అమ్రాబాద్: మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి క్షేత్రంలో హనుమాన్ జయంతి మాల విరమణ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం పండితుడు వీరయ్యశాస్త్రి బృందం వేద మంత్రోచ్ఛరణల మధ్య గవ్యాంతర పూజలు, వాస్తు హోమం, మన్యుసూక్త హోమాలు, రుద్రహోమం నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంలో ఊరేగించారు. రాత్రి శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను చూడముచ్చటగా అలంకరించి.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కల్యాణ వేడుక జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములునాయక్, ఈఓ నర్సింహులు, సిబ్బంది పరందామారెడ్డి, నాగరాజు, విశ్వేశ్వర్రెడ్డి, అజయ్ పాల్గొన్నారు.


