మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సహకరించండి
కల్వకుర్తి టౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలకు పాల్పడకుండా పోలీసులకు, ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 7, 16, 17, 18 వార్డుల్లో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఎవరైనా కోడ్ను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు కోడ్ ముగిసే వరకు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంచామని, ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్ మొదలైన వాటిలో విద్వేషపూరిత లేదా ప్రజలను రెచ్చగొట్టే, తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు చేయరాదన్నారు. జిల్లాలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఏఈ షబ్బీర్, డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐలు మాధవరెడ్డి, వీరబాబు, రాజశేఖర్ తదితరులున్నారు.


