ఇప్పటివరకు బ్యాంకుల స్కాం గురించి విన్నాం. భారీ మొత్తంలో బ్యాంకు ఖాతాదారులు మోసపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ గోల్డ్ లోన్(Gold Loan) పేరుతో స్వయంగా ఖాతాదారులే మోసానికి పాల్పడటం గురించి విన్నారా? మహరాష్ట్ర నాగ్పూర్లోని ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్లో ఈ మెగా గోల్డ్ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాతాదారులు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి దాదాపు రూ. రూ. 23 కోట్ల విలువైన బంగారు రుణాల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్లోని తమ తొమ్మిది శాఖలలో స్కాం జరిగిందని ICICI బ్యాంక్ అధికారులు అంతర్గత తనిఖీలో గుర్తించారు. 'గోల్డ్ లోన్' పోర్ట్ఫోలియోపై నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో ఇది బయటపడింది. తొమ్మిది వేర్వేరు శాఖల్లో తాకట్టు పెట్టిన ఆభరణాలను పరిశీలించగా, అవి అసలు బంగారం కాదని, నకిలీ అని తేలింది.మొత్తం 195 మంది ఖాతాదారులు ఈ నకిలీ బంగారాన్ని చూపి రుణాలు పొందారు.
ICICI బ్యాంక్ జోనల్ కార్యాలయంలో ఉద్యోగి అయిన ధనంజయ్ రమేష్ థైటే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ధంతోలి పోలీసులు మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసపూరిత పథకం జనవరి 2023 నుండి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ వ్యవహారం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?
బ్యాంక్ అధికారుల ప్రమేయం?
సాధారణంగా గోల్డ్ లోన్ ఇచ్చే ముందు బంగారం స్వచ్ఛతను ధృవీకరించడానికి 'వాల్యూయర్స్' (Valuers) ఉంటారు. వారి అనుమతి లేదా క్లియరెన్స్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు కావడం అసాధ్యం. కాబట్టిఈ కుట్రలో బ్యాంక్ ఉద్యోగులు లేదా అధికారులు కూడా భాగస్వాములై ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వాల్యూయర్స్ కావాలనే నకిలీ బంగారాన్ని అసలుదిగా ధృవీకరించారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిండికేట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


