రాంపూర్ చెంచుపెంట నుంచి సలేశ్వరం వరకు ఐదు ప్రధాన మైల్స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం విడిది ఏర్పాట్లు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. రాంపూర్పెంట దాటిని తర్వాత అర కిలోమీటరు దూరంలో వాహనాల పార్కింగ్ ఉంటుంది. ఇక్కడి నుంచి మోకాల కుర్వు, కిలోమీటరు దాటిన తర్వాత గాడిద దొన్న కాల్వ వస్తుంది. ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. అర కిలోమీటరు దాటితే ఇప్పచెట్టుబండ, కిలోమీటరు తర్వాత అప్పాయిపల్లి దారి వస్తుంది. లోయలోకి దిగుతుంటే మైసమ్మకట్ట వద్ద పూజలు చేస్తారు. పాపనాశనం నీళ్లు చుక్కలుగా పడుతాయి. లోయలోకి కిలోమీటర్లు పోతే భైరవుని గుడి వస్తుంది. మహిళలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే ఉండిపోవాలి. చెప్పులు కూడా ఇక్కడే వదలాలి. కిందికిపోతే నీళ్ల కాల్వ బారికేడ్లు వస్తాయి. ఇక్కడ క్యూలో వెళ్లాలి. అనంతరం శనేశ్వర ఆలయం వస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగా శంఖుతీర్థం వస్తుంది. ఇక్కడ స్నానం చేయాలి. శనేశ్వర ఆలయం సందర్శించిన తర్వాత లోయలోకి ముందుకు వెళ్తే సలేశ్వరం తీర్థం వస్తుంది. ఇక్కడ రెండు గుండాలు (శంఖుతీర్థం, సలేశ్వర తీర్థం) ఉంటాయి. సలేశ్వరం తీర్థం వద్ద 300ల అడుగుల పైనుంచి జలపాతం పడుతుంది. ఇక్కడి గుహలోనే సలేశ్వరం లింగమయ్య కొలువుదీరారు. ఇక్కడ పోయే దారి, వచ్చే దారి వేర్వేరుగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేక జనరేటర్ల ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.


