాను 773 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 602 మందికిగాను 577 మంది, ఒకేషనల్ విభాగంలో 203 మందికిగాను 196 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 106 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని వసతుల కల్పించినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి అదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు చివరి దశకు చేరుకోవడంతో భక్తులు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆదివారం సుమారు 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు వివరించారు. వాహనాలు అధికసంఖ్యలో రావడంతో మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కలెక్టరేట్ అతిథి గృహంలో పాము నాగర్కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ అతిథిగృహంలో ఆదివారం ఆరు అడుగుల పొడవుగల పాము కనబడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే స్నేక్ క్యాచర్ వంశీకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకొని పామును సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
విశేషమైన స్పందన..
బాలకేంద్రంలో వేసవి శిక్షణ తరగతులకు విశేషమైన స్పందన లభిస్తుంది. శిక్షణ అనంతరం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. బాల కేంద్రాన్ని బాల భవన్గా మారిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శాశ్వత పద్ధతిన శిక్షకులు నియమితులవుతారు. సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపించే అవకాశం ఉంటుంది. శిక్షణ అనంతరం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం. – రాజేష్ ఖన్నా, ఇన్చార్జి సూపరింటెండెంట్, బాలకేంద్రం, మహబూబ్నగర్ -
రాయితీ ఎరువులు సిద్ధం
వనపర్తి: రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి భూ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ ఏటా పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు రైతులకు 50 శాతం రాయితీపై మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో పంపిణీ షురూ చేశారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా జిల్లాలకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువుల ఇండెంట్ ఆధారంగా జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ జీలుగ, జనుము రకాల విత్తనాలను సిద్ధం చేసింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కర్మాగారంలో ఐదు జిల్లాలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసి తొలకరి వర్షాలు కురుస్తున్న ప్రస్తుతం సమయంలో సరఫరా కోసం ఆయా ప్రాంతాలకు పంపిణీ చేశారు. జీలుగ రకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 వేల క్వింటాళ్లు, జనుము 760 క్వింటాళ్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులకు ఈ విత్తనాలను వారి అభ్యర్థన మేరకు ఆయా రకాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తారు. పచ్చిరొట్టతో ఉపయోగాలిలా.. పచ్చిరొట్ట ఎరువులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. వ్యవసాయ పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం పరిమితికి మించడంతో భూమిపై గల సారవంతమైన పొర చౌడు నేలగా మారే ప్రమాదం ఉంది. ఏటా ఖరీఫ్ పంటల సాగుకు ముందు వర్షాధారంగా పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నడం వలన భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించకుండా ఈ పచ్చిరొట్ట ఎరువులు వాటి మనుగడను కాపాడుతాయి. నేలపై పొరలోని సహజ భౌతిక లక్షణాల రక్షణకు ఉపయోగపడతాయి. ఇదే అనువైన సమయం.. పచ్చిరొట్ట ఎరువుల నాటేందుకు ప్రస్తుత సమయం అనువైనదని ఇటీవల నిర్వహించిన శాస్త్రవేత్తల పల్లెబాట కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవాలి. సాధారణ పంటల సాగుకు ముందు 45 రోజుల ముందు ఈ పచ్చిరొట్ట ఎరువులను నాటుకుంటే.. పచ్చిరొచ్చ మొక్కలు పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదున్నేందుకు అవకాశం ఉంటుంది. రాయితీ వివరాలు ఇలా.. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జీలుగ, జనుము రెండు రకాల పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తోంది. జీలుగ క్వింటాల్కు రూ.14,250 కాగా.. రాయితీపై కేవలం రూ.7,425కు, జనుము పూర్తి ధర క్వింటాల్కు రూ.12,550 ఉండగా.. రాయితీపై రూ.6,275కే రైతులకు అందజేస్తోంది. చాలా ఉపయోగం.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో డిమాండ్ మేరకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రసాయనిక ఎరువుల వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి ఒకసారి పచ్చిరొట్ట ఎరువుల వాడకం పొలానికి చాలా ఉపయోగకరం. – ఆదినారాయణరెడ్డి, రీజినల్ మేనేజర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, వనపర్తి జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఎరువులు ఇలా (క్వింటాళ్లలో).. అందుబాటులో జనుము, జీలుగ రకాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంపిణీచేసేందుకు చర్యలు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చినఇండెంట్ మేరకు సరఫరా -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కందనూలు: జిల్లా కేంద్రంలో సబ్స్టేషన్ మరమ్మతు కారణంగా ఆదివారం ఉదయం 10 నుంచి మధ్మాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఓ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉయ్యాలవాడ మెడికల్ కళాశాల నుంచి శ్రీపురం రోడ్డుకు ఇరువైపులా, శ్రీపురం రోడ్డు నుంచి బీసీకాలనీ, రూబీ గార్డెన్, డిగ్రీ కళాశాల వరకు ఇరువైపులా, నెల్లికొండ రోడ్డు నుంచి కొల్లాపూర్ చౌరస్తా, మంతటి, పెద్దముద్దునూరు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఇందుకు గాను వినియోగదారులు, రైతులు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. ఇంటర్ పరీక్షలకు185 మంది గైర్హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మూడోరోజు జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాల్లో గణితం, బాటనీ, పౌరశాస్త్రం పరీక్షలు నిర్వహించగా ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులు 3,126 మందికి గాను 2,978 మంది హాజరవగా.. 148 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 874 మందికి గాను 837 మంది హాజరవగా.. 37 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి పాక్షిక శనిత్రయోదశి సందర్భంగా శనివారం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తిలతైలాభిషేకాలతో పూజలు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల చేత శనిదోష నివారణ కోసం గోత్రనామార్చన, అభిషేకాలు, అర్చనలు వంటి పూజలను అర్చకులు చేయించారు. భక్తులు శనేశ్వరుడి పూజల అనంతరం శివాలయంలో బ్రహ్మసూత్ర శివుడికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుపై పట్టుసాధించాలి కందనూలు/ తిమ్మాజిపేట/ బిజినేపల్లి: ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, ఆంగ్లంలోనే బోధన చేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శనివారం తిమ్మాజిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎప్పటికప్పుడు బోధనలో నూతన విధానాలను అలవర్చుకోవాలని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను గ్రామాల్లో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రసుత్తం ఉన్న ప్రణాళిక ప్రకారం బోధిస్తే అదనపు సమయం అవసరం లేదన్నారు. మీ దగ్గర క్వాలిటీ ఉంటే మీరు బోధనను శ్రద్ధగా విని ఉత్తమ పౌరులుగా ఎదిగిన వారే మీ గురించి చెప్పడం వల్ల కూడా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయుల కరదీపికను విడుదల చేసి రీసోర్స్పర్సన్లను సన్మానించారు. అలాగే బిజినేపల్లి మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఐదు రోజులుగా నిర్వహించిన వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ పరిశీలించారు. మొత్తంగా శనివారంతో ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ముగిసినట్లు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం జిల్లాస్థాయిలో 1,934 మంది, మండల స్థాయిలో 1,368 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈఓలు సత్యనారాయణశెట్టి, రఘునందన్రావు, ఆయా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రేపు డిప్యూటీ సీఎం రాక
బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్ గ్రామానికి సోమవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం గట్టుతుమ్మెన్లో ఏర్పాటు చేయనున్న సభాస్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి, అనంతరం నియోజకవర్గ ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, నాయకులు గిరివర్ధన్గౌడ్, కాశన్నయాదవ్, గోపాల్రెడ్డి, రాంప్రసాద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలి నాగర్కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల హెడ్ఓడీలతో మాట్లాడుతూ వైద్య కోసం వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలన్నారు. జనరల్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్న ఓ వైద్యుడు గురువారం రాజీనామా చేయడంతో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా రాజీనామా చేసినట్లు దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంఘటనపై విచారణ చేసేందుకు జనరల్ ఆస్పత్రికి వచ్చారు. రాజీనామా చేసిన ఆర్థోపెడిక్ వైద్యుడితో వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిసింది. అనంతరం ఉయ్యాలవాడ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. అకాడమిక్ డీఎంఈ వెంట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు తదితరులున్నారు. ఉగ్రదాడులను అరికట్టడంలో విఫలం ● మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి ● హక్కుల సాధన కోసం పోరాడుదాం ● కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ – కల్వకుర్తి రూరల్ – వివరాలు 8లో.. -
చిన్నారుల పొదరిల్లు
● వేసవి శిక్షణకు వేదికగా బాలభవన్, బాలకేంద్రాలు ● నృత్యం, సంగీతం, చిత్రలేఖనం నేర్చుకునేందుకు చిన్నారుల ఆసక్తి ● ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాల్లో 16 ఏళ్ల లోపు బాలబాలికలకుప్రత్యేక శిక్షణ నారాయణపేటలో 1983లో 9 మంది చిన్నారులతో ఏర్పాటైన బాలకేంద్రం చౌక్బజార్లోని అద్దె భవనంలో కొనసాగింది. ఆ తర్వాత మినీస్టేడియం గ్రౌండ్లో వృథాగా ఉన్న ఓ భవనంలోని మార్చారు. ఇక్కడ తబలా, సితార్, గాత్రం, నృత్యం, చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బాలకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. జనరల్ విద్యార్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్నారులకు రూ.20 ప్రవేశ రుసుం వసూలు చేస్తారు. ఏటా వేసవిలో వందమంది పిల్లలు శిక్షణ పొందడానికి వస్తుంటారు. వీరికి దాతల సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్ వంటి పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు. ఇక తరుచుగా దాతలతో స్నాక్స్ సైతం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పాల్గొని మంచి పేరు తీసుకువచ్చారు. ఉత్సాహభరితంగా.. గద్వాల బాలభవన్లో400కు పైగా విద్యార్థులు వివిధ కళల్లో శిక్షణ పొందారు. 5–16 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సాహభరిత వాతావరణంలో వేసవి శిబిరం కొనసాగుతుంది. వివిధ కళల్లో నైపుణ్యం ఉన్న శిక్షకులు చిన్నారులకు శిక్షణ ఇస్తూ బాల కళాకారులుగా తీర్చిదిద్దారు. చిన్నారులకు భరతనాట్యం, జానపద నృత్యం, శాసీ్త్రయ నృత్యాలను శిక్షకులు సత్యం, చిత్రలేఖనం గణేష్, సంగీతం శివకుమార్, వాయిద్యాలు శంకర్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్లో గాయిత్రి తదితరులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కళల ప్రపంచం.. ‘పేట’ బాలకేంద్రం -
అచ్చంపేటలో జాతీయ పతాకం రెపరెపలు
అచ్చంపేట రూరల్: జమ్ముకాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంఘీభావం శుక్రవారం అచ్చంపేటలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వందలాదిగా పాల్గొన్న ప్రజలు, రాజకీయ, సంఘాల నాయకులు జాతీయ పతాకాన్ని చేతపట్టి ర్యాలీలో ముందుకు సాగారు. అలాగే భారత్ మాతాకీ జై.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారులను సన్మానించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, టీచర్లు, మహిళా, హమాలీ సంఘాల నాయకులు, కోలాట బృందం, న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, ఇతర ప్రొఫెషనల్స్, వేలాదిగా ప్రజలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాములు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్రెడ్డి, భరత్ ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగ్యానాయక్, రైల్వే బోర్డు మెంబర్ ధర్మనాయక్, పార్లమెంట్ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బాలాజీ, రేనయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్రావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జానకమ్మ, జిల్లా కార్యదర్శి శీనునాయక్, సైదులు, పెద్దయ్యయాదవ్, చందులాల్ చౌహాన్, మైనార్టీ అధ్యక్షులు సిద్ధిఖి పాషా తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
కల్వకుర్తి టౌన్: డిపో పరిధిలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా డీఎం సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు సలహాలు, సూచనలు తెలియజేసేందుకు మధ్యా హ్నం 12 నుంచి ఒంటిగంట వరకు సెల్ నం.99592 26292కు ఫోన్ చేయాలని కోరారు. భాషా నైపుణ్యాలు ప్రతిబింబించేలా బోధన కందనూలు: తరగతి గదిలో భాషా నైపుణ్యాలు ప్రతిబింబించేలా బోధన చేయాలని రాష్ట్రస్థాయి రీసోర్స్పర్సన్ అనురాధ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న తెలుగు, హిందీ భాషా పండితుల శిక్షణ తరగతులను ఆమె సందర్శించి మాట్లాడారు. మాతృభాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధనా పద్ధతులను ప్రతి ఉపాధ్యాయుడు మెరుగుపరుచుకోవాలన్నారు. భాషా పండితులు తమ బోధనా పద్ధతులకు ఆకర్షణీయ వాతావరణం కల్పించుకోవాలన్నారు. తరగతి గది బోధనలో భాషా సంస్కృతులను ప్రతిబింబించడం ద్వారా, విద్యార్థులకు తమ సాంస్కృతిక, భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. అంతేకాకుండా తరగ తి గదిలో ఒక స్నేహపూర్వకమైన, సంక్షేమ వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుందని చెప్పారు. మాతృభాషలో విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా నూతన బోధన పద్ధతులను అనుసరించాల్సిన ఆవశ్యకతపై ప్రతి భాషా పండితుడు దృష్టిపెట్టాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో తెలుగు, హిందీ భాషా పండితుల ఆర్పీలు కమలేకర్ నాగేశ్వరరావు, సలీం, యాకూబ్ అలీ, జ్ఞానేశ్వర్, బాలయ్య, శ్రీనివాసులుగౌడ్, వెంకటస్వామిగౌడ్, భాషా పండితులు పాల్గొన్నారు. ఫార్మసీ అధికారులుగా గుర్తించడం హర్షణీయం నాగర్కర్నూల్ క్రైం: ఫార్మసీ ఆఫీసర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు అన్నారు. ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్కు ఫార్మసీ ఆఫీసర్స్గా గుర్తిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీలను శుక్రవారం అందించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రఘు మాట్లాడుతూ ఫార్మాసిస్ట్లను ఫార్మసీ అధికారులుగా గుర్తిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం సంతోషమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఫార్మసీ అధికారుల కొరత ఉన్నప్పటికీ రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓలు రవిశంకర్, హన్మంతురావు, అజీమ్, ప్రశాంత్, జిల్లా ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్కుమార్, సీనియర్ ఫార్మసీ అధికారి రాణి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ వెంకటేష్, ఫార్మసీ ఆఫీసర్స్ శివరాణి, సుశీల, గోవర్ధన్ పాల్గొన్నారు. జీతాలు చెల్లించాలని వినూత్న నిరసన నాగర్కర్నూల్ రూరల్: తమకు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని కలెక్టరేట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన శుక్రవారం మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కలెక్టరేట్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, మూడు రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలోనే మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపామన్నారు. కార్మికులు పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితి ఉన్న కడుపు చంపుకొని మూడు రోజులుగా సమస్యలపై ఆందోళన చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. -
సేవలు మెరుగు
టీహబ్తో ●ఎంతో మేలు.. టీహబ్ ద్వారా కార్పొరేట్ స్థాయిలో రూ.వేలు విలువ చేసే రక్త పరీక్షలను ఉచితంగా రోగులకు అందిస్తున్నారు. ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో చేయని రక్త పరీక్షలను సైతం టీహబ్ ద్వారా అందిస్తున్నారు. ఇటీవల సీటీ స్కాన్ సేవలు సైతం అందుబాటులోకి తీసుకురావడంతో రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది. – గోవర్ధన్, నాగర్కర్నూల్ సేవలు వినియోగించుకోండి.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాం. టీహబ్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో రూ.వేలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలు టీహబ్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. టీహబ్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – రఘు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగర్కర్నూల్ క్రైం: ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్తే వైద్యం కన్నా.. వైద్య పరీక్షలకే ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రోగికి వచ్చిన రోగాన్ని గుర్తించేందుకు రక్త పరీక్ష, మూత్ర పరీక్షలతోపాటు ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా రక్త పరీక్షల నుంచి ఇతర పరీక్షలు లేనిదే వైద్యం చేయడం లేదు. రోగాన్ని తగ్గించేందుకు మందులను రాయడం లేదు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లాలంటే ఏ పరీక్ష చేయాలన్న చాలా రూ.వేలతో కూడుకున్న వ్యవహారం కావడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన టీహబ్ సత్ఫలితాలు ఇస్తుంది. రెండున్నరేళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ వద్ద ఏర్పాటు చేసిన టీహబ్లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వైద్య పరికరాలతో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో రూ.వేలు వెచ్చించి చేసే రక్త పరీక్షలతోపాటు ఇతర పరీక్షలను టీహబ్లో ఉచితంగా చేస్తుండటంతో సామాన్య ప్రజలు ఆర్థిక భారం నుంచి విముక్తి పొందుతున్నారు. శాంపిళ్లు సేకరించి.. జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతోపాటు జనరల్ ఆస్పత్రికి వచ్చిన రోగులకు రక్త పరీక్షలు రాస్తుండటంతో వైద్య సిబ్బంది శాంపిళ్లు సేకరించి టీహబ్కు పంపిస్తున్నారు. ప్రతిరోజు టీహబ్లో వెయ్యి మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ రిపోర్టులను సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. జిల్లాకేంద్రంలో టీహబ్ భవనం రూ.లక్షలు వెచ్చించి అత్యాధునిక పరికరాల ఏర్పాటు నిత్యం వెయ్యిమంది వరకు రక్త, ఇతర పరీక్షలు కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి ఉచిత వైద్యం జిల్లాలో నిరుపేదలకు తప్పిన ఆర్థిక భారం సద్వినియోగం చేసుకుంటున్న పేద ప్రజలు అత్యాధునిక మిషనరీలు.. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయలేని కొన్ని రక్త పరీక్షలను సైతం టీహబ్లో ఉచితంగా చేస్తూ రిపోర్టులు త్వరగా అందజేస్తున్నారు. టీ హబ్లో 28 రకాల వైద్యానికి సంబంధించిన అత్యాధునిక మిషనరీలు ఏర్పాటు చేసి 136 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండటంతో టీహబ్కు సంబంధించి మైక్రో బయాలజిస్టు వైద్యులు సైతం అందుబాటులో ఉంటూ రక్త పరీక్షల రిపోర్టులను పరిశీలిస్తూ రోగులకు కచ్చితత్వంతో కూడిన రిపోర్టులు అందిస్తున్నారు. సీటీ స్కాన్ సేవలు సైతం.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితోపాటు ఇతర రోగులకు టీహబ్ ద్వారా సీటీ స్కాన్ సేవలు అందిస్తున్నారు. సీటీ స్కాన్లో రోగులకు చేసిన వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను ఆన్లైన్లో హైదరాబాద్కు పంపించి టెలీ రేడియాలజిస్టులు క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫై చేసిన తర్వాత రోగులకు వైద్యం అందిస్తున్నారు. రేడియాలజిస్టుల కొరత ఉండటంతో టెలీ రేడియాలజిస్టు ద్వారా టీహబ్ సేవలు అందిస్తుంది. -
దేశ సమైక్యత కోసమే జైసంవిధాన్ యాత్ర
పెద్దకొత్తపల్లి: దేశ సమైక్యత కోసమే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర చేపట్టామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్ గ్రామంలో కొనసాగిన జైసంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించగా.. చెన్నపురావుపల్లి గ్రామం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, నాయకులు నర్సింహ, విష్ణువర్ధన్రెడ్డి, గోపాల్రావు, మధు, వెంకటస్వామి, శివకుమార్రావు, చిన్నయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు. -
మరమ్మతుల జాడేది?
జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట సమస్యలు●మరమ్మతు చేపట్టాలి.. జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చటంతో పాటు లైనింగ్ దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి మరమ్మతుకు నిధులు కేటాయించాలి. రెండేళ్లుగా కాల్వ వెంట మరమ్మతు చేపట్టడం లేదు. కనీసం పూడికతీత, ముళ్లపొదల తొలగింపు వంటి పనులైనా పూర్తిచేయాలి. – హన్మంతు, రైతు, నందిమళ్ల ప్రతిపాదనలు పంపించాం.. ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నాం. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసి అందజేశాం. నిధులు మంజూరు చేస్తే మరమ్మతులు చేపడతాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల జలాశయం అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ అధికారులు రెండేళ్లుగా సంబంధితశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నా.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుగాకపోవడంతో మరుగునపడ్డాయి. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడటాన్ని గుర్తించిన అధికారులు మరమ్మతులకు ఎన్ని నిధులు అవసరం అన్న విషయాలను నివేదిస్తూనే ఉన్నారు. వర్షాకాలం రాకముందే మరమ్మతులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. నిధులు ఎప్పుడు మంజూరవుతాయని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూరాల ప్రధాన జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. ప్రాజెక్టు సమీపంలో ఉన్న వాటిని గుర్తించలేని అధికారులు వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎప్పుడు గుర్తిస్తారని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ మరమ్మతులకు అధికారులు సిద్ధమయ్యారు. వీటిని గతేడాది వేసవిలో పూర్తి చేయాలని నిర్ణయించినా.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, కత్తేపల్లిలో రెండు ప్రధాన పనులు నిలిచిపోయాయి. వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు మొత్తం 1.20 లక్షల ఎకరాలుగా నిర్ధారించినా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతున్నారు. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల మీదుగా 100 కిలోమీటర్ల పొడవునా కాల్వ విస్తరించి ఉంది. వీటిని ఆయా మండలాల్లో కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీటిని ఎడమకాల్వ వెంటే విడుదల చేస్తుంటారు. పెచ్చులూడిన లైనింగ్ రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం నిధుల మంజూరుకు ఎదురుచూపులు ముగుస్తున్న వేసవి.. వర్షాకాలంలో గండ్లు పడే ప్రమాదం -
పైలెట్ గ్రామాల్లో వేగవంతంగా ఇందిరమ్మ ఇళ్లు
నాగర్కర్నూల్: జిల్లాలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతంగా పూర్తి చేసి బేస్మెంట్ వరకు నిర్మించిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే, వెరిఫికేషన్ చేసి అర్హులైన వారిని గుర్తించి చెక్ లిస్ట్ ప్రకారం సరి చూసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న వసతులను మెరుగుపర్చాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి గదులను పరిశీలించారు. డిజిటల్ గ్రంథాలయ ఏర్పాటు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ వనరులను అందుబాటులోకి తేవడం ద్వారా విద్యార్థులకు, రీసెర్చర్లకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని, దీనికి అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాలపై అధికారులతో ఆరాతీశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. ప్రిపరేషన్ తీరు, ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రంథాలయం నుంచి ఆశిస్తున్న సౌకర్యాల గురించి అడిగారు. అనంతరం మండలంలోని తూడుకుర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులు చదువుకునేందుకు విద్యుత్, నీరు, ఆట స్థలాలు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతుల ప్రణాళిక ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నరేష్, లైబ్రేరియన్ పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన
పెంట్లవెల్లి: రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు గురువారం రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారి గణపతిరెడ్డి బృందం ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికిగాను మండలంలోని జటప్రోల్లో స్థల పరిశీలన చేపట్టారు. గ్రామంలోని సర్వేనంబర్లు 176, 177లోని 22 ఎకరాల భూమిని పరిశీలించి మాట్లాడారు. టెండర్ ప్రక్రియ పూర్తయినందున స్థల పరిశీలన చేపట్టామని.. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎస్ఈ, డిప్యూటీ ఏఈ, తహసీల్దార్ విజయసింహకు సూచించారు. వారి వెంట వైస్ ఎంపీపీ భీంరెడ్డి, నాగిరెడ్డి, కృష్ణయ్య, గోవిందరావు, శ్రీను ఉన్నారు. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహించగా.. 20 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 1,182 మందికిగాను 1,098 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 895 మందికిగాను 838 మంది, ఒకేషనల్ విభాగంలో 287 మందికిగాను 260 మంది పరీక్షలు రాశారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 340 మంది విద్యార్థులకుగాను 319 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 305 మందికిగాను 287 మంది, ఒకేషనల్ విభాగంలో 35 మందికిగాను 32 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం తెలకపల్లి: రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని డీఆర్డీఓ చిన్న ఓబులేష్ అన్నారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం.. దైన్యం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 300 క్వింటాళ్ల వరి ధాన్యం పండించగా విక్రయించేందుకు 15 రోజులుగా కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నానని, తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతు కొమ్ము శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందని తెలిపారు. అకాల వర్షాలకు తేమ శాతం తగ్గడంతో అధికారులు కాలయాపన చేయడంతో నష్టం వాటిల్లుతుందని వివరించారు. తేమ శాతం 14 ఉన్నా కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. డీపీఎం శ్రీనివాసులు, ఏపీఎం చంద్రయ్య ఉన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి కల్వకుర్తి రూరల్: రైతులు పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని డా. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొ. త్రివేణి అన్నారు. గురువారం మండలంలోని వెంకటాపూర్లో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. రసాయన ఎరువుల వినియోగంతో కాలుష్యం పెరిగి మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు. మరో శాస్త్రవేత్త డా. స్వరూపారాణి సాగునీటిని ఆదా చేసే పద్ధతులు, చెట్ల పెంపకంతో కలిగే లాభాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను రైతులకు అందజేశారు. -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
కల్వకుర్తి టౌన్/వెల్దండ: ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా ప్రతి ఉపాధ్యాయుడు తమ బోధనా పద్ధతులు కాలానికి అనుగుణంగా మెరుగుపర్చుకొని, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య అన్నారు. గురువారం కల్వకుర్తి, వెల్దండలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఆయన సందర్శించి తగిన సలహాలు సూచనలిచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు శిక్షణలో పూర్తిస్థాయిలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలుచేసి రాష్ట్రాన్ని విద్యా ప్రమాణాల పరంగా ముందువరుసలో నిలబెడతారనే నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా వ్యవస్థ బలోపేతానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, 16.80 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు మరింత సమర్థవంతంగా పని చేయాలని, ప్రధానోపాధ్యాయుడు విధిగా తరగతి గదిలో పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విధ్యాధికారులు తమ పర్యవేక్షణలో మెరుగైన బోధన పద్ధతులు ఉపాధ్యాయులు అవలంబించేలా చూడాలన్నారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి వెంకటయ్య, నర్సింహ, మురళిమనోహరాచారి, ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి : డీఈఓ పెద్దకొత్తపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్య, రాత పుస్తకాలతో పాటు యూనిఫామ్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని.. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధిస్తారని గ్రామాల్లో ప్రచారం చేస్తూ విద్యార్థుల సంఖ్య పెంచాలని వివరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య -
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మిగిలిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా సాగునీటి పారుదలశాఖ, ఇంజినీరింగ్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే ల్యాండ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్యాకేజీలలో కొనసాగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేయాలన్న కృత నిశ్ఛయంతో ఉందని, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని, నీటిపారుదల, రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగం పెంచాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో సమస్యలు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు సందర్శించి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, మార్కండేయ, అచ్చంపేట, కర్నె తండా, డిండి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూ సేకరణ చేపట్టి పనుల పురోగతిలో ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ విజయభాస్కర్, ఎస్ఎన్రెడ్డి, ఈఈలు శ్రీకాంత్, మురళి, ఆర్డీఓలు మాధవి, బన్సీలాల్, సురేష్, శ్రీనివాసులు, సర్వే అధికారి సరిత పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్ -
వచ్చే నెలలో ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు
కొల్లాపూర్: జాతీయ రహదారి–167కెలో భాగంగా మల్లేశ్వరం– సంగమేశ్వరం మధ్యన కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ సస్పెన్సివ్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ అధికారులు పరిశీలించారు. గురువారం ఎన్హెచ్ఏఐ తెలంగాణ ఆర్ఓ కృష్ణప్రసాద్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్యాకేజీ–1 పనుల పూర్తికి నిర్ణీత గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో పనుల పురోగతిపై చర్చించారు. జూలై నెలాఖరు వరకు పనులు దాదాపుగా పూర్తిచేస్తామని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు ఆయనకు వివరించారు. నాగర్కర్నూల్ నుంచి తాడూరు వరకు బైపాస్ రహదారి నిర్మాణ పనులకు భూ సేకరణ సమస్య ఉందని చెప్పారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆర్ఓ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల బ్రిడ్జి టెండర్ల ఖరారు వాయిదా పడుతుందన్నారు. అయితే ఇప్పటికే పలు కంపెనీలు బ్రిడ్జి నిర్మాణం కోసం బిడ్లు దాఖలు చేశాయని, వచ్చే నెలలో టెండర్ల ఖరారు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. బ్రిడ్జికి అనుసంధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్మించే రహదారి కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు చెప్పారు. వాటికి సంబంధించిన నివేదికలను ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు పంపించామన్నారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రవాణా పరంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకు ముందు ఆర్ఓ సంగమేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్ఓ వెంట ఈఈలు ఆదిత్య, రాజేందర్ తదితరులున్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన ఎన్హెచ్ఏఐ ఆర్ఓ -
ప్రాజెక్టులకు నీటి ప్రవాహం
గద్వాల/ ధరూరు/ దోమలపెంట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రెండు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మే నెల చివరలోనే కొత్త నీటి రాక మొదలైంది. గురువారం ఎగువ ప్రాంతం నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 8,953, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 8,940 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లోలు వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సాధారణంగా జూన్, జూలైలో కృష్ణానదికి వరదలు వస్తుంటాయి. జూరాల ప్రాజెక్టుకు కొన్ని నెలలుగా ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు దాపురించారు. మొన్నటి వరకు 3 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం రెండు రోజులుగా వస్తున్న ఇన్ఫ్లోతో దాదాపు 1.25 టీఎంసీల నీరు చేరిందని అధికారులు చెప్పారు. డెడ్ స్టోరేజీ దశలో ఉన్న జూరాలకు స్థానికంగా కురుస్తున్న అకాల వర్షాలు కొంత మేలు చేశాయి. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.175 టీఎంసీల నీరు నిల్వ ఉందని పీజేపీ అధికారులు తెలిపారు. సుంకేసుల, హంద్రీ నుంచి.. శ్రీశైలం జలాశయానికి గురువారం సుంకేసుల నుంచి 8,690, హంద్రీ నుంచి 250 కలిపి మొత్తం 8,940 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని జలాశయం గేజింగ్ నిర్వాహకులు తెలిపారు. కాగా.. గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలం ఎగువన రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకి 1,305 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 817.2 అడుగుల వద్ద 38.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల స్టాప్లాక్ గేట్ల ఓవర్ఫ్లో జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జూరాలకు వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో గేట్ల మరమ్మతు చేసే క్రమంలో ప్రధాన గేట్లకు రక్షణగా ఉన్న స్టాప్లాక్ గేట్లపై నుంచి వర్షపు నీరు పొంగిపొర్లినట్లు ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. జూరాలకు 8,953, శ్రీశైలానికి 8,940 క్యూసెక్కుల ఇన్ఫ్లో జూన్కు ముందే మొదలైన కొత్త నీటి రాక రామన్పాడులో 1,016 అడుగులు.. మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల జలాశయం ఎడమ, కుడి కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని.. రామన్పాడు జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు. -
చదువుతో పాటు క్రీడలు అవసరం
లింగాల: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని డీవైఎస్ఓ సీతారాం నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 10 గ్రామీణ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో కోచ్లు ఇచ్చే మెళకువలను నేర్చుకొని రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కోచ్ ఎండీ అబ్దుల్లా, సహాయ కోచ్లు హరీశ్, నవీన్ పాల్గొన్నారు. ఎల్ఎల్బీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సెమిస్టర్–1, 3కి సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. సెమిస్టర్–1లో 74 శాతం ఉత్తీర్ణత కాగా, 3వ సెమిస్టర్లో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్సైట్లో పొందుపరిచ్చినట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, కోఆర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు. 430 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో కలిపి 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 4వ సెమిస్టర్కు సంబంధించి మొత్తం 8,924 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 8,524 మంది హాజరై 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో సెమిస్టర్–5 బ్యాక్లాగ్ పరీక్షలకు సంబంధించి 299 మందికి 266 మంది హాజరయ్యారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా కవిత మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ఆర్ఎంగా జె.కవిత నియమితులయ్యారు. ఈమె ప్రస్తు తం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వర్క్షాప్లో మేనేజర్గా పని చేస్తున్నారు. కాగా, 2012లో మహబూబ్నగర్ డిపో మేనేజర్గా వ్యవహరించారు. ఇక ఖమ్మం డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తూ గత నెలలో ఇక్కడికి బదిలీపై వచ్చిన భవానీప్రసాద్ పదోన్నతిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆర్ఎంగా వెళ్లారు. -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
నాగర్కర్నూల్/పెంట్లవెల్లి: రాజీవ్ యువవికాసం పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ కార్పొరేషన్, అధికారులతో రాజీవ్ యువవికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి జిల్లావ్యాప్తంగా 41వేల దరఖాస్తులు అందాయని.. దరఖాస్తు దారులతో సంబంధిత అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు. ఇంటర్వ్యూలో ఎంపిక చేసిన లబ్ధిదారుల దరఖాస్తులను బ్యాంకర్లు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు సూచించిన వాటిని జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో అర్హుల తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. జూన్ 2న అర్హులైన వారికి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాంలాల్, బీసీ వెల్ఫేర్ అధికారి ఖాజా నజీమ్ అలీ అప్సర్ తదితరులు ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలి.. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అమరేందర్, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న 15 రోజులు ఎంతో కీలకమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయొద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు, లారీల కొరత లేకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా రైస్మిల్లులకు తరలించాలని తెలిపారు. ఉన్నతాధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిత్యం తనిఖీలు చేయాలని.. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 75వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు హైదర్ అలీ, రాజేందర్, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, డీసీఓ రఘునాథరావు ఉన్నారు. ● పెంట్లవెల్లి మండలం కొండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో రైతులు సమర్పించిన భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పెంట్లవెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకొని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ విజయసింహ, మాజీ సర్పంచ్ గోపాల్, మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, ఎంఈఓ ఇమానీయల్, ఏపీఎం గౌసుద్దీన్ ఉన్నారు. రాజీవ్ యువవికాసం పథకానికి41వేల దరఖాస్తులు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో అర్హుల జాబితా సిద్ధం కలెక్టర్ బదావత్ సంతోష్ -
కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించండి
నాగర్కర్నూల్ రూరల్: కాంట్రాక్టు కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారన్నారు. కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్మికులతో పనులు చేయించుకుంటూ ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని.. లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రిజ్వాన్, నాగమణి, ఎల్లమ్మ, శ్రీదేవి, అలివేల, రేణుక, నాగయ్య, వెంకటేశ్, కాశన్న తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన ‘సీయూఈటీ’
షార్ట్సర్క్యూట్ కారణంగా పనిచేయని కంప్యూటర్లు ● మహబూబ్నగర్ ‘ఫాతిమా’ స్కూల్ కేంద్రంలో పరీక్షకు దూరమైన 180 మంది విద్యార్థులు ● న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) స్థాయిలో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు) నిర్వహిస్తోంది. వివిధ గ్రూపుల విద్యార్థులు ఈ నెల 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 180 మంది విద్యార్థులు బుధవారం ఉదయం సెషన్ 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉదయం వర్షం కారణంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఉన్న ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు సైతం ఆఫ్ అయ్యాయి. గంట తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా.. మళ్లీ 10 నిమిషాల్లోనే మరోసారి షార్ట్ సర్క్యూట్తో సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 180 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా కొనసాగిన పరీక్ష దేశవ్యాప్తంగా 60కి పైగా సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఆన్లైన్లో ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి రూ.950 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా పరీక్ష కొనసాగగా.. ఒక్క మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రంలో మాత్రం జరగలేదు. పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం కూడా బయటికి వచ్చాక.. మరోసారి పరీక్ష ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఫాతిమా విద్యాలయ ప్రిన్సిపాల్ థెరిస్సా మాదను స్పందిస్తూ.. పరీక్ష నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి) సమాచారం ఇచ్చామని.. మరోసారి పరీక్ష నిర్వహించే విధంగా ఎన్టీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. వర్షంలో తడుచుకుంటూ వచ్చాం.. రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి. – సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల పరీక్ష జరగలేదు. సీయూఈటీ పరీక్ష రాసేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – మహేశ్కుమార్, విద్యార్థి, మద్దూరు ఏపీ ఎంసెట్ వదులకున్నా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వరకు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు సమాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రాయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి. – సాయివర్షిణి, విద్యార్థి, మరికల్ మరో అవకాశం ఇవ్వాలి.. సీయూఈటీ పరీక్ష రాయడానికి మరికల్ నుంచి వచ్చాను. కొన్ని రోజులుగా పరీక్ష కోసం సిద్ధమయ్యాను. తీరా పరీక్షకు వస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోయి కంప్యూటర్లు పనిచేయలేదు. ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహిస్తుందా.. లేక రీషెడ్యూల్ చేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. – రామకృష్ణ, విద్యార్థి, మరికల్ -
సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 6,045 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,138 మంది, ఒకేషనల్ విభాగంలో 626 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,894 మంది, ఒకేషనల్ విభాగంలో 387 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలతో పాటు ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే సత్వర సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 25 మంది చొప్పున సీటింగ్.. పరీక్ష కేంద్రంలోని ఒక్కో గదిలో 25 మంది విద్యార్థుల చొప్పున కూర్చొనే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లను నియమించారు. మాస్ కాఫీయింగ్ను అరికట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను నియమించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంట్ అధికారి, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి పోలీస్స్టేషన్ నుంచి తీసుకువచ్చే ప్రశ్నపత్రాల సీల్ తీయడం మొదలుకొని.. విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను సీల్ వేసే వరకు సీసీ కెమెరాల నిఘాలో పూర్తి చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్కు తప్ప మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల్లోకి సంబంధిత అధికారి జారీ చేసిన ఐడీ కార్డులు కలిగిన వారిని తప్ప.. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లావ్యాప్తంగా 20 కేంద్రాల ఏర్పాటు హాజరుకానున్న 6,045 మంది విద్యార్థులు -
బడుల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాల పంపిణీ
కందనూలు: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాము నుంచి 20 కేజీబీవీలు, 28 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలకు పాఠ్యపుస్తకాల సరఫరాను డీఈఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 1నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్, కేజీబీవీ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న 70,390 మంది విద్యార్థులకు 3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. ఇప్పటి వరకు 80 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్ నర్సింహ, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, వెంకటేశ్వర్లు శెట్టి, శివకుమార్ పాల్గొన్నారు. -
డీపీఆర్ రూపొందించారు..
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎలివేటేడ్ కారిడార్ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ● -
కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం
కల్వకుర్తి రూరల్: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ కార్మిక హక్కుల సాధన కోసం పోరాడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సమ్మెను జూలై 9కి వాయిదా వేసినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2019, 2020 సంవత్సరంలోనే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని, దీనిని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ప్రతిఘటన చేయడంతో వాటిని అమలు చేయలేదన్నారు. కార్పొరేట్ పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం వీటిని తెచ్చారని విమర్శించారు. పర్మినెంట్ ఉద్యోగాల వ్యవస్థ స్థానంలో తాత్కాలిక ఉద్యోగాల వ్యవస్థని నెలకొల్పడానికి బాటలు వేశారని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న చేపట్టే సమ్మెను విజయవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, మల్లేష్, రాములు, లక్ష్మమ్మ, రఫిక సుల్తానా, భాగ్యలక్ష్మి, శైలజ, స్వాతి, హసీనా, సుభద్ర, మంజుల, బాల్రెడ్డి, జగన్, అలివేలు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీ
కందనూలు: పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా జిల్లాకేంద్రంలో మంగళవారం సాయంత్రం తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత సాయుధ దళాలకు గౌరవ సూచికంగా, ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో యువత తరలివచ్చారు. జిల్లాకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా అంబేడ్కర్ కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు, వ్యాపార సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై జవాన్, అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేజీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు, యువమోర్చ జిల్లా కార్యదర్శి నరేష్చారి, నాయకులు సుధాకర్, భరత్ప్రసాద్, సుబ్బారెడ్డి, సుధాకర్రెడ్డి, బాబుసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న చెంతకు..నాలుగు వరుసల రోడ్డు
అచ్చంపేట: మల్లికార్జునస్వామి కొలువై ఉన్న నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఆహ్లాదకరమైన ప్రయాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అన్ని అడ్డంకులను అధిగమించుకొని హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి–765 త్వరలోనే నాలుగు వరుసలుగా మారనుంది. రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డును నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవేగా త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.2,800 కోట్లతో ఈ రోడ్డును విస్తరిస్తామని, మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. పనులు ప్రారంభిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్– డిండి, బ్రాహ్మణపల్లి (మన్ననూర్) 105.6 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే 6 గంటల ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గనుంది. శ్రీశైలం దారిలోని తుక్కుగూడ– డిండి వరకు ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ను తొలగించే పని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కేంద్రం కోరింది. హైదరాబాద్– డిండి, మన్ననూర్ రహదారికి మహర్దశ రూ.2,800 కోట్ల వ్యయంతో ఎన్హెచ్–765 నిర్మాణం మన్ననూర్– శ్రీశైలం మధ్య ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటు స్వయంగా ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ.. శ్రీశైలానికి తప్పనున్న ప్రయాణ పాట్లు -
ధాన్యం కొనుగోలులో మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
గోపాల్పేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ధాన్యం సేకరణను నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏదుల మండలం చీర్కపల్లి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ గత పది రోజుల నుంచి లారీల కొరత వలన 7,500 బస్తాల ధాన్యం కొనుగోలు చేసి కేంద్రంలో ఉండటంతో మిగతా కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీర్కపల్లికి రోజుకు 5 లారీలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లర్లు జిల్లావ్యాప్తంగా తరుగు, తాలు పేరుతో క్వింటాల్కు 3 కిలోల ధాన్యం తీస్తూ రైతులను దగా చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవని, ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులకు అవసరమైన కవర్లను ప్రభుత్వమే అందించాలన్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసు అధికారులు వచ్చి జిల్లా సివిల్ సప్లయ్, ఐకేపీ అధికారులు, లారీ కాంట్రాక్టర్తో మాట్లాడి రోజుకు మూడు లారీలు వచ్చే విధంగా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. తరుగు, తాలు పేరుతో జరుగుతున్న విషయాన్ని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమేష్, శేఖర్, మహే ష్, శివశంకర్, రాములు, మల్లేష్, కాసీం, శేషయ్య, సత్యనారాయణ, పర్వతాలు పాల్గొన్నారు. -
అభ్యసన సామర్థ్యాలు మెరుగు..
విద్యార్థుల మానసిక వ్యక్తిత్వం ఆధారంగా బోధిస్తున్నాం. అర్థమయ్యే రీతిలో బోధించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అయినప్పటికీ పిల్లలు సామర్థ్యాన్ని అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఐదు రోజులపాటు ఇచ్చిన శిక్షణ విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాల పెంపునకు దోహదపడుతుంది. – చీర్ల కృష్ణయ్య, ఎస్ఏ ఆంగ్లం, కోడేరు ఎంతో ప్రయోజనం.. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులు. బోధనా వికాసం, సాంకేతిక పాఠాలు, ఏఐ బోధన మెరుగుపరిచే విధంగా ఇస్తున్న శిక్షణ ఎంతో ప్రయోజనకరం. తరగతి గదిలో అర్థం చేసుకునే వాతావరణం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి అంశాలపై సృజనాత్మకత పెంచుతాం. – పూజారి సురేందర్, డీఆర్పీ శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు.. జిల్లాలోఉపాధ్యాయ శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మూడు విడతల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాం. ఎస్జీటీలకు మండల స్థాయిలో, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలకు జిల్లాస్థాయిలో శిక్షణ ఉంటుంది. అంశాల వారీగా శిక్షణ కొనసాగుతుంది. ఉపాధ్యాయులు విధిగా శిక్షణకు హాజరు కావాలి. – రమేశ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి ● -
స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కల్వకుర్తి టౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించడమే కాకుండా, వారికి అందివచ్చిన స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు అందించే కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డితో కలిసి ఆయన లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి సమానంగా నిధులు కేటాయిస్తూ.. వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. స్వయం శక్తితో ఎదిగి కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలపడేందుకే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం 150 మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్, కుట్టుమిషన్లను అందించారు. -
విద్యా ప్రమాణాల పెంపు దిశగా..
కందనూలు: సర్కారు బడుల్లో కొంతమంది విద్యార్థులు చదవడం.. రాయడం వంటివి కూడా చేయలేకపోతుండటాన్ని ఇటీవల పలు సర్వేలు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టింది. విద్యార్థుల లోపాలను సరిచేసేందుకు ముందుగా ఉపాధ్యాయులకు తర్పీదు ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు కనీస విద్యా ప్రమాణాల స్థాయికి చేరుకుంటారని ఆశిస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. మూడు విడతల్లో.. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు బోధనాంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 3,513 మంది ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి విడతగా ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జిల్లాస్థాయిలో మండల రిసోర్స్పర్సన్లు, స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. రెండవ విడత ఎస్జీటీలకు 20 నుంచి 24వ తేదీ వరకు, మూడవ విడత 25 నుంచి 30వ తేదీ వరకు మండలస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయి. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల పెంపు, కృత్రిమ మేధ (ఏఐ) బోధన, తల్లిదండ్రుల సమావేశం ఇతర అంశాలపై తర్పీదు ఇవ్వనున్నారు. శిక్షణ ఇలా.. శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయులకు కంటెంట్ ఎర్నిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ ఔట్ కం వంటి విషయాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల నిర్మాణ క్రమాన్ని అర్ధం చేసుకోవడం, అంశాల వారీగా విద్యా ప్రమాణాలపై అవగాహన, బోధనా వ్యూహాల పెంపు, అభ్యసన ప్రక్రియలను సమర్ధవంతంగా తరగతి గదిలో అమలు, ప్రాజెక్టు వర్క్ల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 3,513 మంది ఉపాధ్యాయులకు శిక్షణ మూడు విడతల్లో తరగతులు నిర్వహించేలా ప్రణాళిక ఇప్పటికే మండల రిసోర్స్పర్సన్లు,ఎస్ఏలకు శిక్షణ పూర్తి 20 నుంచి ఎస్జీటీలకు.. -
దరఖాస్తుల స్వీకరణ
వెల్దండ: మండలంలోని గుండాల గ్రామం ఏకలవ్య మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పర్ధీప్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో 2025–26 సంవత్సరానికి ఎస్టీ విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. కళాశాలల్లో దరఖాస్తు ఫారాన్ని తీసుకొని అన్ని అర్హత పత్రాలను జత చేసి ఈ నెల 24లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. వీరికి మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్ ఏకలవ్య మోడల్ కళాశాలలో ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. కళాశాలలో బైపీసీ గ్రూప్లో బాలురకు 25 సీట్లు, సీఈసీలో 8 సీట్లు ఉన్నట్లు వివరించారు. డిపో అభివృద్ధిలోభాగస్వాములవుదాం కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధిలో ఉద్యోగులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎం ఉమాశంకర్ అన్నారు. పట్టణంలోని డిపో ఆవరణలో మంగళవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశారు. డిపో పరిధిలో ఏప్రిల్ నెలలో అత్యధిక ఇన్సెంటివ్, కేఎంపీఎల్, ఈపీకే సాధించిన కండక్టర్లు, డ్రైవర్లను అభినందించి సత్కరించారు. వారికి నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు రత్నమ్మ, వెంకటేశ్వర్లు, నజీర్, షఫీఉల్లా, గౌసొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రోగులతో స్నేహంగా మెలగాలి ఉప్పునుంతల: వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా మెలిగి వైద్య సేవలు అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక సీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించి ఆస్పత్రిలో సిబ్బంది హాజరు రిజిష్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షించినన సూచనలు, సలహాలు ఇచ్చారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం కోసం వచ్చిన రోగులతో దురుసుగా ప్రవర్తించరాదని హెచ్చరించారు. సమావేశంలో వైద్యాధికారి స్వప్న, ఫార్మాసిస్టు కుమారాచారి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం @ 25 లక్షలు
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం (హరితహారం) కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ పర్యాయం కూడా జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 21 నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమం చేపడుతుంది. దీనిలో భాగంగా జూలై మొదటి వారంలో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, అంగన్వాడీ, బీడు, బంజరు భూములు, రోడ్డుకిరువైపులా, పొలాల గట్లపై మొక్కలు నాటాలని అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మొక్కలకు ప్రాధాన్యం.. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలు పది కాలల పాటు నిలిచి ఉండాలనే లక్ష్యంతో పదో విడత వన మహోత్సవంలో అధికారులు ప్రత్యేకించి కొన్ని జాతుల మొక్కలను ఎంపిక చేశారు. ప్రధానంగా వీటినే నాటించాలని నిర్ణయించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పండ్ల చెట్లను నాటేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు వేప, రాాగి, మేడి, మర్రి, నేరేడు, కానుగ, కదంబ, గుల్మోర్, కరివేపాకు, మునగ, బొప్పాయి, ఈతతోపాటు పలు రకాలు పండ్లు, పూలు, ఔషధ మొక్కలను నాటేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆయా మొక్కలు సుదీర్ఘకాలం మనగలగడమే కాక.. ఇతరత్రా ప్రయోజనాలను కూడా కలిగిస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువ శాతం ఈ రకం మొక్కలనే వన మహోత్సవం కోసం సిద్ధం చేస్తున్నారు. పదో విడత వనమహోత్సవానికిఅధికారుల సన్నద్ధం జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో మొక్కల పెంపకం పండ్లు, ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యం జూలైలో పంపిణీకి సన్నాహాలు చేస్తున్న యంత్రాంగం