ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. మూడు మున్సిపాలిటీల్లోని 65 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ కోసం 131 పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రాల వివరాలను టీ–పోల్ యాప్లో నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 158 బ్యాలెట్ బాక్స్లతో పాటు అదనంగా 20 శాతం బ్యాలెట్ బాక్స్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్ సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులను పూర్తి చేశామన్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమై ఉన్నామని ఎన్నికల కమిషనర్కు కలెక్టర్ వివరించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను నియమించనున్నట్లు తెలిపారు. ఓటు చైతన్యం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. కాగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ దేవసహాయం, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
బీమాతో
ఆర్థిక భరోసా : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: పోలీసు సిబ్బంది తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని.. అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్ హోంగార్డు వెంకటస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అతడి కుటుంబ సభ్యులకు మంజూరైన రూ. 38లక్షల చెక్కును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, ఏఓ కృష్ణయ్య, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అనిల్కుమార్, ఆర్ఐ రాఘవరావు పాల్గొన్నారు.
● జిల్లాలోని ఊర్కొండ, కల్వకుర్తి పోలీస్స్టేషన్ల్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్కానిస్టేబుళ్లు ప్రభాకర్రెడ్డి వెంకటయ్య ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. వీరిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, స్టార్లు అందజేశారు.
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు


